Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Showing posts with label Mahabharata in Telugu. Show all posts
Showing posts with label Mahabharata in Telugu. Show all posts

Monday, September 2, 2024

ఎవరు గొప్ప! కర్ణుడా - అర్జునుడా? Who is more powerful - Karna or Arjuna


ఎవరు గొప్ప! కర్ణుడా - అర్జునుడా? TELUGU VOICE
ద్రౌపది మనస్సులో కర్ణుడిని కామించిందనడంలో ఎంతవరకూ నిజం ఉంది?

వేదవ్యాసుడు చెబుతుండగా, గణపతి రచించిన మహాభారతం, పంచమ వేదంగా పరిగణించబడే భారత ఇతిహాసం. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం, మహాభారత కావ్యం, వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000 సంవత్సరాల కాలంలో, దేవనాగరి లిపి అయిన సంస్కృత భాషలో రచించబడింది. 18 పర్వాలతో, లక్ష శ్లోకాలతో, 74,000 పద్యాలతో లేక సుమారు 18 లక్షల పదాలతో, ప్రపంచంలోనే అతి పెద్ద పద్య కావ్యాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ మహా కావ్యాన్ని 14వ శతాబ్దంలో, కవిత్రయంగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రనలు తెలుగులోకి అనువదించారు. అటువంటి మహాభారతంలోని అర్జునుడూ, కర్ణుడి గురించి తెలియనివారుండరు. ఇక ప్రభాస్ నటించిన కల్కి వంటి చిత్రాలు చూసినప్పుడు, వీరిలో ఎవరు గొప్ప అనే సందేహం మెదులుతూ ఉంటుంది చాలామందిలో. విశ్లేషణాత్మకంగా ఈ విషయాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/xKPQS3XGcWg ]


కర్ణుడు గొప్పా, అర్జునుడు గొప్పా అనేది తెలుసుకునే ముందు, వ్యాస విరచిత మహాభారత కావ్యంలోని కొన్ని పాత్రల వైశిష్ట్యం, కొన్ని సంఘటనలూ తెలుసుకోవడం తప్పనిసరి. దానం విషయంలో కర్ణుడికి సాటి ఎవరూ లేరన్న పేరుంది. కర్ణుడు అంగరాజ్యానికి రాజయ్యాక చేసిన దానాలన్నీ, దుర్యోధనుడు ఇచ్చినవే కావచ్చు. కానీ, బాల్యం నుండీ కర్ణుడికి దానగుణం హెచ్చని, భారతం చెబుతుంది. అలాగే, కర్ణుడి దానాలలోకెల్లా గొప్ప దానం, కవచ కుండలాల దానం. ఎందుకంటే, అవి దుర్యోధనుడు ఇచ్చినవి కావు. కర్ణుడి స్వంతం, అతడికి పుట్టుకతో సంక్రమించినవి. కవచ కుండలాల దానం, కర్ణుడికి మహత్తర కీర్తిని తెచ్చిపెట్టింది. కానీ, ఇక్కడ గమనించాల్సింది, కవచ కుండలాలను దానం చేసి, అంతకంటే గొప్పదైన 'శక్తి' ఆయుధాన్ని ప్రతిఫలంగా పుచ్చుకున్నాడు. ప్రతిఫలం పుచ్చుకున్న దానికి, దాన ఫలం మిగలదు. కర్ణుడు తన పూర్వజన్మలో సహస్ర కవచుడిగా, 1000 కవచాలూ, కుండలాలతో వున్నప్పుడే, నరనారాయణుల ముందు నిలువలేక పోయాడు. ఇక ఈ జన్మలో, కేవలం ఒక్క కవచంతో, నరనారాయణులు అంటే, కృష్ణార్జునుల ముందు నిలువగలడా? ఆ కవచం బలం ఎంతో కర్ణుడికి తెలుసు. అందుకే దాన్ని ఇచ్చేసి, అర్జునుణ్ణి చంపగల శక్తి ఆయుధాన్ని తీసుకున్నాడు. అంటే, ఈ విషయంలో మోస పోయింది కర్ణుడు కాదు, ఇంద్రుడే అనేది తేటతెల్లమవుతుంది. ఈ దానం సందర్భంలో, కర్ణుడు అంతటి చాకచక్యం చూపించాడు.

ఇక భీష్ముడు తన తండ్రి కోసం, రాజ్యాన్ని వదులుకున్నాడు. తండ్రి కోసం ఆయన చేసిన త్యాగమది. ఇక్కడ చెప్పుకోవలసిన విషయం, ఆ రాజ్యం భీష్ముడి స్వంతం కాదు, స్వార్జితమూ కాదు. అప్పటికి ఇంకా భీష్ముడు రాజు కాలేదు. యువరాజు మాత్రమే. ఆ రాజ్యం అప్పటికీ ఆయన తండ్రి అయిన శంతనుడిదే. శంతనుడి రాజ్యాన్ని శంతనుడికే వదిలేశాడు. ఒక విధంగా ఆ త్యాగం అసంపూర్ణం. అతను రాజ్యాన్ని వదిలేసి, దానికి ప్రతిఫలంగా, తాను కోరుకున్నప్పుడే మరణించే వరాన్ని పొందాడు. అంటే, ఈయనా తన త్యాగానికి ఫలితాన్ని పొందాడు. పైగా, సత్యవతి కుమారులు పెరిగి పెద్దయ్యే వరకూ, సుమారు 25 సంవత్సరాలు మకుటం లేని మహారాజుగా, రాజ్యపాలన చేశాడు. అనంతర కాలంలోనూ, చివరి వరకూ బ్రహ్మాండమైన రాజభోగాలను కూడా అనుభవించాడు.

ఈ విధంగా కర్ణుడూ, భీష్ముడూ, తగిన ప్రతిఫలాలను పొందడం వలన, వారి చర్యల్లో చెప్పుకునేంత గొప్పదనం ఏమీ మిగలదు. వీరిద్దరికంటే గొప్ప దాతగా, త్యాగశీలిగా, ధర్మరాజును చెప్పుకోవచ్చు. ఎందుకంటే, అరణ్యవాస కాలంలో, తమకే తిండి తిప్పలు కరువైన రోజుల్లో కూడా, తమనే నమ్ముకుని, తమతోబాటు అరణ్యాలకు వచ్చిన వేలాది మంది అమాయక ప్రజల కోసం, సూర్యునికై తపస్సుజేసి, అక్షయపాత్రను సంపాదించి, ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా, వేలాది మందికి ప్రతిరోజూ అన్నదానాలు చేశాడు. ఎక్కడో హిమాలయాలకు వెళ్లి, అక్కడ భూమిలో నిక్షిప్తమైవున్న నిధులను స్వయంగా సాధించుకు తెచ్చి, అశ్వమేధ యాగ సమయంలో వేలాది మందికి, వారు కోరినంత, స్వార్జితమైన బంగారాన్ని దానం చేసిన ధర్మరాజు, కర్ణ భీష్ముల కంటే గొప్పవాడని నిరూపితమవుతుంది.

