Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Wednesday, November 29, 2023

ముక్తజీవులు! Supreme love and devotion (Mukta Jeeva) భగవద్గీత Bhagavad Gita Chapter 18


ముక్తజీవులు!
ముక్త-జీవులను కూడా ఆకర్షించే మహాద్భుతమైన గుణములు ఎటువంటివి?

'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (51 – 54 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 51 నుండి 54 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/WRr3xsI1QLo ]


పరమ సత్యమును బ్రహ్మము రూపంలో, అనుభవపూర్వకంగా నేర్చుకోవటం ఎలాగో చూద్దాము..

00:48 - బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ ।
శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ ।। 51 ।।

00:58 - వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః ।
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః ।। 52 ।।

01:08 - అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్ ।
విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే ।। 53 ।।

వ్యక్తి ఎప్పుడైతే - ఇంద్రియములను చక్కగా నిగ్రహించి, పరిశుద్ధమైన బుద్ధిగలవాడగునో, శబ్దము, మరియు ఇతర ఇంద్రియ విషయములను త్యజించి, రాగ ద్వేష రహితముగా ఉండునో, అప్పుడు బ్రహ్మమును పొందుటకు పాత్రుడగును. అటువంటి వ్యక్తి, ఏకాంతమును ఇష్టపడతాడు, మితంగా తింటాడు, శరీరమనోవాక్కులను నియంత్రిస్తాడు, నిత్యమూ ధ్యానములో నిమగ్నమౌతాడు, మరియు వైరాగ్యమును అభ్యాసం చేస్తాడు. అహంకారము, హింస, దురభిమానము, కోరికలు, ఆస్తిపాస్తులు తనవే అన్న భావన, స్వార్థము లేకుండా ఉన్నటువంటి వ్యక్తి, ప్రశాంతంగా ఉన్నవాడై, బ్రహముతో ఏకీభావ స్థితిని పొందుటకు అర్హుడవుతాడు.

మన విధులను సరైన దృక్పథంలో చేయటం ద్వారా, మనం పరిపూర్ణ సిద్ధిని ఎలా పొందవచ్చో, శ్రీ కృష్ణుడు చెబుతూ వచ్చాడు. ఇక ఇప్పుడు బ్రహ్మము సాక్షాత్కారానికి కావలసిన శ్రేష్ఠత గురించి వివరిస్తున్నాడు. ఆ యొక్క పరిపూర్ణ సిద్ధి స్థితిలో, మనకు అలౌకిక ఆధాత్మిక జ్ఞానంలోనే స్థితమై ఉన్న విశుద్ధ బుద్ధి పెంపొందుతుంది. ఇష్టాలు, మరియు అయిష్టాల భావనల యందు ఆసక్తి లేకుండా ఉండటంచేత, మనస్సు నియంత్రించబడుతుంది. ఇంద్రియములు నిగ్రహించబడి, శరీర-వాక్కుల ఉద్రేకాలు గట్టిగా నిగ్రహించబడతాయి. శరీర నిర్వహణ కోసం ఉన్న, భుజించటం మరియు నిద్ర వంటి పనులు, వివేకముతో, మితంగా క్రమబద్ధీకరించబడతాయి. అటువంటి యోగి, ధ్యానపరుడై ఉంటాడు. అందుకే ఏకాంతాన్ని ఇష్టపడతాడు. అహంకారము, మరియు దానికున్న అధికార-హోదాల కోసం, తపన నిర్మూలించబడుతుంది. నిరంతరం మనస్సును పరమాత్మ ధ్యానంలో నిమగ్నం చేస్తూ, ఆ యోగి ప్రశాంతముగా, మరియు కామ, క్రోధ, లోభముల బంధము నుండి స్చేచ్ఛతో ఉంటాడు. అటువంటి యోగి, పరమ సత్యమును, బ్రహ్మము రూపంలో తెలుసుకుంటాడు.

03:16 - బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి ।
సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్ ।। 54 ।।

పరబ్రహ్మాంతో ఏకీభావ స్థితిలో ఉన్న వ్యక్తి, మానసికంగా ప్రశాంత చిత్తముతో ఉంటాడు, దేనికీ శోకింపడు, దేనినీ కాంక్షింపడు. సర్వ భూతముల పట్ల సమత్వ భావముతో ఉంటూ, అటువంటి యోగి నా పరాభక్తిని పొందుతాడు.

సంపూర్ణ సిద్ధి స్థాయి యొక్క తన వివరణను, శ్రీ కృష్ణుడిక ఇప్పుడు ముగిస్తున్నాడు. బ్రహ్మ-భూతః అంటే బ్రహ్మమును తెలుసుకున్న స్థితి. దాని యందే స్థితమై ఉండి, ఒక వ్యక్తి సంక్లిష్టమైన, మరియు బాధాకరమైన పరిస్థితులలో కూడా, ప్రశాంతముగా మరియు వాటిచే ప్రభావితం కాకుండా ఉంటాడు. ఆ వ్యక్తి దేనికీ శోకింపడు, లేదా ఎటువంటి కొరతనూ తలంచడు. తన ఆనందం కోసం ఎటువంటి భౌతిక వస్తువునూ కాంక్షింపడు. అటువంటి యోగి, అన్నింటిలో ఉన్నది బ్రహ్మమే అని గ్రహించి, సర్వ భూతములనూ సమ దృష్టితో చూస్తాడు. ఈ స్థితిలో, వ్యక్తి అంతర్గత విజ్ఞాన జ్ఞానోదయ స్థితిలో ఉంటాడు. కానీ, ఇటువంటి జ్ఞానోదయ స్థితిలో ఉన్న వ్యక్తి, భగవంతుని దివ్య ప్రేమను పొందుతాడు. భక్తి అనేది, బ్రహ్మమనే జ్ఞానోదయమునకు ఒక మధ్యమ మెట్టుగా మాత్రమే చేయదగినదని, జ్ఞానులు తరచుగా అంటుంటారు. భక్తి అనేది, అంతఃకరణ శుద్ధికి మాత్రమే ప్రయోజనకారి అనీ, ఈ పథంలో చివరికి కేవలం జ్ఞానమే మిగిలిపోతుందనీ అంటుంటారు. అందుకే దృఢమైన బుద్ధీ, వివేకమూ ఉన్నవారు, భక్తిని పక్కకుపెట్టి, కేవలం జ్ఞానమునే పెంపొందించుకోవాలని, సిఫారసు చేస్తారు. కానీ, ఈ పై శ్లోకం ఇటువంటి దృక్పథాన్ని ఖండిస్తుంది.

అత్యున్నతమైన జ్ఞానోదయాన్ని పొందిన తరువాత, వ్యక్తి పరా భక్తిని పెంపొందించుకుంటాడు. వేద వ్యాసుడు ఇదే విషయాన్ని, శ్రీమద్భాగవతంలో పేర్కొన్నాడు. ‘ఆత్మ యందే రమించే ఆత్మారాములు, ఆత్మ జ్ఞానములోనే స్థితమై, భౌతిక బంధాలనుండి విముక్తులైనవారు.. ఇటువంటి సిద్ధులైన జీవులు కూడా, భగవంతుని పట్ల భక్తిని కలిగిఉండాలని కోరుకుంటారు. భగవంతుని మహాద్భుతమైన గుణములు ఎటువంటివంటే, అవి ముక్త-జీవులను కూడా ఆకర్షిస్తాయి.’ ఆత్మ జ్ఞానాన్ని పొంది, నిరాకార బ్రహ్మామును ఆచరణలో తెలుసుకున్న స్థితిలో, ప్రఖ్యాత జ్ఞానులు ఎందరో ఉన్నారు. కానీ, ఎప్పుడైతే వారికి అలౌకికమైన భగవంతుని దివ్య గుణముల క్షణ దర్శనము లభించిందో, వారు సహజంగానే భక్తి మార్గంలో ఆకర్షితులయ్యారు.

నాలుగు యుగాలలో ప్రతి యుగం నుండీ ఇటువంటి జ్ఞానులున్నారు. సత్య యుగపు మహా జ్ఞానులు, బ్రహ్మ నలుగురు కుమారులైన సనత్ కుమారుడు, సనాతన కుమారుడు, సనక కుమారుడు, మరియు సనందన కుమారుడు. వారు పుట్టుకతోనే ఆత్మజ్ఞాన సంపన్నులు. వారి మనస్సులు నిత్యమూ నిరాకార బ్రహ్మము యందే నిమగ్నమై ఉండేవి. ఈ నలుగురు కుమారులు ఒకసారి విష్ణుమూర్తి నివాసమైన వైకుంఠాన్ని సందర్శించారు. అక్కడ భగవంతుని యొక్క పాదారవిందముల వద్ద నుండి, తులసి ఆకుల పరిమళం వారి ముక్కుపుటాలను తాకింది. అది వారి హృదయంలో అమితమైన ఆనందాన్ని రేకెత్తించింది. తక్షణమే, నిర్గుణ బ్రహ్మముపై వారి ధ్యానం అంతమై పోయింది. వారు విష్ణుమూర్తి యొక్క దివ్య ప్రేమానందములో మునిగి పోయారు. అప్పుడు వారొక వరం కోసం వేడుకున్నారు: ‘ఓ స్వామీ, నీ పాదారవిందముల నుండి జాలువారే దివ్య ప్రేమానందమును గ్రోలే అవకాశం మా మనస్సుకు లభించినంత కాలం, నీవు మమ్ములను నరకానికి పంపినా, మాకు సమ్మతమే.’ ఒక్కసారి ఊహించండి.. నిరాకార బ్రహ్మమును అనుభవించిన తరువాత కూడా, ఈ వరిష్ఠమైన జ్ఞానులు, భగవంతుని సగుణ రూపము యొక్క ఆనందమును అనుభవించుటకు, నరకములో కూడా ఉండటానికి వెనుకాడలేదు.

ఇక ఇప్పుడు, త్రేతాయుగములో చూసినట్లయితే, ఆ యుగపు మాహా జ్ఞాని, జనక మహారాజు. ఆయన శ్రీరామ చంద్ర ప్రభువు యొక్క నిత్యసఖి సీతమ్మవారి త్రండ్రి . ఆయనకే విదేహుడనే పేరు కూడా ఉన్నది. అంటే శారీరక దృక్పథానికి అతీతుడన్నమాట. ఆయన మనస్సు నిత్యమూ నిరాకార బ్రహ్మము పట్లనే రమిస్తూ ఉండేది. కానీ, ఒకరోజు విశ్వామిత్ర మహర్షి ఆయనను కలవటానికి, శ్రీ రామచంద్రుడు మరియు లక్ష్మణుడితో సహా వెళ్లారు. రామచంద్ర ప్రభువును చూసిన జనక మహారాజు, నిరాకార బ్రహ్మము యొక్క ఆనందముపై ఆసక్తిని కోల్పోయాడు. భగవంతుని సాకార రూపము పట్ల, గాఢంగా ఆసక్తుడై పోయాడు.’ ఈ విధంగా, తేత్రాయుగపు మోహోన్నత జ్ఞాని, భక్తి పథంలోకి వచ్చాడు.

ద్వాపర యుగపు మహోన్నత జ్ఞాని, వేద వ్యాసుని పుత్రుడు ‘శుకదేవుడు’. ఆయన ఎంత ఉన్నతుడంటే, బయటకు వస్తే, భౌతిక శక్తి మాయ తనను వశపరుచుకుంటుందని, తల్లి గర్భంలోనే పన్నెండు సంవత్సరములున్నాడని, పురాణములు మనకు చెబుతున్నాయి. చివరికి, నారద మహర్షి వచ్చి, తల్లి చెవుల ద్వారా ఆయనతో మాట్లాడి, బయటకు వస్తే ఏమీ కాదులే అని హామీ ఇచ్చి, తనను తల్లి గర్భం నుండి బయటకు రమ్మని వేడుకున్నాడు. ఆ తరువాత ఆయన బయటకు వచ్చి, తన యోగ శక్తి చే, తన శరీరాన్ని పన్నెండు సంవత్సరముల బాలుడిగా పెద్దదిగా చేసుకుని, ఇంటిని వదిలి, సన్యసించి అడవిలో నివసించటానికి వెళ్లిపోయాడు. అక్కడ, త్వరితగతిన అత్యున్నత సమాధి స్థితికి చేరుకున్నాడు. అలా సంవత్సరములు గడచిన పిదప, వేద వ్యాసుని శిష్యులు అడవిలో కట్టెలు కొడుతూ, ఆయనను సమాధి స్థితిలో చూశారు. వారు తిరిగివెళ్ళి వేదవ్యాసునికి ఆ విషయం చెప్పారు.

ఆయన శుకదేవుని చెవిలో, శ్రీ కృష్ణుడి స్వరూప అందాన్ని వివరించే ఒక శ్లోకాన్ని, ఈ విధంగా చెప్పాడు.. ‘శ్రీ కృష్ణుడు శిరస్సుపై నెమలి పింఛముతో ఉన్న కిరీటముతో అలంకరింపబడి ఉన్నాడు. తన స్వరూపాన్ని గొప్ప నర్తకుడిగా చూపిస్తున్నాడు. ఆయన చెవులు నీలి కర్ణికా పుష్పములచే అలంకరింపబడి ఉన్నవి. ఆయన శాలువా, బంగారు వర్ణముతో మెరిసిపోతున్నది. ఆయన వైజయంతీ పూసల మాలను మేడలో ధరించి ఉంటాడు. తన వేణువు యొక్క రంధ్రములను తన అధరామృతముతో నింపివేస్తాడు. ఆయన బృందావనము చేరగానే, గోపబాలురచే చుట్టుముట్టబడి, కీర్తించబడతాడు. ఆయన పాద గుర్తులు, ఆ నేల సౌందర్యాన్ని మరింత ఇనుమడింప చేస్తాయి.’ ఈ శ్లోకము తన చెవులలోనికి ప్రవేశించిన సమయంలో, శుకదేవుడు నిరాకార బ్రహ్మములో లీనమై ఉన్నాడు. అకస్మాత్తుగా ఆయన ధ్యాన విషయం, మైమరిపించే శ్రీ కృష్ణ భగవానుని స్వరూపంపైకి మళ్ళింది. భగవంతుని సాకార రూపం పట్ల ఎంత గాఢంగా ఆకర్షింపబడ్డాడంటే, తన సమాధిని వదిలి, తండ్రి వేద వ్యాసుని దగ్గరకు వెళ్ళిపోయాడు. ఆయన నుండి, సంపూర్ణ భక్తి మాధుర్యముతో నిండినటువంటి శ్రీమద్ భాగవతమును విన్నాడు. తదుపరి కాలంలో, గంగానదీ తీరంలో, అర్జునుడి మనుమడైన పరీక్షిత్తు మహారాజుకు దానిని వివరించాడు. ఈ విధంగా, ద్వాపర యుగపు అత్యున్నత జ్ఞాని, భక్తి పథంలో ఆకర్షింపబడ్డాడు.

చివరికి, ఇక కలి-యుగానికి వద్దాము. జగద్గురు శంకరాచార్య, కలియుగపు అత్యున్నత జ్ఞానిగా పరిగణించబడతాడు. అద్వైత వాద తత్త్వమును ప్రాచుర్యం లోనికి తెచ్చినది ఆయనే. దీని ద్వారా ఆయన చెప్పినది, సృష్టిలో ఉన్నది ఒక్కటే అనీ, అదే నిర్గుణ అంటే గుణములు లేకుండా ఉన్నది, నిర్విశేష అంటే, లక్షణములు లేకుండా, నిరాకార అంటే, ఆకారము లేకుండా ఉన్న బ్రహ్మమని చెప్పారు. కానీ, ఎంతోమందికి తెలియని విషయం ఏమిటంటే, ఇరవై సంవత్సరాల వయస్సు నుండి, ముప్పైరెండు సంవత్సరాల వయస్సులో ఆయన శరీరాన్ని విడిచిపెట్టే వరకూ, శ్రీకృష్ణ భగవానుడు, శ్రీరామ చంద్ర ప్రభువు, శివుడు, మరియు దుర్గామాతలపై వందల శ్లోకాలను రచించారు. నాలుగు ధామాలను కూడా దర్శించి, భగవంతుని యొక్క సాకార రూప విగ్రహాలను కూడా ఆరాధించారు. ఈ విధంగా, మహోన్నత జ్ఞానోదయ స్థితికి చేరినవారు, ఆ తదుపరి భక్తిలో నిమగ్నమయ్యారనటానికి, కలియుగంలో శంకరాచార్యుల వారు ఒక ఉదాహరణ.

