Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Monday, July 29, 2024

Mahavatar Babaji's Cosmic Cobra Breath | మహావతార్‌ బాబాజీ – ‘విశ్వ సర్ప శ్వాస’ ప్రక్రియ!


మహావతార్‌ బాబాజీ – ‘విశ్వసర్పశ్వాస’!? TELUGU VOICE
కుండలినీ శక్తిని నిద్ర లేపటానికి ఉపయోగించే తాంత్రిక యోగమార్గం ఏమిటో తెలుసా?

ఈ అనంత విశ్వంలో దాగి ఉన్న ఎన్నో రహస్యాలూ, మనిషి మేధస్సుకందని విశేషాలూ అనంతం. మరణం లేని మానవులూ.. మరణాన్ని జయించే యోగాసనాలూ.. ఆ మహా యోగి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసేకొద్దీ, సాధారణ మానవులకు నమ్మశక్యంకాని అటువంటి అద్భుతాలు కోకొల్లలు. ఆయనే మహావతార్ బాబాజీ. సుమారు 2000 సంవత్సరాలుగా, సజీవంగా ఉన్న సిద్ధ యోగి బాబాజీ గురించీ, ఆయన జీవిత విశేషాలతో, మానవాళి శ్రేయస్సుకోసం ఆయన అందించిన ‘క్రియా యోగం’ గురించీ, గతంలో మనం చేసిన వీడియోల Playlist, క్రింద description లో పొందుపరిచాను. చూడని వారు తప్పక చూడండి. ఇక ఈ రోజుటి మన వీడియోలో, ఆ సిద్ధ యోగి మనకోసం అందించిన మరో అద్భుతమైన ‘విశ్వ సర్ప శ్వాస’ గురించి తెలుసుకుని, గురవు ద్వారా నేర్చుకుని తరిద్దాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/W_hczzQyXJY ]


ఈనాటికీ హిమాలయాలలో అదృశ్యరూపుడిగా సంచరిస్తున్నాడని చెప్పబడుతున్న మహావతార్‌ బాబాజీ, మానవ జాతి అభ్యుదయం కోసం అందించిన ఒక అపూర్వమైన వరం “క్రియా యోగం”. క్రియా యోగం అంటే, ఎవరిని వారు తెలుసుకోవటం అని అర్ధం. నిజానికి క్రియా యోగం ఒక సైన్స్‌ అని చెప్పాలి. ఈ క్రియాయోగంలో అత్యున్నత స్థాయికి చెందిన ఒక యోగ ప్రక్రియను “విశ్వ సర్ప శ్వాస ప్రక్రియ అనీ, Science పరంగా కాస్మిక్‌ కోబ్రా బ్రీత్‌” అనీ పిలుస్తారు. అతి పవిత్రమయిన, మరియు అత్యంత రహస్యమైన ఈ శ్వాస ప్రక్రియను, మహావతార్‌ బాబాజీ తన శిష్యులకు బోధించారు. ఆ తరువాతి కాలంలో, ఆ శిష్యులు తమ శిష్యులకు ఈ ప్రక్రియను అందజేస్తూ వచ్చారు.

మానవ శరీరంలో దాగి ఉండే శృంగార సామర్ధ్యాన్ని ఊర్ధ్వరేతస్సుగా, కుండలినీ శక్తిని నిద్రలేపటం కోసం ఉపయోగించే ఒక తాంత్రిక యోగమార్గాన్ని, విశ్వ సర్ప శ్వాస, లేక కాస్మిక్‌ కోబ్రా బ్రీత్ అని పిలుస్తారు. వేలాది సంవత్సరాలుగా భారతదేశానికి చెందిన ఎందరో మహర్షులు, ఈ విధానం ద్వారా కుండలినీ సాక్షాత్కారాన్ని పొందారని తెలుస్తోంది. ఈ విధానంలో 7 స్థాయిలుంటాయి. ఒక్క గురువు ద్వారా మాత్రమే, ఈ శ్వాస విధానాన్ని నేర్చుకోవాలని తెలుస్తోంది.

సాధారణ మానవులు శృంగారంలో పాల్గొన్నప్పుడు, వారిలోని శృంగార శక్తి వీర్యం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఫలితంగా, మానవులు బలహీన పడతారు. అయితే, యోగులు ఆ శృంగార శక్తిని, తమ శరీరంలోని పై భాగాలకు పంపిస్తారు. దీనినే ఊర్ధ్వ రేతస్‌ అని పిలుస్తారు. ఈ ‘విశ్వ సర్ప శ్వాస’ అనే ప్రక్రియ, గురువు నుండి శిష్యుడికి తెలుస్తుంది. ఈ ప్రక్రియ ఎక్కడా వ్రాత రూపంలో కనబడదు. ‘విశ్వ సర్ప శ్వాస’ అనే యోగ ప్రక్రియలో, మొదటి స్థాయిలోనే మానవుడి నుదిటి భాగంలో ఉన్న “అజ్ఞా చక్రాన్ని”, చాలా వేగంగా తెరిచే విధానం నేర్పబడుతుంది. దీనినే మూడవ కన్ను అనికూడా పిలుస్తారు. ఇక ఈ విశ్వ సర్ప శ్వాస ప్రక్రియలోని రెండవ స్థాయిలో, మనిషిలో ఉండే స్త్రీ / పురుష శక్తులను సమతౌల్యంలోకి తీసుకువచ్చి, ఆపై దిగువగా ఉండే మూడు శక్తి కేంద్రాలైన చక్రాలను శుద్ధిచేసే పద్ధతి బోధించ బడుతుంది.

ఇక మానవునిలోని హృదయ ప్రాంతంలో, మరియు కంఠ ప్రాంతంలో ఉండే 4, 5 చక్రాలను తెరచి, ఆపై వెన్నెముక గుండా వెళ్ళే కేంద్ర మార్గాన్ని తెరచి, ఆ మార్గం గుండా, కుండలినీ శక్తిని పైకి వెళ్ళేలా చేసే ప్రక్రియ, “విశ్వ సర్ప శ్వాస” మూడవ స్థాయిలో బోధిస్తారు. నడి నెత్తిన ఉండే ఏడవ చక్రాన్ని తెరచి, ఆ పై జీవాత్మతో పరమాత్మను కలిపే ప్రక్రియను, “విశ్వ సర్ప శ్వాస” నాలుగవ స్థాయిలో నేర్పిస్తారు. మొత్తంగా ఉన్న 7 స్థాయిలలో, 4 స్థాయిలు గురువు ద్వారా నేర్చుకోవాలి. మిగిలిన మూడు స్థాయిలను, శిష్యుడు తన వ్యక్తిగత సాధన ద్వారా సాధించాల్సి ఉంటుంది.

మహావతార్‌ బాబాజీ ప్రబోధించిన “క్రియాయోగం”లో 5 విభాగాలుంటాయి. అవి.., 
1. క్రియా హఠయోగం 2. క్రియా కుండలినీ ప్రాణాయామం 3. క్రియా ధ్యాన యోగం 4. క్రియా మంత్ర యోగం 5. క్రియా భక్తి యోగం..

మానవాళి శ్రేయస్సుకై మహావతార్ బాబాజీ అందించిన ‘క్రియా యోగం’ గురించీ, పైన ప్రస్తావించబడిన సప్త చక్రాల గురించీ, గతంలో మనం చేసిన వీడియోల Playlists, ఈ వీడియో క్రింద description లో పొందుపరిచాను. చూడని వారు తప్పక చూసి మీ అభిప్రాయాలను కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక్క విషయం.. గతంలో చాలామంది, ఈ విద్యలను నేర్చుకునే విధంగా వీడియోలు చేయమని కోరారు. అందరూ గమనించాల్సిన ముఖ్యమైన విషయం, ఇవన్నీ గురుముఖత నేర్చుకోవలసినవే.. ఔత్సాహికులు గురువులకొరకు స్వయంగా అన్వేషణలో పడక తప్పదు.

🚩  ఓం క్రియా బాబాజీ నమః ఓం 🙏

Monday, July 22, 2024

గరుడ పురాణం - మనిషి పాపపుణ్యాలను లెక్కించే శ్రవణులు - Garuda Puranam


‘గరుడ పురాణం’ ప్రకారం.. మనిషి పాపపుణ్యాలను లెక్కించే ‘శ్రవణులు’!? TELUGU VOICE

ఈ కలియుగంలో, అన్ని పురాణాలలోకీ ప్రముఖమైనవిగా పరిగణించబడేవి, మూడు. వాటిలో ప్రధానదీ, ప్రజలకు శుభాలనందించేదీ, శ్రీమద్ భాగవతం. అందుకే అన్ని పురాణాలలో భాగవతం, అత్యున్నతమైనది. తరువాత విష్ణు పురాణం, ఆ తరువాత, గరుడ పురాణంగా చెప్పవచ్చు. అటువంటి గరుడ పురాణంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను వీడియోలుగా, ఇది వరకు కొన్నింటిని అందించి ఉన్నాను. వాటి playlist ను, వీడియో క్రింద description లో పొందుపరుస్తున్నాను. మనిషి సన్మార్గంలో నడుచుకోవడానికి ఉపయోగపడే, శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి స్వయంగా తెలియజేసిన మరికొన్ని విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ATV1ynLPOGs ]


“జ్ఞానసాగరా! శ్రీ మహావిష్ణూ! యమలోకంలో శ్రవణులనే వారుంటారనీ, వారు సర్వజ్ఞులనీ విని ఉన్నాను. వారిని గూర్చి తెలుసుకోవాలని కుతూహల పడుతున్నాను.” అని అన్న గరుత్మంతుడితో విష్ణుభగవానుడు.. “గరుడా! ప్రాచీన కాలంలో సమస్త స్థావర జంగమాత్మకమైన సృష్టి ఏకాకారం చెందినపుడు, నేను దానిని ఆత్మ లీనం చేసుకుని, పాల సముద్రంలో శయనించాను. అప్పుడు నా నాభికమలం నుండి బ్రహ్మపుట్టి, కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి శక్తిమంతుడై, ఏకాకారం చెందిన సృష్టిలోని ప్రాణులను, నాలుగు ప్రకారాలుగా విడగొట్టాడు. తరువాత బ్రహ్మగావించిన సృష్టిని పాలించే బాధ్యతను నేను స్వీకరించాను. ఆ తరువాత సంహారమూర్తి రుద్రుడుదయించాడు. అనంతరం సమస్త చరాచర జగత్తులోనూ ప్రాణాధారమై ప్రవహించే వాయువూ, ఆత్యంత తేజస్వి సూర్యదేవుడూ, చిత్రగుప్త సహితుడై యమధర్మ రాజూ ప్రకటితులయ్యారు..”

