Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Wednesday, May 31, 2023

సర్వోన్నత జ్ఞానం! భగవద్గీత Bhagavadgita


సర్వోన్నత జ్ఞానం!
ఈ జ్ఞానమును స్వీకరించి అంగీకరించినవారు యదార్థముగా జ్ఞానోదయం పొందుతారా?

'భగవద్గీత' పంచదశోధ్యాయం - పురుషోత్తమ ప్రాప్తి యోగం (16 – 20 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదునైదవ అధ్యాయం, పురుషోత్తమ ప్రాప్తి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, పురుషోత్తమ ప్రాప్తి యోగములోని, 16 నుండి 20 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/WrzxKc8Ch5A ]


నాశరహిత పరమాత్మయైన ఆ సర్వోత్కృష్ట దివ్య పురుషుడి గురించిన వివరణ, ఇలా ఉండబోతోంది..

00:47 - ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ ।
క్షరః సర్వాణి భూతాని కూటస్థోఽక్షర ఉచ్యతే ।। 16 ।।

సృష్టిలో రెండు రకాల ప్రాణులు ఉన్నాయి.. క్షరములు అంటే, నశించేవి, మరియు అక్షరములు అంటే, నశించనివి. భౌతిక జగత్తులో ఉన్నవి క్షరములు. అక్షరములు అంటే, మోక్షము పొందిన జీవులు.

భౌతిక జగత్తులో, మాయ అనేది జీవాత్మను ఈ భౌతిక శరీరమునకు కట్టివేస్తుంది. ఆత్మ అనేది, నిత్యసనాతనమైనది అయినా కూడా, అది పదేపదే శరీరము యొక్క జననము, మరియు మరణములను అనుభవిస్తూ ఉంటుంది. అందుకే, శ్రీ కృష్ణుడు భౌతిక జగత్తులో బద్ధ జీవులను, క్షరములని అంటున్నాడు. అతిచిన్న పురుగుల నుండి, ఉన్నతమైన దేవతల వరకూ, ఈ కోవకు చెందినవారే. వీటికన్నా వేరుగా, భగవంతుని ధామములో, ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న జీవులు కలరు. ఈ జీవులకు మరణంలేని శరీరములు ఉంటాయి; వాటి యందు వారు మరణమును అనుభవించరు; అందుకే వారు అక్షరములని పేర్కొనబడ్డారు.

01:53 - ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః ।
యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః ।। 17 ।।

ఇవే కాక, నాశరహిత పరమాత్మయైన ఆ సర్వోత్కృష్ట దివ్య పురుషుడున్నాడు. ఆయన అవ్యయమైన ఈశ్వరునిగా ముల్లోకములలో ప్రవేశించి, సమస్త ప్రాణులనూ పోషిస్తూ ఉంటాడు.

జగత్తు, మరియు జీవాత్మల గురించి చెప్పిన పిదప, శ్రీ కృష్ణుడిక ఆ రెండు లోకాలకూ, మరియు క్షర, అక్షర ప్రాణులకూ అతీతమైన భగవంతుని గురించి చెబుతున్నాడు. శాస్త్రాలలో ఆయనే పరమాత్మగా చెప్పబడ్డాడు. జీవాత్మ అత్యల్పమైనది, మరియు అది వసించి ఉన్న శరీరము యందు మాత్రమే, వ్యాపించి ఉంటుంది. కానీ, పరమాత్మ సమస్త ప్రాణుల హృదయములలో స్థితమై ఉన్నాడు. వాటి కర్మలను నోట్ చేసుకుంటాడు, వాటి ఖాతా ఉంచుకుంటాడు, మరియు వాటి ఫలములను సరియైన సమయంలో ఇస్తూ ఉంటాడు. ఆత్మ జన్మ జన్మలలో ఏ శరీరము తీసుకుంటే, ఆ శరీరములోనికి తాను కూడా ప్రవేశిస్తాడు. ఒకవేళ ఆత్మకు ఒకానొక జన్మలో కుక్క శరీరము ఇవ్వబడితే, పరమాత్మ కూడా దానిలోకి ప్రవేశిస్తాడు, మరియు పూర్వ జన్మల కర్మఫలములను అందిస్తాడు. ఈ విధముగా, కుక్కల అదృష్టంలో కూడా, ఎంతో తేడా ఉంటుంది. కొన్ని వీధి కుక్కలుగా దుర్భరమైన జీవితం గడుపుతుంటాయి, మరికొన్ని పెంపుడు కుక్కలుగా, ఐశ్వర్యంలో విలాసంగా జీవిస్తుంటాయి. ఇంత తేడా వాటి వాటి కర్మరాశి ఫలితంగా సంభవిస్తుంది. ఆ కర్మఫలములను, ఆ పరమాత్మయే అందిస్తూ ఉంటాడు. సర్వ భూతముల హృదయములలో స్థితుడై ఉండే ఆ పరమాత్మ, తన సాకార రూపములో ఉంటాడు.

03:37 - యస్మాత్ క్షరమతీతోఽహమక్షరాదపి చోత్తమః ।
అతోఽస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః ।। 18 ।।

నేను నశ్వరమైన ఈ భౌతిక పదార్ధముకంటే, మరియు నాశరహితమైన జీవాత్మ కంటే కూడా అతీతమైనవాడను. కాబట్టి, వేదములలో, మరియు స్మృతులలో నేనే సర్వోత్కృష్ట దివ్య పురుషుడిగా కీర్తింపబడ్డాను.

ప్రకృతిలో ఉన్న మహాద్భుతమైనవన్నీ, తన యొక్క విభూతుల ప్రకటితములే అని, గతంలో శ్రీ కృష్ణుడు వివరించాడు. కానీ, ఆ కనిపించే జగత్తును సృష్టించడానికి తానే స్వయముగా శ్రమకు లోనవ్వడు. ఆయన యొక్క అలౌకిక వ్యక్తిత్వము, భౌతిక ప్రకృతికీ, మరియు దివ్య ఆత్మలకు కూడా అతీతమైనది. ఇక్కడ తన దివ్య వ్యక్తిత్వమును పురుషోత్తమ అని అంటున్నాడు. ‘శ్రీ కృష్ణుడే సర్వోన్నత భగవానుడు. ఆయన మీదే ధ్యానం చేయుము, ఆయన భక్తినే ఆస్వాదించుము, మరియు ఆయనను ఆరాధించుము.’ ‘శ్రీ కృష్ణుడు సర్వోత్కృష్ట పురుషుడ’ని, వేదములు పేర్కొన్నాయి. మరయితే విష్ణుమూర్తి, శ్రీ రామ చంద్రుడు, శంకరుడు - వీరి స్థాయి ఏమిటన్న సందేహం రావచ్చు. వారందరూ ఆ సర్వోన్నతుని స్వరూపములే, మరియు వారందరూ, ఒకరికొకరు అబేధములే. వారందరూ భగవంతుని, అంటే సర్వోత్కృష్ట దివ్య పురుషుని ప్రకటితములే.

05:00 - యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్ ।
స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత ।। 19 ।।

ఎవరైతే సంశయము లేకుండా నన్ను సర్వోత్కృష్ట పురుషోత్తమునిగా తెలుసుకుంటారో, వారికి సంపూర్ణ జ్ఞానమున్నట్టు. ఓ అర్జునా, వారు హృదయపూర్వకముగా నన్నే భజింతురు.

మనం భగవంతుడిని మూడు రకాలుగా తెలుసుకోవచ్చు: ‘సర్వోన్నత తత్త్వము ఒక్కటే.. అది జగత్తులో బ్రహ్మము, పరమాత్మ, మరియు భగవానుడనే మూడు విధములుగా వ్యక్తమవుతుంది.’ ఇవి మూడు వేర్వేరు అస్థిత్వములు కావు. ఒకే సర్వోన్నత తత్త్వము యొక్క మూడు స్వరూపాలు. ఉదాహరణకి, నీరు, మంచు, నీటి ఆవిరి, మూడూ విభిన్న పదార్ధములుగా అగుపిస్తాయి. కానీ, అవి ఒకే పదార్ధము యొక్క మూడు విభిన్న రూపాలు. అదే విధంగా బ్రహ్మము అంటే, భగవంతుని యొక్క నిరాకార, సర్వ వ్యాప్త అస్థిత్వము. జ్ఞాన యోగమును అనుసరించే వారు, భగవంతుని యొక్క బ్రహ్మమనే అస్థిత్వాన్ని ఆరాధిస్తారు. పరమాత్మ అంటే, సమస్త ప్రాణుల హృదయములో స్థితమై ఉన్న, ఆ సర్వోన్నత తత్త్వము యొక్క అస్థిత్వము. అష్టాంగ యోగ మార్గము, దేవుని యొక్క పరమాత్మ రూపమును దర్శింపచేస్తుంది. భగవానుడంటే, పరమేశ్వరుని యొక్క సాకర రూపము. ఆ రూపంలో ఆయన ఎన్నో మధురమైన లీలలను చేస్తాడు. భక్తి మార్గము, మనకు ఈశ్వరుడిని భగవానుని రూపంలో, భగవత్ ప్రాప్తిని కలిగిస్తుంది. తనను భక్తి ద్వారా భగవానునిగా, సర్వోన్నత దివ్య పురుషోత్తమునిగా తెలుసుకున్నవారు, యదార్థముగా ఆయన పట్ల పూర్తి జ్ఞానముతో ఉన్నట్టు. ‘బ్రహ్మము అస్థిత్వంలో, ఈశ్వరుని యొక్క అనంతమైన శక్తులు గుప్తముగా ఉంటాయి. ఆయన కేవలం నిత్య జ్ఞానమును, మరియు ఆనందమును ప్రదర్శిస్తాడు.’ ‘పరమాత్మ అస్థిత్వంలో, ఈశ్వరుడు తన రూపమునూ, నామమునూ, మరియు గుణమునూ చూపిస్తాడు. కానీ, లీలలను ప్రదర్శించడు, పరివారమును కలిగి ఉండడు.’

‘తన సర్వ శక్తులనూ ప్రకటితం చేస్తూ, మరియు, భక్తులతో ఎన్నెన్నో మధురమైన లీలలను చేస్తూ ఉండే ఈశ్వరుని అస్థిత్వమే, భగవానుడు.’ఈ శ్లోకాలు, బ్రహ్మము మరియు పరమాత్మ అస్థిత్వములలో, ఈశ్వరుడు తన సర్వ శక్తులనూ ప్రకటించడని, స్పష్టంగా చెబుతున్నాయి. ఈశ్వరుడు భగవానుడి రూపములో సంపూర్ణముగా ఉంటాడు. దానిలో తన యొక్క నామములూ, రూపములూ, గుణములూ, లీలలూ, ధామములూ, మరియు పరివారమూ, అన్నింటినీ ప్రకటిస్తాడు.

07:36 - ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మాయానఘ ।
ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత ।। 20 ।।

ఓ పాపరహితుడా, అర్జునా.. అత్యంత రహస్యమైన వేద శాస్త్ర మూలతత్త్వమును, నేను నీకు తెలియచేశాను. దీనిని అర్థం చేసుకున్న వ్యక్తి, జ్ఞాని అవుతాడు, మరియు సాధించవలసినదంతా నెరవేర్చినవాడవుతాడు.

ఈ అధ్యాయంలోని ఇరవై శ్లోకాలలో, భగవంతుడు వేద శాస్త్రాల సారాన్ని తెలియచేశాడు. ఈ జగత్తు యొక్క స్వభావాన్నీ, భౌతికపదార్ధము మరియు ఆత్మ మధ్య భేదాన్నీ, మరియు చివరగా పరమ సత్యము యొక్క సర్వోన్నత జ్ఞానమునూ, ఆ దివ్య మంగళ పురుషోత్తమునిగా తెలియచేశాడు. ఎవరైతే ఈ జ్ఞానమును స్వీకరించి అంగీకరిస్తారో, వారు యదార్థముగా జ్ఞానోదయం పొందుతారని, ఇప్పుడు భగవంతుడు హామీ ఇస్తున్నాడు. అటువంటి జీవాత్మ, సమస్త కార్యముల, కర్తవ్యముల లక్ష్యమయిన భగవత్ ప్రాప్తిని సాధిస్తుందని వివరిస్తున్నాడు, శ్రీ కృష్ణ భగవానుడు.

ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం, యోగ శాస్త్రే, శ్రీ కృష్ణార్జునసంవాదే, పురుషోత్తమ ప్రాప్తి యోగోనామ పంచదశోధ్యాయ:

శ్రీ మద్భగవద్గీతలోని జ్ఞానషట్కం, పదునైదవ అధ్యాయం, పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని, 20 శ్లోకాలూ సంపూర్ణం.

09:02 - ఇక మన తదుపరి వీడియోలో, పదహారవ అధ్యాయం, దైవాసుర సంపద్విభాగ యోగములో, శ్రీ కృష్ణుడు విశదపరిచిన నిగూఢార్థాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, May 29, 2023

నారదుడు చెప్పిన ‘షోడశ రాజులు’ ఎవరు? 16 Sixteen (Shodasa) Chakravarthis or Emperors Story


నారదుడు చెప్పిన ‘షోడశ రాజులు’ ఎవరు?
పుట్టిన ప్రతి జీవీ మరణించక తప్పదు! దుఃఖమయమైన ఈ లోకంలో మానవుడి గమ్యమేంటి?

