Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Monday, March 25, 2024

రంగుల కేళి హోళీ విశిష్ఠత! Holi Festival 2024


మిత్రులూ, శ్రేయోభిలాషులందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు 💐 TELUGU VOICE

రంగుల కేళి హోళీ విశిష్ఠత! - https://youtu.be/X7RDDA-ApRw



Satyameva Jayate | సత్యమేవ జయతే! - ఒక మంచి కథ..


సత్యమేవ జయతే! - ఒక మంచి కథ.. TELUGU VOICE
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మరణానికి సిద్ధపడిన నంద ఎవరు?

మన పురాణాలు సన్మార్గ బోధకాలు. వీటిలో మనకు ఎన్నెన్నో మంచి కథలు కనిపిస్తాయి. ఒక కథకు మంచి కథ అనిపించుకోవడానికి, కచ్చితమైన లక్షణాలంటూ ఏమీ ఉండవు. ఎందుకంటే, ఏవి మంచి కథకు ఉండకూడని లక్షణాలని అనుకుంటామో, ఆ లక్షణాలతోటే మంచి కథ అనిపించుకునేవీ వస్తూనే ఉంటాయి. అలాగే, మంచి కథ లక్షణాలని మనం అనుకునేవన్నీ పొదుగుకునీ, నిరుత్సాహపరిచే కథలూ ఉంటాయి. మంచి కథ మొదలయ్యాక, ఏదో ఒక క్షణంలో పాఠకుణ్ణి ట్యూన్ చేసుకుని, తనలో లీనం చేసుకుంటుంది. అందుకు పాఠకుడి నేపద్యమూ, అనుభవాలు కూడా, అన్నిసార్లూ కారణం కాకపోవచ్చు. కథను అనుసరించే సమయంలో, మన మానసిక స్థితిగతులే అందుకు కారణం కావచ్చు. చిట్టచివరికి అది పాఠకుడు, లేక వీక్షకుడిపై కలిగించే స్పందనా, ప్రభావమే గీటురాళ్లు. అందరికీ సన్మార్గాన్ని బోధించే వ్యాస విరచిత అష్టాదశపురాణాలలో ఒకటైన ‘పద్మపురాణం’ లోని అటువంటి ఒక కథను ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. ఇదే కథను కొంత రూపాంతరంతో, పంచతంత్ర కథలలో కూడా మనం చూడవచ్చు. ఇక కథలోకి వెళితే..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/9omJY5UQwQ4 ]


పూర్వం సరస్వతీ నదీ తీరాన విస్తరించి ఉన్న రాజ్యాన్ని, ప్రభంజనుడనే రాజు పరిపాలిస్తూవున్నాడు. ఒక రోజు ఆయన వేట నిమిత్తం అరణ్యానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఒక లేడి తన పిల్లకు పాలిస్తూ ఉండటం, ఆయన చూశాడు. వెంటనే ప్రభంజనుడు ఆ లేడి మీద బాణ ప్రయోగం చేశాడు. మరణించే ముందు ఆ లేడి, “బాణ ప్రయోగం చేసిన రాజు పులిగా మారిపోవాలి!” అని శపించింది. ఆ శాపం తక్షణమే ఫలించి, రాజు పులి అయిపోయాడు. పులిగా మారిన రాజు తన అపరాధాన్ని మన్నించమని, ఆ లేడిని వేడుకున్నాడు. “నువ్వు నూరు సంవత్సరాలు పులిగా జీవిస్తూ, శాపాన్ని అనుభవిస్తావు. ఆ తరువాత నంద అనే గోవు కారణంగా, నీకు శాప విమోచనం కలుగుతుంది” అని చెప్పి, లేడి ప్రాణం విడిచింది.

పులిగా మారిన రాజు ప్రభంజనుడు, గతాన్ని పూర్తిగా మరచిపోయి, పులి సహజ నైజాన్ని సంతరించుకుని, ఆ అరణ్యంలో జీవించసాగాడు. తక్కిన జంతువులను చంపి ఆకలిని తీర్చుకుంటూ, కాలం వెళ్ళబుచ్చసాగాడు. ఇలా అనేక సంవత్సరాలు గడిచాయి. ఒకానొక రోజు ఆ పులి జీవిస్తూన్న అరణ్యానికి, పచ్చిక మేయడానికి ఒక ఆవులమంద వచ్చింది. అరణ్యంలో రోజంతా మేసిన గోవులు, సాయంత్రం తమ ఊరికి తిరిగి వెళ్ళ నారంభించాయి. ఆ మందలో నంద అనే గోవు కాస్త వెనుకబడింది. అదే సమయంలో వర్షం కురవడం ప్రారంభించడంతో, తక్కిన గోవులు నంద వెనుకబడటం గమనించక, తమ దారిన తాము వెళ్ళిపోయాయి. వాన కారణంగా ఒక చెట్టు క్రింద ఒదిగి ఉన్న నంద, తన స్థితిని గ్రహించుకుని, వేగంగా తమ ఊరికేసి పరుగెత్తసాగింది. అదే సమయంలో పులి తన పిల్లలకు మాంసం వెదుకుతూ, అటువైపు వచ్చింది. నందని గమనించగానే, మంచి మాంసాహారం లభిసోందని భావిస్తూ ఆ పులి, గోవును అడ్డగించింది. నంద మీదికి పంజా విసరడానికి సంసిద్ధమైంది.

నంద తన ప్రాణం గురించి దిగులు చెందలేదు. కానీ, గోకులంలో తన రాకకై ఆతృతగా ఎదురు చూసే తన దూడను తలచుకుని, దాని మనస్సు విలవిలలాడిపోయింది. తనను చంపబోతున్న పులితో, “అయ్యా, నా దూడ ఇప్పుడు గోకులంలో ఆకలితో అలమటిస్తూ ఉంటుంది. దానికి పాలివ్వడానికే నేను వేగంగా పోతున్నాను. నేను వెళ్ళి నా దూడకు పాలిచ్చి, దానిని నా గోనేస్తాలకు అప్పగించి తిరిగి వస్తాను. అప్పుడు మీ అభీష్టం ప్రకారం, నన్ను ఆహారంగా చేసుకోండి. నా దూడను చివరిసారిగా చూడాలనీ, దానికి నాలుగు హితవచనాలు చెప్పిరావాలనీ ఆశిస్తున్నాను. ప్రస్తుతం నా పట్ల కరుణ వహించి, నా దూడను చూసిరావడానికి అనుమతి ఇవ్వండి” అని వినయంగా వేడుకున్నది.

