Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Monday, November 28, 2022

యువక్రీతుడి కథ! Sustainable Attainment 'Story of Yuvakrita'


రోమశ మహర్షి చెప్పిన యువక్రీతుడి కథ!
గురుముఖతః నేర్చుకోని విద్య ఎందుకు పనికిరాదు?

గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/P1cMnPseiNU ]


మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా, ప్రతి అడుగులోనూ, ప్రతిక్షణంలోనూ, ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుకా గురువు వుంటాడు. గురువు యొక్క విశిష్ఠత మన పురాణ గ్రంథాలలో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎంత కఠోర దీక్ష చేసినా, ఎన్ని వరాలను పొందినా, గురుముఖతా నేర్చుకున్న విద్యకు సమానం కాదు. అందుకు ఉపమానంగా, పాండవులు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు, వారి వెంట ఉన్న రోమశ మహర్షి, సంగమ నదీ తీరం వద్ద, యువక్రీతుని గురించి వివరించాడు. యువక్రీతుడు ఎందుకు ఘోర తపస్సుకు పూనుకున్నాడు? ఇంద్రుడిని అడిగిన వరం ఏంటి? ఒక మహర్షి చేతిలో అతని మరణం ఎందుకు సంభవించింది? అనేటటువంటి ఉత్సుకతను రేకేత్తించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసకుందాము..

రైభ్యుడూ, భరద్వాజుడూ అనే మహా ఋషులిరువురూ మిత్రులు. వారిద్దరూ అడవిలో తపస్సులో నిమగ్నమయ్యారు. రైభ్యునికి అర్ధావసుడు, పరావసుడనే కుమారులున్నారు. వారిద్దరూ మంచి విద్యావంతులే అయినా, అర్ధావసుడు సంస్కారవంతుడు కూడా. భరద్వాజుని కుమారుడి పేరు యువక్రీతుడు. అతనికి అర్ధావసుడూ, పరావసుడంటే అసూయ. అందుకని, కష్టపడకుండా సకల విద్యలూ సంప్రాప్తించాలనే కోరికతో, ఇంద్రుని గురించి తపస్సు చేశాడు. చివరకు ఇంద్రుడు ప్రత్యక్షమై, అంత ఘోరతపస్సుకు కారణం అడిగాడు. అందుకు యువక్రీతుడు, తనకు చదవకుండానే సకల శాస్త్రాలూ, వేదాలూ అవగతం కావాలని కోరాడు. ఆ మాటలు విన్న ఇంద్రుడు, అది అనుచితమని చెప్పి, అలా వచ్చే విద్య మత్సరాన్ని కలిగిస్తుంది. అది మంచిది కాదు. విద్య గురు ముఖతః నేర్చుకుంటేనే శాశ్వతమని హితవు పలికి, మరే ఇతర వరాన్నైనా కోరుకొమన్నాడు. అందుకు యువక్రీతుడు సమ్మతించలేదు. దాంతో ఇంద్రుడు తిరిగి వెళ్ళి పోయాడు.

మరింత పట్టుదలతో యువక్రీతుడు తపస్సును కొనసాగించాడు. మరల ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి, అక్కడ ప్రవహిస్తున్న గంగా నదికి అడ్డుగా, చేతులతో ఇసుక పోస్తూ సేతుబంధనం నిర్మించే ప్రయత్నం చేయసాగాడు. అది చూసి యువక్రీతుడు నవ్వి, అలా ఎన్ని రోజులు చేస్తే, ఆ సేతువు పూర్తవుతుందని అడిగాడు. దానికి ఆ వృద్ధుడు, అతనిలాగానే అసాధ్యమైన దాని కోసం ప్రయత్నిస్తున్నానని సత్యాన్ని పలికాడు. ఇంద్రుడు తన నిజరూపం చూపి, తను చేసిన పని ఎంత నిరర్ధకమో, సంస్కార రహితమైన విద్యలూ అంతే నిరర్ధకమని చెప్పి, అతని ప్రయత్నం విరమించుకోమని చెప్పజూశాడు. అందుకు యువక్రీతుడు అంగీకరించక, తనకు సకల విద్యలూ కావలసిందేనని పట్టు పట్టాడు. ఇక ఇంద్రుడు చేసేది లేక, అతనికి సకల విద్యలనూ ప్రసాదించాడు.

తన కోరిక తీరిందన్న గర్వంతో, తన తండ్రి వద్దకు వెళ్ళాడు యువక్రీతుడు. తన పాండిత్యంతో ఎంతో మందిని ఓడించాడు. ఒకరోజు యువక్రీతుడు, తన తండ్రి మిత్రుడైన రైభ్యుని చూడటానికి వెళ్ళాడు. అక్కడ రైభ్యుని రెండవ కుమారుడు పరావసుడి భార్య అయిన కృష్ణ అనే సుందరిని చూశాడు. ఆమెను మోహించి, తన కోరిక తీర్చమని అడిగాడు. అందుకామె, అతనిని తిరస్కరిస్తే శపిస్తాడేమోనని భయపడి, సాకు చెప్పి తప్పించుకుని పోయింది. తరువాత ఆ విషయాన్ని తన మామగారికి చెప్పి, కన్నీరు పెట్టుకుంది. దాంతో రైభ్యుడు ఆగ్రహించి, తన జటాజూటం తీసి అగ్నిలో వేసి, ఒక రాక్షసుడిని సృష్టించాడు. మరొక జటను లాగి అగ్నిలో వేసి, కృష్ణ లాంటి మరొక కన్యను సృష్టించాడు. వారిరువురినీ చూసి, యువక్రీతుని నశింపజేయమని చెప్పి పంపాడు. ముందు ఆ యువతి తన అందంతో యువక్రీతుని మైమరపించి, అతని కమండలాన్ని సంగ్రహించింది. కమండలం పోగానే యువక్రీతుడు అశక్తుడయ్యాడు. వెంటనే రాక్షసుడు యువక్రీతుని వధించాడు. ఆ తరువాత రైభ్యుడు, ఆ యువతిని రాక్షసునికి ఇచ్చి వివాహం చేశాడు. ఆశ్రమానికి వచ్చిన భరద్వాజుడు, కుమారుని మరణ వార్త విని, పుత్ర శోకం భరించలేక, అగ్ని ప్రవేశం చేసి మరణించాడు.

తరువాత కొన్నాళ్ళకు, బృహద్యుమ్నుడనే రాజు సత్రయాగం చేయడానికి పూనుకున్నాడు. ఆ యాగానికి పరావసుడూ, అర్ధావసులను ఋత్విక్కులుగా నియమించాడు. యజ్ఞం జరుగుతుండగా ఆ రాత్రి, పరావసుడు ఆశ్రమానికి బయలుదేరిన సమయంలో, అరణ్యమార్గంలో ఏదో అలికిడి వినిపించింది. ఎదో క్రూరమృగమనుకుని, ఆత్మరక్షణార్ధం పొరపాటున ఎదురుగా వస్తున్న తండ్రి రైభ్యుని చంపాడు. తండ్రిని గుర్తించి, కుమిలి పోయాడు. అతనికి దహన సంస్కారాలు ముగించి అన్న వద్దకు పోయి, జరిగినది చెప్పాడు. పరావసుడు తన అన్న అర్ధావసుడితో, "అన్నయ్యా! నీవు ఒక్కడివే, యాగాన్ని నిర్వహించ లేవు. అది నేను చేయగలనుగనుక, నేను యాగాన్ని కొనసాగిస్తాను. నీవు పోయి నాకు కలిగిన బ్రహ్మహత్యా పాతకానికి పరిహారం చెయ్యి" అని అన్నాడు. సంస్కారవంతుడైన అర్ధావసుడు, తమ్ముని బదులు అన్ని ప్రాయశ్చిత్తములూ పూర్తి చేసి, యాగశాలకు తిరిగి వచ్చాడు. అన్నయ్యను చూసిన పరావసుడు, ఎక్కడ తనవలన జరిగిన తప్పును బయటపెడతాడోనన్న భయంతో, బృహద్యుమ్నునితో, "మహారాజా! ఇతడు యాగశాలలో ప్రవేశించడానికి అర్హుడు కాదు. పవిత్రమైన యాగక్రతువును విడిచి, బ్రహ్మహత్యా ప్రాయశ్చిత కార్యం నిర్వహించి వస్తున్నాడు" అని అన్నాడు. ఆ మాటతో రాజు అనుచరులు, అర్ధావసుణ్ణి యాగశాలలోనికి రాకుండా అడ్డుకున్నారు.

సత్వగుణుడైన అర్ధావసుడు, అప్పుడుకూడా తమ్ముడి మీద ఆపేక్షతో వాస్తవాన్ని బయటపెట్టక, దేవతలను ప్రార్ధించాడు. దానికి దేవతలు సంతోషించి, అతని సత్యనిరతిని మెచ్చుకుని, ఏం వరం కావాలో కోరుకోమన్నారు. అప్పుడు అర్ధావసుడు, "అయ్యా! నా తండ్రినీ, భరద్వాజునీ, యువక్రీతుణ్ణీ బ్రతికించండి. అలాగే, నా తమ్ముని దోషాన్ని కూడా పరిహరించండి" అని కోరుకున్నాడు. ఆ విధంగా దేవతలు, అర్ధావసుడు కోరినట్లు వారిని బ్రతికించారు. తిరిగి బ్రతికిన యువక్రీతుడు దేవతలను చూసి, "దేవతలారా! నేను ఎన్నో విద్యలను పొందాను, వ్రతాలు చేశాను. కానీ, రైభ్యునిచే చంపబడ్డాను. కారణం ఏమిటి?" అని అడిగాడు. దానికి సమాధానంగా దేవతలు "యువక్రీతా! గురు ముఖతః నేర్చుకున్న విద్య, సంస్కారంతో కూడుకున్నది గనుక, ఫలిస్తుంది. తపస్సు వలన పొందినది అహంకారపూరితమైనది గనుక, అక్కరకురాదు. అందుకే నీ కమండలం దూరమైన వెంటనే, నీ విద్యలు నిర్వీర్యమయ్యాయి. రైభ్యుని విద్య గురువు నేర్పినది కనుక, అతడు నీ కంటే శక్తిమంతుడయ్యాడు." అని పలికి, దేవతలు అంతర్ధానమయ్యారు. ఇందుకు మరో ఉదాహరణగా, తననుజూసి అరుస్తున్నదని, అల్ప ప్రాణి అయిన శునకము నోటినిండా బాణాలను సంధించిన ఏకలవ్యుడి కథను కూడా చెప్పుకోవచ్చు.

The story series set up for the Pandavas in the Aranya Parva of the Mahabharata continues to deliver, with sage Romasa narrating tales that convey the significance of each sacred spot that the brothers visit. The next in the sequence is the story of the death and resurrection of sage Yuvakrita. It begins with the friendship of two rishis, Bharadwaja and Raibhya, who make their hermitages in the same forest.

Raibhya has two sons, Ardhavasu and Paravasu, while Bharadwaja has a son by the name of Yuvakrita. Yuvakrita is the troubled one, envious of the adulation that the relatively gregarious Raibhya, and his sons, receive from other brahmans.

In order to acquire the knowledge of the vedas and beyond, Yuvakrita decides not to take the normal, organic route of learning them from his preceptor, but to employ his asceticism and force the gods to grant all the knowledge to him. That said, there is a hint in the text that Yuvakrita’s decision might have been due to his difficulties with learning: he isn’t a particularly intelligent chap. The king of the gods, Indra, is ruffled by the harsh austerities that Yuvakrita performs, and, in the guise of an old brahmin, tries to impart some sense to him. But Yuvakrita is stubborn, and eventually Indra grants him what he desires. When Bharadwaja comes to learn of this, he is agitated.

He considers such a shortcut to knowledge as a betrayal of destiny, and predicts that if Yuvakrita became proud of his achievement, he will be miserably destroyed. One day, Yuvakrita roams into Raibhya’s hermitage and, seeing her alone, rapes Parvasu’s wife. When Raibhya learns of this, he creates two beings: one a woman of beauty, whose task is to lure Yuvakrita; and another a rakshasa, who is tasked with killing him.

Their mission, of course, is successful. Seeing his dead son and knowing his deeds, Bharadwaja’s grief pushes him to take his own life, but that doesn’t happen before he curses Raibhya’s eldest son with killing his own father. One day, after conducting sacrifices for a king, Paravasu returns to the hermitage almost blinded by fatigue and is terrified seeing a black figure in the dense forest: to him its an animal. It is in fact Raibhya, clad in black deerskin, but Paravasu fails to realise that and kills his own father. Thus Bharadwaja’s curse comes to pass.

In order to allow Paravasu to continue the sacrifices, Ardhavasu takes the blame upon him. When the gods are pleased with this act, they allow him to bring back to life his own father, and also Bharadwaja and Yuvakrita. Thus, everything becomes alright again. Only that it doesn’t. The Mahabharata doesn’t offer us any window into the plight of the raped woman, used so blatantly as a narrative device that even her name is not provided. Do the gods un-rape her somehow? Does her trauma also vanish? Or is she banished instead? We don’t know, for our Mahabharata doesn’t care.

ధర్మో రక్షతి రక్షితః

Wednesday, November 23, 2022

మార్గశిర మాసం - Significance of Margasira Masam


రేపటి నుండి మార్గశిర మాసం ప్రారంభం - మార్గశిర మాస విశిష్టత!

