Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Monday, October 30, 2023

గరుడపురాణం ప్రకారం యమలోకంలోని నగరాలు! 16 cities on the way to Yamaloka - Garuda Puranam


గరుడపురాణం ప్రకారం యమలోకంలోని నగరాలు!
పాపాలు చేసినవారు ‘యమలోకానికి’ ఈ నగరాలను దాటి వెళ్ళాలా?

మన పురాణ ఇతిహాసాల ప్రకారం, పాపపు కర్మలు చేసి మరణించిన ప్రతీ ఆత్మ, నరకానికి వెళుతుంది. అక్కడున్న వైతరణీ నదిని దాటి, యముడి చేత తీర్పుపొంది, యమలోకంలో శిక్షలు అనుభవిస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలుసు. కానీ, యమలోకంలో అనేక నగరాలున్నాయి. వాటిని దాటుకుంటూ, అక్కడ వివిధ రకాల యాతనలను అనుభవించిన తరువాతే, యమలోకానికి చేరుకుని శిక్షలు పొందడం జరుగుతుంది. గరుడ పురాణంలో, యమలోకంలో దక్షిణ ద్వారం గుండా ఉన్న 16 నగరాల గురించిన వివరణ ఉంది. శ్రీహరి చెప్పిన ఆ 16 నగరాలు ఏంటి? ప్రేతాత్మ ఏ ఏ నగరాలలో ఎటువంటి హింసలను పొంద వలసి ఉంటుంది? అసలు వైతరణీ నది ఎలా ఉంటుంది? దానిని దాటడానికి గల మార్గం ఏంటి – అనేటటువంటి విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/M4qpRO8wrtw ]


శరీరం వదిలిన ప్రేతాత్మ యమలోకానికి చేరే క్రమంలో, కొన్ని హింసలను భరించాల్సి ఉంటుంది. కొంతమంది పాపాత్ములను యమభటులు అంకుశాలతో గుచ్చుతూ, వీపు మీద పొడుస్తూ, తాళ్ళుకట్టి ఈడుస్తూ లాక్కు పోతారు.  మరికొంత మందిని ముక్కు చివర త్రాళ్ళు కట్టీ, కొందరిని చెవులకు తాళ్ళు కట్టీ, యమపాశాలతో బంధించి ఇంకొందరినీ, ఈడ్చుకు పోతారు. యమభటులు కొందరు దుర్మార్గులను, కంఠానికీ, చేతులకూ, పాదాలకూ సంకెళ్ళు వేసి ఈడ్చుకు పోతారు. కొంతమంది యమదూతలు పాపాత్ములను ముద్గరం అనే ఆయుధంతో కొట్టి, నోటినుంచి రక్తం కక్కుకునేలా చేసి, తిరిగి ఆ రక్తాన్నే వారిచేత త్రాగిస్తారు. ప్రాణులందరూ తాముచేసిన పాపకర్మలను తలుచుకుంటూ, ఏడుస్తు, ఎన్నో యాతనలు పడి, యమలోకానికి వెళతారు. ఈ విధంగా జీవుడు యమ మార్గంలో ప్రయాణం చేస్తూ, ఎన్నో బాధలు పడి దుఃఖిస్తూ, తన పూర్వజన్మలో చేసిన పాపాలను తలచుకుని, వాటిని గురించే ఆలోచిస్తూ, వేగంగా ముందుకు వెళతాడు. ఇలా పదిహేడు రోజులు ప్రయాణించి, పద్దెనిమిదవ రోజు నాటికి, గరుడపురాణంలో చెప్పబడిన పదహారు పట్టణాలలో మొదటి పట్టణమైన సౌమ్యానికి చేరుకుంటాడు.

1. సౌమ్యనగరం: ఆ నగరం చంద్ర సంబంధమైనది. అక్కడ ఎంతో మంది ప్రేతాత్మల సమూహాలుంటాయి. పుష్పభద్ర అనే నది అక్కడ ప్రవహిస్తుంది. దాని పరిసరాలలో, విశాలమైన మర్రి చెట్లు ఉంటాయి. యమలోకానికి జీవులను తీసుకుపోయే యమభటులు, ఆ నగరంలో వారిని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోనిస్తారు. అప్పుడా ప్రేత శరీరుడు ఇంకా మోహాన్ని విడవకుండా, "అయ్యో! నేను మరణించాక నా భార్య ఎలా ఉందో? నా పిల్లలు ఏంచేస్తున్నారో? నేను సంపాదించిన ధనం క్షేమంగానే ఉన్నదా?” వంటి విషయాలు ఆలోచిస్తూ, దుఃఖిస్తూ ఉంటాడు. అదే సమయంలో యమభటులు వచ్చి, ‘మూర్ఖులారా! మీ భార్యా బిడ్డలు ఎక్కడున్నారు? ఎందుకలా విలపిస్తున్నారు. వాళ్ళకీ మీకూ సంబంధం ఎప్పుడో తెగిపోయింది. విశ్రమించింది చాలు.. ఇక బయలుదేరండి’ అని కసిరి కొడతారు. ప్రేత శరీరులు, తమ పుత్రులు, లేక మనమలు శ్రద్ధగా 'మాసికం' చేసి సమర్పించిన పిండాన్ని ఆ సౌమ్యనగరంలోనే భుజించి, అక్కణ్ణుంచి బయలుదేరి, సౌరి అనే నగరానికి వెళతారు.

2. సౌరి నగరం: అది సూర్యసంబంధమైనది. అక్కడ యమధర్మరాజుతో సమానుడైన 'జంగముడు' అనే పేరుగల రాజు ఉంటాడు. అతడిని చూడగానే, ప్రేత జీవుడికి ఎంతో భయం వేస్తుంది. అక్కడ కొద్దికాలం విశ్రాంతి తీసుకుని, నెలరోజులకు పైన, నలభై అయిదురోజుల లోపు చేసే త్రైపాక్షిక శ్రాద్ధంలో పెట్టిన పిండాలను భుజించి, అక్కణ్ణుంచి లేచి బయలుదేరుతాడు. దారిలో అతడికి భయంకరమైన వనాలు ఎదురౌతాయి.

3. నరేంద్ర భవనం: కొండల మీద ఉండే ఈ నగరాన్ని చేరుకున్న ప్రేత శరీరుడు అక్కడే కొద్ది సేపు విశ్రమిస్తాడు. రెండు నెలల తరువాత ఆ నగరానికి చేరిన ప్రేతుడు, రెండవ నెల మాసికంలో తన పుత్రులు పెట్టిన పిండాలను ఆరగించి, సంతోషంగా ఉంటాడు. అంతలోనే తిరిగి యమ భటులు అతడిని పాశాలతో బంధించి, ముందుకు తీసుకుపోతారు.

4. గంధర్వ శైలం: నరేంద్ర భవనం నుంచి బయలుదేరిన ప్రేతుడు, యమభటుల ద్వారా తీసుకు రాబడి, గంధర్వ నగరంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ మూడవ మాసికంలో తనకు ఇవ్వబడిన పిండాలను స్వీకరించి, తిరిగి నడవటం మొదలుపెడతాడు.

5. శైలాగమం: నాలుగవ మాసం నాటికి, ప్రేతుడు శైలాగమం అనే నగరానికి చేరుకుంటాడు. అక్కడ నాలుగవ మాసికంలో తన పుత్రులు పెట్టిన పిండాలనూ, జలాన్నీ గ్రహించి, ఐదవ మాసం వచ్చేసరికి, క్రౌంచ పట్టణానికి చేరుకుంటాడు.

6. క్రౌంచం: క్రౌంచపట్టణం కొంగలకు నిలయం. ఆ పట్టణానికి చేరుకున్న ప్రేతుడు, అయిదవ 'మాసికంలో' తన పుత్రులు పెట్టిన పిండాన్ని ఆరగిస్తాడు. కొద్దికాలం అక్కడ గడిపి, క్రూర పురం అనే పట్టణానికి వెళతాడు.

7. క్రూర పురం: క్రూరపురానికి చేరిన ప్రేతుడు, ఐదు నెలల పదిహేను రోజులు గడిచాక, ‘ఊన షాణ్మాసికం’ అనే శ్రాద్ధ క్రియలో ఇవ్వబడిన పిండాలనూ, జలాన్నీ స్వీకరించి సంతృప్తి చెందుతాడు. అక్కడ కొన్ని ఘడియలు విశ్రాంతి తీసుకుని, తరువాత యమ భటులు లాక్కుపోగా, ఎంతగానో విలపిస్తూ, యమధర్మరాజు సోదరుడైన విచిత్రుడు పాలించే చిత్ర భవనానికి చేరుకుంటాడు.

8. చిత్రపురి-వైతరణీ నది: ప్రేతుడు చిత్రపురిని చేరగానే, మహాభయంకరంగా వున్న విచిత్రుడు దర్శనమిస్తాడు. ఆయనను చూసి భయపడి పారిపోవటానికి ప్రయత్నించే ప్రేతుడితో, అక్కడున్న కొందరు పల్లెవాళ్ళు, "ప్రేతుడా! ఇది చిత్రపురి. ఇదిగో ఇక్కడ వైతరణీనది ప్రవహిస్తోంది. దీనిని నీవు దాటి ముందుకు సాగాలి. అదిగో అక్కడొక ఓడ ఉంది. అది పుణ్యాత్ములకు మాత్రమే. నీవేదైనా పుణ్యం చేసి ఉంటే, నిన్నా ఓడ ఎక్కిస్తాం. లేదంటే, నీవీ నదిని ఈదుకుంటూ వెళ్ళాల్సిందే” అని చెబుతారు. తత్త్వాన్ని గ్రహించిన మునీశ్వరులు, దానం చేయటాన్ని 'వితరణ' అని వ్యవహరించారు. అలాంటి వితరణ చేసిన వాళ్ళే, ఈ వైతరణీ నదిని దాటటానికి సమర్ధులు. అందుకే ఈ నదికి 'వైతరణీ' అనే పేరు వచ్చింది.

ఆ వైతరణీ నది, యమలోకానికి చేరే మార్గంలో అడ్డంగా ప్రవహిస్తుంది. అది ఎంతో లోతైనదీ, భయంకరమైనదీ. దానిపేరు వింటేనే భయం కలుగుతుంది. ఇక దానిని చూస్తే చెప్పేదేముంది! ఆ వైతరణీనది వంద ఆమడల వెడల్పుతో, చీము నెత్తురు ప్రవాహంతో, మాంసపు బురదతో, ఎముకల గుట్టలతో అత్యంత జుగుప్సాకరంగా వుండి, భయాన్ని కలిగిస్తుంది. ఎంతో లోతైన ఆ నది, దాటటానికి అలవి కాకుండా ఉంటుంది. ఆ నదిలో అసంఖ్యాకమైన వెంట్రుకలు నాచులా ఉంటాయి. అందులో భయంకరమైన మొసళ్ళు సంచరిస్తూ ఉంటాయి. అలాంటి వైతరణీనది పాపాత్ములు తన దగ్గరకి రాగానే మంటలతో, పొగతో ముందుకు దూసుకొస్తుంది. ఆ నదీ తీరంలో, సూదిమొనలాంటి ముక్కుతో, పొడిచి చంపే కాకులూ, గ్రద్దలూ విహరిస్తూ ఉంటాయి. అలాగే, జీవులను చీల్చి చెండాడే ఎన్నో నీటి జంతువులు ఆ నదిలో సంచరిస్తూ ఉంటాయి. ఎంతో ఘోరమైన పాపాలు చేసినవారు వైతరణీనదిలో పడి, అమ్మో! అయ్యో! తండ్రీ! నాకెంత కష్టం వచ్చింది! నేనెలా తట్టుకోగలను? నావల్ల కావటంలేదు.. అని దారుణంగా విలపిస్తారు. వైతరణీ నదిని చూడగానే, పాపాత్ములు మూర్ఛ వచ్చి పడిపోతారు. ఆకలి బాధకి తట్టుకోలేక, ఆనదిలో ప్రవహించే రక్తాన్నే త్రాగుతారు. ఆ నది తేళ్ళతో, నల్లటి సర్పాలతో వ్యాపించి ఉంటుంది. ఆ నదిలో పడ్డవాళ్ళను ఎవరూ రక్షించలేరు. పాపాత్ములు వైతరణిలో పడి, అందులోని సుడిగుండాలలో చిక్కి పాతాళం దాకా వెళ్ళి, మళ్ళీ వెనక్కి వస్తారు. ఈ విధంగా ఎన్నో కష్టాలూ, బాధలూ పడుతూ, ఎలాగో వైతరణిని దాటుకుంటూ, పాపాత్ములు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూ, యమలోకానికి వెళతారు.

చిత్రపురికి వెళ్ళిన ప్రేతాత్మలతో అక్కడి పల్లెవాళ్ళు,  "జీవుడా! పోనీ నీవు జీవించి ఉన్నప్పుడు, కనీసం ఒక్క గోవునైనా దానం చేశావా? చేసి ఉంటే, ఈ ఓడ మీద నిన్నెక్కించుకుని నది దాటిస్తాము. అదీ చేయకపోతే, నీకు ఓడ ఎక్కే అర్హత ఉండదు" అని అంటారు. అప్పుడా జీవుడు, ‘అయ్యో! నేనెంత అవివేకిని? కనీసం దానం కూడా చేయ లేదే! అందుకే కదా నాకీ దుఃస్థితి కలిగింది” అని విలపిస్తాడు. పాపాత్ముడైన ప్రేతుడు ఇలా విలపిస్తున్నప్పటికీ, యమకింకరులు జాలిచూపించకుండా, అతడిని ఎత్తి వైతరణిలో పడవేస్తారు. అలా నదిలో పడ్డ ప్రేతుడి ముఖానికి, గొలుసుతో ఉన్న ఒక ఇనుప కొక్కేన్ని గుచ్చి, చేపను లాక్కెళ్ళినట్టు అవతలి ఒడ్డుకు లాక్కెళతారు. నది అవతలి తీరానికి చేరాక ప్రేతుడు, పుత్రులు సమర్పించిన 'షాణ్మాసిక పిండాన్ని' తిని ఆకలి తీర్చుకుంటాడు.

9. బహ్వాపదం: వైతరణిని దాటి వచ్చిన ప్రేతుడు, బహ్వాపద పట్టణాన్ని చేరుకుని, అక్కడ కొద్ది ఘడియలు విశ్రాంతి తీసుకుంటాడు. ఆ నగరంలో ఉన్నప్పుడు, తన పుత్రులు ఏడవ మాసికంలో సమర్పించిన పిండాలను భక్షిస్తాడు. అలా ఆ పట్టణం నుంచి బయలుదేరి, ఏడుస్తూ, ఆకాశ మార్గంలో ‘దుఃఖం’ అనే నగరానికి చేరుకుంటాడు.

10. దుఃఖ పురం: దుఃఖపురంలోకి ప్రవేశించిన ప్రేతుడు, ఎనిమిదవ మాసికంలో తన వారసులు అందించిన పిండాలను తిని కడుపు నింపుకుంటాడు. తిరిగి తొమ్మిదవ మాసం నాటికి, ఆక్రందన పురానికి చేరతాడు.

11. ఆక్రందన పురం: ఇది ఎందరో ప్రేతాల ఆక్రందనలతో, హాహాకారాలతో నిండి ఉంటుంది. ఎంతోమంది దారుణంగా అలా విలపిస్తుంటే చూసి, మతిచెడిన ప్రేతుడు, తాను కూడా దిక్కు తోచక, వారితో పాటు హాహాకారాలు చేస్తాడు. అక్కడ తొమ్మిదవ మాసికంలో పెట్టిన పిండాలను భక్షించి, ఎంతో కష్టంగా, సుతప్తం అనే నగరానికి వెళతాడు.

12. సుతప్తం: ఈ నగరం, పేరుకు తగ్గట్టే వేడిగా, శరీరాన్ని కాల్చేసేలా ఉంటుంది. ఆ నగరాన్ని చేరిన ప్రేతుడు, శరీరమంతా వేడెక్కిపోయి, ఎంతో వేదన పడతాడు. పదవ మాసంలో తనవారిచ్చిన పిండాన్ని భక్షించి, ఆకలి తీర్చుకుంటాడు. అక్కడ వేడిని భరించి, చేసేదేమీ లేక, తిరిగి బయలుదేరి, రౌద్ర పురానికి వెళతాడు.

13. రౌద్ర పురం: పేరుకు తగ్గట్టే, ఆ పురం ఎంతో భయానకంగా ఉంటుంది. అక్కడికి పదకొండవ మాసానికి, ప్రేత జీవుడు చేరుకుంటాడు. ఆ పట్టణంలో ఎన్నో భయంకరమైన సంఘటనలను చూసి, తీవ్రమైన దుఃఖాన్ని పొందుతాడు. అక్కడున్నప్పుడు ప్రేతుడు, తన పుత్రులు 'పదకొండవ మాసికంలో' పెట్టిన పిండాలను భుజించి, మరో పదిహేను రోజులకు, పయోవర్షం అనే నగరానికి చేరుకుంటాడు.

14. పయోవర్ష పురం: ఆ పురంలో, ధారాపాతంగా వర్షం కురుస్తూనే వుంటుంది. ఆ నగరాన్ని చేరిన ప్రేతుడు, ఆ వర్షంలోనే తడుస్తూ, ఎన్నో బాధలు అనుభవిస్తాడు. అక్కడుండగా తన వారు, సంవత్సరం పూర్తికాకుండా చేసే ‘న్యూనాబ్దికం' అనే శ్రాద్ధం ద్వారా ఇచ్చిన పిండాన్ని భక్షిస్తాడు. ఆ తరువాత సంవత్సరం పూర్తి కాగానే, శీతాఢ్యం అనే నగరానికి చేరుకుంటాడు.

15. శీతాఢ్య పురం: అది అత్యంత చల్లదనం కలిగిన ప్రదేశం. అక్కడ ఎప్పుడూ మంచు కురుస్తూనే ఉంటుంది. భయంకరమైన ఆ చలిలోకి ప్రవేశించిన ప్రేతుడు, తీవ్రమైన చలి బాధలు అనుభవిస్తూ, దారుణంగా విలపిస్తాడు. ఆ నగరంలో జీవుడలా బాధలు అనుభవిస్తూ, సంవత్సరం పూర్తయిన తరువాత, పుత్రుడు సమర్పించే ఆబ్దిక పిండాన్ని భుజించి, కొద్దిగా బలాన్ని పుంజుకుంటాడు.

16. మహాభీతి పురం: సంవత్సరీక శ్రాద్ధం ద్వారా కొంచెం శక్తిని పొందిన ప్రేత జీవుడు, యముడి పట్టణానికి దగ్గరలో వున్న మహాభీతి పురానికి చేరుకుంటాడు. ఆ నగరంలో, తనకు సంక్రమించిన ప్రేత శరీరాన్ని విడిచి పెట్టేస్తాడు. ఆ తరువాత, బొటన వ్రేలంత పరిమాణంతో, వాయువుతో సహా పదిహేడు తత్త్వాలతో కూడిన సూక్ష్మ శరీరాన్ని, జీవుడు పొందుతాడు. అయితే, దానితో పాటు పూర్వ జన్మలో చేసిన కర్మల ఫలితాలను అనుభవించటానికి, ఒక యాతనా శరీరాన్ని కూడా పొంది, యమభటులతో కలసి, ఆకాశమార్గంలో తిరుగుతుంటాడు.

ఈ వివరాలన్నీ చెప్పిన తరువాత, ‘అత్యంత భయంకరమైన యమపురికి నాలుగు ద్వారాలుంటాయి. ఇప్పటి దాకా నేను నీకు చెప్పినది దక్షిణ మార్గం గురించి మాత్రమే. ఈ విధంగా పాపాత్ములు యమ మార్గంలో ఎన్నో రకాల కష్టాలూ, బాధలూ అనుభవిస్తార’ని, శ్రీ హరి గరుత్మంతుడికి వివరించాడు.

ఓం నమో భగవతే వాసుదేవాయ!

Thursday, October 26, 2023

మంగళసూత్రం!!! Mangal Sutra


మంగళసూత్రం!!!

క్షీర సాగర మధన సందర్భంలో మాంగళ్యవివరణ.. “మ్రింగెడివాడు విభుండని, మ్రింగెడిదియు గరళమ్మనియు, మేలని ప్రజకున్ మ్రింగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబు నెంత మదినమ్మినదో!

పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవిగా ఉన్నాడంటే, అది ఆయన గొప్ప కాదట.. అమ్మ పార్వతీ దేవి కంఠాన ఉన్న మాంగల్యాభరణం గొప్పదనమట..

మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునా ।
కంఠే భద్నామి సుభగే
త్వం జీవ శరదాం శతం ।।

'ఓ సుభగా! నా జీవనానికి ఆధారమైన ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నువ్వు దీనిని ధరించి, నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు నూరేళ్ళు జీవించు.. అంటే, పుణ్యస్త్రీగా, ముత్తయిదువగా, సకల సౌభాగ్యాలతో జీవించు' అని స్పష్టముగా తెలుస్తున్నది.

పూర్వం భారత దేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు, ఎటువంటి ఆచారాలూ కట్టుబాట్లూ ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి.

భారతావనిలో పిండారీలు, థగ్గుల వంటి కిరాత జాతులవారు వలస వచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకుపోయేవారు. 

మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు, ఏ హానీ చేయకుండా విడిచి పెట్టేసేవారు. కిరాతకులు కూడా ఈ మంగళ సూత్రాన్ని గౌరవించారు. అలా కోట్లాది మగువల మాన ప్రాణాలను కాపాడిందీ మంగళసూత్రం. అందుకే అప్పటినుండీ ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్ళి చేసి మాంగల్యం వేసేవారు.

ఆదిశంకరాచార్యుల వారు వ్రాసిన సౌందర్య లహరి పుస్తకంలో కూడా మంగళ సూత్రానికి విశిష్టతను కల్పించారు.

మంగళసూత్రంలో ముత్యం, పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది. ఎందుకంటే, ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకూ, అన్యోన్య దాంపత్యములకూ కారకుడు.. శారీరకంగా నేత్రములూ, క్రొవ్వు, గ్రంథులూ, సిరలూ, ధమనులూ, స్తనములూ, స్త్రీల గుహ్యావయములూ, నరములూ, ఇంద్రియములూ, గర్భధారణ, ప్రసవములకు కారకుడు.

