Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Showing posts with label Hindu Festivals. Show all posts
Showing posts with label Hindu Festivals. Show all posts

Tuesday, January 16, 2024

కనుమ పండుగ Kanuma Festival


అందరికీ 'కనుమ పండుగ' శుభాకాంక్షలు 🙏 
               
కనుమ పండుగ నాడు ప్రయాణాలు నిషిద్ధం.. అంటుంది శాస్త్రం..! పండుగకు పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు,అల్లుళ్ళు,ఇతర బంధువులు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరు.

[ కనుమ రోజు పశువులను ఎందుకు పూజించాలో తెలుసా?: https://youtu.be/HEeD4ulBfK0 ]


మనకు ఉన్నవి ఐదు కనుమలు.

సంప్రదాయంగా ఐదు కనుమలలో ప్రయాణం చేయరాదని అంటారు... కనుమ నాడు కాకైనా బయలుదేరదు అని సామెత కూడా ప్రసిద్దం...

"శవదాహే గ్రామదాహే సపిండీకరణే తథా
శక్య్తుత్పవే చ సంక్రాంతౌ నగంతవ్యం పరేహని"

1. శవదహనం జరిగిన మరుసటి రోజు..
2. గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగిన మరుసటి రోజు..
3. సపిండీకరణమైన మరుసటి రోజు..
4. గర్భస్రావం మరుసటి రోజు.. మరియు 
5. సంక్రాంతి మరుసటి రోజు.

వీటిని 'ఐదు కనుమలు' అంటారు. ఈ రోజుల్లో ప్రయాణించరాదని శాస్త్ర వచనం. 

కనుమ రోజు పశువులను  పూజించడం ఒక సాంప్రదాయం! 

దీని వెనుక కూడా ఓ కథ ఉంది...

ఒకసారి శివుడు నందిని పిలిచి “భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి”  అని చెప్పి రమ్మన్నాడు.

కానీ నంది అయోమయంలో ‘రోజూ ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి’ అని చెప్పాడట.

దాంతో కోపం వచ్చిన శివుడు, “ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి, ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి!” అని శపించాడట.

అప్పటి నుంచి ఎద్దులు, వ్యవసాయంలో సాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు...

కనుమ పండుగ విశేషాలు:

సంక్రాంతి మూడవ రోజు కనుమ. ఈ ప్రకృతిలో మనతో బాటు జీవించే పశు పక్ష్యాదుల ఉనికిని గుర్తించి గౌరవించటమే కనుమ పండుగ ఉద్దేశం. 

కొన్ని ప్రాంతాల్లో దీన్ని ‘పశువుల పండుగ’ అంటారు. మనది వ్యవసాయిక దేశం  గనుక మన జీవనంలో పశువులూ ఒక భాగమే.

ఆదినుంచీ పశువులను జంతువులుగా గాక సంపదగా, దైవాలుగా భావించే సంప్రదాయం మనది.

వృషభాన్ని ధర్మానికి ప్రతీకగా, పరమేశ్వరుని వాహనమైన నందీశ్వరునిగానూ, గోవును మాతృ స్వరూపంగా, సర్వ దేవతా సమూహానికి చిహ్నంగానూ భావిస్తారు.

ఏడాది పొడవునా తమ వ్యవసాయ పనుల్లో సహాయపడిన ఎడ్లు, ఇంటిల్లిపాదికీ కావాల్సిన పాడిని అందించి చక్కని ఆరోగ్యాన్ని సమకూర్చిన ఆవులు, గేదెలకు గ్రామీణులు కృతజ్ఞతలు తెలియజేసే పండుగే కనుమ.

ద్వాపరయుగంలో ఇంద్రుడికి బదులుగా గోవులను, గోవర్ధనగిరిని పూజించమని నందకులానికి కృష్ణుడు చెప్పిన నాటి నుంచే ఈ పండుగ ఉందని పెద్దల నమ్మకం.

