Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Sunday, December 31, 2023

2024 - Untold Historical Facts about January 1st


2024 - జనవరి 1 కొత్త సంవత్సరం వెనుక ఉన్న అసలు చరిత్ర తెలుసా?  @mplanetleaf  

https://youtu.be/TNSy3HA-kus?si=3wztY7-MyavQn3KU


2024 - 'ఉగాది పండుగ' గొప్పదనం తెలుసుకుందాము..

https://youtu.be/PNwsSBE8SQc?si=uH3MeW1m8LWVO1m5



Wednesday, December 27, 2023

విశ్వాసం! భగవద్గీత Bhagavad Gita Chapter 18


విశ్వాసం!
ఆధ్యాత్మిక ఉపదేశాలను పొందిన వారు అపరాధులుగా ఎందుకు మారుతారు?

'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (67 – 70 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 67 నుండి 70 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/Oros3M6b3gE ]


ఎందుకు కర్మ సన్యాసము కంటే, కర్మ యోగము ఉన్నతమైనదో ఈ శ్లోకాలలో చూద్దాము..

00:48 - ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన ।
న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోఽభ్యసూయతి ।। 67 ।।

ఈ ఉపదేశాన్ని ఎప్పుడూ కూడా తపస్సంపన్నులు కాని వారికీ, లేదా భక్తి లేని వారికీ చెప్పకూడదు. ఆధ్యాత్మిక విషయములు వినటం పట్ల ఏవగింపుగలవారికి కూడా దీనిని చెప్పకూడదు. ముఖ్యంగా నా పట్ల అసూయగలవారికి దీనిని చెప్పకూడదు.

భగవంతుని పట్ల ప్రేమయుక్త భక్తిలో నిమగ్నమైన వారు, ప్రాపంచిక ధర్మములను విడిచిపెట్టినా పాపం లేదు. కానీ, ఈ ఉపదేశంలో ఒక సమస్య ఉన్నది. ఒకవేళ మనం ఇంకా భగవంతుని పట్ల ప్రేమలో స్థిరంగా లేకపోయినా, మరియు తొందరపడి ముందుగానే భౌతికప్రాపంచిక ధర్మములను విడిచి పెట్టినా, మనం అటూ ఇటూ కాకుండా పోతాము. అందుకే, కర్మ సన్న్యాసం అంటే, దానికి తగిన అర్హత ఉండాలి. మనకు దేనికి అర్హత ఉన్నదో, మన గురువు గారు నిర్ణయిస్తారు. ఆయనకే మన సామర్థ్యము, మరియు ఆయా మార్గాలలో ఉండే కాఠిన్యములూ తెలుస్తాయి. ఒకవేళ ఒక విద్యార్థి పట్టభద్రుడు కావాలనుకుంటే, నేరుగా వెళ్లి స్నాతకోత్సవంలో కూర్చుంటే కుదరదు. ఒకటో తరగతి నుండి క్రమక్రమంగా మొదలుపెట్టాలి. అదే విధంగా, అత్యధిక జనులకు కర్మ యోగమునకే అర్హత ఉంటుంది. తొందరపడి అకాలముగా కర్మ సన్యాసము తీసుకోవడం, పెద్ద తప్పే అవుతుంది. తమ శారీరక ధర్మములను నిర్వర్తిస్తూనే, దానితో పాటుగా భక్తిని అభ్యాస సాధన చేయమని చెప్పటమే మంచిది. అందుకే శ్రీ కృష్ణుడు, తాను చెప్పిన ఈ రహస్య జ్ఞానము అందరికోసం కాదని చెబుతున్నాడు. ఇతరులతో పంచుకునే ముందు, ఈ ఉపదేశం అందుకోవటానికి వారి యొక్క అర్హతను పరీక్షించాలి. ఈ హెచ్చరిక, భగవద్గీత మొత్తానికి కూడా వర్తిస్తుంది. ఒకవేళ దీనిని, శ్రీ కృష్ణుడంటే అసూయ, ఈర్ష్య కలిగిన వారికి చెబితే, ఆ వ్యక్తి ఇలా అనవచ్చు.. ‘శ్రీ కృష్ణుడు చాలా దురహంకారముగలవాడు. అర్జునుడిని పదేపదే తనను కీర్తించమని చెబుతున్నాడు’ అని. ఈ ఉపదేశాలను తప్పుగా అర్థం చేసుకుని, విశ్వాసరహితుడు, ఈ దివ్య ఉపదేశం వలన ఇంకా హాని పొందుతాడు. పద్మ పురాణం కూడా ఇలా చెబుతున్నది: ‘విశ్వాసం లేనివారికీ, మరియు భగవంతుని పట్ల ఏవగింపుగలవారికీ, అలౌకిక ఆధ్యాత్మిక ఉపదేశాలను ఇవ్వటం ద్వారా, వారిని అపరాధులుగా చేసినట్టు అవుతుంది.’

03:19 - య ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి ।
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః ।। 68 ।।

ఎవరైతే ఈ పరమ గోప్యమైన జ్ఞానమును నా భక్తులలో ఉపదేశిస్తారో, వారు మహోన్నత ప్రేమయుక్త సేవను చేసినట్టు. వారు నిస్సందేహముగా నన్నే చేరుకుంటారు.

శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, భగవద్గీతను సరియైన పద్ధతిలో బోధిస్తే కలిగే పరిణామాలను ప్రకటిస్తున్నాడు. అటువంటి బోధకులు, ప్రథమంగా ఆయన పరాభక్తిని పొందుతారు. ఆ తర్వాత ఆయననే పొందుతారు.

భక్తిలో నిమగ్నమవ్వటానికి లభించే అవకాశం అనేది, భగవంతుని యొక్క విశేషమైన కృప. అదే సమయంలో, ఇతరులను కూడా భక్తిలో నిమగ్నం చేసే అవకాశం అనేది, ఇంకా ఎక్కువ అనుగ్రహము. అది భగవంతుని యొక్క విశేష కృపను ఆకర్షిస్తుంది. మనం ఎప్పుడైనా ఇతరులతో ఒక మంచిదానిని పంచుకుంటే, మనం కూడా దాని నుండి ప్రయోజనాన్ని పొందుతాము. మన దగ్గరున్న ఏదేని జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటే, భగవదనుగ్రహం వలన, మన జ్ఞానం కూడా ఎంతో పెంపొందుతుంది. ఇతరులకు అన్నం తరచుగా పెట్టడం వలన, మనమెప్పుడూ ఆకలితో ఉండే అవసరం రాదు. దానం ఇవ్వటం వలన, సంపద ఎప్పుడూ తరిగిపోదు; జనులు నీరు తీసుకున్నా, నది ఎన్నడూ తరిగిపోదు. ఈ విధంగా, భగవద్ గీత యొక్క ఆధ్యాత్మిక జ్ఞానమును ఇతరులకు పంచే వారు, తామే అత్యున్నత అనుగ్రహాన్ని పొందుతారు.

04:53 - న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః ।
భవితా న చ మే తస్మాదన్యః ప్రియతరో భువి ।। 69 ।।

వారి కంటే ఎక్కువ ప్రేమయుక్త సేవ నాకు ఎవరూ చేసినట్టు కాదు; వారి కంటే ఎక్కువ ప్రియమైన వారు నాకు ఈ భూమిపై ఎవరూ ఉండబోరు.

ఇతరులకు మనం ఇచ్చే అన్ని బహుమతులకన్నా, ఆధ్యాత్మిక జ్ఞాన బహుమతి అనేది, అత్యంత ఉన్నతమైనది. ఎందుకంటే, ఆ జ్ఞానమును అందుకున్న వాడిని శాశ్వతంగా మార్చివేసే సామర్థ్యం, దానికి ఉన్నది. ఒకనాడు జనక మహారాజు తన గురువు అష్టావక్రుడిని ఇలా అడిగాడు. ‘ఈ అలౌకిక ఆధాత్మిక జ్ఞానమును నాకు ప్రసాదించినందుకు, మీకు ఏంతో రుణపడి ఉన్నాను. మీకు ప్రతిగా ఏమివ్వగలను?’ అని. అందుకు అష్టావక్రుడు ఇలా సమాధానం ఇచ్చాడు. ‘ఈ రుణాన్ని తీర్చగలిగినదేదీ నీవు ఇవ్వలేవు. నేనిచ్చిన జ్ఞానము దివ్యమైనది. నీ దగ్గరున్నదంతా భౌతికమైనది. భౌతిక వస్తువులు ఎప్పుడూ దివ్యమైన జ్ఞానమునకు వెలకట్టలేవు. కానీ, నీవు ఒక పని చేయవచ్చు. నీకు ఎవరైనా, ఈ జ్ఞానం కోసం పరితపిస్తున్నవారు తారసపడితే, దీనిని వారికి తెలియజేయుము.’ ‘భగవద్ గీత యొక్క జ్ఞానమును ఇతరులకు పంచటం అనేది, భగవంతునికి చేయగలిగే అత్యున్నత ప్రేమయుక్త సేవ’ అని, తన అభిప్రాయాన్ని భగవంతుడు వెల్లడిస్తున్నాడు. కానీ, భగవద్ గీత యొక్క జ్ఞానమును ప్రవచించేవారు, ఏదో గొప్ప పని చేస్తున్నట్టు గర్వపడకూడదు. నిజమైన ఉపాధ్యాయుని దృక్పథం ఏమిటంటే, తనను తాను భగవంతుని చేతిలో ఒక పనిముట్టుగానే చూసుకోవాలి. గొప్పతనాన్నంతా ఆ భగవత్ కృపకే ఆపాదించాలి.

06:46 - అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః ।
జ్ఞానయజ్ఞేన తేనాహమిష్టః స్యామితి మే మతిః ।। 70 ।।

మన మధ్య జరిగిన ఈ పవిత్ర సంవాదమును పఠించేవారు, జ్ఞాన యజ్ఞముచే, అంటే, తమ బుద్ధిచే నన్ను ఆరాధించినట్టుని నేను ప్రకటిస్తున్నాను; ఇదే నా అభిప్రాయము.

అర్జునుడికి తన బుద్ధిని, ఆయనకు సమర్పించమని శ్రీ కృష్ణుడు పదేపదే చెప్పి ఉన్నాడు. దీని అర్థం, మన బుద్ధిని ఉపయోగించు కోవటం మానేయమని కాదు; మన బుద్ధిని మన చేతనయినంతవరకూ ఆయన సంకల్పమును పూర్తి చేయుటకు ఉపయోగించమని. భగవద్ గీత యొక్క ఉపదేశము ద్వారా, ఆయన సంకల్పమేమిటో మనకు అర్థం అవుతుంది. కాబట్టి, ఈ పవిత్రమైన సంవాదమును అధ్యయనం చేసేవారు, భగవంతుడిని తమ బుద్ధిచే ఆరాధించినట్టవుతుంది.

07:41 - ఇక మన తదుపరి వీడియోలో, పాపముల నుండి విముక్తి పొంది, పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకములకు చేరుకోవడానికి మార్గం ఏంటో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Tuesday, December 26, 2023

అందరికీ దత్త జయంతి 2023 శుభాకాంక్షలు 🚩🙏


అందరికీ దత్త జయంతి శుభాకాంక్షలు 🚩🙏 

గురువై ఇలలో జ్ఞానమై మనలో వెలసిన దత్తుడు!: దత్త చరిత్ర..

https://youtu.be/O32mt8zkdsE?si=Co8tl8g-IcrJt8mn



Monday, December 25, 2023

Getting rid of sins - Karma Siddhanta పాప భారం - చిట్టి కథ!

 

పాప భారం - చిట్టి కథ!
తీర్థ స్నానాలతో, చేసిన పాపాలను వదిలించుకోవచ్చా?

తీర్థము అంటే, నది రేవు జలస్థానము, పవిత్ర స్థానము, యాత్రా స్థలము అనే అర్థాలున్నాయి. తీర్థ కాకము అంటే, నీటి కాకి. కాకి ఎన్ని తీర్థాలలో మునిగినా, పుణ్య ఫలం పొందలేదనే అర్థంతో, ఈ తీర్థ కాక న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు. ఇక్కడ పేరు కాకిదే అయినా, అసలు ఉద్దేశించి చెప్పింది, మనుషుల గురించేనని అర్థం చేసుకోవాలి. పవిత్రమైన నదుల్లో మునిగి స్నానాలు చేస్తే, అప్పటివరకు చేసిన పాపాలు హరించి పోతాయని భక్తుల విశ్వాసం. తెలిసీతెలియక ఏం పాపాలు చేశామో, అవి పోగొట్టుకుందామని నిష్టగా, భక్తితో తీర్థయాత్రలు చేసే వారు కొందరైతే, నిత్యం అనేక తప్పులూ, చెడు పనులూ చేస్తూ, ‘దాసుని తప్పు దండంతో సరి’ అన్నట్లుగా, తీర్థయాత్రలకు వెళ్ళి, తీర్థ స్నానాలు చేస్తూ ఉంటారు, మరికొందరు. అలా పాపాలు పోగొట్టుకోవాలని ప్రయత్నించే దుష్టుల గురించి, వేమన నిరసనగా ఇలా అంటాడు..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/nAcsHmMF2vs ]


”ఎంత చదువు చదివి యెన్నిటి విన్నను
హీనుడవగుణంబు మానలేడు
బొగ్గు పాల గడుగ బోవునా నైల్యంబు
విశ్వదాభిరామ వినుర వేమ!”