కర్ణుడిలో కొంత దానగుణం తప్ప, ఇక ఏ ఇతర మంచి గుణాలూ లేవు. అందుకే వ్యాసభగవానుడూ, తిక్కన, కర్ణుడిని దుష్టచతుష్టయంలో చేర్చారు. అంగరాజ్యమిచ్చి దుర్యోధనుడు ఆదరించాడనే విశ్వాసంతోనే, దుష్టకార్యాలు చేశాడని కొందరు భ్రమపడుతుంటారు. కానీ అది నిజం కాదు. అంత విశ్వాసం వుంటే, పంతాలకు పోయి, కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళకుండా, పది రోజుల పాటు దుర్యోధనుణ్ణి వదిలేస్తాడా? అంటే, దుర్యోధనుడికంటే, అతనికి తన స్వంత పంతాలే ముఖ్యం. అంతేగాక, కర్ణుడు అసూయ, మోసం, ద్వేషం, అన్నీ మెండుగా కలిగివున్న వాడు. అతడు పరశురాముడి వద్ద విద్య నేర్చుకున్నదే, మోసంతో. మొట్టమొదట కురు పాండవ యుద్ధవిద్యా ప్రదర్శనలో, తానూ పాల్గొనాలని వచ్చాడు. కానీ, అతడు క్షత్రియుడు కాదని కొందరు అభ్యంతరం వెలిబుచ్చారు. ఆ సమయంలో అర్జునుడు గొప్ప అస్త్ర నిధిగా పొగడబడుతున్నాడు. అదే, కర్ణుని అసూయకు నాంది. దుర్యోధనుడి పుణ్యమా అని ఆ అస్త్ర విద్యా ప్రదర్శనలో పాల్గొన్నాడు. అయితే, కౌరవులు తప్ప అతడిని అర్జునుడి కన్నా మిన్న అని అక్కడ ఎవ్వరూ పొగడలేదు. అందుకే ఏనాటికైనా అర్జునుణ్ణి ఓడించాలని అనుకున్నాడు. కానీ, ద్రౌపదీ స్వయంవరం, ఘోష యాత్ర, ఉత్తర గోగ్రహణం లాంటి సంఘటనలు తీసుకుంటే, అనేకసార్లు అర్జునుడి ముందు ఓడిపోయాడు. అందుకే భూమిపై తానో, అర్జునుడో, ఎవరో ఒక్కరే వుండాలని నిర్ణయించుకుని, అర్జునుడి పై పగబట్టాడు.

నిజం చెప్పాలంటే, అర్జునుడేమీ కర్ణుని అంతగా అవమానించిన సందర్భం లేదు. అస్త్ర విద్యా ప్రదర్శన నాడు కూడా, కర్ణుని భీముడే అవమానించి మాట్లాడాడు. దుర్యోధనుడికి ముఖ్య శత్రువు భీముడు. స్నేహితుని శత్రువు గనుక, పగబడితే భీముడిపై పగబట్టాలి కర్ణుడు. కానీ, అర్జునుడిపై పగబట్టింది, కేవలం అసూయ వల్లనే. అందుకే పాండవులలో ఎవరు దొరికినా చంపను, అర్జునుడిని మాత్రం వదలనన్నాడు కుంతీ దేవితో. అర్జునుడిని చంపడానికి నాగాస్త్రం సంపాదించాడు. ఇంద్ర 'శక్తి' ఆయుధం తీసుకున్నాడు. యుద్ధంలో అర్జునుడు అలసిపోయే వరకూ, 10 రోజుల పాటు తాను విశ్రాంతి తీసుకుని, కురుక్షేత్రానికి వచ్చాడు. అతని గురి కేవలం అర్జునుడే..

కర్ణుడి జన్మ రహస్యం ధర్మరాజుకు తెలిస్తే, ఆయన తనకున్నదంతా కర్ణుడికే ఇచ్చేసే వాడు. అలా జరిగితే, పాండవులంతా అతని అనుచరులుగా వుండేవారు. కానీ, కర్ణుడికి కావలసింది, భ్రాతృ ప్రేమో, మాతృ ప్రేమో కాదు. పెద్దన్నయ్యగా గౌరవాదులూ కాదు. అర్జునుడిని ఓడించాలి. తానే గొప్ప వీరుడిగా కీర్తించబడాలి. అందుకు అర్జునుడిని చంపేయాలి. పాండవులతో కలసి జీవిస్తే, తన అసూయా పూరిత దుష్టాశయం నెరవేరదు కాబట్టి, అతడు ఆజన్మాంతం పాండవ విరోధిగానే మిగిలిపోయాడు.

ఇక కర్ణుడి దానశీలతను ఆసరాగా తీసుకుని, ఇంద్రుడు అతని కవచకుండలాలను కాజేశాడనీ, కురుక్షేత్రంలో కర్ణుడిని శల్యుడు తన మాటలతో కుంచింపచేశాడనీ, రధచక్రం భూమిలో క్రుంగిన సమయంలో, అర్జునుడు అతడిని చంపేశాడనీ, ఇటువంటి ఘటనలు జరిగివుండకపోతే, కర్ణుడి చేతిలో అర్జునుడు ఓడిపోయే వాడనీ కొందరు అంటూ ఉంటారు. మరి ఆ విషయాలలోకి వెళితే.. ఏ విధంగా చూసినా, అర్జునుడి వీరత్వం ముందు, కర్ణుడు దిగదుడుపే. ఇందులో ఎంత మాత్రం సందేహం లేదు. అయితే, ఈ కలియుగంలో కలి ప్రభావంచేతనో ఏమోగానీ, ఈ మధ్య విలన్స్‌కి అభిమానులు పెరుగుతున్నారు. అంతటితో ఆగకుండా, డబ్బున్న మారాజులు కొందరు విలన్స్‌ను గొప్పవారిగానూ, ధర్మపరులను అల్పులు గానూ చిత్రించి, సినిమాలూ, టి.వి. సీరియల్స్‌ తీసి ప్రదర్శిస్తున్నారు. ఆ పుక్కిటి కథలనే నిజమని నమ్మడం వల్లే, ఇటువంటి సందేహాలు పుట్టుకొస్తున్నాయి.

‘రావణుడు రాముడికన్నా మిన్న’ అంటాడు ఒకడు. ‘ద్రౌపది, మనస్సులో కర్ణుడిని కామించింద’ని అంటాడు ఇంకొకడు. ‘ధర్మరాజుకు రాజ్య పిపాస హెచ్చ’ని అంటాడు మరొకడు. ‘కీచకుడు మంచివాడే.. అతడిని రెచ్చగొట్టింది ద్రౌపదే’ అని వేరొకడంటాడు. కీచకుడిపై గెలవలేక, భీముడు రహస్యంగా దాచుకున్న కత్తితో పొడిచి చంపేశాడనీ, ద్రౌపదీ స్వయంవరంలో కర్ణుడే మత్స్య యంత్రాన్ని కొట్టేసేవాడు కానీ, ద్రౌపదే అతడిని కించ పరచి, పోటీలో పాల్గొన నీయలేదనీ, అసలు మత్స్య యంత్రాన్ని జరాసంధుడు కొట్టేసేవాడు కానీ, ద్రౌపది అతడిని వేడుకుని, బ్రతిమాలి, పోటీ నుండి తప్పించిందనీ, ఇలా ఎన్నెన్నో.. ఇవన్నీ మన సినిమాలలో, టి.వి. సీరియల్స్‌లోని మాయా జాలాలు. ఈ సంఘటనలేవీ, కృతికర్త వ్యాసుల వారు చెప్పినవి కావు. కర్ణుడు వీరుడే.. కానీ అర్జునుడితో ఏ మాత్రం సరిసమానుడు కాడు. ద్రౌపదీ స్వయంవరంలో, కర్ణుడు అర్జునుడిచేత ఓడించబడ్డాడు. ఘోష యాత్రలో కర్ణుడిని ఓడించిన చిత్రరధుడు, అర్జునుడి చేతిలో ఓడి పోయిన వాడే. ఉత్తర గోగ్రహణంలో కర్ణుడిని పడగొట్టి, అతని తలపాగా కుచ్చును తీసుకు పోయాడు అర్జునుడు. కురుక్షేత్రంలో ఒకే రోజున అయిదు సార్లు భీముడి చేతిలో ఓడిపోయి, పారిపోయాడు కర్ణుడు. అభిమన్యుడి చేతిలో చావుదెబ్బలు తిని పారిపోయి, మరో ఐదుగురు దుర్మార్గులతో కలసివచ్చి, అన్యాయంగా అభిమన్యుణ్ణి చంపిన భీరువు కర్ణుడు. కర్ణుడి కుమారుణ్ణీ, సైంధవుణ్ణీ చంపుతానని చెప్పిమరీ, కర్ణుడి కళ్ళముందే వారిద్దరినీ చంపేశాడు అర్జునుడు. ఘటోత్కచుడి చేతిలో చావుదెబ్బలు తిని, గత్యంతరం లేక, తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం, అర్జునుణ్ణి చంపడానికి దాచుకున్న ఇంద్రశక్తిని ప్రయోగించి, ఘటోత్కచుణ్ణి తుదముట్టించిన భయస్థుడు కర్ణుడు. ఇదీ, కర్ణుడి వీరత్వం.

