Rama an Ordinary Human Being or God? Legend, History & Religion | రాముడు దేవుడా?


రాముడు దేవుడా?
శతృత్వం ఎంతటిదైనా, అది చావుతో ముగిసిపోతుంది! 

శ్రీరాముడి జీవితాన్ని చూస్తే, ఎన్నెన్నో సమస్యల సుడిగుండాలలో ఆయన ఈదినట్లు తెలుస్తుంది. ఆయన జీవితమంతా సమస్యలతోనే సాగింది. మొదట పినతల్లి కారణంగా, పితృవాక్య పరిపాలనను అనుసరించి ఆయన తన రాజ్యాన్ని వదులుకోవలసి వచ్చింది. అడవుల పాలైన శ్రీరాముడి చెంత ఉన్న భార్య సీతమ్మను, రావణుడు అపహరించుకుపోయాడు. ఆమె కోసం ఆయన అంతటా గాలించి, ఆమె జాడను కనుగొని, తనకు ఇష్టం లేకపోయినా యుద్ధం చేశాడు. అలా సీతమ్మను తీసుకుని రాజ్యానికి వెళితే, అక్కడ సీతమ్మను గురించి అపవాదులు వినాల్సి వచ్చింది. ఈ దశలో గర్భవతిగా ఉన్న సీతమ్మను తిరిగి అడవుల పాలు చేయాల్సివచ్చింది. ఆ తర్వాత తన కొడుకులతోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి. ఆ భీకర యుద్ధ సమయంలో సీత రణస్థలికి రావడం, పుత్రులను రామునికి అప్పగించి, భూమాత ఒడిలోకి చేరడం, ఇలా రాముడి జీవితం చూసుకుంటే ముళ్లబాటే. ఐనప్పటికీ భారతదేశంలో కోట్లాదిమంది రాముడినే ఎందుకు కొలుస్తారు? ఆయననే ఆదర్శంగా ఎందుకు తీసుకుంటారు? శ్రీరాముని గొప్పదనం గురించిన వివరాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/8iPA9Kys0Ec ]


రాముడు మాయలూ, మంత్రాలూ చూపించలేదు. శ్రీకృష్ణుడిలా విశ్వరూపం ప్రకటించలేదు. జీవితంలో ఎన్నెన్నో కష్టాలు, జరగరాని సంఘటనలు.. చిన్న వయస్సులోనే పినతల్లి స్వార్థానికి తండ్రికి దూరమై, ఆయనను పోగొట్టుకున్నాడు. పట్టాభిషేక ముహూర్తానికే అడవులపాలయ్యాడు. అరణ్యవాసంలో తోడుగా, ఊరటగా నిలుస్తుందనుకున్న భార్యకు దూరమయ్యాడు. కారడవులలో బాధాతప్త హృదయంతో వెతికాడు. అంతులేని దుఃఖాన్ని గుండెల్లో మోస్తూనే, రాక్షస వధ గావించాడు. అందరిలాగే ఉద్వేగాలు, ఆలోచనలు, ఆవేదనలు అనుభవించాడు. లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా, తాను మాత్రం విస్పష్టంగా 'అహం దశరథాత్మజః' అంటే, దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే అని ప్రకటించాడు. అయినా లోకమంతా ఆయననే ఎందుకు ఆదర్శంగా తీసుకుంది?

ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించినవాడు రాముడు. ధర్మానికి రూపునిస్తే, రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. చేతికి అందివచ్చిన సింహాసనాన్ని వదులుకుని, స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ.. ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే రామచంద్రుడు ధర్మమూర్తి అయ్యాడు. ఆ యుగపురుషుడిగానే కాక, సకల జగత్తుకూ ఒకేఒక్కడుగా నిలిచాడు.

1. శాస్త్ర ధర్మ పాలన..

