Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Showing posts with label Chapter 18. Show all posts
Showing posts with label Chapter 18. Show all posts

Wednesday, January 10, 2024

విశ్వరూపం! భగవద్గీత Bhagavad Gita Chapter 18


విశ్వరూపం!
యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడి ద్వారా పొందబడిన ‘సర్వోన్నత యోగ శాస్త్రము’!

'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (75 – 78 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 75 నుండి 78 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/jh-LR5NbMvk ]


పాపముల నుండి విముక్తి పొంది, పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకములకు చేరుకోవడానికి మార్గం ఏంటో సంజయుడి మాటలలో విందాము..

00:50 - వ్యాసప్రసాదాఛ్చ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరమ్ ।
యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయమ్ ।। 75 ।।

వేదవ్యాసుని అనుగ్రహం చేత, నేను ఈ యొక్క సర్వోత్కృష్ట పరమ రహస్యమైన యోగమును, స్వయంగా యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడి నుండి తెలుసుకున్నాను.

శ్రీ కృష్ణ ద్వైపాయన వ్యాసదేవుడినే మహర్షి వేద వ్యాసుడని కూడా అంటారు; ఆయన సంజయుని యొక్క ఆధ్యాత్మిక గురువు. తన గురువు గారి అనుగ్రహం చేత, సంజయుడు హస్తినాపుర రాజమందిరంలోనే కూర్చుని, కురుక్షేత్ర యుద్ధ భూమిలో జరిగేదంతా తెలుసుకోవటానికి, ఆయనకు దివ్యదృష్టి ప్రసాదించబడింది. తన గురువు గారి కృప వలననే, తనకు సర్వోన్నత యోగ శాస్త్రమును స్వయంగా, యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడి ద్వారా వినే అవకాశం లభించిందని, ఇక్కడ సంజయుడు ఒప్పుకుంటున్నాడు. బ్రహ్మ సూత్రాలూ, పద్దెనిమిది పురాణాలూ, మహాభారతము, ఇంకా ఇతర గ్రంథాలను వ్రాసిన వేద వ్యాసుడు, ఒక భగవత్ అవతారము. ఆయనకు దివ్యదృష్టి వంటి శక్తులున్నాయి. ఈ విధంగా ఆయన, కేవలం శ్రీ కృష్ణుడికీ, అర్జునుడికీ మధ్య జరిగిన సంభాషణనే కాక, సంజయుడికీ, ధృతరాష్ట్రుడికీ మధ్య జరిగిన సంభాషణను కూడా విన్నాడు. అందువలన, ఆయన భగవద్గీత లో ఈ రెండు సంభాషణలనూ పేర్కొన్నాడు.

02:14 - రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతమ్ ।
కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః ।। 76 ।।

సర్వోత్కృష్ట శ్రీ కృష్ణ భగవానునకూ, మరియు అర్జునుడికీ మధ్య జరిగిన ఈ మహాద్భుతమైన సంవాదమును, పదేపదే గుర్తుచేసుకుంటూ ఓ రాజా, నేను మళ్ళీ మళ్ళీ ఆనందిస్తున్నాను.

ఆధ్యాత్మిక అనుభవమనేది, సమస్త భౌతిక ఆనందాలనూ ఒక్కచోట కూర్చిన దానికన్నా ఎక్కువ హర్షమునూ, తృప్తిని కలిగించే ఆనందమునూ ఇస్తుంది. సంజయుడు అటువంటి ఆనందమును అనుభవిస్తూ, తన అనుభవాన్ని అంధుడైన ధృతరాష్ట్రునితో పంచుకుంటున్నాడు. ఈ అద్భుతమైన సంవాదమును గుర్తుచేసుకుంటూ, ఆయన దివ్య ఆనందమును అనుభవిస్తున్నాడు. ఈ గీతా శాస్త్రములో ఉన్న జ్ఞానము యొక్క మహనీయతనూ, మరియు సంజయుడు చూసిన లీలల యొక్క దైవత్వమునూ ఇది సూచిస్తున్నది.

03:11 - తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః ।
విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునఃపునః ।। 77 ।।

అలాగే, ఆ శ్రీ కృష్ణుడి అత్యద్భుతమైన, ఆశ్చర్యకరమైన విశ్వ రూపమును గుర్తుచేసుకుంటూ, ఆశ్చర్యచకితుడనై, మహదానందముతో, పదేపదే పులకించి పోతున్నాను.