వేయి కవచాలు కలిగి ఉన్ననాడే, కృష్ణార్జునులు నరనారాయణుల రూపంలో కర్ణుడిని, అంటే సహస్ర కవచుడిని చావగొట్టి, 999 కవచాలను ఛేదించారు. చేసేది లేక పారిపోయాడు కర్ణుడు. ద్రౌపదీ స్వయంవరం, ఘోషయాత్ర, ఉత్తర గోగ్రహణం సమయాలలో, కర్ణుడికి చివరి కవచ కుండలాలున్నాయి. అయినా, అర్జునుడే గెలిచాడు. అందుకే ఆ కవచ కుండలాల శక్తి ఏ పాటిదో కర్ణుడికి అర్ధమై, ఇంద్రుడు అడిగిన వెంటనే వాటిని ఇచ్చేసి, బదులుగా, అర్జునుడిని చంపగల శక్తి ఆయుధాన్ని తీసుకున్నాడు, దాన కర్ణుడు. ఇక శల్యుడు తన మాటలతో కర్ణుడి మనస్సు పాడు చేయటం సంగతి ఎలావున్నా, ఒక సంఘటనలో, కర్ణుడి ప్రాణాలను రక్షించాడు శల్యుడు. కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజున, కర్ణుడు ధర్మరాజును దూషించిన విషయం తెలుసుకున్న భీముడు వెళ్ళి, కర్ణుడితో యుద్ధం చేసి ఓడించి, మూర్చబోయేటట్లుజేశాడు. అన్నగారిని తిట్టిన నాలుకను కోసి పారేస్తానని ముందుకురికాడు, భీముడు. అప్పుడు శల్యుడు భీముణ్ణి శాంతపరచి, మూర్చలో వున్న వారి నాలుక కోయడం తగదని నచ్చజెప్పి, కర్ణుడిని రక్షించాడు.

ఇక రధ చక్రం కృంగి పోయినప్పటి సంగతికొస్తే, చక్రాన్ని కర్ణుడు ఎత్తుతుండగా అర్జునుడు అతన్ని చంపడం వాస్తవం కాదు. క్రుంగిన రధ చక్రాన్ని ఎత్తడానికి ఎంత ప్రయత్నించినా రాకపోవటంతో, శాపవశాన ఆ చక్రం ఇక రాదనీ, మరో రధం తెచ్చుకున్నా, అదే గతి పడుతుందనీ తెలుసుకున్న కర్ణుడు, ఆ పై ఇక నేలపై నిలబడే యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలోనే కర్ణుడు మరణించాడు. ఇక్కడ అర్జునుడు రధంపైనా, కర్ణుడు నేలపైనా వున్నందువల్లనే, కర్ణుడు ఓడిపోయాడని అనుకోవడం సరికాదు. ఎందుకంటే, అదే కర్ణుడిని ఓడించిన చిత్రరధుడు రధంపై వుండి యుద్ధం చేయగా, నేలపై నిలబడి పోరాడిన అర్జునుడే గెలిచాడు. అందువల్ల మనం గమనించవలసింది, శాపాలు వగైరాలు లేకపోయినా, కర్ణుడు అర్జునుడిపై గెలవగలగడం అసంభవం.

🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏

Monday, July 24, 2023

What Is The Real Definition of a True Friend? నిజమైన స్నేహానికి నిర్వచనం ఏంటి?


నిజమైన స్నేహానికి నిర్వచనం ఏంటి?
స్నేహం గురించి భీష్ముడు తెలియజేసిన కథ ‘నాడీజంఘుడు – గౌతముడు’!

మహాభారతంలోని శాంతి పర్వంలో, భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన అనేక నీతి కథలు ఉన్నాయి. మానవుల్లో ఎలాంటివాళ్ళు సౌమ్యులు? ఎవరిని ప్రేమించాలి? ఎవరు ఉపకారం చేసేవారు? అనే విషయాలను గురించి ధర్మరాజు భీష్ముడిని అడుగగా, అందుకు భీష్ముడు, దోషాలున్న వారందరిలోకీ, కృతఘ్నుడు పరమనీచుడు. అలాంటి వాడు మిత్రులను కూడా చంపుతాడు. అలాంటి అధములను పూర్తిగా వదిలివేయాలని, ‘గౌతముడు - నాడీ జంఘుడి’ కథను వివరించాడు? మరి కథలో దాగిన నీతేంటి? ఒక బ్రాహ్మణుడు, స్నేహితుడిని హత్య చేసే కసాయి వాడిగా ఎలా మారాడు – అనేది, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలనూ, అనుభవాలనూ, కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ALCW_52fobs ]


మ్లేచ్ఛ దేశంలో, గౌతముడనే పేరు గల ఒక బ్రాహ్మణుడున్నాడు. అతడు బ్రాహ్మణులు చేయవలసిన వేదాధ్యయనం, మొదలైనవేవి చేయకుండా, భిక్షాటనతో జీవించేవాడు. ఒకసారి అతను ఒక బందిపోటు దొంగ ఇంటికి, భిక్ష కోసం వెళ్లాడు. ఆ దొంగ దాత, బ్రాహ్మణ భక్తుడు కావడం వలన, అతడు గౌతముడు ఉండడానికి ఒక ఇల్లు, తినడానికి అవసరమైన ఆహార సామాగ్రీ మొదలైన అన్ని సౌకర్యాలతోపాటు, అతనికి సేవ చేయడానికి భర్త చనిపోయిన ఒక శూద్ర స్త్రీని కూడా ఏర్పాటు చేశాడు. గౌతముడు ఆ దాసితో సుఖంగా జీవిస్తూ ఆటవికుల లాగా, గురి చూసి బాణం వేయడం నేర్చుకుని, ప్రతిరోజూ అడవికి వెళ్ళి, అనేక పక్షులనూ, మృగాలనూ చంపి తింటూ జీవించేవాడు.

