Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Monday, July 31, 2023

Effects of bad company | సహవాస దోషం! | MPlanetLeaf


అంతటి మహాభక్తుడిని భోళాశంకరుడు ఎందుకు శపించాడు?
గాయత్రీ మంత్ర సహిత “ఔశన స్మృతి” ని ప్రపంచానికి అందించిన వాడు చెడ్డవాడా?

తెలివితేటలలో దేవగురువు బృహస్పతి ఎంతటివాడో, శుక్రాచార్యుడు కూడా అంతటి వాడు. దేవతలు బృహస్పతిని గురువుగా ఉండమని అడిగినప్పుడు బృహస్పతి, “నా కన్నా శుక్రాచార్యుడు సమర్ధుడు. ఆయనను అడగండి” అని చెప్పాడు. కానీ, దేవతలు బృహస్పతిని గురువుగా ఎంచుకున్నారు. బృహస్పతి మీదా, దేవతల మీదా కోపంతో శుక్రాచార్యుడు, రాక్షసులకు గురువుగా మారాడు. ఆ నాటి నుంచీ దేవ దానవుల సంగ్రామాలలో, దానవులకు అన్ని విధాలుగా సహకరించి, వారి విజయాలకు తోడ్పడే వాడు శుక్రాచార్యుడు. శుక్రాచార్యునికి తెలియని విద్య లేదు, రాని యుద్ధ తంత్రం లేదు. మహర్షి కుమారుడైన ఉశనసుడు, శుక్రాచార్యుడిగా ఎలా మారాడు? శివుడు ద్వారా ఎన్నో వరాలు పొందిన శుక్రాచార్యుడు, ఆయన చేతనే శాపానికి ఎందుకు గురయ్యాడు? శుక్రాచార్యుడి తల్లిని విష్ణువు మారు వేషంలో ఎందుకు చంపాల్సి వచ్చింది - అనేటటువంటి ఉత్సుకతను రేకెత్తించే విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/bIZXoSWJ_p8 ]


శుక్రాచార్యుని తండ్రి, బ్రహ్మ మానస పుత్రుడైన భృగు మహర్షి. భృగు మహర్షి నవ బ్రహ్మలలో ఒకడు. అయన కొడుకు ఉశనసుడు. ఉశనసుడు వేద విద్య నేర్చుకోవటానికి, అంగీరస మహర్షి దగ్గరకు వెళ్ళాడు. కానీ, అయన తన కుమారుడైన బృహస్పతి పట్ల పక్షపాత ధోరణి చూపుతున్నాడని, అక్కడినుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత గౌతమ మహర్షి దగ్గర విద్యనభ్యసించి, శివుని మెప్పు కోసం ఘోర తపస్సు చేసి, చనిపోయిన వారిని బ్రతికించగలిగే మృత సంజీవనీ విద్యను వరంగా పొందాడు. కొంతకాలానికి వర గర్వము తలకెక్కిన ఉశనసుడు, కుబేరునిపై దాడి చేసి, ఆయన ధనమంతా దోచుకున్నాడు. ఈ విషయం తెలిసిన శివుడు ఆగ్రహించి, త్రిశూలంతో ఉశనుసుడిని చంపటానికి బయలుదేరాడు. ఆగ్రహంతో ఉన్న శివుడు, ఉశనసుడిని మింగేశాడు. కడుపులో ఉన్న ఉశనుసుడు బయటకు రావాలని ప్రయత్నిస్తుంటే శివుడు, ఒక్క మూత్ర ద్వారము తప్ప, నవరంధ్రాలలో మిగిలిన రంధ్రాలన్నీ మూసివేశాడు. అప్పుడు ఉశనుసుడు గత్యంతరం లేక, మూత్ర ద్వారము గుండా బయటికి వచ్చాడు.

అప్పటికీ కోపం తగ్గని శివుడు ఉశనసుడిని చంపాలని చూడగా, పార్వతీ దేవి జాలితో, వదిలి వేయమని కోరింది. ఆవిడ కోరిక మేరకు శివుడు ఉశనుసుడిని వదిలి, వీడు సక్రమ మార్గంలో బయటికి రాలేదు. కాబట్టి, శక్తివంతుడైనప్పటికీ, శుక్రాచార్యుడనే పేరుతో, రాక్షసులకు గురువుగా ఉంటాడని చెప్పి, వదిలివేశాడు. ఆ విధంగా, పరమ శివుని వరంగా మృత సంజవనీ విద్యను పొందిన ఉశనుసుడు, శివుని ఆగ్రహముతో, శుక్రాచార్యునిగా, రాక్షసుల గురువయ్యాడు.

అదే సమయంలో బృహస్పతి, దేవతల గురువయ్యాడు. అప్పటి నుండి శుక్రాచార్యునికి, బృహస్పతి మీద ఈర్ష్య, అసూయలు పెరగడం ఆరంభం అయింది. శుక్రాచార్యుడిని గురువుగా పెట్టుకుని, దానవ రాజైన హిరణ్యకశిపుడు, ఏకచ్ఛత్రాధిపత్యంగా, 72కోట్ల, 61లక్షల, 60వేల సంవత్సరాలు, ముల్లోకాలనూ పాలించాడు. కొంతకాలం తరువాత, రాక్షసులకు వరుస అపజయాలు ఎదురవుతుండగా శుక్రాచార్యుడు, తపస్సు చేసి, శివుని మెప్పించి, కొత్త అస్త్రాలను సాధించుకు వస్తానని, తపస్సు చేయడానికి బయలుదేరాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, దేవతలను గెలవాలంటే, నీవు తల్లక్రిందులుగా వెయ్యి సంవత్సరాలు తపస్సు చేయాలని చెప్పాడు. అందుకు శుక్రాచార్యుడు మళ్ళీ తపస్సు ప్రారంభించాడు.

శుక్రాచార్యుడు లేడని తెలిసి, దేవతలు రాక్షసులపై దాడి చేసి చంపడం మొదలుపెట్టారు. అప్పుడు రాక్షసులు శుక్రాచార్యుని తల్లి ఉశనను శరణు కోరారు. కానీ, నిద్రా దేవి ప్రభావం వలన, ఆవిడ ఏమీ చేయలేక పోయింది. విష్ణువు ఇంద్రునిలో ప్రవేశించి, రాక్షసులపై యుద్ధం చేస్తుండగా, ఉశన విష్ణువును శపించాలని ప్రయత్నించింది. ఆ సమయంలో, విష్ణువు ఆమెను సంహరించాడు. ఆది చూసిన భృగు మహర్షి, తన భార్యను చంపిన విష్ణువును, భూమిమీద ఏడుసార్లు జన్మించమని శపించాడు. తపస్సులో నిమగ్నమైన శుక్రాచార్యుడు శక్తి వంతుడై వస్తే, దేవతలకు కష్టాలు ప్రారంభమవుతాయని, ఇంద్రుడు తన కూతురు జయంతిని, అయన సేవలకు వినియోగించాడు. అయితే, శుక్రాచార్యుడి కఠోర తపస్సుకు మెచ్చిన శివుడు, శక్తివంతమైన అస్త్రశస్త్రాలను వరంగా ఇచ్చాడు.

వరాలు పొందిన శుక్రాచార్యుడు తన సేవకురాలైన జయంతిని వివాహమాడాడా? అస్త్రశస్త్రాలతో శుక్రాచార్యుడు యుద్ధాన్ని జయించాడా? అనే విషయాలు, మన గత వీడియోలో పొందుపరచబడి ఉన్నాయి. చూడని వారికోసం, దాని లింక్ ను, క్రింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచాను.

తరువాత శుక్రాచార్యుడు, ప్రియవ్రతుని కుమార్తె ఊర్జస్వాతిని వివాహమాడాడు. వారికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. కుమారులలో చండ, అమార్కుడు, ఇద్దరూ ప్రహ్లాదునికి గురువులు కాగా, మిగిలిన వారు త్వాష్ట్ర మరియు ధరాత్రులు. కూతురు దేవయాని అంటే, శుక్రాచార్యునికి విపరీతమైన ప్రేమ. ఆ ప్రేమ వల్లే, బృహస్పతి కొడుకైన కచునికి, రాక్షసుల అభీష్టానికి వ్యతిరేకముగా, మృత సంజీవనీ విద్యను నేర్పాడు. కచుడు దేవయాని ప్రేమను నిరాకరించడం, పరస్పర శాపాలను పొందడం జరిగింది. తదుపరి దేవయాని, రాక్షస రాజు కూతురు శర్మిష్ఠను దాసిగా చేసుకోవడం, యయాతిని వివాహమాడడం జరిగింది. దేవయాని జీవితంలో ప్రేమ, పెళ్ళి విషయాలకు సంబంధించిన వీడియో లింక్, క్రింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచాను.

శుక్రాచార్యుడు ఎందరో రాక్షస రాజులకు గురువు. బలిచక్రవర్తి చేత యజ్ఞ యాగాదులు చేయిస్తున్న సమయంలో, శ్రీ మహావిష్ణువు, వామనావతారంలో దానం స్వీకరించటానికి వచ్చి, మూడడుగుల చోటు దానమివ్వమన్నాడు. అప్పుడు రాక్షసగురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో, ఆ వచ్చినవాడు సాక్షాత్తూ విష్ణువేననీ, అతడి రాజ్యాన్ని అపహరించి, అతడిని పరాభవించడానికే వచ్చాడనీ, కొన్ని సందర్భాలలో అసత్యం చెప్పినా దోషం కాదని చెప్పి, ఆ దాన కార్యక్రమాన్ని వారించేందుకు ప్రయత్నించాడు. బలి అందుకు అంగీకరించలేదు. వామనుడడిగిన మూడడుగుల భూమిని ఇచ్చేందుకు, దానపాత్ర చేత పుచ్చుకున్నాడు. కనీసం అప్పుడైనా ఆపుదామని, శుక్రాచార్యుడు సూక్ష్మరూపంలో దానపాత్రలోకి ప్రవేశించి, దానినుంచి నీరు పడకుండా అడ్డుకున్నాడు. అప్పుడైనా అసలు విషయం గ్రహించని బలి అలాగే చూస్తుండిపోవడంతో, వామనుడు పాత్రకు ఏదో అడ్డుపడిందంటూ, తన చేతనున్న దర్భ పుల్లతో పొడిచాడు. దాంతో శుక్రాచార్యుడి కన్నుపోయి, ఒంటి కంటి వాడయ్యాడు. బలి చక్రవర్తి, పాతాళానికి త్రొక్కివేయబడే వరకూ, శుక్రాచార్యుని ఆధ్వర్యంలో, 20కోట్ల 30లక్షల 64వేల సంవత్సరాలు పాలించాడు.

శుక్రాచార్యుడు “ఔశన సంహిత” అనే గ్రంధాన్ని వ్రాశాడు. ఆ గ్రంధంలో, వివాహల గురించీ, కులాంతర వివాహాల గురించీ, వివరించాడు.  మునులు ధర్మ శాస్త్రాల గురించి వివరించమని అడగగా, శుక్రాచార్యుడు వారికిచ్చిన వివరణే, తొమ్మిది అధ్యాయాలుగా, “ఔశన స్మృతి” అనే గ్రంధంగా రూపొందింది. ఆ గ్రంధంలో, బ్రహ్మచారి విధులూ, గాయత్రీ మంత్రమూ, శ్రాద్ధ విషయాలూ, గృహస్తు చేయవలసిన ప్రేతకర్మా, అసౌచమూ, ప్రయాస చిత్తమూ, మొదలైన అంశాలకు వివరణ ఉంటుంది. ఇంత ప్రతిభా వంతుడూ, జ్ఞానీ అయివుండీ, రాక్షసుల పక్షాన ఉండి, నిరంతరం దానవులకు సహకరిస్తూ ఉండటం వలన, ఒక చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించబడ్డాడు. శుక్రచార్యుడు గొప్ప తత్త్వవేత్త కూడా. సత్యయుగంలో శుక్రాచార్యుడు పేర్కొన్న విషయాలు, శుక్రనీతిగా ప్రస్తుత కాలానికీ ఎంతగానో ఉపయోగపడతాయి.

ఓం నమః శివాయ!

Wednesday, July 26, 2023

3 Doors of Hell - 3 నరక ద్వారములు - Bhagavad Gita భగవద్గీత

 

3 నరక ద్వారములు!
చీకటి దిశగా ఉన్న ఆ మూడు ద్వారములు ఏవి? శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు?

'భగవద్గీత' షోడశోధ్యాయం - దైవాసుర సంపద్విభాగ యోగం (21 – 24 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహారవ అధ్యాయం, దైవాసుర సంపద్విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, దైవాసుర సంపద్విభాగ యోగములోని, 21 నుండి 24 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/XWs5w3_uIrU ]


ఆత్మ వినాశనానికి దారి తీసే నరక ద్వారముల గురించి, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:49 - త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః ।
కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్ ।। 21 ।।

ఆత్మ వినాశనానికి దారి తీసే నరక ద్వారములు, మూడు ఉన్నాయి - కామము, క్రోధము, మరియు లోభము. కాబట్టి, అందరూ వీటిని విడిచిపెట్టాలి.

శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, ఈ ఆసురీ స్వభావము యొక్క మూలకారణములను వివరిస్తున్నాడు. కామము అంటే కోరిక, క్రోధము అంటే కోపము, మరియు లోభము  అంటే దురాశ. ఈ మూడూ దీనికి కారణములని, సూటిగా చెబుతున్నాడు. కామము, క్రోధము, మరియు లోభము కలసి, ఆసురీ ప్రవృత్తి యొక్క మూలాధారములుగా ఉంటాయి. అవి మనస్సులో సలుపుతూ, పెరుగుతూ ఉండి, మిగతా అన్ని దుర్గుణములకూ పెరిగే అవకాశం ఇస్తాయి. అందుకే శ్రీ కృష్ణుడు వాటిని, నరకమునకు ద్వారములని పేర్కొంటున్నాడు. అలాగే, ఆత్మ వినాశనం నుండి కాపాడుకోవటానికి, వాటిని దూరంగా ఉంచాలని గట్టిగా చెబుతున్నాడు. సంక్షేమం కోరుకునే వారు, వాటి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే, వాటిని తమ వ్యక్తిత్వం నుండి దూరంగా ఉంచాలి.