పగడం కుజగ్రహనికి ప్రతీక. కుజగ్రహ దోషాల వలన అతి కోపం, కలహాలు, మూర్ఖత్వం, సామర్ధ్యము, రోగము, ఋణపీడలు, అగ్ని, విద్యుత్భయములు, పర దూషణ, కామ వాంఛలు, దీర్ఘ సౌమాంగల్యము, దృష్టి దోషము ఇత్యాదులు, మరియు శారీకంగా ఉదరము, రక్తస్రావము, గర్భస్రావము, ఋతుదోషములూ మొదలగునవి.

భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రంలో ముత్యానికి మించిన విలువైనది లేనే లేదు. దానికి తోడు జాతి పగడం ధరించమని మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధమున్నది. ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు (కుజుడు), తెలుపు (చంద్రుడు) స్వీకరించి, స్త్రీ భాగంలోని అన్ని నాడీ కేంద్రములనూ ఉత్తేజ పరచి, శారీరకంగా, భౌతికంగా ఆ జంట గ్రహాలు, స్త్రీలలో వచ్చే నష్టాలనూ, దోషాలనూ తొలగిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు.

కనుక చంద్ర కుజుల కలయిక, ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యత వహిస్తాయో, అలాగే ముత్యం, పగడం రెండూ కలిపిన మంగళసూత్రం, స్త్రీకి అత్యంత శుభ ఫలితాలను సమకూరుస్తుంది.

పాశ్చాత్య అనుకరణ వెర్రిలో ఊగుతున్న మన ఆడ కూతుర్లను మందలించైనా, తిరిగి మన ధర్మం వైపుకు తీసుకు వద్దాము. దీని విశిష్టతను ప్రతి ఒక్కరికీ అర్ధం అయ్యేంత వరకూ తెలియ పరుద్దాము..

Wednesday, October 25, 2023

మనిషిని దుఃఖపూరితంగా, చికాకు పరిచేలా చేసేవి ఏమిటి? భగవద్గీత Bhagavad Gita Chapter 17

 

మనిషిని దుఃఖపూరితంగా, చికాకు పరిచేలా చేసేవి ఏమిటి?

'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (27 – 31 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 27 నుండి 31 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/rHBlo2Ia35g ]


ఎటువంటి కర్త రజోగుణములో ఉన్నట్టు పరిగణించబడతాడో చూద్దాము..

00:46 - రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్ధో హింసాత్మకోఽశుచిః ।
హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః ।। 27 ।।

కర్మఫలముల పట్ల ఆసక్తితో ఉంటూ, దురాశగలవాడై, హింసా-ప్రవృత్తి కలిగి, అపవిత్రతతో ఉండి, మరియు హర్ష-శోకములచే ప్రభావితమౌతూ ఉండే కర్త, రజోగుణములో ఉన్నట్లు పరిగణించబడతాడు.

రాజసిక కర్తలు ఇక్కడ వివరించబడుతున్నారు. సాత్త్విక కర్తలు, ఆధ్యాత్మిక పురోగతిచే ప్రేరణ పొందితే, రాజసిక కర్తలు భౌతిక వస్తు విషయ సంపాదన కొరకు, అత్యంత ఆసక్తితో ఉంటారు. ఇక్కడున్న ప్రతిదీ తాత్కాలికమైనదే అనీ, మరియు అన్నింటినీ ఇక్కడ ఎదో ఒకరోజు వదిలి వేయాలనీ అర్థంచేసుకోరు. మితిమీరిన రాగముతో, భావోద్వేగానికి లోనవుతూ, వారు ఆలోచనలో పవిత్రత కలిగి ఉండరు. వారు కోరుకునే ఆనందము, ఈ ప్రాపంచిక వస్తువులలో ఉన్నదన్న నమ్మికతో ఉంటారు. అందుకే వారికి అందిన దానితో తృప్తి చెందక, 'లుబ్దః' అంటే, ఇంకా కావాలనే దురాశతో ఉంటారు. ఇతరులు తమకన్నా ఎక్కువ సాధిస్తూ, లేదా ఎక్కువ భోగిస్తూ ఉంటే, వారు హింసాత్మకముగా మారతారు. వారి ప్రయోజనం సిద్ధించటానికి, ఒక్కోసారి నైతికతను విడిచిపెట్టటం వలన, అశుచిః అంటే, అపవిత్రముగా అయిపోతారు. వారి కోరికలు తీరినప్పుడు, అతిగా సంతోష పడతారు. అవి తీరకపోతే, నిరాశ చెందుతారు. ఈ విధంగా వారి జీవితాలు, హర్షము, శోకముల మిళితముగా ఉంటాయి.

02:21 - అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోఽలసః ।
విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే ।। 28 ।।

క్రమశిక్షణారాహిత్యంతో ఉన్నవారు, తుచ్చులు, మూర్ఖులు, ధూర్తులు, నీచులు, బద్ధకస్తులు, నిరాశతో ఉండేవారు, మరియు నిర్లక్ష్యంతో కాలవిలంబన చేసే కర్తలను, తమోగుణ కర్తలు అంటారు.

శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు, తామసిక కర్తలను గురించి వివరిస్తున్నాడు. వారి మనస్సు చెడు భావములలో నిమగ్నమై పోవటం వలన, వారు అయుక్త, అంటే, క్రమశిక్షణ తప్పి ఉంటారు. ఏది సరియైనదో, ఏది చెడుమార్గమో చెప్పే ఉపదేశాలను, శాస్త్రములు మనకు అందిస్తాయి. కానీ, తమోగుణ పనివారు, 'స్తబ్ధః' అంటే, మూర్ఖ చిత్తులు. వారు తమ చెవులను, మరియు మనస్సునూ, సరియైన తర్కబద్ధ విషయములను గ్రహించటానికి, సిద్దముగా ఉంచరు. అందుకే వారు తరచుగా, శఠః అంటే, మోసప్రవృత్తి కలవారై, మరియు నైష్కృతిక అంటే, నిజాయితీ లేని నీచ ప్రవృత్తి కలవారై ఉంటారు. వారు ప్రాకృతః అంటే, అసభ్యకరంగా ఉంటారు. ఎందుకంటే, వారు తమ పశు-బుద్ధిని నియత్రించుకోవటం యొక్క అవసరాన్ని గ్రహించలేరు. వారు చేయవలసిన కర్తవ్యములు ఉన్నా, ఆ పరిశ్రమను కష్టతరమైనదిగా, మరియు దుఃఖకరమైనదిగా పరిగణిస్తారు. అందుకే వారు సోమరితనంతో, మరియు కాలయాపన చేసే వారుగా కొనసాగుతారు. వారి యొక్క తుచ్ఛమైన నీచ ఆలోచనలు, అందరికన్నా వారినే ఎక్కువగా ప్రభావితం చేస్తాయి; అవి వారిని దుఃఖపూరితంగా, మరియు చికాకు పరిచేలా చేస్తాయి.

04:05 - బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ।
ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ ।। 29 ।।

ఇక వినుము ఓ అర్జునా.. ప్రకృతి త్రిగుణముల ప్రకారం, బుద్ధి మరియు ధృతుల యందు భేదమును విస్తారముగా వివరిస్తాను.

గత తొమ్మిది శ్లోకాలలో, శ్రీ కృష్ణుడు కర్మ యొక్క అంగములను వివరించివున్నాడు. ఈ మూడు అంగములూ, ఒక్కోటి మూడు రకాలుగా ఉంటాయని చెప్పివున్నాడు. ఇక ఇప్పుడు, ఈ కర్మ యొక్క శ్రేష్ఠత, మరియు పరిమాణములను ప్రభావితం చేసే రెండు విషయములను వివరిస్తున్నాడు. అవి కర్మను ప్రేరేపించటమే కాక, దానిని నియంత్రిస్తూ, దిశానిర్దేశం కూడా చేస్తాయి. ఇవే బుద్ధి మరియు ధృతి. బుద్ధి అంటే, ఏది మంచో ఏది చెడో తెలుసుకోగల విచక్షణా సామర్ధ్యం. ధృతి అంటే - తీసుకున్న పనిని, కష్టాలు, అవరోధాలు ఉన్నా, ఎట్టి పరిస్థితిలోనైనా సాధించాలనే అంతర్లీనంగా ఉండే సంకల్ప బలం. ఈ రెండూ కూడా, ప్రకృతి త్రిగుణముల ప్రకారంగా, మూడు రకాలుగా ఉంటాయి.

05:14 - ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే ।
బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ ।। 30 ।।

ఓ పార్థా, ఏది సరియైన పని, ఏది చెడు పని; ఏది కర్తవ్యము, ఏది కర్తవ్యము కాదు; దేనికి భయపడాలి, దేనికి భయపడనవసరం లేదు; ఏది బంధకారకము, ఏది మోక్షకారకమని అర్థమైనప్పుడు, బుద్ధి సత్త్వగుణములో ఉన్నదని చెప్పబడును.

మనం నిరంతరం మన స్వేచ్ఛా చిత్తమును ఉపయోగించుకుని, నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. మన ఈ నిర్ణయముల ఎంపికే, మనం జీవితంలో ఎటువెళతామో నిర్ణయిస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోవటానికి, ఒక అభివృద్ధి చెందిన ఉన్నతమైన విచక్షణా సామర్థ్యము అవసరం. అర్జునుడికి సరైన విచక్షణా జ్ఞానమును అందిచటానికే, భగవద్గీత అతనికి ఉపదేశించబడినది. మొదట్లో అర్జునుడు తన కర్తవ్యము పట్ల అయోమయంలో ఉన్నాడు. తన బంధువుల పట్ల విపరీతమైన మమకారాసక్తి, అతనిని ఏది సరైన పనో, ఏది కాదో అన్న నిర్ణయంపట్ల అయోమయానికి గురి చేసింది. బలహీనతతో మరియు భయంతో, తీవ్ర అయోమయంలో ఆయన, భగవంతునికి శరణాగతి చేసి, ఆయనను తన కర్తవ్యము పట్ల జ్ఞానోపదేశం చేయమని, వేడుకున్నాడు. భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణ భగవానుడు, అర్జునుడికి విచక్షణా జ్ఞానమును పెంపొందించుకోవటానికి దోహద పడ్డాడు. సత్త్వ గుణము, బుద్ధిని జ్ఞానముచే ప్రకాశింపచేస్తుంది. అది వస్తువులూ, పనులూ, మరియు భావాలలో, ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకోగలిగే విచక్షణను పెంపొందింప చేస్తుంది. ఏ రకమైన కర్మ చేయాలి, ఏ రకమైన పని విడిచిపెట్టాలి; దేనికి భయపడాలి, దేనిని పట్టించుకోవలసిన అవసరం లేదు - అన్న జ్ఞానాన్ని, మనకు సత్త్వ గుణ బుద్ధిః ఎఱుకలోకి తెస్తుంది. అది మన వ్యక్తిత్వంలోని లోపాల యొక్క కారణాన్నీ, మరియు వాటికి పరిష్కారాన్నీ తెలియచేస్తుంది.

07:16 - యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ ।
అయథావత్ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ ।। 31 ।।

ఎప్పుడైతే బుద్ధి ఏది ధర్మము, ఏది అధర్మము అన్న అయోమయములో ఉంటుందో, ఏది సరియైన ప్రవర్తన, ఏది తప్పుడు ప్రవర్తన అని తెలుసుకోలేకపోతుందో, అప్పుడా బుద్ధి రజోగుణములో ఉన్నట్టు.

వ్యక్తిగత మమకారాసక్తుల వలన, రాజసిక బుద్ధి మిశ్రితమైపోతుంది. కొన్ని కొన్ని సార్లు స్పష్టంగా చూడగలుగుతుంది. కానీ, స్వార్థ ప్రయోజనం కలగాలనుకున్నప్పుడు, అది కళంకితమై, అయోమయంలో పడిపోతుంది. ఉదాహరణకి, కొంతమంది వారి వృత్తులలో అత్యంత నైపుణ్యం కలిగి ఉంటారు కానీ, కుంటుంబపర సంబంధాలలో పరిణితి లేని ప్రవర్తనతో ఉంటారు. వారు వృత్తి వ్యాపారాలలో ఏంతో విజయం సాధిస్తారు కానీ, కుటుంబ వ్యవహారాలలో ఘోర వైఫల్యం చెందుతారు. ఇది ఎందుకంటే, వారి యొక్క మమకారాసక్తియే, వారిని సరైన దృక్పథం, మరియు నడవడికతో ప్రవర్తించకుండా చేస్తుంది. రాజసిక బుద్ధి, రాగద్వేషములూ, ఇష్టాఇష్టములచే ప్రభావితమై, ఏది మంచి, ఏది చెడు అన్న విషయాన్ని సరిగ్గా తెలుసుకోలేదు. ఏది ముఖ్యము, ఏది అనావశ్యకము, ఏది నిత్యము, ఏది తాత్కాలికము, ఏది విలువైనది, మరియు ఏది అల్పమైనదన్న విషయంలో, అది అయోమయంలో ఉంటుంది.

08:44 - ఇక మన తదుపరి వీడియోలో, చీకటితో ఆవృత్తమై ఉండే తమోగుణ బుద్ధి ఏ విధంగా ఉంటుందో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, October 23, 2023

‘ధర్మ ద్వేషులు’ ఎటువంటి వారైనా అంతమొందక తప్పదు! Mahabharatam


‘ధర్మ ద్వేషులు’ ఎటువంటి వారైనా అంతమొందక తప్పదు!
భీముడి కొడుకు మరణించినప్పుడు శ్రీ కృష్ణుడు ఎందుకు ఆనందించాడు?

మహాభారతంలో ఎందరో వీరులూ, యోధానుయోధులూ ఉన్నారు. వారితోపాటు ఈ ఇతిహాసంలో ఎందరో వీర వనితల ప్రస్తావన కూడా మనకు కనిపిస్తుంది. శ్రీ కృష్ణుడి సుదర్శన చక్రాన్ని ఓడించిన ఆ స్త్రీ ఎవరు? శ్రీ కృష్ణుడితో ఆమె యుద్ధం చేయడానికి గల కారణం ఏంటి? భీముడి కొడుకు మరణించినప్పుడు, కృష్ణ భాగవానుడు ఎందుకు నృత్యం చేస్తూ ఆనందించాడు?  శ్రీ కృష్ణుడు ఆ రాక్షస స్త్రీని ఎలా శాంతింపజేశాడు? అనేటటువంటి ఉత్సుకతను రేకెత్తించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Q48XqOWYIr4?si=TFzLUaVcqP-EK4qZ ]


లక్క గృహం దహనమైన తరువాత, దాని నుండి బయటపడిన పాండవులందరూ అరణ్యంలో అలసిపోగా, భీముడు ఒక పెద్ద వృక్షం నీడలో అందరినీ విశ్రాంతి తీసుకోమన్నాడు. తాను వెళ్లి నీరు తీసుకుని వచ్చాడు. అందరూ అలిసిపోవటం చేత, ఓ చెట్టుకింద విశ్రమించారు. చీకటి పడింది. భీముడు వారికి కాపలాగా కూర్చున్నాడు. అయితే, పాండవులు విశ్రమించిన ప్రదేశానికి దగ్గరగా, హిడింబుడనే రాక్షసుడున్నాడు. నర వాసన వాడి ముక్కు పుటాలకు సోకింది. చెల్లెలు హిడింబను పిలిచి, “హిడింబా, మన ఆవాసానికి నరులు వచ్చారు. నోరు చవి చెడి ఉన్నది. ఆ నరులను చంపి, నాకు వండి పెట్టు” అని చెప్పాడు. అన్న ఆనతి మేరకు, హిడింబ పాండవుల దగ్గరకు వెళ్ళింది. పడుకుని ఉన్న పాండవులనూ, కాపలాగా ఉన్న భీముడినీ, చెట్టు చాటున నిలబడి చూసింది. భీముని మీద మనసు పడింది. వెంటనే, మానవకాంత రూపం ధరించి, అన్న చెప్పిన మాటలు మరచి పోయింది.

అన్నలకు కాపలాగా ఉన్న భీముడు, తన దగ్గరకు వస్తున్న హిడింబను చూశాడు. “ఎవరు నువ్వు? ఇక్కడకు ఎందుకు వచ్చావు?” అని అడిగాడు. “మహాభాగా, నా పేరు హిడింబ. నేను హిడింబుడు అనే రాక్షసుని చెల్లెలిని. నిన్ను మోహించాను. నువ్వు నాకు భర్తవయితే, నా అన్న నీకు హాని చెయ్యడు. కాబట్టి నన్ను వివాహమాడు. మా అన్న సంగతి నీకు తెలియదు. అతను ఎవరినీ లెక్కపెట్టడు. ఇది నా అన్న హిడింబాసురిడి వనము. అతను చూసిన, మిమ్ములను బతుకనీయడు. నాతో రమ్ము, నిన్ను కోరిన చోటికి తీసుకుని పోతాను. మనం సుఖాలు అనుభవిస్తాము” అని బలవంతం చేసింది, హిడింబ. దానికి భీముడు, “వీరు నా తల్లి, తమ్ములు. ఒక స్త్రీ కోసం వీళ్ళను ఎలా వదలమంటావు?” అని అన్నాడు. “ఐతే వీరిని నిద్రలేపు. అందరం వెళ్లిపోదాము” అన్నది హిడింబ. “అదేమిటి అలా అంటావు. ఎవరో రాక్షసుడు వస్తున్నాడని, సుఖంగా నిద్రిస్తున్న తల్లీ, సోదరుల నిద్ర చెడగొట్టమంటావా?” అన్నాడు భీముడు.

ఈలోగా హిడింబాసురుడు తన చెల్లెలు ఎంతకూ రాకపోయేసరికి, తానే అక్కడకు వెళ్ళాడు. అతనిని చూసి హిడింబ, భీముని చాటుకు వెళ్లి దాక్కుంది. “రాక్షసా, నిన్ను వధించి, ఈ అడవిలో రాక్షస భయం లేకుండా చేస్తాను” అని హిడింబాసురుడి మీదికి ఉరికాడు. ఇద్దరికీ ఘోర యుద్ధం జరిగింది. వారు చేస్తున్న గర్జనలకు, కుంతీ దేవీ, మిగిలిన పాండవులూ నిద్రలేచారు. హిడింబను చూశారు. “అమ్మా! నువ్వు ఎవరు?” అని అడిగింది కుంతి. “తల్లీ! నేను ఈ రాక్షసుడు హిడింబాసురుని చెల్లెలిని. నా పేరు హిడింబ. నీ కుమారుని భర్తగా వరించాను. నా అన్నయ్య, మీ కుమారుడు, భీకరంగా యుద్ధం చేస్తున్నారు” అని చెప్పింది. ఇంతలో అర్జనుడు యుద్ధం జరిగే చోటికి వెళ్ళాడు. “భీమా, తూర్పు అరుణంగా మారుతోంది. ఇది దుష్ట రాక్షసులకు అనుకూల సమయం. వెంటనే ఈ రాక్షసుడిని చంపు” అని అరిచాడు. ఆ మాటలు విని భీముడు విజృంభించి, హిడింబుని ఎత్తి గిర గిరా తిప్పి, నేలమీద పడేశాడు. హిడుంబుడి నడుము విరిగి నేలమీద పడి, ప్రాణాలు విడిచాడు. హిడింబకు ఆశ్చర్యం వేసింది.

భీముడు హిడింబను చూసి, “నువ్వు రాక్షస కాంతావు. మేము నిన్ను నమ్మము. నువ్వు మా వెంట రావద్దు” అని అన్నాడు. అప్పుడు హిడింబ కుంతీదేవిని చూసి, “అమ్మా, సర్వ ప్రాణులకూ కామ సంబంధమైన కోరికలు సామాన్యంగా ఉంటాయి. కానీ, స్త్రీలలో అవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. నేను భీముని మీద మనసు పడ్డాను. అతని కొరకు అందరినీ వదులుకున్నాను. నా కోరిక తీరకపోతే, నేనే ప్రాణాలు విడుస్తాను. మీరు నన్ను స్వీకరిస్తే, మీకు ఎంతో సహాయంగా ఉంటాను. నాకు జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది తెలుసు. మీకు జరగబోయే దానిని చెపుతాను వినండి. ఇక్కడికి కొంచెం దూరంలో, శాలిహోత్రుడనే మహాముని ఆశ్రమము ఉంది. అక్కడ ఉన్న కొలనులోని నీరు త్రాగితే, ఆకలి దప్పులు ఉండవు. మీరు అక్కడ ఉండండి. కృష్ణద్వైపాయనుడు వచ్చి, మీకు హితోపదేశం చేస్తాడు” అని చెప్పింది. ఇది విని కుంతీదేవి ఎంతో సంతోషించింది.

భీముని చూసి, “భీమసేనా, నా మాట, నీ అన్నగారైన ధర్మజు మాటగా వినుము. హిడింబ ఉత్తమకాంత. ఈమెను పెళ్లి చేసుకో. నీకు మంచి జరుగుతుంది” అని చెప్పింది. భీముడు తల్లి మాట ప్రకారం, హిడింబను పెళ్లి చేసుకున్నాడు. తరువాత అందరూ శాలిహోత్రుని ఆశ్రమములో కొంతకాలం నివసించారు. ఇంతలో హిడింబ గర్భం ధరించింది. ఆమెకు ఘటోత్కచుడు జన్మించాడు. అతడు తండ్రి మాదిరిగానే, అమిత బలవంతుడు. తల్లి వద్దనుండి రాక్షస శక్తులను పొందిన మహా శక్తివంతుడు. కొంతకాలం తరువాత పాండవులు ఆశ్రమాన్ని వదిలి వెళ్ళబోతున్న సమయంలో, ఘటోత్కచుడినీ, హిండిబినీ తనతో రమ్మని అడుగగా, అందుకు వారు నిరాకరించారు. హిండిబి తన కుమారుడితో కలిసి ఆ వనంలోనే ఉంటానని చెప్పి, వారు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఘటోత్కచుడు వారి ముందుకు వస్తాడని మాట ఇచ్చి, వారిని పంపించింది.