దీని అర్ధం, ఎంత చదివినా, ఎన్ని మంచి మాటలు విన్నా, నీచుడు, చెడు గుణం కలిగిన వ్యక్తి మారడు. నల్లని బొగ్గును పాలతో కడిగినా, ఆ నలుపు పోయి తెల్లగా మారదు కదా! అలా కొందరు తప్పులు కప్పి పుచ్చుకోవడానికి చేసే తీర్థయాత్రలూ, స్నానాల వల్ల, వారికి ఎలాంటి పుణ్యమూ రాదనే అర్థంతో, ఈ తీర్థ కాక న్యాయమును చెబుతుంటారు. ఇక మరో కోణం చూద్దాము..

ఒక నాడు గంగలో స్నానమాచరిస్తున్న లక్షలాది మందిని చూసిన ఒక ఋషికి, ఒక సందేహం వచ్చింది. వెంటనే గంగానదినే అడిగాడు.. 'తల్లీ! ఎందరో, ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి పాపాలు వదిలేస్తున్నారు. మరి ఇందరి, ఇంత పాప భారం ఎలా మోస్తున్నావమ్మా?' అని అడిగాడు.. అందుకా తల్లి, 'నాయనా, ఆ పాప భారం నేనెక్కడ మోస్తున్నాను? అవన్నీ తీసుకెళ్ళి, ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపి వేస్తుంటాను కదా!' అని బదులిచ్చింది..

అయ్యో, అన్ని పుణ్య నదులూ ఇంతే కదా..! పాపాలన్నీ సముద్రంలో కలిపేస్తే, ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో..! అని అనుకుని వెళ్ళి, సముద్రుడినే అడిగాడు.. 'ఎలా మోస్తున్నావు తండ్రీ ఈ పాప భారాన్ని?' అని.. దానికి సముద్రుడు.. 'నేనెక్కడ భరిస్తున్నానయ్యా? ఆ పాపాలను వెను వెంటనే ఆవిరిగా మార్చి, పైన మేఘాల లోకి పంపించేస్తుంటాను' అని బదులిచ్చాడు..

అరే! ఎంతో తేలికగా కదిలి పోయే మేఘాలకు ఎంత కష్టం వచ్చిందని అనుకుంటూ.. 'ఓ మేఘ మాలికల్లారా.. ఎలా భరిస్తున్నారు ఈ పాప భారాన్ని?' అని అడుగగా అవి పకపకా నవ్వి.. 'మేమెక్కడ భరిస్తున్నాము? ఎప్పటి కప్పుడు వర్ష రూపేణా మీ మీదే కురిపించేస్తున్నాము కదా!' అని బదులిచ్చాయి..

ఓహో! ఆ పాపాలన్నీ మన మీద పడి, మనమే అనుభవిస్తున్నామన్న మాట! అయితే ఎట్టి పరిస్థితులలోనూ, ఎవ్వరూ కర్మ ఫలితాలను వదిలించు కోలేరని గ్రహించాడు, ఋషి..

ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః ।
ఆత్మతీర్ధం నజానన్తి కధం మోక్షః శృణు ప్రియే ।।

ఈ తీర్ధంలో స్నానమాచరిస్తే పుణ్యం కలుగుతుంది, ఆ తీర్ధంలో స్నానమాచరిస్తే మోక్షం కలుగుతుందని, తీర్ధ స్నానాలకై పరుగులు పెడుతున్న మానవులు, ‘భ్రమకు లోబడిన వారు’! ఆత్మ జ్ఞాన తీర్ధంలో స్నానమాచరించని వారికి మోక్షమెలా కలుగుతుంది? అని ఈ శ్లోకం యొక్క అర్థం.

కర్మ కర్మణా నశ్యతి కర్మ ।। అంటే.. కర్మ అనేది కర్మతోనే నశిస్తుంది..

సత్కర్మ భిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం ।
అచ్యుత్కట పుణ్య పాపానం సత్యం ఫలాను భవమిహం ।।

ఈ చోటి కర్మ ఈ చోటే. ఈ నాటి కర్మ మరునాడే. అనుభవంచి తీరాలంతే, ఈ సృష్టి నియమం ఇదే..

ధర్మో రక్షతి రక్షితః!

Wednesday, December 20, 2023

ఏది ధర్మం? భగవద్గీత What is Dharma? Bhagavad Gita Chapter 18


ఏది ధర్మం?
భౌతికప్రాపంచిక ధర్మమును విడిచిపెడితే ఏం జరుగుతుంది?

'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (63 – 66 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 63 నుండి 66 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/s7bUig5PKaM ]


జనులు ఏ విధంగా చేయడం వలన భగవంతుడిని పొందగలరో చూద్దాము..

00:47 - ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా ।
విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు ।। 63 ।।

ఈ విధంగా, నేను నీకు అన్ని రహస్యాలకంటే పరమ రహస్యమైన జ్ఞానమును తెలియచేశాను. దీనిపై లోతుగా ఆలోచించుము, మరియు నీకు నచ్చిన రీతిలో చేయుము.

రహస్యము అంటే, అందరికీ సామాన్యముగా అందుబాటులో లేని జ్ఞానమని అర్థం. ఆధ్యాత్మిక జ్ఞానమనేది చాలా నిగూఢమయినది. అది ప్రత్యక్ష అనుభూతి ద్వారా తెలుసుకోబడలేనిది. దానిని గురువు, మరియు శాస్త్రముల ద్వారా నేర్చుకోవాలి. కాబట్టి, అది రహస్యమని చెప్పబడినది. రెండవ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు ఆత్మ జ్ఞానమును తెలియచేశాడు. 7వ మరియు 8వ అధ్యాయాలలో, తన శక్తిసామర్థ్యాల యొక్క జ్ఞానమును తెలియచేశాడు. 9వ మరియు తదుపరి అధ్యాయాలలో, తన భక్తి గురించి తెలియచేశాడు. ప్రస్తుత అధ్యాయంలో, తనను తన సాకార రూపంలో తెలుసుకోవటం కేవలం భక్తి ద్వారా మాత్రమే సాధ్యమని తెలియచెప్పాడు. అత్యంత రహస్యములతో కూడిన జ్ఞానాన్ని అర్జునుడికి తెలియ చేస్తూ, ఇక ఇప్పుడు ఏం చేయాలనే నిర్ణయాన్ని, అర్జునుడికే వదిలేస్తున్నాడు. ‘నేను నీకు గంభీరమైన, మరియు గోప్యమైన జ్ఞానాన్ని అందించాను. ఇక ఇప్పుడు నీ ఇష్టం.’ అని భగవంతుడు, తుది నిర్ణయాన్ని అర్జునుడికే వదిలివేశాడు. అయోధ్యావాసులకు శ్రీ రామచంద్ర ప్రభువు, సుమారుగా ఇటువంటి మాటలే చెప్పాడు. ఒకసారి ఆయన వారందరినీ తన ప్రవచనానికి పిలిచాడు. ఆ ఉపదేశంలో, రాముడు వారందరికీ, మానవ జీవిత లక్ష్యం ఏమిటో, దానిని ఎలా సాధించాలో చెప్పాడు. చివరికి ఇలా ముగించాడు. ‘నేను మీకు చెప్పిన ఉపదేశంలో తప్పు లేదు. అలాగే, నిర్బంధంగా దానిని పాటించాల్సిన అవసరమూ లేదు. దానిని జాగ్రత్తగా విని, ఆలోచించి, ఆ తరువాత మీకు నచ్చిన రీతిలో చేయండి.’ అందుబాటులో ఉన్న వాటిలో దేనిని ఎంపిక చేసుకోవాలనే ఈ యొక్క స్వేచ్ఛాచిత్తమును, భగవంతుడు జీవుడికిచ్చాడు. ఈ స్వేచ్ఛాచిత్తమునకు పరిమితులున్నాయి. ఎవరైనా, ‘తాను ప్రపంచంలో అత్యంత తెలివిగల వ్యక్తిగా ఉందామనుకుంటున్నాన’ని, వారికి వారే నిర్ణయించుకోలేరు. మన పూర్వ మరియు ప్రస్తుత కర్మలచే, మనకున్న ఎంపిక పరిధి లోనివి, పరిమితంగా ఉంటాయి. కానీ, మనకు ఖచ్చితంగా కొంతమేర ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే, మనం భగవంతుని చేతిలో యంత్రాలము కాము. కొన్నిసార్లు జనులు, ‘భగవంతుడు మనకు స్వేచ్ఛాచిత్తమును ఇచ్చి ఉండకపోతే, మనం చెడుపనులు చేసి ఉండేవాళ్ళం కాదుకదా’ అంటారు. అలా ఐతే, మనం మంచి కూడా చేసి ఉండేవాళ్ళం కాదు. మంచి చేసే అవకాశం ఎప్పుడూ, చెడు చేసే ప్రమాదంతోనే కూడి ఉంటుంది. మరీ ముఖ్యంగా, భగవంతుడు, మనం ఆయనను ప్రేమించాలనే కోరుకుంటాడు. స్వేచ్ఛాచిత్త ఎంపిక ఉన్నప్పుడే, ప్రేమ సాధ్యమవుతుంది. ఒక యంత్రము ఎప్పుడూ ప్రేమించలేదు. ఎందుకంటే, దానికి స్వేచ్ఛాచిత్తము ఉండదు గనుక. భగవంతుడు మనలను స్వేచ్ఛాచిత్తము తోటే సృష్టించి, ఎన్నో విషయాలనూ, పద్ధతులనూ ఎంచుకునే అవకాశాలను కలిగించాడు. ఇదంతా మనం ఆయననే ఎంచుకుని, ఆయన పట్ల మన ప్రేమను తెలియపరుచుకోవటానికే. సర్వ శక్తిమంతుడయిన భగవానుడు కూడా, జీవుడు తనను ప్రేమించి, శరణువేడుకునే విధంగా బలవంతం చేయలేడు. ఆ నిర్ణయం, జీవుడే స్వయంగా తీసుకోవాలి. ఇక్కడ శ్రీ కృష్ణుడు, అర్జునుడికి అతని యొక్క స్వేచ్ఛాచిత్తమును గుర్తుచేస్తూ, అతనినే ఎంచుకోమని చెబుతున్నాడు.

04:34 - సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ।
ఇష్టోఽసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్ ।। 64 ।।

నా యొక్క సర్వోత్కృష్ట ఉపదేశమును మళ్ళీ ఒకసారి వినుము. అది సమస్త జ్ఞానములలో కెల్లా అత్యంత గోప్యమైనది. నీ హితము కోరి, దీనిని తెలియచేస్తున్నాను. ఎందుకంటే, నీవు నాకు చాలా ప్రియమైనవాడివి కాబట్టి.

ఒక ఉపాధ్యాయుడికి నిగూఢమైన రహస్యం తెలిసి ఉండవచ్చు. కానీ, ఆయన దానిని విద్యార్థికి తప్పకుండా చెబుతాడనే నమ్మకం లేదు. దానిని చెప్పేముందు, ఆయన చాలా విషయాలను పరిగణనలోకి తీసుకుంటాడు. అంటే, విద్యార్థి యొక్క యోగ్యత, దానిని అర్థం చేసుకునే సామర్థ్యం, మరియు దాని నుండి ప్రయోజనం పొందగలగటం, మొదలైనవి. భగవద్గీత ప్రారంభంలో, అర్జునుడు తన ముందున్న సమస్యచే ఆందోళన చెంది, శ్రీ కృష్ణ పరమాత్మను దారిచూపమన్నాడు. భగవంతుడు చాలా జాగ్రత్తగా, సావధానంగా, అతని యొక్క జ్ఞానాన్ని క్రమక్రమంగా, పద్దెనిమిది అధ్యాయాల ద్వారా వృద్ధి చేశాడు. అర్జునుడు ఆ ఉపదేశాన్ని చక్కగా నేర్చుకోవటం చూసి, శ్రీ కృష్ణుడికి ఇక ఇప్పుడు, తన యొక్క అంతిమ, అత్యంత నిగూఢమైన జ్ఞానమును అర్జునుడు అర్థంచేసుకోగలడన్న ధైర్యం వచ్చింది. ‘నీవు నా ప్రియమిత్రుడవు. నీ క్షేమాన్ని కోరుకుంటున్నాను. నీకు ఎప్పుడూ మంచి జరగాలనే ఆశిస్తాను కావున, దీనిని నేను నీకు చెబుతున్నాను.’ అని వెల్లడించాడు.

06:07 - మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు ।
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోఽసి మే ।। 65 ।।

ఎప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను పూజించుము, మరియు నాకు నమస్కరించుము. ఇలా చేయటం వలన నీవు తప్పకుండా నన్నే చేరుకుందువు. నేను నీకిచ్చే వాగ్దానం ఇది. ఎందుకంటే, నీవు నాకు చాలా ప్రియమైనవాడవు.

