Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Monday, January 29, 2024

Science Behind Mangalsutra | మంగళసూత్రం - నూరేళ్ళ పంట!


మంగళసూత్రం! - నూరేళ్ళ పంట! 
స్త్రీలు ధరించే మంగళసూత్రం వెనుకవున్న సైన్స్ మీకు తెలుసా?

హిందూ వివాహ తంతులో మాంగల్యధారణే అత్యంత ప్రధానమైనది. మాంగల్యానికే మంగళసూత్రం, తాళి, తాళిబొట్టు, పుస్తె, శతమానం అనే పేర్లతోపాటు, ప్రాంతాలవారీగా వివిధ రూపాలు కూడా ఉన్నాయి. ఇవి కులం, వంశానుసారం కూడా పలురూపాలలో ఉంటాయి. మనిషికి పెళ్లి ఎంత ముఖ్యమో, ఆ పెళ్లికి మంగళసూత్రమూ అంతే ముఖ్యం. వివాహ సమయం నుండి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఏనాటినుంచో వస్తోంది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో 'మంగళ' అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలున్నాయి. సూత్రం అంటే తాడు, ఆధారమైనదనే అర్ధాలు వస్తాయి. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని దారపు పోగులు కలిపి, దానికి పసుపు రాసి తయారు చేస్తారు. పెళ్లినాడు ఇచ్చిపుచ్చుకున్న ఇతర వస్తువులూ, ఆభరణాలన్నీ రూపాంతరం చెందినా, చివరి వరకూ వెంట ఉండేది మంగళసూత్రం మాత్రమే. అటువంటి మంగళసూత్రం గురించి మనలో చాలామందికి తెలియని, విస్మరిస్తున్న వాస్తవాలను ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/lNINMJMMhJc ]


పోతనామాత్యుల వివరణ ప్రకారం, క్షీరసాగరమధన సందర్భంలో మాంగల్య ప్రస్థావన ఇలా ఉంది.. “మ్రింగెడివాడు విభుండని, మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్, మ్రింగుమనె సర్వమంగళ, మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో! హాలాహలం పొంగుకొచ్చి, లోకాలు నాశనం అయ్యే ప్రమాదం ఏర్పడినప్పుడు, దేవతలందరూ కలసి మహేశ్వరుడికి మొర పెట్టుకున్నారు. భోళాశంకరుడు ఆ విషాన్ని మొత్తం మింగి ప్రపంచాన్ని కాపాడడానికి పూనుకుని, తన అర్థాంగి పార్వతి యేమంటుందో అని ఆమె వైపు చూశాడు. ఆమె చిరునవ్వుతో తన అంగీకారాన్ని తెలిపింది! ఇదీ సంస్కృత భాగవతంలో ఉన్న సన్నివేశం. "ఎంత దేవుళ్ళైనా, చూస్తూ చూస్తూ తన భర్త విషం తాగడానికి ఏ భార్యయినా అంగీకరిస్తుందా?" పరీక్షిత్తుకు కలిగిన సందేహానికి శుకమహర్షిచ్చిన జవాబు ఈ పద్యం. "మంగళసూత్రాన్ని నమ్మడ"మంటే తమ భార్యాభర్తల అనుబంధాన్ని నమ్మడం! ఒకరినొకరు విడిచిపెట్టమని చేసిన ప్రమాణాలలోని సత్యాన్ని నమ్మడం! ఇక్కడ పార్వతి, "సర్వమంగళ". అంటే, పరిపూర్ణమైన శుభానికి ప్రతిరూపమే ఆవిడ. తన మాంగల్యమ్మీద అంత నమ్మకం ఉండబట్టే, ఆవిడ సర్వమంగళ అయింది. అందుకే, మింగుతున్నది తన భర్తని తెలిసీ, మింగేది విషమని తెలిసీ, ప్రజలందరికీ మేలు జరుగుతుంది కాబట్టి, మింగమని చిరునవ్వుతో తన అంగీకారాన్ని చెప్పగలిగింది.

“మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా !
కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాంశతం”

ఓ సుభగా! నా జీవనానికి ఆధారమైన ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. దీనిని ధరించిన నువ్వు నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు నూరేళ్ళు జీవించు. అంటే పుణ్యస్త్రీగా, ముత్తయిదువగా సకల సౌభాగ్యాలతో జీవించమనే భావం స్పష్టంగా తెలుస్తుంది. దాని ఉద్దేశ్యం, నీవు దీనిని ధరించి, నా జీవితంలో అన్నింటా సగ భాగమై, నాకు తోడుగా, నీడగా ఉంటూ, మనమిద్దరమూ కలిసి, నిండు నూరేళ్ళు ఆనందంగా జీవిద్దామని.

పూర్వం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు, ఎటువంటి ఆచారాలూ, కట్టుబాట్లూ ఉండేవి కావు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి. భారతావనిలో పిండారీలూ, థగ్గుల వంటి కిరాత జాతులవారు వలస వచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను, మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకు పోయేవారు. మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు.. ఏ హానీ చేయకుండా విడిచిపెట్టేవారు. కిరాతకులు కూడా ఈ మంగళ సూత్రాన్ని గౌరవించారు. అలా కోట్లాది మగువల మాన ప్రాణాలను కాపాడింది ఈ మంగళసూత్రం. అందుకే అప్పటినుండీ, ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్ళి చేసి, మాంగల్యం వేసే వారు.

ఆదిశంకరాచార్యుల వారు వ్రాసిన ‘సౌందర్యలహరి’లో కూడా, మంగళ సూత్రానికి విశేష విశిష్టతను కల్పించారు. అటువంటి మంగళసూత్రంలో, ముత్యం, పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది. స్త్రీ శారీరక, మానసిక రక్షణ కోరకు, మంగళ సూత్రంలో ముత్యం, పగడం వాడతారు. ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలోనుండి ఎరుపు - కుజుడు, తెలుపు - చంద్రుడు స్వీకరించడం జరుగుతుంది. ఆ జంట గ్రహాలు, స్త్రీ శరీరంలోని అన్ని నాడీ కేంద్రములనూ ఉత్తేజ పరచి, శారీరకంగా, భౌతికంగా, ఆరోగ్య పరంగా స్త్రీలలో వచ్చే నష్టాలనూ, దోషాలనూ తొలగిస్తాయనటంలో ఎటువంటి సందేహమూ లేదు. చంద్ర, కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యత వహిస్తాయో, అలాగే ముత్యం, పగడం కలిపిన మంగళసూత్రం, స్త్రీకి అత్యంత శుభఫలితాలను అందిస్తుంది. వీటి ప్రయోజనాలను పరిశీలిస్తే, ముత్యం, పగడం ధరించిన పాత తరం స్త్రీలు, ప్రసవ సమయంలో, ఆపరేషన్ లేకుండా, సహజ సిద్ధంగా పిల్లలను కనేవారు. ఆపరేషన్ అనేది అప్పట్లో అరుదైన విషయం. కానీ, ప్రస్తుత కాలంలో కాన్పులు, సిజేరియన్ ఆపరేన్ ద్వారా జరగటం అనేది సర్వ సాధారణమై పోయింది.

ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకు, అన్యోన్య దాంపత్యములకూ కారకుడు. శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రంథులు, సిరలు, ధమనులు, స్థనములు, స్త్రీల గుహ్యావయవములు, నరములు, ఇంద్రియములు, గర్భధారణ, ప్రసవములకు కారకుడు. పగడం కుజగ్రహనికి ప్రతీక. కుజగ్రహ దోషం వలన కలిగే ప్రభావాలు, అతికోపం, కలహాలు, మూర్ఖత్వం, సామర్ధ్యరాహిత్యము, రోగము, ఋణపీడలు, అగ్ని, విద్యుత్భయములు, పరదూషణ, కామవాంఛలు, దీర్ఘ సౌమాంగల్యలోపం, దృష్టి దోషము యిత్యాదులు, శారీకంగా ఉదరసంబంధిత ఇబ్బందులు, రక్త స్రావము, గర్భ స్రావము, ఋతు దోషములు మొదలైనవి. భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రములో ముత్యాన్ని మించిన విలువగలది వేరే లేదు. దానికి తోడు జాతి పగడం ధరించమని మన మహర్షులు చెప్పటంలో విశేష గూఢార్ధాన్ని గమనించవచ్చు.

శాస్త్ర, సాంప్రదాయ పరంగా, ఆరోగ్య పరంగా, జ్యోతిష్య పరంగా, మంగళసూత్రాలు, మెట్టెలు, బొట్టు, గాజులనేవి, అలంకరణ కోసం మాత్రమే కాక, స్త్రీని అన్ని విధాలుగా కాపాడుతూ, చక్కటి దేహ కాంతితో, ఆరోగ్యకరమైన సంసార జీవనాన్ని కొనసాగించేలా చేస్తాయి. ఏ విధంగా చూసినా, విలువలు తెలియని వివాహాలు శుభకరం కాకపోగా, విడాకుల వరకూ తీసుకు వెళతాయి. సాంప్రదాయ సంస్కారం లేని బంధాలలో కలతలు చోటు చేసుకుంటాయి. అలాగే, పాశ్చాత్య అనుకరణ వెర్రిలో పెడ దారి పడుతున్న మన ఆడ కూతుర్లకు మన ధర్మం గొప్పదనం, విశిష్టత అర్ధం అయ్యేలా తెలియ పరుద్దాము. సంప్రదాయాలను కాపాడుకుంటూ సంతృప్తిగా జీవిద్దాము..

Wednesday, January 24, 2024

Rama an Ordinary Human Being or God? Legend, History & Religion | రాముడు దేవుడా?


రాముడు దేవుడా?
శతృత్వం ఎంతటిదైనా, అది చావుతో ముగిసిపోతుంది! 

శ్రీరాముడి జీవితాన్ని చూస్తే, ఎన్నెన్నో సమస్యల సుడిగుండాలలో ఆయన ఈదినట్లు తెలుస్తుంది. ఆయన జీవితమంతా సమస్యలతోనే సాగింది. మొదట పినతల్లి కారణంగా, పితృవాక్య పరిపాలనను అనుసరించి ఆయన తన రాజ్యాన్ని వదులుకోవలసి వచ్చింది. అడవుల పాలైన శ్రీరాముడి చెంత ఉన్న భార్య సీతమ్మను, రావణుడు అపహరించుకుపోయాడు. ఆమె కోసం ఆయన అంతటా గాలించి, ఆమె జాడను కనుగొని, తనకు ఇష్టం లేకపోయినా యుద్ధం చేశాడు. అలా సీతమ్మను తీసుకుని రాజ్యానికి వెళితే, అక్కడ సీతమ్మను గురించి అపవాదులు వినాల్సి వచ్చింది. ఈ దశలో గర్భవతిగా ఉన్న సీతమ్మను తిరిగి అడవుల పాలు చేయాల్సివచ్చింది. ఆ తర్వాత తన కొడుకులతోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి. ఆ భీకర యుద్ధ సమయంలో సీత రణస్థలికి రావడం, పుత్రులను రామునికి అప్పగించి, భూమాత ఒడిలోకి చేరడం, ఇలా రాముడి జీవితం చూసుకుంటే ముళ్లబాటే. ఐనప్పటికీ భారతదేశంలో కోట్లాదిమంది రాముడినే ఎందుకు కొలుస్తారు? ఆయననే ఆదర్శంగా ఎందుకు తీసుకుంటారు? శ్రీరాముని గొప్పదనం గురించిన వివరాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/8iPA9Kys0Ec ]


రాముడు మాయలూ, మంత్రాలూ చూపించలేదు. శ్రీకృష్ణుడిలా విశ్వరూపం ప్రకటించలేదు. జీవితంలో ఎన్నెన్నో కష్టాలు, జరగరాని సంఘటనలు.. చిన్న వయస్సులోనే పినతల్లి స్వార్థానికి తండ్రికి దూరమై, ఆయనను పోగొట్టుకున్నాడు. పట్టాభిషేక ముహూర్తానికే అడవులపాలయ్యాడు. అరణ్యవాసంలో తోడుగా, ఊరటగా నిలుస్తుందనుకున్న భార్యకు దూరమయ్యాడు. కారడవులలో బాధాతప్త హృదయంతో వెతికాడు. అంతులేని దుఃఖాన్ని గుండెల్లో మోస్తూనే, రాక్షస వధ గావించాడు. అందరిలాగే ఉద్వేగాలు, ఆలోచనలు, ఆవేదనలు అనుభవించాడు. లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా, తాను మాత్రం విస్పష్టంగా 'అహం దశరథాత్మజః' అంటే, దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే అని ప్రకటించాడు. అయినా లోకమంతా ఆయననే ఎందుకు ఆదర్శంగా తీసుకుంది?

ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించినవాడు రాముడు. ధర్మానికి రూపునిస్తే, రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. చేతికి అందివచ్చిన సింహాసనాన్ని వదులుకుని, స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ.. ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే రామచంద్రుడు ధర్మమూర్తి అయ్యాడు. ఆ యుగపురుషుడిగానే కాక, సకల జగత్తుకూ ఒకేఒక్కడుగా నిలిచాడు.

1. శాస్త్ర ధర్మ పాలన..

తండ్రి మాట కోసం, సీత, లక్ష్మణులతో కలిసి వనవాసానికి బయలుదేరాడు రాముడు. అయోధ్యలో పుత్రవియోగ దుఃఖంతో దశరథుడు మరణించాడు. మేనమామ ఇంట్లో ఉన్న భరతుడు వచ్చి, దశరథుడికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. అన్నను వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్లి, తండ్రి మరణవార్త తెలియజేశాడు. అది విని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు రామయ్య. 'పెద్దకుమారుడినైవుండీ తండ్రికి ఉత్తరక్రియలు చెయ్యలేకపోయాన'ని బాధపడ్డాడు. అక్కడికక్కడే శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి ఉత్తరక్రియలు చేసి, పిండితో పిండాలు చేసి, దర్భల మీద ఉంచబోయాడు. ఇంతలో బంగారు కంకణాలు ధరించిన ఓ హస్తం రాముడి ముందుకు వచ్చి, తాను దశరథుడిననీ, పిండం తన చేతిలో పెట్టమనీ వాణి వినిపించింది. కానీ, రాముడు అందుకు ఒప్పుకోలేదు. శాస్త్రప్రమాణాలను అనుసరించి, దర్భల మీదే పిండాలు ఉంచాడు. నిజంగా మీరు నా తండ్రే అయితే, దర్భల మీద ఉంచిన పిండాలను స్వీకరించండి. నేను శాస్త్ర ప్రమాణాన్నే పాటిస్తానని నిక్కచ్చిగా చెప్పాడు. తండ్రి వియోగ దుఃఖంలో ఉన్న సమయంలో కూడా, శాస్త్ర ధర్మాన్ని తు.చ తప్పకుండా పాటించిన ఆదర్శమూర్తి రామచంద్రుడొక్కడే.

2. స్నేహ ధర్మ పాలన..

సీతమ్మ మాయలేడిని కొరినప్పుడు, ఆమెను వదలి, పర్ణశాలను దాటి, చాలా దూరం వెళ్ళారు రామలక్ష్మణులు. అదే అదనుగా, రావణుడు మారు వేషంలో వెళ్ళి సీతమ్మను అపహరించాడు. అదంతా గమనించిన జటాయువు రావణుడిని అడ్డగించే ప్రయత్నంలో, రావణుడిని ముప్పుతిప్పలు పెట్టాడు. సహనం నశించిన రావణాసురుడు జటాయువు రెక్కలు నరికివేశాడు. రెక్కలు తెగిన పక్షిరాజు  నేలకూలాడు. కొన్నాళ్లకు సీతాన్వేషణ చేస్తూ అటుగా వచ్చిన రాముడికి జరిగిన వృత్తాంతం చెప్పి, రాముడి చేతిలోనే ప్రాణాలు విడిచాడు. తన క్షేమం కోసం ప్రాణత్యాగం చేసిన జటాయువును ఆప్తమిత్రుడిగా స్వీకరించి, అతడికి ఉత్తరక్రియలు స్వయంగా నిర్వహించాడు రామచంద్రుడు. తాను క్షత్రియుడు. చేస్తున్నది వనవాసం. మరణించింది పక్షి. అయినప్పటికీ జటాయువుకు తాను స్వయంగా ఉత్తరక్రియలు చేసి, స్నేహధర్మానికి అసలైన అర్థాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించాడా స్నేహశీలి.

3. యుద్ధ ధర్మ పాలన..

వాలి తన తమ్ముడైన సుగ్రీవుడి భార్య రుమను చెరబట్టాడు. తమ్ముడి భార్య కోడలితో సమానం. మామగారు తండ్రితో సమానం. తండ్రిలాగా కాపాడవలసిన తమ్ముడి భార్యను, వాలి కామంతో కోరుకున్నాడు. అంతేకాదు.. వాలి వనచరుడు. క్రూరత్వం కలిగిన వనచరాలను వేటాడటం క్షత్రియ ధర్మం. అంతేకాకుండా, ఎదుటివారి బలాన్ని తగ్గించే వరమాల వాలి మెడలో ఉంది. దానిని ధరించిన సమయంలో, వాలి ఎదుట ఎవరు నిలిచినా, వారి శక్తి క్షీణిస్తుంది. కాబట్టే రాముడు చెట్టుచాటున దాగి, వాలిపై బాణాన్ని ప్రయోగించాడు. ఇది యుద్ధ ధర్మం. వాలి వధ ఘట్టంలో రాముడు క్షత్రియ, యుద్ధ ధర్మాలను పాటించాడు.

రావణ సంహారం తర్వాత విభీషణుడు రాముని వద్దకు వచ్చి, ఉత్తర క్రియలు నిర్వహించేందుకు అన్నగారి పార్థివ దేహాన్ని ఇమ్మని అడిగాడు. అప్పుడు రాముడు..
మరణాంతాని వైరాని నివృత్తం నః ప్రయోజనం |
క్రియతామద్య సంస్కారః మమాప్యేష యథా తవ ||
'విభీషణా! శతృత్వం ఎంతటిదైనా, అది చావుతో ముగిసిపోతుంది. సంధి కుదరక పోవడం వల్లనే, యుద్ధం చేయాల్సి వచ్చింది. మీ అన్నగారికి, ఆచార విధి ప్రకారం ఉత్తర క్రియలు జరిపించు. ఇక నుంచి ఈయన నీకు మాత్రమే కాదు. నాకూ అన్నగారే’ అని అన్నాడు. ఇదీ రాముడి ధర్మవర్తనం..

4. దయా ధర్మ పాలన..

సీతను రాముడికి అప్పగించమని హితబోధ చేసిన విభీషణుడికి, రాజ్యబహిష్కరణ శిక్ష వేశాడు, రావణుడు. సముద్ర తీరంలో, అపారమైన వానర సేనతో ఉన్న రామచంద్రుడి పాదాలను ఆశ్రయించాడు, విభీషణుడు. మరో ఆలోచన లేకుండా, విభీషణుడికి అభయం ఇచ్చాడు రామయ్య. అంతేకాదు, రావణుడిని చంపి, విభీషణుడిని లంకా రాజ్యానికి రాజును చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కానీ, సుగ్రీవుడు, మొదలైన వారికి, ఇదంతా ఇష్టం లేదు. ఏకాంతంలో ఉన్న రామయ్య దగ్గరకు వెళ్లి, విభీషణుడిని నమ్మవద్దని చెప్పారు. అతడు రావణాసురుడి దూత అని హెచ్చరించారు. అంతా విన్న రాముడు, విభీషణుడే కాదు. చివరకు రావణుడే తనను ఆశ్రయించినా, అతడికి కూడా అభయం ఇస్తానన్నాడు. ఆశ్రయించిన ప్రాణులకు రక్షణ కల్పించటం, క్షత్రియ ధర్మం, దయా ధర్మం. వనవాసంలో ఉన్నా, చివరకు యుద్ధ భూమిలో ఉన్నా, దయా ధర్మాన్ని విడిచి పెట్టలేదు రాముడు.

5. మనుష్య ధర్మ పాలన..

రామరావణ సంగ్రామం ముగిసింది. రావణుడు నేలకొరిగాడు. ముల్లోకాలూ ఆనందించాయి. వానరసేన చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇంతలో బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమయ్యారు. రాముడిని సాక్షాత్తు శ్రీమహావిష్ణు స్వరూపంగా స్తుతించారు. ‘నీది విష్ణు అంశ. వాస్తవానికి నువ్వు నిరాకారుడివి. అయినా, సాకారుడిగా ఉన్నావు. సృష్టి, స్థితి, లయలు నీవే నిర్వహిస్తావు’ అంటూ రాముడికి దైవత్వాన్ని ఆపాదించారు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి చెప్పినా, రాముడు తాను దైవాన్నని చెప్పుకోలేదు. తనకు దైవత్వాన్ని ఆపాదించుకోలేదు. ‘ఆత్మానం మానుషం మన్యే... దశరథాత్మజః’ అంటూ, తాను కేవలం దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే, సాధారణ మనుజుడిని మాత్రమే’ అని అన్నాడు. ఇదీ రామయ్య పాటించిన మనుష్య ధర్మం. రామయ్య ఎక్కడా మాయలు, మంత్రాలు ప్రకటించలేదు. తాను దైవాన్నని ఎన్నడూ చెప్పుకోలేదు. సాధారణ మనిషిలాగే, రాజ్య భోగాలతో పాటు, సుఖ దుఃఖాలూ అనుభవించాడు. మనుష్య ధర్మాన్ని పరిపూర్ణంగా పాటించిన యుగపురుషుడు రామచంద్రుడు.

6. సోదర ధర్మ పాలన..

రావణ వధ అనంతరం, లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావలసిందిగా విభీషణుడుకి వర్తమానం పంపించి, విశ్రాంతిగా కూర్చున్నాడు రాముడు. దూరంగా ఓ స్త్రీమూర్తి వడివడిగా అడుగులు వేసుకుంటూ, తన వైపే వస్తోంది. ఆమె ఎవరై ఉంటుందని రాముడు ఆలోచిస్తుండగా, ఆమె  ఎదురుగా వచ్చి నిలుచుంది. అమ్మా! ఎవరు నువ్వు? ఎందుకిలా వచ్చావు? రక్తసిక్తమైన రణభూమిని చూస్తుంటే, నీకు భయం అనిపించటం లేదా? నా వల్ల ఏదైనా సహాయం కావాలా? అంటూ రాముడు ఎంతో వినమ్రంగా ఆమెను అడిగాడు. అందుకామె సమాధానం ఇస్తూ, రామచంద్ర ప్రభూ! నన్ను మండోదరి అంటారు. నీ చేతిలో మరణించిన రావణాసురుడి భార్యను. రామా! నీవు ధర్మమూర్తివనీ, ఏకపత్నీవ్రతుడవనీ.. సీతను తప్ప మరే ఇతర స్త్రీ పేరు కూడా తలవవనీ విన్నాను. నా భర్త అనేకమంది స్త్రీలను చెరపట్టాడు. నీవంటి ఉత్తమ గుణసంపన్నుడైన యోధుడిని దర్శించుకోవాలనే కుతూహలంతో వచ్చాను. పరస్త్రీని చూడగానే వినమ్రంగా ఉన్నప్పుడే, నీ ఔన్నత్యం అర్థమైంది. రామచంద్రా! నీ దర్శన భాగ్యంతో ధన్యురాలనయ్యాను. ఇక సెలవు. అంటూ నిష్క్రమించింది. ఇదీ, పర స్త్రీలపై ఆ రామచంద్రుడు చూపించే సోదర ధర్మం.

పవిత్ర జీవితం కోసం, ముక్తి కోసం సాధన చేసే యోగులు, రామునిలా జీవించాలని అనుకుంటారు. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా మారొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. నిరీక్షించి, కాల పరీక్షను ఎదుర్కోవడమే వివేకవంతుల లక్షణం. రామయ్యా అదే చేశాడు. ఎప్పుడూ ప్రణాళికా బద్ధంగానే జీవితం నడుస్తుందని భావించలేము. మన ప్రమేయం లేకుండా, చికాకులు కలుగుతాయి. వాటికి క్రుంగిపోతే, జీవితం గతి తప్పుతుంది. గుచ్చుకున్న ముల్లును నెమ్మదిగా తొలగించి, ముందుకెళ్లాలి. అలా చేయగలిగితే, అద్భుతమైన అనుభూతి మిగులుతుంది. ఏ విషయాన్నైనా, సక్రమంగా నిర్వర్తించే సామర్ధ్యం పెరుగుతుంది. రాముడిని ఆదర్శంగా తీసుకోవడం అనేది, ఆరాధన కోసం కాదు. మన జీవితాలను మనమే ఉద్ధరించుకోవాలన్నది, అందులోని పరమార్థం. త్యాగం, ధర్మం, దయ, పరాక్రమం, రామునిలోని గొప్ప లక్షణాలు. వీటిని పెంపొందించుకోవాలని చెప్పేదే రామాయణం.

జై శ్రీరామ!

Monday, January 22, 2024

శ్రీ రామ రక్షా స్తోత్రం Sri Rama Raksha Stotram

 

శ్రీ రామ రక్షా స్తోత్రం

ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్య
బుధకౌశిక ఋషిః
శ్రీ సీతారామ చంద్రోదేవతా
అనుష్టుప్ ఛందః
సీతా శక్తిః
శ్రీమద్ హనుమాన్ కీలకం
శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్రజపే వినియోగః ॥

ధ్యానం:

ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం
పీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్ ।
వామాంకారూఢ సీతాముఖ కమలమిలల్లోచనం నీరదాభం
నానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్ ॥

స్తోత్రం:

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ ।
ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్ ॥ 1 ॥

ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్ ।
జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితమ్ ॥ 2 ॥

సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్ ।
స్వలీలయా జగత్త్రాతు మావిర్భూతమజం విభుమ్ ॥ 3 ॥

రామరక్షాం పఠేత్ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్ ।
శిరో మే రాఘవః పాతు ఫాలం (భాలం) దశరథాత్మజః ॥ 4 ॥

కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్రప్రియః శృతీ ।
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః ॥ 5 ॥

జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః ।
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః ॥ 6 ॥

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ ।
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః ॥ 7 ॥

సుగ్రీవేశః కటిం పాతు సక్థినీ హనుమత్-ప్రభుః ।
ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకుల వినాశకృత్ ॥ 8 ॥

జానునీ సేతుకృత్-పాతు జంఘే దశముఖాంతకః ।
పాదౌ విభీషణశ్రీదః పాతు రామోఽఖిలం వపుః ॥ 9 ॥

ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ ।
స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ ॥ 10 ॥

పాతాళ-భూతల-వ్యోమ-చారిణ-శ్చద్మ-చారిణః ।
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః ॥ 11 ॥

రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ ।
నరో న లిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి ॥ 12 ॥

జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్ ।
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః ॥ 13 ॥

వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్ ।
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళమ్ ॥ 14 ॥

ఆదిష్టవాన్-యథా స్వప్నే రామరక్షామిమాం హరః ।
తథా లిఖితవాన్-ప్రాతః ప్రబుద్ధౌ బుధకౌశికః ॥ 15 ॥

ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్ ।
అభిరామ-స్త్రిలోకానాం రామః శ్రీమాన్ స నః ప్రభుః ॥ 16 ॥

తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ ।
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ॥ 17 ॥

ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ ।
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ॥ 18 ॥

శరణ్యౌ సర్వసత్త్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతామ్ ।
రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ ॥ 19 ॥

ఆత్త సజ్య ధనుషా విషుస్పృశా వక్షయాశుగ నిషంగ సంగినౌ ।
రక్షణాయ మమ రామలక్షణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్ ॥ 20 ॥

సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా ।
గచ్ఛన్ మనోరథాన్నశ్చ (మనోరథోఽస్మాకం) రామః పాతు స లక్ష్మణః ॥ 21 ॥

రామో దాశరథి శ్శూరో లక్ష్మణానుచరో బలీ ।
కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః ॥ 22 ॥

వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః ।
జానకీవల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః ॥ 23 ॥

ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః ।
అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః ॥ 24 ॥

రామం దూర్వాదళ శ్యామం పద్మాక్షం పీతవాససమ్ ।
స్తువంతి నాభి-ర్దివ్యై-ర్నతే సంసారిణో నరాః ॥ 25 ॥

రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్ ।
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందే లోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిమ్ ॥ 26 ॥

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే ।
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ॥ 27 ॥

శ్రీరామ రామ రఘునందన రామ రామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ ।
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ ॥ 28 ॥

శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి
శ్రీరామ చంద్ర చరణౌ వచసా గృహ్ణామి ।
శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి
శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే ॥ 29 ॥

మాతా రామో మత్-పితా రామచంద్రః
స్వామీ రామో మత్-సఖా రామచంద్రః ।
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
నాన్యం జానే నైవ జానే న జానే ॥ 30 ॥

దక్షిణే లక్ష్మణో యస్య వామే చ (తు) జనకాత్మజా ।
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ ॥ 31 ॥

లోకాభిరామం రణరంగధీరం
రాజీవనేత్రం రఘువంశనాథమ్ ।
కారుణ్యరూపం కరుణాకరం తం
శ్రీరామచంద్రం శరణ్యం ప్రపద్యే ॥ 32 ॥

మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్ ।
వాతాత్మజం వానరయూథ ముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే ॥ 33 ॥

కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్ ।
ఆరుహ్యకవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్ ॥ 34 ॥

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ ।
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్ ॥ 35 ॥

భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదామ్ ।
తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్ ॥ 36 ॥

రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః ।
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర ॥ 37 ॥

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ।
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ॥ 38 ॥

ఇతి శ్రీబుధకౌశికముని విరచితం శ్రీరామ రక్షాస్తోత్రం సంపూర్ణమ్ ।

శ్రీరామ జయరామ జయజయరామ ।

శ్రీ రామ పట్టాభిషేకం! భాగం - 2 Coronation of Lord Rama in Ayodhya - Shri Rama Pattabhishekam


శ్రీ రామ పట్టాభిషేకం! భాగం - 2
ఆనాడు శ్రీరామ పట్టాభిషేకం ఎలా జరిగింది? ఈనాడు ప్రాణ ప్రతిష్ట సమయంలో మనం ఏం చేయాలి?

యావత్ భారత దేశం ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూసిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ ఘట్టానికి చేరుకున్నాం. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఆలయంలో ముగ్ధ మనోహరుడైన బాల రాముడు కొలువు దీరుతున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన అయోధ్య రామాలయ విశిష్టతలేంటి? వేల ఏళ్ళ క్రితం నాటి రాముడి పట్టాభిషేకం ఎలా జరిగింది? రాముడి ప్రాణ ప్రతిష్ఠ రోజున మనం చేయవలిసిన కార్యాలేంటి? అనేటటువంటి విషయాలను ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/WJxFJo2M8QU ]


రాముడు లంక నుండి సీతా దేవిని తీసుకుని పుష్పక విమానంలో, భల్లూక, వానరుల సమూహంతో అయోధ్యలోని నందిగ్రామానికి చేరుకున్నాడు. అక్కడ నుండి రాముడు అందమైన పట్టుపుట్టములను ధరించి, సూర్యమండల సన్నిభమైన రథాన్ని ఎక్కి పట్టాభిషేకానికి బయలుదేరాడు. ఆ రథం యొక్క పగ్గాలను భరతుడు పట్టుకుని నడిపించాడు. లక్ష్మణుడు నూరు తీగలు కలిగిన తెల్లటి గొడుగును పట్టాడు. ఒకపక్క శత్రుఘ్నుడు, మరొకపక్క విభీషణుడు వింజామర వీస్తున్నారు. అలా రథంలో అయోధ్యకు వెళుతున్న రాముడు, కనపడ్డ వాళ్ళందరినీ పలకరించుకుంటూ వెళ్ళాడు. రాముడు అందరితో కలిసి ఊరేగింపుగా, నందిగ్రామం నుండి అయోధ్యకు వెళుతుంటే,  అయోధ్యలో ప్రతి ఇంటిమీదా పతాకాలు ఎగురవేశారు. అన్ని ఇళ్ళముందు రంగవల్లులు వేశారు. అందరూ సంతోషపడిపోతూ, నాట్యం చేస్తూ వెళుతున్నారు. అలా వెళ్ళేటప్పుడు ముందుగా మంగళ వాయిద్యాలు నడిచాయి. ఆ వెనుక వేద పండితులు నడిచారు. తరువాత పెద్దలు, వాళ్ళ వెనుక కన్నె పిల్లలు. కొంతమంది స్త్రీలు పిండివంటలు పట్టుకుని నడిచారు. మార్గమధ్యంలో గంధపు నీరు జల్లుకుంటూ వెళ్ళారు. ఆ తరువాత సువాసినులయిన స్త్రీలు చేతులలో పువ్వులు, పసుపు, కుంకుమ పట్టుకుని వెళ్ళారు. వశిష్ఠుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు మొదలైన ఋషులందరూ అక్కడికి వచ్చారు. అలా అందరూ కలిసి అయోధ్యకి చేరుకున్నారు.

ఆ రాత్రికి అయోధ్యలో గడిపాక, మరునాడు రాముడి పట్టాభిషేకానికి 4 సముద్ర జలాలూ, 500 నదుల జలాలనూ వానరులు తీసుకొచ్చారు. ఇంద్రుడు నూరు బంగారు పూసలు కలిగిన మాలను రాముడికి బహూకరించాడు. వానరులు తీసుకొచ్చిన ఆ జలాలను రాముడి మీద పోసి, ఆయనకు పట్టాభిషేకం చేశారు. అప్పుడే కిరీటాన్ని తీసుకు వచ్చి రాముడి శిరస్సున అలంకరించారు. ఆ సమయంలో రాముడు కొన్ని కోట్ల బంగారు నాణాలూ, లక్షల ఆవులూ, వేల ఎద్దులనూ దానం చేశాడు.

తిరిగి ఇన్ని వేల సంవత్సరాల తరువాత, అయోధ్యలో బాల రాముడి పట్టాభిషేకం కన్నుల పండువుగా జరగుతోంది. ఆనాడు అయోధ్య ప్రజలు రాముడి రాక కోసం ఎదురుచూసిన విధంగా, నేడు భరత జాతి యావత్తూ రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఎదురుచూస్తోంది. సర్వాంగ సుందరంగా, ఎన్నో ప్రత్యేకతలతో నిర్మింపబడిన రామ మందిరం, ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద హిందూ ఆలయంగా నిలువనుంది. ప్రస్తుతం కంబోడియా అంకోర్‌వాట్‌లోని దేవాలయ సముదాయం, ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా రికార్డులకెక్కింది. ఆ తర్వాత స్థానంలో, తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న రంగనాథస్వామి ఆలయం ఉంది. ఇప్పుడు అయోధ్యలోని రామాలయం, మూడవ అతి పెద్ద ఆలయంగా ప్రసిద్ధి చెందింది. భారత సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు ప్రతిరూపం, అయోధ్య రామ మందిరం. ఈ రామమందిరాన్ని సంప్రదాయ నాగర్‌ శైలిలో నిర్మించారు. ఈ ఆలయం, 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో నిర్మితమైంది. మందిరాన్ని మొత్తం మూడు అంతస్తుల్లో నిర్మించారు. ఒక్కో అంతస్తు, 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ రామాలయంలో మొత్తం 392 స్తంభాలూ, 44 గేట్లూ ఉన్నాయి. ప్రధాన గర్భగుడిలో శ్రీరాముడు, ఐదేళ్ల బాలరాముడిగా దర్శనమివ్వనున్నాడు.

ఆలయంలో మొత్తం 5 మండపాలున్నాయి. అవి నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థనా మండపం, కీర్తన మండపం. రామాలయంలోని మొత్తం గోడలూ, స్తంభాలపై, అనేక రకాల దేవతామూర్తులను చెక్కారు. రామాయణ ఘట్టాలను చిత్రీకరించారు. ఆలయం చుట్టూ 732 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో, దీర్ఘచతురస్రాకారంలో ప్రహరీని నిర్మించారు. నాలుగు మూలల్లో నాలుగు దేవాలయాలను నిర్మించారు. వీటిలో సూర్యభగవానుడు, దేవి భగవతి, గణపతి, శివుడి ఆలయాలున్నాయి. ఉత్తర భుజంలో అన్నపూర్ణ ఆలయం, దక్షిణం వైపు ఆంజనేయ స్వామి ఆలయాలున్నాయి. మందిరం సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి అయిన సీతా కూపం ఉంది. మందిర సముదాయంలో వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, నిషాద్ రాజ్, శబరి మాత, అహల్య దేవిల మందిరాలను చూడొచ్చు. నైరుతి భాగంలో నవరత్న కుబేరు తిలపై, పురాతన శివాలయం పునరుద్ధరించబడింది. అక్కడ జటాయువు విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇంత విశాలమైన ఈ ఆలయాన్ని, ఇనుము వాడకుండా, ప్రత్యేక శిలలతో అత్యంత సుందరంగా నిర్మించారు. మందిర నిర్మాణంలో నేల, గోడలు, మెట్లు, పైకప్పు.. ఇలా అంతటా రాతినే వినియోగించారు. ఎక్కడా ఇనుము, స్టీల్‌, సిమెంట్‌, కాంక్రీటును వాడలేదు. భూమిలోని తేమతో, ఆలయానికి భవిష్యత్తులో ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు, 21 అడుగుల ఎత్తున గ్రానైట్‌తో పునాదిని నిర్మించారు.

దేశం నలు మూలల నుంచి సేకరించిన రెండు లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వాడారు. రిక్టర్‌ స్కేల్‌పై 10 తీవ్రతతో భారీ భూకంపాలు వచ్చినా, మరే విధమైన ప్రకృతి విపత్తులు వచ్చినా, కనీసం 2,500 సంవత్సరాల పాటు తట్టుకునేలా ఆలయ నిర్మాణాన్ని డిజైన్‌ చేశారు. ఆయోధ్య రామాలయ ప్రాంగణంలో, 27 నక్షత్రాలకు సూచికగా, 27 మొక్కలను గతంలో నాటారు. భక్తులు తమ జన్మ నక్షత్రాన్నీ, రాశినీ అనుసరించి, ఆయా చెట్ల కింద కూర్చుని ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం కోసమే, ఈ వాటికను ఏర్పాటు చేశారు.

నాడు వానరులు 500 నదులూ, 5 సముద్రాల నుండి తెచ్చిన జలాలతో, రాముడి పట్టాభిషేకాన్ని నిర్వహించారు. నేడు వసుదైక కుటుంబం అన్న భారతీయ భావనను ప్రతిబింబించేలా, ప్రపంచ వ్యాప్తంగా ఏడు ఖండాలలోని 115 దేశాలలో ప్రవహించే నదులూ, సముద్రాల నుంచి తీసుకొచ్చిన జలాన్ని, 2,587 ప్రాంతాల నుంచి తెప్పించిన మట్టినీ, రామాలయ నిర్మాణంలో వినియోగించారు.  ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత, ఒడిశాలోని కోణార్క్‌ సూర్య దేవాలయం గర్భగుడిలో, మూల విరాట్‌పై సూర్య కిరణాలు పడినట్లుగా, రామ మందిరంలోని బాల రాముడి విగ్రహం మీద, శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు ప్రసరించేలా, అయోధ్య ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం విశేషం. ఇలా ఎన్నో విశిష్టతలతో నిర్మింపబడిన ఈ ఆలయంలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం, మేష లగ్నంలో అభిజిత్ ముహుర్తంలో జరగబోతోంది. సాధారణంగా 5 గ్రహాలు అనుకూల స్థానంలో ఉంటే మంచి ముహుర్తం. అయితే ప్రాణ ప్రతిష్ట సమయంలో ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో విగ్రహ ప్రతిష్టాపన చేస్తే, ప్రపంచంలోనే మన దేశ కీర్తి మరింత పెరుగుతుంది. ఇంతటి బృహత్తర కార్యక్రమంలో మనమందరం ప్రత్యక్షంగా పాల్గోనే అవకాశం లేకపోవచ్చు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు శ్రీ రాముడి అక్షతలను పంపిణీ చేశారు. ప్రాణ ప్రతిష్ఠ రోజున అయోధ్యలోని రామ మందిరంతో పాటు, ప్రతీ రామాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. వాటిలో పాల్గోనే అవకాశం ఉన్నవారు, ఆలయంలో రామ నామ స్మరణ చేస్తూ రాముల వారి కృపకు పాత్రులు కావచ్చు. ఇన్నేళ్ళ మనందరి కల తీరబోతున్న వేళ సాయం సమయంలో, ప్రతీ ఇంట్లో దీప కాంతిలో దీపావళి శోభ కనువిందు చేయబోతోంది. ప్రతి ఇంట్లో 5 దీపాలను వెలిగించి, మన ఇంటికి కూడా రాముల వారిని ఆహ్వానిద్దాము.

జై శ్రీరామ!

Wednesday, January 17, 2024

శ్రీరామ పట్టాభిషేకం! భాగం - 1 Coronation of Lord Rama in Ayodhya - Shri Rama Pattabhishekam


శ్రీ రామ పట్టాభిషేకం! భాగం - 1  @mplanetleaf  
రాముడు పట్టాభిషిక్తుడవ్వడం భరతుడికి ఇష్టమేనా?

రామాయణంలోని ప్రతి ఘట్టం ఒక మధుర కావ్యంలానే ఉంటుంది. ఒక్కో కాండం, అద్భుతమైన భావోద్వేగాలను జనింపజేస్తుంది. రామాయణంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం, శ్రీ రామ పట్టాభిషేకం. రాముడికి రాజుగా పట్టాభిక్తుడవ్వడం ఇష్టమేనా? రాముడి దూతగా హనుమ భరతుడి దగ్గరకు ఎందుకు వెళ్ళాడు? పుష్పక విమానంలో లంక నుండి బయలుదేరిన రాముడు, సీతతో పంచుకున్న విషయాలేంటి? పుష్పక విమానంలో ఎవరెవరు అయోధ్యకు చేరుకున్నారు - వంటి మధురమైన విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/6D9Vuf63rNc ]


తాము అయోధ్యకు పయనమవ్వడానికి ప్రయాణ సాధనం ఏదైనా ఉన్నదా? అని రాముడు విభీషణుడిని అడగగా, విభీషణుడు వెంటనే పుష్పక విమానాన్ని ఏర్పాటు చేశాడు. రాముడు ఆ విమానాన్ని ఎక్కిన తరువాత వానరులతో, "మీరందరూ నాకోసం చాలా కష్టపడ్డారు. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. నేను బయలుదేరతాను" అని చెప్పగా వారందరూ, "మిమ్మల్ని విడిచి మేము ఉండలేము. మేము కూడా మీతో అయోధ్యకు వచ్చేస్తాము. మేము అక్కడ ఎక్కువ రోజులుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టము. మిమ్మల్ని కన్న కౌసల్యా మాతను ఒకసారి దర్శించుకోవాలని ఉంది. మీరు పట్టాభిషిక్తులై సింహాసనం మీద కూర్చుంటే చూడాలని ఉంది" అని అన్నారు. విశాల హృదయుడైన రాముడు సరే అనేసరికి, అక్కడున్న వాళ్ళందరూ ఆ పుష్పక విమానంలోకి గబగబా ఎక్కేశారు. తరువాత ఆ విమానం ఆకాశంలోకి ఎగిరిపోయింది.

రాముడు సీతమ్మకు పుష్పక విమానం నుండి కిందకి చూపిస్తూ, "సీతా, ఇదిగో ఇదే నేను రావణుడిని పడగొట్టిన ప్రదేశం. అదిగో అది కుంభకర్ణుడు పడిపోయిన ప్రదేశం. అది నరాంతకుడు పడిపోయిన ప్రదేశం. ఇది హనుమ విరూపాక్షుడిని పడగొట్టిన ప్రదేశం. ఆ సముద్రంలో ఉన్న సేతువును మేము వానరులతో కలసి నిర్మించాము. ఇక్కడే మేమందరమూ కూర్చుని, ఈ సముద్రాన్ని ఎలా దాటడం అని ఎంతో ఆలోచించాము. ఇదే కిష్కింధ. ఇక్కడి నుంచే వానరులు అన్ని దిక్కులకూ నీ జాడను కనిపెట్టడానికి బయలుదేరారు" అని చెప్తుంటే, సుగ్రీవుడు గబగబా వచ్చి, "రామ! మనం కిష్కింధ మీద నుంచే వెళుతున్నాము కదా, నా భార్యలు తారా, రుమా చూస్తుంటారు. వాళ్ళని కూడా ఎక్కించుకుందాము" అన్నాడు. రాముడు సరేనని ఒప్పుకోవడంతో, పుష్పకవిమానాన్ని కిందకి దింపారు. సుగ్రీవుడు వెంటనే వెళ్ళి, తార, రుమలకు విషయాన్ని చెప్పి, రమ్మన్నాడు.

అప్పుడు తార మిగిలిన ఆడవారి దగ్గరికి వెళ్ళి "రండి, రండి. సుగ్రీవుడు జయాన్ని సాధించి, రామ పట్టాభిషేకానికి వెళుతున్నారు. మంచి మంచి బట్టలు, ఆభరణాలు వేసుకుని అందరూ వచ్చెయ్యండి" అని చెప్పింది. అప్పుడు అక్కడున్న ఆడ వానరులందరూ మానవ కాంతలలాగా  కామరూపాలను పొంది, పట్టుపుట్టాలు, ఆభరణములు వేసుకుని, పుష్పక విమానానికి ప్రదక్షిణం చేసి లోపలికి ఎక్కి, "సీతమ్మ ఎక్కడ? సీతమ్మ ఎక్కడ?" అని అడిగారు. "ఆవిడే సీతమ్మ" అని చూపిస్తే, అందరూ వెళ్ళి ఆమెకి నమస్కరించారు. అప్పుడు సీతమ్మ వాళ్ళందరినీ సంతోషంగా కౌగలించుకుని, పలకరించింది.

మళ్ళి రాముడు సీతతో "సీత, అదే ఋష్యమూక పర్వతం. అక్కడే నేను, సుగ్రీవుడు కలుసుకున్నాము. అది శబరి యొక్క ఆశ్రమం. అక్కడున్న చిక్కటి వనంలోనే కబంధుడిని చంపాను. చూశావా సీత, అది మనం ఉన్న పంచవటి ఆశ్రమం.  అక్కడే రావణుడు నిన్ను అపహరించాడు" అని రాముడు చెబుతుంటే, సీతమ్మ గబుక్కున రాముడి చెయ్యి పట్టుకుంది. ఇంకా కొంత ముందుకు వెళ్ళాక, అదే అగస్త్య మహర్షి ఆశ్రమం. అక్కడే అగస్త్యుడు నాకు రావణ సంహారం కోసం అస్త్రాన్ని ఇచ్చాడు. అక్కడ కనపడుతున్నది సుతీక్షణుడి ఆశ్రమం. ఆ పక్కన కనపడుతున్నది చిత్రకూట పర్వతం. అక్కడే మనం తిరుగుతూ ఉండేవాళ్ళము" అన్నాడు. అలా రాముడు పుష్పకవిమానంలో ప్రయాణం చేస్తున్నంత సేపు, సీతమ్మకు దారి పొడవునా ఉన్న ప్రాంతాలను చూపిస్తూ, అక్కడ జరిగిన సంఘటనలు వివరించాడు.

అలా ఆ పుష్పక విమానం కొంత ముందుకు వెళ్ళాక, వాళ్ళకి భరద్వాజ మహర్షి ఆశ్రమం కనపడింది. అప్పుడు ఆ పుష్పక విమానాన్ని అక్కడ దింపి, భరద్వాజుడికి నమస్కరించారు వాళ్ళు అందరూ. భరద్వాజ మహర్షి రాముడిని చూసి సంతోషిస్తూ, "రామ! నేను నా తపఃశక్తితో అన్ని కాలాలలో నీ గురించి తెలుసుకుంటున్నాను. నువ్వు రావణ సంహారం చెయ్యడం నాకు తెలుసు. ఈ ఒక్క రాత్రి నా ఆశ్రమంలో ఉండి విశ్రాంతి తీసుకుని, నా ఆతిధ్యం స్వీకరించిన తరువాత నువ్వు బయలుదేరు" అని అన్నాడు. అప్పుడు రాముడు భరద్వాజుడి మాట కాదనలేక, అక్కడ ఉండటానికి నిర్ణయించుకున్నాడు. తరువాత  హనుమంతుడిని పిలిచి, 'హనుమ! నువ్వు ఇక్కడినుండి బయలుదేరి వెళ్ళి, గంగానది ఒడ్డున శృంగిభేరపురంలో గుహుడు ఉంటాడు. అతను నాకు మిక్కిలి స్నేహితుడు. గుహుడికి నా క్షేమ సమాచారం చెప్పి, పట్టాభిషేకానికి రమ్మని చెప్పు. ఆ పని అయిపోయిన తరువాత అక్కడినుండి బయలుదేరి, అయోధ్యలో అందరూ కుశలంగా ఉన్నారా లేదా? అని కనుకకుని, నందిగ్రామానికి వెళ్ళు. అక్కడ అందరితో నేను తిరిగి వస్తున్నానని చెప్పు. ముఖ్యంగా భరతుడికి అదే మాట చెప్పి, ఆయన ముఖకవళికలు గమనించు.

భరతుడి ముఖంలో ఏదన్నా కొంచెం బెంగ నీకు కనపడితే, వెంటనే వెనక్కి వచ్చెయ్యి. ఇంక నేను అయోధ్యకి రాను. భరతుడు అయోధ్యను పాలిస్తాడు. ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా కనిపెట్టి తిరిగిరా" అన్నాడు. వెంటనే హనుమంతుడు అక్కడి నుండి బయలుదేరి గుహుడిని కలుసుకుని, ఆయనని పలకరించి, రాముడు చెప్పిన విషయాన్ని చెప్పాడు. తరువాత అక్కడినుండి బయలుదేరి వెళ్ళి భరతుడిని కలుసుకుని, రాముడు పడిన కష్టాలు, సీతాపహరణం, రావణ వధ మొదలైన విషయాలను వర్ణించి చెప్పాడు. హనుమంతుడి మాటలు విన్న భరతుడు చాలా సంతోషించాడు.

మరునాడు ఉదయం రాముడు బయలుదేరబోయేముందు భరద్వాజుడు రాముడితో, "రామా!! నీ ధర్మానుష్టానికి నాకు ప్రీతి కలిగింది. నీకొక వరం ఇస్తాను, ఏదన్నా కోరుకో" అని అన్నాడు. అప్పుడు రాముడు, "వానరములు ఎక్కడ ఉంటాయో అక్కడ ఫలసంవృద్ధి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడి నుండి 3 యోజనముల దూరం వరకూ అయోధ్యకు ప్రయాణిస్తాము. ఆ మార్గంలో కూడా, చెట్లన్నీ ఫల పుష్పభరితములై, తేనెపట్లతో తేనెలు కారుతూ ఉండాలి. ఇలా నాకు వరం ఇవ్వండి" అని అడిగాడు. భరద్వాజుడు రాముడు అడిగినట్టు వరం ఇవ్వగానే, భరద్వాజుడి దగ్గర సెలవు తీసుకుని, కోలాహలంతో నందిగ్రామానికి చేరుకున్నాడు రాముడు. అప్పుడు భరతుడు తన సైనికులతో "రాముడు వచ్చేస్తున్నాడు. అయోధ్యలో ఉన్న తల్లులను తీసుకురండి. రథాలని తీసుకురండి. పెద్దవాళ్ళని తీసుకురండి. అందరినీ అయోధ్యకు రమ్మనండి. అంతటా పసుపు నీరు, గంధపు నీరు జల్లించండి. దివ్యమైన ధూపములు వెయ్యండి. అందరమూ కలిసి రాముడిని నందిగ్రామం నుండి అయోధ్యకు పట్టాభిషేకానికి తీసుకువెళదాము" అని భరతుడు ఆజ్ఞాపించాడు.

రాముడు వచ్చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అయోధ్య వాసులు, పరుగు పరుగున నందిగ్రామానికి వచ్చారు. అలా రాముడి రాక అయోధ్యకు కొత్త కాంతి తీసుకొచ్చింది. రాముడు పుష్పక విమానం నుండి కిందకి దిగగానే, భరతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, అన్నగారి పాదాలకు పాదుకలు తొడిగాడు. ఇది చూసి సుగ్రీవ విభీషణుల కన్నుల నుండి నీళ్ళు కారాయి. వెంటనే భరతుడు సుగ్రీవుడిని కౌగలించుకుని, "ఇంతకముందు మేము నలుగురము, ఇవ్వాల్టి నుండి, మనం అయిదుగురన్నదమ్ములము సుగ్రీవ" అని అన్నాడు. తరువాత అక్కడున్న గంధమాదనుడూ, మైందుడూ మొదలైనవారిని భరతుడికి పరిచయం చేశారు. అప్పుడు భరతుడు ఆ వానరాలతో, "మీరు మా అన్నయ్యకి సహాయం చేశారు. మీకు ఋణపడి ఉన్నాం" అని అందరినీ కౌగలించుకున్నాడు. పుష్పకం నుండి కిందకి దిగిన వానరకాంతలు, అక్కడున్న ఆడవారి రూపాలనూ, వారి అలంకారాలనూ చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు అక్కడికి వచ్చిన కౌసల్య, కైకేయ, సుమిత్రలు వారందరితో, "ఈ వానర కాంతలందరికీ మేమే తలస్నానాలు చేయిస్తాము" అని వాళ్ళందరికీ చెప్పి తలస్నానాలు చేయించారు. తరువాత రాముడు ఆ పుష్పక విమానాన్ని, కుబేరుడి దగ్గరికి వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపించాడు. అప్పుడా ఆ పుష్పకం కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోయింది.

భరతుడు తలవంచి నమస్కారం చేసి రాముడితో, "అమ్మ కైకేయి ఆనాడు రెండు వరాలడిగింది. ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా పుట్టి, రాజ్యం పొందడానికి సమస్త అర్హతలు కలిగి ఉన్న నువ్వు, తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయావు. నీ పాదుకలను వ్యాసంగా ఇచ్చి, నన్ను రాజ్యం చెయ్యమన్నావు. నువ్వు నాకు రాజ్యాన్ని ఎలా ఇచ్చావో, అలా ఆ రాజ్యాన్ని తీసుకువచ్చి నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాను. నీకు ఉన్నదానిని నాకు ఇచ్చి, నేను దానిని అనుభవిస్తుంటే చూసి నువ్వు మురిసిపోయావు. ఇవ్వాళ నేను దానిని నీకు అప్పగించేస్తున్నాను" అని అన్నాడు. భరతుడి మాటలకు సంతోషించిన రాముడు, తిరిగి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించాడు. శత్రుఘ్నుడు అక్కడికి వచ్చి, "అన్నయ్య! క్షుర కర్మ చేసేవారిని తీసుకొచ్చాను. నీ జుట్టు జటలు పట్టేసింది కదా, అందుకని క్షుర కర్మ చేయించుకో" అని అన్నాడు. అప్పుడు రాముడు, "నేను తండ్రిమాట నిలబెట్టడం కోసమని, నా అంతట నేనుగా అరణ్యవాసానికి వెళ్ళాను. కానీ, తండ్రి ఆజ్ఞాపించకపోయినా, నా మీద ఉన్న  ప్రేమ చేత, స్వచ్ఛందంగా తనంత తాను దీక్ష స్వీకరించి, నా పాదుకలను తీసుకెళ్ళి సింహాసనంలో పెట్టి, 14 సంవత్సరములు రాజ్యము మీద  మమకారము లేకుండా పరిపాలించిన భరతుడు, ముందు దీక్ష విరమించి స్నానం చేస్తే తప్ప, నేను దీక్షని విరమించను" అని అన్నాడు.

భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు క్షుర కర్మ చేయించుకుని మంగళస్నానం చేశాక, రాముడు క్షుర కర్మ చేయించుకుని మంగళ స్నానం చేశాడు. తరువాత రాముడు అందమైన పట్టుపుట్టములను ధరించి, మంచి అంగరాగములను పూసుకుని, దివ్యాభరణములను ధరించి బయటకు వచ్చాడు. తన కొడుకు ఇన్నాళ్ళకు తిరిగొచ్చాడని పొంగిపోయిన కౌసల్యా దేవి, సీతమ్మకు అభ్యంగన స్నానం చేయించి, మంచి పట్టుపుట్టం కట్టి, చక్కగా అలంకరించింది. కౌసల్య, సుమిత్ర, కైకేయిల చేత అలంకరింపబడ్డ వానర కాంతలు, 9000 ఏనుగులను ఎక్కారు. దశరథుడు ఎక్కే శత్రుంజయం అనే ఏనుగును తీసుకు వచ్చి, దానిమీద సుగ్రీవుడిని ఎక్కించారు. వానరులందరూ కూడా సంతోషంగా అయోధ్యకు బయలుదేరారు. మరి అయోధ్యలో రాముడి పట్టాభిషేకం ఎలా జరిగింది? ఎవరెవరు పాల్గోన్నారనేటటువంటి రసరమ్య ఘట్టాలను, మన తదుపరి వీడియోలో తెలుసుకుందము..

జై శ్రీరామ!

Tuesday, January 16, 2024

కనుమ పండుగ Kanuma Festival


అందరికీ 'కనుమ పండుగ' శుభాకాంక్షలు 🙏 
               
కనుమ పండుగ నాడు ప్రయాణాలు నిషిద్ధం.. అంటుంది శాస్త్రం..! పండుగకు పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు,అల్లుళ్ళు,ఇతర బంధువులు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరు.

[ కనుమ రోజు పశువులను ఎందుకు పూజించాలో తెలుసా?: https://youtu.be/HEeD4ulBfK0 ]


మనకు ఉన్నవి ఐదు కనుమలు.

సంప్రదాయంగా ఐదు కనుమలలో ప్రయాణం చేయరాదని అంటారు... కనుమ నాడు కాకైనా బయలుదేరదు అని సామెత కూడా ప్రసిద్దం...

"శవదాహే గ్రామదాహే సపిండీకరణే తథా
శక్య్తుత్పవే చ సంక్రాంతౌ నగంతవ్యం పరేహని"

1. శవదహనం జరిగిన మరుసటి రోజు..
2. గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగిన మరుసటి రోజు..
3. సపిండీకరణమైన మరుసటి రోజు..
4. గర్భస్రావం మరుసటి రోజు.. మరియు 
5. సంక్రాంతి మరుసటి రోజు.

వీటిని 'ఐదు కనుమలు' అంటారు. ఈ రోజుల్లో ప్రయాణించరాదని శాస్త్ర వచనం. 

కనుమ రోజు పశువులను  పూజించడం ఒక సాంప్రదాయం! 

దీని వెనుక కూడా ఓ కథ ఉంది...

ఒకసారి శివుడు నందిని పిలిచి “భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి”  అని చెప్పి రమ్మన్నాడు.

కానీ నంది అయోమయంలో ‘రోజూ ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి’ అని చెప్పాడట.

దాంతో కోపం వచ్చిన శివుడు, “ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి, ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి!” అని శపించాడట.

అప్పటి నుంచి ఎద్దులు, వ్యవసాయంలో సాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు...

కనుమ పండుగ విశేషాలు:

సంక్రాంతి మూడవ రోజు కనుమ. ఈ ప్రకృతిలో మనతో బాటు జీవించే పశు పక్ష్యాదుల ఉనికిని గుర్తించి గౌరవించటమే కనుమ పండుగ ఉద్దేశం. 

కొన్ని ప్రాంతాల్లో దీన్ని ‘పశువుల పండుగ’ అంటారు. మనది వ్యవసాయిక దేశం  గనుక మన జీవనంలో పశువులూ ఒక భాగమే.

ఆదినుంచీ పశువులను జంతువులుగా గాక సంపదగా, దైవాలుగా భావించే సంప్రదాయం మనది.

వృషభాన్ని ధర్మానికి ప్రతీకగా, పరమేశ్వరుని వాహనమైన నందీశ్వరునిగానూ, గోవును మాతృ స్వరూపంగా, సర్వ దేవతా సమూహానికి చిహ్నంగానూ భావిస్తారు.

ఏడాది పొడవునా తమ వ్యవసాయ పనుల్లో సహాయపడిన ఎడ్లు, ఇంటిల్లిపాదికీ కావాల్సిన పాడిని అందించి చక్కని ఆరోగ్యాన్ని సమకూర్చిన ఆవులు, గేదెలకు గ్రామీణులు కృతజ్ఞతలు తెలియజేసే పండుగే కనుమ.

ద్వాపరయుగంలో ఇంద్రుడికి బదులుగా గోవులను, గోవర్ధనగిరిని పూజించమని నందకులానికి కృష్ణుడు చెప్పిన నాటి నుంచే ఈ పండుగ ఉందని పెద్దల నమ్మకం.

ఈ రోజు రైతులు తమ పశువులను వేడి నీటితో శుభ్రంగా కడిగి అందంగా అలంకరించి హారతులిచ్చి పూజిస్తారు. అనంతరం పశు గణాన్ని తోలుకొని వెళ్లి గ్రామ దేవత ఆలయం చుట్టూ తిప్పి తీసుకొస్తారు. ఈ రోజు వాటిచేత ఏ పనీ చేయించరు. వాటికి మేలైన ఆహారాన్ని అందిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కనుమనాడు గ్రామ ప్రజల౦దరూ కలిసి ఎడ్ల పందాలను తిలకిస్తారు.

కొన్నిచోట్ల కనుమ నాడు పశువుల పాకలను చక్కగా అలంకరించి అక్కడ పాలు, కొత్తబియ్యంతో పొంగలి వండి దాన్ని దేవుడికి నివేదించిన తర్వాత పొలంలో చల్లుతారు. దీన్నే 'పొలి చల్లటం' అంటారు. దీనివల్ల తమ పంటలకు చీడపీడల బెడద ఉండదని రైతులు విశ్వసిస్తారు.

కనుమ నాడు పక్షులనూ రైతులు ఆదరిస్తారు. ఇందులో భాగంగా పక్షుల కోసం జొన్న కంకులూ, వరి కంకులూ తెచ్చి గుమ్మాలు, కిటికీలు, వసారాలో వేళ్ళాడగడతారు.

ధనుర్మాసం అంతా వేసే ముగ్గులకు భిన్నంగా కనుమనాడు పెద్ద రథం ముగ్గు వేస్తారు. విష్ణువు చేత పాతాళానికి తొక్కబడిన బలి చక్రవర్తి సంక్రాంతి మూడురోజులూ భూలోకానికి వచ్చి, కనుమనాడు తిరిగి వెళతాడనీ, ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికేందుకే ఈ రథం ముగ్గు వేస్తారని పెద్దలు చెబుతారు. 

అలాగే శ్రీమన్నారాయణుని స్మరిస్తూ ఆయన నివసించే వైకుంఠ వాకిలికి ఈ ముగ్గు ప్రతీక అనీ కొందరు చెబుతారు.

పండుగ రోజు పెట్టిన బొమ్మల కొలువును కనుమనాడు తీస్తారు. దీన్నే 'బొమ్మల కొలువు ఎత్తటం' అంటారు. పేరంటాలను పిలించి బొమ్మలకు హారతి పట్టి, కొలువులో పెట్టిన ఏదైనా ఒక్క బొమ్మను ఉన్నచోటు నుంచి కదిలిస్తారు. తర్వాత వీలును బట్టి ఎప్పుడైనా బొమ్మలను తీసుకుంటారు.

కనుమ రోజు మినప వంటకాలు తినాలని పెద్దలు చెబుతారు. అందుకే అందరూ ఈ రోజు గారెలు తింటారు. పశు పక్ష్యాదులను పూజించే కనుమ నాడు మాంసం తినే ఆచారం తర్వాతి రోజుల్లో వచ్చిందే తప్ప మొదటినుంచీ ఉన్నదైతే కాదు.

కనుమనాడు పిల్లలు, యువతీ యువకులు గాలిపటాలు (పతంగులు) ఎగరవేస్తారు. ఆకాశంలో రివ్వున పైకి దూసుకుపోయే గాలిపటం మాదిరిగానే వారి లక్ష్యాలూ సమున్నతంగా ఉండాలనే సందేశం ఇందులో ఉంది.

కనుమ నాడు నువ్వులు, బెల్లం పంచి శనిదేవుని శుభ దృష్టి, శనగ గుగ్గిళ్ళు లేదా నానబెట్టిన శనగలు పంచిపెడితే (దానము) ద్వారా గురు గ్రహం ఆశీస్సులు లభిస్తాయి.
          
లోకా సమస్తా సుఖినోభవన్తు!

Monday, January 15, 2024

భూమండలాన్ని గడగడలాడించిన రాముడి ఆగ్రహం! Ramayana


భూమండలాన్ని గడగడలాడించిన రాముడి ఆగ్రహం!
రాముడు లంకకు ప్రయాణమై సముద్రం దగ్గరకు చేరుకున్న తరువాత ఏం జరిగింది?

రాముడు లేని రామాయణం లేదు. మనుష్యరూపంలో సంచరించిన దైవం ఆ రామచంద్ర ప్రభువు. అవతారపురుషుడు అయ్యివుండి కూడా, సామాన్య మనుష్యులు అనుభవించే కర్మఫలాలను చిరునవ్వుతో స్వీకరించాడు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణ మహాకావ్యంలో గమనిస్తే, రాముడి పాత్రకు ఎంత ప్రత్యేకత ఉంటుందో, రావణుడు సీతమ్మను అపహరించిన సమయంలో ఆయనకు సహయం చేసిన వానర వీరుల పాత్రలకు కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. ఆ సమయంలో రాముడికి సహయం చేసిన హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు మాత్రమే మనలో చాలామందికి తెలిసి వుంటుంది. కానీ, రామసేతును నిర్మించడంలో అతి ముఖ్యుడైన నీలుడి గురించి, రామాయణాన్ని పఠించిన అతి కొద్ది మందికి మత్రమే తెలుసని చెప్పవచ్చు. నీలుడు రామసేతు నిర్మాణంలో ముఖ్యుడు ఎలా అయ్యాడు? రాముడి కోసం సముద్రుడి సహకారం ఏమిటి? రాముడి ఆగ్రహానికి సముద్రుడు ఎలా కారణమయ్యాడు? రాముడు లంకను చేరడానికి సముద్రం వద్దకు చేరుకున్న తరువాత, అక్కడ ఎటువంటి పరాణామాలు చోటుచేసుకున్నాయి? రావణుడు పంపిన దూతలేమయ్యారు? వంటి అద్భుత ఘట్టాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/gAelx7i7X24 ]


హనుమ వెళ్ళి సీతమ్మ జాడ తెలుసుకుని వచ్చాక, రాముడు వానర సైన్యం సహాయంతో, రావణుడిపై యుద్ధానికి పూనుకున్నాడు. వారందరూ సముద్రపు ఒడ్డుకు చేరుకోగా, అక్కడకు విభీషణుడు కూడా వచ్చి, రాముడికి సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. అయితే, రామ సైన్యం అంతా లంకను చేరుకోవాలంటే, సముద్రాన్ని దాటాలి. దానికి తగిన పరిష్కారం కోసం ఆలోచిస్తుండగా విభీషణుడు, "సముద్రుడు రాముడి పూర్వీకుడైన సగరుడికి ఋణపడి ఉన్నాడు. అందు చేత రామకార్యం తీరుస్తాడు." అని మార్గం చెప్పాడు. ఆ మాటలకు రాముడు సముద్రతీరాన దర్భలు పరచి వాటి పైన కూర్చుని, సముద్రుడిని ధ్యానించాడు. ఈలోపు రావణుడి వేగైన శార్దూలుడనే రాక్షసుడు వానరసేన ఉన్న చోటికి వచ్చి, అక్కడి పరిస్థితులన్నీ చూసి రావణుడి వద్దకు తిరిగివెళ్ళి, “వానర, భల్లూక సేన అపరసముద్రంలాగా లంక పైకి వస్తున్నది. ఉత్తమ ఆయుధాలను ధరించిన రామలక్ష్మణులు సీత కోసం, సేనతో సహా సముద్రతీరాన ఉన్నారు. ఆ సేన యొక్క విస్తీర్ణం ఎటు చూసినా పది యోజనాలున్నది. నేనీ విషయాలు స్థూలంగా చూసి వచ్చాను. వివరంగా చూసి రావటానికి మరెవరినైనా పంపటం మంచిది” అని అన్నాడు. అప్పుడు రావణుడు శుకుడనే రాక్షసుడితో, “నీవు సుగ్రీవుడి వద్దకు వెళ్ళి, మంచిగా ఈ మాటలు చెప్పు” అని, ఏం చెప్పాలో చెప్పి పంపాడు.

శుకుడు పక్షి రూపం ధరించి లంక నుంచి బయలుదేరి, సముద్రం దాటి వానరసేన దగ్గిరకు ఎగురుతూ వెళ్ళి, సుగ్రీవుడు మొదలైన వారి మీదుగా గాలిలోనే ఉండి ఇలా చెప్పాడు. “వానర రాజైన సుగ్రీవుడా! రావణుడు ఇలా అన్నాడు. ఉన్నత వంశంలో పుట్టిన వాడవు, మహాబలుడవు. జన్మతః నాకు బంధువువంటి వాడవు. అకారణంగా నాతో విరోధ మెందుకు? ఇందువల్ల నీకు ఒరిగేదీ, తరిగేదీ లేదు. వాలి నా స్నేహితుడు. నీవు నా తమ్ముడిలాంటి వాడవు. నేను రాముడి భార్యను తెస్తే నీకేమిటి? బుద్ధి మంతుడవు. బాగా ఆలోచించుకుని కిష్కింధకు తిరిగి వెళ్ళు. ఈ విషయంలో నీ ప్రమేయమేమీ లేదు. లంకలోకి దేవతలే ప్రవేశించలేరు గదా! నరుల మాటా, వానరుల మాటా చెప్పే దేముంది?”

ఈ మాటలు వింటూనే వానరులు ఆకాశాని కెగిరి, శుకుణ్ణి పట్టుకుని నేల మీదికి పడద్రోశారు. శుకుడు ఎలుగెత్తి, “ఓ రామా, నన్నీ వానరులు చంపేస్తున్నారు. దూతను చంపరాదు. నా ప్రభువు అనమన్న మాటలే అన్నాను గానీ, నేను సొంతాన ఏమీ అనలేదు.” అని వాపోయాడు. రాముడు జాలిపడి, దూతగా వచ్చిన వారిని అగౌరవపరచకూడదని చెప్పి, వదిలేయమన్నాడు. శుకుడు దెబ్బతిన్న రెక్కలతో ఆకాశంలోకి లేచి, “సుగ్రీవుడా, రావణుడితో ఏం చెప్పమంటావు?” అని అడిగాడు. “రావణుడితో ఇలా అన్నానని చెప్పు. ‘రాక్షసరాజా, నీవు నాకు స్నేహితుడవూ కావు, మేలుచేసిన వాడవూ కావు. నా మిత్రుడైన శ్రీ రాముడికి శత్రువువు, నా శత్రువైన వాలికి మిత్రుడవు. అందుచేత తప్పక చంపదగిన వాడవు. మేము నిన్ను సకుటుంబంగా చంపి, లంకను భస్మీపటలం చేస్తాము. అన్ని దివ్యాస్త్రాలూ తన అధీనంలో ఉన్న రాముడి బారి నుండి దేవతలు కూడా నిన్ను రక్షించలేరు. ముసలి జటాయువును చంపినట్లో, రామలక్ష్మణులు లేనప్పుడు దొంగతనంగా సీతమ్మను ఎత్తుకు పోయినట్లో కాదు. రాముడి ప్రతాపం నీకు త్వరలో తెలుస్తుంది.”అని చెప్పమని, సుగ్రీవుడు శుకుడితో అన్నాడు. అంతలో అంగదుడు సుగ్రీవుడితో, "వీడు దూతలాగా లేడు. వేగుల వాడని తోస్తున్నది. మనతో మాట్లాడుతూనే శిబిరమంతా చూశాడు. వీడిని వదలకుండా పట్టుకోండి. లంకకు పోనివ్వకండి" అని అన్నాడు. సుగ్రీవుడి ఆజ్ఞానుసారం, వానరులు శుకుణ్ణి మళ్ళీ పట్టుకున్నారు. శుకుడు మళ్ళీ ఆక్రోశిస్తూ, "ఓ రామా, దూతనైన నా రెక్కలను ఈ వానరులు విరుస్తున్నారు. కళ్ళు పీకేస్తున్నారు" అని పెద్దగా మొర పెట్టుకున్నాడు. రాముడు వానరులకు చెప్పి, శుకుణ్ణి విడిపించాడు.

తరువాత రాముడు సముద్రుడికి నమస్కరించి, చెయ్యి తల క్రింద పెట్టుకుని, సముద్రుడికి ఎదురుగా పడుకున్నాడు. రాముడలా మూడు అహోరాత్రాలు ఉపవసిస్తూ గడిపాడు. అంతకాలమూ సముద్రుణ్ణి ధ్యానించాడు. కానీ, సముద్రుడు సాక్షాత్కరించకపోయేసరికి, రాముడికి కోపం వచ్చింది. లోకంలో మంచితనం అసమర్థతగా పరిగణించబడుతుంది. సముద్రుడు తనను అలాగే భావించినట్లున్నాడు. అందుచేత రాముడు సముద్రుడికి గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు. రాముడు దివ్యధనుస్సు తీసుకుని శరసంధానానికి ఉద్యుక్తుడవుతుండగా, లక్ష్మణుడు అన్న కోపాన్ని ఉపశమింపచేసే ప్రయత్నం చేశాడు. కోపంతోసముద్రుడిని శోషింపజేస్తే నిరపరాధులైన కోటానుకోట్ల జలజీవులు ఏమైపోతాయోనని భయపడ్డాడు. కానీ, రాముడు సముద్రుడికి గుణపాఠం నేర్పాలని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించటానికి ధనుస్సుకు నారి బిగించి శరసంధానం చేశాడు. అప్పుడు లోకాలు సంక్షోభంలో కూరుకునిపోయాయి. సూర్యచంద్రులు గతులు తప్పారు. ఆకాశం నుంచి పిడుగుల వర్షం కురిసింది. ఉల్కలు రాలాయి. ప్రచండవాయువు వీచింది. భూమ్యాకాశాల నడుమ జ్వాలలు వ్యాపించాయి. అప్పటికే రాముడు ప్రయోగించి వదిలిపెట్టిన దివ్యాస్త్రాలతో, సముద్రం మైళ్ళ పర్యంతం వెనక్కు వెళ్లి క్షీణించి పోయింది.

రాముడు బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టి ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు సముద్ర మధ్యంలోని బ్రహ్మాండమైన అలల మధ్య నుంచి సముద్రుడు, సమస్త నదులు వెంటరాగా బయటకు వచ్చాడు. సముద్రుడి దేహం వైఢూర్య వర్ణంగా ఉంది. ఎర్రని మాలలూ, బట్టలూ ధరించి, రంగురంగుల పుష్పమాలికలూ, అనేకమైన బంగారు నగలూ ధరించివున్నాడు. అతని మెడలోని ముత్యాల హారాల మధ్య, కౌస్తుభమణి యొక్క తోబుట్టువు ప్రకాశిస్తున్నది. సముద్రుడు రాముణ్ణి సమీపించి, ముందుగా తానే రాముడి పేరు స్మరించి నమస్కరించాడు. "శ్రీరామా, పంచభూతాలూ ఎలాగైతే సహజ ధర్మాలను అతిక్రమించలేవో, అలా నేనూ నా కట్టుబాటుకు బద్ధుడనై ఉన్నాను. అంతేకానీ, నీ పట్ల అగౌరవం చూపటానికో, అపరాధం చేయటానికో కాదు. అగ్నిహోత్రం చల్లగా ఉండటం ఎంత విరుద్ధమో, నేను నా అగాధత్వాన్ని పరిత్యజించటం కూడా స్వభావవిరుద్ధం కదా! నీవు లోకధర్మాన్ని స్థిరంగా అనుశాసించాలి, అనుపాలించాలి. నేను గడ్డకట్టుకుని పోవడమో, చీలిపోవడమో అనూహ్యం. అలాచేస్తే, జలచరాలన్నీ నశించిపోతాయి. అయితే రామా! నేను నీకు నా చేతనైనంతగా తోడ్పడతాను. నీ ఆజ్ఞానువర్తినై, నీ అనుగ్రహం కోరి ప్రవర్తిస్తాను. వానరులు వారధి కట్టేటప్పుడు వారికి సముద్ర ప్రాణుల భయం లేకుండా చెయ్యగలను. స్వభావ సిద్ధంగా ఎగసిపడే అలలను అణచగలను. మీరు ఈ సముద్రాన్ని దాటడంలో సహాయపడగలను. నీ సేనలో గల నలుడనే వానరోత్తముడు, విశ్వకర్మ కొడుకు. శిల్ప విద్యలో తండ్రికి ఏమాత్రమూ తీసిపోడు. అతని చేత సేతువును నిర్మింపజెయ్యి. అలాగే, వానరుల్లో నీలుడుకి ఒక శాపం ఉంది. పూర్వం మునులు నది ఒడ్డున తపస్సు చేసుకుంటుండగా, వారి వస్తువులను నీటిలో పడవేశాడు. దానితో వారు, నీలుడు నీటిలో వేసిన ఏ వస్తువైనా మునగదని శపించారు. ఇప్పుడు అదే శాపాన్ని వినియోగించుకుని, నీలుడు వారధి నిర్మాణానికి తోడ్పడగలడు." అని సముద్రుడు చెప్పి, రాముడికి వినయంగా నమస్కరించి, అంతర్ధానమయ్యాడు.

నలుడి నేతృత్వంలో కోట్లాదిమంది వానరులు అయిదు రోజులలో లంకకు వారధిని నిర్మించారని రామాయణంలో స్పష్టంగా పేర్కొనబడి ఉంది. మహాకాయులైన వానరులు మొదటిరోజు పధ్నాలుగు యోజనాలు, రెండవ రోజు ఇరవై, మూడవ రోజు ఇరవైఒకటి, ఆ తరువాత రోజు ఇంకో యోజనం అదనంగా, అలా సువేలాద్రి హద్దుగా సేతువును నిర్మించారు. మహా ప్రజ్ఞాశాలి నలుడు నిర్మించిన సేతువు ఆకాశంలో స్వాతిపథంలా విరాజిల్లింది. తన తండ్రి విశ్వకర్మ కీర్తిని సార్థకంజేశాడు నలుడు. ఈ వారధిని రామేశ్వరం దగ్గరున్న ధనుష్కోటి నుంచి, శ్రీలంక దగ్గరున్న మన్నార్‌ తీరం వరకూ నిర్మించారు. సముద్రుడు ఆనాడు రాముడికిచ్చిన మాట ప్రకారమే, నేటికీ రామసేతు ఉన్న ప్రాంతంలో అలల ఉధృతి లేకుండా, సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటికీ సేతువు చాలావరకూ సముద్రం మీద తేలుతూ కనిపిస్తుంటుంది. అది రాముని స్పర్శ సోకిన నిర్మాణమే అన్న పులకింతను, మనకు నిలువెల్లా కలుగజేస్తుంది.

జై శ్రీరామ!

సంక్రాంతి పండుగ Sankranti 2024


అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు 🙏 

[ సంక్రాంతి పండుగ ఎలా జరుపుకోవాలి?: https://youtu.be/itjUnux5PEE ]


ధనుర్మాసం మొదలైన దగ్గర్నుంచే తెలుగు లోగిళ్లలో పండుగ వాతావరణం మొదలవుతుంది. ఇంటిముందు ముగ్గులు, హరిదాసులు, గంగిరెద్దుల వాళ్లతో, గ్రామాలలో పండుగ వాతావరణం వెల్లివిరుస్తుంది. దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా సంక్రాంతి పండుగకు స్వంత ఊరికి వస్తారు. సంక్రాంతి పండుగ గురించి చెప్పాలంటే, పెద్దలనుంచి పిన్నల వరకు ఎన్నెన్నో విశేషాలు ఉంటాయి. పట్టణాల నుంచి వచ్చే బంధువులకు పల్లె జనం స్వాగతం పలుకుతూ, ఆనందోత్సాహాలలో మునిగిపోతారు. చిన్ననాడు స్వగ్రామంలో తిరిగిన తీపి గురుతులను నెమరువేసుకుంటూ, అంతా పండుగను ఎంజాయ్ చేస్తారు. ఇల్లలికి సున్నాలు వేసి, సుందరంగా అలంకరిస్తారు.

లేలేత సూర్యకిరణాలు భూమిని తాకే వేళ, ఇంటి ముందు ఆడవారు ముగ్గులు పెట్టేవేళ, రామదాసు కీర్తనలు, హరినామ సంకీర్తన, శ్రీ కృష్ణ లీలామృతాన్ని గానం చేసుకుంటూ కాలికి గజ్జెకట్టి తంబురను మీటుతూ, తలపై అక్షయ పాత్రతో, చేతిలో చిడతలతో, హరిదాసులు చేసే సంకీర్తనలు, సంక్రాంతి పండుగవేళ కనిపించే అతి గొప్ప సాంప్రదాయాల్లో ఒకటిగా చెప్పవచ్చు. హరిదాసులు శ్రీమహావిష్ణువుకు  ప్రతిరూపాలుగా కూడా చెబుతారు. ఇంటి వారు ఇచ్చే ధన, ధాన్య, వస్తు దానాలను తీసుకుని ఇంటింటికీ తిరుగుతూ, "హరిలో రంగ హరి.. హరిలో రంగ హరి" అంటూ ఇంటి ముందు నర్తిస్తూ, అందరినీ చల్లగా ఉండమని దీవిస్తూ గ్రామంలో తిరిగే హరిదాసులు, నేటికీ గ్రామాలలో కనిపిస్తారు. హరిదాసులు తమ తలపై ఉన్న అక్షయపాత్రను గ్రామ సంచారం సమయంలో ఎక్కడా తీసి కింద పెట్టరు. కేవలం ఇంటికి వెళ్లాక అతని భార్య మాత్రమే అక్షయపాత్రను కిందకు దించుతుంది.

ఏడాది పొడవునా ఎప్పడూ కనపడని హరిదాసులు, సంక్రాంతి పండుగ సమయంలో ధనుర్మాసం నెల రోజులపాటు మాత్రమే కనిపిస్తారు. గ్రామాలలో హరిదాసుల సందడి సూర్యోదయం తోటే మొదలవుతుంది. ఇలా నెలరోజులపాటు తిరిగి, సంవత్సరానికి సరిపడా గ్రాసాన్ని సంపాదించుకుంటారు హరిదాసులు. వీరంతా ఊరి బయటనుంచే వస్తారు. ఏడాదిలో  ప్రతి వూరికీ ఎవరెవరు వస్తారో, వారు తప్ప ఇతరులు రారు. ముఖ్యంగా ఇలా వచ్చే వారిలో, విష్ణు భక్తులైన సాతానులు, దాసరులు, రాజులు మొదలైన వారు, ఇలా జీవిస్తూ వుంటారు.
గ్రామ వీధుల్లో హరిదాసులు ఇలా హరి భజన చేయడం కోలాహలంగా వుంటుంది. హరిదాసుడి అక్షయ పాత్రలో బియ్యం వేయటానికి  బాలబాలికలు పోటీలు పడతారు. హరిదాసులు ప్రతి ఇంటి ముందూ కూర్చుని లేవటం చాల కష్టమైన పని. అయినా భక్తి భావంతో అదంతా మరచిపోతారు.

హరిదాసులతో పాటు, సంక్రాంతి పర్వదినాలలో గంగిరెద్దుల వారు, బుడబుక్కలవారు, పగటి వేషధారులు, గారడీ వాళ్ళు, ఎందరెందరో జానపద కళాకారులతో, కన్నుల పండువుగా సంక్రాంతి పర్వదినాలు ముగుస్తాయి. పంటను ఇంటికి తెచ్చుకుని కళకళలాడే రైతు కుంటుంబాలు అందరినీ ఆదరిస్తూ, సంక్రాంతి పర్వదినాలను ఆనందంగా ముగిస్తారు.

నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే ।
ఆయురారోగ్య మైశ్వర్యం దేహి దేహి దేవః జగత్పతే ॥

Sunday, January 14, 2024

భోగి పండుగ 2024


అందరికీ 'భోగి పండుగ' శుభాకాంక్షలు 🙏

[ భోగి రోజు ఇలా చేస్తే ఇంటి నిండా సిరులే: https://youtu.be/jkmkEU3i8yg ]


సంక్రాంతి పండుగ అంటే సంబరాల పండుగ. మన తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజులు ఎంతో కోలాహలంగా జరిగే ఈ పండుగలో మొదటి రోజున వచ్చేది 'భోగి' పండుగ. భోగి అంటే 'తొలినాడు' అనే అర్ధం ఉంది. భోగి రోజున ఇంటి ముందు మంట వేస్తే, ఇంట్లో ఉండే దరిద్ర దేవతను తరిమినట్లేనని మన నమ్మకం. ఈ భోగి పండుగ నాడు సంబరమంతా పిల్లలదే. తెల్లవారు జామున భోగి మంటలు వేయటం, సాయంత్రం భోగి పండ్లు పోయించుకోవడంతో, పిల్లలు హుషారుగా ఉంటారు. 'భగ' అనే పదం నుంచి భోగి అన్న మాట పుట్టిందని చెబుతారు. 'భగ' అంటే 'మంటలు' లేదా 'వేడి'ని పుట్టించడం అని అర్ధం.

భోగి రోజు సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు పోస్తూ, చిన్న పిల్లలను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా భావిస్తారు. రేగి పళ్ళను సంస్కృతంలో బదరీ ఫలం అంటారు. భోగి పళ్ళలో చేమంతి, బంతి పూరేకులు, అక్షింతలు, చిల్లర నాణేలు కలిపి, పిల్లల తలపై పోస్తారు. ‘భుగ్’ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ రోజున శ్రీ రంగనధాస్వామిలో గోదా దేవి లీనమై, భొగాన్ని పొందిందనీ, దీనికి సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనీ పురాణ గాధ. అయితే, చాలా మంది భావించే విధంగా భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు. ఆరోగ్యం కోసం కూడా.

ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడతారు. దేశీ ఆవు పేడ పిడకలని కాల్చడం వలన, గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మ క్రిములు నశిస్తాయి. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని జోడిస్తారు. ఈ ఔషధ మూలికలు, ఆవు నెయ్యి, ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి, అతి శక్తివంతమైనది. మన శరీరంలోని 72 వేల నాడులలోకి ప్రవేశించి, శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. దీనితో భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయం వల్ల వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది.

ఇక ఆధ్యాత్మిక పరంగా, ఈ భోగి మంటలను అగ్నిదేవుడికి ఆరాధనగా పరిగణిస్తారు. వాస్తవానికి  భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులను కాదు. మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలను. అప్పుడే మనకున్న పీడ పోయి, మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి అనే అర్ధం ఈ భోగి మంటల వెనుక ఉంది. భోగి రోజున మొదలయ్యే పెద్ద పండుగలో అరిసెలు, నువ్వుల లడ్లు, జంతికలు, చక్కలతో పాటు, రకరకాల పిండి వంటలతో మన ఇరు రాష్ట్రాలలోని తెలుగు వారు ఎంతో ఆనందంగా చేసుకునే ఈ భోగి పండుగతో, మూడు రోజుల పెద్ద పండుగ ప్రారంభం అవుతుంది.

Wednesday, January 10, 2024

విశ్వరూపం! భగవద్గీత Bhagavad Gita Chapter 18


విశ్వరూపం!
యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడి ద్వారా పొందబడిన ‘సర్వోన్నత యోగ శాస్త్రము’!

'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (75 – 78 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 75 నుండి 78 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/jh-LR5NbMvk ]


పాపముల నుండి విముక్తి పొంది, పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకములకు చేరుకోవడానికి మార్గం ఏంటో సంజయుడి మాటలలో విందాము..

00:50 - వ్యాసప్రసాదాఛ్చ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరమ్ ।
యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయమ్ ।। 75 ।।

వేదవ్యాసుని అనుగ్రహం చేత, నేను ఈ యొక్క సర్వోత్కృష్ట పరమ రహస్యమైన యోగమును, స్వయంగా యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడి నుండి తెలుసుకున్నాను.

శ్రీ కృష్ణ ద్వైపాయన వ్యాసదేవుడినే మహర్షి వేద వ్యాసుడని కూడా అంటారు; ఆయన సంజయుని యొక్క ఆధ్యాత్మిక గురువు. తన గురువు గారి అనుగ్రహం చేత, సంజయుడు హస్తినాపుర రాజమందిరంలోనే కూర్చుని, కురుక్షేత్ర యుద్ధ భూమిలో జరిగేదంతా తెలుసుకోవటానికి, ఆయనకు దివ్యదృష్టి ప్రసాదించబడింది. తన గురువు గారి కృప వలననే, తనకు సర్వోన్నత యోగ శాస్త్రమును స్వయంగా, యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడి ద్వారా వినే అవకాశం లభించిందని, ఇక్కడ సంజయుడు ఒప్పుకుంటున్నాడు. బ్రహ్మ సూత్రాలూ, పద్దెనిమిది పురాణాలూ, మహాభారతము, ఇంకా ఇతర గ్రంథాలను వ్రాసిన వేద వ్యాసుడు, ఒక భగవత్ అవతారము. ఆయనకు దివ్యదృష్టి వంటి శక్తులున్నాయి. ఈ విధంగా ఆయన, కేవలం శ్రీ కృష్ణుడికీ, అర్జునుడికీ మధ్య జరిగిన సంభాషణనే కాక, సంజయుడికీ, ధృతరాష్ట్రుడికీ మధ్య జరిగిన సంభాషణను కూడా విన్నాడు. అందువలన, ఆయన భగవద్గీత లో ఈ రెండు సంభాషణలనూ పేర్కొన్నాడు.

02:14 - రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతమ్ ।
కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః ।। 76 ।।

సర్వోత్కృష్ట శ్రీ కృష్ణ భగవానునకూ, మరియు అర్జునుడికీ మధ్య జరిగిన ఈ మహాద్భుతమైన సంవాదమును, పదేపదే గుర్తుచేసుకుంటూ ఓ రాజా, నేను మళ్ళీ మళ్ళీ ఆనందిస్తున్నాను.

ఆధ్యాత్మిక అనుభవమనేది, సమస్త భౌతిక ఆనందాలనూ ఒక్కచోట కూర్చిన దానికన్నా ఎక్కువ హర్షమునూ, తృప్తిని కలిగించే ఆనందమునూ ఇస్తుంది. సంజయుడు అటువంటి ఆనందమును అనుభవిస్తూ, తన అనుభవాన్ని అంధుడైన ధృతరాష్ట్రునితో పంచుకుంటున్నాడు. ఈ అద్భుతమైన సంవాదమును గుర్తుచేసుకుంటూ, ఆయన దివ్య ఆనందమును అనుభవిస్తున్నాడు. ఈ గీతా శాస్త్రములో ఉన్న జ్ఞానము యొక్క మహనీయతనూ, మరియు సంజయుడు చూసిన లీలల యొక్క దైవత్వమునూ ఇది సూచిస్తున్నది.

03:11 - తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః ।
విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునఃపునః ।। 77 ।।

అలాగే, ఆ శ్రీ కృష్ణుడి అత్యద్భుతమైన, ఆశ్చర్యకరమైన విశ్వ రూపమును గుర్తుచేసుకుంటూ, ఆశ్చర్యచకితుడనై, మహదానందముతో, పదేపదే పులకించి పోతున్నాను.

మహోన్నత యోగులకు కూడా అరుదుగా కనిపించే భగవంతుని విశ్వ రూప దర్శన భాగ్యము, అర్జునుడికి కలిగింది. అర్జునుడు, ఆయన యొక్క భక్తుడు, మరియు స్నేహితుడు. ఆయనకు చాలా ప్రియమైన వాడు కావున, తన విశ్వరూపమును చూపిస్తున్నానని, శ్రీ కృష్ణుడు చెప్పాడు. సంజయుడు కూడా ఆ విశ్వ రూపమును చూశాడు. ఎందుకంటే, భగవంతుని దివ్యలీలలలో పాలు పంచుకునే భాగ్యము, ఆయనకు కథకుడిగా లభించింది. ఊహించని భగవదనుగ్రహము, ఒక్కోసారి మన దారిలో వస్తుంటుంది. దానిని సరిగ్గా ఉపయోగించుకుంటే, మనం సాధనలో అత్యంత వేగంతో ముందుకెళ్లవచ్చు. సంజయుడు పదేపదే తాను చూసిన దానిని గుర్తుచేసుకుంటూ, భక్తి ప్రవాహంలో ఓలలాడి పోతున్నాడు.

04:20 - యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః ।
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ ।। 78 ।।

ఎక్కడెక్కడైతే యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడూ, మరియు అత్యున్నత విలుకాడైన అర్జునుడూ ఉంటారో, అక్కడ సకల ఐశ్వర్యమూ, సర్వ విజయమూ, సకల-సమృద్ధీ, మరియు ధర్మమూ ఉంటాయి. ఇది నా నిశ్చిత అభిప్రాయము.

ఈ శ్లోకంతో, ఒక గంభీరమైన ప్రకటన ఇస్తూ, భగవద్గీతను ముగించాడు. ధృతరాష్ట్రుడు యుద్ధం యొక్క ఫలితం పట్ల ఆందోళనతో ఉన్నాడు. రెండు సైన్యముల పరస్పర భౌతిక పరమైన సామర్థ్యముల లెక్కలు వ్యర్థమని, సంజయుడు అతనికి చెబుతున్నాడు. ఈ యుద్ధంలో ఒక్కటే తీర్పు ఉంటుంది - విజయం ఎల్లప్పుడూ భగవంతుడు, మరియు ఆయన శుద్ధ భక్తుడున్న పక్షానే ఉంటుంది; అదే పక్షాన, మంచితనమూ, ఆధిపత్యము, మరియు సమృద్ధి కూడా ఉంటాయి. భగవంతుడు సర్వ స్వతంత్రుడు, స్వయం సమృద్ధిగల జగదీశ్వరుడు, మరియు అర్చన-ఆరాధనలకు అత్యంత యోగ్యుడు. ఆయనకు సరితూగేవారు ఎవరూ లేరు; ఆయనకంటే గొప్పవారూ ఉండరు; తన అసమానమైన మహిమను ప్రకటించటానికి తగిన వాహకం, ఆయనకు కావాలి. ఆయనకు శరణాగతి చేసిన జీవాత్మ, భగవంతుని యశస్సును ప్రకాశింపచేయటానికి, అటువంటి ఒక చక్కటి వాహకంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఎక్కడైతే సర్వోత్కృష్ట పరమేశ్వరుడూ, మరియు ఆయన యొక్క పరిపూర్ణ భక్తుడూ ఉంటారో, పరమ సత్యము యొక్క తేజస్సు ఎల్లపుడూ అసత్యపు చీకటిని జయిస్తుంది. ఇంకే ఇతర ఫలితమూ ఉండజాలదు.

ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీ కృష్ణార్జునసంవాదే మోక్ష సన్యాస యోగోనామ అష్టాదశోధ్యాయ:

06:17 - శ్రీ మద్భగవద్గీతలోని జ్ఞానషట్కం, పద్దెనిమదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగంలోని, 78 శ్లోకాలూ సంపూర్ణం. భగవద్గీతలోని 18 అధ్యాయాలూ, 18 యోగాలలో ఉన్న మొత్తం 701 శ్లోకాలు పూర్తయ్యాయి. స్వయానా భగవంతుడు వివరించిన ఆత్మజ్ఞానం, కర్మజ్ఞానం గురించీ, భగవద్గీతలోని అంతరార్థం గురించీ, ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలనే కోరికతో మేము చేసిన ఈ ప్రయత్నాన్ని మీరందరూ ఆదరించినందుకు, కృతజ్ఞతాభివందనాలు..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, January 8, 2024

Brahmastra on a crow | కాకి మీద బ్రహ్మాస్త్రం!


కాకి మీద బ్రహ్మాస్త్రం!
లంకలో సీతమ్మ హనుమకు చెప్పిన కాకాసుర వృత్తాంతం!

రామాయణం గురించి మనలో చాలామందికి తెలుసు. శ్రీ రామ చంద్రమూర్తికి సతి అయిన సీతా దేవిని, మాయావి రావణాసురుడు అపహరించి లంకలో బంధించడం, రామ దూతగా హనుమ వెళ్లి సీతమ్మను కనుగొనడం, తరువాత రాముడు వానర సైన్యంతో వారధిని నిర్మింపజేసి, రావణాసురుడితో యుద్ధం చేసి, సీతమ్మను తిరిగి తీసుకురావడం.. ఇవన్నీ ప్రతి ఒక్కరికీ తెలిసిన రామాయణ ఘట్టాలే. హనుమ సప్త సముద్రాలనూ దాటి, సీతమ్మను చేరుకున్న తరువాత జరిగిన సంభాషణ, రామాయణంలో రసరమ్యభరితం. వాటిలో, సీతా దేవి హనుమకు వివరించిన కాకాసుర వృత్తాంత సంఘటనను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Vgn-qemaUEA ]


రాముడి గుణగణాల గురించీ, రాముడి రూపం గురించీ ఎంతో గొప్పగా చెప్పి, రాముడు సీతమ్మకు ఇవ్వమన్న ఉంగరాన్ని, హనుమంతుడు ఆ తల్లికి ఇచ్చాడు. ఆ ఉంగరాన్ని చూడగానే, సీతమ్మ ఎంతో సంతోషపడింది. సాక్షాత్తూ రాముడిని చూసినంత ఆనందం పొందింది. తరువాత హనుమంతుడు సీతమ్మతో, "యజ్ఞములో వేసిన హవిస్సును హవ్యవాహనుడైన అగ్నిదేవుడు ఎంత పవిత్రంగా తీసుకెళతాడో, అలా నిన్ను తీసుకెళ్ళి రాముడి పాదాల దగ్గర పెడతాను. అమ్మా! నువ్వు వచ్చి నా వీపు మీద కుర్చో" అని అన్నాడు. హనుమంతుడు సీతమ్మను వీపు మీద కూర్చోమని అడిగేసరికి, "నన్ను క్షేమంగా రాముడి దగ్గరికి నువ్వు తీసుకువెళ్ళగలవు. కానీ నేను స్పృహలో ఉండగా, తెలిసి తెలిసి రాముడిని తప్ప, వేరొక పురుషుడిని నా చేతితో స్పృశించను. రాముడే వచ్చి రావణుడిని సంహరించి, నా చెయ్యి పట్టుకుని, ఈ సముద్రాన్ని దాటించాలి" అని చెప్పింది. అప్పుడు హనుమంతుడు, "ఒక మనుష్య స్త్రీగా ఉండి, ఇన్ని కష్టాలు పడుతూ, ఇటువంటప్పుడు కూడా 'నేను రాను' అనడం నీకే చెల్లింది తల్లి. నువ్వు నా వీపు మీద కూర్చుని రాను అంటున్నావు కదా! పోనీ రాముడి దగ్గరికి నేను వెళ్ళి చెప్పడానికి, ఏదైనా ఒక విషయం చెప్పు తల్లి" అని అన్నాడు.

అప్పుడు సీతమ్మ, "ఒకనాడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు, చిత్రకూట శిఖరాల మీద ఆశ్రమాన్ని నిర్మించుకుని, అక్కడున్న తపోభూములలో నేను, రాముడు విహరిస్తూ ఉండేవాళ్ళము. అటువంటి సమయంలో, ఈశాన్య పర్వతానికి పక్కన ఉన్న ఒక చిన్న పర్వతం మీద, మేము విహరిస్తున్నాము. అప్పుడు రాముడు అక్కడున్న కొలనులోని నీళ్ళల్లో ఆడుకుని, తడిబట్టలతో పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి, నా పక్కన కూర్చున్నాడు. ఆ సమయంలో నేను కొన్ని  ఒరుగులను అక్కడ ఎండపెట్టాను. నా పక్కన కూర్చున్న రాముడు, సంతోషంగా నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు కాకాసురుడనే కాకి అక్కడికి వచ్చి, ఆ ఒరుగులను తినడం ప్రారంభించింది. అప్పుడు నేను ఒక మట్టిగడ్డను తీసి, ఆ కాకి మీదకు విసిరాను. అప్పుడా పక్షి నా వక్షస్థలం మీద వాలి, తన ముక్కుతో పొడిచి, నా మాంసం పీకింది. ఆ బాధలో నేను గిలగిలలాడడం వలన, నా వడ్డాణం జారింది. నేను ఆ వడ్డాణాన్ని తీసి కాకి మీదకు విసరబోతే, రాముడు నన్ను చూసి నవ్వి, 'సీత! కాకి మీదకు బంగారు వడ్డాణం విసురుతావా' అని అన్నాడు.

తరువాత నేను ఆ బాధను ఓర్చుకుని, రాముడి ఒడిలో తల పెట్టుకుని నిద్రపోయాను. నేను అలా రాముడి ఒడిలో తల పెట్టుకుని ఉన్నంతసేపు, ఆ కాకి రాలేదు. మళ్ళి కొంతసేపటికి నేను నిద్రలేచాను. అప్పుడు రాముడు నా ఒడిలో తల పెట్టుకుని నిద్రపోతున్నాడు. మళ్ళీ ఆ కాకాసురుడనే కాకి నా వక్షస్థలం మీద కూర్చుని, మళ్ళి గట్టిగా నా శరీరంలోకి పొడిచి నా మాంసాన్ని తిన్నది. అప్పుడు నా శరీరం నుండి నెత్తురుకారి, రాముడి నుదిటి మీద పడింది. రాముడు లేచి ఇంత నెత్తురు ఎక్కడిదని చూసేసరికి, వక్షస్థలం నుండి నెత్తురు కారుతూ, ఏడుస్తూ నేను కనపడ్డాను. అప్పుడాయన నోటినుండి అప్రయత్నంగా ఒక మాట వచ్చింది.. "ఎవడురా అయిదు తలల పాముతో ఆటలాడినవాడు?" అని గద్దించాడు. దానికి అర్థం, సీతమ్మను పంచముఖ గాయత్రిగా రాముడు అభివర్ణించాడు. అప్పుడాయన చుట్టూ చూసేసరికి, ముక్కున నెత్తురంటిన మాంసం ముక్కతో, కాళ్ళకి నెత్తురుతో, ఒక కాకి కనపడింది.

రాముడు అక్కడ ఉన్న ఒక గడ్డిపోచను తీసి, దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. ఆ బ్రహ్మాస్త్రం కాకిని తరిమింది. ఆ కాకి మూడు లోకములు తిరిగి, అందరి దగ్గరికీ వెళ్ళింది. కానీ, అందరూ రాముడు చంపుతానని అస్త్ర ప్రయోగం చేస్తే, మేము రక్షించలేము. నువ్వు వెళ్ళిపో అని అన్నారు. ఆ కాకి అన్ని చోట్లకీ తిరిగి తిరిగి, రాముడున్న చోటకి వచ్చి, నమస్కారం చేస్తూ పడిపోయింది. రాముడు ఆ కాకిని చూసి, నా దగ్గరికి వచ్చి పడిపోయావు కనుక, నువ్వు నాకు శరణాగతి చేసినట్టే. అందుకు నేను నిన్ను విడిచిపెడుతున్నాను. కానీ, ఒకసారి బ్రహ్మాస్త్రం వేసిన తరువాత, ప్రాణములతో సమానమైనదానిని ఇచ్చేయ్యాలి. మరి నువ్వు ఏమిస్తావు?' అని రాముడు ఆ కాకసురుడిని అడిగాడు. అప్పుడా కాకాసురుడు తన కుడి కన్నును బ్రహ్మాస్త్రానికి ఆహారంగా వేసి, రాముడికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆనాడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన రాముడు, ఇవేళ ఎందుకూరుకున్నాడో ఆలోచించమని, ఒకసారి రాముడికి చెప్పు" అని సీతమ్మ కాకాసుర వృత్తాంతాన్ని హనుమకు చెప్పింది.

సీతమ్మ హనుమంతుడితో కాకాసుర వృత్తాంతాన్ని చెప్పిన తరువాత, "శత్రువులను సంహరించే సమర్ధత కలిగిన ఓ హనుమా! నా వలన చిన్నదో పెద్దదో ఒక పొరపాటు జరిగి ఉంటుంది. మా అత్తగారు కౌసల్యా దేవి, లోకమునంతటినీ రక్షించే కొడుకును కన్నది. ఆ రాముడి పాదాలకు తలవంచి, భక్తిగా నమస్కరించానని చెప్పు. దశరథ మహారాజు మరణించినా కూడా, రాముడు ఆ బాధను పొందలేదంటే, లక్ష్మణుడు పక్కన ఉండడమే అందుకు కారణం. వదినను తల్లిలా చూసే స్వభావం ఉన్నవాడు, లక్ష్మణుడు. లక్ష్మణుడు నాకు కొడుకుతో సమానమైనవాడు. ఆ లక్ష్మణుడిని కుశలం అడిగానని చెప్పు. సుగ్రీవుడినీ కుశలమడిగానని చెప్పు. హనుమా! నువ్వు రాముడి దగ్గర చెప్పే మాటలను బట్టి, రాముడికి నామీద ప్రేమ ఇంకా పెరుగుతుంది. కాబట్టి, నువ్వు రాముడి దగ్గర ఇక్కడ జరిగింది మొత్తం వివరంగా చెప్పి,  రాముడు నన్ను తొందరలో తీసుకువెళ్లేటట్టు చెయ్యి" అని చెప్పింది. అప్పుడు హనుమంతుడు, "అమ్మా! కాకాసుర వృత్తాంతం చెప్పావు. దీనితో పాటుగా, ఇంకొక జ్ఞాపకం ఏదైనా ఇస్తావా? తీసుకువెళతాను! దానిని చూపించి, రాముడికి జరిగింది మొత్తం వివరంగా చెబుతాను" అని అన్నాడు.

అప్పుడు సీతమ్మ తన పవిట కొంగుకు కట్టి ఉన్న మూటను విప్పి, అందులో ఉన్న చూడామణిని ఇచ్చింది. ఈ చూడామణిని వివాహ సమయంలో నా శిరస్సు మీద, మా అమ్మ అలంకరించింది. నువ్వు దీనిని రాముడికి ఇవ్వు. అప్పుడు రాముడికి ఒకే సమయంలో ముగ్గురు జ్ఞాపకానికి వస్తారు. ఒకరు మా అమ్మ, రెండు దశరథుడు, మూడు  నేను. ఇలా రాముడికి ముగ్గురం జ్ఞాపకం వస్తాము" అని అన్నది. హనుమంతుడు ఆ చూడామణిని కన్నులకు అద్దుకుని, రాముడు ఇచ్చిన ఉంగరాన్ని ఎలా భద్రపరుచుకున్నాడో, అలా చూడామణిని కూడా జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. సీతమ్మ ఆభరణం చేతిలో పడగానే ఆయనకు విశేషమైన శక్తీ, ధైర్యం వచ్చాయి. ఆ తరువాత సీతమ్మ హనుమంతుడితో, "హనుమా! నీకు ఇంకొక విషయం చెబుతాను విను. ఒకనాడు నేను రాముడితో కలిసి విహరిస్తున్న సమయంలో, నా నొసటన పెట్టుకున్న తిలకం మరుగునపడింది. అప్పుడు రాముడు అక్కడున్న ఒక కుంకుమ శిలను అరగదీసి, నా బుగ్గమీద చుక్క పెట్టాడు. ఈ విషయాన్ని కూడా రాముడికి జ్ఞాపకం చెయ్యి" అని చెప్పింది సీతమ్మ. రామాయణంలోని ఈ ఘట్టంలో, సీతా దేవి తన శ్రీరాముడి కోసం ఎదురుచూస్తూ పడిన వేదన, ప్రతి సందర్భంలోనూ ప్రస్ఫుటిస్తుంది.

జై శ్రీరామ!

Wednesday, January 3, 2024

భౌతిక జ్ఞానం! భగవద్గీత Bhagavad Gita Chapter 18


భౌతిక జ్ఞానం!
భగవత్ కృపతో పొందవలసిన ‘ఆధ్యాత్మిక జ్ఞానము’ను కొని, అమ్మగలమా?

'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (71 – 74 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 71 నుండి 74 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/PfGzGGEorXI ]


పాపముల నుండి విముక్తి పొంది, పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకాలకు చేరుకోవడానికి మార్గం ఏంటో చూద్దాము..

00:49 - శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః ।
సోఽపి ముక్తః శుభాల్లోకాన్ ప్ర్రాప్నుయాత్ పుణ్యకర్మణామ్ ।। 71 ।।

శ్రద్ధా విశ్వాసముతో, అసూయ లేకుండా, ఈ జ్ఞానాన్ని కేవలం విన్న వారు కూడా పాపముల నుండి విముక్తి పొంది, పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకములకు చేరుకుంటారు.

శ్రీ కృష్ణుడికీ, అర్జునుడికీ మధ్య జరిగిన ఈ సంభాషణను అర్థం చేసుకునే వివేక సామర్థ్యము అందరికీ ఉండకపోవచ్చు. అటువంటి వారు కేవలం శ్రద్ధావిశ్వాసముతో దీనిని కేవలం విన్నా సరే, వారు కూడా లాభపడతారని, శ్రీకృష్ణుడు హామీ ఇస్తున్నాడు. వారిలోనే స్థితమై ఉన్న భగవంతుడు, వారి నిష్కపటమైన ప్రయాస గమనించి, వారిని తగిన రీతిలో సత్కరిస్తాడు. జగద్గురు శంకరాచార్యుల వారి శిష్యుడు, సనందుడి గురించిన ఒక కథ, ఈ విషయాన్ని చక్కగా వివరిస్తుంది. సనందుడు అంతగా చదువు రాని వాడు. గురువు గారి ఉపదేశాన్ని, ఇతర శిష్యులలా అర్థం చేసుకోలేక పోయేవాడు. కానీ, శంకరాచార్యుల వారు ప్రవచనం చెపుతుంటే, అత్యంత శ్రద్ధతో, మరియు గొప్ప విశ్వాసంతో వినేవాడు. ఒక రోజు అతను, గురువు గారి బట్టలను నదికి ఆవలి ఒడ్డున ఉతుకుతున్నాడు. ఉపదేశం చెప్పే సమయం అయింది. ఇతర శిష్యులు గురువుగారిని, ఉపదేశం ప్రారంభించమని అభ్యర్థించారు. శంకరాచార్యులు, ‘కాసేపు ఆగుదాము. సనందుడు ఇక్కడ లేడు.’ అని బదులిచ్చారు. ‘కానీ గురువుగారూ, అతనికేమీ అర్థం కాదు’ అని అభ్యర్థించారు మిగతా శిష్యులు. ‘అది నిజమే; కానీ అతను అత్యంత శ్రద్ధావిశ్వాసంతో వింటాడు. కాబట్టి అతనిని నిరాశ పరచదలుచుకోలేదు’, అన్నారు శంకరాచార్యుల వారు. ఆ తర్వాత శ్రద్ధ యొక్క మహిమను చూపించటానికి శంకరాచార్యుల వారు, ‘సనందా! దయచేసి ఇలా రా.’ అని పిలిచారు. గురువు గారి మాటలు విన్న సనందుడు ఏమాత్రం సంకోచించలేదు. నీటిపైనే పరిగెత్తాడు. ఆయన పాదాలు పెట్టిన చోటల్లా, తామర పూవులు పైకొచ్చి ఆయనకు ఆధారంగా నిలబడ్డాయి. అలా, ఆవలి ఒడ్డుకి వెళ్లి, గురువు గారికి నమస్కరించాడు. అదే సమయంలో, చక్కటి సంస్కృతంలో, ఒక గురు స్తుతి ఆయన నోటినుండి వెలువడింది. మిగతా శిష్యులు దీనిని వింటూ ఆశ్చర్యానికి గురయ్యారు. తామర పూవులు ఆయన పాదాల క్రిందకు వచ్చాయి కాబట్టి, ఆయన పేరు ‘పద్మపాదుడు’ అయింది. అంటే, పాదముల క్రింద తామర పూవులుగలవాడని అర్థం. ఆయన శంకరాచార్యుల వారి నలుగురు ప్రధాన శిష్యులలో ఒకడయ్యాడు. మిగతా వారు - సురేశ్వరాచార్య, హస్తామలక, మరియు త్రోటకాచార్య. ఈ విధంగానే, శ్రద్ధగా ఈ పవిత్ర సంభాషణను కేవలం విన్న వారు కూడా, క్రమక్రమంగా పరిశుద్ధి అవుతారని, ఈ పై శ్లోకములో శ్రీ కృష్ణుడు అర్జునుడికి హామీ ఇస్తున్నాడు.

03:47 - కచ్చిదేతఛ్చ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా ।
కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ ।। 72 ।।

ఓ అర్జునా, నేను చెప్పినది ఏకాగ్రతతో విన్నావా? నీ యొక్క అజ్ఞానము, మోహభ్రాంతి నిర్మూలించబడినవా?

శ్రీ కృష్ణుడు అర్జునుడి గురువు స్థానములో ఉన్నాడు. గురువు గారు సహజంగానే, తన శిష్యుడు విషయాన్నంతా బాగా అర్థం చేసుకున్నాడా లేదా అని అడుగుతాడు. ఇలా అడగటం వెనుక ఉన్న కృష్ణుడి ఉద్దేశ్యం ఏమిటంటే, ఒకవేళ అర్జునుడు గనక అర్థం చేసుకోలేకపోతే, తను మళ్ళీ చెప్పటానికి, లేదా ఇంకా అర్థ వివరణ చేయటానికి సిద్ధంగా ఉన్నానని తెలియచేయటమే. ఆ ఉద్దేశ్యంతోనే, అర్జునుడిని శ్రీ కృష్ణుడడుగుతున్నాడు. నేను చెప్పిన విషయాలను ఏకాగ్రతతో విన్నావా? నీ మనస్సును అలుముకున్న చీకటి తొలగిపోయిందా? అని..

04:44 - అర్జున ఉవాచ ।
నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత ।
స్థితోఽస్మి గతసందేహః కరిష్యే వచనం తవ ।। 73 ।।

అర్జునుడు ఇలా అంటున్నాడు: ఓ అచ్యుతా, నీ కృపచే నా యొక్క మోహభ్రాంతి నిర్మూలించబడినది. నేను జ్ఞానములో స్థితుడనై ఉన్నాను. నాకు ఇప్పుడు సందేహాలు ఏవీ లేవు. నీ ఉపదేశాల ప్రకారం చేస్తాను.

ప్రారంభంలో, అర్జునుడు ఒక విస్మయ పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఆ పరిస్థితిలో తన కర్తవ్యము పట్ల అయోమయానికి గురయ్యాడు. అతనిలో దుఃఖము, శోకముచే నిండిపోయి, ఆయుధాలు విడిచి, తన రథంలో కూలబడిపోయాడు. తన శరీర ఇంద్రియములపై దాడి చేసిన శోకానికి, ఎటువంటి ప్రత్యుపాయం దొరకడంలేదని ఒప్పుకున్నాడు. కానీ, ఇప్పుడు తనకు తానే పూర్తిగా మారిపోయినట్లుగా తెలుసుకున్నాడు. తనకు జ్ఞానోదయమయినదనీ, ఇక ఏమాత్రమూ గందరగోళమైన చిత్తము లేదనీ,  ప్రకటిస్తున్నాడు. భగవత్ సంకల్పానికి తనను తాను అర్పించుకుని, ఇక శ్రీ కృష్ణుడు చెప్పిన విధంగా చేస్తానని ప్రకటిస్తున్నాడు. ఇదే అతనిపై భగవత్ గీత ఉపదేశం చూపిన ప్రభావము. కానీ, త్వత్ ప్రసాదాన్ మయాచ్యుత, అంటున్నాడు. అంటే, ‘ఓ శ్రీ కృష్ణా, కేవలం నీ ఉపదేశం కాదు. నిజానికి నీ కృపయే నా అజ్ఞానమును తొలగించినది.’ అని వక్కాణిస్తున్నాడు. భౌతిక జ్ఞాన సముపార్జనకు, కృప అవసరం లేదు. మనం ఓ విద్యాలయానికి కానీ, ఉపాధ్యాయునికి కానీ డబ్బు కట్టి, ఆ జ్ఞానమును తెలుసుకోవచ్చు. కానీ, ఆధ్యాత్మిక జ్ఞానమును కొనలేము, అమ్మలేము. అది కృప ద్వారా ఇవ్వబడుతుంది, విశ్వాసము, వినమ్రత ద్వారా అందుకోబడుతుంది. కాబట్టి, మనం భగవద్గీతను అహంకార దృక్పథంతో చేరి, నేను చాలా తెలివిగలవాడిని, ఈ ఉపదేశం యొక్క విలువ ఏమిటో వెలకడతానని అనుకుంటే, భగవద్గీతను ఎన్నటికీ అర్థం చేసుకోలేము. అలాంటి దృక్పథంలో ఉంటే, మన బుద్ధి ఆ శాస్త్రములో ఏదో తప్పు అనిపించే దానిని పట్టుకుని, దాని మీదే అలోచించి, దాని వల్ల ఆ మొత్తం శాస్త్రాన్నే తప్పని తిరస్కరిస్తుంది. భగవద్ గీతపై ఎన్నెన్నో వ్యాఖ్యానాలు వ్రాయబడ్డాయి. గత ఐదు వేల సంవత్సరాలలో, ఈ దివ్య ఉపదేశం యొక్క అసంఖ్యాకమైన పాఠకులు కూడా ఉన్నారు. కానీ, వీరిలో ఎంతమందికి అర్జునుడిలా జ్ఞానోదయమయింది? ఒకవేళ మనం నిజంగా ఈ జ్ఞానాన్ని అందుకోదలిస్తే, మనం కేవలం చదవటమే కాదు, విశ్వాసము మరియు ప్రేమయుక్త శరణాగతి ద్వారా, శ్రీ కృష్ణుడి కృపను ఆకర్షించాలి. ఆ తరువాత మనకు భగవత్ గీత యొక్క సారాంశము, ఆయన కృపచే అర్థమవుతుంది.

07:35 - సంజయ ఉవాచ ।
ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః ।
సంవాదమిమమశ్రౌషమ్ అద్భుతం రోమహర్షణమ్ ।। 74 ।।

సంజయుడు ఇలా అంటున్నాడు: ఈ విధంగా నేను, వాసుదేవుని పుత్రుడైన శ్రీ కృష్ణుడికీ, మరియు మహాత్ముడు, ప్రిథ పుత్రుడూ అయిన అర్జునుడికీ మధ్య జరిగిన సంవాదమును విన్నాను. ఇది ఎంత అద్భుతమైనదంటే, నా రోమములు నిక్కబొడుచుకుంటున్నాయి.

ఈ విధంగా సంజయుడు, ధృతరాష్ర్ట మహారాజుకు భగవద్గీత అనే దివ్య ఉపదేశమును విన్నవించుటను ముగిస్తున్నాడు. అర్జునుడిని మహాత్ముడని అంటున్నాడు. ఎందుకంటే, అతను శ్రీ కృష్ణుడి యొక్క ఉపదేశాన్ని, మరియు సలహానూ పాటించాడు. దానిచే మిక్కిలి వివేకవంతుడయినాడు. సంజయుడు ఇక ఇప్పుడు, ఆ దివ్య సంవాదమును వింటూ, తాను ఎంత ఆశ్చర్యానికీ, మరియు సంభ్రమానికీ గురయ్యాడో చెబుతున్నాడు. రోమాలు నిక్కబొడుచు కోవటం అనేది, గాఢమైన భక్తికి ఉన్న ఒక లక్షణం. భక్తిరసామృత సింధు, ఇలా పేర్కొంటున్నది: ‘భక్తి తన్మయత్వంలో వచ్చే ఎనిమిది లక్షణాలు ఏమిటంటే: కదలిక లేకుండా స్థంభించిపోవటం, చెమట పట్టడం, రోమములు నిక్కబొడుచు కోవటం, స్వరం గద్గదమై పోవటం, వణకటం, మొఖం రంగు పీలగా అయిపోవటం, కన్నీరు కారటం, మరియు మూర్ఛ పోవటం.’ సంజయుడు ఇటువంటి గాఢమైన భక్తి యుక్త భావములను అనుభూతి చెందుతున్నాడు. అందుకే ఆయన రోమములు దివ్య ఆనందముచే నిక్కబొడుచుకున్నాయి.

09:13 - ఇక మన తదుపరి వీడియోలో, రాజ్యంలో ఉన్న సంజయుడికి, రణరంగంలో జరుగుతున్న విషయాలను తెలుసుకోగలిగే రహస్య యోగము ఎలా లభ్యమయిందో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, January 1, 2024

Story of Shanta and Rishyasringa (The Man with Horn) | ఋష్యశృంగుడు!


ఋష్యశృంగుడు!
లేడి గర్భంలో జన్మించిన ఋష్యశృంగ మహర్షి ఎవరు?

మన పురాణాలలో వివరించబడ్డ గొప్ప మహర్షులలో ఋష్యశృంగుడు ఒకడు. ఆయన అమోఘమైన విద్వత్తు కలిగినవాడు, మహనీయుడు, పూజనీయుడు. ప్రకృతి ప్రకాశకుడు, ఋష్యశృంగుడు. స్వయంగా శివుని అంశగా పురాణాలు వ్యక్తం చేస్తున్నాయి. రాముని అవతరణకు ఇతోధికంగా సహాయపడిన వాడు. ఆయన గురించి తలుచుకోవడం కూడా మన సుకృతమే.  అటువంటి పావన మూర్తి, ఋష్యశృంగుడు. ఈయన కాలు మోపిన ప్రదేశం, సుభిక్షంగా వర్థిల్లుతుంది. యవ్వనం వచ్చినా, ఆడ మగ తేడా తెలియకుండా, తండ్రి సంరక్షణలో పెరిగిన వాడు, ఋష్యశృంగుడు. ఈయన జననం, యాదృచ్ఛికంగా జరిగింది. ఋష్యశృంగుడు, తలపై కొమ్ముతో జన్మించడానికి గల కారణం ఏంటి? ఋష్యశృంగుడి తల్లి పూర్వాశ్రమ వృత్తాంతం ఏంటి? రోమపాద మహారాజు, ఋష్యశృంగ మహర్షిని ఎందుకు వంచన చేయాల్సి వచ్చింది? దశరథుని కుమార్తె, రాముడి సోదరి అయిన శాంతతో, ఋష్యశృంగ మహర్షి వివాహం ఎలా జరిగింది? అనేటటువంటి ఉత్సుకతను కలిగించే విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/s8PJAlHrf48 ]


కశ్యప ప్రజాపతి కుమారుడైన విభాండకుడనే మహర్షి పుత్రుడే, ఋష్యశృంగ మహర్షి. విభాండకమహర్షి, అస్ఖలిత బ్రహ్మచారి, తపస్సంపన్నుడు. ఒకనాడాయన ఒక సరస్సులో స్నానమాచరించి, సంధ్యావందనం చేస్తున్న సమయంలో, దేవలోక అప్సరస, అపురూప సౌందర్యవతి అయిన ఊర్వశి అటుగా వెళుతూ, ఆయన కంట పడింది. ఆమె సౌందర్యానికి మనస్సు చెలించి, ఆ సరస్సులోనే స్ఖలించాడాయన. అప్పుడే ఆ నదిలో నీళ్లు తాగేందుకు వచ్చిన జింక, నీటితో పాటు, ఆయన విడిచిన వీర్యాన్ని కూడా గ్రహించింది. దాంతో గర్భవతి అయ్యింది. అయితే, ఆ జింక పూర్వాశ్రమంలో, ‘చిత్రరేఖ’ అనే అప్సరస. ఆమె నాట్యానికి వన్యమృగాలు సైతం పరవశించిపోతాయి. అలా ఒక నాడామె దేవేంద్రుని ఎదుట నాట్యం చేస్తోంది. దేవేంద్రుని మనస్సూ, చూపూ ఆమెమీదే నిలిచింది. కానీ, ఆమె మాత్రం అతన్ని చూడకుండా, ఆమె నాట్యాన్ని చూసి పరవశిస్తోన్న లేడిని చూడసాగింది. దాంతో కోపోద్రిక్తుడైన దేవేంద్రుడు, ‘నువ్వు జింకవై, ఒక మానవ పుత్రుడికి జన్మనిచ్చెదవు గాక!’ అని శపించాడు.

అలా ఇంద్రుడి శాపం పొందిన అప్సరసే, ఈ సరస్సులో నీరు తాగిన జింక. తల్లి పోలిక పుణికి పుచ్చుకుని, ఆ జింక కడుపున ఒక శృంగము, అంటే కొమ్మును కలిగి జన్మించిన వాడు, ఋష్యశృంగుడు. దివ్యదృష్టిచేత ఈ వృత్తాంతాన్ని తెలుసుకున్న విభాండకుడు, ఆ బాలుని తన ఆశ్రమానికి తీసుకువచ్చి, ఋష్యశృంగుడని పేరు పెట్టి, అతనికి సకల విద్యలూ, వేదవేదాంగాలూ, యజ్ఞయాగాది క్రతువులూ నేర్పాడు, తానే గురువై. అతనికి తండ్రే దైవం, ఆ ఆశ్రమమే ప్రపంచం. ఇంద్రియ విషయలోలత్వం తెలియనివాడు. కనీసం, స్త్రీ పురుషుల తారతమ్యం కూడా యెరుగనివాడు. జ్ఞాననిష్ఠ, తపస్సంపదతో జ్వలిస్తున్న అగ్ని వంటి తేజస్సుతో, ప్రకాశించేవాడు. అరికాలిలో అదృష్ట రేఖలున్నవాడు. ఆయన ఎక్కడుంటే, అక్కడ ప్రకృతి పరవశిస్తుంది. చక్కగా వర్షాలు పడతాయి. పంటలు పండి, దేశం సుభిక్షంగా వర్ధిల్లుతుంది.  ఇది ఆయనకున్న వరం.

ఇదిలా ఉండగా, దశరథునికి రాములవారు జన్మించక ముందే, ‘శాంత’ అనే కుమార్తె జన్మించింది. కానీ, ఆమెను అంగదేశాధీశుడైన రోమపాదుడనే రాజుకు దత్తతగా ఇచ్చాడు, దశరథుడు. రోమపాదుడు దశరథుని స్నేహితుడు. పైగా, రోమపాదుని భార్య, కౌసల్య సోదరి. దాంతో సంతానం లేక బాధపడుతున్న ఆ దంపతులకు, తన కూతురిని దత్తత ఇచ్చారు వారు. శాంత అంగరాజ్యంలో, అపురూపమైన రాజకుమారిగా పెరగసాగింది. అస్త్ర విద్యలలోనూ, వేద వేదాంగాలలోనూ, అపారమైన నైపుణ్యాన్ని సాధించింది. అద్భుతమైన వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వానికి ధీటైన అందం, ఆమె సొంతం. ఒక రోజు శాంత, రోమపాదునితో కలిసి ఏదో చర్చలో మునిగిపోయి ఉండగా, ఒక బ్రాహ్మణుడు వారి వద్దకు వచ్చాడు. తను వ్యవసాయం చేయదల్చుకున్నాననీ, ఆ వ్యవసాయానికి ఏదైనా సహాయం అందించమనీ, ఆ బ్రాహ్మణుడు రోమపాదుని వేడుకున్నాడు. కానీ, కూతురితో కలసి శాస్త్ర చర్చలలో మునిగిపోయిన రోమపాదుడు, ఆ బ్రాహ్మణుని అభ్యర్థనను ఆలకించ లేదు. తన భక్తునికి జరిగిన అవమానాన్ని, దేవలోకాధిపతి ఇంద్రుడు సహించ లేక పోయాడు. అంగ రాజ్యం కరవుకాటకాలతో దుర్భిక్షంగా మారిపోతుందని శపించాడు.

ఏళ్లు గడుస్తున్నా, తగిన వర్షాలు కురవకపోవడంతో, ఏం చేయాలో అంగ వాసులకు పాలుపోలేదు. రోమపాదుడికి, ఋష్యశృంగుడిని రాజ్యం లోకి రప్పిస్తే, రాజ్యంలో వర్షాలు పడతాయని సలహా ఇచ్చారు, రాజగురువులు. కానీ, అది అంత సులువైన విషయం కాదు. ఋష్యశృంగుడు విషయలోలత్వం తెలియనివాడు. అతన్ని తండ్రి విభాండకుడు, ఆశ్రమం నుండి బయటికి పంపేందుకు ఇష్టపడడు. కాబట్టి, అది అసాధ్యమైన విషయం. దానికి తరుణోపాయం ఆలోచించి, అందమైన స్త్రీలను ఋష్యశృంగుడుండే ఆశ్రమానికి పంపించాడు, రోమపాద మహారాజు. వారు వెళ్ళిన సమయానికి, విభాండక మహర్షి అక్కడ లేడు. అదే మంచి అవకాశమని, వారందరిలోకీ అద్భుత సౌందర్యంతో వెలిగిపోతున్న ఒక విలాసవతి, ఆశ్రమంలో వున్న ఋషి కమారుడి దగ్గరకు వెళ్ళింది. "మునివరా! క్షేమమా? మీకు కావలసిన కందమూలాలు లభ్యమవుతున్నాయా? మీ తపస్సు నిరాఘాటంగా కొనసాగుతోందా? వేదాధ్యయనం సక్రమంగా కొనసాగుతోందా? తండ్రిగారు ఎలా ఉన్నారు?" అని ప్రశ్నలు వేసింది.

అటువంటి సుందరాకారంలో ఉన్న మనిషిని గానీ, అలాంటి మధురస్వరం కానీ, పాపం ఋష్యశృంగుడు అంతకుమునుపెన్నడూ కనలేదు, వినలేదు. మెరుపులా మెరిసిన ఆ సుందరిని చూడగానే, ఋషి కుమారుడి మనస్సులో కలవరం మొదలైంది. అతనికి స్త్రీ పురుష భేదం తెలీదు కనుక, ఆ వచ్చింది మునికుమారుడే అనుకున్నాడు. ఆర్ఝ్యపాద్యాదులు ఇచ్చి, "మీ ఆశ్రమం ఎక్కడ? మీ వ్రత నియమాలేమిటి?" అని అడిగాడు. "మా ఆశ్రమం ఇక్కడికి మూడామడల దూరంలో వున్నది" అంటూ ఆమె తెచ్చిన భక్ష్యాలూ, పండ్లూ స్వయంగా తినిపించింది. సువాసనలు వెదజల్లే పూలహారాలు మెడలో వేసింది. అలా కొంతసేపు గడిపి, విభాండక మహాముని వచ్చేవేళకు, "అగ్నిహోత్రానికి వేళ అయింది" అని సాకు చెప్పి, తప్పించుకున్నది.

విభాండకుడు వచ్చేసరికి, ఆశ్రమం అంతా చెల్లాచెదురుగా వుంది. పూలూ, పండ్లతొనలూ, చిందర వందరగా పడి ఉన్నాయి. ఇదంతా పరికించి, "అబ్బాయీ! నేను లేని సమయంలో నీ దగ్గరకెవరైనా వచ్చారా? ఎందుకలా అన్యమనస్కంగా కనిపిస్తున్నావు?" అని అడిగాడు. "నాన్నగారూ! మీరు లేని సమయంలో, అద్భుతరూపంలో వున్న ఒక మహనీయుడు ఇక్కడకు వచ్చాడు. ఆ మాట, ఆ ఆకారం, నా మనస్సున నాటుకుపోయాయి. ఆ మూర్తిని చూడకుండా ఉండలేను. అతడితో స్నేహం చేయాలని ఉంది" అని చెప్పడు. విభాండకుడికి విషయం తెలిసిపోయింది. తమ తపస్సును భంగం చెయ్యడానికి ఎవరో రాక్షసులు వచ్చారనుకుని, "నేను లేనప్పుడు ఎవ్వరినీ ఆశ్రమానికి రానివ్వకు!" అని గట్టిగా చెప్పాడు.

ఒకనాడు మళ్ళీ విభాండకుడు లేని సమయం చూసి, ఆ సుందరి మెల్లగా ఋష్యశృంగుడిని సమీపించింది. ఆమెను చూడగానే, భరింపరాని మోహంతో, ఋషికుమారుడు ఆమె దగ్గరకు పరుగెత్తాడు. ఆ జవ్వని, మాటలతో ఋష్యశృంగుడిని మైమరపిస్తూ, మెల్లగా అడవి దాటించి, తన సఖులను కలిసింది. వారంతా కలిసి ఋష్యశృంగుడిని అంగదేశానికి తీసుకుపోయారు. ఋష్యశృంగుడు అంగదేశంలో ఆడుగు పెట్టగానే, వానలు కురిశాయి. ప్రాణికోటి సేదతీరింది. నేల పచ్చబారింది. రోమపాదుడు సంతోషించి, తన కమార్తె శాంతను ఋష్యశృంగుడికిచ్చి పెళ్ళి చేశాడు. అన్నీ అనుకున్న ప్రకారం నెరవేరినప్పటికీ, విభాండక మహాముని ఆగ్రహిస్తాడని భయపడ్డాడు రాజు. అందుకని, మునిని శాంతపరచటం కోసం, రాజధానికి వచ్చే మార్గాలలో చక్కని కర్రి ఆవులనూ, ఎద్దులనూ నిలిపి, పరిజనాన్ని కాపు ఉంచాడు."

ఈ ఆవులూ, ఎడ్లూ, మేకలూ, భూములూ, మీ కుమారుడివి. మేము మీ సేవకులము" అని వినయంగా మాట్లాడమని, భటులను హెచ్చరించాడు. అనుకున్నట్టు కొడుకును వెతుక్కుంటూ, మహాముని రానే వచ్చాడు. రాజాజ్ఞ ప్రకారం, పరిచారకులు మునీంద్రునికి స్వాగతం పలికి, చేయవలసిన సపర్యలన్నీ చేశారు. కోపం చాలా వరకూ చల్లార్చి, ఆయనను పట్టణంలో ప్రవేశ పెట్టారు. రాజాంతఃపురంలో సకల ఐశ్వర్యాలు అనుభవిస్తూన్న కొడుకునూ, పక్కనే వినయంగా తలవంచుకుని నిలబడ్డ కోడలినీ చూసిన విభాండక మునికి, ఆనందం కలిగింది. "నాయనా ఋష్యశృంగా! ఈ రాజుకు ప్రియమైనదంతా చెయ్యి. ఒక కుమారుడు కలిగిన తరువాత, మీరు అరణ్యాలకు రావచ్చు" అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. తండ్రి ఆనతి ప్రకారం ఋష్యశృంగుడు సంతానవంతుడై, ఆ వెనుక వానప్రస్థాన్ని స్వీకరించాడు. ఒకరకంగా రాములవారు అవతారం దాల్చేందుకు కూడా, శాంతే కారణం. ఎందుకంటే, అంగరాజ్యంలో నివాసాన్ని ఏర్పరచుకున్న సమయంలోనే, రుష్యశృంగుడు దశరథుని చేత పుత్రకామేష్టియాగాన్ని చేయించాడు. ఆ యాగ ఫలంగానే, రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులు జన్మించారు. ఋష్యశృంగుడి వృత్తాంతాన్ని, రామాయణం లోని బాల కాండంలో, దశరథుని మంత్రి అయిన సుమంతుడు వివరించాడు.

జై శ్రీరామ!

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...