మహోన్నత యోగులకు కూడా అరుదుగా కనిపించే భగవంతుని విశ్వ రూప దర్శన భాగ్యము, అర్జునుడికి కలిగింది. అర్జునుడు, ఆయన యొక్క భక్తుడు, మరియు స్నేహితుడు. ఆయనకు చాలా ప్రియమైన వాడు కావున, తన విశ్వరూపమును చూపిస్తున్నానని, శ్రీ కృష్ణుడు చెప్పాడు. సంజయుడు కూడా ఆ విశ్వ రూపమును చూశాడు. ఎందుకంటే, భగవంతుని దివ్యలీలలలో పాలు పంచుకునే భాగ్యము, ఆయనకు కథకుడిగా లభించింది. ఊహించని భగవదనుగ్రహము, ఒక్కోసారి మన దారిలో వస్తుంటుంది. దానిని సరిగ్గా ఉపయోగించుకుంటే, మనం సాధనలో అత్యంత వేగంతో ముందుకెళ్లవచ్చు. సంజయుడు పదేపదే తాను చూసిన దానిని గుర్తుచేసుకుంటూ, భక్తి ప్రవాహంలో ఓలలాడి పోతున్నాడు.

04:20 - యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః ।
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ ।। 78 ।।

ఎక్కడెక్కడైతే యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడూ, మరియు అత్యున్నత విలుకాడైన అర్జునుడూ ఉంటారో, అక్కడ సకల ఐశ్వర్యమూ, సర్వ విజయమూ, సకల-సమృద్ధీ, మరియు ధర్మమూ ఉంటాయి. ఇది నా నిశ్చిత అభిప్రాయము.

ఈ శ్లోకంతో, ఒక గంభీరమైన ప్రకటన ఇస్తూ, భగవద్గీతను ముగించాడు. ధృతరాష్ట్రుడు యుద్ధం యొక్క ఫలితం పట్ల ఆందోళనతో ఉన్నాడు. రెండు సైన్యముల పరస్పర భౌతిక పరమైన సామర్థ్యముల లెక్కలు వ్యర్థమని, సంజయుడు అతనికి చెబుతున్నాడు. ఈ యుద్ధంలో ఒక్కటే తీర్పు ఉంటుంది - విజయం ఎల్లప్పుడూ భగవంతుడు, మరియు ఆయన శుద్ధ భక్తుడున్న పక్షానే ఉంటుంది; అదే పక్షాన, మంచితనమూ, ఆధిపత్యము, మరియు సమృద్ధి కూడా ఉంటాయి. భగవంతుడు సర్వ స్వతంత్రుడు, స్వయం సమృద్ధిగల జగదీశ్వరుడు, మరియు అర్చన-ఆరాధనలకు అత్యంత యోగ్యుడు. ఆయనకు సరితూగేవారు ఎవరూ లేరు; ఆయనకంటే గొప్పవారూ ఉండరు; తన అసమానమైన మహిమను ప్రకటించటానికి తగిన వాహకం, ఆయనకు కావాలి. ఆయనకు శరణాగతి చేసిన జీవాత్మ, భగవంతుని యశస్సును ప్రకాశింపచేయటానికి, అటువంటి ఒక చక్కటి వాహకంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఎక్కడైతే సర్వోత్కృష్ట పరమేశ్వరుడూ, మరియు ఆయన యొక్క పరిపూర్ణ భక్తుడూ ఉంటారో, పరమ సత్యము యొక్క తేజస్సు ఎల్లపుడూ అసత్యపు చీకటిని జయిస్తుంది. ఇంకే ఇతర ఫలితమూ ఉండజాలదు.

ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీ కృష్ణార్జునసంవాదే మోక్ష సన్యాస యోగోనామ అష్టాదశోధ్యాయ:

06:17 - శ్రీ మద్భగవద్గీతలోని జ్ఞానషట్కం, పద్దెనిమదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగంలోని, 78 శ్లోకాలూ సంపూర్ణం. భగవద్గీతలోని 18 అధ్యాయాలూ, 18 యోగాలలో ఉన్న మొత్తం 701 శ్లోకాలు పూర్తయ్యాయి. స్వయానా భగవంతుడు వివరించిన ఆత్మజ్ఞానం, కర్మజ్ఞానం గురించీ, భగవద్గీతలోని అంతరార్థం గురించీ, ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలనే కోరికతో మేము చేసిన ఈ ప్రయత్నాన్ని మీరందరూ ఆదరించినందుకు, కృతజ్ఞతాభివందనాలు..

కృష్ణం వందే జగద్గురుం!

Wednesday, January 3, 2024

భౌతిక జ్ఞానం! భగవద్గీత Bhagavad Gita Chapter 18


భౌతిక జ్ఞానం!
భగవత్ కృపతో పొందవలసిన ‘ఆధ్యాత్మిక జ్ఞానము’ను కొని, అమ్మగలమా?

'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (71 – 74 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 71 నుండి 74 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/PfGzGGEorXI ]


పాపముల నుండి విముక్తి పొంది, పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకాలకు చేరుకోవడానికి మార్గం ఏంటో చూద్దాము..

00:49 - శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః ।
సోఽపి ముక్తః శుభాల్లోకాన్ ప్ర్రాప్నుయాత్ పుణ్యకర్మణామ్ ।। 71 ।।

శ్రద్ధా విశ్వాసముతో, అసూయ లేకుండా, ఈ జ్ఞానాన్ని కేవలం విన్న వారు కూడా పాపముల నుండి విముక్తి పొంది, పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకములకు చేరుకుంటారు.

శ్రీ కృష్ణుడికీ, అర్జునుడికీ మధ్య జరిగిన ఈ సంభాషణను అర్థం చేసుకునే వివేక సామర్థ్యము అందరికీ ఉండకపోవచ్చు. అటువంటి వారు కేవలం శ్రద్ధావిశ్వాసముతో దీనిని కేవలం విన్నా సరే, వారు కూడా లాభపడతారని, శ్రీకృష్ణుడు హామీ ఇస్తున్నాడు. వారిలోనే స్థితమై ఉన్న భగవంతుడు, వారి నిష్కపటమైన ప్రయాస గమనించి, వారిని తగిన రీతిలో సత్కరిస్తాడు. జగద్గురు శంకరాచార్యుల వారి శిష్యుడు, సనందుడి గురించిన ఒక కథ, ఈ విషయాన్ని చక్కగా వివరిస్తుంది. సనందుడు అంతగా చదువు రాని వాడు. గురువు గారి ఉపదేశాన్ని, ఇతర శిష్యులలా అర్థం చేసుకోలేక పోయేవాడు. కానీ, శంకరాచార్యుల వారు ప్రవచనం చెపుతుంటే, అత్యంత శ్రద్ధతో, మరియు గొప్ప విశ్వాసంతో వినేవాడు. ఒక రోజు అతను, గురువు గారి బట్టలను నదికి ఆవలి ఒడ్డున ఉతుకుతున్నాడు. ఉపదేశం చెప్పే సమయం అయింది. ఇతర శిష్యులు గురువుగారిని, ఉపదేశం ప్రారంభించమని అభ్యర్థించారు. శంకరాచార్యులు, ‘కాసేపు ఆగుదాము. సనందుడు ఇక్కడ లేడు.’ అని బదులిచ్చారు. ‘కానీ గురువుగారూ, అతనికేమీ అర్థం కాదు’ అని అభ్యర్థించారు మిగతా శిష్యులు. ‘అది నిజమే; కానీ అతను అత్యంత శ్రద్ధావిశ్వాసంతో వింటాడు. కాబట్టి అతనిని నిరాశ పరచదలుచుకోలేదు’, అన్నారు శంకరాచార్యుల వారు. ఆ తర్వాత శ్రద్ధ యొక్క మహిమను చూపించటానికి శంకరాచార్యుల వారు, ‘సనందా! దయచేసి ఇలా రా.’ అని పిలిచారు. గురువు గారి మాటలు విన్న సనందుడు ఏమాత్రం సంకోచించలేదు. నీటిపైనే పరిగెత్తాడు. ఆయన పాదాలు పెట్టిన చోటల్లా, తామర పూవులు పైకొచ్చి ఆయనకు ఆధారంగా నిలబడ్డాయి. అలా, ఆవలి ఒడ్డుకి వెళ్లి, గురువు గారికి నమస్కరించాడు. అదే సమయంలో, చక్కటి సంస్కృతంలో, ఒక గురు స్తుతి ఆయన నోటినుండి వెలువడింది. మిగతా శిష్యులు దీనిని వింటూ ఆశ్చర్యానికి గురయ్యారు. తామర పూవులు ఆయన పాదాల క్రిందకు వచ్చాయి కాబట్టి, ఆయన పేరు ‘పద్మపాదుడు’ అయింది. అంటే, పాదముల క్రింద తామర పూవులుగలవాడని అర్థం. ఆయన శంకరాచార్యుల వారి నలుగురు ప్రధాన శిష్యులలో ఒకడయ్యాడు. మిగతా వారు - సురేశ్వరాచార్య, హస్తామలక, మరియు త్రోటకాచార్య. ఈ విధంగానే, శ్రద్ధగా ఈ పవిత్ర సంభాషణను కేవలం విన్న వారు కూడా, క్రమక్రమంగా పరిశుద్ధి అవుతారని, ఈ పై శ్లోకములో శ్రీ కృష్ణుడు అర్జునుడికి హామీ ఇస్తున్నాడు.

03:47 - కచ్చిదేతఛ్చ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా ।
కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ ।। 72 ।।

ఓ అర్జునా, నేను చెప్పినది ఏకాగ్రతతో విన్నావా? నీ యొక్క అజ్ఞానము, మోహభ్రాంతి నిర్మూలించబడినవా?

శ్రీ కృష్ణుడు అర్జునుడి గురువు స్థానములో ఉన్నాడు. గురువు గారు సహజంగానే, తన శిష్యుడు విషయాన్నంతా బాగా అర్థం చేసుకున్నాడా లేదా అని అడుగుతాడు. ఇలా అడగటం వెనుక ఉన్న కృష్ణుడి ఉద్దేశ్యం ఏమిటంటే, ఒకవేళ అర్జునుడు గనక అర్థం చేసుకోలేకపోతే, తను మళ్ళీ చెప్పటానికి, లేదా ఇంకా అర్థ వివరణ చేయటానికి సిద్ధంగా ఉన్నానని తెలియచేయటమే. ఆ ఉద్దేశ్యంతోనే, అర్జునుడిని శ్రీ కృష్ణుడడుగుతున్నాడు. నేను చెప్పిన విషయాలను ఏకాగ్రతతో విన్నావా? నీ మనస్సును అలుముకున్న చీకటి తొలగిపోయిందా? అని..

04:44 - అర్జున ఉవాచ ।
నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత ।
స్థితోఽస్మి గతసందేహః కరిష్యే వచనం తవ ।। 73 ।।

అర్జునుడు ఇలా అంటున్నాడు: ఓ అచ్యుతా, నీ కృపచే నా యొక్క మోహభ్రాంతి నిర్మూలించబడినది. నేను జ్ఞానములో స్థితుడనై ఉన్నాను. నాకు ఇప్పుడు సందేహాలు ఏవీ లేవు. నీ ఉపదేశాల ప్రకారం చేస్తాను.

ప్రారంభంలో, అర్జునుడు ఒక విస్మయ పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఆ పరిస్థితిలో తన కర్తవ్యము పట్ల అయోమయానికి గురయ్యాడు. అతనిలో దుఃఖము, శోకముచే నిండిపోయి, ఆయుధాలు విడిచి, తన రథంలో కూలబడిపోయాడు. తన శరీర ఇంద్రియములపై దాడి చేసిన శోకానికి, ఎటువంటి ప్రత్యుపాయం దొరకడంలేదని ఒప్పుకున్నాడు. కానీ, ఇప్పుడు తనకు తానే పూర్తిగా మారిపోయినట్లుగా తెలుసుకున్నాడు. తనకు జ్ఞానోదయమయినదనీ, ఇక ఏమాత్రమూ గందరగోళమైన చిత్తము లేదనీ,  ప్రకటిస్తున్నాడు. భగవత్ సంకల్పానికి తనను తాను అర్పించుకుని, ఇక శ్రీ కృష్ణుడు చెప్పిన విధంగా చేస్తానని ప్రకటిస్తున్నాడు. ఇదే అతనిపై భగవత్ గీత ఉపదేశం చూపిన ప్రభావము. కానీ, త్వత్ ప్రసాదాన్ మయాచ్యుత, అంటున్నాడు. అంటే, ‘ఓ శ్రీ కృష్ణా, కేవలం నీ ఉపదేశం కాదు. నిజానికి నీ కృపయే నా అజ్ఞానమును తొలగించినది.’ అని వక్కాణిస్తున్నాడు. భౌతిక జ్ఞాన సముపార్జనకు, కృప అవసరం లేదు. మనం ఓ విద్యాలయానికి కానీ, ఉపాధ్యాయునికి కానీ డబ్బు కట్టి, ఆ జ్ఞానమును తెలుసుకోవచ్చు. కానీ, ఆధ్యాత్మిక జ్ఞానమును కొనలేము, అమ్మలేము. అది కృప ద్వారా ఇవ్వబడుతుంది, విశ్వాసము, వినమ్రత ద్వారా అందుకోబడుతుంది. కాబట్టి, మనం భగవద్గీతను అహంకార దృక్పథంతో చేరి, నేను చాలా తెలివిగలవాడిని, ఈ ఉపదేశం యొక్క విలువ ఏమిటో వెలకడతానని అనుకుంటే, భగవద్గీతను ఎన్నటికీ అర్థం చేసుకోలేము. అలాంటి దృక్పథంలో ఉంటే, మన బుద్ధి ఆ శాస్త్రములో ఏదో తప్పు అనిపించే దానిని పట్టుకుని, దాని మీదే అలోచించి, దాని వల్ల ఆ మొత్తం శాస్త్రాన్నే తప్పని తిరస్కరిస్తుంది. భగవద్ గీతపై ఎన్నెన్నో వ్యాఖ్యానాలు వ్రాయబడ్డాయి. గత ఐదు వేల సంవత్సరాలలో, ఈ దివ్య ఉపదేశం యొక్క అసంఖ్యాకమైన పాఠకులు కూడా ఉన్నారు. కానీ, వీరిలో ఎంతమందికి అర్జునుడిలా జ్ఞానోదయమయింది? ఒకవేళ మనం నిజంగా ఈ జ్ఞానాన్ని అందుకోదలిస్తే, మనం కేవలం చదవటమే కాదు, విశ్వాసము మరియు ప్రేమయుక్త శరణాగతి ద్వారా, శ్రీ కృష్ణుడి కృపను ఆకర్షించాలి. ఆ తరువాత మనకు భగవత్ గీత యొక్క సారాంశము, ఆయన కృపచే అర్థమవుతుంది.

07:35 - సంజయ ఉవాచ ।
ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః ।
సంవాదమిమమశ్రౌషమ్ అద్భుతం రోమహర్షణమ్ ।। 74 ।।

సంజయుడు ఇలా అంటున్నాడు: ఈ విధంగా నేను, వాసుదేవుని పుత్రుడైన శ్రీ కృష్ణుడికీ, మరియు మహాత్ముడు, ప్రిథ పుత్రుడూ అయిన అర్జునుడికీ మధ్య జరిగిన సంవాదమును విన్నాను. ఇది ఎంత అద్భుతమైనదంటే, నా రోమములు నిక్కబొడుచుకుంటున్నాయి.

ఈ విధంగా సంజయుడు, ధృతరాష్ర్ట మహారాజుకు భగవద్గీత అనే దివ్య ఉపదేశమును విన్నవించుటను ముగిస్తున్నాడు. అర్జునుడిని మహాత్ముడని అంటున్నాడు. ఎందుకంటే, అతను శ్రీ కృష్ణుడి యొక్క ఉపదేశాన్ని, మరియు సలహానూ పాటించాడు. దానిచే మిక్కిలి వివేకవంతుడయినాడు. సంజయుడు ఇక ఇప్పుడు, ఆ దివ్య సంవాదమును వింటూ, తాను ఎంత ఆశ్చర్యానికీ, మరియు సంభ్రమానికీ గురయ్యాడో చెబుతున్నాడు. రోమాలు నిక్కబొడుచు కోవటం అనేది, గాఢమైన భక్తికి ఉన్న ఒక లక్షణం. భక్తిరసామృత సింధు, ఇలా పేర్కొంటున్నది: ‘భక్తి తన్మయత్వంలో వచ్చే ఎనిమిది లక్షణాలు ఏమిటంటే: కదలిక లేకుండా స్థంభించిపోవటం, చెమట పట్టడం, రోమములు నిక్కబొడుచు కోవటం, స్వరం గద్గదమై పోవటం, వణకటం, మొఖం రంగు పీలగా అయిపోవటం, కన్నీరు కారటం, మరియు మూర్ఛ పోవటం.’ సంజయుడు ఇటువంటి గాఢమైన భక్తి యుక్త భావములను అనుభూతి చెందుతున్నాడు. అందుకే ఆయన రోమములు దివ్య ఆనందముచే నిక్కబొడుచుకున్నాయి.

09:13 - ఇక మన తదుపరి వీడియోలో, రాజ్యంలో ఉన్న సంజయుడికి, రణరంగంలో జరుగుతున్న విషయాలను తెలుసుకోగలిగే రహస్య యోగము ఎలా లభ్యమయిందో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Wednesday, December 13, 2023

ఉపకారస్మృతి! భగవద్గీత Bhagavad Gita Chapter 18


ఉపకారస్మృతి!
మనం నడిచే నేల, చూసే సూర్యుని వెలుగు, పీల్చే గాలి, త్రాగే నీరు ఎక్కడివి?

'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (59 – 62 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 59 నుండి 62 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/AQTTQeffwzY ]


జీవాత్మల గతిని, వాటి వాటి కర్మల అనుగుణంగా భగవంతుడు ఏ విధంగా నిర్దేశిస్తూ ఉంటాడో చూద్దాము..

00:50 - యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే ।
మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి ।। 59 ।।

ఒకవేళ నీవు అహంకారముచే ప్రేరితమై, ‘నేను యుద్ధం చేయను’ అని అనుకుంటే, నీ నిర్ణయం ఎలాగూ వ్యర్థమై పోతుంది. ఎందుకంటే, నీ యొక్క క్షత్రియ భౌతిక స్వభావమే, నిన్ను యుద్ధం చేయటానికి పురికొల్పుతుంది. 

శ్రీ కృష్ణుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. మనకు ఏది నచ్చితే అది చేయటానికి మనకు పూర్తి స్వేచ్ఛ ఉందని, మనం ఎన్నడూ అనుకోకూడదు. ఆత్మ అనేది, పూర్తి స్వతంత్రమైన అస్తిత్వమును కలిగి ఉండదు. అది భగవంతుని సృష్టిపై ఎన్నో విధాలుగా ఆధారపడి ఉంటుంది. భౌతిక బద్ధ స్థితిలో, అది ప్రకృతి త్రిగుణముల ఆధీనములో ఉంటుంది. ఈ గుణముల సంయోగమే, మన స్వభావాన్ని ఏర్పరుస్తుంది. అది ఆదేశించినట్టుగా మనం ప్రవర్తించవలసి ఉంటుంది. కాబట్టి మనకు, ‘నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను’ అనే పరిపూర్ణ స్వేచ్ఛ లేదు. భగవంతుని యొక్క, మరియు శాస్త్రముల సత్-సందేశాన్నీ, లేదా ప్రకృతి యొక్క బలవంత ఒత్తిడినీ, ఈ రెంటిలో ఏదో ఒక దానిని ఎంచుకోవలసి ఉంటుంది. స్వభావసిద్ధంగా అర్జునుడు ఒక యోధుడు. ఒకవేళ గనక అహంకారముతో, మంచి సలహాని పాటించనని ఆయన నిర్ణయించుకున్నా, ఆయన యొక్క క్షత్రియ స్వభావము, అతనిని తప్పకుండా యుద్ధానికి ప్రేరేపిస్తుంది.

02:20 - స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా ।
కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవశోఽపి తత్ ।। 60 ।।

ఓ అర్జునా, మోహభ్రాంతిచే నీవు ఏదైతే పనిని చేయనని అంటున్నావో, నీ యొక్క సహజ ప్రకృతి స్వభావముచే జనించిన ప్రేరణచే, ఆ పనినే చేయటానికి ప్రేరేపింపబడతావు.

తన యొక్క హెచ్చరింపు మాటలను కొనసాగిస్తూ, శ్రీ కృష్ణుడు ఇంతకు క్రితం చెప్పిన విషయాన్నే, మరింత విశదీకరిస్తున్నాడు. ఆయన అనేదేమిటంటే, నీ యొక్క పూర్వ జన్మ సంస్కారాల వలన, నీకు క్షత్రియ స్వభావమున్నది. నీ యొక్క సహజ గుణములైన వీరత్వము, పరాక్రమము, మరియు దేశభక్తి, నిన్ను యుద్ధం చేయటానికే పురిగొల్పుతాయి. నీకు పూర్వ జన్మలలో, మరియు ఈ జన్మలో కూడా, ఒక యోధుడిగా నీ కర్తవ్యమును నిర్వర్తించటానికే, శిక్షణ ఇవ్వబడినది. నీ కళ్ళ ముందే ఇతరులకు అన్యాయం జరుగుతుంటే, ఊరికే ఉండటం నీకు సాధ్యమవ్వదు. నీ స్వభావము, మరియు లక్షణాలు ఎలాంటివంటే, నీవు ఎక్కడ దుర్మార్గాన్ని చూసినా, దానిని తీవ్రంగా అడ్డుకుంటావు. కాబట్టి, నీ సహజ స్వభావంచే ప్రేరేపితమై చేసేకన్నా, నా ఉపదేశాన్ని అనుసరించి యుద్ధం చేయటమే నీకు మేలు.. అనే సందేశాన్ని ఇస్తున్నాడు భగవంతుడు.

03:43 - ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఽర్జున తిష్ఠతి ।
భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ।। 61 ।।

 ఓ అర్జునా, పరమేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉంటాడు. భౌతిక శక్తిచే తయారు చేయబడిన యంత్రమును అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని, వాటి వాటి కర్మల అనుగుణముగా, ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు.

భగవంతునిపై జీవాత్మ ఆధారపడి ఉండటాన్ని వక్కాణిస్తూ, శ్రీ కృష్ణుడు ఇలా అంటున్నాడు. నేను చెప్పినట్టు విన్నా, వినకపోయినా, నీవు ఎల్లప్పుడూ నా ఆధీనంలోనే ఉంటావు. నీవు వసించి ఉండే ఈ శరీరము, నా భౌతిక శక్తిచే తయారు చేయబడినది. నీ యొక్క పూర్వ కర్మల ప్రకారం, నీకు తగిన శరీరమును ఇచ్చాను. నేను కూడా దానిలోనే కూర్చుని ఉన్నాను. నేను నీ సమస్త ఆలోచనలను, మాటలను, మరియు చేష్ఠలను లిఖించుకుంటున్నాను. కాబట్టి, నీవు ప్రస్తుతం చేసే దానిని బట్టి, నీ భవిష్యత్తు ఎలా ఉండాలని కూడా నిర్ణయిస్తాను. నీవు నాకంటే స్వతంత్రుడవని ఎన్నడూ తలంచకు. కాబట్టి అర్జునా, నీ శ్రేయస్సు కోసమే, నీవు నాకు శరణాగతి చేయటమే మంచిది. అని అర్జునుడికి విశదీకరిస్తున్నాడు.

05:02 - తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత ।
తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ ।। 62 ।।

ఓ భరతా, సంపూర్ణ హృదయ పూర్వకముగా, కేవలం ఆయనకే అనన్య శరణాగతి చేయుము. ఆయన కృపచే, నీవు పరమ శాంతిని, మరియు నిత్యశాశ్వత ధామమును పొందెదవు.

భగవంతునిపైనే ఆధారపడి ఉన్న జీవాత్మ, తన ప్రస్తుత దురవస్థ నుండి బయట పడటానికీ, మరియు సర్వోన్నత పరమ లక్ష్యమును సాధించటానికి కూడా, భగవత్ కృప పైనే ఆధారపడి ఉండాలి. కేవలం సొంత ప్రయత్నం మాత్రమే దీనికి సరిపోదు. కానీ, భగవంతుడు తన కృపను ప్రసాదిస్తే, ఆయన తన దివ్య జ్ఞానమునూ, మరియు దివ్య ఆనందమునూ, ఆ జీవాత్మకు ప్రసాదించి, దానిని భౌతిక శక్తి యొక్క మాయా బంధనముల నుండి విడిపిస్తాడు. తన కృపచేత, వ్యక్తి నిత్య శాశ్వత మోక్షమును, మరియు అనశ్వరమైన ధామమును పొందుతాడని, శ్రీ కృష్ణుడు వక్కాణిస్తున్నాడు. కానీ, ఆ కృపను పొందటానికి జీవాత్మ, భగవత్ శరణాగతి ద్వారా అర్హతను సంపాదించుకోవాలి. ఈ లోకంలోని ఒక తండ్రి కూడా, తన కొడుకు ప్రయోజకుడై, వాటిని బాధ్యతతో సన్మార్గంలో ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకునే వరకూ, తన విలువైన సంపత్తిని అతనికి అప్పచెప్పడు. అదే విధంగా, భగవత్ కృప అనేది, ఏదో ఆషామాషీ వ్యవహారం కాదు. దానిని ప్రసాదించటానికి, సంపూర్ణ, సహేతుక, తర్కబద్ధ నియమాలు ఆధారంగా ఉన్నాయి. ఒకవేళ భగవంతుడు తన కృపను ప్రసాదించటంలో నియమాలు పాటించకపోతే, జనుల విశ్వాసము దెబ్బతింటుంది. భగవంతుడు తన కృపను, మనకు అర్హత లేకుండానే ప్రసాదిస్తే, ఇంతకు క్రితం మహాత్ములైన వారు, ఈ విధంగా అనుకుంటారు. ‘ఏమిటిది? మేము ఎన్నో జన్మల తరబడి, మమ్ములను మేము పరిశుద్ధి చేసుకోవటానికి కష్టపడ్డాము. ఆ తదుపరి భగవంతుని కృప లభించింది. కానీ ఈ వ్యక్తి తనను తాను యోగ్యుడిగా చేసుకోకముందే, ఆయన కృప లభించినది. అలా అయితే, ఆత్మ-ఉద్ధరణ కోసం మా పరిశ్రమ అంతా అర్థరహితమైనది.’ అని అనుకుంటారు. దానికి సమాధానంగా, శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:

‘ఆ బ్రహ్మ దేవుడినీ మరియు ఇతరులను సృష్టించిన ఆ సర్వోత్కృష్ట తత్త్వమును ఆశ్రయిస్తున్నాము. ఆయన కృపచేతనే, ఆత్మ మరియు బుద్ధి, జ్ఞానప్రకాశితమౌతాయి.’ 

భగవత్ శరణాగతి యొక్క ఆరు అంగములు ఏమిటంటే:

1. భగవంతుని సంకల్పమునకు అనుగుణముగానే కాంక్షించటం: సహజ సిద్ధంగానే, మనం ఆ భగవంతుని సేవకులము. తన స్వామి కోరికను తీర్చటమే, సేవకుని కర్తవ్యము. కాబట్టి, శరణాగతి చేసిన భగవత్ భక్తులుగా, మన సంకల్పాన్ని, దివ్య భగవత్ సంకల్పంతో ఏకం చేయాలి. ఒక ఎండుటాకు, వీచేగాలికి లొంగిపోతుంది. అంటే శరణాగతి చేస్తుంది. ఆ వీచేగాలి, దాన్ని పైకిలేపినా, ముందుకు, లేదా వెనుకకు పడవేసినా, లేదా నేలపై పడవేసినా – అదేమీ ఫిర్యాదు చేయదు. అదే విధంగా, మనం కూడా భగవంతుని ఆనందమే మన ఆనందం అని ఉండటం నేర్చుకోవాలి.

2. భగవంతుని సంకల్పమునకు వ్యతిరేకంగా కోరుకోకుండా ఉండటం: మన జీవితంలో మనకు లభించినదంతా, మన పూర్వ, ప్రస్తుత కర్మల అనుసారమే ఉంటుంది. కానీ, కర్మ ఫలములు వాటంతట అవే రావు. భగవంతుడు వాటిని లిఖించి, వాటి ఫలములను సరైన సమయంలో ఇస్తుంటాడు. భగవంతుడే స్వయంగా ఈ ఫలములను ఇస్తుంటాడు కాబట్టి, మనం వాటిని ప్రశాంత చిత్తముతో స్వీకరించటం నేర్చుకోవాలి. సాధారణంగా జనులు తమకు సంపద, కీర్తి, ఆనందము, మరియు విలాసాలు లభించినప్పుడు, భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పటం మరచిపోతారు. కానీ, కష్టాలు ఎదురైనప్పుడు, ‘ఎందుకు భగవంతుడు ఇలా చేశాడు?’ అని భగవంతుడిని నిందిస్తారు. రెండవ సూత్రం ఏమిటంటే, భగవంతుడు మనకు ఇచ్చిన దాని పట్ల, ఎటువంటి అసంతృప్తులు ఉండకపోవటం.

3. భగవంతుడు మనలను రక్షిస్తున్నాడన్న దృఢ విశ్వాసం కలిగి ఉండటం: భగవంతుడు మన సనాతనమైన నిత్య శాశ్వత తండ్రి. సృష్టిలోని సమస్త ప్రాణుల సంక్షేమం చూసుకుంటూనే ఉంటాడు. ఈ భూమిపై కొన్ని వేల కోట్ల చీమలు ఉన్నాయి. అవన్నీ సమయానుసారం ఆహారం తీసుకోవలసినదే. మన తోటలో కొన్నివేల చీమలు ఆకలితో చనిపోయి ఉండటం అనేది ఎప్పుడైనా జరిగిందా? వాటన్నిటికీ భగవంతుడు ఆహారం సమకూర్చి పెడుతూనే ఉంటాడు. అదే సమయంలో మరో పక్క, ఏనుగులు కిలోలకొద్దీ ఆహారం ప్రతి రోజూ తీసుకోవాలి. భగవంతుడు వాటి అవసరాలు కూడా తీరుస్తుంటాడు. ఈ లోకపు తండ్రి కూడా, తన బిడ్డల అవసరాలన్నీ తీరుస్తాడు. మరైతే మన నిత్యసనాతన తండ్రి అయిన భగవంతుడు, మన సంరక్షణ చూసుకోడన్న సందేహం ఎందుకు? ఆయనిచ్చే రక్షణ పట్ల సంపూర్ణ దృఢ విశ్వాసం కలిగి ఉండటం, శరణాగతి యొక్క మూడవ అంగము.

4. భగవంతుని పట్ల కృతజ్ఞతా భావమును కలిగి ఉండటం: మనం భగవంతుని నుండి ఎన్నో అమూల్యమైన బహుమానాలను పొంది ఉన్నాము. మనం నడిచే నేల, చూసే సూర్యుని వెలుగు, పీల్చే గాలి, త్రాగే నీరు - ఇవన్నీ భగవంతుడు మనకు ఇచ్చినవే. నిజానికి ఆయన వలననే మనం ఇలా ఉండగలుగుతున్నాము; మనకు ప్రాణ శక్తినిచ్చి, మన ఆత్మకు చైతన్యమును ప్రసాదించినది ఆయనే. వీటికి ప్రతిగా, ఆయనకు మనం ఏమీ పన్నులు కట్టడంలేదు. కానీ కనీసం ఆయన ఇచ్చిన దాని పట్ల కృతజ్ఞతా భావముతో ఉండాలి. ఇదే, ఉపకారస్మృతి, కృతజ్ఞతా భావము. మనకు ఆయన ప్రసాదించిన అన్నింటి పట్ల, మన నిత్య శాశ్వత తండ్రి అయిన భగవంతుని పట్ల, కృతజ్ఞతా భావము కలిగి ఉండటమే, శరణాగతి యొక్క నాలుగవ అంశము.

5. మనకున్నదంతా ఆయన సొత్తుగా పరిగణించటం: భగవంతుడు ఈ సమస్త జగత్తుని సృష్టించాడు; అది మనం పుట్టకముందు నుండీ ఉన్నది, మరియు మన తరువాత కూడా ఉంటుంది. కాబట్టి, ఈ సృష్టిలో సమస్తానికీ ఆయనే నిజమైన యజమాని. మనం ఏదైనా వస్తువు మనకే చెందినదని అనుకుంటే, భగవంతుని యొక్క యజమానత్వమును మరచి పోయినట్టే. ఈ జగత్తు, మరియు దానిలో ఉన్నదంతా భగవంతునికే చెందినది. ఈ విషయం గుర్తుంచుకుని, మన యజమానత్వమును విడిచి పెట్టటం, శరణాగతి యొక్క ఐదవ అంగము.

6. శరణాగతి చేశానన్న అహంకారమును కూడా విడిచిపెట్టటం: ఒకవేళ మనం చేసిన మంచి పనుల పట్ల గర్వపడితే, అహంకరిస్తే, ఆ గర్వం మన హృదయాన్ని మలినం చేస్తుంది. మనం చేసిన మంచి పని యొక్క ఫలితాన్ని నిర్మూలిస్తుంది. అందుకే నమ్రత, మరియు విధేయత ఉంచుకోవటం అనేది, చాలా ముఖ్యమైనది. ‘నేను ఏదైనా మంచి పని చేయగలిగానంటే, అది కేవలం భగవంతుడు నా బుద్ధిని సరియైన దిశలో ప్రేరేపించాడు కాబట్టే. నామటుకు నేనే అయితే, నేను ఎప్పటికీ ఇది సాధించేవాడిని కాదు.’ అనేటటువంటి వినమ్రతా దృక్పథాన్ని కలిగి ఉండటమే, శరణాగతి యొక్క ఆరవ అంగము.

ఒకవేళ మనం శరణాగతి యొక్క ఈ ఆరు అంగములనూ పరిపూర్ణముగా అమలుపరిస్తే, మనం భగవంతుని యొక్క షరతులను పూర్తిచేసినట్టే.. అప్పుడాయన తన కృపను మనపై ప్రసాదిస్తాడు.

12:39 ఇక మన తదుపరి వీడియోలో, జనులు ఏ విధంగా చేయడం వలన భగవంతుడిని పొందగలరో తెలుసుకుందాం..

కృష్ణం వందే జగద్గురుం!

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...