నంద వేడుకోలును మన్నించడానికి, పులి సిద్ధంగా లేదు. “ఇప్పుడు నిన్ను వెళ్ళడానికి అనుమతిస్తే, నువ్వు తిరిగి వస్తావని హామీ ఏమిటి? నేడు నువ్వు నాకు ఆహారం కావడం, విధి నిర్ణయం. నిన్ను నేనిప్పుడు చంపవలసిందే!” అని అన్నది. ఆ మాటలు విని నంద, “నేను మాట తప్పను. నన్ను నమ్మండి” అంటూ తాను కనుక మాట తప్పితే, ఫలానా ఫలానా పాపాలకు ఒడిగట్టిన దాన్నవుతానని, కొన్ని ఘోరపాపకృత్యాలను పేర్కొని, వాటిపై శపథం చేసింది.

సామాన్యంగా మనుషుల స్థితి వేరు. బహుశా పులిగా ఉన్నందున, నంద చెప్పినది విన్న ప్రభంజనుడి మనస్సు కరిగిందేమో. “సరే, నువ్వు చెబుతున్నది నమ్ముతున్నాను. కానీ, వెంటనే నీ దూడను చూసి తిరిగి వచ్చేయాలి! దానితోపాటు మరో విషయం కూడా గుర్తుంచుకో: ప్రాణం కాపాడుకోవడానికి అబద్ధమాడినా తప్పులేదని చెప్పి, పలువురు నీ మనస్సు మార్చాలని ప్రయత్నిస్తారు. వారి మాటలు పట్టించుకోకుండా, చేసిన వాగ్దానం ప్రకారం ఇక్కడకు వచ్చేయాలి” అని అన్నది పులి. “నేను ఎన్నటికీ మిమ్మల్ని వంచించను. ఇతరులను వంచించే వాడు, ఆత్మవంచన చేసుకున్న వాడే అవుతాడు” అని నంద జవాబు చెప్పి, పులి అనుమతితో గోకులానికి బయలుదేరింది.

అక్కడ గోకులంలో నంద కనిపించకపోవడంతో, దూడ ఆందోళనతో తల్లడిల్లిపోతున్నది. తల్లిని చూడగానే, ఆనందోత్సాహాలతో గంతులు వేసి, పాలు త్రాగనారంభించింది. కానీ, అలవాటు ప్రకారం ఆప్యాయంగా నాలుకతో తనను తడిమే తల్లి, ఆ నాడు శోకమయంగా ఉండటం చూసి, దూడ ఉత్సాహం నీరుగారింది. అది ఆతృతగా, “అమ్మా. ఎందుకు దిగులుగా ఉన్నావు? కారణం ఏమిటో నాకు చెప్పకూడదా?” అని నందను అడిగింది.

నంద కారణాన్ని వివరించింది. అది వినగానే దూడ రోదించింది. “అమ్మా! నేనూ నీతోనే వచ్చి, ఆ పులికి ఆహారమైపోతాను” అన్నది కృత నిశ్చయంతో. ఆ మాట వినగానే నంద మనస్సు చివుక్కుమన్నది. తనను తాను సంభాళించుకుని, మనస్సును దృఢ పరచుకుని, ప్రేమ ఉట్టిపడే స్వరంలో, బిడ్డకు హితోక్తులు చెప్పింది. తను లేని స్థితిలో దూడ తనను తాను ఎలా రక్షించుకోవాలో, ఎలా జీవించాలో, ఇతరులతో ఎలా మసలుకోవాలో వివరించి చెప్పి, దూడ మనస్సును సాంత్వన పరచింది. తరువాత నంద తన దూడను, తన తల్లి వద్దకు, నేస్తాల వద్దకు తోడ్కొని పోయింది. వారికి దూడను అప్పగించి, తను అరణ్యానికి వెళ్ళవలసిన అగత్యాన్ని తెలిపింది.
పులి భావించినట్లే, నంద తల్లీ, నేస్తాలూ ఇలా చెప్పాయి: “ప్రాణ రక్షణకై అబద్ధం చెప్పినప్పటికీ, అది సత్యమే అవుతుంది; ప్రాణం కోల్పోయేట్లు చేసే సత్యం, అబద్ధమే అవుతుంది” అని లోకం చాటి చెప్పే పలు న్యాయాలను, నందకు నొక్కివక్కాణించారు. “పులికి నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని భంగం చెయడంలో తప్పులేదు” అని నంద మీద, దాని దూడ మీద ఉన్న ప్రేమాభిమానాల కారణంగా వేడుకున్నాయి.

కానీ, తన తల్లీ, నేస్తాలూ నొక్కిచెప్పిన కార్యకారణాలనూ, న్యాయాలనూ నంద అంగీకరించలేదు. అది వాటితో ఇలా చెప్పింది: “ఇతరులను రక్షించడానికైతే అబద్ధం చెప్పవచ్చు. నా ప్రాణ రక్షణకోసం నేను ససేమిరా అబద్ధం ఆడను. ఎవరు చేసిన పాప పుణ్యాల ఫలితాన్ని, వారే అనుభవించి తీరాలి. స్వర్గం, మోక్షం, ధర్మం, అన్నీ మన వాక్కులను బట్టే ఉంటాయి. ఎవడు సత్యం పలుకడం విడనాడతాడో, అతడు మంగళకరమైన హితాలనన్నీ కోల్పోతాడు. మనస్సులో ఒకటి ఉంచుకుని, బైటకు మరో విధంగా మాట్లాడే వాడు, తన ఆత్మనే తస్కరించే దొంగ అవుతాడు.”

నంద దృఢనిశ్చయాన్ని ఎవరూ మార్చలేకపోయారు. తరువాత అది అందరి వద్దా సెలవు పుచ్చుకుని, అరణ్యంలోని పులి వద్దకు వెళ్ళింది. పులితో నంద, “నా కర్తవ్యాలను పూర్తి చేసుకున్నాను. ఇక మీరు నన్ను నిరాక్షేపణీయంగా ఆహారంగా చేసుకోవచ్చు” అన్నది నిర్లిప్తంగా. అదే సమయంలో దూడ కూడా అతివేగంగా అక్కడకు వచ్చి చేరింది. అది తన తల్లి ముందు నిలబడి, “నా తల్లిని చంపడంతో పాటు నన్నూ చంపి, మీ ఆకలి తీర్చుకోండి” అని పులి వైపు చూస్తూ చెప్పింది. నంద శిక్షణలో పెరిగిన ఆ దూడ, తల్లి సుగుణాలనన్నీ పుణికిపుచ్చుకున్నది.

