Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Showing posts with label Mahabharatam. Show all posts
Showing posts with label Mahabharatam. Show all posts

Monday, January 13, 2025

Reincarnation of Arjuna a Hagiography | కలియుగంలో అర్జునుడు ‘పునర్జన్మ – మోక్షం’!


ఆత్మీయ మిత్రులందరికీ 'భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు' TELUGU VOICE
పరమాత్ముడికై సంపూర్ణ శరణాగతీ, ఆత్మ నివేదనా ఎలా ఉండాలి?
కలియుగంలో అర్జునుడు ‘పునర్జన్మ – మోక్షం’!

పంచమ వేదంగా పేరుగాంచిన వ్యాస విరచిత జయకావ్యం - మహాభారతంలో, పాండవుల స్వర్గారోహణ గురించి వివరించబడివున్నది. 17వ పర్వమైన మహా ప్రస్థానిక పర్వం ప్రకారం, పాండవులు సర్వమూ త్యజించి, స్వర్గానికి పయనమైనట్లు చెప్పబడింది. ఆ విషయాలను వివరిస్తూ, 'పాండవులు స్వర్గానికి వెళ్లిన దారి ఎక్కడుంది?' అనే శీర్షికన గతంలో మనం వీడియో చేసి ఉన్నాము. చూడని వారు అదికూడా తప్పక చూడండి. అలా ఆ జన్మను ముగించిన పాండవ మధ్యముడు 'అర్జునుడి' మరుజన్మ వివరాలు ఏమిటి? అని తెలుసుకునే ముందు, ద్వాపరయుగంలో అర్జునుడు శివుడి గురించి తపస్సు చేయగా, పాశుపతాస్త్రాన్ని వరంగా ఇచ్చాడు గానీ, మోక్షం ప్రసాదించలేదు ఆ పరమేశ్వరుడు. ‘కలియుగంలో బోయ వానిగా జన్మించి మోక్షం పొందుతావ’ని అర్జునుడికి శివుడు చెప్పినట్లు మన ఇతిహాసాలలో పేర్కొనబడింది. దాని ప్రకారం అర్జునుడు బోయవానిగా జన్మించి, శివుడి అనుగ్రహాన్ని పొందాడని ప్రతీతి. ఆ బోయవాడి పుట్టుపూర్వోత్తరాలనూ, ఆతడు కైవల్యాన్ని పొందిన వైనం వంటి అనేక విషయాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ZJHvEAzmeQk ]


బోయ రాజైన నాగప్ప, దత్త దంపతులకు, రాజంపేట ప్రాంతంలోని ఊటుకూరులో జన్మించాడు తిన్నడు. తల్లిదండ్రులిరువురూ తెలుగు వారు, సుబ్రహ్మణ్య స్వామి భక్తులు కావడంతో, అతడికి తిన్నప్ప అనే పేరు పెట్టారు. కొడుకు తిన్నప్పకు విలువిద్యాదులు నేర్పించి, రాజును చేశాడు తండ్రి నాగప్ప. కులధర్మం ప్రకారం వేటగాడైనా, జంతువుల పట్ల అపార కరుణను చూపేవాడు తిన్నడు. జంతువులలో పసివాటినీ, ఆడవాటిని, రోగాలతో ఉన్నవాటినీ వేటాడేవాడు కాదు. తనలోని జంతు భావాలైన కామ, క్రోధ, మద మాత్సర్యాలను జయించాడు తిన్నడు. ఒకనాడు తిన్నడు వేటకు వెళ్లి అడవి పందిని బంధించబోగా, అది తప్పించుకున్నది. దానిని పట్టుకోవడానికి తన అనుయాయులైన నాముడూ, కాముళ్ళతో ఆ వరాహాన్ని తరుముకుంటూ వెళ్లాడు. పరుగెత్తి పరుగత్తి ఎట్టకేలకు దానిని చంపాడు. అలసిపోయిన తిన్నడు ఆ పందిని తీసుకుని స్వర్ణముఖీ నదీ తీరానికి వెళ్లాడు. ఆ ప్రక్కనే ఉన్న కాళహస్తి పర్వతంపై వెలసి ఉన్న ఆలయాన్ని చూసిన తిన్నడికి, అక్కడకు వెళ్లాలనే తృష్ణ కలిగింది. అనుకున్నదే తడవుగా ఆ కొండ ఎక్కనారంభించాడు.

ఆలయం సమీపించే కొద్దీ, తనకు అంతకుముందెన్నడూ అనుభవంకాని అలౌకికానందాన్ని అనుభూతి చెందుతూ, పరవశుడైపోసాగాడు. అది పూర్వ జన్మ సంస్కార ఫలితమే. తన మీదినుంచి ఏదో బరువు దిగిపోతున్నట్లు అనిపించసాగిందతనికి. దేహ స్పృహ కూడా మందగించ సాగింది. ఆ పరమేశ్వరుని మీద అనంతమైన ప్రేమ పెల్లుబికింది. లింగాన్ని కౌగలించుకుని ముద్దులు కురుపించి, ఆనందభాష్పాలు జాలువారుతుండగా, ‘ఈశ్వరా! ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉంటున్నావయ్యా? నీకు ఆహారమెలా అందుతోంది? నీకిక్కడ తోడెవరుంటారు?’ అని చింతాక్రాంతుడై అడుగుతూ.. ‘నేను నీతోనే ఉంటాను. అయ్యో! నా తండ్రికి ఆకలిగా ఉందేమో.. ఆహరం తీసుకు రావాలి.’ అని తనలో తానే అనుకుంటూ, శివయ్యాను వంటరిగా విడిచి వెళ్ళలేక వెళ్లాడు. స్వర్ణముఖీ నదిలోని నీటిని నోటితో పుక్కిలినిండా పట్టి, పువ్వులను తలపై పెట్టుకుని, చేతిలో మాంసాన్ని పట్టుకుని తిరిగి ఆలయానికి చేరుకున్నాడు. నోటిలోని నీటితో శివుణ్ణి అభిషేకించి, పువ్వులతో అర్చించి, మాంసాన్ని నైవేద్యంగా అర్పించాడు. ఆలయ ద్వారం వద్ద కూర్చుని ఏ జంతువూ లోనికి రాకుండా కాపలా కాస్తూ, ఆ శివయ్యనే చూస్తూ మురిసి పోయాడు..

తిన్నడు చేస్తున్న పనులు చూసిన అతని అనుయాయులు నాముడూ, కాముడూ ఆ విషయాన్ని అతని తల్లి దండ్రులకు ఎరుకపరిచారు. వారక్కడకు చేరుకుని, తిన్నడిని ఇంటికి తీసుకువెళదామని శత విధాలా ప్రయత్నించినా వారికి సాధ్యం కాలేదు. దానితో వారతనిని అక్కడే వదిలి వెళ్లక తప్పలేదు. ఉదయాన్నే లేచి వేటకు వెళ్లి మాంసాన్ని తీసుకురావడం, శివయ్యకు నోటి నీళ్ళతో అభిషేకం చేయడం, తలపై పెట్టుకు తెచ్చిన పూలతో అర్చించడం, మాంసాన్ని నివేదించడం వంటి పనులు చేస్తూ, అక్కడే ఉండిపోయాడు తిన్నడు. ఈ విధంగా అయిదు రోజులు గడిచి పోయాయి. ఆలయ అర్చకుడూ, పరమ శివ భక్తుడూ అయిన శివగోచారుడు, ప్రతి రోజూ ఉదయాన్నే ఆలయం చేరుకుని, తిన్నడు చేస్తున్న పనులను జూసి భరించలేక రోదించాడు. ‘ఈ ఘోర కలిని ఆపు స్వామీ’ అంటూ మొరపెట్టుకున్నాడు. ఆ నాటి రాత్రి అర్చకునికి కలలో శివయ్య కనిపించి, ‘నీవు రేపు లింగం వెనుక దాక్కుని ఏం జరగబోతోందో చూడు..’ అని చెప్పాడు. మరునాడు శివగోచారుడు, రాత్రి స్వామి కలలో చెప్పిన విధంగానే చేశాడు. రోజూ లాగానే తిన్నడు నీళ్ళూ, పూలూ, మాంసం పట్టుకుని ఆలయం చేరుకున్నాడు. తిన్నడు శివయ్యను చూసే సరికి, లింగం యొక్క కుడి కంటి నుండి రక్తం కారుతోంది. అది చూసి ఏడుస్తూ, తల్లడిల్లి పోయి, తనకు తెలిసిన మూలికా వైద్యం చేశాడు తిన్నడు. అయినా లింగంనుంచి రక్తస్రావం ఆగక పోవడంతో, కంటికి కన్ను అనే సిద్ధాంతం గుర్తుకు వచ్చి, తన కంటిని పెకలించి, శివయ్యకు అమర్చాడు. రక్తం కారడం ఆగిందని సంతోషించే లోపుగా, లింగం యొక్క ఎడమ కంటి నుండి రక్తం కారండం ప్రారంభమయ్యింది.

వెంటనే తిన్నడు, ‘శివయ్యా, విచారించకు.. నా రెండవ కన్ను కూడా తీసి పెడతాను' అంటూ రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలితో ఆ కంటిని వత్తి పెట్టి, తన రెండవ కంటిని కూడా పెకిలించుకోబోతుండగా, అతడి అపార భక్తిప్రపత్తులకు కదిలిపోయిన శివుడు ప్రత్యక్షమై, తిన్నడిని వారించాడు. ‘తిన్నా.. నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను. నీ కంటిని నాకు అర్పించినందుకు, ఇకపై నీవు కన్నప్పగా లోక ప్రసిద్ధుడవవుతావు. నిస్వార్థ భక్తుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతావు’ అంటూ శివసాయుజ్యం ప్రసాదించాడు. ఇదంతా గమనిస్తున్న శివగోచారుడు నిశ్చేష్ఠుడయ్యాడు. అలా తిన్నడు తన అపార భక్తితో ఆ పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని, కన్నప్పగా చీరస్మరణీయుడయ్యాడు. మహాభక్తుడైన తిన్నడు తన కళ్లను తానే పెకలించి శివునికి అర్పించడం, ఆ పరమాత్ముడిపై సంపూర్ణ శరణాగతీ, ఆత్మ నివేదనా కనిపిస్తాయి. దానిని మించిన భక్తి తత్పరత మరొకటి లేదు. వేదం, నాదం, యోగం, శాస్త్రాలూ, పురాణాలూ ఏమీ తెలియక పోయినా, అకుంఠిత భక్తి శ్రద్ధలతో ఒక సాధారణ వ్యక్తి, ఆ మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకుని, ‘భక్త కన్నప్ప’గా చరితార్థుడయ్యాడు.

మన పురాణాలలో చెప్పబడిన గొప్ప శివ భక్తులను ‘నాయనార్లు’గా పేర్కొనబడినది. వీరిలో 63 మంది ముఖ్యులు. ఈ నాయనార్లలో రాజుల నుంచీ సాధారణ మానవుల వరకూ అన్ని స్థాయిల వారూ ఉన్నారు. భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మషమైన భక్తి తప్ప ఇంకేమీ కాదని, అంత్యకాలంలో మోక్షాన్ని పొందిన వీరి గాధలు నిరూపిస్తాయి. వీరిలో 19వ వాడు, తెలుగు వాడు, తిన్నడు.

🚩 హారహర మహాదేవ 🙏

Monday, October 28, 2024

సర్వధర్మజ్ఞుడైన భీష్మాచార్యుడిని ధర్మరాజడిగిన 6 ప్రశ్నలేంటి? 6 Questions of Yudhishtira to Bhishma


భక్తి! జ్ఞాన సముపార్జన! TELUGU VOICE
సర్వధర్మజ్ఞుడైన భీష్మాచార్యుడిని ధర్మరాజడిగిన 6 ప్రశ్నలేంటి?

“స్వ స్వరూపానుసంధానం భక్తి రిత్యభిధీయతే” అని సూత్రీకరించారు, నారద మహర్షి. దానిని బట్టి, జీవాత్మను పరమాత్మతో చేర్చటమే ‘భక్తి’ అని తెలుస్తోంది. “సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం, హృషీకేణ హృషీకేశ సేవనం భక్తి రుచ్యతే” అని నారద పంచరాత్రం లోనూ, “అన్యాభిలాషితా శూన్యం జ్ఞానకర్మాద్యనావృతం, ఆనుకూల్యేన కృష్టానుశీలనం భక్తి రుత్తమా”.. అని భక్తి రసామృత సింధువులోనూ విశదీకరింపబడి ఉంది. “మన ఇంద్రియాలన్నింటి ద్వారా, ఇంద్రియాలకు అధిపతి అయిన పరమాత్మను సేవిస్తూ ఉండడమే 'భక్తి'. జ్ఞాన కర్మాదులవైపు మనస్సు పోనీయకుండా, శ్రీ కృష్ణుని సంతృప్తి పరచడమే లక్ష్యంగా చేసే సాధన, ఉత్తమ భక్తిగా పరిగణింప బడుతుందన్నదే, వాటి తాత్పర్యం. మరి అంపశయ్యపై మృత్యు నిరీక్షణలో వున్న భీష్ముడు, భక్తి గురించీ, విష్ణు సహస్రనామం గురించి ఏం చెప్పాడు? అన్న విషయాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/QI8rw_UOcco ]


ఉపాధిగతుడై ఉన్న పరమాత్మనే, ‘జీవుడు’అని అంటాము. అటువంటి జీవులు అనంతంగా ఉంటాయి. అంటే, ఆ పరమాత్మ, ఈ సువిశాల విశ్వమంతటా ఉన్న అన్ని ఉపాధులలోనూ, జీవ రూపంలో ఉన్నాడని అర్ధం. దానివల్ల, అన్ని ప్రాణులలో ఉండేవాడు ఆయన ఒక్కడే అని తెలుస్తోంది. ఆ సత్యాన్నే “ఏకో దేవః సర్వభూతేషు గూఢః” అని ఉపనిషత్తులూ, “క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు..” అని శ్రీ కృష్ణపరమాత్మా, వ్యక్త్రపరచటం జరిగింది.

అయితే, యిప్పుడు మన కర్తవ్య మేమిటి? అంటే, సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ శ్రీమహావిష్ణువును, విష్ణు సహస్ర నామస్తోత్ర రూపంలో ఉన్న“మహా మంత్రం” ఆధారంగా గుర్తించటానికి ప్రయత్నించటం. మనలో భక్తి అనేది దృఢంగా ఉంటే, తప్పకుండా సఫలమనోరథులమవుతాము. అందులో సందేహమేమీలేదు.

“శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం” అనే మహామంత్రం, శ్రీమన్మహాభారతంలో, అనుశాసనిక పర్వంలో ఉంది. మహాభారత యుద్ధ కాలంలో, ఒక వైపు కురు పితామహుడైన భీష్మాచార్యుడు ప్రాణోత్క్రమణ సమయం కోసం ఎదురు చూస్తూ, అంపశయ్య మీద ఉన్నాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అయిన శ్రీకృష్ణుని దర్శనం కోసం తహతహలాడుతున్నాడు. మరొక వైపు యుధిష్ఠిరుడు, తన రాజ్యకాంక్ష కారణంగానే యుద్ధం జరిగిందనీ, అందులో తన గురువులూ, బంధువులూ, మిత్రులూ అన్యాయంగా మరణించటం సంభవించిందనీ భావించి, అమిత వేదనను అనుభవిస్తూ, పాపభీతితో కుమిలిపోతున్నాడు.

ఇదంతా గ్రహిస్తున్న శ్రీకృష్ణ భగవానుడు, తన పరమ భక్తుడైన భీష్మాచార్యునికీ, ధర్మమూర్తి అయిన యుధిష్ఠిరునికీ, ఏకకాలంలో మనశ్శాంతి చేకూర్చాలని నిశ్చయించుకున్నాడు. ఆ కారణంగానే, ధర్మజుని తీసుకుని భీష్మాచార్యుని దగ్గరకు వెళ్ళాడు.

శ్రీ కృష్ణుని ఆగమనాన్ని గ్రహించిన భీష్ముడు, ఆనంద పరవశుడయ్యాడు. శ్రీ కృష్ణుని భక్తవాత్సల్యాన్ని అమితంగా ప్రశంసించాడు. ఆపైన శ్రీ కృష్ణుని ఆదేశానుసారం, ఆయన ప్రసాదించిన శక్తి ఆధారంగా, పాండవాగ్రజునికి అనేక ధర్మసూక్ష్మాలు బోధించాడు. ఆ ధర్మసూక్ష్మాలలో కొన్నింటిని, మనం ఇదివరకే వీడియోలుగా అందించివున్నాము. చూడనివారు తప్పక చూడగలరు. అలా ఆయన ధర్మరాజు ఆవేదనను ఉపశమింప చేయటానికి ప్రయత్నించాడు.

కానీ, ధర్మజుడికి సంపూర్ణమైన సంతృప్తి కలుగలేదు. తన గురు దేవుని ద్వారా తాను తెలుసుకో వలసిన అసలు విషయమేదో మిగిలి ఉన్నదన్న అభిప్రాయం, ఆయనను బాధిస్తూనే ఉంది. ఆ కారణంగానే ఆయన, సర్వధర్మజ్ఞుడైన భీష్మాచార్యుడిని ఉద్దేశించి, ఆరు ప్రశ్నలడిగాడు..

1. ‘కి మేకం దైవతం లోకే’ అంటే, ప్రపంచమంతటికీ ఏకైక ఆరాధ్య దేవత ఎవరు?
2. ‘కిం వా ప్యేకం పరాయణం’ అంటే, ప్రాణికోటికి ఏకైక పరమ లక్ష్యమేమిటి?
3. ‘స్తువంతః కం ప్రాప్నుయుర్‌ మానవాః శుభం’ అంటే, ఎవరిని స్తుతించడం ద్వారా మానవులకు మేలు కలుగుతుంది?
4. ‘కమర్చంతః ప్రాప్నుయుర్‌ మానవాః శుభం’ అంటే, ఎవరిని అర్చించడం ద్వారా మానవులకు సుఖమూ, శాంతీ లభిస్తాయి?
5. ‘కోధర్మః సర్వధర్మాణాం భవతః పరమోమతః?’ అంటే, మీ అభిప్రాయంలో ధర్మాలన్నింటిలోకీ విశిష్ఠమైన ధర్మం ఏది?
6. ‘కిం జపన్‌ ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్‌’ అంటే, ఏ మంత్రాన్ని జపించడం ద్వారా ప్రాణికోటి, జనన-మరణ రూపమైన సంసారచక్రం నుండి విడివడగలుగుతుంది?

అన్న ఈ ఆరు ప్రశ్నలకు సమాధానాలను, భీష్మాచార్యుడు ఇలా చెప్పనారంభించాడు..

ప్రపంచమంతటికీ ఏకైక ఆరాధ్య దేవత ఎవరు? అన్న ప్రశ్నకు, ‘పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం, దైవతం దేవతానాం చ భూతానాం యో అవ్యయః పితా’ అంటే, పవిత్రమైన వాటన్నింటికీ పవిత్రతను చేకూర్చే పరమ పవిత్రుడూ, సర్వశ్రేయాలకూ మూలమైన వాడూ, దేవతలందరికీ దైవతమైన వాడూ, సమస్త ప్రాణికోటికీ తండ్రి అయిన శ్రీ మహావిష్ణువే, ప్రపంచమంతటికీ ఏక్రైక దైవతం.

ప్రాణికోటికి ఏకైక పరమ లక్ష్యం ఏమిటి? అన్న ప్రశ్నకు, ‘పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః, పరమం యో మహద్‌ బ్రహ్మ పరమం యః పరాయణం’ అంటే, పరమ తేజస్వరూపుడూ, సర్వ నియామకుడూ, సర్వ వ్యాపకుడూ, సర్వేశ్వరుడూ, పరమాత్మా అయిన శ్రీ మహావిష్ణువే, ప్రాణికోటి అంతటికీ ఏకైక లక్ష్యం.

ఎవరిని స్తుతించడం ద్వారా మానవులకు మేలు కలుగుతుంది? అన్న ప్రశ్నకు, ‘జగత్ ప్రభుం దేవదేవ మనంతం పురుషోత్తమం, స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః’ అంటే, ముల్లోకాలకూ ప్రభువూ, దేవతలకు కూడా దైవతమైన వాడూ, ఆది మధ్యాంత రహితుడూ అయిన పరమ పురుషుడిని, ఆయనకు సంబంధించిన అనంత నామాల ద్వారా స్తోత్రం చేయటంవలన, జీవులకు మేలు కలుగుతుంది.