11:40 - ఇక మన తదుపరి వీడియోలో, భగవానుడి కృపచే ఎటువంటి వారు నిత్యశాశ్వతమైన, మరియు అనశ్వరమైన ధామమును పొందుతాతో, శ్రీ కృష్ణుడి వివరణలో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, November 27, 2023

ముచికుందుడు King Muchukunda


ముచికుందుడు ఎవరు?
యాదవులచేతిలో మరణం లేని వరాన్ని పొందిన కాలయవనుడిని కృష్ణుడు ఎలా చంపాడు?

సూర్యవంశానికి చెందిన ముచికుందుడు, మహాపరాక్రమవంతుడు. మాంధాత కుమారుడైన ముచికుందుడిని యుద్ధంలో గెలవడం అసాధ్యం. వందలాది సైన్యాన్ని మట్టుపెట్టగల సమర్థుడు. కదనరంగాన మహా మహావీరులు సైతం ఆయనకు ఎదురు నిలువలేరు, ఆయన ధాటికి తట్టుకోలేరు. అందువల్లనే దేవతలు సైతం ఆయన సహాయాన్ని కోరేవారు. దీనిని బట్టే ఆయన ఏ స్థాయి పరాక్రమవంతుడనేది అర్ధం చేసుకోవచ్చు. త్రేతాయుగంలో జన్మించిన ముచికుందుడు ఇంకా జీవించే ఉన్నాడా? ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడికీ, ముచికుందుడుకీ సంబంధం ఏమిటీ? ముచికుందుడు దేవతల నుండి పొందిన వరం ఏమిటి? అది కృష్ణుడికి ఎలా ఉపయోగపడింది? ముచికుందుడి వృత్తాంతానికి సంబంధించిన ఉత్సుకతను కలిగించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/bVirKu3kTVI ]


ఒకసారి దేవదానవుల మధ్య పోరు భీకరంగా సాగింది. దేవతలను జయించే పరిస్థితికి, దానవులు చేరుకున్నారు. అలాంటి సమయంలోనే, వాళ్లంతా ముచికుందుడి సహాయాన్ని కోరారు. దాంతో ఆయన దేవతల పక్షాన, అసురులతో పోరాడాడు. ముచికుందుడు యుద్ధరంగాన నిలిచిన తొలిరోజునే, ఆయన ఎంతటి పరాక్రమవంతుడనేది, దానవులకు అర్థమయ్యింది. అసురులు ఆయన ధాటికి నిలువలేక, తమ ప్రాణాలను కొల్పోయారు. అలా దేవతలు విజయం సాధించడంలో, ముచికుందుడి పాత్ర ప్రధానమైనది. యుద్ధం పూర్తయిన తరువాత, విజయానికి కారకుడైన ముచికుందుడిని దేవతలు అభినందించారు. తమకు చేసిన సాహాయానికిగాను, ఏదైనా వరం కోరుకోమని అన్నారు. ఎడతెరపి లేని యుద్ధంలో పోరాడి అలసిన తనకు, కొన్నేళ్లపాటు హాయిగా నిద్రించే వరం ప్రసాదించమని, ముచికుందుడు కోరుకున్నాడు. ఆ సమయంలో ఎవరైతే తనకి నిద్రా భంగం కలిగిస్తారో, వాళ్లు తన కంటిచూపు సోకగానే భస్మం అయ్యేలా, వరాన్ని ప్రసాదించమన్నాడు. అందుకు దేవతలు తథాస్తు పలికి, ఆయన కోరికను మన్నించారు. దాంతో ముచికుందుడు, సామాన్యుల కంటబడని ఒక గుహను ఎంపిక చేసుకుని, అందులో నిద్రకు ఉపక్రమించాడు.

యుగాల తరబడి ఆయన అలా నిద్రావస్థలోనే ఉన్నాడు. ముచికుందుడు దేవతల నుండి పొందిన వరం, ద్వాపర యుగంలో ఒక అసురుడి మరణానికి కారణమయ్యింది. బలరామకృష్ణుల చేతిలో ఓడిపోయిన జరాసంధుడు, ఎప్పటికప్పుడు ఇతర రాజులతో మైత్రి చేసుకుని, వాళ్లతో కలిసి మధురపై దండెత్తేవాడు. అలా జరాసంధుడు వరుసగా దండయాత్రలు చేయడం, కృష్ణుడు అతనిని తప్ప, మిగతావారిని కడతేర్చడం జరుగుతూ వచ్చింది. ఇలా తరచూ జరుగుతుండడంతో, యాదవ సైన్యం కూడా పెద్ద సంఖ్యలో నశించసాగింది. దాంతో సముద్ర మధ్య ప్రాంతంలో "ద్వారకా నగరం" నిర్మించాలని, శ్రీ కృష్ణుడు సంకల్పించాడు. అక్కడైతే జరాసంధుడి దాడుల కారణంగా, ప్రజల ప్రాణాలకు ముప్పుండదని భావించాడు. అనుకున్నదే తడవుగా, "విశ్వకర్మ"ను రప్పించి, ద్వారకా నగర నిర్మాణ పనులను, ఆయనకు అప్పగించాడు.

అత్యంత సుందరంగా ద్వారకా నగరాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో, విశ్వకర్మ రంగంలోకి దిగాడు. మంచి ముహూర్తం చూసుకుని, ఆయన ద్వారకా నగర నిర్మాణ పనులను ఆరంభించాడు. అలా చకచకా పనులు సాగిపోతున్నాయి. ఒక వైపున ద్వారకా నగర నిర్మాణం జరుగుతూ ఉన్న సమయంలో కూడా, జరాసంధుడు యుద్ధానికి రావడం, ఓడిపోయి ఒంటరిగా తిరిగి వెళ్లడం జరుగుతూనే ఉంది. ఆ మరుసటి రోజు నుంచే, మళ్లీ సైన్యాన్ని కూడగట్టుకోవడం మొదలు పెట్టే వాడు. అలా కృష్ణుడి వీరత్వం గురించి, "కాలయవనుడి" కి తెలిసింది. తనను మించిన వీరుడు లేడనే అహంభావంతో ఉన్న కాలయవనుడు, కృష్ణుడి ధైర్యసాహసాలను గురించి విన్నాడు. కృష్ణుడిని చూడాలనీ, ఆయనతో యుద్ధం చేయాలనీ భావించాడు. "కంసుడిని హతమార్చి, జరాసంధుడిని పలుమార్లు ఎదుర్కున్న కృష్ణుడు, నిజంగానే మహావీరుడయ్యే ఉంటాడు. అలాంటి వీరుడు సహజంగా మిడిసిపడుతుండటం జరుగుతూ ఉంటుంది. తాను ఉండగా అలా జరగకూడదు. అలాంటివాళ్లకు తాను ఉన్నాననే ఒక భయం ఉండాలి" అని తనలో తాననుకున్నాడు. అలాంటి ఆలోచన రాగానే, కృష్ణుడిని ఎదిరించడమే ధ్యేయంగా కదలమని, తన సైనిక బలగాలను ఆదేశించాడు కాలయవనుడు.

అతడి సైనిక బలగాలు మధుర పొలిమేరలను చేరుకున్నాయి. యాదవుల చేతిలో మరణం లేకుండా వరాన్ని పొందిన కాలయవనుడిని, తెలివిగా అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు కృష్ణుడు. మరుక్షణమే, కాలయవనుడు తన సైన్యంతో విడిది చేసిన ప్రదేశానికి ఒంటరిగా చేరుకున్నాడు. కృష్ణుడు ఎలాంటి ఆయుధాలూ చేతపట్టక, ఒంటరిగా తనవైపుకు రావటం చూసిన కాలయవనుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణుడిని చూడగానే, "కాలయవనుడు" ఆగ్రహావేశాలకు లోనయ్యాడు. తన వరబలం, భుజబలం సంగతి తెలియక, కృష్ణుడు ఒంటరిగా రావడం చూసి నవ్వుకున్నాడు. ఇతర అసురులను సంహరించినంత తేలికగా తనను మట్టుపెట్టగలననే నమ్మకంతో, అతను వస్తుండవచ్చని భావించాడు. ఒక్కసారి తన శౌర్య పరాక్రమాలను రుచి చూపిస్తే, ఇకపై తనను తలచుకోవడానికి కూడా భయపడతాడని అనుకున్నాడు. కృష్ణుడు తన సమీపానికి వస్తుండగానే, ఒక్కసారిగా ఖడ్గాన్ని దూశాడు. అది చూసిన కృష్ణుడు ఉలిక్కిపడినట్టుగా నటించి, అక్కడి నుంచి పరుగందుకున్నాడు.

భయంతో కృష్ణుడు అలా పారిపోవటం చూసి కాలయవనుడు పకపకా నవ్వుతూ, "కృష్ణుడు మహావీరుడు, ఎంతోమంది అసురులను సంహరించాడని తెలిసి, అతనితో యుద్ధం చేయాలని తాను ముచ్చటపడి వస్తే, అతను ఇలా పారిపోతుండటం హస్యాస్పదం" అని ప్రగల్భాలు పలికాడు. ఎంతో దూరం నుంచి వచ్చిన తను, కృష్ణుడిని ఓడించకుండా వెనుతిరగకూడదని నిశ్చయించుకుని, ఆయనను అనుసరించాడు. కాలయవనుడు తన వెంటపడుతుండటంతో, మరింత భయాన్ని నటిస్తూ, కృష్ణుడు పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆయన ఎంతగా భయపడుతుంటే, అంతగా కాలయవనుడు ఆనందంతో పొంగిపోతున్నాడు. ఒక్కసారి తనతో యుద్ధం చేయమనీ, తనని వీరుడిగా అంగీకరించమనీ కోరుతూ, కృష్ణుడి వెంటే కాలయవనుడు కూడా పరిగెత్తాడు. అయినా ఆగకుండా కృష్ణుడు పరిగెడుతూనే ఉన్నాడు. అక్కడక్కడా ఆగి వెనక్కి తిరిగి చూస్తూ, కాలయవనుడు కాస్త దగ్గరికి రాగానే, మళ్లీ పరిగెడుతూ ఉన్నాడు కృష్ణుడు.

ఆయనను పట్టుకోవడం చేతకాక పరుగెత్తలేక ఆయాసంతో, "ఇంత పిరికివాడినా, అంతటి మహా వీరుడంటూ ఆకాశానికి ఎత్తేశారు! ఇంత భయస్థుడి చేతిలోనా, అసురులు అసువులు బాసినది! ఏది ఏమైనా, కృష్ణుడిని పట్టుకుని, ఒక్కసారైనా కత్తి కలిపి ఆయనను ఓడించాననే సంతృప్తితోనే తాను వెనుదిరగాలి. లేదంటే, జీవితాంతం ఆ అసంతృప్తి అలా వెంటాడుతూనే ఉంటుంది" అనుకుంటూ, మళ్లీ పరుగు వేగాన్ని పెంచాడు కాలయవనుడు. అతనికి అందినట్టుగానే అంది, తప్పించుకుని మళ్లీ పరుగందుకుంటున్నాడు కృష్ణుడు. ఇలా వాళ్లు చాలాదూరం వెళ్ళారు. కాలయవనుడిని తప్పించుకోవడం కోసం, కృష్ణుడు గుహలోకి ప్రవేశించాడు. అది చూసిన కాలయవనుడు, ఆయన వెనుకే గుహలోకి ప్రవేశించాడు. పొడవైన, విశాలమైన ఆ గుహలో అంతా చీకటిమయం. అందులో కృష్ణుడి కోసం అంగుళం అంగుళం వెతకసాగాడు కాలయవనుడు. అయితే, ఒక చోట ఎవరో పడుకుని ఉన్నట్టనిపించడంతో, అది కృష్ణుడని భావించిన కాలయవనుడు, అతనికి దగ్గరగా వెళ్లి, "ఎక్కడ ఉన్నా, ఎన్ని వేషాలు వేసినా, నా నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు. కృష్ణుడు నా చేతికి చిక్కడం అసంభవమనీ, అసాధ్యమనీ చాలామంది చెప్పారు. అలాంటి వారందరికీ, తానేమిటనేది ఇప్పుడు తెలుస్తుంది." అని గర్వంతో పలుకుతూ, "ముసుగు తొలగించి బయటికి వస్తే, బలాబలాలు తేల్చుకుందాం" అని సవాలు చేశాడు.

అయినా అవతలి వ్యక్తి నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో, లేవమంటూ కాలయవనుడు తన కాలితో ఒక్క తన్ను తన్నాడు. కాలయవనుడు అలా తన్నడంతో, అప్పటివరకూ ముసుగుపెట్టి పడుకున్న "ముచికుందుడు", నెమ్మదిగా ముసుగు తొలగించాడు. కృష్ణుడికి బదులుగా అక్కడ ఎవరో ఉండటం చూసి, కాలయవనుడు బిత్తరపోయాడు. కృష్ణుడు ఎక్కడికి పోయాడు? ఏమైపోయాడన్నట్టుగా, ఆయన కోసం చుట్టూ చూశాడు. తనకు నిద్రాభంగం కలిగించిందెవరని అనుకుంటూ, ముచికుందుడు కళ్లు నలుపుకుంటూ లేచాడు. ఆయన కళ్లు తెరిచి చూడగానే, తీక్షణమైన ఆ శక్తికి కాలయవనుడు ఒక్కసారిగా భస్మమైపోయాడు. వందల ఏళ్లపాటు నిద్రలో ఉండి లేచిన కారణంగా, ఏం జరిగిందనేది ముచికుందుడికి అర్థం కాలేదు.  తన కళ్ల ఎదురుగా పోగుపడిన భస్మ రాశిని చూశాడు. తన గుహలోకి ప్రవేశించిందెవరు? తనను నిద్రలో నుంచి లేపిందెవరు? తనతో వాళ్లకి గల పనేమిటి? అని పరిపరివిధాల ఆలోచించసాగాడు ముచికుందుడు. అప్పటివరకూ చాటుగా ఉండి ఇదంతా చూస్తున్న కృష్ణుడు బయటికి వచ్చి, జరిగిందంతా ముచికుందుడికి వివరించగా, కృష్ణ దర్శనభాగ్యం లభించినందుకు ముచికుందుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, పరి పరి విధాలా భగవానుడిని స్తుతించాడు.

కృష్ణం వందే జగద్గురుం!

Sunday, November 26, 2023

ఈ రోజు '26/11/2023' కార్తీక పూర్ణిమ - అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.. Kartika Pournami

 

ఈ రోజు '26/11/2023' కార్తీక పూర్ణిమ - అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు..
 
కార్తీక పూర్ణిమను 'త్రిపుర పూర్ణిమ', 'రాస పూర్ణిమ', 'దేవ దీపావళి' అని కూడా అంటారు. ఈ రోజును మనువులలో పద్నాలుగోవాడైన భౌత్యుని పేరున భౌత్యమన్వంతరాది, ఇంద్ర సావర్ణిక మన్వంతరమని కూడా అంటారు. త్రిపురాసుర సంహారం జరిగింది కూడా ఈ రోజే.

[ ముచికుందుడు ఎవరు? https://youtu.be/bVirKu3kTVI ]


జ్వాలాతోరణ దర్శనంతో ఈ భూమిపై ఉండే సర్వ ప్రాణుల పాపాలూ పరిహరించబడి, సద్గతి లభిస్తుందని పురాణ వచనం. కార్తీక జ్వాలా తోరణం చేసినందు వలన, జాతిభేదం లేకుండా, మానవులకు, కీటకాదులకు, పక్షులకు, దోమలకు, జలచరాలైన చేపలకు, వృక్షాలకు కూడా పునర్జన్మ ఉండదని ఐతిహ్యం. కార్తీక పౌర్ణమి రోజున వేదవ్యాస పూజ కూడా నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున దీపోత్సవం, సర్వపాపహరం. కార్తీక పౌర్ణమి వ్రతం ఆచరించిన పురంజయుడనే రాజు తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకుని, విష్ణు పూజతో మోక్షాన్ని పొందిన గాధ ప్రచారంలో ఉంది.

కార్తీక పౌర్ణమి రోజున పితృ ప్రీతిగా వృషోత్సర్జనం చేయటం, సాలగ్రామాన్ని దానం చేయటం, ఉసిరి కాయలు దక్షిణతో దానం చేయటం వలన, వెనుక జన్మలలో చేసిన సమస్త పాపములనూ నశింప జేసుకోవచ్చు.

కార్తీకంలో ఆధ్యాత్మిక, ఆరోగ్య పరమైన ఉపయోగాలు..

కార్తీక మాసం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రమైనది, మహిమాన్వితమైనది. నెలరోజుల పాటు తులసి కోట, లేదా దేవాలయంలో దీపారాధన చేయడం ద్వారా, అంతర్గత శక్తి పెరుగుతుంది, జ్ఞానం వికసిస్తుంది.