తన ముందు జరుగుతున్నదంతా చూసిన పులికి, అది కలా నిజమా అనే అనుమానం కలిగింది. ఆడిన మాటను సునాయాసంగా తప్పేవారు ఉండే ఈ లోకంలో, ప్రాణాన్ని ఖాతరు చేయక, ఆడిన మాటను నిలబెట్టుకునే నంద వంటి వారు ఉండటం, పులికి ఆశ్చర్యంతో పాటు, ఆనందం కూడా కలిగించింది.

పులికి తన పిల్లలు గుర్తుకు వచ్చారు. అదీ ఒక తల్లే కదా! “నేను చనిపోతే నా పిల్లలు ఎంత కష్టపడతాయో! అదే విధంగా ఈ గోవు మరణిస్తే, దాని దూడ కష్టపడుతుంది!” అనే ఆలోచన తలెత్తగానే, పులి మనస్సు ద్రవించింది. అంతేకాక తన దూడనూ బంధుగణాన్నీ విడిచి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన గోవు నంద నిజాయితీ, పులి మనస్సును పూర్తిగా మార్చి వేసింది. “నిన్ను చంపాలనే ఉద్దేశాన్ని మార్చుకున్నాను. సత్యమనే నీలో ఉన్న మహోన్నత సుగుణం, నన్ను జయించి వేసింది. నీ సత్యమే ఇప్పుడు నిన్ను రక్షించింది. ఇప్పటి నుండి ఇతరులను చంపి బ్రతికే జీవితం నాకు వద్దు. అటువంటి జీవితాన్ని నేను అసహ్యించుకుంటున్నాను. నాకు హితం చేకూరే ఉపదేశాలు చెప్పు” అని పులి ప్రార్ధించింది.

యావత్తు మానవాళీ స్వీకరించి, పాటించవలసిన ఒక ఉపదేశం, పులికి నంద చేసింది: “సర్వభూతాలకూ ఎవరు అభయమిస్తారో, అతడు బ్రహ్మాన్ని పొందుతాడు.” గోవు చెప్పడం పూర్తి అయినప్పుడు, దాని పేరు నంద అని పులికి తెలియ వచ్చింది. అది నందను తాకి ప్రణమిల్లింది. ఆ క్షణంలోనే, పులి రూపంలో జీవిస్తూన్న ప్రభంజనుని శాపం తీరి, తన పాత రాజోచిత రూపం దాల్చాడు. ఆ సమయంలో ధర్మదేవత అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ధర్మదేవత అనుగ్రహంతో, నందకు మోక్షం ప్రాప్తించింది. గోవత్స న్యాయం మేరకు, దూడకు కూడా తల్లితో పాటు మోక్ష పథం దక్కింది. ప్రభంజనుడు తన నగరానికి తిరిగి వెళ్ళి, మునుపటి కంటే ధర్మంగా, న్యాయంగా రాజ్యాన్ని పాలించాడు. సత్యమనే మహోన్నత గుణాన్ని ఊపిరిగా చేసుకున్న నంద పేరు, లోకంలో శాశ్వతంగా నిలిచిపోవడం న్యాయ సమ్మతమే.. నంద ముక్తి పొందిన నాటినుండి, సరస్వతీ నదికి నంద సరస్వతీ నది అనే పేరు శాశ్వతంగా స్థిరపడిపోయింది.

సత్యమేవ జయతే!

Monday, March 18, 2024

Dreams and What They Really Mean as per Garuda Purana | గరుడ పురాణం ప్రకారం కలలు!


కలలు! జీవిత సత్యాలు.. TELUGU VOICE
‘గరుడ పురాణం’ ప్రకారం మనకు వచ్చే ఈ కలలకు అర్ధం తెలుసా?

సాధారణంగా ఎవరికైనా కలలు రావడం అనేది సహజమే. వాటిలో కొన్ని సంతోషం కలిగించేవిగా ఉంటే, కొన్ని పీడ కలలు కూడా వస్తూంటాయి. కొన్ని మనకు కర్తవ్య బోధ చేసేవిగా ఉంటే, మరికొన్ని ఎక్కడో ఆకాశంలోనుంచి పడిపోతున్నట్లు, విచిత్రంగా కూడా ఉంటాయి. వీటిలో కొన్ని కలలు గుర్తుంటాయి, మరికొన్ని గుర్తుండవు. మన పురాణాలు, శాస్త్రాల ప్రకారం, తెల్లవారు జామున వచ్చే కలలు నిజం అవుతాయంటారు. స్వప్న శాస్త్రం ప్రకారం కూడా, కలలో వచ్చేవి కొన్ని నిజం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, కలల గురించి గరుడపురాణంలో, శ్రీ మహావిష్ణువు గరుడుడికి తెలియజేసిన సత్యాలేంటి? వాటిపై ప్రేతాల ప్రభావం ఉంటుందా? కలలో కనిపించే కొన్నింటికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? వాటికి ప్రాయశ్చిత్తాలేంటి వంటి విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/lqxfEzeB4Uc ]