ద్రోణాచార్యుడు నిర్మించిన బేధించనలవికాని పద్మవ్యూహంలోకి, ధైర్యంతో, శౌర్యంతో చొచ్చుకుపోయి, ఎందరో కౌరవ వీరులను సంహరించి, వీరమరణం పొందాడు అభిమన్యుడు. బాలుడైనప్పటికీ, సైన్యంలో చొచ్చుకొని పోవడానికి సమర్థుడని యుద్ధానికి పంపాననీ, అర్జునుడు వచ్చి తన కొడుకేడని అడిగితే, ఏం సమాధానం చెప్పాలో తెలియక, బాధతో కృంగిపోయాడు ధర్మరాజు. యుద్ధానికి పంపి తాను పాపం చేశాననీ, అభిమన్యుడి వెంట తాను యుద్ధంలోకి చొచ్చుకు పోలేకపోయాననీ చింతించాడు. ఇలా పలు విధాలుగా దుఃఖిస్తున్న ధర్మరాజు దగ్గరకు, వ్యాసమహర్షి వెళ్ళాడు. తాను పద్మవ్యూహంలోకి బాలుడైన అభిమన్యుడిని పంపిన విషయం, అతడి వెనుకే తాము పోవడానికి ప్రయత్నించగా, సైంధవుడు అడ్డు తగిలిన విషయం, ఆ విధంగా అభిమన్యుడికి సహకరించే అవకాశం తప్పిపోయిన వైనం, అప్పుడు పలువురు కౌరవ వీరులు అతడిని చుట్టుముట్టి, అన్యాయంగా హతమార్చిన విషయం, వేదవ్యాసుడికి చెప్పాడు ధర్మరాజు. తనలాంటి కఠినాత్ముడు లేడంటూ, జరిగిన దారుణానికి చింతించాడు. మిక్కిలి బలవంతుడైన అభిమన్యుడు చిన్నబాలుడు కాడనీ, ఎంతోమంది రాజులను అంతం చేసిన గొప్ప వీరుడనీ, అభిమన్యుడిని వ్యాసుడు కీర్తించాడు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవ్వరైనా, విధిని తప్పించుకోవడం సాధ్యమయ్యే విషయం కాదు. అందుకు నీవు వ్యధ చెందడం తగదని హితువు చెప్పాడు, వ్యాసుడు. ఆ మాటలకు ధర్మరాజు, ‘బాగా ఆలోచిస్తే మృత్యువును అవశ్యం అనుభవించి తీరవలసిందే’ అని వ్యాఖ్యానించాడు. అప్పుడు వ్యాసుడు, సృంజయుడనే రాజు పూర్వం ఏవిధంగా, నారదుడు తెలిపిన మృత్యు ప్రకరణ విధానాన్ని విని, చిత్తశాంతిని పొందాడో వివరించాడు. మరి ఆ సృంజయుడి గాధేంటి? నారదుడు వివరించిన షోడశరాజులు ఎవరు? సృంజయుడి దు:ఖాన్ని నారదుడు ఏ విధంగా తొలగించాడు - వంటి ఆసక్తిని కలిగించే విషయాలను, ఈ రోజు తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/_7MSPm7UcqM ]



ఈ కథ ద్రోణపర్వంలోని అభిమన్యు వధ పర్వం అనే ఉపపర్వంలో, 55 వ అధ్యాయంలో ఉంది. పూర్వం సృంజయుడనే పేరు గల రాజు, పుత్ర సంతానం కోరి, సద్బ్రాహణులకు అనేక దానధర్మాలను చేశాడు. ఒకసారి నారద మహర్షి సృంజయుని దగ్గరకు వచ్చినప్పుడు, బ్రాహ్మణులందరూ సృంజయరాజుకు పుత్రుని ప్రసాదించ వలసిందిగా నారదుణ్ణి కోరారు. దానికి నారదుడు, ఎలాంటి కుమారుడు కావాలో కోరుకోమని, సృంజయునితో అన్నాడు. సృంజయుడు నారదునికి నమస్కరించి, "యశస్వీ, తేజస్వీ, శత్రునాశకుడూ, ఉత్తమ గుణాలు కలవాడు అయిన కొడుకు కావాలి. ఆ కుమారుని మల మూత్రాలు, ఉమ్మి, చెమట, ఇంకా అతని శరీరం నుంచి వచ్చేవన్నీ, బంగారం కావాలి అని కోరుకున్నాడు." అతడు కోరుకున్నట్లుగానే జరుగుతుందని నారదుడు వరమిచ్చాడు.

ఆ తరువాత కొద్ది రోజులకు ఆ రాజుకు ఒక కొడుకు పుట్టాడు. ఆ బాలుడు విసర్జించే మల మూత్రాలూ, ఏడ్చేటప్పుడు అతని కన్నుల నుంచి కారే కన్నీరూ, ఉమ్మీ, చెమట మొదలైనదంతా బంగారంగా మారుతూ ఉంది. అందువల్లనే ఆ బాలునికి సువర్ణష్ఠీవి అనే పేరు ఏర్పడింది. ఇలా బాలుడు విసర్జించేదంతా బంగారం కావడం చేత, సృంజయరాజు సంపద అమితంగా పెరిగిపోయింది. రాజు తన భవనాలనూ, ప్రాకారాలనూ, కోటలనూ, బ్రాహ్మణ గృహాలనూ, ఇంకా అతనికి అవసరమైన పాన్పులూ, ఆసనాలూ, వాహనాలూ, బిందెలూ, చెంబులూ, పాత్రలూ మొదలైన అన్నివస్తువులనూ బంగారంతో తయారు  చేయించాడు. రోజు రోజుకూ అతని సంపద ఇంకా పెరుగుతూ ఉంది. కొందరు దోపిడీ దొంగలు రాజు వైభవానికీ, అతని ధన సంపదకూ కన్ను కుట్టింది. అతని సంపదకు కారకుడైన సువర్ణష్ఠీవిని అపహరించాలని నిశ్చయించుకుని, రాజ భవనంలోకి ప్రవేశించి, యువరాజును బలవంతంగా ఎత్తుకెళ్ళారు.

ఒక అడవిలోకి తీసుకొనిపోయి అతణ్ణి చంపి బంగారం కోసం అతని కడుపు చీల్చేశారు ఆ దొంగలు. కానీ, అందులో వారికి బంగారం కనిపించలేదు. మూర్ఖులైన దొంగలు పరస్పరం ఒకరి మీద ఒకరు నిందారోపణలు చేసుకుని, ఒకరినొకరు కొట్టుకుని చనిపోయారు. తన ధన సంపదకు మూలకారకుడైన తన కుమారుడు చనిపోయినందుకు, సృంజయ రాజు ఎంతగానే దు:ఖించాడు. అతని దు:ఖాన్ని విని నారదుడు వచ్చి, షోడశరాజుల చరిత్రలను వివరించాడు. "మరుత్తు అనే చక్రవర్తి, సంవర్తుడు ఉపద్రష్టగా, అనేక యజ్ఞయాగాదులు నిర్వహించినప్పటికీ, శాశ్వతమైన పదవిలో వుండలేదు. సుహోత్రుడనే మహారాజు ఎంత సక్రమ మార్గంలో జీవించినప్పటికీ, ఆశ్వమేధాది యజ్ఞాలు నిర్వర్తించినప్పటికీ, చివరకు మరణించాడు. ఎన్నో యజ్ఞాలు చేసిన అంగుడు అనే రాజు దివంగతుడయ్యాడు. ఎన్నో అశ్వమేధ యాగాలను చేసి, అమితమైన గోదానాలను చేసిన శిబి చక్రవర్తి, శాశ్వతంగా ఈ లోకంలో ఉండలేకపోయాడు. రావణాసురుడిని బంధు సమేతంగా సంహరించిన సామర్థ్యం, ఆశ్చర్యకరమైన మాహాత్మ్యం కలిగిన దశరథ రాముడూ కాలధర్మం చెందాడు. ఆకాశగంగను భూలోకంలో ప్రవహింప చేసి, సగరులకు ఉత్తమ గతులు కలిగించి, అనేకానేక అశ్వమేధ యజ్ఞాలు చేసిన భగీరథుడు శాశ్వతంగా జీవించలేదు. ఎన్నో అశ్వమేధ యజ్ఞాలు చేసి, ఇంద్రుడిని మెప్పించిన దిలీపుడు సహితం మరణించాడు.

భూమండలాన్ని ఏకచ్చత్రాధిపత్యంగా అనుభవించి, బ్రాహ్మణులకు అన్న సంతర్పణం చేసి, అశ్వమేధ యాగాలు చేసిన మాంధాత చక్రవర్తీ, ఈ లోకంలో శాశ్వతంగా నిలువలేదు. దేవాసుర యుద్ధంలో పాల్గొని రాక్షసులను వధించి, వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరచి, భూమిని సింగారించి, ఎన్నో యజ్ఞయాగాదులను చేసిన యయాతీ, ఈ లోకంలో శాశ్వతంగా వుండలేకపోయాడు. అమితమైన రాజ్యాన్ని సంపాదించి, లెక్కలేనన్ని యాగాలు చేసి, మణులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చిన అంబరీషుడూ బ్రతికిలేడు. ప్రసిద్ధ యాగాలు నిర్వర్తించిన శశిబిందుడూ, శాశ్వత శరీరాన్ని పొందలేదు. అగ్నిని ఆరాధించి తీవ్రమైన తపస్సు చేసి, ధార్మికుడిగా కీర్తికెక్కిన గయుడు కూడా చనిపోయాడు. రంతిదేవుడి లాంటి పుణ్యాత్ముడూ, పరలోకానికి పోక తప్పలేదు. సర్వదమనుడని కణ్వుడు పేరుపెట్టిన భరతుడూ, ఇహలోకాన్ని విడిచి వెళ్లినవాడే. గోరూపంలో వున్న భూమిని ఓషధులు పితకవలసిందిగా ఆజ్ఞాపించి, సమస్త భూమినీ బ్రాహ్మణులకు దానమిచ్చిన పృథచక్రవర్తి యశస్సు నిలిచింది కాని, శరీరం సుస్థిరంగా వుండలేదు. సమస్త భూమినీ కశ్యపుడికి ధారాదత్తం చేసిన పరశురాముడు సహితం, భూమిపై శాశ్వతంగా ఉండలేకపోయాడు.

గొప్ప గొప్ప రాజులే మరణించక తప్పలేదు. పుట్టిన ప్రతి జీవీ మరణించక తప్పదు. అందువల్ల, కుమారుని కోసం దు:ఖించవద్ద"ని సృంజయునికి నారదుడు వివరించాడు. ఆ మాటలు విన్న సృంజయుడు, పుత్రశోకం నుండి కొంతవరకూ తేరుకున్నాడు. ఆ తరువాత సృంజయుడి కోరిక ప్రకారం, చనిపోయిన అతడి కుమారుడు సువర్ణష్ఠీవిని బతికించి తెచ్చాడు నారదుడు. ఆ తరువాత సువర్ణష్ఠీవి పెరిగి పెద్దవాడయ్యాడు. బాణవిద్య నేర్చుకుని, వివాహమాడి, సంతానవంతుడయ్యాడు. ఇదంతా తిరిగి ధర్మరాజుకు చెప్పిన వేదవ్యాసుడు, అభిమన్యుడి గురించి దుఃఖించడం వివేకం కాదనీ, ఈ లోకం అంతా దుఃఖమయమనీ, తపోదానాదులతో మానవులు దేవలోకం చేరాలనుకోవడం ప్రసిద్ధమనీ, తెలియజేశాడు. అభిమన్యుడు పుణ్యాత్ములు పొందే అరుదైన లోకాన్ని పొంది వున్నాడని తెలియచేయడానికే, తాను షోడశ రాజ చక్రవర్తుల చరిత్ర చెప్పాననీ, దానివల్ల కలిగే పరిజ్ఞానంతో, మనస్సు కుదుట పడేటట్లు చేసుకొమ్మని చెప్పి, వ్యాసుడు అంతర్థానమయ్యాడు.

సర్వేజనాః సుఖినోభవంతు!

Thursday, May 18, 2023

గుప్పెడు మనస్సు - మంచిమాట Manchimata


గుప్పెడు మనస్సు - మంచిమాట

అవకాశం లభించాలే కానీ, మనం జ్ఞానులమని ఇతరులు గుర్తించాలనేలా ప్రవర్తిస్తాము. మౌలికంగా మనం తెలివి గలవారమని మన నమ్మకం. ఇతరులు ఏదైనా చెబితే దానిని ఖండించేందుకు, మాటలను అన్వేషిస్తాము. అవసరం లేని గర్వాన్ని పెంచుకుంటాము. దానితో అరిషడ్వర్గాలన్నీ మనలను ఆవహిస్తాయి. వీటితోపాటు, అతిశయం అంతరంగంలోకి చేరుతుంది.


ఈ ప్రపంచంలో తెలివి అన్నది ఏ ఒక్కరి సొత్తూ కాదు. ఈ చిన్న నిజాన్ని మనం తెలుసుకో లేక పోతున్నాము. తెలివితేటలంటే మనకున్న కొద్దిపాటి జ్ఞానాన్ని చర్వితచర్వణం చేయడమా? అందులో మన సొంతం ఒక్కటీ ఉండదు. మన ప్రజ్ఞ ఎక్కడా ప్రస్ఫుటం కాదు. అన్నీ అరువు తెచ్చుకున్నవే. మన సొంత జ్ఞానం ఏ పాటిదని మనం ఎందుకు విశ్లేషించుకోము? మనలో మౌలికత లేదు.. క్రియాశీలత అంతంత మాత్రమే.. ఇది నా ఆలోచన, ఇది నా ప్రజ్ఞా విశేషం, ఇది నేను తెలుసుకున్న సత్యం - అని ఒక్కటంటే ఒక్కదానిని చూపగలుగుతున్నామా? పైగా ఇతరులు ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తే, ససేమిరా వినం.