ఎవరిని అర్చించడం ద్వారా మానవులకు సుఖమూ, శాంతీ లభిస్తాయి? అన్న ప్రశ్నకు, ‘తమేవ చార్చయన్‌ నిత్యం భక్ష్యాపురుష మవ్యయం, స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః’ అంటే, భక్తితో ఆ పరమపురుషుని ధ్యానించడం, పూజించడం, సేవించడం ద్వారా, మానవులకు సుఖమూ, శాంతీ లభిస్తాయి.

చివరి రెండు ప్రశ్నలు.. ‘మీ అభిప్రాయంలో ధర్మాలన్నింటిలోకీ విశిష్ఠమైన ధర్మం ఏది? ఏ మంత్రాన్ని జపించడం ద్వారా ప్రాణికోటి, జనన-మరణ రూపమైన సంసారచక్రం నుండి విడివడగలుగుతుంది? అన్న ప్రశ్నలకు, ‘అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం, లోకాధ్యక్షం స్తువ న్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్‌’ అంటే, జనన మరణాలకు అతీతుడూ, సర్వవ్యాపీ, విశ్వమంతటికీ ప్రభుడూ, సర్వసాక్షీ అయిన పరమాత్ముని అనంత నామాలను అనుదినమూ జపించడం ద్వారా, మానవులు దుఃఖ నివృత్తి చేసుకో గలుగుతారు.

ఈ విధంగా సమాధానమిచ్చిన తరువాత భీష్మాచార్యుల వారు, భగవంతుడికి సంబంధించిన అనంతనామాలైన శ్రీ విష్ణు సహస్రనామాలను ధర్మజుడికి వినిపించడం జరిగింది. నిరాకారుడైన భగవంతుడు, నామ రూపాలుగల ప్రపంచంగా వ్యక్తంకావడం వల్ల, ఆయనకు అనంత నామాలు ఏర్పడ్డాయి. ఆ నామాలన్నీ ఆయనవే అని గ్రహించడం, ఆ రూపాలన్నీ ఆయనవిగానే భావించడం, ప్రపంచంలోనూ, త్రికాలాలలోనూ శాశ్వతంగా ఉండేది ఆయన ఒక్కడే అని స్పష్టంగా తెలుసుకోవడం అన్నదే, ‘జ్ఞానం’. ఆ విధమైన జ్ఞాన సముపార్జనకు, విష్ణు సహస్రనామాలు అమితంగా సహాయపడతాయి.

ధర్మ సంరక్షణకోసం, అధర్మ నిర్మూలనకోసం, భగవంతుడు అప్పుడప్పుడూ అవతరిస్తూ ఉంటాడు. జ్ఞానులూ, భక్తులూ, సత్పురుషులూ మొదలయిన మహనీయుల రూపంలో, సామాన్యంగా వ్యక్తమవుతూ ఉంటాడు. ఆయా నమయాలలో ఆయన వెలువరుస్తూ ఉండే గుణాల ఆధారంగానే, మనం ఆయనదైన మహత్తర శక్తిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. అంటే, అవ్యక్త శక్తిని అవగాహన చేసుకోవటానికి, వ్యక్త రూపాలను ఆధారం చేసుకోవాలి. ఉదాహరణకు, ఒక చిత్రపటాన్నో, శిల్పాన్నో దర్శించుకున్నా, ఒక మహాకావ్యాన్ని చదివినా, ఆ చిత్రపటం, శిల్పం, లేక కావ్యం ద్వారా, ఆయా చిత్రకారుల, శిల్పాచార్యుల, మహాకవుల శక్తి సామర్థ్యాలు కొంతవరకైనా మనకు అవగతమవుతాయి. అలాగే వివిధ రూపాలలో వ్యక్తమయ్యే భగవత్‌ సృష్టిని పరిశీలించడం ద్వారా, ఆ భగవత్‌ శక్తిని లేశ మాత్రమైనా అర్థంజేసుకోవడానికి మనకు వీలవుతుంది. మనకు ఆ విధమైన అనుభూతిని కలిగించేవే, ‘శ్రీ విష్ణు సహస్రనామాలు’.

అలాగే, ‘కలిదోష నివారకమైన మార్గమేమిటి?’ అని నారద మహర్షి ఒకసారి, చతుర్ముఖ బ్రహ్మని అడిగాడు. అప్పుడాయన, ‘సర్వ శృతి రహస్యం గోప్యం తత్‌ శృణు యేన కలి సంసారం తరిష్యసి, భగవతః ఆదిపురుషస్య నారాయణస్య నామోచ్ఛారణ మాత్రేన నిర్ధూత కలిర్‌ భవతి’ అని సమాధానమిచ్చాడు.

ఆ అభిప్రాయాన్నే ‘బృహన్నారద పురాణం’, ‘హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం, కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతి రన్యథా’ అని ఉద్ఘోషించింది. దానిని బట్టి, ‘కలియుగంలో మానవులకు హరినామం ఒక్కటే గతి. అంతకు మించి వేరే గతి లేదు..’ అని నిష్కర్షగా తేటతెల్లమవుతోంది. అటువంటి మహత్తర శక్తిగల నామాలు, ఈ ‘స్తోత్ర మహామంత్రం’లో వెయ్యి వున్నాయి.

జనన ధర్మంగల జీవులకు జన్మరాహిత్యాన్ని చేకూర్చేది, భగవన్నామ జపం ఒక్కటే. ఏ రూపంలో ఉన్నా, ఏ జాతికి, కులానికి, మతానికి చెంది ఉన్నా, భగవన్నామాన్ని జపించే అర్హత ప్రతి ప్రాణికీ ఉంది. ఆ సత్య నిరూపణకు, గజేంద్ర మోక్షం ప్రబల నిదర్శనం. జడ భరతుని గాథ ఒక తార్కాణం. వాల్మీకి, హరిదాసు మొదలైన వారి చరితలు, కొన్ని ఉదాహరణలు.

శ్రీ విష్ణు సహస్రనామాలలో ప్రతి నామం ఒక మంత్రమే. వీటిలో ఏ ఒక్క నామాన్ని జపించినా, ధన్యత్వం సిద్ధించి తీరుతుందంటారు ఆర్యులు.

🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

Monday, September 2, 2024

ఎవరు గొప్ప! కర్ణుడా - అర్జునుడా? Who is more powerful - Karna or Arjuna


ఎవరు గొప్ప! కర్ణుడా - అర్జునుడా? TELUGU VOICE
ద్రౌపది మనస్సులో కర్ణుడిని కామించిందనడంలో ఎంతవరకూ నిజం ఉంది?

వేదవ్యాసుడు చెబుతుండగా, గణపతి రచించిన మహాభారతం, పంచమ వేదంగా పరిగణించబడే భారత ఇతిహాసం. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం, మహాభారత కావ్యం, వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000 సంవత్సరాల కాలంలో, దేవనాగరి లిపి అయిన సంస్కృత భాషలో రచించబడింది. 18 పర్వాలతో, లక్ష శ్లోకాలతో, 74,000 పద్యాలతో లేక సుమారు 18 లక్షల పదాలతో, ప్రపంచంలోనే అతి పెద్ద పద్య కావ్యాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ మహా కావ్యాన్ని 14వ శతాబ్దంలో, కవిత్రయంగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రనలు తెలుగులోకి అనువదించారు. అటువంటి మహాభారతంలోని అర్జునుడూ, కర్ణుడి గురించి తెలియనివారుండరు. ఇక ప్రభాస్ నటించిన కల్కి వంటి చిత్రాలు చూసినప్పుడు, వీరిలో ఎవరు గొప్ప అనే సందేహం మెదులుతూ ఉంటుంది చాలామందిలో. విశ్లేషణాత్మకంగా ఈ విషయాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/xKPQS3XGcWg ]


కర్ణుడు గొప్పా, అర్జునుడు గొప్పా అనేది తెలుసుకునే ముందు, వ్యాస విరచిత మహాభారత కావ్యంలోని కొన్ని పాత్రల వైశిష్ట్యం, కొన్ని సంఘటనలూ తెలుసుకోవడం తప్పనిసరి. దానం విషయంలో కర్ణుడికి సాటి ఎవరూ లేరన్న పేరుంది. కర్ణుడు అంగరాజ్యానికి రాజయ్యాక చేసిన దానాలన్నీ, దుర్యోధనుడు ఇచ్చినవే కావచ్చు. కానీ, బాల్యం నుండీ కర్ణుడికి దానగుణం హెచ్చని, భారతం చెబుతుంది. అలాగే, కర్ణుడి దానాలలోకెల్లా గొప్ప దానం, కవచ కుండలాల దానం. ఎందుకంటే, అవి దుర్యోధనుడు ఇచ్చినవి కావు. కర్ణుడి స్వంతం, అతడికి పుట్టుకతో సంక్రమించినవి. కవచ కుండలాల దానం, కర్ణుడికి మహత్తర కీర్తిని తెచ్చిపెట్టింది. కానీ, ఇక్కడ గమనించాల్సింది, కవచ కుండలాలను దానం చేసి, అంతకంటే గొప్పదైన 'శక్తి' ఆయుధాన్ని ప్రతిఫలంగా పుచ్చుకున్నాడు. ప్రతిఫలం పుచ్చుకున్న దానికి, దాన ఫలం మిగలదు. కర్ణుడు తన పూర్వజన్మలో సహస్ర కవచుడిగా, 1000 కవచాలూ, కుండలాలతో వున్నప్పుడే, నరనారాయణుల ముందు నిలువలేక పోయాడు. ఇక ఈ జన్మలో, కేవలం ఒక్క కవచంతో, నరనారాయణులు అంటే, కృష్ణార్జునుల ముందు నిలువగలడా? ఆ కవచం బలం ఎంతో కర్ణుడికి తెలుసు. అందుకే దాన్ని ఇచ్చేసి, అర్జునుణ్ణి చంపగల శక్తి ఆయుధాన్ని తీసుకున్నాడు. అంటే, ఈ విషయంలో మోస పోయింది కర్ణుడు కాదు, ఇంద్రుడే అనేది తేటతెల్లమవుతుంది. ఈ దానం సందర్భంలో, కర్ణుడు అంతటి చాకచక్యం చూపించాడు.

ఇక భీష్ముడు తన తండ్రి కోసం, రాజ్యాన్ని వదులుకున్నాడు. తండ్రి కోసం ఆయన చేసిన త్యాగమది. ఇక్కడ చెప్పుకోవలసిన విషయం, ఆ రాజ్యం భీష్ముడి స్వంతం కాదు, స్వార్జితమూ కాదు. అప్పటికి ఇంకా భీష్ముడు రాజు కాలేదు. యువరాజు మాత్రమే. ఆ రాజ్యం అప్పటికీ ఆయన తండ్రి అయిన శంతనుడిదే. శంతనుడి రాజ్యాన్ని శంతనుడికే వదిలేశాడు. ఒక విధంగా ఆ త్యాగం అసంపూర్ణం. అతను రాజ్యాన్ని వదిలేసి, దానికి ప్రతిఫలంగా, తాను కోరుకున్నప్పుడే మరణించే వరాన్ని పొందాడు. అంటే, ఈయనా తన త్యాగానికి ఫలితాన్ని పొందాడు. పైగా, సత్యవతి కుమారులు పెరిగి పెద్దయ్యే వరకూ, సుమారు 25 సంవత్సరాలు మకుటం లేని మహారాజుగా, రాజ్యపాలన చేశాడు. అనంతర కాలంలోనూ, చివరి వరకూ బ్రహ్మాండమైన రాజభోగాలను కూడా అనుభవించాడు.

ఈ విధంగా కర్ణుడూ, భీష్ముడూ, తగిన ప్రతిఫలాలను పొందడం వలన, వారి చర్యల్లో చెప్పుకునేంత గొప్పదనం ఏమీ మిగలదు. వీరిద్దరికంటే గొప్ప దాతగా, త్యాగశీలిగా, ధర్మరాజును చెప్పుకోవచ్చు. ఎందుకంటే, అరణ్యవాస కాలంలో, తమకే తిండి తిప్పలు కరువైన రోజుల్లో కూడా, తమనే నమ్ముకుని, తమతోబాటు అరణ్యాలకు వచ్చిన వేలాది మంది అమాయక ప్రజల కోసం, సూర్యునికై తపస్సుజేసి, అక్షయపాత్రను సంపాదించి, ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా, వేలాది మందికి ప్రతిరోజూ అన్నదానాలు చేశాడు. ఎక్కడో హిమాలయాలకు వెళ్లి, అక్కడ భూమిలో నిక్షిప్తమైవున్న నిధులను స్వయంగా సాధించుకు తెచ్చి, అశ్వమేధ యాగ సమయంలో వేలాది మందికి, వారు కోరినంత, స్వార్జితమైన బంగారాన్ని దానం చేసిన ధర్మరాజు, కర్ణ భీష్ముల కంటే గొప్పవాడని నిరూపితమవుతుంది.

కర్ణుడిలో కొంత దానగుణం తప్ప, ఇక ఏ ఇతర మంచి గుణాలూ లేవు. అందుకే వ్యాసభగవానుడూ, తిక్కన, కర్ణుడిని దుష్టచతుష్టయంలో చేర్చారు. అంగరాజ్యమిచ్చి దుర్యోధనుడు ఆదరించాడనే విశ్వాసంతోనే, దుష్టకార్యాలు చేశాడని కొందరు భ్రమపడుతుంటారు. కానీ అది నిజం కాదు. అంత విశ్వాసం వుంటే, పంతాలకు పోయి, కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళకుండా, పది రోజుల పాటు దుర్యోధనుణ్ణి వదిలేస్తాడా? అంటే, దుర్యోధనుడికంటే, అతనికి తన స్వంత పంతాలే ముఖ్యం. అంతేగాక, కర్ణుడు అసూయ, మోసం, ద్వేషం, అన్నీ మెండుగా కలిగివున్న వాడు. అతడు పరశురాముడి వద్ద విద్య నేర్చుకున్నదే, మోసంతో. మొట్టమొదట కురు పాండవ యుద్ధవిద్యా ప్రదర్శనలో, తానూ పాల్గొనాలని వచ్చాడు. కానీ, అతడు క్షత్రియుడు కాదని కొందరు అభ్యంతరం వెలిబుచ్చారు. ఆ సమయంలో అర్జునుడు గొప్ప అస్త్ర నిధిగా పొగడబడుతున్నాడు. అదే, కర్ణుని అసూయకు నాంది. దుర్యోధనుడి పుణ్యమా అని ఆ అస్త్ర విద్యా ప్రదర్శనలో పాల్గొన్నాడు. అయితే, కౌరవులు తప్ప అతడిని అర్జునుడి కన్నా మిన్న అని అక్కడ ఎవ్వరూ పొగడలేదు. అందుకే ఏనాటికైనా అర్జునుణ్ణి ఓడించాలని అనుకున్నాడు. కానీ, ద్రౌపదీ స్వయంవరం, ఘోష యాత్ర, ఉత్తర గోగ్రహణం లాంటి సంఘటనలు తీసుకుంటే, అనేకసార్లు అర్జునుడి ముందు ఓడిపోయాడు. అందుకే భూమిపై తానో, అర్జునుడో, ఎవరో ఒక్కరే వుండాలని నిర్ణయించుకుని, అర్జునుడి పై పగబట్టాడు.

నిజం చెప్పాలంటే, అర్జునుడేమీ కర్ణుని అంతగా అవమానించిన సందర్భం లేదు. అస్త్ర విద్యా ప్రదర్శన నాడు కూడా, కర్ణుని భీముడే అవమానించి మాట్లాడాడు. దుర్యోధనుడికి ముఖ్య శత్రువు భీముడు. స్నేహితుని శత్రువు గనుక, పగబడితే భీముడిపై పగబట్టాలి కర్ణుడు. కానీ, అర్జునుడిపై పగబట్టింది, కేవలం అసూయ వల్లనే. అందుకే పాండవులలో ఎవరు దొరికినా చంపను, అర్జునుడిని మాత్రం వదలనన్నాడు కుంతీ దేవితో. అర్జునుడిని చంపడానికి నాగాస్త్రం సంపాదించాడు. ఇంద్ర 'శక్తి' ఆయుధం తీసుకున్నాడు. యుద్ధంలో అర్జునుడు అలసిపోయే వరకూ, 10 రోజుల పాటు తాను విశ్రాంతి తీసుకుని, కురుక్షేత్రానికి వచ్చాడు. అతని గురి కేవలం అర్జునుడే..

కర్ణుడి జన్మ రహస్యం ధర్మరాజుకు తెలిస్తే, ఆయన తనకున్నదంతా కర్ణుడికే ఇచ్చేసే వాడు. అలా జరిగితే, పాండవులంతా అతని అనుచరులుగా వుండేవారు. కానీ, కర్ణుడికి కావలసింది, భ్రాతృ ప్రేమో, మాతృ ప్రేమో కాదు. పెద్దన్నయ్యగా గౌరవాదులూ కాదు. అర్జునుడిని ఓడించాలి. తానే గొప్ప వీరుడిగా కీర్తించబడాలి. అందుకు అర్జునుడిని చంపేయాలి. పాండవులతో కలసి జీవిస్తే, తన అసూయా పూరిత దుష్టాశయం నెరవేరదు కాబట్టి, అతడు ఆజన్మాంతం పాండవ విరోధిగానే మిగిలిపోయాడు.

ఇక కర్ణుడి దానశీలతను ఆసరాగా తీసుకుని, ఇంద్రుడు అతని కవచకుండలాలను కాజేశాడనీ, కురుక్షేత్రంలో కర్ణుడిని శల్యుడు తన మాటలతో కుంచింపచేశాడనీ, రధచక్రం భూమిలో క్రుంగిన సమయంలో, అర్జునుడు అతడిని చంపేశాడనీ, ఇటువంటి ఘటనలు జరిగివుండకపోతే, కర్ణుడి చేతిలో అర్జునుడు ఓడిపోయే వాడనీ కొందరు అంటూ ఉంటారు. మరి ఆ విషయాలలోకి వెళితే.. ఏ విధంగా చూసినా, అర్జునుడి వీరత్వం ముందు, కర్ణుడు దిగదుడుపే. ఇందులో ఎంత మాత్రం సందేహం లేదు. అయితే, ఈ కలియుగంలో కలి ప్రభావంచేతనో ఏమోగానీ, ఈ మధ్య విలన్స్‌కి అభిమానులు పెరుగుతున్నారు. అంతటితో ఆగకుండా, డబ్బున్న మారాజులు కొందరు విలన్స్‌ను గొప్పవారిగానూ, ధర్మపరులను అల్పులు గానూ చిత్రించి, సినిమాలూ, టి.వి. సీరియల్స్‌ తీసి ప్రదర్శిస్తున్నారు. ఆ పుక్కిటి కథలనే నిజమని నమ్మడం వల్లే, ఇటువంటి సందేహాలు పుట్టుకొస్తున్నాయి.

‘రావణుడు రాముడికన్నా మిన్న’ అంటాడు ఒకడు. ‘ద్రౌపది, మనస్సులో కర్ణుడిని కామించింద’ని అంటాడు ఇంకొకడు. ‘ధర్మరాజుకు రాజ్య పిపాస హెచ్చ’ని అంటాడు మరొకడు. ‘కీచకుడు మంచివాడే.. అతడిని రెచ్చగొట్టింది ద్రౌపదే’ అని వేరొకడంటాడు. కీచకుడిపై గెలవలేక, భీముడు రహస్యంగా దాచుకున్న కత్తితో పొడిచి చంపేశాడనీ, ద్రౌపదీ స్వయంవరంలో కర్ణుడే మత్స్య యంత్రాన్ని కొట్టేసేవాడు కానీ, ద్రౌపదే అతడిని కించ పరచి, పోటీలో పాల్గొన నీయలేదనీ, అసలు మత్స్య యంత్రాన్ని జరాసంధుడు కొట్టేసేవాడు కానీ, ద్రౌపది అతడిని వేడుకుని, బ్రతిమాలి, పోటీ నుండి తప్పించిందనీ, ఇలా ఎన్నెన్నో.. ఇవన్నీ మన సినిమాలలో, టి.వి. సీరియల్స్‌లోని మాయా జాలాలు. ఈ సంఘటనలేవీ, కృతికర్త వ్యాసుల వారు చెప్పినవి కావు. కర్ణుడు వీరుడే.. కానీ అర్జునుడితో ఏ మాత్రం సరిసమానుడు కాడు. ద్రౌపదీ స్వయంవరంలో, కర్ణుడు అర్జునుడిచేత ఓడించబడ్డాడు. ఘోష యాత్రలో కర్ణుడిని ఓడించిన చిత్రరధుడు, అర్జునుడి చేతిలో ఓడి పోయిన వాడే. ఉత్తర గోగ్రహణంలో కర్ణుడిని పడగొట్టి, అతని తలపాగా కుచ్చును తీసుకు పోయాడు అర్జునుడు. కురుక్షేత్రంలో ఒకే రోజున అయిదు సార్లు భీముడి చేతిలో ఓడిపోయి, పారిపోయాడు కర్ణుడు. అభిమన్యుడి చేతిలో చావుదెబ్బలు తిని పారిపోయి, మరో ఐదుగురు దుర్మార్గులతో కలసివచ్చి, అన్యాయంగా అభిమన్యుణ్ణి చంపిన భీరువు కర్ణుడు. కర్ణుడి కుమారుణ్ణీ, సైంధవుణ్ణీ చంపుతానని చెప్పిమరీ, కర్ణుడి కళ్ళముందే వారిద్దరినీ చంపేశాడు అర్జునుడు. ఘటోత్కచుడి చేతిలో చావుదెబ్బలు తిని, గత్యంతరం లేక, తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం, అర్జునుణ్ణి చంపడానికి దాచుకున్న ఇంద్రశక్తిని ప్రయోగించి, ఘటోత్కచుణ్ణి తుదముట్టించిన భయస్థుడు కర్ణుడు. ఇదీ, కర్ణుడి వీరత్వం.