గరుడపురాణంలో శ్రీ మహావిష్ణువు చెప్పిన ప్రకారం, కొన్ని కలలు మన మానసికి స్థితి మీద ఆధారపడి ఉంటే, కొన్ని కలలపై ప్రేతాల ప్రభావం వుంటుంది. గరుడపురాణంలో ప్రేతాలకు సంబంధించి గతంలో నేను చేసిన వీడియో link, చూడని వారి కోసం description లో, I-cards లో పొందుపరుస్తున్నాను. ప్రేతాల నుండి విడుదల వుంది. దానికి ముందు అది ఎలాంటి ప్రేతమో, ఇది ఎలాంటి తాపమో తెలియాలి. దానికి జ్యోతిర్విద్వాంసుల సహకారం అవసరం. ప్రేతగ్రస్త ప్రాణికి కొన్ని అద్భుతమైన కలలొస్తుంటాయి. తీర్థ యాత్రలకు వెళ్ళాలనీ, నదీ స్నానాలు చెయ్యాలనీ, ధర్మకార్యాలను అనుష్టించాలనీ గట్టిగా నిశ్చయించుకుని, ముహూర్తం కూడా చూసుకున్నాక, ఎందుకో అత్యంత నిరాసక్తత ఏర్పడుతుంది. ఎక్కడికీ వెళ్ళ బుద్ధికాదు. చెడు పనులవైపు మనస్సు లాగుతుంది. వెంటనే ఇది ప్రేత నిర్వాకమే అని పోల్చి, జ్యోతిర్విద్వాంసులనాశ్రయించిన వాడు, బాగు పడతాడు. వారిని సంప్రదించవలసిన అవసరం లేకుండా కూడా, దానాలు చేసినా ప్రేత బాధలు వదిలి పోతాయి. కలలో కనిపించిన ప్రేతాన్నుద్దేశించి మంత్ర సహితంగా దానం చేయడం వల్ల, ఆ ప్రేతానికీ, ఈ మనిషికి కూడా తృప్తి కలుగుతుంది. ప్రేతాలు వాటిలో అవి కూడబలుకుకుని, దానమిచ్చిన వానికి సుఖాలనిస్తాయి. వారి బంధు బాంధవులకు కూడా, ధన ధాన్యాల నిస్తాయి. స్వప్నాలలో ప్రేతాలు కనిపించిన పిమ్మట కూడా, వాటి మాటలు, చేష్టలు, పీడలను చూసి కూడా, శ్రాద్ధాదుల ద్వారా వాటి నుండి ముక్తికై ప్రయత్నించని వారు, ఆ ప్రేతాలు పెట్టే శాపాలకు లోనై, దుఃఖ సాగరంలోనే మునిగి వుండి, ఇక తేలరు. కొంత మంది మరుజన్మలో కూడా నిస్సంతులు, పశుహీనులు, దరిద్రులు, రోగులుగానే వుండిపోతారు.

కొన్ని సందర్భాలలో ప్రేతాల నామ గోత్రాలు, స్వప్నాల వల్ల తెలుస్తాయి. కొందరిని కలలు రాకున్నా, ప్రేతాలు పట్టి పీడిస్తాయి. అలాంటి సందర్భాలలో, కుల పురోహితుని మాటనే పూర్తిగా విశ్వసించి, ఆయన ఆదేశం మేరకు, భక్తిభావ పూర్వకంగా పితృభక్తి నిష్టులై, పురశ్చరణ పూర్వకంగా నారాయణ బలి కార్యాన్ని నిర్వహించి, జప, హోమ, దానముల ద్వారా దేహ శోధనను చేసుకోగానే, సమస్త విఘ్నాలూ సమసిపోతాయి. ఇవన్నీ చేయగానే, అంతవరకూ భూత ప్రేత పిశాచాదులచే పీడింపబడుతున్న ప్రాణి బాధలన్నీ, దూదిపింజలలాగా ఎగిరిపోతాయి.

ఒక్కటి మాత్రం గుర్తుంచుకో కశ్యప నందనా! పితృభక్తి ఉండాలి. లేకుంటే సుఖం లేదు. అన్ని ప్రయత్నాలలోనూ విజయం కావాలంటే, తండ్రిపోయిన తొమ్మిదవ, లేదా పదవ సంవత్సరంలో, పదివేల గాయత్రీ జపం చేసి, దశాంశ హోమం కూడా చేసి, “ఇది మా పితరుల నిమిత్తం” అని చెప్పుకోవాలి. దీని ఫలితంగా ఉపద్రవాలిక దరిజేరవు. తల్లిదండ్రులను మించిన దైవాలు లేరు.

పితృమాతృ సమం లోకేనాస్త్య న్య దైవతం పరం ।
తస్మాత్‌ సర్వప్రయత్నేన పూజయేత్‌ పితరౌ సదా ॥

హితానాము పదేష్టా హి ప్రత్యక్షం దైవతం పితా ।
అన్యాయా దేవతాలోకే న దేహ ప్రభవో హి తాః ॥ (ధర్మ... 21/28 29)

ప్రాణులకు స్వర్గానికిగానీ, మోక్షానికి గానీ, ఏకమాత్ర సాధనం శరీరమే. అటువంటి శరీరం దేని ద్వారా అయితే వచ్చిందో, దానికన్న పూజ్యమేది? కాబట్టి, దానమిచ్చిన వాడికి దక్కే ఫలమే గొప్పది.

పుత్రుడు పుట్టుటయే భాగ్యము. వాడు మంచివాడై, అన్ని పితృకార్యములనూ చేయుటయే గొప్ప పుణ్య ఫలము. వాడు పుట్టగానే తండ్రికి 'పుత్' అనే నరకబాధ తప్పిపోతుంది.

పున్నామ నరకాద్యస్మాత్‌ పితరం త్రాయతే సుతః ।
తస్మాత్‌ పుత్ర ఇతి ప్రోక్త ఇహచాపి పరత్ర చ ॥ (ధర్మ... 21/92)

ఓయి ఖగరాజా! ఎవరికైనా మాతాపితరులిరువురూ అకాల మృత్యువు పాలైతే, వారొక యేడాది పాటు ఆ తల్లిదండ్రులకు పుణ్యలోకాలను ప్రాప్తింపజేసే ప్రయత్నంలోనే వుండాలి. ఆ ఏడు వ్రతాలనూ, తీర్థయాత్రలనూ, వివాహాది మంగళ కార్యాలనూ తలపెట్టకూడదు. (అధ్యాయం - 21)

తమ సతీసుతుల, బంధు మిత్రుల కలలలో భయంకరమైన అశ్వాలుగా, ఏనుగులుగా, ఎద్దులుగా, వికృత రూపులైన మానవులుగా కనిపించి, బాధిస్తాయి. కొంతమంది నిద్ర పోతుండగా వచ్చి, వారి శయ్యలను అన్ని విధాలా అపభ్రంశం చేసి పడేస్తాయి. మనిషి తెల్లారి లేచి చూసుకునే సరికి, తానూ తన పక్కా చాలా అసహ్యకరంగా తయారౌతారు. కొందరికి తాము సంకెళ్ళచే బంధింపబడినట్లు కల వస్తే, మరికొందరికి చనిపోయిన తమ వారు పరువు తక్కువ, నిందనీయ వేషాలలో తిరుగుతున్నట్టు కల వస్తుంది. తింటున్న వాని నుండి అన్నాన్ని తామే లాగుకొని పారిపోతున్నట్లు, దాహంతో ఆబగా నీరు త్రాగబోతున్న వాని నుండి ఆ నీటిని తామే లాక్కుని పారిపోతున్నట్లు, కొందరికి కలలు వస్తాయి. ఇవన్నీ ప్రేతాల నిర్వాకాలే. ప్రేతాలలో ఒక రకమే పిశాచాలు. ఇవన్నీ వాటి విన్యాసాలు.

