Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Monday, April 28, 2025

Origin of Hinduism in Cambodia - The Khmer Empire | హిందూ రాజు పేరుమీద ఏర్పడిన మరో దేశ చరిత్ర!

 

హిందూ రాజు పేరుమీద ఏర్పడిన మరో దేశ చరిత్ర!
2000 ఏళ్ల నాడు వ్యాపార నిమిత్తం చేసిన ప్రయాణం ఒక దేశ ఆవిర్భావానికి కారణం అయ్యిందా?

మన దేశం భారత దేశంగా పిలవబడడానికి కారణం, కొన్ని యుగాలకు పూర్వం ఈ దేశాన్ని ఏలిన భరత చక్రవర్తి అనే విషయం తెలిసిందే. పరిపాలనా దక్షత, వీరత్వం, మంచి మనస్సు, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణ వంటి సూక్ష్మాలను పాటిస్తూ, ప్రజలు ఏ విధంగా ఉండాలి, రాజులు ఏ విధంగా పాలించాలనే విషయాలను భావితరాలకు అందించిన యుగ పురుషుడాయన. అందుకే మన దేశానికి భారత దేశం అనే పేరు స్థిరపడింది. ఆయన పాలనలో అఖండ భారతావని ఆవిష్కృతం అయ్యింది. దాదాపుగా అటు మధ్య ఆసియా దేశాలుగా పిలవబడే ఇరాక్, సిరియా నుంచి ఇటు ఫిలిప్పీన్స్ ద్వీప దేశం వరకు ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. అందుకే ఆయన పాలించిన రాజ్యాన్ని భారత దేశం అని కాకుండా, భరత ఖండం అని పిలిచేవారు. మరి ఈ ప్రపంచంలో మన హిందూ రాజు పేరుపై నిర్మితమైన మరో దేశం గురించి మీరెప్పుడయినా విన్నారా? ఎక్కడో ఉన్న మరో దేశానికి ఒక హిందువు రాజు ఎలా అయ్యాడు? ఆయన పేరుమీద ఆ దేశానికి ఆ పేరు ఎలా వచ్చింది? వంటి సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/OGpUBZWB5uM ]


ఈ భూమండలంపై అత్యంత పురాతనమైన నాగరికత మన సనాతన ధర్మమే. ఒకప్పుడు మన దేశం అద్భుతమైన విజ్ఞానానికీ, అఖండమైన ఆవిష్కరణలకూ ఆలవాలంగా నిలిచింది. ఇక్కడి రాజులూ, ప్రజలూ, ప్రపంచపు నలుమూలలకూ వెళ్ళి, అక్కడ మన ధర్మాన్ని నెలకొల్పడమే కాకుండా, ఆయా ప్రదేశాలలో ఉన్న ఆదిమ జాతులవారికి నాగరికత నేర్పించారు. నేటి పాశ్చాత్య చరిత్రకారులు ఎంతో ఆశ్చర్యంగా చెప్పుకునే సుమేరియన్, ఈజిప్ట్, బాబిలోనియన్, ఆఖరికి భూగోళానికి అటువైపున ఉన్న Inca, మయాన్, Tiwanaku వంటి ఎన్నో పురాతన నాగరికతలన్నీ, కాలగమనంలో సనాతన ధర్మం అనే మహా వృక్షం నుంచి పుట్టుకొచ్చిన శాఖలే అని చరిత్రకారులు చెబుతున్నారు. అలా మన హిందూ రాజు ద్వారా ఏర్పడి, అభివృద్ధి చెంది, నేటికీ ఆయన పేరు మీదనే నిలబడిన దేశం కంబోడియా.

ఆది నుంచీ మన హిందూ రాజుల ప్రాభవం ప్రపంచం మొత్తం మీదా ఉండేదనే విషయం మనం చాలా వీడియోలలో చెప్పుకున్నాము. అయితే ఆధునిక చరిత్ర పుటలలో మాత్రం, కంబోడియా చరిత్ర మన దేశం నుంచి వెళ్ళిన ఒక వర్తకుడితో మొదలైంది. కౌండిన్యుడనే పేరుగల వర్తకుడు దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం వ్యాపార నిమిత్తం చేసిన ప్రయాణం, ఒక దేశ ఆవిర్భావానికి కారణం అయ్యింది. చరిత్రకారుల ప్రకారం కౌండిన్య అనేది అతని పేరు కాదనీ, అతని అసలైన పేరు నేటికీ తెలియని ఒక ప్రశ్న అనీ చెబుతున్నారు. సాధారణంగా మన దేశంలో కౌండిన్య అనే పేరు గోత్ర నామాలలో వింటూ ఉంటాము. మరీ ముఖ్యంగా పూర్వం నుంచి ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళ నాడు ప్రాంతాలలో ఉండే బ్రహ్మణులలో, కౌండిన్య గోత్రం గలవారు ఉంటారు. కంబోడియాకి ప్రయణమైన వ్యక్తి కూడా అదే కౌండిన్య గోత్రానికి చెందిన వాడనీ, పూర్వం పేరు చెప్పినప్పుడు ముందుగా గోత్రం కూడా చెప్పే అలవాటు ఉండడంతో, చరిత్రలో ఆయన అసలు పేరు కంటే గోత్ర నామమైన కౌండిన్య లిఖించబడి ఉందనీ చరిత్రకారులు అంటున్నారు.