ప్రతి సంవత్సరం కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుందని అందరికీ తెలిసిన విషయమే. సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మే భగవద్గీతలో 'మాసానాం మార్గశీర్షోహం' అని చెప్పారంటే, హిందువులకు ఈ మాసం ఎంత పవిత్రమైనదో తెలుస్తుంది. మోక్ష గ్రంధమైన భగవద్గీత అవతరించినది కూడా, ఈ మాసంలోనే అని చెబుతారు. హిందువులు నెల రోజుల పాటు తిరుప్పావై చదువుతూ, పరమ భక్తితో చేసుకునే ధనుర్మాస వ్రతం కూడా, ఈ మాసంలోనే మొదలవుతుంది. ఈ మాసంలో విష్ణు ప్రీతిగా చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా, మంచి ఫలితాన్ని ఇస్తుంది.

[ శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన మార్గశిరమాస విశిష్టత: https://youtu.be/0IsB-um3hno ]


శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం ఇదని అందరూ చెబుతుంటారు..

పెద్ధలు ఈ మాసాన్ని మోక్ష మాసంగా, లేదా మోక్ష సాధనా మాసంగా కూడా చెబుతారు. భక్తితో ఉపవాసం, జాగరణ ఉండి చేసే మోక్షద ఏకాదశి కూడా, ఈ మాసంలోనే వస్తుంది.

నిజానికి ఈ మాసానికి ఎందుకంత ప్రాముఖ్యత అనే విషయం గురించి తెలుసుకుందాం..

మార్గశిరం తరువాత వచ్చే పుష్యమాసం నుండి, ఉత్తరాయణం మొదలవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం.

అలా చూసుకుంటే, దక్షిణాయనం చివరిభాగం, ఉత్తరాయణం ముందు వచ్చే భాగం అయిన మార్గశిరం, పగలుకు ముందు వచ్చే బ్రాహ్మీముహూర్తం లాంటిదని తెలుస్తుంది. రోజులో బ్రాహ్మీ ముహూర్తం ఎంత ప్రాధాన్యత కలిగినదో, సంవత్సరానికి స్వయం విష్ణు స్వరూపమైన మార్గశిరం కూడా అంతే ప్రాధాన్యత కలిగినది. ఎలాగైతే బ్రాహ్మీ మహూర్తంలో మనం నిత్య పూజ చేసుకుంటామో, అదే విధంగా, దేవతలకు బ్రాహ్మీ ముహూర్తమైన ఈ మాసమంతా, దేవతలూ, ఋషులూ, యోగులూ, శ్రీమహావిష్ణువును భక్తితో పూజిస్తారు. ఈ మాసం లక్ష్మీనారాయణ స్వరూపం. శ్రావణ శుక్రవారం, కార్తీక సోమవారం లాగా, మార్గశిర లక్ష్మివారం (గురువారం), మార్గశిర శనివారం, చాలా ప్రాముఖ్యతగలవి.

Link: https://www.youtube.com/post/Ugkx5CgqUoRUPmDvVi9k7HNxYJyriK7GCvOA

మీకు తెలుసా?

Tuesday, November 22, 2022

షాడో ఇన్ బోర్నియో Shadow in Borneo by Madhubabu


త్వరలో.. 

'షాడో ఇన్ బోర్నియో' Shadow in Bornio - షాడో స్పై అడ్వెంచర్ - మధుబాబు

02nd డిసెంబర్ నుండి ప్రారంభం.. Only on SMBAB

కిల్లర్స్ గ్యాంగ్ వలలో చిక్కుకున్న బోర్నియో చక్రవర్తి, ఆర్ధిక, రాజకీయ, సామాజిక, వ్యక్తిగత ఇబ్బందులలో చిక్కుకుని విలవిలలాడుతూ, ద్వీపాన్ని అశాంతి, అల్ల కల్లోలం నుంచి రక్షించ లేని పరిస్థితులలో ఉన్నప్పుడు, ఇంటర్‌పోల్ అభ్యర్థన పై ఆ ద్వీపంలో అడుగు పెట్టిన షాడో, అనుక్షణం ఎటువంటి ప్రమాదాలను ఎదుర్కున్నాడు?

అనుకోని అతిథిలా తరచూ షాడోకి తారస పడుతున్న ఆ బోర్నియో విలాస సుందరి ఎవరు?

అన్ని దుర్మార్గాలకు మూలకారణమైన చిన్ లీ చాన్ కథ ఎలా ముగిసింది?

కిల్లర్ గ్యాంగ్ సుప్రీం కమాండ్ ప్రలోభాలనూ, ప్రతిహింసనూ షాడో ఎలా తిప్పి కొట్టాడు?

'షాడో ఇన్ బోర్నియో’ త్వరలో మీ ముందుకు! విని / చూసి ఆనందించండి!!

గోలోకం గురించి చాలామందికి తెలియని వాస్తవాలు! Cows and Goloka


గోలోకం గురించి చాలామందికి తెలియని వాస్తవాలు!
శివుడి ఆగ్రహానికి గురైన కపిల గోవుకు ఎందుకంత ప్రాశస్త్యం?

ప్రాచీన భారతీయ సంస్కృతీ సంపదలకు ప్రతీక, పవిత్ర గోమాత. భారతీయులకు అనాది నుంచీ ఆరాధ్య దేవత. చతుర్వేదాలలోనే కాక, హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ, భారత, రామాయణ భాగవతాది పవిత్రగ్రంథాలలోనూ, గోమహిమ అసామాన్యమైనదిగా అభివర్ణించబడింది. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి, గోపాలుడిగా, వాటి ప్రాముఖ్యతను వివరించాడు. దేవతలతో సరిసమాన కీర్తిని గడించిన గోవు ఎలా ఉద్భవించింది? గోవులలో కపిల గోవుకు ఎందుకంత ప్రాముఖ్యత సంతరించుకుంది? అన్ని లోకాలలో కెల్లా గోలోకానికి అంత ప్రాశస్త్యం రావడానికి కారణమేంటి? అసలు మహాభారతంలో, గోవు విశిష్ఠత గురించి ఏం వివరించబడి ఉంది - వంటి ఆసక్తికర అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/iT2XRwhIgLQ ]


పూర్వము విశ్వకర్మ, గొప్ప తపస్సుకు పూనుకున్నాడు. అమృత రూపిణి, కామరూపి అయిన సురభి అనే కన్యను, మానస పుత్రికగా సృష్టించాడు. ఆమెతో పాటు, మహా తేజోవంతుడైన ఒక పురుషుడిని కూడా సృష్టించాడు. ఆ పురుషుడు, ఆ కన్యను చూసి మోహించి, ఆమె కొరకు పరితపించసాగాడు. అది చూసిన బ్రహ్మ, "మార్తోభవ" అంటే, నీ పరితాపము ఉపశమించుగాక, అని దీవించాడు. అతడికి మార్తాండుడని పేరు పెట్టి, సురభిని ఇచ్చి వివాహము జరిపించి, "మీ ఇరువురికీ పుట్టిన సంతానం, యజ్ఞయాగాదులకు అవసరమైన పాలు, పెరుగు, నెయ్యి సమకూరుస్తాయి" అని చెప్పాడు. అలా వారిరువురికీ, గోవులు సంతానంగా జన్మించాయి. సురభీ మార్తాండులకు, పదకొండు మంది సంతానం ఉద్భవించారు. వారే, బ్రాహ్మణులకు మూల పురుషులు. వారే ఏకాదశ రుద్రులు. వారి పేర్లు, అజపాదుడు, అహిర్బుధ్న్యుడు, త్రయంబకుడు, వృషాకపి, శంభుడు, కాపాలి, రైవతుడు, హరుడు, బహురూపుడు, ఉగ్రుడు, విశ్వరూపుడు. ఈ ఏకాదశరుద్రులను లోకమంతా పూజించారు. ఏకాదశ రుద్రుల తరువాత, గో సమూహం పుట్టింది. ఆ ఆవుల ముఖంలో, కొమ్ములలో, నాలుకలో ఇంద్రుడూ.. మలద్వారము, మూత్రములో వాయుదేవుడూ.. మూపురంలో శివుడూ.. పాదాలలో దేవతలూ.. కడుపులో అగ్నిదేవుడూ.. పాల పొదుగులో సరస్వతీ.. పేడలో లక్ష్మీదేవీ.. పంచితంలో కీర్తీ.. రక్తంలో చంద్రుడూ కొలువై ఉన్నారు. గోవు హృదయంలో భగుడు అనే దేవతా, పాలలో బ్రహ్మదేవుడూ, వెంట్రుకలలో అనుష్ఠానములూ, తోకలో యమధర్మరాజూ, కన్నులలో సూర్యుడూ, చర్మములో తపస్సూ, తేజమూ అధిష్ఠాన దేవతలుగా ఉన్నారు. ఆవు కాళ్ళలో ఉన్న కీళ్ళలో, సిద్ధులు కొలువై ఉన్నారు. సమస్త దేవతలకూ ఆలవాలమైన గోవు మాహాత్మ్యమును, ఎన్ని విధాలుగా వర్ణించినా పరిపూర్ణము కాదు. వాటిలో కపిల గోవు మరింత పూజనీయమైనది.

ఒకనాడు ఆవులన్నీ హిమాలయాల మీద విహరిస్తున్నాయి. ఆ సమయంలో ఒక లేగదూడ తన తల్లి దగ్గర పాలు తాగుతోంది. ఆ పాల నురగ గాలికి ఎగిరి, అక్కడే తపస్సు చేసుకుంటున్న పరమశివుడి తల మీద పడింది. పరమశివుడికి కోపం వచ్చి మూడవ కన్ను తెరచి, ఆ ఆవులను చూశాడు. ఆ ఆవులన్నీ ఆ కోపాగ్ని వేడికి, ఎర్రగా అయిపోయాయి. ఆవులన్నీ బెదిరి, తలోదిక్కుకు పారి పోయాయి. ఈ సంగతి తెలుసుకున్న బ్రహ్మదేవుడు పరమశివుని వద్దకు వచ్చి, "మహేశా! నీ తల మీద ఉన్న చంద్రుడు నిరంతరం నీ మీద అమృతం కురిపిస్తుంటాడు కదా! లేగ దూడల నోటి నుండి వచ్చే నురగ కూడా, అమృత సమానమే కదా! అది ఎంగిలి ఎలా ఔతుంది! గోవు పాలు అమృతమైతే, వాటి నురగ కూడా అమృతమే కదా! దీనికి ఆగ్రహిస్తే ఎలా! వాటిని కరుణించు" అని వేడుకుని, ఒక మంచి ఎద్దును శివుడికి కానుకగా ఇచ్చాడు. పరమశివుడు శాంతించి, ఆ ఎద్దును తన వాహనముగా చేసుకుని, ఆవులను ఆ ప్రాంతంలో తిరగడానికి అనుమతి ఇచ్చాడు. వెంటనే, బెదిరి పోయిన ఆవులు తిరిగి వచ్చాయి. అప్పుడు శివుడు, "బ్రహ్మదేవా! ఈ గోవులన్నీ నా మూడవ కంటిచూపుతో ఎర్రగా అయిపోయాయి. ఇప్పటి నుండి, ఇవి అతి శ్రేష్ఠమైనవిగా భావించబడతాయి" అని పరమేశ్వరుడు వరం ఇచ్చాడు.

సాధారణంగా కపిల గోవులకు చెవులూ, ముక్కు, కళ్ళు, కొమ్ములూ, కపిల వర్ణంలో ఉంటాయి. అలాకాక, ఏ ఒక్క చోట ఎర్రగా ఉన్నా చాలు. అది కపిల గోవు అని పిలువబడుతుంది. ఇక శరీరం అంతా ఎర్రగా ఉంటే, ఇక దాని మహిమ చెప్పవలసిన అవసరం లేదు. ఆవులు దేవతలతో సమానంగా నేటికీ పూజింపబడుతూ ఉన్నాయి. గోలోకమునకు సంబంధించి, ఒక కథ ఉంది. త్రిశిఖరము, అనే కొండ ప్రాంతంలో, భృగువంశంలో పుట్టిన కొంత మంది మునులు ఆశ్రమాలు నిర్మించుకుని, తపస్సు చేసుకునేవారు. వారిలో సుమిత్రుడు ఒకడు. ఒకరోజు అంగీరసుడనే బ్రాహ్మణుడు, గోశర్కర అనే తీగను, సుమిత్రుడికి ఇచ్చాడు. సుమిత్రుడు దానిని తన గోవులకు ఆహారంగా ఇచ్చాడు. ఆ ఓషధిని తిన్న ఆవులు ఏపుగా పెరిగి, ఆ గోవులకు తామర తంపరగా, సంతానం పెరిగింది. అలా ఆ గోవుల సంతతి పెరిగి, మందగా ఏర్పడ్డాయి. సుమిత్రుడు ఆ ఆవుల మందను చూసి బాగా మురిసిపోయాడు. ఆ ఆవు దూడలు తల్లుల పాలు త్రాగుతుంటే, వాటి నుండి వచ్చే నురగను తాను సేవించసాగాడు. అప్పటి నుండి అతడికి ఫేనుడు అనే పేరు వచ్చింది. ఆ ఆవులకు కామరూప విద్యకూడా ఉంది. ఒక రోజు కొన్ని ఆవులు చక్కటి స్త్రీల రూపము ధరించి, సమీప కొలనులో జలకాలాడుతున్నాయి.