ఎద్దు మీద స్వారీ చేస్తున్నట్లు, ఎద్దులతో కలసి ఎక్కడికో వెళుతున్నట్టు, ఆకాశంలో భయంగా, పడిపోయేలా ఎగురుతున్నట్టు, ఆకలితో అలమటిస్తూ తీర్ధంలో తిరుగుతున్నట్టూ, ఆవు, ఎద్దు, గుర్రం, పక్షులతో, తన గొంతులోనే వాటి భాషను మాట్లాడుతూ గోష్టి సలుపుతున్నట్టూ, తన నుదుటిపై తనకే, ఏనుగు, దేవతలు, భూతప్రేత నిశాచరాదుల చిహ్నాలు కనిపిస్తే, తనకి పిశాచజన్మే వస్తుందని అర్ధం.

పక్షీంద్రా! ప్రేతయోని సంబంధితాలైన ఎన్నో చిహ్నాలు కలల్లో వచ్చి కంగారు పెట్టేవి ఉన్నాయి. తన అన్నదమ్ములు, భార్య, కొడుకు ఎవరైనా పోయినట్టు కల వస్తే అది ప్రేత దోషమే. మనిషికి ఆకలి దప్పులతో తాను ఆరాట పడుతున్నట్టూ, “వాటిని తీర్చండి మహాప్రభో” అని ఎవరినో యాచిస్తున్నట్టూ కల వస్తే, ప్రేత దోషాన్ని వదలించుకోవాలి. వెంటనే ఏదైనా తీర్థానికి వెళ్ళి, తన పితరులందరికీ పిండదానం చేసి, ప్రేత సంతృప్తిని సాధించాలి. పుత్ర, పితా, భ్రాత, పత్ని, పశు, పత్యాది ముఖ్యులు ఇల్లు వదలి బయటికి పోతున్నట్టు కల వచ్చినా, ప్రేత దోషముందని అర్ధము.

గరుడా, ఇలాంటి స్వప్న దోషాలకు ప్రాయశ్చిత్తమెలా చేయించుకోవాలో విను. ఆ వ్యక్తి ఇంట్లోగానీ, తీర్ధంలోగానీ స్నానం చేసి, మారేడు మూలంలో జలతర్పణమివ్వాలి. వేద పారంగతులైన బ్రాహ్మణులను పూజించి, వారికి నల్లని ధాన్యాలను దానమివ్వాలి. తరువాత యథాశక్తి హవనం చేసిన పిమ్మట, గరుడ పురాణ పారాయణ చేయించు కోవాలి. శ్రద్ధాపూర్వకంగా ఈ అధ్యాయాన్ని విన్నా, చదివినా, వారికి ఏ ప్రేత దోషమూ అంటదు. అప్పటికే అంటివుంటే మంటిలో కలసి పోతుంది. (అధ్యాయం -23)

సర్వేజనాః సుఖినోభవన్తు! లోకాః సమస్తా సుఖినోభవంతు!

Tuesday, March 12, 2024

భోజన నియమాలు - Meal Rules


సనాతన సాంప్రదాయంలో తప్పక తెలుసుకోవలసిన భోజన నియమాలు.. TELUGU VOICE

1. భోజనానికి ముందు, తరువాత తప్పక కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.
2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.
3. ఆహార పదార్థాలు (కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.) తినే పళ్ళానికి తాకించరాదు. అలా చేస్తే అవి ఎంగిలి అవుతాయి. ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు. అది చాలా పెద్ద దోషం.
4. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు.
5. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు.
6. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు, తాకరాదు.
7. ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు. ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి.
8. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు.
9. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు. *బఫే పద్దతి* పూర్తిగా మన సనాతన హైందవ ధర్మానికి విరుద్ధం. దయచేసి దీనిని వీలైనంత వరకు పాటించవద్దు. పాదరక్షలు తో పొరపాటున కూడా భోజనం చేయవద్దు.
10. భగవన్నామము ఉచ్చరించి భోజనం చేయాలి.
11. అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు.
12. ఆపోశనము అయ్యాక ఉప్పు వడ్డించుకోరాదు. ఏవైనా పదార్థాలలో ఉప్పు తక్కువైతే ఆ పదార్థాలు ఉన్న గిన్నెలలో ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి.
13. కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే మంచం మీద భోజనం చేయరాదు. (ఇది వృద్ధులకు, వికలాంగులకు, అనారోగ్యంతో ఉన్నవారికి వర్తించదు)
14. మాడిన అన్నాన్ని నివేదించరాదు. అతిథులకు పెట్టరాదు. మన ఇంటి చాకలి వారికి పొరపాటున కూడా పెట్టకూడదు.
15. భోజనం అయ్యాక క్షురకర్మ చేసుకోరాదు (వెంట్రుకలు కత్తిరించడం).
16. గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తేమనం తినగా మిగిలినవి పెట్టరాదు. వారికి మళ్ళీ ప్రత్యేకంగా వంటచేయాలి.
17. భోజనం వడ్డించేటప్పుడు పంక్తిబేధం చూపరాదు. అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం మరొకరికి తక్కువ వడ్డించడం చేయరాదు. 
18. భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి. 
19. వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలో ఆవునెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది.
20. భగవన్నామము తలుచుకుంటూ లేదా భగవత్ కథలు వింటూ వంట వండడం, భోజనం చేయడం చాలా ఉత్తమం.
21. ఉపాసకులను, ఏదైనా దీక్షలో ఉన్నవారిని ఎక్కువ తినమని బలవంతపెట్టరాదు ముఖ్యముగా అయ్యప్ప దీక్షల వద్ద ఈ చెడు అలవాటు ఇటీవల కాలములో మితి మీరుచున్నది. (అతిగా ఆహారం స్వీకరిచడం వారి అనుష్ఠానానికి ఇబ్బంది అవ్వచ్చు) 
22. భోజనం చేస్తున్నవారు (అనగా భోజనం మధ్యలో తింటూ) వేదం చదువరాదు.
23. గిన్నె మొత్తం ఊడ్చుకుని తినరాదు. ఆహార పదార్థాలను కాళ్ళతో తాకరాదు.
24. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి.
25. స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు, వడ్డించరాదు. వారు ఆ 4 రోజులు ఎవరినీ తాకరాదు. వడ్డన సమయంలో అక్కడ ఉండరాదు.
26. అరటి ఆకుల వంటి వాటిలో భోజనం చేసిన వ్యక్తి వాటిని మడవకూడదు (తిన్న విస్తరిని మడవడం అనాచారం) తన ఇంటిలో ఒక్కడు ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు.
27. ఎంగిలి విస్తరాకులను తీసేవాడికి వచ్చే పుణ్యం అన్నదాత కు కూడా రాదని శాస్త్రం. (జగద్గురువైన శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజసూయయాగంలో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు ఎత్తాడని మహాభారతం చెబుతోంది)
28. భోజనం అయ్యాక రెండు చేతులూ, కాళ్ళూ కడుక్కోవాలి. అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి.
నోరు నీటితో పుక్కిలించుకోవాలి.
29. భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి (మెతుకులు తీసేసి, తిన్న చోట తడిగుడ్డతో శుభ్రం) చేసి మాత్రమే అక్కడ వేరేవారికి భోజనం వడ్డించాలి (ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరి ఇళ్ళల్లో గోమయం లేదా పసుపు నీళ్ళు చల్లి మరీ శుద్ధి చేస్తారు)
30. స్నానం చేసి మాత్రమే వంట వండాలని కఠోర నియమము. పెద్దలు, సదాచారపరులు హోటళ్ళలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం చేయకపోవడానికి ఇదే ముఖ్యకారణం. అక్కడ వంట చేసే వారు స్నానం చేసారో లేదో తెలియదు, పాచిముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంటచేసినా దోషం. అవి తిన్న వారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది.
31. ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు. ద్విపాక దోషం వస్తుంది.
32. ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు, వడ్డించరాదు.