శ్రీ కృష్ణుడు అర్జునుడికి అత్యంత రహస్యమైన జ్ఞానమును తెలియజేశాడు. ఆ తర్వాత భక్తి యొక్క ప్రాశస్త్యమును చెప్పాడు. ఇక్కడ, తన పట్ల భక్తితో నిమగ్నమవ్వమని చెబుతున్నాడు. భగవంతుడి పట్ల గాఢమైన ప్రేమను పెంపొందించుకుని, తన యొక్క మనస్సు సతతమూ అనన్య భక్తితో, ఆయన యందే నిమగ్నం చేయటం వలన, అర్జునుడు ఖచ్చితంగా సర్వోన్నత గమ్యమును చేరుకోగలడు. సంపూర్ణముగా భక్తిలో నిమగ్నమైన వానికి ఉన్న ఒక చక్కటి ఉదాహరణ, అంబరీష మహారాజు. ‘అంబరీషుడు తన మనస్సును శ్రీ కృష్ణుడి పాదారవిందముల మీదనే నిమగ్నం చేశాడు. తన వాక్కును భగవంతుని గుణములను కీర్తించటానికే వాడాడు. తన చేతులను, దేవాలయమును శుభ్రం చేయటానికే వాడాడు. తన చెవులను, భగవత్ దివ్య లీలలను వినటానికే వాడాడు. తన కన్నులను, దివ్యమంగళ విగ్రహాలను దర్శించటంలోనే నిమగ్నం చేశాడు. తన శరీర అంగములను భక్తుల సేవకే వాడాడు. తన ముక్కును, భగవంతుని పాదార విందముల వద్ద అర్పించిన తులసీ దళములను ఆఘ్రాణించటానికే వాడాడు. తన నాలుకను భగవత్ ప్రసాదమును రుచి చూడటానికే వాడాడు. తన కాళ్ళను పుణ్య ప్రదేశాలకు వెళ్ళటానికీ, తన శిరస్సును భగవత్ పాదార విందముల వద్ద ప్రణమిల్లటానికీ ఉపయోగించాడు. పూల దండలూ, చందనము వంటి సరంజామా అంతటినీ, భగవత్ సేవకే వాడాడు. ఇవన్నీ ఏదో స్వార్థ ప్రయోజనం కోరి కాకుండా, చిత్తశుద్ధి ద్వారా, కేవలం, శ్రీ కృష్ణుడి నిస్వార్థ ప్రేమ పొందటానికే చేశాడు. ఇంతటి సేవాతత్పరుడైన అంబరీషుడి వృత్తాంతాన్ని, గతంలో వివరించాను. హృదయ పూర్వకముగా భక్తిలో నిమగ్నమవ్వమని చెప్పే ఉపదేశమే, సమస్త శాస్త్రముల యొక్క సారాంశము, మరియు సమస్త జ్ఞానము యొక్క సారము. అయినా, శ్రీ కృష్ణుడు పేర్కొన్న అత్యంత గోప్యమైన జ్ఞానము ఇది కాదు. ఎందుకంటే, దీనిని కృష్ణుడు ఇంతకు పూర్వమే చెప్పి ఉన్నాడు.

08:37 - సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ।
అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ।। 66 ।।

అన్ని విధములైన ధర్మములనూ విడిచిపెట్టి, కేవలం నాకే శరణాగతి చేయుము. నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తి చేసెదను; భయపడకుము.

ఇప్పటివరకూ, శ్రీ కృష్ణుడు అర్జునుడిని ఒకే సమయంలో, రెండు పనులు చేయమన్నాడు – మనస్సును భక్తిలో నిమగ్నం చేయాలి, మరియు శరీరాన్ని, తన ప్రాపంచిక క్షత్రియ ధర్మమును నిర్వర్తించటంలో వాడాలి. ఈ విధంగా అర్జునుడిని, తన క్షత్రియ ధర్మమును విడిచిపెట్టమని చెప్పలేదు. దానితో పాటుగా, భక్తిని పెంపొందించుకోమన్నాడు. ఇదే 'కర్మయోగ' సిద్ధాంతము. ఇక ఇప్పుడు శ్రీ కృష్ణుడు, ఈ ఉపదేశానికి విరుద్ధంగా చెబుతూ, ప్రాపంచిక ధర్మములను నిర్వర్తించుట కూడా, అవసరంలేదని అంటున్నాడు. అర్జునుడు సమస్త ప్రాపంచిక ధర్మములనూ విడిచిపెట్టి, కేవలం భగవంతునికి శరణాగతి చేయవచ్చన్నాడు. ఇది కర్మ సన్న్యాస సిద్ధాంతము. యధార్థముగా, మనకు రెండు రకాల ధర్మములున్నాయి - భౌతిక ధర్మములు, మరియు ఆధ్యాత్మిక ధర్మములు. ఈ రెండు రకాల ధర్మములు, ‘నేను’ అంటే ఏమిటన్న రెండు వేర్వేరు విధములైన అవగాహన నుండి జనించాయి. మనం మనలను ఈ శరీరమే అనుకుంటే, మన ధర్మం అనేది, మన శారీరక హోదా, కర్తవ్యాలు, విధులు, మరియు ఆచారాల వల్ల నిర్ణయించబడుతుంది. కాబట్టి, శారీరక తల్లిదండ్రుల సేవ, సమాజ పర బాధ్యతలు, దేశం పట్ల కర్తవ్యాలు, మొదలైనవన్నీ, శారీరక ధర్మములంటారు. దీనినే 'అపర ధర్మం' లేదా ప్రాపంచిక ధర్మమని అంటారు. దీని పరిధిలోనే, బ్రాహ్మణ ధర్మం, క్షత్రియ ధర్మం మొదలైనవన్నీ ఉంటాయి. కానీ, ఎప్పుడైతే మనం మనలను ఆత్మ అనుకుంటామో, మనకు ఇక భౌతికమైన వర్ణాశ్రమ గుర్తింపులు ఉండవు. ఆత్మ యొక్క తండ్రి, తల్లి, మిత్రుడు, సఖి, సఖుడు, మరియు ఆశ్రయము, అన్నీ భగవంతుడే. కాబట్టి, మనకున్న ఏకైక ధర్మం, ప్రేమయుక్త భగవత్ సేవయే అవుతుంది. దీనినే పర-ధర్మం, లేదా ఆధ్యాత్మిక ధర్మమని అంటారు. ఒకవేళ వ్యక్తి తన భౌతికప్రాపంచిక ధర్మమును విడిచిపెడితే, కర్తవ్య ఉపేక్ష చేత, అది పాపముగా పరిగణించ బడుతుంది. కానీ, ఎవరైనా భౌతిక ధర్మమును విడిచిపెట్టి, ఆధ్యాత్మిక ధర్మమును ఆశ్రయిస్తే, అది పాపము కాదు. భగవంతునికి శరణాగతి చేయని వారికి, ఐదు రకాల రుణాలు ఉంటాయి: దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ఇతర మానవులకు, మరియు ఇతర ప్రాణులకు, వర్ణాశ్రమ వ్యవస్థ, మనలను మనం ఈ ఐదు రుణముల నుండి విడిపించుకోవటానికి, వివిధ పద్ధతులను కలిగి ఉంది. కానీ, మనం భగవంతునికి శరణాగతి చేస్తే, మనం అప్రయత్న పూర్వకంగానే, ఈ అన్ని ఋణాల నుండి విముక్తి చేయబడతాము; ఇది ఎలాగంటే, ఒక చెట్టు వేరులో నీరు పోస్తే, దాని యొక్క అన్ని శాఖలు, చిగుర్లు, ఆకులు, పుష్పాలు, మరియు కాయలు, అన్నిటికీ నీరు అందుతుంది. అదే విధముగా, భగవంతుని పట్ల మన కర్తవ్యమును నిర్వర్తిస్తే, మనం అప్రయత్నంగానే, అందరి పట్ల మన విధిని నిర్వర్తించినట్టే. కాబట్టి, మనం సముచితంగా, ఆధ్యాత్మిక ధర్మంలో స్థితమై ఉంటే, భౌతికప్రాపంచిక ధర్మమును విడిచిపెట్టినా, పాపం అంటదు. నిజానికి, అత్యున్నత లక్ష్యమేమిటంటే, మనం సంపూర్ణముగా, మరియు మనసారా, ఆధ్యాత్మిక ధర్మంలో నిమగ్నమవ్వటమే. భగవద్గీతలో, శ్రీ కృష్ణుడు అర్జునుడికి క్రమక్రమంగా, ఉన్నతమైన ఉపదేశాలను ఇచ్చాడు. ప్రారంభంలో అర్జునుడికి కర్మ చేయమని చెప్పాడు. అదే క్షత్రియ యోధుడిగా, తన భౌతికప్రాపంచిక ధర్మము. కానీ, భౌతిక ధర్మమనేది, భగవత్ ప్రాప్తిని కలుగచేయలేదు; అది స్వర్గాది లోకములనే ఇవ్వగలదు. పుణ్యక్షయం అయిపోయినప్పుడు, జీవుడు మరల తిరిగి రావలసినదే. కాబట్టి శ్రీ కృష్ణుడు, తదుపరి అర్జునుడికి కర్మ యోగమును చేయమని చెప్పాడు. అంటే, శరీరముతో భౌతిక ధర్మము, మరియు మనస్సుతో ఆధ్యాత్మిక ధర్మము. శరీరంతో యుద్ధం చేస్తూ, మనస్సుతో భగవంతుడిని స్మరిస్తూ ఉండమన్నాడు. ఈ కర్మయోగ ఉపదేశమే, భగవత్ గీత యొక్క అతిపెద్ద భాగము. ఇక చిట్ట చివరికి, శ్రీ కృష్ణుడు అర్జునుడిని కర్మ సన్యాసము చేయమని చెప్పాడు. అంటే, సమస్త భౌతిక ధర్మములనూ విడిచి, కేవలం ఆధ్యాత్మిక ధర్మం, అంటే భగవత్ ప్రేమను పాటించమన్నాడు. అందుకే యుద్ధం చేయాలి కానీ, అది తన క్షత్రియ ధర్మమని కాదు. భగవంతుడు తనను అలా చేయమంటున్నాడు కాబట్టి.

13:26 - ఇక మన తదుపరి వీడియోలో, ఎందుకు కర్మ సన్యాసము కంటే కర్మ యోగము ఉన్నతమైనదో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, December 18, 2023

కంసుడు చంపిన కృష్ణుడి సహోదరులు ఏమయ్యారు? 6 Elder Brothers of Lord Krishna - Karma Siddhantam


కంసుడు చంపిన కృష్ణుడి సహోదరులు ఏమయ్యారు?
ఉచ్ఛిష్టీకృత దోషం వలన కలిగే పరిణామం మీకు తెలుసా?

మనం చేసే ప్రతి పాపానికీ ప్రాయశ్చిత్తం తప్పక చేసుకోవాలి. ఎన్ని జన్మలెత్తైనా సరే, మన కర్మఫలాన్ని అనుభవించి తీరాలి. కర్మఫలం ఏ విధంగా ఉంటుందనేది, మనం చేసే పనులపైన ఆధారపడి ఉంటుంది. దేవకీ వసుదేవల సంతానాన్ని కంసుడు సంహరించాడు. కంసుడినీ, అతని సోదరులనూ బలరామకృష్ణులు తుదముట్టించారు. కృష్ణ భగవానుడికి సోదరులుగా జన్మించి, మరణించిన వారి వెనుక ఒక గాధ ఉంది. అదే విధంగా, బలరాముడి చేతిలో మరణించిన కంస సహోదరుల వెనుకా, ఒక గాధ ఉంది. దేవకీ సుతులుగా పుట్టి, కంసుని చేతిలో మరణించిన వారి పూర్వజన్మ వృత్తాంతం ఏంటి? రాక్షస జాతిలో జన్మించి, బలరాముడి చేతిలో మరణించి, పుణ్య ప్రాప్తి నొందిన కంసుని సోదరులు, గత జన్మలో చేసిన తప్పిదం ఏంటి? మరణించిన తన సంతానం కోసం, దేవకీ దేవి కోరిన కోరికను శ్రీ కృష్ణుడు తీర్చాడా? పాతాళానికి వెళ్లి, బలి చక్రవర్తిని ఎందుకు కలుసుకోవాల్సి వచ్చింది? కంసుడి చేతిలో మరణించిన కృష్ణుడి సహోదరులు ఏమయ్యారు? వంటి ఉత్సుకతను రేకెత్తించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/-uZSFX1vDhM ]


ముందు జన్మలో మారీచుడి కొడుకైన కాలనేమి, కంసుడిగా పుట్టాడు. కంసుని తండ్రి పేరు, ఉగ్రసేనుడు. అతని భార్యకు దేవదాది న్యాయము వలన, ద్రవిళుడనే వాడికి పుట్టినవాడు. అంటే, క్షేత్రజ పుత్రుడన్న మాట. ఉగ్రసేనుని భార్య పద్మావతి, కొందరు గొల్ల స్త్రీలతో కలసి యమునా నదికి స్నానానికి వెళ్ళి, పుష్పవతి అయింది. ఆమె తన భర్తను తలచుకుంది. రాక్షసుడైన ద్రవిళుడు చూసి, ఉగ్రసేనుని రూపంలో వెళ్ళాడు. అంతా జరిగిన తరువాత, తను మోసపోయానని గ్రహించి, నిలదీసింది పద్మావతి. నీ వలన పుట్టిన వాడు హరివంశమున పుట్టినవాడి చేతిలో మరణిస్తాడని శపించింది. రాక్షస రాజు వలన పుట్టిన కంసునికి రాక్షస లక్షణాలు వచ్చాయి. కంసుడు పెరిగి పెద్దవాడవుతూనే, తండ్రి ఉగ్రసేనుని చెరసాలలో బంధించి, తాను రాజయ్యాడు. జరాసంధుని కూతుళ్ళయిన ఆస్తి, ప్రాస్తి, ఇద్దరినీ పెళ్ళాడాడు. శిశుపాలునితో స్నేహం చేశాడు. తన పిన తండ్రి కూతురైన దేవకీ దేవిని, చెరసాలలో బంధించాడు. ఆమెకు పుట్టిన సంతానాన్ని సంహరించాడు. కానీ, దేవకీ దేవి గర్భంలో జన్మించిన అష్టమ సంతానమైన శ్రీ కృష్ణుడు పెరిగి పెద్దవాడై, తన మామ కంసుడి గురించి తెలుసుకున్నాడు. అతడిని సంహరించి, తల్లి దండ్రులను బంధవిముక్తుల్ని చేయడానికి మధురకు వెళ్ళాడు.