సృష్టిలోని ప్రాణులను విడగొట్టిన బ్రహ్మ, మరల తపస్సు చేశాడు. కొన్ని వందల ఏళ్ళు ఆయన అలాగే, నాభి కమలంలో తపస్సమాధిలోనే ఉండిపోయాడు. సృష్టిని మాత్రం అలాగే కొనసాగించాలని, లోపలి నుండే ఆదేశించాడు. అప్పుడు బ్రహ్మతో విష్ణు రుద్రాదులు, తమకు లోక వ్యవహారమెలా నడుస్తుందో, ఎవరే పాప పుణ్యాలు చేస్తున్నారో తెలియదనీ, దానికి సంబంధించిన ఏర్పాటేదో బ్రహ్మయే చేయాలనీ విన్నవించారు.

తన మంత్రాన్ని చిరకాలం పాటు ఏకాగ్రతతో, సర్వశక్తులనూ కేంద్రీకరించి జపించాలనే సంకల్పాన్ని, బ్రహ్మ వారందరికీ కలిగించాడు. వారంతా అలా చాలాకాలం పాటు చేసిన తరువాత, బ్రహ్మ తన పుత్రులుగా పన్నెండు మంది అమిత తేజస్వులూ, విశాల నేత్రులూ అయిన దేవతలను సృష్టించాడు. వారికి ఈ లోకంలో ఎక్కడ ఏది జరిగినా, ఎవరేం చేసినా, ఎవరు ఏమన్నా వినే శక్తినిచ్చాడు. ఈ విశేషజ్ఞానం వల్ల, ఆ బ్రహ్మపుత్రులను శ్రవణులన్నారు. వీరి నివాసం, ఆకాశం. అక్కడి నుండే అందరినీ చూస్తూ, వింటూ, అవసరమైనప్పుడు యమధర్మరాజు, లేదా చిత్రగుప్తల వద్దకు వచ్చి, వారికి కావలసిన వివరాలనందిస్తారు. ఆ సమయంలో వారి ద్వారా ప్రాణుల ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించిన సర్వకర్మల సారమూ, వివేచన సహితంగా, ధర్మరాజుకు సమర్పించ బడుతుంది.

ఓయీ వైనతేయా! సంసారానికి చెందిన ప్రాణుల ముందుండే మార్గాలు నాలుగే. అవే, ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు. ఉత్తమ ప్రకృతి గల ప్రాజ్ఞి, ధర్మ మార్గంలో నడుస్తాడు. ధనధాన్యాలను సంపాదించినా, దానానికే వినియోగించిన వారు, విమానంలో పరలోకాలకు చేరతారు. మోక్షాకాంక్షతోనే జీవితంలో ప్రతి పనినీ చేసిన వారు, తమ దేహాంతంలో హంసల విమానంపై పరలోకానికి పయనమవుతారు. ఉన్న దాని తోనే బ్రతుకుతూ, అప్పుడప్పుడైనా ఉన్నంతలో యాచకులను సంతోష పెట్టిన వారిని, దేవ దూతలు గుర్రాలపై తీసుకుని పోతారు. ఏ పుణ్యమూ, ధర్మమూ చేయకుండానే బ్రతుకు వెళ్లబెట్టిన వారిని, ఇది వరకు నువ్వ విన్నట్లుగా, యమదూతలు నడిపించుకుంటూ, ఏ అసిపత్ర వనానికో తీసుకు పోతారు. శ్రవణులను భక్తితో, పక్వాన్నం, వర్ధని, జలపాత్రల ద్వారా పూజించిన వారికి, నేను స్వయంగా ప్రసన్నుడనై, ఏ దేవతలూ ఇవ్వలేనన్ని వరాలను కురిపిస్తాను. (అధ్యాయం - 17)

పక్షింద్రా! ఈ శ్రవణులు చెప్పినదంతా విన్న తరువాత, చిత్రగుప్తుడు కొన్ని క్షణాలపాటు ధ్యాన నిమగ్నుడై, ఆ మనిషి రాత్రింబవళ్ళు గావించిన పాపపుణ్యాల ఫలాన్ని, యమధర్మ రాజుకు విన్నవిస్తాడు. గరుడా! మనిషి మాట, తనువు, మనస్సులతో చేసే ప్రతి కర్మకీ, ఫలాన్ని అనుభవించ వలసినదే. నేడు నీవు విన్న ఈ విషయాలను, రేపు ప్రపంచమంతా తెలుసుకుంటుంది. అన్నదానం, దీపదానం చేసిన వారు, మహామార్గంలో సుఖ పూర్వకంగా పయనిస్తారు.

కార్తీక కృష్ణ చతుర్దశి నాటి రాత్రి చేసే దీపదానం, సర్వసుఖకారి. ఇప్పుడొకసారి సంక్షిప్తంగా దాన ఫలాలను చెబుతాను విను.. వృషోత్సర్గ పుణ్యం వల్ల, మనిషి పితృలోకానికి వెళతాడు. జలపూర్ణ ఘట దానం వల్ల, యమదూతలు సంతోషిస్తారు. పదకొండవ రోజున శయ్యాదానం చేయడం వల్ల, మనిషి విమానమెక్కి, స్వర్గలోకానికి చేరతాడు. విశేషించి, పన్నెండవ రోజు అన్ని ప్రకారాల దానాలనూ చేయాలి. పదమూడు పద దానాలను చేసినవారు, పితరులూ, పుత్రులూ కూడా, వాటి సహాయంతో మహామార్గాన్ని సుఖంగా దాటి వెళ్ళగలరు. ఎవరి భాగ్యమెలా వున్నదో, వారి మార్గ సుఖమును బట్టి తేలిపోతుంది. తన కొడుకు తాను పోయినప్పుడెలాగూ చేస్తాడు కదా అని సరిపెట్టుకోకుండా, తానే, తన జీవిత కాలంలోనే, స్వస్థ చిత్తుడై, అన్ని రకాల దానాలనూ చేసినవాడు, సర్వత్రా సుఖ పడతాడు.

విష్ణు భగవానుడి ఈ మాటలు విన్న గరుత్మంతుడు, “భగవాన్‌! పదమూడు పద దానాలంటే ఏమిటో తెలియజేయండి” అని అడిగాడు. దానికి శ్రీ మహావిష్ణువు, “ఛత్రం, పాదుక, వస్త్రం, ముద్రిక, కమండలువు, ఆసనం, భోజన పాత్ర, మరొక ఆసనం, జలపాత్ర, అన్నం, భోజన సామగ్రి, నెయ్యి, యజ్ఞోపవీతం.. ఈ పదమూడింటినీ పద దానాలన్నారు. ఇవన్నీ మృతుని నారకీయ మార్గంలో ఉపయోగపడి, ప్రేతానికి సుఖాన్నిస్తాయి. అంతేగాకుండా, దానమిచ్చిన వానికి కూడా గొప్ప పుణ్యాన్ని కలుగజేస్తాయి.

గృహ్ణాతి వరుణో దానం మమహస్తే ప్రయచ్ఛతి |
అహంచ భాస్కరే దేవో భాస్కరాత్‌ సో అశ్నుతే సుఖం ॥ (18/27)

మృతుని బంధువు, అతని ఇంటి వద్ద చేసిన దానాన్ని, వరుణుడు స్వీకరించి విష్ణువు చేతిలో పెట్టగా, దానిని భాస్కరుడు సేకరించి, ప్రేతం సుఖించేలా చూస్తాడు. ఇది వరకే చెప్పబడిన పదహారు పురాలనూ దాటి, యమునికి దగ్గరగానున్న బహుభీతికర నామక పురంలో, అంతవరకు హస్తం పరిమాణంలో వున్న శరీరం, చిటికెన వేలంత అయిపోగా, జీవుడు గాలిలో ఎగురుతూ, అక్కడక్కడ శమీపత్రాలపై కూర్చుంటూ, యముని వద్దకూ, ఆ తరువాత ఆయనతో కలసి, చిత్రగుప్త పురీ చేరుకుంటాడు.