మన ఆంధ్రరాష్ట్రం అన్నపూర్ణగా కీర్తించబడటానికి, మన పూర్వీకులు పాటించిన పై సూత్రాలే ప్రధాన కారణం..

Monday, March 11, 2024

Who are you? What is Karma Siddhanta? | ఎవరు నువ్వు? కర్మ సిద్ధాంతం ఏమిటి?


ఎవరు నువ్వు? కర్మ సిద్ధాంతం ఏమిటి? TELUGU VOICE
కోరికలు తీరకపోతే నమ్ముకున్న దైవాన్ని మార్చి, వేరే దైవాన్ని ఆశ్రయిస్తారా?

సనాతనధర్మం ప్రకారం కర్మ సృష్టి ధర్మం. ప్రకృతి గుణాల వలన కర్మలు నిర్వహించబడతాయి. మానవుడు స్వతంత్రుడు కాదు.. కర్మబద్ధుడు! కర్మ ఫలితంగానే జన్మ ఆధారపడి ఉంటుంది. ఈ జన్మలో అనుభవించగా మిగిలిన కర్మ ఫలాన్ని, మరు జన్మలో అనుభవించక తప్పదు. జీవుల కష్ట సుఖాలకూ, లాభ నష్టాలకూ ఇతరులు కారణం కాదు. భార్యా బిడ్డలూ, బంధు మిత్ర, సంయోగ వియోగాలూ, పురాకృత కర్మ ఫలితాలే. అసలు నువ్వెవరు? బలీయమైన కర్మ సిద్ధాంతం ఏమిటి? అనే జీవిత సత్యాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/obtCjPk1svs ]


64 లక్షల జీవ కణాలు అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే, అందులో ఒకే ఒక్క జీవ కణం మాత్రమే, తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది. అదికూడా మొండాన్ని కోల్పోయి, శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత, కేవలం 24 గంటలలో, అండాన్ని పట్టుకుని బ్రతకకపోతే, ముక్కలై బయటికి వచ్చేస్తుంది. అదొక పోరాటమే. ఆ పోరాటానికి మనకు దేవుడిచ్చిన సమయం, కేవలం 24 గంటలు మాత్రమే. నిలిచావా, బ్రతుకుతావు. లేదా ముక్కలై బయటికి వచ్చేస్తావు.

అలా రూపం లేకుండా వెళ్లిన కణం రూపాంతరం చెంది బయటికి వచ్చి, రూపాన్ని పొందుతుంది. కాళ్లూ చేతులూ కదప లేని, నోటితో చెప్పలేని స్థితి. ఏం చేసినా భరించాలి. క్రమంగా దేహం పెరుగుతుంది. దేహం మీద మోహమూ పెరుగుతుంది. ఈ దేహం నేనే అంటాము. అసలు అలా అనటానికి, నీ దేహంలోని ఏ భాగం నీ మాట వింటుంది..? నిజానికి ఏ భాగమూ వినదు. వినాలని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది. చిన్నప్పుడు రెండడుగులుగా ఉన్న దేహం, క్రమంగా పెరుగుతూ, ఆరడుగులవుతుంది. అందంగా మారుతుంది. క్రమంగా అందం మందగించి, ముదిరి ముడతలు పడి, ఒక్కొక్క అవయవం చొప్పున క్రమంగా వేగాన్ని తగ్గించుకుని, అసలు పని చేయడానికి మొరాయిస్తాయి.

మరి ఈ దేహం నీదే కదా! ఎందుకు మొరాయిస్తుంది? ఈ దేహం నీదే అయినప్పుడు, ఎందుకు ఒకప్పుడున్న రూపం ఈ రోజు లేదు? దేహం నీదయినప్పుడు, నీ మాట ఎందుకు వినడం లేదు? దేహం నీదే అనుకున్నప్పుడు, చివరికి ఎందుకు వదిలేసి వెళ్లి పోతున్నావు..?
ఎందుకంటే, అసలు ఈ దేహం నీది కాదు. నీకు ఆ దేవుడిచ్చిన ఉపకరణం మాత్రమే. ఆ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తప్ప, "ఈ దేహం నాదే, నేను శాశ్వతంగా ఉండిపోతాను" అనే భ్రమకి లోను కాకూడదు. ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు, నీకున్న బాధ్యతలను నువ్వు సక్రమంగా నిర్వర్తించు. శాస్త్రాలు ఏం చెప్పాయో, వాటిని అనుసరించు. ఈ సృష్టి పరమాత్మదని తెలుసుకో..

రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించి, రూపం పొంది, ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు. చివరికి ధరించిన రూపం ఇక్కడే వదిలి వెళ్ళిపోవాలి. నిజానికి ఇక్కడున్నది నువ్వు కాదు. నీకు ఆ పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే యధార్థం తెలుసుకుంటే, ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి. రూపానికి ముందు నువ్వున్నావు, రూపంలో  నువ్వున్నావు, రూపం వదిలేసిన తారువాతా నువ్వుంటావు. ప్రతి చోటా నువ్వు అనే వాడివి లేకపోతే, అసలు రూపమే ఉండదు.