వేయి కవచాలు కలిగి ఉన్ననాడే, కృష్ణార్జునులు నరనారాయణుల రూపంలో కర్ణుడిని, అంటే సహస్ర కవచుడిని చావగొట్టి, 999 కవచాలను ఛేదించారు. చేసేది లేక పారిపోయాడు కర్ణుడు. ద్రౌపదీ స్వయంవరం, ఘోషయాత్ర, ఉత్తర గోగ్రహణం సమయాలలో, కర్ణుడికి చివరి కవచ కుండలాలున్నాయి. అయినా, అర్జునుడే గెలిచాడు. అందుకే ఆ కవచ కుండలాల శక్తి ఏ పాటిదో కర్ణుడికి అర్ధమై, ఇంద్రుడు అడిగిన వెంటనే వాటిని ఇచ్చేసి, బదులుగా, అర్జునుడిని చంపగల శక్తి ఆయుధాన్ని తీసుకున్నాడు, దాన కర్ణుడు. ఇక శల్యుడు తన మాటలతో కర్ణుడి మనస్సు పాడు చేయటం సంగతి ఎలావున్నా, ఒక సంఘటనలో, కర్ణుడి ప్రాణాలను రక్షించాడు శల్యుడు. కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజున, కర్ణుడు ధర్మరాజును దూషించిన విషయం తెలుసుకున్న భీముడు వెళ్ళి, కర్ణుడితో యుద్ధం చేసి ఓడించి, మూర్చబోయేటట్లుజేశాడు. అన్నగారిని తిట్టిన నాలుకను కోసి పారేస్తానని ముందుకురికాడు, భీముడు. అప్పుడు శల్యుడు భీముణ్ణి శాంతపరచి, మూర్చలో వున్న వారి నాలుక కోయడం తగదని నచ్చజెప్పి, కర్ణుడిని రక్షించాడు.

ఇక రధ చక్రం కృంగి పోయినప్పటి సంగతికొస్తే, చక్రాన్ని కర్ణుడు ఎత్తుతుండగా అర్జునుడు అతన్ని చంపడం వాస్తవం కాదు. క్రుంగిన రధ చక్రాన్ని ఎత్తడానికి ఎంత ప్రయత్నించినా రాకపోవటంతో, శాపవశాన ఆ చక్రం ఇక రాదనీ, మరో రధం తెచ్చుకున్నా, అదే గతి పడుతుందనీ తెలుసుకున్న కర్ణుడు, ఆ పై ఇక నేలపై నిలబడే యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలోనే కర్ణుడు మరణించాడు. ఇక్కడ అర్జునుడు రధంపైనా, కర్ణుడు నేలపైనా వున్నందువల్లనే, కర్ణుడు ఓడిపోయాడని అనుకోవడం సరికాదు. ఎందుకంటే, అదే కర్ణుడిని ఓడించిన చిత్రరధుడు రధంపై వుండి యుద్ధం చేయగా, నేలపై నిలబడి పోరాడిన అర్జునుడే గెలిచాడు. అందువల్ల మనం గమనించవలసింది, శాపాలు వగైరాలు లేకపోయినా, కర్ణుడు అర్జునుడిపై గెలవగలగడం అసంభవం.

🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏

Monday, October 23, 2023

‘ధర్మ ద్వేషులు’ ఎటువంటి వారైనా అంతమొందక తప్పదు! Mahabharatam


‘ధర్మ ద్వేషులు’ ఎటువంటి వారైనా అంతమొందక తప్పదు!
భీముడి కొడుకు మరణించినప్పుడు శ్రీ కృష్ణుడు ఎందుకు ఆనందించాడు?

మహాభారతంలో ఎందరో వీరులూ, యోధానుయోధులూ ఉన్నారు. వారితోపాటు ఈ ఇతిహాసంలో ఎందరో వీర వనితల ప్రస్తావన కూడా మనకు కనిపిస్తుంది. శ్రీ కృష్ణుడి సుదర్శన చక్రాన్ని ఓడించిన ఆ స్త్రీ ఎవరు? శ్రీ కృష్ణుడితో ఆమె యుద్ధం చేయడానికి గల కారణం ఏంటి? భీముడి కొడుకు మరణించినప్పుడు, కృష్ణ భాగవానుడు ఎందుకు నృత్యం చేస్తూ ఆనందించాడు?  శ్రీ కృష్ణుడు ఆ రాక్షస స్త్రీని ఎలా శాంతింపజేశాడు? అనేటటువంటి ఉత్సుకతను రేకెత్తించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Q48XqOWYIr4?si=TFzLUaVcqP-EK4qZ ]


లక్క గృహం దహనమైన తరువాత, దాని నుండి బయటపడిన పాండవులందరూ అరణ్యంలో అలసిపోగా, భీముడు ఒక పెద్ద వృక్షం నీడలో అందరినీ విశ్రాంతి తీసుకోమన్నాడు. తాను వెళ్లి నీరు తీసుకుని వచ్చాడు. అందరూ అలిసిపోవటం చేత, ఓ చెట్టుకింద విశ్రమించారు. చీకటి పడింది. భీముడు వారికి కాపలాగా కూర్చున్నాడు. అయితే, పాండవులు విశ్రమించిన ప్రదేశానికి దగ్గరగా, హిడింబుడనే రాక్షసుడున్నాడు. నర వాసన వాడి ముక్కు పుటాలకు సోకింది. చెల్లెలు హిడింబను పిలిచి, “హిడింబా, మన ఆవాసానికి నరులు వచ్చారు. నోరు చవి చెడి ఉన్నది. ఆ నరులను చంపి, నాకు వండి పెట్టు” అని చెప్పాడు. అన్న ఆనతి మేరకు, హిడింబ పాండవుల దగ్గరకు వెళ్ళింది. పడుకుని ఉన్న పాండవులనూ, కాపలాగా ఉన్న భీముడినీ, చెట్టు చాటున నిలబడి చూసింది. భీముని మీద మనసు పడింది. వెంటనే, మానవకాంత రూపం ధరించి, అన్న చెప్పిన మాటలు మరచి పోయింది.

అన్నలకు కాపలాగా ఉన్న భీముడు, తన దగ్గరకు వస్తున్న హిడింబను చూశాడు. “ఎవరు నువ్వు? ఇక్కడకు ఎందుకు వచ్చావు?” అని అడిగాడు. “మహాభాగా, నా పేరు హిడింబ. నేను హిడింబుడు అనే రాక్షసుని చెల్లెలిని. నిన్ను మోహించాను. నువ్వు నాకు భర్తవయితే, నా అన్న నీకు హాని చెయ్యడు. కాబట్టి నన్ను వివాహమాడు. మా అన్న సంగతి నీకు తెలియదు. అతను ఎవరినీ లెక్కపెట్టడు. ఇది నా అన్న హిడింబాసురిడి వనము. అతను చూసిన, మిమ్ములను బతుకనీయడు. నాతో రమ్ము, నిన్ను కోరిన చోటికి తీసుకుని పోతాను. మనం సుఖాలు అనుభవిస్తాము” అని బలవంతం చేసింది, హిడింబ. దానికి భీముడు, “వీరు నా తల్లి, తమ్ములు. ఒక స్త్రీ కోసం వీళ్ళను ఎలా వదలమంటావు?” అని అన్నాడు. “ఐతే వీరిని నిద్రలేపు. అందరం వెళ్లిపోదాము” అన్నది హిడింబ. “అదేమిటి అలా అంటావు. ఎవరో రాక్షసుడు వస్తున్నాడని, సుఖంగా నిద్రిస్తున్న తల్లీ, సోదరుల నిద్ర చెడగొట్టమంటావా?” అన్నాడు భీముడు.

ఈలోగా హిడింబాసురుడు తన చెల్లెలు ఎంతకూ రాకపోయేసరికి, తానే అక్కడకు వెళ్ళాడు. అతనిని చూసి హిడింబ, భీముని చాటుకు వెళ్లి దాక్కుంది. “రాక్షసా, నిన్ను వధించి, ఈ అడవిలో రాక్షస భయం లేకుండా చేస్తాను” అని హిడింబాసురుడి మీదికి ఉరికాడు. ఇద్దరికీ ఘోర యుద్ధం జరిగింది. వారు చేస్తున్న గర్జనలకు, కుంతీ దేవీ, మిగిలిన పాండవులూ నిద్రలేచారు. హిడింబను చూశారు. “అమ్మా! నువ్వు ఎవరు?” అని అడిగింది కుంతి. “తల్లీ! నేను ఈ రాక్షసుడు హిడింబాసురుని చెల్లెలిని. నా పేరు హిడింబ. నీ కుమారుని భర్తగా వరించాను. నా అన్నయ్య, మీ కుమారుడు, భీకరంగా యుద్ధం చేస్తున్నారు” అని చెప్పింది. ఇంతలో అర్జనుడు యుద్ధం జరిగే చోటికి వెళ్ళాడు. “భీమా, తూర్పు అరుణంగా మారుతోంది. ఇది దుష్ట రాక్షసులకు అనుకూల సమయం. వెంటనే ఈ రాక్షసుడిని చంపు” అని అరిచాడు. ఆ మాటలు విని భీముడు విజృంభించి, హిడింబుని ఎత్తి గిర గిరా తిప్పి, నేలమీద పడేశాడు. హిడుంబుడి నడుము విరిగి నేలమీద పడి, ప్రాణాలు విడిచాడు. హిడింబకు ఆశ్చర్యం వేసింది.

భీముడు హిడింబను చూసి, “నువ్వు రాక్షస కాంతావు. మేము నిన్ను నమ్మము. నువ్వు మా వెంట రావద్దు” అని అన్నాడు. అప్పుడు హిడింబ కుంతీదేవిని చూసి, “అమ్మా, సర్వ ప్రాణులకూ కామ సంబంధమైన కోరికలు సామాన్యంగా ఉంటాయి. కానీ, స్త్రీలలో అవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. నేను భీముని మీద మనసు పడ్డాను. అతని కొరకు అందరినీ వదులుకున్నాను. నా కోరిక తీరకపోతే, నేనే ప్రాణాలు విడుస్తాను. మీరు నన్ను స్వీకరిస్తే, మీకు ఎంతో సహాయంగా ఉంటాను. నాకు జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది తెలుసు. మీకు జరగబోయే దానిని చెపుతాను వినండి. ఇక్కడికి కొంచెం దూరంలో, శాలిహోత్రుడనే మహాముని ఆశ్రమము ఉంది. అక్కడ ఉన్న కొలనులోని నీరు త్రాగితే, ఆకలి దప్పులు ఉండవు. మీరు అక్కడ ఉండండి. కృష్ణద్వైపాయనుడు వచ్చి, మీకు హితోపదేశం చేస్తాడు” అని చెప్పింది. ఇది విని కుంతీదేవి ఎంతో సంతోషించింది.

భీముని చూసి, “భీమసేనా, నా మాట, నీ అన్నగారైన ధర్మజు మాటగా వినుము. హిడింబ ఉత్తమకాంత. ఈమెను పెళ్లి చేసుకో. నీకు మంచి జరుగుతుంది” అని చెప్పింది. భీముడు తల్లి మాట ప్రకారం, హిడింబను పెళ్లి చేసుకున్నాడు. తరువాత అందరూ శాలిహోత్రుని ఆశ్రమములో కొంతకాలం నివసించారు. ఇంతలో హిడింబ గర్భం ధరించింది. ఆమెకు ఘటోత్కచుడు జన్మించాడు. అతడు తండ్రి మాదిరిగానే, అమిత బలవంతుడు. తల్లి వద్దనుండి రాక్షస శక్తులను పొందిన మహా శక్తివంతుడు. కొంతకాలం తరువాత పాండవులు ఆశ్రమాన్ని వదిలి వెళ్ళబోతున్న సమయంలో, ఘటోత్కచుడినీ, హిండిబినీ తనతో రమ్మని అడుగగా, అందుకు వారు నిరాకరించారు. హిండిబి తన కుమారుడితో కలిసి ఆ వనంలోనే ఉంటానని చెప్పి, వారు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఘటోత్కచుడు వారి ముందుకు వస్తాడని మాట ఇచ్చి, వారిని పంపించింది.

ధర్మరాజు ఇంద్ర ప్రస్థను పాలిస్తున్న కాలంలో, సభలో అందరూ కొలువుదీరి ఉన్న సమయంలో, ఘటోత్కచుడి వివాహ విషయం సంభాషణకు రాగా, అక్కడే ఉన్న శ్రీ కృష్ణుడు, కామాఖ్య అడవులలో ఉన్న రాక్షస జాతికి చెందిన స్త్రీ మౌర్వి, ఘటోత్కచుడికి సరైన వధువు అంటూ, ఆమె గురించి వివరించాడు. మౌర్వి పూర్వజన్మలో, అహిలావతి అనే గొప్ప నాగ కన్య. ఆమె తండ్రి నాగలోకాధిపతి అయిన వాసుకి. ఆమె గొప్ప శివభక్తురాలు. అహిలావతి కైలాసంలో పార్వతిదేవికి ఇష్టమైన సేవకురాలిగా ఉండేది. శివుని పూజ నిమిత్తం, పార్వతి దేవికి నిత్యం పూలను అందించేది. అయితే, ఒకనాడు అనుకోకుండా వాడిన పూలను శివుని పూజకు సిద్ధం చేయగా, పార్వతి దేవి ఆగ్రహించింది. ‘నువ్వు రాక్షస జాతిలో జన్మించి, రాక్షస రాణిగా పెరిగి, ఒక భయంకరమైన రాక్షసుణ్ణి వివాహం చేసుకుని బాధలు పడతావు’ అంటూ పార్వతీ దేవి శపించింది. అందుకు అహిలావతి, పార్వతి మాతను క్షమించమని అడిగి, తనను శాప విముక్తిరాలిని చేయమని అడిగింది.

దానిని వెనకకు తీసుకునే అవకాశం లేదు. కానీ, ఇంతకాలం నువ్వు చేసిన సేవలకు గాను, ఎటువంటి కష్టం నీకు రాకుండా కాపాడతానంటూ, అభయమిచ్చింది. ఆ విధంగా నాగకన్య అయిన అహిలావతి, పార్వతీదేవి శాపంతో, భూలోకంలో మురాసురుని కుమార్తెగా జన్మించింది. తన తండ్రి నరకాసురునికి సేనాధిపతి, మంచి స్నేహితుడు. మురాసురుడికి మౌర్వితో పాటు, ఏడుగురు కుమారులు కూడా జన్మించారు. నరకాసుర వధ సమయంలో, మురాసురునికీ, శ్రీ కృష్ణుడికి ఘోర యుద్ధం జరిగింది. తన ఏడుగురు కుమారులతో కలిసి మురాసురుడు రణరంగంలో పోరాడగా, వారిని శ్రీ కృష్ణుడు సంహరించాడు. తన తండ్రినీ, సోదరులనూ కోల్పొయి, మౌర్వి ఒంటరిగా మిగిలిపోయింది. శ్రీ కృష్ణుడి పై పగను పెంచుకుని, తనతో యుద్ధం చేసేందుకు సకల విద్యలను నేర్చుకుంది మౌర్వి.

ఒకనాడు మౌర్వి శ్రీ కృష్ణుడిపై యుద్ధాన్ని ప్రకటించింది. వీరిద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. మౌర్విని సంహరించేందుకు, శ్రీ కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. కానీ, అది మౌర్విని గాయపరచకుండా, తిరిగి శ్రీ కృష్ణుడి వద్దకు చేరుకుంది. అందుకు కారణం, మౌర్వికి ఎటువంటి ఆపద రాకుండా ఎల్లప్పుడు కాపాడతానని, పార్వతి మాత వాగ్దానం చేయడమే. ఆ కారణంగా, సుదర్శన చక్రం మౌర్విని ఏమీ చేయలేకపోయింది. దాంతో శ్రీ కృష్ణుడు, పగతో రగిలిపోతున్న మౌర్వికి, తన పూర్వజన్మ స్మృతులనూ, పార్వతీదేవి శాపాన్ని గుర్తు చేసి, ఆమెను శాంతింపజేశాడు.

ఆ తరువాత మౌర్వి, పార్వతిదేవి రూపమైన కామాఖ్య దేవిని పూజిస్తూ, అడవులలో జీవించసాగింది. ఈ విషయాలన్నింటినీ వివరించి, ఘటోత్కచుడికి మౌర్వి సరి అయిన జోడి అని చెప్పి, వారికి వివాహం జరిగేలా చేశాడు శ్రీ కృష్ణుడు. ఘటోత్కచుడికీ, మౌర్వికీ ముగ్గురు కుమారులు. వారిలో అత్యంత శక్తివంతుడు, మహాభారత యుద్ధం ఆసాంతం వీక్షించిన బర్బరీకుడు. ఘటోత్కచుడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గోని, గొప్ప వీరుడిగా పేరుగడించాడు. తన మాయోపాయ శక్తులతో, కౌరవ సేనలను ఇరకాటంలోకి నెట్టాడు. కర్ణుడు తన దగ్గర ఉన్న అతీంద్రియ బాణంతో, ఘటోత్కచుడిని సంహరించాడు. ఘటోత్కచుడి మరణ వార్త విన్న పాండవులు, కన్నీరు మున్నీరుగా విలపించారు. భీమసేనుడి దుఃఖానికి అంతు లేదు. కానీ, కృష్ణుడు రధం మీద నిలబడి, నాట్యమాడసాగాడు. కేరింతలు కొట్టి, సింహనాదం చేసి, ఆనందంతో పాంచజన్యం పూరించారు.

కృష్ణుడి ఈ విపరీత ప్రవర్తన చూసి అర్జునుడు ఆశ్చర్యపోతూ, "కృష్ణా! ఏమిటిది? మేమంతా ఘటోత్కచుడి మరణానికి విలపిస్తుంటే, నీవు ఆనందంతో గంతులు వేస్తున్నావు. ఏమిటి నీ ఆంతర్యం" అన్నాడు. కానీ, కృష్ణుడు తన ఆనంద హేల ఆపక, అలా పాడుతూ, ఆనందంతో గెంతుతూనే ఉన్నాడు. అంతలో అర్జునుడు తెలివి తెచ్చుకుని కృష్ణునితో, "కృష్ణా! నీవు అన్నీ తెలిసిన వాడివి. మహానుభావుడివి. నీ వింత ప్రవర్తనకు ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏమిటది?" అని అనునయంగా అన్నాడు. అప్పుడు కృష్ణుడు, "అర్జునా! నీ తండ్రి నీ క్షేమము కోరి, కర్ణుడి వద్ద నుండి కవచకుండలములు దానంగా పరిగ్రహించాడు. ఆ సమయంలో, కర్ణుడికి ప్రతిగా ఒక మహత్తర శక్తిని కానుకగా ఇచ్చాడు. అది ఒక సారి ప్రయోగిస్తే, ఒకరిని మాత్రమే చంపి, తిరిగి ఇంద్రుని చేరగలదు. దానిని కర్ణుడు నిన్ను చంపడానికి మాత్రమే దాచి ఉంచాడు.

ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితులలో, దానిని కర్ణుడు ఘటోత్కచుడి మీద ప్రయోగించాడు. కనుక ఇక కర్ణుడు నిన్ను ఏమీ చేయ లేడు. అర్జునా! కర్ణుడు దైవాంశ సంభూతుడు, అసామాన్యుడు. అతడి వద్ద ఇంద్రుడు ఇచ్చిన శక్తి ఉన్నంత వరకు, నా సుదర్శన చక్రము కానీ, నీ గాండీవం కానీ, ఏమి చేయలేదు. నీ తండ్రి కర్ణుడి కవచ కుండలములు పరగ్రహించకున్న, అతడిని నీవే కాదు, ముల్లోకాలలో ఎవరూ ఏమీ చేయ లేరు. అతడిప్పుడు సాధారణ మానవుడయ్యాడు కనుక, అతడిని ఇక నీవు సులభంగా జయించవచ్చు. ఇది నాకు సంతోషం కాదా!" అని అన్నాడు. ఇక ఘటోత్కచుడు ఎంత భీముడి కుమారుడైనా, రాక్షస వంశ సంజాతుడు. ధర్మద్వేషము, హరిద్వేషము అతడి నరనరాలలో జీర్ణించుకుని ఉంది. అతడు బ్రతికి ఉంటే, ఎప్పటికైనా నా మీదా, ధర్మం మీదా తిరగబడగలడు. అప్పుడు నేను చేయవలసిన పని, ఇప్పుడు కర్ణుడు పూర్తి చేసాడు. అని వివరించాడు. ఘటోత్కచుడి మరణం తరువాత, మౌర్వి శాప విమోచనం పొంది, అహిలావతిగా కైలాసానికి చేరుకుంది.

శుభం భూయాత్!

Monday, October 16, 2023

11 భయంకరమైన అస్త్రాలు! మహాభారతం Mahabharatam

 

సృష్టి వినాశనం చేయగలిగే 11 భయంకరమైన అస్త్రాలు!
మహాభారతంలో వాడిన ఆ ఆయుధాలు అణ్వాయుధాలా?

చరిత్రలోనే అత్యంత భయాంకరమైన యుద్ధం, పాండవులకూ, కౌరవులకూ మధ్య జరిగిన మహాభారత యుద్ధం. సృష్టి ఆది నుండి నేటి వరకూ, అత్యంత ఘోరమైన యుద్ధంగా పేర్కొనబడేది, కురుక్షేత్ర సంగ్రామమే. దాదాపుగా అప్పుడు మనుగడలో ఉన్న రాజ్యాలన్నీ ఆ యుద్ధంలో పాల్గొన్నాయి. ఆ మహా సంగ్రామం జరిగిన కురుక్షేత్రమనే ప్రదేశం, ఉత్తర భారత దేశం లోని ప్రస్తుత హర్యానా రాష్ట్రంలో ఉంది. 18 రోజులపాటు నిర్విరామంగా సాగిన ఆ యుద్ధంలో, 47 లక్షల, 23 వేల, 920 మంది పాల్గోంటే, అందులో కేవలం 10 మంది మాత్రమే మిగిలారు. అంత భారీ జన నష్టం సంభవించడానికి కారణం, మహాభారత యుద్ధంలో ప్రయోగించబడిన అణ్వస్త్రాలే అనే వాదన కూడా ఉంది. ఆ నాడు జరిగినది మాములు యుద్ధం కాదని, పాశ్చాత్య చరిత్రకారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంపై దాదాపు శతాబ్ది కాలంగా, ఆ ప్రాంతాలలో ఎన్నో పరిశోధనలూ, సుదీర్ఘ చర్చలూ జరుగుతూనే ఉన్నాయి. కేవలం 18 రోజుల్లో, 47 లక్షల పై చిలుకు జనాభా మరణించడం అంటే, సామాన్యమైన విషయం కాదు. సాధరణ ఆయుధాలతో సాధ్యపడే విషయమూ కాదు. మన ధార్మిక గ్రంథాలను చూసుకున్నట్లయితే, రెండు రకాల ఆయుధాలను వివరించాయి. ఒకటి అస్త్రం, అంటే, మంత్రించి ప్రయోగించేది. రెండవది శస్త్రం, అంటే, హనికరమైన ఆయుధం. నేటి తరంలో చూసుకుంటే, మిస్సైల్ లాంటివి.  మరి మహాభారత కాలంలో ఉపయోగించిన అస్త్రశస్త్రాల గురించీ, వాటి విశిష్ఠత గురించీ, వాటిని ఎవరు ఉపయోగించారు అనే విషయాలను గురించీ, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/hOduy8rQEBM?si=-5_A25TVmp8y0G6T ]


అన్ని ఆయుధాలూ, అస్త్రాలలో కెల్లా అత్యంత ప్రముఖమైన ఆయుధం, మొదటగా చెప్పుకోవల్సినది, ‘బ్రహ్మాస్త్రం’.. అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రం గురించి, మన పురాణ గ్రంథాలలో వివరించబడింది. ఇది అత్యంత విధ్వంసకర, ప్రమాదకరమైన ఆయుధాలలో ఒకటిగా, వర్ణించబడింది. మన పురాణాల ప్రకారం, బ్రహ్మ దేవుడు బ్రహ్మాస్త్రాన్ని సృష్టించాడని, పండితులు చెబుతున్నారు. విశ్వం యొక్క అన్ని కార్యకలాపాలూ సక్రమంగా జరగడానికీ, నియంత్రణను కొనసాగించడానికీ, ఇది ఉద్దేశింపబడింది. ఈ ఆలోచనతోనే, బ్రహ్మదేవుడు ఈ ఆయుధాన్ని సృష్టించాడు. ఇది సంపూర్ణ శక్తివంతమైన ఆయుధం. దీనిని కేవలం, రోజులో ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి. రామాయణ కాలంలో విభీషణుడూ, లక్ష్మణుడూ మాత్రమే దీనిని వాడారు. మహాభారత యుద్ధంలో, ద్రోణాచార్యుడూ, అశ్వత్థామ, శ్రీ క్రిష్ణుడు, కువలాశ్యుడు, యుధిష్ఠిరుడు, కర్ణుడు, ప్రద్యుమ్నుడు, అర్జునుడూ, ఈ అస్త్ర ప్రయోగం తెలిసిన వారు. కురుక్షేత్ర యుద్ధంలో, కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి ప్రయత్నించాడు. అయితే, కర్ణుడి గురువైన పరశురాముడి శాపం కారణంగా, ఆఖరి క్షణంలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించే పద్ధతిని మరచిపోయాడు.

2. బ్రహ్మశీర్షాస్త్రం: ఇది బ్రహ్మాస్త్రం కంటే, నాలుగు రెట్లు శక్తివంతమైన ఆయుధం. ఈ అస్త్రాన్ని ఉపయోగించడం వల్ల, వినాశనం కలుగుతుంది. దీనిని ప్రయోగించిన ప్రాంతం, 12 సంవత్సరాల పాటు నిర్మానుష్యంగా మారి పోతుంది. బ్రహ్మ రూపొందించిన ఈ అస్త్రాన్ని, పరశురాముడు ద్రోణాచార్యుడికి ప్రసాదించాడు. ఇంత శక్తివంతమైన బ్రహ్మశీర్షాస్త్రాన్ని ద్రోణాచార్యుడు, తన ప్రియ శిష్యుడైన అర్జునుడికి ఇస్తూ, పూర్వం రాముడి దగ్గర ఈ అస్త్రం ఉన్నా, దాని వలన సంభవించే వినాశనాన్ని ఆలోచించి, రామ రావణ యుద్ధంలో దీనిని ప్రయోగించలేదు. దీనివలన ఈ అస్త్రం ఎంత ప్రమాదకరమైనదో, శక్తివంతమైనదో నువ్వు అర్థం చేసుకో. అనివార్యమైన సమయంలో తప్ప, ఎట్టి పరిస్థితులలోనూ దీనిని ప్రయోగించవద్దని చెప్పి, అర్జునుడికి అందించాడు.

3. బ్రహ్మండాస్త్రం: ఈ ఆయుధం, మొత్తం సౌర వ్యవస్థను, అంటే, ఈ బ్రహ్మాండాన్నే నాశనం చేసేంత శక్తివంతమైనది. ఈ ఆయుధం కొనపై, బ్రహ్మ యొక్క ఐదు తలలు ఉంటాయి. ఇది బ్రహ్మాస్త్రం, అలాగే బ్రహ్మశీర్షాస్త్రం, ఈ రెండింటి శక్తీ కలిపి ఉంటుంది. ఒక్కసారి ఈ అస్త్రాన్ని విడిచిన తరువాత, దానిని ఆపడం ఎవరి తరమూ కాదు. అది ప్రయోగించబడిన వారు రక్షింపబడే అవకాశమే లేదు. ఈ ఆయుధం, ద్రోణాచార్యుడి వద్ద ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు, ధర్మం కోసం పోరాడుతున్నందున, వారిపై దీనిని ప్రయోగించవద్దని దేవతలు ద్రోణాచార్యుడిని కోరడంతో, ఆయన దానిని ప్రయోగించలేదు.

4. నాగాస్త్రం: ఇది పాము రూపాన్ని పోలి ఉంటుంది. కురుక్షేత్ర సమయంలో అర్జునుడికి వ్యతిరేకంగా, కర్ణుడు దానిని సమర్థవంతంగా ప్రయోగించ లేక పోయాడు. యుద్ధంలో అర్జునుడి బాణాల పరంపర నుండి తప్పించుకుంటూ, కర్ణుడు అత్యంత శక్తివంతమైన నాగాస్త్రాన్ని పంపాడు. దానిని అర్జునుడి ఛాతీపై గురి పెట్టవలసి ఉంది. కానీ, కర్ణుడు అర్జునుడి మెడపై గురిపెట్టాడు. ఆ సమయంలో అర్జునుడి రథ సారధి అయిన శ్రీ కృష్ణుడు, దానిని గురి తప్పేలా చేశాడు. అందుకే అది అర్జునుడి కిరీటానికి తగిలింది. నాగాస్త్రం తగిలిన వెంటనే, ఆ కిరీటం వెయ్యి ముక్కలుగా విరిగి నేల మీద పడిపోయింది. అంతటి శక్తివంతమైన ఆయుధం, నాగాస్త్రం.

5. నారాయణాస్త్రం: ఈ అస్త్రం, శ్రీహరికి చెందినది. కురుక్షేత్ర యుద్ధంలో ఈ అస్త్రాన్ని అశ్వత్థామ, సుయోధనుని ఆజ్ఞ మేరకు, అభిమంత్రించి, పాండవ సేనపై ప్రయోగించాడు. ఆ సమయంలో మహాస్త్ర మహిమో ఏమోగానీ, ప్రకృతి అంతా అల్లకల్లోలమయి పోయింది. గగనాంగణంలోకి ప్రవేశించిన నారాయణాస్త్రం, రకరకాల ఆయుధాల రూపంలో, వేల కొలది మహాగ్ని జ్వాలలతో, పాండవేయుల సైన్యాలన్నిటా విజృంభించసాగింది. దానిని కన్నెత్తి చూడలేని పాంచాల, పాండవేయ సైన్యాలు, ఘోర ఆర్తనాదాలతో పరుగులు తీశాయి. ఆ బీభత్సాన్ని కృష్ణార్జునులు చూస్తూ, అచేతనులయ్యారు. ధర్మరాజు ఆందోళనకు అంతులేకుండా పోయింది. అందరినీ పారిపొమ్మంటూ గగ్గోలు పెట్ట సాగాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు, యోధులందరినీ వాహనాల మీద నుంచి కిందకి దూకమనీ, ఆయుధాలు వదిలేసి తలలొంచుకుని నిలబడమనీ, సూచించాడు. శ్రీ కృష్ణ భగవానుడి ఆదేశానుసారం, అందరూ నిరాయుధులై, నారాయణాస్త్రాన్ని తప్పించుకున్నారు. వేల ఆయుధాల సమాహారమైన నారాయణాస్త్రాన్ని ఎదిరించడం, ఎవరి తరమూ కాదు. దాని నుండి తప్పించుకునే మార్గం, లొంగి పోవడం మాత్రమే.

6. పాశుపతాస్త్రం: ఈ అస్త్రం కలిగినవారు ఇద్దరు మాత్రమే, మనపురాణ గాథలలో మనకు కనిపిస్తారు. ఒకరు రావణుని పుత్రుడు మేఘనాధుడు, మరోకరు పాండవమధ్యముడు అర్జునుడు. ఈ పాశుపతాస్త్రం పొందడం కోసం, అర్జునుడు కుడికాలి బొటన వేలిపై నుంచుని, చాలా కాలం తపస్సు చేశాడు. ఆ తర్వాత జరిగిన మహాభారత యుద్ధంలో, పరమేశ్వరుడు ప్రసాదించిన పాశుపతాస్త్రాన్ని కర్ణుడిపై ప్రయోగించి, అర్జునుడు విజయం సాధించాడు.

7. మహేశ్వరాస్త్రం: ఈ ఆయుధం పరమేశ్వరుడి మూడవ కన్ను యొక్క శక్తిని కలిగి ఉంటుంది. అది ఒక్కసారిగా, శత్రువులందరినీ బూడిదగా మార్చేసే శక్తికలిగినది. సమస్త లోకాలనూ, భగవంతుడి లోకి లయం చేయగలగే శక్తి సామర్థ్యాలను పొందినటువంటిది, ఈ మహేశ్వరాస్త్రం.

8. వాసవీ శక్తి: వాసవీ శక్తి, ఇంద్రుని ఆధీనంలో ఉన్న ఆయుధం. అది ఎటువంటి శత్రువులనైనా చంపగలదు. వాసవీ శక్తిని ఇంద్రుడు, కర్ణుడికిచ్చాడు. కర్ణుడు కవచ కుండలానికి బదులుగా, ఇంద్రుడి నుండి ఈ ఆయుధాన్ని పొందాడు. ఇది చాలా బలమైన ఆయుధం. ఈ ఆయుధానికి ఇంద్రుడిచ్చిన "అజేయత" అనే వరం కూడా ఉంది. దాంతో అది మరింత శక్తివంతం అయ్యింది. ఈ ఆయుధంతో, దేవతలూ, అసురులూ, మానవులూ, గంధర్వులూ, ఉరగలూ, మరియు రాక్షసులలో, ఎవరిని చంపాలనుకున్నా, వారు ఖచ్చితంగా చంపబడతారు. అయితే, దానిని ఒక్కసారి మాత్రమే ప్రయోగించగలరు. కురుక్షేత్రంలో, అర్జునుడిపై వాసవీ శక్తిని ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు, కర్ణుడు. కానీ, అనివార్య కారణాలవల్ల, యుద్ధంలో భీముని కుమారుడైన ఘటోత్కచడిపై, దానిని ఉపయోగించవలసి వచ్చింది.

9. వారుణాస్త్రం: వరుణ దేవుడికి చెందిన ఈ అస్త్రం, ఏ ఇతర ఆయుధ రూపాన్నయినా పొందగలదు. దీనిని ప్రయోగించడంతో పాటు, పొందడం కూడా ఎంతో కఠినతరం. అర్జునుడూ, సాత్యకీ, ధృష్టద్యుమ్నుడూ, ద్రోణాచార్యుల వంటి ప్రఖ్యాత యోధులు మాత్రమే, ఈ ఆయుధాన్ని కలిగి ఉన్నారు.

10. భార్గవాస్త్రం: బ్రహ్మశీర్షాస్త్రంతో సమానమైనది ఇది. ప్రపంచం మొత్తాన్నీ నాశనం చేయగలిగిన శక్తి, ఈ అస్త్రానికి ఉంది. ఒక్కసారి ఈ అస్త్రాన్ని ఉపయోగిస్తే, బూడిద కూడా మిగలదు. రక్షించుకోవడం కోసం ఈ అస్త్రాన్ని వాడితే, బ్రహ్మాస్త్రాన్నీ, బ్రహ్మశీర్షాస్త్రాన్ని కూడా నాశనం చేయగలిగిన శక్తి, దీనికి ఉంది. కురుక్షేత్రంలో ద్రోణాచార్యులు, పాండవులపై ఈ అస్త్రాన్ని ప్రయోగించారు.

11. గాండీవం: ఖాండవ వనాన్ని అర్జునుడు అగ్నికి ఆహుతివ్వడంతో, అగ్నిదేవుడు సంతోషించి, అర్జునునికి గాండీవాన్ని ప్రసాదించాడు. గాండీవం అనేది, స్వర్గంలోని గాండీవ వృక్షం ద్వారా రూపొందించబడింది కాబట్టి, గాండీవానికి తగిన రక్ష వుంది. లక్షలాది ఆయుధాలకు ఇది సమానమైనది. పలు రంగులతో కూడినది, మృదువైనది. ఈ గాండీవం, వెయ్యేళ్లు బ్రహ్మదేవుని వద్ద వుండగా, ప్రజాప్రతి వద్ద, 503 సంవత్సరాలూ, ఇంద్రుడి వద్ద 85 సంవత్సరాలూ, చంద్రుడి వద్ద 500 సంవత్సరాలూ, వరుణుడి వద్ద 100 సంవత్సరాలు ఉండింది. ఈ విల్లును గంధర్వులూ, దేవతలూ పూజించారని పురాణాలు చెబుతున్నాయి. చిత్రమేమిటంటే, దానికి అక్షయ తూణీరం ఉంది. ఎన్ని బాణాలు తీసివేస్తున్నా, అది ఖాళీ కాదు. ఎప్పుడూ శరసమృద్ధమై ఉంటుంది.

ఇవి మాత్రమే కాక, ఇంకా ఎన్నో అత్యద్భుత శక్తులు కలిగిన మంత్ర పూరితమైన అస్త్ర శస్త్రాలతో, కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అయితే, అన్ని అస్త్రాలలో కెల్లా అత్యంత బలమైన ఆయుధం, ఎంతటి శక్తి కలిగిన ఆయుధాన్నయినా మట్టి కరిపించగల ఆయుధం, సుదర్శన చక్రం. శ్రీ కృష్ణుడు యుద్ధంలో పాల్గొననందున, ఆయన దానిని కురుక్షేత్రంలో ఉపయోగించలేదు. అయితే, శ్రీ కృష్ణుడు, శిశుపాలుడిని చంపడానికి, సుదర్శన చక్రాన్ని ఉపయోగించాడు. త్రిశూలం మహాదేవుని కుండలినీ శక్తి అయినట్లే, సుదర్శన చక్రం శ్రీ హరి యొక్క కుండలినీ శక్తి. కృష్ణావతారానికి పూర్వమే, సుదర్శనం విష్ణువు దగ్గర ఉంది. విష్ణువు దుష్టసంహారణార్థం, సుదర్శనాన్ని కృష్ణావతారానికి ముందు కూడా ప్రయోగించినట్లు, పురాణగాథల ద్వారా తెలుస్తోంది. సుదర్శనశక్తి అద్భుతమైనది. ఇది శత్రువులను అగ్నివలె దహించివేస్తుంది. శత్రుసంహారం కోసం, విష్ణువు ఎప్పుడైతే సుదర్శనాన్ని ప్రయోగిస్తాడో, అప్పుడది సూర్య తేజో విరాజితమవుతుంది. శత్రుసంహారం చేసి తిరిగి భగవానుని చెంతకు చేరుకుంటుంది. మహాభారత యుద్ధంలో పాల్గోన్న యోధులు, ఈ ఆయుధాలను చాలా జాగ్రత్తగా ఉపయోగించారని గమనించాలి. ఎందుకంటే, ఇవి సమాజానికి కలిగించే సంభావ్య విధ్వంసం గురించి వారికి తెలుసు. సామూహిక విధ్వంసక ఆయుధాలను, బాధ్యతతో ఉపయోగించడం, ఆ రోజుల్లో ఒక ఆచారం. వీటిలో కొన్ని అణ్వాయుధాలుగా ఉండే అవకాశాలు ఉన్నాయనే వాదనలు, నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి.

కృష్ణం వందే జగద్గురుం!

Monday, July 24, 2023

What Is The Real Definition of a True Friend? నిజమైన స్నేహానికి నిర్వచనం ఏంటి?


నిజమైన స్నేహానికి నిర్వచనం ఏంటి?
స్నేహం గురించి భీష్ముడు తెలియజేసిన కథ ‘నాడీజంఘుడు – గౌతముడు’!