వాటిని చూసి  అక్కడే స్నానం చేస్తున్న కొన్ని గోవులు, "మీరు ఎవరు? మీకు ఈ మనుషుల రూపములు ఎలా వచ్చాయి? అని అడిగాయి. అప్పుడు స్త్రీ రూపంలో ఉన్న గోవులు, "మేము బ్రాహ్మణులకు సేవ చేస్తాము. యజ్ఞములకూ, పితృకార్యములకూ, అతిథి సత్కారములకూ, బ్రాహ్మణులకూ ఆహారంగా ఉపయోగపడే పాలు ఇస్తాము. బ్రాహ్మణుల పొలములో పని చేయడానికి, మా పిల్లలను పంపుతాము. మేము చేసే మంచి పనుల వలన, మాకు గోలోక ప్రాప్తి కలిగింది." అని పలికాయి. మిగిలిన గోవులు తమకు కూడా గోలోక ప్రాప్తి కలిగే తరుణోపాయము చూపమని, కాంతల రూపంలో ఉన్న గోవులను అడిగాయి. అప్పుడు ఆ గోవులు, "రంతిదేవుడు ఒక యజ్ఞము చేస్తున్నాడు. మీరు అక్కడకు వెళ్ళండి. ఆయన మిమ్మల్ని ఆ యజ్ఞములో బలి ఇస్తాడు. మీకు గోలోకప్రాప్తి కలుగుతుంది" అని పలికాయి. వెంటనే ఆ ఆవులన్నీ రంతిదేవుడి వద్దకు వెళ్ళడానికి, సిద్ధం అయ్యాయి. కానీ, అందులో ఒక గోవు సందేహం వెలిబుచ్చింది. "మనం మన యజమాని సుమిత్రుని అడిగి కదా వెళ్ళాలి?" అని అన్నది. వాటిలోని కొన్ని ఆవులు, "సుమిత్రుడు మనము వెళ్ళడానికి అనుమతి ఇవ్వడు. కనుక మనం అతడిని చంపుదాము. అప్పుడు అతడు కూడా గోలోకముకు వస్తాడు" అని అన్నాయి. కానీ, అవి సుమిత్రుడిని చంపలేక పోయాయి. అయితే, కాంతల రూపంలో ఉన్న కపిలగోవులు మాత్రం, "మేము సుమిత్రుడిని చంపుతాము. దానికి బదులుగా మీరు మాకు ఏమి ఇస్తారు?" అని అడిగాయి. అప్పుడు మిగిలిన ఆవులు కపిలగోవులతో, "ఈ రోజు నుండి అన్ని రంగుల ఆవులలో, ఎర్రని గోవులు శ్రేష్టమైనవిగా పరిగణించబడతాయి" అని వరం ఇచ్చాయి.

వెంటనే ఆ ఆవులు మారు రూపంలో సుమిత్రుడి వద్దకు వెళ్ళి "అయ్యా! ఇప్పటి వరకు మీరు గోపూజ చేశారు. మేము ఎంతో సంతోషించాము. మీకు ఏమి వరం కావాలో కోరుకోండి" అని అడిగాయి. అందుకు సుమిత్రుడు, "నాకు ఇప్పటి వలె, ఎప్పటికీ ఆవుల యందు భక్తిశ్రద్ధలుండేలా అనుగ్రహించండి" అని కోరుకున్నాడు. ఆ ఆవులు "అలాగే అనుగ్రహిస్తాము. మేము గోలోకము వెడుతున్నాము. మీరు కూడా మాతో రండి" అని అన్నాయి. సుమిత్రుడు "నేను నా గోవులను విడిచి ఎక్కడకూ రాను" అని అన్నాడు. అప్పుడు మారు వేషములో ఉన్న గోవులు, అతడి శరీరమును తమ కొమ్ములతో ఎత్తి, క్రింద పడవేశాయి. సుమిత్రుడు ప్రాణాలు వదిలాడు. అతడి శరీరం మాత్రం క్రింద పడింది. ఆత్మ మాత్రం, గోలోకం చేరింది. అక్కడ ఉన్న గోమాతలు సుమిత్రుడిని ఆదరించి మర్యాదలు చేసి, అతడికి జరిగినది చెప్పి, నీకు మేలే జరిగింది కానీ, నిన్నిలా దారుణంగా చంపిన ఎర్రని ఆవులకు మాత్రం, ముఖం నల్లగా మాడి పోతుంది" అని శాపం పెట్టాయి.

తరువాత సుమిత్రుడి ఆవులన్నీ రంతిదేవుడి వద్దకు వెళ్ళి, "అయ్యా మీరు మమ్ము యజ్ఞములో బలి ఇచ్చి, మాకు గోలోక ప్రాప్తిని కలుగజేయండి" అని వేడుకున్నాయి. అప్పుడు రంతిదేవుడు, "అది ఎలా చేయగలను.. అది పాపము కదా! ఆ పనిచేసి నేనెలా పాపము మూట కట్టుకుంటాను? నాకు ఉత్తమ గతులు ఎలా ప్రాప్తిస్తాయి?" అని అన్నాడు. "అయ్యా, ఇది మా నిర్ణయం కాదు. దేవతల నిర్ణయం మీరు ఆచరించాలి. మేము పవిత్ర హోమంలో బలిదానం చేసుకోగలిగితేనే, గోలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది." అని అన్నాయి. అందుకు రంతిదేవుడు, "అయితే, నాది ఒక నిబంధన. మీలో ఏ ఒక్క గోవైనా మోహ పరవశంతో బలికి అంగీకరించకపోయినా, నేను యజ్ఞం ఆపివేస్తాను" అని అన్నాడు. అందుకు గోవులు అంగీకరించాయి. రంతిదేవుడు, "గోవులను వరుసగా బలి ఇచ్చి, హోమం పూర్తిచేశాడు. ఇంతలో ఒక ఆవు తన దూడతో, "అయ్యో, ఈ క్రూరాత్ములు నన్ను చంపడానికి వస్తున్నారు. నేను చచ్చిపోతే, నీ గతి ఏమిటి?" అని ఏడ్చింది. వెంటనే రంతిదేవుడు ఆ మాటలు విని, యజ్ఞమును ఆపివేశాడు.

అప్పటి వరకు బలి ఇచ్చిన గోవులు గోలోకము వెళ్ళాయి. రంతిదేవుడు స్వర్గానికి వెళ్ళాడు. అలా మిగిలిన గోవుల సంతంతి, భూలోకంలోనే ఉండిపోయింది. పవిత్రమైన హోమంలో బలిదానమై, గోలోకం చేరుకున్న గోవులకు, బ్రహ్మ వరాన్ని ప్రసాదించాడు. వాటి లోకమైన గోలోకాన్ని, అన్ని లోకముల కంటే పైన ఉండేలా వరం ఇచ్చాడు, బ్రహ్మ. మొట్ట మొదటి సత్యలోకం కంటే పైన ఉన్న లోకమే, గోలోకం. ఈ చరాచర జగత్తుకు మూలాధారము గోవు. దేవతలకూ, సిద్ధులకూ, సాధువులకూ గోవు తల్లి వంటిది. బ్రహ్మ పదమును కోరుకునేవాడు, గోవును మనసుతో కానీ, కర్మలతో కానీ, వాక్కుతో కానీ బాధించకూడదు. ఇది బ్రహ్మ వాక్కు. వేదము కూడా గోవులకు పవిత్రతను ఆపాదించింది. ఏ గోవును పూజించి, దేవతలు మానవుల కంటే గొప్ప వాళ్ళయ్యారో, అటువంటి గోవుల కంటే పవిత్రమైనది, ఈ లోకములో ఏముంది! యజ్ఞ యాగములలో గోవులకు ఉన్న పవిత్రత, మరి వేటికీ లేదు. ఉపనిషత్తులన్నీ గో స్వరూపాలే అని, బ్రహ్మదేవుడు స్వయంగా తెలియజేశాడు. గోపూజ పవిత్రమైన యజ్ఞము వంటిది. మానవులు ఎక్కువగా, కపిల గోవులను పూజిస్తారు. వాటిని దానంగా ఇస్తారు. అలా చేయడం వలన, వారి పాపాలన్నీ తొలగి పోతాయి".

వీటి యొక్క విశిష్ఠత, మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో, సుస్పష్టంగా వివరించాడు, వ్యాస భగవానుడు.

వందే గోమాతరం!

Thursday, November 17, 2022

చరిత్రలో మనం ఛత్రపతి శివాజీ గురించి పెద్దగా నేర్చుకోలేదు.. Facts about Shivaji Maharaj

స్కూళ్ళలో చెప్పే చరిత్రలో మనం ఛత్రపతి శివాజీ గురించి పెద్దగా నేర్చుకోలేదు..

ముష్కరులకు ముచ్చెమటలు పట్టించిన యోధుడు: https://youtu.be/it7JY1jp20A


ది గ్రేట్ ఎస్కేప్ - ఎక్కడ తగ్గాలో తెలిసిన అపరమేధావి: https://youtu.be/ay2IFCn95Wo


చాలామంది ఆయన గురించి ఏమనుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు:

"కాబూల్ నుండి కాందహార్ వరకు నా తైమూర్ కుటుంబం మొగల్ సుల్తానేట్‌ను సృష్టించింది. ఇరాక్, ఇరాన్, టర్కిస్తాన్ మరియు అనేక దేశాలలో, నా సైన్యం క్రూరమైన యోధులను ఓడించింది. కానీ, భారతదేశంలో శివాజీ మాకు బ్రేకులు వేశారు. నేను శివాజీకి నా గరిష్ట శక్తిని వెచ్చించాను, కానీ అతన్ని మోకాళ్ల మీదకు తీసుకురాలేకపోయాను..

యా అల్లాహ్, నువ్వు నాకు నిర్భయుడైన, మరియు నిటారుగా నిలబడ్డ శత్రువును ఇచ్చావు. దయచేసి అతని కోసం స్వర్గానికి తలుపులు తెరిచి ఉంచండి. ఎందుకంటే, ప్రపంచంలోని అత్యుత్తమ, మరియు విశాల హృదయం ఉన్న యోధుడు మీ వద్దకు వస్తున్నాడు"

- ఔరంగజేబ్ (శివాజీ మరణానంతరం నమాజ్ చదువుతూ)

"ఆ రోజు శివాజీ నా వేళ్లు నరికేయలేదు. కానీ, నా అహంకారాన్ని నరికేశాడు. నా కలలో కూడా ఆయనను కలవాలంటే భయం"

- షాహిస్తా ఖాన్.

"నా రాజ్యంలో శివాజీని ఓడించే వాడు లేడా??"

- విసుగు చెందిన బేగం అలీ ఆదిల్షా.

"నేతాజీ, బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికి మీ దేశానికి హిట్లర్ అవసరం లేదు. మీరు బోధించాల్సింది శివాజీ చరిత్ర మాత్రమే."

- అడాల్ఫ్ హిట్లర్

"శివాజీ ఇంగ్లండ్‌లో జన్మించి ఉంటే, మనం భూమిని మాత్రమే కాకుండా మొత్తం విశ్వాన్ని పాలించి ఉండేవాళ్ళం."

- లార్డ్ మౌంట్ బాటన్

"శివాజీ ఇంకో పదేళ్లు బ్రతికి ఉంటే, బ్రిటిష్ వాళ్ళు భారతదేశం ముఖం చూసి ఉండేవారు కాదు."

- ఒక బ్రిటిష్ గవర్నర్

భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలంటే ఒక్కటే మార్గం, 'శివాజీలా పోరాడండి'.

- నేతాజీ

"శివాజీ అనేది కేవలం పేరు కాదు.. భారతీయ యువతకు ఇది శక్తి వనరు.. ఇది భారతదేశాన్ని స్వేచ్ఛగా మార్చడానికి ఉపయోగపడుతుంది."

- స్వామి వివేకానంద.

"శివాజీ అమెరికాలో జన్మించి ఉంటే, మేము అతనికి SUN అని నామకరణం చేస్తాము."

- బరాక్ ఒబామా

ఉంబర్‌ఖైండ్ యొక్క ప్రసిద్ధ యుద్ధం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేర్కొనబడింది:

"ఉజ్బెకిస్తాన్ నుండి వచ్చిన 30,000 మంది కరతలాబ్ ఖాన్ సైన్యాన్ని కేవలం 1000 మంది శివాజీ మావలులు ఓడించారు. స్వదేశానికి తిరిగి పోవడానికి ఒక్క ఉజ్బెకీ కూడా ప్రాణాలతో మిగలలేదు."

శివాజీ అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రాజు.  తన కెరీర్‌లో 30 ఏళ్ల వ్యవధిలో, కేవలం ఇద్దరు భారతీయ యోధులతోనే పోరాడాడు. మిగతా వారంతా బయటి వ్యక్తులు.

అబూ తాలిబాన్ మరియు టర్కిస్తాన్ రాజుగా, తన కలలో కూడా శివాజీకి భయపడే షాహిస్తా ఖాన్.

బెహ్లోల్ ఖాన్ పఠాన్, సికందర్ పఠాన్, చిదర్ ఖాన్ పఠాన్ అందరూ ఆఫ్ఘనిస్తాన్ యొక్క యోధ సర్దార్లు.

దిలేర్ ఖాన్ పఠాన్ మంగోలియా యొక్క గొప్ప యోధుడు.  వీరంతా శివాజీ ముందు దుమ్ము దులుపుకున్నారు.

సిద్ధి జౌహర్ మరియు సలాబా ఖాన్ ఇరానియన్ యోధులు, వీరు శివాజీ చేతిలో ఓడిపోయారు.

సిద్ధి జౌహర్ తర్వాత సముద్ర దాడికి ప్లాన్ చేశాడు. ప్రతిస్పందనగా శివాజీ ఒక నౌకాదళాన్ని, మొదటి భారతీయ నౌకాదళాన్ని పెంచారు.  అయితే ఆ పని పూర్తి కాకముందే శివాజీ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.  

Google "Shivaji, the Management Guru" ఇది బోస్టన్ విశ్వవిద్యాలయంలో పూర్తి సబ్జెక్ట్.