ఈ దేహం దేవుడిచ్చిన ఓ అద్భుత వరం. ఆయనే ఆ దేహానికి ఏం కావాలో ఇస్తాడు. ఆయనే తయారు చేశాడు, సమయమవ్వగానే ఆయనే నాశనం చేస్తాడు. ఈ దేహాన్ని ధరించినంత కాలం, దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ  దేహాన్ని ఇష్టం వచ్చినట్లు చేయడానికి అధికారం ఎవ్వరికీ లేదు. ఈ దేహంలో ఉన్న అన్ని భాగాలూ, పరమాత్మ ఆజ్ఞ ప్రకారమే నడుస్తాయి. అయన ఆగమన్నప్పుడు అన్నీ ఆగిపోతాయి. కాబట్టి, ఆ  నువ్వు ఎవరో తెలుసుకుని మసలుకునే ప్రయత్నం చెయ్యాలి.

ఇక కర్మ సిద్ధాంతం విషయానికి వస్తే, కర్మలకు దోషం వున్నప్పటికీ, జీవులు కర్మబద్ధులు. కర్మలు మానడం కంటే, కర్మలు చేయడమే మేలు. కర్మ చేయకపోతే, జీవయాత్ర జరగదు. జీవులు కర్మ చేయకుండా ఒక్క క్షణమైనా వుండలేరు. అయితే, కర్మల వలన ఫలం తప్పదు కాబట్టి, సత్కర్మలు చేయడం అలవరుచుకోవాలి. ప్రతిఫలాన్ని ఆశించకుండా, కర్మఫలాన్ని దైవానికి అర్పించడం ద్వారా, జీవుడు క్రమేణా జన్మరాహిత్యాన్ని పొందగలడని తీర్మానం చేసింది, మన సనాతనధర్మం. అజ్ఞానులు కర్మలలో మునిగి ఎలా పని చేస్తారో, జ్ఞానులు కూడా లోక శ్రేయస్సు కోరుతూ, అలాగే కర్మలు చెయ్యాలి. కర్మలలో మునిగిపోయిన వారిని ఆక్షేపించకుండా, వారు సత్కర్మలు ఆచరించేలా జ్ఞానులు ప్రోత్సహించాలి. అహంకారం వలన తానే అన్నింటికీ కర్తనని అనుకుంటాడు అజ్ఞాని. కానీ, గుణకర్మల యొక్క తత్వం తెలిసిన జ్ఞాని, ఆ చట్రంలో చిక్కుకోడు.

కర్మఫలితాన్ని కోరుకునే వాళ్ళు, దేవతలను ధూపదీపనైవేద్యాలతో ఆరాధిస్తారు. ఆరాధనలో తమ కోరికలను నెరవేర్చమని వేడుకుంటారు. కొన్ని కోరికలు తీరిన తరువాత, ఆరాధనలో కొంత ఆడంబరాన్ని పెంచుతారు. పది మందికీ తమ ఆడంబరతను చూపెట్టే ప్రయత్నం చేస్తారు. దేవుడు నా వాడే అని భావిస్తారు. కొన్ని జరగకపోతే, దేవుణ్ణి నిందించడం ప్రారంభిస్తారు. నెమ్మదిగా అహం చోటుచేసుకుంటుంది. మెల్లగా నమ్ముకున్న దైవాన్ని మార్చి, వేరే దైవాన్ని ఆశ్రయిస్తారు. ప్రస్తుతం జరుగుతున్నది ఇదే!! అంటే, తాము చేస్తున్న కర్మలవలన, మనుజుల గుణము బయటపడుతోంది! వ్యక్తిలో దాగివున్న సత్వ, రజో, తమో గుణములు, కర్మలరూపంలో తేటతెల్లమవుతున్నాయి. ఎంత కపటమును ప్రదర్శించినా, అవి ఒకానొకప్పుడు బయటపడక తప్పదు.

కర్మలు శాశ్వతము కావు. ఎందుకంటే, కాలానుగుణంగా కర్మలు మారుతూ వుంటాయి. కాబట్టి, వాటి ఫలితాలు కూడా తాత్కాలికములే. అంటే, మనుజులు కర్మలు చేయటంగానీ, చేయకపోవటంగానీ ముఖ్యంకాదు. తమ మనస్సులోని మాలిన్యాలను తొలగించడమే ప్రధానమని తెలుస్తోంది. ఆ మాలిన్యాలను మనసా, వాచా తొలగించకుండా చేసే ఏ కర్మ అయినా, నిరుపయోగమే! అజ్ఞాని, ‘నేను’ చేస్తున్నానని భావించి, ఫలితముల యందు ఆసక్తితో కర్మలను చేసి, వాటి ఫలితాన్ని అనుభవించడానికి ఈ జన్మ చాలకపోతే, ఇంకొన్ని జన్మలు ఎత్తవలసి వుంటుంది. దానినే ప్రారబ్ధకర్మ అంటారు. జ్ఞానులు ఆత్మస్థితిలో వుండి, ఏ ఫలితములనూ ఆశించకుండా, దైవబుద్ధితో కర్మలు చేస్తారు. అది యజ్ఞంగా, యోగంగా మారి, బంధమును కలిగించదు. సాధనతో ఆత్మజ్ఞానమును పొంది, బంధము నుండి విముక్తి పొందుతారు. అంటే, అనాసక్తితో, ఫలాపేక్ష లేకుండా, ఎటువంటి కోరికా లేక, అహమనే భావాన్ని త్యజించి చేసే ఏ కర్మ అయినా, "కర్మయోగము"గా మారిపోతుంది. కర్మయోగము వలన, బంధము కలుగదు. జ్ఞానము పరిపక్వత చెంది, సమాధి స్థితి కలిగినప్పుడు, కర్మలతో పనిలేదు. కొందరు లోక కల్యాణం కొరకు కర్మలు చేస్తారు, కొందరు చేయరు. వారు కర్మను అకర్మగా, అకర్మను కర్మగా భావిస్తారు. అంటే, వారు చేసే కర్మలు అసంగముగా చేస్తారు కాబట్టి, కర్మబంధము ఉండదు.