కొన్ని వేల సంవత్సరాల క్రితం భారత దేశం సముద్ర వర్తక వ్యాపార సామ్రాజ్యంలో ప్రపంచంలోనే అగ్రశ్రేణిలో ఉండేది. ఆ కాలంలో చాలా మంది భారతీయ వర్తకులు, మనదగ్గర దొరికే వస్తువులను ఎన్నో దేశాలకు ఎగుమతి చేసేవారు. ఇలా భారీ ఓడలపై సముద్ర యానం చేయడానికి, అప్పట్లోనే మన దేశంలో ఎన్నో అద్భుతమైన ఓడ రేవులు ఉండేవి. అటువంటి వాటిలో ఒరిస్సా లోని Golabai ఓడ రేవు ఒకటి. ఆ కాలంలో Chilka అనే ఉప్పు నీటి సరస్సు దగ్గర ఈ భారీ ఓడ రేవు ఉండేది. ఈ సరస్సు లోతుగా, విశాలంగా ఉండటంతో పాటు, ఒక పక్క bay of Bengal సముద్రంలో కలుస్తూ ఉండేది. దానితో నాడు Chilka సరస్సు నుంచి ఓడలు Bay Of Bengal లోకి ప్రవేశించి, అక్కడి నుంచి తమిళనాడు లోని నాగపట్నం పోర్ట్ కీ, అటునుంచి శ్రీలంకలోని పోర్ట్ కీ వెళ్ళి, అక్కడి నుంచి అటు సౌత్ ఈస్ట్ దేశాల వైపుకూ, ఇటు పశ్చిమ దేశాల వైపుకూ ప్రయాణం చేసేవారు. ఇదే విధంగా నాడు మన వర్తకులు, రోమ్ వరకూ తమ వ్యరపారాలను విస్తరింప చేశారు. సౌత్ ఈస్ట్ వైపుకు ప్రయాణం చేసినప్పుడు, అండమాన్ దీవుల నుంచి మలక్కా జలసంధిని దాటి, అటువైపున్న జపాన్, చైనా, ఆస్ట్రేలియా వంటి ఎన్నో దేశాలలో వర్తక వ్యాపారాలు చేసేవారు.

ఆ కాలంలో అండమాన్ కి వెళ్ళేదారిలో బలమైన తుఫాన్లు, సముద్రపు దొంగల బెడద ఎక్కువగా ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. దానితో కొంతమంది వర్తకులు తమ దగ్గర ఉన్న సరుకును కాపాడుకోడానికి వేరే దారి వెతుక్కున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న థాయిలాండ్ దేశానికి మధ్యలో ఓ చిన్న కెనాల్ ఉండేది. అది నేరుగా bay of Bengal నుంచి, gulf of Thailand సముద్రంలో కలిసేది. ఆ కెనాల్ కాస్త ఇరుకుగా ఉన్నా, అప్పట్లో నేర్పున్న నౌక కెప్టెన్లు, దూరాన్ని తగ్గించుకోడానికీ, పైరేట్స్ నుంచీ, తుఫాన్ల నుంచీ రక్షించుకోవడానికీ, ఆ కెనాల్ ని వాడే వారు. దానినే Isthmus of Kra అని పిలిచేవారు.

కౌండిన్యుడు కూడా ఆ రెండు దారులలో ఏదో ఒక దారిలో సౌత్ ఈస్ట్ దేశాల వైపుకు వెళ్లాడానీ, అయితే అతను ఖచ్చితంగా ఏ దారి వాడాడనే విషయం నేటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉండిపోయిందనీ చరిత్రకారులంటున్నారు. అలా వెళ్ళిన కౌండిన్యుడు gulf of Thailand దగ్గరకి చేరుకోగానే, కొంతమంది సముద్రపు దొంగలు అతని ఓడ పై దాడి చేశారు. అయితే ఎంతో వీరోచితంగా పోరాడిన కౌండిన్యుడూ, అతడి బృందమూ, ఆ సముద్రపు దొంగలను తరిమికొట్టారు. ఆ దాడిలో కౌండిన్యుడి ఓడ కాస్త దెబ్బతినడంతో, మరమత్తుల కోసం దగ్గరలోని ఒక తీరానికి చేరుకున్నాడతను. ఆ కాలంలో ఆ తీరం స్థానిక పల్లె రాజు ఆధీనంలో ఉండేది. అక్కడ కౌండిన్యుడికీ, అతని సిబ్బందికీ తెలిసిన విషయం ఏమిటంటే, వారిపై దాడి చేసిన పైరేట్స్, ఆ పల్లె రాజు ఆధీనంలోని మనుషులే అని. దానితో వారిపై మరో భారీ దాడి జరిగే అవకాశం ఉందని తెలుసుకున్నారు.