కార్తీకంలో శరదృతువు పవిత్ర జలం హంసోదకంగా పిలవబడుతుంది. మానసిక, శారీరక, రుగ్మతలను తొలగించి, ఆయుష్షునూ, ఆరోగ్యాన్నీ ప్రసాదించే ఉషోదయ స్నానం, కార్తీకంలో ప్రముఖ స్థానం పొందింది.

పైత్య ప్రకోపాలను తగ్గించేందుకే, ఈ హంసోదక స్నానం. ఇది అమృత తుల్యంగా మానవాళికి ఉపయుక్తంగా ఉంది. అగస్త్య నక్షత్రం ఉదయించడం వల్ల, దోష రహితమైనది. శరదృతువులోని పవిత్ర జలాన్ని హంసోదకం అంటాము.

తులారాశిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావనీ ౹
సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా ౹౹

సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు, గంగాదేవి అన్ని ప్రదేశాలలో ద్రవరూపంలో ఉంటుంది. తులా మాసంలో గోవు పాదమంత జల ప్రదేశంలో కూడా శ్రీమహావిష్ణువు ఉంటాడనేది, పురాణ వచనం. సూర్యుడు తులారాశిలో సంచారం చేసే కార్తీకమాసంలో, నిత్యం ప్రాతః కాలం నదీ స్నానం చేసే వారికి, మహాపాతకాలు సైతం హరించ బడతాయని ప్రతీతి. కొండలు, కోనలు, అడవుల గుండా నదులు ప్రవహిస్తూ ఉండటం వల్ల, ఆయుర్వేద గుణాలున్న నదీ నీటిలో స్నానం ఆచరించడం వల్ల, ఆరోగ్యం సిద్ధిస్తుందని శాస్త్ర వచనం. నదిలో అనిర్వచనీయమైన విద్యుత్‌ ఉంటుంది. ఇది శరీరానికి శక్తినిస్తుంది. శరీరాన్ని సమస్థితిలో ఉంచే నిరాహారం, మరో యోగం. కొందరు ఉపవాసాన్ని, రోజు మొత్తంలో ఒకసారి ఫలాహారాన్ని స్వీకరించి, ఏక భుక్తంగా నిర్వహిస్తారు. మరి కొందరు, నక్తం చేస్తుంటారు. అంటే, పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయడం. ఇలా కార్తీక సోమవారాలు, కార్తీక శనివారాలు, ఏకాదశులు, కార్తీక పౌర్ణమి వంటి రోజులలో ఉపవాస దీక్ష చేయటం, శరీరానికి మేలు చేస్తుంది.

ఈ కార్తీక మాసంలో విశేషంగా దీపాలను వెలిగించటం వలన, ఆనేక దీపాల వల్ల, వాటినుంచి వచ్చే వాయువుల వల్ల, వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి, వాతావరణ శుద్ధి అవుతుంది. తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది. ఈ రోజు ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలుగజేస్తుంది. భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి, దీనికా పేరు ప్రసిద్ధమైనది. ఎవరి శక్తి సామర్ధ్యాలను బట్టి వారు హరిహరులను సేవించి, వారి కారుణా కటాక్షాలను పొందుతారు. వీటిని ఎంత నిష్ఠతో ఆచరిస్తే అంత శుభ ఫలితాలు ఉంటాయి.

హరహర మహాదేవ!
లోకా సమస్తా సుఖినోభవన్తు!

Wednesday, November 22, 2023

Realization of the Absolute (Naishkarmya Siddhi) నైష్కర్మ్య సిద్ధి! భగవద్గీత Bhagavad Gita Chapter 18


నైష్కర్మ్య సిద్ధి!
మనకు విధింపబడిన వృత్తి ధర్మములను ఎప్పటివరకు నిర్వర్తించాలి?

'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (47 – 50 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 47 నుండి 50 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/rb5QUdAqXQ8 ]


ఎటువంటి వారు శ్రేష్ఠమైన నైష్కర్మ్య సిద్ధిని పొందుతారో చూద్దాము..

00:46 - శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ ।
స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ।। 47 ।।

పర ధర్మమును సరిగ్గా చేయుటకంటే, సరిగా చేయలేకపోయినా సరే, స్వ-ధర్మము చేయుటయే వ్యక్తికి శ్రేష్ఠము. తన స్వభావ సిద్ధ విధులను చేయుటలో, వ్యక్తికి పాపము అంటదు.

మనం మన స్వ-ధర్మమును అంటే, విధింపబడిన వృత్తి ధర్మములు పాటిస్తున్నప్పుడు, రెండు విధాల ప్రయోజనం ఉంటుంది. అది మన స్వభావానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి, పక్షికి ఎగరటంలా, లేదా చేపకు ఈదటంలా, అది మన వ్యక్తిత్వానికి సహజంగా ఉంటుంది. రెండవది ఏమిటంటే, మనస్సుకు సౌకర్యముగా ఉంటుంది కాబట్టి, అప్రయత్నంగానే మనం దానిని నిర్వర్తించవచ్చు. దానితో భక్తిలో నిమగ్నమవ్వటానికి, అంతఃకరణ స్వేచ్ఛగా ఉంటుంది. బదులుగా, అవి దోషపూరితముగా ఉన్నాయని మనం మన ధర్మములను విడిచిపెట్టి, మన స్వభావానికి అనుకూలంగా లేని ఇంకొకరి ధర్మములు పాటిస్తే, మనం మన సహజ సిద్ధ ప్రవృత్తికి విరుద్ధంగా ప్రయాసపడవలసి ఉంటుంది. అర్జునుడి పరిస్థితి సరిగ్గా ఇదే. అతని క్షత్రియ స్వభావము, సైనిక మరియు పరిపాలనా కార్యకలాపాల పట్ల మొగ్గు చూపుతుంది. పరిస్థితులు ఆయనను ధర్మయుద్ధంలో పాలుపంచుకునే అవసరం వైపుకు తీసుకువచ్చాయి. తన కర్తవ్యం నుండి తప్పించుకుని, అడవిలో తపస్సు కోసం యుద్ధభూమి నుండి వెనుతిరిగితే, అది అతని ఆధ్యాత్మిక పురోగతికి దోహదపడదు. ఎందుకంటే, అడవిలో కూడా తన సహజ స్వభావం తన వెంటే ఉంటుంది. అక్కడ కూడా బహుశా, తను అడవిలో ఆటవికులను కూడగట్టుకుని, వారికి నాయకుడిగా  అయిపోవచ్చేమో. బదులుగా, తన స్వభావ సిద్ధంగా జనించిన విధులను నిర్వర్తిస్తూ ఉండి, తన కర్మ ఫలాలను అర్పించటం ద్వారా, భగవదారాధన చేయటమే మేలు. ఎప్పుడైతే వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదుగుతాడో, అప్పుడు స్వ-ధర్మం మారుతుంది. అది ఇక శారీరక స్థాయిలోనే ఉండిపోదు. అది ఆత్మ స్థాయి ధర్మముగా మారిపోతుంది. అంటే, భగవత్ భక్తి. ఆ స్థాయిలో, వ్యక్తి తన వృత్తి ధర్మములను త్యజించి, పూర్తిగా భక్తిలోనే నిమగ్నమవ్వటం తప్పు కాదు. ఎందుకంటే, అదే అప్పుడు అతని సహజ స్వ-ధర్మమమవుతుంది. శ్రవణం, కీర్తనం, మరియు భగవత్ లీలలపై ధ్యానముచే, భక్తి అంటే, అభిరుచి వృద్ధి చెందనంత వరకూ, మనం మనకు విధింపబడిన వృత్తి ధర్మములను నిర్వర్తిస్తూనే ఉండాలి.

03:24 - సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ ।
సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః ।। 48 ।।

ఓ కుంతీ పుత్రా, తన సహజ సిద్ధ స్వభావంచే జనితమైన కర్తవ్యములను, వాటిలో దోషాలున్నా సరే, వాటిని వ్యక్తి ఎన్నటికీ విడిచి పెట్టరాదు. అగ్ని పొగచే కప్పివేయబడినట్లు, నిజానికి సమస్త కర్మ ప్రయాసలూ, ఏదో ఒక దోషముచే ఆవరింపబడి ఉంటాయి.

ఏదో దోషము చూడటం వలన జనులు కొన్నిసార్లు, తమ కర్తవ్యము నుండి వెనుతిరుగుతారు. అగ్నిపై సహజంగానే పొగ ఆవరింపబడి ఉన్నట్టు, ఏ పని కూడా సంపూర్ణ దోషరహితముగా ఉండదని, ఇక్కడ శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. ఉదాహరణకి, కోట్లాది సూక్ష్మ క్రిములను చంపకుండా, మనం శ్వాస కూడా తీసుకోలేము. ఒకవేళ నేల దున్ని వ్యవసాయం చేస్తే, అసంఖ్యాకమైన సూక్ష్మ జీవులను నాశనం చేస్తాము. వ్యాపారంలో పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తే, ఇతరులకు సంపద లేకుండా చేస్తాము. ఒకవేళ మనం భుజిస్తే, ఇంకొకరికి ఆహరం లేకుండా చేసినట్టవుతుంది. స్వ-ధర్మము అంటే, కార్యకలాపాలు చేయటం కాబట్టి, అది సంపూర్ణ దోషరహితముగా ఉండజాలదు. కానీ, స్వ-ధర్మ పాలన యొక్క ప్రయోజనాలు, దాని దోషములకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. అన్నింటికన్నా ముఖ్య ప్రయోజనం ఏమిటంటే, అది మనుష్యులకు, తమ పరిశుద్ధికీ, మరియు ఉన్నతికీ ఒక సహజమైన అనాయాస మార్గమును అందిస్తుంది. శ్రీ కృష్ణుడు అర్జునుడితో - తన స్వభావానికి బాగా సరిపోయే పనిని విడిచి పెట్టవద్దని అంటున్నాడు. దానిలో దోషములున్నాసరే, తన సహజమైన స్వభావానికి అనుగుణంగా కర్మలు చేయమంటున్నాడు.

05:14 - అసక్తబుద్ధిః సర్వత్ర జితాత్మా విగతస్పృహః ।
నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసేనాధిగచ్ఛతి ।। 49 ।।

ఎవరి బుద్ధి అంతటా అనాసక్తిగా ఉంటుందో, ఎవరు మనస్సును జయించారో, మరియు సన్న్యాస అభ్యాసముచే కోరికలను త్యజించారో, వారు శ్రేష్ఠమైన నైష్కర్మ్య సిద్ధిని పొందుతారు.

శ్రీ కృష్ణుడు గతంలో, కేవలం జీవిత బాధ్యతల నుండి పారిపోవటం సన్న్యాసము కాదు, అది త్యాగము కూడా కాదని, అర్జునుడికి చెప్పి ఉన్నాడు. ఇక ఇప్పుడు కర్మ రహిత స్థితి, అంటే, నైష్కర్మ్య-సిద్ధి స్థితిని వివరిస్తున్నాడు. నిరంతరం మారుతున్న ప్రపంచం యొక్క స్థితి గతుల మధ్యకూడా, మనలను మనమే ప్రపంచ సంఘటనలు, పరిణామాలకు దూరంగా, ఆసక్తి రహితముగా ఉంచుకుని, కేవలం మన కర్తవ్య నిర్వహణ పట్ల మాత్రమే ధ్యాస ఉంచటం ద్వారా, ఈ నైష్కర్మ్య -సిద్ధి స్థితిని సాధించవచ్చు. ఇది ఎలాగంటే, ఒక వంతెన క్రింది నుండి, నీరు ఒకవైపునుండి వచ్చి, ఇంకొక వైపు నుండి వెళ్ళిపోవటం లాంటిది. ఆ వంతెన ఆ నీటిని తీసుకోదు, లేదా నీటిని సరఫరా చేయదు; ఆ నీటి ప్రవాహంచే ఏమాత్రం ప్రభావితం కాదు. అదే విధంగా, కర్మయోగులు తమ కర్తవ్యాన్ని చేస్తుంటారు.. కానీ, నిరంతరం జరిగే పరిణామాల పట్ల ఉదాసీనంగా ఉంటారు. భగవదారాధన లాగా, వారు తమ కర్తవ్య నిర్వహణలో చక్కటి పరిశ్రమ చేస్తారు. కానీ, అంతిమ ఫలితాన్ని ఆ భగవంతునికే వదిలేస్తారు. తద్వారా వారు ఎల్లప్పుడూ తృప్తితో, మరియు ఏది జరిగినా ప్రశాంతంగానే ఉంటారు. దీనిని వివరించటానికి, ఒక చక్కటి కథ ఉంది. ఒకాయనకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మొదటి అమ్మాయికి ఒక రైతుతో వివాహమయ్యింది. రెండవ అమ్మాయికి, ఒక ఇటుకబట్టి యజమానితో వివాహమయ్యింది. ఒకరోజు ఆ తండ్రి మొదటి అమ్మాయికి ఫోన్ చేసి, ఎలా ఉందో కనుక్కున్నాడు. ‘నాన్నా, మేము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము. మంచి వర్షాలు పడాలని మాకోసం దేవుణ్ణి ప్రార్ధించు.’ అని అన్నదామె. తరువాత ఆయన రెండవ అమ్మాయికి ఫోన్ చేశాడు.. ‘నాన్నా, మాకు వ్యాపారం బాగాలేదు, ఈ సంవత్సరం వానలు పడొద్దని దయచేసి దేవుణ్ణి ప్రార్థించు. బాగా ఎండ కాస్తే, మాకు మంచి ఇటుకల ఉత్పత్తి జరుగుతుంది.’ అని అన్నదామె. తండ్రి తన కూతుర్ల నుండి విరుద్ధమైన విన్నపాలు విని, ‘ఏది మంచో, ఏది సరియైనదో, ఆ భగవంతునికే తెలుసు.. ఆయననే చేయనీ" అని అనుకున్నాడు. ఈశ్వర సంకల్పానికి ఇటువంటి శరణాగతి అనేది, ప్రపంచంలో నిరంతరం జరిగే వ్యవహారములలో తలమునకలై ఉన్నా, వాటివాటి ఫలితములపట్ల అనాసక్తిని కలుగచేస్తుంది.

08:06 - సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే ।
సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా ।। 50 ।।

ఓ అర్జునా, పరిపూర్ణ సిద్ధిని పొందిన వ్యక్తి ఏ విధముగా, అలౌకిక ఆధ్యాత్మిక జ్ఞానము యందే స్థితమై ఉండటం ద్వారా, బ్రహ్మమును కూడా ఎలా పొందగలడో వివరిస్తాను. నా నుండి క్లుప్తముగా వినుము.

పుస్తక జ్ఞానాన్ని చదవటం ఒక ఎత్తయితే, ఆ జ్ఞానాన్ని ఆచరణలో, అనుభవపూర్వకంగా తెలుసుకోవటం మరో ఎత్తు. మంచి ఆలోచనలు ఎన్ని ఉన్నా, వాటిని ఆచరణలో పెట్టకపోతే, అన్నీ వ్యర్థమే. పుస్తక జ్ఞానం ఉన్న పండితులకు బుర్రలో సర్వ శాస్త్రముల జ్ఞానం ఉంటుంది కానీ, వాటి విజ్ఞానం అవగతం కాకపోవచ్చు. మరోపక్క, కర్మ యోగులకు ప్రతినిత్యం, శాస్త్ర సత్యాలను ఆచరణలో అభ్యాసం చేసే అవకాశాలు వస్తుంటాయి. అందుకే, కర్మ యోగము యొక్క నిరంతర అభ్యాసము, మనకు ఆధ్యాత్మిక జ్ఞానమును హృదయములో విజ్ఞానముగా వికసింపచేస్తుంది. ఎప్పుడైతే వ్యక్తి నైష్కర్మ్య సిద్ధితో, అంటే పని చేస్తూ కూడా కర్మ రహితముగా ఉండగలడో, అప్పుడు అలౌకిక ఆధ్యాత్మిక జ్ఞానము, నిజమైన అనుభవంగా తెలుస్తుంది. ఆ జ్ఞానంలో స్థితమై ఉన్నప్పుడు, కర్మ యోగి భగవత్ ప్రాప్తిలో పరిపూర్ణతను సాధిస్తాడు.

09:31 - ఇక మన తదుపరి వీడియోలో, పరమ సత్యమును బ్రహ్మము  రూపంలో, అనుభవపూర్వకంగా నేర్చుకోవటం ఎలాగో, శ్రీ కృష్ణుడి వివరణలో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, November 20, 2023

పాండ్యుల వీరవనిత ‘తడైతగై’ శక్తిగా ఎలా ఉద్భవించింది? Story of Madurai Meenakshi and Sundareshwara


పాండ్యుల వీరవనిత ‘తడైతగై’ శక్తిగా ఎలా ఉద్భవించింది?
భార్య భర్తల మధ్య అన్యోన్యత కోసం ఈ అమ్మవారిని పూజించాలి!