ధర్మరాజు ఇంద్ర ప్రస్థను పాలిస్తున్న కాలంలో, సభలో అందరూ కొలువుదీరి ఉన్న సమయంలో, ఘటోత్కచుడి వివాహ విషయం సంభాషణకు రాగా, అక్కడే ఉన్న శ్రీ కృష్ణుడు, కామాఖ్య అడవులలో ఉన్న రాక్షస జాతికి చెందిన స్త్రీ మౌర్వి, ఘటోత్కచుడికి సరైన వధువు అంటూ, ఆమె గురించి వివరించాడు. మౌర్వి పూర్వజన్మలో, అహిలావతి అనే గొప్ప నాగ కన్య. ఆమె తండ్రి నాగలోకాధిపతి అయిన వాసుకి. ఆమె గొప్ప శివభక్తురాలు. అహిలావతి కైలాసంలో పార్వతిదేవికి ఇష్టమైన సేవకురాలిగా ఉండేది. శివుని పూజ నిమిత్తం, పార్వతి దేవికి నిత్యం పూలను అందించేది. అయితే, ఒకనాడు అనుకోకుండా వాడిన పూలను శివుని పూజకు సిద్ధం చేయగా, పార్వతి దేవి ఆగ్రహించింది. ‘నువ్వు రాక్షస జాతిలో జన్మించి, రాక్షస రాణిగా పెరిగి, ఒక భయంకరమైన రాక్షసుణ్ణి వివాహం చేసుకుని బాధలు పడతావు’ అంటూ పార్వతీ దేవి శపించింది. అందుకు అహిలావతి, పార్వతి మాతను క్షమించమని అడిగి, తనను శాప విముక్తిరాలిని చేయమని అడిగింది.

దానిని వెనకకు తీసుకునే అవకాశం లేదు. కానీ, ఇంతకాలం నువ్వు చేసిన సేవలకు గాను, ఎటువంటి కష్టం నీకు రాకుండా కాపాడతానంటూ, అభయమిచ్చింది. ఆ విధంగా నాగకన్య అయిన అహిలావతి, పార్వతీదేవి శాపంతో, భూలోకంలో మురాసురుని కుమార్తెగా జన్మించింది. తన తండ్రి నరకాసురునికి సేనాధిపతి, మంచి స్నేహితుడు. మురాసురుడికి మౌర్వితో పాటు, ఏడుగురు కుమారులు కూడా జన్మించారు. నరకాసుర వధ సమయంలో, మురాసురునికీ, శ్రీ కృష్ణుడికి ఘోర యుద్ధం జరిగింది. తన ఏడుగురు కుమారులతో కలిసి మురాసురుడు రణరంగంలో పోరాడగా, వారిని శ్రీ కృష్ణుడు సంహరించాడు. తన తండ్రినీ, సోదరులనూ కోల్పొయి, మౌర్వి ఒంటరిగా మిగిలిపోయింది. శ్రీ కృష్ణుడి పై పగను పెంచుకుని, తనతో యుద్ధం చేసేందుకు సకల విద్యలను నేర్చుకుంది మౌర్వి.

ఒకనాడు మౌర్వి శ్రీ కృష్ణుడిపై యుద్ధాన్ని ప్రకటించింది. వీరిద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. మౌర్విని సంహరించేందుకు, శ్రీ కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. కానీ, అది మౌర్విని గాయపరచకుండా, తిరిగి శ్రీ కృష్ణుడి వద్దకు చేరుకుంది. అందుకు కారణం, మౌర్వికి ఎటువంటి ఆపద రాకుండా ఎల్లప్పుడు కాపాడతానని, పార్వతి మాత వాగ్దానం చేయడమే. ఆ కారణంగా, సుదర్శన చక్రం మౌర్విని ఏమీ చేయలేకపోయింది. దాంతో శ్రీ కృష్ణుడు, పగతో రగిలిపోతున్న మౌర్వికి, తన పూర్వజన్మ స్మృతులనూ, పార్వతీదేవి శాపాన్ని గుర్తు చేసి, ఆమెను శాంతింపజేశాడు.

ఆ తరువాత మౌర్వి, పార్వతిదేవి రూపమైన కామాఖ్య దేవిని పూజిస్తూ, అడవులలో జీవించసాగింది. ఈ విషయాలన్నింటినీ వివరించి, ఘటోత్కచుడికి మౌర్వి సరి అయిన జోడి అని చెప్పి, వారికి వివాహం జరిగేలా చేశాడు శ్రీ కృష్ణుడు. ఘటోత్కచుడికీ, మౌర్వికీ ముగ్గురు కుమారులు. వారిలో అత్యంత శక్తివంతుడు, మహాభారత యుద్ధం ఆసాంతం వీక్షించిన బర్బరీకుడు. ఘటోత్కచుడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గోని, గొప్ప వీరుడిగా పేరుగడించాడు. తన మాయోపాయ శక్తులతో, కౌరవ సేనలను ఇరకాటంలోకి నెట్టాడు. కర్ణుడు తన దగ్గర ఉన్న అతీంద్రియ బాణంతో, ఘటోత్కచుడిని సంహరించాడు. ఘటోత్కచుడి మరణ వార్త విన్న పాండవులు, కన్నీరు మున్నీరుగా విలపించారు. భీమసేనుడి దుఃఖానికి అంతు లేదు. కానీ, కృష్ణుడు రధం మీద నిలబడి, నాట్యమాడసాగాడు. కేరింతలు కొట్టి, సింహనాదం చేసి, ఆనందంతో పాంచజన్యం పూరించారు.

కృష్ణుడి ఈ విపరీత ప్రవర్తన చూసి అర్జునుడు ఆశ్చర్యపోతూ, "కృష్ణా! ఏమిటిది? మేమంతా ఘటోత్కచుడి మరణానికి విలపిస్తుంటే, నీవు ఆనందంతో గంతులు వేస్తున్నావు. ఏమిటి నీ ఆంతర్యం" అన్నాడు. కానీ, కృష్ణుడు తన ఆనంద హేల ఆపక, అలా పాడుతూ, ఆనందంతో గెంతుతూనే ఉన్నాడు. అంతలో అర్జునుడు తెలివి తెచ్చుకుని కృష్ణునితో, "కృష్ణా! నీవు అన్నీ తెలిసిన వాడివి. మహానుభావుడివి. నీ వింత ప్రవర్తనకు ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏమిటది?" అని అనునయంగా అన్నాడు. అప్పుడు కృష్ణుడు, "అర్జునా! నీ తండ్రి నీ క్షేమము కోరి, కర్ణుడి వద్ద నుండి కవచకుండలములు దానంగా పరిగ్రహించాడు. ఆ సమయంలో, కర్ణుడికి ప్రతిగా ఒక మహత్తర శక్తిని కానుకగా ఇచ్చాడు. అది ఒక సారి ప్రయోగిస్తే, ఒకరిని మాత్రమే చంపి, తిరిగి ఇంద్రుని చేరగలదు. దానిని కర్ణుడు నిన్ను చంపడానికి మాత్రమే దాచి ఉంచాడు.

ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితులలో, దానిని కర్ణుడు ఘటోత్కచుడి మీద ప్రయోగించాడు. కనుక ఇక కర్ణుడు నిన్ను ఏమీ చేయ లేడు. అర్జునా! కర్ణుడు దైవాంశ సంభూతుడు, అసామాన్యుడు. అతడి వద్ద ఇంద్రుడు ఇచ్చిన శక్తి ఉన్నంత వరకు, నా సుదర్శన చక్రము కానీ, నీ గాండీవం కానీ, ఏమి చేయలేదు. నీ తండ్రి కర్ణుడి కవచ కుండలములు పరగ్రహించకున్న, అతడిని నీవే కాదు, ముల్లోకాలలో ఎవరూ ఏమీ చేయ లేరు. అతడిప్పుడు సాధారణ మానవుడయ్యాడు కనుక, అతడిని ఇక నీవు సులభంగా జయించవచ్చు. ఇది నాకు సంతోషం కాదా!" అని అన్నాడు. ఇక ఘటోత్కచుడు ఎంత భీముడి కుమారుడైనా, రాక్షస వంశ సంజాతుడు. ధర్మద్వేషము, హరిద్వేషము అతడి నరనరాలలో జీర్ణించుకుని ఉంది. అతడు బ్రతికి ఉంటే, ఎప్పటికైనా నా మీదా, ధర్మం మీదా తిరగబడగలడు. అప్పుడు నేను చేయవలసిన పని, ఇప్పుడు కర్ణుడు పూర్తి చేసాడు. అని వివరించాడు. ఘటోత్కచుడి మరణం తరువాత, మౌర్వి శాప విమోచనం పొంది, అహిలావతిగా కైలాసానికి చేరుకుంది.

శుభం భూయాత్!

Wednesday, October 18, 2023

ముక్తసంగులు! భగవద్గీత Bhagavad Gita Chapter 18 - Part 127


ముక్తసంగులు!
ప్రాపంచిక మమకారాసక్తితో వస్తువిషయముల పట్ల సంగము పెడితే?

'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (22 – 26 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 22 నుండి 26 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

సాత్విక జ్ఞానమూ, రాజసిక జ్ఞానముల గురించి తెలుసుకున్నాము.. ఇప్పుడు తామసిక జ్ఞానము గురించి చూద్దాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/tS_FKddurio ]


00:50 - యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకమ్ ।
అతత్త్వార్థవదల్పం చ తత్తామసముదాహృతమ్ ।। 22 ।।

సంపూర్ణ సృష్టి అంతా, ఈ భిన్నభిన్న భాగములే అన్న విషయంలో, పూర్తిగా మనిషిని తలమునకలై పోయేట్టు చేసి, తర్కబద్ధముగా లేకుండా, మరియు సత్య దూరముగా ఉండే జ్ఞానము, తామసిక జ్ఞానమని చెప్పబడుతుంది.

ఎప్పుడైతే బుద్ధి తమోగుణ ప్రభావముచే మందకొండిగా అయిపోతుందో, అప్పుడది, భిన్నత్వమే సంపూర్ణ సత్యమన్న భావనను పట్టుకుని ఉంటుంది. అటువంటి అవగాహనా దృక్పథంలో ఉన్నవారు, తరచుగా వారికి సరి అనిపించిన పరమ సత్యము పట్ల, అతి మూర్ఖాభిమానముతో ఉంటారు. వారి జ్ఞానము తరచుగా, కనీసం తర్కబద్ధముగా కూడా ఉండదు. యధార్థమునకు దూరంగా, మరియు శాస్త్ర ఉపదేశాలకు విరుద్ధంగా ఉంటుంది. అయినా సరే, వారు మిక్కిలి పట్టుదలతో, తమ నమ్మకాన్ని ఇతరులపైకి రుద్దటానికి ప్రయత్నిస్తారు. తమను తామే భగవదనుచరులమనీ, ధర్మ-సంరక్షకులమనీ అనుకునే మతమూఢులను ఎంతోమందిని, మానవ జాతి చరిత్ర చూసి ఉన్నది. వారు మూర్ఖముగా, ఉన్మత్తులై, మతమార్పిడి ద్వారా అదే రకం బుద్ధి ఉన్న కొంతమంది అనుచరులను సంపాదించి, గుడ్డి వాడు గుడ్డివాళ్లకు దారి చూపిన రీతిలో ప్రవర్తిస్తారు. భగవంతుడికీ, మత ధర్మమునకూ సేవ చేస్తున్న పేరుతో, సామాజిక అశాంతికీ, మరియు దానియొక్క సామరస్య పూర్వకమైన అభివృద్ధికీ, ఆటంకం కలిగిస్తారు.

02:22 - నియతం సంగరహితం అరాగద్వేషతః కృతమ్ ।
అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్త్వికముచ్యతే ।। 23 ।।

ఏదైతే కర్మ శాస్త్రబద్ధముగా చేయబడినదో, రాగద్వేష రహితముగా ఉన్నదో, మరియు ఫలాపేక్ష లేకుండా చేయ బడినదో, అది సత్త్వగుణములో ఉన్నట్టని చెప్పబడినది.

మూడు రకములైన జ్ఞానములను వివరించిన పిదప, శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, మూడు విధములైన కర్మలను వివరిస్తున్నాడు. ఎంతో మంది మేధావులు, కర్మలకు సంబంధించి ఎన్నో నిర్వచనాలు ఇచ్చారు. ‘తినండి, త్రాగండి, మరియు హాయిగా ఉండండి’ అనే పద్దతి ఒకటైతే, అందరూ స్వార్థపరులై, ఎవరూ ఇతరుల గురించి ఆలోచించకపోతే, ప్రపంచంలో అది ఒక అస్తవ్యస్త స్థితికి దారి తీస్తుంది. కాబట్టి, వ్యక్తిగత ఇంద్రియ సంతృప్తితో పాటు, మనం ఇతరుల గురించి కూడా ఆలోచించాలనేది, ఇంకొకరి పద్ధతి. అంటే, ఉదాహరణకి, ఒకవేళ భర్త అనారోగ్యంతో ఉంటే, భార్య అతనిని చూసుకోవాలి; ఒకవేళ భార్య అనారోగ్యంతో ఉంటే, భర్త ఆమెను చూసుకోవాలి. ఒకవేళ ఇతరులకు సహాయం చేయటం, స్వీయప్రయోజనానికి విరుద్ధంగా ఉంటే, సొంత ప్రయోజనానికే మనం మొగ్గు చూపాలని, వారి అభిప్రాయం. మరొక సిద్ధాంతం ప్రకారం, స్వీయ-ప్రయోజనం తరువాతనే, ఇతరులకు సేవ చేయటమనే ఆలోచన తప్పు. ఇతరులకు సేవ చేయటం సహజమైన మానవ సద్గుణము. ఒక తల్లి-సింహము కూడా, తాను ఆకలితో ఉన్నా, తన పిల్లలకు ఆహారం అందిస్తుంది. కాబట్టి, ఇతరుల సేవకే ప్రాధాన్యత ఇవ్వాలి. మరికొందరు తత్త్వవేత్తలు, అంతరాత్మ చెప్పిన విధముగా అనుసరించమని చెప్తారు. అదే మనకు, ఏది సరియయిన ప్రవర్తనో చెప్పటానికి ఉత్తమమైన మార్గదర్శి అని, సూచించారు. కానీ, సమస్య ఏమిటంటే, ప్రతిఒక్కని అంతరాత్మ, వేర్వేరు విధములుగా మారదర్శకం చేస్తుంది. ఒకే కుటుంబంలో, ఇద్దరు పిల్లలకి విభిన్న విలువలూ, అంతరాత్మా ఉంటాయి. అంతేకాక, ఒకే వ్యక్తి యొక్క అంతరాత్మ కూడా, కాలంతో పాటు మారుతుంది. ఒక హంతకుడిని, తను జనులను చంపటం పట్ల పశ్చాత్తాపం పడుతున్నాడా అని అడిగితే, అయన ఇలా అనవచ్చు, ‘మొదట్లో చెడుపని చేస్తున్నట్టు అనిపించేది. కానీ, క్రమక్రమంగా, అదేదో దోమలను చంపటం లాగ మామూలు పనయిపొయింది. నాకేమీ పశ్చాత్తాపం లేదు’ అని. యుక్తమైన పని ఏదన్న విషయంలో, మహాభారతం ఇలా చెప్తున్నది: ‘ఇతరులు నీ పట్ల ఎలా ప్రవర్తిస్తే నీకు ఇష్టం ఉండదో, నీవు కూడా వారి పట్ల అలా ప్రవర్తించకు. కానీ, నీ ప్రవర్తన ఎల్లప్పుడూ, శాస్త్ర సమ్మతంగా ఉండేలా చూసుకో.’ ఇతరులు నీపట్ల ఎలా ఉండాలని నీవు ఆశిస్తావో, నీవూ వారిపట్ల అలాగే ఉండాలి. అదే మాదిరిగా, శాస్త్రములు చెప్పిన విధంగా తన కర్తవ్యమును చేయటమే, సత్త్వ గుణములో ఉన్న కర్మ అని, ఇక్కడ శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. అంతేకాక, అటువంటి పని, రాగద్వేష రహితముగా ఉండాలి, మరియు ఫలాపేక్ష లేకుండా కూడా ఉండాలని, పేర్కొంటున్నాడు.

05:31 - యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః ।
క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతమ్ ।। 24 ।।

స్వార్థ కోరికచే ప్రేరేపితమై, అహంకారముచే చేయబడినట్టి, మరియు తీవ్ర ప్రయాసతో కూడిన పని, రజోగుణములో ఉన్నదని చెప్పబడును.

రజో గుణము యొక్క స్వభావము ఏమిటంటే, అది భౌతిక సంపత్తి కోసము, మరియు ఇంద్రియ భోగముల కొరకూ, తీవ్రమైన వాంఛను సృష్టిస్తుంది. కాబట్టి, రజోగుణ కర్మ - పెద్ద ఆశయముచే ప్రేరేపితమై, తీవ్ర పరిశ్రమతో కూడి ఉంటుంది. అది చాలా శ్రమతో ఉండి, ఎంతో శారీరక, మానసిక అలసటను కలుగచేస్తుంది. రాజసిక జగత్తు యొక్క ఒక ఉదాహరణ, నేటి కార్పొరేట్ ప్రపంచం. ఉన్నతోద్యోగులు తరచుగా, ఒత్తిడికి గురౌతున్నామని ఫిర్యాదు చేస్తుంటారు. ఇది ఎందుకంటే వారి కర్మలు సాధారణంగా, గర్వము, అహంకారముచే, మరియు మితిమీరిన అధికార దాహం, హోదా, మరియు సంపత్తిచే ప్రేరణ చెంది ఉంటాయి. రాజకీయ వేత్తలూ, అతిగా ఆందోళన చెందే తల్లితండ్రులూ, మరియు వ్యాపారవేత్తల ప్రయాస కూడా, తరచుగా రజోగుణ కర్మల కోవకే చెందుతాయి.

06:45 - అనుబంధం క్షయం హింసామనపేక్ష్య చ పౌరుషమ్ ।
మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే ।। 25 ।।

మోహభ్రాంతి వల్ల ప్రారంభించబడి, తమ యొక్క స్వ-శక్తి ఏమిటో తెలుసుకోకుండా, మరియు పరిణామాలు, జరిగే నష్టము, మరియు ఇతరులకు జరిగే హాని గురించి ఆలోచించకుండా చేసే కర్మను, తామసిక కర్మ అని అంటారు.

తమో-గుణములో ఉన్న జనుల బుద్ధి, అజ్ఞానముచే ఆవరింపబడి ఉంటుంది. వారు ఏది మంచి, లేదా ఏది చెడు అన్న దాని గురించి ఆలోచించరు, పట్టించుకోరు. కేవలం ‘తమ’ గురించీ, మరియు తమ స్వార్థ ప్రయోజనం కోసమే చూసుకుంటారు. వారు తమ దగ్గర ఎంత ధనం, లేదా ఇతర వనరులున్నాయి అని చూసుకోరు. పైగా, ఇతరులకు కలిగే ఇబ్బందిని కూడా పట్టించుకోరు. ఇటువంటి పని, వారికీ, ఇతరులకూ హాని చేకూరుస్తుంది. తామసిక కర్మ, వ్యక్తి యొక్క ఆరోగ్యమునూ, మరియు శౌర్యమునూ క్షీణింప చేస్తుంది. అది ఉత్త దండగ శ్రమ, సమయ వృధా, మరియు వనరులు కూడా వృథాయే. ఇటువంటి పనులకి ఉదారహణలు కొన్ని ఏమిటంటే, జూదము, దొంగతనమూ, భ్రష్టాచారమూ, తాగుడు వంటి దుర్గుణములు.

08:00 - ముక్త సంగోఽనహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః ।
సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే ।। 26 ।।

అహంకార-మమకార రహితముగా ఉన్నవారూ, మరియు ఉత్సాహము, ధృడసంకల్పము కలవారూ, జయాపజయముల పట్ల ఉదాసీనముగా ఉన్నవారూ, సత్త్వగుణ కర్తలని చెప్పబడ్డారు.

శ్రీ కృష్ణుడు ఇంతకు క్రితం, జ్ఞానము, కర్మ, మరియు కర్తలు, మూడు రకములుగా ఉంటారని వివరించి ఉన్నాడు. జ్ఞానము మరియు కర్మ - ఈ రెండింటిని వివరించిన పిదప - ఇక ఇప్పుడు మూడు రకములైన కర్తలను గురించి చెప్పటం ప్రారంభిస్తున్నాడు. సత్త్వ గుణ సంపన్నులు, సోమరితనంతో ఉండరని అంటున్నాడు; పైగా, వారు ఉత్సాహముతో, మరియు దృఢచిత్తముతో పని చేస్తారు. తేడా ఏమిటంటే, వారు పని చేసే దృక్పథం వేరుగా ఉంటుంది. సాత్త్విక కర్తలు, 'ముక్తసంగులు'. అంటే, ప్రాపంచిక మమకారాసక్తిచే వస్తువిషయముల పట్ల సంగముతో ఉండరు; అలాగే, ప్రాపంచిక వస్తువులు, ఆత్మకు తృప్తిని ఇవ్వగలవని విశ్వసించరు. అందుకే వారు ఉత్తమ ఆశయాలతో పనిచేస్తారు. వారి యొక్క ఉద్దేశాలు పవిత్రమైనవి కావటంచే, వారు ఉత్సాహము, మరియు ధృఢచిత్తముచే పరిశ్రమిస్తారు. పని చేస్తున్నంత సేపూ, వారి ఉత్తమమైన మానసిక దృక్పథం వల్ల, తక్కువ శక్తి వినియోగింపబడుతుంది. అందుకే, అలసట లేకుండా, వారు తమ ఉన్నత ఆశయాలను నిర్వర్తించగలుగుతారు. వారు గొప్ప కార్యములు సాధించినా, 'అనహం వాదీ' అంటే, అహంకార రహితముగా ఉంటారు. తమ గెలుపు యొక్క గొప్పతనమంతా, ఆ భగవంతునికే ఆపాదిస్తారు.

09:44 - ఇక మన తదుపరి వీడియోలో, ఎటువంటి కర్త రజోగుణములో ఉన్నట్టు పరిగణించబడతాడో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, October 16, 2023

11 భయంకరమైన అస్త్రాలు! మహాభారతం Mahabharatam

 

సృష్టి వినాశనం చేయగలిగే 11 భయంకరమైన అస్త్రాలు!
మహాభారతంలో వాడిన ఆ ఆయుధాలు అణ్వాయుధాలా?