ఈ రోజు రైతులు తమ పశువులను వేడి నీటితో శుభ్రంగా కడిగి అందంగా అలంకరించి హారతులిచ్చి పూజిస్తారు. అనంతరం పశు గణాన్ని తోలుకొని వెళ్లి గ్రామ దేవత ఆలయం చుట్టూ తిప్పి తీసుకొస్తారు. ఈ రోజు వాటిచేత ఏ పనీ చేయించరు. వాటికి మేలైన ఆహారాన్ని అందిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కనుమనాడు గ్రామ ప్రజల౦దరూ కలిసి ఎడ్ల పందాలను తిలకిస్తారు.

కొన్నిచోట్ల కనుమ నాడు పశువుల పాకలను చక్కగా అలంకరించి అక్కడ పాలు, కొత్తబియ్యంతో పొంగలి వండి దాన్ని దేవుడికి నివేదించిన తర్వాత పొలంలో చల్లుతారు. దీన్నే 'పొలి చల్లటం' అంటారు. దీనివల్ల తమ పంటలకు చీడపీడల బెడద ఉండదని రైతులు విశ్వసిస్తారు.

కనుమ నాడు పక్షులనూ రైతులు ఆదరిస్తారు. ఇందులో భాగంగా పక్షుల కోసం జొన్న కంకులూ, వరి కంకులూ తెచ్చి గుమ్మాలు, కిటికీలు, వసారాలో వేళ్ళాడగడతారు.

ధనుర్మాసం అంతా వేసే ముగ్గులకు భిన్నంగా కనుమనాడు పెద్ద రథం ముగ్గు వేస్తారు. విష్ణువు చేత పాతాళానికి తొక్కబడిన బలి చక్రవర్తి సంక్రాంతి మూడురోజులూ భూలోకానికి వచ్చి, కనుమనాడు తిరిగి వెళతాడనీ, ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికేందుకే ఈ రథం ముగ్గు వేస్తారని పెద్దలు చెబుతారు. 

అలాగే శ్రీమన్నారాయణుని స్మరిస్తూ ఆయన నివసించే వైకుంఠ వాకిలికి ఈ ముగ్గు ప్రతీక అనీ కొందరు చెబుతారు.

పండుగ రోజు పెట్టిన బొమ్మల కొలువును కనుమనాడు తీస్తారు. దీన్నే 'బొమ్మల కొలువు ఎత్తటం' అంటారు. పేరంటాలను పిలించి బొమ్మలకు హారతి పట్టి, కొలువులో పెట్టిన ఏదైనా ఒక్క బొమ్మను ఉన్నచోటు నుంచి కదిలిస్తారు. తర్వాత వీలును బట్టి ఎప్పుడైనా బొమ్మలను తీసుకుంటారు.

కనుమ రోజు మినప వంటకాలు తినాలని పెద్దలు చెబుతారు. అందుకే అందరూ ఈ రోజు గారెలు తింటారు. పశు పక్ష్యాదులను పూజించే కనుమ నాడు మాంసం తినే ఆచారం తర్వాతి రోజుల్లో వచ్చిందే తప్ప మొదటినుంచీ ఉన్నదైతే కాదు.

కనుమనాడు పిల్లలు, యువతీ యువకులు గాలిపటాలు (పతంగులు) ఎగరవేస్తారు. ఆకాశంలో రివ్వున పైకి దూసుకుపోయే గాలిపటం మాదిరిగానే వారి లక్ష్యాలూ సమున్నతంగా ఉండాలనే సందేశం ఇందులో ఉంది.

కనుమ నాడు నువ్వులు, బెల్లం పంచి శనిదేవుని శుభ దృష్టి, శనగ గుగ్గిళ్ళు లేదా నానబెట్టిన శనగలు పంచిపెడితే (దానము) ద్వారా గురు గ్రహం ఆశీస్సులు లభిస్తాయి.
          
లోకా సమస్తా సుఖినోభవన్తు!

Monday, January 15, 2024

సంక్రాంతి పండుగ Sankranti 2024


అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు 🙏 

[ సంక్రాంతి పండుగ ఎలా జరుపుకోవాలి?: https://youtu.be/itjUnux5PEE ]


ధనుర్మాసం మొదలైన దగ్గర్నుంచే తెలుగు లోగిళ్లలో పండుగ వాతావరణం మొదలవుతుంది. ఇంటిముందు ముగ్గులు, హరిదాసులు, గంగిరెద్దుల వాళ్లతో, గ్రామాలలో పండుగ వాతావరణం వెల్లివిరుస్తుంది. దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా సంక్రాంతి పండుగకు స్వంత ఊరికి వస్తారు. సంక్రాంతి పండుగ గురించి చెప్పాలంటే, పెద్దలనుంచి పిన్నల వరకు ఎన్నెన్నో విశేషాలు ఉంటాయి. పట్టణాల నుంచి వచ్చే బంధువులకు పల్లె జనం స్వాగతం పలుకుతూ, ఆనందోత్సాహాలలో మునిగిపోతారు. చిన్ననాడు స్వగ్రామంలో తిరిగిన తీపి గురుతులను నెమరువేసుకుంటూ, అంతా పండుగను ఎంజాయ్ చేస్తారు. ఇల్లలికి సున్నాలు వేసి, సుందరంగా అలంకరిస్తారు.

లేలేత సూర్యకిరణాలు భూమిని తాకే వేళ, ఇంటి ముందు ఆడవారు ముగ్గులు పెట్టేవేళ, రామదాసు కీర్తనలు, హరినామ సంకీర్తన, శ్రీ కృష్ణ లీలామృతాన్ని గానం చేసుకుంటూ కాలికి గజ్జెకట్టి తంబురను మీటుతూ, తలపై అక్షయ పాత్రతో, చేతిలో చిడతలతో, హరిదాసులు చేసే సంకీర్తనలు, సంక్రాంతి పండుగవేళ కనిపించే అతి గొప్ప సాంప్రదాయాల్లో ఒకటిగా చెప్పవచ్చు. హరిదాసులు శ్రీమహావిష్ణువుకు  ప్రతిరూపాలుగా కూడా చెబుతారు. ఇంటి వారు ఇచ్చే ధన, ధాన్య, వస్తు దానాలను తీసుకుని ఇంటింటికీ తిరుగుతూ, "హరిలో రంగ హరి.. హరిలో రంగ హరి" అంటూ ఇంటి ముందు నర్తిస్తూ, అందరినీ చల్లగా ఉండమని దీవిస్తూ గ్రామంలో తిరిగే హరిదాసులు, నేటికీ గ్రామాలలో కనిపిస్తారు. హరిదాసులు తమ తలపై ఉన్న అక్షయపాత్రను గ్రామ సంచారం సమయంలో ఎక్కడా తీసి కింద పెట్టరు. కేవలం ఇంటికి వెళ్లాక అతని భార్య మాత్రమే అక్షయపాత్రను కిందకు దించుతుంది.

ఏడాది పొడవునా ఎప్పడూ కనపడని హరిదాసులు, సంక్రాంతి పండుగ సమయంలో ధనుర్మాసం నెల రోజులపాటు మాత్రమే కనిపిస్తారు. గ్రామాలలో హరిదాసుల సందడి సూర్యోదయం తోటే మొదలవుతుంది. ఇలా నెలరోజులపాటు తిరిగి, సంవత్సరానికి సరిపడా గ్రాసాన్ని సంపాదించుకుంటారు హరిదాసులు. వీరంతా ఊరి బయటనుంచే వస్తారు. ఏడాదిలో  ప్రతి వూరికీ ఎవరెవరు వస్తారో, వారు తప్ప ఇతరులు రారు. ముఖ్యంగా ఇలా వచ్చే వారిలో, విష్ణు భక్తులైన సాతానులు, దాసరులు, రాజులు మొదలైన వారు, ఇలా జీవిస్తూ వుంటారు.
గ్రామ వీధుల్లో హరిదాసులు ఇలా హరి భజన చేయడం కోలాహలంగా వుంటుంది. హరిదాసుడి అక్షయ పాత్రలో బియ్యం వేయటానికి  బాలబాలికలు పోటీలు పడతారు. హరిదాసులు ప్రతి ఇంటి ముందూ కూర్చుని లేవటం చాల కష్టమైన పని. అయినా భక్తి భావంతో అదంతా మరచిపోతారు.

హరిదాసులతో పాటు, సంక్రాంతి పర్వదినాలలో గంగిరెద్దుల వారు, బుడబుక్కలవారు, పగటి వేషధారులు, గారడీ వాళ్ళు, ఎందరెందరో జానపద కళాకారులతో, కన్నుల పండువుగా సంక్రాంతి పర్వదినాలు ముగుస్తాయి. పంటను ఇంటికి తెచ్చుకుని కళకళలాడే రైతు కుంటుంబాలు అందరినీ ఆదరిస్తూ, సంక్రాంతి పర్వదినాలను ఆనందంగా ముగిస్తారు.

నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే ।
ఆయురారోగ్య మైశ్వర్యం దేహి దేహి దేవః జగత్పతే ॥

Sunday, January 14, 2024

భోగి పండుగ 2024


అందరికీ 'భోగి పండుగ' శుభాకాంక్షలు 🙏

[ భోగి రోజు ఇలా చేస్తే ఇంటి నిండా సిరులే: https://youtu.be/jkmkEU3i8yg ]


సంక్రాంతి పండుగ అంటే సంబరాల పండుగ. మన తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజులు ఎంతో కోలాహలంగా జరిగే ఈ పండుగలో మొదటి రోజున వచ్చేది 'భోగి' పండుగ. భోగి అంటే 'తొలినాడు' అనే అర్ధం ఉంది. భోగి రోజున ఇంటి ముందు మంట వేస్తే, ఇంట్లో ఉండే దరిద్ర దేవతను తరిమినట్లేనని మన నమ్మకం. ఈ భోగి పండుగ నాడు సంబరమంతా పిల్లలదే. తెల్లవారు జామున భోగి మంటలు వేయటం, సాయంత్రం భోగి పండ్లు పోయించుకోవడంతో, పిల్లలు హుషారుగా ఉంటారు. 'భగ' అనే పదం నుంచి భోగి అన్న మాట పుట్టిందని చెబుతారు. 'భగ' అంటే 'మంటలు' లేదా 'వేడి'ని పుట్టించడం అని అర్ధం.

భోగి రోజు సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు పోస్తూ, చిన్న పిల్లలను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా భావిస్తారు. రేగి పళ్ళను సంస్కృతంలో బదరీ ఫలం అంటారు. భోగి పళ్ళలో చేమంతి, బంతి పూరేకులు, అక్షింతలు, చిల్లర నాణేలు కలిపి, పిల్లల తలపై పోస్తారు. ‘భుగ్’ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ రోజున శ్రీ రంగనధాస్వామిలో గోదా దేవి లీనమై, భొగాన్ని పొందిందనీ, దీనికి సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనీ పురాణ గాధ. అయితే, చాలా మంది భావించే విధంగా భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు. ఆరోగ్యం కోసం కూడా.

ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడతారు. దేశీ ఆవు పేడ పిడకలని కాల్చడం వలన, గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మ క్రిములు నశిస్తాయి. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని జోడిస్తారు. ఈ ఔషధ మూలికలు, ఆవు నెయ్యి, ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి, అతి శక్తివంతమైనది. మన శరీరంలోని 72 వేల నాడులలోకి ప్రవేశించి, శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. దీనితో భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయం వల్ల వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది.

ఇక ఆధ్యాత్మిక పరంగా, ఈ భోగి మంటలను అగ్నిదేవుడికి ఆరాధనగా పరిగణిస్తారు. వాస్తవానికి  భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులను కాదు. మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలను. అప్పుడే మనకున్న పీడ పోయి, మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి అనే అర్ధం ఈ భోగి మంటల వెనుక ఉంది. భోగి రోజున మొదలయ్యే పెద్ద పండుగలో అరిసెలు, నువ్వుల లడ్లు, జంతికలు, చక్కలతో పాటు, రకరకాల పిండి వంటలతో మన ఇరు రాష్ట్రాలలోని తెలుగు వారు ఎంతో ఆనందంగా చేసుకునే ఈ భోగి పండుగతో, మూడు రోజుల పెద్ద పండుగ ప్రారంభం అవుతుంది.

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...