ఒకసారి అతని దగ్గరకు గౌతముని ఊరి వాడు, మిత్రుడు, వేదాధ్యనతత్పరుడు అయిన ఒక బ్రాహ్మణుడు వెళ్ళాడు. అదే సమయంలో గౌతముడు, తాను చంపిన హంసలను భుజమ్మీద వ్రేలాడదీసుకుని, చేతిలో ధనుస్సు పట్టుకుని, రక్తంతో తడిసిన శరీరంతో, రాక్షసుని లాగా వేట నుంచి వచ్చాడు. సద్బ్రాహ్మణుడు అతణ్ణి చూసి ఆశ్చర్యపోయి, అతణ్ణి మార్చాలనే ఉద్దేశ్యంతో, సద్బ్రాహ్మణ కర్మలను గురించి ఉపదేశించి, హింసను త్యజించమని, అనేక రకాలుగా బోధించాడు. గౌతముడు అతని మాటలను విని పశ్చాత్తాప పడినట్లుగా నటించి, మరుసటి రోజు తెల్లవారిన తరువాత ఆ వూరినీ, క్రూర కర్మలనూ వదిలిపెట్టి, అతనితోపాటు తానూ వస్తాననీ, సద్బ్రాహ్మణునికి తగిన పనులను చేస్తాననీ చెప్పి, అతనికి నమ్మకం కలిగించాడు.

వచ్చిన సద్బ్రాహ్మణుడు రాత్రి నిద్రపోయిన తరువాత, గౌతముడు అక్కడి నుంచి సముద్రం దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరాడు. అదే సమయంలో కొంతమంది వ్యాపారులు అక్కడికి రాగా, వారితో కలసి సముద్రతీరానికి వెళ్ళాడు. ఇంతలోనే ఒక మదించిన ఏనుగు వారి మీద పడి, అందరినీ చంపడం మొదలుపెట్టింది. గౌతముడు అతి కష్టం మీద తప్పించుకుని ఉత్తర దిక్కుకు పారిపోయి, ఒక అడవిలో తిరుగుతూ దివ్యమైన ఒక ఉద్యానవనంలోకి ప్రవేశించాడు. ఆ ఉద్యానవనం అనేక రకాల పండ్లచెట్లతో, పూల మొక్కలతో సువాసనలు వెదజల్లుతూ, రమణీయంగా ఉంది. ఆ చల్లని గాలికి గౌతముడు ఆదమరచి నిద్రపోయాడు.

ఆ ఉద్యానవనం, నాడీజంఘుడు అనే పేరు గల ఉత్తమమైన కొంగది. ఆ కొంగ, సురభి, కశ్యపుల కుమారుడు, బ్రహ్మ దేవునికి ఆప్తమిత్రుడు. అతనికి రాజధర్ముడనే ప్రసిద్ధమైన మరొక పేరు కూడా ఉంది. దేవకన్యా పుత్రుడు కావడం వలన, అతని శరీరం దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. అలాంటి కొంగను చూసి గౌతముడు మొదట ఆశ్చర్యపోయి, ఆకలితో ఉన్నవాడు కావడం చేత, ఆ కొంగను చంపి తినాలకున్నాడు. అప్పుడా కొంగ గౌతమునితో, " బ్రాహ్మణా, నా అదృష్టం వలన ఈ నాడు నాకు అతిథిగా వచ్చావు. యథావిథిగా నా ఆతిథ్యాన్ని స్వీకరించి, రేపు పొద్దున నీ దారిలో నీవు వెళుదువు." అని పలికి, పక్కనే ఉన్న నది నుంచి చేపలను పట్టి తెచ్చి, వాటిని కాల్చి, అతనికి ఆహారంగా సమర్పించింది. తన రెక్కలతో విసరి, అతని శ్రమను పొగొట్టింది. ఆ తరువాత నాడీజంఘుడు, గౌతముడు అక్కడకు వచ్చిన కారణాన్ని గురించి ప్రశ్నించాడు.

దానికి గౌతముడు, తాను దరిద్రుణ్ణనీ, ద్రవ్య సంపాదన కోసం తిరుగుతున్నాననీ చెప్పాడు. అది విన్న కొంగ, ధన సంపాదనకు అతడు ఎక్కడికీ వెళ్ళనవసరం లేదనీ, తనకు ఆప్తమిత్రుడైన విరూపాక్షుడనే రాక్షసరాజు, మూడు యోజనాల దూరంలోని నగరంలో ఉన్నాడనీ, అతని దగ్గరకు వెళ్ళి, తన మిత్రునిగా చెప్పుకుంటే, గౌతమునికి కావలసినంత బంగారం అతను ఇస్తాడనీ చెప్పింది. ఆ మాటలకు  గౌతముడు సంతోషించి, మరుసటి రోజు విరూపాక్షుడున్న నగరానికి వెళ్ళి అతణ్ణి దర్శించి, నాడీజంఘుని మిత్రునిగా పరిచయం చేసుకుని, తాను వచ్చిన పనిని గురించి వివరించాడు. విరూపాక్షుడు, గౌతముని చరిత్రను ఉన్నది ఉన్నట్లు చెప్పమన్నాడు. అందుకు గౌతముడు, "రాజా, నేను మధ్య దేశంలో బ్రాహ్మణ కులంలో పుట్టాను. శబరుల గ్రామంలో జీవిస్తున్నాను. నా భార్య శూద్ర స్త్రీ. ఆమె మొదట ఇంకొకరి భార్య. ప్రస్తుతం నా భార్య" అని తన గురించిన వాస్తవాన్ని తెలియజేశాడు. అది విన్న తరువాత విరూపాక్షుడు, తనలో తను ఇలా అనుకున్నాడు. “ఇతడు కేవలం జన్మతః మాత్రమే బ్రాహ్మణుడు. ఇతణ్ణి తనకు అత్యంత ఆప్తమిత్రుడైన నాడీజంఘుడు పంపించాడు. కాబట్టి, ఇతనికి అవసరమైన ధనాన్ని తప్పక ఇవ్వాలి” అని భావించాడు. తాను ప్రతిరోజు చేసే బ్రాహ్మణ పూజతో పాటు, గౌతముని కూడా పూజించి, ఇతర బ్రాహ్మణులతో సమానంగా, గౌతమునికి కూడా విలువైన బంగారు, వెండి, వజ్ర వైఢూర్యాలు, మొదలైన వాటిని ఇచ్చి పంపించాడు.

గౌతముడు ఆ బంగారాన్ని మోసుకుంటూ, నాడీజంఘుని దగ్గరకు వెళ్ళాడు. నాడీజంఘుడు మళ్ళీ అతనికి అనేక రకాల సపర్యలు చేసి, చక్కటి భోజనం పెట్టి, రాత్రి తన దగ్గరే ఆశ్రయమిచ్చాడు. ఆ సమయంలో గౌతముడు, "ఈ బంగారాన్ని మోసుకుని నేను చాలా దూరం వెళ్ళాలి. దారిలో తినడానికి ఆహారం కావాలి. ఆహారం ఉంటేగానీ, ప్రాణం నిలువదు. కాబట్టి, నేను బ్రతకాలంటే, ఆహారం తప్పనిసరి" అని ఆలోచిస్తుండగా, తనకు ఆశ్రయమిచ్చి, ఎంతగానో ఉపకారం చేసిన నాడీజంఘుడు, అతనికి పెద్ద మాంసపు ముద్దలాగా కనిపించాడు. దాంతో అతను నిద్రపోతున్న నాడీజంఘుని చంపి, పక్షి రెక్కలూ, ఈకలూ తీసివేసి, అగ్నిలో కాల్చి, ఆ మాంసాన్నీ, బంగారాన్నీ తీసుకుని, తన గ్రామానికి బయలుదేరాడు.