మన భారత ఇతిహాసాల ప్రకారం, శక్తి స్వరూపిణికి సంబంధించి, అష్టాదశ శక్తి పీఠాలున్నాయి. అవన్నీ అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రాంతాలుగా, పరమ పవిత్రమైన పుణ్య స్థలాలుగా ప్రసిద్ధిచెందాయి. మన దక్షిణ భారతదేశంలోని ఒక గొప్ప పుణ్య క్షేత్రం, మధురై. తమిళ సంస్కృతికి పుట్టినిల్లు. పవిత్ర వైగైనదీ తీరాన ఉన్న ఈ ప్రాంతం.., మీనాక్షీ, సుందరేశ్వరుల ఆలయ నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ సుందర నగరాన్ని కవీశ్వరులూ, గాయకులూ, దివ్యమైనదిగా గానం చేశారు. శక్తి స్వరూపిణి అయిన దేవి, మానవ రూపంలో అవతరించి, పాండ్య రాజు పుత్రికగా రాజ్యాన్ని పరిపాలించి, భక్తుల రక్షణ కోసం దివ్య మహిమలు ప్రదర్శించి, పరమ శివుని సతీమణి అయింది. అంతటి విశిష్ఠత గల మధుర మీనాక్షి అమ్మవారి చరిత్ర ప్రాశస్త్యం ఏమిటి? సుందరమూర్తి అయిన మీనాక్షి అమ్మవారు, మూడు స్తన్యాలతో ఎందుకు జన్మించారు? రాణిగా ఎన్నో రాజ్యాలపై విజయం సాధించిన మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వరుణ్ణి ఎలా వివాహం చేసుకున్నారు? మీనాక్షి అమ్మవారి వివాహానికీ, శ్రీ మహా విష్ణువుకూ సంబంధం ఏమిటి - వంటి పరమోత్కృష్ట విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Pq1-JyGP0uE ]


తమిళ గ్రంథం ‘తిరువవిలై యాతర’లోని కథనం ప్రకారం.. ఒకప్పుడు మధురై ప్రాంతాన్ని పాలించిన మలయధ్వజ పాండ్యరాజుకు, చాలా కాలం వరకూ సంతానం కలుగలేదు. దానితో ఆయన తన భార్య కాంచనమాలతో కలసి, పుత్ర సంతానం కోసం ఒక యజ్ఞం చేశాడు. అయితే, ఆయనకు ఆ అగ్నిహోత్రం నుండి, పార్వతీ దేవి అంశతో, మూడేళ్ల వయస్సున్న ఒక పుత్రిక జన్మించింది. ఆమె విచిత్రంగా మూడు స్తన్యాలతో ఉద్భవించింది. ఆమెను చూసి ఆశ్చర్యపోయిన రాజ దంపతులకు, ఆకాశవాణి ప్రత్యక్షమై, ఆమెను కొడుకు మాదిరి పెంచమనీ, ఆమె తన భర్తను కలసిన మరుక్షణం, మూడవ స్థన్యం మాయమవుతుందని చెప్పింది. దాంతో మలయధ్వజ పాండ్యరాజూ, కాంచనమాలా, ఎంతో ప్రేమతో ఆమెను పెంచసాగారు. మీనముల వంటి చక్కని విశాలనేత్రములతో, ముద్దులొలికే ఆ పాపకు మీనాక్షిగా నామకరణం చేశారు. ఆమెను కొడుకు మాదిరిగా పెంచారు, రాజ దంపతులు. అన్ని విద్యలలో శిక్షణ పొంది, గొప్ప వీరవనితగా పేరుగడించిందామె.

కొంతకాలానికి మలయధ్వజుడు కాలంచెయ్యగా, మీనాక్షి రాణి అయ్యింది. ఉత్తరాది రాజ్యాలను జయిస్తూ, విజయ పరంపరను కొనసాగించింది. తన సైన్యానికి నాయకత్వం వహిస్తూ, అనేక రాజ్యాలను ఓడించి, చివరకు హిమాలయాలను చేరుకుంది. అక్కడ ముగ్ధమనోహర రూపంలో, తపో ధనుడైన పరమశివుడిని చూసింది. ఆ సుందరేశ్వరుడిని చూడగానే, మీనాక్షి అమ్మవారి మూడవ స్తన్యం మాయమయ్యింది. వెంటనే మీనాక్షి అమ్మవారు, తనను పెళ్లి చేసుకోమని కోరారు. అందుకు సుందరేశ్వరుడు అంగీకరించగా, మధురైలో మీనాక్షి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. వారి వివాహం కొరకు, వైకుంఠం నుండి శ్రీ మహా విష్ణువు, బంగారు గుర్రంపై బయలుదేరాడు. కానీ, దేవతల నాటకం కారణంగా, ఇంద్రుడి వంచనకు గురై, రావడం కాస్త ఆలస్యమైంది. ఈలోగా తిరుప్పరాంకుండ్రంకి చెందిన స్థానిక దేవుడు పవలాకనైవాల్‌ పెరుమాళ్‌, ఆ వివాహం జరిపించాడు. ఆ వివాహాన్నే, ప్రతి ఏటా ‘చిత్తిరై తిరువళ్’ వేడుకగా నిర్వహిస్తుంటారు.

మీనాక్షీ సుందరేశ్వరులు ఎంతో సంతోషంగా జీవించి, ఒక కుమారునికి జన్మనిచ్చారు. అతడే ఉగ్రపాండ్యుడు. అతను సాక్షాత్తూ సుబ్రహ్మణ్యస్వామి అవతారమని అంటారు. ఉగ్రపాండ్యుడు యుక్తవయస్సుకు రాగా, సింహసనాన్ని అధిష్ఠింపజేసి,  వారు సుందరేశ్వర మీనాక్షులుగా మధురైలో కొలువుదీరారు. పంచ శక్తి పీఠాలలో ఒకటిగా, ఎంతో ప్రాముఖ్యతను పొందింది ఈ ఆలయం. దక్షిణాదిన ప్రసిద్ధి చెందిన మధురై మీనాక్షి ఆలయం ప్రస్తావన, 6వ శతాబ్దానికి చెందిన తమిళ సంగమ సాహిత్యంలో కనిపిస్తుంది. ఈ ఆలయ ప్రస్తావన ప్రాచీన గ్రంథాలలో ఉన్నా, 14వ శతాబ్దం అనంతరమే, ప్రస్తుత ఆలయ నిర్మాణం జరిగిందని తెలుస్తోంది. ఈ ఆలయంలో ఒకే ఒక్క మరకత శిలతో, అమ్మవారి విగ్రహం చెక్కబడి ఉంటుంది. ఆకుపచ్చ, నీలము కలగలిపిన మరకత మణి శరీరకాంతి, ఆ తల్లి ప్రత్యేకత. అమ్మవారి విగ్రహంలో చిలుక ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. అక్కడి సాంప్రదాయం ప్రకారం, తొలుత మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న తరువాతే, సుందరేశ్వరుడైన పరమ శివుడిని దర్శించుకోవాలి. అందుచేత తూర్పు వైపున ఉన్న అష్టశక్తి మండపం గుండా ఆలయంలోకి ప్రవేశించాలి. ఆ ఆలయంలో మరొక ప్రాశస్త్యం, అక్కడున్న నటరాజస్వామి దేవాలయం. దానిని కేవెళ్లియంబళం అని అంటారు. అక్కడ కుడికాలు పైకెత్తి తాండవ నృత్యం చేస్తున్న భంగిమలో ఉన్న స్వామివారి రూపం, విశేషం. సుమారు 2500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం, పాండ్య రాజుల కాలం నుంచే, పూజలందుకుంది. ఆ ఆలయానికి నాలుగు ముఖ ద్వారాలున్నాయి. ధర్మ, అర్ధ, కామ, మోక్ష ద్వారాలుగా వాటిని పిలుస్తారని, పురాణ విదితం.

మీనాక్షి దేవి ఆలయంలో పరమశివుడి ఆవిర్భావానికి సంబంధించి, మరొక గాథ ప్రాచుర్యంలో ఉంది. ఒకానొక సమయంలో, దివ్యలోకానికి అధిపతి అయిన ఇంద్రుడికి, బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. పాప పరిహారార్థం, ఇంద్రుడు ఎన్నెన్నో క్షేత్రాలలో తపస్సు చేశాడు. మధురై వద్ద కదంబవనం దాటుతూవుంటే, తలవని తలంపుగా అతడికి పరిహారం జరిగింది. విషయం పరిశీలించిన తర్వాత, ఆ కదంబ వృక్షం కింద స్వయంభూ లింగం ఉందని తెలిసింది. అప్పుడు ఇంద్రుడు స్వర్ణ కమలాలతో ఆ లింగాన్ని పూజించాడు.  పూజ అయిన తరువాత దివ్య విమానం ఎక్కి, తన దేవలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. తరువాత కొంతకాలానికి, ధనంజయుడనే వ్యాపారి ఆ దారిలో నడుస్తుండగా, చీకటి పడేసరికి, విశ్రాంతి తీసుకోవడం కోసం కదంబ వృక్షం దగ్గర ఆగాడు. ఆ వ్యాపారికి తెల్లవారుజామున నిద్రలో, శివార్చన జరుగుతున్నట్లు కల వచ్చింది. వెంటనే కళ్ళు తెరిచి చూశాడు. ఆయన విశ్రాంతి తీసుకున్న కదంబవృక్షం క్రింద శివలింగం ఉందని గ్రహించాడు. వెనువెంటనే ఆ విషయాన్ని, వారి ప్రభువు కులశేఖర పాండ్యులకు తెలియజేశాడు. ఆ రాజు అరణ్యానికి వచ్చి, ఆ శివలింగాన్ని పూజించి, ఆలయాన్ని ఏర్పాటు చేయించాడు. తదుపరి పాండ్యరాజులకు ముఖ్య పట్టణమైన మధురై నగరాన్ని తీర్చిదిద్దిన ప్రభువు, ఆ కుల శేఖరుడే. అతని తరువాత గద్దెనెక్కిన రాజు, మలయధ్వజ పాండ్యుడు. ఆయనకు అగ్ని హోత్రంలో ఉద్భవించిన తడాతగై అనే బాలికే, మీనాక్షి అమ్మవారుగా, ఆ ఆలయంలో కొలువుదీరారు.

ఎంతో మహిమాన్వితమైన మీనాక్షి దేవి ఆలయం, దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధి చెందింది. కాలగమనంలో, మహామంత్రద్రష్టలైన కొందరు తమ స్వార్ధ పూరిత ఆలోచనలతో, తామే సర్వలోకాలకూ అధిపతులు కావాలనే కోరికతో, అమ్మవారి పీఠాలలోని యంత్రాలకు మరింత ఉగ్రత్వం సంతరించుకునేలా పూజలూ, యజ్ఞాలూ, హోమాలూ, బలులూ నిర్వహించి, ఆ తల్లిలో తామసిక శక్తిని ప్రేరేపించి, ప్రోత్సహించారు. అలా శాంత మూర్తి అయిన అమ్మవారు, ఉగ్రరూపాన్ని దాల్చి, రాజ్యాన్ని బలిగొన్నది. అలాంటి విపత్కర పరిస్థితులలో, ఆది శంకరుల వారు తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఏమిటి? అమ్మవారి లోని తామసిక శక్తిని ఆయన ఎలా పారద్రోలారు? అమ్మవారితో పాచికలాడి, ఆదిశంకరులు ఎలా గెలవగలిగారు? మీనాక్షీ దేవి ఉగ్రరూపాన్ని ఎలా కట్టడి చేయగలిగారు? మధుర మీనాక్షీ అమ్మవారి ఆలయంలో జరిగిన ఆనాటి సంఘటనలను తెలుసుకోవాలంటే, మన తదుపరి భాగం కోసం వేచి చూడండి. మధుర మీనాక్షి అమ్మవారి వృత్తాంతాన్ని తెలసుకున్న వారికి, సకల శుభాలు కలుగుతాయి. మీనాక్షి దేవిని పూజిస్తే, అనేక శుభాలు కలుగుతాయి. పెళ్లికాని అమ్మాయిలు మీనాక్షీ దేవిని పూజించినట్లయితే, ఆకర్షణీయమైన రూపాన్ని పొందడమే కాక, మంచి భర్తను పొందుతారు. ఈ పూజ చేయడం వలన, దాంపత్య సుఖాన్ని అనుభవిస్తారు. అసాధ్యాలను సుసాధ్యంగా మార్చగల శక్తి, మీనాక్షి దేవి సొంతం. అమ్మవారిని పూజించే వారి జీవితంలో, ఆమె సంతోషాన్ని నింపుతుంది. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి బాధలనైనా, అడ్డంకులనైనా ఎదుర్కునే శక్తిని ప్రసాదిస్తుంది.

ఓం శ్రీ మాత్రే నమః

Wednesday, November 15, 2023

వ్యాధ గీత! Vyadha Gita - Dharmavyadha భగవద్గీత Bhagavad Gita Chapter 18


వ్యాధ గీత!
మహాభారతంలో ఓ కసాయివాడు చెప్పిన వ్యాధ గీత!

'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (42 – 46 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 42 నుండి 46 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/rxo3TZCyXtQ ]


నాలుగు వర్ణాల వారిలో సహజంగా ఉన్న కర్మ లక్షణములు ఏంటో చూద్దాము..

00:47 - శమో దమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ ।
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజమ్ ।। 42 ।।

శమము (ప్రశాంతత), దమము (ఇంద్రియ నిగ్రహణ), తపస్సు, స్వచ్ఛత, సహనం, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానము, మరియు ఇహపరలోకములపై విశ్వాసము - ఇవి బ్రాహ్మణుల సహజసిద్ధ స్వభావ కర్మ లక్షణములు.

సాత్త్విక స్వభావము ప్రధానంగా కలవారు బ్రాహ్మణులు. వారి యొక్క ప్రధానమైన విధులు, తపస్సు ఆచరించటం, అంతఃకరణ శుద్ధి అభ్యాసం చేయటం, భక్తి మరియు ఇతరులకు తమ నడవడికచే స్పూర్తినివ్వటం. ఈ విధంగా, వారు సహనంతో, వినమ్రతతో, మరియు ఆధ్యాత్మిక చిత్తముతో ఉంటారని అందరూ ఆశిస్తారు. తమ కోసం, మరియు ఇతర వర్గాల కోసం కూడా, వైదిక కర్మకాండలను చేస్తారని, అందరూ ఆశిస్తారు. వారి సహజ స్వభావం వారికి జ్ఞాన-సముపార్జన పట్ల ఆసక్తిని కలుగజేస్తుంది. కాబట్టి, ఉపాధ్యాయ వృత్తి - జ్ఞానాన్ని పెంపొందించుకునీ, మరియు దానిని ఇతరులతో పంచుకునే వృత్తి కూడా వారికి అనుకూలంగా ఉండేది. వారు తామే స్వయంగా ప్రభుత్వ పరిపాలనలో పాలుపంచుకోకపోయినా, అధికారులకు దిశానిర్దేశం చేసేవారు. వారికి శాస్త్ర పరిజ్ఞానం ఉండేది కాబట్టి, సామాజిక మరియు రాజకీయ విషయాలపై వారి అభిప్రాయానికి చాలా విలువ ఉండేది.

02:18 - శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనమ్ ।
దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్ ।। 43 ।।

శౌర్యము, బలము, ధైర్యము, ఆయుధ విద్యలో నైపుణ్యం, యుద్ధంలోనుండి వెనుతిరగని సంకల్పము, విశాల హృదయముతో గల దయాగుణము, మరియు నాయకత్వ సామర్ధ్యము - ఇవి క్షత్రియులకు సహజంగా ఉన్న కర్మ లక్షణములు.

క్షత్రియులు ప్రధానంగా, రాజసిక లక్షణములతో ఉండి, కొద్దిగా సత్త్వగుణ మిశ్రమంతో ఉంటారు. అది వారిని రాజసంతో, వీరత్వంతో, ధైర్యంతో, నాయకత్వ లక్షణాలతో, మరియు దానగుణంతో ఉండేలా చేస్తుంది. వారి లక్షణములు వారికి సైనిక పరమైన, మరియు నాయకత్వ పనులకు అనుకూలంగా చేస్తాయి. వారు దేశాన్ని పాలించే పాలక వర్గముగా ఉంటారు. అయినా వారు బ్రాహ్మణులంత పవిత్రంగా, వారంత పాండిత్యంతో ఉండరని గ్రహించారు. అందుకే వారు బ్రాహ్మణులను గౌరవించేవారు, మరియు సైద్ధాంతిక, ఆధ్యాత్మిక, మరియు విధానపరమైన విషయాల్లో, బ్రాహ్మణుల నుండి సలహా తీసుకునేవారు.