మహాభారతంలోని శాంతి పర్వంలో, భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన అనేక నీతి కథలు ఉన్నాయి. మానవుల్లో ఎలాంటివాళ్ళు సౌమ్యులు? ఎవరిని ప్రేమించాలి? ఎవరు ఉపకారం చేసేవారు? అనే విషయాలను గురించి ధర్మరాజు భీష్ముడిని అడుగగా, అందుకు భీష్ముడు, దోషాలున్న వారందరిలోకీ, కృతఘ్నుడు పరమనీచుడు. అలాంటి వాడు మిత్రులను కూడా చంపుతాడు. అలాంటి అధములను పూర్తిగా వదిలివేయాలని, ‘గౌతముడు - నాడీ జంఘుడి’ కథను వివరించాడు? మరి కథలో దాగిన నీతేంటి? ఒక బ్రాహ్మణుడు, స్నేహితుడిని హత్య చేసే కసాయి వాడిగా ఎలా మారాడు – అనేది, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలనూ, అనుభవాలనూ, కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ALCW_52fobs ]


మ్లేచ్ఛ దేశంలో, గౌతముడనే పేరు గల ఒక బ్రాహ్మణుడున్నాడు. అతడు బ్రాహ్మణులు చేయవలసిన వేదాధ్యయనం, మొదలైనవేవి చేయకుండా, భిక్షాటనతో జీవించేవాడు. ఒకసారి అతను ఒక బందిపోటు దొంగ ఇంటికి, భిక్ష కోసం వెళ్లాడు. ఆ దొంగ దాత, బ్రాహ్మణ భక్తుడు కావడం వలన, అతడు గౌతముడు ఉండడానికి ఒక ఇల్లు, తినడానికి అవసరమైన ఆహార సామాగ్రీ మొదలైన అన్ని సౌకర్యాలతోపాటు, అతనికి సేవ చేయడానికి భర్త చనిపోయిన ఒక శూద్ర స్త్రీని కూడా ఏర్పాటు చేశాడు. గౌతముడు ఆ దాసితో సుఖంగా జీవిస్తూ ఆటవికుల లాగా, గురి చూసి బాణం వేయడం నేర్చుకుని, ప్రతిరోజూ అడవికి వెళ్ళి, అనేక పక్షులనూ, మృగాలనూ చంపి తింటూ జీవించేవాడు.

ఒకసారి అతని దగ్గరకు గౌతముని ఊరి వాడు, మిత్రుడు, వేదాధ్యనతత్పరుడు అయిన ఒక బ్రాహ్మణుడు వెళ్ళాడు. అదే సమయంలో గౌతముడు, తాను చంపిన హంసలను భుజమ్మీద వ్రేలాడదీసుకుని, చేతిలో ధనుస్సు పట్టుకుని, రక్తంతో తడిసిన శరీరంతో, రాక్షసుని లాగా వేట నుంచి వచ్చాడు. సద్బ్రాహ్మణుడు అతణ్ణి చూసి ఆశ్చర్యపోయి, అతణ్ణి మార్చాలనే ఉద్దేశ్యంతో, సద్బ్రాహ్మణ కర్మలను గురించి ఉపదేశించి, హింసను త్యజించమని, అనేక రకాలుగా బోధించాడు. గౌతముడు అతని మాటలను విని పశ్చాత్తాప పడినట్లుగా నటించి, మరుసటి రోజు తెల్లవారిన తరువాత ఆ వూరినీ, క్రూర కర్మలనూ వదిలిపెట్టి, అతనితోపాటు తానూ వస్తాననీ, సద్బ్రాహ్మణునికి తగిన పనులను చేస్తాననీ చెప్పి, అతనికి నమ్మకం కలిగించాడు.

వచ్చిన సద్బ్రాహ్మణుడు రాత్రి నిద్రపోయిన తరువాత, గౌతముడు అక్కడి నుంచి సముద్రం దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరాడు. అదే సమయంలో కొంతమంది వ్యాపారులు అక్కడికి రాగా, వారితో కలసి సముద్రతీరానికి వెళ్ళాడు. ఇంతలోనే ఒక మదించిన ఏనుగు వారి మీద పడి, అందరినీ చంపడం మొదలుపెట్టింది. గౌతముడు అతి కష్టం మీద తప్పించుకుని ఉత్తర దిక్కుకు పారిపోయి, ఒక అడవిలో తిరుగుతూ దివ్యమైన ఒక ఉద్యానవనంలోకి ప్రవేశించాడు. ఆ ఉద్యానవనం అనేక రకాల పండ్లచెట్లతో, పూల మొక్కలతో సువాసనలు వెదజల్లుతూ, రమణీయంగా ఉంది. ఆ చల్లని గాలికి గౌతముడు ఆదమరచి నిద్రపోయాడు.

ఆ ఉద్యానవనం, నాడీజంఘుడు అనే పేరు గల ఉత్తమమైన కొంగది. ఆ కొంగ, సురభి, కశ్యపుల కుమారుడు, బ్రహ్మ దేవునికి ఆప్తమిత్రుడు. అతనికి రాజధర్ముడనే ప్రసిద్ధమైన మరొక పేరు కూడా ఉంది. దేవకన్యా పుత్రుడు కావడం వలన, అతని శరీరం దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. అలాంటి కొంగను చూసి గౌతముడు మొదట ఆశ్చర్యపోయి, ఆకలితో ఉన్నవాడు కావడం చేత, ఆ కొంగను చంపి తినాలకున్నాడు. అప్పుడా కొంగ గౌతమునితో, " బ్రాహ్మణా, నా అదృష్టం వలన ఈ నాడు నాకు అతిథిగా వచ్చావు. యథావిథిగా నా ఆతిథ్యాన్ని స్వీకరించి, రేపు పొద్దున నీ దారిలో నీవు వెళుదువు." అని పలికి, పక్కనే ఉన్న నది నుంచి చేపలను పట్టి తెచ్చి, వాటిని కాల్చి, అతనికి ఆహారంగా సమర్పించింది. తన రెక్కలతో విసరి, అతని శ్రమను పొగొట్టింది. ఆ తరువాత నాడీజంఘుడు, గౌతముడు అక్కడకు వచ్చిన కారణాన్ని గురించి ప్రశ్నించాడు.

దానికి గౌతముడు, తాను దరిద్రుణ్ణనీ, ద్రవ్య సంపాదన కోసం తిరుగుతున్నాననీ చెప్పాడు. అది విన్న కొంగ, ధన సంపాదనకు అతడు ఎక్కడికీ వెళ్ళనవసరం లేదనీ, తనకు ఆప్తమిత్రుడైన విరూపాక్షుడనే రాక్షసరాజు, మూడు యోజనాల దూరంలోని నగరంలో ఉన్నాడనీ, అతని దగ్గరకు వెళ్ళి, తన మిత్రునిగా చెప్పుకుంటే, గౌతమునికి కావలసినంత బంగారం అతను ఇస్తాడనీ చెప్పింది. ఆ మాటలకు  గౌతముడు సంతోషించి, మరుసటి రోజు విరూపాక్షుడున్న నగరానికి వెళ్ళి అతణ్ణి దర్శించి, నాడీజంఘుని మిత్రునిగా పరిచయం చేసుకుని, తాను వచ్చిన పనిని గురించి వివరించాడు. విరూపాక్షుడు, గౌతముని చరిత్రను ఉన్నది ఉన్నట్లు చెప్పమన్నాడు. అందుకు గౌతముడు, "రాజా, నేను మధ్య దేశంలో బ్రాహ్మణ కులంలో పుట్టాను. శబరుల గ్రామంలో జీవిస్తున్నాను. నా భార్య శూద్ర స్త్రీ. ఆమె మొదట ఇంకొకరి భార్య. ప్రస్తుతం నా భార్య" అని తన గురించిన వాస్తవాన్ని తెలియజేశాడు. అది విన్న తరువాత విరూపాక్షుడు, తనలో తను ఇలా అనుకున్నాడు. “ఇతడు కేవలం జన్మతః మాత్రమే బ్రాహ్మణుడు. ఇతణ్ణి తనకు అత్యంత ఆప్తమిత్రుడైన నాడీజంఘుడు పంపించాడు. కాబట్టి, ఇతనికి అవసరమైన ధనాన్ని తప్పక ఇవ్వాలి” అని భావించాడు. తాను ప్రతిరోజు చేసే బ్రాహ్మణ పూజతో పాటు, గౌతముని కూడా పూజించి, ఇతర బ్రాహ్మణులతో సమానంగా, గౌతమునికి కూడా విలువైన బంగారు, వెండి, వజ్ర వైఢూర్యాలు, మొదలైన వాటిని ఇచ్చి పంపించాడు.

గౌతముడు ఆ బంగారాన్ని మోసుకుంటూ, నాడీజంఘుని దగ్గరకు వెళ్ళాడు. నాడీజంఘుడు మళ్ళీ అతనికి అనేక రకాల సపర్యలు చేసి, చక్కటి భోజనం పెట్టి, రాత్రి తన దగ్గరే ఆశ్రయమిచ్చాడు. ఆ సమయంలో గౌతముడు, "ఈ బంగారాన్ని మోసుకుని నేను చాలా దూరం వెళ్ళాలి. దారిలో తినడానికి ఆహారం కావాలి. ఆహారం ఉంటేగానీ, ప్రాణం నిలువదు. కాబట్టి, నేను బ్రతకాలంటే, ఆహారం తప్పనిసరి" అని ఆలోచిస్తుండగా, తనకు ఆశ్రయమిచ్చి, ఎంతగానో ఉపకారం చేసిన నాడీజంఘుడు, అతనికి పెద్ద మాంసపు ముద్దలాగా కనిపించాడు. దాంతో అతను నిద్రపోతున్న నాడీజంఘుని చంపి, పక్షి రెక్కలూ, ఈకలూ తీసివేసి, అగ్నిలో కాల్చి, ఆ మాంసాన్నీ, బంగారాన్నీ తీసుకుని, తన గ్రామానికి బయలుదేరాడు.

నాడీజంఘుడు ప్రతిరోజూ బ్రహ్మ దర్శనానికి వెళ్ళి తిరిగివస్తూ, దారిలో విరూపాక్షుని దగ్గరకు వెళుతూ ఉంటాడు. అప్పటికి రెండు రోజులుగా నాడీజంఘుడు రాకపోవడంతో, విరూపాక్షుడు, దుష్టుడైన గౌతముని వలన అతనికేదైనా అపకారం జరిగి ఉంటుందని అనుమానించి, తన కుమారునితో పాటు కొంతమంది అనుచరులైన రాక్షసులను, నాడీజంఘుని ఉద్యాన వనానికి పంపించాడు. అతని కుమారుడు అక్కడ నాడీజంఘుని ఈకలు చూసి, జరిగిన విషయాన్ని గ్రహించి, అనుచరులతో చాలా వేగంగా ప్రయాణించి, గౌతముని పట్టుకుని, అతని వద్ద ఉన్న నాడీజంఘుని శరీరాన్ని తీసుకుని, విరూపాక్షుని వద్దకు వెళ్లాడు. నాడీజంఘుని శరీరాన్ని చూసిన విరూపాక్షుడూ, అతని కుటుంబ సభ్యులూ, మంత్రులూ, భోరున విలపించారు.

వెంటనే విరూపాక్షుడు పట్టరాని కోపంతో, తన మిత్రుని చంపిన పరమ క్రూరుడూ, కృతఘ్నుడూ అయిన గౌతముణ్ణి, రాక్షసులైన తన అనుచరులతో ముక్కలు మక్కులుగా నరికించి, అతని మాంసాన్ని దోపిడిగాళ్ళకు ఆహారంగా వేయించాడు. కృతఘ్నుడైన అతడి మాంసాన్ని తినడానికి, వారు కూడా ఇష్టపడలేదు. విరూపాక్షుడు నాడీజంఘుని శరీరానికి దహన క్రియలు నిర్వర్తించాడు. అదే సమయంలో అతని తల్లీ, దక్షుని కుమార్తె అయిన సురభీ దేవి, ఆకాశంలో ప్రత్యక్షమయ్యింది. ఆమె నోటి నుండి పాలతో కూడిన నురగ జారి, నాడీజంఘుని చితిమీద పడింది. దాంతో నాడీజంఘుడు తిరిగి జీవించాడు. అదే సమయంలో దేవేంద్రుడు అక్కడికి వచ్చి, పూర్వం బ్రహ్మదేవుడు ఇచ్చిన శాపం వలన, నాడీజంఘుడు గౌతమునిచేత చంపబడ్డాడని చెప్పాడు.

పునర్జీవితుడైన నాడీజంఘుడు మహేంద్రునికి నమస్కరించి, చనిపోయిన గౌతముణ్ణి బతికించవలసిందిగా కోరాడు. దేవేంద్రుడు అమృతాన్ని చల్లి, గౌతముని బ్రతికించాడు. నాడీ జంఘుడు గౌతముణ్ణి కౌగలించుకుని, ధనంతో సహా అతణ్ణి అతని గ్రామానికి పంపించాడు. గౌతముడు తన గ్రామానికి వెళ్ళి, శూద్ర స్త్రీతో సంసారం చేసి, సంతానం పొందాడు. చేసిన పాపం కారణంగా, మరణించిన తరువాత గౌతముడు ఘోర నరకంలో పడ్డాడు. అని ఈ కథను భీష్ముడు ధర్మరాజుకు చెప్పి, "మనిషి తాను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉండాలి. మిత్రుల కోరికలను తీర్చాలి. మిత్రుని వల్ల సర్వమూ లభిస్తుంది. మిత్రుని వలన మనిషి భోగాలను పొందుతాడు. మిత్రుని వలన, ఆపదల నుంచి బయటపడతాడు. వివేకవంతుడు మిత్రుణ్ణి గొప్ప సత్కారాలతో పూజించాలి" అని తెలియజేశాడు.

కృష్ణం వందే జగద్గురుం!

Monday, July 3, 2023

Why was Kripacharya not punished in Ashwathama's misdeed? అధర్మపరులకు సుఖాలు ఎందుకు కలుగుతాయి? Mahabharatam


అధర్మపరులకు సుఖాలు ఎందుకు కలుగుతాయి?
అశ్వత్థామ ఉప పాండవులను చంపేముందు కృపాచార్యుడు ఏమన్నాడు?

కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, మహా భారత కావ్యంలోని రెండు ముఖ్య పాత్రలు. కౌరవులకూ, పాండవులకూ విద్య నేర్పిన గురువులూ, కురుక్షేత్ర యుద్ధంలో కురు సైన్యాన్ని నడిపించిన అతిరధ మహారధులు. మరి అటువంటి వారిలో ద్రోణాచార్యుడి గురించి అందరికీ తెలిసినా, కృపాచార్యుడి గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలిసివుంటుంది. కృపాచార్యుడు బ్రహ్మ నాల్గవ అవతారము. ఈయన శతానంద మహర్షి మనుమడు. మహాభారతంలో కురు పాండవులకు గురువు. మహాభారత యుద్ధంలో, కౌరవుల తరపున నిలిచి యుద్ధం చేశాడు. యుద్ధం ముగిసిన తరువాత బ్రతికి ఉన్న అతికొద్దిమందిలో, ఈయన కూడా ఒకరు. సప్త చిరంజీవులలో ఒకరిగా, మన పురాణాలలో ప్రస్తావించబడ్డాడు. 8వ మన్వంతరములోని ఋషులలో గొప్పవాడైన కృపాచార్యుడి జీవితంలోని కొన్ని ఘట్టాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/cQqicClN840 ]


గౌతమ మహర్షి కుమారుడైన శతానంద మహర్షికి, సత్య ధృతి అనే కుమారుడున్నాడు. సత్య ధృతి జన్మించడమే, విల్లంబులతో జన్మించాడు కనుక, శరద్వంతుడు అనే పేరుతో ప్రసిద్ధిచెందాడు. ఇతనికి ధనుర్విద్య పుట్టుకతోనే ప్రాప్తించింది. ఇతడు చిన్నతనం నుంచీ వేదాల మీద కన్నా, అస్త్ర విద్యలపైన ఆసక్తిని కనబరచసాగాడు. కొంతకాలం తపస్సు చేసి, అన్ని యుద్ధవిద్యలలో ఆరితేరాడు. ధనుర్విద్యలో తిరుగులేని మహా వీరుడయ్యాడు. ఒక మహర్షి తనయుడు, అన్ని యుద్ధవిద్యలలో ప్రావీణ్యం పొందడాన్ని చూసి, ఇంద్రుడు తట్టుకోలేకపోయాడు.

అతనిని ప్రక్క దారి పట్టించేందుకు, అద్భుత సౌందర్యరాశియైన జలపది అనే దేవకన్యను, శరద్వంతుడి బహ్మచర్యాన్ని ఆటంకపరిచేందుకు పంపించాడు, ఇంద్రుడు. ఆమె శరద్వంతుడి వద్దకు వెళ్ళి, వివిధ రకాలుగా ఆకర్షించడానికి ప్రయత్నించింది. మహా సౌందర్యవతి అయిన ఆమెను చూసి, శరద్వంతుడి చేతిలోని విల్లంబులు జారి క్రిందపడ్డాయి. అది గ్రహించి, తన కామోద్రేకమును నిగ్రహించుకుని, ఆ ప్రాంతమును విడిచి వెళ్ళిపోయాడతడు. కానీ, అతనికి తెలియకుండకుండా రేతః పతనమై, అది రెల్లుగడ్డిలో పడింది. అది రెండు భాగములై, అందులోనుంచి ఒక బాలుడూ, ఒక బాలికా జన్మించారు.

కొంతకాలానికి శంతన మహారాజు వేటాడుతుండగా, అక్కడున్న ఆ బిడ్డలను చూసి, వారిపై అనురాగం కలిగి, తన బిడ్డలుగా పెంచుకున్నాడు. వారికి జాతక కర్మాది సంస్కారాలు గావించి, తన కృపతో పెంచబడ్డారు కాబట్టి, వారికి కృపుడు, కృపి అని నామకరణము చేయించాడు. ఈ సంగతి గ్రహించిన శరద్వంతుడు, శంతనునితో తన సంగతి చెప్పి, కృపుడికి చతుర్విధ ధనుర్వేదములనూ, నానా విధ శాస్త్రములనూ నేర్పాడు. అతడే, విలువిద్యలో పరమాచార్యుడై, భీష్ముని కోరిక మేరకు, కురు పాండవులకు గురువయి, వారికి యుద్ధ విద్యలలో తర్ఫీదు ఇచ్చాడు.

ఆ తరువాత, కురుపాండవులకు ద్రోణుడు ఆచార్యుడయ్యాడు. కృపాచార్యుడు తన సోదరి అయిన కృపిని ద్రోణాచార్యునికిచ్చి వివాహం జరిపించాడు. వీరి సంతానమే, అశ్వాత్థామ. మహాభారత యుద్ధంలో దుర్యోధనుడితో కలిసి, పాండవులతో పోరాడిన వారిలో, కృపాచార్యుడు కూడా ఒకడు. కౌరవులతో పాటు యుద్ధంలో పాల్గోన్నా, ధర్మాధర్మ నియమాలను పాటించిన వాడు, కృపాచార్యుడు. సౌప్తిక పర్వంలో, తన తండ్రి ద్రోణాచార్యుడి మరణానికి ప్రతీకారంగా, ఉపపాండవులను సంహరించడానికి బయలుదేరబోయిన అశ్వత్థామకు, కృపాచార్యుడు చెప్పిన ధర్మనీతి, అతడి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.

యుద్ధరంగంలో రాత్రిపూట కృపాచార్యుడూ, కృతవర్మా నిద్రపోయినా, అశ్వత్థామకు నిద్ర రాక, దిక్కులు చూస్తూ ఉన్నాడు. ఆ మర్రి చెట్టు మీద ఎన్నో కాకులు గూళ్ళు కట్టుకుని ఉన్నాయి. వాటిలో కాకి పిల్లలూ ఉన్నాయి. ఆ సమయంలో ఒక గుడ్లగూబ, ఆ చెట్టు మీద వాలింది. మెల్లగా చప్పుడు చేయకుండా, కాకి గూళ్ళను సమీపించి, కొన్ని కాకుల పీకలు కొరికి, వాటిని చంపేసింది. అది చూసిన అశ్వత్థామకు, తళుక్కున ఒక ఆలోచన, మెరుపులా మెరిసింది. “నిద్రపోతున్న శత్రువులను సంహరించమని, ఈ ఉలూకము నాకు ఉపదేశం ఇచ్చింది. నేను కూడా ఈ విధంగానే, నిద్రిస్తున్న పాండవులను వధిస్తాను. పాండురాజు కొడుకులనూ, వారి కొడుకులనూ, బంధుమిత్ర సహితంగా వధిస్తానని, సుయోధనుడికి మాటిచ్చాను. నేను ఒక్కడినే, ఎటువంటి సైన్య సహకారం లేకుండా, అత్యంత పరాక్రమ వంతులైన వారందరినీ సంహరించలేను. అది మంచిది కాదు.

ఏమాత్రం సంశయించక, పాండవ శిబిరంలోకి ప్రవేశించి, ఆదమరచి నిద్రపోతున్న పాండవులనూ, వారి పుత్రులనూ, ఈ రోజే బంధుమిత్ర సహితంగా తుదముట్టిస్తాను. ఈ సమయంలో ధర్మాధర్మ విచక్షణ పనికి రాదు. శత్రురాజుల మీద దండెత్తినపుడూ, శత్రురాజులు విడిది చేసినపుడూ, శత్రురాజులు ఇరుకు దారిలో వెళుతున్న సమయానా, శత్రువులు నిద్రిస్తున్న సమయానా చంపడం తప్పు కాదన్నది శాస్త్రం వచనమని, పెద్దలు చెప్తారు కదా! పైగా నేను క్షాత్రధర్మం అనుసరిస్తున్నాను కనుక, ఇది నాకు దోషం కాదు. పాడవులు భీష్ముడినీ, కర్ణుడినీ, ద్రోణుడినీ పడగొట్టినప్పుడు, ధర్మాన్ని పాటించారా! వారు అధర్మం పాటించినపుడు, నేను అధర్మంగా నడచుకుంటే ఏ విధంగా దోషమవుతుంది?.. కనుక కల్మషహృదయులైన పాండవులనూ, వారి బంధువులనూ, నిద్రిస్తున్న సమయాన చంపడం రణనీతే కానీ, నిందార్హం కాదు” అంటూ, తనకుతాను నిశ్చయించుకున్నాడు.