ఆ పురి ఇరవై యోజనాలలో పరుచుకుని వుంటుంది. అక్కడుండే కాయస్థులనే దేవయోని జనితులు, అన్ని రకాల ప్రాణుల పాప-పుణ్యాలనూ పూర్తిగా గ్రహించి వుంటారు. ఇది వరకూ నేను చెప్పినట్లుగానే, యమధర్మరాజు పాపులకొకలాగా కనిపిస్తే, పుణ్యులకు మరొక విధంగా దర్శనమిస్తాడు. దానములు చేసిన వారిని, ఆ యమధర్మరాజే లేచి నిలబడి గౌరవిస్తాడు.” అని గరుడుడికి శ్రీమహావిష్ణువు వివరించాడు. ఈ విషయాలన్నీ తెలుసుకుని, మనుష్యులందరూ సన్మార్గంలో నడుచుకోవాలన్నదే నా ఆకాంక్ష..

సర్వేజనాః సుఖినోభవన్తు! లోకాః సమస్తా సుఖినోభవంతు!

Sunday, July 21, 2024

గురు పౌర్ణమి - శ్రీ వ్యాస పూర్ణిమ / గురు పూర్ణిమ శుభాకాంక్షలు - Guru Paurnami 2024


ఈ రోజే '21 జులై, 2024' గురు పౌర్ణమి.. TELUGU VOICE
అందరికీ శ్రీ వ్యాస పూర్ణిమ / గురు పూర్ణిమ శుభాకాంక్షలు 🙏🏻

శ్రీ వ్యాస స్తుతి..

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్‌ ।
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్‌ ।।
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే ।
నమోవై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ।।

నారాయణుడు, ఆయన నాభి కమలం నుండి జన్మించిన బ్రహ్మ, బ్రహ్మ మానస పుత్రుడు వశిష్ఠుడు, వశిష్ఠుని సంతానమైన శక్తి, శక్తి మహర్షి పుత్రుడు పరాశరుడు, పరాశరాత్మజుడు వ్యాసుడు, ఆయన కొడుకు పరమ భాగవతోత్తముడైన శుకుడు, ఆ పరంపరలో గౌడపాదాచార్యులు, గోవింద యోగి మొదలైన వారు మన గురువులు. ఇది ఆర్ష గురు పరంపర. వీరిలో వ్యాస మహర్షి సాక్షాత్‌ విష్ణు రూపుడే. ఆయనకు నాలుగు ముఖాలు లేవు కానీ, బ్రహ్మ స్వరూపుడే. అటువంటి వ్యాస భగవానునికి నమస్కారం 🙏🏻

పరమపావనమైన ఆషాఢ పూర్ణిమ పర్వదినం ఇది. పూర్ణిమ అనగానే ఆధ్యాత్మిక సాధనకి చాలా యోగ్యమైనది. అందునా ఈ ఆషాఢ పూర్ణిమకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది గురు పూర్ణిమ అని ప్రసిద్ధి. ఇక్కడి నుంచి చాతుర్మాసాలలో వచ్చే పూర్ణిమలు అన్నీ, జ్ఞాన ప్రధానమైనటువంటి పూర్ణిమలు. జ్ఞానము అనగానే, ఆధ్యాత్మ జ్ఞానమే జ్ఞానము. సృష్టిలో విద్యలు ఎన్నైనా ఉండవచ్చు గాక! కానీ, “ఆధ్యాత్మ విద్యా విద్యానాం” అని భగవద్గీతలో చెప్పినట్లుగా, విద్యలన్నింటిలోకీ ఆధ్యాత్మ విద్య చాలా గొప్పది. మిగిలినవన్నీ భౌతికమైన సుఖదుఃఖాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. జీవుడిని తరింప జేసే విద్య, ఆధ్యాత్మ విద్య. అందుకే ఆధ్యాత్మకం ఎవరు బోధిస్తారో, అతనిని సద్గురువుగా భావన చేసి, ఆరాధించాలి. అసలు ఒక్క అక్షరం నేర్పిన వాడినైనా గురువుగా గౌరవించవలసిందే అని, శాస్త్రం మనకి చెబతున్నది. అందుకు విద్యలు, పరా విద్యలు, అపరా విద్యలని రెండు విధములుగా చెప్పబడుతూ ఉంటాయి. అపరా విద్యలంటే, లౌకికమైన విద్యలన్నీ అందులోకి వస్తాయి. పరావిద్య అంటే, బ్రహ్మవిద్య, మోక్షానికి పనికివచ్చే ఆధ్యాత్మ విద్య. ఈ రెండు విద్యలు చెప్పేవాళ్లూ గురువులే. ప్రతి వారినీ గౌరవించాలి. అందునా పరా విద్యను చెప్పిన వారిని భగవంతునితో సమానంగా ఆరాధించుకోవాలి.

అందుకు గురువు ఆరాధనలో..

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ।।

నిజానికి ఈ శ్లోకం భారతీయులందరికీ ఇంచుమించు వచ్చు. అంత ప్రసిద్ధి చెందినది. దీనిని బట్టి గురువును ఎలా భావించాలి అంటే, బ్రహ్మవిష్ణుశివాత్మకమైన పరబ్రహ్మగా భావించి, ఆరాధించాలని దీని యొక్క భావం. అయితే, బ్రహ్మవిష్ణుశివ స్వరూపం గురువులో కనబడుతుంది. అందుకు భారతీయ సంస్కృతి ప్రకారం, సృష్టి స్థితి లయలకు హేతువైన పరమాత్మ ఒకడున్నాడు. ఆయననే పరబ్రహ్మ అంటారు. పరబ్రహ్మ అంటే, అన్నింటికీ అతీతమై, అన్నింటినీ మించిపోయి ఉండే తత్త్వము, పరబ్రహ్మ తత్త్వం. అదే సృష్టి, స్థితి, లయలు చేసేటప్పుడు, బ్రహ్మ విష్ణు శివాత్మకంగా ఉన్నది. కనుక వీరు ముగ్గురూ ఒకే పరబ్రహ్మము యొక్క స్వరూపము. అలాంటి స్వరూపమే గురువు అని భావించాలి. ఇందులో ఉన్న ఆంతర్యం ఏమిటని మనం గమనించినట్లైతే, బ్రహ్మ అనగా సృష్టికర్త. విష్ణువు అనగా స్థితికర్త. రుద్రుడు అంటే లయకర్త, లీనము చేయువాడని అర్థం. అంటే, మరుగు పరచు వాడు, లీనము చేయువాడని. ఏదైనా పని ప్రారంభించడం సృష్టి అనుకుంటే, ఆ పనిని చక్కగా కొనసాగించడం స్థితి అనుకుంటే, దానిని పూర్తి చేసి లయం పొందటం లయం. ఈమూడూ ఒకపనిలో మూడు భాగాలు. ఆ మూడూ ఒకే చైతన్యం వల్ల నడుస్తాయి. కానీ, ఆ పనియొక్క స్థితిని బట్టి, మూడు పేర్లు.

అదేవిధంగా, మామూలు మానవుణ్ణి వివేక వైరాగ్యాలు కలిగించి, జ్ఞానాన్ని ఇచ్చి, ఒక జ్ఞాన శరీరాన్ని సృష్టిస్టారు గురువులు. అప్పుడతడు బ్రహ్మదేవుడు. ఎందుకంటే, మనలో జ్ఞానాన్ని సృష్టించాడతను. ఆ సృష్టించిన వివేకాన్ని, జ్ఞానాన్ని, క్రమంగా మార్గం చూపిస్తూ పెంచి పోషిస్తాడు. ఆ జ్ఞానానికి స్థితి కల్పిస్తాడు. అప్పుడతను విష్ణువు. క్రమంగా ఈ జ్ఞానం ద్వారా ఈ జీవుడిని పరమాత్మలో లయం చేయిస్తాడు. ఆ లయం చేసేటప్పుడు అతడే శివుడయ్యాడు. కనుక జ్ఞానాన్ని పుట్టించి, పెంచి పరమాత్మలో లయం చేసేటటువంటి గురువు, బ్రహ్మ విష్ణు శివాత్మకుడని భావించాలి. ఇది మన శాస్త్రం చెబుతున్నటువంటి గొప్ప భావం. అందుకు ఈ శ్లోకం ప్రసిద్ధి చెందింది. అయితే, అలాంటి బ్రహ్మవిష్ణుశివాత్మకమైన గురు స్వరూపం ఎవరు? అంటే, వ్యాస భగవానుని ఆవిధంగా చూపించారు..

అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః ।
అఫాల లోచనః శంభుః భగవాన్ బాదరాయణః ।।

అని వర్ణించారు. వ్యాస భగవానునికి అసలు పేరు కృష్ణుడు. ఆయన పుట్టినప్పుడు ఆ తల్లి సత్యవతి పెట్టినటు వంటి పేరు కృష్ణుడు. పరాశర మహర్షి తపస్సు చేస్తుండగా, నారాయణుని తేజస్సు ఆయనలో ప్రవేశించి, నారాయణ ప్రేరణ చేత ఒక అప్సర కాంత సత్యవతి అనే స్త్రీగా అవతరించినపుడు, నారాయణుడు అవతరించడానికి తగిన క్షేత్రం అది అని ప్రేరణ గ్రహించి, పరాశర మహర్షి ద్వారా ఆ తేజం ఆ తల్లిలో ప్రవేశింప జేయబడి, అప్పటికప్పుడు సద్యోగర్భంగా, ఒక తపః ఫలంగా ఆవిర్భవించి, ఒక దీవియందు ఉద్భవించాడు, వ్యాస దేవుడు. పుడుతూనే ఒక యోగ్యమైన స్వరూపంతో ఆయన వ్యక్తమయ్యాడు. అందుకు ఆయనకు కృష్ణుడు అని పేరు. ద్వీపమునందు ఉద్భవించాడు కనుక, ద్వైపాయణుడని పేరు. నల్లని కాంతులతో ఉంటాడట ఆయన. మేఘము వలె ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే..