బలరామకృష్ణులను సంహరించడానికి కంసుడు పంపిన వారందరూ, మృత్యువు ఒడికి చేరుకున్నారు. కృష్ణుడిని ఎదురించడం అసంభవమని తెలిసిన కంసుడు, పులి నుండి తప్పించుకున్న మేకపిల్లలా, సభామందిరంలో సింహాసనం మీద ఒదిగొదిగి కూర్చుని వున్నాడు. అతని చుట్టూ మంత్రులూ, సైనికులూ వున్నారు. నిలువెల్లా కంపిస్తున్న తన అనుచరులనూ, మృత్యువు రూపంలో ఎదుట నిలిచిన నల్లనయ్యనూ చూసి కంసుడు, ఇక తెగించక తప్పదనుకున్నాడు. చావు ధైర్యం తెచ్చుకుని, 'పిచ్చెక్కిన ఏనుగునూ, తాగి తూలుతున్న యోధులనూ సంహరించడం గొప్ప కాదు. నాతో యుద్ధానికి రా. బలాబలాలు తేల్చుకుందాం' అన్నాడు శౌరివైపు తిరిగి. దాంతో కన్నయ్యకు  కోపం వచ్చింది.  కంసుడి మీదకు ఉరికాడు. మృత్యువు మాదిరి తన మీదకు వస్తున్న అచ్యుతుడిని చూసి, కంసుడు తటాలున సింహాసనం మీద నుంచి కిందకు దూకాడు. ఒర నుంచి ఖడ్గాన్ని తీసి, కృష్ణుడితో తలపడ్డాడు. కృష్ణుడు అంతెత్తుకు ఎగిరి అక్కడి నుంచి కొదమసింహంలా కంసుడి పైకి లంఘించాడు. ఆ దెబ్బతో కంసుడి కిరీటం బండి చక్రంలా దొర్లుకుంటూ వెళ్ళి, దూరంగా పడింది. కృష్ణుడు కంసుడి జట్టు పట్టుకు లాగి, విసురుగా తోశాడు. కంసుడు వెల్లకిలా పడ్డాడు. అతని పక్కటెముకలు నుజ్జు నుజ్జయ్యాయి. లేవలేక కూలబడిపోయాడు. మాధవుడు ఎగిరి అతని ఎదురు రొమ్ముమీద కూర్చుని, పిడికిళ్ళతో మర్దించాడు. కంసుడు నురగలు కక్కాడు.

'మామా! నిన్ను నేను ఈవేళ చంపడం కాదు. కొన్నేళ్ళుగా చంపుతున్నాను. రాత్రింబవళ్ళు, అనుక్షణం, తింటూ, తాగుతూ, విహరిస్తూ కూడా, నన్నే తలుచుకుని భయపడ్డావు. నేను గుర్తుకు వచ్చినప్పుడల్లా, నీకు కంటిమీద నిద్ర వుండేది కాదు. ప్రతి కదలికలో, ప్రతి ఒక్కరి నీడలో నన్నే చూసి, నరక యాతన పడ్డావు. ఎందుకొచ్చిన దిగులు చెప్పు? క్షణక్షణం చస్తూ బతికే కన్నా, ఒకేసారి చావడం మంచిది' అని ఒక్కపోటు పొడిచాడు. కంసుడి కళ్ళు మూతపడ్డాయి. అతనిలోంచి ఒక దివ్యతేజం వచ్చి, కృష్ణుడిలో లీనమైంది. సభ అంతా చేతులు జోడించి, ఆ కిశోర వీరుడికి నమస్కరించింది. కంసుడి మరణ వార్త విని ఉగ్రులై అతని తమ్ములు కంకుడు, న్యగ్రోధుడు, గహ్వుడు మొదలైనవారు, మూకుమ్మడిగా బలరామకృష్ణులమీద విరుచుకుపడ్డారు. బలరాముడొక్కడే, వాళ్ళందర్నీ హతమార్చాడు. బలరాముడి చేతిలో మరణించిన కంసుడి సొదరులకు సంబంధించి, ఒక కథ ఉంది.

కంసుడి సోదరులు, పూర్వం అలకాపురంలో వుండే దేవయక్షుని కుమారులు. దేవకూట, మహాగిరి, గండ, చండ, ప్రచండ, ఖండ, అఖండ, పృధువులని, వాళ్ళకు పేర్లుండేవి. ఆ అన్నదమ్ములొకసారి, తండ్రి ఆజ్ఞ మేరకు, మానస సరోవరానికి వెళ్ళి, మహేశ్వరుడిని పూజించేందుకు, అరవిందాలు కోసుకువచ్చారు. కానీ, దారిలో వాటి సుగంధాలకు ముగ్ధులై, వాసన చూశారు. దానివల్ల వారికి ఉచ్ఛిష్టీకృత దోషం, అంటే, ఎంగిలి చేసిన పదార్థాలను నివేదన చెయ్యడం, వాసన చూసిన పూలతో పూజించడం వల్ల కలిగే దోషం సంభవించింది. ఆ కారణంగా వారు ఎనిమిది మందీ, వరుసగా మూడు జన్మలలో రాక్షసులై పుట్టారు. మూడవసారి చివరగా, ఉగ్రసేనుని కుమారులుగా జన్మించారు. శ్రీకృష్ణుని చేతిలో మరణించి, పాపవిమోచనం పొందారు. కంసుని మరణవార్త వినగానే, ప్రజలంతా ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. చెరసాలలో మగ్గుతున్న దేవకీవసుదేవులకు నల్లనయ్య విముక్తి కలిగించాడు. వారు కారాగారం నుంచి బయటకు రాగానే, బలరామకృష్ణులు వారికి పాదాభివందనం చేశారు. ఆనందంతో దేవకీవసుదేవులు పరవశించారు. దేవకీదేవి తటాలున వంగి, బిడ్డలను లేవదీసి, గుండెలకు హత్తుకున్నది.

బలరామకృష్ణులు చంటిబిడ్డల్లా తల్లిని చుట్టుకుపోయారు. 'అమ్మా! పుట్టటమైతే నీ కడుపున పుట్టాను కానీ, పసితనం నుంచే నీ ప్రేమానురాగాలకు దూరమయ్యాను. ఆ దురదృష్టమంతా నాదే. నువ్వేం బాధపడకు. కంసుడి చేతిలో మీరు పడుతున్న కష్టాలు తెలిసి కూడా, మిమ్మల్ని రక్షించడానికి ఇంత ఆలస్యమైనందుకు మన్నించండి' అని కృష్ణుడు తల్లిని వేడుకున్నాడు. దేవకీ వసుదేవులు నల్లనయ్యను దగ్గరకు తీసుకుని, పరవశులయ్యారు. తరువాత కృష్ణుడు తాతైన ఉగ్రసేనుడ్ని పిలిచి, 'మహారాజా! యయాతి శాపం వల్ల, యాదవులకు సింహాసనం ఎక్కే అధికారం లేకుండా పోయింది. కనుక మీరే ఈ భూమికి అధిపతి కావాలి. సింహాసనం స్వీకరించండి. ధర్మం తప్పకుండా పాలన చేయండి' అని అన్నాడు. బిడ్డల గొప్పతనానికి మురిసిపోయి తల్లిదండ్రులు, బలరామకృష్ణులను దగ్గరకు పిలిచి, 'నాయనలారా! మిమ్మల్ని పొగడాలో, పొగడకుండా నా ఆనందాన్నంతా ఈ గుప్పెడు గుండెలో ప్రోది చేసుకోవాలో, మీకు నమస్కరించవచ్చో, లేక బిడ్డలకి చెయ్యకూడదో, మిమ్మల్ని ఆలింగనం చేసుకోవాలో, లేక దూరం నుంచి దర్శించి, కన్నులపండుగ చేసుకోవాలో తెలియటంలేదు. 'మీరు ఏమీ అనుకోకపోతే, ఒకే ఒక కోరిక కోరుతాను. మీరిద్దరూ, మరణించిన మీ గురుపుత్రుని తీసుకువచ్చిన విధంగానే, కంసుడు పొట్టన పెట్టుకున్న నా బిడ్డలను కూడా ఒక్కసారి తెచ్చి చూపండి' అని భోరున ఏడ్చింది.

బలరామకృష్ణులు ఆమెను ఓదార్చి, యోగమాయా ప్రభావంతో, వెంటనే సుతలానికి వెళ్ళారు. రాక్షసేశ్వరుడు బలి వాళ్ళకు ఘనంగా స్వాగతం చెప్పాడు. భక్తిపూర్వకంగా వాళ్ళను అర్చించి, కానుకలు సమర్పించాడు. బలరామకృష్ణులు అమితానందం పొందారు. 'బలీ! పూర్వం స్వాయంభువ మన్వంతరంలో మరీచికి, 'ఊర్ణ' అనే ఒక భార్య ఉండేది. ఆ దంపతులకు స్మరుడు, ఉద్గదుడు, పరిష్వంగుడు, పతంగుడు, క్షుద్రభువు, ఘృణి అనే ఆరుగురు కుమారులుండేవారు. వారందరూ దేవతలే. వాళ్ళు ఒకసారి బ్రహ్మదేవుని ఎగతాళి చేసి, పరిహాసంగా మాట్లాడారు. అందువల్ల వాళ్ళను రాక్షసులై పుట్టమని ఆయన శపించాడు. అలా శపించబడ్డ ఆ ఆరుగురూ, హిరణ్యకశిపుడికి జన్మించాల్సింది. కానీ, యోగమాయా ప్రభావం వలన, వాళ్ళు దేవకీదేవికి పుట్టారు. పుట్టిన వెంటనే వాళ్ళను కంసుడు సంహరించాడు. ఆ ఆరుగురూ ఇప్పుడు నీ దగ్గర వున్నారు. మా తల్లి దేవకీదేవి వాళ్ళను చూడాలనుకుంటోంది. ఆమె కోరికను తీర్చటంకోసమే, మేము ఇక్కడికి వచ్చాం. వాళ్ళు మా వెంట వస్తే, వాళ్ళకు శాపవిముక్తి కలుగుతుంది. వాళ్ళు తిరిగి వాళ్ళ నిజ వాసం చేరుకుంటారు' అని చెప్పారు. బలి వెంటనే వాళ్ళను బలరామకృష్ణులకు అప్పగించాడు. వాళ్ళను బలరామకృష్ణులు తమ తల్లికి చూపించి, ఆమెకు ఆనందం కలిగించారు. ఆ ఆరుగురూ శ్రీకృష్ణుని స్పృశించి, తమ పాపాలను తొలగించుకున్నారు. చతుర్ముఖుని శాపం నుంచి విముక్తి పొందారు. ఏనాడో మరణించిన కుమారులు తన సముఖానికి రావడం, వెంటనే తిరిగి వెళ్ళిపోవడం, దేవకీ దేవికి ఆశ్చర్యం కలిగించింది. అదంతా శ్రీకృష్ణుని లీల అని గ్రహించి, పరవశించిపోయిందామె.

కృష్ణం వందే జగద్గురుం!

Wednesday, December 13, 2023

ఉపకారస్మృతి! భగవద్గీత Bhagavad Gita Chapter 18


ఉపకారస్మృతి!
మనం నడిచే నేల, చూసే సూర్యుని వెలుగు, పీల్చే గాలి, త్రాగే నీరు ఎక్కడివి?

'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (59 – 62 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 59 నుండి 62 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/AQTTQeffwzY ]


జీవాత్మల గతిని, వాటి వాటి కర్మల అనుగుణంగా భగవంతుడు ఏ విధంగా నిర్దేశిస్తూ ఉంటాడో చూద్దాము..

00:50 - యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే ।
మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి ।। 59 ।।

ఒకవేళ నీవు అహంకారముచే ప్రేరితమై, ‘నేను యుద్ధం చేయను’ అని అనుకుంటే, నీ నిర్ణయం ఎలాగూ వ్యర్థమై పోతుంది. ఎందుకంటే, నీ యొక్క క్షత్రియ భౌతిక స్వభావమే, నిన్ను యుద్ధం చేయటానికి పురికొల్పుతుంది. 

శ్రీ కృష్ణుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. మనకు ఏది నచ్చితే అది చేయటానికి మనకు పూర్తి స్వేచ్ఛ ఉందని, మనం ఎన్నడూ అనుకోకూడదు. ఆత్మ అనేది, పూర్తి స్వతంత్రమైన అస్తిత్వమును కలిగి ఉండదు. అది భగవంతుని సృష్టిపై ఎన్నో విధాలుగా ఆధారపడి ఉంటుంది. భౌతిక బద్ధ స్థితిలో, అది ప్రకృతి త్రిగుణముల ఆధీనములో ఉంటుంది. ఈ గుణముల సంయోగమే, మన స్వభావాన్ని ఏర్పరుస్తుంది. అది ఆదేశించినట్టుగా మనం ప్రవర్తించవలసి ఉంటుంది. కాబట్టి మనకు, ‘నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను’ అనే పరిపూర్ణ స్వేచ్ఛ లేదు. భగవంతుని యొక్క, మరియు శాస్త్రముల సత్-సందేశాన్నీ, లేదా ప్రకృతి యొక్క బలవంత ఒత్తిడినీ, ఈ రెంటిలో ఏదో ఒక దానిని ఎంచుకోవలసి ఉంటుంది. స్వభావసిద్ధంగా అర్జునుడు ఒక యోధుడు. ఒకవేళ గనక అహంకారముతో, మంచి సలహాని పాటించనని ఆయన నిర్ణయించుకున్నా, ఆయన యొక్క క్షత్రియ స్వభావము, అతనిని తప్పకుండా యుద్ధానికి ప్రేరేపిస్తుంది.

02:20 - స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా ।
కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవశోఽపి తత్ ।। 60 ।।

ఓ అర్జునా, మోహభ్రాంతిచే నీవు ఏదైతే పనిని చేయనని అంటున్నావో, నీ యొక్క సహజ ప్రకృతి స్వభావముచే జనించిన ప్రేరణచే, ఆ పనినే చేయటానికి ప్రేరేపింపబడతావు.

తన యొక్క హెచ్చరింపు మాటలను కొనసాగిస్తూ, శ్రీ కృష్ణుడు ఇంతకు క్రితం చెప్పిన విషయాన్నే, మరింత విశదీకరిస్తున్నాడు. ఆయన అనేదేమిటంటే, నీ యొక్క పూర్వ జన్మ సంస్కారాల వలన, నీకు క్షత్రియ స్వభావమున్నది. నీ యొక్క సహజ గుణములైన వీరత్వము, పరాక్రమము, మరియు దేశభక్తి, నిన్ను యుద్ధం చేయటానికే పురిగొల్పుతాయి. నీకు పూర్వ జన్మలలో, మరియు ఈ జన్మలో కూడా, ఒక యోధుడిగా నీ కర్తవ్యమును నిర్వర్తించటానికే, శిక్షణ ఇవ్వబడినది. నీ కళ్ళ ముందే ఇతరులకు అన్యాయం జరుగుతుంటే, ఊరికే ఉండటం నీకు సాధ్యమవ్వదు. నీ స్వభావము, మరియు లక్షణాలు ఎలాంటివంటే, నీవు ఎక్కడ దుర్మార్గాన్ని చూసినా, దానిని తీవ్రంగా అడ్డుకుంటావు. కాబట్టి, నీ సహజ స్వభావంచే ప్రేరేపితమై చేసేకన్నా, నా ఉపదేశాన్ని అనుసరించి యుద్ధం చేయటమే నీకు మేలు.. అనే సందేశాన్ని ఇస్తున్నాడు భగవంతుడు.

03:43 - ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఽర్జున తిష్ఠతి ।
భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ।। 61 ।।

 ఓ అర్జునా, పరమేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉంటాడు. భౌతిక శక్తిచే తయారు చేయబడిన యంత్రమును అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని, వాటి వాటి కర్మల అనుగుణముగా, ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు.

భగవంతునిపై జీవాత్మ ఆధారపడి ఉండటాన్ని వక్కాణిస్తూ, శ్రీ కృష్ణుడు ఇలా అంటున్నాడు. నేను చెప్పినట్టు విన్నా, వినకపోయినా, నీవు ఎల్లప్పుడూ నా ఆధీనంలోనే ఉంటావు. నీవు వసించి ఉండే ఈ శరీరము, నా భౌతిక శక్తిచే తయారు చేయబడినది. నీ యొక్క పూర్వ కర్మల ప్రకారం, నీకు తగిన శరీరమును ఇచ్చాను. నేను కూడా దానిలోనే కూర్చుని ఉన్నాను. నేను నీ సమస్త ఆలోచనలను, మాటలను, మరియు చేష్ఠలను లిఖించుకుంటున్నాను. కాబట్టి, నీవు ప్రస్తుతం చేసే దానిని బట్టి, నీ భవిష్యత్తు ఎలా ఉండాలని కూడా నిర్ణయిస్తాను. నీవు నాకంటే స్వతంత్రుడవని ఎన్నడూ తలంచకు. కాబట్టి అర్జునా, నీ శ్రేయస్సు కోసమే, నీవు నాకు శరణాగతి చేయటమే మంచిది. అని అర్జునుడికి విశదీకరిస్తున్నాడు.

05:02 - తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత ।
తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ ।। 62 ।।

ఓ భరతా, సంపూర్ణ హృదయ పూర్వకముగా, కేవలం ఆయనకే అనన్య శరణాగతి చేయుము. ఆయన కృపచే, నీవు పరమ శాంతిని, మరియు నిత్యశాశ్వత ధామమును పొందెదవు.

భగవంతునిపైనే ఆధారపడి ఉన్న జీవాత్మ, తన ప్రస్తుత దురవస్థ నుండి బయట పడటానికీ, మరియు సర్వోన్నత పరమ లక్ష్యమును సాధించటానికి కూడా, భగవత్ కృప పైనే ఆధారపడి ఉండాలి. కేవలం సొంత ప్రయత్నం మాత్రమే దీనికి సరిపోదు. కానీ, భగవంతుడు తన కృపను ప్రసాదిస్తే, ఆయన తన దివ్య జ్ఞానమునూ, మరియు దివ్య ఆనందమునూ, ఆ జీవాత్మకు ప్రసాదించి, దానిని భౌతిక శక్తి యొక్క మాయా బంధనముల నుండి విడిపిస్తాడు. తన కృపచేత, వ్యక్తి నిత్య శాశ్వత మోక్షమును, మరియు అనశ్వరమైన ధామమును పొందుతాడని, శ్రీ కృష్ణుడు వక్కాణిస్తున్నాడు. కానీ, ఆ కృపను పొందటానికి జీవాత్మ, భగవత్ శరణాగతి ద్వారా అర్హతను సంపాదించుకోవాలి. ఈ లోకంలోని ఒక తండ్రి కూడా, తన కొడుకు ప్రయోజకుడై, వాటిని బాధ్యతతో సన్మార్గంలో ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకునే వరకూ, తన విలువైన సంపత్తిని అతనికి అప్పచెప్పడు. అదే విధంగా, భగవత్ కృప అనేది, ఏదో ఆషామాషీ వ్యవహారం కాదు. దానిని ప్రసాదించటానికి, సంపూర్ణ, సహేతుక, తర్కబద్ధ నియమాలు ఆధారంగా ఉన్నాయి. ఒకవేళ భగవంతుడు తన కృపను ప్రసాదించటంలో నియమాలు పాటించకపోతే, జనుల విశ్వాసము దెబ్బతింటుంది. భగవంతుడు తన కృపను, మనకు అర్హత లేకుండానే ప్రసాదిస్తే, ఇంతకు క్రితం మహాత్ములైన వారు, ఈ విధంగా అనుకుంటారు. ‘ఏమిటిది? మేము ఎన్నో జన్మల తరబడి, మమ్ములను మేము పరిశుద్ధి చేసుకోవటానికి కష్టపడ్డాము. ఆ తదుపరి భగవంతుని కృప లభించింది. కానీ ఈ వ్యక్తి తనను తాను యోగ్యుడిగా చేసుకోకముందే, ఆయన కృప లభించినది. అలా అయితే, ఆత్మ-ఉద్ధరణ కోసం మా పరిశ్రమ అంతా అర్థరహితమైనది.’ అని అనుకుంటారు. దానికి సమాధానంగా, శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:

‘ఆ బ్రహ్మ దేవుడినీ మరియు ఇతరులను సృష్టించిన ఆ సర్వోత్కృష్ట తత్త్వమును ఆశ్రయిస్తున్నాము. ఆయన కృపచేతనే, ఆత్మ మరియు బుద్ధి, జ్ఞానప్రకాశితమౌతాయి.’ 

భగవత్ శరణాగతి యొక్క ఆరు అంగములు ఏమిటంటే:

1. భగవంతుని సంకల్పమునకు అనుగుణముగానే కాంక్షించటం: సహజ సిద్ధంగానే, మనం ఆ భగవంతుని సేవకులము. తన స్వామి కోరికను తీర్చటమే, సేవకుని కర్తవ్యము. కాబట్టి, శరణాగతి చేసిన భగవత్ భక్తులుగా, మన సంకల్పాన్ని, దివ్య భగవత్ సంకల్పంతో ఏకం చేయాలి. ఒక ఎండుటాకు, వీచేగాలికి లొంగిపోతుంది. అంటే శరణాగతి చేస్తుంది. ఆ వీచేగాలి, దాన్ని పైకిలేపినా, ముందుకు, లేదా వెనుకకు పడవేసినా, లేదా నేలపై పడవేసినా – అదేమీ ఫిర్యాదు చేయదు. అదే విధంగా, మనం కూడా భగవంతుని ఆనందమే మన ఆనందం అని ఉండటం నేర్చుకోవాలి.

2. భగవంతుని సంకల్పమునకు వ్యతిరేకంగా కోరుకోకుండా ఉండటం: మన జీవితంలో మనకు లభించినదంతా, మన పూర్వ, ప్రస్తుత కర్మల అనుసారమే ఉంటుంది. కానీ, కర్మ ఫలములు వాటంతట అవే రావు. భగవంతుడు వాటిని లిఖించి, వాటి ఫలములను సరైన సమయంలో ఇస్తుంటాడు. భగవంతుడే స్వయంగా ఈ ఫలములను ఇస్తుంటాడు కాబట్టి, మనం వాటిని ప్రశాంత చిత్తముతో స్వీకరించటం నేర్చుకోవాలి. సాధారణంగా జనులు తమకు సంపద, కీర్తి, ఆనందము, మరియు విలాసాలు లభించినప్పుడు, భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పటం మరచిపోతారు. కానీ, కష్టాలు ఎదురైనప్పుడు, ‘ఎందుకు భగవంతుడు ఇలా చేశాడు?’ అని భగవంతుడిని నిందిస్తారు. రెండవ సూత్రం ఏమిటంటే, భగవంతుడు మనకు ఇచ్చిన దాని పట్ల, ఎటువంటి అసంతృప్తులు ఉండకపోవటం.

3. భగవంతుడు మనలను రక్షిస్తున్నాడన్న దృఢ విశ్వాసం కలిగి ఉండటం: భగవంతుడు మన సనాతనమైన నిత్య శాశ్వత తండ్రి. సృష్టిలోని సమస్త ప్రాణుల సంక్షేమం చూసుకుంటూనే ఉంటాడు. ఈ భూమిపై కొన్ని వేల కోట్ల చీమలు ఉన్నాయి. అవన్నీ సమయానుసారం ఆహారం తీసుకోవలసినదే. మన తోటలో కొన్నివేల చీమలు ఆకలితో చనిపోయి ఉండటం అనేది ఎప్పుడైనా జరిగిందా? వాటన్నిటికీ భగవంతుడు ఆహారం సమకూర్చి పెడుతూనే ఉంటాడు. అదే సమయంలో మరో పక్క, ఏనుగులు కిలోలకొద్దీ ఆహారం ప్రతి రోజూ తీసుకోవాలి. భగవంతుడు వాటి అవసరాలు కూడా తీరుస్తుంటాడు. ఈ లోకపు తండ్రి కూడా, తన బిడ్డల అవసరాలన్నీ తీరుస్తాడు. మరైతే మన నిత్యసనాతన తండ్రి అయిన భగవంతుడు, మన సంరక్షణ చూసుకోడన్న సందేహం ఎందుకు? ఆయనిచ్చే రక్షణ పట్ల సంపూర్ణ దృఢ విశ్వాసం కలిగి ఉండటం, శరణాగతి యొక్క మూడవ అంగము.

4. భగవంతుని పట్ల కృతజ్ఞతా భావమును కలిగి ఉండటం: మనం భగవంతుని నుండి ఎన్నో అమూల్యమైన బహుమానాలను పొంది ఉన్నాము. మనం నడిచే నేల, చూసే సూర్యుని వెలుగు, పీల్చే గాలి, త్రాగే నీరు - ఇవన్నీ భగవంతుడు మనకు ఇచ్చినవే. నిజానికి ఆయన వలననే మనం ఇలా ఉండగలుగుతున్నాము; మనకు ప్రాణ శక్తినిచ్చి, మన ఆత్మకు చైతన్యమును ప్రసాదించినది ఆయనే. వీటికి ప్రతిగా, ఆయనకు మనం ఏమీ పన్నులు కట్టడంలేదు. కానీ కనీసం ఆయన ఇచ్చిన దాని పట్ల కృతజ్ఞతా భావముతో ఉండాలి. ఇదే, ఉపకారస్మృతి, కృతజ్ఞతా భావము. మనకు ఆయన ప్రసాదించిన అన్నింటి పట్ల, మన నిత్య శాశ్వత తండ్రి అయిన భగవంతుని పట్ల, కృతజ్ఞతా భావము కలిగి ఉండటమే, శరణాగతి యొక్క నాలుగవ అంశము.

5. మనకున్నదంతా ఆయన సొత్తుగా పరిగణించటం: భగవంతుడు ఈ సమస్త జగత్తుని సృష్టించాడు; అది మనం పుట్టకముందు నుండీ ఉన్నది, మరియు మన తరువాత కూడా ఉంటుంది. కాబట్టి, ఈ సృష్టిలో సమస్తానికీ ఆయనే నిజమైన యజమాని. మనం ఏదైనా వస్తువు మనకే చెందినదని అనుకుంటే, భగవంతుని యొక్క యజమానత్వమును మరచి పోయినట్టే. ఈ జగత్తు, మరియు దానిలో ఉన్నదంతా భగవంతునికే చెందినది. ఈ విషయం గుర్తుంచుకుని, మన యజమానత్వమును విడిచి పెట్టటం, శరణాగతి యొక్క ఐదవ అంగము.

6. శరణాగతి చేశానన్న అహంకారమును కూడా విడిచిపెట్టటం: ఒకవేళ మనం చేసిన మంచి పనుల పట్ల గర్వపడితే, అహంకరిస్తే, ఆ గర్వం మన హృదయాన్ని మలినం చేస్తుంది. మనం చేసిన మంచి పని యొక్క ఫలితాన్ని నిర్మూలిస్తుంది. అందుకే నమ్రత, మరియు విధేయత ఉంచుకోవటం అనేది, చాలా ముఖ్యమైనది. ‘నేను ఏదైనా మంచి పని చేయగలిగానంటే, అది కేవలం భగవంతుడు నా బుద్ధిని సరియైన దిశలో ప్రేరేపించాడు కాబట్టే. నామటుకు నేనే అయితే, నేను ఎప్పటికీ ఇది సాధించేవాడిని కాదు.’ అనేటటువంటి వినమ్రతా దృక్పథాన్ని కలిగి ఉండటమే, శరణాగతి యొక్క ఆరవ అంగము.

ఒకవేళ మనం శరణాగతి యొక్క ఈ ఆరు అంగములనూ పరిపూర్ణముగా అమలుపరిస్తే, మనం భగవంతుని యొక్క షరతులను పూర్తిచేసినట్టే.. అప్పుడాయన తన కృపను మనపై ప్రసాదిస్తాడు.

12:39 ఇక మన తదుపరి వీడియోలో, జనులు ఏ విధంగా చేయడం వలన భగవంతుడిని పొందగలరో తెలుసుకుందాం..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, December 11, 2023

పూరూరవుడు ఎవరు? King Pururava


పూరూరవుడు ఎవరు?
ఊర్వశీ పురూరవుల ప్రణయ కావ్యం మీకు తెలుసా?

మన పురాణాలలో ఎన్నో ప్రేమకథలు చోటుచేసుకున్నాయి. వాటిలో విచిత్రమైన ప్రేమకథలు, స్వర్గలోక వాసులైన సౌందర్యరాశుల సొంతం. అప్సరసల గురించి హిందూ పురాణాలలో చాలా చోట్ల ప్రస్తావించబడింది. వీరిలో రంభ, ఊర్వసి, మేనక, తిలోత్తమలతో పాటు, అనేక మంది ఇతర అప్సరసలు కూడా ఉన్నారు. అయితే, ఊర్వసి పుట్టుక గురించి ప్రత్యేకమైన కథ ప్రచారంలో ఉంది. నరనారాయణులకూ, ఊర్వశికీ గల సంబంధం ఏమిటో మన గత వీడియోలో వివరించాను. చూడని వారి కోసం, దాని లింక్ ను  i Cards లో పొందుపరిచాను. అనన్య సామాన్యమైన అందాల రాశి ఊర్వశి ఎందుకు మానవ జన్మ ఎత్తవలసి వచ్చింది? ఆమెకున్న శాపం ఏమిటి? పూరూరవ చక్రవర్తి ఎవరు? ఊర్వశి పూరురవుడితో ప్రేమలో ఎలా పడింది? పూరురవుడిని ఊర్వశి ఎందుకు వదిలి వెళ్లింది? తిరిగి ఊర్వశీ పూరురవులు కలుసుకున్నారా? వీరి ప్రేమకావ్యానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/oXHEBpbKZmM ]


ప్రజాపతి బ్రహ్మకు, అత్రిమహర్షి సంతానంగా కలిగాడు. ఆయనకు చంద్రుడు ఉదయించాడు. ఈయన తారా మండలానికి రాజుగా, ఓషధులకు అధీశుడిగా ప్రఖ్యాతుడయ్యాడు. ఈయన రాజసూయం చేసి, ముల్లోకాలూ గెలిచాడు. చంద్రుడు దేవగురువు భార్య తారను కామించాడు. ఆమె గర్భవతి అయి, కుమారుని కన్నది. ఆ సుందరాకారుని చూచి, బృహస్పతి తన కుమారునిగా స్వీకరిస్తాననగా, వివాదం చెలరేగింది. బ్రహ్మ విషయం గ్రహించి, వానిని చంద్రుని పుత్రుడిగా పంపించాడు. ఆ కుమారుడే, బుధుడు. బుధుని భార్య ఇల. వీరి కుమారుడు, పురూరవుడు. అతి పరాక్రమవంతుడైన పురూరవుడు, దేవతలకు సన్నిహితుడిగా పేరుగాంచి, ఎన్నో యుద్ధాలలో పాల్గోన్నాడు. పురు అనే పర్వతం పై జన్మించాడు కాబట్టి, పురూరవుడు అనే పేరొచ్చింది. ప్రతిష్టాన పురాన్ని పాలించే పురూరవుడు, తపస్సు చేసి, బ్రహ్మను మెప్పించి, భూమండలానికి అధిపతి అయ్యాడు. ఆ తరువాత పురూరవుడు కొన్ని వందల అశ్వమేధ యాగాలు చేశాడు.

పురూరవునితో దేవతలు స్నేహితులుగాను, రాక్షసులు అనుచరులుగాను మెలిగేవారు. మహాభారతం ప్రకారం, పురూరవుడు గంధర్వ లోకంనుండి, మూడు రకాల అగ్నులను యజ్ఞయాగాదుల కోసం తెచ్చాడు. ఆ సందర్భంలోనే, అక్కడ ఊర్వశిని చూసి మోహించాడు. ఊర్వశి మహా సౌందర్యవతి. నారాయణుడి ఊరువు నుండి ఉద్భవించిన ఆమె ముగ్ధమోహన లావణ్యానికి, ఎంతటివారైనా దాసోహం అవ్వాల్సిందే. రంభాది అప్సరసలకంటే రెట్టింపు అందం, ముఖవర్ఛస్సుతో, ఆమె దేవలోకంలో అగ్ర నర్తకిగా పేరుగాంచింది. ఊర్వశి ఒకనాడు సూర్యుని చేత శాపగ్రస్థురాలై, మానవజన్మ యెత్తి భూలోకానికి వచ్చింది. పూరురవ మహారాజును ఏకాంతంలో దర్శించింది. అప్పటికే ఊర్వశి సౌందర్యానికి మోహితుడైన పురూరవుడు ఆమెను చేరి, తన కోరికను తెలిపాడు.

ఊర్వశి కూడా పురూరవుడి యందు కామ కోరికను కలిగి నవ్వుతూ, "రాజేంద్రా! నాకు రెండు నియమాలున్నాయి. అవి నీవు పాటిస్తే, నిన్ను వరిస్తాను. నియమం తప్పిన క్షణంలో నిన్ను విడిచి పోతాను. ఒకటి, నాకు రెండు గొర్రెలున్నాయి. వాటిని నిరంతరం నువ్వు రక్షిస్తూండాలి. రెండవది - ఎన్నడూ నా ముందు నువ్వు దిగంబరంగా కనపడ కూడదు" అని అన్నది. మోహమత్తుడైన పురూరవుడు ఆమె నియమాలను ఆమోదించి, ఆమెతో కలసి జీవించనారంభించాడు. అక్కడ అమరావతిలో దేవేంద్రుడు, తన సభలో ఊర్వశి లేకపోవడం లోటుగా వున్నదని భావించాడు. ఎలాగైనా ఆమెను స్వర్గలోకానికి తీసుకురావాలని, గంధర్వులను భూలోకానికి పంపించాడు. ఊర్వశీ పూరూరవల ప్రణయాన్ని చూసిన గంధర్వులు, ఆమె తిరిగి అమరావతి రావడం అసాధ్యం అని భావించి, ఒక పన్నాగం పన్నారు.

ఒకనాటి రాత్రి అత్యంత రహస్యంగా, ఊర్వశి పెంచుకునే గొర్రెలను అపహరించబోగా, అవి రోదన చేశాయి. వాటి అరుపు సాగుతున్నా, పురూరవుడు ఏమాత్రం చలించక, గాఢనిద్రలో వుండిపోయాడు. ఆ అరుపులకు ఊర్వశి లేచి, "నా కన్నబిడ్డల వంటి పొట్టేళ్ళను దొంగలు అపహరిస్తున్నా, మొద్దు నిద్రపోయే నీవు మగవాడివేనా! నోరులేని పశువులను రక్షించలేవు. ప్రియురాలి కౌగిలి తప్ప మరేమీ యెరగని మగవాడై పుట్టడం కంటే, ఆడజన్మ మేలు". అని అనేక విధాలా నిందించగా భరించలేని పూరురవుడు, శయ్యదిగి పోయి, ఆ దొంగల నుండి గొర్రెలను తోలుకు వచ్చాడు. గాఢ నిద్ర నుండి లేచిన ఆ మైకంలో, శరీరం మీద వస్త్రం వున్నదీ లేనిదీ చూసుకోకుండా, గొర్రెల కోసం పోయి వాటిని తీసుకువచ్చి, ఊర్వశి ముందు దిగంబరంగా నిలబడ్డాడు. తక్షణం ఊర్వశి తన నియమానుసారం, అంతర్ధానం అయ్యింది.

ప్రియురాలు కనిపించక దీనంగా విలపిస్తూ, ఆమె కోసం ఎదురు చూశాడు పూరురవుడు. ఆమె జాడ కోసం ముల్లోకాలూ సంచరిస్తూ, సరస్వతీ నదీ తీరాన చెలికత్తెలతో వున్న ఊర్వశిని చూశాడు. ఆనందభరితుడైన పురూరవుడు, తనతో పాటు రమ్మని పరి పరివిధాలా ఊర్వశిని వేడుకున్నాడు. అందుకు ఊర్వశి, "మహారాజా! తియ్య తియ్యని మాటలతో వంచించడమే తప్ప, మన్మథుణ్ణి కూడా మనసారా ప్రేమించని వేశ్యలతో నీకెందుకయ్యా? సరే, ఒక్క సంవత్సరం ఆగి నా దగ్గరకు రా. అప్పుడు నీకు యోగ్యులయిన పుత్రులను అందిస్తాను" అని చెప్పింది. అప్పుడు పురూరవుడు ఆమె గర్భవతియని గ్రహించి, అక్కడి నుండి వెళ్ళి పోయాడు.

ఊర్వశి మాట ప్రకారమే, సంవత్సరం గడిచాక ఆమె దగ్గరకు పోయాడు. ఊర్వశి, పూరూరవుడితో గంధర్వులను వేడుకోమ్మని చెప్పింది. పూరూరవుడు ఆమె మాటకు లోబడి వారిని అభ్యర్థించగా, వారు ఊర్వశి వంటి రూపం కలిగిన అగ్నిస్థలిని యిచ్చారు. ఆమెను ఊర్వశిగా భావించి, అగ్నిస్థలితో జీవనం కొనసాగించాడు, పూరూరవుడు. అయితే, కొంత కాలం గడిచిన తరువాత, ఆమె ఊర్వశి కాదని తెలియగా, ఆమెను విడిచిపెట్టాడు. ఎంతకాలమైనా పురూరవుడి మనస్సు ఊర్వశి యందే లగ్నమై ఉంది.

అంతలో కృతయుగం గడచి, త్రేతాయుగం ప్రవేశించింది. ఆయన మనస్సులో వేద ధర్మం మూడు విధాలుగా గోచరించగా, జమ్మిచెట్టులో పుట్టిన రావిచెట్టు కొమ్మలతో, రెండు అరణులు చేశాడు. మొదటి అరణి తానుగా, రెండవది ఊర్వశిగా, నడుమనున్న కర్ర కుమారుడుగా మథనం చేయగా, జాత వేద రూపంతో అగ్ని సంభవించి, ఆహవనీయాగ్నిగా ప్రఖ్యాతమయింది. ఆ అగ్నితో పురూరవుడు, శ్రీహరిని ఆరాధించాడు. ఆ శ్రీహరి సంతోషించి, ఊర్వశితో జీవితాన్ని సంతోషంగా గడపమని చెప్పి, ఊర్వశీ పురూరవుల సంతానం చంద్ర వంశంగా ప్రఖ్యాతి గడిస్తుందని వరమిచ్చాడు. అనంతరం పురూరవుడు, గంధర్వ లోకంలో ఊర్వశిని చేరి, ఆయువు, శ్రుతాయువు ఆదిగా, ఆరుగురు కుమారులను కన్నాడు.

ఓం నమో నారాయణాయ!

Wednesday, December 6, 2023

బ్రహ్మానందము - భగవద్గీత Bhagavad Gita Chapter 18


బ్రహ్మానందము!
నిస్వార్థ ప్రేమయుక్త భక్తితో మనం ఆరాధించిన భగవత్ స్వరూప ధామానికి చేరుకుంటామా?

'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (55 – 58 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 55 నుండి 58 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/LwZBQ8gvBAk ]


భగవానుడి కృపచే ఎటువంటి వారు నిత్యశాశ్వతమైన, మరియు అనశ్వరమైన ధామమును పొందుతారో చూద్దాము..

00:50 - భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్త్వతః ।
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్ ।। 55 ।।

కేవలం నా పట్ల ప్రేమ యుక్త భక్తి చేత మాత్రమే, యదార్థముగా నేను ఎవరో, ఎంతటి వాడినో తెలుసుకోవచ్చును. నన్ను తెలుసుకున్న పిదప, నా భక్తుడు నా సంపూర్ణ భావనలో లీనమగును.

అలౌకిక ఆధ్యాత్మిక జ్ఞానములో స్థితుడై ఉన్న పిదప, వ్యక్తి భక్తిని పొందుతాడు. ఇక ఇప్పుడు, కేవలం భక్తి చేత మాత్రమే భగవంతుని యొక్క యధార్థ స్వరూపమును తెలుసుకోవచ్చని అంటున్నాడు. ఇంతకు క్రితం, జ్ఞాని భగవంతుడిని నిర్గుణ, నిర్విశేష, నిరాకార బ్రహ్మముగా ఆచరణలో తెలుసుకుని ఉన్నాడు. కానీ, జ్ఞాని భగవంతుని యొక్క సాకార రూపమును అనుభవించలేదు. ఆ సాకార రూప రహస్యము - కర్మ, జ్ఞానము, అష్టాంగ యోగము, మొదలైన ప్రక్రియల ద్వారా తెలుసుకోబడలేదు. కేవలం ప్రేమ మాత్రమే, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది, మరియు అందని దానిని అందిస్తుంది. భగవంతుని యొక్క రూపమూ, గుణములూ, లీలలూ, ధామములూ, మరియు పరివారముల యొక్క నిగూఢత, ఆయన పట్ల అనన్య భక్తి ద్వారానే తెలుసుకోబడతాయి. ప్రేమ దృష్టి ఉండటం చేతనే, భక్తులు భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతారు. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవటానికి, పద్మ పురాణంలో ఒక చక్కటి కథ ఉంది. జాబాలి అనే ఋషి ఒకసారి, అడవిలో ధ్యానం చేస్తున్న ఒక అత్యంత తేజోవంతమయిన, మరియు ప్రశాంతమైన కన్యను చూశాడు. తానెవరో, తానెందుకు ధ్యానం చేస్తున్నదో తెలియ చేయమని, ఆ ఋషి ఆమెను ప్రార్థించాడు. ఆమె ఇలా సమాధానం ఇచ్చింది: ‘నేను బ్రహ్మ విద్యను, అంటే ఆత్మ గురించి తెలుసుకునే శాస్త్రము. అది అంతిమంగా భగవంతుని అంటే, బ్రహ్మము యొక్క అస్తిత్వమును ఎఱుకలోకి తెస్తుంది. గొప్ప గొప్ప యోగులూ, సాధువులూ నన్ను తెలుసుకొనుటకు, తపస్సులు చేస్తుంటారు. కానీ, సాకార రూప భగవంతుని పాదారవిందముల పట్ల భక్తిని పెంపొందించుకోవటానికి, నేనే స్వయంగా కఠినమైన తపస్సు ఆచరిస్తున్నాను. నేను బ్రహ్మానందములో తృప్తిగా, మరియు నిండుగా ఉన్నాను. అయినా, శ్రీ కృష్ణుడి పట్ల ప్రేమానుబంధం లేకపోతే, వెలితిగా, శూన్యంగా అనిపిస్తుంది.’ అని జాబాలికి తెలియజేసింది. ఈ విధంగా, కేవలం జ్ఞానం మాత్రమే ఉంటే, అది భగవంతుని సాకార రూప ఆనందాన్ని ఆస్వాదించటానికి సరిపోదు. భక్తి ద్వారా మాత్రమే ఎవరైనా ఆ రహస్యం తెలుసుకోవచ్చు, సంపూర్ణ భగవత్ భావనను పొందవచ్చు.

03:34 - సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః ।
మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్ ।। 56 ।।

సర్వ కార్యములూ చేస్తూనే ఉన్నా, నా భక్తులు నన్నే పూర్తిగా ఆశ్రయిస్తారు. నా కృపచే వారు నిత్యశాశ్వతమైన, మరియు అనశ్వరమైన ధామమును పొందుతారు.

భక్తి ద్వారా భక్తులు తన యొక్క సంపూర్ణ ఏకీభావ స్థితిలోకి వస్తారు. ఈ దృక్పథంలో, వారు ప్రతిదానినీ ఈశ్వర సంబంధముగా చూస్తారు. తమ శరీర, మనోబుద్ధులను భగవంతుని శక్తిగా పరిగణిస్తారు. వారి భౌతిక సంపత్తిని భగవంతుని సొత్తుగా చూస్తారు. వారు సర్వ భూతములనూ, భగవంతుని అంశలుగానే పరిగణిస్తారు, తమను తాము భగవత్ సేవకులుగా పరిగణించుకుంటారు. ఆ దివ్య దృక్పథంలో, వారు పనిని విడిచిపెట్టరు. కానీ, కర్తృత్వ భావననూ, మరియు కర్మఫలభోక్తలమనే భావననూ విడిచిపెడతారు. అన్ని పనులనూ ఈశ్వర సేవగా చూస్తూ, వాటిని చేయటానికి ఆయన మీదనే ఆధార పడతారు.

ఆ తర్వాత, దేహమును విడిచిపెట్టిన పిదప, భగవంతుని దివ్య ధామమును చేరుకుంటారు. ఏ విధంగానైతే ఈ భౌతిక జగత్తు, భౌతిక శక్తితో తయారు చేయబడినదో, దివ్య లోకాలు, ఆధ్యాత్మిక దివ్య శక్తిచే తయారుచేయబడినవి. కాబట్టి, అది భౌతిక స్వభావం యొక్క దోషములకు అతీతమయినది, మరియు సంపూర్ణ దోషరహితమైనది. అది సత్-చిత్-ఆనందం.. అంటే, నిత్యశాశ్వతత్వము, జ్ఞానము, మరియు ఆనందములచే నిండి ఉన్నది. భగవంతుని యొక్క వివిధమైన స్వరూపాలకు, ఆధ్యాత్మిక జగత్తులో వారి వారి స్వీయ ధామములున్నాయి; అక్కడ వారు తమ భక్తులతో నిత్య ప్రేమయుక్త లీలలలో నిమగ్నమై ఉంటారు. ఎవరైతే ఆయన పట్ల నిస్వార్థ ప్రేమయుక్త భక్తి సేవలో పరిపూర్ణత సాధిస్తారో, వారు ఆయొక్క ఆరాధించిన భగవత్ స్వరూప ధామమునకు చేరుకుంటారు. ఈ విధంగా, శ్రీ కృష్ణుడి భక్తులు గోలోకమునకూ, విష్ణుభక్తులు వైకుంఠమునకూ, రామ భక్తులు సాకేతలోకమునకూ, శివ భక్తులు శివలోకమునకూ, దుర్గామాత భక్తులు దేవీలోకమునకూ చేరుకుంటారు. ఈ దివ్య ధామములకు చేరుకున్న భక్తులు, ఆయనను చేరిన తరువాత, ఆధ్యాత్మిక శక్తితో పరిపూర్ణమైన ఆయన దివ్య లీలలలో పాలుపంచుకుంటారు.

06:02 - చేతసా సర్వకర్మాణి మయి సన్న్యస్య మత్పరః ।
బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ ।। 57 ।।

నన్నే నీ యొక్క పరమ లక్ష్యముగా చేసుకుని, నీ యొక్క ప్రతి కర్మనూ నాకే సమర్పించుము. బుద్ధి యోగమును ఆశ్రయించి, నీ చిత్తమును నా యందే ఎల్లప్పుడూ లగ్నము చేయుము.

‘యోగము’ అంటే ఏకమైపోవుట, మరియూ, బుద్ధి యోగము అంటే, ‘బుద్ధిని భగవంతునితో ఏకం చేయుట’ అని. సమస్త పదార్థములూ, జీవులూ, భగవంతుని నుండే జనించాయి, ఆయనతో అనుసంధానమై ఉన్నాయి, మరియు ఆయన ప్రీతికోసమే ఉన్నాయని ఎప్పుడైతే బుద్ధి దృఢ నిశ్చయంతో ఉంటుందో, అప్పుడు బుద్ధి భగవంతునితో ఏకమై పోతుంది. మనలో ఉన్న అంతర్గత వ్యవస్థలో, బుద్ధి యొక్క స్థాయిని ఒకసారి అర్థం చేసుకుందాము. మన శరీరంలో సూక్ష్మమైన అంతఃకరణ ఉంటుంది. మనం దానినే సామాన్యంగా, 'హృదయము' అంటుంటాము. దానికి నాలుగు అస్తిత్వాలు ఉంటాయి. అది ఆలోచనలను సృష్టిస్తే, దానిని మనం 'మనస్సు' అంటాము. అది విశ్లేషించి, నిర్ణయం తీసుకుంటే, దానిని 'బుద్ధి' అంటాము. అది ఒక వస్తువుకు, లేదా వ్యక్తి పట్ల మమకారానురాగంతో ఉంటే, దానిని 'చిత్తము' అంటాము. అది తనను తాను దేహ సంబంధ గుణములతో అనుసంధానం చేసుకునీ, మరియు గర్వంతో ఉంటే, దానిని మనం 'అహంకారము' అంటాము. ఈ యొక్క అంతర్గత వ్యవస్థలో, బుద్ధి యొక్క స్థాయి ఉన్నతమైనది. అది నిర్ణయం తీసుకుంటే, మనస్సు ఆ నిర్ణయాల ప్రకారం తన కోరికలను కోరుతుంది, మరియు చిత్తము ఆయా వస్తువిషయముల పట్ల మమకారాసక్తితో ఉంటుంది. ఉదాహరణకి, బుద్ధి గనుక మనకు భద్రతయే చాలా ప్రధానమైనదని నిర్ణయిస్తే, మనస్సు ఎల్లప్పుడూ, జీవితంలో భద్రత కోసమే ప్రాకులాడుతుంది. హోదా, ప్రతిష్ఠలే జీవితంలో ఆనందానికి మూలమని గనుక బుద్ధి నిర్ణయిస్తే, మనస్సు ఎల్లప్పుడూ, ‘ప్రతిష్ఠ... ప్రతిష్ఠ...’ అని ప్రాకులాడుతుంది. మనుష్యులమైన మనం, రోజంతా మనస్సును బుద్ధిచే నియంత్రిస్తుంటాము. మనం బుద్ధిని సరియైన జ్ఞానంచే పెంపొందించుకోవాలి, దానిని మనస్సును సరియైన దిశలో పెట్టడానికి ఉపయోగించుకోవాలి. శ్రీ కృష్ణుడు చెప్పే బుద్ధి యోగమంటే ఇదే - అన్ని వస్తువులూ, మరియు పనులూ, భగవంతుని ప్రీతికోసమే, ఆయన సంతోషం కొరకే ఉన్నాయనే దృఢ సంకల్పము, బుద్ధి యందు పెంపొందించుకోవటం అన్నమాట. దృఢ సంకల్పబుద్ధి ఉన్న ఇటువంటి వ్యక్తి యొక్క చిత్తము, సునాయాసముగానే, భగవంతుని పట్ల అనుసంధానమైపోతుంది.

08:45 - మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి ।
అథ చేత్ త్వమహంకారాన్ న శ్రోష్యసి వినంక్ష్యసి ।। 58 ।।

నీవు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉంటే, నా కృపచే అన్ని అడ్డంకులనూ, మరియు కష్టాలనూ అధిగమించగలవు. కానీ, ఒకవేళ అహంకారముచే నా సలహా వినకపోతే, నీవు నాశనమైపోతావు.

ఏం చెయ్యాలో ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇక ఇప్పుడు తన ఉపదేశాన్ని పాటిస్తే వచ్చే లాభాన్ని చెబుతున్నాడు, మరియు పాటించకపోతే కలిగే పరిణామాలనూ వివరిస్తున్నాడు. జీవాత్మ ఎన్నటికీ, తాను భగవంతుని కంటే స్వతంత్రుడనన్న భావనలో ఉండకూడదు. మనస్సును పూర్తిగా భగవంతుని యందే నిమగ్నం చేసి, మనం భగవంతుడినే సంపూర్ణంగా ఆశ్రయిస్తే, ఆయన కృపచేత అన్ని అవరోధాలూ, మరియు కష్టాలూ తీరిపోతాయి. కానీ, గర్వముచే, సనాతన భగవత్ జ్ఞానము, మరియు శాస్త్రముల కంటే మనకే ఎక్కువ తెలుసనుకుని, ఆయన ఉపదేశాన్ని పెడచెవిన పెడితే, మనం మానవ జన్మ యొక్క ప్రధాన లక్ష్యాన్ని సాధించటంలో విఫలం అవుతాము. ఎందుకంటే, భగవంతుని కంటే ఉన్నతమైదేమీ లేదు, మరియు ఆయన ఉపదేశాన్ని మించిన సందేశమూ లేదు.

10:03 - ఇక మన తదుపరి వీడియోలో, జీవాత్మల గతిని, వాటి వాటి కర్మల అనుగుణంగా భగవంతుడు ఏ విధంగా నిర్దేశిస్తూ ఉంటాడో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, December 4, 2023

అంబరీష చక్రవర్తి! Bhakta Ambarisha


అంబరీష చక్రవర్తి!
కార్తీక మాసంలో అంబరీషోపాఖ్యానం వింటే ఏం జరుగుతుంది?

ప్రతిరోజూ ఉదయం లేవగానే రామాయణం, మధ్యాహ్నం భోజనానంతరం భారతం, రాత్రి నిద్రించే మందు భాగవతం చదవాలనీ, లేదా చదివించుకుని వినాలనీ పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుత కాలంలో అందరికీ అంత వెసులుబాటు లేక పోయినప్పటకీ, కొందరు ప్రవచనకర్తల ద్వారా కొన్ని పురాణ గాథలను వినగలుగుతున్నాము. భాగవతంలో ఎన్నో కథలు ప్రాశస్త్యంలో ఉన్నాయి. అటువంటి వాటిలో ముఖ్యమైనవిగా, ధ్రువ చరిత్ర, ప్రహ్లద చరిత్ర, గజేంద్ర మోక్షం, అంబరీషోపాఖ్యానం వంటివి చోటుచేసుకుంటాయి. భాగవతం, కార్తీక పురాణాలలో పేర్కోనబడిన అంబరీషోపాఖ్యానం ఎంతో ప్రాముఖ్యత చెందినది. గొప్ప విష్ణు భక్తుడిగా పేరుగడించిన అంబరీషుడి వృత్తాంతం ఏమిటి? మాంధాత, ముచికుందుడి వంశంలో జన్మించిన అంబరీషుడు, మహా చక్రవర్తిగా ఎలా పేరుగడించాడు? దుర్వాస మహామునిని సైతం పరుగులు పెట్టించిన అంబరీషుడి శక్తి ఎటువంటిదో, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. మీలో ఎవరైనా షోడశ రాజులలో ఒకరైన మాంధాత మాహారాజు వృత్తాంతాన్నీ, ఇక్ష్వాకు వంశంలో, త్రేతా యుగంలో జన్మించి, ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడికి సహాయం చేసిన ముచికుంద మహారాజు చరిత్రనూ గనుక తెలుసుకోనట్లయితే, వారికి సంబంధించిన వీడియో లింక్స్, ఐ కార్డ్స్ లో పొందుపరిచాను.. ప్రతి వీడియోలో కామెంట్ చేస్తూ, వీడియోను లైక్ చేస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సాహిస్తున్న సహృదయులందరికీ, పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ESTXE40Ben0 ]


అంబరీషుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు. శ్రేష్ఠుడైన అంబరీషుడు, ఏడు దీవులతో కూడిన భూమండల భారాన్ని, తన భుజస్కంధాల మీద మోసి శుభాలను పొంది, అఖండ రాజ్యసంపదలను కలిగి, చెడు నడతలకు లోనుకాకుండా, విష్ణుపూజలతోనే కాలాన్ని వెళ్ళబుచ్చి, విష్ణు సాన్నిధ్యాన్ని చేరి, ప్రశస్తి పొందాడు. సూర్యవంశములో సుప్రసిద్ధుడైన అంబరీషుడు, హరి పూజా దురంధరుడు, సద్గుణ సంపన్నుడు, నిరాడంబరుడు, పరిపాలనా దక్షుడు. పూర్వ జన్మ సుకృతం వల్ల, అతనిలో బాల్యం నుంచీ హరి భక్తి ఏర్పడింది. మనోవాక్కాయ కర్మలతో మహా విష్ణువునే ఆరాధించడం, అతనికి నిత్యకృత్యం అయింది. విష్ణు భక్తులను ఆదరిస్తూ, విష్ణు కీర్తనలను ఆలపిస్తూ, విష్ణు మందిరాన్ని పరిశుభ్రం చేస్తూ అతడు కాలం గడిపేవాడు. ఫలాపేక్ష లేకుండా, సరస్వతీ నదీ తీరంలో అనేక యజ్ఞాలు గావించి, రాజర్షి అనే పేరును కూడా పొందాడు అంబరీషుడు. కొంతకాలానికి అంబరీషుడు సంసార బంధాలకు అతీతుడై, సత్యమార్గంలో, ధర్మ నిష్టతో ప్రవర్తింపసాగాడు. విష్ణువు అతని భక్తికి మెచ్చి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయగల సుదర్శన చక్రాన్ని అతనికి ప్రసాదించాడు. అంబరీషుడు విష్ణుదేవుని కరుణా కటాక్షాలకు పొంగి పులకించాడు.

ఒకసారి అంబరీషుడు తన తోడూనీడ అయిన అర్థాంగి లక్ష్మితో కలసి, ద్వాదశ వ్రతాన్ని ఆచరించాడు. వ్రతాన్ని సంపూర్ణం చేయడానికి, కార్తీక మాసంలో మూడు రాత్రులు ఉపవాసం వుండి, విష్ణువును షోడశోపాచారాలతో అర్చించాడు. బ్రాహ్మణులకు గోవులను దానమిచ్చాడు. యధావిధిగా, వేదవేత్తలను ఆరాధించి, ద్వాదశీ పారాయణ చేయటానికి సిద్ధమయ్యాడు. సరిగ్గా అదే సమయంలో, భాసుర తపో విలాసుడూ, నిరంతర యోగాభ్యాసుడూ అయిన దుర్వాస మహర్షి అక్కడకు విచ్చేశాడు. అనుకోకుండా భోజన సమయానికి అరుదెంచిన అతిధి, సాక్షాత్తు విష్ణుమూర్తితో సమానమని పెద్దల ఉవాచ. తన ఇంటికి వచ్చిన అతిథికి అంబరీషుడు స్వాగతం పలికి, తగిన మర్యాదలు చేసి, తన ఆతిధ్యాన్ని స్వీకరించమని వేడుకున్నాడు. అందుకు ఎంతగానో సంతసించి, స్నానం చేసి వస్తానని యమునా నదికి వెళ్ళాడు, దుర్వాసుడు. అక్కడ స్నానానికై నీటిలోకి దిగి జపం మొదలుపెట్టి, ఆలస్యం చేశాడు. ఎండ మండిపోతున్నది. ద్వాదశీ పారాయణకు సమయం మించిపోతున్నది. ఆ సమయంలో పారాయణ చేయకపోతే, చేసిన వ్రతం అంతా వ్యర్దమైపోతుంది.

అటువంటి క్లిష్ట సయంలో ఏం చేయడానికీ తోచక, అంబరీషుడు పండితులనందరినీ పిలిపించి, విషయాన్ని వివరించాడు. తగిన ఉపాయాన్ని సూచించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడా విద్వాంసులందరూ ఆలోచించి, అతిధి రాలేదని అంబరీష మహారాజు, ద్వాదశీ పారాయణం మానకూడదు. ఆలాగని భోజనం చేయకూడదు. కనుక మధ్యేమార్గంగా జలపానం చేసినట్లయితే, ద్వాదశీవ్రత ఫలితం దక్కుతుందని, అతని ధర్మసందేహాన్ని తీర్చారు. అందుకు సంతోషించి, అంబరీషుడు నీటిని మాత్రమే కొద్దిగా త్రాగి, వ్రతాన్ని పూర్తి చేశాడు. కొంతసేపటికి తన అనుష్టానం ముగించుకుని దుర్వాసుడు రానే వచ్చాడు. జరిగిన సంగతి తెలుసుకుని, ఆగ్రహోదగ్రుడయ్యాడు. నన్ను భోజనానికి పిలిచి, నేను రాకముందే పారాయణ చేసి కూర్చుంటారా? అని పళ్ళు పటపట కొరికాడు. కనుబొమలు ముడివేసి, పెదవులు అదరుచుండగా, తన జట నొకదానిని ఊడపెరికి మంత్రించి, దానిని కృత్య అనే రాక్షసిగా మార్చాడు. అపార్ధంతో కూడిన అహంకారంతో హుంకరించి, ఆ కృత్యను అంబరీషుని మీదకు ప్రయోగించాడు. ప్రళయాగ్నిలాగా విజృంభించి, పెద్ద శూలాన్ని ధరించి, కృత్య భయంకర ఆకారంతో అంబరీషుని పైకి దూకింది.

అంతలోనే వెర్రిమొర్రి కోపంతో కేకలు పెడుతున్న దుర్వాసుడి దురహంకారాన్ని తుత్తునియలు చేయమని, మహావిష్ణువు తన చక్రాయుధాన్ని పంపించాడు. చక్రం రివ్వున వచ్చి, క్షణకాలంలో కృత్యను భస్మం చేసింది. అంతటితో ఆగక, అవక్రపరాక్రమము గల ఆ చక్రం, దుర్వాసుడి వెంట పడింది. ఆ ముక్కోపి దిక్కుతోచక, భయంతో పరుగెత్తసాగాడు. అతడు ఎక్కడెక్కడకు వెళ్ళితే, ఆ చక్రం అక్కడకు వెళ్ళింది. పాతాళానికి వెళితే పాతాళానికీ, సముద్రంలోకి ప్రవేశిస్తే సముద్రంలోనికీ, ఆకాశానికి వెళితే ఆకాశానికీ, దిక్కులకు పోతే దిక్కులకూ వెన్నంటి పోసాగింది. సుదర్శన చక్రపు అగ్నిజ్వాలలకు తట్టుకోలేక, గిలగిల కొట్టుకుంటూ, దుర్వాసుడు పరుగెత్తుతూ పోయి, సత్యలోకం చేరాడు. కాపాడమని బ్రహ్మదేవుని ప్రార్థించాడు. ఆయన సుదర్శన చక్రాన్ని మరల్చే శక్తి తనకు లేదన్నాడు. ఈశ్వరుడు, చక్రాన్ని ఉపసంహరించాలంటే ఆ చక్రధరుడే రావాలన్నాడు. దుర్వాసునికి దిక్కు తోచలేదు. విష్ణుమూర్తిని శరణు వేడడం కంటే, వేరే మార్గం లేదని నిర్ణయించుకున్నాడు.

శోకంతో ఆక్రోశిస్తూ, వెంటనే వైకుంఠానికి చేరాడు. లక్ష్మి సమేతుడైయున్న శ్రీమహావిష్ణువుకు, దుర్వాసుడు మొరపెట్టుకున్నాడు. అప్పుడు శ్రీహరి, "దుర్వాసా, నేను భక్త పరాధీనుణ్ణి. గోమాత వెంటనంటి నుండే గోవత్సలులాగా, నేను నా భక్తులను అనుసరిస్తుంటాను. అందువలన ఆ చక్రాన్ని ఉపసంహరించే శక్తి నాకంటే ఎక్కువగా, ఆ అంబరీషుడికే వుంది. వెంటనే వెళ్ళి అతన్ని ఆర్దించు" అని పంపించాడు. దుర్వాసమహర్షి తన అహంకారినికీ తన ప్రవర్తనకూ ఎంతగానో పశ్చాత్తాపపడ్డాడు. ఇక తప్పేదేముంది? అంబరీషుడే శరణ్యం. లేకుంటే చక్రజ్వాలామాలికలు తనను కాల్చివేస్తాయి. చకచకామని వెళ్ళి, అంబరీషుడిని "పాహి పాహి" అని ప్రార్థించాడు. సహజంగానే సాధు స్వభావుడైన అంబరీషుడు, దాయార్ద్ర హృదయుడై, దుర్వాసుణ్ణి ఓదార్చాడు. శాంతించమని చక్రాయుధాన్ని పరి పరి విధాలా స్తుతించాడు. చక్రం శాంతించి, ఆరోగమించగా, దుర్వాసుడి ప్రాణాలు కుదుటపడ్డాయి. ఆ ముని తన అవివేకానికి సిగ్గుపడ్డాడు. భక్తి ప్రభావాన్ని కన్నులారా చూశాడు. భక్తులంటే ఏమిటో, వారి శక్తి ఎంత గొప్పదో తెలుసుకొనగలిగాడు.

వెంటనే చేతులెత్తి, తనను క్షమించమని అంబరీషుడిని వేడుకున్నాడు. అంబరీషుడు దుర్వాసమహర్షికీ, వేదవేత్తలైన బ్రాహ్మణులకూ తృప్తిగా భోజనం పెట్టి, అనంతరం తన భార్యతో కలసి భుజించాడు. ద్వాదశీవ్రతం విజయవంతంగా పరి సమాప్తమయ్యింది. అంబరీషుని వద్ద సెలవు తీసుకుని, దుర్వాసుడు తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. భక్తునికి భగవంతుడు ఏవిధంగా లోబడివుంటాడో, వారిద్దరికీ గల బంధం ఎటువంటిదో, అంబరీషుడి వృత్తాంతం వెల్లడిస్తుంది. అంతేకాదు, భగవంతునికంటే ఒక్కొక్కసారి, భక్తుడే శక్తిమంతుడని కూడా మనకు స్పష్టమవుతుంది. భగవంతుడిని ప్రభువుగా భావించి, సర్వకర్మలనూ ఆయనకే అంకితం చేయడం, నవవిధ భక్తి మార్గాలలో ఒకటైన ‘దాస్య భక్తి’గా పిలువబడుతుంది. దాస భక్తితో, స్వామికి దాసుడననే భావముతో సేవిస్తూ, భగవంతునికి దాసుడై, సర్వమూ ఆ భగవంతునికి అర్పించడమే దాస్యం. సప్తద్వీప విశాల భూభారాన్ని వహించి, విష్ణు సేవతో కాలం గడిపి, సద్గుణ సంశోభితుడైన అంబరీష చక్రవర్తి భక్తి, అటువంటి దాస్య భక్తికి ఒక ఉదాహరణ.

ఓం నమో భగవతే వాసుదేవాయ!

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...