అశ్వత్థామ తన నిశ్చయాన్ని కృపాచార్యుడికి వివరించాడు. “మామా కృపాచార్యా! ఆ పాండవులు సుయోధనుడిని ఒక్కడిని చేసి, అధర్మంగా కూల్చారు. పదకొండు అక్షౌహిణుల సైన్యాలకు అధిపతి అయిన సుయోధనుడు, దీనుడై, నేలపై పడి ఉన్నాడు. ఆ పాపాత్ముడు భీముడు, సుయోధనుడిని కాలితో తన్నాడు. మనం ఉండీ, సుయోధనుడు దిక్కు లేని వాడయ్యాడు. మనమిప్పుడు ఏం చేయాలో ఆలోచించండి” అని అన్నాడు. అందుకు కృపాచార్యుడు, "అశ్వత్థామా! నీమనసులో మాట చెపితే విని, మా మాట చెప్తాము. ముందుగా నేను కొన్ని మాటలు చెప్తాను విను.

ఏ పనికైనా పురుష ప్రయత్నమూ, దైవసహాయమూ, రెండూ కావాలి. ఏ ఒక్కదానితోనూ, కార్యము సానుకూలము కాదు. దేవతలు అనుకూలించి వర్షం కురిపించినా, రైతు విత్తనదే, మొలకెత్తదు కదా! అలాగే, రైతు విత్తినా, దైవం అనుకూలించి వర్షం కురిపించకపోతే, విత్తనం మొలకెత్తి, ఫలితాన్ని ఇవ్వదు. కనుక, పురుష ప్రయత్నం, దైవసహాయం, రెండూ చేరి, కార్యసానుకూలతను ఇస్తాయి. ధర్మం తప్పక చేసే ఏపనికైనా, దైవసహాయం ఉంటుంది. కనుక కార్యం సానుకూలమౌతుంది. అధర్మంతో చేసే పనులు ప్రారంభంలో సుఖాలు ఇచ్చినా, తరువాత పడవేస్తాయి. అదే మన సుయోధనుడి విషయంలో జరిగింది. సుయోధనుడు లోభం, కోపం, అసూయ, అహంకారంతో, ద్రౌపదిని సభకీడ్చి, అవమానించాడు. అందుకు తగిన ఫలితం అనుభవించాడు. మనం ధర్మం తప్పక కార్యం నెరవేర్చాలి.

ముందుగా మనం ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి, అతడికీ, గాంధారికీ విషయం చెప్పి, వారేమి చెప్పినా, అది చేద్దాము. వారు చెప్పిన మాట ధర్మబద్ధం ఔతుంది కానీ, ధర్మవిరుద్ధం కాదు. కాబట్టి, ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో” అని అన్నాడు. ఆ మాటలకు అశ్వత్థామ కృపాచార్యునితో, "మామా! ధర్మం, దేశ కాల పరిస్థితులను అనుసరించి, మారుతూ ఉంటుంది. దరిద్రంలో ధర్మమనిపించింది, ధనవంతుడిగా అధర్మం ఔతుంది. కనుక, నేను నమ్మినదే ధర్మం. దానిని నేను నా మరణానికి వెరువక ఆచరిస్తాను. నేను బ్రాహ్మణ వంశంలో పుట్టి, నా దౌర్భాగ్యం కొద్దీ విల్లు పట్టాను. క్షాత్రం అవలంభించాను. ఇంత కాలం తరువాత, మరలా నేను బ్రాహ్మణ్యం వంక మరలడం, నాకు చేత కాదు.

అస్త్రసన్యాసం చేసిన నా తండ్రిని దారుణంగా చంపినవాడు బ్రతికి ఉండగా, నేను ఎలా ప్రాణంతో ఉండగలను? ఈ రోజు నా తండ్రిని చంపిన దుర్మార్గుడిని, అతని బంధువులతో సహా, ఏ ఉపాయంతోనైనా హతమారుస్తాను. నా శత్రువులు విజయోత్సాహంలో తేలియాడి, ఆనందంగా, అలసి సొలసి ఆదమరచి నిద్రిస్తున్నారు. వారిని సంహరించడానికి, ఇదే తగిన సమయం. పైగా, మనం బ్రతికి ఉన్నామని వారికి తెలియదు. నేను వచ్చి వధిస్తానని ఊహించి ఉండరు. కనుక ఏమరుపాటున ఉన్న వారి మీద విరుచుకు పడి, పీకలు కోసి దారుణంగా చంపి, వారి శిబిరాలను పీనుగుల పెంట చేసి, భూతాలకు ఆహారంగా వేస్తాను. నా తండ్రిని చంపిన వాడి శరీర భాగాలు, ఆ పీనుగుల పెంటల మధ్య చెల్లాచెదురుగా, గజాశ్వకళేబరాలతో పడి ఉండటం, నేను కళ్ళారా చూడాలి” అని అన్నాడు అశ్వత్థామ.

అతను చెప్పిందంతా శాంతంగా విన్న కృపాచార్యుడు, "అశ్వత్థామా! నీకు అపకారం చేసిన వాడిని హతమార్చాలని అనుకున్నావు. నీవు దానికి ఒక మార్గం అవలంభిస్తున్నావు. దానికి అభ్యంతరం లేదు. మేము కూడా నీతో ఉండి, నీకు తోడ్పాటును అందిస్తాము. ఈ రాత్రికి విశ్రమించి, రేపు ఉదయం మన ప్రయత్నాలు ప్రారంభిద్దాము. నీవు ద్విగుణీకృత ఉత్సాహంతో, శత్రువులను గెలువగలవు. నీవు యుద్ధ భూమిలో నిలిస్తే, నిన్ను గెలువగల వారు ఎవ్వరు! ఇక నా గురించి చెప్పే పని లేదు. కృతవర్మ అమిత శౌర్యవంతుడు, అస్త్రకోవిదుడు, బలాఢ్యుడు. ఇక ఆ కవచము విడిచి, కొంత విశ్రాంతి తీసుకో. రేపు ఉదయం పాండవులను ఎదుర్కొని, వారిని చంపటమో, లేక వారి చేతిలో మారణించటమో, ఏదో ఒకటి నిశ్చయం” అని అన్నాడు కృపాచార్యుడు.

అశ్వత్థామ కృపాచార్యుడి మాట విని, ఇలా ప్రతిస్పందించాడు. "ఈలోకంలో కోపంలో ఉన్న వాడికీ, ధన సంపాదనా వ్యామోహికీ, వ్యాధిగ్రస్తుడికీ, కామాతురతతో కన్ను మూసుకు పోయిన వాడికీ, నిద్ర ఎలా పడుతుంది? నా తండ్రి మరణాన్ని తలచుకుని దహించుకు పోతున్న నా హృదయాన్ని, శత్రుసంహారంతో ఆర్పి, నా స్వామి సుయోధనుడి ఋణం తీర్చుకుంటాను. అంత వరకూ నాకు నిద్ర రాదు. పగలు వారికి అర్జునుడూ, కృష్ణుడూ అండగా ఉంటారు కనుక, ఎదిరించ లేము. అందుకే రాత్రి సమయంలోనే శత్రుసంహారం చేస్తాను. దయచేసి నన్ను వారించకండి. ఈ రాత్రి నేను పాండవులూ, వారి బంధు మిత్రులూ, సైనికులూ గాఢనిద్రలో ఉండగా, వారి మీద దాడి చేసి, దారుణంగా వధిస్తాను. ఆ తరువాత ఆ విషయం రారాజుకు చెప్పి, సుఖంగా నిద్రిస్తాను” అని అన్నాడు.

అశ్వత్థామ మాటలను విన్న కృపాచార్యుడు, "అశ్వత్థామా! కోపంతో ఉన్న వాడికి కార్యాకార్య విచక్షణ తెలియదు. ప్రస్థుతం నీవు ఆ స్థితిలో ఉన్నావు. ధర్మాధర్మములు తెలుసుకోలేక పోతున్నావు. కోపం వదిలి, నా మాట విని, ధర్మమార్గాన నడిస్తే, నీకు మేలు జరుగుతుంది. నిద్రిస్తున్న వాడినీ, ఆయుధములు విడిచిన వాడినీ, జుట్టు ముడివిడిపడిన వాడినీ, వాహన వైకల్యమును పొందిన వాడినీ, శరణుజొచ్చిన వాడినీ వధించటం, ధర్మం కాదు. పాండవులూ, వారి సమస్త సైన్యమూ, పాంచాలురూ, గాఢ నిద్రలో ఉన్నారు. నిద్రించినవాడు, చచ్చినవాడితో సమానం. చచ్చినవాడిని మీదపడి చంపి, నరకానికి ఎందుకు పోతావు? మహాస్త్రకోవిదుడవూ, మహారధులలో ప్రధముడవూ అయిన నీవు, ఇలాంటి నీచ కార్యానికి ఒడిగట్టడం భావ్యమా! కనుక రేపు యుద్ధంలో, మనం పాండువీరులతో పోరు సల్పుదాము” అని అన్నాడు.

అందుకు అశ్వత్థామ, "మామా కృపాచార్యా! మీరు పెద్ద వారు. నన్ను శాసించదగిన వారు. మీరు చెప్పింది సత్యమేగానీ, నేను చెప్పేది వినండి. రాజులంతా చూస్తుండగా, అస్త్ర సన్యాసము చేసిన నా తండ్రిని, పాంచాల రాకుమారుడు దృష్టద్యుమ్నుడు, అది పాపమని ఆలోచించకుండా, జుట్టు పట్టుకుని తల నరికాడు. శిఖండిని అడ్డు పెట్టుకుని, అర్జునుడు భీష్ముని పడగొట్టాడు. భూమిలో దిగిన రధచక్రాన్ని ఎత్తుతున్న కర్ణుడి మీద, అర్జునుడు బాణప్రయోగం చేసి చంపాడు. అర్జునుడు భూరిశ్రవసుడిని భుజములు నరికినందుకు, అతడు ప్రాయోపవేశం చేశాడు. ప్రాయోపవేశం చేసిన భూరిశ్రవసుడిని, సాత్యకి దారుణంగా చంపాడు. ఇదంతా ఎందుకు.. ఎక్కడో మడుగులో దాగిన సుయోధనుడిని బయటకు రప్పించి, భీముని చేత అధర్మయుద్ధంలో కూలత్రోయించారు. ఇన్ని విధాలా యుద్ధధర్మాన్ని మీరి, యుద్ధధర్మమనే వంతెనను కూల్చిన వారిని వదిలి, నన్ను ధర్మంగా నడవమని చెప్పడం న్యాయమా!” అని అన్నాడు.

మామా! తొడలు విరిగి నేలమీద ఉన్న సుయోధనుడు, దీనంగా పలికిన పలుకులు విని కూడా, నీకు ఆగ్రహం కలుగ లేదా! అందుకే నేను చేసేది అధర్మమైనా, అధర్మమార్గాన నా తడ్రిని చంపిన దృష్టద్యుమ్నిడిని, నేను చంపక వదలను. నన్ను మీరు ఆపలేరు. ఇందు వలన నేను కీటకంగా జన్మించినా బాధపడను” అని అంటూనే, రథం ఎక్కాడు అశ్వత్థామ.  వెంటనే కృపాచార్యుడు, "అశ్వత్థామా! నువ్వూ, నేనూ, కృతవర్మా, ఒకే పని మీద వచ్చాము. అటువంటి సమయంలో, నీవు ఒంటరిగా వెళ్ళడం భావ్యం కాదు. నేనూ నీతో వస్తాను” అని బయలుదేరాడు, కృపాచార్యుడు. తన మాటలను పట్టించుకోలేదని, అశ్వత్థామను ఒంటరిగా వదిలి వేయలేదు. ఎటువంటి అవకాశం దొరికినా, శత్రువులను సంహరించాలనే అశ్వత్థామ కోరికకు, మద్ధతూ పలుకలేదు. కురు సైన్య మహారధిగా, తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు.

కృష్ణం వందే జగద్గురుం!

Monday, May 29, 2023

నారదుడు చెప్పిన ‘షోడశ రాజులు’ ఎవరు? 16 Sixteen (Shodasa) Chakravarthis or Emperors Story


నారదుడు చెప్పిన ‘షోడశ రాజులు’ ఎవరు?
పుట్టిన ప్రతి జీవీ మరణించక తప్పదు! దుఃఖమయమైన ఈ లోకంలో మానవుడి గమ్యమేంటి?

ద్రోణాచార్యుడు నిర్మించిన బేధించనలవికాని పద్మవ్యూహంలోకి, ధైర్యంతో, శౌర్యంతో చొచ్చుకుపోయి, ఎందరో కౌరవ వీరులను సంహరించి, వీరమరణం పొందాడు అభిమన్యుడు. బాలుడైనప్పటికీ, సైన్యంలో చొచ్చుకొని పోవడానికి సమర్థుడని యుద్ధానికి పంపాననీ, అర్జునుడు వచ్చి తన కొడుకేడని అడిగితే, ఏం సమాధానం చెప్పాలో తెలియక, బాధతో కృంగిపోయాడు ధర్మరాజు. యుద్ధానికి పంపి తాను పాపం చేశాననీ, అభిమన్యుడి వెంట తాను యుద్ధంలోకి చొచ్చుకు పోలేకపోయాననీ చింతించాడు. ఇలా పలు విధాలుగా దుఃఖిస్తున్న ధర్మరాజు దగ్గరకు, వ్యాసమహర్షి వెళ్ళాడు. తాను పద్మవ్యూహంలోకి బాలుడైన అభిమన్యుడిని పంపిన విషయం, అతడి వెనుకే తాము పోవడానికి ప్రయత్నించగా, సైంధవుడు అడ్డు తగిలిన విషయం, ఆ విధంగా అభిమన్యుడికి సహకరించే అవకాశం తప్పిపోయిన వైనం, అప్పుడు పలువురు కౌరవ వీరులు అతడిని చుట్టుముట్టి, అన్యాయంగా హతమార్చిన విషయం, వేదవ్యాసుడికి చెప్పాడు ధర్మరాజు. తనలాంటి కఠినాత్ముడు లేడంటూ, జరిగిన దారుణానికి చింతించాడు. మిక్కిలి బలవంతుడైన అభిమన్యుడు చిన్నబాలుడు కాడనీ, ఎంతోమంది రాజులను అంతం చేసిన గొప్ప వీరుడనీ, అభిమన్యుడిని వ్యాసుడు కీర్తించాడు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవ్వరైనా, విధిని తప్పించుకోవడం సాధ్యమయ్యే విషయం కాదు. అందుకు నీవు వ్యధ చెందడం తగదని హితువు చెప్పాడు, వ్యాసుడు. ఆ మాటలకు ధర్మరాజు, ‘బాగా ఆలోచిస్తే మృత్యువును అవశ్యం అనుభవించి తీరవలసిందే’ అని వ్యాఖ్యానించాడు. అప్పుడు వ్యాసుడు, సృంజయుడనే రాజు పూర్వం ఏవిధంగా, నారదుడు తెలిపిన మృత్యు ప్రకరణ విధానాన్ని విని, చిత్తశాంతిని పొందాడో వివరించాడు. మరి ఆ సృంజయుడి గాధేంటి? నారదుడు వివరించిన షోడశరాజులు ఎవరు? సృంజయుడి దు:ఖాన్ని నారదుడు ఏ విధంగా తొలగించాడు - వంటి ఆసక్తిని కలిగించే విషయాలను, ఈ రోజు తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/_7MSPm7UcqM ]



ఈ కథ ద్రోణపర్వంలోని అభిమన్యు వధ పర్వం అనే ఉపపర్వంలో, 55 వ అధ్యాయంలో ఉంది. పూర్వం సృంజయుడనే పేరు గల రాజు, పుత్ర సంతానం కోరి, సద్బ్రాహణులకు అనేక దానధర్మాలను చేశాడు. ఒకసారి నారద మహర్షి సృంజయుని దగ్గరకు వచ్చినప్పుడు, బ్రాహ్మణులందరూ సృంజయరాజుకు పుత్రుని ప్రసాదించ వలసిందిగా నారదుణ్ణి కోరారు. దానికి నారదుడు, ఎలాంటి కుమారుడు కావాలో కోరుకోమని, సృంజయునితో అన్నాడు. సృంజయుడు నారదునికి నమస్కరించి, "యశస్వీ, తేజస్వీ, శత్రునాశకుడూ, ఉత్తమ గుణాలు కలవాడు అయిన కొడుకు కావాలి. ఆ కుమారుని మల మూత్రాలు, ఉమ్మి, చెమట, ఇంకా అతని శరీరం నుంచి వచ్చేవన్నీ, బంగారం కావాలి అని కోరుకున్నాడు." అతడు కోరుకున్నట్లుగానే జరుగుతుందని నారదుడు వరమిచ్చాడు.

ఆ తరువాత కొద్ది రోజులకు ఆ రాజుకు ఒక కొడుకు పుట్టాడు. ఆ బాలుడు విసర్జించే మల మూత్రాలూ, ఏడ్చేటప్పుడు అతని కన్నుల నుంచి కారే కన్నీరూ, ఉమ్మీ, చెమట మొదలైనదంతా బంగారంగా మారుతూ ఉంది. అందువల్లనే ఆ బాలునికి సువర్ణష్ఠీవి అనే పేరు ఏర్పడింది. ఇలా బాలుడు విసర్జించేదంతా బంగారం కావడం చేత, సృంజయరాజు సంపద అమితంగా పెరిగిపోయింది. రాజు తన భవనాలనూ, ప్రాకారాలనూ, కోటలనూ, బ్రాహ్మణ గృహాలనూ, ఇంకా అతనికి అవసరమైన పాన్పులూ, ఆసనాలూ, వాహనాలూ, బిందెలూ, చెంబులూ, పాత్రలూ మొదలైన అన్నివస్తువులనూ బంగారంతో తయారు  చేయించాడు. రోజు రోజుకూ అతని సంపద ఇంకా పెరుగుతూ ఉంది. కొందరు దోపిడీ దొంగలు రాజు వైభవానికీ, అతని ధన సంపదకూ కన్ను కుట్టింది. అతని సంపదకు కారకుడైన సువర్ణష్ఠీవిని అపహరించాలని నిశ్చయించుకుని, రాజ భవనంలోకి ప్రవేశించి, యువరాజును బలవంతంగా ఎత్తుకెళ్ళారు.

ఒక అడవిలోకి తీసుకొనిపోయి అతణ్ణి చంపి బంగారం కోసం అతని కడుపు చీల్చేశారు ఆ దొంగలు. కానీ, అందులో వారికి బంగారం కనిపించలేదు. మూర్ఖులైన దొంగలు పరస్పరం ఒకరి మీద ఒకరు నిందారోపణలు చేసుకుని, ఒకరినొకరు కొట్టుకుని చనిపోయారు. తన ధన సంపదకు మూలకారకుడైన తన కుమారుడు చనిపోయినందుకు, సృంజయ రాజు ఎంతగానే దు:ఖించాడు. అతని దు:ఖాన్ని విని నారదుడు వచ్చి, షోడశరాజుల చరిత్రలను వివరించాడు. "మరుత్తు అనే చక్రవర్తి, సంవర్తుడు ఉపద్రష్టగా, అనేక యజ్ఞయాగాదులు నిర్వహించినప్పటికీ, శాశ్వతమైన పదవిలో వుండలేదు. సుహోత్రుడనే మహారాజు ఎంత సక్రమ మార్గంలో జీవించినప్పటికీ, ఆశ్వమేధాది యజ్ఞాలు నిర్వర్తించినప్పటికీ, చివరకు మరణించాడు. ఎన్నో యజ్ఞాలు చేసిన అంగుడు అనే రాజు దివంగతుడయ్యాడు. ఎన్నో అశ్వమేధ యాగాలను చేసి, అమితమైన గోదానాలను చేసిన శిబి చక్రవర్తి, శాశ్వతంగా ఈ లోకంలో ఉండలేకపోయాడు. రావణాసురుడిని బంధు సమేతంగా సంహరించిన సామర్థ్యం, ఆశ్చర్యకరమైన మాహాత్మ్యం కలిగిన దశరథ రాముడూ కాలధర్మం చెందాడు. ఆకాశగంగను భూలోకంలో ప్రవహింప చేసి, సగరులకు ఉత్తమ గతులు కలిగించి, అనేకానేక అశ్వమేధ యజ్ఞాలు చేసిన భగీరథుడు శాశ్వతంగా జీవించలేదు. ఎన్నో అశ్వమేధ యజ్ఞాలు చేసి, ఇంద్రుడిని మెప్పించిన దిలీపుడు సహితం మరణించాడు.