నాడీజంఘుడు ప్రతిరోజూ బ్రహ్మ దర్శనానికి వెళ్ళి తిరిగివస్తూ, దారిలో విరూపాక్షుని దగ్గరకు వెళుతూ ఉంటాడు. అప్పటికి రెండు రోజులుగా నాడీజంఘుడు రాకపోవడంతో, విరూపాక్షుడు, దుష్టుడైన గౌతముని వలన అతనికేదైనా అపకారం జరిగి ఉంటుందని అనుమానించి, తన కుమారునితో పాటు కొంతమంది అనుచరులైన రాక్షసులను, నాడీజంఘుని ఉద్యాన వనానికి పంపించాడు. అతని కుమారుడు అక్కడ నాడీజంఘుని ఈకలు చూసి, జరిగిన విషయాన్ని గ్రహించి, అనుచరులతో చాలా వేగంగా ప్రయాణించి, గౌతముని పట్టుకుని, అతని వద్ద ఉన్న నాడీజంఘుని శరీరాన్ని తీసుకుని, విరూపాక్షుని వద్దకు వెళ్లాడు. నాడీజంఘుని శరీరాన్ని చూసిన విరూపాక్షుడూ, అతని కుటుంబ సభ్యులూ, మంత్రులూ, భోరున విలపించారు.

వెంటనే విరూపాక్షుడు పట్టరాని కోపంతో, తన మిత్రుని చంపిన పరమ క్రూరుడూ, కృతఘ్నుడూ అయిన గౌతముణ్ణి, రాక్షసులైన తన అనుచరులతో ముక్కలు మక్కులుగా నరికించి, అతని మాంసాన్ని దోపిడిగాళ్ళకు ఆహారంగా వేయించాడు. కృతఘ్నుడైన అతడి మాంసాన్ని తినడానికి, వారు కూడా ఇష్టపడలేదు. విరూపాక్షుడు నాడీజంఘుని శరీరానికి దహన క్రియలు నిర్వర్తించాడు. అదే సమయంలో అతని తల్లీ, దక్షుని కుమార్తె అయిన సురభీ దేవి, ఆకాశంలో ప్రత్యక్షమయ్యింది. ఆమె నోటి నుండి పాలతో కూడిన నురగ జారి, నాడీజంఘుని చితిమీద పడింది. దాంతో నాడీజంఘుడు తిరిగి జీవించాడు. అదే సమయంలో దేవేంద్రుడు అక్కడికి వచ్చి, పూర్వం బ్రహ్మదేవుడు ఇచ్చిన శాపం వలన, నాడీజంఘుడు గౌతమునిచేత చంపబడ్డాడని చెప్పాడు.

పునర్జీవితుడైన నాడీజంఘుడు మహేంద్రునికి నమస్కరించి, చనిపోయిన గౌతముణ్ణి బతికించవలసిందిగా కోరాడు. దేవేంద్రుడు అమృతాన్ని చల్లి, గౌతముని బ్రతికించాడు. నాడీ జంఘుడు గౌతముణ్ణి కౌగలించుకుని, ధనంతో సహా అతణ్ణి అతని గ్రామానికి పంపించాడు. గౌతముడు తన గ్రామానికి వెళ్ళి, శూద్ర స్త్రీతో సంసారం చేసి, సంతానం పొందాడు. చేసిన పాపం కారణంగా, మరణించిన తరువాత గౌతముడు ఘోర నరకంలో పడ్డాడు. అని ఈ కథను భీష్ముడు ధర్మరాజుకు చెప్పి, "మనిషి తాను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉండాలి. మిత్రుల కోరికలను తీర్చాలి. మిత్రుని వల్ల సర్వమూ లభిస్తుంది. మిత్రుని వలన మనిషి భోగాలను పొందుతాడు. మిత్రుని వలన, ఆపదల నుంచి బయటపడతాడు. వివేకవంతుడు మిత్రుణ్ణి గొప్ప సత్కారాలతో పూజించాలి" అని తెలియజేశాడు.

కృష్ణం వందే జగద్గురుం!

Monday, May 1, 2023

సగం శరీరంతో జన్మించిన ‘అరుణుడు’ ఎవరు? Story of Aruna or Anura

 

సగం శరీరంతో జన్మించిన ‘అరుణుడు’ ఎవరు?
How Sanatana Dharma is Scientific and Conscientious way of living?

సూర్యుడి కిరణాలు మన భూమిని నాశనం చేయకుండా కాపాడేది, ఓజోను పొర అని మనందరికీ తెలిసిందే. దాని గురించి ఎన్నో ఏళ్ళ క్రితమే మన పురాణాలలో, సుస్పష్టంగా వివరించబడిన ఒక గాథతోపాటు, సూర్యుడి ఆగ్రహ జ్వాలలకు కారణం ఏమిటి? సూర్యకిరణాలు లోకాలను దహించివేయకుండా అడ్డుపడేది ఎవరు? సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో, ఆకాశంలో కనబడే అరుణ వర్ణం ఎవరి కారణంగా ఉద్భవిస్తుందనేటటువంటి ఉత్సుకతును రేకెత్తించే విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/2laPV4Ws8X0 ]



ఇనుడు అంటే సూర్యుడు. ‘ఇన’ శబ్దానికి, సంచరించువాడు అని అర్థం. సూర్యుడు ఒకచోట స్థిరంగా ఉండకుండా సంచరిస్తూ ఉంటాడని, వేల ఏళ్ళ క్రిందటే చెప్పారు మన మహర్షులు. గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. ఆ తిరగడంలో ఒక పద్ధతి ఉన్నది, నియంత్రణ ఉన్నది. ఒక గ్రహానికి మరొక గ్రహం ఢీ కొనకుండా చూసే ఏర్పాటున్నది. ఈ ఏర్పాటును చూసే శక్తి పేరు, శేషువు. ఈ విషయాన్నే స్థూలంగా, ఆదిశేషుడు భూమిని మోస్తున్నాడని చెబుతాయి, మన పురాణాలు. సూర్యుడు తన చుట్టూ తాను తిరగడం మాత్రమే కాక, అనేక కోట్ల సూర్యులతో కలసి ఏర్పడిన పాలపుంత చుట్టూ తిరుగుతుంటాడు. దీనిపేరు బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండాన్ని నిలబెట్టే గురుత్వాకర్షణ శక్తి పేరు, కమఠ. అదే కూర్మ శక్తి. అమృత మథనానికి తోడ్పడేందుకు, మంధర పర్వతాన్ని మోసిన ఆది కూర్మం ఇదే. ఆధునికులు పాలపుంతగా భావించే అంతరిక్షంలోని నక్షత్రమండల సముదాయాన్ని, మన పూర్వులు క్షీర సముద్రంగా వర్ణించారు. పాలపుంతలన్నీ కలిసి ఒక కేంద్రకాన్ని ఏర్పరచుకుని, దాని చుట్టూ తిరుగుతుంటాయి. ప్రాచీనుల భాషలో దానిని, అఖిలాండ బ్రహ్మాండ కోటి అంటారు. ఈ ఏర్పాటును స్థిరపరిచే గురుత్వాకర్షణ శక్తిని, ఆది వరాహమనీ, శ్వేత వరాహమనీ అంటారు. భూమిని ప్రాణికోటికి నివాస యోగ్యంగా స్థిరపరచిన ఈ వరాహం పేరునే, మన పూజా సంకల్పాలలో ‘శ్వేత వరాహ కల్పే’ అని జ్ఞాపకం చేసుకుంటాము. సూర్యుడిది ఏక చక్ర రథం. దానికి పూన్చిన గుర్రాలు ఏడు. కిరణంలోని ఏడు రంగులే, ఏడు గుర్రాలు. అశ్వాలు వేగానికి ప్రతీక.