ప్రాంశు పయోద నీల తను భాసితు నుజ్జ్వల దండధారు పిం
గాంశు జటాచ్ఛటాభరణు నాగమ పుంజపదార్థ తత్త్వ ని
స్సంశయ కారు కృష్ణ మృగ చర్మ కృతోత్తర కృత్యు భారతీ
వంశ వివర్ధను త్రిదశ వందితు సాత్యవతేయు గొల్చెదన్ ।।

అంటారు తిక్కన గారు, భారతంలో వ్యాస దేవుడికి నమస్కారం చేస్తూ.. నీల మేఘ ఛాయతో ప్రకాశిస్తూ, తేజోమయమైన రూపంతో, వర్చస్సుతో ఉంటారు వ్యాసుల వారు. అందుకు ఆయన పేరు, శరీర కాంతికి తగ్గట్లుగా, కృష్ణ అని వచ్చింది. ద్వైపాయణుడు అని కూడా పేరున్నది. ఆయన వేదములను వ్యాసం చేసి వ్యాస దేవుడయ్యారు. పైగా ఆయనకు బాదరాయణుడు అని కూడా పేరున్నది. బదరికాశ్రమంలో సాధన చేసి గ్రంథ రచన చేసినందుకు, నిరంతరం బదరికాశ్రమంలో నేటికీ ఉంటారని శాస్త్రంలో ప్రసిద్ధి. ఇప్పటికీ బదరికాశ్రమం దగ్గర వ్యాస గుహ అని ఉంటుంది. అందుకు బాదరాయణుడు అన్న పేరు కూడా ఆయనకు ఉన్నది. వ్యాసుడే మనందరకూ అసలైన గురువు. ఎందుకంటే, ఈ రోజు మనం ఒక సంస్కృతి, సంస్కారం, ఒక ధర్మం, వేదాంతం, విజ్ఞానం, ఉపాసన, ఇవన్నీ మాట్లాడుతున్నాము అంటే, ఇవన్నీ మనకు లభించింది వ్యాసుని ద్వారానే. కావలసినవన్నీ వ్యాసమహర్షి మనకు అమర్చి పెట్టాడు. దానిని సరియైన గురువుల ద్వారా మనం గ్రహించాలి. వ్యాసుడి విజ్ఞానాన్ని మనకు ఎవరు బోధిస్తారో వారిని మనం వ్యాస రూపంతో, గురు రూపంతో ఆరాధించుకుని, వ్యాసునికి నమస్కరించాలి..


శ్రీ గురుభ్యో నమః 🙏🏻

Wednesday, July 17, 2024

ఈ రోజు '17/07/2024' తొలి ఏకాదశి, శయన ఏకాదశి - అందరికీ శుభాకాంక్షలు! Toli Ekadasi


ఈ రోజు '17/07/2024' తొలి ఏకాదశి, శయన ఏకాదశి - అందరికీ శుభాకాంక్షలు! TELUGU VOICE

తొలి ఏకాదశి అంటే ఏమిటి, ఎందుకు చేసుకుంటారు, దీని విశిష్ఠత ఏంటి?

హిందూ సంప్రదాయాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన తొలి ఏకాదశి, పండుగలకు ఆది.  తెలుగు సంవత్సరంలో అన్ని పండగలనూ వెంట పెట్టుకుని వచ్చే తొలి ఏకాదశి విశిష్ఠత ఏంటో తెలుసుకుందాము..

తొలి ఏకాదశి అంటే ఏమిటి?

ఆషాఢ శుద్ధ ఏకాదశిని “తొలి ఏకాద‌శి” అని అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు (ప్రతీ నెల కృష్ణ పక్షంలో ఒకటి, శుక్ల పక్షంలో ఒకటి, మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి). అవి ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఏకాదశి అంటే, పదకొండు అని అర్థం. మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, వీటిని పని చేయించే అంతరేంద్రియం అయిన మనస్సుతో కలిపితే, పదకొండు. ఈ పదకొండూ ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి.

తొలి ఏకాదశి విశిష్ఠత!

ఆషాఢ మాస ఏకాదశినే 'తొలి ఏకాదశి'గా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే “శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి, హరి వాసరం” అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కనుక దీన్ని “శయన ఏకాదశి” అంటారు. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాల పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు, ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు (సూర్యుడు దక్షణం వైపుకు మరలి నట్లు, ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది). అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకుని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు, అంటే, క్షీరాబ్ది ద్వాదశి వరకూ ఆచరించాలని, మన పురాణాలు తెలియజేస్తున్నాయి.

తొలి ఏకాదశి జరుపుకునే విధానం, నియమాలు..

మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వ దినాన వ్రతాన్ని ఆచరిస్తే, సూర్య, చంద్ర గ్రహణాల సమయంలో, భూమి దానమిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని, ఏకాదశీ వ్రత మాహాత్మ్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహా సాధ్వీ అయిన సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించే, మోక్ష సిద్ధి పొందింది.

వ్రతంలోని ప్రధాన నియమాలు..

ఉపవాస ఫలితాలు:

ఈ వ్రతాన్ని ఆచరించ దలచిన వారు, దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.

అసత్యం ఆడకూడదు. స్త్రీ సాంగత్యం నిషిద్ధం. చెడు పనులూ, దుష్ట ఆలోచనలూ చేయకూడదు.

ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాల అనంతరం శ్రీహరిని పూజించి, నైవేద్య తాంబూలాలు సమర్పించి, భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది.

ఏకాదశి వ్రతమాచరించేవారు ఇవి తినకూడదు..

ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరిని నిష్ఠగా పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని, విష్ణుమూర్తి ప్రతిమకు, లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి, పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి, కర్పూర హారతినివ్వాలి.

ఏకాదశి వ్రతమాచరించే వారు, కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు,  మినుములు తీసుకోకూడదు. అదే విధంగా, మంచంపై శయనించడం వంటివి చేయకూడదని, పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గురించి, పద్మ పురాణంలో వివరించబడింది. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవ జాతిని ఉద్ధరించటానికి, సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడనీ, ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించిన వారు, సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ, పద్మ పురాణంలో పేర్కొనబడింది.

ఈ రోజు నుండి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు ‘చాతుర్మాస్య వ్రతం’ అవలంభిస్తారు. శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది, ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి, మర్నాడు పారణ చేసి, ప్రసాదం తీసుకుని, వ్రతం ముగిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగానే, తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదనీ, పైరుకు ఏ రకమైన తెగుళ్ళూ సోకకూడదనీ, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదనీ దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు, మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి, దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. 

తొలి ఏకాదశి రోజున శేషశాయిని పూజిస్తే..

ప్ర‌తినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలూ చేకూరుతాయని పండితులు చెబుతారు. ఈ మాసంలోనే బోనాలు, పశుపూజ, శకట ఆరాధనలూ చేస్తారు.

ప్రాశస్త్యం..

ముఖ్యంగా ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోజనంచేసి, శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే, కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢమాసం, శుక్లపక్ష ఏకాదశి నాడు, విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని, తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి, దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి, తీర్థ ప్రసాదాలను స్వీకరించి, ఆ తర్వాత భోజనం చేస్తే, జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు, మళ్ళీ నాలుగు నెలల తర్వాత, కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని పురాణ విదితం. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే, 'క్షీరాబ్ధి ద్వాదశి' అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి, అందరూ చాతుర్మాస్య దీక్ష చేస్తారు.

అలాగే 'ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి?' అనే విషయాలు తెలుసుకోవాలంటే: [ https://youtu.be/Lcy2ZkxYfYY ]


🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

Monday, July 15, 2024

గ్రహాంతర జీవులు! – ఇది నిజమా? Is there life outside of Earth? Existence of Aliens


గ్రహాంతర జీవులు! – ఇది నిజమా? TELUGU VOICE

ఇతర గ్రహాలలో కూడా మనిషిలాంటి మేధో జీవులున్నారా? అనే ప్రశ్న, సామాన్యుడి నుండి శాస్త్రజ్ఞుల వరకూ, ఒక చిక్కుముడిగా ఉండిపోయింది. చాలా కాలం నుండి ఇతర గ్రహాలకు చెందిన జీవులు, ఎగిరే పళ్ళాలు, లేదా Flying Saucers అనబడే అంతరీక్ష విమానాలలో భూమిపైకి వచ్చి, కొందరిని అపహరించుకుని వెళ్ళినట్లు వార్తలు వింటూ ఉంటాము. ఇతర గ్రహాల నుండి వచ్చే గుర్తు తెలియని ఆకాశ ప్రయాణ సాధనాలనే U.F.O. లు, లేదా Un-Identified Flying Objects గా శాస్త్రజ్ఞులు పేర్కొంటారు.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/R90vO1zWUy0 ]


చాలా దేశాలలో ఈ UFO లను చూసినట్లు, అక్కడి స్థానికులు చెప్పటం మనలో చాలామంది వినే ఉంటారు. కొందరు విజ్ఞానుల అభిప్రాయం ప్రకారం, ఈ UFO లనేవి, Galaxies గా పిలువబడే ఇతర పాలపుంతల నుండి భూమి మీదకు వచ్చిన గ్రహాంతర జీవులనీ, భూమిపైన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందని ప్రాచీన కాలంలోనే, పిరమిడ్ల వంటి భారీ నిర్మాణాలు జరిపించింది, గ్రహాంతర జీవులేననీ, కొందరి నమ్మకం.