02:03 - ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైః త్రిభిర్నరః ।
ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిమ్ ।। 22 ।।

చీకటి దిశగా ఉన్న ఈ మూడు ద్వారముల నుండి ముక్తి పొందిన వారు, ఆత్మ శ్రేయస్సుకై పరిశ్రమిస్తారు. తద్వారా వారు పరమ లక్ష్యమును పొందుతారు.

ఈ కామ క్రోధ లోభములను త్యజించటం వలన కలిగే ఫలితమును వివరిస్తున్నాడు శ్రీ కృష్ణుడు. ఇవి ఉన్నంతకాలం, వ్యక్తులు ప్రస్తుతానికి సుఖంగా అనిపించి, చివరకు చేదుగా ఉండే ఆనందము వైపుకు ఆకర్షించబడతారు. కానీ, భౌతిక పరమైన కోరికలు తగ్గిపోయినప్పుడూ, భౌతిక రజోగుణము నుండి స్వేచ్ఛను పొందిన తరువాతా, బుద్ధి ఈ మార్గంలో ఉండే అవివేకమును గమనించ గలుగుతుంది. ఆ తరువాత వ్యక్తి, శ్రేయస్సు వైపుకు తిరుగుతాడు. అంటే, ప్రస్తుతానికి కష్టముగా అనిపించినా, చివరకు మధురముగా ఉండే ఆనందము. ఈ శ్రేయస్సు వైపు ఆకర్షితమయ్యేవారికి, జ్ఞానోదయ మార్గము తెరుచుకుంటుంది. దానితో, తమ నిత్య శాశ్వత ఆత్మ సంక్షేమం కోసం పరిశ్రమిస్తారు. దాని వలన, పరమ లక్ష్యం దిశగా ముందుకెళతారు.

03:14 - యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః ।
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్ ।। 23 ।।

ఎవరైతే శాస్త్రములలో చెప్పబడిన ఆదేశములను కాదని, కామ ప్రేరితులై ప్రవర్తిస్తారో, వారు పరిపూర్ణ సిద్ధిని కానీ, సుఖాన్ని కానీ, చివరకు జీవిత పరమ లక్ష్యమును కానీ సాధించలేరు.

శాస్త్రములనేవి, మానవులకు జ్ఞానోదయ దిశలో ప్రయాణించటానికి ఇవ్వబడిన మార్గదర్శక పటముల వంటివి. అవి మనకు జ్ఞానమునూ, మరియు అవగాహననూ అందిస్తాయి. అవి మనకు, ఏమి చేయవచ్చు, ఏమి చేయకూడదనే ఉపదేశాలను కూడా అందజేస్తాయి. ఈ ఉపదేశములు రెండు రకాలుగా ఉంటాయి - విధి మరియు నిషేధము. కొన్ని చేయవలసిన కార్యములను చెప్పే వాటిని, ''విధి'' అంటారు. చేయకూడని పనులను చెప్పే వివరణను, ''నిషేధం'' అంటారు. ఈ రెండు ఉపదేశములనూ శ్రద్ధతో పాటించటం ద్వారా, మానవులు పరిపూర్ణతను సాధించవచ్చు. కానీ, ఆసురీ గుణములు కలవారు, శాస్త్ర ఉపదేశములకు విరుద్ధంగా ప్రవర్తిస్తారు. నిషేధింపబడిన పనులను చేస్తూ, చేయవలసిన విధులను విస్మరిస్తూ ఉంటారు. ఇటువంటి జనులను ఉదహరిస్తూ, శ్రీ కృష్ణుడు - కామ ప్రేరణచే మోహితులై, ఎవరైతే అనుమతింపబడిన మార్గమును త్యజించి, తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తారో, వారు యదార్థమైన జ్ఞానమునూ, పరిపూర్ణ ఆనంద సిద్ధినీ, మరియు భౌతిక బంధనము నుండి విముక్తిని కూడా పొందలేరని అంటున్నాడు.

04:49 - తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితౌ ।
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి ।। 24 ।।

కాబట్టి, ఏది చేయాలి, ఏది చేయకూడదన్న విషయంలో, శాస్త్రములనే ప్రమాణముగా తీసుకొనుము. శాస్త్ర విధివిధానాలనూ, ఉపదేశాలనూ తెలుసుకొనుము, మరియు ఆ విధంగానే ఈ జగత్తులో ప్రవర్తించుము.

శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు, ఈ అధ్యాయము లోని తన ఉపదేశము యొక్క అంతిమ ముగింపును ఇక్కడ ప్రకటిస్తున్నాడు. దైవీ మరియు ఆసురీ గుణములను పోల్చిచూపి, తేడాలను వివరించిన పిదప, ఆసురీ గుణములు ఏ విధంగా నరక లోకాలకు దారి తీస్తాయో వివరించాడు. ఈ విధంగా, శాస్త్ర విధివిధానములను తిరస్కరిస్తే, మనకు వచ్చే లాభం ఏమీ లేదని, ధృవీకరించాడు. ఇప్పుడు ఏదైనా కార్యము యొక్క ఔచిత్యం, అంటే, మంచో చెడో నిర్ణయించాలన్నా, వేద శాస్త్రములే ప్రమాణములని, గట్టిగా చెబుతున్నాడు. కొన్ని సార్లు మంచి ఉద్దేశ్యంతో ఉన్నవారు కూడా, ‘నేను ఏ నియమాలనూ పాటించను. నా మనస్సు చెప్పినట్టే వింటాను, నాకు నచ్చినట్లే చేస్తాను’ అని అంటుంటారు. మనస్సు చెప్పినట్టు అనుసరించటం మంచిదే అనుకున్నా, వారి మనస్సు వారిని తప్పుదోవ పట్టించటం లేదన్న గ్యారంటీ లేదుగా? ఇలా ఒక నానుడిలో చెప్పినట్టు, ‘నరకానికి మార్గం మంచి భావాలతోనే వేయబడి ఉంటుంది..’ అందుకే, మన మనస్సు మనలను సరియైన దిశలోనే తీసుకువెళుతున్నదా, లేదా అనేదానిని, శాస్త్రములతో పరీక్షించి, సరిచూసుకోవాలి. భూత, వర్తమాన, భవిష్యత్తులలో, ఏ ఆధ్యాత్మిక సూత్రము యొక్క ప్రామాణికత అయినా, వేదము ఆధారంగానే నిర్ణయింపబడాలి. కాబట్టి, శాస్త్రముల ఉపదేశం అర్థం చేసుకుని, తద్విధముగానే నడుచుకొమ్మని అర్జునుడికి చెబుతూ, ఈ అధ్యాయమును ముగిస్తున్నాడు, శ్రీ కృష్ణ భాగవానుడు.

ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం, యోగ శాస్త్రే శ్రీ కృష్ణార్జునసంవాదే, దైవాసుర సంపద్విభాగ యోగో నామ షోడశోధ్యాయ:

శ్రీ మద్భగవద్గీతలోని జ్ఞానషట్కం, పదహారవ అధ్యాయం, దైవాసుర సంపద్విభాగ యోగంలోని, 24 శ్లోకాలూ సంపూర్ణం.

07:08 - ఇక మన తదుపరి వీడియోలో, పదిహేడవ అధ్యాయం, శ్రద్ధా త్రయ విభాగ యోగములో, శ్రీ కృష్ణుడు విశదపరిచిన నిగూఢార్థాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, July 24, 2023

What Is The Real Definition of a True Friend? నిజమైన స్నేహానికి నిర్వచనం ఏంటి?


నిజమైన స్నేహానికి నిర్వచనం ఏంటి?
స్నేహం గురించి భీష్ముడు తెలియజేసిన కథ ‘నాడీజంఘుడు – గౌతముడు’!

మహాభారతంలోని శాంతి పర్వంలో, భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన అనేక నీతి కథలు ఉన్నాయి. మానవుల్లో ఎలాంటివాళ్ళు సౌమ్యులు? ఎవరిని ప్రేమించాలి? ఎవరు ఉపకారం చేసేవారు? అనే విషయాలను గురించి ధర్మరాజు భీష్ముడిని అడుగగా, అందుకు భీష్ముడు, దోషాలున్న వారందరిలోకీ, కృతఘ్నుడు పరమనీచుడు. అలాంటి వాడు మిత్రులను కూడా చంపుతాడు. అలాంటి అధములను పూర్తిగా వదిలివేయాలని, ‘గౌతముడు - నాడీ జంఘుడి’ కథను వివరించాడు? మరి కథలో దాగిన నీతేంటి? ఒక బ్రాహ్మణుడు, స్నేహితుడిని హత్య చేసే కసాయి వాడిగా ఎలా మారాడు – అనేది, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలనూ, అనుభవాలనూ, కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ALCW_52fobs ]


మ్లేచ్ఛ దేశంలో, గౌతముడనే పేరు గల ఒక బ్రాహ్మణుడున్నాడు. అతడు బ్రాహ్మణులు చేయవలసిన వేదాధ్యయనం, మొదలైనవేవి చేయకుండా, భిక్షాటనతో జీవించేవాడు. ఒకసారి అతను ఒక బందిపోటు దొంగ ఇంటికి, భిక్ష కోసం వెళ్లాడు. ఆ దొంగ దాత, బ్రాహ్మణ భక్తుడు కావడం వలన, అతడు గౌతముడు ఉండడానికి ఒక ఇల్లు, తినడానికి అవసరమైన ఆహార సామాగ్రీ మొదలైన అన్ని సౌకర్యాలతోపాటు, అతనికి సేవ చేయడానికి భర్త చనిపోయిన ఒక శూద్ర స్త్రీని కూడా ఏర్పాటు చేశాడు. గౌతముడు ఆ దాసితో సుఖంగా జీవిస్తూ ఆటవికుల లాగా, గురి చూసి బాణం వేయడం నేర్చుకుని, ప్రతిరోజూ అడవికి వెళ్ళి, అనేక పక్షులనూ, మృగాలనూ చంపి తింటూ జీవించేవాడు.

ఒకసారి అతని దగ్గరకు గౌతముని ఊరి వాడు, మిత్రుడు, వేదాధ్యనతత్పరుడు అయిన ఒక బ్రాహ్మణుడు వెళ్ళాడు. అదే సమయంలో గౌతముడు, తాను చంపిన హంసలను భుజమ్మీద వ్రేలాడదీసుకుని, చేతిలో ధనుస్సు పట్టుకుని, రక్తంతో తడిసిన శరీరంతో, రాక్షసుని లాగా వేట నుంచి వచ్చాడు. సద్బ్రాహ్మణుడు అతణ్ణి చూసి ఆశ్చర్యపోయి, అతణ్ణి మార్చాలనే ఉద్దేశ్యంతో, సద్బ్రాహ్మణ కర్మలను గురించి ఉపదేశించి, హింసను త్యజించమని, అనేక రకాలుగా బోధించాడు. గౌతముడు అతని మాటలను విని పశ్చాత్తాప పడినట్లుగా నటించి, మరుసటి రోజు తెల్లవారిన తరువాత ఆ వూరినీ, క్రూర కర్మలనూ వదిలిపెట్టి, అతనితోపాటు తానూ వస్తాననీ, సద్బ్రాహ్మణునికి తగిన పనులను చేస్తాననీ చెప్పి, అతనికి నమ్మకం కలిగించాడు.

వచ్చిన సద్బ్రాహ్మణుడు రాత్రి నిద్రపోయిన తరువాత, గౌతముడు అక్కడి నుంచి సముద్రం దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరాడు. అదే సమయంలో కొంతమంది వ్యాపారులు అక్కడికి రాగా, వారితో కలసి సముద్రతీరానికి వెళ్ళాడు. ఇంతలోనే ఒక మదించిన ఏనుగు వారి మీద పడి, అందరినీ చంపడం మొదలుపెట్టింది. గౌతముడు అతి కష్టం మీద తప్పించుకుని ఉత్తర దిక్కుకు పారిపోయి, ఒక అడవిలో తిరుగుతూ దివ్యమైన ఒక ఉద్యానవనంలోకి ప్రవేశించాడు. ఆ ఉద్యానవనం అనేక రకాల పండ్లచెట్లతో, పూల మొక్కలతో సువాసనలు వెదజల్లుతూ, రమణీయంగా ఉంది. ఆ చల్లని గాలికి గౌతముడు ఆదమరచి నిద్రపోయాడు.

ఆ ఉద్యానవనం, నాడీజంఘుడు అనే పేరు గల ఉత్తమమైన కొంగది. ఆ కొంగ, సురభి, కశ్యపుల కుమారుడు, బ్రహ్మ దేవునికి ఆప్తమిత్రుడు. అతనికి రాజధర్ముడనే ప్రసిద్ధమైన మరొక పేరు కూడా ఉంది. దేవకన్యా పుత్రుడు కావడం వలన, అతని శరీరం దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. అలాంటి కొంగను చూసి గౌతముడు మొదట ఆశ్చర్యపోయి, ఆకలితో ఉన్నవాడు కావడం చేత, ఆ కొంగను చంపి తినాలకున్నాడు. అప్పుడా కొంగ గౌతమునితో, " బ్రాహ్మణా, నా అదృష్టం వలన ఈ నాడు నాకు అతిథిగా వచ్చావు. యథావిథిగా నా ఆతిథ్యాన్ని స్వీకరించి, రేపు పొద్దున నీ దారిలో నీవు వెళుదువు." అని పలికి, పక్కనే ఉన్న నది నుంచి చేపలను పట్టి తెచ్చి, వాటిని కాల్చి, అతనికి ఆహారంగా సమర్పించింది. తన రెక్కలతో విసరి, అతని శ్రమను పొగొట్టింది. ఆ తరువాత నాడీజంఘుడు, గౌతముడు అక్కడకు వచ్చిన కారణాన్ని గురించి ప్రశ్నించాడు.