ఈ లోపు కౌండిన్యుడి అందం, బలం, బలగం చూసిన ఆ పల్లె రాజు కుమార్తె ‘Soma’ అతడిపై మనస్సు పడి, కౌండిన్యతో వివాహం జరిపించమని తండ్రిని కోరింది. దాంతో పల్లె రాజు అనుచరులు ఆ విషయాన్ని కౌండిన్యుడికి చెరవేయగా, అతను మొదట్లో కాస్త తటపటాయించినా, తర్వత ఆమెతో వివాహానికి అంగీకరించాడు. ఆ విధంగా సౌత్ ఈస్ట్ లోని ఒక చిన్న రాజ్యానికి అల్లుడు అయిన కౌండిన్యుడు, తన తెలివితో, బలంతో ఒక మహా సామ్రాజ్యాన్ని నెలకొల్పి, కంబోడియాకి మొదటి చక్రవర్తి అయ్యాడని, చరిత్ర కారుల విశ్లేషణ. అందుకే అతని పేరుపైనే ఆ దేశానికి కంబోడియా అనే పేరు వచ్చిందని వారి వాదన.

ఇలా నేడు చూస్తున్న కంబోడియా ప్రాంతంలో మొదటి రాచరిక వ్యవస్థను స్థాపించిన కౌండిన్యుడు ఎన్నో ఏళ్ల పాటు పాలించినట్లూ, ఆ తర్వాత అతడి వారసులు ఆ ప్రాంతాన్ని ఏలినట్లూ చరిత్ర తెలియపరుస్తోంది. అంతేకాదు, కౌండిన్యుడి తర్వాత ఎంతో మంది భారతీయులు, కంబోడియాలోని మహిళలను పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యారు. మరీ ముఖ్యంగా, బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు అధికంగా కాంబోడియాకు వెళ్ళినట్లు చరిత్ర విదితం. ఆది కాలం నుంచీ బ్రాహ్మణులు, భారత ఇతిహాసంలోని రాచరిక వ్యవస్థలలో administrative departments లో పనిచేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. వారి జ్ఞానంతో, ఒక రాజ్యపాలనకు అవసరమైన లెక్క, పత్రాలన్నీ చూసుకుని, రాజుకు సరైన సలహాలు ఇవ్వడంలో వారు మేటి. కొంతమంది బ్రాహ్మణులు మన దేశంలోని రాజ్యాలను ఏలిన చరిత్ర కూడా ఉంది. వారిలో ఉన్న ఈ అనుభవం, కంబోడియా నిర్మాణంలో తోడ్పడుతుందని కౌండిన్యుడు భావించి, మన దేశం నుంచి చాలా మంది బ్రాహ్మణులను అక్కడికి తీసుకు వెళ్ళాడు. అలా వెళ్ళిన వారు, ఆ దేశంలోని ఉన్నతాధికారులూ, ధనికుల కుమార్తెలను వివాహమాడి అక్కడే స్థిరపడపోయారు. ఈ తంతు 15, 16 వ శతాబ్దాలలో కంబోడియాను పాలించిన Khmer వంశ పతనం వరకు కొనసాగింది.