తండ్రి మాట కోసం, సీత, లక్ష్మణులతో కలిసి వనవాసానికి బయలుదేరాడు రాముడు. అయోధ్యలో పుత్రవియోగ దుఃఖంతో దశరథుడు మరణించాడు. మేనమామ ఇంట్లో ఉన్న భరతుడు వచ్చి, దశరథుడికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. అన్నను వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్లి, తండ్రి మరణవార్త తెలియజేశాడు. అది విని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు రామయ్య. 'పెద్దకుమారుడినైవుండీ తండ్రికి ఉత్తరక్రియలు చెయ్యలేకపోయాన'ని బాధపడ్డాడు. అక్కడికక్కడే శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి ఉత్తరక్రియలు చేసి, పిండితో పిండాలు చేసి, దర్భల మీద ఉంచబోయాడు. ఇంతలో బంగారు కంకణాలు ధరించిన ఓ హస్తం రాముడి ముందుకు వచ్చి, తాను దశరథుడిననీ, పిండం తన చేతిలో పెట్టమనీ వాణి వినిపించింది. కానీ, రాముడు అందుకు ఒప్పుకోలేదు. శాస్త్రప్రమాణాలను అనుసరించి, దర్భల మీదే పిండాలు ఉంచాడు. నిజంగా మీరు నా తండ్రే అయితే, దర్భల మీద ఉంచిన పిండాలను స్వీకరించండి. నేను శాస్త్ర ప్రమాణాన్నే పాటిస్తానని నిక్కచ్చిగా చెప్పాడు. తండ్రి వియోగ దుఃఖంలో ఉన్న సమయంలో కూడా, శాస్త్ర ధర్మాన్ని తు.చ తప్పకుండా పాటించిన ఆదర్శమూర్తి రామచంద్రుడొక్కడే.

2. స్నేహ ధర్మ పాలన..

సీతమ్మ మాయలేడిని కొరినప్పుడు, ఆమెను వదలి, పర్ణశాలను దాటి, చాలా దూరం వెళ్ళారు రామలక్ష్మణులు. అదే అదనుగా, రావణుడు మారు వేషంలో వెళ్ళి సీతమ్మను అపహరించాడు. అదంతా గమనించిన జటాయువు రావణుడిని అడ్డగించే ప్రయత్నంలో, రావణుడిని ముప్పుతిప్పలు పెట్టాడు. సహనం నశించిన రావణాసురుడు జటాయువు రెక్కలు నరికివేశాడు. రెక్కలు తెగిన పక్షిరాజు  నేలకూలాడు. కొన్నాళ్లకు సీతాన్వేషణ చేస్తూ అటుగా వచ్చిన రాముడికి జరిగిన వృత్తాంతం చెప్పి, రాముడి చేతిలోనే ప్రాణాలు విడిచాడు. తన క్షేమం కోసం ప్రాణత్యాగం చేసిన జటాయువును ఆప్తమిత్రుడిగా స్వీకరించి, అతడికి ఉత్తరక్రియలు స్వయంగా నిర్వహించాడు రామచంద్రుడు. తాను క్షత్రియుడు. చేస్తున్నది వనవాసం. మరణించింది పక్షి. అయినప్పటికీ జటాయువుకు తాను స్వయంగా ఉత్తరక్రియలు చేసి, స్నేహధర్మానికి అసలైన అర్థాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించాడా స్నేహశీలి.

3. యుద్ధ ధర్మ పాలన..

వాలి తన తమ్ముడైన సుగ్రీవుడి భార్య రుమను చెరబట్టాడు. తమ్ముడి భార్య కోడలితో సమానం. మామగారు తండ్రితో సమానం. తండ్రిలాగా కాపాడవలసిన తమ్ముడి భార్యను, వాలి కామంతో కోరుకున్నాడు. అంతేకాదు.. వాలి వనచరుడు. క్రూరత్వం కలిగిన వనచరాలను వేటాడటం క్షత్రియ ధర్మం. అంతేకాకుండా, ఎదుటివారి బలాన్ని తగ్గించే వరమాల వాలి మెడలో ఉంది. దానిని ధరించిన సమయంలో, వాలి ఎదుట ఎవరు నిలిచినా, వారి శక్తి క్షీణిస్తుంది. కాబట్టే రాముడు చెట్టుచాటున దాగి, వాలిపై బాణాన్ని ప్రయోగించాడు. ఇది యుద్ధ ధర్మం. వాలి వధ ఘట్టంలో రాముడు క్షత్రియ, యుద్ధ ధర్మాలను పాటించాడు.