03:26 - కృషిగౌరక్ష్యవాణిజ్యం వైశ్యకర్మస్వభావజమ్ ।
పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్ ।। 44 ।।

వ్యవసాయం, పాడిపంటలు, మరియు వర్తకవాణిజ్యాలనేవి, వైశ్య గుణములున్నవారికి సహజ సిద్ధమైన పనులు. పనులు చేయటం ద్వారా సేవ చేయటం అనేది, శూద్ర లక్షణములు కలవారి యొక్క సహజమైన విధి.

రాజసిక స్వభావం ప్రధానంగా ఉండి, దానిలో తమోగుణ మిశ్రమంగా కలవారు, వైశ్యులు. కాబట్టి వారు వాణిజ్యం, మరియు వ్యవసాయం ద్వారా, ఆర్థిక సంపత్తిని వృద్ధిచేసి, దానిని కలిగివుండటం వైపు మొగ్గు చూపిస్తారు. వారు దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తూ, ఇతర వర్గాల వారికి ఉద్యోగాలను కల్పించేవారు. పేదల కోసం ధార్మిక పనుల నిమిత్తం, వారు తమ యొక్క సంపదలో కొంత భాగాన్ని వెచ్చించాలని, అందరూ కోరుకునేవారు. శూద్రులు, అంటే తామసిక స్వభావం కలిగి ఉండేవారు. వారు చదువు, పాండిత్యం పట్ల, పరిపాలన పట్ల, లేదా వాణిజ్య కార్యకలాపాల పట్ల కానీ, ఆసక్తి చూపేవారు కాదు. వారి యొక్క పురోగతికి సరియైన మార్గమంటే, సమాజానికి, వారికి నచ్చిన రీతిలో సేవ చేయటమే. చేతిపనుల వారు, వృత్తిపనుల వారు, రోజు-కూలీలు, దర్జీలు, శిల్పులు, క్షురకుల వంటి వారు, ఈ వర్గంలో చేర్చబడ్డారు.

04:51 - స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః ।
స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు।। 45 ।।

స్వభావసిద్ధ జనితమైన వారి వారి విధులను నిర్వర్తించటం ద్వారా, మానవులు పరిపూర్ణ సిద్ధిని సాధించవచ్చు. ఒక వ్యక్తి తనకు విధింపబడిన విధులను ఆచరిస్తూ, పరిపూర్ణతను ఎలా సాధించగలడో, ఇక ఇప్పుడు నా నుండి వినుము.

స్వ-ధర్మ అంటే, మన గుణములు, మరియు జీవిత స్థాయిని బట్టి విధింపబడిన కర్తవ్యములు. వాటిని నిర్వర్తించటం వలన, మన శారీరిక, మానసిక సామర్థ్యాన్ని నిర్మాణాత్మకంగా, ప్రయోజనకరంగా వాడుకోవటం జరుగుతుంది. ఇది పరిశుద్దికీ, పురోగతికీ దారి తీస్తుంది. ఇది మనకూ, సమాజానికి కూడా మంగళకరమైనది. విహిత కర్మలు మన సహజస్వభావానికి అనుగుణంగా ఉన్నాయి కాబట్టి, వాటిని నిర్వర్తించటంలో మనం సుఖప్రదంగా, నిలకడగా ఉంటాము. ఆ తరువాత మన యోగ్యత, సమర్థతలను పెంచుకున్న కొద్దీ, స్వ-ధర్మం కూడా మారుతుంది. తద్వారా మనం తదుపరి ఉన్నత స్థాయిలోకి వెళతాము. ఈ రకంగా మన బాధ్యతలను శ్రద్ధతో నిర్వర్తించటం వలన, మనం పురోగతి సాధిస్తూ ఉంటాము.

06:07 - యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్ ।
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః ।। 46 ।।

తన సహజస్వభావ వృత్తిని నిర్వర్తించటం ద్వారా వ్యక్తి, సమస్త భూతములూ ఎవని నుండి ఊద్భవించాయో, ఎవ్వనిచే ఈ జగమంతా నిండి నిబిడీకృతమై ఉన్నదో, వానిని ఆరాధించినట్టు. ఇటువంటి పనులు చేయటం ద్వారా, వ్యక్తి సునాయాసముగానే సిద్ధిని పొందుతాడు.

భగవంతుని సృష్టిలో ఏ ఒక్క జీవి కూడా, అనావశ్యకమైనది ఉండదు. సమస్త జీవుల యొక్క క్రమబద్ధమైన పురోగతి కోసమే, ఆయన యొక్క దివ్య ప్రణాళిక రచించబడినది. భారీ చక్రంలో చిన్ని పళ్ళచక్రంలా, మనమందరమూ ఆయన బృహత్ పథకంలో భాగాలమే. ఆయన మనకిచ్చిన సామర్థ్యము కంటే ఎక్కువ, మననుండి ఏమీ ఆశించడు. కాబట్టి, మనం కేవలం మన స్వభావం, మరియు స్థాయికి అనుగుణముగా, మన స్వధర్మాన్ని నిర్వర్తిస్తే, మనం ఆయన దివ్య ప్రణాళికలో, మన అంతఃకరణ శుద్ధి కోసం పాలుపంచుకున్నట్టే. ఎప్పుడైతే మనం భక్తి యుక్త దృక్పథంలో పని చేస్తామో, మన పనే ఒక ఈశ్వర-ఆరాధన అవుతుంది. ఏ విధి కూడా అసహ్యకరమైనది, మరియు అపవిత్రమైనది కాదు. దాన్ని ఏ దృక్పథంతో చేస్తున్నామనే దాని మీదనే, ఆ పని యొక్క విలువ ఉంటుందన్న విషయాన్ని వివరిస్తూ, మార్కండేయ ముని, యుధిష్టురుడికి మహాభారతంలోని వన-పర్వంలో, ఒక కథ చెప్పి ఉన్నాడు. ఒక యువ సన్యాసి అడవిలోకి వెళ్లి, అక్కడ చాలాకాలం ధ్యానము, మరియు తపస్సులు ఆచరించాడు. అలా కొద్ది సంవత్సరములు గడచిన తర్వాత ఒకరోజు, ఆయన పైనున్న చెట్టు నుండి ఒక కాకి రెట్ట, ఆయనపై పడింది. ఆయన కోపంతో ఆ పక్షి వంక చూశాడు. దాంతో అది చచ్చి పడిపోయింది. తనకు తపశ్చర్యల ద్వారా అతీంద్రియ శక్తులు ప్రాప్తించినట్టు, ఆ సన్యాసి తెలుసుకుని, చాలా గర్వపడ్డాడు. కొద్దికాలం తరువాత ఆయన ఒక ఇంటికి బిక్ష అడగటానికి వెళ్ళాడు. ఆ ఇంటావిడ తలుపు దగ్గరకు వచ్చి, అనారోగ్యంతో ఉన్న తన భర్తకు సపర్యలు చేస్తున్నందున, ఆ సన్యాసిని కొద్దిసేపు వేచి ఉండమని ప్రార్థించింది. దీనితో ఆ సన్యాసి కోపగ్రస్తుడై, ఆమె వంక కోపంగా చూస్తూ, ఇలా మనసులో అనుకున్నాడు.. ‘ఓ అధమురాలా, ఎంత ధైర్యం నన్ను వేచి ఉండమని చెప్పటానికి! నా శక్తులు ఏమిటో నీకు తెలియదు’ అని అన్నాడు. ఆయన మనస్సులో ఉన్నది గ్రహించి, ఆ స్త్రీ ఈ విధంగా అన్నది, ‘నా పట్ల అలా కోపముగా చూడకు, నేనేమి కాకిని కాదు నీవు కోపంతో చూసిన చూపుకు భస్మమై పోవటానికి’ అని అన్నది. ఆ సన్యాసి ఆశ్చర్యచకితుడై పోయాడు. ఆ సంఘటన గూర్చి ఆమెకెలా తెలుసని అడిగాడు. ఆ ఇంటి ఆవిడ తాను ఏమీ తపస్సులు చేయలేదు కానీ, తన విధులను భక్తి శ్రద్ధలతో చేశానని చెప్పింది. అందుచే ఆవిడకు తేజస్సు ప్రాప్తించి, ఆయన మనస్సులో ఉన్నది తెలుసుకో గలిగింది. ఆ తరువాత అతనిని మిథిలా నగరంలో ఉండే ఒక ధర్మాత్ముడైన కసాయివాడిని కలవమని చెప్పింది. ఆయన ఇతని ధర్మ సందేహాలకు జవాబు చెప్పగలడని సెలవిచ్చింది. ఆ సన్యాసి మొదట్లో ఆ తక్కువ స్థాయి కసాయి వాడితో మాట్లాడటానికి తనకు కలిగిన సంకోచాన్ని అధిగమించి, మిథిలా నగరానికి వెళ్ళాడు. ధర్మాత్ముడైన ఆ కసాయివాడప్పుడు, మనకందరికీ మన పూర్వజన్మ కర్మలు, మరియు సామర్థ్యమును అనుసరించి, స్వ-ధర్మములు ఉన్నాయని చెప్పాడు. అయినా మనం స్వార్థ చింతనను విడిచి, మనకొచ్చే సుఖదుఃఖాలకు అతీతంగా ఉంటూ, మన సహజ స్వభావ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే, మనల్ని మనం పరిశుద్ధి చేసుకుని, పై మెట్టు ధర్మ స్థాయికి చేరుకుంటాము. ఈ విధంగా కర్తవ్య విధులను, వాటి నుండి పారిపోకుండా నిర్వర్తిస్తే, జీవాత్మ క్రమక్రమంగా తన ప్రస్తుత మొరటు దృక్పథం నుండి, దివ్యమైన ఆధ్యాత్మిక చైతన్యం వైపు పురోగమిస్తుంది. ఆ కసాయివాడు చెప్పిన ఉపదేశమే, మహాభారతంలో, వ్యాధ గీత అని అంటారు. ఈ ఉపదేశం, ప్రత్యేకంగా అర్జునుడికి బాగా వర్తిస్తుంది. ఎందుకంటే, కష్టతరం మరియు బాధాకరం అని భావించి, అర్జునుడు తన స్వ-ధర్మం నుండి పారిపోదలచాడు. తన స్వధర్మాన్ని సరైన దృక్పథంలో చేయటం ద్వారా, అర్జునుడు ఈశ్వరుణ్ణి ఆరాధించినట్టే అనీ, తద్వారా పరిపూర్ణ సిద్ధిని సునాయాసంగా సాధించవచ్చనీ, ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.

10:42 - ఇక మన తదుపరి వీడియోలో, ఎటువంటి వారు శ్రేష్ఠమైన నైష్కర్మ్య సిద్ధిని పొందుతారో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, November 13, 2023

తండ్రి గర్భంలో జన్మించిన అతడు ఎవరు? Mandhata – The legendary King


తండ్రి గర్భంలో జన్మించిన అతడు ఎవరు?

హిందూ పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశ కీర్తి ఆ చంద్ర తారార్కం నిలిచిపోతుంది. షోడశ మహారాజులలో ఓకడిగా కీర్తిగడించిన, ఇక్ష్వాకు వంశస్థుడు మాంధాతకు సంబంధించిన ప్రస్తావన, మహాభారతంలోని శాంతి పర్వము, వన పర్వములో కనిపిస్తుంది. ఈ షోడశమహారాజులకు సంబంధించిన వీడియోని గతంలో మన చానెల్ లో పుబ్లిష్ చేశాను. చూడని వారికోసం దాని లింక్ ను క్రింద డిస్క్రిప్షన్ లో పొందు పరిచాను. ఎంతో విచిత్రమైన మాంధాత జననం ఎలా జరిగింది?  అతి బలవంతుడైన రావణుడితో మాంధాత యుద్ధం ఎందుకు చేయవలసి వచ్చింది? ఇంద్ర సింహాసనాన్ని అధిష్టించాలనుకున్న మాంధాత కోరిక నెరవేరిందా? భూమండలాన్ని ఏకచ్ఛాత్రిధిపతిగా ఏలిన మాంధాతకు మరణం ఎలా సంభవించింది - వంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/bAds8CIzcuw ]


అరణ్యవాసంలో ఉన్న పాండవులు, సైంధవారణ్యంలోకి ప్రవేశించారు. అక్కడ ప్రవహిస్తున్న యమునా నదిని చూసి, వారితో ఉన్న రోమశుడు ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, ఇది యమునా నది. గంగా నదితో సమానమైనది. దీని తీరాన మాంధాత అనే మహారాజు ఎన్నో యాగాలు చేశాడు. ఆయన చరిత్ర చెపుతాను విను. పూర్వం ఇక్ష్వాకు వంశంలో ధార్మికుడూ, కీర్తివంతుడూ, ధర్మశీలుడూ, బలవంతుడూ అయిన యవనాశ్వుడనే రాజు ఉండేవాడు. అతనికి వంద మంది భార్యలు ఉన్నా, సంతానం మాత్రం కలుగలేదు. ఆ కారణంతో ఎంతో చింతించిన యవనాశ్వుడు, భృగుమహర్షి ఆశ్రమానికి వెళ్ళి, సంతానం కోసం అర్ధించాడు. అతని కోరిక మన్నించిన భృగుమహర్షి, పుత్రకామేష్టి యాగం చేశాడు. యాగం అనంతరం మంత్రజలం నిండిన పాత్రను పక్కన ఉంచాడు. యాగ నిమిత్తం, ఆ రోజు మొత్తం ఉపవాసం ఉన్న యవనాశ్వుడు, అర్ధరాత్రి సమయంలో దాహంవేసి, తెలియక ఆ మంత్రజలాన్ని త్రాగాడు. ఇది భృగుమహర్షికి తెలిసి యవనాశ్వునితో, "రాజా! విధి అనుల్లంఘనీయం. నీ భార్యకు ఇవ్వవలసిన జలాన్ని, నీవు త్రాగావు. కనుక నీవు గర్భం ధరిస్తావు. నీ భార్య ఈ మంత్ర జలాన్ని తాగినట్లయితే, దేవేంద్రుడికి సమానమైన కుమారుడు జన్మించేవాడు. ఈ జలాన్ని నీవు తాగడం వలన, నువ్వు కుమారుడికి జన్మనిస్తావు" అని చెప్పాడు.

ఆ విధంగానే, యవనాశ్వుడు గర్భం ధరించాడు. అతని ఉదరం ఎడమభాగాన్ని చీల్చుకుని, కుమారుడు కలిగాడు. అతనే మాంధాత. ఆ శిశువును చూడటానికి ఇంద్రుడితో సహా, దేవతలందరూ వచ్చాడు. ఆ బాలుడు ఇంద్రుడి చూపుడు వ్రేలిని నోటిలో పెట్టుకుని, అమృతాన్ని సేవించాడు. అందువలన అతనికి మాంధాతృడు అని నామకరణం చేశాడు. చిన్నతనం నుంచే ఎన్నో సాహసాలు చేసేవాడు. యుద్ధాల్లో చేసే పోరాటాలను ఎంతో ఆసక్తిగా నేర్చుకుని, అందరిలోనూ మేటిగా నిలిచాడు. మాంధాతను 12వ ఏట రాజ్యభిషిక్తుడిని చేసి, తపస్సుకు వెళ్ళిపోయాడు యవనాశ్వుడు. ఎంతో శక్తివంతమైన రాజుగా ఎదిగాడు మాంధాత. ప్రజలకు పన్నుల భారం లేకుండా, వారిని సుఖంగా చూసుకున్నాడు. కొంతకాలం రాజ్యభారం మోసిన తరువాత, సైంధవారణ్యానికి వెళ్ళి, మాంధాత విష్ణువును గురించి తపస్సు చేశాడు. దాంతో ఇంద్రుడు ప్రత్యక్షం అయ్యి, తనకు నమస్కరించిన మాంధతతో, "మాంధాతా! నువ్వు విష్ణువును ప్రసన్నం చేసుకోవడం అంత సులభం కాదు. అందుకని నేను ప్రత్యక్షం అయ్యాను. నీ కోరిక ఏమిటో నేను నెరవేరుస్తాను" అని అన్నాడు. దాంతో మాంధాత, "మహేంద్రా! నాకు ఈ సంసారం మీద విరక్తి కలిగించి, బిక్షుకవృత్తి మీద ఆసక్తి కలిగించు" అని కోరాడు.

అప్పుడు ఇంద్రుడు మాంధాతతో, "ఓ మహారాజా! అన్ని ధర్మములలోకి రాజధర్మం గొప్పది. రాజు కామక్రోధములు విడిచి, దండనీతిని అమలు చేస్తూ రాజ్య పాలన చేయాలి. అప్పుడు రాజుకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. అలాంటి మహారాజైన నీకు, భిక్షుక వృత్తి, ఆచరణ యోగ్యం కాదు. ప్రజలను రక్షించడం, యుద్ధంలో మరణించడం, క్షత్రియధర్మం. భిక్షుకవృత్తి రాజధర్మం కాదు. మానవులలో రాజు శ్రేష్టుడని, వేదములు ఘోషిస్తున్నాయి” అని అన్నాడు. “ధర్మబద్ధమైన దండనీతికి సాటి అయినది వేరే లేదని పెద్దలు చెప్పారు కదా! కనుక ఓ మహారాజా! నీవు కామక్రోధములు విడిచి పెట్టి, దండనీతిని అమలు చేస్తూ రాజ్యం చెయ్యి. అంతే కానీ, భిక్షుకవృత్తి నీకు సరికాదు" అని మాంధాతతో ఇంద్రుడు చెప్పాడు. ఆ తరువాత మాంధాత ముల్లోకాలనూ జయించడానికి పూనుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న లంకాధిపతి రావణుడు, మాంధాతను ఎలాగైనా ఓడించాలనుకున్నాడు. తనకంటే బలమైనవాడు లేడని నిరూపించడం కోసం, అతనితో యుద్ధానికి దిగేందుకు రావణుడు సన్నద్ధం అయ్యాడు. లాంకాధీశుడైన రావణాసురుడు కూడా, బలవంతుడు, శక్తివంతుడైన రాజు. బ్రహ్మ చేత వరాలను పొంది, అహంభావంతో సాధుజనులనూ, ముని పుంగవులనూ హింసించేవాడు. మాంధాత పైకి యుద్ధానికి వెళ్ళాడు రావణుడు. ఇద్దరి మధ్య భీకర పోరు సాగింది. మాంధాత రావణుని సైన్యములోని అకంపనుడు, మహెూదరుడు, విరుపాక్షుడి వంటి అనేక మంది యోధులను సంహరించగా, రావణుడే నేరుగా మాంధాతతో తలపడ్డాడు. ఇద్దరూ దివ్యాస్త్రాలతో యుద్ధం సాగించారు.

రావణుడు మాంధాతపై ఆధిపత్యము సాధించటానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా, మాంధాత పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ విధంగా ఇద్దరూ శక్తివంతమైన అస్త్రాలను ప్రయోగించగా, ముల్లోకాలను వీటి నుండి రక్షించటానికి, ఋషులు పులస్త్యుడు, గాలవ్యుడు కల్పించుకుని, ఇద్దరినీ యుద్ధమును విరమించుకొమ్మని, సంధి చేశారు. ఆ ఋషులు, భవిష్యత్తులో మాంధాత వంశములో జన్మించే కారణజన్ముడూ, సాక్షాత్తు విష్ణు మూర్తి అవతారమైన శ్రీరాముని చేతిలో రావణాసురుడు మరణించవలసి ఉన్నదని, మాంధాతతో చెప్పి యుద్ధం నుండి విరమింపజేశారు. విషయము తెలియక పోయినా, మాంధాత పరాక్రమానికి వెరచి, రావణుడు కూడా యుద్ధం నుండి విరమించాడు. రావణాసురుడిని సైతం ఓడించిన రాజుగా, మాంధాత ప్రఖ్యాతి గడించాడు. చంద్ర వంశానికి చెందిన యాదవ రాజైన శసవిందు కుమార్తె బిందుమతిని వివాహమాడాడు, మాంధాత. వీరికి ముగ్గురు కుమారులూ, యాభై మంది కుమార్తెలూ కలిగారు. కుమారులైన పురుకుత్స, అంబరీష, ముచికుందులు కూడా, మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు.

మాంధాత తన పరిపాలనా కాలంలో, కరువు వచ్చినప్పుడు సహజంగా కురవలసిన వర్షాలు కురువపోతే, తన బాణాలను ప్రయోగించి వర్షాలను కురిపించాడు. వరుణ విద్యలో మాంధాత ఆరితేరినవాడు. కొన్ని వందల అశ్వమేధ యాగాలనూ, రాజసూయ యాగాలను చేశాడు. అంతేకాదు, అనేక ఆలయాలను తన రాజ్యంలో నిర్మింపజేశాడు. భూలోకాన్నీ, పాతాళాన్నీ, సగం స్వర్గాన్నీ జయించిన మాంధాత, ఇంద్రుడి అర్థ సింహాసనాన్ని అధిష్టించాలనే తన కోరికను ఇంద్రుడికి చెప్పాడు. అందుకు ఇంద్రుడు, "ముందు భూలోకాన్ని జయించి, ఆ తర్వాత ఇంద్రలోకాన్ని నువ్వు జయించవచ్చు" అని చెప్పాడు. "భూలోకంలో నేను ఓడించని రాజెవరు" అని ఇంద్రుడిని అడిగాడు మాంధాత. అందుకు ఇంద్రుడు, "మధువు కుమారుడైన లవణుడిని ఓడించి, తరువాత ఇంద్రలోకంలోని సింహాసనాన్ని అధిష్ఠించు" అని చెప్పాడు. ఇండ్రుడి మాట ప్రకారం భూమ్మీదకు వచ్చిన మాంధాత ముందుగా, తన ఆధిపత్యం శిరసా వహించాలని, లవణుడి వద్దకు దూతను పంపించాడు. లవణుడు అతని మాట లక్ష్యపెట్టక, వచ్చిన దూతను కూడా చంపేశాడు. అప్పుడు లవణుడితో మాంధాత, యుద్ధానికి తలపడ్డాడు. ఆ ఘోర యుద్ధంలో, లవణుడు తనకు పరమశివుడు ప్రసాదించిన శూలంతో, మాంధాతను సంహరించాడు. మాంధాతను సంహరించిన లవణుడు, రావణాసురుడి వంశస్థుడు కావడం, గమనార్హం.  భూమండలాన్ని ఏకచ్చత్రాధిపత్యంగా అనుభవించి, బ్రాహ్మణులకు అన్న సంతర్పణం చేసి, అశ్వమేధ యాగాలు చేసిన మాంధాత చక్రవర్తి, షోడశ రాజులలో ప్రముఖుడిగా కీర్తిగడించాడు. ఇక్ష్వాకు వంశంలోని సాటిలేని మేటి మహారాజుగా మన ఇతిహాసాలలో పేర్కోనబడ్డాడు మాంధాత.

Sunday, November 12, 2023

దీపావళి ఐదు రోజుల పండుగ అంటారు? వాటి విశేషాలు ఏమిటి? Deepavali Significance


అందరికీ దీపావళి శుభాకాంక్షలు 🙏

దీపావళి ఐదు రోజుల పండుగ అంటారు? వాటి విశేషాలు ఏమిటి?

ధన్వంతరీ త్రయోదశి..

వాడుకలో ధన త్రయోదశి అని అంటూ ఆ రోజు బంగారం కొనాలనే ఆశ పడుతున్నాం ! కానీ ఆరోజు ‘ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి మూల పురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన ‘ధన్వంతరీభగవాన్’ జయంతి. పాల సముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృత భాండముతో అవతరించాడు.

నరక చతుర్దశి..

నరక యాతనల నుండి రక్షించమని యముడి ప్రీతి కొరకు మరియు పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలి. నరకుడు చనిపోయిన రోజు కూడా ఇదే రోజు ప్రాక్జ్యోతీషపురం (నేటి అస్సాము)ను పాలించిన ‘నరకుడు’ నర రూప రాక్షసుడు. దేవీ ఉపాసకుడే కానీ దేవిని వామాచారంలో క్షుద్రపూజలు చేసి అనేక అధ్భుత శక్తులను సంపాదించి, దేవతలను కూడా ఓడించాడు. వాడు ప్రతీ అమావాస్య - పౌర్ణమికి నవ యవ్వన రాచ కన్యలను దేవికి బలి ఇచ్చే వాడు. కాముకత్వంతో అనుభవించేవాడు. నరకుని చెరసాలలో వేలాది అందమైన మహిళలు (రాచకన్యలు) బందీలుగా వుండేవారు. ఆది వరాహమూర్తికి – భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకుడు. తామస ప్రవృత్తితో జనించాడు. శ్రీకృష్ణ భగవానుడు – సత్యభామ (భూదేవీ అవతారం)తో కలసి గరుడారూఢుడై వచ్చి శక్తి ఉపాసకుడైన నరకుని శక్తి (సత్యభామ) సహకారంతో సంహరించాడు. నరకుని పీడ విరగడైంది కావున, ఇది ‘నరక చతుర్దశి’.

దీపావళి..

రావణ సంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన శుభ సంధర్బంగా దీపావళి జరుపు కోవాటం, నరకుని బాధల నుండి విముక్తి లభించిన ఆనందంలో దీపావళిని జరుపుకోవటం, అనాదిగా వస్తున్న ఆచారం. 'దీపం' లక్ష్మీ స్వరూపం, ఐశ్వర్య స్వరూరం, జ్ఞాన స్వరూపం.. అందుకే మనం దీపావళి రోజు లక్ష్మీ పూజలు చేస్తాము. వ్యాపారస్తులు కొత్త లెక్కలు వ్రాసుకుంటారు.

బలి పాఢ్యమి..

వామనావతారంలో శ్రీమన్నారాయణుడు బలి చక్రవర్తిని ‘మూడు అడుగుల’ నేలను దానమడిగాడు. వామన వటువుకు దానమిచ్చాడు బలి. ‘ఇంతింతైవటుడింతైనభోరాశిపైనల్లంతై’ అన్నట్లుగా, ఒక పాదంతో భూమిని, ఇంకో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించిన ‘త్రివిక్రముడు’, వేరొక పాదంతో బలిని పాతాళానికి అణచాడు. సంవత్సరానికి ఒకసారి బలి పాడ్యమి రోజున బలి భూలోకానికి వచ్చి, ఇక్కడి దీప కాంతులను చూసి, మనమంతా సుఖశాంతులతో వుండాలని ఆశీర్వదించి వెలతాడని పురాణ విదితం. ఇది ఆయనకు వామనుడిచ్చిన వరం.

యమద్వితీయ..

సూర్య భగవానునికి యముడు, శనిదేవుడు, ఇద్దరు పుత్రులు, యమున అనే ఒక పుత్రిక ఉన్నారు. యముడు, యమున ఇద్దరూ అన్నా చెల్లెలు కదా! తనపని (జీవులను ఆయువు మూడిన తర్వాత తన యమపాశంతో ఈడ్చుకు వచ్చి, వారి వారి కర్మాను సారం వారికి తగిన శిక్షలు విధించే పని) లో పడి, పాపం చెల్లెలింటికి వెళ్ళటం లేదు యముడు. ఒకసారి మా ఇంటికి రా అన్నయ్యా అని చెల్లి బతిమాలింది. కార్తీక శుద్ఘ విదియ, మంగళవారం రోజు తీరిక చేసుకుని, తన చెల్లెలింటికి వెళ్లి హాయిగా కొద్ది సేపు వుండి భోజనం చేసి వచ్చాడు యముడు. చెల్లెలైన యమున అన్నయ్యను ఒక వరం అడిగింది. 'ఎవరైతే ఈ రోజు చెల్లెలింటికి వెళ్లి, చెల్లెలికి కట్నకానుకలిచ్చి, వాళ్ళింట్లో భోజనం చేసి వస్తారో, వారికి యముని బాధలు లేకుండా చేయి' అని అడిగింది. ఈ యమునమ్మనే, యమునా నది. కృష్ణుని భక్తురాలు. భగినీ హస్త భోజనం అన్న పేరుతో, ఉత్తర భారతంలో ఈ పండుగ ఇప్పటికీ జరుపుకుంటారు.

Wednesday, November 8, 2023

కులవ్యవస్థ! Casteism భగవద్గీత Bhagavad Gita Chapter 18


కులవ్యవస్థ!
బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రుల గురించి శ్రీకృష్ణుడేం చెప్పాడు?

'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (37 – 41 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 37 నుండి 41 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/uyfTaY-i77Q ]


సత్వ గుణ ఆనందం, రజో గుణ ఆనందం, తామసిక ఆనందం ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాము..

00:49 - యత్తదగ్రే విషమివ పరిణామేఽమృతోపమమ్ ।
తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమ్ ఆత్మబుద్ధిప్రసాదజమ్ ।। 37 ।।

మొదట్లో విషంలా అనిపించినా, చివరికి అమృతంలా ఉండే సుఖమే, సత్త్వ గుణ సుఖము. అది ఆత్మ-జ్ఞానము యందే స్థితమై ఉన్న స్వచ్ఛమైన బుద్ధిచే జనిస్తుంది.

ఉసిరికాయ, ఆరోగ్యానికి లాభకారియైన అత్యుత్తమ ఆహారపదార్ధాలలో ఒకటి. దానిలో, 10 నారింజ పళ్ళకన్నా ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. కానీ, అది పుల్లగా ఉంటుంది కాబట్టి, పిల్లలకు అది ఇష్టం ఉండదు. ఆసక్తికర విషయం ఏమిటంటే, ఉసిరికాయ తిన్న తరువాత, రెండు నిమిషాల వ్యవధిలోనే, పుల్లని రుచి పోయి, తియ్యని రుచి అనుభవంలోకి వస్తుంది. సత్త్వ గుణ సుఖము, సరిగ్గా ఇటువంటిదే. అది ప్రస్తుతానికి చేదుగా అనిపించినా, అంతిమంగా అమృతంలాగా ఉంటుంది. వేదములు ఈ యొక్క సత్త్వ గుణ సుఖాన్ని, 'శ్రేయస్సు' అని చెప్పాయి. అంటే, ప్రస్తుతానికి ఇబ్బందిగా ఉన్నా, అంతిమంగా అది చాలా మంచిది. దీనికి వ్యతిరేకం 'ప్రేయస్సు'. అది ప్రస్తుతానికి సుఖంగా ఉన్నా, అంతిమంగా హానికారకమే. ఈ శ్రేయస్సు మరియు ప్రేయస్సు గురించి, కఠోపనిషత్తు ఈ విధంగా పేర్కొన్నది.. రెండు మార్గాలు ఉన్నాయి - ఒకటి “మేలుకలిగించేది”, ఇంకొకటి “సుఖంగా” ఉండేది. ఈ రెండూ మనుష్యులను రెండు భిన్నమైన గమ్యాలకు చేరుస్తాయి. సుఖంగా ఉండేది, మొదట్లో హాయిగా అనిపిస్తుంది. కానీ, అది బాధతో ముగుస్తుంది. అజ్ఞానులు ఈ సుఖాలలో చిక్కుకుపోయి, చివరకు నశించిపోతారు. కానీ, వివేకవంతులు ఈ ఆకర్షణలచే మోసపోరు. అందుకే వారు ప్రయోజనకరమైన దానిని ఎంచుకుని, సుఖానందాన్ని పొందుతారు.’

02:41 - విషయేంద్రియసంయోగాత్ యత్తదగ్రేఽమృతోపమమ్ ।
పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్ ।। 38 ।।

ఇంద్రియములతో, ఇంద్రియ వస్తువిషయముల సంపర్కముచేతా కలిగిన సుఖమును, రాజసిక సుఖమని అంటారు. ఈ సుఖానందము మొదట్లో అమృతంలా ఉన్నా, చివరకు విషంలా ఉంటుంది.

రాజసిక సుఖమనేది, ఇంద్రియములకు ఇంద్రయవస్తువిషయ సంపర్కము కలిగినప్పుడు అనుభవించే అనుభూతి. కానీ, ఆ కలయిక మాదిరిగానే, సుఖానందము కూడా తాత్కాలికమే. ఈ ప్రక్రియలో అది దురాశ, ఆందోళన, అపరాధభావన, మరియు మరింత భౌతిక భ్రాంతిని కలుగచేస్తుంది. భౌతిక జగత్తులో కూడా, అర్థవంతమైన పురోగతి సాధించాలంటే, రాజసిక సుఖాన్ని త్యజించవలసి ఉంటుంది. నిత్య శాశ్వతమైన దివ్య ఆనందం కోసం ఉన్న మార్గము - భోగాలను అనుభవించటంలో లేదు. అది త్యాగము, తపస్సు, మరియు క్రమశిక్షణ లోనే ఉన్నది.

03:44 - యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః ।
నిద్రాలస్యప్రమాదోత్థం తత్తామసముదాహృతమ్ ।। 39 ।।

ఏదైతే ఆనందము - ఆత్మ యొక్క స్వభావాన్ని పూర్తిగా మొదలు నుండి చివర వరకు కప్పివేసి, నిద్ర, సోమరితనము, మరియు నిర్లక్ష్యము నుండి ఉద్భవించినదో - అది తామసిక ఆనందమని చెప్పబడును.

తామసిక సుఖము, అన్నింటికన్నా నిమ్న స్థాయికి చెందినది. అది మొదటినుండీ చివర వరకూ మూర్ఖమయినది. అది ఆత్మను అజ్ఞానపు చీకటిలో విసిరివేస్తుంది. అయినా సరే, దానిలో ఒక స్వల్పమాత్ర సుఖము ఉండటం చేత, జనులు దానికి బానిసై పోతారు. అందుకే సిగరెట్టు త్రాగేవారు, అది తమకు చాలా హానికారి అనితెలిసి కూడా, ఆ అలవాటును వదిలిపెట్టటానికి కష్టతరంగా భావిస్తారు. ఆ దురలవాటు నుండి లభించే సుఖాన్ని త్యజించలేకపోతారు. నిద్ర, సోమరితనము, మరియు నిర్లక్ష్యం ద్వారా జనించిన ఇటువంటి సుఖానందాలు, తమోగుణములో ఉన్నట్లని, శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు.

04:50 - న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః ।
సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః ।। 40 ।।

ఈ భౌతిక జగత్తు యందు - భూమిపై కానీ, లేదా, ఊర్ధ్వ స్వర్గాది లోకాలలో కానీ - ఏ ఒక్క ప్రాణి కూడా ఈ ప్రకృతి త్రిగుణముల ప్రభావానికి అతీతము కాదు.

భౌతిక శక్తి అయిన మాయ, మూడు వర్ణములలో ఉంటుంది. తెలుపు, ఎరుపు, మరియు నలుపు.. అంటే, దానికి మూడు గుణములు ఉంటాయి.. సత్త్వము, రజస్సు, మరియు తమస్సు. విశ్వములోని అసంఖ్యాకమైన జీవులకు, అది మాతృ-గర్భము వంటిది. పుట్టుకలేని, సంపూర్ణ జ్ఞాన స్వరూపుడైన ఆ భగవంతునిచే, అది అస్థిత్వములోనికి తేబడి, ఆయనచే నిర్వహించబడుతున్నది. కానీ, భగవంతునికి ఈ భౌతిక శక్తి అంటదు. ఆయన తనకుతాను వేరుగా, అలౌకిక లీలానందమును రమిస్తుంటాడు. కానీ, జీవుడు దానిని భోగిస్తూ, తద్వారా బద్ధుడై పోతాడు. నరక లోకాల నుండి బ్రహ్మ లోకం వరకూ, మాయ యొక్క పరిధి ఉంటుంది. ప్రకృతి త్రిగుణములు - సత్త్వము, రజస్సు, మరియు తమస్సులు, మాయ యొక్క అంతర్లీన గుణములు కాబట్టి, అవి అన్ని భౌతిక లోకాలలో ఉంటాయి. అందుకే, ఈ లోకాలలో ఉండే సమస్త జీవ రాశులూ, వారు మానవులైనా లేదా దేవతలైనా, ఈ త్రి-గుణముల ప్రభావంలోనే ఉంటారు. ఉన్న తేడా అంతా, ఈ గుణములు ఉండే పాళ్ళు వేర్వేరుగా ఉండటమే. నిమ్న లోకాలలో నివసించేవారు, తమోగుణము ప్రధానంగా కలిగి ఉంటారు. భూలోకంలో ఉండేవారు, రజోగుణ ప్రధానంగా ఉంటారు. ఇక స్వర్గాది లోకాలలో ఉండేవారు, సత్త్వ గుణ ప్రధానంగా ఉంటారు.

06:39 - బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం చ పరంతప ।
కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః ।। 41 ।।

బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు, వీరి యొక్క విధులు, వారివారి లక్షణములకు అనుగుణంగా, వారి వారి గుణముల ప్రకారంగా కేటాయించబడినవి.

జనులకు వారి వారి గుణముల ప్రకారంగా, వారి వ్యక్తిత్వాన్ని ఏర్పరిచే విభిన్నమైన స్వభావాలు ఉంటాయి. అందుకే విభిన్న వృత్తిపరమైన విధులు, వారికి అనుగుణముగా ఉంటాయి. ఈ యొక్క 'వర్ణాశ్రమ ధర్మములు' అనేవి, 'స్వభావ-ప్రభావైర్ గుణైః'.. అంటే, వ్యక్తి యొక్క స్వభావ గుణముల ఆధారంగా, పనిని అనుసరించి ఉన్న ఒక శాస్త్రీయమైన సామాజిక ఏర్పాటు. ఈ వర్గీకరణ పద్ధతిలో, నాలుగు ఆశ్రమాలూ,  మరియు నాలుగు వృత్తులూ ఉంటాయి.

1) బ్రహ్మచర్య ఆశ్రమం అంటే విద్యార్థి జీవితం, ఇది పుట్టుక నుండి 25 సంవత్సరాల వయస్సు వరకు ఉండేది.
2) గృహస్థ ఆశ్రమం అంటే కుటుంబపర జీవనం లేక సాధారణ వైవాహిక జీవితం, ఇది 25 సంవత్సరాల వయస్సు నుండి 50 సంవత్సరాల వరకు.
3) వానప్రస్థ ఆశ్రమం అంటే పాక్షిక సన్న్యాస జీవనం, ఇది 50 సంవత్సరాల వయస్సు నుండి, 75 సంవత్సరాల వయస్సు వరకు.. ఈ స్థితిలో, కుటుంబంలో ఉంటూనే, సన్న్యాసమును అభ్యాసం చేయటం.
4) సన్యాస ఆశ్రమం అంటే, 75 ఏళ్ల వయస్సు నుండి, ఆ పైకి.. ఇందులో వ్యక్తి అన్ని కుటుంబపర విధులనూ త్యజించి, ఒక పవిత్ర ప్రదేశంలో నివసిస్తూ, మనస్సును భగవంతుని యందే నిమగ్నం చేస్తాడు.

ఇక బ్రాహ్మణ పురోహితులు అంటే, పౌరోహిత్యం చేసేవారూ, క్షత్రియులు అంటే యోధులు మరియు పరిపాలన చేసేవారూ, వైశ్యులు అంటే వ్యాపారం, మరియు వ్యవసాయం చేసేవారూ, శూద్రులు కాయకష్టం చేసేవారూ.. ఈ నాలుగు వర్ణములవారికి, నాలుగు వృత్తి ధర్మములు నిర్దేశించబడినవి. వర్ణములనేవి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఎప్పుడూ పరిగణింపబడలేదు. సమాజం మొత్తం భగవంతుని చుట్టూ, ఆయన సేవార్థమే ఉండేది కాబట్టి, అందరూ తమనూ, మరియు సమాజాన్ని పోషించేందుకు, తమ స్వాభావిక సహజ గుణముల ప్రకారంగా పని చేసేవారు; తద్వారా భగవత్ ప్రాప్తి దిశగా ముందుకెళ్లి, జీవితాన్ని సఫలం చేసుకునేవారు. ఈ విధంగా వర్ణాశ్రమ వ్యవస్థలో, భిన్నత్వంలో ఏకత్వం ఉండేది. ప్రకృతిలో భిన్నత్వం అనేది, అంతర్గతంగా ఎల్లప్పుడూ ఉండేదే.. దానిని పూర్తిగా నిర్మూలించలేము. మన శరీరంలోనే విభిన్నమైన అంగములు ఉన్నాయి. అవన్నీ వేర్వేరు పనులు చేస్తుంటాయి. అన్ని అంగములూ ఒకే పని చేయాలని ఆశించటం, అవివేకం. వాటన్నిటినీ భిన్నంగా చూడటం అజ్ఞానం కాదు.. అది వాటి యొక్క యదార్థ ప్రయోజనాన్ని చూడటమే. అదే విధంగా, మానవులలో ఉండే వైవిధ్యాన్ని కూడా మనం విస్మరించలేము. సమత్వమే ప్రధాన సూత్రంగా ఉన్న కమ్యూనిస్ట్ దేశాలలో కూడా – సిద్ధాంతాలనూ, చట్టాలనూ ప్రతిపాదించే పార్టీ నాయకులు ఉంటారు. ఆయుధాలు ధరించి దేశాన్ని కాపాడే సైనికులూ, సైన్య బలం ఉంటుంది. వ్యవసాయం చేసుకునే రైతులు ఉంటారు. శారీరక పనిచేసే ప్రారిశ్రామిక కార్మికులు ఉంటారు. ఎంత సమానంగా ఉంచాలని చూసినా, ఈ నాలుగు రకాల వృతుల వారు, అక్కడ కూడా ఉంటారు. వర్ణాశ్రమ వ్యవస్థ, మనుష్యులలో ఉన్న వైవిధ్యాన్ని గుర్తించి, వారివారి స్వభావాల అనుగుణంగా, వారికి సరిపోయే వృత్తులను శాస్త్రీయంగా సిఫారసు చేసింది. కానీ, కాలక్రమంలో, వర్ణాశ్రమ వ్యవస్థ భ్రష్టుబట్టిపోయింది. వర్ణమనేది వ్యక్తి యొక్క గుణ-స్వభావంపై కాక, వాని యొక్క పుట్టుకపై ఆధారమైపోయింది. ఉన్నత కులము, తక్కువ కులము అన్న భావము ప్రబలిపోయింది. తక్కువ కులం వారిని చిన్నచూపు చూడటం మొదలయ్యింది. ఎప్పుడైతే ఈ వ్యవస్థ బిరుసుగా, పుట్టుక ఆధారంగా అయిపోయిందో, అది అస్తవ్యస్థమై పోయింది. ఈ సామాజిక దోషం, కలికాలంలో ప్రబలిందే కానీ, వర్ణాశ్రమ వ్యవస్థ యొక్క అసలు ఉద్దేశ్యం కాదు.

10:58 - ఇక మన తదుపరి వీడియోలో, నాలుగు వర్ణాల వారిలో సహజంగా ఉన్న కర్మ లక్షణములు ఏంటో, శ్రీ కృష్ణుడి వివరణను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, November 6, 2023

999 ఏళ్ళ యుద్ధం! Sahasrakavacha


999 ఏళ్ళు యుద్ధం చేసిన రాక్షసుడికీ దాన వీర శూర కర్ణుడికీ సంబంధం ఏంటి?

ఈ లోకంలో బ్రహ్మ చేస్తున్న సృష్టికి సహకరించేందుకు, కొందరు ప్రజాపతులు తోడ్పడ్డారు. వారిలో ఒకరు, ధర్మ ప్రజాపతి. ఆ ధర్మ ప్రజాపతికి నరుడు, నారాయణుడనే కవల పిల్లలు జన్మించారు. నరుడు, నారాయణుడు, సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అవతారమేనని, మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీ హరి అవతారాలుగా, పురాణ ప్రాశస్త్యాన్ని పొందిన నరనారాయణులు ఎవరు? వారి ఆవిర్భావం ఎలా జరిగింది? వారి తపో శక్తి ముందు, శివుడు కూడా ఓడిపోయాడా? తపోధనులైన నరనారాయణులు, ఊర్వశిని ఎందుకు సృష్టించారు? మహాభారత సంగ్రామంలో కర్ణుడి మరణానికీ, నరనారాయణులకూ సంబంధం ఏమిటి - అనేటటువంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/tlNzC7ZYgwE ]


మన ఇతిహాసాలలో, తపోధనులుగా, దైవాంశ సంభూతులుగా పేరుగడించిన నరనారాయణులు, సనాతన మహర్షులు. శాంత సంయమనాలకు నెలవులు. నిజమైన, నిర్మలమైన ఆచారశీలతకూ, ఆధ్యాత్మిక నీతికీ, ధార్మిక రీతికీ, తపో నియతికీ, మంత్రానుష్టాన అనుభూతికీ, నిలువెత్తు సాక్ష్యాలు. నిజానికి ఒకే ఒక్క వైష్ణవ తేజం, నర నారాయణులు. ఒకప్పుడు వీరు సోదరులు. ఇంకొకప్పుడు మిత్రులు. మరొకప్పుడు గురుశిష్యులు. అన్ని యుగాలలో అవతరించిన దైవాంశ సంభూతులు. "పరమాత్మ ఇందుగలడందు లేడను సందేహము వలదు. శ్రీ హరి సర్వోపగతుడు. ఎందెందు వెదకూచిన అందందే గలడు" అంటూ తండ్రికి చెప్పి, స్థంభం నుండి నరసింహావతారమూర్తి ఆవిర్భావానికి, ప్రహ్లాదుడు తెరదీశాడు. అహంకారంతో, తనను ఎదిరించే వారులేరనే క్రోధంతో విర్రవీగుతూ, తన భక్తుణ్ణి సదా హింసిస్తున్న హిరణ్యకశిపుని సంహరించడానికి, ఆ ఆది దేవుడైన విష్ణువు, నృసింహమూర్తిగా ఒక స్తంభం నుండి పుట్టి, దుష్ట దానవుడైన హిరణ్యకశిపుని సంహరించాడు. అవతార లక్ష్యం నెరవేరింది.

కానీ, స్వామి భయంకరాకృతి, లోకాలకు భయానకంగా తయారైంది. అప్పుడు సదాశివుడు అతి భయంకర రూపమైన శరభసాళువుగా అవతరించి, నృసింహస్వామితో యుద్ధం చేసి, నరుడు – సింహములను రెండుగా, నరసింహ రూపాన్ని వేరు చేశాడు. ఈ నర - సింహములనే రెండు రూపాలే, అనంతర జన్మలో, ధర్మ ప్రజాపతికి నర నారాయణులుగా జన్మించారు. హిమాలయాల సమీపంలోని ఒక వనంలో, తపస్సు సాగించారు నరనారాయణులు. ఆ వనమంతా రేగుచెట్లతో నిండిపోయి ఉంది. ఆ రేగుపళ్లనే ఆహారంగా తీసుకుంటూ, వారు తమ తపస్సును కొనసాగించారు. రేగుపండుకు, బదరీఫలం అన్న పేరుంది కాబట్టి, అక్కడ తపస్సునాచరించిన నరనారాయణులకి, బదరీనాథుడన్న పేరు స్థిరపడింది. నరనారాయణుల ఘోరతపస్సు గురించి, అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి.

వారి తపస్సు తీవ్రతను లోకానికి తెలియచేయడానికి, ఒకసారి ఆ పరమేశ్వరుడు, తన పాశుపతాస్త్రాన్ని వారి మీదకు సంధించాడు. కానీ, నిర్వికల్ప సమాధిలో మునిగిపోయిన నరనారాయణుల ముందు, ఆ అస్త్రం సైతం తలవంచక తప్పలేదు. ఇది తెలిసిన ఇంద్రుడు, నరనారాయణుల తపోభంగానికి, మన్మథుణ్ణీ, అప్సరసలనూ పంపాడు. కానీ, మన్మథ బాణాలు ఆ మునుల యెడల నిర్వీర్యమైనాయి. అప్సరసల శృంగార చేష్టలు, చెల్లని నాణేలయ్యాయి. నరనారాయణులకు ఇంద్రుని కుతంత్రం తెలిసింది. నారాయణుడు తన ఊరువును లీలగా గీరాడు. అతని తొడ నుండి మరొక సుందరాంగి ప్రత్యక్షమైంది. అది చూసిన అప్సరసల మోములు చిన్నబోయాయి. నరనారాయణులు మందస్మితంగా కనిపించారు. వారి ధైర్యం, ఆత్మౌన్నత్యం, తపోనిష్ఠ, శమదమాదుల నిగ్రహం గమనించిన అప్సరసలకు, బుద్ది వికసించింది.

"స్వామీ! మీరు సామాన్యులు కారు. మహనీయులు. సాక్షాత్తు వైష్ణవ తేజోవిరాజితులు. ఆ నరసింహదేవుని ఆకృతియే, ఇలా మీ ఇద్దరి రూపంలో కన్పిస్తోంది. దివ్యమూర్తులైన మీ దర్శనభాగ్యం కలగడం, మా పురాతన సుకృతం. దేవేంద్రుని స్వార్థ బుద్ధికి ఇలా దిగబడ్డాము. అయినా ఆగ్రహించక, నిగ్రహంతో మా అపరాధాన్ని మన్నించి అనుగ్రహించారు" అంటూ అంజలి ఘటించారు. నరనారాయణులు కూడా దివ్యకాంతల వినయ విధేయతలకూ, బుద్ధి కుశలతకూ ముచ్చటపడ్డారు. "కాంతలారా! నా ఊరువుల నుండి పుట్టిన ఈ దివ్యకాంత, ఊర్వశిగా పిలువబడుతుంది. ఈమెను మీతో స్వర్గానికి కొనిపోండి. ఇది స్వర్గానికి మా కానుక. దేవేంద్రునకు ఉపహారం. దివ్యులకు మేలు కలుగుగాక. ఎన్నడూ తపోధనుల యెడల అనుచితంగ ప్రవర్తించకండి" అని చెప్పారు. దివిజకాంతలు నరనారాయణుల పాదపద్మాలకు నమస్కరించి, దివిజలోకం చేరుకున్నారు.

అలాగే, నరనారాయణుల వేల సంవత్సరాల తపస్సుకు కూడా, ఒక లక్ష్యం ఉంది. అదే, సహస్ర కవచుని సంహారం. సహస్ర కవచుడు, ఒక రాక్షసుడు. పుట్టుకతోనే వేయి కవచములను శరీరంలో కలిగి ఉన్నటువంటి వాడు. వానితో పోరు సలపాలంటే, వేయి సంవత్సరాల తపోబలం కావాలి. వాడి సంహారం కానట్లయితే, దివిజులకూ, మానవులకూ, మహర్షులకూ కంటకమవుతుంది. ధర్మం నశిస్తుంది. జన జీవన విధానానికి విఘాతం ఏర్పడుతుంది. అందుకే, నర నారాయణులుగా వైష్ణవతేజం ఆవిర్భవించింది. నరుడు తపస్సు చేస్తుంటే నారాయణుడూ, నారాయణుడు తపస్సు చేస్తుంటే నరుడూ, ఇలా సహస్ర కవచునితో తలపడ్డారు. ఒక్కొక్కమారు ఒక్కో కవచం చొప్పున, నర నారాయణులు ఆ రాక్షసుని 999 కవచాలు ఛేదించారు. ఇక ఒక్క కవచం మాత్రమే ఉంది. కానీ, వాడు ఆ కవచంతోనే తన జన్మను చాలించాడు. వాని ఆత్మ మాత్రం, రాక్షస భావంతో రగిలిపోతూ, మరలా జన్మించాడు. వాడే కర్ణుడు.

పుట్టుకతోనే కవచ కుండలాలతో జన్మించిన మహావీరుడు. అలాగే, నర నారాయణులు మరలా, వాని సంహారం కోసమే కృష్ణార్జునులుగా జన్మించారు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్ర మహాయుద్ధంలో, ఒకరు రథి, అంటే వీరుడిగా, మరొకరు సారథిగా, ధర్మయుద్ధం నిర్వహించారు. కృష్ణుడు మాయోపాయం పన్ని, ఇంద్రుని బ్రాహ్మణ రూపంలో పంపి, దానకర్ణుడైన ఆ సహస్రకవచుని కవచకుండలాలను స్వీకరించడంతో, కర్ణుడు ఓటమి పాలయ్యాడు. చివరి క్షణాలలో కర్ణుడు అర్జునునితో, "అర్జునా! ధర్మాన్ని రక్షిస్తే, ఆ ధర్మం మనలను కాపాడుతుందంటారు. మేము కూడా నిరంతరం, యథాశక్తి, యథాశ్రుతం, ధర్మాన్నే అనుసరించాము. కానీ, ఆ ధర్మం తన భక్తులమైన మమ్ము రక్షింపజాలకున్నది" అంటూ, ఎదురైన శాపాలకు తాపం చెందుతూ, కొద్దిసేపు యుద్ధం ఆపమని కోరుతూ చెప్పాడు. అప్పుడు పరమాత్మ, "కర్ణా! ఇప్పుడు నీకు ధర్మం గుర్తొచ్చిందా? లక్క గృహదహనం, ద్రౌపదీ వస్త్రాపహరణం, బాలుడైన అభిమన్యుని వధ, మొదలైన సంఘటనలలో, ఎక్కడా ధర్మాధర్మ విచక్షణ లేదే" అంటూ "నీచులు కష్టాలలో దైవ నింద చేస్తారు కానీ, తాము గతంలో చేసిన దుష్కృతాల వలననే, దుష్పలితాలను పొందుతున్నామని భావించరు" అని తెలియజెప్పి, నరుని ప్రోత్సహించగా, అర్జునుని అస్త్రాలకు కర్ణుడు వీర మరణం పొందడం జరిగింది.

మన దేశంలో నరనారాయణులకు సంబంధించిన అనేక క్షేత్రాలున్నాయి. వాటిలో బదరీక్షేత్రం ప్రముఖమైనది. ఈ క్షేత్రంలోనే నరనారాయణులు తపస్సు సాగించారనీ, ఇప్పటికీ నర, నారాయణ అనే పర్వతాల రూపంలో తపస్సు చేసుకుంటున్నారనీ, పురాణ విదితం. ఈ రెండు పర్వతాల నడుమ నుంచి, అలకనందా నది ప్రవహిస్తూ ఉంటుంది. గంగానది భూమి మీదకు అవతరించినప్పుడు, ఈ భూమి ఆ గంగ తీవ్రతను తట్టుకోలేకపోయింది. అప్పుడే గంగానదిలోని ఒక పాయ, అలకనందగా మారిందని చెబుతారు. నరనారాయణ క్షేత్రాలు కొన్నింటిలో వీరిరువురూ ఒకే రూపంలో ఉంటే, మరికొన్ని క్షేత్రాలలో, వేర్వేరుగా దర్శనమిస్తారు. తర్వాతి కాలంలో ఈ నరనారాయణులే, కృష్ణార్జునులుగా జన్మించినట్లు, భాగవత పురాణం పేర్కొంటుంది. మహాభారతంలో, శ్రీకృష్ణుడే స్వయంగా, తాను నారాయణుడిననీ, అర్జునుడే నరుడనీ చెప్పాడు. ఇంతటి ప్రశస్తి కలిగిన నరనారాయణలు, కర్క సంక్రమణం తర్వాత వచ్చే హస్తా నక్షత్రం రోజున జన్మించారని చెబుతారు. ఆ పుణ్యదినాన నరనారాయణులను కొలుచుకుంటే మంచిదని అంటారు.

నరనారాయణుల రూపాన్ని కృష్ణుడిగా, బదరీనాథుడిగా, విష్ణుమూర్తిగా, నరసింహస్వామిగా, భక్తులు పూజిస్తుంటారు. నరనారాయణ జననం, జగతికి మోదం, ప్రమోదం, ఆమోదం, ప్రబోధం, సత్య సందేశాత్మకం, నిత్య జ్ఞానానందమయమే కాదు.. ‘జగద్దితం’ అనగా, లోక కళ్యాణ కారకం. ఒక సహస్రకవచుని సంహరించడానికి భగవానునికే రెండు జన్మలు అవసరమైనాయి. మానవునిగా భువికి వచ్చినవారు దివ్యులైనా, మానవాతీతమైన శక్తి సామర్థ్యాల సాధనకు ప్రయత్నం చేయాల్సిందే. అందుకే వేల సంవత్సరాల తపోబలం సాధించడం, అలాగే, కర్ణుని కవచ కుండలాలను అపహరించడానికి, ఇంద్రుడిని మాయా బ్రాహ్మణునిగా పంపడం. ఇదంతా విధిలీల. నిజానికి కర్ణుడు దానశీలుడు, శౌర్యవంతుడే కానీ, అతడనుసరించిన సేవాధర్మం, రాక్షస ప్రవృత్తికీ, అధర్మ వర్తనకూ బలాన్ని సమకూర్చుతోంది. అందునా, సహజంగా అతనిలో ఉన్న రాక్షసావేశం, అందుకు ప్రోత్సహించింది. ఆవేశం, ఆలోచనా రాహిత్యం , అహంకారం, కామ క్రోధాదులు, రాక్షస ప్రవృత్తికి సంకేతం.

మనం చేసే లోభం, పాపం శాపాలై, మానుష ప్రయత్నాన్ని పతనం చేస్తాయి. శేషకవచంతో కర్ణునిగా జన్మించిన సహస్ర కవచుడు, అలాంటి శాపాల తాపాలకు గురియైనాడు. అతడి పౌరుష ప్రతాపాలు, అవసరమైనప్పుడు అక్కరకు రాలేదు. నరనారాయణులూ, వరం తీసుకున్న కుంతీ, కవచకుండలాలు గ్రహించిన ఇంద్రుడూ, అనుచిత వ్యాఖ్యలతో నిరుత్సాహ పరచిన శల్యుడూ, భూమాత శాపం, గురువు శాపంతో అక్కరకురాని విద్య, మొదలగు ఆరు కారణాల వలన కర్ణుడు మరణించాడనేది సత్యం. జగత్తుకూ, జగత్తులో జీవించే ప్రాణులకూ, హితం కలగాలి. సనాతన వైదిక ధర్మం నిరాటంకంగా కొనసాగాలి. అందుకు పరమాత్మ ఎన్ని అవతారాలైనా ఎత్తుతాడు. ఎన్ని ఎత్తులకైనా తెరదీస్తాడు. అందుకు నిదర్శనమే, నర నారాయణ జననం.

జై శ్రీమన్నారాయణాయ!

Wednesday, November 1, 2023

ఆనందం! భగవద్గీత Bhagavad Gita Chapter 18


ఆనందం!
కర్మల వెనుక ఉన్న అంతిమలక్ష్యం ‘ఆనందం’ కోసం అన్వేషణ అంటే?

'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (32 – 36 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 32 నుండి 36 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/QaT8M3tArJw ]


చీకటితో ఆవృత్తమై ఉండే తమోగుణ బుద్ధిని గురించి ఇప్పుడు తెలుసుకుందాము..

00:47 - అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా ।
సర్వార్థాన్విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ ।। 32 ।।

ఓ పార్థా! చీకటితో ఆవృత్తమై ఉండి, అధర్మమునే ధర్మమనుకుంటూ, అసత్యమును సత్యమని భావిస్తూ ఉండే బుద్ధి, తమోగుణ బుద్ధి.

తామసిక బుద్ధి అనేది, పవిత్రమైన జ్ఞానముచే ప్రకాశితమై ఉండదు. కాబట్టి, అది అధర్మమునే తప్పుగా, ధర్మమని అనుకుంటుంది. ఉదాహరణకు, ఒక త్రాగుబోతు ఆ మద్యం యొక్క మత్తు పట్ల ఆసక్తితో ఉంటాడు. కాబట్టి, అతని యొక్క అల్పబుద్ధి, అంధకారముచే కప్పివేయబడినదై, తనకు తానే స్వయంగా చేసుకునే తీవ్ర హానిని కూడా గ్రహించలేడు. ఇది ఎంత బలీయంగా ఉంటుందంటే, ఇంకొక మద్యంసీసా కోసం తన ఆస్తిని కూడా అమ్మటానికి వెనుకాడడు. తామసిక బుద్ధిలో, విచక్షణా జ్ఞానము, మరియు తర్కబద్ధ వివేచన అనేవి కోల్పోబడతాయి.

01:49 - ధృత్యా యయా ధారయతే మనఃప్రాణేంద్రియక్రియాః ।
యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్త్వికీ ।। 33 ।।

యోగము ద్వారా పెంపొందించుకున్న దృఢ చిత్త సంకల్పమూ, మనస్సూ, ప్రాణ వాయువులూ, ఇంద్రియముల యొక్క కార్యకలాపములకు ఆధారముగా ఉన్న సంకల్పాన్నీ, సత్త్వ గుణ దృఢ మనస్కత అంటారు.

దృఢ సంకల్పము అనేది, కష్టాలు-అవరోధాలు ఎదురైనా, మన మార్గంలోనే పట్టువిడువకుండా ఉంచగలిగే మన మనోబుద్ధుల యొక్క అంతర్గత సామర్థ్యము. మనం మన లక్ష్యంపై చూపును కేంద్రీకరిస్తూ, శరీరమనోబుద్ధులలో దాగి ఉన్న శక్తిని వెలికితీసి, కష్టసాధ్యమైన అవరోధాలను కూడా అధిగమించే సామర్థ్యాన్ని - ధృతియే కలుగచేస్తుంది. యోగాభ్యాసము ద్వారా, మనస్సు క్రమశిక్షణతో ఉండి, శరీరేంద్రియములపై ఆధిపత్యంతో ఉండగలిగే సామర్ధ్యాన్ని పెంపొందించుకుంటుంది. ప్రాణవాయువులను నియంత్రించి, ఇంద్రియములను అధీనము లోనికి తెచ్చుకుని, మనస్సును నియంత్రించగలిగినప్పుడు కలిగే దృఢ చిత్తమునే, సత్త్వ గుణములో ఉన్న దృఢ సంకల్పమని అంటారు.

03:01 - యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతేఽర్జున ।
ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ రాజసీ ।। 34 ।।

ఫలాపేక్షచే ప్రేరితమై, విధులు, సుఖములు, మరియు సంపద పట్ల ఆసక్తితో ఉండే స్థిరచిత్తము, రాజసిక ధృతి అని చెప్పబడును.

ధృతి అనేది కేవలం యోగులలోనే ఉండదు. ప్రాపంచిక మనస్తత్వం ఉన్న జనులు కూడా, తమతమ ఆశయసాధనలో అత్యంత ధృడ సంకల్పముతో ఉంటారు. కానీ, వారి సంకల్పమనేది, వారి పరిశ్రమ యొక్క ఫలములను భోగించాలనే కోరికచే, ప్రేరేపితమై ఉంటుంది. ఇంద్రియ సుఖాలను భోగించాలి, ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలి - వంటి విషయాలపై వారి మనస్సు కేంద్రీకృతమై ఉంటుంది. అలాగే, డబ్బు అనేది వీటన్నిటినీ పొందటానికి సాధనం కాబట్టి, ఇటువంటి మనుష్యులు జీవితాంతం డబ్బునే పట్టుకుని వ్రేళ్ళాడతారు. కర్మఫలములను భోగించాలనే కోరికచే ప్రేరేపితమైన సంకల్పము, రజో గుణములో ఉన్న సంకల్పముగా చెప్పబడినది.

04:08 - యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ ।
న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసీ ।। 35 ।।

విడువకుండా పగటికలలు కంటూ, భయపడుతూ, శోకిస్తూ, నిరాశకు లోనౌతూ, మరియు దురహంకారముతో ఉండే అల్పబుద్ధి సంకల్పమునే, తమోగుణ ధృతి అంటారు.

సంకల్పము, ధృడ చిత్తమనేవి, అవివేకులూ మరియు అజ్ఞానులలో కూడా కనిపిస్తాయి. కానీ, ఆ మూర్ఖత్వము - మొండితనము, భయము, నిరాశ, మరియు దురహంకారముచే జనిస్తుంది. ఉదాహరణకి, కొంతమంది అస్తమానం భయపడే లక్షణంతో ఉంటారు. అదేదో తమ వ్యక్తిత్వములో భాగమన్నట్టుగా, వారు దానినే పట్టుకుని ఉండటం ఒక ఆసక్తికరమైన, గమనించదగ్గ విషయం. మరికొందరు, ఏదో గతంలో జరిగిన నిరాశా సంఘటననే అస్తమానం పట్టుకుని ఉండి, దానిని విడిచి పెట్టక, తమ జీవితాన్ని దుర్భరం చేసుకుంటారు. అది వారిపై ఎంత దుష్ప్రభావం కలుగచేస్తుందో గమనించి కూడా, అలాగే ఉంటారు. కొందరు తమ అహంభావమును దెబ్బ తీసిన వారందరితో, తగవు పెట్టుకోకుండా ఉండలేరు. ఇటువంటి నిరర్థకమైన తలపుల పట్ల ఉన్న మూర్ఖపు పట్టుపై ఆధారపడి ఉన్న ధృతి, తమోగుణములో ఉన్న సంకల్పంగా చెప్పబడుతుంది.

05:31 - సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ ।
అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్ఛతి ।। 36 ।।

ఓ అర్జునా, ఇక ఇప్పుడు దేహముయందున్న జీవాత్మ రమించే మూడు విధముల సుఖముల గురించీ, మరియు సర్వ దుఃఖముల నుండి విముక్తి దశ చేరటం గురించీ వినుము.

ఇంతకు క్రితం శ్లోకాలలో, శ్రీ కృష్ణుడు కర్మ యొక్క అంగములను వివరించి ఉన్నాడు. ఆ తరువాత కర్మలను ప్రేరేపించి, నియంత్రించే కారకములను వివరించి ఉన్నాడు. ఇక ఇప్పుడు కర్మ యొక్క లక్ష్యము గురించి చెబుతున్నాడు. జనుల కర్మల వెనుక ఉన్న అంతిమలక్ష్యం, ఆనందం కోసం అన్వేషణే. ప్రతిఒక్కరూ ఆనందంగా, సుఖంగా ఉండాలనే కోరుకుంటారు. వారి పనులచే వారు తుష్టిని, శాంతిని, మరియు సంతృప్తిని పొందటానికి ప్రయత్నిస్తారు. కానీ, ప్రతి ఒక్కరి కర్మలూ, వాటి వాటి అంతర్గత కారక స్వభాములచే భిన్నముగా ఉండటం వలన, వాటి ద్వారా వచ్చే సుఖము కూడా వేర్వేరుగా ఉంటుంది.

ఇక మన తదుపరి వీడియోలో, సత్వ గుణ ఆనందం, రజో గుణ ఆనందం, తామసిక ఆనందం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...