చరిత్రలోనే అత్యంత భయాంకరమైన యుద్ధం, పాండవులకూ, కౌరవులకూ మధ్య జరిగిన మహాభారత యుద్ధం. సృష్టి ఆది నుండి నేటి వరకూ, అత్యంత ఘోరమైన యుద్ధంగా పేర్కొనబడేది, కురుక్షేత్ర సంగ్రామమే. దాదాపుగా అప్పుడు మనుగడలో ఉన్న రాజ్యాలన్నీ ఆ యుద్ధంలో పాల్గొన్నాయి. ఆ మహా సంగ్రామం జరిగిన కురుక్షేత్రమనే ప్రదేశం, ఉత్తర భారత దేశం లోని ప్రస్తుత హర్యానా రాష్ట్రంలో ఉంది. 18 రోజులపాటు నిర్విరామంగా సాగిన ఆ యుద్ధంలో, 47 లక్షల, 23 వేల, 920 మంది పాల్గోంటే, అందులో కేవలం 10 మంది మాత్రమే మిగిలారు. అంత భారీ జన నష్టం సంభవించడానికి కారణం, మహాభారత యుద్ధంలో ప్రయోగించబడిన అణ్వస్త్రాలే అనే వాదన కూడా ఉంది. ఆ నాడు జరిగినది మాములు యుద్ధం కాదని, పాశ్చాత్య చరిత్రకారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంపై దాదాపు శతాబ్ది కాలంగా, ఆ ప్రాంతాలలో ఎన్నో పరిశోధనలూ, సుదీర్ఘ చర్చలూ జరుగుతూనే ఉన్నాయి. కేవలం 18 రోజుల్లో, 47 లక్షల పై చిలుకు జనాభా మరణించడం అంటే, సామాన్యమైన విషయం కాదు. సాధరణ ఆయుధాలతో సాధ్యపడే విషయమూ కాదు. మన ధార్మిక గ్రంథాలను చూసుకున్నట్లయితే, రెండు రకాల ఆయుధాలను వివరించాయి. ఒకటి అస్త్రం, అంటే, మంత్రించి ప్రయోగించేది. రెండవది శస్త్రం, అంటే, హనికరమైన ఆయుధం. నేటి తరంలో చూసుకుంటే, మిస్సైల్ లాంటివి.  మరి మహాభారత కాలంలో ఉపయోగించిన అస్త్రశస్త్రాల గురించీ, వాటి విశిష్ఠత గురించీ, వాటిని ఎవరు ఉపయోగించారు అనే విషయాలను గురించీ, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/hOduy8rQEBM?si=-5_A25TVmp8y0G6T ]


అన్ని ఆయుధాలూ, అస్త్రాలలో కెల్లా అత్యంత ప్రముఖమైన ఆయుధం, మొదటగా చెప్పుకోవల్సినది, ‘బ్రహ్మాస్త్రం’.. అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రం గురించి, మన పురాణ గ్రంథాలలో వివరించబడింది. ఇది అత్యంత విధ్వంసకర, ప్రమాదకరమైన ఆయుధాలలో ఒకటిగా, వర్ణించబడింది. మన పురాణాల ప్రకారం, బ్రహ్మ దేవుడు బ్రహ్మాస్త్రాన్ని సృష్టించాడని, పండితులు చెబుతున్నారు. విశ్వం యొక్క అన్ని కార్యకలాపాలూ సక్రమంగా జరగడానికీ, నియంత్రణను కొనసాగించడానికీ, ఇది ఉద్దేశింపబడింది. ఈ ఆలోచనతోనే, బ్రహ్మదేవుడు ఈ ఆయుధాన్ని సృష్టించాడు. ఇది సంపూర్ణ శక్తివంతమైన ఆయుధం. దీనిని కేవలం, రోజులో ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి. రామాయణ కాలంలో విభీషణుడూ, లక్ష్మణుడూ మాత్రమే దీనిని వాడారు. మహాభారత యుద్ధంలో, ద్రోణాచార్యుడూ, అశ్వత్థామ, శ్రీ క్రిష్ణుడు, కువలాశ్యుడు, యుధిష్ఠిరుడు, కర్ణుడు, ప్రద్యుమ్నుడు, అర్జునుడూ, ఈ అస్త్ర ప్రయోగం తెలిసిన వారు. కురుక్షేత్ర యుద్ధంలో, కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి ప్రయత్నించాడు. అయితే, కర్ణుడి గురువైన పరశురాముడి శాపం కారణంగా, ఆఖరి క్షణంలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించే పద్ధతిని మరచిపోయాడు.

2. బ్రహ్మశీర్షాస్త్రం: ఇది బ్రహ్మాస్త్రం కంటే, నాలుగు రెట్లు శక్తివంతమైన ఆయుధం. ఈ అస్త్రాన్ని ఉపయోగించడం వల్ల, వినాశనం కలుగుతుంది. దీనిని ప్రయోగించిన ప్రాంతం, 12 సంవత్సరాల పాటు నిర్మానుష్యంగా మారి పోతుంది. బ్రహ్మ రూపొందించిన ఈ అస్త్రాన్ని, పరశురాముడు ద్రోణాచార్యుడికి ప్రసాదించాడు. ఇంత శక్తివంతమైన బ్రహ్మశీర్షాస్త్రాన్ని ద్రోణాచార్యుడు, తన ప్రియ శిష్యుడైన అర్జునుడికి ఇస్తూ, పూర్వం రాముడి దగ్గర ఈ అస్త్రం ఉన్నా, దాని వలన సంభవించే వినాశనాన్ని ఆలోచించి, రామ రావణ యుద్ధంలో దీనిని ప్రయోగించలేదు. దీనివలన ఈ అస్త్రం ఎంత ప్రమాదకరమైనదో, శక్తివంతమైనదో నువ్వు అర్థం చేసుకో. అనివార్యమైన సమయంలో తప్ప, ఎట్టి పరిస్థితులలోనూ దీనిని ప్రయోగించవద్దని చెప్పి, అర్జునుడికి అందించాడు.

3. బ్రహ్మండాస్త్రం: ఈ ఆయుధం, మొత్తం సౌర వ్యవస్థను, అంటే, ఈ బ్రహ్మాండాన్నే నాశనం చేసేంత శక్తివంతమైనది. ఈ ఆయుధం కొనపై, బ్రహ్మ యొక్క ఐదు తలలు ఉంటాయి. ఇది బ్రహ్మాస్త్రం, అలాగే బ్రహ్మశీర్షాస్త్రం, ఈ రెండింటి శక్తీ కలిపి ఉంటుంది. ఒక్కసారి ఈ అస్త్రాన్ని విడిచిన తరువాత, దానిని ఆపడం ఎవరి తరమూ కాదు. అది ప్రయోగించబడిన వారు రక్షింపబడే అవకాశమే లేదు. ఈ ఆయుధం, ద్రోణాచార్యుడి వద్ద ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు, ధర్మం కోసం పోరాడుతున్నందున, వారిపై దీనిని ప్రయోగించవద్దని దేవతలు ద్రోణాచార్యుడిని కోరడంతో, ఆయన దానిని ప్రయోగించలేదు.

4. నాగాస్త్రం: ఇది పాము రూపాన్ని పోలి ఉంటుంది. కురుక్షేత్ర సమయంలో అర్జునుడికి వ్యతిరేకంగా, కర్ణుడు దానిని సమర్థవంతంగా ప్రయోగించ లేక పోయాడు. యుద్ధంలో అర్జునుడి బాణాల పరంపర నుండి తప్పించుకుంటూ, కర్ణుడు అత్యంత శక్తివంతమైన నాగాస్త్రాన్ని పంపాడు. దానిని అర్జునుడి ఛాతీపై గురి పెట్టవలసి ఉంది. కానీ, కర్ణుడు అర్జునుడి మెడపై గురిపెట్టాడు. ఆ సమయంలో అర్జునుడి రథ సారధి అయిన శ్రీ కృష్ణుడు, దానిని గురి తప్పేలా చేశాడు. అందుకే అది అర్జునుడి కిరీటానికి తగిలింది. నాగాస్త్రం తగిలిన వెంటనే, ఆ కిరీటం వెయ్యి ముక్కలుగా విరిగి నేల మీద పడిపోయింది. అంతటి శక్తివంతమైన ఆయుధం, నాగాస్త్రం.

5. నారాయణాస్త్రం: ఈ అస్త్రం, శ్రీహరికి చెందినది. కురుక్షేత్ర యుద్ధంలో ఈ అస్త్రాన్ని అశ్వత్థామ, సుయోధనుని ఆజ్ఞ మేరకు, అభిమంత్రించి, పాండవ సేనపై ప్రయోగించాడు. ఆ సమయంలో మహాస్త్ర మహిమో ఏమోగానీ, ప్రకృతి అంతా అల్లకల్లోలమయి పోయింది. గగనాంగణంలోకి ప్రవేశించిన నారాయణాస్త్రం, రకరకాల ఆయుధాల రూపంలో, వేల కొలది మహాగ్ని జ్వాలలతో, పాండవేయుల సైన్యాలన్నిటా విజృంభించసాగింది. దానిని కన్నెత్తి చూడలేని పాంచాల, పాండవేయ సైన్యాలు, ఘోర ఆర్తనాదాలతో పరుగులు తీశాయి. ఆ బీభత్సాన్ని కృష్ణార్జునులు చూస్తూ, అచేతనులయ్యారు. ధర్మరాజు ఆందోళనకు అంతులేకుండా పోయింది. అందరినీ పారిపొమ్మంటూ గగ్గోలు పెట్ట సాగాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు, యోధులందరినీ వాహనాల మీద నుంచి కిందకి దూకమనీ, ఆయుధాలు వదిలేసి తలలొంచుకుని నిలబడమనీ, సూచించాడు. శ్రీ కృష్ణ భగవానుడి ఆదేశానుసారం, అందరూ నిరాయుధులై, నారాయణాస్త్రాన్ని తప్పించుకున్నారు. వేల ఆయుధాల సమాహారమైన నారాయణాస్త్రాన్ని ఎదిరించడం, ఎవరి తరమూ కాదు. దాని నుండి తప్పించుకునే మార్గం, లొంగి పోవడం మాత్రమే.

6. పాశుపతాస్త్రం: ఈ అస్త్రం కలిగినవారు ఇద్దరు మాత్రమే, మనపురాణ గాథలలో మనకు కనిపిస్తారు. ఒకరు రావణుని పుత్రుడు మేఘనాధుడు, మరోకరు పాండవమధ్యముడు అర్జునుడు. ఈ పాశుపతాస్త్రం పొందడం కోసం, అర్జునుడు కుడికాలి బొటన వేలిపై నుంచుని, చాలా కాలం తపస్సు చేశాడు. ఆ తర్వాత జరిగిన మహాభారత యుద్ధంలో, పరమేశ్వరుడు ప్రసాదించిన పాశుపతాస్త్రాన్ని కర్ణుడిపై ప్రయోగించి, అర్జునుడు విజయం సాధించాడు.

7. మహేశ్వరాస్త్రం: ఈ ఆయుధం పరమేశ్వరుడి మూడవ కన్ను యొక్క శక్తిని కలిగి ఉంటుంది. అది ఒక్కసారిగా, శత్రువులందరినీ బూడిదగా మార్చేసే శక్తికలిగినది. సమస్త లోకాలనూ, భగవంతుడి లోకి లయం చేయగలగే శక్తి సామర్థ్యాలను పొందినటువంటిది, ఈ మహేశ్వరాస్త్రం.

8. వాసవీ శక్తి: వాసవీ శక్తి, ఇంద్రుని ఆధీనంలో ఉన్న ఆయుధం. అది ఎటువంటి శత్రువులనైనా చంపగలదు. వాసవీ శక్తిని ఇంద్రుడు, కర్ణుడికిచ్చాడు. కర్ణుడు కవచ కుండలానికి బదులుగా, ఇంద్రుడి నుండి ఈ ఆయుధాన్ని పొందాడు. ఇది చాలా బలమైన ఆయుధం. ఈ ఆయుధానికి ఇంద్రుడిచ్చిన "అజేయత" అనే వరం కూడా ఉంది. దాంతో అది మరింత శక్తివంతం అయ్యింది. ఈ ఆయుధంతో, దేవతలూ, అసురులూ, మానవులూ, గంధర్వులూ, ఉరగలూ, మరియు రాక్షసులలో, ఎవరిని చంపాలనుకున్నా, వారు ఖచ్చితంగా చంపబడతారు. అయితే, దానిని ఒక్కసారి మాత్రమే ప్రయోగించగలరు. కురుక్షేత్రంలో, అర్జునుడిపై వాసవీ శక్తిని ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు, కర్ణుడు. కానీ, అనివార్య కారణాలవల్ల, యుద్ధంలో భీముని కుమారుడైన ఘటోత్కచడిపై, దానిని ఉపయోగించవలసి వచ్చింది.

9. వారుణాస్త్రం: వరుణ దేవుడికి చెందిన ఈ అస్త్రం, ఏ ఇతర ఆయుధ రూపాన్నయినా పొందగలదు. దీనిని ప్రయోగించడంతో పాటు, పొందడం కూడా ఎంతో కఠినతరం. అర్జునుడూ, సాత్యకీ, ధృష్టద్యుమ్నుడూ, ద్రోణాచార్యుల వంటి ప్రఖ్యాత యోధులు మాత్రమే, ఈ ఆయుధాన్ని కలిగి ఉన్నారు.

10. భార్గవాస్త్రం: బ్రహ్మశీర్షాస్త్రంతో సమానమైనది ఇది. ప్రపంచం మొత్తాన్నీ నాశనం చేయగలిగిన శక్తి, ఈ అస్త్రానికి ఉంది. ఒక్కసారి ఈ అస్త్రాన్ని ఉపయోగిస్తే, బూడిద కూడా మిగలదు. రక్షించుకోవడం కోసం ఈ అస్త్రాన్ని వాడితే, బ్రహ్మాస్త్రాన్నీ, బ్రహ్మశీర్షాస్త్రాన్ని కూడా నాశనం చేయగలిగిన శక్తి, దీనికి ఉంది. కురుక్షేత్రంలో ద్రోణాచార్యులు, పాండవులపై ఈ అస్త్రాన్ని ప్రయోగించారు.

11. గాండీవం: ఖాండవ వనాన్ని అర్జునుడు అగ్నికి ఆహుతివ్వడంతో, అగ్నిదేవుడు సంతోషించి, అర్జునునికి గాండీవాన్ని ప్రసాదించాడు. గాండీవం అనేది, స్వర్గంలోని గాండీవ వృక్షం ద్వారా రూపొందించబడింది కాబట్టి, గాండీవానికి తగిన రక్ష వుంది. లక్షలాది ఆయుధాలకు ఇది సమానమైనది. పలు రంగులతో కూడినది, మృదువైనది. ఈ గాండీవం, వెయ్యేళ్లు బ్రహ్మదేవుని వద్ద వుండగా, ప్రజాప్రతి వద్ద, 503 సంవత్సరాలూ, ఇంద్రుడి వద్ద 85 సంవత్సరాలూ, చంద్రుడి వద్ద 500 సంవత్సరాలూ, వరుణుడి వద్ద 100 సంవత్సరాలు ఉండింది. ఈ విల్లును గంధర్వులూ, దేవతలూ పూజించారని పురాణాలు చెబుతున్నాయి. చిత్రమేమిటంటే, దానికి అక్షయ తూణీరం ఉంది. ఎన్ని బాణాలు తీసివేస్తున్నా, అది ఖాళీ కాదు. ఎప్పుడూ శరసమృద్ధమై ఉంటుంది.

ఇవి మాత్రమే కాక, ఇంకా ఎన్నో అత్యద్భుత శక్తులు కలిగిన మంత్ర పూరితమైన అస్త్ర శస్త్రాలతో, కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అయితే, అన్ని అస్త్రాలలో కెల్లా అత్యంత బలమైన ఆయుధం, ఎంతటి శక్తి కలిగిన ఆయుధాన్నయినా మట్టి కరిపించగల ఆయుధం, సుదర్శన చక్రం. శ్రీ కృష్ణుడు యుద్ధంలో పాల్గొననందున, ఆయన దానిని కురుక్షేత్రంలో ఉపయోగించలేదు. అయితే, శ్రీ కృష్ణుడు, శిశుపాలుడిని చంపడానికి, సుదర్శన చక్రాన్ని ఉపయోగించాడు. త్రిశూలం మహాదేవుని కుండలినీ శక్తి అయినట్లే, సుదర్శన చక్రం శ్రీ హరి యొక్క కుండలినీ శక్తి. కృష్ణావతారానికి పూర్వమే, సుదర్శనం విష్ణువు దగ్గర ఉంది. విష్ణువు దుష్టసంహారణార్థం, సుదర్శనాన్ని కృష్ణావతారానికి ముందు కూడా ప్రయోగించినట్లు, పురాణగాథల ద్వారా తెలుస్తోంది. సుదర్శనశక్తి అద్భుతమైనది. ఇది శత్రువులను అగ్నివలె దహించివేస్తుంది. శత్రుసంహారం కోసం, విష్ణువు ఎప్పుడైతే సుదర్శనాన్ని ప్రయోగిస్తాడో, అప్పుడది సూర్య తేజో విరాజితమవుతుంది. శత్రుసంహారం చేసి తిరిగి భగవానుని చెంతకు చేరుకుంటుంది. మహాభారత యుద్ధంలో పాల్గోన్న యోధులు, ఈ ఆయుధాలను చాలా జాగ్రత్తగా ఉపయోగించారని గమనించాలి. ఎందుకంటే, ఇవి సమాజానికి కలిగించే సంభావ్య విధ్వంసం గురించి వారికి తెలుసు. సామూహిక విధ్వంసక ఆయుధాలను, బాధ్యతతో ఉపయోగించడం, ఆ రోజుల్లో ఒక ఆచారం. వీటిలో కొన్ని అణ్వాయుధాలుగా ఉండే అవకాశాలు ఉన్నాయనే వాదనలు, నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి.

కృష్ణం వందే జగద్గురుం!

Thursday, October 12, 2023

జ్ఞాన త్రిపుతీ! భగవద్గీత Bhagavad Gita Chapter 18


జ్ఞాన త్రిపుతీ!
మనిషి చేసే కర్మలను ప్రేరేపించే వీటి గురించి ఏమని చెప్పబడింది?

'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (17 – 21 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 17 నుండి 21 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/yrDn7Si7oPk ]


జ్ఞానము, కర్మ, మరియు కర్త.. ప్రకృతి త్రి-గుణముల పరముగా ఉండే వ్యత్యాసాలు ఏంటో చూద్దాం..

00:49 - యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే ।
హత్వాఽపి స ఇమాఁల్లోకాన్న హంతి న నిబధ్యతే ।। 17 ।।

కర్తృత్వ అహంకార భావమును, అంటే, చేసేది నేనే అన్న భావమును విడిచి పెట్టి, బుద్ధి మమకారాసక్తి రహితముగా ఉండే వారు, ప్రాణులను సంహరించినా సరే, వారు చంపినట్టు కాదు. వారు కర్మ బంధనములకు లోనుకారు.

అయితే, శ్రీ కృష్ణుడు గత శ్లోకంలో మూఢ బుద్ధిని వివరించారు. ఇప్పుడు స్వచ్ఛమైన బుద్ధిని వివరిస్తున్నాడు. పవిత్రమైన బుద్ధి కలవారు, చేసేది తామే అన్న అహంకారమును విడిచి పెట్టి ఉంటారు. తమ కర్మ యొక్క ఫలములను భోగించాలనే కోరికతో కూడా ఉండరు. ఆ విధంగా వారు, తాము చేసిన పనుల యొక్క కర్మ బంధనములలో చిక్కుకోరు. కర్మఫలాసక్తిని విడిచిపెట్టిన వారు, పాపముచే కళంకితులు కారు. భౌతిక దృక్పథం పరంగా, వారు పనిచేస్తున్నట్లే ఉంటారు కానీ, ఆధ్యాత్మిక కోణంలో, వారు స్వార్ధ ప్రయోజనాలకు అతీతంగా ఉంటారు. కాబట్టే వారు కర్మఫలములకు బందీలు కారు. మనం సాధించిన వాటన్నిటికీ, కేవలం మనమొక్కళ్ళమే కారణమన్న భావన విడిచి పెడితే, అది మనలను కర్తృత్వ అహంకార భావన నుండి విముక్తి చేస్తుంది.

02:08 - జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా ।
కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మసంగ్రహః ।। 18 ।।

జ్ఞానము, జ్ఞేయము అంటే జ్ఞాన విషయము, జ్ఞానమును ఎఱింగినవాడు - ఇవి మూడూ కర్మను ప్రేరేపించును. కర్మ యొక్క ఉపకరణం, క్రియ, కర్త - ఈ మూడూ కర్మ యొక్క అంగములు.

కర్మ శాస్త్రం విషయంపై ఒక చక్కటి పద్ధతి ప్రకారం ఉన్న తన విశ్లేషణలో, శ్రీ కృష్ణుడు దాని యొక్క అంగములను వివరించి ఉన్నాడు. చేసే పనుల యొక్క కర్మ ప్రతి ఫలములను కూడా వివరించాడు. అలాగే, కర్మ ప్రతిచర్యల నుండి ఎలా విముక్తి అవ్వవచ్చో కూడా చెప్పాడు. ఇక ఇప్పుడు, కర్మను ప్రేరేపించే మూడు రకముల కారకములను వివరిస్తున్నాడు. అవి, జ్ఞానము, జ్ఞేయము అనగా జ్ఞాన విషయము, మరియు జ్ఞాత  అంటే జ్ఞానమును తెలిసినవాడు. ఈ మూడింటినీ కలిపి, 'జ్ఞాన త్రిపుతీ' అని అంటారు. ‘జ్ఞానము’ అనేది, కర్మకు ప్రధానమైన ప్రేరణను ఇచ్చేది; అది ‘జ్ఞాత’కు, ‘జ్ఞేయము’ను గూర్చి అవగాహన కల్పిస్తుంది. ఈ మూడూ కలిపి కర్మను ప్రేరేపిస్తాయి. ఉదాహరణకు, పనిచేసే సంస్థ ఇచ్చే జీతం యొక్క జ్ఞానమే, ఉద్యోగులకు పనిచేసే ప్రేరణ ఇస్తుంది; ప్రపంచంలో ఎన్నో చోట్ల బంగారం లభిస్తున్నదనే సమాచారమే, ఎంతో మంది కూలీలు ఆయా ప్రాంతాలకు వలస పోయేటట్లు చేస్తుంది; ఒలింపిక్స్ లో పతకం గెలవటం యొక్క ప్రాముఖ్యత తెలియటం వలననే, ఎంతో మంది ఆటగాళ్ళు సంవత్సరాల తరబడి అభ్యాసం చేసేందుకు, ప్రేరణను కలిగిస్తుంది. పని యొక్క నైపుణ్యం పై కూడా, ఈ జ్ఞాన ప్రభావం ఉంటుంది. ఉదాహరణకి, ప్రముఖ విద్యాసంస్థ నుండి పొందిన పట్టాకి, ఉద్యోగ వేటలో ఎక్కువ విలువ ఉంటుంది. ఉన్నత స్థాయి జ్ఞానం కలవారు, పనిని చక్కగా చేస్తారని, పారిశ్రామిక సంస్థలు అభిప్రాయపడతాయి. అందుకే, ప్రఖ్యాత సంస్థలు, తమ ఉద్యోగుల జ్ఞాన అభ్యున్నతికి బాగా ఖర్చు పెడతాయి. రెండవ సమూహాన్ని, 'కర్మ త్రిపుతీ' అని అంటారు. దానిలో ఉండేవి - కర్త అంటే చేసేవాడు, కారణము అంటే కర్మ యొక్క ఉపకరణము, మరియు కర్మ అంటే ఆ పని. ఈ మూడూ కలిపి కర్మ అంగములని అనుకోవచ్చు. 'కర్త' అనేవాడు, 'కారణము' ను ఉపయోగించుకుని, 'కర్మ' ను చేస్తాడు.

04:35 - జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ।
ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛృణు తాన్యపి ।। 19 ।।

జ్ఞానము, కర్మ, మరియు కర్త - ఇవి ప్రకృతి త్రి-గుణముల పరముగా, ఒక్కోక్కటీ మూడు రకాలుగా ఉంటాయని, సాంఖ్య శాస్త్రం పేర్కొంటున్నది. నేను ఈ వ్యత్యాసాలు నీకు ఇప్పుడు చెబుతాను వినుము.

శ్రీ కృష్ణుడు ప్రకృతి త్రిగుణముల ప్రకారముగా, జ్ఞానము, కర్మ, మరియు కర్తలను వివరించబోతున్నాడు. భారత తత్త్వశాస్త్రాలలో ఉన్న ఆరింటిలో, సాంఖ్య శాస్త్రం ఒకటి. ఈ శాస్త్రాన్ని పురుష ప్రకృతి వాదము అంటారు. అది ఆత్మను పురుషుడిగా, అంటే, ప్రభువుగా పరిగణిస్తుంది. కాబట్టి, చాలా మంది పురుషులున్నట్టు నిర్ధారిస్తుంది. ప్రకృతి అంటే భౌతిక శక్తి. దానిచే తయారు చేయబడిన అన్ని వస్తువులూ, అందులోకే వస్తాయి. సాంఖ్య శాస్త్రము ప్రకారము, పురుషునికి ప్రకృతిని భోగించాలనే కోరికయే, దుఖానికి మూల కారణం. ఈ భోగలాలస తగ్గిపోయినప్పుడు, పురుషుడు ఈ భౌతిక ప్రకృతి యొక్క బంధనముల నుండి విముక్తి చేయబడి, నిత్య శాశ్వత పరమానందమును పొందుతాడు. సాంఖ్య శాస్త్రము, పరమ పురుషుడూ, లేదా పరమాత్మ యొక్క అస్థిత్వమును ఒప్పుకోదు. అందుకే అది ‘పరమ సత్యము’ను తెలుసుకోవటానికి సరిపోదు. అయినా కానీ, భౌతిక ప్రకృతి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవటానికి మాత్రం, ఇదే మనకు ప్రమాణం.

06:06 - సర్వ భూతేశు యేనైకం భావమవ్యయమీక్షతే ।
అవిభక్తం విభక్తేషు తత్ జ్ఞానం విద్ధి సాత్వికం ।। 20 ।।

ఏ జ్ఞానముచేనైతే, సమస్త విభిన్నమైన జీవరాశులలో, ఒకే, అవిభక్తమైన, అనశ్వరమైన అస్థిత్వము ఉన్నట్టు తెలుసుకోబడుతుందో, ఆ జ్ఞానము సత్త్వ గుణములో ఉన్నట్టు.

ఈ సృష్టి మనకు విభిన్నమైన, రకరకాల జీవరాశుల, భౌతిక వస్తువుల సమూహముగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ, ఈ మొత్తం కనిపించే భిన్నత్వానికి వెనుక ఉన్న పదార్థము, ఆ పరమేశ్వరుడే. ఎలాగైతే ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్, అన్ని విద్యుత్ ఉపకరణములలో ప్రవహించేది ఒకే విద్యుత్తని ఏ విధంగా గమనిస్తాడో; ఒక కంసాలి, అన్ని ఆభరణములలో ఉండేది ఒకే బంగారమని ఎలాగైతే తెలుసుకుంటాడో, ఈ జ్ఞాన దృష్టి కలవారు, ఈ సృష్టిలో ఉన్న భిన్నత్వం వెనుక, ఏకత్వమును చూస్తారు. నాలుగు సూత్రముల ఆధారంగా, భగవంతుడిని శ్రీ కృష్ణ రూపంలో, అద్వయ జ్ఞాన తత్త్వముగా పరిగణించవచ్చు.

1. సజాతీయ భేద శూన్యము, అంటే, సజాతీయమైన వాటికంటే వెరైనది కాదు: రాముడు, శివుడు, విష్ణువు వంటి వేరే ఇతర అన్ని భగవత్ స్వరూపములకూ, శ్రీ క్రిష్ణుడు అబేధము. ఎందుకంటే వీరందరూ ఒకే భగవంతుని యొక్క భిన్నమైన వ్యక్తములు. శ్రీ కృష్ణుడు, ఆత్మలకు కూడా అభేదమే. అవి ఆయన యొక్క అణు అంశలే. ఎలాగైతే అగ్ని జ్వాలలు, అగ్ని యొక్క చిన్న చిన్న భాగాలో.. అంశ అనేది, దాని యొక్క పరిపూర్ణ భాగమునకు అభేదము.

2. విజాతీయ భేద శూన్యము, అంటే, విజాతీయమైన వాటి కంటే భేదము లేని వాడు: భగవంతునికి విజాతీయమైనది, మాయ; అది జడమైనది, భగవంతుడు, చైతన్యవంతుడు. కానీ, మాయ కూడా భగవంతుని యొక్క శక్తి స్వరూపమే. ఎలాగైతే అగ్ని యొక్క శక్తులైన వేడిమి, వెలుగు, దాని కంటే అభేదమో, శక్తి మరియు శక్తి మంతుడు కూడా, అభేదములే.

3. స్వగత భేద శూన్యము, అంటే, తన యొక్క వేర్వేరు అంగములు ఆయనకు అభేదము: భగవంతుని శరీరము యొక్క మహాద్భుతమైన లక్షణమేమిటంటే, దానిలో అన్ని అంగములూ, మిగతా అన్ని అంగముల పనీ చేస్తాయి.

బ్రహ్మ సంహిత ఇలా పేర్కోన్నది. తన శరీరము యొక్క అన్ని అంగములతో భగవంతుడు చూడగలడు, వినగలడు, మాట్లాడగలడు, వాసన చూడగలడు, తినగలడు, మరియు ఆలోచించగలడు. అందుకే భగవంతుని యొక్క అన్ని అంగములూ, ఆయనకు అభేదములే.

4. స్వయం సిద్ధము, అంటే, తనకు వేరే ఏ ఇతరమైన వాటి ఆధారమూ అవసరం లేదు: మాయ, మరియు ఆత్మ, రెండూ కూడా తమ అస్థిత్వం కోసం, భగవంతుని పైనే ఆధారపడి ఉన్నాయి. ఆయనే గనక వాటిని శక్తివంతము చేయకపోతే, వాటికి అస్థిత్వం లేదు. అదే సమయంలో, భగవంతుడు సర్వ స్వతంత్రుడు, మరియు తన మనుగడ కోసం ఏ ఇతరమైన వాటి ఆధారమూ, ఆయనకు అవసరం లేదు. సర్వోన్నతుడైన శ్రీ కృష్ణ ప్రరమాత్మ, ఈ పై నాలుగు లక్షణములనూ కలిగి ఉన్నాడు. అందుకే ఆయన, అద్వయ జ్ఞాన తత్త్వము.. వేరే మాటల్లో చెప్పాలంటే, సృష్టిలో ఉండే ప్రతిదీ ఆయనే. ఈ అవగాహనతో, సమస్త సృష్టినీ ఆయనతో ఏకత్వముతో చూస్తే, అది సాత్త్విక జ్ఞానమవుతుంది.

09:35 - పృథక్త్వేన తు యత్ జ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ ।
వేత్తి సర్వేషు భూతేషు తత్ జ్ఞానం విద్ధి రాజసమ్ ।। 21 ।।

ఏ జ్ఞానము చేతనయితే, భిన్నభిన్న దేహములలో ఉన్న నానా రకాల ప్రాణులు వేర్వేరుగా, ఒకదానికొకటి సంబంధము లేనట్టుగా చూడబడతాయో, ఆ జ్ఞానము రాజసికమని, అనగా రజోగుణములో ఉన్న జ్ఞానమని గ్రహించుము.

శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, రాజసిక జ్ఞానమును వివరిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ జగత్తు భగవత్ సంబంధముగా చూడబడదో, ప్రాణులు వేర్వేరుగా, తమతమ జాతి, తెగ, కులము, వర్గము, జాతీయత వంటి వాటిచే భిన్నముగా గ్రహించబడతాయో, ఆ జ్ఞానము రజోగుణ జ్ఞానమని చెప్పబడుతుంది. అటువంటి జ్ఞానము, ఒకే మానవ జాతిని ఎన్నో రకాలుగా విభజిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానము అందరినీ దగ్గరికి తెస్తుందో, ఐక్యతగా ఉంచుతుందో, ఆ జ్ఞానము, సత్త్వగుణ ప్రధానమైనది. విభజించే జ్ఞానము, రజోగుణ ప్రధానమయినది.

10:39 - ఇక మన తదుపరి వీడియోలో, ఎటువంటి జ్ఞానము, ‘తామసిక’ జ్ఞానమని చెప్పబడుతుందో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

క్రతవే నమః Kratave Namaha


'క్రతవే నమః' - ఈ నామ జపంతో ఏం జరుగుతుంది?

అది సద్గురువు శ్రీ రాఘవేంద్ర స్వామి వారు కుంభకోణం విజయం చేసిన సమయం. తంజావూరు జిల్లా మొత్తం కరవు కాటకాలతో బాధ పడుతున్నది. ఒక పుష్కరకాలంగా సకాలంలో వానలు లేక, ప్రజలంతా ఆకలి దప్పులతో కటకటలాడుతున్నారని, స్థానికులు రాఘవేంద్ర స్వామికి విన్నవించుకున్నారు. అప్పుడు తంజావూరును  పాలిస్తున్న చోళ రాజు, రాఘవేంద్రస్వామి మహిమలు విని, రాఘవేంద్ర స్వామి వారిని శరణు వేడాడు. 'స్వామీ, ఒకప్పుడు ఈ చోళనాడు అన్నదాతగా ప్రసిద్ధి గాంచింది. అటువంటి సశ్యశ్యామలమైన ఈ ప్రాంతం, యిప్పుడు కరవుతో కటకటలాడి పోతున్నది. మా ప్రజలను మీరే కాపాడాలి' అని వేడుకున్నాడు.



ఆనాటి తంజావూరు ప్రజల ప్రవర్తన, నడవడికను గమనించిన రాఘ వేంద్రస్వామి, "రాజా!  భగవంతుని ప్రీత్యర్ధం, ప్రజలు నిత్యమూ ఐదు రకాల యాగాలు నిర్వర్తించాలి. వాటికి పంచ మహా యజ్ఞాలని పేరు. అవి..

1. బ్రహ్మ యజ్ఞం... నిత్యం వేదాల నుండి ఒక భాగాన్ని పారాయణం చేయాలి.
2. దేవ యజ్ఞం... అగ్నిహోత్రం, ఔపోసన మొదలైన వైదిక కర్మలతో, దేవతలను తృప్తి పరచే ఆరాధన చేయాలి.
3. పితృయజ్ఞం... పితృదేవతలకి చేయ వలసిన తర్పణలు, కర్మలు యధా విధిగా చేయాలి.
4. మనుష్య యజ్ఞం... ఇంటికి వచ్చిన అతిధులకూ, పేదవారికీ భోజనం పెట్టాలి.
5. భూత యజ్ఞం... పశుపక్ష్యాదులకు ఆహారం పెట్టాలి.

ఈ ఐదు విధాలైన యాగాలతో పాటు, వైదిక కర్మలన్నింటినీ శాస్త్రోక్తంగా అనుష్టించి, శ్రీ మహావిష్ణువును సంతోష పరిస్తే,  సమృధ్ధిగా వర్షాలు కురిసి, పంటలు పండుతాయి. ప్రకృతి పచ్చదనాలతో కళకళలాడుతుంది. మీ రాజ్య ప్రజలు తమ వైదిక కర్తవ్యాలు విస్మరించినందు వలన, ఈ రాజ్యంలో క్షామం తాండవిస్తున్నది.." అని చెప్పారు. ''ఇక్కడ వెంటనే 'కార్యేష్టి' అనే యాగాన్ని 21 రోజులపాటు శాస్త్రోక్తంగా చేయండి. వర్షాలు కురుస్తాయి, సుభిక్షమౌతుంది'' అని విశద పరిచారు.

మహారాజు ఆ విధంగానే యాగాలకు ఏర్పాటు చేశాడు.  పండిత పురోహితుల ద్వారా యాగాలు చేయించి, మహా విష్ణువును సంతుష్టి పరచి, వానలు పడేటట్టు చేశారు గురు రాఘవేంద్రులు. కరుణామయుడైన మహా విష్ణువు, 12 ఏళ్ళ కరవు తీర్చాడు. రాఘవేంద్రుల 
మహిమకు ముగ్ధుడైన తంజావూరు మహరాజు, స్వామికి ఒక బంగారు హారాన్ని కానుకగా ఇచ్చాడు. భోగ భాగ్యాల మీద ఆసక్తి లేని రాఘవేంద్ర స్వామి, తనకు ఉన్నదంతా ఆ శ్రీ మహావిష్ణువుకే సమర్పిస్తారు. అందుకే మహారాజు ఇచ్చిన బంగారు హారాన్ని యాగ గుండంలో వేసి, నారాయణార్పణం చేశారు.

తను కానుకగా యిచ్చిన బంగారు గొలుసును అగ్ని గుండంలో వేయడం చూసిన మహారాజుకు కోపం వచ్చింది. మహారాజు ముఖ కవళికలూ, మనో భావాలనూ పసి గట్టిన రాఘవేంద్ర స్వామి, హృదయ పూర్వకంగా యివ్వని ఆ గొలుసును భగవంతునికి సమర్పించ కూడదని భావించి, తన చేతిని అగ్ని గుండంలో పెట్టి, ఆ గొలుసును మరల బయటకు తీసి, మహారాజుకే యిచ్చి వేశారు. రాఘవేంద్రుల చేతులకు గానీ, ఆ నగకు గానీ, అగ్ని తాకిడి చిహ్నాలు ఏవీ కనిపించ లేదు. అది చూసిన మహారాజు విస్మయంతో, తన ప్రవర్తనకు పశ్చాత్తపం చేందాడు. తరువాతి కాలంలో మహారాజు, రాఘవేంద్ర స్వామి వారి భక్తుడిగా మారినట్లు చారిత్రక కధనం.

పంచ యజ్ఞాలతో నారాయణుని ఆరాధిస్తారు.. ఈ యజ్ఞాలతో నారాయణుని హృదయం ఆనందంతో  కరిగి, అనుగ్రహం ప్రసాదిస్తాడు. ఈ పంచ యజ్ఞాలకు 'క్రతువుల'ని పేరు. నారాయణుని క్రతువులతో ఆరాధిస్తున్నందు వలన, నారాయణుడు 'క్రతుః' అని పిలువ బడుతున్నాడు. ఈ నామము, సహస్ర నామాలలో 449వ నామము.

'క్రతవే నమః' అని అనునిత్యం జపించే భక్తుల జీవితాలలో, ఆ శ్రీమన్నారాయణుడు సదా సుఖ సంతోషాలను అనుగ్రహిస్తాడు...

ఓం సద్గురు శ్రీ మంత్రాలయ రాఘవేంద్రాయ నమః

Tuesday, October 10, 2023

జన్మ - విముక్తి Birth and Death


ఎందుకీ జన్మ? ఎప్పుడు విముక్తి?

జీవితం మీద విరక్తి కలిగినప్పుడు, ‘ఛీ.. ఎందుకీ జన్మ?’ అని మనలో మనం ఆక్రోశించుకుంటూ ఉంటాము. అసలు మనిషి జన్మ ఏమిటి? దీనికి విముక్తి ఎప్పుడనే విషయాలను తెలుసుకోవాలనుకున్న వారు ముందుకు సాగండి..

[ మరణించిన తరువాత కర్ణుడు తిరిగి భూమిపైకి ఎందుకు పంపబడ్డాడు?: https://youtu.be/vfBBesZcTbw?si=FoJjN6HAcHW4cOKK ]


నిజంగా మానవ జన్మ అంత నీచ నికృష్టమైనదా? అసలు మనం ఈ భూమిమీద ఎందుకు పుట్టము? ఎందుకు చనిపోతున్నాము? చనిపోయాక ఎక్కడికి పోతాము? ఇలాంటి ప్రశ్నలన్నీ మనిషికి సర్వ సాధారణంగా కలుగుతుంటాయి. మనం అనుకున్నట్లుగా మనిషి జన్మ నీచమైనది కాదు.. ఉత్తమోత్తమమైనది.. ‘పునరపి జననం, పునరపి మరణం’ అన్నారు పెద్దలు. జన్మ అంటే మళ్లీ పుట్టడం. అంటే, చనిపోయిన వారు మళ్ళీ పుట్టడమే జన్మ. కానీ, తిరిగి మానవ జన్మే వస్తుందని మాత్రం చెప్పలేము. ఎందుకంటే, మనం ఎలాంటి జన్మ ఎత్తాలో మనం సంపాదించుకున్న జ్ఞానం మీదా, తద్వారా కర్మల మీదా మాత్రమే ఆధారపడి ఉంటుంది. కర్మ ఫలాలను బట్టే మనిషి జన్మ ఉంటుంది. మనిషి జన్మ అనేది, మనం దేవుడికి చేరువ కావడానికి మనకు దొరికిన ఓ అపురూపమైన అవకాశం. భక్తి మార్గంలో ఉండి, వైరాగ్యం చెంది, భగవంతుడిని చేరుకోవడానికి మనిషి జన్మ తప్ప మరో జన్మలో ఆ అవకాశం లేదు.

అయినా, పూర్వ జన్మ పుణ్య ఫలంతో సాలీడు, ఏనుగు, పాము, నెమలి వంటివి దేవుడిని పూజించి, ముక్తిని పొందినట్లు శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యం వంటి మన పురాణ గ్రంథాలలో ప్రస్ఫూటంగా తెలుస్తుంది. కానీ, మనిషిగా పుట్టిన వారంతా భగవంతుడికి దగ్గరయ్యే మార్గాన్ని నిజంగా ఉపయోగించుకుంటున్నారా లేదా? అనేది, మనకు మనం ఆలోచించు కోవాలి. మనిషి పుట్టినప్పటి నుంచీ తాను చెయ్యాల్సిన మంచి పనులు చేయక తప్పదు. సంసార సాగరంలో ఈదుకుంటూ పోవడం తప్ప, మనకు మరో మార్గం లేదు.

ఇవన్నీ మనుషులకేనా! చెట్లకూ చేమలకూ ఉండవా? అని మనం అనుకోవచ్చు.. ఒక చెట్టుకు మొగ్గ వచ్చి, అది పువ్వై, ఆ తర్వాత కాయగా మారింది. పండిన తరువాత కొంతకాలానికి అది నేల రాలిపోతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, పిందెగానో, కాయగానో ఉండగా దానిని కొమ్మ నుంచి కోసి వేరు చేస్తే, అది ఉన్న చోటు నుంచి నీరు కారుతుంది. కాయ మొదలు లోనూ, ఆ తడిని చూడవచ్చు. కానీ, పండు రాలినప్పుడు, కొమ్మలో ఎలాంటి తడీ ఉండదు. పండు రాలిన చోట కూడా తడి ఉండదు. కాయ కోస్తున్నప్పుడు మాత్రమే తడి ఉండటానికి కారణం, ‘అయ్యో మరిన్ని రోజులు నన్ను అంటి పెట్టుకుని ఉంటే, అది పండు అయ్యేది కదా!’ అని చెట్టు కొమ్మ కంట తడి పెడుతుంది. కాబట్టే అక్కడ తడిని మనం చూస్తుంటాము. అలాగే కాయ మొదలులోనూ ఆ నీటి తడి ఉంటుంది. ‘అయ్యో ముందుగానే నన్ను చెట్టు కొమ్మ నుంచి వేరు చేసేశారు కదా’ అని కాయ కూడా బాధపడుతుంది. కానీ పండు విషయంలో అలా కాదు.. కాయ పండి రాలుతున్నప్పుడు, చెట్టు కొమ్మకు తడి కనిపించదు. పండు మొదలులోనూ నీటి తడి ఉండదు. రెండింటిలోనూ ఓ పరిపక్వత వస్తుంది. దాని బంధం అయిపోయింది కాబట్టే పండు రాలిపోయిందని, చెట్టు కొమ్మ అనుకుంటుంది. పండు కూడా తన కాలం ముగిసినట్టు అనుకోవడంతో, రెండువైపులా బాధ అనేది ఉండదు. అలాంటిదే మనిషి జీవితం కూడా.

సంసార చక్రంలో ఉండి కుటుంబ వ్యవహారాలు సాగిస్తున్న సమయంలో, ఉన్నట్లుండి పక్కకు తప్పుకుంటే, అటు కుటుంబ సభ్యులకూ బాధే, ఇటు మధ్యలోనే దూరమవుతున్నామని, అతనికీ బాధే. ఆ వ్యక్తి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి, నెమ్మదిగా జ్ఞాన మార్గం వైపుకు అడుగులు వేస్తూ, అందులో మునిగి తేలినప్పుడు, అటు అతనికీ, ఇటు కుటుంబ సభ్యులకూ బాధ ఉండదు. రెండు వైపులా కన్నీరు కార్చడం అనేది ఉండదు. జ్ఞానమనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. నెమ్మదిగా రావాలి. అందుకే మెల్ల మెల్లగా దాని వైపుకు అడుగులు వేయాలి.