రావణ సంహారం తర్వాత విభీషణుడు రాముని వద్దకు వచ్చి, ఉత్తర క్రియలు నిర్వహించేందుకు అన్నగారి పార్థివ దేహాన్ని ఇమ్మని అడిగాడు. అప్పుడు రాముడు..
మరణాంతాని వైరాని నివృత్తం నః ప్రయోజనం |
క్రియతామద్య సంస్కారః మమాప్యేష యథా తవ ||
'విభీషణా! శతృత్వం ఎంతటిదైనా, అది చావుతో ముగిసిపోతుంది. సంధి కుదరక పోవడం వల్లనే, యుద్ధం చేయాల్సి వచ్చింది. మీ అన్నగారికి, ఆచార విధి ప్రకారం ఉత్తర క్రియలు జరిపించు. ఇక నుంచి ఈయన నీకు మాత్రమే కాదు. నాకూ అన్నగారే’ అని అన్నాడు. ఇదీ రాముడి ధర్మవర్తనం..

4. దయా ధర్మ పాలన..

సీతను రాముడికి అప్పగించమని హితబోధ చేసిన విభీషణుడికి, రాజ్యబహిష్కరణ శిక్ష వేశాడు, రావణుడు. సముద్ర తీరంలో, అపారమైన వానర సేనతో ఉన్న రామచంద్రుడి పాదాలను ఆశ్రయించాడు, విభీషణుడు. మరో ఆలోచన లేకుండా, విభీషణుడికి అభయం ఇచ్చాడు రామయ్య. అంతేకాదు, రావణుడిని చంపి, విభీషణుడిని లంకా రాజ్యానికి రాజును చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కానీ, సుగ్రీవుడు, మొదలైన వారికి, ఇదంతా ఇష్టం లేదు. ఏకాంతంలో ఉన్న రామయ్య దగ్గరకు వెళ్లి, విభీషణుడిని నమ్మవద్దని చెప్పారు. అతడు రావణాసురుడి దూత అని హెచ్చరించారు. అంతా విన్న రాముడు, విభీషణుడే కాదు. చివరకు రావణుడే తనను ఆశ్రయించినా, అతడికి కూడా అభయం ఇస్తానన్నాడు. ఆశ్రయించిన ప్రాణులకు రక్షణ కల్పించటం, క్షత్రియ ధర్మం, దయా ధర్మం. వనవాసంలో ఉన్నా, చివరకు యుద్ధ భూమిలో ఉన్నా, దయా ధర్మాన్ని విడిచి పెట్టలేదు రాముడు.

5. మనుష్య ధర్మ పాలన..

రామరావణ సంగ్రామం ముగిసింది. రావణుడు నేలకొరిగాడు. ముల్లోకాలూ ఆనందించాయి. వానరసేన చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇంతలో బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమయ్యారు. రాముడిని సాక్షాత్తు శ్రీమహావిష్ణు స్వరూపంగా స్తుతించారు. ‘నీది విష్ణు అంశ. వాస్తవానికి నువ్వు నిరాకారుడివి. అయినా, సాకారుడిగా ఉన్నావు. సృష్టి, స్థితి, లయలు నీవే నిర్వహిస్తావు’ అంటూ రాముడికి దైవత్వాన్ని ఆపాదించారు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి చెప్పినా, రాముడు తాను దైవాన్నని చెప్పుకోలేదు. తనకు దైవత్వాన్ని ఆపాదించుకోలేదు. ‘ఆత్మానం మానుషం మన్యే... దశరథాత్మజః’ అంటూ, తాను కేవలం దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే, సాధారణ మనుజుడిని మాత్రమే’ అని అన్నాడు. ఇదీ రామయ్య పాటించిన మనుష్య ధర్మం. రామయ్య ఎక్కడా మాయలు, మంత్రాలు ప్రకటించలేదు. తాను దైవాన్నని ఎన్నడూ చెప్పుకోలేదు. సాధారణ మనిషిలాగే, రాజ్య భోగాలతో పాటు, సుఖ దుఃఖాలూ అనుభవించాడు. మనుష్య ధర్మాన్ని పరిపూర్ణంగా పాటించిన యుగపురుషుడు రామచంద్రుడు.