భూమండలాన్ని ఏకచ్చత్రాధిపత్యంగా అనుభవించి, బ్రాహ్మణులకు అన్న సంతర్పణం చేసి, అశ్వమేధ యాగాలు చేసిన మాంధాత చక్రవర్తీ, ఈ లోకంలో శాశ్వతంగా నిలువలేదు. దేవాసుర యుద్ధంలో పాల్గొని రాక్షసులను వధించి, వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరచి, భూమిని సింగారించి, ఎన్నో యజ్ఞయాగాదులను చేసిన యయాతీ, ఈ లోకంలో శాశ్వతంగా వుండలేకపోయాడు. అమితమైన రాజ్యాన్ని సంపాదించి, లెక్కలేనన్ని యాగాలు చేసి, మణులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చిన అంబరీషుడూ బ్రతికిలేడు. ప్రసిద్ధ యాగాలు నిర్వర్తించిన శశిబిందుడూ, శాశ్వత శరీరాన్ని పొందలేదు. అగ్నిని ఆరాధించి తీవ్రమైన తపస్సు చేసి, ధార్మికుడిగా కీర్తికెక్కిన గయుడు కూడా చనిపోయాడు. రంతిదేవుడి లాంటి పుణ్యాత్ముడూ, పరలోకానికి పోక తప్పలేదు. సర్వదమనుడని కణ్వుడు పేరుపెట్టిన భరతుడూ, ఇహలోకాన్ని విడిచి వెళ్లినవాడే. గోరూపంలో వున్న భూమిని ఓషధులు పితకవలసిందిగా ఆజ్ఞాపించి, సమస్త భూమినీ బ్రాహ్మణులకు దానమిచ్చిన పృథచక్రవర్తి యశస్సు నిలిచింది కాని, శరీరం సుస్థిరంగా వుండలేదు. సమస్త భూమినీ కశ్యపుడికి ధారాదత్తం చేసిన పరశురాముడు సహితం, భూమిపై శాశ్వతంగా ఉండలేకపోయాడు.

గొప్ప గొప్ప రాజులే మరణించక తప్పలేదు. పుట్టిన ప్రతి జీవీ మరణించక తప్పదు. అందువల్ల, కుమారుని కోసం దు:ఖించవద్ద"ని సృంజయునికి నారదుడు వివరించాడు. ఆ మాటలు విన్న సృంజయుడు, పుత్రశోకం నుండి కొంతవరకూ తేరుకున్నాడు. ఆ తరువాత సృంజయుడి కోరిక ప్రకారం, చనిపోయిన అతడి కుమారుడు సువర్ణష్ఠీవిని బతికించి తెచ్చాడు నారదుడు. ఆ తరువాత సువర్ణష్ఠీవి పెరిగి పెద్దవాడయ్యాడు. బాణవిద్య నేర్చుకుని, వివాహమాడి, సంతానవంతుడయ్యాడు. ఇదంతా తిరిగి ధర్మరాజుకు చెప్పిన వేదవ్యాసుడు, అభిమన్యుడి గురించి దుఃఖించడం వివేకం కాదనీ, ఈ లోకం అంతా దుఃఖమయమనీ, తపోదానాదులతో మానవులు దేవలోకం చేరాలనుకోవడం ప్రసిద్ధమనీ, తెలియజేశాడు. అభిమన్యుడు పుణ్యాత్ములు పొందే అరుదైన లోకాన్ని పొంది వున్నాడని తెలియచేయడానికే, తాను షోడశ రాజ చక్రవర్తుల చరిత్ర చెప్పాననీ, దానివల్ల కలిగే పరిజ్ఞానంతో, మనస్సు కుదుట పడేటట్లు చేసుకొమ్మని చెప్పి, వ్యాసుడు అంతర్థానమయ్యాడు.

సర్వేజనాః సుఖినోభవంతు!

Monday, May 15, 2023

కపోత-లుబ్దక! పరశురాముడు చెప్పిన దివ్య గాధ! Story of Fowler and Pigeon from Mahabharatam


కపోత-లుబ్దక! పరశురాముడు చెప్పిన దివ్య గాధ!
‘అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడె ధన్యుడు సుమతీ’ - నీతి కథ!

మహాభారతంలోని శాంతిపర్వంలో, ఆపద్ధర్మానుశాసన పర్వం అనే ఉపపర్వంలో వివరించబడిన, బోయవాడు - పావురం కథను, భీష్ముడు ధర్మరాజుకు తెలియజేశాడు. శరణాగత రక్షకుడు పాటించవలసిన ధర్మాన్ని గురించి చెప్పమని, భీష్ముడిని ధర్మరాజు కోరగా, శరణాగత రక్షణను గొప్పగా పాటించిన ఒక పావురం కథను తెలియజేశాడు, భీష్మ పితామహుడు. పూర్వం పరశురాముడు, ముచికుందరాజుకు వివరించిన ఆ కథను, అంపశయ్యమీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. శరణాగత రక్షణతో పాటు, భార్యభర్తల అన్యోన్య దాంపత్యాన్ని వివరించే ఆ పావురం కథను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/JumauLZVQuw ]


ఒక అడవి సమీపంలో అతి క్రూరుడైన బోయవాడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు వల తీసుకుని అడవికి వెళ్ళి, పక్షులను పట్టుకుని చంపి, వాటిని అమ్మేవాడు. ఒకరోజు పక్షుల కోసం అతడు అడవికి వెళ్ళినపుడు, గాలీ వానతో కూడిన కుండపోత వర్షం కురుసింది. అడవంతా నీటితో నిండిపోయింది. బోయవాడు ఆ వర్షంలో తడిచి ముద్దై, చలికి వణుకుతూ అడవిలో తిరుగుతూ, వర్షానికి ఎటూ కదలలేక, చిన్న కొమ్మ మీద ఉన్న పావురాన్ని చూసి, దానిని తన బుట్టలో వేసుకున్నాడు. అక్కడికి దగ్గరలోని ఒక పెద్ద చెట్టును చూసి, ఆ రాత్రికి అక్కడే ఉండిపోవాలని నిశ్చయించుకుని, ఆ చెట్టుకు నమస్కరించి, "ఈ చెట్టు మీద ఉన్న దేవతలందరినీ శరణుగోరుతున్నాను", అని పలికి, చలికి వణుకుతూ, ఆకలితో బాధపడుతూ నిద్రపోయాడు. ఆ చెట్టు కొమ్మ మీద ఒక పావురం ఉంది. దాని భార్య ఆ రోజు పొద్దున ఆహారం కోసం వెళ్ళి, తిరిగి రాలేదు. తన భార్య రాకపోయినందుకు, ఆ పక్షి ఆమె క్షేమాన్ని గురించి దిగులు పడుతూ, ఆమె పాతివ్రత్యాన్నీ, సత్ర్పవర్తనను గురించీ, ఇలా అన్నది.

"నా భార్య లేకపోతే నాకు ఇల్లు శూన్యం. కుమారులూ, కోడళ్ళూ, మనుమలూ, సేవకులూ, ఇంటి నిండా ఉన్నప్పటికీ, ఇల్లాలు లేకపోతే, గృహస్థుకు ఇల్లు శూన్యమే. గృహిణి లేని ఇల్లు, ఇల్లు కాదు. గృహస్థుకు గృహిణియే ఇల్లు. గృహిణి లేని ఇల్లు అడవితో సమానం. సర్వాంగ సుందరమైన నా భార్య ఈ రోజు రాకపోతే, నేను బ్రతికి ఉపయోగం లేదు. ఆమె మహా పతివ్రత. ఎల్లప్పుడూ నన్ను అనుసరించి, నా ఆనందాన్ని తన ఆనందంగా, నా దు:ఖాన్ని తన దు:ఖంగా భావిస్తూ ఉంటుంది. అలాంటి భార్యను పొందిన వాడు, ధన్యుడు. పురుషునికి భార్యయే పరమార్థం. అతడు రోగాలతో బాధపడుతున్నా, కష్టాల్లో చిక్కుకున్నా, భార్య వంటి ఔషధం మరొకటి ఉండదు. భార్యతో సమానమైన బంధువు ఉండడు. భార్యలాంటి గతి ఉండదు. లోకంలోని ధర్మ సంగ్రహంలో, భార్యతో సమానమైన సహాయకుడు ఉండడు. అలాంటి భార్య ఇంట్లో లేకపోతే, భర్త అడవులకు వెళ్ళాలి. ఎందుకంటే, భార్యలేని ఇల్లైనా, అడవైనా ఒకటే.." అని తన భార్యను తలచుకుని, దీనంగా విలపించింది.

ఆ విధంగా విలపిస్తున్న పావురం మాటలను విని బోయవాని బుట్టలో ఉన్న ఆడపావురం, తన భర్తకు తన మీద ఉన్న ప్రేమానురాగాలకు ఎంతో సంతోషించి, తన భర్తతో ఇలా అన్నది. "నీ నివాసం దగ్గరకు వచ్చిన ఈ బోయవాడు చలితో, ఆకలితో బాధపడుతూ పడి ఉన్నాడు. అతనికి సహాయం చేసి, శరణాగత రక్షకుడివి కమ్ము. నా కోసం బాధపడవద్దు. సంతానవంతుడవైన నీవు, ఈ బోయవాని మనస్సు సంతోషించేలా, అతని కోరికలను తీర్చు."

ఆ మాటలను విన్న మగపావురం, భార్య చెప్పినట్లుగా చేయాలని నిశ్చయించుకుని, బోయవానితో.. "నీవు బాధపడవలసిన అవసరం లేదు. మా ఇంటికి వచ్చిన అతిథివి నీవు. ఇంటికి వచ్చిన శత్రువుకైనా, ఆతిథ్యమివ్వాలి. నరకడానికి వచ్చిన వాడికి కూడా చెట్టు నీడనిస్తుందే కానీ, ముడుచుకోదు. ఇంటికి వచ్చిన వానికి గృహస్థు తప్పని సరిగా అతిథ్యమివ్వాలి. కాబట్టి, నీకేమి కావాలో చెప్పు" అని బోయవానిని అడిగింది. దానికి బోయవాడు, చలి బాధ నుండి తనను రక్షించమని వేడుకున్నాడు. వెంటనే పావురం నేల మీది ఆకులను పోగుచేసి, తన రెక్కల శక్తినంతా ఉపయోగించి, తొందరగా ఎగిరి దగ్గర్లో ఉన్న గ్రామానికి వెళ్ళి నిప్పు తీసుకుని వచ్చి, ఎండుటాకుల మీద వేసి మంట చేసి, శరీరావయవాలను వెచ్చచేసుకోమని, బోయవానికి చెప్పింది. బోయవాడు మంటకు తన అవయవాలు కాచుకుని, చలి నుండి విముక్తుడై, తన ఆకలి తీర్చమని పావురాన్ని కోరాడు.

అతని మాటలు విన్న పక్షి, "నా దగ్గర సంపద లేదు. ఏ రోజుకారోజు దొరికిన దానితో మేము జీవిస్తాము. భోజనం కోసం కూడబెట్టినది, నా దగ్గర లేదు" అని పలికి క్షణకాలమాగి, "అయినా నీ ఆకలి తీరుస్తాను" అని బోయవానితో చెప్పి, ఎండుటాకుల మంటను పెద్దది చేసి, "ఋషుల వల్లా, దేవతల వల్లా, పితరుల వల్లా, మహాత్ముల వల్లా, అతిథి పూజనమే గొప్ప ధర్మమని నేను గతంలో విని ఉన్నాను. ఓ సౌమ్యుడా.. నేను సత్యం చెబుతున్నాను. అతిథి పూజలో నాకు తిరుగులేని బుద్ధిని అనుగ్రహించు" అని ఆ పావురం అతనితో పలికి, నవ్వుతూ అగ్నికి మూడుసార్లు ప్రదక్షిణ చేసి, అగ్నిలో ప్రవేశించింది. ఆ దృశ్యాన్ని చూసి బోయవాడు ఛలించిపోయాడు. అప్పటి వరకూ తాను చేసిన క్రూర కర్మలను అనేక విధాలుగా నిందించుకుంటూ, పెద్దగా విలపించడం మొదలుపెట్టాడు.

కపోతం యొక్క త్యాగాన్ని చూసిన బోయవాడు, "గతంలో ఎన్నో క్రూరమైన కర్మలతో, ఎంతో పాపం చేశాను. నేను దుర్బుద్ధినీ, నమ్మతగినవాడనుకానూ. ఎన్నో పక్షులను పట్టుకుని, చంపి జీవిస్తున్నాను. గొప్ప మనస్సు గల ఈ పావురం తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి, తన మాంసాన్ని నాకు అర్పించి, నా క్రూరత్వానికి తగిన ప్రతీకారం చేసి, నిస్సంశయంగా ధర్మ మర్గాన్ని నాకు బోధించింది. కాబట్టి, నేను భార్యా బిడ్డలనూ, ప్రియమైన ప్రాణాలను కూడా వదలివేస్తాను. భోగాలన్నింటినీ విడనాడి, నా శరీరాన్ని రకరకాల ఉపవాసాలతో శుష్కింప జేసుకుని, పరలోకాన్ని పొందుతాను." అని పలికి, ధర్మాచరణకు నిశ్చయించుకుని, క్రూరకర్ముడైన ఆ బోయవాడు పక్షులను పట్టుకోవడానికి ఉపయోగించే తన పరికరాలను అక్కడే వదిలివేశాడు.

పంజరంలో బంధించిన ఆడ పావురాన్ని విడిచిపెట్టి, మహాప్రస్థానం వైపు పయనమవుతుండగా, బంధ విముక్తురాలైన ఆడపావురం తన భర్త మరణానికి దు:ఖిస్తూ, తన భర్త మంచితనాన్నీ, తన మీద అతనికి గల ప్రేమనూ, అతను తనకు కల్పించిన స్వర్గ సుఖాలనూ తలచుకుని, "స్త్రీకి భర్తతో సమానమైన వారెవరూ లేరు. తండ్రి, సోదరుడూ, కొడుకూ, వీరందరి కన్నా భర్త అనురాగమే గొప్పది. అలాంటి భర్త లేకుండా నేను జీవించనవసరం లేదు" అని పలికి, ఆడపావురం మండుతున్న అగ్నిలో దూకేసింది. అప్పుడు ఆ పావురాల జంటను తీసుకుని వెళ్ళడానికి స్వర్గలోకం నుండి చక్కగా అలంకరించిన విమానం వచ్చింది. దాన్ని ఎక్కి ఆ రెండు పావురాలు స్వర్గ లోకానికి వెళ్ళిపోయాయి. ఆ దృశ్యాన్ని చూసిన బోయవాడు, తాను కూడా పక్షుల లాగే ఉత్తమ లోకాలను పొందగోరి, నిరాహారుడై, ఉపవాసంతో కృశిస్తూ, అడవిలో తిరుగుతూ, కొంత కాలానికి అడవిలో చెలరేగిన దావానలాగ్నికి తన శరీరాన్ని అర్పించి పునీతుడై, ఉత్తమ లోకాలను పొందాడు.

దయ, కరుణ, పరోపకారం, త్యాగం అనే పదాలకు నిర్వచనం చెప్పాయి పావురాలు. తనకు హాని చేసిన వేటగాడిని సైతం కాపాడమని, "అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడె ధన్యుడు సుమతీ" అన్న హితబోధను చేసింది. ఆకలిగొన్న వాడికి తన శరీరాన్నే ఆహారంగా సమర్పించిన పావురం యొక్క త్యాగం అద్వితీయం. ఈ కథను భీష్ముడు ధర్మరాజుకు చెప్పి, శరణాగత రక్షణ అనేది గొప్ప ధర్మం అని వివరించాడు. ఈ ధర్మం వల్ల, గోహత్యా పాతకం నుంచి కూడా బయటపడవచ్చు. శరణాగతుని చంపిన వానికి, నిష్కృతి లేదు. పుణ్యకర్మమూ, పాప వినాశకరమూ అయిన ఈ కథను విన్నవారు, స్వర్గలోకాన్ని పొందగలరని, తెలియజేశాడు. ఈ కథలో చక్కటి సన్నివేశ వర్ణనా, సహృదయులను ప్రభావితం చేయగల రమణీయమైన సంభాషణలూ, అపూర్వమైన పాత్ర చిత్రణా కనిపిస్తాయి. చక్కటి రంగులతో, అందమైన శరీరాన్ని కలిగి, కుహుకుహూ అనే శబ్దాలతో ఆనందాన్నివ్వగల పావురం, శాంతికి ప్రతీక. అలాంటి పావురాలను పాత్రలుగా తీసుకుని, భార్యాభర్తల అన్యోన్య దాంపత్యాన్నీ, పరస్పరం ఒకరినొకరు విడిచివుండలేని అపూర్వమైన భార్యాభర్తల ప్రేమాభిమానాలనూ, భీష్ముడు ఈ కథ ద్వారా గొప్పగా తెలియజేశాడు. అలాగే, శరణాగత రక్షణ, అతిథి పూజనం, గొప్ప ధర్మాలనీ, మానవులు ఆ ధర్మాలను తప్పనిసరిగా పాటించాలనీ, అలా పాటించిన వారు, మరణానంతరం స్వర్గలోక సౌఖ్యాలను అనుభవిస్తారనీ చెప్పిన ఈ కథ, మానవులకు పరోపకారం, కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయాలన్న గొప్ప నీతిని తెలుపుతుంది.

సర్వేజనాః సుఖినోభవంతు!

Monday, April 24, 2023

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu


అంపశయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన అద్భుత నీతి కథ!

మహాభారతంలో నేటి జీవన శైలికి ఉపయోగపడే ఎన్నో నీతి కథలున్నాయి. ధర్మరాజు సందేహాల నివృత్తి కోసం, భీష్మపితామహుడు వివరించిన కథలు నేటికీ అనుసరణీయమే. అయితే, ఈ రోజు మనం తెలుసుకోబోయే కథకు, ఒక ప్రత్యేకత ఉంది. మామూలుగా మనం విన్నవీ, చదివినవీ, అంపశయ్య మీదున్న భీష్ముణ్ణి ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా, భీష్ముడు చెప్పిన కథలను. ఈ కథను మాత్రం, ధర్మరాజు తనను ప్రశ్నించకుండానే, తనంతట తానుగా తెలియజేశాడు భీష్మపితామహుడు. భారతీయుల చారిత్రక గ్రంధమైన మహాభారత కావ్యం, శాంతి పర్వంలోని ఆపద్ధర్మ పర్వం అనే ఉప పర్వంలో, 137వ అధ్యాయంలో, 24వ శ్లోకంలో ఉన్న ఈ కథతో, కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి? ఏ మేరకు అప్రమత్తంగా ఉండాలి? అనే అంశాలను అనుసంధానించి, భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు...

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/HB27utkLXCo ]



ఈ కథ ఒకరకంగా, ప్రస్తుతం మన దేశంలో నెలకొని ఉన్న Secular పరిస్థితులకూ వర్తిస్తుంది. అది ఎలా అనేది అన్వయించుకుని, మీకేమనిపించిందో, మీ అభిప్రాయాలను Comment ద్వారా తెలియజేయండి.

ఒక చెరువులో మూడు చేపలుండేవి. దీర్ఘదర్శీ, ప్రాప్తకాలజ్ఞుడూ, దీర్ఘసూత్రుడనేవి వాటి పేర్లు. ముగ్గురి ఆలోచనలూ, నడవడికలూ వేరైనా, అవి మంచిమిత్రులు. నీరు నిండుగా ఉండి, చెరువు చల్లగా ఉండడంతో, హాయిగా కాలం గడిపేవవి. అయితే, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! వర్షాకాలం గడిచింది. శీతకాలం గడిచింది. ఇక ఎండాకాలం రానే వచ్చింది. ఎండాకాలం వస్తూనే, వేడి నిప్పులను చెరిగింది. ఎండ వేడిమికి వడగాడ్పులు తోడవడంతో, చెరువు ఎండి పోసాగింది. రాబోయే విపత్కర పరిస్థితిని ముందుగానే గమనించాడు, దీర్ఘదర్శి. మిత్రులిద్దరినీ పిలిచి, ఇలా చెప్పాడు. ‘చూశారుగా మిత్రులారా! ఈ ఏడు ఎండలు విపరీతంగా ఉన్నాయి. రోజు రోజుకీ చెరువు ఎండిపోతున్నది. ఎండిపోయిన చెరువులో మనం ఉండడం, ప్రమాదకరం. పైగా, ఈ చెరువుకీ, ఇంకో చెరువుకీ పల్లంలో గల కాలువ మార్గం కూడా ఎండిపోయిన పక్షంలో, మన బ్రతుకే ప్రశ్నార్థకమవుతుంది. అందుకని ముందుగా మనం మేల్కోవడం మంచిది. కాలువ మార్గం ద్వారా ఏదైనా ఇంకో చెరువుకు ప్రయాణించడం, శ్రేయస్కరం.