ఇందుకు ఒక ఉదాహరణగా, తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం భీమేశ్వర ఆలయాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఆలయంలో, ఆ చుట్టుపక్కల లభించని భారీ పరిమాణంలోని రాళ్ళను ఎక్కడినుంచో తెచ్చి అక్కడ చేర్చి, క్రేన్ లలాంటి పరికరాలు లేని సమయంలో, అంత ఎత్తున పేర్చడం జరిగింది. పురావస్తు శాఖ వారి అభిప్రాయం ప్రకారం, ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయం, ఆరు వేల సంవత్సరాల నాడు కట్టబడింది. మరి ఆనాడు, అంత భారీ శిలలను వాడి, ఆ ఆలయాన్ని ఎలా నిర్మించారు? అన్న ప్రశ్నకు సమాధానంగా, ఇది మానవులకన్నా చాలా ముందుగా సాంకేతిక పరిజ్ఞానం సంపాదించుకున్న గ్రహాంతర వాసుల వల్ల సాధ్యపడి ఉండొచ్చు. అందువల్లనే, ఈ ఆలయాన్ని దేవతలు నిర్మించారని అంటారు.

1979-80 వ సం॥ల మధ్య, ఆంధ్రదేశంలో ఒక రోజు సాయంకాలం, ఆకాశంలో రంగు రంగుల వృత్తాలు ఏర్పడ్డాయి. అవి చాలా భారీ పరిమాణంలో ఆకాశంలో కనిపిస్తూ, మళ్ళీ మాయమవటం జరిగిందనే విషయం చాలామందికి తెలుసు. తర్వాత ఈ ఆకాశ వృత్తాలన్నీ వార్తా పత్రికలలోనూ ప్రచురించ బడ్డాయి. అవి శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగ కేంద్రం చేసిన ప్రయోగాల వలన వచ్చాయని ప్రచారం జరిగింది. గ్రహాంతర జీవుల అంతరీక్ష నౌకల తాలూకు కాంతి పుంజాలు ఆ నాడు ఆకాశంలో కనిపించాయన్న విషయాన్ని, ఉద్దేశ్య పూర్వకంగా ప్రభుత్వమే తొక్కిపెట్టి, ఏవో కబుర్లు చెప్పిందని కొందరు విజ్ఞానులు అభ్యంతరం వ్యక్తపరిచారు.

రాకెట్‌ ప్రయోగం జరిగితే, ఒక సరళ రేఖ ఆకారంలో, పొగ ఆకాశంలో ఏర్పడుతుందని అందరికీ తెలుసు. కానీ, వృత్తాల రూపంలో కొన్ని వందల మైళ్ళ వరకూ విస్తరించిన ఆ రంగుల వలయాలు, UFO లు కాదా? ఎందుకని ప్రభుత్వం ఇలా వాస్తవాలను దాచింది? ప్రజలు భయాందోళనకు గురికాకుండా ఉండటానికి, అతీంద్రియ మరియు అంతరీక్ష శక్తుల ఉనికిని కొట్టిపారేసి, రహస్యంగా ఆ అంశాలపై ప్రయోగాలు చెయ్యటం, ప్రభుత్వ బాధ్యత కావడం వలన అలా చేసిందని అనుకోవాలి!

1947లో తొలిసారిగా, Arnold అనే వ్యాపార వేత్త తన సొంత విమానంలో వాషింగ్టన్‌ గగన వీధుల్లో విహరిస్తుండగా, అతనికి ఒక డిస్క్‌ అంటే సాసర్‌ ఆకారంలో ఆకాశంలో ఎగురుతున్న గుర్తుతెలియని ఆకారాలు కనిపించాయి. ఆ UFO లు, గంటకి 1800 కి.మీల వేగంతో ప్రయాణించాయని, అతడు తెలిపాడు. “ఆర్నాల్డ్‌” అనుభవాలు అమెరికా వార్తా పత్రికల్లో Headlines లో వచ్చాయి. తర్వాత చాలా మంది, గ్రహాంతర వాసులను చూశామని చెప్పిన విషయాలు, దేశం నాలుగు మూలల నుండీ వార్తా కథనాలు వెలువడ్డాయి. గ్రహాంతర వాసులు పారదర్శక దుస్తులు ధరించారనీ, 8 అడుగుల ఎత్తు వరకూ ఉన్నారనీ కొందరు చెప్పారు. ముగ్గురు గ్రహాంతర వాసులను అమెరికా ప్రభుత్వం అరెస్ట్ చేసిందని, ఆ నాడు వార్తలు వెలువడ్డాయి. మరి వారిని అమెరికా, బాహ్య ప్రపంచానికి తెలియకుండా, అత్యంత భద్రత నడుమ ఉంచిన తమ ‘Area 51’ అనే రహస్య ప్రదేశంలో ఉంచి ప్రయోగాలు చేస్తోందా? ఇందులో నిజానిజాలు ఎంతవరకూ అనేది, ఇంకా తేలాల్సి ఉంది.

UFO లు కనిపించాయన్న వార్తలు పెరిగి పోవటంతో, అమెరికా వాయుసేన విభాగం ఇందులో నిజానిజాలు తేల్చటానికి, ఒక Astrophysics Professor అధ్యక్షతలో, మరో నలుగురు వైమానిక రంగ నిపుణులు సభ్యులుగా, ఒక కమీషన్‌ ని ఏర్పాటు చేసింది. ఈ ఆపరేషన్‌ కి “ప్రాజెక్ట్‌ బ్లూ బుక్‌” అనే పేరు పెట్టింది. దాదాపు 20 సం॥లు UFO ల ఉనికిపై ప్రయోగాలు జరిగాయి. కానీ, ఏమీ తేలలేదు. అయితే, ఆ కమీషన్‌ అధిపతి సిఫార్స్‌ పై, ప్రభుత్వం ఇల్లినాయిస్‌ రాష్ట్రంలో, “Evanston” అనే ప్రాంతంలో, UFO అధ్యయన కేంద్రం ఏర్పరచింది. అంటే, గ్రహాంతర జీవులున్నాయని, ఆ శాస్త్రజ్ఞులు భావించారు. కనుకనే, 20 సం॥ల పరిశోధన తర్వాత, UFO అధ్యయన కేంద్రం ఏర్పాటుకు సిఫార్సు చేశారు.

1970 లో “ఇధియోపియా” అనే దేశంలో ఎగిరే పళ్ళాలు దర్శనమిచ్చాయి. అందులో ఒక UFO, ఎర్రటి అగ్నిగోళంలా ఉంది. అది ఆ ప్రాంతంలోని నివాసాలపైన ఆకాశంలో, బాగా క్రిందగా, గాలిలో చెక్కర్లు కొట్టింది. హెలికాఫ్టర్‌ ఎగిరేటప్పుడు వచ్చే భీకర శబ్దం, ఈ UFO ఎగురుతున్నప్పుడు వచ్చిందని, ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆ అంతరీక్ష నౌక చేసిన విన్యాసాల వేగానికి, ఆ ప్రాంతంలోని భారీ వృక్షాలు కూలి పోయి, వంతెనలు విరిగి పోయాయి. అయితే, ఆ సమయంలో ప్రాణాంతక వ్యాధులైన కాన్సర్‌, క్షయలాంటి వ్యాధులతో బాధ పడుతున్న కొందరికి, ఆ వ్యాధి నివారణ జరిగింది. UFO నుండి వెలువడిన గుర్తు తెలియని కిరణాల వల్ల, ఆ రోగులకు స్వస్థత చేకూరి ఉండ వచ్చని, దాక్టర్లు భావించారు. ఈ మధ్య గ్రహాంతర జీవులు ఒక నిండు గర్భిణీ స్రీ ని అపహరించాయన్న వదంతి, జపాన్‌ దేశంలో ప్రబలింది. ఇందులో నిజానిజాలు తేలాల్సి ఉంది.

1978 లో, ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఒక మానసిక శాస్త్రవేత్త ఆధ్వర్యంలో, నలుగురు సభ్యుల కమిటీని, UFO ల పరిశోధనకు ఏర్పాటుజేసింది. ఆ కమిటీ సభ్యులు, UFO లను చూశామన్న 12 మంది వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేశారు. అయితే, వాళ్ళెవరూ UFO ల గురించి స్పష్టంగా వివరించ లేక పోయారు. ఇంకో ఆసక్తికరమైన సంఘటన, 1979 వ సంవత్సరంలో, అమెరికాలో జరిగింది. “ఆల్బర్ట్‌ బెండర్‌” అనే వ్యక్తి, అమెరికాలోని కనెక్టికట్‌ ప్రాంతంలో, "అంతర్జాతీయ ఫ్లయింగ్‌ సాసర్‌ బ్యూరో” అనే సంస్థను స్థాపించాడు. ఆయన "స్పేస్‌ రివ్యూ” అనే పత్రికను కూడా స్థాపించి, UFO ల గురించి తనకు తెలిసిన విషయాలను ఎప్పటికప్పుడు, ఆ పత్రికలో ప్రచురిస్తూ వచ్చాడు.

అయితే, అతడు తన పరిశోధనలు ప్రారంభించిన నాలుగు నెలలకు, ముగ్గురు గ్రహాంతర వాసులు అతడి దగ్గరకు వచ్చి, UFOల గురించిన అతని పరిశోధనలను వెంటనే ఆపేయాలని తీవ్రంగా హెచ్చరించారు. వారు పారదర్శక ముసుగులను ధరించి ఉండటంతో, వాళ్ళ ముఖాలను గుర్తు పట్టలేక పోయాడని తెలుస్తోంది. ఏది ఏమైనా, “ఆల్బర్ట్‌” గ్రహాంతర వాసుల బెదిరింపులకు భయపడి, తన ప్రయోగాలను హఠాత్తుగా, అర్ధాంతరంగా నిలిపివేశాడు. మరి మనుషులు గ్రహాంతర జీవులపై పరిశోధనలు చేసి, వారి రహస్యాలను తెలుసుకోకుండా అడ్డుకోవడం వెనుక అసలు కారణం ఏమిటి? గ్రహాంతర జీవుల ఉనికి రహస్యంగా ఉంచడంలోని మర్మం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం, ఆ గ్రహాంతర వాసులకే తెలియాలి!

UFO లు కనిపించిన తర్వాతే, ఈ అంతరీక్ష జీవులు మానవులకు కనిపించటం జరుగుతోంది. అంటే, ఎగిరే పళ్ళాలవంటి అంతరిక్ష విమానాలలో ప్రయాణించి,  గ్రహాంతర జీవులు భూమిపైకి వస్తున్నారని భావించటం వాస్తవం. కొందరి వాదన ప్రకారం, గ్రహాంతర వాసులు కుజ గ్రహ నివాసులనీ, ఆ గ్రహంలో భయంకర అణుయుద్దాలు జరిగి, అక్కడి వాతావరణం పూర్తిగా దెబ్బతిన్నదనీ, అందుకే నివాస యోగ్యంగా ఉండే మరో గ్రహం కోసం అన్వేషణలో భాగంగా, ఆ గ్రహాంతర వాసులు భూమిపైకి కూడా వస్తున్నారనీ తెలుస్తోంది.

21 ఆగస్టు, 2007 న, కెనడాలోని Alberta లో, ఒక ఇంటి గోడలపై గ్రహాంతర జీవుల చిత్రాలు ముద్రించ బడ్డాయి. ఒక గోడపై ఇద్దరు అంతరిక్ష వాసుల తలలు కనిపించాయి. ఆ గ్రహాంతర జీవుల ముఖాలపై రెండు కళ్ళున్నాయి. తలపైన Antenna ల వంటి పరికరాలున్నాయి. ఆ చిత్రాలను వేలాది మంది చూశారు. ఆ చిత్రాలు అంతర్జాతీయ పత్రికలలో కూడా వచ్చాయి. తమ చిత్రాలను గ్రహాంతర జీవులే ఆ ప్రదేశంలో చిత్రించారా? అలా ఎందుకు చేశారు? అన్నది ఈ నాటికీ సమాధానం లభించని ప్రశ్నగానే మిగిలి పోయింది.

ఇక దేవుడున్నాడా? పునర్జన్మలు నిజంగా ఉన్నాయా? అతీత శక్తులు వాస్తవమేనా? లాంటి ప్రశ్నలు, బుద్ధి జీవులైన మానవులను చాలా కాలంగా వేధిస్తున్నాయి. ఈ పురాతన కాల ప్రశ్నలకు తోడుగా, ఇంకో ప్రశ్న నాగరిక మానవులను తీవ్రంగా కలవర పెడుతూ వుంది. అదే, గహాంతర జీవులు నిజంగా ఉన్నాయా..?

[ దేవుడున్నాడా? - https://youtu.be/kQTqwv8rNck ]


ఆక్సిజన్‌, నీరు ఉన్న చోటనే, ప్రాణులు జీవించగలవు. ఈ అంశాలు భూ గ్రహంపై సమృద్ధిగా ఉండటం వల్లనే, భూమిపై అనేక రకాల జీవజాలం మనుగడ సాగిస్తోంది. మరి కార్బన్ డయాక్సయిడ్ అధికంగా ఉండే గ్రహాలలో జీవరాశి ఉండే అవకాశముందా? అనే ప్రశ్నకు, కొందరు శాస్త్రవేత్తలు చెప్పే సమాధానం.. మనుషులు, జంతువులు ఆక్సిజన్‌ పీల్చి కార్బన్‌ డయాక్సయిడ్ ను బయటికి వదిలితే, ఆ వాయువును వృక్షాలు పీల్చుకుని, ఆక్సిజన్‌ ను విడుదల చేస్తాయి. దేవుడు చేసిన అత్యంత సంక్లిష్టమైన ఏర్పాటు ఇది. సకల జీవరాశీ చెట్లపైన ఆధార పడుతుంది. ఇక్కడ కార్బన్‌ డయాక్సయిడ్ ను పీల్చుకుని జీవించే వృక్షాలలాగానే, గ్రహాంతర జీవులు తమ గ్రహాలలోని కార్బన్‌ డయాక్సయిడ్ ని పీల్చుకుని జీవించే అవకాశం లేకపోలేదు.. ఆయితే, చాలా మంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, భూమిని మినహాయించి, మన సౌరకుటుంబంలోని ఏ గ్రహంలోనూ, జీవులుండే ఆస్కారం లేదని తేల్చి చెబుతున్నారు. కానీ, కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, మనిషి నేటి వరకూ కనీసం సౌరకుటుంబంలో ఉన్న సూర్యుడి దాకా కూడా వెళ్ళ లేక పోయాడు. అలాంటిది, ఈ అనంత విశ్వంలో ఉన్న కోటానుకోట్ల గ్రహాలలో, జీవులు లేరని ఏ ఆధారాలతో చెప్ప గలం?

ఇటీవలి కాలంలో ఎలక్ట్రానిక్‌ మీడియా చాలా అభివృద్ధి చెందింది. అనేక టీ.వి. ఛానెల్స్‌, Social Media మాద్యమాలూ ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా, క్షణాలలో వీడియోతో సహా, ప్రపంచం మొత్తం ప్రదర్శించ గల పరిజ్ఞానం ఏర్పడింది. కనుకనే, గ్రహాంతర జీవుల వివరాలూ, అప్పుడప్పుడూ కనిపించే గ్రహాంతర జీవుల అంతరీక్ష నౌకల ఫొటోలూ, ప్రపంచమంతటా అందించ బడుతున్నాయి. 'నిప్పు లేనిదే పొగ రాదు' అని ఒక సామెత ఉంది. ఏ ఆధారాలూ లేకుండా, గ్రహాంతర జీవులు లేరనీ, అవన్నీ ఎవరో పని లేని వారి కల్పనలనీ, కొందరు ఎందుకు వాదిస్తున్నారు?

నిజంగా గ్రహాంతర వాసులు ఉన్నారా? UFO లు గా పిలువబడుతున్న గ్రహాంతర వాసుల అంతరీక్ష వాహనాలు, చాలా మందికి, చాలా దేశాలలో కనిపించిన మాట నిజమేనా? ఏ కారణాలతో పాశ్చాత్య ప్రభుత్వాలు గ్రహాంతర జీవుల సమాచారాన్ని ఉద్దేశ్య పూర్వకంగా తొక్కి పెడుతున్నాయి? గ్రహాంతర జీవులతో సంబంధాలు పెట్టుకునీ, వారికున్న అపార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునీ, ప్రపంచాన్ని శాసించాలని నాడు అడాల్ఫ్ హిట్లర్‌ వంటి వారూ, అమెరికా వంటి దేశాలూ ప్రయత్నించిన మాట వాస్తమేనా? కొన్ని నిజాలు కాలమే నిరూపించాలి. ఇలాంటి కొన్ని అసాధారణ ప్రశ్నలకు సమాధానంగా, మనం ఇది వరకు చేసిన "తిరుమల శిలాతోరణం మరో గ్రహానికి వెళ్లే ద్వారమా?" అనే వీడియోను తప్పక చూసి, మీ అభిప్రాయాలను comment చేస్తారని ఆశిస్తున్నాను. ఆ వీడియో లింక్, క్రింద పొందు పరుస్తున్నాను.

[ శిలాతోరణం మరో గ్రహానికి వెళ్లే ద్వారమా? - https://youtu.be/Hi4qJn2xAoA]


🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

Antique Art by Legendary Artist Late Sri. BG Sharma

Saturday, July 6, 2024

ఆశ - Desire


ఆశ - Desire TELUGU VOICE

శ్లోకం :

ఆశాయాః యే దాసాః తే దాసాః సర్వలోకస్య ।
ఆశా యేషాం దాసీ తేషాం దాసాయతే లోకః ॥

యే ఆశాయాః దాసాః తే సర్వలోకస్య దాసాః (భవన్తి)।
యేషాం ఆశా దాసీ, లోకః తేషాం దాసాయతే ॥

భావం:

ఆశకి ఎవరైతే దాసులో, వారు సమస్త లోకానికీ దాసులు. ఆశ ఎవరికైతే దాసురాలో, అటువంటి వారికి సమస్త లోకమూ దాసత్వం చేస్తుంది.

Those who are the slaves of ‘desire’ are slaves of the entire world. But world itself is the slave of those, to whom ‘desire’ is a slave.

ఆశ మనిషికి సహజం. అదే ఆశ మితిమీరితే, అత్యాశ లేక దురాశ అవుతుంది. స్థూలంగా దీనినే ఆశ అంటూ ఉంటారు.  ఈ ఆశే, మనిషిని తన బానిసను చేసుకుంటుంది. ధన వ్యామోహము ఒక ఆశ. విపరీతమైన ధన వ్యామోహము, లేదా దానిమీద విపరీతమైన కోరిక లేక మమకారం, అనేకమైన విపరీతాలకు దారి తీస్తుంది. విపరీత ధనకాంక్షతో మనిషి ఉచ్ఛనీచాలు కూడా మరచిపోయి, ఎంతటి ఘాతుకానికైనా ఒడిగడతాడు. మద్యపానమూ, జూదమూ, వ్యభిచారమూ, చౌర్యమూ, మాదక ద్రవ్య సేవనమూ, హత్యలూ, మాన భంగాలూ, ఇవన్నీ తీవ్రమైన కోరికల పర్యవసానములు. అవే వ్యసనాలుగా పరిణమిస్తాయి. ఇటువంటి కోరికలకు ఎవరైతే దాసులో, వారు ప్రపంచానికే దాసులు. వారి ప్రవర్తనను సమాజం ఏవగించుకుంటుంది. వారు ప్రపంచంలోని ప్రతి వ్యక్తికీ చులకనై పోతారు. వారిని ఎవరూ గౌరవించరు, ఎవరూ లక్ష్య పెట్టరు. చివరకు సమాజ విద్రోహకులుగా ముద్ర వేయబడి, తీవ్రమైన శిక్షా పాత్రులవుతారు.

అటువంటి 'కోరిక' ఎవరికైతే దాసీయో, వారికి ప్రపంచమే దాసోహం అంటుంది. అనగా, కోరికలను అదుపులో ఉంచుకుని వాటిని అధిగమించిన వారు, ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకుని, జీవితంలో అనేక విజయాలు సాధించగలుగుతారు. సమాజ శ్రేయస్సుకై పాటుపడతారు. అటువంటి వారికి ప్రపంచమంతా దాసోహం అంటుంది, వేనోళ్ళ కొనియాడుతుంది, ప్రశంసిస్తుంది. వారు చిరస్మరణీయులవుతారు. సత్సమాజ నిర్మాణానికై, సమాజ అభివృద్ధికై, ఇటువంటి వారు ఎంతైనా అవసరం.


🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

Friday, July 5, 2024

షడగోప్యము (శఠగోపనం) - Shada-Gopyam

 

షడగోప్యము (శఠగోపనం) TELUGU VOICE

అసలు దేవాలయంలో ఈ షడగోప్యమును తల మీద ఎందుకు పెట్టించుకోవాలి? దాని వలన కలిగే ఫలితం ఏంటి?

దేవాలయంలో దర్శనం అయ్యాక తప్పక షడగోప్యము పెట్టించుకుని, తీర్థము తీసుకోవాలి. ఈ రొజుల్లో చాలామంది ఆలయాలకు వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక, వచ్చిన పనైపొయిందని గబగబా వెళ్ళి ఏదో ఒక ప్రదేశం చూసుకుని కూర్చుంటారు. బహుకొద్ధి మంది మాత్రమే ఆగి షడగోప్యం పెట్టించుకుంటారు.

అసలు షడగోప్యము అంటే అత్యంత గోప్యము, గోప్యము అంటే, రహస్యము అని అర్థం.. అంటే, దానిని తల మీద పెట్టే పూజారికీ, లేదా అర్చకుడికి కూడా వినిపించని విధంగా కోరికను మనస్సులోనే తలచుకోవాలి. అంటే, మీ కోరికే షడగోప్యము. మానవునికి శత్రువులైన కామమూ,  క్రోధమూ,  లోభమూ, మోహమూ, మద - మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటానని అనుకుంటూ, తలవంచి తీసుకొవటము మరో అర్ధము. పూజారి చేత షడగోప్యము పెట్టించుకోండి. చక్కగా మీ మనస్సులోని కోరికను స్మరించుకోండి.

షడగోప్యమును రాగి, కంచు, లేదా వెండితో తయారు చేస్తారు. షడగోప్యము పైన దేవతా పాదములు ఉంటాయి. షడగోప్యమును తల మీద ఉంచినపుడు, మన శరీరంలో ఉన్న విద్యుత్తు, దాని యొక్క సహజత్వం ప్రకారం, శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధికమైన విద్యుత్తు బయటికి పంపివేయబడి, శరీరంలో అందోళనా, ఆవేశమూ తగ్గుతాయి. ఈ షడగోప్యమునే, శఠగోపము, శఠగోపనము, శఠగోపం, శఠారి అని కూడా అంటారు.

మన 'సనాతన ధర్మం'లో చెప్పబడిన ప్రతి విషయం శాస్త్రీయమే - ఏదీ మూఢ నమ్మకం కాదు 🚩 శ్రీ మాత్రే నమః 🙏

Monday, July 1, 2024

The purpose of human life | మనిషి జన్మ?


మానవ జన్మ? TELUGU VOICE
కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం.. మధ్యన ఉన్న రెప్పపాటు కాలమే ఈ జీవితం!

పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ।
ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే ।।

మరల మరల జన్మిస్తూ, మరల మరల మరణిస్తూ, తిరిగి తల్లి గర్భంలో శయనిస్తూ, ఈ సంసారజంఝాటం దాటలేక, నానా బాధలకూ గురౌతున్న నన్ను ఓ మురారీ! కృపతో తరింపజేయి తండ్రీ.. ఒక జీవితం ముగిసిన తరువాత, మళ్ళీ పుట్టడమే ‘జన్మ’. అలా పుట్టే జీవికి మళ్ళీ మానవ జన్మే లభిస్తుందనేది మాత్రం, ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేని విషయం. ఎందుకంటే, మళ్ళీ మనం పొందే జన్మ, గడిచిన జన్మలో మనం సంపాదించుకున్న జ్ఞానం, కర్మల మీద ఆధారపడి వుంటుంది. అన్ని జన్మలలోనూ మానవ జన్మ ఉత్తమోత్తమమైనది, అత్యంత దుర్లభమైనది. మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలను చేస్తూవుంటాడు. చేసిన కర్మలకు ఫలితాలను తప్పనిసరిగా అనుభవించి తీరాలి. వాటినే కర్మ ఫలాలంటారు. అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు, జీవుడితో పాటుగా ప్రయాణిస్తూ ఉంటాయి.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/dNWbKKQMSjo ]


అన్ని పుణ్య కర్మల ఫలాలూ పక్వానికి వచ్చినపుడు, ఆ జీవుడు దేవలోకాలలో, దేవతా జన్మనెత్తుతాడు. అక్కడ ఆ కర్మఫలాల కారణంగా, అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగ భూమిగనుక, అక్కడ అతడికి ఏ కర్మలూ చేసే అధికారం ఉండదు. అందువల్ల, పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలను ఆచరించే అవకాశమూ ఉండదు. తన కర్మఫలానుసారం భోగాలననుభావించాక, ఆ కర్మ ఫలాలు క్షయం కాగానే, ‘క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి’ అన్నట్లుగా, తిరిగి మర్త్య లోకమైన ఈ మానవ లోకాన్ని చేరవలసిందే. మరల మరల మానవ జన్మనో, జంతు జన్మనో ఎత్తవలసిందే. దేవ జన్మలో కేవలం మనోబుద్ధులుంటాయేగానీ, కర్మలు చేయటానికి సాధనమైన స్థూల శరీరం వుండదు. కనుక దేవజన్మ భగవత్సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మకాదు.

ఇక పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినపుడు, ఆ జీవుడు జంతువులూ, పశుపక్ష్యాదులూ, క్రిమికీటకాదులూ మొదలైన జీవులుగా, నీచయోనులలో జన్మించాల్సివుంటుంది. ఆ జన్మలలో, తన పూర్వార్జిత కర్మఫలాల కారణంగా, అనేక బాధలూ, దుఃఖాలూ అనుభవించి, హింసింపబడతాడు. ఆ జన్మలలో అవి కర్మలు చేస్తున్నా, అవన్నీ బుద్ధిపరంగా కాకుండా, కేవలం ప్రకృతి ప్రేరణతో, పరతంత్రంగా చేస్తాయి. జంతు జన్మలలో శరీరం, మనస్సూ ఉంటాయిగానీ, బుద్ధి మాత్రం ఉండదు. కనుక ఆ జన్మలలో కూడా, కేవలం కర్మఫలాలు అనుభవించడమే గానీ, పరమాత్మను అందుకోవడానికి తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం ఉండదు. అందుకే, భగవత్సాక్షాత్కారానికి జంతు జన్మ కూడా ఉపయోగ పడదు.

ఇక పుణ్య, పాప కర్మల ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినపుడు, ఆ జీవుడు మానవ జన్మ ఎత్తడం జరుగుతుంది. ఈ మనవ జన్మలో, పుణ్య కర్మల ఫలంగా సుఖాలనూ, పాప కర్మల ఫలంగా దుఖాలనూ అనుభవిస్తాడు. అయితే, ఇలా కర్మఫలాలను అనుభవించటం మాత్రమేగాక, కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా, ఈ మనవ జన్మలో మాత్రమే వుంటుంది. ఎందుకంటే, స్వతంత్రంగా బుద్ధి అనే సాధనం ఉన్న జన్మ ఇది. కనుక పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారమూ, జ్ఞానమూ పొందే అవకాశం ఉన్న మనవ జన్మ, ఉత్తమోత్తమమైనదీ, మరియు దుర్లభమైనదని అంటారు. 84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తరువాత లభించే అపురూప జన్మ కావడంచేత ఈ మనవ జన్మను, ‘జంతూనాం నర జన్మ దుర్లభం’ అని శంకరాచార్యులవారు, “వివేక చూడామణి” అనే గ్రంధంలో తెలియజేశారు. ఇటువంటి అపురూపమైన, ఉత్తమమైన, మరియు దుర్లభమైన మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరూ, దీనిని సార్ధకం చేసుకునే ప్రయత్నం చేయాలి.

ఇక జన్మల విషయం పక్కనబెడితే, మనం ఈ విధంగా మళ్ళీ మళ్ళీ ఎందుకు పుట్టవలసి వస్తోంది? పుట్టిన మన జన్మ లక్ష్యం ఏమిటి..? అనే విషయానికి వస్తే, జంతు జన్మలు పొందిన జీవుల లక్ష్యం అయితే ఒకటే.. అవి మానవ జన్మ పొందడానికి, కర్మలను ఆచరిస్తూ వుంటాయి. మరి మనిషిగా పుట్టిన మనం ఏం చేస్తున్నాము? మన లక్ష్యం ఏమిటి? అంటే, మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరూ దీనిని సార్ధకం చేసుకోవాలి. అలా సార్ధకం చేసుకోవడానికి ఏం చేయాలనేది మనం తెలుసుకోవాలి.

మానవుడు ఏ దు:ఖమూలేని నిత్యమైన ఆనందం మాత్రమే కోరుకుంటాడు. కానీ, లభిస్తున్నది మాత్రం దుఃఖాలతో, క్లేశాలతో కూడిన అనిత్యమైన ఆనందం. దాని కారణంగానే, అసంతృప్తి, అశాంతి, ఆవేదన, అలజడి రూపుదిద్దుకుంటుంటాయి. ఎందుకిలా జరుగుతోంది? బాగా చదువుకుని మంచి ఉద్యోగాలో, పెద్ద పెద్ద పదవులో చేపట్టి, బాగా సంపాదించి, భార్యబిడ్డలతో అనేక భోగాలను అనుభవించాలనేది, మానవ సహజ ఆలోచనా సరళి. అయితే, ఎన్ని సుఖాలూ, భోగాలూ అనుభవించినా, మనస్సుకు ఎదో ఒక వెలితి మిగిలే వుంటుంది. దీనికి కారణం, మనం అనుభవించేవి ఏవీ, నిత్యమైన, పరిపూర్ణమైన సుఖాలు కాదు. ఇవన్నీ అనిత్యమైన వస్తువుల ద్వారా వచ్చే తాత్కాలిక సుఖాలు. నిత్యమైన, పరిపూర్ణమైన, శాశ్వతమైన సుఖం కావాలంటే, అది నిత్య శాశ్వత వస్తువు ద్వారానే లభిస్తుంది. ఏమిటా నిత్యమైనటువంటి వస్తువు? “నిత్య వస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం” – నిత్యమైన వస్తువు ఏకమైన బ్రహ్మమే. అదే పరమాత్మ. పరమాత్మ కన్నా వేరైనవన్నీ, అనిత్యాలే అని ‘తత్త్వబోధ’లో తెలియజేశారు, శ్రీశంకరభగవత్పాదులవారు. అంటే, నిత్యమైన వస్తువు, ఏకమైన పరమాత్మ మాత్రమే గానీ, దానికి వేరుగా ఉన్నవన్నీ అనిత్యాలే. కనుక నిత్యమైన పరమాత్మతో ఐక్యత వలన లభించే సుఖం, ఆనందం అందుకునే వరకూ, మానవుడికి తృప్తి ఉండదు, అసంతృప్తి తీరదు. అటువంటి శాస్వతానందాన్ని అందుకోవడమే, జన్మ సార్ధకత. ఆ శాస్వతానందాన్నే మోక్షం,  ముక్తి అని కూడా అంటారు.

ఈ సృష్టిలో వున్న ప్రతి జీవీ భగవంతుడిలో ఐక్యమవ్వాలంటే, ఇక్కడ చేసిన అన్ని కర్మలనూ సంపూర్ణంగా నిర్మూలించుకోవాలి. అంటే, ఆత్మ స్వరూపుడవైన నీవు, వీటన్నిటినుండీ విముక్తిని పొందాలి. ఈ విధంగా విముక్తిని పొందటాన్నే, ముక్తి అని కూడా అంటారు. దానికి సరియైన జన్మ, ఒక్క మానవ జన్మ మాత్రమే. ముందు చెప్పుకున్న విధంగా, ఇక యే ఇతర జన్మలలోనూ సాధ్యం కాదు. మానవ జన్మలో మనిషికి దేవుడు ప్రసాదించిన బుద్ధి ద్వారా, శాశ్వతమైన, నిత్యమైన, సత్యమైన దానిని గ్రహించి, మనం ఈ లోకంలోకి ఎందుకు వచ్చామో తెలుసుకుని, మనస్సునూ, బుద్దినీ అదుపులో వుంచుకుని, పరమాత్మ తత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకుని, ఆత్మానాత్మ వివేకాన్ని గ్రహించడమే జ్ఞానం. ఎప్పుడైతే నీలో దేవుడి గురించి తెలుసుకోవాలనే తపన మొదలవుతుందో, అప్పుడా దేవుడే నీకు మార్గాన్ని సుగమం చేయవచ్చు, లేదా అందుకు తోడ్పడే సద్గురువుకై మన అన్వేషణకి సహకరించవచ్చు.

అలా కాకుండా మనం అజ్ఞానంలో వుంటూ కర్మలను ఆచరిస్తూ, అన్నీ దుష్కర్మలే చేస్తే, ఖచ్చితంగా తరువాతి జన్మ, మానవ జన్మ పొందడం సాధ్యపడదు. అన్నీ చెడ్డ పనులే చేస్తే, గరుడ పురాణంలో చెప్పబడినట్టు, ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి, నరకంలో వాటి ఫలితాలను అనుభవించి, మళ్ళీ ఈ కర్మ భూమిలో, నీ జ్ఞాన సముపార్జన ఆధారంగా, నీకు ఎదో ఒక జన్మ లభిస్తుంది. మరి సత్కర్మలు ఆచరిస్తే మానవ జన్మ వస్తుందా? అంటే, 99% అవకాశాలున్నాయి. సత్కర్మలు చేస్తే, ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి, వాటి ఫలితాలను స్వర్గంలో అనుభవించి, మళ్ళీ ఈ కర్మ భూమిలో నీ జ్ఞాన సముపార్జన ఆధారంగా నీకు జన్మ లభిస్తుంది. నీవు సత్కర్మలు ఆచరించి, కొద్దోగొప్పో దేవుడి గురించి తెలుసుకుని వుంటే, నీవు మంచి యోగుల కుటుంబంలో జన్మిస్తావు. ఈ విషయాన్ని భగవద్గీతలోని ధ్యాన యోగంలో, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఇలా చెప్పాడు.. ఓ అర్జునా! ఎవరయితే నా జ్ఞానాన్ని గ్రహించి, కర్మ, జ్ఞాన, ధ్యాన యోగాలను అవలంభించి ఉంటారో, వారికి ఒకవేళ ఇంకా ఏవైనా కర్మలు మిగిలి వుంటే, ఖచ్చితంగా మంచి జన్మ, అదీ ఉన్నతమైన కుటుంబంలో లభిస్తుంది. ఇందులో ఎంత మాత్రమూ సందేహం లేదని, శ్రీ కృష్ణుడు వివరించాడు.

కాబట్టి, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం.. మధ్యన ఉన్న రెప్ప పాటు కాలమే ఈ జీవితమనే సత్యాన్ని గ్రహించాలి. కానీ మనం చేస్తున్నది? మంచితనాన్నీ, మానవత్వాన్నీ, దాతృత్వాన్నీ, ఆధ్యాత్మిక దృష్టినీ విస్మరించి, కేవలం స్వార్ధమే పరమావధిగా, అరిషడ్వర్గాలలో చిక్కుకుపోయి, విషయలోలురై, పాపపంకిలమైన జీవితం గడిపేస్తున్నాము. ఆ పరిస్థితిని అధిగమించి, జీవితం అంతా వట్టి భ్రమ, మాయా నాటకం అన్న పరమ సత్యాన్ని తెలుసుకుంటే, మానవ జన్మ తరించినట్లే.. ఆ పరబ్రహ్మమును చేరుకునే మార్గం గోచరించినట్లే..

కృష్ణం వందే జగద్గురుం!

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...