6. సోదర ధర్మ పాలన..

రావణ వధ అనంతరం, లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావలసిందిగా విభీషణుడుకి వర్తమానం పంపించి, విశ్రాంతిగా కూర్చున్నాడు రాముడు. దూరంగా ఓ స్త్రీమూర్తి వడివడిగా అడుగులు వేసుకుంటూ, తన వైపే వస్తోంది. ఆమె ఎవరై ఉంటుందని రాముడు ఆలోచిస్తుండగా, ఆమె  ఎదురుగా వచ్చి నిలుచుంది. అమ్మా! ఎవరు నువ్వు? ఎందుకిలా వచ్చావు? రక్తసిక్తమైన రణభూమిని చూస్తుంటే, నీకు భయం అనిపించటం లేదా? నా వల్ల ఏదైనా సహాయం కావాలా? అంటూ రాముడు ఎంతో వినమ్రంగా ఆమెను అడిగాడు. అందుకామె సమాధానం ఇస్తూ, రామచంద్ర ప్రభూ! నన్ను మండోదరి అంటారు. నీ చేతిలో మరణించిన రావణాసురుడి భార్యను. రామా! నీవు ధర్మమూర్తివనీ, ఏకపత్నీవ్రతుడవనీ.. సీతను తప్ప మరే ఇతర స్త్రీ పేరు కూడా తలవవనీ విన్నాను. నా భర్త అనేకమంది స్త్రీలను చెరపట్టాడు. నీవంటి ఉత్తమ గుణసంపన్నుడైన యోధుడిని దర్శించుకోవాలనే కుతూహలంతో వచ్చాను. పరస్త్రీని చూడగానే వినమ్రంగా ఉన్నప్పుడే, నీ ఔన్నత్యం అర్థమైంది. రామచంద్రా! నీ దర్శన భాగ్యంతో ధన్యురాలనయ్యాను. ఇక సెలవు. అంటూ నిష్క్రమించింది. ఇదీ, పర స్త్రీలపై ఆ రామచంద్రుడు చూపించే సోదర ధర్మం.

పవిత్ర జీవితం కోసం, ముక్తి కోసం సాధన చేసే యోగులు, రామునిలా జీవించాలని అనుకుంటారు. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా మారొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. నిరీక్షించి, కాల పరీక్షను ఎదుర్కోవడమే వివేకవంతుల లక్షణం. రామయ్యా అదే చేశాడు. ఎప్పుడూ ప్రణాళికా బద్ధంగానే జీవితం నడుస్తుందని భావించలేము. మన ప్రమేయం లేకుండా, చికాకులు కలుగుతాయి. వాటికి క్రుంగిపోతే, జీవితం గతి తప్పుతుంది. గుచ్చుకున్న ముల్లును నెమ్మదిగా తొలగించి, ముందుకెళ్లాలి. అలా చేయగలిగితే, అద్భుతమైన అనుభూతి మిగులుతుంది. ఏ విషయాన్నైనా, సక్రమంగా నిర్వర్తించే సామర్ధ్యం పెరుగుతుంది. రాముడిని ఆదర్శంగా తీసుకోవడం అనేది, ఆరాధన కోసం కాదు. మన జీవితాలను మనమే ఉద్ధరించుకోవాలన్నది, అందులోని పరమార్థం. త్యాగం, ధర్మం, దయ, పరాక్రమం, రామునిలోని గొప్ప లక్షణాలు. వీటిని పెంపొందించుకోవాలని చెప్పేదే రామాయణం.

జై శ్రీరామ!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

ప్రతి హిందువూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర! New Year History

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess