Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Showing posts with label Karma Siddhantam. Show all posts
Showing posts with label Karma Siddhantam. Show all posts

Monday, December 25, 2023

Getting rid of sins - Karma Siddhanta పాప భారం - చిట్టి కథ!

 

పాప భారం - చిట్టి కథ!
తీర్థ స్నానాలతో, చేసిన పాపాలను వదిలించుకోవచ్చా?

తీర్థము అంటే, నది రేవు జలస్థానము, పవిత్ర స్థానము, యాత్రా స్థలము అనే అర్థాలున్నాయి. తీర్థ కాకము అంటే, నీటి కాకి. కాకి ఎన్ని తీర్థాలలో మునిగినా, పుణ్య ఫలం పొందలేదనే అర్థంతో, ఈ తీర్థ కాక న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు. ఇక్కడ పేరు కాకిదే అయినా, అసలు ఉద్దేశించి చెప్పింది, మనుషుల గురించేనని అర్థం చేసుకోవాలి. పవిత్రమైన నదుల్లో మునిగి స్నానాలు చేస్తే, అప్పటివరకు చేసిన పాపాలు హరించి పోతాయని భక్తుల విశ్వాసం. తెలిసీతెలియక ఏం పాపాలు చేశామో, అవి పోగొట్టుకుందామని నిష్టగా, భక్తితో తీర్థయాత్రలు చేసే వారు కొందరైతే, నిత్యం అనేక తప్పులూ, చెడు పనులూ చేస్తూ, ‘దాసుని తప్పు దండంతో సరి’ అన్నట్లుగా, తీర్థయాత్రలకు వెళ్ళి, తీర్థ స్నానాలు చేస్తూ ఉంటారు, మరికొందరు. అలా పాపాలు పోగొట్టుకోవాలని ప్రయత్నించే దుష్టుల గురించి, వేమన నిరసనగా ఇలా అంటాడు..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/nAcsHmMF2vs ]


”ఎంత చదువు చదివి యెన్నిటి విన్నను
హీనుడవగుణంబు మానలేడు
బొగ్గు పాల గడుగ బోవునా నైల్యంబు
విశ్వదాభిరామ వినుర వేమ!”

దీని అర్ధం, ఎంత చదివినా, ఎన్ని మంచి మాటలు విన్నా, నీచుడు, చెడు గుణం కలిగిన వ్యక్తి మారడు. నల్లని బొగ్గును పాలతో కడిగినా, ఆ నలుపు పోయి తెల్లగా మారదు కదా! అలా కొందరు తప్పులు కప్పి పుచ్చుకోవడానికి చేసే తీర్థయాత్రలూ, స్నానాల వల్ల, వారికి ఎలాంటి పుణ్యమూ రాదనే అర్థంతో, ఈ తీర్థ కాక న్యాయమును చెబుతుంటారు. ఇక మరో కోణం చూద్దాము..

ఒక నాడు గంగలో స్నానమాచరిస్తున్న లక్షలాది మందిని చూసిన ఒక ఋషికి, ఒక సందేహం వచ్చింది. వెంటనే గంగానదినే అడిగాడు.. 'తల్లీ! ఎందరో, ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి పాపాలు వదిలేస్తున్నారు. మరి ఇందరి, ఇంత పాప భారం ఎలా మోస్తున్నావమ్మా?' అని అడిగాడు.. అందుకా తల్లి, 'నాయనా, ఆ పాప భారం నేనెక్కడ మోస్తున్నాను? అవన్నీ తీసుకెళ్ళి, ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపి వేస్తుంటాను కదా!' అని బదులిచ్చింది..

అయ్యో, అన్ని పుణ్య నదులూ ఇంతే కదా..! పాపాలన్నీ సముద్రంలో కలిపేస్తే, ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో..! అని అనుకుని వెళ్ళి, సముద్రుడినే అడిగాడు.. 'ఎలా మోస్తున్నావు తండ్రీ ఈ పాప భారాన్ని?' అని.. దానికి సముద్రుడు.. 'నేనెక్కడ భరిస్తున్నానయ్యా? ఆ పాపాలను వెను వెంటనే ఆవిరిగా మార్చి, పైన మేఘాల లోకి పంపించేస్తుంటాను' అని బదులిచ్చాడు..

అరే! ఎంతో తేలికగా కదిలి పోయే మేఘాలకు ఎంత కష్టం వచ్చిందని అనుకుంటూ.. 'ఓ మేఘ మాలికల్లారా.. ఎలా భరిస్తున్నారు ఈ పాప భారాన్ని?' అని అడుగగా అవి పకపకా నవ్వి.. 'మేమెక్కడ భరిస్తున్నాము? ఎప్పటి కప్పుడు వర్ష రూపేణా మీ మీదే కురిపించేస్తున్నాము కదా!' అని బదులిచ్చాయి..

ఓహో! ఆ పాపాలన్నీ మన మీద పడి, మనమే అనుభవిస్తున్నామన్న మాట! అయితే ఎట్టి పరిస్థితులలోనూ, ఎవ్వరూ కర్మ ఫలితాలను వదిలించు కోలేరని గ్రహించాడు, ఋషి..

ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః ।
ఆత్మతీర్ధం నజానన్తి కధం మోక్షః శృణు ప్రియే ।।

ఈ తీర్ధంలో స్నానమాచరిస్తే పుణ్యం కలుగుతుంది, ఆ తీర్ధంలో స్నానమాచరిస్తే మోక్షం కలుగుతుందని, తీర్ధ స్నానాలకై పరుగులు పెడుతున్న మానవులు, ‘భ్రమకు లోబడిన వారు’! ఆత్మ జ్ఞాన తీర్ధంలో స్నానమాచరించని వారికి మోక్షమెలా కలుగుతుంది? అని ఈ శ్లోకం యొక్క అర్థం.

కర్మ కర్మణా నశ్యతి కర్మ ।। అంటే.. కర్మ అనేది కర్మతోనే నశిస్తుంది..

సత్కర్మ భిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం ।
అచ్యుత్కట పుణ్య పాపానం సత్యం ఫలాను భవమిహం ।।

ఈ చోటి కర్మ ఈ చోటే. ఈ నాటి కర్మ మరునాడే. అనుభవంచి తీరాలంతే, ఈ సృష్టి నియమం ఇదే..

ధర్మో రక్షతి రక్షితః!

Monday, December 18, 2023

కంసుడు చంపిన కృష్ణుడి సహోదరులు ఏమయ్యారు? 6 Elder Brothers of Lord Krishna - Karma Siddhantam


కంసుడు చంపిన కృష్ణుడి సహోదరులు ఏమయ్యారు?
ఉచ్ఛిష్టీకృత దోషం వలన కలిగే పరిణామం మీకు తెలుసా?

మనం చేసే ప్రతి పాపానికీ ప్రాయశ్చిత్తం తప్పక చేసుకోవాలి. ఎన్ని జన్మలెత్తైనా సరే, మన కర్మఫలాన్ని అనుభవించి తీరాలి. కర్మఫలం ఏ విధంగా ఉంటుందనేది, మనం చేసే పనులపైన ఆధారపడి ఉంటుంది. దేవకీ వసుదేవల సంతానాన్ని కంసుడు సంహరించాడు. కంసుడినీ, అతని సోదరులనూ బలరామకృష్ణులు తుదముట్టించారు. కృష్ణ భగవానుడికి సోదరులుగా జన్మించి, మరణించిన వారి వెనుక ఒక గాధ ఉంది. అదే విధంగా, బలరాముడి చేతిలో మరణించిన కంస సహోదరుల వెనుకా, ఒక గాధ ఉంది. దేవకీ సుతులుగా పుట్టి, కంసుని చేతిలో మరణించిన వారి పూర్వజన్మ వృత్తాంతం ఏంటి? రాక్షస జాతిలో జన్మించి, బలరాముడి చేతిలో మరణించి, పుణ్య ప్రాప్తి నొందిన కంసుని సోదరులు, గత జన్మలో చేసిన తప్పిదం ఏంటి? మరణించిన తన సంతానం కోసం, దేవకీ దేవి కోరిన కోరికను శ్రీ కృష్ణుడు తీర్చాడా? పాతాళానికి వెళ్లి, బలి చక్రవర్తిని ఎందుకు కలుసుకోవాల్సి వచ్చింది? కంసుడి చేతిలో మరణించిన కృష్ణుడి సహోదరులు ఏమయ్యారు? వంటి ఉత్సుకతను రేకెత్తించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/-uZSFX1vDhM ]


ముందు జన్మలో మారీచుడి కొడుకైన కాలనేమి, కంసుడిగా పుట్టాడు. కంసుని తండ్రి పేరు, ఉగ్రసేనుడు. అతని భార్యకు దేవదాది న్యాయము వలన, ద్రవిళుడనే వాడికి పుట్టినవాడు. అంటే, క్షేత్రజ పుత్రుడన్న మాట. ఉగ్రసేనుని భార్య పద్మావతి, కొందరు గొల్ల స్త్రీలతో కలసి యమునా నదికి స్నానానికి వెళ్ళి, పుష్పవతి అయింది. ఆమె తన భర్తను తలచుకుంది. రాక్షసుడైన ద్రవిళుడు చూసి, ఉగ్రసేనుని రూపంలో వెళ్ళాడు. అంతా జరిగిన తరువాత, తను మోసపోయానని గ్రహించి, నిలదీసింది పద్మావతి. నీ వలన పుట్టిన వాడు హరివంశమున పుట్టినవాడి చేతిలో మరణిస్తాడని శపించింది. రాక్షస రాజు వలన పుట్టిన కంసునికి రాక్షస లక్షణాలు వచ్చాయి. కంసుడు పెరిగి పెద్దవాడవుతూనే, తండ్రి ఉగ్రసేనుని చెరసాలలో బంధించి, తాను రాజయ్యాడు. జరాసంధుని కూతుళ్ళయిన ఆస్తి, ప్రాస్తి, ఇద్దరినీ పెళ్ళాడాడు. శిశుపాలునితో స్నేహం చేశాడు. తన పిన తండ్రి కూతురైన దేవకీ దేవిని, చెరసాలలో బంధించాడు. ఆమెకు పుట్టిన సంతానాన్ని సంహరించాడు. కానీ, దేవకీ దేవి గర్భంలో జన్మించిన అష్టమ సంతానమైన శ్రీ కృష్ణుడు పెరిగి పెద్దవాడై, తన మామ కంసుడి గురించి తెలుసుకున్నాడు. అతడిని సంహరించి, తల్లి దండ్రులను బంధవిముక్తుల్ని చేయడానికి మధురకు వెళ్ళాడు.

బలరామకృష్ణులను సంహరించడానికి కంసుడు పంపిన వారందరూ, మృత్యువు ఒడికి చేరుకున్నారు. కృష్ణుడిని ఎదురించడం అసంభవమని తెలిసిన కంసుడు, పులి నుండి తప్పించుకున్న మేకపిల్లలా, సభామందిరంలో సింహాసనం మీద ఒదిగొదిగి కూర్చుని వున్నాడు. అతని చుట్టూ మంత్రులూ, సైనికులూ వున్నారు. నిలువెల్లా కంపిస్తున్న తన అనుచరులనూ, మృత్యువు రూపంలో ఎదుట నిలిచిన నల్లనయ్యనూ చూసి కంసుడు, ఇక తెగించక తప్పదనుకున్నాడు. చావు ధైర్యం తెచ్చుకుని, 'పిచ్చెక్కిన ఏనుగునూ, తాగి తూలుతున్న యోధులనూ సంహరించడం గొప్ప కాదు. నాతో యుద్ధానికి రా. బలాబలాలు తేల్చుకుందాం' అన్నాడు శౌరివైపు తిరిగి. దాంతో కన్నయ్యకు  కోపం వచ్చింది.  కంసుడి మీదకు ఉరికాడు. మృత్యువు మాదిరి తన మీదకు వస్తున్న అచ్యుతుడిని చూసి, కంసుడు తటాలున సింహాసనం మీద నుంచి కిందకు దూకాడు. ఒర నుంచి ఖడ్గాన్ని తీసి, కృష్ణుడితో తలపడ్డాడు. కృష్ణుడు అంతెత్తుకు ఎగిరి అక్కడి నుంచి కొదమసింహంలా కంసుడి పైకి లంఘించాడు. ఆ దెబ్బతో కంసుడి కిరీటం బండి చక్రంలా దొర్లుకుంటూ వెళ్ళి, దూరంగా పడింది. కృష్ణుడు కంసుడి జట్టు పట్టుకు లాగి, విసురుగా తోశాడు. కంసుడు వెల్లకిలా పడ్డాడు. అతని పక్కటెముకలు నుజ్జు నుజ్జయ్యాయి. లేవలేక కూలబడిపోయాడు. మాధవుడు ఎగిరి అతని ఎదురు రొమ్ముమీద కూర్చుని, పిడికిళ్ళతో మర్దించాడు. కంసుడు నురగలు కక్కాడు.

'మామా! నిన్ను నేను ఈవేళ చంపడం కాదు. కొన్నేళ్ళుగా చంపుతున్నాను. రాత్రింబవళ్ళు, అనుక్షణం, తింటూ, తాగుతూ, విహరిస్తూ కూడా, నన్నే తలుచుకుని భయపడ్డావు. నేను గుర్తుకు వచ్చినప్పుడల్లా, నీకు కంటిమీద నిద్ర వుండేది కాదు. ప్రతి కదలికలో, ప్రతి ఒక్కరి నీడలో నన్నే చూసి, నరక యాతన పడ్డావు. ఎందుకొచ్చిన దిగులు చెప్పు? క్షణక్షణం చస్తూ బతికే కన్నా, ఒకేసారి చావడం మంచిది' అని ఒక్కపోటు పొడిచాడు. కంసుడి కళ్ళు మూతపడ్డాయి. అతనిలోంచి ఒక దివ్యతేజం వచ్చి, కృష్ణుడిలో లీనమైంది. సభ అంతా చేతులు జోడించి, ఆ కిశోర వీరుడికి నమస్కరించింది. కంసుడి మరణ వార్త విని ఉగ్రులై అతని తమ్ములు కంకుడు, న్యగ్రోధుడు, గహ్వుడు మొదలైనవారు, మూకుమ్మడిగా బలరామకృష్ణులమీద విరుచుకుపడ్డారు. బలరాముడొక్కడే, వాళ్ళందర్నీ హతమార్చాడు. బలరాముడి చేతిలో మరణించిన కంసుడి సొదరులకు సంబంధించి, ఒక కథ ఉంది.

కంసుడి సోదరులు, పూర్వం అలకాపురంలో వుండే దేవయక్షుని కుమారులు. దేవకూట, మహాగిరి, గండ, చండ, ప్రచండ, ఖండ, అఖండ, పృధువులని, వాళ్ళకు పేర్లుండేవి. ఆ అన్నదమ్ములొకసారి, తండ్రి ఆజ్ఞ మేరకు, మానస సరోవరానికి వెళ్ళి, మహేశ్వరుడిని పూజించేందుకు, అరవిందాలు కోసుకువచ్చారు. కానీ, దారిలో వాటి సుగంధాలకు ముగ్ధులై, వాసన చూశారు. దానివల్ల వారికి ఉచ్ఛిష్టీకృత దోషం, అంటే, ఎంగిలి చేసిన పదార్థాలను నివేదన చెయ్యడం, వాసన చూసిన పూలతో పూజించడం వల్ల కలిగే దోషం సంభవించింది. ఆ కారణంగా వారు ఎనిమిది మందీ, వరుసగా మూడు జన్మలలో రాక్షసులై పుట్టారు. మూడవసారి చివరగా, ఉగ్రసేనుని కుమారులుగా జన్మించారు. శ్రీకృష్ణుని చేతిలో మరణించి, పాపవిమోచనం పొందారు. కంసుని మరణవార్త వినగానే, ప్రజలంతా ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. చెరసాలలో మగ్గుతున్న దేవకీవసుదేవులకు నల్లనయ్య విముక్తి కలిగించాడు. వారు కారాగారం నుంచి బయటకు రాగానే, బలరామకృష్ణులు వారికి పాదాభివందనం చేశారు. ఆనందంతో దేవకీవసుదేవులు పరవశించారు. దేవకీదేవి తటాలున వంగి, బిడ్డలను లేవదీసి, గుండెలకు హత్తుకున్నది.

బలరామకృష్ణులు చంటిబిడ్డల్లా తల్లిని చుట్టుకుపోయారు. 'అమ్మా! పుట్టటమైతే నీ కడుపున పుట్టాను కానీ, పసితనం నుంచే నీ ప్రేమానురాగాలకు దూరమయ్యాను. ఆ దురదృష్టమంతా నాదే. నువ్వేం బాధపడకు. కంసుడి చేతిలో మీరు పడుతున్న కష్టాలు తెలిసి కూడా, మిమ్మల్ని రక్షించడానికి ఇంత ఆలస్యమైనందుకు మన్నించండి' అని కృష్ణుడు తల్లిని వేడుకున్నాడు. దేవకీ వసుదేవులు నల్లనయ్యను దగ్గరకు తీసుకుని, పరవశులయ్యారు. తరువాత కృష్ణుడు తాతైన ఉగ్రసేనుడ్ని పిలిచి, 'మహారాజా! యయాతి శాపం వల్ల, యాదవులకు సింహాసనం ఎక్కే అధికారం లేకుండా పోయింది. కనుక మీరే ఈ భూమికి అధిపతి కావాలి. సింహాసనం స్వీకరించండి. ధర్మం తప్పకుండా పాలన చేయండి' అని అన్నాడు. బిడ్డల గొప్పతనానికి మురిసిపోయి తల్లిదండ్రులు, బలరామకృష్ణులను దగ్గరకు పిలిచి, 'నాయనలారా! మిమ్మల్ని పొగడాలో, పొగడకుండా నా ఆనందాన్నంతా ఈ గుప్పెడు గుండెలో ప్రోది చేసుకోవాలో, మీకు నమస్కరించవచ్చో, లేక బిడ్డలకి చెయ్యకూడదో, మిమ్మల్ని ఆలింగనం చేసుకోవాలో, లేక దూరం నుంచి దర్శించి, కన్నులపండుగ చేసుకోవాలో తెలియటంలేదు. 'మీరు ఏమీ అనుకోకపోతే, ఒకే ఒక కోరిక కోరుతాను. మీరిద్దరూ, మరణించిన మీ గురుపుత్రుని తీసుకువచ్చిన విధంగానే, కంసుడు పొట్టన పెట్టుకున్న నా బిడ్డలను కూడా ఒక్కసారి తెచ్చి చూపండి' అని భోరున ఏడ్చింది.

బలరామకృష్ణులు ఆమెను ఓదార్చి, యోగమాయా ప్రభావంతో, వెంటనే సుతలానికి వెళ్ళారు. రాక్షసేశ్వరుడు బలి వాళ్ళకు ఘనంగా స్వాగతం చెప్పాడు. భక్తిపూర్వకంగా వాళ్ళను అర్చించి, కానుకలు సమర్పించాడు. బలరామకృష్ణులు అమితానందం పొందారు. 'బలీ! పూర్వం స్వాయంభువ మన్వంతరంలో మరీచికి, 'ఊర్ణ' అనే ఒక భార్య ఉండేది. ఆ దంపతులకు స్మరుడు, ఉద్గదుడు, పరిష్వంగుడు, పతంగుడు, క్షుద్రభువు, ఘృణి అనే ఆరుగురు కుమారులుండేవారు. వారందరూ దేవతలే. వాళ్ళు ఒకసారి బ్రహ్మదేవుని ఎగతాళి చేసి, పరిహాసంగా మాట్లాడారు. అందువల్ల వాళ్ళను రాక్షసులై పుట్టమని ఆయన శపించాడు. అలా శపించబడ్డ ఆ ఆరుగురూ, హిరణ్యకశిపుడికి జన్మించాల్సింది. కానీ, యోగమాయా ప్రభావం వలన, వాళ్ళు దేవకీదేవికి పుట్టారు. పుట్టిన వెంటనే వాళ్ళను కంసుడు సంహరించాడు. ఆ ఆరుగురూ ఇప్పుడు నీ దగ్గర వున్నారు. మా తల్లి దేవకీదేవి వాళ్ళను చూడాలనుకుంటోంది. ఆమె కోరికను తీర్చటంకోసమే, మేము ఇక్కడికి వచ్చాం. వాళ్ళు మా వెంట వస్తే, వాళ్ళకు శాపవిముక్తి కలుగుతుంది. వాళ్ళు తిరిగి వాళ్ళ నిజ వాసం చేరుకుంటారు' అని చెప్పారు. బలి వెంటనే వాళ్ళను బలరామకృష్ణులకు అప్పగించాడు. వాళ్ళను బలరామకృష్ణులు తమ తల్లికి చూపించి, ఆమెకు ఆనందం కలిగించారు. ఆ ఆరుగురూ శ్రీకృష్ణుని స్పృశించి, తమ పాపాలను తొలగించుకున్నారు. చతుర్ముఖుని శాపం నుంచి విముక్తి పొందారు. ఏనాడో మరణించిన కుమారులు తన సముఖానికి రావడం, వెంటనే తిరిగి వెళ్ళిపోవడం, దేవకీ దేవికి ఆశ్చర్యం కలిగించింది. అదంతా శ్రీకృష్ణుని లీల అని గ్రహించి, పరవశించిపోయిందామె.

కృష్ణం వందే జగద్గురుం!

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...