’’దీర్ఘదర్శి ఆలోచనా, ఆందోళనా విన్న స్నేహితులిద్దరూ నవ్వుకున్నారు. వారిలో ప్రాప్తకాలజ్ఞుడు వెక్కిరింపుగా, ‘‘మొదలుపెట్టావా? ఎండాకాలం ప్రారంభమయింది, ఇంకా మొదలుపెట్టలేదేమిటా అని చూస్తున్నాను’ అని పగలబడి నవ్వి, ‘‘అన్నింటికీ ముందే భయపడకూడదు మిత్రమా! ప్రమాదం అని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకడం, దుఃఖ దాయకం. ప్రమాదం ముంచుకొస్తే, అప్పుడు ఆలోచిద్దాము. అప్పటిదాకా హాయిగా ఉండు. లేనిపోని భయాలు పెట్టుకోకు’’ అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. వెంటనే దీర్ఘసూత్రుడు మాట్లాడుతూ,‘‘ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడెండిపోయింది చెరువు? సముద్రంలా చల్లగా ఉంటేను. ప్రతి సారీ ఎండాకాలం వస్తుంది, ఆ తరువాత వర్షాకాలం వస్తుంది. అయినా ఇప్పుడప్పుడే ఈ చెరువు ఎండిపోదు. మనకే ఆపదా రాదు. తిని తిరక్కుండా, ఎందుకీ భయాలు’’ అని, దీర్ఘదర్శి మాటలను, వారిరువురూ కొట్టి పారేశారు. 

తన మాట వినిపించుకోని మిత్రులిద్దరినీ జాలిగా చూశాడు, దీర్ఘదర్శి. ఇక అక్కడ ఉండడం ఎంత మాత్రం క్షేమకరం కాదనుకుని, పల్లంలో గల కాలువ ప్రవాహంలో ప్రయాణించి, వేరే చెరువుకు చేరుకున్నాడు. కొద్ది రోజులు గడిచాయి. దీర్ఘదర్శి చెప్పినట్లు, చెరువులోని నీరు క్రమక్రమంగా ఇంకి పోసాగింది. అది గమనించిన జాలరులు చేపల వేటకు సిద్ధమయ్యారు. నీరు సరిగాలేని ఆ చెరువులో, జాలరులకు చేపలు ఇట్టే దొరికిపోసాగాయి. దొరికిన చేపలను తాటినారకు గుది గుచ్చి, మళ్ళీ మరిన్ని చేపల కోసం చెరువును అల్లకల్లోలం చేయసాగారు. ప్రాప్తకాలజ్ఞుడు జాగ్రత్తగా అంతా పరిశీలించి, ఒక పథకాన్ని ఆలోచించాడు. ‘జాలరి చేతికి చిక్కితే, ఇక అంతే సంగతులు. అందుకని ఇప్పుడు ఎంచక్కా తాటి తీగను నోటితో కరచి పట్టుకుని, చచ్చిన దానిలా వ్రేలాడతాను. పట్టిన చేపల మట్టిని వదిలించేందుకు, జాలరి ఎప్పుడయితే మంచి నీటిలో చేపలన్నిటినీ ముంచి తీస్తాడో, అప్పుడు అదే అవకాశంగా, నీటిలోకి జారుకుంటాను. అక్కడి నుండి సురక్షితమైన ఇంకో చోటుకు చేరుకుని, ఈ ప్రమాదాన్నించి తప్పించుకుంటాను’ అని ఆలోచించి, తన పథకాన్ని అనుకున్నట్టుగానే చేశాడు. చేపల గుత్తిని కరచి పట్టుకుని, చచ్చినట్టు నటించాడు ప్రాప్తకాలజ్ఞుడు.

జాలరి మరిన్ని చేపలను పట్టుకుని, అక్కణ్ణుంచి ముందుకు నడిచాడు. బురదలేని, తేటనీటి కొలను దగ్గరకు చేరుకున్నాడు. అలసిపోయాడేమో! దాహమనిపిస్తే, దోసిట నీరు పట్టి త్రాగాడు. తర్వాత తాను తెచ్చిన చేపల గుత్తిని ఎత్తి చూశాడు. చేపలన్నీ బురద బురదగా ఉన్నాయి. వాటి బురదను పోగొట్టేందుకు, చేపల గుత్తిని మంచి నీటిలో ముంచి తీశాడు. జాలరి గుత్తిని ముంచడమే ఆలస్యం. ప్రాప్తకాలజ్ఞుడు చల్లగా నీటిలోకి జారుకుని, తన ప్రాణాలను కాపాడుకున్నాడు. దీర్ఘసూత్రుడు మాత్రం, దీర్ఘదర్శిలా ముందే మేల్కొనకుండా, ప్రాప్తకాలజ్ఞుడిలా తగిన సమయానికి, తగిన విధంగా ప్రవర్తించకుండా, ‘ఆఁ! ఏం కాదులే’ అనుకుంటూ రోజులు గడిపేసి, చివరకు జాలరి వలకు చిక్కి, చనిపోయి, మరొకరికి ఆహారమయిపోయాడు’’.. ఈ కథలో నేర్చుకోవాల్సింది చాలా ఉంది..

ప్రాణం మీదకు వచ్చిన ఆపదను తెలుసుకోలేని మూర్ఖులూ, రాగల ఆపదను ముందుగానే పసిగట్టే ప్రయత్నం చేయని అజ్ఞానులూ, దీర్ఘసూత్రునిలా ప్రమాదంలో చిక్కుకుని, మరణిస్తున్నారు. నేను తెలివి గలవాడిని, అవసరం వచ్చినపుడు ఆలోచించుకోవచ్చులే అని నిర్లక్ష్యంగా ఉండేవాడు, ప్రాప్తకాలజ్ఞుడిలా, ప్రాణసంకటంలో పడతాడు. రాగల ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన దీర్ఘదర్శిలాంటి జాగ్రత్తపరులు, చీకూ చింతా లేకుండా, హాయిగా, సుఖంగా ఉండగలుగుతారు.’’ అని భీష్ముడు ధర్మరాజుకు, తన కర్తవ్యాన్ని ముందు చూపుతో ఏవిధంగా నిర్వర్తించాలో,  తెలియజేశాడు.

ఈ కథను మన పాఠ్యాంశాలలో, ప్రాథమిక స్థాయి తరగతులలో, చదివే ఉంటాము. అయితే, ఈ కథ భారతంలో ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ఈ కథలోని దీర్ఘదర్శి, రాబోయే ఆపదను ముందుగానే పసిగట్టి, ఆపద రాకముందే సురక్షితంగా బయట పడాలనే నీతిని తెలుపుతోంది. ఈ పద్ధతి ఉత్తమమైనది. ఎలాంటి భయం, ఆందోళనా లేకుండా, ప్రశాంత జీవనం గడపడానికి, ఇది పనికి వస్తుంది. అపాయం ఎదురైనప్పుడు, ఉపాయంతో బయట పడడం, మధ్యమం. ఈ పద్ధతిలో, అపాయం నుంచి బయట పడేవరకూ, ప్రాణాలు అరచేతిలో చిక్కబట్టుకోవాలి. అపాయం నుంచి తప్పించుకోవడానికి, మన ఉపాయం నెరవేరుతుందో లేదో, తెలియదు. అందువల్ల, దాని కంటే మొదటి పద్ధతే ఉత్తమమైనది. ఒక వేళ ఏ కారణం చేతనైనా మొదటి పద్ధతిని పాటించలేకపోతే, ప్రాప్తకాలజ్ఞుడిలా రెండవ పద్ధతి ద్వారా, ప్రాణాలు కాపాడుకోవాలి. ఈ రెండు పద్ధతులూ పాటింపని సోమరిలా ఉంటే, దీర్ఘసూత్రుని లాగా నశించిపోవలసి వస్తుందనే చక్కని నీతిని, ఈ కథ ద్వారా భీష్మపితామహుడు, ధర్మరాజు తోపాటు, మనందరికీ తెలియజేశాడు.

ఏ విషయమైనా, మన దాకా వచ్చిన తరువాత చూసుకుందాములే.. అని తాత్సారం చేసి, భావితరాలను ముంపుకు గురిచేయకుండా, సరైన నిర్ణయాలను తీసుకుని, జాగ్రత్త పడదాము. సనాతన ధర్మాన్ని మించిన ధర్మం లేదు..

సర్వం కృష్ణ మయం!

Monday, April 17, 2023

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

 

దుర్యోధనుడికి భీష్ముడు వివరించిన శిఖండి జన్మ రహస్యం!

మహాభారత కావ్యంలో, శిఖండిది ఒక విచిత్రమయిన పాత్ర. ద్రుపదమహరాజుకు కూతురుగా, శిఖండిగా జన్మించి, తరువాత మహారథుడయిన కొడుకుగా మారిన విచిత్ర గాధ. ఎవరైనా పంతాలూ పట్టింపులకు పొయినా, అనుకున్నది సాధించేవరకూ నిద్రపోని లక్షణాలు కనిపించినా, ''శిఖండి'' అని గొణుక్కోవడం, చాలామందికి పరిపాటే. తన పూర్వ జన్మలో భీష్ముడిపై కక్షతో, ఆత్మత్యాగం చేసుకున్న అంబ, మరు జన్మలో శిఖండిగా జన్మించి, భీష్ముడి మరణానికి కారణమైందన్న సంగతి, అందరికీ తెలిసిందే. కానీ, శిఖండి స్త్రీ గా జన్మించి, పురుషుడిగా మారడమనే విషయం, కొంతమందికి మాత్రమే తెలుసు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు, దుర్యోధనుడు తన సైన్యానికి భీష్ముడిని, సర్వ సైన్యాధ్యక్షునిగా చేసినపుడు, భీష్ముడు తన శక్తి సామర్థ్యాలను గురించి, దుర్యోధనుడు మొదలైన ధార్తరాష్ట్రులకు చెబుతూ, "స్త్రీని గానీ, మొదట స్త్రీగా ఉండి, తరువాత పురుషుడిగా మారిన వ్యక్తిని గానీ చంపను. శిఖండి మొదట స్త్రీగా పుట్టి, తర్వాత పురుషుడయ్యింది. అలాంటి వాడు నన్నెదిరించి, నా మీద బాణాలు వేసినప్పటికీ, నేను అతని మీద బాణం వెయ్యను" అని చెప్పాడు. అలా ఎందుకు వెయ్యలేవని దుర్యోధనుడు భీష్ముణ్ణి ప్రశ్నించాడు. దానికి సమాధానంగా భీష్ముడు, అంబోపాఖ్యానాన్ని వివరించాడు. స్త్రీగా జన్మించిన శిఖండి పురుషత్వాన్ని ఎలా పొందిందో, భారతంలో భీష్ముడు వివరించిన శిఖండి జన్మ రహస్యాన్ని, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/rOzNea41xS0 ]


ద్రుపద మహారాజుకు భీష్మునిపై ఉన్న కోపం కారణంగా, అతనిని చంపగల కుమారుణ్ణి ప్రసాదించమని, శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై, ద్రుపదుడికి పుట్టబోయే కూతురే పురుషుడిగా మారి, భీష్ముడి మరణానికి కారణమవుతుందని, అభయమిచ్చాడు. ద్రుపదుడు జరిగిన విషయమంతా తన భార్యకు వివరించాడు. ఈశ్వరుడు వరమిచ్చినట్లుగానే, వారికొక కుమార్తె జన్మించింది. వారు ఆమెకు శిఖండి అని నామకరణం చేసి, కుమారునిగానే పెంచారు. ఆమెకు ద్రోణాచార్యుని వద్ద విలువిద్య నేర్పించారు. ఆమె యవ్వనవతి కాగానే, శివుని వరం వృధా పోదు అని విశ్వసించి, పురుషత్వం రాక మునుపే, ఆమెకు వివాహం చేయాలని నిశ్చయించారు. వారు దశార్ణ దేశ రాజైన హేమవర్మ కుమార్తెతో, వివాహం జరిపించారు. శిఖండి గురించిన రహస్యం తెలుసుకున్న భార్య, మౌనంగా ఉండి పోయింది.

కానీ, ఆమె చెలికత్తె ద్వారా ఈ విషయం తెలుసుకున్న దశార్ణ మహారాజు, తననూ, తన కుమార్తెనూ మోసం చేసినందుకు, తమ రాజ్యం మీదకు దండయాత్రకు వస్తున్నట్లు, ద్రుపదునికి దూతద్వారా తెలియపరచి, తన సేనలతో పాంచాల దేశాన్ని ముట్టడించాడు. శిఖండి తన పురుషత్వం గురించి, రెండుదేశాలు యుద్ధం చేసుకోవడం చూసి, సిగ్గుపడింది. అర్ధరాత్రి లేచి, అరణ్యంలోకి వెళ్ళింది. ఆ అరణ్యంలో స్థూలకర్ణుడనే యక్షుడు నివసించేవాడు. అతనికి భయపడి, మనుష్యులెవ్వరూ ఆ అరణ్యంలోకి ప్రవేశించేవారు కాదు. అది తెలిసే, శిఖండి అడవిలోకి ప్రవేశించింది. ఆ విషయం గ్రహించిన యక్షుడు శిఖండిని చూసి, "కుమారీ, నీవెవరు? ప్రాణముల మీద ఆశ వదలి, ఇక్కడికి ఎందుకు వచ్చావు?" అని అడిగాడు. శిఖండి జరిగినదంతా అతనికి వివరించి, తనకు పురుషత్వం కావాలి కానీ, అది శివుని వలననే సాధ్యం కాగలదని చెప్పి, చింతించింది.

అది విన్న యక్షుడు ఒక ఉపాయం చెప్పాడు. "నేను నీకు ఒక్క పది రోజుల కాలం నా పురుషత్వాన్ని ఇచ్చి, నీ స్త్రీ రూపం నేను ధరిస్తాను. ఆ సమయంలో నీవు హేమవర్మ వద్దకు వెళ్ళి, నీ పురుషత్వం నిరూపించుకో. పరిస్థితిలు చక్కబడగానే ఇక్కడకు తిరిగి వస్తే, మరలా మనం ఎవరి రూపం వారు పొందవచ్చ"ని అన్నాడు. శిఖండి అందుకు అంగీకరించి, యక్షుని నుండి పురుషత్వం స్వీకరించి, తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు. జరిగినది వారికి వివరించగానే వారు సంతోషించి, సమస్యకు కనీసం తాత్కాలిక పరిష్కారం లభించిందని తెలుసుకుని, హేమవర్మ వద్దకు దూతలను పంపి, తన వద్దకు రప్పించి, శిఖండి పురుషుడేనని నిరూపించాడు. హేమవర్మ తన తొందర పాటుకు చింతించి, ద్రుపదునికి క్షమాపణ చెప్పాడు. ద్రుపదుడు వారికి విందులూ, వినోదాలూ ఏర్పాటు చేసి, వారిని సగౌరవంగా సాగనంపాడు. ఇలా రెండు రోజులు గడిచిన తరువాత, కుబేరుడు తన విమానంపై విహరింస్తూ, యక్షుడైన స్థూలకర్ణుని మందిరానికి వెళ్ళాడు.

ఎంతకూ స్థూలకర్ణుడు తనను ఆహ్వానించడానికి రాకపోవడంతో కోపించి, కిన్నెరులను కొంత మందిని లోపలకు పంపి, స్థూలకర్ణుని విషయం కనుక్కుని రమ్మన్నాడు. కిన్నెరులు జరిగిన విషయమంతా స్థూలకర్ణునిద్వారా తెలుసుకుని, కుబేరుని వద్దకు వచ్చి చెప్పారు. దానికి కుబేరుడు శాంతించి, అతడిని స్త్రీరూపంతోనే రమ్మని చెప్పి, తన వద్దకు వచ్చిన స్థూలకర్ణునితో, "జరిగినదేదో జరిగింది. ఇది దైవ సంకల్పం. నీవు ఇక ఇలాగే ఉండు" అని అన్నాడు. స్థూలకర్ణుడు కుబేరుని కాళ్ళపై బడి విమోచన మార్గం చెప్పమని బ్రతిమాలాడు. దానికి కుబేరుడు, "స్థూలకర్ణా! దైవ సంకల్పానికి అనుగుణంగా జరిగినది, ఈ మార్పిడి. శిఖండిని జీవితాంతం పురుషునిగానే ఉండనివ్వు. జరగవలసిన ఈశ్వర సంకల్పం నెరవేరగానే, శిఖండి మరణిస్తాడు. ఆ తరువాత నీ పురుష రూపం నీకు వస్తుంది" అని చెప్పి, తన విమానంపై అలకాపురికి తిరిగి వెళ్ళాడు.

శిఖండి మాత్రం, తిరిగి స్థూలకర్ణుడిని కలుసుకుని, తన పురుషత్వాన్ని స్వీకరించి, స్త్రీత్వాన్ని తిరిగి ఇవ్వమని అడిగాడు. అప్పుడు స్థూలకర్ణుడు జరిగినదంతా వివరించి, ఇది దైవ సంకల్పం కనుక, నీవు ఇక పురుషుడిగానే సంచరించవచ్చని చెప్పాడు. శిఖండి పరమ సంతోషం చెంది, తన తల్లి తండ్రులకు జరిగనది వివరించాడు. అతడు బ్రాహ్మణులనూ, దేవతలనూ పూజించి, ఎన్నో వ్రతాలను ఆచరించి, ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి, అతడి శిష్యునిగా చేరి, ద్రోణాచార్యుని వలన విలువిద్యా ప్రావీణ్యాన్ని పొందాడు. మహాభారత యుద్ధములో, అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకుని చేసిన యుద్ధము వలన, భీష్ముడు అస్త్ర సన్యాసము చేసి, అంపశయ్యపై చేరటముతో, శిఖండి చరిత్ర ముగుస్తుంది. శిఖండిగా పుట్టిన అంబ, తన గత జన్మలో చేసిన శపథాన్ని నేరవేర్చుకుంది.

అంబ శిఖండిగా మారటం అనేది, భీష్ముని తనువు చాలించటానికే. ఎందుకంటే, భీష్ముడి లాంటి పరాక్రమవంతుడినీ, ధర్మ నిష్టాపరుడినీ, ఏ రకమైన శస్త్రాలూ, ఎటువంటి వీరులూ సంహరించలేరు. ఇందులో మరో ఆసక్తికరమైన విషయమేటింటే, అంబే శిఖండిగా జన్మించిందనీ, ఆమె వల్లే తనకు మరణం తథ్యమనీ, భీష్ముడికి కూడా తెలుసు. తనంతట తానుగా కోరుకుంటేనే మరణించే ‘ఇచ్ఛా మరణ’ వరం పొంది వుండి కూడా, శిఖండిని ఎదురించడానికి గానీ, మృత్యువు నుండి తప్పించుకోవడానికి గానీ, భీష్మ పితామహుడు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. స్వచ్ఛందంగా తన మరణాన్ని స్వాగతించి, అంపశయ్యపై ఉన్న భీష్ముడిని చూసి, సాక్షాత్తూ ఆ కృష్ణ భగవానుడే ఛలించిపోయాడంటే, ఆ మహా వీరుడి గొప్పదనం ఎంటో తెలుసుకోవచ్చు.

భీష్ముడు పరమపదం చేరిన మాఘశుద్ధ అష్టమినాటిని “భీష్మాష్టమి” గానూ, మాఘశుద్ధ ఏకాదశిని, “భీష్మ ఏకాదశి” గానూ, మనం నేటికీ ఆచరిస్తూ, ఆయనను స్మరిస్తున్నాం. భీష్మ నిర్యాణం జరిగి, సహస్రాబ్దాలు గతిస్తున్నా, ఆయన ప్రవచించిన “విష్ణు సహస్ర నామ స్తోత్రం”, యిప్పటికీ భాగవతుల రసాగ్రాలపై నర్తిస్తూనే వుంది. ఆయన దివ్య వాణి, విశ్వవ్యాప్తమై, ప్రతిధ్వనిస్తూనే వుంది. విష్ణుసహస్రనామ పఠనం, సర్వ దుఃఖహరం, సకల శుభకరం.
     
ఓం నమో భగవతే వాసుదేవాయ!

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...