ఇదిలా ఉంటే, కంబోడియా అనే పదం, ఫ్రెంచ్ వారి ఆక్రమణ తర్వాత వచ్చిన పేరు. అంతకు ముందు ఆ దేశాన్ని Kampuchea లేదా Kambujadesa అని పిలిచేవారు. దీనికి ‘The Land Of Kambuja’ అనే అర్ధం వస్తుంది. సంస్కృత భాషలో దీని ఉచ్ఛారణ ‘కాంభోజ రాజ్యం’. ‘కంబు స్వాయంభువ’ అనే ఋషి పేరుమీద ఆ దేశానికి కాంభోజ దేశం అనే పేరు వచ్చినట్లు చరిత్రకారులంటున్నారు. దీనికి ఆధారంగా, మన దేశ ఖ్యాతినీ, మన చరిత్రనూ అభివర్ణిస్తూ రాయబడిన ‘ఏకాత్మతా స్తోత్రం’ లోని 21వ శ్లోకం, అగస్త్యః కంబుకౌండిన్యౌ.. అంటూ సాగే శ్లోకంలో, కంబు స్వాయంభువ ఋషి గురించిన ప్రస్తావన చూపుతున్నారు. దానితో పాటు మరికొన్ని చారిత్రక ఆధారాలను పరిశీలించి, కొన్ని వేల ఏళ్ల క్రితం ప్రస్తుతం ఉన్న కంబోడియా ప్రాంతానికి కంబు స్వాయంభువ ఋషి వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్న నాగ జాతి కన్య అయిన ‘మేరా’ అనే రాకుమార్తెను పెళ్లి చూసుకున్నాడనీ, అతని వంశమే కంబోడియాలో అతి పెద్ద రాజ వంశంగా మారిందని చరిత్రకారులు చెబుతున్నారు. అంతేకాదు, Khmer వంశం కూడా ఈ కంబు స్వాయంభువాకీ, మేరా కీ కలిగిన సంతానం నుంచి ఉద్భవించిన వంశమే అని చెబుతున్నారు. కంబు లో సగం, మేరా లోని సాగాన్నీ కలుపుతూ, Khmer వంశం అనే పేరు వచ్చినట్లు చరిత్ర విదితం.

ఈ Khmer వంశం వారెవరని ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ప్రపంచంలోనే అతిపెద్ద వైష్ణవ దేవలయంగా పేరుగాంచిన Angkor Wat గురించి వినే ఉంటారు. ఆ ఆలయాన్ని నిర్మించింది ఈ Khmer వంశస్థులే. 10వ శతాబ్ద కాలంలో Khmer వంశాన్ని పాలించిన మొదటి సూర్యవర్మ Angkor Wat కి పునాది వెయ్యగా, 12వ శతాబ్దంలో అదే వంశానికి చెందిన రెండవ సూర్యవర్మ, నేడున్న Angkor Wat ని పూర్తి చేశాడన్నది చారిత్రక వాస్తవం. ఆ ఆలయం మొదట్లో పూర్తి వైష్ణవ ఆలయంగా ఉండేది. Khmer వంశపు రాజులు మన దేశంలోని ఒరిస్సా నుంచి తమిళనాడు వరకు పాలించిన రాజ వంశాలతో వివాహ సంబంధాలు కూడా ఏర్పరుచుకున్నారని చరిత్ర చెబుతుంది. అందుకే మొదట్లో Angkor Wat ఒక పూర్తి హిందూ ఆలయంగా మాత్రమే ఉండేది. రాను రాను కంబోడియాలో బౌద్ధ ధర్మ ప్రచారం పెరగడం, Khmer వంశపు రాజులకు బౌద్ధుల పట్ల సానుకుల దృక్పథం కలిగి ఉండటంతో, పూర్తి హిందూ దేశంగా ఉన్న కంబోడియా మెల్ల మెల్లగా బౌద్ధ ధర్మం వైపు కూడా అడుగులు వేసింది. Khmer వంశం పతన దశకు వచ్చేటప్పటికి, Angkor Wat లో బౌద్ధ విగ్రహాలూ, క్షేత్రాలూ ఎన్నో వెలిశాయి. ఆ కారణంగానే నేడు ఆ ఆలయంలో బౌద్ధ విగ్రహాలను కూడా చూడవచ్చు.

ఇదిలా ఉంటే, కంబోడియా చరిత్రపై మరింత క్షుణ్ణంగా పరిశీలించిన చరిత్రకారులు, కంబు స్వాయంభువ ఋషి, కౌండిన్యుడూ ఒక్కరే అనీ, స్థానిక రాజు పెద్ద కూతురు Soma మరో పేరు మేరా అనీ, కౌండిన్యుడు వృద్ధాప్యంలో ఋషిగా మారి ఎన్నో అద్వితీయమైన కార్యక్రమాలు చేశాడనీ అంటారు. అతని కారణంగానే వేర్వేరు ఆదిమ జాతి తెగలతో చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న కంబోడియా ఒక మహా సామ్రాజ్యంగా మారడంతో పాటు హిందూత్వం వ్యాప్తి చెందిందనీ, అతని తర్వాత వచ్చిన రాజులు కూడా హిందూత్వ వ్యాప్తిలో ఎంతో కృషి చేశారనీ, చరిత్రకారుల మాట. ప్రస్తుతానికి కంబోడియాలో థెరవాడ బౌద్ధమతం, లేదా దక్షిణ బౌద్ధమతాన్ని అనుసరించే వారు ఎక్కువగా ఉన్నా, నేటికీ ఆ దేశంలో ఎన్నో హిందూ ఆలయాలూ, అద్భుత శిల్పాలూ, శివ లింగాలూ వెలుగుచూస్తూనే ఉన్నాయి.

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...