అమెరికాలోని చికాగోలో సార్వత్రిక మత సమ్మేళనం జరిగినప్పుడు, ఆ సభల్లో పాల్గొనడానికి భారత్‌ నుంచి వివేకానందులు వెళ్లారు. మహామహులందరూ అక్కడ ఉన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానంతో తలలు పండిన వాళ్లందరూ ఆ సభలో ఆసీనులయ్యారు. పేరు ప్రఖ్యాతులున్న ఆధ్యాత్మిక వేత్త ఒకరు వివేకానందుడి వైపు చూసి, కించిత్తు చులకన స్వరంతో, 'నీకు ఏం తెలుసునని ఈ సభలకు వచ్చావ్‌? మేం చెప్పేది వినడానికా, లేక నీవు మాకే ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నావా?' అని ప్రశ్నించాడు. వివేకానందుడు ఎంతో సౌమ్యంగా 'మహాశయా! మీరు చెప్పింది వినడానికి మాత్రమే ఉబలాట పడుతున్నాను' అన్నాడు. 'అదంత సులువు కాదు. ఈ సభలోని వక్తల మాటలు వినేందుకు అర్హత ఉండాలి. ముందు నీకేం తెలుసో మూడు నిమిషాల్లో మాకు వివరించగలవా?' అని అతిశయంతో ప్రశ్నించాడు.వివేకానందుడు సరేనంటూ వేదిక పైకి ఎక్కి 'నా ఆత్మీయులారా..' అంటూ ప్రారంభించిన ఉపన్యాసం గంటన్నరపాటు ధారాళంగా సాగింది. శ్రోతలందరూ సమ్మోహితులయ్యారు. సభలో అందరి కరతాళధ్వనుల మధ్య వివేకానందుడి ప్రసంగం ముగిసింది. ఆయన ఆధ్యాత్మికంగా ఆవిష్కరించుకున్న సత్యాన్ని అలవోకగా తెలియజేశాడు. అదీ ఆయన ప్రజ్ఞావైభవం.

మనిషి మానసం నిరంతర అన్వేషి. జ్ఞానం కోసం సదా వెతుకుతూనే ఉండాలి. మనసు అంటే ఏమిటి? అది పాత సామానులు నిలువచేసే గది కాదే! పుస్తకాలు చదివి పురాణాలు వినడం ద్వారా కలిగిన జ్ఞానం మన సొంతమా? కానే కాదు. ఈ జ్ఞానాన్ని మానసం అనే మూలగదిలో దాచి మన సొంతమని గర్వపడితే ఎలా? ఇదేనా మన విద్వత్తు? మన మనసులో కొత్తదనం ఉండాలి, మనలో జీవం ఉండాలి. మన హృదయాంతరాళాల్లో చైతన్యం వికసించాలి. మనసును శూన్యం చేసుకోవాలి. సరికొత్త జ్ఞాన పరంపర మనస్సులోకి చేరడానికి అవకాశం కలిగించాలి. గుప్పెడు మనస్సు అంటాము కానీ, అది అంతులేని అలౌకిక జ్ఞానాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. అదే స్వీయ ప్రజ్ఞ. అప్పుడే జీవి స్వతంత్రుడవుతాడు.

ఆదిశంకరాచార్యులను ఆయన శిష్య గణంలో ఒకడైన కమలనాభుడు, ఒక రోజు ప్రశ్నించాడు. 'స్వామీ! ఎందరికో ఎన్నో గొప్పగొప్ప విషయాలు చెబుతున్నారు. నాకు మాత్రం ఏదీ చెప్పడం లేదు' అని. అందుకు శ్రీ శంకర భగవత్పాదులు నవ్వుతూ, 'ఎందరికో ఎన్నో చెబుతున్నానన్నావు.. మరి నీవు వినడం లేదా? .. అంటే, నీ మనస్సు ఖాళీగా లేదు. నిబ్బరం లేక అది ఉరకలు వేస్తున్నట్టుంది. ముందు నీ మనస్సును శూన్యంగా చేయి. నేను చెబుతున్నవన్నీ అందులోకి చేరుతాయి. అపుడు నీవు సైతం ప్రజ్ఞావంతుడవుతావు' అని అన్నారు.

జీవితం ఎన్నో సంవత్సరాల ప్రస్థానంలో, అవసరమైనవీ అనవసరమైనవీ పోగుచేసుకుంటుంది. అవి మనలో కొండలుగా పేరుకుపోయి ఉన్నాయి. ఆ కొండ పేరే 'నేను' అనే మానసం. జన్మజన్మలుగా పేరుకుపోయిన అనవసరమైన చెత్త బరువు మోయలేక, జీవచైతన్యం వెలవెలబోతోంది. ఆ బరువు నుంచి స్వేచ్ఛ పొందడమే, మానవ జీవితానికి విముక్తి, పవిత్రత! జీవి స్వతంత్రం కావడమే జీవన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోగలిగితే, మనమూ ఆదిశంకరాచార్యులమే!

Wednesday, May 17, 2023

పుట్టుకతోనే గుడ్డివాళ్ళు కూడా కలలు ఎందుకు చూడగలుగుతారు? 6 ఇంద్రియములు! భగవద్గీత Bhagavadgita


6 ఇంద్రియములు!
పుట్టుకతోనే గుడ్డివాళ్ళు కూడా కలలు ఎందుకు చూడగలుగుతారు?

'భగవద్గీత' పంచదశోధ్యాయం - పురుషోత్తమ ప్రాప్తి యోగం (06 – 10 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదునైదవ అధ్యాయం, పురుషోత్తమ ప్రాప్తి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, పురుషోత్తమ ప్రాప్తి యోగములోని, 06 నుండి 10 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/qiura3E5uwY ]


భౌతిక శక్తిచే కట్టివేయబడి, మనస్సుతో కలిపి ఉన్న ఆరు ఇంద్రియములతో ఏ విధంగా ప్రయాస పడుతుంటామో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:51 - న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః ।
యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ ।। 6 ।।

సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ, ఇవేవీ నా పరంధామమును ప్రకాశింపచేయలేవు. అక్కడికి వెళ్లిన పిదప, జనులు మరల ఈ భౌతిక లోకానికి తిరిగిరారు.

ఇక్కడ శ్రీ కృష్ణుడు, దివ్య లోక స్వభావాన్ని సంక్షిప్తముగా వివరిస్తున్నాడు. దానిని ప్రకాశింపచేయటానికి, సూర్యుడు, చంద్రుడు, మరియు అగ్ని అవసరం లేదు. ఎందుకంటే, అది సహజంగానే స్వయం ప్రకాశితము. భౌతిక జగత్తు అనేది, భౌతిక శక్తి, మాయ ద్వారా తయారుచేయబడినది. కానీ, దివ్య లోకము, ఆధ్యాత్మిక శక్తీ, యోగ మాయచే తయారు చేయబడినది. అది భౌతిక జగత్తు యొక్క ద్వందములు, మరియు దోషములకు అతీతమైనది, సంపూర్ణ దోషరహితమైన ప్రదేశము. అది సత్-చిత్-ఆనందము, అంటే, అమరత్వము, జ్ఞానము, మరియు ఆనందముతో పూర్ణముగా నిండి ఉంటుంది. దివ్య లోకము, పరవ్యోమమనే ఆధ్యాత్మిక ఆకాశమును కలిగి ఉంటుంది. దానిలో దైవీ ఐశ్వర్యములూ, అద్భుతములతో నిండిన ఎన్నెన్నో ధామములుంటాయి. సమస్త నిత్య సనాతన భగవత్ స్వరూపములైన, కృష్ణుడూ, రాముడూ, నారాయణుడి వంటి వారు, వారి వారి ధామములను ఆ ఆధ్యాత్మిక ఆకాశములో కలిగి ఉంటారు. అక్కడ వారు నిత్య శాశ్వతముగా, తమ భక్తులతో నివసిస్తూ, తమ దివ్య లీలలలో వారితో గడుపుతూ ఉంటారు.

02:25 - మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః ।
మనః షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ।। 7 ।।

భౌతిక జగత్తులో ఉన్న జీవాత్మలు, నా యొక్క సనాతనమైన అంశలు. కానీ, భౌతిక శక్తిచే కట్టివేయబడి, వారు మనస్సుతో కలిపి ఉన్న ఆరు ఇంద్రియములతో ప్రయాస పడుతున్నారు.

శ్రీ కృష్ణుడు ఇంతకు పూర్వం, ఆయన ధామమునకు చేరిన జీవులు ఇక మళ్ళీ తిరిగి రారని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు, భౌతిక జగత్తు లోనే ఇంకా ఉండిపోయిన జీవుల గురించి చెబుతున్నాడు. భగవంతుడికి ఉన్న వివిధ అంశలు, రెండు రకాలుగా ఉంటాయి..

స్వాంశలు: వీరు భగవంతుని అవతారములైన రాముడు, నృసింహ, వరాహ మొదలైనవారు. వారు శ్రీ కృష్ణునికి అబేధములు. అందుకే వారిని స్వాంశలు అంటాము. అంటే, ఏకీకృతమైన అంశలని అర్థం.

విభిన్నాంశలు: వీరు భగవంతునికి భిన్నములైన అంశలు. వారు నేరుగా భగవంతుని అంశలు కాదు. అయినా, వారు ఆయన యొక్క జీవ శక్తి యొక్క అంశలే. ఈ కోవలోకే, జగత్తులో ఉన్న ఆత్మలన్నీ వస్తాయి. ఇంతేకాక, విభిన్నాంశ ఆత్మలు మూడు రకాలు:

నిత్య సిద్ధులు: వీరు ఎప్పుడూ విముక్తులైన వారే కాబట్టి, భగవంతుని యొక్క దివ్య ధామములో, ఆయన దివ్య లీలలలో పాలుపంచుకుంటూ, సనాతన కాలం నుండి ఉన్నవారు.

సాధన సిద్ధులు: ఈ జీవాత్మలు మనలాగే, ఒకప్పుడు భౌతిక జగత్తులో ఉండే వారే. కానీ, వారు తమ సాధనా అభ్యాసం ద్వారా, ఆ భగవంతుడిని చేరుకున్నారు. ఇక ఇప్పుడు వారు, దివ్య భగవత్ ధామములోనే శాశ్వతంగా ఉంటూ, భగవంతుని దివ్య లీలలలో పాలుపంచుకుంటూ ఉంటారు.

నిత్య బద్ధులు: వీరు సనాతన కాలం నుండీ భౌతిక జగత్తులోనే ఉండిపోయినవారు. వీరు ఐదు ఇంద్రియములూ, మరియు మనస్సుచే కట్టివేయబడినారు. కాబట్టి, వారు ప్రయాస పడుతున్నారు. ఈ యొక్క విభిన్నాంశలైన నిత్యబద్ధ అంశల గురించి శ్రీ కృష్ణుడు చెప్పిన ప్రకారం, వారు మనస్సూ, ఇంద్రియములను తృప్తిపరచటానికి ప్రయాసపడుతూ, ఆ క్రమంలో దుఃఖాన్ని అనుభవిస్తున్నారు.

4:39 - శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః ।
గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్ ।। 8 ।।

ఎలాగైతే గాలి సుగంధమును ఒకచోటి నుండి ఇంకొక చోటికి తీసుకువెళుతుందో, జీవాత్మ కూడా, పాత శరీరమును విడిచి, కొత్త శరీరంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు, మనస్సూ మరియు ఇంద్రియములను తనతో పాటుగా తీసుకెళుతుంది.

ఆత్మ ఒక శరీరము నుండి ఇంకొక శరీరములోకి వెళ్లే ప్రక్రియను గురించి, ఇక్కడ వివరించబడినది. వీచేగాలి, పుష్పముల సువాసనను ఒకచోటి నుండి ఇంకొక చోటికి తీసుకెళ్లటం, ఇక్కడ ఉదాహరణగా చెప్పబడినది. అదే విధముగా, మరణ సమయంలో ఆత్మ దేహమును విడిచి వెళ్ళేటప్పుడు, అది స్థూల శరీరమును విడిచి పెడుతుంది. కానీ, తనతో పాటుగా సూక్ష్మ, మరియు కారణ శరీరములను తీసుకుని వెళుతుంది; వీటిలోనే మనస్సూ, ఇంద్రియములూ ఉంటాయి. ఆత్మకు ప్రతి జన్మలో ఒక కొత్త శరీరము వచ్చినా, మనస్సు మాత్రం, పూర్వ జన్మల నుండీ అదే వస్తుంటుంది. పుట్టుకతోనే గుడ్డివాళ్ళు కూడా, కలలు ఎందుకు చూడగలుగుతారో, దీని వలన మనకు తెలుస్తుంది. మామూలుగా అయితే, మనం మెలకువగా ఉన్న సమయంలో చూసిన దృశ్యాలూ, ఆలోచించిన తలపుల వికారములే, నిద్రలో ఒకలా మళ్ళీ అగుపిస్తాయి. కలలో ఆ వ్యక్తి మానవ శరీరంతోనే ఎగురుతూ, తనకు తానే అగుపించవచ్చు. ఇది ఎందుకంటే, అతను మెలకువగా ఉన్నప్పటి ఆలోచనలూ, చూసిన దృశ్యాలూ, ఒకలా వికారంచెంది, మరల స్వప్న స్థితిలో అగుపిస్తాయి. కానీ, పుట్టుగ్రుడ్డి వాడు, ఎప్పుడూ ఎలాంటి రూపములూ, ఆకారములూ చూసి ఉండడు. అయినా ఆ వ్యక్తి కూడా స్వప్నములు చూస్తాడు. ఎందుకంటే, మెలకువగా ఉన్నప్పటి అనుభూతులు, అనంతమైన పూర్వ జన్మల నుండీ మనస్సులలో ముద్రించబడి ఉంటాయి. ఆత్మ వెళ్లిపోయేటప్పుడు, తనతో పాటు మనస్సూ, ఇంద్రియములనూ తీసుకువెళుతుంది.