భారతీయులమైన మనకు ఆయన గురించి చాలా తక్కువ తెలుసు.. కనీసం మన భావి తరాలకైనా ఈ గొప్ప భారతీయుని గురించి తెలిసేలా చేద్దాం. విస్తృతంగా ప్రసారం చేద్దాము🙏

భారతమాతకు జై 🙏మేరా భారత్ మహాన్ 🚩

Wednesday, November 16, 2022

అష్ట సాత్విక భావములు! భగవద్గీత Bhagavadgita


అష్ట సాత్విక భావములు!
హృదయంలో భక్తి ఉప్పొంగినప్పుడు భక్తులలో కనిపించే లక్షణాలేంటి?

'భగవద్గీత' ఏకాదశోధ్యాయం – విశ్వరూప దర్శన యోగం (10 – 14 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదకొండవ అధ్యాయం, విశ్వరూప దర్శన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విశ్వరూప దర్శన యోగములోని 10 నుండి 14 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

అర్జునుడి, శ్రీ కృష్ణుడి విశ్వరూప దర్శన అనుభూతిని, సంజయుడు ఇలా వివరిస్తున్నాడు..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/aUdwm4wMXo4 ]


00:46 - అనేకవక్త్రనయనమ్ అనేకాద్భుతదర్శనమ్ ।
అనేకదివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్ ।। 10 ।।

00:56 - దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనమ్ ।
సర్వాశ్చర్యమయం దేవమనంతం విశ్వతోముఖం ।। 11 ।।

ఆ యొక్క విశ్వ రూపములో, అర్జునుడు అనంతమైన ముఖములూ, మరియు కనులనూ దర్శించాడు. అవి ఎన్నెన్నో దివ్యమైన ఆభరణములనూ, మరియు అనేక రకాల దివ్య ఆయుధములనూ కలిగి ఉన్నాయి. ఆ స్వరూపము తన శరీరంపై అనేక మాలలను కలిగి ఉంది, మరియు దివ్య సుగంధ పరిమళభూరితమై గుబాళిస్తున్నది. మహాద్భుతమైన, అనంతమైన ఈశ్వరునిగా, సర్వత్రా తన ముఖముతో, తనను తాను వ్యక్తపరుచుకున్నాడు.

శ్రీ కృష్ణుడి యొక్క దివ్య మంగళ విశ్వరూపమును, సంజయుడు, 'అనేక' మరియు 'అనంత' అన్న పదాలతో విశదీకరిస్తున్నాడు. సమస్త సృష్టీ, భగవంతుని విశ్వరూప శరీరమే. అందుకే అది అసంఖ్యాకమైన ముఖములూ, కళ్ళూ, నోర్లూ, ఆకృతులూ, వర్ణములూ మరియు రూపములనూ కలిగి ఉంటుంది. మనుష్య బుద్ధికి, పరిమితమైన కాలము, ప్రదేశము, మరియు రూపములకు లోబడి ఉన్న వాటినే, అవగతం చేసుకోగలిగే సామర్ధ్యం ఉన్నది. భగవంతుని విశ్వ రూపము - అసాధారణమైన అద్భుతములూ, వింతలూ, మరియు ఆశ్చర్యములను - అన్ని దిక్కులా ప్రకటించింది. అది కాల-ప్రదేశ పరిమితులను అధిగమించినదిగా, అలౌకికమైనదిగా ఉన్నది. అందుకే దానిని మహాద్భుతము అనటం, సమంజసమే.

02:21 - దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థితా ।
యది భాః సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః ।। 12 ।।

ఆకాశములో వెయ్యి మంది సూర్యులు ఒకే సమయంలో ప్రకాశించినా, ఆ మహోన్నత రూపము యొక్క తేజస్సుకు సాటి రావు.

సంజయుడు ఇప్పుడు ఆ విశ్వ రూపము యొక్క తేజస్సును వివరిస్తున్నాడు. ఆ కన్నులు మిరుమిట్లు గొలిపే ప్రకాశము ఎంతటిదో అవగాహన ఇవ్వటానికి, దానిని వెయ్యి సూర్యులు ఒక్కసారే మధ్యాహ్న ఆకాశంలో వెలిగితే వచ్చే కాంతితో పోల్చుతున్నాడు. నిజానికి భగవంతుని తేజస్సు అనంతమైనది; దానిని సూర్యుని వెలుగు యొక్క ప్రమాణంతో కొలవటం, సాధ్యం కాదు. ఈ వెయ్యి సూర్యుల ఉపమానము అనేది, ఆ విశ్వ రూప తేజస్సుకు మరేదీ సాటిలేదన్న సంజయుని అభిప్రాయమును సూచిస్తున్నది.

03:12 - తత్రైకస్థం జగత్ కృత్స్నం ప్రవిభక్తమనేకధా ।
అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా ।। 13 ।।

అక్కడ, ఆ దేవదేవుని శరీరము యందు, సమస్త బ్రహ్మాండములన్నీ ఒక్క చోటే ఉన్నట్టు, అర్జునుడు దర్శించాడు.

ఆ విశ్వ రూపములోని మహాద్భుతమైన ఆశ్చర్యములను వివరించిన పిదప, సంజయుడు ఈ జగత్తు అంతటినీ అది తన యందే కలిగి ఉన్నదని పేర్కొంటున్నాడు. ఇంకా ఆశ్చర్యముగా, అర్జునుడు జగత్తు యొక్క సమస్త అస్థిత్వమునూ, శ్రీ కృష్ణుడి శరీర భాగములోనే చూశాడు. అనంతమైన బ్రహ్మాండములనూ, వాటి యొక్క నక్షత్ర మండలములూ, మరియు గ్రహ-సమూహాలనూ, ఆ పరమేశ్వరుని చిన్న అంశగా దర్శించాడు.

తన చిన్ననాటి లీలలలో, శ్రీ కృష్ణుడు తన విశ్వ రూపమును తల్లి యశోదకు కూడా చూపించాడు. ఆ సర్వేశ్వరుడు తన దివ్య వైభవములను మరుగున దాచి, భక్తుల ఆనందం కోసం, ఒక చిన్నపిల్లవానిలా నటించాడు. శ్రీ కృష్ణుడు తన పుత్రుడే అనుకుంటూ, ఎన్ని సార్లు వద్దని చెప్పినా మన్ను తింటున్నాడని, ఒకసారి యశోదా మాత, బాలుడిని గట్టిగా మందలించింది. నోట్లో పరీక్షించటానికి, బాల కృష్ణుడిని నోరు తెరవమని అడిగింది. కానీ, ఆ తల్లికి సంభ్రమాశ్చర్యంగా, శ్రీ కృష్ణుడు నోరు తెరిచినప్పుడు, ఆయన తన యోగమాయా శక్తిచే, దానిలో విశ్వరూపమును చూపించాడు. యశోదమ్మ తన చిన్ని బాలకుని నోటిలో అనంతమైన బ్రహ్మాండములూ, అద్భుతములూ చూసి, పూర్తిగా భ్రమకు లోనయ్యింది. ఆ యొక్క మహాశ్చర్యాన్ని తట్టుకోలేక, ఆమె మూర్చిల్లబోయింది. శ్రీ కృష్ణుడు ఆ తల్లిని ముట్టుకుని, మరలా మామూలు మనిషిని చేశాడు. యశోదామాతకి చూపించిన అదే విశ్వ రూపమును, భగవంతుడు, తన మిత్రుడైన అర్జునుడికి ఇప్పుడు చూపిస్తున్నాడు.

05:00 - తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః ।
ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత ।। 14 ।।

అప్పుడు, పరామాశ్చర్యమునకు లోనయ్యి, రోమములు నిక్కబోడుచుకున్నవాడైన అర్జునుడు, చేతులు జోడించి, తలవంచి నమస్కరిస్తూ, భగవంతుడిని ఈ విధంగా స్తుతించాడు.

ఇప్పుడిక ఈ శ్లోకంలో సంజయుడు, విశ్వరూపమును దర్శించిన అర్జునుడి ప్రతిస్పందనను తెలియజేస్తున్నాడు. ఆ యొక్క మహాద్భుతమును చూసిన అర్జునుడు, విస్మయమునకూ, మరియు గాఢమైన పూజ్యభావమునకూ లోనయ్యాడు. దానితో అతని హృదయములో భక్తి భావనలు పెల్లుబికి, ఆనందముతో ఉప్పొంగిపోయాడు. భక్తి భావముతో కలిగిన మహానందము, ఒక్కోసారి భౌతిక లక్షణములతో వ్యక్తమవుతూ ఉంటుంది. భక్తి శాస్త్రములు ఇటువంటి ఎనిమిది లక్షణాలను వివరిస్తాయి. వాటినే, "అష్ట సాత్విక భావములు" అంటారు. ఇవి ఒక్కోసారి, వారి హృదయంలో భక్తి ఉప్పొంగినప్పుడు, భక్తులలో మనకు కనిపిస్తాయి.

అవి, స్థంభించి పోవటమూ, చెమటలు పట్టటమూ, గగుర్పాటూ, గొంతు బొంగురు పోవటమూ, వణుకూ, పేలగా మారటమూ, కన్నీరు కారటమూ, మూర్ఛ పోవటము. ఈ శారీరక లక్షణముల ద్వారా, ఒక్కోసారి హృదయములోని గాఢమైన ప్రేమ, కొన్నిసార్లు బయటకు వ్యక్తమవుతుంది. తన రోమములు నిక్క బోడుచుకున్నప్పుడు, అర్జునుడు అనుభూతి చెందినది ఇదే.

06:25 - ఇక మన తదుపరి వీడియోలో, పూజ్య భావముతో చేతులు జోడించి వంగి, అర్జునుడు చేసిన స్తుతి గురించి తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, November 14, 2022

సకల వేదాంగ విదుడైన ‘బ్రాహ్మణుడికి సమానం’ ఎవరు? Who is equivalent to a brahmin?


సకల వేదాంగ విదుడైన ‘బ్రాహ్మణుడికి సమానం’ ఎవరు?
అశ్వినులకు దేవతా స్థానం కల్పించిన ‘చ్యవనుడి వృత్తాంతం’!

బ్రహ్మ మానస పుత్రుడూ, సప్తర్షులలో ఒకడైన భృగు మహర్షీ, కర్దమ ప్రజాపతి కుమార్తె అయిన పులోమాదేవి సంతానం, చ్యవనుడు. దివ్య తేజో సంపన్నుడైన చ్యవనుడు, ఆయుర్వేద ప్రవీణుడు. మన ఇతిహాసాలలో సుస్థిర స్థానం దక్కించుకున్న గొప్ప మహర్షి. చ్యవనుడు వృద్ధాప్యంలో, నవ యవ్వనవతి అయిన రాకుమార్తెను ఎందుకు వివాహం చేసుకున్నాడు? దేవతా వైద్యులైన అశ్వినులకు సోమపాన అర్హత కలిగించి, వారిని ఎందుకు దేవతలుగా చేశాడు? అశ్వినీ దేవతలు, చ్యవనుడి భార్యకు పెట్టిన పరీక్షలో ఆమె నెగ్గిందా - అనేటటువంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/yCZKmQP1wxQ ]


చ్యవనుడు ఆయుర్వేద ప్రవీణుడు మాత్రమే కాదు.. ఒక గొప్ప మహర్షి కూడా. అందుకు నిదర్శనం, ఆయన కఠోర తపస్సు. ఆయన చేసిన దీర్ఘకాల తపస్సు కారణంగా, ఆ ముని శరీరం చుట్టూ పుట్టలు ఏర్పడి, అది పూర్తి తీగలతో కప్పబడింది. ఒక రోజు శర్యాతి మహారాజు కుమార్తె సుకన్య వన విహారానికి వచ్చిన సమయంలో, చ్యవనుడు తపస్సు చేస్తున్న ప్రదేశాన్ని చూసింది. ఆ పుట్టలో ఉన్న చ్యవనుని కళ్ళు మిలమిలలాడాయి. అది చూసిన సుకన్య కుతూహలంతో, ఆ పుట్టను త్రవ్వించింది. దాంతో, కఠోర తపస్సులో ఉన్న చ్యవనుడు కోపించి, సుకన్యనూ, ఆమె పరివారాన్నీ బంధించాడు. ఈ విషయం తెలుసుకుని, శర్యాతి మహారాజు చ్యవనుని వద్దకు వచ్చి, తన కుమార్తె తెలియక చేసిన తప్పును క్షమించమని వేడుకున్నాడు. రాకుమారి సుకన్యను తనకిచ్చి వివాహం చేస్తే క్షమిస్తానని, చ్యవనుడు బదులిచ్చాడు. అందుకు శర్యాతి మహారాజు అంగీకరించి, సుకన్యను చ్యవనునికిచ్చి వివాహం చేశాడు. సుకన్య చ్యవనుడి భార్యగా, పర్ణాశ్రమ ధర్మాలను తూ.చా తప్పకుండా నిర్వహించేది.

ఒకరోజు అశ్వినులు, చ్యవనుడి ఆశ్రమానికి వచ్చారు. వారు సుకన్యను చూసి, "అమ్మా! నీవెవరు?" అని అడిగగా, అందుకు సుకన్య, "అయ్యా! నేను శర్యాతి మహారాజు కుమార్తెను. చ్యవనుని భార్యను" అని సమాధానమిచ్చింది. దాంతో వారు ఆశ్చర్యపోయి, "నీ వంటి అందెగత్తెకు, చ్యవనుని లాంటి వృద్ధుడు భర్తా? ఇకనైనా తగిన వరుని కోరుకో. మేము వాడిని తీసుకు వస్తాము" అని సుకన్యతో చెప్పారు. అందుకు సుకన్య ఆగ్రహించి, "నాకు నా భర్త మీద ప్రేమ ఉంది. ఆయనతోనే నా జీవితం. నేను ఆయనను విడిచి, మరొకరిని కోరుకోలేను" అని బదులిచ్చింది. తరువాత ఆమె ఈ విషయాన్ని చ్యవనునికి చెప్పింది. అప్పుడు చ్యవనుడు సుకన్యతో, "వారు చెప్పినట్లు చేయవచ్చు కదా?" అని అన్నాడు. అందుకు సుకన్య "మీ భార్యనైన నన్ను వేరొక వరుని కోరుకోమనడం, ధర్మం కాదు. నా జీవనం మీతోనే" అని సమాధానమిచ్చింది. అది విన్న చ్యవనుడూ, అశ్వినీ దేవతలూ, సుకన్య పాతివ్రత్యానికి సంతోషించారు. నీకు యవ్వనవంతుడైన పతిని ప్రసాదిస్తాము.. అంటూ, చ్యవనుడితో సహా, అక్కడున్న కొలనులో ప్రవేశించారు. అయితే, ఆమెను పరీక్షించదలచి, కొలను నుండి ముగ్గురూ నవయవ్వనులుగా, ఒకే మాదిరి తేజస్సుతో బయటకు వచ్చి, మాలో నీకు ఎవరు కావాలో కోరుకో’మని, ఆమెకు చెప్పారు. సుకన్య వారిని చూసి ఆశ్చర్యపోయి, తన నిష్కళంక పతి భక్తితో తన భర్త చ్యవనుడిని గుర్తించి, ఆయనను వరించింది. దాంతో చ్యవనుడు, "మీ వలన నేను యవ్వనవంతుడనైనాను. అందుకు ప్రతిఫలంగా, శర్యాతి మహారాజు చేస్తున్న యాగంలో, దేవేంద్రుడు చూస్తుండగా, మీచే సోమరసం తాగిస్తాను." అంటూ అశ్వినులకు వరమిచ్చాడు. దాంతో వారు కూడా సంతోషంతో తిరిగి వెళ్ళారు.

తన అల్లుడు నవయవ్వనవంతుడయ్యాడని తెలుసుకున్న శర్యాతి మహారాజు, వారిని చూడటానికి వెళ్లాడు. అప్పుడు చ్యవనుడు శర్యాతితో, "రాజా! నేను మీచే ఒక మహా యజ్ఞం చేయిస్తాను" అని అన్నాడు. శర్యాతి అందుకు అంగీకరించాడు. ఆ యజ్ఞంలో చ్యవనుడు అశ్వినులకు సోమరసం ఇచ్చాడు. అది చూసిన ఇంద్రుడు చ్యవనునితో, "వారు దేవ వైద్యులే కానీ దేవతలు కారు. కనుక మాతో సమానంగా సోమపానానికి అర్హులు కారు" అంటూ వ్యతిరేకించాడు. కానీ చ్యవనుడు ఇంద్రుని మాట లక్ష్య పెట్టక, అశ్వినులకు సోమరసం ఇచ్చాడు. దాంతో ఇంద్రుడు ఆగ్రహించి, చ్యవనుని మీదకు వజ్రాయుధం ఎత్తాడు. అయితే, దధీచి మహర్షి ఎముకలతో చేయబడిన ఆ వ్రజాయుధాన్ని, చ్యవనుడు తన తపోశక్తితో నిలువరించాడు. ఎందుకంటే, దధీచి మహర్షి స్వయానా చ్యవనుడి పుత్రుడు. ఇంద్రుడు వజ్రాయుధం ఎత్తిన వెంటనే ఆగ్రహించిన చ్యవనుడు, ఆ హోమం నుండి ఒక భయంకరాకారుడిని సృష్టించాడు. ఆ రాక్షసుడు ఇంద్రుని మీదకు వెళ్ళడంతో, ఇంద్రుడు భీతిచెందాడు. దాంతో ఇంద్రుడు చ్యవనుడితో, "మహర్షీ! మీ తపశ్శక్తి తెలియక అపరాధం చేశాను. నన్ను క్షమించండి. నేటి నుండి, అశ్వినులు సోమరసానికి అర్హులు" అంటూ అంగీకరించాడు. దాంతో శాంతించిన చ్యవనుడు, తను సృష్టించిన రాక్షసుడిని కాముకులైన స్త్రీలలోనూ, మద్యంలోనూ, పాచికలలోనూ, మృగములలోనూ ప్రవేశించమని, ఆదేశించాడు.

చ్యవనుడు కఠోర తపస్సు చేయడంలో నిష్ణాతుడు. ఒకనాడు చ్యవనుడు గంగా యమునా సంగమస్థానంలో, నీటిలో మునిగి సమాధి స్థితిలో ఉన్నాడు. అప్పుడతడిని చేపలు చుట్టుముట్టి, అతడిని తాకుతూ తిరుగుతున్నాయి. ఆ చేపల స్పర్శకు ఆనందిస్తూ, చ్యవనుడు 12 సంవత్సరాలు గడిపాడు. ఒక రోజు చేపలు పట్టే జాలరులు ఆ ప్రాంతంలో చేపల కొరకు వేసిన వలలో, చేపలతో పాటు చ్యవనుడు కూడా చిక్కుకున్నాడు. అతడిని చూసి భయపడిన జాలరులు, "మునీంద్రా, మీరు నీటిలో ఉన్న విషయము మాకు తెలియదు. కనుక మా తప్పు కాచి, మమ్ము రక్షించండి" అని వేడుకున్నారు. అందుకు చ్యవనుడు, "ఇందులో మీ తప్పు ఏమీ లేదు. నేను నీటి అడుగున ఈ చేపలతో సహజీవనము చేస్తున్నాను. కనుక వీటితో నేనూ మరణించాలని అనుకుంటున్నాను. కాబట్టి మీరు నన్ను కూడా వీటితో పాటు వెలకు అమ్మండి" అని అన్నాడు. ఆ మాటలకు జాలరులు మరింత భయపడి, ఆ దేశమునేలే రాజైన నహుషుడి వద్దకు వెళ్ళి, జరిగినది వివరించారు. నహుషుడు పురోహితులతో వచ్చి, చ్యవనుడికి సాష్టాంగ నమస్కారం చేసి, ‘మహానుభావా! ఈ జాలరులు చేసిన తప్పుకు తగిన పరిష్కారం తెలియచేయండి’ అని అడిగాడు. అందుకు చ్యవనుడు, "ఈ జాలరులు వారి వృత్తి ధర్మంగా చేపలు పడుతున్నారు. కనుక అది వారి తప్పు కాదు. వీరు చాలా కష్టించి, చేపలనూ, నన్నూ పట్టారు కనుక, వారి కష్టానికి తగిన ప్రతి ఫలము ఇచ్చి పంపండి" అని అన్నాడు.

నహుషుడు ముని కోపించనందుకు సంతోషించి, మంత్రులను పిలిచి, ఆ జాలరులకు వేయి మాడలు ఇచ్చి పంపమన్నాడు. ఆ మాటలకు చ్యవనుడు, ‘నా ఖరీదు వేయి మాడలా?’ అని అన్నాడు. అప్పుడు నహుషుడు, ‘అలాగైతే లక్ష మాడలు ఇవ్వండి’ అని అన్నాడు. ‘నా విలువ లక్షమాడలా’ అని అడిగాడు చ్యవనుడు. నహుషుడు కోటి మాడలు ఇచ్చి పంపండని అన్నాడు. చ్యవనుడు మళ్ళీ నా ఖరీదు కోటిమాడలా? అని అడిగాడు. ఇక నహుషుడు పంతానికి పోయి, తన అర్ధరాజ్యం ఇస్తానని అన్నాడు. దానికి చ్యవనుడు, "అలా కాదులే మహారాజా! మరొక మాట చెప్పు" అని అన్నాడు. దాంతో నహుషుడు, తన పూర్తి రాజ్యమును ఇస్తానన్నాడు. దానికి కూడా చ్యవనుడు అంగీకరించక, "మహారాజా! మంత్రులతో ఆలోచించి, తగిన వెల నిర్ణయించు" అని అన్నాడు. దాంతో నహుషుడు విసుగు చెంది మంత్రులతో, ‘ఉన్న రాజ్యం అంతా ఇస్తానన్నాను కదా! ఇంతకంటే నావద్ద ఇవ్వడానికి ఏముంది?" అని దుఃఖించాడు.

ఆ సమయంలో అక్కడకు వచ్చిన అవిజాతుడనే ముని జరుగుతున్న విషయము విని, "మహారాజా! చింతించకండి. ఇప్పుడే మునికి తగిన వెల నిర్ణయిస్తాను" అని అన్నాడు. "మునీంద్రా! అదేదో చెప్పి పుణ్యం కట్టుకుని, నన్ను రక్షించండి" అని మునిని వేడుకున్నాడు. అప్పుడు అవిజాతుడు, "మహారాజా! బ్రహ్మదేవుడు రెండు జాతులుగా పుట్టించినా, గోవు, బ్రాహ్మణుడు, ఒక జాతికి చెందిన వారే. గోవు క్షీరము వలన, పాలు, పెరుగు, నెయ్యి వంటి యాగసంభారాలు సమకూరుతాయి. ఆ యాగము చేయదగిన వాడు, బ్రాహ్మణుడు. కనుక వీరిరువురూ సమానులే. సకల వేదాంగ విదుడైన బ్రాహ్మణుడికి విలువ నిర్ణయించడం, ఈశ్వరుడికి కూడా శక్యము కాదు. సకలదేవతా స్వరూపమైన గోవు కూడా అంతేగనుక, బ్రాహ్మణుడికి సమానంగా గోవును దానంగా ఇచ్చి, చ్యవనుడిని విడిపించండి" అని సలహా ఇచ్చాడు.

ఆ మాటలకు సంతోషించిన నహుషుడు చ్యవనుడితో, "మహానుభావా! నన్ను కరుణించండి. మీకు వెల నిర్ణయించగల శక్తి నాకు ఉన్నదా! కనుక తమకు బదులుగా గోవును దానమిస్తాను" అని అన్నాడు. చ్యవనుడు నవ్వి, "నీ నిర్ణయానికి సంతోషించాను. నహుష మహారాజా! గోవు అంటే అగ్ని, గోవు అంటే అమృతము.. యజ్ఞములో గోవు, అత్యంత పవిత్రమైన స్థానాన్ని అలంకరిస్తుంది. స్వర్గలోక సమానము, దేవతలకు కూడా పూజనీయము. కనుక, నాకు బదులుగా గోవును ఇవ్వండి" అని అన్నాడు. వెంటనే నహుషుడు గోవును తెప్పించి, జాలరులకు ఇచ్చాడు. జాలరులు గోవును చ్యవనుడికి సమర్పించారు. చ్యవనుడు ఆ జాలరులకూ, చేపలకూ, స్వర్గ ప్రాప్తిని పొందేలా, వరం ప్రసాదించాడు. ఆ తరువాత చ్యవనుడు నహుషుడికి, సతతమూ ధర్మపరత్వమూ, ఇంద్రుడితో సరి సమానమైన సంపదలనూ ప్రసాదించాడు. అలా చ్యవనుడు ఎన్నో సంఘటనలలో, తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

అయితే, చ్యవనుడు గోవు విషయంలో చెప్పిన మాట పూర్తిగా యధార్థం. మరి గోవులకు అంత ప్రాశస్త్యం ఎలా వచ్చింది? వాటి అవిర్భావం ఎలా జరిగింది? గోవులలో కపిల గోవు ఎందుకు మరింత ప్రత్యేకతను కలిగి ఉంది - అనేటటువంటి విషయాలను, మన తదుపరి వీడియోలో తెలుసుకుందాము.

ధర్మో రక్షతి రక్షితః

Thursday, November 10, 2022

తరతరాల సనాతన సాంప్రదాయాలు! Ancient Hindu Traditions

 

మనం మరచి పోతున్న కొన్ని,
తరతరాల సనాతన సాంప్రదాయాలు!

సోమవారం తలకు నూనె రాయరాదు.

ఒంటి కాలిపై నిలబడ రాదు.

మంగళ వారం పుట్టినింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు.

శుక్రవారం నాడు కోడలిని పుట్టినింటికి పంపరాదు.

గుమ్మడికాయ ముక్కలనే ఇంటికి తేవాలి.

ఇంటిలోపల గోళ్ళు కత్తిరించరాదు.

మధ్యాహ్నం తులసి ఆకులను కోయరాదు.

సూర్యాస్తమయం తరువాత కసవు వూడ్చరాదు, తల దువ్వరాదు.

పెరుగును, ఉప్పును అప్పు ఈయరాదు.

వేడి వేడి అన్నంలో పెరుగు వేసుకోరాదు.

భోజనం మధ్యలో లేచిపోరాదు.

తల వెంట్రుకలు ఇంట్లో వేయరాదు.

గడపపై పాదం పెట్టి వెళ్లరాదు.

ఇంటినుండి బయటకు వెళ్ళేటప్పుడు కసవూడ్చరాదు

గోడలకు పాదం ఆనించి పడుకోరాదు.

రాత్రి  వేళలో బట్టలుతకరాదు.

విరిగిన గాజులు వేసుకోరాదు.

నిద్ర లేచిన తరువాత పడుకున్న చాపను మడిచి పెట్టాలి.

చేతి గోళ్ళను కొరకరాదు.

అన్న తమ్ముడు,తండ్రి కొడుకు ఒకే సారి క్షవరం చేయించుకోరాదు.

ఒంటి (సింగిల్) అరిటాకును తేరాదు.

సూర్యాస్తమయం వేళలో నిద్ర పోరాదు.

కాళ్ళు కడిగేటప్పుడు మడమలను మరచిపోరాదు.

ఇంటి గడపపై కూర్చోరాదు.

తిన్న తక్షణమే పడుకోరాదు.

పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని, కాళ్ళు చాపుకుని కూర్చోరాదు.

చేతులు కడిగిన పిమ్మట విదిలించరాదు.

రాత్రి భోజనం తరువాత పళ్ళెం కడుక్కోవాలి.

ఎంగిలి చేతితో వడ్డించరాదు.

అన్నం, కూర, చారు వండిన పాత్రలలో తినరాదు.

సింకులో పాత్రలపై ఎంగిలి చేతులు కడగరాదు.

ఇంటికి వచ్చిన ఆడ పిల్లలకు, ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా  పంపరాదు.

చిరిగిన అంగీలు, బనియన్లు తదితర లో దుస్తులను ధరించరాదు.

ఇంటి లోపలికి చెప్పులు / Shoes ధరించి రారాదు.

దేవాలయాలలో చెప్పులు పోతే మరచిపొండి. వేరే వాళ్ళవి వేసుకొస్తే దారిన పోయే దరిద్రాన్ని ఇంటికి  తెచ్చుకున్నట్లే.

జంతువులకు  (కుక్కలు, దూడలు లాంటివి) పాచిపోయిన పదార్థాలు పెట్టకండి.

ఒకరు వేసుకున్న బట్టలు, ఆభరణాలు మరొకరు ధరించరాదు.

శనివారం ఉప్పు, నూనె కొని తేరాదు.

అనవసరంగా కొత్త చెప్పులను కొనరాదు.

ఇంటిలో వాడకుండా పడివున్న గోడ గడియారాలు, వాచీలు, సైకిళ్ళ,
కుట్టు మెషిన్లు లాంటివి వదిలించుకోవాలి.

భగవంతుణ్ణి అది కావాలి, ఇది కావాలి అని అడుక్కుని భిక్షగాళ్ళు కాకండి.
మీకు రావలసివుంటే ఆయనే ఇస్తాడు.

అర్హులకు మాత్రమే గుప్త దానం చేయండి.

మఠాలు దేవాలయాకు చెందిన వస్తువులు దురుపయోగం చేస్తే 
మీ తరువాతి తరం వాళ్ళకు శిక్ష పడుతుంది.

ఇతరులను అనవసరంగా విమర్శించడం,
మిమ్మల్ని మీరు పొగడుకోవడం మానండి.

మీరు, మీ అధికారం ఏవీ శాశ్వతం కావు. ఇతరులను ఎదగనివ్వండి. 
మీరు వారికి గురువులాగా ప్రవర్తించండి.

మన పూర్వీకులు చెప్పిన పై వాటిని ఆలోచించి మార్పు సహజమని గుర్తించి,
ప్రశాంత జీవన విధానం అలవరచుకోండి.

కారు మేఘాలు కమ్ముతున్నాయి.. ఏక్షణంలో అయినా వర్షం విపరీతంగా కురుస్తుంది..!
వేసే ముగ్గు..ఆవర్షంలో కలుస్తుంది! అయినా.. ఆమె ముగ్గువేస్తోంది..!
అదీ.. సంప్రదాయం అంటే..! 

అంతర్జాతీయ ఖ్యాతినార్జించి అమెరికాలో ఉంటున్న వైద్యుడు..
సొంతూరు వచ్చినప్పుడల్లా పాఠాలు చెప్పిన పంతులు గారికి పాదాభివందనం చేస్తాడు…! 
అదీ.. సంస్కారం! 

ఖగోళ శాస్త్రాన్ని నమిలి మింగిన నిష్ణాతుడు..
నిష్టగా ఉంటూ గ్రహణం విడిస్తేగానీ ఆహారం తీసుకోడు..!
అదీ.. నమ్మకం!

పరమాణు శాస్త్రాన్ని పిండి పిప్పిచేసిన పండితుడు.. 
మనవడి పుట్టు వెంట్రుకలు పుణ్యక్షేత్రంలో తీయాలని,
పరదేశం నుండి పయనమై వస్తాడు..!
అదీ.. ఆచారం!

అంతరిక్ష విజ్ఞానాన్ని అరచేతబట్టిన  అతిరధుడు..
అకుంఠిత నిష్ఠతో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తాడు..!
అదీ.. సనాతన ధర్మం!

అత్తింటికి వెళ్లేముందు ఇంటి ఆడబడుచు పెద్దలందరికీ 
పాదాభివందనం చేసి పయనమవుతుంది..!
అదీ.. పద్ధతి!

పెద్ద చదువులు చదివినా, పెద్ద కొలువు చేస్తున్నా, పేరు ప్రఖ్యాతులున్నా,
పెళ్లి పీటలమీద.. వధువు పొందికగా ఉంటుంది..!
అదీ.. సంస్కృతి!

భార్య పక్షవాతానికి లోనయ్యింది.. మంచం దిగలేని పరిస్థితి.. తనంతట తానుగా నడవలేని స్థితి..
భర్త భరోసాగా నిలచి, భారమంతా మోస్తాడు.. అన్నీ తానై ఆలిని సాకుతాడు..!
అదీ.. దాంపత్యం!

బ్రతికే అవకాశం తక్కువ, వెంటిలేటర్ పై వేచిచూస్తే బ్రతికితే బ్రతకొచ్చు!
లక్షల ఖర్చు భరిస్తూ వెంటిలేటర్ పై పెడతారు..!
అదీ.. అనుబంధం!

ఇవి భారతీయుల తరతరాల ఆచారాలు, సంప్రదాయలు, విలువల్లో కొన్ని మాత్రమే..

మన హిందూ సాంప్రదాయాలను ఆచరించండి, అందరితో ఆచరింపచేయండి..

ధర్మో రక్షతి రక్షితః!

Wednesday, November 9, 2022

దివ్యదృష్టి! భగవద్గీత Bhagavadgita Chapter 11


దివ్యదృష్టి!
అనంతమైన బ్రహ్మాండములనూ, వాటి వాటి సమస్త చరాచర ప్రాణులతో సహా భూత భవిష్యత్తులను చూడగలగటం!

'భగవద్గీత' ఏకాదశోధ్యాయం – విశ్వరూప దర్శన యోగం (06 – 09 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదకొండవ అధ్యాయం, విశ్వరూప దర్శన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విశ్వరూప దర్శన యోగములోని 06 నుండి 09 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

తన విశ్వరూప దర్శనము గురించి శ్రీ కృష్ణుడు ఇలా వివరిస్తున్నాడు..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/-QLqNbfl5Hs ]


00:44 - పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా ।
బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత ।। 6 ।।

నాలో పరికించుము ఓ భరత వంశీయుడా, పన్నెండుగురు అదితి పుత్రులనూ, ఎనిమిది మంది వసువులనూ, పదకొండు రుద్రులనూ, ఇద్దరు అశ్వినీ కుమారులనూ, అంతే కాక, నలభై తొమ్మిది మరుత్తులూ, మరియు మరెన్నెన్నో ఇంతకు పూర్వం తెలియపరచబడని అద్భుతములను కూడా చూడుము.

భగవంతుని విశ్వ రూపము కేవలం భూలోకంలో ఉన్న అద్భుతాలే కాక, పైలోకాల్లో ఉన్న అద్భుతాలను కూడా కలిగి ఉంటుంది. ఈ విధంగా అన్నీకూడి ఉన్న స్వరూపము, ఇంతకు మునుపు ఎప్పుడూ దర్శించబడలేదు. దేవతలు తన దివ్య స్వరూపములోని అతి చిన్న భాగములే అని కూడా చెప్తున్నాడు, శ్రీ కృష్ణ భగవానుడు. పన్నెండుమంది ఆదిత్యులనూ, ఎనిమిది మంది వసువులనూ, పదకొండు మంది రుద్రులనూ, ఇద్దరు అశ్వినీ కుమారులనూ, మరియు నలభై తొమ్మిది మరుత్తులనూ తన విశ్వరూపంలో చూపిస్తున్నాడు. అదితి యొక్క పన్నెండుగురు పుత్రులు, ధాత, మిత్ర, ఆర్యమ, శక్ర, వరుణ, అంశ, భగ, వివస్వన, పుష, సవిత, త్వష్ట, వామన. అలాగే అష్ట వసువులనగా, దార, ధ్రువ, సోమ, ఆహ, అనిల, అనల, ప్రత్యూష, ప్రభాస. ఇక పదకొండు మంది రుద్రులు అనగా, హర, బహురూప, త్రయంబక, అపరాజిత, వృసకపి, శంభు, కాపర్ది, రైవత, మృగవ్యాధ, సర్వ, కపాలి. ఇద్దరు అశ్విని కుమారులు, కవలలైన దేవతా వైద్యులు. నలభై తొమ్మిది మరుత్తులుగా పిలువబడే వాయు దేవతలు, సత్త్వజ్యోతి, ఆదిత్య, సత్యజ్యోతి, తిర్యగ్జ్యోతి, సజ్యోతి, జ్యోతిష్మన, హరిత, రితజిత, సత్యజిత, సుశేణ, సేనాజిత, సత్యమిత్ర , అభిమిత్ర, హరిమిత్ర, కృత, సత్య, ధృవ, ధార్త, విధార్త, విధరాయ, ధ్వాంత, ధుని, ఉగ్ర, భీమ, అభియు, సాక్షిప, ఇద్రిక, అన్యద్రిక, యద్రిక, ప్రతికృత, ఋక్, సమితి, సంరంభ, ఇద్రిక్ష, పురుష, అన్యద్రిక్ష, చేతస, సమిత, సమిద్రిక్ష, ప్రతిద్రిక్ష, మారుతి, సరత, దేవ, దిశ, యజుః, అనుద్రిక, సమ, మానుష మరియు విష అనబడే వారు. వారందరూ కృష్ణ భగవానుడి రూపంలో ఇమిడి ఉన్నారు.

03:06 - ఇహైకస్థం జగత్ కృత్స్నం పశ్యాద్య సచరాచరమ్ ।
మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్ద్రష్టుమిచ్ఛసి ।। 7 ।।

 ఓ అర్జునా, ఒక్క చోటే కూడి ఉన్న సమస్త చరాచరములను కలిగి ఉన్న జగత్తును, నా విశ్వ రూపము యందే దర్శించుము. ఇంకా మరేదైనా చూడదలుచుకున్నా, వాటన్నిటినీ నా విశ్వ రూపము యందే తిలకించుము.

తన స్వరూపమును చూడమని చెప్పిన కృష్ణుడు, తన దివ్య మంగళ స్వరూప శరీరము యందే, సమస్త సృష్టినీ దర్శించమని అంటున్నాడు. అనంతమైన బ్రహ్మాండములనూ, వాటి వాటి సమస్త చరాచర ప్రాణులతో సహా, అర్జునుడిని చూడమంటున్నాడు భగవానుడు. సర్వమూ ఆ విశ్వ రూపములో ఉంటుంది, భూత / భవిష్యత్ సంఘటనలు కూడా ఉంటాయి. అర్జునుడు తద్వారా, విశ్వ పరిణామ ఆవిష్కరణ ప్రణాళికలో భాగంగా, పాండవుల విజయాన్నీ, మరియు కౌరవుల పరాజయాన్ని కూడా చూడగలిగాడు.

04:00 - న తు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా ।
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్ ।। 8 ।।

కానీ, నా యొక్క విశ్వ రూపమును నీ ప్రాకృతిక కళ్ళతో చూడలేవు. కాబట్టి, నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. నా యొక్క మహాద్భుత వైభవమును దర్శించుము.

పరమేశ్వరుడైన భగవానుడు ఈ లోకంలోకి అవతరించినప్పుడు, ఆయనకి రెండు రకాల స్వరూపాలు ఉంటాయి - ఒకటి ప్రాకృతిక కళ్ళతో చూడగలిగే భౌతికమైన స్వరూపము, మరొకటి దివ్య దృష్టితో మాత్రమే చూడగలిగే దివ్య స్వరూపము. ఈ విధంగా, మనుష్యులు ఆయనను భూలోక అవతార సమయంలో తప్పకుండా దర్శిస్తారు. కానీ, ఆయన యొక్క ప్రాకృతిక రూపంలోనే దర్శిస్తారు. ఆయన యొక్క దివ్య స్వరూపము వారియొక్క ప్రాకృతిక కన్నులకు కనపడదు. ఈ కారణం వలననే, ఈ భౌతిక ప్రపంచపు జీవాత్మలు, భగవంతుడు ఈ భూలోకంలో అవతరించినప్పుడు, ఆయనను గుర్తించలేరు. జనులు చూసేది కేవలం దివ్య అవతారము యొక్క భౌతిక స్వరూపము మాత్రమే. శ్రీ కృష్ణుడు అర్జునుడిని తన యొక్క విశ్వ రూపమును చూడమని అడిగాడు. కానీ, అర్జునుడికి ఏమీ కనపడలేదు. ఎందుకంటే, అతనికి ప్రాకృతిక కన్నులే ఉన్నాయి. ఈ యొక్క ప్రాకృతిక కళ్ళు, ఆ విశ్వ రూపమును దర్శించటానికి సరిపోవు, మరియు సామాన్యమైన బుద్ధికి అది అర్థం కాదు. అందుకే, అర్జునుడు విశ్వ రూపమునూ, దాని అపూర్వ వైభవమునూ దర్శించటానికి సాధ్యమయ్యేటట్టుగా, శ్రీ కృష్ణుడు, ఆయనకి దివ్య దృష్టిని ఇప్పుడు ప్రసాదిస్తానని అంటున్నాడు. ఆధ్యాత్మిక దృష్టి ప్రసాదించటం అనేది, ఒక భగవంతుని కృప. ఆయన కృప చేతనే, భగవంతుడు తన దివ్య చక్షువులను జీవాత్మ యొక్క ప్రాకృతిక కనులకు అందిస్తాడు. తన దివ్య మనస్సుని జీవాత్మ యొక్క ప్రాకృతిక మనస్సుకు అందజేస్తాడు. తన దివ్య బుద్ధిని, జీవాత్మ యొక్క ప్రాకృతిక బుద్ధికి ఏర్పరుస్తాడు. తదుపరి, ఈ భగవంతుని దివ్యమైన ఇంద్రియములూ, మనస్సూ, మరియు బుద్ధీ కలిగి ఉన్న జీవాత్మ, ఆయన యొక్క దివ్య స్వరూపాన్ని చూడగలుగుతుంది, స్మరించగలుగుతుంది, మరియు దానిని అర్థం చేసుకోగలుగుతుంది.

06:11 - సంజయ ఉవాచ ।
ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః ।
దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరమ్ ।। 9 ।।

సంజయుడు ఇలా అంటున్నాడు. ఓ మహారాజా, మహా యోగేశ్వరుడునూ, పాపములను హరించువాడునూ అయిన భగవానుడు, ఈ విధముగా పలికి, అనంతరము షడ్గుణైశ్వర్య సంపన్నమైన తన పరమదివ్యస్వరూపమును అర్జునునకు చూపించాడు.

అర్జునుడు శ్రీ కృష్ణుడిని, 11వ అధ్యాయం, 4వ శ్లోకంలో, "యోగేశ్వర" అని సంబోధించాడు. ఇక ఇప్పుడు, సంజయుడు ఆయనను, "మహా-యోగేశ్వరా" అని అంటున్నాడు. యోగేశ్వరుడికి "మహా" అన్నఅతిశయోక్తి జత చేశాడు. సంజయునికి తన గురువు వేద వ్యాసునిచే, దివ్యదృష్టి వరం ఇవ్వబడింది. కాబట్టి, ఆయన కూడా భగవంతుని విశ్వ రూపమును, అర్జునుడు చూసిన విధముగానే చూశాడు.
07:04 - ఇక మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడి విశ్వరూప దర్శన అనుభూతిని గురించి, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, November 7, 2022

శూద్రుడైన శంభూకుడిని ఏం తప్పు చేశాడని శ్రీ రాముడు వధించాడు? Why Did Lord Rama Kill Shambuka?

 

శూద్రుడైన శంభూకుడిని ఏం తప్పు చేశాడని శ్రీ రాముడు వధించాడు?
డా. బి.ఆర్. అంబేద్కర్ ‘శంభూక వధ’ గురించి ఏమని వివరించారు?

లోకాభిరాముడిగా, అవతార పురుషుడైన శ్రీ రామచంద్రమూర్తి, మచ్చలేని చందమామగా, మన ఇతిహాసాలలో పేర్కొనబడ్డాడు. అయితే, ఆ అయోధ్య రాముడి జీవితంలో తీసుకున్న రెండు నిర్ణయాలను, కొంతమంది వ్యతిరేకిస్తారు. అటువంటి వాటిలో ఒకటి, గర్భవతియైన సీతామాతను అడవులలో వదిలివేయడం, రెండవది, తపస్సు చేసుకుంటున్న శూద్రుడైన శంభూకుడిని వధించడం. అయితే, మనం ఈ రోజు శంభూకుడిని రాముడు ఎందుకు వధించాడు? అగ్రవర్ణాల ఆధిపత్యం కారణంగా, తపస్వి అయిన శంభూకుడిని సంహరించాల్సి వచ్చిందా? శంభూక వధ గురించి, ఉత్తరకాండ లో, 74, 75, 76 వ సర్గలలో ఏం ఉంది - అనే విషయాలతో పాటు, శంభూక వధ, త్రేతా యుగంలోని యుగ ధర్మానుసారం ఎలా అన్వయమైంది? ఈ కలియుగంలోని యుగధర్మము గురించి కూడా, అందులోనే ఉన్న ప్రస్తావనను క్లుప్తంగా పరిశీలిద్దాము. వీడియొను పూర్తిగా చూడకుండా, తొందపడి కామెంట్ చేయవద్దని ప్రార్ధిస్తున్నాను.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/jrfF6ofOlfY ]


ఆనాటి యుగ ధర్మం ప్రకారం, ఒక రాజు ధర్మ పరిపాలన చేస్తే, ఆ రాజ్యంలో అకాల మరణాలు ఉండవు. ఒకవేళ సంభవిస్తే, ఆ రాజ్యంలో ఎక్కడో అధర్మం జరిగిందని అర్ధం. శ్రీ రాముడు తన రాజ్యాన్ని  ధర్మ యుక్తంగా పరిపాలిస్తున్న సమయంలో, ఒక వృద్ధ బ్రాహ్మణుడు దుఃఖిస్తూ, అకాల మృత్యువుకు లోనైన తన కుమారుడి కళేబరం తీసుకు వచ్చి, రామునికి చూపించాడు. ‘ఓ శ్రీరామ.. నేనే పాపం చేశానో, నా కుమారుడు ఇలా అకాల మృత్యువుకు లోనైనాడు. నా పాపంతో పాటు, ఈ రాజ్యానికి రాజువైన, నీ దోషము కూడా కారణము కావచ్చును. ఎందుకంటే, ఇతర రాజ్యాలలో ఎటువంటి అకాల మరణాలూ లేవు. నీ ఈ రాజ్యంలో, నీ దృష్టికి రాకుండా ఎక్కడో అధర్మం జరిగి ఉండవచ్చు. కాబట్టి, నీవు ఆ అధర్మాన్ని నిర్మూలిస్తే, ఇది కేవలం అకాల మృత్యువు కనుక, నా పుత్రుడు తిరిగి బ్రతుకుతాడు. నీవు ఈ పని చేయకపోతే, నేనూ నా భార్య, ఇక్కడే ప్రాణ త్యాగం చేస్తాము’ అని ఆ వృద్ధుడు, శ్రీ రాముని ఎదుట విలపించాడు.

ఆ సమయంలో అక్కడకు విచ్చేసిన నారద మహర్షి, ఆ బాలుడి అకాల మృత్యువునకు కారణం ఏమిటో వివరించాడు.. “కృత యుగములో కేవలం బ్రాహ్మణులు మాత్రమే తపస్సులను ఆచరించడానికి యోగ్యులు. వారికి మాత్రమే ఉపదేశముండును. ఇతర మూడు వర్ణముల వారికీ, ఆ అర్హత ఉండదు. త్రేతాయుగములో బ్రాహ్మణులతో పాటు, క్షత్రియులు కూడా తపశ్చర్యలకు యోగ్యులే అవడంతో, వారి ఇరు వర్ణముల వారూ, సమానులుగా ఉంటారు. ఈ యుగములో, ఇతర వర్ణముల వారికి తపస్సు చేయుటకు అనుమతీ, ఉపదేశం ఉండదు. ద్వాపర యుగములో, బ్రాహ్మణ, క్షత్రియులతో పాటు, వైశ్యులు కూడా తాపసులు కావచ్చును..  ఉత్తరకాండ, 74వ సర్గ, 27వ శ్లోకము నందు, ఈ విధంగా వివరించబడి ఉంది.

భవిష్యచ్ఛూద్రయోన్యాం వై తపశ్చర్యా కలౌ యుగే |
అధర్మః పరమో రాజన్ ద్వాపరే శూద్ర జన్మనః ||

అనగా, ద్వాపర యుగము, అంతకు ముందు యుగములలో, యుగధర్మాలను అనుసరించి, శూద్ర వర్ణం వారికి తపస్సు చేయుటకు అనుమతి లేకున్నది. కానీ, కలియుగములో, శూద్రులకు కూడా తపశ్చర్య ప్రవృత్తి ఏర్పడి, అందరూ సమానులుగా ఉందురు.  కాబట్టి, యుగ ధర్మమును ఆచరించి, నీ రాజ్యమంతటా సంచరించి, ఎవరైనా అధర్మమును ఆచరిస్తూ ఉంటే, వారిని ఒక రాజుగా సంహరించి, ధర్మమును నిలబెట్టుము. తద్వారా, అకాల మృత్యువు బారిన పడిన బాలుడు, పునర్జీవితుడు కాగలడు.” అని నారద మహర్షి పలికాడు.

అది విన్న రాముడు, తన రాజ్యమంతటా తిరుగుతూ, శంభూకుని వద్దకు చేరుకున్నాడు. అక్కడ శంభూకుడు అధోముఖుడై, తన కాళ్ళను త్రాడుతో చెట్టుకు కట్టుకుని, తల్లక్రిందులుగా వ్రేలాడుతూ, క్రింద అగ్నిని జ్వలింపచేసి, కఠోర తపస్సునాచరిస్తుండగా, రాముడు చూశాడు. శంభూకుడితో రాముడు, “ఓ వ్రత నిష్ఠాగరిష్ఠుడా. నీవు ఎంత ధన్యుడవు! తపోవృద్ధుడా, నీ జన్మ ఎట్టిది? నీ శక్తి సామర్ధ్యములు దృఢమైనవి. కావున, కుతూహలముతో ఈ విధంగా అడుగుతున్నాను. నేను దశరధ కుమారుడైన శ్రీ రాముడిని. నీవు ఈ ఘోర తపస్సు ఏం ఆశించి, ఎందుకు చేస్తున్నావు? నీకు కావలసిన వరమేమిటి? స్వర్గ భోగములు కావలెనా, లేక వాటికి మించినవా తెలుపుము” అని అడిగాడు. దానికి శంభూకుడు, “శ్రీరామా.. నేను శూద్రుడను. నా పేరు శంభూకుడు. ఈ శరీరముతోనే, దివ్యత్వమును పొందగోరుచున్నాను. నేను దేవలోకమును జయింపదలచి, ఇట్టి ఉగ్రతపస్సుకు పూనుకున్నాను. నా పలుకులు నిజము” అని తెలుపగా, అది విన్న శ్రీరాముడు, అధర్మమమని తలచి, అతడి తలను ఖండించి, వధించాడు. ఆ క్షణమునే, అకాల మృత్యువు బారిన పడిన బ్రాహ్మణుడి కుమారుడు, తిరిగి జీవితుడయ్యాడు. అయితే, ఇక్కడ మనం శంభూకుడి వధలో, కొన్ని ముఖ్య విషయాలను గ్రహించవలసి ఉంది.

శంభూక వధ అన్యాయంగా జరిగింది, అతడు శూద్రుడు కాబట్టి, రాముడు చంపాడు.. అని కొంతమంది హేతువాదులు వాదిస్తుంటారు. రాముడు చేసింది ఆ యుగంలోని ధర్మము. ఆ యుగములో, వారు అటువంటి ఉగ్రతపస్సు చేయడం వలన, ధర్మానికి హాని కలుగుతుంది. ఇక్కడ శూద్రుడైన శంభూకుడు, ఆ యుగ ధర్మానికి విరుద్ధముగా తపస్సు చేయడం వలన వధ జరిగినది కానీ, కేవలం శూద్రుడు కావడం చేత కాదు. రామ రాజ్యంలో, ధర్మబద్ధంగా ఉన్న శూద్ర వర్ణం వారందరూ, ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారనేందుకు, రామాయణములో అనేక శ్లోకాలు ఉన్నాయి. శ్రీ రాముడు  శంభూకుడుని వధించినది, కేవలం ఒక వర్ణం వారి కోసమే కాదు, లేక ఒక వర్ణం పైన కోపంతోనూ కాదు. తన రాజ్యంలో అన్నీ వర్ణాల వారూ, అకాల మృత్యువు బారిన పడకుండా చూసేందుకే, ఆ పని చేయవలసి వచ్చింది.

ఏ జీవీ, శరీరంతో స్వర్గానికి వెళ్ళడం వీలు కాదు. అది ప్రకృతి నియమం. ఈ జన్మలో చేసిన తపస్సూ, యజ్ఞం, లేక ఏ ఇతర సత్కార్యం వల్లనైనా వచ్చిన పుణ్యంతో, మరణానంతరం మాత్రమే, స్వర్గానికి వెళ్లగలరు. ఈ ప్రకృతి నియతిని భంగం చేస్తూ, శంభూకుడు తపస్సు చేయడం, లోక వ్యవస్థకు హానికరం. అందుకే, అకాల మరణం వంటి ఉత్పాతాలు ఏర్పడ్డాయి. అయితే, అంత కఠోర తపస్సు చేసిన శంభూకుడు, రాముని చేతిలో హతమారి, స్వర్గస్థుడయ్యాడు. ఆ విధంగా చూసుకున్నా కూడా, శ్రీ రామ చంద్ర మూర్తి చేతిలో మరణం, శంభూకుడికి స్వర్గ ప్రాప్తిని చేకూర్చింది. అయితే, కొంతమంది వాదనల ప్రకారం, శూద్రుడు తపస్సు చేయడం వలన, రాముడు సంహరించాడని చెప్పుకోవచ్చు. కానీ, అంతకు పూర్వం బ్రాహ్మణుడైన రావణాసురుడిని, అతని దుర్గుణాల చేత సంహరించాడనే విషయం, మేధావుల మదిలో తోచకపోవడం, శోచనీయం. కాబట్టి, శంభూక వధ, శూద్రుడిని వధించడంగా కాకుండా, అధర్మపరుడిని వధించడం అనీ, అధర్మ పరులైతే, ఒకసారి బ్రాహ్మణుడు, ఒకసారి శూద్రుడు, మరో సందర్భంలో క్షత్రియులనూ వధించడం జరిగిందని తెలుసుకోవాలి. దాని వలన, పదకొండు వేల సంవత్సరాల రామరాజ్యంలో, అన్ని వర్ణాల వారూ ఆనందముగా, సుఖ సంతోషాలతో జీవించారనేది, ప్రామాణికమైన సత్యం.

అయితే, ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, యుగ యుగానికీ, మనుష్యుల శక్తి క్షీణిస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అన్ని యుగములలో, అన్ని వర్ణాల వారూ, తమ తమ స్వకర్మలను ఆచరించే వారు. వారిలో హెచ్చుతగ్గులు లేవు. కృత యుగములో మనుష్యులకు ఎక్కువ శక్తి ఉండడం చేత, బ్రాహ్మణుల తపస్సు, మొత్తం సమాజానికి సరిపోయింది.  త్రేతా యుగములో మనుష్యుల శక్తి కొంత క్షీణించి, క్షత్రియులు కూడా తపశ్చర్య చేయవలసి వచ్చినది. ద్వాపరయుగములో, ఇంకొంత శక్తి క్షీణిస్తుంది కాబట్టి, వైశ్యులు కూడా తపశ్చర్య చేయవలసి వచ్చినది. కలియుగము వచ్చేసరికి, మనుష్యుల శక్తి మరింత క్షీణించడం చేత, అందరూ ధర్మము ద్వారా లోకములను కాపాడటం కొరకు, తమకు చేతనైన తపశ్చర్య చేయవలసి ఉన్నది. దీని అర్ధము, ఆ ముందు యుగాలలో మిగతా వారికి, ఆ అర్హత లేదని కాదు. అవసరము లేదని. ఆ మాటకొస్తే, కృతయుగంలో అందరూ బ్రాహ్మణులే అని, శాస్త్రాలు చెపుతున్నాయి. ఆనాటి వ్యవస్థ, వివిధ కర్మలు, పనులను బట్టి నడిచే వ్యవస్థలేకానీ, అనేక ఉద్యోగములు ఉండే వ్యవస్థ కాదు. అలాంటప్పుడు, వివిధ పనులకు ఆయా వర్ణములలోని వారు మాత్రమే, ఆయా పనులూ, లేదా కర్మలు చేయడమనే నియమం లేకపోతే, ఆనాటి వ్యవస్థలలో జన జీవనము, అచిర కాలములలోనే స్తంభించి పోయి ఉండేది.

కాబట్టి, ఆ విద్యుక్త ధర్మాన్ని బట్టి, ఆచరణ నిర్ణయింపబడి ఉంది. దానిపైనే సృష్టీ, మానవ మనుగడా ఆధారపడి ఉన్నది.  అదే లేకుంటే, ఈ నాడు వాటి గురించి మాట్లాడుకోవడానికీ, చదవడానికి కూడా, మనం ఈ విధంగా నాగరికత కలిగి ఉండే వాళ్ళం కాదు. ప్రపంచానికి నాగరికత నేర్పిన సనాతన ధర్మం, సంస్కృతీ మనది. ఈ మధ్య కాలంలో, అనేక మంది దళితులను, అగ్ర వర్ణాల వారు అణగద్రొక్కుతున్నారు, వారిని హీనంగా చూస్తున్నారు, వారికి సమాజంలో తగిన స్థానం ఇవ్వడం లేదనే వాదనలు పుట్టుకొస్తున్నాయి. ఆ విష పూరిత మాటలనే ఆయుధంగా చేసుకుని, కొంతమంది మత మార్పిడులకు తెరతీస్తున్న ఘటనలు అనేకం ఉన్నాయి. అలాంటి వారు కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మనం ఆచరిస్తున్న రాజ్యాంగాన్ని రాసిన డా. బి.ఆర్ అంబెద్కర్, రాముడి భక్తుడు. ఆయన రాసిన రాజ్యంగ పుస్తకంలోని మొదటి పేజిలో, సీతారాముల ఫోటోను కూడా మనం చూడవచ్చు. అయితే, ఈ శంభూక వధ అంశంపై, అంబెద్కర్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. Dr. Ambedkars Speeches and Writings, అనే పుస్తకం, Vol-1, page 61లో ఈ విధంగా ఉంది.

‘శిక్షాస్మృతి లేకుండా, చాతుర్వర్ణ్య ఆదర్శం సాకారం కాదని, రామాయణంలోని శంభూకుడిని చంపిన కథ ద్వారా నిరూపించబడింది. కొంతమంది రాముడిని నిందించినట్లనిపిస్తుంది. ఎందుకంటే, కారణం లేకుండా శంభూకుడిని చంపాడని. కానీ, శంభూకుడిని చంపినందుకు, రాముడిని నిందించడమంటే, పరిస్థితిని మొత్తం తప్పుగా అర్థం చేసుకోవడమే. రామ రాజ్యమనేది, చాతుర్వర్ణ్యం మీద ఆధారపడిన రాజ్యం. రాజుగా, రాముడు చాతుర్వర్ణాన్ని నిర్వహించడానికే కట్టుబడి ఉన్నాడు. తన వర్గాన్ని అతిక్రమించి, బ్రాహ్మణుడిగా ఉండాలనుకునే శూద్రుడైన శంభూకుడిని చంపడం, ఆయన కర్తవ్యం. రాముడు శంభూకుడిని చంపడానికి కారణం ఇదే.’

ఆ యుగంలో, రాముడు ఒక రాజుగా చేసినది సరైనదని, అంబెద్కర్ కూడా తన మనోభావాన్ని వెల్లడించారు.

శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష!

Link: https://www.youtube.com/post/UgkxHis0fiJ8OdspI41jZOwUXfDruobjvmJI

Wednesday, November 2, 2022

విశ్వరూప దర్శనం! భగవద్గీత Bhagavadgita


విశ్వరూప దర్శనం! అనంతమైన ఆకృతులూ, మరియు వర్ణములతో కూడిన భగవానుడి విశ్వరూపము!

'భగవద్గీత' ఏకాదశోధ్యాయం – విశ్వరూప దర్శన యోగం (01 – 05 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదకొండవ అధ్యాయం, విశ్వరూప దర్శన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విశ్వరూప దర్శన యోగములోని 1 నుండి 5 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/F3yPQAg34Q4 ]


ఈ పదకొండవ అధ్యాయంలో అర్జునుడు, శ్రీ కృష్ణుడి విశ్వ రూపమును చూడాలని ప్రార్ధిస్తున్నాడు. సమస్త విశ్వములూ తనలోనే కలిగి ఉన్న అనంతమైన విశ్వ రూపాన్ని, శ్రీ కృష్ణుడు అర్జునుడి దివ్య దృష్టికి చూపించాడు.

00:54 - అర్జున ఉవాచ ।
మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్ ।
యత్త్వయోక్తం వచస్తేన మోహోఽయం విగతో మమ ।। 1 ।।

నా మీద దయచే నీవు తెలియపరచిన ఈ యొక్క పరమ రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానము విన్న తరువాత, నా మోహము ఇప్పుడు తొలగిపోయినది.

శ్రీ కృష్ణుడి విభూతులనూ, మరియు పరమేశ్వరుని యొక్క జ్ఞానమునూ విన్న పిదప, అర్జునుడు ఆనందముతో ఉప్పొంగిపోయాడు. అంతేగాక, తన యొక్క మోహము నశించిపోయినదని తెలుసుకున్నాడు. శ్రీ కృష్ణుడు కేవలం తన ప్రియ మిత్రుడు మాత్రమే కాదనీ, ఆయన జగత్తులోని సర్వ ఐశ్వర్యములకూ మూలమైన సర్వోత్కృష్ట పరమేశ్వరుడేననీ అంగీకరించాడు. ఇప్పుడు అమూల్యమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలియపరచటం ద్వారా చూపిన శీ కృష్ణుడి ఆదరణను, కృతజ్ఞతా పూర్వకంగా అంగీకరించడంతో, ఈ అధ్యాయమును ప్రారంభిస్తున్నాడు.

01:51 - భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా ।
త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయమ్ ।। 2 ।।

సర్వ ప్రాణులూ, ఉత్పత్తీ మరియు అవ్యక్తమైపోవటమనే విషయమును గురించి, విస్తారముగా నీ నుండి విన్నాను. ఓ తామర వంటి నేత్రములు కలవాడా. నిత్య శాశ్వతమైన నీ మాహాత్మ్యము కూడా విన్నాను.

సమస్త భౌతిక జగత్తు సృష్టికీ, మరియు లయమైపోవటానికీ మూల కారణమైన శ్రీ కృష్ణుడి అత్యున్నత స్థాయిని విశ్వసిస్తూ అర్జునుడు, శ్రీ కృష్ణుని మాహాత్మ్యమును ప్రశంసించటం కొనసాగిస్తూనే ఉన్నాడు. అర్జునుడు ఈ శ్లోకంలో, "ఓ శ్రీ కృష్ణా, నీ యొక్క నిత్య శాశ్వతమైన మహాద్భుతమైన మహిమలను, నీ నుండి విన్నాను. నీవు అందరిలోనే ఉన్నా, నీవు వాటి యొక్క దోషములకు అతీతుడవు. నీవే సర్వోన్నత నియామకుడవు. అదే సమయంలో, నీవు అకర్తవూ, మరియు మా యొక్క కర్మలకు నీవు భాద్యుడవు కావు. నీవే మా కర్మ ఫలితములను అందించేవాడవయినా, నీవు నిష్పక్షపాతమైనవాడివీ, మరియు అందరికీ సమానుడవు. నీవే సర్వసాక్షివీ, మరియు కర్మ ఫలాలను అందించేవాడివీ. అందుకే నీవే, సర్వ ప్రాణులకూ ఆరాధ్యుడవని విశ్వసిస్తున్నాను.

03:10 - ఏవమేతద్యథాత్థ త్వమాత్మానం పరమేశ్వర ।
ద్రష్టుమిచ్ఛామి తే రూపమైశ్వరం పురుషోత్తమ ।। 3 ।।

ఓ ప్రభూ, నీవెవరో నీవే చెప్పినట్టు, నీవు సరిగ్గా అటువంటి దివ్య స్వరూపానివే. ఇప్పుడు నాకు నీ యొక్క దివ్య విశ్వరూపమును చూడాలనే కోరిక కలుగుతున్నది, ఓ పురుషోత్తమా.

అర్జునుడు శ్రీ కృష్ణుడి దివ్య వ్యక్తిత్వపు యదార్ధమును, ఆయన చెప్పినట్టుగానే అంగీకరిస్తున్నట్టు ప్రకటిస్తున్నాడు. అర్జునుడికి ఆయన యొక్క సాకార స్వరూపముపై, పూర్తి విశ్వాసము ఉంది. అయినా, శ్రీ కృష్ణుడి యొక్క సర్వ ఐశ్వర్యములతో కూడిన విశ్వరూపమును, చూడ గోరుతున్నాడు. తన స్వంత కళ్ళతోనే అది చూడాలని, అభిలషిస్తున్నాడు.

03:56 - మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టుమితి ప్రభో ।
యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్ ।। 4 ।।

ఓ యోగేశ్వరా, నాకు దాన్ని దర్శించగలిగే శక్తి ఉందని నీవనుకుంటే, దయచేసి నీ యొక్క నిత్య శాశ్వతమైన విశ్వ రూపమును నాకు చూపించుము.

అర్జునుడు సర్వేశ్వరుని యొక్క విశ్వ రూపమును చూడగోరుతున్నాడు. అందుకిప్పుడు, ఆయన యొక్క అనుమతి అడుగుతున్నాడు. "ఓ యోగేశ్వరా, నా కోరిక నీకు తెలియచేశాను. నేను దానికి అర్హుడనని నీవనుకుంటే, నీ కృపచే, నీ యొక్క విశ్వ రూపమును నాకు చూపించుము, మరియు నాకు నీ యొక్క యోగ-ఐశ్వర్యమును చూపించుము" అని అంటున్నాడు. యోగం అంటే, జీవాత్మను పరమాత్మతో ఏకం చేసే శాస్త్రము. ఈ శాస్తమును అభ్యాసం చేసే వారే, యోగులు. యోగేశ్వరుడు అంటే, "యోగులందరికీ ప్రభువు" అని కూడా అర్ధం. అందరు యోగులూ అంతిమంగా సాధించవలసినది ఆ పరమాత్మనే కాబట్టి, శ్రీ కృష్ణుడు యోగేశ్వరుడవుతాడు. గత శ్లోకాల్లో అర్జునుడు భగవంతుడిని "యోగి" అని సంభోదించాడు, అంటే, “యోగ నిష్ణాతుడా” అని. కానీ ఇప్పుడు, శ్రీ కృష్ణుడి మీద పెరిగిన గౌరవం దృష్ట్యా, దానిని "యోగేశ్వరా" అని భక్తి పూర్వకంగా పిలుస్తున్నాడు.

05:18 - శ్రీ భగవానువాచ ।
పశ్య మే పార్థ రూపాణి శతశోఽథ సహస్రశః ।
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ ।। 5 ।।

శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు:  ఓ పార్థ, వివిధములైన ఆకృతులూ, పరిమాణములూ, మరియు వర్ణములతో ఉన్న వందల, వేల అద్భుతమైన నా యొక్క స్వరూపములను, ఇదిగో తిలకించుము.

అర్జునుడి ప్రార్ధనలను విన్న తరువాత, శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు, తన యొక్క విశ్వ-రూపమును తిలకించమని అంటున్నాడు. శ్రీ కృష్ణుడు చూపించబోయే ఆ రూపము ఒకటే అయినా, దాని యందు అసంఖ్యాకమైన, విలక్షణమైన రంగులూ, వివిధ ఆకృతులతో కూడి ఉన్న అనంతమైన వ్యక్తిత్వాలూ ఉన్నాయి. అనంతమైన ఆకృతులూ, మరియు వర్ణములతో కూడి ఉన్న తన విశ్వరూపమును, ఆర్జునుడిని చూడమన్న పిదప, శ్రీ కృష్ణుడిప్పుడిక, ఆర్జునుడిని ఆ విశ్వ రూపములో ఉన్న దేవతలనూ, మరియు ఇతర అద్భుతములనూ గమనించమంటున్నాడు.

06:17 - ఇక మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడి విశ్వరూప దర్శనానికి సంబంధించిన విషయాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...