జ్ఞానం, కర్మలు, ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. జ్ఞానం పెరిగే కొద్దీ, కర్మలు అంతరిస్తాయి. అనేక జన్మలుగా మనం చేసిన పాపపుణ్యాలు, కర్మల రూపంలో మనతోనే వస్తాయి. ఈ కర్మలు మూడు రకాలుగా ఉంటాయి. ‘ఆగామి, సంచితం, ప్రారబ్దం’ అని, మూడు రకాలుగా కర్మలు ఉంటాయి. నిత్యం మనం చేసే కర్మలన్నీ ఆగామి కర్మల క్రిందికే వస్తాయి. కొన్ని వెంటనే ఫలిస్తాయి, మరికొన్ని తర్వాతి జన్మలలో తమ ఫలితాలను చూపిస్తాయి. మనం ఎన్ని పాపాలు చేశాం? ఎన్ని పుణ్యాలు చేశాం? దాన ధర్మాలు ఏమైనా చేశామా? వంటివన్నీ, ఆగామి కర్మల క్రిందికి వస్తాయి. ఇక పూర్వ జన్మలో మనం చేసిన కర్మలు ఈ జన్మకు వచ్చి, ఇప్పుడు కూడా వాటిని అనుభవించలేకపోతే, అవి మళ్లీ రాబోయే జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. ఇటువంటి వాటిని, సంచిత కర్మలని అంటారు.

ఇక ప్రారబ్దం విషయానికి వస్తే అంతా నా ప్రారబ్దం అని అనుకోవడం మనం తరచూ వింటూ ఉంటాము. సంచిత కర్మలలో ఖచ్చితంగా అనుభవించి తీరాల్సినవి ఉంటాయి. వాటినే ప్రారబ్దం అంటారు. గత జన్మలలో చాలా పాపాలు చేసి ఉండి, పైగా పుణ్యబలం కూడా లేకపోతే, జన్మ తీసుకోగానే దాని సమయం వచ్చినప్పుడు, ఆ ప్రారబ్దం తగిన ఫలితం చూపిస్తుంది. ఇలాంటి చావు ఎవరికీ రాకూడదని అందరూ అనుకుంటూ ఉంటారు. అది ప్రారబ్ద కర్మ కాబట్టే, అతను అనుభవించక తప్పలేదు. అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు, ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి.

పుణ్య కర్మలు పక్వానికి వస్తే, ఆ వ్యక్తి దేవ లోకంలో పుడతాడు. ఆ కర్మల ఫలితంగా, అనేక భోగాలను అనుభవిస్తాడు. ఆ భోగాలు అయిపోగానే, ‘క్షీణే పుణ్యే మర్త్య లోకం విశంతి’ అన్నట్లు, మళ్లీ మానవ లోకాన్ని చేరుకుంటాడు. ఇక్కడ మళ్లీ మనిషిగానో, జంతువుగానో పుడతాడు. అంతకు ముందు అతను దేవ లోకంలో పుట్టినా, అతనికి కర్మలు చేసే స్థూల శరీరం ఉండదు. ఎందుకంటే, అక్కడ భోగాలు అనుభవించటానికి మాత్రమే అధికారం ఉంటుందిగానీ, కర్మలు చేసే అధికారం ఉండదు. పుణ్య కర్మలు పక్కన పెట్టి, మనం పాపాలు మాత్రమే చేస్తూ పోతే, అవి కూడా పక్వానికి వస్తాయి. అప్పుడు ఏ జంతువుగానో పుట్టక తప్పదు.

ఇలా కర్మ ఫలాలను అనుభవించటం మాత్రమే కాదు.. కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా, మనిషి జన్మలోనే ఉంటుంది. 'బుద్ధే కర్మానుసారిణి' అంటారు.. కర్మలను బట్టే మనిషి బుద్ధి మారుతుంటుంది. బుద్ధి అనే సాధనం ఉన్న జన్మ, 'మానవ జన్మ'. పరమాత్మను చేరుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారాన్నీ, జ్ఞానాన్నీ పొందే అవకాశం ఉన్నది, ఒక్క మానవ జన్మలోనే. అందుకే ఈ మానవ జన్మ ఉత్తమోత్తమమైనది, అపురూపమైనది. 84 లక్షల జీవరాసులలో పుట్టి-గిట్టిన తర్వాతే, ఈ మనిషి జన్మ లభిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. మనిషి తన జన్మకు ఒక లక్ష్యం అంటూ పెట్టుకోవాలి. 'బాగా చదువుకోవాలి, పెద్ద ఉద్యోగం చేయాలి, కోట్లు సంపాదించాలి' అనేది మాత్రమే లక్ష్యం కాదు. జ్ఞాన సముపార్జన చేయాలి.

ఎన్నో సుఖాలూ, భోగాలూ అనుభవించినా, మన మనస్సులో ఏదో ఒక వెలితి మాత్రం ఉంటుంది. పరమాత్మను తెలుసుకోవాలంటే, జ్ఞాన మార్గం ఒక్కటే దారి. ‘నిత్య వస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం’ అని తత్వ బోధలో శంకరాచార్యుల వారు స్పష్టంగా చెప్పారు. అంటే, నిత్య వస్తువు అనేది, ఒక్క పరమాత్మ మాత్రమే. అందుకు భిన్నంగా ఉంటే, అవి అశాశ్వతం అని అర్థం. ప్రతి జీవీ, భగవంతుడిలో ఐక్యం కాగలిగినప్పుడే, ఈ జన్మకు ముక్తి లభించినట్లు. ఆ ముక్తి మార్గానికి దారి తెలియాలంటే, అది మానవ జన్మలోనే సాధ్యం. నేనెవరు? ఎందుకు పుట్టాను? ఎవరి కోసం పుట్టాను? నా లక్ష్యం ఏమిటి? నా కర్తవ్యం ఏమిటి? అని తెలుసుకుని, మనస్సును అదుపులో పెట్టుకుని, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవలి.

ఆత్మకూ పరమాత్మకూ తేడాను తెలుసుకోవడమే 'జ్ఞానం'. భగవంతుడిని తెలుసుకోవాలన్న తపన ఉంటే, ఆ భగవంతుడే మనకు దారి చూపిస్తాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో, ‘అర్జునా! ఎవరైతే నా జ్ఞానాన్ని గ్రహించి, కర్మ, జ్ఞాన, ధ్యాన యోగాలను అవలంభించి ఉంటారో, వారు ఇంకా ఏదైనా కర్మలు చేయాల్సి ఉంటే, వారికి ఖచ్చితంగా ఒక మంచి జన్మ లభిస్తుంది’ అని చెప్పాడు. ఈ విషయాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని మనిషి ముందుకు సాగాలి. అప్పుడే జీవన్ముక్తి సాధ్యం. అప్పటి వరకూ ఈ భవ బంధాలను అనుభవించి తీరవలసిందే.

సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!

Monday, October 9, 2023

Shraadh: An In-Depth Guide to Hindu Ancestral Rituals - The Garuda Purana | 'శ్రాద్ధాలు' - గరుడ పురాణం!


'శ్రాద్ధాలు' - గరుడ పురాణం!
మరణించిన వారి పేరు మీద బ్రాహ్మణులకు పెట్టే భోజనం ఎవరికి చేరుతుంది?

మన సనాతన ధర్మంలో, పూర్వీకులకు అంకితం చేయబడిన, సంవత్సరంలోని నిర్దిష్ట కాలాన్ని, పితృ పక్షం అంటారు. పితృపక్షం సమయంలో, పూర్వీకులు తమ వారిని కలవటం కోసం, భూమి మీదకు వస్తారని కూడా చెబుతారు. ఈ సమయంలో స్నానం, దానం, తర్పణం, శ్రార్ధ కర్మలు చేసినప్పుడు, పూర్వీకుల ఆత్మ సంతృప్తి చెంది, సుఖ సంతోషాలతో వర్ధిల్లేటట్లు దీవిస్తారని చెబుతారు. ప్రతి ఏడాదీ, పితృపక్షాలు భాద్రపద మాసంలో, కృష్ణ పక్షంలో వస్తూ ఉంటాయి. అయితే, మనం ఇక్కడ చేసే తద్దినాలూ, శ్రాద్ధాలూ, మరణించిన మన పితరులకు ఏ విధంగా చేరతాయి? బ్రాహ్మణులకు పెట్టే భోజనం, అన్ని వర్ణాల పితృదేవతలకూ సంతృప్తి చేకూరుస్తుందా - వంటి అనేక ప్రశ్నలను, గరుడ పురాణం, ఆచారకాండలో, గరుడుడు శ్రీ మహా విష్ణువును అడిగాడు. పితృకార్యక్రమాలకు సంబంధించి, గరుడుడు అడిగిన ప్రశ్నలకు, శ్రీ మహా విష్ణువు చెప్పిన దివ్య సమాధానాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/enEKiyfwnxs ]


సపిండీకరణ, వార్షిక శ్రాద్ధాల తరువాత, మృత వ్యక్తికి తన స్వకర్మానుసారం, దైవత్వమో, మానుషత్వమో, ఇతర ఏతత్వమో  ప్రాప్తిస్తుంది కదా? ఆహరపుటలవాట్లు అందరివీ ఒకలాగా ఉండవు కదా? మరి బ్రాహ్మణ భోజనాల వల్ల గానీ, శ్రాద్ధ హోమాల వల్లగానీ, అందరూ తృప్తిపడడమోలా సాధ్యం? ప్రేత రూపంలోనున్న వారిని ఉద్ధరించడానికి బ్రాహ్మణులకు పెట్టే భోజనం, వారి కడుపు నింపి ఎలా ఆనందింప జేయగలదు? శ్రాద్ధాలను అమావాస్య నాడే పెట్టాలన్నది నిజమేనా? ఈ లోకంలో, అంటే మృత్యులోకమైన భూలోకమనే ఉద్దేశ్యం.. మనుష్యుల ద్వారా ఇవ్వబడిన హవ్య-కవ్య పదార్థాలు, పై లోకాలకెలా వెళతాయి? వాటిని పొందేదెవరు? ఈ శ్రాద్ధాలు, మృతుల కడుపు నింపడమంటే, ఆరిపోయిన దీపంలో తైలం పోస్తే, వెలుగులు విరజిమ్ముతాయన్నట్లుంది. చనిపోయిన వాడు పోవలసిన చోటికి, వాని కర్మఫలాన్ని బట్టి పోనే పోతాడు కదా? వాని పుత్రుని ద్వారా ఈయబడ్డ పుణ్యకార్య ఫలాన్నెలా అందుకుంటాడు? ఆ లోకం నుండి భూలోకానికి వచ్చి, శ్రాద్ధంలో భోజనం చేస్తున్న పితరులను చూసిన వారెవరైనా ఉన్నారా? దయచేసి నా యొక్క విషయక అజ్ఞానాన్ని దూరం చేయండి! అని విష్ణు దేవుని ప్రార్థించాడు వినతా సుతుడు.

అందుకు శ్రీ మహా విష్ణువు, ‘గరుత్మంతా, మనిషి తన కర్మానుసారం దేవతలలో కలసిపోతే, శ్రాద్ధాన్నం, అంటే, వారసులు పెట్టే అన్నం, అమృతంగా మారి, వాని చేతికందుతుంది. అదే అన్నం, గంధర్వయోనిలో పడినవానికి భోగ రూపంలోనూ, పశుయోనిలో పడినవానికి గడ్డిరూపంలోనూ అందుతుంది. అలాగే, నాగయోనిలో పడ్డ వారికి వాయురూపంలోనూ, పక్షికి ఫలంగానూ, రాక్షసునికి మాంసం గానూ, ప్రేతానికి రక్తంగానూ, మనుష్యునికి అన్నపానాదులుగానూ అందుతుంద’ని వివరించాడు. ‘ప్రత్యక్షంగా కనిపించేది ప్రమాణమే. కానీ, దానికన్నా గొప్ప ప్రమాణం, బలమైనదీ, శ్రుతి వాక్యం. దాని నుండి వచ్చిన జ్ఞానం, అమృతాదులతో సమానం. శ్రాద్ధ కర్మలలో ఉచ్ఛరింపబడిన గోత్రనామాదులే, ఆయా పితరాదులకు హవ్య-కవ్యాలనందించే ప్రాపకాలు. ఆ మంత్రాలు అచేతనాలని అనుకోకు. వాటికున్న చైతన్యం, మరి వేటికీ ఉండదు. సంశయము వలదు. అగ్నిష్వాత్తాది పితృగణాలచే, ఆ పితరులు రాజ పదవులలో నియమింప బడతారు. వారి వద్దకు ఈ పితృ పాత్రలలో, విధివశాత్తుగా ప్రతిపాదింపబడిన అన్నాది అభీష్ట పదార్థాలు చేరతాయి. ఆ జీవులెక్కడుంటే అక్కడికి, ఈ అగ్నిష్వాత్తాది పితృదేవతలే అన్నాదులను తీసుకుని వెళతారు.

గోత్ర నామాలూ, మంత్రాలే, ఇక్కడి శక్తి ప్రదాయకాలు. ఇదంతా ఊహకందనంత వేగంగా జరిగి పోతుంటుంది. ఎక్కడ మృతులకు నామ గోత్ర మంత్ర సహితంగా శ్రాద్ధం పెట్టబడుతున్నా, ఆ మృతి చెందాడనుకుంటున్న జీవి మరెక్కడ ఏ యోనిలో ఉన్నా, ఈ మంత్రం చదవగానే, ఆ జీవికి కడుపు నిండి, తృప్తి కలుగుతుంది. సంస్కారం చేస్తున్న వ్యక్తి, కుశాచ్ఛాదితమైన పృథ్విపై, జందెమును కుడి భుజంపై పెట్టుకుని, మూడు పిండములను పెట్టి, మంత్రం ద్వారా తన పితరులను తృప్తులను చేయగలడు. ఇక్కడితడు అన్నమునే పెట్టవచ్చు కానీ, మంత్ర బలం వల్ల, 'అక్కడ' ఏ యోనిలోనున్న పితరునికి, ఆ యోని జాతి తినే పదార్థమే లభిస్తుంది. ఆవులన్నీ ఒకచోటే వున్నా, దూడ తన తల్లిని పోల్చుకుని, దాని దగ్గరకే పరుగెత్తినట్లు, జీవి ఏ యోనిలో ఉన్నా, ఆ పితరుల నిమిత్తమై, బ్రాహ్మణులచే చేయబడిన శ్రాద్ధాన్నం, గురి తప్పకుండా, ఆ పితరులనే చేరుతుంది. పితృగణాలు విశ్వేదేవతలతో కలసి, శ్రాద్ధాన్నమును గ్రహిస్తాయి. వసు, రుద్ర, దేవత, పితర, విశ్వేదేవులీ కర్మకు ప్రసన్నులైతే, పితృదేవతలు ప్రసన్నులవుతారు.

మంచి కుటుంబాల నుండి వచ్చిన పితరులు, 'శ్రాద్ధ సమయం వస్తోంది' అని తెలుసుకోగానే, ప్రసన్నులౌతారు. తమలో తాము చర్చించుకుని, వాయు మనో వేగాలతో, శ్రాద్ధకర్మ జరిగే చోటికి చేరుకుని, ఆకాశంలోనే కూర్చుని, బ్రాహ్మణుడితో బాటే భోజనం చేయగలరు. అయితే, ఇవి అంతరీక్షగాములైన పితరులకే సాధ్యం. వారు వాయు రూపంలో వచ్చి, భోజనం చేసి, పరమగతిని పొందుతారు. కొందరు బ్రాహ్మణుల శరీరాలలో ప్రవేశించి భుజించి, తమ లోకాలకు వెళతారు. కారణవశానా శ్రాద్ధకర్త, శ్రాద్ధ కర్మలో ఒక్క బ్రాహ్మణునే కూర్చుండ బెడితే, ఆయన ఉదర భాగంలో శ్రాద్ధకర్త తండ్రీ, దక్షిణం వైపు తాతా, వెనుక భాగంలో పిండభక్షక పితరులూ ఉంటారు. శ్రాద్ధ కాలంలో, యమధర్మ రాజు తన వద్దనున్న ప్రేతాలనూ, పితరులనూ వదిలేస్తాడు. నరక లోకంలో శిక్షలను అనుభవిస్తున్నవారు, ఆకలి దప్పులతో అలమటిస్తూ, తమ పుత్ర పౌత్రులు తేనె కలిపిన పాయసాన్ని శ్రాద్ధంలో పెడితే, ఆకలి దప్పుల నుండి విముక్తి కలుగుతుందని భావిస్తారు. శ్రాద్ధ కర్తకు తన వారెక్కడున్నారో తెలియదు కాబట్టి, అందరూ అందరికీ మధుమిశ్రిత పాయసాన్ని పెట్టడం మేలు.

అమావాస్య దినాలలో, పితృగణాలు తమ వారి ఇంటి గుమ్మాల వద్ద, వాయు రూపంలో దిగి వుండి, శ్రాద్ధాల నభిలషిస్తారు. సూర్యాస్తమయం దాకా వారలాగే వుంటారు. సూర్యడస్తమించినా శ్రాద్ధ భోజనం లభించకపోతే, నిరాశాపూరిత నిశ్వాసాలను బరువుగా వెలువరుస్తూ వెడలిపోతారుగానీ, తమ స్వజనాలను నిందింపరు, దూషించరు, శపించరు. అయినా వారి దీవెనలు లభించి, మనిషికి ఇహపరాలలో పరమసుఖం కావాలంటే, ఏదో తద్దినం ఏడాదికొకమారు ముక్తసరిగా పెట్టేసి వూరుకోకుండా, ప్రతి అమావాస్యనాడూ పితరులనుద్దేశించి, శ్రాద్ధం పెట్టాలి. వారి ఆకలి దప్పులను తీర్చాలి. శాస్త్రం చెప్పిన విధంగా, పితృజనులకు వారి పుత్రులూ, బంధుబాంధవులూ కూడా, శ్రాద్ధకర్మలను సాంగోపాంగంగా నిర్వర్తించి, గయా తీర్థానికొక మారైనా పోయి పిండ ప్రదానము చేస్తే, పితరులతో పాటు వారు కూడా బ్రహ్మలోక నివాసానికధికారులవుతారు. ఇక్కడ గానీ, అక్కడ గానీ, వారికి ఆకలి దప్పులు తీరక పోవడం ఉండదు.

విద్వాంసులెన్నడూ, ఈ శ్రాద్ధాలను విస్మరించ రాదు. వారూ చేయాలి, ఇతరుల చేతా చేయించాలి. సమయానుసారం శ్రాద్ధకర్మలు జరిగే ఇంటిలోకి, ఏ దు:ఖమూ, అశాంతీ ప్రవేశింప జాలవు. పితరులను పూజించటం వల్లా, సంతృప్తి పరచటం వల్లా, మనుష్యులకు ఆయు, పుత్ర, యశ, స్వర్గ, కీర్తి, పుష్టి, బల, శ్రీ, పశు, సుఖ, ధన ధాన్యాలన్నీ లభిస్తాయి. దేవకార్యానికన్నా, పితృకార్యానికే మాహాత్మ్యమెక్కువ. దేవతల కంటే ముందే పితరులను ప్రసన్నం చేసుకోవాలి.  తమ తమ పితృగణాలనూ, దేవగణలనూ, బ్రాహ్మణులనూ, అగ్నినీ పూజించేవారు, నన్ను పూజించిన్నట్లే. వీటన్నిటిలో నేను పూజలందుకుంటాను. శ్రాద్ధాల ద్వారా పిపీలకం నుండి బ్రహ్మదాకా, అన్నిటినీ, అందరినీ ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ శ్రాద్ధకర్మ, ఎంతమందినెలా సంతోషపెడుతుందో ఆలోచిస్తే, ఆశ్చర్యమనిపిస్తుంది. మనుష్యుల ద్వారా పెట్టబడిన శ్రాద్ధంలో, నేలపై రాలిన అన్నపు మెతుకుల వల్ల, పిశాచ యోనిలో నున్న పితరుల ఆకలి తీరుతుంది. శ్రాద్ధస్నానంలో, తడి వస్త్రాల నుండి నేలకు జారిన నీటిబిందువులతో, వృక్షయోనిలో పడివున్న పితరుల కడుపు నిండుతుంది. ఆ కార్య వేళ నేలపైబడిన గంధ జలాలు, దైవత్వ యోని ప్రాప్తినొందిన పితరులను, సుఖపెడతాయి.

శ్రాద్ధానంతరం, బ్రాహ్మణులు చేతులు కడుగుకున్నప్పుడు, నేల వ్రాలిన జలాన్నాలతో, కులబహిష్కృతులై, శ్రాద్ధ కర్మకు గానీ, ఏ సంస్కారానికి గానీ నోచుకోక అలమటించే పితరులకు, క్షుద్బాధ తగ్గుతుంది. ఈ లోకంలో శ్రాద్ధ నిమిత్తం ఇతరులకీయబడిన అన్నం, ధనం, ఇతరం ఏమైనా సరే, పితరులకు చేరుతుంది. ఆండబరంతో పని లేదు. సామాన్యమైన ఆకు కూరలూ, కూరగాయలూ మున్నగు వాటితో, యథాశక్తి ఎవరు శ్రాద్ధం పెట్టినా, వారి పితరులకు సంపూర్ణ తృప్తి కలుగుతుంది. శ్రద్ధ నుండే శ్రాద్ధం వచ్చింది. మృత్యువు తరువాత ప్రాణికి మరొక శరీరం రావడానికి పట్టేకాలం, అందరికీ ఒక్కలాగే ఉండదు. ధూమరహితమైన దీపం లాగా, మనిషిలో వెలిగే ప్రధాన పురుషుడైన జీవాత్మ, ఆ మనిషి పోగానే, వాయవీయ శరీరాన్ని ధరిస్తాడు. ఒక మెట్టుమీద కాలుంచి మరొక మెట్టు మీద రెండవకాలు పెట్టాక, మొదటి మెట్టును వదిలేసినట్లు, శరీరి, పూర్వ శరీరాన్ని వదిలేసి, మరొక శరీరాన్నాశ్రయిస్తాడు. ఆ మధ్య కాలంలో, ఆత్మ గాలిలో వుంటుంది. కాబట్టి, దానినే వాయవీయ శరీరధారణమంటారు.

ఇక శరీరంలోని ఇంద్రియాలన్నీ నిశ్చేష్టితాలై పోగానే, ఆ జీవి శరీరాన్ని వదిలేస్తాడు. ఆ తరువాత ఆశ్రయించిన శరీరాన్ని కూడా, వదిలెయ్య వలసినదే. అంటే, ఏ జీవికీ ఏ శరీరమూ శాశ్వతం కాదు. అమ్మ కడుపులో పడిన జీవి, ఆమె నుండి అన్నాదికములను గ్రహించి బలపడి, దానిని వదలి ఒక శరీరాన్ని ధరించి బయటికి వచ్చినపుడు, గర్భమనే ఆశ్రయాన్ని పరిత్యజించినట్లే, ఈ శరీరం బలహీనమైనపుడు, దీనిని త్యజించి వేస్తాడు. రెండు శరీరాల మధ్య వుండే శరీరాన్ని, ఆతివాహిక వాయవీయ శరీరమని, విద్వాంసులు వ్యవహరిస్తారు. భూతప్రేతాది శరీరాలూ, మనిషి పిండజ శరీర స్థాయీ ఒక్కటే. పుత్రాదుల ద్వారా, దశగాత్ర పిండదానాలీయబడిన వారి పిండజ శరీరం, వాయవీయ శరీరంతో ఏకాకారమై పోతుంది. పిండజ శరీరము కలవకపోతే, వాయజ శరీరం కష్టాల పాలవుతుంది. ఇక ఆలస్యంగా శరీర ధారణ చేసే జీవాల విషయానికొస్తే, కొందరు జీవాత్మలకు పిండజ శరీరం రావడానికి, సమయం పడుతుంది. మృతి చెందగనే వారు తమ కర్మల వల్ల, నరకానికి వెళతారు. చిత్రగుప్తుని మాట మేరకు, వారి కాలం అక్కడ గడుస్తుంది. అక్కడి యాతనలను తమ కర్మం కొద్దీ అనుభవించిన తరువాత, పశు-పక్షి యోనులలో వారు పుడతారు. శరీరం మీద మోహం, మానవులకే ఎక్కువగా వుంటుంది.

శుభా శుభకర్మలను ఇతర లోకాలలో భోగించాక, అది పోతుంది. పితృకార్యక్రమాలకు సంబంధించి, సీతా దేవి గురించిన ఉదాహరణ ఒకటుంది. శ్రీరాముడు వనవాసం చేస్తున్న సమయంలో, ఒకానొకప్పుడు పుష్కర తీర్థానికి వెళ్లాడు. అక్కడ తన పితరులకు శ్రాద్ధ కర్మను చేయ సంకల్పించగా, సీతమ్మ పక్వానికి వచ్చిన పండును సిద్ధం చేసింది. రామయ్య ఆజ్ఞ మేరకు, ఆయనతో బాటు ఆమె కూడా దీక్షను స్వీకరించి, తన ధర్మాన్ని పాలించింది. సూర్యుడు నింగి నడి నెత్తిన చేరాడు. కుతుప ముహుర్తం వచ్చింది. శ్రీ రాముడు ఆహ్వానించిన ఋషులందరూ విచ్చేశారు. రామచంద్రుడు తల ఊపగానే, సీతమ్మ తద్దినం, అంటే, బ్రాహ్మణులకు అన్నం పెట్టడానికి వచ్చింది. కానీ, బ్రాహ్మణుల మధ్య నిలబడి వారి వైపు చూడగానే నమస్కరించి, సంభ్రమంగా, దూరంగా పోయి, చెట్టుచాటున తీగల మధ్య నిలబడిపోయింది. 'సీతాదేవి ఏకాంతంలోకి పోయినదేమిటీ? బ్రాహ్మణులకు వనవాసయుక్తమైన భోజనాన్ని వడ్డించడానికి సిగ్గు పడిందేమో. సరిలే' అనుకుంటూ, రాముడే బ్రాహ్మణుల చేత భోజనాదులను చేయించి, వారు సెలవు తీసుకుని వెళ్ళి పోయిన తరువాత, సీతను కనుగొని చిరునవ్వు నవ్వాడు.

ఆ నవ్వు చాటు ప్రశ్నను అర్థం చేసుకున్న సీత, ఇలా సమాధానం చెప్పింది. 'ఆర్య పుత్రా!' నేనిక్కడొక గొప్ప ఆశ్చర్యం కలిగించే విషయాన్ని చూశాను. ఈ శ్రాద్ధంలో పాల్గోన్న బ్రాహ్మణుల అగ్ర భాగాన, నేను మా మామగారైన దశరథ మహారాజును చూశాను. ఆయన నిండు కొలువులో ఉన్నట్లే, సర్వాలంకార భూషితులై, దరహాసభాసుర వదనారవిందులై నాకు దర్శనమిచ్చారు. వారితో పాటు, మీ పితామహ, ప్రపితామహులు కూడా దర్శనమిచ్చారు. ఈ నార చీరలతో, మహారాజుగారి సమక్షంలో నిలబడడానికి సిగ్గుపడి, నేను చెట్టు చాటుకు వెళ్ళిపోయాను. ఆ మహారాజుగారికి, ఆయన దాసానుదాసులు కూడా వేలెత్తి ముట్టని అతిసామాన్య ఆహారాన్ని వడ్డించలేక, తప్పుకున్నాను. తృణపాత్రలో అన్నాన్ని వేసి పట్టుకుని, దేవేంద్ర సన్నిభుడైన రఘుకులాన్వయ భూషణుని ఎదుటికెలా పోగలను? అందుకే ఆ మహా భాగులకు నమస్కరించి, నిష్క్రమించాను. సీతమ్మ మాటలు విని, శ్రీరాముడు ఆశ్చర్యపోయాడు. తన తండ్రి దర్శన భాగ్యం, తన జీవన సహచరికైనా దక్కినందుకు సంతోషించాడు.

గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు వివరించిన ఈ నియమాలను పాటిస్తూ, పితృపక్షాలను సక్రమంగా నిర్వహించినట్లయితే, పితృదేవతలను సంతృప్తి పరచడమే కాకుండా, వారి ఆశీస్సులను పొంది, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతాము.

Wednesday, October 4, 2023

కర్మ ఫల త్యాగి - భగవద్గీత | Bhagavad Gita - Karma Phala Tyagi


కర్మఫలత్యాగి!
శరీరధారులకు పూర్తిగా ఎటువంటి కర్మలూ చేయకుండా ఉండటం సాధ్యమా?

'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (11 – 16 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 11 నుండి 16 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/7ccCqvQVC90 ]


నిజమైన త్యాగి వేటిని త్యజించాలో చూద్దాం..

00:45 - న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః ।
యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే ।। 11 ।।

దేహమును కలిగీ ఉన్న ఏ జీవికి కూడా, కర్మలను పూర్తిగా త్యజించటం శక్యము కాదు. అందుకే తన కర్మ ఫలములను త్యజించినవాడే, నిజమైన త్యాగి అని చెప్పబడును.

కర్మ ఫలములను త్యజించటం కన్నా, అసలు కర్మలనే పూర్తిగా త్యజించటమే మేలు కదా! అని కొందరు వాదించవచ్చు. దానితో ఇక ధ్యానమునకూ, మరియు ఆధ్యాత్మిక చింతనకూ ఎలాంటి అవరోధమూ ఉండదని అనుకోవచ్చు. శ్రీ కృష్ణుడు అది ఆచరణకు సాధ్యంకానిదని తిరస్కరిస్తున్నాడు. ఎందుకంటే, శరీరధారులకు పూర్తిగా ఎటువంటి కర్మలూ చేయకుండా ఉండటం సాధ్యం కాదు. శరీర నిర్వహణకు అవసరమయ్యే పనులు, అంటే, భుజించటం, నిద్రపోవటం, స్నానం చేయటం, మొదలైనవి అందరూ చేయవలసినదే. అంతేకాక, నిల్చోవటం, కూర్చోవటం, ఆలోచించటం, నడవటం, మాట్లాడటం వంటి పనులు కూడా చేయకుండా ఉండలేము. ఒకవేళ మనం సన్న్యాసము, అంటే, బాహ్యమైన పనులు విడిచిపెట్టటమని అనుకుంటే, నిజంగా సన్యసించిన వారెవరూ ఉండరు.

02:01 - అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్ ।
భవత్యత్యాగినాం ప్రేత్య న తు సన్న్యాసినాం క్వచిత్ ।। 12 ।।

స్వప్రయోజనము పట్ల ఆసక్తితో ఉండేవారికి, మరణించిన పిదప కూడా, సుఖము, దుఃఖము, మరియు ఈ రెండింటి మిశ్రమమూ, ఈ మూడు విధములుగా కర్మ ప్రతి ఫలములుండును. కానీ, కర్మఫల త్యాగము చేసిన వారికి, అటువంటి ఫలములు, ఈ లోకములో కానీ, పరలోకములో కానీ ఉండవు.

మరణించిన పిదప, ఆత్మ మూడు రకముల ఫలములను అనుభవిస్తుంది. అవి, 1) ఇష్టం అంటే, స్వర్గ లోకాలలో ఆనందకర అనుభవాలు, 2) అయిష్టం, అంటే నరక లోకాలలో బాధాకర అనుభవాలు. మరియు 3) మిశ్రమం, అంటే మానవ రూపంలో, భూలోకంలో మిశ్రమమైన అనుభవాలు. పుణ్య కర్మలు చేసినవారికి, స్వర్గాది లోకములు ప్రసాదించబడతాయి; పాప కర్మలు చేసినవారికి, నిమ్న లోకాలలో జన్మ ఇవ్వబడుతుంది; అలాగే, పుణ్య-పాప కర్మలు రెండింటినీ చేసినవారికి, మానవ జన్మ ఇవ్వబడుతుంది. కానీ, కర్మలను ఫలాపేక్షతో చేసినవారికే, ఇది వర్తిస్తుంది. ఇటువంటి ఫలాపేక్షను విడిచి, కేవలం భగవంతుని పట్ల విధిగా మాత్రమే చేస్తే, మన కర్మలకు ఎటువంటి ఫలమూ అంటదు.

03:20 - పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే ।
సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్ ।। 13 ।।

ఓ అర్జునా, ఏ కార్యము చేయబడాలన్నా, వాటి వెనుక ఉన్న ఐదు కారకముల గురించి, సాంఖ్య శాస్త్రము ప్రకారం ఏమి చెప్పారో, ఇప్పుడు చెబుతాను వినుము. అది కర్మ ప్రతిచర్యలను ఎలా నిరోధించాలో వివరిస్తుంది.

కర్మలను పుట్టించే హేతువులు ఏమిటి? అనే విషయాలను, శ్రీ కృష్ణుడు, అర్జునుడికి ప్రకటించబోతున్నాడు. ఎందుకంటే, ఈ జ్ఞాన విషయము, కర్మ ఫలముల పట్ల అనాసక్తి పెంపొందించుకోవటానికి దోహదపడుతుంది. అదే సమయంలో, ఈ కర్మ యొక్క ఐదు అంగముల వివరణ, కొత్త విశ్లేషణ కాదు. ఇది ఇంతకు పూర్వమే, సాంఖ్య శాస్త్రములో కూడా చెప్పబడినదని వివరిస్తున్నాడు. ‘సాంఖ్య’ అనేది మహర్షి కపిలుడు ప్రతిపాదించిన తత్త్వ శాస్త్రము. అది శరీరములోని, మరియు ప్రపంచములోని వివిధ అంగముల విశ్లేషణ ద్వారా, ఆత్మ జ్ఞానమును పెంపొందిస్తుంది. కర్మ యొక్క వివిధ అంగముల విశ్లేషణ ద్వారా, కారణము మరియు దాని ప్రభావముల స్వభావములను కూడా, నిర్ధారణ చేస్తుంది.

04:34 - అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్ ।
వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమమ్ ।। 14 ।।

శరీరము, జీవాత్మ, వివిధ ఇంద్రియములు, వివిధ రకాల కృషి, దైవానుగ్రహము - ఇవే కర్మ యొక్క ఐదు అంగములు.

ఈ శ్లోకంలో అధిష్టానం అంటే, ‘నివసించే స్థానము’ అని.. అంటే, శరీరమన్నమాట. ఆత్మ శరీరములో ఉన్నపుడే, కర్మలు చేయటానికి సాధ్యమవుతుంది. 'కర్తా' అంటే 'చేసేవాడు'. అంటే, 'జీవాత్మ' అన్నమాట. ఆత్మ తనంతట తానే కర్మలు చేయకపోయినా, అది శరీర-మనో-బుద్ధుల వ్యవస్థను, జీవప్రాణముతో కర్మలు చేయటానికి ఉత్తేజింప చేస్తుంది. అంతేకాక, అహంకార ప్రభావం వల్ల, ఆ కర్మలు చేసేది తానే అని అనుకుంటుంది. అందుకే, శరీరముచే చేయబడిన పనులకు, అది బాధ్యత వహించవలసి ఉంటుంది. అలాగే, ఆత్మ 'తెలిసినవాడు' మరియు 'చేసేవాడు' అని పరిగణించ బడుతుంది. చూసేది, స్పృశించేది, వినేది, అనుభవించేది, రుచి చూసేది, ఆలోచించేది, మరియు అర్థంచేసుకునేదీ, ఆత్మయే. అందుకే ఆత్మను, కర్మలను 'తెలిసినది' మరియు 'చేసేది' అని పరిగణించాలి. కర్మలు చేయటంలో ఇంద్రియములు ఉపకరణములలా సహకరిస్తాయి. ఇంద్రియములు లేకుండా, ఆత్మ - రుచి, స్పర్శ, చూపు, వాసన, మరియు శబ్దము వంటి వాటిని అనుభవించలేదు. వాటితోపాటుగా, ఐదు కర్మేంద్రియములు కూడా ఉన్నాయి - చేతులు, కాళ్ళు, వాక్కు, జననేంద్రియములు, మరియు గుదము. వీటన్నిటి సహకారం తోటే, ఆత్మ వివిధ రకాల పనులను చేస్తుంటుంది. అందుకే, కార్యములను సాధించటానికి, ఇంద్రియములు కూడా కారకములుగా పేర్కొనబడ్డాయి. కర్మ కొరకు అన్ని ఉపకరణములూ ఉన్నా, వ్యక్తి తను ప్రయత్నం చేయకపోతే, ఏ పనీ అవ్వదు. భగవంతుడు ప్రాణుల శరీరములో సాక్షిగా స్థితమై ఉంటాడు. వాటి వాటి పూర్వ కర్మానుసారం, వివిధ జనులకు కర్మలు చేయటానికి, భిన్నభిన్న సామర్ధ్యములను ఇస్తుంటాడు. దీనినే మనము దైవానుగ్రహము అనవచ్చు.

06:49 - శరీరవాఙ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః ।
న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః ।। 15 ।।

06:59 - తత్రైవం సతి కర్తారమ్ ఆత్మానం కేవలం తు యః ।
పశ్యత్యకృతబుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః ।। 16 ।।

శరీరము, వాక్కు, లేదా మనస్సులచే ఏ కార్యము జరిగినా, అది మంచయినా లేదా చెడయినా, ఈ ఐదూ దానికి కారకములు. ఇది అర్థంకాని వారు, ఆత్మయే నిజమైన కర్త అని అనుకుంటారు. మలిన బుద్ధితో ఉన్న అటువంటి వారు, యథార్థమును గ్రహింప లేరు.

మూడు రకములైన కర్మలు ఏమిటంటే - కాయిక అంటే, శరీరముచే చేయబడినవి, వాచిక అంటే, మాటలచే చేయబడినవి, మరియు మానసిక అంటే, మనస్సుచే చేయబడినవి. వీటిలో ప్రతి ఒక్క వర్గంలో కూడా, పుణ్య కర్మలు చేసినా, లేదా పాప కర్మలు చేసినా, ఐదు కారకములే బాధ్యులు. అహంకారము చేత మనమే ఈ పనులు చేసేది అనుకుంటాము. ఈ జ్ఞాన విషయం తెలియచేయటంలో శ్రీ కృష్ణుడి ఉద్దేశం ఏమిటంటే, ఆత్మ యొక్క కర్తృత్వ-అహంకారమును నాశనం చేయటమే. ఈ విధంగా, కేవలం ఆత్మ మాత్రమే కర్మలను చేసేదని అనుకునేవారు, యధార్థమును చూడలేనట్టే. ఒకవేళ భగవంతుడు ఆత్మకు శరీరమును ఇవ్వకపోతే, అది ఏమీ చేసి ఉండగలిగేది కాదు. అంతేకాక, భగవంతుడు శరీరమును, ప్రాణముతో శక్తివంతము చేయకపోతే, అది కూడా ఏమీ చేసి ఉండగలిగేది కాదు. కర్మలు చేయటంలో జీవాత్మకు ప్రమేయం లేదని అర్థం కాదు. ఆత్మ శరీరమనోబుద్ధులను నియంత్రిస్తుంది. కానీ, చేనేది తానే అన్న భావమును అది కలిగి ఉండ రాదు. ఒకవేళ మనమే, కర్మకు ఉన్న ఒకే ఒక కారణం అనుకుంటే, మనమే ఆ కర్మల ప్రతిఫలమును అనుభవించాలని అనుకుంటాము. కానీ, కర్తృత్వ భావనను నిర్మూలించుకుని, ఇదంతా భగవంతుని కృప వలెనే, ఆయన ఇచ్చిన ఉపకరణముల వలననే సాధ్యమయినదని భావిస్తే, మనం మన కర్మ ఫలములకు భోక్తలము కామనీ, మరియు అన్ని పనులూ ఆయన ప్రీతికోసమే ఉన్నాయనీ, తెలుసుకుంటాము.

09:05 - ఇక మన తదుపరి వీడియోలో, జ్ఞానము, కర్మ, మరియు కర్త, ప్రకృతి త్రి-గుణముల పరంగా ఉండే వ్యత్యాసాల గురించి తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, October 2, 2023

Story of a Pious Woman | 'పుణ్యాత్మురాలు' - బేతాళ కథలు!


'పుణ్యాత్మురాలు' - బేతాళ కథలు!
భర్తకు ‘మళ్ళీ పెళ్లి’ చేసిన స్త్రీ పుణ్యాత్మురాలెలా అయ్యింది?

బేతాళ పంచవింశతి కథల మూలాలు, అత్యంత ప్రాచీనమైనవి. సా.శ.పూ. 1 వ శతాబ్దానికి చెందిన ఈ కథలు, తొలిసారిగా శాతవాహనుల యుగానికి చెందిన గుణాడ్యుని బృహత్కథలో, ఒక భాగంగా చోటుచేసుకున్నాయి. మొట్టమొదట పైశాచి భాషలో రాయబడిన ఈ కథలు, తరువాతి కాలంలో సంస్కృత భాషలోకి అనువదించబడ్డాయి. అయితే, పైశాచి భాషలోని బృహత్కథ మూలగ్రంధం అలభ్యం కావడంతో, సంస్కృత భాషలో అనువదించబడిన కథలే మిగిలాయి. సాక్షాత్తూ పరమేశ్వరుడే పార్వతీ మాతకు చెప్పినట్టుగా పేర్కొనే ఆ కథలు, మనలను సన్మార్గంలో నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ కథ పంచవింశతి కథలలో ఒకటాకాదా అనే విషయాన్ని పక్కనబెట్టి, కథలోని నీతిని గురించి మీరేమనుకుంటున్నారో, కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక కథ విషయానికి వస్తే, ఒక స్త్రీ తన కుంటుంబాన్ని ఎలా తీర్చుదిద్దుకున్నది? తన భర్తకు రెండవ వివాహం ఎందుకు చేసింది? అందరు అత్తలలాగానే కోడలితో కఠినంగా వ్యవహరించినా కూడా, పుణ్యాత్మురాలిగా ఆ స్త్రీమూర్తి బేతాళ కథలలో స్థానం ఎలా సంపాదించుకోగలిగింది? వంటి విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/13ULBoqeFOQ ]


పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవం లోని బేతాళుడు ఇలా చెప్పానారంభించాడు. పురాణపురం అనే ఊరిలో విద్యానాథుడనే పండితుండేవాడు. ఆయన భార్య భారతి, పుణ్యాత్మురాలని పేరు పొందినది. ఆ దంపతులకు భార్గవుడు, శుక్రుడు అని ఇద్దరు కొడుకులూ, సుచిత్ర అనే కుమార్తె ఉన్నారు. సుచిత్రకు వివాహమై, కాపురానికి వెళ్లి భర్తతో హాయిగా ఉంది. కొడుకుల్లో పెద్దవాడు భార్గవుడు, పాండిత్యంలో తండ్రంతటివాడని పేరు తెచ్చుకున్నాడు. అతడి భార్య రేవతి, భర్తకి అనుకూలవతిగా ఉంటూ, ఇంట్లో అందరికీ తలలో నాలుకగా ఉండేది. ఆ దంపతులకు సమీరుడు, ఒక్కగానొక్క కొడుకు. మనుమడంటే భారతికి ప్రాణం. చిన్నవాడు శుక్రుడికి కూడా, పాండిత్యంలో ప్రతిభావంతుడని పేరొచ్చింది. ఆ ఊరి జమీందారు, వాడిని తన ఆస్థానపండితుల్లో ఒకడిగా చేరమని కోరాడు. కానీ, తను నేర్చుకోవాల్సినది ఇంకా చాలా ఉన్నదన్న భావనతో, శుక్రుడు తటపటాయించాడు.

ఇలాంటి వచ్చని నంసారంలో ఉన్నట్టుండి, వరుసగా చిక్కు సమస్యలు మొదలయ్యాయి. పట్నంలో గురుకులం నడుపుతున్న జ్ఞానానందుడు, తనకు వయసైపోయిందని, గురుకులాధివతి పదవినుంచి తప్పుకోవాలనుకున్నాడు. ఆ పదవికి భార్గవుడే తగినవాడని భావించి, గురుకులానికి రావలసిందిగా, భార్గవుడికి కబురు పంపాడు. భార్గవుడికి ఆ గురుకులానికి అధిపతి కావడం ఇష్టమే. ఎందుకంటే, అక్కడున్న ఉద్దండపండితుల సాహచర్యంలో, తన శాస్త్రజ్ఞానం మరింతగా వికసిస్తుంది. ఆ గురుకులంలో శిష్యులుగా చేరేవారు కూడా, సామాన్యులుకారు. తమ సందేహాలతో గురువు ప్రతిభనే, సవాలుచెయ్యగల సమర్థులు. అక్కడ విద్య నేర్చుకున్నా, నేర్పినా, జ్ఞానవృద్ధి కలుగుతుందని చెప్పుకుంటారు. భార్గవుడు తండ్రికి తన అభీష్టం చెప్పి, ఆయనను కూడా తనతో పట్నం వచ్చెయ్యమన్నాడు. కానీ, విద్యానాథుడు అందుకు ఒప్పుకోలేదు. "మనకు వారసత్వంగా వచ్చిన ఆస్తితో, కొన్ని తరాలు సుఖంగా జీవించవచ్చు. ఎట్టి పరిస్థితులలోనూ, ఈ ఊరు వదిలి రాను" అన్నాడు నిష్కర్షగా.

భార్గవుడి భార్య రేవతి కూడా, "నాకిక్కడ అందరితో కలిసి ఉండడం బాగుంది. నేను ఈ ఊరు విడచి రాను. మనం ఇక్కడే ఉందాము" అన్నది భర్తతో. భార్గవుడు తన గోడు తల్లికి చెప్పుకున్నాడు. భర్తను వ్యతిరేకించలేక, కొడుకుకు అనుకూలంగా మాట్లాడలేక, మనస్సులో సతమతమయ్యింది భారతి. అయినా, కోడలి మనస్సులో ఏముందో తెలుసుకోవాలని, ఆమెను పక్కకు పిలిచి అడిగితే, "అత్త మామలను పెద్ద వయస్సులో విడిచి ఎలా వెడతాను? ఇప్పుడే కదా, మీకు మా సేవలు అవసరం" అన్నది రేవతి. ఇదిలా ఉంటే, శుక్రుడు ఆ ఊరిలోనే, తార అనే పిల్లను ప్రేమించాడు. కానీ, తార జాతకం ప్రకారం, పెళ్ళి జరిగిన వెంటనే ఆమె అత్తమామల్లో ఒకరు చనిపోతారని ఉంది. అందుకని విద్యానాథుడు ఆ పె‌ళ్ళికి ఒప్పుకోలేదు. తనకు జాతకాలమీద ఏమాత్రం నమ్మకం లేదని, శుక్రుడు వాదించాడు. ఇక సుచిత్రకు కూడా ఒక నమస్య వచ్చింది. ఆమె ఇంటి పురోహితుడు ఆమె భర్తతో, "నీ భార్య జాతకం గొప్పది. వచ్చే పున్నమిలోగా, మీ ఇంట్లోని లక్ష్మీదేవి విగ్రహానికి, నూరుకాసులహారాన్ని ధరింపజేసి, నీ భార్యచేత నూరు రోజులు పూజ చేయిస్తే, నీ కుటుంబం కలకాలం అష్టైశ్వర్యాలతో వర్థిల్లుతుంది. హారం మీ స్వంతమై ఉండాలి" అని చెప్పాడు.

ఐతే సుచిత్రకు కొన్ని నగలున్నాయి కానీ, నూరుకాసులహారం లేదు. అంత ఖరీదైన హారం చేయించడం, భర్తకు ఇప్పట్లో సాధ్యం కాదు. ఆమె తల్లి భారతికి నూరుకాసులహారం ఉంది. ఆమె తదనంతరం, అది కూతురికే చెందుతుంది. కూతురికి ఆ హారాన్ని ఇప్పుడే ఇచ్చేద్దామని, భారతి అనుకుంటోంది. కానీ, ఎట్టి పరిస్థితులలోనూ, తల్లి బ్రతికుండగా ఆ హారాన్ని ఆమెనుంచి తీసుకోవడం, సుచిత్రకు ఇష్టం లేదు. వూజ ప్రారంభించడానికి పది రోజులే గడువుందని, ఆమె భర్త బెంగ పెట్టుకున్నాడు. విద్యానాథుడిది ఇంకా విచిత్రమైన సమస్య. ఓ రోజు వాణి అనే కవయిత్రి ఆయనవద్దకు వచ్చి, కొన్ని నందేహాలను అడిగి తీర్చుకుంది. అప్పుడామెకు ఆయనపై మోహం పుట్టింది. "నేను మీకు రెండవ భార్యగా ఉంటాను. నన్ను పెళ్ళిచేసుకోండి" అన్నది. "నేను ఏకపత్నీ వ్రతుణ్ణి. వయస్సులో నీకంటే బాగా పెద్దవాణ్ణి. నిన్ను పెళ్ళిచేసుకోలేను" అని ఆయన అన్నాడు. కానీ, వాణి తన పట్టు వీడలేదు.

ఆమె చాలా అందగత్తె కావడంవల్ల - అటు చిత్తచాంచల్యాన్ని జయించలేక, ఇటు ఆదర్శాలు వదలలేక, తికమక పడ్డాడు విద్యానాథుడు. ఈ సంగతి తెలిసిన భారతి భర్తతో, "మీరు పండితులు. వాణి కవయిత్రి. మీరిద్దరూ వివాహం చేసుకుంటే, నాకూ ఇష్టమే" అని చెప్పింది. అయినా విద్యానాథుడు ససేమిరా అన్నాడు. తన అత్తగారు, మామగారిని రెండవ పెళ్ళికి ప్రోత్సహిస్తోందని తెలిసిన రేవతి, "ముసలి తనంలో ప్రతి పురుషుడూ పడుచుపిల్లను రెండవ పెళ్ళి చేసుకుంటే, ముసలిదైన భార్యకు రక్షణ ఉండదు. ఈ పెళ్ళి జరిగితే, మేమంతా తక్షణం ఇల్లు వదిలి వెళ్ళి పోతాము" అని అత్తగారిని హెచ్చరించింది.

అందుకు భారతి, "నీ బెదిరింపులు నా మేలుకోసమే తప్ప, నీ స్వార్థంకోసం కాదని నాకు బాగా తెలుసు. నేను నీకు మీ అమ్మకంటే కూడా ఎక్కువైనదాన్ని. ఊరికే కబుర్లు చెబుతావుగానీ, ముసలిదాన్నవుతున్న నన్ను వదిలి, నువ్వు ఎక్కడికీ వెళ్లవని నాకు గట్టి నమ్మకం" అని తేలికగా నవ్వేసింది. కానీ, తన కుటుంబంలో తలెత్తిన సమస్యలు, భారతి మనస్సును బాగా కలవరపరిచాయి. బాగా ఆలోచించగా, వాటన్నింటికీ పరిష్కారం తన చావులోనే ఉందని తోచింది. "ఇన్నాళ్లూ సుఖసంతోషాలతో బ్రతికాను. నాకు జీవితంలో మరి ఏ ఇతర కోరికాలేదు. తొందరలోనే నా భర్త చేతిలో, పుణ్య స్త్రీగా కన్నుమూసేలా అనుగ్రహించండి" అని సమస్త దేవతలనూ ప్రార్థించసాగింది. అప్పటినుంచీ భారతి ప్రవర్తనలో మార్పు వచ్చింది. అది మిగతావారు గమనించలేదుగానీ, పసివాడైన సమీరుడు పసికట్టాడు. వాడు భారతితో, "బామ్మా! మనింట్లో ఎవరు ఎక్కడ ఉన్నా, నేనుమాత్రం నీ దగ్గరే ఉంటాను" అని ముద్దుగా చెప్పాడు. భారతి వాణ్ణి దగ్గరగా తీసుకుని, "నాకూ ఓ బామ్మ ఉంది. తన దగ్గరకు వెళ్లాలని నాకూ ఉంటుందిగా. అలాంటప్పుడు, నువ్వు నన్ను ఆపకూడదు.. నాతో వస్తాననకూడదు" అని అన్నది. ఆమె మాటలకు అర్థం తెలియని సమీరుడు బుద్ధిగా తల ఊపి, "అలాగే కానీ, ఎక్కడికెళ్లినా ఎక్కువ రోజులు ఉండకూడదు" అని షరతు పెట్టాడు.

ఇదిలా ఉండగా, ఆ ఊరికి భావిదర్శనుడనే యోగి వచ్చాడు. ఆయన మనిషి ముఖంచూసి, భూత భవిష్యద్వర్తమానాలు చెప్పగల దిట్ట. రోజూ ఊరంతా తిరిగి, ఒకరి ఇంట భిక్ష స్వీకరించేవాడు. అలా ఒకరోజున, విద్యానాథుడి వంతు వచ్చింది. ఆయన ఆ ఇంట్లో తృప్తిగా భోజనం చేశాక, "ఈ కుటుంబంలో ప్రతిఒక్కరికీ ఒక్కో తరహా సమస్య వచ్చినట్లు, నా దివ్యదృష్టికి గోచరిస్తోంది. అన్ని సమస్యలకూ పరిష్కారం, ఈ ఇంటి ఇల్లాలు భారతి చేతిలో ఉంది. నేను ఆమెతో ఏకాంతంగా మాట్లాడ దలిచాను" అని అన్నాడు. ఏకాంతంలో భావిదర్శనుడు భారతితో, "అమ్మా! నీ వంటి పుణ్యాత్మురాలి దర్శనంతో, నా జన్మ ధన్యమైంది. నీ మంచి తనం వర్ణించడం, యోగినైన నాకూ సాధ్యం కాదు. అలాంటి నీ ఇంట్లో, అందరికీ సమస్యలు వచ్చాయి. వాటిని పరిష్కరించడానికి, నువ్వు నీ మరణాన్ని కోరుకుంట్న్నావు కదూ! అది అపూర్వం. నీ ప్రార్థన దేవతలు విన్నారు. నేను వారి పనుపున ఓ దేవ రహస్యం చెప్పడానికి వచ్చాను. నేటికి సరిగ్గా మూడురోజులలో, నీకు దేవుడి పిలుపు వస్తుంది. ఏ అనారోగ్యం లేకుండా, శరీర బాధకు గురి కాకుండా, అనాయాసంగా ప్రాణాలు విడుస్తావు.

ఐతే, కేవలం తమ స్వార్థం గురించే ఆలోచించే నీ వాళ్లకోసం, నిస్వార్థమైన నీ జీవితాన్ని త్యాగం చెయ్యడం సబబుకాదని నీకు అనిపిస్తే కనుక, నీవు మరిన్ని సంవత్సరాలు సుఖ జీవనం చేస్తావు. ఇది ఆలోచించుకోవడానికే, నీకు మూడు రోజుల గడువు లభిస్తోంది" అని అన్నాడు. భారతి ఆయనకు భక్తితో నమస్కరించి, "యోగివర్యా! నా వాళ్లు చెడ్డ వాళ్లు కారు. చిత్తచాపల్యంతో మనస్సు కాస్త బలహీనమై, వాళ్లలో కొన్ని కోరికలు పుట్టినా, వారిలో ఏ ఒక్కరూ, నా చావును కోరుకోరు. నాకు జీవితం ఎంతో సంతృప్తిగా గడిచింది. పుట్టిన ప్రతి జీవికీ ఏదో ఒకనాడు చావు తప్పదు. చావు వల్ల కూడా ప్రయోజనం సాధిస్తే, అంతకు మించిన సంతృప్తి ఏముంది? అందుకే నా వాళ్ల సంతోషం కోసం జీవితాన్ని త్యాగం చెయ్యాలనిపించినా, ఆత్మహత్య మహా పాతకమని ఆగాను. దేవుడే చావును ఇస్తే, అది నాకు గొప్ప వరం. నా చావుకు లభించిన ఈ మూడు రోజుల గడువు, నా అదృష్టం. ఎందుకంటే, నా చావును మా ఇంట్లో ఏ ఒక్కరూ భరించలేరు. వారందరికీ ఏదో ఒకలాగా ఉపశమనం కలుగజెయ్యాలి. అందుకు తగిన ఆదేశాలిస్తాను. నా మాట శిలాక్షరం కాబట్టి, వాళ్లు నా మాట పాటిస్తారు" అని అన్నది.

భావిదర్శనుడామెతో, "కుటుంబ శ్రేయస్సే తప్ప, ప్రాణాల మీద కూడా మమకారం లేని నువ్వు, ధన్యురాలివి" అని మెచ్చుకున్నాడు. తర్వాత ఆయన, ఇంట్లోని మిగతావారందరికీ, "ఈ ఇంట్లో భారతి వంటి పుణ్యాత్మురాలు ఉండడం, మీ అదృష్టం. ఆమె ఆదేశాలు పాటిస్తూ, సుఖంగా ఉండండి" అని చెప్పి వెళ్లిపోయాడు. భారతికి రానున్న మరణం గురించి మాత్రం, ఆయన ఎవరికీ చెప్పలేదు. మర్నాడు భారతి శుక్రుణ్ణి పిలిచి, "నాకు చావు ఎప్పుడు రాసి పెట్టి ఉందో, అప్పుడే వస్తుంది. నీ పెళ్ళికీ దానికీ ఏ సంబంధమూ లేదు. నువ్వు తారను ఈ రోజే పెళ్ళిచేసుకో. లేకుంటే ఇవ్పుడే నేను విషంమింగి చస్తాను" అని అన్నది. తన ప్రేమ ఫలించడమేకాక, తల్లి ప్రాణాలు కాపాడినట్లు కూడా అవుతుందని, శుక్రుడు ఆ రోజే తారను గుడిలో పెళ్ళి చేసుకున్నాడు. తండ్రికి ఆ పెళ్ళి ఇష్టంలేదు కాబట్టి, శుక్రుడు ఇల్లు వదిలి వేరు కాపురం పెట్టాడు. ఉదర పోషణకు వెంటనే ఆ ఊరి జమీందారు కొలువులో చేరాడు.

తర్వాత భారతి భర్తతో, ఏకాంతంలో మాట్లాడాలని చెప్పింది. ఆయన వెంటనే, "యోగి చెప్పాడని నేను నీ ప్రతి ఉపదేశాన్నీ వింటాననుకోకు. నీ కొడుకు పెళ్ళి నీకు సంతోషంగా ఉండొచ్చు. కానీ నాకు సంతోషంగా లేదు. వాణ్ణి ఇంటికి పిలవమని చెప్పకు. తర్వాత మాట వినలేదని బాధ పడతావు" అని తేల్చి చెప్పాడు. "శుక్రుడికి తారను పెళ్ళి చేసుకోవాలనుంది. వాడి జీవితం వాడి ఇష్టం. కాదనడానికి మనం ఎవరము? అందుకే వాడికి అలా చెప్పాను. ఐతే, వాడు మనింట్లో ఉండాలా, కూడదా అన్నది మీ ఇష్టం. ఈ ఇంట్లో మీ ఇష్టమే నా ఇష్టం. నేను చెప్పాలనుకుంటున్నది, వాడి గురించి కాదు. మీరు ఏక పత్నీ వ్రతులు. ఏక పత్నీ వ్రతమంటే, భార్య బ్రతికుండగా మాత్రమే, ఇంకో భార్య ఉండ కూడదని అర్థం. అనుకోకుండా కొద్ది రోజులలోనే నా ప్రాణాలు పోయాయనుకోండి.. అప్పుడు మీరు వాణిని పెళ్ళిచేసుకోండి. లేదంటే, నా ఆత్మకి శాంతి ఉండదు" అన్నది భారతి. భార్య తనకు అలాంటి ఉపదేశమిస్తుందని ఊహించని విద్యానాథుడు తెల్లబోయాడు.

తర్వాత భారతి కూతురు సుచిత్రకు కబురంపి రప్పించింది.  "ఇప్పుడు అధిక మాసం నడుస్తోంది. అధిక మాసంలో చేసే పూజలు చెల్లవు. కాబట్టి, నీ పూజకు గడువు మరికాస్త పెరిగింది. ఆలోగా నీకు నూరుకాసులహారం లభించే ఏర్పాటు నేను చేస్తాను. ఎట్టి పరిస్థితులలోనూ, పూజ మాననని నాకు మాట ఇవ్వు" అని చెప్పింది. ఆ తర్వాత భార్గవుణ్ణి పిలిచి, "నేను బ్రతికి ఉండగా నాన్న గారిని విడచి వెళ్లనని మాట ఇవ్వు" అని అడిగి వాగ్దానం తీసుకుంది. మనుమడు సమీరుణ్ణి చాటుగా పిలిచి, "రెండు రోజులలో నేను నా బామ్మ దగ్గరకు వెళుతున్నాను. అక్కడ నేను ఎన్నాళ్లున్నా, నువ్వు ఏడవ కూడదు. అన్న మాట నిలబెట్టుకోవాలి" అని బుర్రకెక్కేలా చెప్పింది.  ఇందరితో ఇన్ని చెప్పిన భారతి, కోడలితో మాత్రం, "భావిదర్శనుడి ధర్మమా అని, నా బుద్ధి వికసించింది. ఆయన ఎవరినీ నమ్మవద్దనీ, జాగ్రత్తగా పరిశీలించి, నిజం తెలుసుకొమ్మనీ చెప్పాడు. ఆ మాటలను బట్టి నీ గురించి ఆలోచిస్తే, నీది వక్రబుద్ధి అనీ, మా అందరి మీదా కపట ప్రేమ నటిస్తున్నావనీ అర్థమైంది. నా చిన్నకొడుకు శుక్రుడు తారను ప్రేమించడానికి, నీ ప్రోత్సాహమే కారణమని నేను గ్రహించాను. భార్గవుడికి బోలెడు జీతంతో ఉద్యోగం లభిస్తే వెళ్లనివ్వక, ఇక్కడే తిష్ట వేశావు. ఈ ఇంట్లోనే ఉంటే, మొత్తం ఆస్తి నీకే దక్కుతుందని నీ ఆశ. పరాయి ఇంటి పిల్ల పరాయిదే కానీ, ఇంటి మనిషి కాలేదని నిరూపించావు.

నీకు తెలియనిదేమిటంటే, ఇల్లొదిలి వెళ్లినా, శుక్రుడికి చెందాల్సిన ఆస్తివాటా వాడికే వెళ్ళేట్టు చేస్తాను. నేను పోతే, నా నగలు నా కూతురికే తప్ప, నీకు రావు. నువ్వూ భార్గవుడూ, పట్టనానికి వెళ్లినా, న్యాయంగా మీ కుటుంబానికి రావలసిన ఆస్తిని పంచియిచ్చే విశాల హృదయం మాకున్నదని, నీ అల్పబుద్ధికి తోచలేదు" అని ఏకాంతంలో నిష్ఠూరంగా మాట్లాడింది. ఆ మాటలకు రేవతి నొచ్చుకోలేదు. "మీరు నన్నేమన్నా సరే కానీ, చావు గురించి మాత్రం మాట్లాడవద్దు. మీరు లేని ఈ ఇంటిని, ఊహలో కూడా భరించలేను. మీరు మరింత కాలం బ్రతకాలి" అని కన్నీళ్ళద్దుకున్నది. ఐనా భారతి ఛలించక, "ఇదివరలో ఇలాంటి మాటలే నమ్మి, నీ మీద ప్రేమ పెంచుకున్నాను. నీ నిజస్వరూపం తెలిసిన తర్వాత, ఈ దొంగ కన్నీళ్ళకు నేను మోసపోను. నటనలు కట్టిపెట్టి, మంచి బుద్ధి అలవరుచుకో" అని మందలించింది. భావిదర్శన యోగి చెప్పినట్లే, ఆ తర్వాత మూడవ రోజు భారతి మరణించింది. ఓ పుణ్యాత్ముర్యాలు కన్నుమూసిందని అంతా చెప్పుకున్నారు.

బేతాళుడీ కథను విక్రమారకుడికి చెప్పి,‘‘రాజా! మరణించే ముందు, స్వార్థ పరులైన తన వాళ్లందరికీ ఉపయోగ పడే మాటలు చెప్పిన భారతి, నిస్వార్థ పరురాలైన కోడలి వద్ద మాత్రం భిన్నంగా ప్రవర్తించి, అందరు అత్తగార్ల లాగానే, తనూ కోడలి విషయంలో మాత్రం, చెడ్డ దానిగా మిగిలింది. కానీ, ఆ కోడలితో సహా, అంతా ఆమెను వుణ్యాత్మురాలని ఎందుకన్నారు? నిజానిజాలు అంచనా వెయ్యగల భావిదర్శన యోగి కూడా, ఆమెను మంచిదనీ, పుణ్యాత్మురాలనీ ఎందుకు పేర్కొన్నాడు? అత్తగారు తనను అన్ని మాటలన్నా గానీ నొచ్చుకోకుండా, ‘మీరు మరింత కాలం బ్రతకాలి’ అని రేవతి ఎందుకు కోరింది? అసలు భారతి నిజంగా పుణ్యాత్మురాలేనా? ఆమె కనుక పుణ్యాత్మురాలైతే, ఎలా పుణ్యాత్మురాలైంది? నా ఈ సందేహాలకు సమాధానం చెప్పు” అని అడిగాడు. దానికి విక్రమార్కుడు, "ఎవరి మంచితనమైనా, వాళ్లతో మసిలిన వారికే తెలుస్తుంది. అందుకే ఇంట్లోని వారికీ, ఊరిలోని వారికీ, ఆమె పుణ్యాత్మురాలు. ఇక స్వార్థ పరులైన తన వాళ్ల సంతోషం కోసం, ఆరోగ్యవంతమైన తన శరీరాన్ని కూడా వదులు కోవాలని అనుకున్నదామె. ఆ విషయం తెలుసు కాబట్టే, భావిదర్శనుడు ఆమెను పుణ్యాత్మురాలన్నాడు.

ఇంట్లో స్వార్థపరుల విషయానికొస్తే, భారతి శుక్రుడి పెళ్ళి, ముందే జరిగేలా చేసింది. కూతురికి నగ ఇస్తానంది. భర్తను మరో పెళ్ళి చేనుకోమంది. ఆయన మరో పె‍ళ్ళి చేసుకుంటే, పిల్లలు ఆయనతో ఎలాగూ తెగదెంపులు చేనుకుంటారు. అప్పుడు వయస్సులో చిన్నదైన వాణి, ఆయనకు సేవలు చేయ గలుగుతుంది. పోయిన భార్యను తలచుకుని దిగులుపడే అవసరంలేకుండా, సాహిత్య చర్చలతో ఆయనను మరిపించ గలదు వాణి. మనుమడు చిన్నపిల్లవాడు కాబట్టి, తాత్కాలికంగా మరిపిస్తే, ఆ తర్వాత వాడే అర్థం చేసుకోగలడు. ఇక మిగిలిందల్లా, కోడలు రేవతి. తన ఇంట్లో ఏ స్వార్థమూ లేకుండా ఉన్నది ఆమె మాత్రమేనని భారతికి తెలుసు. అందుకు కారణం, ఆమె తనను కన్నతల్లిలా ప్రేమించడమేననీ, ఆమెకు తెలుసు. ఏ స్వార్థమూలేని ఆమెను, దుఃఖం నుంచి దూరం చెయ్యడానికి వేరే దారి లేక, ఆమెకు తనపై విరక్తి కలగించాలనుకున్నది, భారతి. విరక్తి కలిగితే, కోడలికి అత్తగారు పోయిన దుఃఖం అంతగా ఉండక పోవచ్చనుకున్నది. ఆమె తనను మనస్సులో తిట్టుకున్నా సరే ననుకుని, ఇల్లొదిలిపోయే మాటలతో రెచ్చ గొట్టింది. రేవతి ఆమెను నిజంగా కన్న తల్లిలా భావించింది కాబట్టే, ఆ మాటలకు నొచ్చుకోలేదు. అందుకే భారతి నిజంగా మహా పుణ్యాత్మురాలని బదులిచ్చాడు, విక్రమార్క చక్రవర్తి.

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...