06:34 - శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ ।
అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే ।। 9 ।।

మనస్సును ఆశ్రయించి ఉన్న ఇంద్రియములైన చెవులూ, కన్నులూ, చర్మమూ, నాలుక, మరియు ముక్కూ, వీటి యొక్క గ్రహణశక్తితో, జీవాత్మ ఇంద్రియ వస్తువిషయములను ఆస్వాదిస్తుంటుంది.

ఆత్మ దివ్యమైనది కావున, అది సూటిగా రుచి చూడటం, స్పర్శించటం, అనుభవించటం, వాసనచూడటం, లేదా వినటం చేయలేదు. మరి అది ఎలా ఈ అనుభూతులను ఆస్వాదించవచ్చు? అనే ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, దానికి ఇంద్రియములూ, మనస్సూ సహాయం చేస్తాయి. ఇంద్రియములూ, మనస్సూ, నిజానికి జడమైనవి. కానీ, అవి ఆత్మ శక్తిచే చైతన్యవంతమయ్యి, ప్రాణం ఉన్నట్లుగా అవుతాయి. కాబట్టి, అవి వస్తువులూ, పరిస్థితులూ, ఆలోచనలూ, మరియు వ్యక్తుల ద్వారా సుఖదుఃఖాలను అనుభవిస్తాయి. అహంకారముచే ఆత్మ తన మనసేంద్రియములతో అనుసంధానమై, పరోక్షంగా ఆ యొక్క సుఖాలను అనుభవిస్తుంటుంది.

07:39 - ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితమ్ ।
విమూఢా నానుపశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుషః ।। 10 ।।

అది ఇంద్రియ వస్తువిషములను ఆనందిస్తూ, దేహములోనే ఉన్నప్పుడు కానీ, లేదా అది దేహమును విడిచివెళ్లినప్పుడు కానీ, జీవాత్మను అజ్ఞానులు గమనించరు. కానీ, జ్ఞాన నేత్రములు కలవారు, దానిని దర్శించగలరు.

ఆత్మ దేహములోనే స్థితమై ఉండి, తన మనస్సూ, ఇంద్రియముల యొక్క అనుభూతులను ఆస్వాదిస్తూ ఉన్నా, దానిని అందరూ గుర్తించలేరు. దీనికి గల కారణం ఏమిటంటే, ఆత్మ అనేది ప్రాకృతికమైనది కాదు. అందుకే అది భౌతిక ఇంద్రియములచే చూడబడలేదు, లేదా స్పర్శించబడలేదు. శాస్త్రజ్ఞులు దానిని తమ ప్రయోగశాలలో, తమ ఉపకరణాలతోనూ గుర్తించలేరు. కాబట్టి వారు తప్పుగా, ఈ శరీరమే మనము అని అంటారు. కానీ, ఆధ్యాత్మిక మార్గం లో పయనించిన వారు, ఆత్మయే ఈ అన్ని శరీర భాగములనూ జీవింపచేస్తుందని, తమ జ్ఞాన నేత్రములచే తెలుసుకుంటారు. అది వెళ్ళిపోయిన తరువాత, భౌతిక శరీరము యొక్క అన్ని భాగములూ, గుండె, మెదడు, ఊపిరితిత్తుల వంటివన్నీ అక్కడే ఉన్నా, వాటిలో చైతన్యం ఉండదు. చైతన్యమనేది, ఆత్మ యొక్క లక్షణము. ఆత్మ ఉన్నంత వరకే, శరీరములో చైతన్యము ఉంటుంది; ఆత్మ వెళ్ళిపోయినప్పుడు, అదికూడా ఉండదు. జ్ఞాన నేత్రములు కలవారే, దీనిని చూడగలరు. అజ్ఞానులు, తమ స్వంత దివ్య అస్థిత్వము తెలియక, ఈ భౌతిక కాయమే తామని అనుకుంటారు.

09:14 - ఇక మన తదుపరి వీడియోలో, దేహములోనే స్థితమై ఉన్న ఆత్మను ఎటువంటి వారు తెలుసుకోగలుగుతారో, చూద్దాము..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, May 15, 2023

కపోత-లుబ్దక! పరశురాముడు చెప్పిన దివ్య గాధ! Story of Fowler and Pigeon from Mahabharatam


కపోత-లుబ్దక! పరశురాముడు చెప్పిన దివ్య గాధ!
‘అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడె ధన్యుడు సుమతీ’ - నీతి కథ!

మహాభారతంలోని శాంతిపర్వంలో, ఆపద్ధర్మానుశాసన పర్వం అనే ఉపపర్వంలో వివరించబడిన, బోయవాడు - పావురం కథను, భీష్ముడు ధర్మరాజుకు తెలియజేశాడు. శరణాగత రక్షకుడు పాటించవలసిన ధర్మాన్ని గురించి చెప్పమని, భీష్ముడిని ధర్మరాజు కోరగా, శరణాగత రక్షణను గొప్పగా పాటించిన ఒక పావురం కథను తెలియజేశాడు, భీష్మ పితామహుడు. పూర్వం పరశురాముడు, ముచికుందరాజుకు వివరించిన ఆ కథను, అంపశయ్యమీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. శరణాగత రక్షణతో పాటు, భార్యభర్తల అన్యోన్య దాంపత్యాన్ని వివరించే ఆ పావురం కథను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/JumauLZVQuw ]


ఒక అడవి సమీపంలో అతి క్రూరుడైన బోయవాడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు వల తీసుకుని అడవికి వెళ్ళి, పక్షులను పట్టుకుని చంపి, వాటిని అమ్మేవాడు. ఒకరోజు పక్షుల కోసం అతడు అడవికి వెళ్ళినపుడు, గాలీ వానతో కూడిన కుండపోత వర్షం కురుసింది. అడవంతా నీటితో నిండిపోయింది. బోయవాడు ఆ వర్షంలో తడిచి ముద్దై, చలికి వణుకుతూ అడవిలో తిరుగుతూ, వర్షానికి ఎటూ కదలలేక, చిన్న కొమ్మ మీద ఉన్న పావురాన్ని చూసి, దానిని తన బుట్టలో వేసుకున్నాడు. అక్కడికి దగ్గరలోని ఒక పెద్ద చెట్టును చూసి, ఆ రాత్రికి అక్కడే ఉండిపోవాలని నిశ్చయించుకుని, ఆ చెట్టుకు నమస్కరించి, "ఈ చెట్టు మీద ఉన్న దేవతలందరినీ శరణుగోరుతున్నాను", అని పలికి, చలికి వణుకుతూ, ఆకలితో బాధపడుతూ నిద్రపోయాడు. ఆ చెట్టు కొమ్మ మీద ఒక పావురం ఉంది. దాని భార్య ఆ రోజు పొద్దున ఆహారం కోసం వెళ్ళి, తిరిగి రాలేదు. తన భార్య రాకపోయినందుకు, ఆ పక్షి ఆమె క్షేమాన్ని గురించి దిగులు పడుతూ, ఆమె పాతివ్రత్యాన్నీ, సత్ర్పవర్తనను గురించీ, ఇలా అన్నది.

"నా భార్య లేకపోతే నాకు ఇల్లు శూన్యం. కుమారులూ, కోడళ్ళూ, మనుమలూ, సేవకులూ, ఇంటి నిండా ఉన్నప్పటికీ, ఇల్లాలు లేకపోతే, గృహస్థుకు ఇల్లు శూన్యమే. గృహిణి లేని ఇల్లు, ఇల్లు కాదు. గృహస్థుకు గృహిణియే ఇల్లు. గృహిణి లేని ఇల్లు అడవితో సమానం. సర్వాంగ సుందరమైన నా భార్య ఈ రోజు రాకపోతే, నేను బ్రతికి ఉపయోగం లేదు. ఆమె మహా పతివ్రత. ఎల్లప్పుడూ నన్ను అనుసరించి, నా ఆనందాన్ని తన ఆనందంగా, నా దు:ఖాన్ని తన దు:ఖంగా భావిస్తూ ఉంటుంది. అలాంటి భార్యను పొందిన వాడు, ధన్యుడు. పురుషునికి భార్యయే పరమార్థం. అతడు రోగాలతో బాధపడుతున్నా, కష్టాల్లో చిక్కుకున్నా, భార్య వంటి ఔషధం మరొకటి ఉండదు. భార్యతో సమానమైన బంధువు ఉండడు. భార్యలాంటి గతి ఉండదు. లోకంలోని ధర్మ సంగ్రహంలో, భార్యతో సమానమైన సహాయకుడు ఉండడు. అలాంటి భార్య ఇంట్లో లేకపోతే, భర్త అడవులకు వెళ్ళాలి. ఎందుకంటే, భార్యలేని ఇల్లైనా, అడవైనా ఒకటే.." అని తన భార్యను తలచుకుని, దీనంగా విలపించింది.

ఆ విధంగా విలపిస్తున్న పావురం మాటలను విని బోయవాని బుట్టలో ఉన్న ఆడపావురం, తన భర్తకు తన మీద ఉన్న ప్రేమానురాగాలకు ఎంతో సంతోషించి, తన భర్తతో ఇలా అన్నది. "నీ నివాసం దగ్గరకు వచ్చిన ఈ బోయవాడు చలితో, ఆకలితో బాధపడుతూ పడి ఉన్నాడు. అతనికి సహాయం చేసి, శరణాగత రక్షకుడివి కమ్ము. నా కోసం బాధపడవద్దు. సంతానవంతుడవైన నీవు, ఈ బోయవాని మనస్సు సంతోషించేలా, అతని కోరికలను తీర్చు."

ఆ మాటలను విన్న మగపావురం, భార్య చెప్పినట్లుగా చేయాలని నిశ్చయించుకుని, బోయవానితో.. "నీవు బాధపడవలసిన అవసరం లేదు. మా ఇంటికి వచ్చిన అతిథివి నీవు. ఇంటికి వచ్చిన శత్రువుకైనా, ఆతిథ్యమివ్వాలి. నరకడానికి వచ్చిన వాడికి కూడా చెట్టు నీడనిస్తుందే కానీ, ముడుచుకోదు. ఇంటికి వచ్చిన వానికి గృహస్థు తప్పని సరిగా అతిథ్యమివ్వాలి. కాబట్టి, నీకేమి కావాలో చెప్పు" అని బోయవానిని అడిగింది. దానికి బోయవాడు, చలి బాధ నుండి తనను రక్షించమని వేడుకున్నాడు. వెంటనే పావురం నేల మీది ఆకులను పోగుచేసి, తన రెక్కల శక్తినంతా ఉపయోగించి, తొందరగా ఎగిరి దగ్గర్లో ఉన్న గ్రామానికి వెళ్ళి నిప్పు తీసుకుని వచ్చి, ఎండుటాకుల మీద వేసి మంట చేసి, శరీరావయవాలను వెచ్చచేసుకోమని, బోయవానికి చెప్పింది. బోయవాడు మంటకు తన అవయవాలు కాచుకుని, చలి నుండి విముక్తుడై, తన ఆకలి తీర్చమని పావురాన్ని కోరాడు.

అతని మాటలు విన్న పక్షి, "నా దగ్గర సంపద లేదు. ఏ రోజుకారోజు దొరికిన దానితో మేము జీవిస్తాము. భోజనం కోసం కూడబెట్టినది, నా దగ్గర లేదు" అని పలికి క్షణకాలమాగి, "అయినా నీ ఆకలి తీరుస్తాను" అని బోయవానితో చెప్పి, ఎండుటాకుల మంటను పెద్దది చేసి, "ఋషుల వల్లా, దేవతల వల్లా, పితరుల వల్లా, మహాత్ముల వల్లా, అతిథి పూజనమే గొప్ప ధర్మమని నేను గతంలో విని ఉన్నాను. ఓ సౌమ్యుడా.. నేను సత్యం చెబుతున్నాను. అతిథి పూజలో నాకు తిరుగులేని బుద్ధిని అనుగ్రహించు" అని ఆ పావురం అతనితో పలికి, నవ్వుతూ అగ్నికి మూడుసార్లు ప్రదక్షిణ చేసి, అగ్నిలో ప్రవేశించింది. ఆ దృశ్యాన్ని చూసి బోయవాడు ఛలించిపోయాడు. అప్పటి వరకూ తాను చేసిన క్రూర కర్మలను అనేక విధాలుగా నిందించుకుంటూ, పెద్దగా విలపించడం మొదలుపెట్టాడు.

కపోతం యొక్క త్యాగాన్ని చూసిన బోయవాడు, "గతంలో ఎన్నో క్రూరమైన కర్మలతో, ఎంతో పాపం చేశాను. నేను దుర్బుద్ధినీ, నమ్మతగినవాడనుకానూ. ఎన్నో పక్షులను పట్టుకుని, చంపి జీవిస్తున్నాను. గొప్ప మనస్సు గల ఈ పావురం తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి, తన మాంసాన్ని నాకు అర్పించి, నా క్రూరత్వానికి తగిన ప్రతీకారం చేసి, నిస్సంశయంగా ధర్మ మర్గాన్ని నాకు బోధించింది. కాబట్టి, నేను భార్యా బిడ్డలనూ, ప్రియమైన ప్రాణాలను కూడా వదలివేస్తాను. భోగాలన్నింటినీ విడనాడి, నా శరీరాన్ని రకరకాల ఉపవాసాలతో శుష్కింప జేసుకుని, పరలోకాన్ని పొందుతాను." అని పలికి, ధర్మాచరణకు నిశ్చయించుకుని, క్రూరకర్ముడైన ఆ బోయవాడు పక్షులను పట్టుకోవడానికి ఉపయోగించే తన పరికరాలను అక్కడే వదిలివేశాడు.

పంజరంలో బంధించిన ఆడ పావురాన్ని విడిచిపెట్టి, మహాప్రస్థానం వైపు పయనమవుతుండగా, బంధ విముక్తురాలైన ఆడపావురం తన భర్త మరణానికి దు:ఖిస్తూ, తన భర్త మంచితనాన్నీ, తన మీద అతనికి గల ప్రేమనూ, అతను తనకు కల్పించిన స్వర్గ సుఖాలనూ తలచుకుని, "స్త్రీకి భర్తతో సమానమైన వారెవరూ లేరు. తండ్రి, సోదరుడూ, కొడుకూ, వీరందరి కన్నా భర్త అనురాగమే గొప్పది. అలాంటి భర్త లేకుండా నేను జీవించనవసరం లేదు" అని పలికి, ఆడపావురం మండుతున్న అగ్నిలో దూకేసింది. అప్పుడు ఆ పావురాల జంటను తీసుకుని వెళ్ళడానికి స్వర్గలోకం నుండి చక్కగా అలంకరించిన విమానం వచ్చింది. దాన్ని ఎక్కి ఆ రెండు పావురాలు స్వర్గ లోకానికి వెళ్ళిపోయాయి. ఆ దృశ్యాన్ని చూసిన బోయవాడు, తాను కూడా పక్షుల లాగే ఉత్తమ లోకాలను పొందగోరి, నిరాహారుడై, ఉపవాసంతో కృశిస్తూ, అడవిలో తిరుగుతూ, కొంత కాలానికి అడవిలో చెలరేగిన దావానలాగ్నికి తన శరీరాన్ని అర్పించి పునీతుడై, ఉత్తమ లోకాలను పొందాడు.

దయ, కరుణ, పరోపకారం, త్యాగం అనే పదాలకు నిర్వచనం చెప్పాయి పావురాలు. తనకు హాని చేసిన వేటగాడిని సైతం కాపాడమని, "అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడె ధన్యుడు సుమతీ" అన్న హితబోధను చేసింది. ఆకలిగొన్న వాడికి తన శరీరాన్నే ఆహారంగా సమర్పించిన పావురం యొక్క త్యాగం అద్వితీయం. ఈ కథను భీష్ముడు ధర్మరాజుకు చెప్పి, శరణాగత రక్షణ అనేది గొప్ప ధర్మం అని వివరించాడు. ఈ ధర్మం వల్ల, గోహత్యా పాతకం నుంచి కూడా బయటపడవచ్చు. శరణాగతుని చంపిన వానికి, నిష్కృతి లేదు. పుణ్యకర్మమూ, పాప వినాశకరమూ అయిన ఈ కథను విన్నవారు, స్వర్గలోకాన్ని పొందగలరని, తెలియజేశాడు. ఈ కథలో చక్కటి సన్నివేశ వర్ణనా, సహృదయులను ప్రభావితం చేయగల రమణీయమైన సంభాషణలూ, అపూర్వమైన పాత్ర చిత్రణా కనిపిస్తాయి. చక్కటి రంగులతో, అందమైన శరీరాన్ని కలిగి, కుహుకుహూ అనే శబ్దాలతో ఆనందాన్నివ్వగల పావురం, శాంతికి ప్రతీక. అలాంటి పావురాలను పాత్రలుగా తీసుకుని, భార్యాభర్తల అన్యోన్య దాంపత్యాన్నీ, పరస్పరం ఒకరినొకరు విడిచివుండలేని అపూర్వమైన భార్యాభర్తల ప్రేమాభిమానాలనూ, భీష్ముడు ఈ కథ ద్వారా గొప్పగా తెలియజేశాడు. అలాగే, శరణాగత రక్షణ, అతిథి పూజనం, గొప్ప ధర్మాలనీ, మానవులు ఆ ధర్మాలను తప్పనిసరిగా పాటించాలనీ, అలా పాటించిన వారు, మరణానంతరం స్వర్గలోక సౌఖ్యాలను అనుభవిస్తారనీ చెప్పిన ఈ కథ, మానవులకు పరోపకారం, కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయాలన్న గొప్ప నీతిని తెలుపుతుంది.

సర్వేజనాః సుఖినోభవంతు!

Wednesday, May 10, 2023

కామ్య కర్మలు! భగవద్గీత Bhagavadgita


కామ్య కర్మలు! ఏ కార్యములను చేయటం వలన వ్యక్తి స్వర్గాది పై లోకాలకు వెళతాడు?

'భగవద్గీత' పంచదశోధ్యాయం - పురుషోత్తమ ప్రాప్తి యోగం (01 – 05 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదునైదవ అధ్యాయం, పురుషోత్తమ ప్రాప్తి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, పురుషోత్తమ ప్రాప్తి యోగములోని, 01 నుండి 05 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/Eo6LbRTPR8Q ]


ఈ అధ్యాయములో, భౌతిక ప్రపంచంలో క్లేశములకు గురయ్యే జీవాత్మ, భౌతిక అస్థిత్వములో ఉండే జగత్తు యొక్క నిజ స్వరూపము యొక్క అజ్ఞానము వలన మరింతగా, దానిలో ఎలా చిక్కుకుని పోతుందో, శ్రీ కృష్ణుని  వివరణను తెలుసుకుందాము..

00:57 - శ్రీ భగవానువాచ ।

ఊర్ధ్వమూలమధః శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ ।

ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ।। 1 ।।

శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు: వేర్లు పైకీ, మరియు కొమ్మలు క్రిందికీ ఉన్న సనాతనమైన అశ్వత్థ వృక్షము గురించి చెబుతుంటారు. దాని యొక్క ఆకులు వేద మంత్రములుగా, ఆ చెట్టు యొక్క రహస్యం తెలిసిన వారు, వేదములను తెలుసుకున్నట్లుగా చెబుతారు.

అశ్వత్థ అన్న పదానికి అర్థం, ఉన్నది ఉన్నట్లుగా ఒక్కరోజు కూడా ఉండనిది, అని. ఈ జగత్తు కూడా అశ్వత్థమే.. ఎందుకంటే, ఇది కూడా నిరంతరం మారుతూ ఉంటుంది. ఈ జగత్తు ప్రతినిత్యం మారుతూ ఉండటమే కాక, అది ప్రళయ వినాశనం చేయబడి, తిరిగి భగవంతునిలోనికి ఒక రోజు తీసుకొనబడుతుంది. అందుకే దానిలో ఉండేదంతా తాత్కాలికమైనదే, అశ్వత్థమే. అశ్వత్థ అంటే ఇంకొక అర్థం కూడా ఉంది - రావి చెట్టు అని. ఆత్మకు భౌతిక జగత్తు, చాలా విశాలమైన ఒక అశ్వత్థ వృక్షము వంటిదని, శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. సాధారణంగా వృక్షములకు వేర్లు క్రిందికీ, మరియు కొమ్మలు పైకీ ఉంటాయి. కానీ, ఈ వృక్షమునకు, ఊర్ధ్వ మూలం, వేర్లు పైకీ ఉంటాయి. అందుకే అది భగవంతుని నుండి ఉత్పన్నమైనదిగా చెప్పుకుంటాము. ఆయన యందే స్థితమై ఉన్నది, మరియు ఆయనచేతనే పోషించబడుతున్నది. ఆ చెట్టుబోదె, శాఖలూ, క్రిందికి విస్తరించి ఉంటాయి. వాటియందే భౌతిక జగత్తులోని లోకాల సమస్త జీవరాశులూ, స్థితమై ఉన్నాయి. కర్మ కాండలూ, మరియు వాటి ఫలములు చెప్పే వేద మంత్రములు, ఈ వృక్షము యొక్క ఆకులు. ఈ భౌతిక అస్థిత్వమనే వృక్షమునకు, అవి పోషకములు. వేదమంత్రములలో చెప్పబడిన ఫలాపేక్ష గల యజ్ఞ కర్మ కాండలు చేయటం వలన, ఆత్మ స్వర్గ భోగములను అనుభవించటానికి, స్వర్గాది లోకములకు వెళుతుంది. కానీ, ఆ పుణ్యము క్షయమై పోయినప్పుడు, తిరిగి భూలోకానికి చేరుతుంది. ఈ విధంగా, ఆ చెట్టు యొక్క ఆకులు దానిని నిరంతరం, జనన-మరణ చక్రంలో ఉంచుతూ పోషిస్తాయి. ఈ జగత్తు రూపంలో ఉండే వృక్షము సనాతనమైనదని అంటారు. ఎందుకంటే, దాని ప్రవాహం నిరంతరంగా జరుగుతుంటుంది. దాని యొక్క ఆది మరియు అంత్యమూ, జీవాత్మల అనుభవంలోనికి రాదు. ఎలాగైతే నిరంతర ప్రక్రియలో, సముద్రము యొక్క నీరు ఆవిరై మేఘాలుగా మారి, మరల వానలాగా భూమిపై పడి, అంతిమంగా తిరిగి సముద్రం చేరుతుందో, ఈ జనన-మరణ చక్రము కూడా నిరంతరం సాగుతూనే ఉంటుంది.

03:38 - అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా

గుణప్రవృద్ధా విషయప్రవాలాః ।

అధశ్చమూలాన్యనుసంతతాని

కర్మానుబంధీని మనుష్యలోకే ।। 2 ।।

త్రి-గుణములచే పోషించబడి, ఈ చెట్టు యొక్క శాఖలు, పైకీ క్రిందికీ విస్తరించి ఉంటాయి. ఇంద్రియ విషయములు వాటికి చిగుర్ల వలె ఉంటాయి. మానవ రూపంలో కర్మ ప్రవహించటానికి, చెట్టు యొక్క వేర్లు క్రిందికి వేళ్ళాడుతూ ఉంటాయి. క్రింది భాగాన దాని యొక్క వేర్లు శాఖలుగా విస్తరించి, మనుష్య లోకములో కర్మలను కలుగచేస్తాయి.

భౌతిక జగత్తును అశ్వత్థ వృక్షముతో పోల్చుతున్నాడు భగవంతుడు. చెట్టు యొక్క ప్రధాన మొండెము, ఆత్మ తన కర్మలు చేసేటటువంటి మానవ స్వరూపము. వృక్షము యొక్క శాఖలు క్రిందికీ, మరియు పైకి కూడా విస్తరించి ఉంటాయి. ఒకవేళ ఆత్మ పాపిష్టి పనులు చేస్తే, అది జంతువులలో, లేదా నరకలోకాలలో పుడుతుంది. ఇవి క్రిందికి ఉండే శాఖలు. ఒకవేళ ఆత్మ పుణ్య కార్యములు చేస్తే, అది స్వర్గ లోకాలలో గంధర్వుడిలాగా, దేవతల లాగా, లేదా మరేదైనా జీవిలా పుడుతుంది. ఇవి పైకి ఉన్న శాఖలు. ఒక వృక్షము నీటితో పోషింపబడినట్లుగా, ఈ భౌతిక ఆస్థిత్వపు జగత్తు, ప్రకృతి త్రిగుణములచే పోషించబడుతుంది. ఈ త్రిగుణములు, ఇంద్రియ వస్తువిషయములను సృష్టిస్తాయి. అవి వృక్షమునకు చిగుర్లవంటివి. చిగుర్ల యొక్క ప్రయోజనం ఏమిటంటే, అవి అంకురించి, మరింతగా విస్తరిస్తాయి. ఈ అశ్వత్థ వృక్షము మీది చిగుళ్లు మొలకెత్తి, భౌతిక వాంఛలను కలుగ చేస్తాయి. అవి చెట్టు ఊడల వంటివి. రావి చెట్టు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అవి శాఖలనుండి ఊడలను నేల వద్దకు పంపిస్తాయి. దీనితో, ఊడలు ద్వితీయ స్థాయి బోదెలుగా మారతాయి; అలా ఆ రావి చెట్టు విస్తరించి, చాలా విశాలంగా పెరుగుతుంది. అశ్వత్థ వృక్షము యొక్క ఉపమానంలో, భౌతిక జగత్తులో ఇంద్రియ వస్తువిషయములు, చెట్టుకు ఉన్న చిగుళ్లు. అవి అంకురించి, వ్యక్తిలో ఇంద్రియ భోగముల పట్ల కోరికలను జనింపచేస్తాయి. ఈ కోరికలు ఆ వృక్షము యొక్క ఊడల వంటివి. అవి ఈ చెట్టు పెరుగుతూనే ఉండటానికి, పోషకములను ఇస్తుంటాయి. భౌతిక భోగముల పట్ల కోరికలచే ప్రేరేపించబడి, జీవ ప్రాణి కర్మలను చేస్తుంది. కానీ, ఇంద్రియ వాంఛలు ఎన్నటికీ తీరవు; పైగా, వాటిని సంతృప్తి పరచాలని చూసే కొద్దీ, అవి మరింతగా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి, కోరికలను తీర్చుకోవటానికి చేసే కర్మలు, వాటిని మరింత పెంచుకోవటానికి మాత్రమే దోహద పడతాయి.

06:19 - న రూపమస్యేహ తథోపలభ్యతే

నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా ।

అశ్వత్థమేనం సువిరూఢమూలమ్

అసంగశస్త్రేణ దృఢేన ఛిత్త్వా ।। 3 ।।

06:31 - తతః పదం తత్పరిమార్గితవ్యం

యస్మిన్ గతా న నివర్తంతి భూయః ।

తమేవ చాద్యం పురుషం ప్రపద్యే

యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ ।। 4 ।।

ఈ వృక్షము యొక్క నిజ స్వరూపము, ఈ జగత్తులో గ్రహింపబడదు. దాని యొక్క మొదలూ, చివర, లేదా సనాతన అస్థిత్వము కూడా అర్థం కావు. కానీ, ఈ యొక్క లోతైన వేర్లుగల అశ్వత్థ వృక్షమును, అనాసక్తి అనే బలమైన గొడ్డలిచే ఖండించివేయాలి. ఆ తరువాత ఆ వృక్షము యొక్క మొదలు వెతకాలి. అదియే, ఆ భగవంతుడు. ఆయన నుండే ఈ జగత్తు యొక్క ఉత్పత్తి, సనాతన కాలం క్రితం సంభవించినది. ఆయనను ఆశ్రయించిన తరువాత, మళ్ళీ మనం ఈ జగత్తు లోనికి రాము.

సంసారములో, అంటే ఎడతెగని జనన-మరణ చక్రములో మునిగి ఉన్న బద్ధులైన జీవాత్మలు, ఈ యొక్క అశ్వత్థ వృక్షము యొక్క స్వభావమును తెలుసుకోలేకున్నారు. వారికి ఈ చెట్టు యొక్క చిగుళ్ళు చాలా ఆకర్షణీయముగా అనిపిస్తాయి. వారు ఇంద్రియ వస్తు విషయముల పట్ల ఆకర్షితమవుతారు, వాటి పట్ల కోరికలను పెంచుకుంటారు. ఈ కోరికలను తీర్చుకోవటానికి, వారు ఎంతో శ్రమిస్తుంటారు. కానీ, వీరి శ్రమ అంతా, ఆ వృక్షము మరింతగా పెరగటానికి దోహదపడుతుందని తెలుసుకోరు. ఎప్పుడైతే కోరికలు తీరుతాయో, అవి మరింత ఉధృతంగా, అత్యాశ రూపంలో తిరిగి వస్తాయి. కోరికలను అడ్డుకున్నప్పుడు, అవి క్రోధమునకు దారితీస్తాయి. అది బుద్ధిని మరింత భ్రమకు గురి చేసి, మరింత అజ్ఞానము లోకి నెట్టి వేస్తాయి. ఈ అశ్వత్థ వృక్షము యొక్క నిగూఢ మర్మమును, కొద్ది మందే అర్థం చేసుకుంటారని, శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. ఈ వృక్షము యొక్క మొదలు, లేదా దాని అసలు స్వభావము తెలుసుకోకుండా, జీవుడు వ్యర్ధమైన పనులు చేయటం, లేదా ప్రయాసలు పడటం చేస్తుంటాడు. తన యొక్క భౌతిక కోరికలను తీర్చుకోవటం కోసం, మానవుడు ఒక్కోసారి పాపపు పనులు చేస్తూ, నిమ్నస్థాయి జీవులలోకీ, అధోలోకాలలోనికీ ప్రవేశిస్తాడు. ఒక్కోసారి భౌతిక భోగములు అనుభవించాలనే కోరిక, వ్యక్తిని ఆ చెట్టు యొక్క ఆకుల పట్ల ఆకర్షితం చేస్తుంది. అవే, వేదములలో చెప్పబడిన కామ్య కర్మ కాండలు. ఈ కార్యములను చేయటం వలన, వ్యక్తి స్వర్గాది పై లోకములకు వెళతాడు. కానీ, పుణ్యము క్షయమయిపోయిన తరువాత, తిరిగి భూలోకానికి చేరుతాడు.

08:59 - నిర్మానమోహా జితసంగదోషా

అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ।

ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః

గచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్ ।। 5 ।।

దురభిమానము, మరియు మోహము లేకుండా ఉన్నవారూ, మమకారాసక్తియనే అరిష్టాన్ని జయించినవారూ, సతతమూ, ఆత్మ భగవంతుని చింతనలోనే ఉన్నవారూ, ఇంద్రియ భోగములను అనుభవించాలని కోరికలు లేని వారూ, సుఖదుఃఖములనెడి ద్వందములకు అతీతులై ఉన్నవారూ, ఇటువంటి ముక్తజీవులు, నా పరమపదమును చేరుకుంటారు.

శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, ఆ వృక్షము యొక్క మూలాధారమైన భగవంతునకు, ఎలా శరణాగతి చేయాలో వివరిస్తున్నాడు. ప్రప్రధమంగా, అజ్ఞానము వల్ల జనించిన అహంకారమునూ, మరియు గర్వమునూ విడిచిపెట్టాలని అంటున్నాడు. భ్రాంతికి లోనైన జీవాత్మ, ప్రస్తుతం ఇలా అనుకుంటుంది.. ‘నాకున్న దానికంతా నేనే యజమానిని, భవిష్యత్తులో మరింత సంపాదించుకుంటాను. ఇదంతా నా భోగవిలాసానికీ, మరియు సంతోషానికే ఉన్నది.’ అనే భ్రమలో ఉంటుంది. మనము అజ్ఞానము వలన జనించిన ఈ అహంకారముచే మోహితులమై ఉన్నంత వరకూ, మనమే ప్రకృతిని అనుభవించేదని అనుకుంటాము. ఇటువంటి పరిస్థితిలో, మనము ఆ భగవంతుడిని పక్కకుపెట్టి, ఆయన సంకల్పానికి శరణాగతి చేయటానికి వాంఛించము. మనమే వీటన్నిటినీ అనుభవించేదన్న దృక్పథం, జ్ఞాన సహకారంతో నిర్మూలించబడాలి. ఈ భౌతిక శక్తి భగవంతునికి చెందినది కాబట్టి, ఆయన సేవ కోసమే ఉన్నదని గ్రహించాలి. ఆత్మ కూడా భగవంతుని యొక్క సేవకుడే కాబట్టి, ప్రస్తుతమున్న భోగించే దృక్పథాన్ని, సేవా దృక్పథముగా మార్చాలి. దీని కోసం మనము మనస్సుని భగవంతుని నుండి దూరంగా, ప్రాపంచికత్వం వైపు మరల్చే భౌతిక బంధాలను నిర్మూలించుకోవాలి. బదులుగా, ఆత్మ అనేది భగవంతుని యొక్క సనాతన నిత్య దాసుడే అని అర్థం చేసుకుని, మనస్సును నిస్వార్ధ సేవా దృక్పథంలో, భగవంతుని యందే అనుసంధానం చేయాలి.

11:05 - ఇక మన తదుపరి వీడియోలో, భౌతిక శక్తిచే కట్టివేయబడి, మనస్సుతో కలిపి ఉన్న ఆరు ఇంద్రియములతో ఏ విధంగా ప్రయాస పడుతుంటామో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Link: https://www.youtube.com/post/UgkxaOc1LBkdNKgupyDYRmy98045V70C_wxa

Monday, May 8, 2023

తపస్సు బ్రాహ్మణులు మాత్రమే చేయగలరా? పురాణాలలో ఏం ఉంది? Who is Satyatapas?

 

తపస్సు బ్రాహ్మణులు మాత్రమే చేయగలరా? పురాణాలలో ఏం ఉంది?

బోయవాడిగా పుట్టి, బ్రాహ్మణుడిగా ఎదిగిన ‘సత్యతపుడు’ ఎవరు? మన పురాణాలలో అత్యుత్తమ గాథలు కోకొల్లలు. ఒక్కో గాథలో, మానవ జీవితాన్ని సార్థకం చేసుకునే నీతి ఎంతో గోచరిస్తుంది. బోయవాడిగా పుట్టి, బ్రాహ్మణుడిగా ఎదిగి, ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకున్న ముని గురించి తెలుసుకుందాము.. బోయవాడు బ్రహ్మజ్ఞానాన్ని ఎలా సంపాదించాడు? దుర్వాస మహార్షి చేత నామకరణం చేయబడిన ఆ బోయవాడి వృత్తాంతం ఏమిటి? సత్య దీక్షతో ఇంద్రుడిని మెప్పించి, వరాలను పొందిన ఆ బోయవాడి గాధను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/CrrnCM18VWI ]



శాప వశాన సర్పంగా జన్మించిన బ్రాహ్మణ కుమారుడు, సత్యతపుడిగా ప్రసిద్ధి చెందినట్లు, ‘దేవీ పురాణం’లో వివరించబడి ఉంది. ప్రాచీన కాలంలో దేవదత్తుడనే బ్రాహ్మణుడూ, అతని భార్య రోహిణికీ సంతానం లేదు. అందుకతడు పుత్రకామేష్టి యాగం చేశాడు. ఎందరో సాధువులు అందులో పాల్గొన్నారు. సుహోత్రుడు బ్రాహ్మణుడిగా, యాజ్ఞవల్క్యుడు పురోహితుడిగా, బృహస్పతి యజ్ఞకర్తగా, పైలుడు వేదాలు చదువుతుండగా, గోడిలుడు స్తోత్రాలు గానం చేశాడు. అతడు పాడుతుండగా పామువచ్చి బుసకొడుతుంటే, దేవదత్తుడు అతని ధ్వనిని ఛీత్కరించాడు.  అతడు కోపించి, నీకు జన్మించేవాడు సర్పంగా జన్మిస్తాడని శపించాడు. దేవదత్తుడు అతడి పాదాలపై పడి, క్షమాపణ అడిగాడు. అప్పుడు ఆ పాము, సర్పంగా జన్మించినా, గొప్ప రుషి అవుతాడని శాపవిమోచనం చెప్పాడు.

ఆ తర్వాత దేవదత్తుడికి, ఉతత్యుడనే సర్ప బాలుడు జన్మించాడు. అతడు అంతర్ముఖుడిగా ప్రవర్తించేవాడు. అతడి శైలిని మార్చడానికి ఎంతగానో ప్రయత్నించి విఫలం చెందారు, తల్లి దండ్రులు. ప్రతి ఒక్కరూ అతడు సర్పమనే భావించి ఛీత్కారం చేయగా, అతడు ఇల్లు వదలి గంగాతీరంలో ఓ గుడిసె వేసుకుని, తీవ్రమైన తపస్సు చేశాడు. అతడు ఎవరికీ హానిచేసే వాడు కాదు. అబద్ధం చెప్పేవాడు కాదు. అతడి ప్రవర్తనను బట్టి, చుట్టుపక్కల వారు అతడిని సత్యతపసుడని పిలిచేవారు. అలా ఆ కుటీరంలో 14 సంవత్సరాలు జీవించాడు. ఒకరోజు ఓ ఆటవికుడు ఓ పందిపై బాణం విసరగా, అది దాని శరీరంలో దిగబడడంతో, అక్కడే ఉన్న సత్యతపుడి ఆశ్రమంలోకి పారిపోయింది. ఆటవికుడు అదెక్కడుందని సత్యతపుడిని అడుగగా, “ఎవరైతే చూశారో, వారు మాట్లాడలేరు. మాట్లాడగలిగినవారు, చూడలేరు” అని సమాధానమివ్వగా, బోయవాడు తన విల్లును పడేసి, జ్ఞానోదయాన్ని పొందాడు. సత్యతపుడి సత్య దీక్షకు మెచ్చిన దేవతలు, అతడిని శాప విముక్తుడిని చేశారు.

ఇక సత్యతపుడి గురించి వరాహ పురాణంలో సైతం, వివరించబడి ఉంది. పూర్వం ఒక ఊళ్ళో ఒక బోయవాడు ఉ౦డేవాడు. అతడికి ఏ పనీ రాదు. వచ్చినా చెయ్యడు. వట్టి సోమరి పోతు. మరి తినడానికి ధనం కావాలి కదా! దాని కోస౦ దారిన పోయే వాళ్ళను బెదిరి౦చి, వాళ్ళ దగ్గర దొరికిన వాటితో, పొట్టపోసుకునేవాడు. ఇలా ఒక రోజు బోయవాడు అడవిలో తిరుగుతున్నాడు. ఎ౦త తిరిగినా, ఆ రోజు బాటసారులెవరూ దొరకలేదు. తినడానికి తిండి లేక, ఆకలి బాధ ఎక్కువవుతుంటే, అక్కడ తపస్సు చేసుకు౦టున్న ‘అరుణియ’ అనబడే ముని కనిపి౦చాడు. ఆకలి కోపంతో ఆ మహర్షిని కొట్టబోయాడు. ఆ శబ్దానికి ఒకసారి కళ్ళు విప్పి చూసి, మళ్ళీ కళ్ళు మూసుకున్నాడా ముని. బోయవాడు ఆశ్చర్యంతో, ‘ఇదేమిటి? నేను కొట్టబోతే భయపడలేదు! పైగా, మళ్ళీ కళ్ళు మూసుకుని జప౦లో పడ్డాడు! అ౦టే, కొడితే కొట్టుకో అనుకు౦టున్నాడా?’ అనుకుని, ఆ మహర్షి కళ్లు తెరిచాక, అదే విషయం తేల్చుకుందామని అక్కడే, ఆ ముని ఎదురుగా కూర్చు౦డి పోయాడు. కొ౦త సేపటికి ఆయన జప౦ చాలి౦చి లేచాడు. అంత వరకూ ఆయన సంగతేదో చూడాలనుకున్న వాడు, మంత్రం వేసినట్లుగా, సాధు స్వభావిలా, “స్వామీ! ఇ౦కెప్పుడూ మిమ్మల్ని కొట్టను! మిమ్మల్నే కాదు, అసలు ఎవరినీ కొట్టను. నన్ను మీ శిష్యుడిగా స్వీకరి౦చ౦డి” అని అన్నాడు. మహర్షి ఏమీ మాట్లాడకు౦డా, అక్కడి నుండి నడిచి వెళ్ళిపోయాడు.