ఇక ఈ కథ, ఆది పర్వంలోని ఆస్తీక పర్వం అనే ఉపపర్వంలో, గరుడుని కథలో, 24 వ అధ్యాయంలో, 20 శ్లోకాలలో ఉంది. దేవదానవులు సముద్రాన్ని చిలికినపుడు, అందులోనుంచి అమృతం ఉద్భవించింది. విష్ణువు అమృతాన్ని దేవతలకు పంచుతున్న సమయంలో, రాహువు దేవతల పంక్తిలో కూర్చుని అమృతాన్ని సేవించబోతూ ఉన్నప్పుడు, సూర్య చంద్రులు చూసి, విష్ణువుకు చెప్పారు. విష్ణువు తన చక్రంతో రాహువు తల నరికి వేశాడు. అయితే, అప్పటికే అమృతాన్ని నోటిలో పోసుకోవడం వల్ల, మొండెం నుంచి తల వేరయినప్పటికీ, అమృత ప్రభావంతో, తల భాగం ప్రాణంతోనే ఉండి, ఆ రాహువు సూర్య చంద్రులను పట్టుకుని బాధించడం మొదలు పెట్టాడు. తాను రాహువు తల నరికించి దేవతలకు చాలా మేలు చేసినప్పటికీ, తనను రాహువు బాధిస్తూ ఉంటే, దేవతలు తనకు సహాయంగా రాకుండా చోద్యం చూస్తున్నారని, సూర్యునికి దేవతల మీద కోపం వచ్చి, ముల్లోకాలకూ బాధ కల్పించాలనే ఉద్దేశంతో, అస్తాద్రికి చేరి అక్కడే ఉంటూ, లోకాలను తన కిరణాల చేత తపింపజేయడం మొదలుపెట్టాడు. అప్పుడు రుషులూ, దేవతలూ కలసి బ్రహ్మ వద్దకు వెళ్లి, సూర్యుడు లోకాలను దహింపజేస్తున్న విషయాన్ని గురించి చెప్పారు.

దానికి బ్రహ్మ, "కశ్యప మహర్షి కుమారుడైన అనూరుడు చాలా విశాలమైన శరీరం కలవాడు, గొప్ప తేజస్వి. అతణ్ణి సూర్యుని ముందు రథం మీద కూర్చుండ బెట్టి సారథ్యం చేయిస్తే, భయంకరమైన సూర్యుని తేజస్సు అడ్డగింపబడుతుంద"ని సలహ ఇచ్చాడు. సూర్య శక్తిని తట్టుకోగలిగే అనూరుడి జన్మ వృత్తాంతాన్ని చూసుకున్నట్లయితే, కశ్యప ప్రజాపతి భార్యలైన వినతా కద్రువలు, తమకు సంతానం కావాలని భర్తను కోరారు. అప్పుడు కశ్యపుడు వారిని "ఎలాంటి పుత్రులు కావాల"ని అడుగగా, కద్రువ తనకు ప్రకాశవంతమైన దేహాలు కలిగిన పుత్రులు వెయ్యి మంది కావాలని కోరింది. వినత మాత్రం, తనకు వారి కంటే బలవంతులైన ఇద్దరు పుత్రులు కావాలని కోరింది. పుత్రుల కొరకు కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. యాగ ఫలితంగా, కద్రువకు వెయ్యి అండాలూ, వినతకు రెండు అండాలూ లభించాయి. ముందుగా కద్రువ అండాలు పక్వం చెంది, వెయ్యి మంది నాగ కుమారులు జనించారు. అందుకు వినత ఉక్రోషపడి, తన అండాలలో ఒకదానిని బలవంతంగా చిదిమింది. దాని నుండి సగం దేహంతో జన్మించిన వాడే, అనూరుడు. అండము నుండి బయటకు రాగానే అతను తల్లిని మందలించి, తనకు అసంపూర్ణమైన దేహం కలిగినందుకు కారణమైన ఆమెను, ఎవరిని చూసి ఈర్ష్యతో ఆ దారుణానికి పూనుకున్నదో, వారికే దాసివవుతావని బాధతో శపించాడు. తరువాత వినతకు మరో అండం ద్వారా, గరుడుడు జన్మించాడు.

సూర్యుడి తాపం నుండి విముక్తి పొందడానికై బ్రహ్మ సలహా మేరకు, గరుడుడు ముల్లోకాల క్షేమాన్నీ కోరి, తన అన్న, నడుము క్రింది భాగం లేనివాడూ అయిన అనూరుడిని మోసుకుని వెళ్ళి, సూర్యుని రథం మీద కూర్చోబెట్టాడు. సారథి రథికుడికి వెన్నుపెట్టి గుర్రాలను తోలాలి. అనూరుడు అందుకు భిన్నంగా, సూర్యుడివైపు ముఖంపెట్టి కూర్చున్నాడు. సూర్యుడి నుంచి వెలువడే కిరణాల దుష్ప్రభావాలను తాను వడగట్టి, మంచి కిరణాలను భూమికి పంపడం మొదలుపెట్టాడు. సూర్యోదయానికి పూర్వం, ఆకాశంలో కనబడే ఎరుపు వర్ణం, అనూరుడు చేస్తుండే సాహసానికి సంబంధించినదే!  దీనినే, ఓజోన్‌ పొర అతినీలలోహిత కిరణాలను అడ్టుకుంటుందన్న దానికి ప్రతీకగా తీసుకోవచ్చు. సూర్యుడి కిరణాలను అడ్డుకుంటూ, ముల్లోకాలకూ ప్రశాంతతను కలుగజేసిన అనూరుడికి, అరుణుడు అన్నపేరు స్థిరపడింది. శూరసుత, అనూరు, అరణ్య కాశ్యపి, గరుడాగ్రజ అనేవి, అనూరునికి గల మరికొన్ని పేర్లు.

అనూరుడికి తన భార్య శ్యేని వల్ల, ఇద్దరు కుమారులు కలిగారు. వారే సంపాతి, జటాయువు. వీరి పూర్తి వృత్తాంతాలను మనం గతంలో, రామయణ గాథలో తెలుసుకున్నాము. అయితే, కొన్ని గ్రంథాల ఆధారంగా, వాలీ, సుగ్రీవులు కూడా అనూరుడి కుమారులే. ఒకసారి అనూరుడు దేవేంద్ర సభలో అప్సరసలు నృత్యం చేస్తున్నారని తెలిసి, వారిని చూడడానికి స్త్రీగా మారి ఇంద్రలోకం చేరగా, ఇంద్రుడామెను మోహించి సంగమించగా, ఓ పుత్రుడు జన్మించాడు. ఆ తరువాత తన పూర్వ రూపంలోకి మారి, సూర్యుని వద్దకు వెళ్ళాడు. ఆలస్యానికి కారణమేమిటని సూర్యుడు నిలదీయగా, జరిగిన విషయాన్ని వివరించాడు. అంతా విన్న సూర్యుడు మరొకసారి తనను స్త్రీగా మారవలిసినదిగా కోరాడు. ఆ సమయంలో సూర్యుడితో సంగమించగా, మరొక పుత్రుడు జన్మించాడు. అలా స్త్రీగా మారిన అనూరుడికి జన్మించిన ఇద్దరి పుత్రులనూ, అహల్యాదేవి సాకింది. ఆమె భర్త గౌతమునికి ఇది కోపకారణమై, వారిని కోతులుగా మారమని శపించాడు.

రుక్షరాజు సంతానం లేక విచారిస్తుండగా, ఈ కోతుల రూపంలో ఉన్న ఇద్దరినీ, ఇంద్రుడు అతనికి అప్పగించాడు. వారే, వాలీ సుగ్రీవులు. అయితే, కద్రువ సంతానంలో ఐరావతుడనే వాడు, గొప్ప సర్పరాజు. అతనికి ఇరవైవేల మంది సంతానం. వీరందరూ సూర్యుడి రథానికి కట్టిన గుర్రాలను నియంత్రించడానికి అవసరమైన పగ్గాలుగా పనిచేయడానికి, వంతుల వారీగా, సూర్యమండలానికి వెళ్లి వస్తుంటారు. కాంతి కిరణాలు సరళరేఖలో పయనిస్తాయని మొదట్లో నమ్మిన ఆధునిక శాస్త్రజ్ఞులు, అలల రూపంలో కూడా అవి ప్రసరిస్తాయని కనుగొన్నారు. కాంతి కిరణాలు పాముల వలె మెలికలు తిరుగుతూ, అడ్డదిడ్డంగా, కట్టలుకట్టలుగా ప్రసరిస్తాయని, మన పూర్వులు పేర్కొన్నారు. కాలానికి సంబంధించిన శాస్త్రీయ విషయాలు ఎన్నో, మన వేదాలలో, పురాణేతిహాసాలలో కనిపిస్తాయి. సంకేతాల సాయంతో శాస్త్రీయ విషయాలను చెప్పడం, మనవారికి వెన్నతో పెట్టిన విద్య అని గ్రహించడమే, మన ఋషులకు మనం సమర్పించగల నివాళి. అత్యంత సనాతనమైన, ఎంతో విశిష్టతను సొంతం చేసుకున్న మన హైందవ ధర్మాన్ని గౌరవించడంతో పాటు, ముష్కరుల దాడులనుండి కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే.

ధర్మో రక్షతి రక్షిత:

Monday, April 24, 2023

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu


అంపశయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన అద్భుత నీతి కథ!

మహాభారతంలో నేటి జీవన శైలికి ఉపయోగపడే ఎన్నో నీతి కథలున్నాయి. ధర్మరాజు సందేహాల నివృత్తి కోసం, భీష్మపితామహుడు వివరించిన కథలు నేటికీ అనుసరణీయమే. అయితే, ఈ రోజు మనం తెలుసుకోబోయే కథకు, ఒక ప్రత్యేకత ఉంది. మామూలుగా మనం విన్నవీ, చదివినవీ, అంపశయ్య మీదున్న భీష్ముణ్ణి ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా, భీష్ముడు చెప్పిన కథలను. ఈ కథను మాత్రం, ధర్మరాజు తనను ప్రశ్నించకుండానే, తనంతట తానుగా తెలియజేశాడు భీష్మపితామహుడు. భారతీయుల చారిత్రక గ్రంధమైన మహాభారత కావ్యం, శాంతి పర్వంలోని ఆపద్ధర్మ పర్వం అనే ఉప పర్వంలో, 137వ అధ్యాయంలో, 24వ శ్లోకంలో ఉన్న ఈ కథతో, కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి? ఏ మేరకు అప్రమత్తంగా ఉండాలి? అనే అంశాలను అనుసంధానించి, భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు...

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/HB27utkLXCo ]



ఈ కథ ఒకరకంగా, ప్రస్తుతం మన దేశంలో నెలకొని ఉన్న Secular పరిస్థితులకూ వర్తిస్తుంది. అది ఎలా అనేది అన్వయించుకుని, మీకేమనిపించిందో, మీ అభిప్రాయాలను Comment ద్వారా తెలియజేయండి.

ఒక చెరువులో మూడు చేపలుండేవి. దీర్ఘదర్శీ, ప్రాప్తకాలజ్ఞుడూ, దీర్ఘసూత్రుడనేవి వాటి పేర్లు. ముగ్గురి ఆలోచనలూ, నడవడికలూ వేరైనా, అవి మంచిమిత్రులు. నీరు నిండుగా ఉండి, చెరువు చల్లగా ఉండడంతో, హాయిగా కాలం గడిపేవవి. అయితే, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! వర్షాకాలం గడిచింది. శీతకాలం గడిచింది. ఇక ఎండాకాలం రానే వచ్చింది. ఎండాకాలం వస్తూనే, వేడి నిప్పులను చెరిగింది. ఎండ వేడిమికి వడగాడ్పులు తోడవడంతో, చెరువు ఎండి పోసాగింది. రాబోయే విపత్కర పరిస్థితిని ముందుగానే గమనించాడు, దీర్ఘదర్శి. మిత్రులిద్దరినీ పిలిచి, ఇలా చెప్పాడు. ‘చూశారుగా మిత్రులారా! ఈ ఏడు ఎండలు విపరీతంగా ఉన్నాయి. రోజు రోజుకీ చెరువు ఎండిపోతున్నది. ఎండిపోయిన చెరువులో మనం ఉండడం, ప్రమాదకరం. పైగా, ఈ చెరువుకీ, ఇంకో చెరువుకీ పల్లంలో గల కాలువ మార్గం కూడా ఎండిపోయిన పక్షంలో, మన బ్రతుకే ప్రశ్నార్థకమవుతుంది. అందుకని ముందుగా మనం మేల్కోవడం మంచిది. కాలువ మార్గం ద్వారా ఏదైనా ఇంకో చెరువుకు ప్రయాణించడం, శ్రేయస్కరం.

’’దీర్ఘదర్శి ఆలోచనా, ఆందోళనా విన్న స్నేహితులిద్దరూ నవ్వుకున్నారు. వారిలో ప్రాప్తకాలజ్ఞుడు వెక్కిరింపుగా, ‘‘మొదలుపెట్టావా? ఎండాకాలం ప్రారంభమయింది, ఇంకా మొదలుపెట్టలేదేమిటా అని చూస్తున్నాను’ అని పగలబడి నవ్వి, ‘‘అన్నింటికీ ముందే భయపడకూడదు మిత్రమా! ప్రమాదం అని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకడం, దుఃఖ దాయకం. ప్రమాదం ముంచుకొస్తే, అప్పుడు ఆలోచిద్దాము. అప్పటిదాకా హాయిగా ఉండు. లేనిపోని భయాలు పెట్టుకోకు’’ అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. వెంటనే దీర్ఘసూత్రుడు మాట్లాడుతూ,‘‘ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడెండిపోయింది చెరువు? సముద్రంలా చల్లగా ఉంటేను. ప్రతి సారీ ఎండాకాలం వస్తుంది, ఆ తరువాత వర్షాకాలం వస్తుంది. అయినా ఇప్పుడప్పుడే ఈ చెరువు ఎండిపోదు. మనకే ఆపదా రాదు. తిని తిరక్కుండా, ఎందుకీ భయాలు’’ అని, దీర్ఘదర్శి మాటలను, వారిరువురూ కొట్టి పారేశారు. 

తన మాట వినిపించుకోని మిత్రులిద్దరినీ జాలిగా చూశాడు, దీర్ఘదర్శి. ఇక అక్కడ ఉండడం ఎంత మాత్రం క్షేమకరం కాదనుకుని, పల్లంలో గల కాలువ ప్రవాహంలో ప్రయాణించి, వేరే చెరువుకు చేరుకున్నాడు. కొద్ది రోజులు గడిచాయి. దీర్ఘదర్శి చెప్పినట్లు, చెరువులోని నీరు క్రమక్రమంగా ఇంకి పోసాగింది. అది గమనించిన జాలరులు చేపల వేటకు సిద్ధమయ్యారు. నీరు సరిగాలేని ఆ చెరువులో, జాలరులకు చేపలు ఇట్టే దొరికిపోసాగాయి. దొరికిన చేపలను తాటినారకు గుది గుచ్చి, మళ్ళీ మరిన్ని చేపల కోసం చెరువును అల్లకల్లోలం చేయసాగారు. ప్రాప్తకాలజ్ఞుడు జాగ్రత్తగా అంతా పరిశీలించి, ఒక పథకాన్ని ఆలోచించాడు. ‘జాలరి చేతికి చిక్కితే, ఇక అంతే సంగతులు. అందుకని ఇప్పుడు ఎంచక్కా తాటి తీగను నోటితో కరచి పట్టుకుని, చచ్చిన దానిలా వ్రేలాడతాను. పట్టిన చేపల మట్టిని వదిలించేందుకు, జాలరి ఎప్పుడయితే మంచి నీటిలో చేపలన్నిటినీ ముంచి తీస్తాడో, అప్పుడు అదే అవకాశంగా, నీటిలోకి జారుకుంటాను. అక్కడి నుండి సురక్షితమైన ఇంకో చోటుకు చేరుకుని, ఈ ప్రమాదాన్నించి తప్పించుకుంటాను’ అని ఆలోచించి, తన పథకాన్ని అనుకున్నట్టుగానే చేశాడు. చేపల గుత్తిని కరచి పట్టుకుని, చచ్చినట్టు నటించాడు ప్రాప్తకాలజ్ఞుడు.

జాలరి మరిన్ని చేపలను పట్టుకుని, అక్కణ్ణుంచి ముందుకు నడిచాడు. బురదలేని, తేటనీటి కొలను దగ్గరకు చేరుకున్నాడు. అలసిపోయాడేమో! దాహమనిపిస్తే, దోసిట నీరు పట్టి త్రాగాడు. తర్వాత తాను తెచ్చిన చేపల గుత్తిని ఎత్తి చూశాడు. చేపలన్నీ బురద బురదగా ఉన్నాయి. వాటి బురదను పోగొట్టేందుకు, చేపల గుత్తిని మంచి నీటిలో ముంచి తీశాడు. జాలరి గుత్తిని ముంచడమే ఆలస్యం. ప్రాప్తకాలజ్ఞుడు చల్లగా నీటిలోకి జారుకుని, తన ప్రాణాలను కాపాడుకున్నాడు. దీర్ఘసూత్రుడు మాత్రం, దీర్ఘదర్శిలా ముందే మేల్కొనకుండా, ప్రాప్తకాలజ్ఞుడిలా తగిన సమయానికి, తగిన విధంగా ప్రవర్తించకుండా, ‘ఆఁ! ఏం కాదులే’ అనుకుంటూ రోజులు గడిపేసి, చివరకు జాలరి వలకు చిక్కి, చనిపోయి, మరొకరికి ఆహారమయిపోయాడు’’.. ఈ కథలో నేర్చుకోవాల్సింది చాలా ఉంది..

ప్రాణం మీదకు వచ్చిన ఆపదను తెలుసుకోలేని మూర్ఖులూ, రాగల ఆపదను ముందుగానే పసిగట్టే ప్రయత్నం చేయని అజ్ఞానులూ, దీర్ఘసూత్రునిలా ప్రమాదంలో చిక్కుకుని, మరణిస్తున్నారు. నేను తెలివి గలవాడిని, అవసరం వచ్చినపుడు ఆలోచించుకోవచ్చులే అని నిర్లక్ష్యంగా ఉండేవాడు, ప్రాప్తకాలజ్ఞుడిలా, ప్రాణసంకటంలో పడతాడు. రాగల ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన దీర్ఘదర్శిలాంటి జాగ్రత్తపరులు, చీకూ చింతా లేకుండా, హాయిగా, సుఖంగా ఉండగలుగుతారు.’’ అని భీష్ముడు ధర్మరాజుకు, తన కర్తవ్యాన్ని ముందు చూపుతో ఏవిధంగా నిర్వర్తించాలో,  తెలియజేశాడు.

ఈ కథను మన పాఠ్యాంశాలలో, ప్రాథమిక స్థాయి తరగతులలో, చదివే ఉంటాము. అయితే, ఈ కథ భారతంలో ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ఈ కథలోని దీర్ఘదర్శి, రాబోయే ఆపదను ముందుగానే పసిగట్టి, ఆపద రాకముందే సురక్షితంగా బయట పడాలనే నీతిని తెలుపుతోంది. ఈ పద్ధతి ఉత్తమమైనది. ఎలాంటి భయం, ఆందోళనా లేకుండా, ప్రశాంత జీవనం గడపడానికి, ఇది పనికి వస్తుంది. అపాయం ఎదురైనప్పుడు, ఉపాయంతో బయట పడడం, మధ్యమం. ఈ పద్ధతిలో, అపాయం నుంచి బయట పడేవరకూ, ప్రాణాలు అరచేతిలో చిక్కబట్టుకోవాలి. అపాయం నుంచి తప్పించుకోవడానికి, మన ఉపాయం నెరవేరుతుందో లేదో, తెలియదు. అందువల్ల, దాని కంటే మొదటి పద్ధతే ఉత్తమమైనది. ఒక వేళ ఏ కారణం చేతనైనా మొదటి పద్ధతిని పాటించలేకపోతే, ప్రాప్తకాలజ్ఞుడిలా రెండవ పద్ధతి ద్వారా, ప్రాణాలు కాపాడుకోవాలి. ఈ రెండు పద్ధతులూ పాటింపని సోమరిలా ఉంటే, దీర్ఘసూత్రుని లాగా నశించిపోవలసి వస్తుందనే చక్కని నీతిని, ఈ కథ ద్వారా భీష్మపితామహుడు, ధర్మరాజు తోపాటు, మనందరికీ తెలియజేశాడు.

ఏ విషయమైనా, మన దాకా వచ్చిన తరువాత చూసుకుందాములే.. అని తాత్సారం చేసి, భావితరాలను ముంపుకు గురిచేయకుండా, సరైన నిర్ణయాలను తీసుకుని, జాగ్రత్త పడదాము. సనాతన ధర్మాన్ని మించిన ధర్మం లేదు..

సర్వం కృష్ణ మయం!

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...