దానికి గౌతముడు, తాను దరిద్రుణ్ణనీ, ద్రవ్య సంపాదన కోసం తిరుగుతున్నాననీ చెప్పాడు. అది విన్న కొంగ, ధన సంపాదనకు అతడు ఎక్కడికీ వెళ్ళనవసరం లేదనీ, తనకు ఆప్తమిత్రుడైన విరూపాక్షుడనే రాక్షసరాజు, మూడు యోజనాల దూరంలోని నగరంలో ఉన్నాడనీ, అతని దగ్గరకు వెళ్ళి, తన మిత్రునిగా చెప్పుకుంటే, గౌతమునికి కావలసినంత బంగారం అతను ఇస్తాడనీ చెప్పింది. ఆ మాటలకు  గౌతముడు సంతోషించి, మరుసటి రోజు విరూపాక్షుడున్న నగరానికి వెళ్ళి అతణ్ణి దర్శించి, నాడీజంఘుని మిత్రునిగా పరిచయం చేసుకుని, తాను వచ్చిన పనిని గురించి వివరించాడు. విరూపాక్షుడు, గౌతముని చరిత్రను ఉన్నది ఉన్నట్లు చెప్పమన్నాడు. అందుకు గౌతముడు, "రాజా, నేను మధ్య దేశంలో బ్రాహ్మణ కులంలో పుట్టాను. శబరుల గ్రామంలో జీవిస్తున్నాను. నా భార్య శూద్ర స్త్రీ. ఆమె మొదట ఇంకొకరి భార్య. ప్రస్తుతం నా భార్య" అని తన గురించిన వాస్తవాన్ని తెలియజేశాడు. అది విన్న తరువాత విరూపాక్షుడు, తనలో తను ఇలా అనుకున్నాడు. “ఇతడు కేవలం జన్మతః మాత్రమే బ్రాహ్మణుడు. ఇతణ్ణి తనకు అత్యంత ఆప్తమిత్రుడైన నాడీజంఘుడు పంపించాడు. కాబట్టి, ఇతనికి అవసరమైన ధనాన్ని తప్పక ఇవ్వాలి” అని భావించాడు. తాను ప్రతిరోజు చేసే బ్రాహ్మణ పూజతో పాటు, గౌతముని కూడా పూజించి, ఇతర బ్రాహ్మణులతో సమానంగా, గౌతమునికి కూడా విలువైన బంగారు, వెండి, వజ్ర వైఢూర్యాలు, మొదలైన వాటిని ఇచ్చి పంపించాడు.

గౌతముడు ఆ బంగారాన్ని మోసుకుంటూ, నాడీజంఘుని దగ్గరకు వెళ్ళాడు. నాడీజంఘుడు మళ్ళీ అతనికి అనేక రకాల సపర్యలు చేసి, చక్కటి భోజనం పెట్టి, రాత్రి తన దగ్గరే ఆశ్రయమిచ్చాడు. ఆ సమయంలో గౌతముడు, "ఈ బంగారాన్ని మోసుకుని నేను చాలా దూరం వెళ్ళాలి. దారిలో తినడానికి ఆహారం కావాలి. ఆహారం ఉంటేగానీ, ప్రాణం నిలువదు. కాబట్టి, నేను బ్రతకాలంటే, ఆహారం తప్పనిసరి" అని ఆలోచిస్తుండగా, తనకు ఆశ్రయమిచ్చి, ఎంతగానో ఉపకారం చేసిన నాడీజంఘుడు, అతనికి పెద్ద మాంసపు ముద్దలాగా కనిపించాడు. దాంతో అతను నిద్రపోతున్న నాడీజంఘుని చంపి, పక్షి రెక్కలూ, ఈకలూ తీసివేసి, అగ్నిలో కాల్చి, ఆ మాంసాన్నీ, బంగారాన్నీ తీసుకుని, తన గ్రామానికి బయలుదేరాడు.

నాడీజంఘుడు ప్రతిరోజూ బ్రహ్మ దర్శనానికి వెళ్ళి తిరిగివస్తూ, దారిలో విరూపాక్షుని దగ్గరకు వెళుతూ ఉంటాడు. అప్పటికి రెండు రోజులుగా నాడీజంఘుడు రాకపోవడంతో, విరూపాక్షుడు, దుష్టుడైన గౌతముని వలన అతనికేదైనా అపకారం జరిగి ఉంటుందని అనుమానించి, తన కుమారునితో పాటు కొంతమంది అనుచరులైన రాక్షసులను, నాడీజంఘుని ఉద్యాన వనానికి పంపించాడు. అతని కుమారుడు అక్కడ నాడీజంఘుని ఈకలు చూసి, జరిగిన విషయాన్ని గ్రహించి, అనుచరులతో చాలా వేగంగా ప్రయాణించి, గౌతముని పట్టుకుని, అతని వద్ద ఉన్న నాడీజంఘుని శరీరాన్ని తీసుకుని, విరూపాక్షుని వద్దకు వెళ్లాడు. నాడీజంఘుని శరీరాన్ని చూసిన విరూపాక్షుడూ, అతని కుటుంబ సభ్యులూ, మంత్రులూ, భోరున విలపించారు.

వెంటనే విరూపాక్షుడు పట్టరాని కోపంతో, తన మిత్రుని చంపిన పరమ క్రూరుడూ, కృతఘ్నుడూ అయిన గౌతముణ్ణి, రాక్షసులైన తన అనుచరులతో ముక్కలు మక్కులుగా నరికించి, అతని మాంసాన్ని దోపిడిగాళ్ళకు ఆహారంగా వేయించాడు. కృతఘ్నుడైన అతడి మాంసాన్ని తినడానికి, వారు కూడా ఇష్టపడలేదు. విరూపాక్షుడు నాడీజంఘుని శరీరానికి దహన క్రియలు నిర్వర్తించాడు. అదే సమయంలో అతని తల్లీ, దక్షుని కుమార్తె అయిన సురభీ దేవి, ఆకాశంలో ప్రత్యక్షమయ్యింది. ఆమె నోటి నుండి పాలతో కూడిన నురగ జారి, నాడీజంఘుని చితిమీద పడింది. దాంతో నాడీజంఘుడు తిరిగి జీవించాడు. అదే సమయంలో దేవేంద్రుడు అక్కడికి వచ్చి, పూర్వం బ్రహ్మదేవుడు ఇచ్చిన శాపం వలన, నాడీజంఘుడు గౌతమునిచేత చంపబడ్డాడని చెప్పాడు.

పునర్జీవితుడైన నాడీజంఘుడు మహేంద్రునికి నమస్కరించి, చనిపోయిన గౌతముణ్ణి బతికించవలసిందిగా కోరాడు. దేవేంద్రుడు అమృతాన్ని చల్లి, గౌతముని బ్రతికించాడు. నాడీ జంఘుడు గౌతముణ్ణి కౌగలించుకుని, ధనంతో సహా అతణ్ణి అతని గ్రామానికి పంపించాడు. గౌతముడు తన గ్రామానికి వెళ్ళి, శూద్ర స్త్రీతో సంసారం చేసి, సంతానం పొందాడు. చేసిన పాపం కారణంగా, మరణించిన తరువాత గౌతముడు ఘోర నరకంలో పడ్డాడు. అని ఈ కథను భీష్ముడు ధర్మరాజుకు చెప్పి, "మనిషి తాను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉండాలి. మిత్రుల కోరికలను తీర్చాలి. మిత్రుని వల్ల సర్వమూ లభిస్తుంది. మిత్రుని వలన మనిషి భోగాలను పొందుతాడు. మిత్రుని వలన, ఆపదల నుంచి బయటపడతాడు. వివేకవంతుడు మిత్రుణ్ణి గొప్ప సత్కారాలతో పూజించాలి" అని తెలియజేశాడు.

కృష్ణం వందే జగద్గురుం!

Wednesday, July 19, 2023

ఎటువంటివారు పాములూ బల్లులూ తేళ్లుగా జన్మిస్తారు? భగవద్గీత Bhagavad Gita


మూర్ఖపు ఆత్మల గతి!
ఎటువంటివారు పాములూ, బల్లులూ, తేళ్లుగా జన్మిస్తారు?

'భగవద్గీత' షోడశోధ్యాయం - దైవాసుర సంపద్విభాగ యోగం (17 – 20 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహారవ అధ్యాయం, దైవాసుర సంపద్విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, దైవాసుర సంపద్విభాగ యోగములోని, 17 నుండి 20 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/tbwW27eKeDE ]



దురహంకారము కలిగిన మనుషులు ఏవిధంగా నడుచుకుంటారో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:49 - ఆత్మసంభావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః ।
యజంతే నామయజ్ఞైస్తే దంభేనావిధిపూర్వకమ్ ।। 17 ।।

ఇటువంటి దురహంకారము, మరియు మొండిపట్టుదల గల మనుషులు, తమ ధనము, సంపదచే గర్వము, అహంకారముతో నిండి, శాస్త్ర నియమముల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా, నామమాత్రంగా, ఆడంబరంగా యజ్ఞములు చేస్తారు.

సాధుపురుషులు యజ్ఞములను ఆత్మశుద్ధి కోసం, మరియు భగవంతుని ప్రీతి కోసం చేస్తారు. ఇక్కడ జరిగే అపహాస్యం ఏమిటంటే, ఆసురీ స్వభావము కల జనులు కూడా యజ్ఞములు చేస్తారు. కానీ, అది అపవిత్ర ఉద్దేశ్యంతో ఉంటుంది. వారు చాలా వైభవోపేత యజ్ఞ, కర్మ కాండలు చేస్తారు. కానీ, అదంతా సమాజం దృష్టిలో పుణ్యాత్ములుగా కనిపించటానికే. వారు శాస్త్ర ఉపదేశాలను పాటించరు, మరియు తమ స్వార్థ వ్యక్తిగత గొప్ప కోసం, ఎదో చూపించుకోవటానికే చేస్తారు. కానీ, శాస్త్ర ఉపదేశం ఏమిటంటే: గూహితస్య భవేద్ వృద్ధిః కీర్తితస్య భవేత్ క్షయః. మనం చేసిన ఏదేని మంచి పని గురించి గొప్పలు చెప్పుకుంటే, దాని ఫలం తగ్గిపోతుంది; దానిని గోప్యంగా ఉంచితే, దాని ఫలము ఎన్నో రెట్లు పెరుగుతుంది.’ ఆసురీ స్వభావము కలవారు చేసే యజ్ఞ కర్మకాండలను, అవి తప్పు పద్ధతిలో చేయబడతాయని చెబుతూ, ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు వాటిని తిరస్కరిస్తున్నాడు.

02:20 - అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః ।
మామాత్మపరదేహేషు ప్రద్విషంతోఽభ్యసూయకాః ।। 18 ।।

అహంకారము, బలము, గర్వము, కామము, మరియు కోపముచే కళ్ళుమూసుకుపోయి, ఈ అసురీ ప్రవృత్తి కలవారు, తమ దేహములో, మరియు ఇతరుల దేహములో కూడా ఉన్న నన్ను, దుర్భాషలాడుతూ, ద్వేషిస్తూ ఉంటారు.

ఇక్కడ, శ్రీ కృష్ణుడు, ఆసురీ స్వభావము కలిగిన వారి యొక్క మరింత స్పష్టమైన గుణములను వివరిస్తున్నాడు. వారు పాపిష్ఠివారు, ద్వేషపూరితమైన వారు, క్రూరమైన వారు, జగడమాడు స్వభావముగలవారు, మరియు పొగరుబోతులు. స్వయముగా వారికి ఏ మంచి గుణములూ లేకపోయినా, ఇతరులలో తప్పులు వెదకటంలో, ఆనందిస్తుంటారు. వారికి వారే, చాలా ప్రాముఖ్యతను ఇచ్చుకుంటారు. ఈ యొక్క సొంత గొప్పలకు పోయే ప్రవృత్తి వలన, వారు ఇతరుల విజయం పట్ల అసూయతో ఉంటారు. ఎప్పుడైనా వారి ప్రణాళికకు అవరోధం కలిగితే, వారికి ఆగ్రహం పెల్లుబుకుతుంది. ఇతరులకు కూడా యాతన కలుగ చేస్తారు, తమకు కూడా హాని కలుగచేసుకుంటారు. పర్యవసానంగా, వారు తమ హృదయంలో, మరియు ఇతరుల హృదయంలో స్థితమై ఉన్న పరమాత్మను ఉపేక్షించి, తిరస్కరిస్తారు. ఎదుటి వ్యక్తి మంచి కార్యాలకు పూనుకున్నా సహించక, అసురీ స్వభావం కలవారు, వారిని అపహాస్యం చేస్తూ, వారిలో స్థితమైవున్న భగవంతుడిని కూడా దూషిస్తారు.

03:50 - తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ ।
క్షిపామ్యజస్రమశుభానాసురీష్వేవ యోనిషు ।। 19 ।।

04:00 - ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని ।
మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిమ్ ।। 20 ।।

కౄరులూ మరియు ద్వేషపూరిత స్వభావము కలవారినీ, అధములనూ, నీచ నరులనూ, నేను భౌతిక జగత్తు యొక్క పునర్జన్మ చక్రములో, పదే పదే, అటువంటి ఆసురీ స్వభావము కలవారి గర్భములోనే విసిరివేస్తుంటాను. ఈ మూర్ఖపు ఆత్మలు, మళ్ళీ మళ్ళీ ఆసురీ గర్భములలోనే జన్మిస్తుంటాయి. ఓ అర్జునా,  ఆ ఆత్మలు నన్ను చేరుకోలేక, అత్యంత నీచ స్థాయి జీవనంలోనికి క్రమేపీ పడిపోతాయి.

శ్రీ కృష్ణుడు మళ్ళీ ఒకసారి, ఆసురీ మనస్తత్వం యొక్క పరిణామాలను వివరిస్తున్నాడు. వారి యొక్క తదుపరి జన్మలలో, అదే రకం మనస్తత్వం ఉన్న వారి కుటుంబాలలో జన్మనిస్తారు. అక్కడ వారికి సరిపోయే విధంగా, తమ నీచ స్వభావాన్ని స్వేచ్ఛగా ప్రదర్శించుకునేందుకు వీలైన వాతావరణం ఉంటుంది. ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, ఎక్కడ పుట్టాలి, ఏ జాతిలో పుట్టాలి, ఏ వాతావరణంలో పుట్టాలి! అనేది, ఆత్మ చేతిలో ఉండదు. వ్యక్తి యొక్క కర్మనూ, స్వభావాన్నీ బట్టి, భగవంతుడే దానిని నిర్ణయిస్తాడు. ఈ విధంగా, ఆసురీ గుణములు కలవారు, నిమ్న స్థాయి, మరియు నీచ గర్భములలోనికి పంపబడతారు. దుష్ట బుద్ధి కలవారికి సరిపోయే పాములూ, బల్లులూ, మరియు తేళ్లుగా కూడా జన్మనెత్తుతారు. అసురీ స్వభావము కలిగిన ఆత్మలు, భగవంతుడిని తెలుసుకోలేక, నీచ స్థాయిలోనే జీవిస్తూ, మళ్ళీ మళ్ళీ జీవన చక్రములో తిరుగుతూ, మరింత దుర్గతులపాలవుతారు.

ఇక మన తదుపరి వీడియోలో, ఆత్మ వినాశనానికి దారి తీసే నరక ద్వారములు ఏంటో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, July 17, 2023

హరినే పరుగెత్తించిన కరి! - అసలు కారణం ఏంటి? Gajendra Moksham

 

హరినే పరుగెత్తించిన కరి! - అసలు కారణం ఏంటి?
గజేంద్ర మోక్షం – మకరికి ఉన్న శాపం ఏంటి?

భాగవతంలో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తయితే, గజేంద్ర మోక్షం ఒక ఎత్తు. ఎవరయితే ఈ గజేంద్ర మోక్షం కథను శ్రద్ధగా వింటారో, వారి పాపాలు హరించబడతాయి. దరిద్రం తొలగిపోయి, ఐశ్వర్యం కలసి వస్తుంది. గ్రహ దోషాల వలన కలిగే పీడలు తొలగిపోతాయి. మరి అంతటి అద్భుతమైన గజేంద్ర మోక్షం కథను గురించీ, శ్రీహరి ద్వారా మోక్షాన్ని పొందిన గజేంద్రుడి గత జన్మ రహస్యం, గంధర్వుడు మకరిగా మారి, శ్రీహరి చేతిలో ఎందుకు మరణించాల్సి వచ్చింది? అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. అందరూ ఈ వీడియోను చివరి వరకూ చూసి లబ్ది పొందాలని కోరుకుంటున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Zs59vTFTOdg ]



క్షీరసాగరం మధ్యలో, త్రికూటం అనే పర్వతం ఉంది. ఆ పర్వతానికి మూడు శిఖరాలున్నాయి. ఒక శిఖరం బంగారంతో, ఇంకో శిఖరం వెండితో, మరొకటి ఇనుముతో అలరారుతూండేవి. ఆ పర్వతం మీద ఉన్న అడవులలో, అడవి దున్నలూ, ఖడ్గమృగాలూ, ఎలుగు బంట్లూ మెదలైన క్రూర మృగాలతో పాటు, ఏనుగులు కూడా ఉండేవి. ఆ ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటే, ఆ ప్రదేశంలో అంధకారం అలముకునేది. ఒకరోజు ఆ గుంపులు ఆహారం గ్రహించి, దాహ బాధతో తిరుగుతూ, సరోవరానికి చేరుతూ ఉన్నపుడు, ఒక ఏనుగుల గుంపు చీలిపోయింది. అందులోని ఆడ ఏనుగులు గజరాజును అనుసరించి, ఇంకో సరోవరాన్ని చేరుకొన్నాయి.

అలా ఏనుగులు చేరుకున్న ఆ సరోవరం, అతి విశాలమైనది. ఆ సరోవరం నిండా వికసించిన కలువలూ, తామరలూ, ఇంకెన్నో జలచరాలూ నివసిస్తూ ఉన్నాయి. ఆడ ఏనుగులు దాహార్తిని తీర్చుకుని, జలక్రీడలు జరిపి బయటికి వచ్చిన తరువాత, గజరాజు కూడా సరోవరంలోకి ప్రవేశించి నీళ్ళు తాగి, తొండం నిండా నీరు నింపి, గగనవీధికి చిమ్ముతూ ఆడుకున్నాడు. అలా నీరు చిమ్మగా, చేపలన్నీ వెళ్లి మీనరాశిలోకీ, ఎండ్రకాయలు కర్కాటక రాశిలోకీ పడిపోయాయి. అలా ఆ గజరాజు జలక్రీడ జరుపుతూ ఉన్న సమయంలో, ఆ చెరువులో ఉన్న ఒక మొసలి, గజరాజు కాలును పట్టుకుంది. పట్టు విడిపించుకుని తొండంతో దెబ్బ తీయాలని, ఆ ఏనుగు చూసింది. కానీ, మకరిని వదిలించుకోవడం, కరికి సాధ్యపడలేదు. చాలా సేపు మకరితో పోరాడడంతో, గజరాజు బలం సన్నగిల్లింది. జలమే తన నివాసస్థానం అవడం వల్ల, మకరి బలం అంతకంతకూ పెరుగుతూ ఉండడంతో, గజరాజును నీరసం ఆవహించింది.

మొసలితో పోరు సాగించలేక దీనావస్థలో పడిన ఆ గజరాజు, మకరిని గెలవడం తనవల్ల కాదని నిశ్చయించుకుని, తనను రక్షించమంటూ, సర్వేశ్వరుడైన ఆ నారాయణుడిని వేడుకున్నాడు. ‘నీవు తప్ప నన్ను రక్షించే వారెవరూ లేరు. నా తప్పులన్నీ మన్నించు’ అని శరణు వేడాడు. వైకుంఠం నుండి పరమాత్మ, తనను తాను మరిచిపోయి రావాలని ప్రార్ధించాడు. ఆ సమయంలో శ్రీ మహా విష్ణువు, వైకుంఠపురంలో లక్ష్మీ దేవితో కలిసి, సరదాగా కబుర్లు చెబుతూ ఉన్నాడు. త్రికూట పర్వతంలో ఏనుగు ఆర్తితో చేసిన ఘీంకారం వినిపించింది. ఆపదలో ఉన్న ఏనుగు రక్షించమని కోరుతోందని గ్రహించిన విష్ణుమూర్తి, ఒక్కసారిగా అక్కడి నుండి కదిలాడు. ఆ సమయంలో లక్ష్మీ దేవి చీర కొంగు ఆయన చేతిలో ఉండిపోయింది. ఆ విషయం ఆమె చెబుతూ ఉన్నా పట్టించుకోకుండా, విష్ణుమూర్తి వడివడిగా వెళుతున్నాడు. తమను ధరించవలసిందింగా శంఖ చక్రాలు ముందుకు వచ్చినా, ఆయన పట్టించుకోలేదు. శ్రీ హరి ఎక్కడకు బయలుదేరినా, క్షణాలలో సిద్ధమయ్యే గరుత్మంతుడు కూడా, స్వామి ముందుకు వచ్చి ఆగాడు. గరుడవాహనం వైపు కూడా చూడకుండా స్వామి పరుగు పరుగున వెళుతున్నాడు.

స్వామి చేతిలో తన చీర కొంగు ఉండడంతో, ఆయనతో పాటు లక్ష్మీదేవి కూడా పరుగులాంటి నడకతో, ఆయనను అనుసరించింది. ఆయన భక్తుడెవరో ఆపదలో ఉండి ఉండవచ్చనీ, అందువల్లనే ఆయన అంత తొందర పడుతున్నాడనే విషయం, లక్ష్మీదేవికి అర్థమయ్యింది. శంఖ చక్రాలు రెండూ, ముఖ ముఖాలు చూసుకున్నాయి. ఎప్పుడూ, ఎక్కడికి వెళుతున్నా, తమను ధరించే బయలుదేరే స్వామి, అప్పుడు మాత్రం తమవైపు చూడకుండా వెళ్ళిపోతుండడం, వాళ్లకు ఆశ్చర్యాన్ని కలిగించింది. విష్ణుమూర్తిని లక్ష్మీ దేవి అనుసరిస్తూ ఉండడం చూసిన శంఖ చక్రాలు, తాము కూడా స్వామి వెనుకనే బయలుదేరాయి. ఇక స్వామి తమ ధ్యాసలో లేడన్న విషయాన్ని, గరుత్మంతుడు గమనించాడు. అందువల్లనే ఆయన తనను పట్టించుకోకుండా వెళుతున్నాడని భావించి, ఆయన కూడా స్వామిని అనుసరించాడు.

విష్ణు మూర్తి తన పట్టు వస్త్రాలను కూడా సరిచేసుకోకుండా, శంఖ చక్రాలు లేకుండా, కంగారుగా వెళుతుండడం చూసిన ఇంద్రాది దేవతలంతా, ఆశ్చర్యపోయారు. తాము భక్తి శ్రద్ధలతో నమస్కరించినా పట్టించుకోకుండా వెళుతున్న స్వామిని, ఆశ్చర్యంగా చూశారు. ఏం జరగబోతోందో అర్థంగాక, వాళ్లంతా అయోమయానికి గురయ్యారు. త్రికూట పర్వతం సమీపంలోని సరోవరంలో, మొసలి కారణంగా ప్రమాదంలో ఉన్న ఏనుగును స్వామి చూశాడు. ఆయన ఆంతర్యం అర్థంకాగానే, సుదర్శునుడు వచ్చి, ఆయన చేతిని అలంకరించాడు. అంతే, సుదర్శన చక్రంతో శ్రీ మహా విష్ణువు, ఆ మొసలి శిరస్సును ఖండించాడు. దాని తల, మొండెం వేరై, సరస్సులో పడిపోయాయి.

అప్పుడు ఆ మొసలిలో నుంచి ఒక దివ్యజ్యోతి బయటకు వచ్చి, గంధర్వుడిగా నిజరూపాన్ని పొందింది. గంధర్వుడు మొసలిగా జన్మించడానికి ఒక బలమైన కారణం ఉంది. ‘హు హు’ అనే ఒక గంధర్వుడు, మహా అందగాడు. ఎప్పుడు చూసినా ఆయన అప్సరసలతో కలసి, శృంగార విలాసాలలో తేలిపోతూ ఉండేవాడు. అలా ఒకసారి ఆయన ఒక నదిలో అప్సరసలతో కలిసి స్నానం చేస్తున్నాడు. అదే సమయంలో, దేవళ మహర్షి అక్కడి వచ్చాడు. నదికి ఆయన స్నానానికి రావడం, ఆ గంధర్వుడు చూశాడు. ఆ మహర్షిని ఆటపట్టిస్తూ, అప్సరసలకు వినోదాన్ని కలిగించాలనీ, అలా తన గొప్పతనాన్ని చాటుకోవాలనీ అనుకున్నాడు.

స్నానానికి వచ్చిన దేవళ మహర్షిని అనేక విధాలుగా అవమానిస్తూ, ఆనందాన్ని పొందాడు. ఆయన మాటలూ, ధోరణి చూసి, ఆ అప్సరసలు కూడా సంతోషించారు. వాళ్ళు అదే పనిగా నవ్వుతూ ఉండడంతో, అతడు మరింతగా రెచ్చిపోయాడు. జరుగుతున్నదంతా చూస్తూ, దేవళ మహర్షి తన పని తాను చేసుకుపోతున్నాడు. ఆయన మౌనం కూడా, గంధర్వుడు మితిమీరడానికి కారణమయ్యింది. ఎన్ని రకాలుగా ఎద్దేవా చేసినా, ఆ మహర్షి మౌనంగా ఉండడంతో, అప్సరసలను మరింత నవ్వించాలనే అత్యుత్సాహానికి పోయాడు. నీటి అడుగు నుంచి వెళ్లి, ఆ మహర్షి రెండు కాళ్ళనూ పట్టుకుని లాగేశాడు. దాంతో ఆ మహర్షి నీళ్ళలో పడిపోయాడు. గంధర్వుడు చేసిన పనికి ఆగ్రహించిన ఆయన, నీటి అడుగు నుంచి వచ్చి తన కాళ్ళు పట్టుకుని లాగిన కారణంగా, మొసలివై జన్మించమని శపించాడు.

దేవళ మహర్షి శాపానికి గంధర్వుడూ, అప్సరసలూ భయపడిపోయారు. తొందరపాటు తనంతో తాను చేసిన పనికి తనను క్షమించమని, ఆ గంధర్వుడు మహర్షిని వేడుకున్నాడు. అత్యుత్సాహంతో అవమానపరిచినందుకు, పెద్ద మనసుతో మన్నించమని ప్రార్ధించాడు. తన శాపాన్ని తాను తిరిగి తీసుకోలేననీ, శ్రీ మహా విష్ణువు సుదర్శన చక్రం చేత, మొసలి రూపం నుంచి విముక్తి కలుగుతుందనీ చెప్పాడు. అలా మొసలి రూపాన్ని పొందిన గంధర్వుడు, శ్రీ హరి చేతిలో మరణించి, శాపవిముక్తుడై, తన లోకానికి వెళ్లిపోయాడు.  ఇక గాయపడిన కాలితో ఒడ్డుకు వచ్చిన ఏనుగు, తొండం పైకెత్తి, స్వామి వారికి కృతజ్ఞతా పూర్వకంగా నమస్కరించింది. స్వామి ఆ ఏనుగుకు మోక్షాన్ని ప్రసాదించాడు. ఏనుగులోని దివ్య జ్యోతి స్వామి వారిలో ఐక్యమయ్యింది.

అయితే, ఒక ఏనుగు తన ఆపదకాలంలో దైవాన్ని స్మరించడం.. ఆ తరువాత మోక్షాన్ని పొందడం వెనుక, ఒక గాథ ఉంది. పూర్వ జన్మలో ఇంద్రద్యుమ్నుడనే మహారాజే, ఈ ఏనుగు. ఇంద్రద్యుమ్నుడు, శ్రీ మహా విష్ణువు భక్తుడు. ఎల్లప్పుడూ ఆయన ఆ స్వామి నామాన్నే స్మరిస్తూ ఉండేవాడు. ఇక పరిపాలనా సంబంధమైన విషయాలను చూసుకున్న తరువాత, మిగతా సమయాన్ని ఆశ్రమ వాతావరణంలో, స్వామి ధ్యానానికి కేటాయించేవాడు. ఆ సమయంలో ఆయనకు ఎవరూ అంతరాయం కలిగించేవారు కాదు. ఒకసారి ఆయన ధ్యానంలో ఉండగా, అక్కడికి అగస్త్య మహర్షి వెళ్ళాడు. ఇంద్రద్యుమ్న మహారాజు కోసం, ఆయన చాలా సేపు నిరీక్షించాడు. ఎంతసేపటికీ  ఇంద్రద్యుమ్నుడు రాకపోవడంతో, తాను కావాలనే అహంకారంతో అలా చేస్తున్నాడని, మహర్షి భావించాడు.

ఆగ్రహావేశాలకు లోనైన అగస్త్యుడు, అజ్ఞానంతో తనను అవమాన పరచిన కారణంగా, ఇంద్రద్యుమ్నుడిని ఏనుగై జన్మించమని శపించాడు. అలా మహాభక్తుడై ఇంద్రద్యుమ్ముడు, ఏనుగులా జన్మించాడు. అడవులలో తిరుగుతూ తన జీవితాన్ని కొనసాగించాడు. చివరికి మొసలి చేతికి చిక్కాడు. క్రితం జన్మలో ఆయన శ్రీహరి భక్తుడు కావడంతో, ఆపద సమయంలో భగవంతుడిని స్మరించాలనే జ్ఞానం కలిగింది. ఆ కారణంగానే, శ్రీ మహా విష్ణువును రప్పించగలిగాడు. పూర్వజన్మలో తాను చేసుకున్న పుణ్య విశేషం వలన, ముక్తిని పొందాడు.

ఓం నమో భగవతే వాసుదేవాయ!

Wednesday, July 12, 2023

ఏది నీది? What belongs to you? భగవద్గీత Bhagavadgita


ఏది నీది?
సమాజంలో ఉండే నాలుగు రకాలైన మనుష్యులు ఎవరు?

'భగవద్గీత' షోడశోధ్యాయం - దైవాసుర సంపద్విభాగ యోగం (13 – 16 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహారవ అధ్యాయం, దైవాసుర సంపద్విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, దైవాసుర సంపద్విభాగ యోగములోని, 13 నుండి 16 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/V53m_Aej3zs ]



అసురీ లక్షణాలను కలిగిన వారు ఎలా ఆలోచిస్తారో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:48 - ఇదమద్య మయా లబ్దమ్ ఇమం ప్రాప్స్యే మనోరథమ్ ।
ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్ ।। 13 ।।

00:58 - అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి ।
ఈశ్వరోఽహమహం భోగీ సిద్ధోఽహం బలవాన్ సుఖీ ।। 14 ।।

01:08 - ఆఢ్యోఽభిజనవానస్మి కోఽన్యోఽస్తి సదృశో మయా ।
యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః ।। 15 ।।

ఆసురీ లక్షణములు కలిగిన వారు ఇలా ఆలోచిస్తారు.. ‘నేను ఈనాటికే చాలా ధనమును సంపాదించాను. నా ఈ కోరికను తీర్చుకుంటాను. ఇదంతా నాదే. రేపు నాకు ఇంకా వస్తుంది. ఆ శత్రువు నాచే నాశనం అయిపోయాడు, మరియు నేను మిగతావారిని కూడా నాశనం చేస్తాను! నేనే స్వయంగా దేవుడి వంటి వాడిని. నేనే ఇదంతా భోగించేది. నేను దోషరహితుడను. నేను శక్తిమంతుడను మరియు నేను ఆనందంగా ఉన్నాను. నేను ధనవంతుడను మరియు గొప్ప హోదాలలో ఉన్న బంధువులు నాకు ఉన్నారు. నాకు ఇక సాటి ఎవరు? నేను దేవతలకు యజ్ఞములు చేస్తాను; దానములు ఇస్తాను; ఆనందిస్తాను.’ ఈ విధంగా, వారు అజ్ఞానముచే భ్రమపడుతుంటారు.

నైతికత్వాన్ని పూర్తిగా విస్మరిస్తూ, తమకేది నచ్చితే దానిని అనుభవించే హక్కు తమకుందని, ఆసురీ లక్షణములు కలవారనుకుంటారు. తన స్వప్రయోజనాలు నెరవేరటం కోసం, పరిస్థితులను తమ వైపు తిప్పుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వైదిక కర్మ కాండలు తమకు భౌతిక సంపత్తిని కలుగచేస్తాయని తెలుసుకుని, వారు కీర్తి సంపదల కోసం యజ్ఞయాగాదులు కూడా నిర్వహిస్తుంటారు. కానీ, ఏవిధంగా అయితే రాబందు ఎత్తులో ఎగిరినా, దాని చూపు క్రిందికే నిమగ్నమై ఉంటుందో, ఆసురీ స్వభావము కలవారు, కొన్నిసార్లు సమాజంలో ఉన్నతహోదాకి ఎదిగినా, వారి పనులు నీచమైనవిగా, మరియు నిమ్నస్థాయిలో ఉంటాయి. వారి కోరికలను తీర్చుకునేందుకు ఉన్న అవరోధాలను తొలగించటానికీ, ఇతరులకు హాని చేయటానికీ, లేదా గాయపరచటానికి కూడా వెనుకాడరు. నాలుగు రకాలైన మనుష్యులు ఉంటారు సమాజంలో.

మొదటి రకం మనుష్యులు, సాధు పురుషులు. వారు ఇతరుల సంక్షేమం కోసం, తమ స్వార్థ-ప్రయోజనాన్ని వదిలి పెడతారు. రెండవ రకం మనుష్యులు, సాధారణమైన వారు. వీరు తమకు హాని కలగనంత వరకూ, ఇతరుల సంక్షేమం కోసం పనిచేస్తారు. మూడవ రకం మనుష్యులు, ఆసురీ గుణాలు కలవారు. వారి స్వార్థ-ప్రయోజనం నెరవేరుతుంది అంటే, ఇతరులకు హాని చేయటానికీ వెనుకాడరు. ఇక నాల్గవ రకం మనుష్యులు కూడా ఉంటారు. అకారణంగా ఇతరులను బాధ పెడుతుంటారు. అటువంటి వారికి సరిపోయే పేరు కూడా లేదు. శ్రీ కృష్ణుడు, నీచమైన ఆసురీ ప్రవృత్తి గల వారిని, ఇక్కడ స్పష్టముగా వివరిస్తున్నాడు. గర్వముతో కళ్ళు మూసుకుపోయి, వారు ఈ విధముగా అనుకుంటారని చెబుతున్నాడు: ‘నేను ఒక ఐశ్వర్యవంత రాచరిక కుటుంబంలో పుట్టాను. ధనవంతుడను, మరియు బలవంతుడను. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. భగవంతుని ముందు మ్రోకరిల్లాల్సిన అవసరమూ నాకు లేదు. ఎందుకంటే, నేనే దేవుడి లాంటి వాడను’. చాలా సందర్భాలలో, మనుషులు ‘నేను’ అన్నప్పుడు, అది వారి అహంకారము మాట్లాడుతున్నట్టు.. వారు కాదు. ఈ అహంకారమనేది, అభిప్రాయాలూ, బాహ్య వేషధారణ, కోపావేశాల వంటి వాటితో, వ్యక్తిగతంగా అనుసంధానం అయి ఉంటుంది. ఈ అహంకారమనేది, దానికే ఒక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటుంది. దాని ప్రభావముచే, జనులు తలంపులు, భావోద్వేగాలు, మరియు జ్ఞాపకాలతో అనుసంధానమై ఉంటారు. వాటిని తమలో భాగమే అనుకుంటారు. ఈ అహంకారమే, ‘ఇది నాది’ అన్న భావన కలిగి ఉంటుంది. కానీ, ఈ యజమానత్వము తాత్కాలికమైనదే. దానిలోనే, ‘ఇది చాలదు’ అన్న గాఢమైన అసంతృప్తి భావన ఉంటుంది. ఈ యొక్క తీరని కోరికే, వ్యాకులతనూ, కలవరపాటునూ, విసుగునూ, ఆందోళననూ, మరియు అసంతృప్తినీ కలుగ చేస్తుంది. పర్యవసానంగా, యధార్థము యొక్క మరింత వికృతమైన అనుభూతి కలుగుతుంది. అది నిజమైన ఆత్మ నుండి, ‘నేను’ ను మరింత దూరం చేస్తుంది. ఈ అహంకారమే, మన జీవితంలో అత్యంత పెద్ద అబద్ధాన్నిసృష్టిస్తుంది. మనం-కాని దాన్ని మనముగా చూపిస్తుంది. ఈ విధంగా, ధర్మమార్గంలో పురోగతి కోసం, సమస్త మతధర్మాలూ, మరియు సాధువులూ, మన అహంకార పూరిత ఆలోచనా పరంపరను విధ్వంసం చేయాలని, వేడుకుంటారు.

05:39 - అనేకచిత్తవిభ్రాంతాః మోహజాలసమావృతాః ।
ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేఽశుచౌ ।। 16 ।।

ఇటువంటి ఊహలూ, తలంపులతో తప్పుదారి పట్టి, చిత్తభ్రాంతి వలలో చిక్కుకుపోయీ, మరియు ఇంద్రియ సుఖాల తృప్తికి బానిసై పోయి, వారు అధోః నరకాలకు పతనమై పోతారు.

అహంకారపు పట్టులో, జనులు తమను తాము, తమ యొక్క మనస్సుతో అనుసంధానం చేసుకుని, దానియొక్క భ్రష్టుపట్టిన, మరియు నిరంతరంగా వచ్చే ఆలోచనా పరంపరకు బానిసై పోతారు. పూర్తిగా తమ మనస్సు యొక్క ఆధీనము లోనికి వెళ్ళిపోతారు. వారి మనస్సు సృష్టించిన జగత్తులో నివసిస్తుంటారు. అపవిత్రమైన మనస్సుకు ఇష్టమైన ఇటువంటి ఒక పని ఏమిటంటే, అస్తమానం ఫిర్యాదు చెయ్యటం. అది ఎప్పుడూ మనుష్యుల పట్లే కాక, పరిస్థితుల పట్ల కూడా సణుగుతూ, కోపంతో ఉంటూ ఉంటుంది. మనకున్న ప్రతి ఒక్క అసంతృప్తీ, మన మనస్సు సృష్టించినదే. వ్యక్తి దాన్ని గుడ్డిగా, పూర్తిగా నమ్మేస్తాడు. తలలో ఉన్న స్వరం, మన జీవితం గురించి దుఃఖపూరిత, ఆందోళనకర, లేదా క్రోధపూరిత కథలను చెబుతుంటుంది. పాపం ఆ వ్యక్తి, అహంకారము యొక్క పట్టులో ఉండి, ఆ చెప్పబడే దానిని నమ్ముతాడు. ఈ అసంతృప్తి తీవ్రమైనప్పుడు, అది ఆక్రోశముగా మారుతుంది. ఆక్రోశము అంటే, దుఃఖంతో, కోపంగా, వేదనతో, మనస్సు నొప్పించబడినట్టు ఉండటం. ఈ ఆక్రోశము చాలా కాలం ఉండిపోతే, అది వ్యధగా మారుతుంది. వ్యధ అంటే, భూతకాలంలో జరిగిన ఏదేని ఒక సంఘటనతో అనుసంధానమై, పదేపదే ‘నాపట్ల వారు ఇలా చేసారు’ అనే దాని గురించే ఆలోచిస్తూ, దానిని మనస్సులోనే ఉంచుకున్న, ఒక తీవ్రమైన, ప్రతికూల భావోద్వేగము. ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు అనేదేమిటంటే.. అహంకారముచే సృష్టించబడిన, మోహ భ్రాంతి వలలోనే ఉండాలని నిర్ణయించుకున్న ఆసురీ ప్రవృత్తి మనుష్యులు, ఎన్నెన్నో నీచమైన అలోచనలచే సతమతమై పోతుంటారు. అందువలన, వారి భవిష్యత్తును చీకటిమయం చేసుకుంటారు. మానవులు తమ స్వంత చిత్తముతో కర్మలు చేయటానికి, వారికి పూర్తి స్వేచ్ఛ ఉన్నది. కానీ, వారు చేసిన కర్మల యొక్క ఫలితములు వారే నిర్ణయించుకునే అధికారం లేదు. కర్మ సిద్ధాంతమును అనుసరించి, కర్మఫలములను ఆ భగవంతుడే వారికి ప్రసాదిస్తాడు. ఆసురీ స్వభావమును ఎంచుకున్న వారిని, వారి తదుపరి జన్మలలో, భగవంతుడు నిమ్న, నీచ స్థాయి జీవనం లోనికి పంపించి వేస్తాడు. సాత్త్విక బుద్ధితో ప్రవర్తించేవారు, ఉన్నత స్థాయికి వెళతారు; రాజసిక ప్రవృత్తితో వ్యవహరించేవారు, మధ్యమ స్థాయిలోనే ఉండిపోతారు; తామసిక మనస్తత్వంతో పనిచేసేవారూ, మరియు పాపిష్టి పనులపై మొగ్గు చూపేవారూ, నిమ్న స్థాయి లోకాలకు పడిపోతారు.

08:38 - ఇక మన తదుపరి వీడియోలో, దురహంకారము కలిగిన మనుషులు ఏవిధంగా నడుచుకుంటారో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, July 10, 2023

గరుడ పురాణం ప్రకారం ఎన్ని రకాల నరకాలున్నాయి? Garuda Puranam


‘గరుడ పురాణం’ - ఇటువంటి వారిని దూరం పెడితే నరకాన్ని తప్పించుకున్నట్లే!
గరుడ పురాణం ప్రకారం ఎన్ని రకాల నరకాలున్నాయి?

‘మరణం’ మారని సత్యం. దానిని ఎవరూ మార్చలేరు, తప్పించలేరు. భూమిపై జన్మించిన ప్రతి జీవికీ మరణం ఖాయం. కానీ, మరణం తరువాత ఆత్మకు ఎటువంటి గతులు సంభవిస్తాయనేది, మనం జీవించి ఉండగా చేసిన కార్యాలపై ఆధారపడి ఉంటుంది. ఆత్మలు అనుభవించే ఫలాలకు సంబంధించిన విషయాలు, అష్టాదశపురాణాలలోని అతి ప్రముఖమైన గరుడ పురాణంలో వివరించబడి ఉన్నాయి. మనం చేసే తప్పులకు ఎటువంటి శిక్షలు అనుభవిస్తామో, మనం గతంలో చేసిన ‘గరుడ పురాణం ప్రకారం ఏ తప్పుకు ఏ శిక్ష!’ అనే వీడియోలో వివరించాను. చూడని వారి కోసం క్రింద డిస్క్రిప్షన్ లో దాని లింక్ ను పొందుపరిచాను.

[ శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పిన గరుడ పురాణం: https://youtu.be/LfQinWIsacs ]



మహాపురాణం అని పిలిచే గరుడ పురాణంలో, మన జీవితానికి అవసరమైన అనేక అంశాలను చూడవచ్చు. గరుడ పురాణంలో, మన జీవితాలలో వెలుగులు నింపే ఎన్నో అద్భుతమైన విషయాలున్నాయి. ఆత్మకు విధించబడే శిక్షలూ, అవి ఏ ఏ నరకాలలో అమలు అవుతాయి? అసలు యమలోకంలో ఎన్ని నరకాలున్నాయి? ఆత్మ నీచపు నరకానికి చేరకుండా ఉండాలంటే, గరుడ పురాణంలో పేర్కోన్న విషయాలేంటి? మనం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో గొడవ పడకూడదు, ఎవరితో ఎలా న‌డుచుకోవాల‌నే అంశాలపై చ‌క్కటి వివ‌ర‌ణ‌లు ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ZRFbkpQQIiQ ]



గరుడ పురాణంలో మొత్తం 14 లక్షల నరకాలను గురించి చెప్పబడింది. అయితే, ఇందులో 16 భయంకరమైన నరకాలను, ముఖ్యమైనవిగా చెప్పబడ్డాయి. తమ జీవితంలో ఎన్నో చెడు పనులు చేసినవారి ఆత్మలు, ఈ నరకాల్లోకి వెళ్తాయి. గరుడ పురాణం ప్రకారం, 16 నరకాలు ఇలా చెప్పబడ్డాయి..

తామిశ్రమ నరకం: ఇతరుల ఆస్తిని ఆక్రమించిన వారి ఆత్మను బంధించి, అతను అపస్మారక స్థితికి వచ్చే వరకూ, తామిశ్రమ నరకంలో శిక్షిస్తారు.

అంధతమిస్త్ర నరకం: ఎదుటి వారిని కేవలం తమ స్వలాభం కోసం, ఒక వస్తువులా వాడుకుని, మోసగించే స్త్రీ లేదా పురుషులకు, ఈ లోకంలో శిక్ష విధింపబడుతుంది.

వైతరణి నరకం: గరుడ పురాణం ప్రకారం, మరణం తర్వాత ఆత్మ గమ్యాన్ని చేరుకోవడానికి, ఈ నదిని దాటాలి. కానీ, ఇది సాధారణ నది కాదు. గంగా నదికి ఉగ్రరూపంగా పరిగణించబడుతుంది. ఇందులో మల మూత్ర విసర్జనలూ, చనిపోయిన కీటకాలూ, పాములూ, మాంసం మరియు అగ్ని జ్వాలలూ ఉంటాయి. ఈ నది ఎరుపు రంగులో ఉంటుంది. జీవితంలో చాలా పాపాలు చేసిన వారి ఆత్మలు, ఈ నది గుండా వెళ్ళాల్సిందే.

తప్తమూర్తి నరకం: రత్నాలూ, లోహాలూ దొంగిలించేవారిని, తప్తమూర్తి నరకంలోని అగ్నిలో ఉంచుతారు.

పుయోదక నరకం: శాస్త్రాల వర్ణన ప్రకారం, ఈ నరకం బావి లాంటిది. ఇందులో రక్తం, మానవ విసర్జన, మరియు అనేక అసహ్యకరమైన విషయాలున్నాయి. పెళ్లి కాకుండానే శారీరక సంబంధాలు పెట్టుకుని ద్రోహం చేసేవాళ్లు, దీనిని అనుభవించాలి.

కుంభీపాక నరకం: తమ స్వార్థం కోసం జంతువులను చంపేవారి ఆత్మ, ఈ నరకానికి వస్తుంది. ఇక్కడ మరుగుతున్న వేడి నూనెలో వేసి, ఆత్మను హింసిస్తారు.

విల్పక నరకం: మద్యం సేవించే బ్రాహ్మణులను, ఈ నరకంలోని అగ్నిలో ఉంచుతారు.

అవిసి నరకం: అబద్ధాలు చెప్పేవారిని, ఈ నరకానికి పంపుతారు. ఇందులో ఆత్మ చాలా ఎత్తు నుండి, కిందకు విసిరి వేయబడుతుంది.
లాలాభక్ష నరకం: ఇతరులతో బలవంతంగా శారీరక సంబంధాలు, లేదా అత్యాచారం చేసేవారిని, ఈ నరకానికి పంపుతారు.

అసితపత్ర నరకం: బాధ్యతారాహిత్యంగా ఉండి, కర్తవ్యాన్ని విస్మరించేవారు, ఈ నరకాన్ని పొందుతారు. ఇక్కడ ఆత్మను కత్తితో పొడిచి, జల్లెడ పట్టి హింసిస్తారు.

కాలసూత్ర నరకం: పెద్దలను గౌరవించని వారినీ, చులకనగా చూసే వారినీ, ఈ నరకంలోని వేడి ప్రదేశంలో ఉంచుతారు.

సుకర్ముఖ నరకం: ఎదుటి వారి నమ్మకాన్ని బలహీనతగా తీసుకుని, వారిని మోసం చేసి, మాససిక క్షోభకు గురిచేసే అధములు, మరణం తరువాత ఈ నరకానికి చేరుకుంటారు.

మహావీచి నరకం: ఈ నరకం, రక్తంతో, పదునైన ముళ్లతో నిండి ఉంటుంది. ఆవులను చంపే వారికి, ఈ నరకంలో శిక్ష పడుతుంది.
శాల్మలీ నరకం: అపరిచిత వ్యక్తితో అనైతిక సంబంధం పెట్టుకున్న మహిళ, ఈ నరకంలో మండుతున్న ముళ్లను కౌగిలించుకోవలసి వస్తుంది.

వజ్ర కుతార నరకం: చెట్లను నరికిన వారిని, మరణానంతరం ఈ నరకంలో పిడుగుపాటుతో కొడతారు.

దుర్ధర నరకం: ఈ నరకం తేళ్లతో నిండి ఉంటుంది. వడ్డీ వ్యాపారాలూ, వగైరాలు చేసి, నిస్సహాయుల నుంచి అధిక వడ్డీలు వసూలు చేసే వారిని, ఈ నరకానికి తీసుకెళ్తారు.

ఇప్పటివరకూ మనం ఎటువంటి పాపాలకు, ఏ ఏ నరకాలలో శిక్షలను అనుభవించాలో తెలుసుకున్నాం. పాపాలకు శిక్షలు ఏంటో తెలియజేసి, మనల్ని గగుర్పాటుకు గురిచేసే గరుడ పురాణంలో, ఒక అద్భుతమైన విషయం కూడా దాగి ఉంది. మనం ఎటువంటి వారితో కఠినంగా ఉండాలి? ఎవరితో సన్నిహితంగా ఉండాలి? అనేటటువంటి చక్కటి విషయాలను కూడా, తెలియజేస్తోంది.

1. సోమరితనం, ఖచ్చితంగా జీవితానికి ప్రాణాంతకం. ఏ పనినైనా అత్యంత శ్రద్ధతో చేయాలని, అన్ని శాస్త్రాలూ బోధిస్తున్నాయి. అలాగే, గరుడ పురాణంలో కూడా, అలాంటి ప్రస్తావన ఉంది. ప్రతి పనినీ, సమయానికి చేయకుండా కాలయాపన చేస్తూ, ఉదాసీనంగా ప్రవ‌ర్తించే వారిపట్లా, అజాగ్రత్తగా ఉండే వారి పట్లా, ప్రేమ, దయ చూపకూడదు. అలాంటి వారితో కఠినంగా ఉండటం చాలా ముఖ్యమని, గరుడ పురాణం చెబుతోంది.

2. మన జీవితంలో అనవసరంగా కోపాన్ని ప్రదర్శించే చాలా మందిని చూస్తుంటాం. వారు ఇతరులను భయపెట్టేలా ప్రవ‌ర్తిస్తుంటారు. అయితే, గరుడ పురాణం ప్రకారం, అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించడంలో, తప్పు లేదు. అలాంటి వారితో భయం లేకుండా, కఠినంగా వ్యవహరించవచ్చు. ఎందుకంటే, మీరు అలాంటి వారికి భయపడితే, మీరు బలహీనులని వారు అనుకోవచ్చు. అంటే, వారు మీ మంచిత‌నాన్ని, చేత‌కానిత‌నంగా భావించే అవ‌కాశ‌ముంది. అందువల్ల, వీలైతే వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించండి. అయితే, అది సాధ్యం కానప్పుడు మాత్రం, కఠినంగా వ్యవహరించవచ్చు. కాబట్టి, మనం అందరితో ఒకే స్వభావంతో స్పందించ‌కూడ‌దు. ఎందుకంటే, మన జీవితం నిజాయితీగా ఉండి, మన ఉద్దేశం సరైనదైతే, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఆ విధంగా, దర్పానికి భయపడితే, సమస్యలు ఎదుర‌వుతాయి.

3. అందరినీ గౌరవంగా చూడాలి. ఎవరినీ చిన్నచూపు చూడకూడదు, ఎవరినీ అవమానించ కూడదు, ఎవరినీ నొప్పించకూడదు. అన్ని గ్రంధాలలో ఇటువంటి సందేశం ఖచ్చితంగా ఉంటుంది. ఇత‌రుల‌ను చుల‌క‌న‌గా చూసే అల‌వాటున్న వ్యక్తికి దూరంగా ఉండాలని, గరుడ పురాణం చెబుతోంది.

4. ఎవరితో మంచి సంబంధం కలిగి ఉండాలి, ఎవరితో ప్రేమగా, గౌరవంగా మెల‌గాలో, గ‌రుడ పురాణంలో స్పష్టంగా పేర్కొనబడి ఉంది. పొరుగువారితో సత్సంబంధాలు కలిగి ఉండాలనే అంశం కూడా, ఇందులో ఉంది. అంటే, మనం ఇత‌రుల‌తో ఎంత మంచిగా ఉంటే, అంత మంచితనం మన చుట్టూ ఉంటుంది. మన పక్కన మంచి మాట‌లు మాట్లాడేవారినీ, ప్రియమైన వారినీ కలిగి ఉండటం, కష్ట సమయాలలో మనల్ని బలంగా నిలబెడుతుంది. వారి ధైర్యం, ప్రేమ.. జీవితానికి బలాన్నిస్తాయి. కాబట్టి, మనం స్నేహితులూ, సహోద్యోగులూ, పొరుగువారితో మంచి సంబంధాలు కలిగి ఉండాలి.

5. తల్లిదండ్రులు దేవుడితో సమానం. తల్లిదండ్రులను ప్రేమగా, శ్రద్ధగా చూసుకోవడం, పిల్లల కర్తవ్యం. ఇది గరుడ పురాణంలో స్పష్టంగా వివరించబడి ఉంది. అంతేకాకుండా, తల్లిదండ్రులను వేధిస్తూ, వారితో గొడవప‌డుతూ, అగౌరవపరిచే వారు, తరువాతి కాలంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, తల్లిదండ్రులను ప్రేమించని, పట్టించుకోని పిల్లలు, స‌మాజంలో గౌరవానికి ఎప్పటికీ అర్హులు కాదు. ప్రతి ఒక్కరూ, తమ తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవాలని, గ‌రుడ పురాణం వెల్లడిస్తోంది. మనం తెలియక చేసే తప్పులు ఎన్నో ఉంటాయి. వాటికి తగిన ప్రతిఫలాలను, మరణించిన తరువాత నరకంలో మాత్రమే కాదు, జీవించి ఉండగా కూడా, వాటి పర్యావసానాలను, మనం ఎదుర్కోవలసి వస్తుంది.

అన్ని జన్మలలో కెల్లా అత్యుత్తమైనది, మానవ జన్మ. మంచీ చెడూ తెలుసుకోగల జ్ఞానం, మనకి మాత్రమే ఉంది. కాబట్టి, ఎటువంటి శిక్షలైనా మన ఆత్మకే అని తేలికగా తీసుకోకుండా, మంచి నడవడికను కలిగి ఉండడం, ముఖ్యం. ఏ పురాణాలయినా, ఏ ఇతిహాసాలయినా మనకు బోధించేది మాత్రం ఒకటే, ధర్మాన్ని రక్షిస్తే, ఆ ధర్మమే మనలను కాపాడుతుంది..

ధర్మో రక్షతి రక్షిత:

Wednesday, July 5, 2023

చార్వాక సిద్ధాంతం! Charvaka Philosophy భగవద్గీత Bhagavadgita

చార్వాక సిద్ధాంతం!
మనిషి జీవించడానికి అవసరమైన దానికంటే ఎక్కువ పోగుజేసుకుంటే ఏమవుతుంది?

'భగవద్గీత' షోడశోధ్యాయం - దైవాసుర సంపద్విభాగ యోగం (09 – 12 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహారవ అధ్యాయం, దైవాసుర సంపద్విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, దైవాసుర సంపద్విభాగ యోగములోని, 9 నుండి 12 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/wPNEPowYsWk ]


ఏ విధంగా మోహితులై, తాత్కాలికమైన వాటికి ఆకర్షితులమవుతామో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:49 - ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోఽల్పబుద్ధయః ।
ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతోఽహితాః ।। 9 ।।

ఇటువంటి దృక్పథంలో గట్టిగా ఉండి, ఈ తప్పుదోవపట్టిన జీవాత్మలు, అల్ప బుద్ధితో, మరియు కౄర కార్యములతో, ప్రపంచానికి శత్రువులుగా మారి, దానిని విధ్వంసం చేయ భయపెడతారు.

నిజమైన ఆత్మ-జ్ఞానం లేక, ఆసురీ ప్రవృత్తి కలవారు, వారి యొక్క మలినమైన బుద్ధిచే, యధార్ధసత్యము యొక్క వక్రీకరించబడిన దృక్పథాన్ని పుట్టిస్తారు. చార్వాక సిద్ధాంతము, దీనికి ఒక ఉదాహరణ. ‘బ్రతికినంత కాలం సుఖిస్తూ బ్రతుకు. ఒకవేళ నెయ్యి త్రాగటం ఇష్టమైతే, అప్పుచేసైనా సరే అలాగే చెయ్యి. ఈ శరీరము భస్మమైపోయిన తరువాత, నీవు ఇక ఉండవు, మళ్లీ ఈ లోకం లోకి తిరిగి రావు’ అని చార్వాక సిద్ధాంతం ప్రబోధిస్తుంటుంది. ఈ ప్రకారంగా ఆసురీ-మనస్తత్త్వం కలవారు, ఆత్మ యొక్క నిత్య శాశ్వత అస్థిత్వమునూ, మరియు కర్మ ఫల ప్రతిచర్యనూ తిరస్కరిస్తారు; దీనితో వారు ఏ సంకోచమూ లేకుండా స్వార్థ పనులలో నిమగ్నమై, ఇతరుల పట్ల క్రూరంగా కూడా ప్రవర్తించటానికి వీలుగా ఉంటుంది. ఒకవేళ వారికి ఇతరులపై అధికారం ఉంటే, వారిపై కూడా, ఈ తప్పుడు దారి పట్టిన భౌతిక దృక్పథాన్ని రుద్దుతారు. ఇతరులకు బాధ కలిగించయినా, లేదా ప్రపంచాన్ని నాశనం చేసయినా, వారి యొక్క స్వార్థ పూరిత లక్ష్యము సాధించటానికి, సంకోచించరు. చరిత్రలో హిట్లర్, ముస్సోలిని, స్టాలిన్ వంటి నిరంకుశత్వ ఉన్మాదులూ, మరియు చక్రవర్తులను, మానవజాతి చాలా సార్లు ప్రత్యక్షంగా చూసింది; వారు సత్యం యొక్క తమ స్వంత పాపిష్టి దృక్పథంచే ప్రేరేపితమై, ‘ప్రపంచానికి’ చెప్పలేని దుఃఖాన్నీ, మరియు వినాశనాన్నీ కలుగచేశారు.

02:41 - కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః ।
మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్ ప్రవర్తంతేఽశుచివ్రతాః ।। 10 ।।

తృప్తిపరచలేని కామముతో ఉంటూ, దంభము, దురభిమానము, మరియు గర్వముతో నిండిపోయి, ఈ ఆసురీ లక్షణములు కలవారు, తప్పుడు సిద్ధాంతములను పట్టుకుని వుంటారు. ఈ విధంగా మోహితులై, వారు తాత్కాలికమైన వాటికి ఆకర్షితమై, అపవిత్ర సంకల్పంతో ప్రవర్తిస్తారు.

తృప్తిపరచలేని కామ కోరికల తుష్టి కోసం ప్రయత్నిస్తూ, ఆసురీ స్వభావము కలవారు, అత్యంత అపవిత్ర హృదయంతో ఉంటారు. కపట బుద్ధితో నిండిపోయి, ఎదో మంచి వారిలాగా నటిస్తుంటారు. వారి మోహపూరితమైన బుద్ధి, తప్పుడు ఆలోచనలను పాటిస్తుంది. వారి గర్వము, తమ కంటే తెలివికలవారు ఎవరూ లేరన్న భావనను కలిగిస్తుంది. తాత్కాలికమైన ఇంద్రియ సుఖముల పట్ల ఆకర్షితులై, వారి బుద్ధి, నీచంగా, స్వార్థ పూరితంగా, మరియు గర్విష్ఠిగా అవుతుంది. ఈ విధంగా వారు శాస్త్ర ఉపదేశాలను పట్టించుకోకుండా, ధర్మబద్ధమైన, సత్యవంతమైన నడవడికకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు.

03:53 - చింతామపరిమేయాం చ ప్రలయాంతాముపాశ్రితాః ।
కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః ।। 11 ।।

వారు అంతులేని చింతలు, లేక ఆందోళనలచే సతమతమై పోతుంటారు. అవి చివరకు మరణంతోనే ముగుస్తాయి. అయినా సరే, వాంఛల సంతుష్టి, మరియు ఆస్తులు కూడగట్టుకోవటమే జీవిత పరమావధి అని, నిశ్చయముగా ఉంటారు.

భౌతిక దృక్పథంలో ఉన్న జనులు తరచుగా ఆధ్యాత్మిక మార్గాన్ని - అది కష్టతరమైనది, మరియు భారమైనదనీ, మరియు అంతిమ లక్ష్యం చాలా దూరమైనదనీ, తిరస్కరిస్తారు. త్వరగా ఫలితాలను ఇచ్చే ఈ ప్రాపంచిక మార్గాన్నే వారు అనుసరిస్తారు కానీ, ప్రాపంచిక మార్గంలో ఇంకా ఎక్కువ బాధలు పడుతుంటారు. భౌతిక సంపాదనలకై ఉన్న వారి కోరికలు, వారిని క్షోభకు గురిచేస్తుంటాయి. వారి ఆశయాలను పూర్తిచేసుకోవటానికి, ఏవేవో పెద్ద పెద్ద ప్రణాళికలు వేసుకుంటారు. వారు కోరుకున్న వస్తువును పొందగానే కాసేపు ఉపశమనం పొందినా, వెంటనే కొత్త క్షోభ మొదలవుతుంది. వారు సంపాదించిన వస్తువు దెబ్బతింటుందనో, ఇతరులెవరైనా తీస్కుంటారేమో అన్న ఆందోళనతో, దానిని కాపాడుకోవటానికి శ్రమిస్తుంటారు. చిట్టచివరికి, ఆ మమకారాసక్తి ఉన్న వస్తు-విషయంతో, అనివార్యమైన ఎడబాటు సంభవించినప్పుడు, మిగిలేది దుఃఖమే. ఈ ప్రపంచంలోని జనులు, చెప్పలేని బాధలనూ, మరియు ఒత్తిడినీ, పాపంచిక ప్రయాసలో అనుభవిస్తుంటారు – సంతానాన్ని పెంచటం, వ్యాపారం చేయటం, ఆస్తి-పాస్తులను కూడబెట్టడం, మరియు కీర్తి ప్రతిష్ఠలను సంపాదించుకోవడం వంటివి. వారు గనక ఇదే విధమైన అనురాగమూ, శ్రద్ధా, ఆ శ్రీ కృష్ణుడి పాదారవిందముల వద్ద ప్రేమను పెంచుకోవటంలో చూపిస్తే, వారు ఇక ఎన్నటికీ ఆ మృత్యు దేవత, యమరాజు గురించి చింతించవలసిన అవసరం ఉండదు. కానీ, ఆసురీప్రవృత్తి కలవారు, ఈ పచ్చినిజాన్ని ఒప్పుకోవటానికి తిరస్కరిస్తారు. ఎందుకంటే, ఈ ప్రాపంచిక సుఖాలే అత్యున్నత ఆనందమని, వారి బుద్ధులు నిశ్చయంతో ఉంటాయి. వారిని నికృష్ట లోకాలకు తీసుకుపోవటానికీ, మరియు మరింత దుఃఖపూరిత తదుపరి జన్మలలోకి తీసుకువెళ్ళటానికీ, మృత్యువు ఓర్పుతో నిరీక్షిస్తున్నదని కూడా, తెలుసుకోలేరు.

06:13 - ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ।
ఈహంతే కామభోగార్థమ్ అన్యాయేనార్థసంచయాన్ ।। 12 ।।

వందల కొద్దీ కోరికలచే కట్టివేయబడీ, మరియు కామ క్రోధములచే ఆవరించబడీ, వారు అన్యాయ పద్ధతులలో సంపదను ప్రోగుచేయటానికి శ్రమిస్తారు. ఇదంతా వారి ఇంద్రియ సుఖాల కోసమే.

ఈ ప్రపంచాన్ని భోగించటానికి, డబ్బు ఒక సాధనం. అందుకే అంతులేని కోరికలతో, భౌతిక దృక్పథంలో ఉన్న జనులు, డబ్బు సంపాదించటానికి, అంత ప్రాముఖ్యతను ఇస్తారు. వారు అన్యాయ పద్ధతులలో డబ్బు ప్రోగుచేసుకోవటానికి కూడా, సంకోచించరు. అందుకే వారి అనైతిక ప్రవర్తనకు, రెట్టింపు శిక్ష ఉంటుంది. భాగవతం పేర్కోన్న దాని ప్రకారం, వ్యక్తి జీవన నిర్వహణకు సరిపోయినంత సంపద మాత్రమే, ఆ వ్యక్తికి ఉంచుకునే అర్హత ఉంది. ఒకవేళ ఎవరైనా తన అవసరాని కన్నా ఎక్కువ ప్రోగుచేసుకుంటే, భగవంతుని దృష్టిలో అతను దొంగ. అందుకతను శిక్షింపబడతాడు. ఏమిటి ఆ శిక్ష? అంటే, మొదటగా, మరణ సమయంలో, ప్రోగు చేసుకున్న సంపద మనతో పాటుగా రాదు. అది తీసివేయబడుతుంది. అంతేకాక, కర్మ సిద్ధాంతమును అనుసరించి, ఈ సంపత్తి ప్రోగుచేసిన వ్యవహారాలలో చేసిన పాపములకు, శిక్షింపబడతాడు. అది ఎలాగంటే, ఒక స్మగ్లర్ పట్టుబడితే, అతని సామాను జప్తుచేయబడుతుంది, చట్టాన్ని ఉల్లఘించినందుకు, అతనికి శిక్ష కూడా పడుతుంది. అదే విధంగా, మనం కూడా శిక్షను అనుభవించవలసి ఉంటుంది.

07:50 - ఇక మన తదుపరి వీడియోలో, ఆసురీ లక్షణాలు కలిగిన వారు ఎలా ఆలోచిస్తారో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, July 3, 2023

Why was Kripacharya not punished in Ashwathama's misdeed? అధర్మపరులకు సుఖాలు ఎందుకు కలుగుతాయి? Mahabharatam


అధర్మపరులకు సుఖాలు ఎందుకు కలుగుతాయి?
అశ్వత్థామ ఉప పాండవులను చంపేముందు కృపాచార్యుడు ఏమన్నాడు?

కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, మహా భారత కావ్యంలోని రెండు ముఖ్య పాత్రలు. కౌరవులకూ, పాండవులకూ విద్య నేర్పిన గురువులూ, కురుక్షేత్ర యుద్ధంలో కురు సైన్యాన్ని నడిపించిన అతిరధ మహారధులు. మరి అటువంటి వారిలో ద్రోణాచార్యుడి గురించి అందరికీ తెలిసినా, కృపాచార్యుడి గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలిసివుంటుంది. కృపాచార్యుడు బ్రహ్మ నాల్గవ అవతారము. ఈయన శతానంద మహర్షి మనుమడు. మహాభారతంలో కురు పాండవులకు గురువు. మహాభారత యుద్ధంలో, కౌరవుల తరపున నిలిచి యుద్ధం చేశాడు. యుద్ధం ముగిసిన తరువాత బ్రతికి ఉన్న అతికొద్దిమందిలో, ఈయన కూడా ఒకరు. సప్త చిరంజీవులలో ఒకరిగా, మన పురాణాలలో ప్రస్తావించబడ్డాడు. 8వ మన్వంతరములోని ఋషులలో గొప్పవాడైన కృపాచార్యుడి జీవితంలోని కొన్ని ఘట్టాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/cQqicClN840 ]


గౌతమ మహర్షి కుమారుడైన శతానంద మహర్షికి, సత్య ధృతి అనే కుమారుడున్నాడు. సత్య ధృతి జన్మించడమే, విల్లంబులతో జన్మించాడు కనుక, శరద్వంతుడు అనే పేరుతో ప్రసిద్ధిచెందాడు. ఇతనికి ధనుర్విద్య పుట్టుకతోనే ప్రాప్తించింది. ఇతడు చిన్నతనం నుంచీ వేదాల మీద కన్నా, అస్త్ర విద్యలపైన ఆసక్తిని కనబరచసాగాడు. కొంతకాలం తపస్సు చేసి, అన్ని యుద్ధవిద్యలలో ఆరితేరాడు. ధనుర్విద్యలో తిరుగులేని మహా వీరుడయ్యాడు. ఒక మహర్షి తనయుడు, అన్ని యుద్ధవిద్యలలో ప్రావీణ్యం పొందడాన్ని చూసి, ఇంద్రుడు తట్టుకోలేకపోయాడు.

అతనిని ప్రక్క దారి పట్టించేందుకు, అద్భుత సౌందర్యరాశియైన జలపది అనే దేవకన్యను, శరద్వంతుడి బహ్మచర్యాన్ని ఆటంకపరిచేందుకు పంపించాడు, ఇంద్రుడు. ఆమె శరద్వంతుడి వద్దకు వెళ్ళి, వివిధ రకాలుగా ఆకర్షించడానికి ప్రయత్నించింది. మహా సౌందర్యవతి అయిన ఆమెను చూసి, శరద్వంతుడి చేతిలోని విల్లంబులు జారి క్రిందపడ్డాయి. అది గ్రహించి, తన కామోద్రేకమును నిగ్రహించుకుని, ఆ ప్రాంతమును విడిచి వెళ్ళిపోయాడతడు. కానీ, అతనికి తెలియకుండకుండా రేతః పతనమై, అది రెల్లుగడ్డిలో పడింది. అది రెండు భాగములై, అందులోనుంచి ఒక బాలుడూ, ఒక బాలికా జన్మించారు.

కొంతకాలానికి శంతన మహారాజు వేటాడుతుండగా, అక్కడున్న ఆ బిడ్డలను చూసి, వారిపై అనురాగం కలిగి, తన బిడ్డలుగా పెంచుకున్నాడు. వారికి జాతక కర్మాది సంస్కారాలు గావించి, తన కృపతో పెంచబడ్డారు కాబట్టి, వారికి కృపుడు, కృపి అని నామకరణము చేయించాడు. ఈ సంగతి గ్రహించిన శరద్వంతుడు, శంతనునితో తన సంగతి చెప్పి, కృపుడికి చతుర్విధ ధనుర్వేదములనూ, నానా విధ శాస్త్రములనూ నేర్పాడు. అతడే, విలువిద్యలో పరమాచార్యుడై, భీష్ముని కోరిక మేరకు, కురు పాండవులకు గురువయి, వారికి యుద్ధ విద్యలలో తర్ఫీదు ఇచ్చాడు.

ఆ తరువాత, కురుపాండవులకు ద్రోణుడు ఆచార్యుడయ్యాడు. కృపాచార్యుడు తన సోదరి అయిన కృపిని ద్రోణాచార్యునికిచ్చి వివాహం జరిపించాడు. వీరి సంతానమే, అశ్వాత్థామ. మహాభారత యుద్ధంలో దుర్యోధనుడితో కలిసి, పాండవులతో పోరాడిన వారిలో, కృపాచార్యుడు కూడా ఒకడు. కౌరవులతో పాటు యుద్ధంలో పాల్గోన్నా, ధర్మాధర్మ నియమాలను పాటించిన వాడు, కృపాచార్యుడు. సౌప్తిక పర్వంలో, తన తండ్రి ద్రోణాచార్యుడి మరణానికి ప్రతీకారంగా, ఉపపాండవులను సంహరించడానికి బయలుదేరబోయిన అశ్వత్థామకు, కృపాచార్యుడు చెప్పిన ధర్మనీతి, అతడి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.

యుద్ధరంగంలో రాత్రిపూట కృపాచార్యుడూ, కృతవర్మా నిద్రపోయినా, అశ్వత్థామకు నిద్ర రాక, దిక్కులు చూస్తూ ఉన్నాడు. ఆ మర్రి చెట్టు మీద ఎన్నో కాకులు గూళ్ళు కట్టుకుని ఉన్నాయి. వాటిలో కాకి పిల్లలూ ఉన్నాయి. ఆ సమయంలో ఒక గుడ్లగూబ, ఆ చెట్టు మీద వాలింది. మెల్లగా చప్పుడు చేయకుండా, కాకి గూళ్ళను సమీపించి, కొన్ని కాకుల పీకలు కొరికి, వాటిని చంపేసింది. అది చూసిన అశ్వత్థామకు, తళుక్కున ఒక ఆలోచన, మెరుపులా మెరిసింది. “నిద్రపోతున్న శత్రువులను సంహరించమని, ఈ ఉలూకము నాకు ఉపదేశం ఇచ్చింది. నేను కూడా ఈ విధంగానే, నిద్రిస్తున్న పాండవులను వధిస్తాను. పాండురాజు కొడుకులనూ, వారి కొడుకులనూ, బంధుమిత్ర సహితంగా వధిస్తానని, సుయోధనుడికి మాటిచ్చాను. నేను ఒక్కడినే, ఎటువంటి సైన్య సహకారం లేకుండా, అత్యంత పరాక్రమ వంతులైన వారందరినీ సంహరించలేను. అది మంచిది కాదు.

ఏమాత్రం సంశయించక, పాండవ శిబిరంలోకి ప్రవేశించి, ఆదమరచి నిద్రపోతున్న పాండవులనూ, వారి పుత్రులనూ, ఈ రోజే బంధుమిత్ర సహితంగా తుదముట్టిస్తాను. ఈ సమయంలో ధర్మాధర్మ విచక్షణ పనికి రాదు. శత్రురాజుల మీద దండెత్తినపుడూ, శత్రురాజులు విడిది చేసినపుడూ, శత్రురాజులు ఇరుకు దారిలో వెళుతున్న సమయానా, శత్రువులు నిద్రిస్తున్న సమయానా చంపడం తప్పు కాదన్నది శాస్త్రం వచనమని, పెద్దలు చెప్తారు కదా! పైగా నేను క్షాత్రధర్మం అనుసరిస్తున్నాను కనుక, ఇది నాకు దోషం కాదు. పాడవులు భీష్ముడినీ, కర్ణుడినీ, ద్రోణుడినీ పడగొట్టినప్పుడు, ధర్మాన్ని పాటించారా! వారు అధర్మం పాటించినపుడు, నేను అధర్మంగా నడచుకుంటే ఏ విధంగా దోషమవుతుంది?.. కనుక కల్మషహృదయులైన పాండవులనూ, వారి బంధువులనూ, నిద్రిస్తున్న సమయాన చంపడం రణనీతే కానీ, నిందార్హం కాదు” అంటూ, తనకుతాను నిశ్చయించుకున్నాడు.

అశ్వత్థామ తన నిశ్చయాన్ని కృపాచార్యుడికి వివరించాడు. “మామా కృపాచార్యా! ఆ పాండవులు సుయోధనుడిని ఒక్కడిని చేసి, అధర్మంగా కూల్చారు. పదకొండు అక్షౌహిణుల సైన్యాలకు అధిపతి అయిన సుయోధనుడు, దీనుడై, నేలపై పడి ఉన్నాడు. ఆ పాపాత్ముడు భీముడు, సుయోధనుడిని కాలితో తన్నాడు. మనం ఉండీ, సుయోధనుడు దిక్కు లేని వాడయ్యాడు. మనమిప్పుడు ఏం చేయాలో ఆలోచించండి” అని అన్నాడు. అందుకు కృపాచార్యుడు, "అశ్వత్థామా! నీమనసులో మాట చెపితే విని, మా మాట చెప్తాము. ముందుగా నేను కొన్ని మాటలు చెప్తాను విను.

ఏ పనికైనా పురుష ప్రయత్నమూ, దైవసహాయమూ, రెండూ కావాలి. ఏ ఒక్కదానితోనూ, కార్యము సానుకూలము కాదు. దేవతలు అనుకూలించి వర్షం కురిపించినా, రైతు విత్తనదే, మొలకెత్తదు కదా! అలాగే, రైతు విత్తినా, దైవం అనుకూలించి వర్షం కురిపించకపోతే, విత్తనం మొలకెత్తి, ఫలితాన్ని ఇవ్వదు. కనుక, పురుష ప్రయత్నం, దైవసహాయం, రెండూ చేరి, కార్యసానుకూలతను ఇస్తాయి. ధర్మం తప్పక చేసే ఏపనికైనా, దైవసహాయం ఉంటుంది. కనుక కార్యం సానుకూలమౌతుంది. అధర్మంతో చేసే పనులు ప్రారంభంలో సుఖాలు ఇచ్చినా, తరువాత పడవేస్తాయి. అదే మన సుయోధనుడి విషయంలో జరిగింది. సుయోధనుడు లోభం, కోపం, అసూయ, అహంకారంతో, ద్రౌపదిని సభకీడ్చి, అవమానించాడు. అందుకు తగిన ఫలితం అనుభవించాడు. మనం ధర్మం తప్పక కార్యం నెరవేర్చాలి.

ముందుగా మనం ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి, అతడికీ, గాంధారికీ విషయం చెప్పి, వారేమి చెప్పినా, అది చేద్దాము. వారు చెప్పిన మాట ధర్మబద్ధం ఔతుంది కానీ, ధర్మవిరుద్ధం కాదు. కాబట్టి, ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో” అని అన్నాడు. ఆ మాటలకు అశ్వత్థామ కృపాచార్యునితో, "మామా! ధర్మం, దేశ కాల పరిస్థితులను అనుసరించి, మారుతూ ఉంటుంది. దరిద్రంలో ధర్మమనిపించింది, ధనవంతుడిగా అధర్మం ఔతుంది. కనుక, నేను నమ్మినదే ధర్మం. దానిని నేను నా మరణానికి వెరువక ఆచరిస్తాను. నేను బ్రాహ్మణ వంశంలో పుట్టి, నా దౌర్భాగ్యం కొద్దీ విల్లు పట్టాను. క్షాత్రం అవలంభించాను. ఇంత కాలం తరువాత, మరలా నేను బ్రాహ్మణ్యం వంక మరలడం, నాకు చేత కాదు.

అస్త్రసన్యాసం చేసిన నా తండ్రిని దారుణంగా చంపినవాడు బ్రతికి ఉండగా, నేను ఎలా ప్రాణంతో ఉండగలను? ఈ రోజు నా తండ్రిని చంపిన దుర్మార్గుడిని, అతని బంధువులతో సహా, ఏ ఉపాయంతోనైనా హతమారుస్తాను. నా శత్రువులు విజయోత్సాహంలో తేలియాడి, ఆనందంగా, అలసి సొలసి ఆదమరచి నిద్రిస్తున్నారు. వారిని సంహరించడానికి, ఇదే తగిన సమయం. పైగా, మనం బ్రతికి ఉన్నామని వారికి తెలియదు. నేను వచ్చి వధిస్తానని ఊహించి ఉండరు. కనుక ఏమరుపాటున ఉన్న వారి మీద విరుచుకు పడి, పీకలు కోసి దారుణంగా చంపి, వారి శిబిరాలను పీనుగుల పెంట చేసి, భూతాలకు ఆహారంగా వేస్తాను. నా తండ్రిని చంపిన వాడి శరీర భాగాలు, ఆ పీనుగుల పెంటల మధ్య చెల్లాచెదురుగా, గజాశ్వకళేబరాలతో పడి ఉండటం, నేను కళ్ళారా చూడాలి” అని అన్నాడు అశ్వత్థామ.

అతను చెప్పిందంతా శాంతంగా విన్న కృపాచార్యుడు, "అశ్వత్థామా! నీకు అపకారం చేసిన వాడిని హతమార్చాలని అనుకున్నావు. నీవు దానికి ఒక మార్గం అవలంభిస్తున్నావు. దానికి అభ్యంతరం లేదు. మేము కూడా నీతో ఉండి, నీకు తోడ్పాటును అందిస్తాము. ఈ రాత్రికి విశ్రమించి, రేపు ఉదయం మన ప్రయత్నాలు ప్రారంభిద్దాము. నీవు ద్విగుణీకృత ఉత్సాహంతో, శత్రువులను గెలువగలవు. నీవు యుద్ధ భూమిలో నిలిస్తే, నిన్ను గెలువగల వారు ఎవ్వరు! ఇక నా గురించి చెప్పే పని లేదు. కృతవర్మ అమిత శౌర్యవంతుడు, అస్త్రకోవిదుడు, బలాఢ్యుడు. ఇక ఆ కవచము విడిచి, కొంత విశ్రాంతి తీసుకో. రేపు ఉదయం పాండవులను ఎదుర్కొని, వారిని చంపటమో, లేక వారి చేతిలో మారణించటమో, ఏదో ఒకటి నిశ్చయం” అని అన్నాడు కృపాచార్యుడు.

అశ్వత్థామ కృపాచార్యుడి మాట విని, ఇలా ప్రతిస్పందించాడు. "ఈలోకంలో కోపంలో ఉన్న వాడికీ, ధన సంపాదనా వ్యామోహికీ, వ్యాధిగ్రస్తుడికీ, కామాతురతతో కన్ను మూసుకు పోయిన వాడికీ, నిద్ర ఎలా పడుతుంది? నా తండ్రి మరణాన్ని తలచుకుని దహించుకు పోతున్న నా హృదయాన్ని, శత్రుసంహారంతో ఆర్పి, నా స్వామి సుయోధనుడి ఋణం తీర్చుకుంటాను. అంత వరకూ నాకు నిద్ర రాదు. పగలు వారికి అర్జునుడూ, కృష్ణుడూ అండగా ఉంటారు కనుక, ఎదిరించ లేము. అందుకే రాత్రి సమయంలోనే శత్రుసంహారం చేస్తాను. దయచేసి నన్ను వారించకండి. ఈ రాత్రి నేను పాండవులూ, వారి బంధు మిత్రులూ, సైనికులూ గాఢనిద్రలో ఉండగా, వారి మీద దాడి చేసి, దారుణంగా వధిస్తాను. ఆ తరువాత ఆ విషయం రారాజుకు చెప్పి, సుఖంగా నిద్రిస్తాను” అని అన్నాడు.

అశ్వత్థామ మాటలను విన్న కృపాచార్యుడు, "అశ్వత్థామా! కోపంతో ఉన్న వాడికి కార్యాకార్య విచక్షణ తెలియదు. ప్రస్థుతం నీవు ఆ స్థితిలో ఉన్నావు. ధర్మాధర్మములు తెలుసుకోలేక పోతున్నావు. కోపం వదిలి, నా మాట విని, ధర్మమార్గాన నడిస్తే, నీకు మేలు జరుగుతుంది. నిద్రిస్తున్న వాడినీ, ఆయుధములు విడిచిన వాడినీ, జుట్టు ముడివిడిపడిన వాడినీ, వాహన వైకల్యమును పొందిన వాడినీ, శరణుజొచ్చిన వాడినీ వధించటం, ధర్మం కాదు. పాండవులూ, వారి సమస్త సైన్యమూ, పాంచాలురూ, గాఢ నిద్రలో ఉన్నారు. నిద్రించినవాడు, చచ్చినవాడితో సమానం. చచ్చినవాడిని మీదపడి చంపి, నరకానికి ఎందుకు పోతావు? మహాస్త్రకోవిదుడవూ, మహారధులలో ప్రధముడవూ అయిన నీవు, ఇలాంటి నీచ కార్యానికి ఒడిగట్టడం భావ్యమా! కనుక రేపు యుద్ధంలో, మనం పాండువీరులతో పోరు సల్పుదాము” అని అన్నాడు.

అందుకు అశ్వత్థామ, "మామా కృపాచార్యా! మీరు పెద్ద వారు. నన్ను శాసించదగిన వారు. మీరు చెప్పింది సత్యమేగానీ, నేను చెప్పేది వినండి. రాజులంతా చూస్తుండగా, అస్త్ర సన్యాసము చేసిన నా తండ్రిని, పాంచాల రాకుమారుడు దృష్టద్యుమ్నుడు, అది పాపమని ఆలోచించకుండా, జుట్టు పట్టుకుని తల నరికాడు. శిఖండిని అడ్డు పెట్టుకుని, అర్జునుడు భీష్ముని పడగొట్టాడు. భూమిలో దిగిన రధచక్రాన్ని ఎత్తుతున్న కర్ణుడి మీద, అర్జునుడు బాణప్రయోగం చేసి చంపాడు. అర్జునుడు భూరిశ్రవసుడిని భుజములు నరికినందుకు, అతడు ప్రాయోపవేశం చేశాడు. ప్రాయోపవేశం చేసిన భూరిశ్రవసుడిని, సాత్యకి దారుణంగా చంపాడు. ఇదంతా ఎందుకు.. ఎక్కడో మడుగులో దాగిన సుయోధనుడిని బయటకు రప్పించి, భీముని చేత అధర్మయుద్ధంలో కూలత్రోయించారు. ఇన్ని విధాలా యుద్ధధర్మాన్ని మీరి, యుద్ధధర్మమనే వంతెనను కూల్చిన వారిని వదిలి, నన్ను ధర్మంగా నడవమని చెప్పడం న్యాయమా!” అని అన్నాడు.

మామా! తొడలు విరిగి నేలమీద ఉన్న సుయోధనుడు, దీనంగా పలికిన పలుకులు విని కూడా, నీకు ఆగ్రహం కలుగ లేదా! అందుకే నేను చేసేది అధర్మమైనా, అధర్మమార్గాన నా తడ్రిని చంపిన దృష్టద్యుమ్నిడిని, నేను చంపక వదలను. నన్ను మీరు ఆపలేరు. ఇందు వలన నేను కీటకంగా జన్మించినా బాధపడను” అని అంటూనే, రథం ఎక్కాడు అశ్వత్థామ.  వెంటనే కృపాచార్యుడు, "అశ్వత్థామా! నువ్వూ, నేనూ, కృతవర్మా, ఒకే పని మీద వచ్చాము. అటువంటి సమయంలో, నీవు ఒంటరిగా వెళ్ళడం భావ్యం కాదు. నేనూ నీతో వస్తాను” అని బయలుదేరాడు, కృపాచార్యుడు. తన మాటలను పట్టించుకోలేదని, అశ్వత్థామను ఒంటరిగా వదిలి వేయలేదు. ఎటువంటి అవకాశం దొరికినా, శత్రువులను సంహరించాలనే అశ్వత్థామ కోరికకు, మద్ధతూ పలుకలేదు. కురు సైన్య మహారధిగా, తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు.

కృష్ణం వందే జగద్గురుం!

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...