బోయవాడు కూడా ఆయనను వదలకు౦డా వె౦ట పడ్డాడు. మహర్షి ఎక్కడికి వెళితే, అక్కడికి వెళ్ళాడు. హఠాత్తుగా ఒక చోట పులి ఒకటి, మహర్షి మీదకు దూకింది. వె౦టనే బోయవాడు ఆ పులిని చ౦పేశాడు. ముని కరుణించి, తనను కాపాడిన బోయవాడికి భగవంతుడి యొక్క గొప్పతనం, తపస్సు చేసుకునే విధాన౦ ఉపదేశిస్తూ, “నాయనా! దారిన వెళ్ళే వాళ్ళని కొట్టడ౦ మానెయ్యి. ఎప్పుడూ సత్యాన్నే పలుకు! నేను చెప్పిన పద్ధతిలో  తపస్సు చేసుకో” అని చెప్పి వెళ్ళి పోయాడు. బోయవాడు అరుణియ మహర్షి చెప్పినట్టే చేయడం మొదలు పెట్టాడు.  తిండి కూడా మరచిపోయి, తపస్సు చేయసాగాడు.

ఒక రోజు అటు వైపుగా దుర్వాస మహర్షి వచ్చాడు. బోయవాడు ఆయనను చూసి సమస్కార౦ చేసి, “స్వామీ! నా దగ్గర ఆతిథ్య౦ తీసుకుని వెళ్ళ౦డి!” అని ప్రార్థి౦చాడు. “ఇతని దగ్గర ఏము౦దని నాకు ఆతిథ్యమిస్తాడు? అదీ చూద్దా౦!” అని అనుకుని, “నీ ఇష్టప్రకార౦, నీ ఆతిథ్య౦ తీసుకునే వెళతాను!” అన్నాడు మహర్షి. దుర్వాస మహర్షి మాటలకు స౦తోష౦గా శివుణ్ణి ప్రార్థి౦చాడు, బోయవాడు. శివుడు అతనికి ఒక బ౦గారు పాత్రను ప్రసాదించాడు. దాని సహయ౦తో అతడు, దుర్వాసుడికి కావలసిన ఆతిథ్యమిచ్చి, గౌరవి౦చాడు. అది చూసి దుర్వాసుడు ఆశ్చర్యపోయాడు. అతడికి ‘సత్యతపుడ’నే పేరు పెట్టి, “నాయనా! నువ్వు నిజ౦గా సత్య తపుడివే!” అని ఆశ్వీరదించాడు.

ఆనాటి నుండీ బోయవాడు సత్యతపుడిగా, అందరి మన్ననలూ పొందాడు. ఒక రోజు అతడు అడవిలో సమిథలు కోసుకు౦టూ ఉ౦డగా, కత్తి తగిలి వేలు తెగి, క్రింద పడిపోయి౦ది. కానీ, వె౦టనే ఆ వేలు పైకి వచ్చి, దాని చోటులో అది అతుక్కుపోయి౦ది. అక్కడే వున్న కొ౦తమ౦ది కెన్నెర కింపురుషులు ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్య౦తో, దేవేంద్రుడికి చెప్పారు. వారి మాటలకు ఇ౦ద్రుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఇటువ౦టి విశేష౦ ఎప్పుడూ వినలేదే! అని అనుకున్నాడు. సత్యతపుడి తపశ్శక్తిని పరీక్షి౦చాలనుకుని, వె౦టనే ఇద్దరు అనుచరులతో బయల్దేరాడు. ఒకరు ఎరుకలవాని వేష౦లోనూ, మరొకరు ప౦ది వేష౦లోనూ, సత్యతపుడి దగ్గరకు వచ్చారు.

మాయ ప౦ది పరుగెత్తుతూ.. రక్షి౦చమని అరుస్తూ, సత్యతపుడి ఆశ్రమ౦లో దాక్కు౦ది. ఎరుకలవాడు దాన్ని తరుముతూ వచ్చి, సత్యతపుడి ఆశ్రమ౦ చేరాడు. “అయ్యా! నేను కొట్టిన ప౦ది మీ ఆశ్రమ౦లోకి వచ్చి౦ది. ఎటు వెళ్ళి౦దో చెప్ప౦డి!” అని అడిగాడు. సత్యతపుడికి ధర్మసంకటం ఏర్పడింది. ఏ౦ చెయ్యాలో తోచలేదు. తనకు తెలిసిన దానిని, తెలిసి కూడా చెప్పకపోతే, అబద్ధ౦ అవుతు౦ది. తెలుసని చెబితే, జరగబోయేది జీవహి౦స కనుక, అది పాపం అవుతుంది. ఆ పాప౦ తనకు చుట్టుకు౦టు౦ది. కొద్దిసేపు ఆలోచి౦చి, ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ ఎరుకల వాడితో, “నాయనా! ప౦దిని చూడగలిగి౦ది కన్ను. దానికి నోరు లేదు.. మాట్లాడడ౦ రాదు. చెప్పగలిగి౦ది నోరు.. దానికి చూడడ౦ రాదు. చూశానని ఎలా చెప్తు౦ది?” అని ఎదురు ప్రశ్నించాడు. అతని సత్య దీక్షకు మెచ్చుకుని, ఇ౦ద్రుడూ, మిగతా దేవతలూ, తమ నిజ రూపాల్లో కనిపి౦చి, “సత్యతపా! ఆ పేరు నీకు సరిగ్గా సరిపోయి౦ది!” అని మెచ్చుకుని, అతడికి కావలసిన వరాలిచ్చి, అ౦తర్థానం అయ్యారు. ఏమీ తెలియని ఒక సోమరిపోతయిన బోయవాడు, గురువుగారి మీద భక్తితో, ఎప్పుడూ సత్యాన్నే పలకాలని చెప్పిన గురువుగారి మాటకు కట్టుబడి, ఆచరించి, ఆయన చెప్పినట్టు సాధన చేసి, సత్యతపుడిగా పేరు సార్ధక౦ చేసుకుని, చరితార్థుడయ్యాడు.

ధర్మో రక్షతి రక్షితః

Wednesday, May 3, 2023

Transcendental Meditation - భగవద్గీత Bhagavadgita


Transcendental Meditation?
అనుకూల - ప్రతికూల పరిస్థితులనూ, విమర్శనూ - ప్రశంసనూ ఒక్కలాగే ఎలా చూడాలి?

'భగవద్గీత' చతుర్దశోధ్యాయం – గుణత్రయ విభాగ యోగం (24 – 27 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్నాలుగవ అధ్యాయం, గుణత్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, గుణత్రయ విభాగ యోగములోని, 24 నుండి 27 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/UdZlKp1cyro ]



త్రిగుణములకు అతీతులైనవారెవరో, శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు..

00:45 - సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మకాంచనః ।
తుల్యప్రియాప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః ।। 24 ।।

00:55 - మానాపమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః ।
సర్వారంభపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే ।। 25 ।।

సుఖదుఃఖాలలో ఒక్క రీతిగానే ఉండేవారూ, ఆత్మ భావన యందే స్థితమై ఉండేవారూ, మట్టిముద్ద, రాయి, మరియు బంగారము, వీటన్నిటినీ ఒకే విలువతో చూసేవారూ, అనుకూల, లేదా ప్రతికూల పరిస్థితిలో ఒక్కరీతిగానే ఉండేవారూ, తెలివైన వారూ, నిందాస్తుతులను రెంటినీ సమముగా స్వీకరించేవారూ, గౌరవమునూ, అవమానమునూ ఒక్క రీతిగానే తీసుకునేవారూ, శత్రువునూ, మిత్రుడినీ ఒక్కలాగే చూసేవారూ, అన్ని యత్నములనూ విడిచిపెట్టినవారూ - వీరు త్రిగుణములకు అతీతులైనవారని చెప్పబడతారు.

భగవంతుని లాగానే, ఆత్మ కూడా త్రిగుణాతీతమయినదే. శారీరక దృక్పథంలో మనము, మనలను శరీరము యొక్క సుఖ-దుఃఖాలతో అనుసంధానం చేసుకుంటాము. అందుకే, హర్షము లేదా శోకము వంటి భావోద్వేగాల మధ్య ఊగిసలాడతాము. కానీ, ఆత్మ భావము యందే స్థితమైనవారు, శరీరము యొక్క సుఖము, లేదా దుఃఖముచే ప్రభావితం కారు. ఇటువంటి ఆత్మజ్ఞానులు జగత్తు యందలి ద్వందములను గమనిస్తారు కానీ, వాటిచే ప్రభావితం కారు. అందుకే వారు నిర్గుణులైపోతారు. అంటే, గుణముల ప్రభావమునకు అతీతమైపోతారు. ఇది వారికి సమత్వ దృష్టిని ఇస్తుంది. దానితో వారు, ఒక రాయిని, లేదా మట్టి ముద్దని, బంగారాన్ని, అనుకూల మరియూ ప్రతికూల ప్రరిస్థితులనూ, విమర్శనూ మరియు ప్రశంసనూ ఒక్కలాగే చూస్తారు.

02:33 - మాం చ యోఽవ్యభిచారేణ భక్తియోగేన సేవతే ।
స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే ।। 26 ।।

నిష్కల్మషమైన భక్తి ద్వారా నన్ను సేవించిన వారు, ప్రకృతి త్రిగుణములకు అతీతులై పోవుదురు, మరియు బ్రహ్మము స్థాయికి చేరతారు.

ప్రకృతి త్రి-గుణములకు అతీతులైన వారి యొక్క లక్షణములను వివరించిన పిదప, శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, ఈ త్రిగుణములకు అతీతమై పోవటానికి ఉన్న ఏకైక పద్ధతిని వివరిస్తున్నాడు. ఆత్మ యొక్క జ్ఞానము, మరియు దానికీ శరీరమునకూ ఉన్న బేధమును, కేవలం తెలుసుకుంటే సరిపోదు. భక్తి యోగము ద్వారా, మనస్సును ఆ పరమేశ్వరుడైన శ్రీ కృష్ణ పరమాత్మపై లగ్నం చేయాలి. అప్పుడు మాత్రమే మన మనస్సు, నిర్గుణుడైన శ్రీకృష్ణుడి వలె, మూడు గుణములకు అతీతమైన స్థాయికి చేరుతుంది. చాలా మంది జనులు, మనస్సును సాకార రూప భగవంతునిపై నిమగ్నం చేస్తే, అది అలౌకిక స్థాయికి చేరుకోలేదని అనుకుంటారు. దానిని నిరాకార బ్రహ్మముపై నిమగ్నం చేస్తేనే, మనస్సు త్రి-గుణములకు అతీతమవుతుందని భావిస్తారు. కానీ, ఈ శ్లోకం ఆ అభిప్రాయాన్ని ఖండిస్తున్నది. సాకార రూప భగవంతుడు అనంతమైన గుణములను కలిగి ఉన్నా, అవి అన్నీ దివ్యమైనవి, మరియు ప్రకృతి గుణముల కన్నా అతీతమైనవి. కాబట్టి, సాకార రూప భగవానుడు నిర్గుణుడు. పద్మ పురాణంలో, మహర్షి వేద వ్యాసుడు, ఈ విషయాన్ని ఇలా వివరిస్తున్నాడు: ‘శాస్త్రములు ఏవైనా భగవానుడు నిర్గుణుడని అంటే, దాని అర్థం, ఆయనకి ప్రాకృతిక గుణములు లేవని. ఐనప్పటికీ, ఆయన యొక్క దివ్య వ్యక్తిత్వము గుణరహితము కాదు. ఆయనకు అనంతమైన దివ్య గుణములు ఉన్నాయి’. ధ్యాన విషయంలో ఏది శ్రేష్ఠమో కూడా, ఈ శ్లోకము తెలియచేస్తున్నది. Transcendental meditation అంటే, ఎదో శూన్యంపై ధ్యానం చేయటం కాదు. భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములకు అతీతమైన అస్థిత్వము, భగవంతుడు. కాబట్టి, మన ధ్యాన విషయం భగవంతుడయినప్పుడే, దానిని నిజమైన Transcendental meditation అని అనవచ్చు.

04:45 - బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమ్ అమృతస్యావ్యయస్య చ ।
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ ।। 27 ।।

అనశ్వరమైన, అవ్యయమైన నిరాకార బ్రహ్మమునకూ, సనాతనమైన ధర్మమునకూ, మరియు అఖండమైన దివ్య ఆనందమునకూ నేనే ఆధారమును.

సర్వశక్తిమంతుడైన భగవానుడు, తన అస్తిత్వంలో నిరాకార తత్వమును, మరియు సాకార రూపమును, రెంటినీ కలిగి ఉన్నాడని, ఇదివరకే చెప్పబడినది. జ్ఞానులు ఉపాసించే బ్రహ్మము అనేది, భగవంతుని యొక్క సాకార రూపము నుండి జనించే ప్రకాశమే అని, ఇక్కడ శ్రీ కృష్ణుడు తెలియపరుస్తున్నాడు. ‘బృందావనేశ్వరుడైన శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క పాద నఖముల నుండి వెలువడే కాంతియే, జ్ఞానులూ, దేవతలూ ధ్యానించే అలౌకిక బ్రహ్మమ’ని, పద్మ పురాణంలో వివరించబడింది. భగవంతుని యొక్క దివ్య దేహము నుండి వెలువడే తేజస్సే, ఉపనిషత్తులలో బ్రహ్మముగా చెప్పబడినది. పరమేశ్వరుని సాకార రూపము పట్ల నిశ్చలమైన భక్తితో నిమగ్నమవ్వటమే, త్రిగుణముల యొక్క వ్యాధుల సర్వరోగనివారిణి అని, రూఢీగా తెలియజేస్తున్నాడు శ్రీ కృష్ణుడు.

ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం, యోగ శాస్త్రే, శ్రీ కృష్ణార్జునసంవాదే, గుణత్రయ విభాగయోగో నామ చతుర్దశోధ్యాయ:

శ్రీ మద్భగవద్గీతలోని జ్ఞానషట్కం, పద్నాలుగవ అధ్యాయం, గుణత్ర విభాగ యోగములోని, 27 శ్లోకాలూ సంపూర్ణం..

06:18 - ఇక మన తదుపరి వీడియోలో, పదునైదవ అధ్యాయం, పురుషోత్తమ ప్రాప్తి యోగములో, శ్రీ కృష్ణుడు విశదపరిచిన నిగూఢార్థాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, May 1, 2023

సగం శరీరంతో జన్మించిన ‘అరుణుడు’ ఎవరు? Story of Aruna or Anura

 

సగం శరీరంతో జన్మించిన ‘అరుణుడు’ ఎవరు?
How Sanatana Dharma is Scientific and Conscientious way of living?

సూర్యుడి కిరణాలు మన భూమిని నాశనం చేయకుండా కాపాడేది, ఓజోను పొర అని మనందరికీ తెలిసిందే. దాని గురించి ఎన్నో ఏళ్ళ క్రితమే మన పురాణాలలో, సుస్పష్టంగా వివరించబడిన ఒక గాథతోపాటు, సూర్యుడి ఆగ్రహ జ్వాలలకు కారణం ఏమిటి? సూర్యకిరణాలు లోకాలను దహించివేయకుండా అడ్డుపడేది ఎవరు? సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో, ఆకాశంలో కనబడే అరుణ వర్ణం ఎవరి కారణంగా ఉద్భవిస్తుందనేటటువంటి ఉత్సుకతును రేకెత్తించే విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/2laPV4Ws8X0 ]



ఇనుడు అంటే సూర్యుడు. ‘ఇన’ శబ్దానికి, సంచరించువాడు అని అర్థం. సూర్యుడు ఒకచోట స్థిరంగా ఉండకుండా సంచరిస్తూ ఉంటాడని, వేల ఏళ్ళ క్రిందటే చెప్పారు మన మహర్షులు. గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. ఆ తిరగడంలో ఒక పద్ధతి ఉన్నది, నియంత్రణ ఉన్నది. ఒక గ్రహానికి మరొక గ్రహం ఢీ కొనకుండా చూసే ఏర్పాటున్నది. ఈ ఏర్పాటును చూసే శక్తి పేరు, శేషువు. ఈ విషయాన్నే స్థూలంగా, ఆదిశేషుడు భూమిని మోస్తున్నాడని చెబుతాయి, మన పురాణాలు. సూర్యుడు తన చుట్టూ తాను తిరగడం మాత్రమే కాక, అనేక కోట్ల సూర్యులతో కలసి ఏర్పడిన పాలపుంత చుట్టూ తిరుగుతుంటాడు. దీనిపేరు బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండాన్ని నిలబెట్టే గురుత్వాకర్షణ శక్తి పేరు, కమఠ. అదే కూర్మ శక్తి. అమృత మథనానికి తోడ్పడేందుకు, మంధర పర్వతాన్ని మోసిన ఆది కూర్మం ఇదే. ఆధునికులు పాలపుంతగా భావించే అంతరిక్షంలోని నక్షత్రమండల సముదాయాన్ని, మన పూర్వులు క్షీర సముద్రంగా వర్ణించారు. పాలపుంతలన్నీ కలిసి ఒక కేంద్రకాన్ని ఏర్పరచుకుని, దాని చుట్టూ తిరుగుతుంటాయి. ప్రాచీనుల భాషలో దానిని, అఖిలాండ బ్రహ్మాండ కోటి అంటారు. ఈ ఏర్పాటును స్థిరపరిచే గురుత్వాకర్షణ శక్తిని, ఆది వరాహమనీ, శ్వేత వరాహమనీ అంటారు. భూమిని ప్రాణికోటికి నివాస యోగ్యంగా స్థిరపరచిన ఈ వరాహం పేరునే, మన పూజా సంకల్పాలలో ‘శ్వేత వరాహ కల్పే’ అని జ్ఞాపకం చేసుకుంటాము. సూర్యుడిది ఏక చక్ర రథం. దానికి పూన్చిన గుర్రాలు ఏడు. కిరణంలోని ఏడు రంగులే, ఏడు గుర్రాలు. అశ్వాలు వేగానికి ప్రతీక.

ఇక ఈ కథ, ఆది పర్వంలోని ఆస్తీక పర్వం అనే ఉపపర్వంలో, గరుడుని కథలో, 24 వ అధ్యాయంలో, 20 శ్లోకాలలో ఉంది. దేవదానవులు సముద్రాన్ని చిలికినపుడు, అందులోనుంచి అమృతం ఉద్భవించింది. విష్ణువు అమృతాన్ని దేవతలకు పంచుతున్న సమయంలో, రాహువు దేవతల పంక్తిలో కూర్చుని అమృతాన్ని సేవించబోతూ ఉన్నప్పుడు, సూర్య చంద్రులు చూసి, విష్ణువుకు చెప్పారు. విష్ణువు తన చక్రంతో రాహువు తల నరికి వేశాడు. అయితే, అప్పటికే అమృతాన్ని నోటిలో పోసుకోవడం వల్ల, మొండెం నుంచి తల వేరయినప్పటికీ, అమృత ప్రభావంతో, తల భాగం ప్రాణంతోనే ఉండి, ఆ రాహువు సూర్య చంద్రులను పట్టుకుని బాధించడం మొదలు పెట్టాడు. తాను రాహువు తల నరికించి దేవతలకు చాలా మేలు చేసినప్పటికీ, తనను రాహువు బాధిస్తూ ఉంటే, దేవతలు తనకు సహాయంగా రాకుండా చోద్యం చూస్తున్నారని, సూర్యునికి దేవతల మీద కోపం వచ్చి, ముల్లోకాలకూ బాధ కల్పించాలనే ఉద్దేశంతో, అస్తాద్రికి చేరి అక్కడే ఉంటూ, లోకాలను తన కిరణాల చేత తపింపజేయడం మొదలుపెట్టాడు. అప్పుడు రుషులూ, దేవతలూ కలసి బ్రహ్మ వద్దకు వెళ్లి, సూర్యుడు లోకాలను దహింపజేస్తున్న విషయాన్ని గురించి చెప్పారు.

దానికి బ్రహ్మ, "కశ్యప మహర్షి కుమారుడైన అనూరుడు చాలా విశాలమైన శరీరం కలవాడు, గొప్ప తేజస్వి. అతణ్ణి సూర్యుని ముందు రథం మీద కూర్చుండ బెట్టి సారథ్యం చేయిస్తే, భయంకరమైన సూర్యుని తేజస్సు అడ్డగింపబడుతుంద"ని సలహ ఇచ్చాడు. సూర్య శక్తిని తట్టుకోగలిగే అనూరుడి జన్మ వృత్తాంతాన్ని చూసుకున్నట్లయితే, కశ్యప ప్రజాపతి భార్యలైన వినతా కద్రువలు, తమకు సంతానం కావాలని భర్తను కోరారు. అప్పుడు కశ్యపుడు వారిని "ఎలాంటి పుత్రులు కావాల"ని అడుగగా, కద్రువ తనకు ప్రకాశవంతమైన దేహాలు కలిగిన పుత్రులు వెయ్యి మంది కావాలని కోరింది. వినత మాత్రం, తనకు వారి కంటే బలవంతులైన ఇద్దరు పుత్రులు కావాలని కోరింది. పుత్రుల కొరకు కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. యాగ ఫలితంగా, కద్రువకు వెయ్యి అండాలూ, వినతకు రెండు అండాలూ లభించాయి. ముందుగా కద్రువ అండాలు పక్వం చెంది, వెయ్యి మంది నాగ కుమారులు జనించారు. అందుకు వినత ఉక్రోషపడి, తన అండాలలో ఒకదానిని బలవంతంగా చిదిమింది. దాని నుండి సగం దేహంతో జన్మించిన వాడే, అనూరుడు. అండము నుండి బయటకు రాగానే అతను తల్లిని మందలించి, తనకు అసంపూర్ణమైన దేహం కలిగినందుకు కారణమైన ఆమెను, ఎవరిని చూసి ఈర్ష్యతో ఆ దారుణానికి పూనుకున్నదో, వారికే దాసివవుతావని బాధతో శపించాడు. తరువాత వినతకు మరో అండం ద్వారా, గరుడుడు జన్మించాడు.

సూర్యుడి తాపం నుండి విముక్తి పొందడానికై బ్రహ్మ సలహా మేరకు, గరుడుడు ముల్లోకాల క్షేమాన్నీ కోరి, తన అన్న, నడుము క్రింది భాగం లేనివాడూ అయిన అనూరుడిని మోసుకుని వెళ్ళి, సూర్యుని రథం మీద కూర్చోబెట్టాడు. సారథి రథికుడికి వెన్నుపెట్టి గుర్రాలను తోలాలి. అనూరుడు అందుకు భిన్నంగా, సూర్యుడివైపు ముఖంపెట్టి కూర్చున్నాడు. సూర్యుడి నుంచి వెలువడే కిరణాల దుష్ప్రభావాలను తాను వడగట్టి, మంచి కిరణాలను భూమికి పంపడం మొదలుపెట్టాడు. సూర్యోదయానికి పూర్వం, ఆకాశంలో కనబడే ఎరుపు వర్ణం, అనూరుడు చేస్తుండే సాహసానికి సంబంధించినదే!  దీనినే, ఓజోన్‌ పొర అతినీలలోహిత కిరణాలను అడ్టుకుంటుందన్న దానికి ప్రతీకగా తీసుకోవచ్చు. సూర్యుడి కిరణాలను అడ్డుకుంటూ, ముల్లోకాలకూ ప్రశాంతతను కలుగజేసిన అనూరుడికి, అరుణుడు అన్నపేరు స్థిరపడింది. శూరసుత, అనూరు, అరణ్య కాశ్యపి, గరుడాగ్రజ అనేవి, అనూరునికి గల మరికొన్ని పేర్లు.

అనూరుడికి తన భార్య శ్యేని వల్ల, ఇద్దరు కుమారులు కలిగారు. వారే సంపాతి, జటాయువు. వీరి పూర్తి వృత్తాంతాలను మనం గతంలో, రామయణ గాథలో తెలుసుకున్నాము. అయితే, కొన్ని గ్రంథాల ఆధారంగా, వాలీ, సుగ్రీవులు కూడా అనూరుడి కుమారులే. ఒకసారి అనూరుడు దేవేంద్ర సభలో అప్సరసలు నృత్యం చేస్తున్నారని తెలిసి, వారిని చూడడానికి స్త్రీగా మారి ఇంద్రలోకం చేరగా, ఇంద్రుడామెను మోహించి సంగమించగా, ఓ పుత్రుడు జన్మించాడు. ఆ తరువాత తన పూర్వ రూపంలోకి మారి, సూర్యుని వద్దకు వెళ్ళాడు. ఆలస్యానికి కారణమేమిటని సూర్యుడు నిలదీయగా, జరిగిన విషయాన్ని వివరించాడు. అంతా విన్న సూర్యుడు మరొకసారి తనను స్త్రీగా మారవలిసినదిగా కోరాడు. ఆ సమయంలో సూర్యుడితో సంగమించగా, మరొక పుత్రుడు జన్మించాడు. అలా స్త్రీగా మారిన అనూరుడికి జన్మించిన ఇద్దరి పుత్రులనూ, అహల్యాదేవి సాకింది. ఆమె భర్త గౌతమునికి ఇది కోపకారణమై, వారిని కోతులుగా మారమని శపించాడు.

రుక్షరాజు సంతానం లేక విచారిస్తుండగా, ఈ కోతుల రూపంలో ఉన్న ఇద్దరినీ, ఇంద్రుడు అతనికి అప్పగించాడు. వారే, వాలీ సుగ్రీవులు. అయితే, కద్రువ సంతానంలో ఐరావతుడనే వాడు, గొప్ప సర్పరాజు. అతనికి ఇరవైవేల మంది సంతానం. వీరందరూ సూర్యుడి రథానికి కట్టిన గుర్రాలను నియంత్రించడానికి అవసరమైన పగ్గాలుగా పనిచేయడానికి, వంతుల వారీగా, సూర్యమండలానికి వెళ్లి వస్తుంటారు. కాంతి కిరణాలు సరళరేఖలో పయనిస్తాయని మొదట్లో నమ్మిన ఆధునిక శాస్త్రజ్ఞులు, అలల రూపంలో కూడా అవి ప్రసరిస్తాయని కనుగొన్నారు. కాంతి కిరణాలు పాముల వలె మెలికలు తిరుగుతూ, అడ్డదిడ్డంగా, కట్టలుకట్టలుగా ప్రసరిస్తాయని, మన పూర్వులు పేర్కొన్నారు. కాలానికి సంబంధించిన శాస్త్రీయ విషయాలు ఎన్నో, మన వేదాలలో, పురాణేతిహాసాలలో కనిపిస్తాయి. సంకేతాల సాయంతో శాస్త్రీయ విషయాలను చెప్పడం, మనవారికి వెన్నతో పెట్టిన విద్య అని గ్రహించడమే, మన ఋషులకు మనం సమర్పించగల నివాళి. అత్యంత సనాతనమైన, ఎంతో విశిష్టతను సొంతం చేసుకున్న మన హైందవ ధర్మాన్ని గౌరవించడంతో పాటు, ముష్కరుల దాడులనుండి కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే.

ధర్మో రక్షతి రక్షిత:

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...