అష్టైశ్వర్యాలు, ఇంద్ర భోగాలను అనుభవించేవారిని కూడా, కాలరూపమనే మృత్యువు వెంబడించి కబళిస్తుంది. వారు సకల సౌభాగ్యాలూ అనుభవించడానికి, వారి పూర్వజన్మ సుకృతమే కారణమని మన పురాణాలు చెబుతున్నాయి. పురాకృత కర్మ ఫలాన్ని బ్రహ్మాది దేవతలు కూడా తప్పించుకోలేరు. అలనాడు ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుడిని చంపగా, బ్రహ్మ హత్యా దోషం ఆయనను వెంటాడింది. దీనితో ఇంద్రుడు భీతచిత్తుడై పరుగెత్తి, మానస సరస్సులో, ఒక తామర తూడులో దూరి, సన్నని తంతువుల్లో కలిసిపోయి, వెయ్యి సంవత్సరములు అజ్ఞాతవాసం గడిపి, కర్మ ఫలాన్ని అనుభవించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఇంద్రుని బ్రహ్మ హత్యా దోషాన్ని విభజించి, పాప విముక్తి కలిగించాడు. ఇంద్రుడు అశ్వమేధ యాగం చేసి, మళ్లీ తన సింహాసనంపై కూర్చోగలిగాడు.

దుర్లభమైన మానవ జన్మ లభించినప్పుడే, మానవులు మంచి పనులు చేయాలి. అది కూడా ఫలాపేక్ష లేకుండా చేయాలి. చేసిన మంచి పని తాలూకు ఫలితాన్ని, భగవదర్పణం చేయాలి. అప్పుడే, మోక్షం లభించి, జననమరణ చక్ర భ్రమణం నుంచి ముక్తి కలుగుతుంది. పుణ్య పాప కర్మలు మిశ్రమముగా పక్వానికి వచ్చినప్పుడు, జీవుడు మానవ జన్మ ఎత్తుతాడు. కర్మ ఫలముగా సుఖములను, దుఃఖములను అనుభవిస్తాడు. కర్మ ఫలమును అనుభవించటమే కాక, కొత్త కర్మలు కూడా చేసే అవకాశం, కేవలం మానవ జన్మలోనే కలుగుతుంది. పరమాత్మను అందుకోవడానికి కావలసిన కర్మలు చేసే అధికారం, జ్ఞానం వున్న ఈ మానవ జన్మ, ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది. “జంతూనాం నర జన్మ దుర్లభం” అని శంకరులు ‘వివేక చూడామణి’లో తెలియచేసారు. ఇలాంటి ఉత్తమమైన మానవ జన్మని సార్ధకం చేసుకోడానికి, ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి. మానవులు పరమాత్మను చేరడానికి, కర్మ-జ్ఞానములు తప్పక అవసరము. ఇక్కడ "కర్మ అంటే, నిష్కామ కర్మ" అనే భావించాలి. దానివలననే జ్ఞానము ఉదయిస్తుంది.

Monday, March 4, 2024

I am Shiva - Aham Shivam Ayam Shivam | శివోహం - నేను శివుడిని!


శివోహం - నేను శివుడిని! TELUGU VOICE
‘నేను శివుడిని, నేనే శివుడిని’ – అసలు శివతత్వమేమిటి?

పరమ జిజ్ఞాసువు, కారణజన్ముడైన ఒక విద్యార్థిని, ఒక ఆధ్యాత్మిక గురువు, ‘నీ వెవరివి?’ అని ప్రశ్నించాడు. ఆ విద్యార్థి సవినయంగా నమస్కరించి, ‘చిదానందరూపః శివోహం శివోహం’ అని సమాధానం ఇచ్చాడు. ఇక్కడ శివుడు అన్న పదానికి పరబ్రహ్మం అని అర్థం. మనం పరమేశ్వరుడు, శివుడు అని అర్థం చెప్పుకుంటే, సందర్భోచితంగా ఉంటుంది. ఏ వ్యక్తి అయినా ‘నేను శివుడిని, నేనే శివుడిని’ అని మనస్సులో అనుకున్నా, పైకి అన్నా, బాగానే ఉంటుంది. శివతత్వాన్ని అర్థం చేసుకుని, శివుడిలాగా ప్రవర్తిస్తే ఇంకా బాగుంటుంది. మరి ఆ శివతత్వమేమిటో ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/UafRztjHW04 ]


శివం అంటే శుభం అని అర్థం. శివుడు అంటే శుభాన్ని కలిగించేవాడు. శం అంటే సుఖం. శంకరుడు అంటే సుఖాన్ని కలిగించేవాడు. పాలసముద్రం నుంచి హాలాహలం ఆవిర్భవించినప్పుడు, లోకాలన్నీ భయకంపితాలై, హాహాకారాలు చేస్తుంటే, శివుడు ఆ ఘోర విషాన్ని అరచేతిలోకి తీసుకుని, ఆనందంగా తాగాడు. తనకు వెలుపల ఉన్న లోకాలకూ, తనకు లోపల ఉన్న లోకాలకూ ఇబ్బంది కలగకుండా, దానిని తన కంఠ ప్రదేశంలో నిలుపుకున్నాడు. ఇక్కడ గుర్తుంచుకోవలసినది, ఇతరుల ఇబ్బందిని తొలగించడం మన పనయినట్లయితే, మనం ఆ పని చేసి తీరవలసిందే. వారికి వచ్చిన ఇబ్బందిని తీర్చవలసిందే. ఇదే శివతత్వం!

శివుడు అభిషేక ప్రియుడు. భక్తిప్రపత్తులతో ఒక్క ఉద్ధరిణెడు నీళ్లు తీసుకుని, ‘హరహర మహాదేవ!’ అంటూ శివలింగం మీద పోస్తే చాలు. ఒక్క మారేడు దళాన్ని తెచ్చి, ‘ఓం నమశ్శివాయ!’ అంటూ శివలింగం మీద ఉంచితే చాలు - శివుడు పొంగిపోతాడు. అతడి కోరికలన్నింటినీ తీరుస్తాడు. ఇక్కడ గమనించవలసినది, మన వద్దకు వచ్చిన వ్యక్తి ఎంత విలువైన వస్తువును తెచ్చాడనేది కాదు.. ఎంత ఆప్యాయతతో తెచ్చాడనేది ప్రధానం. మనం చూడవలసింది అర్థాన్ని కాదు, ఆత్మీయతనే.. ఇదీ శివతత్వం!

శివుడు రుద్రుడు. అపరిమితమైన ఆగ్రహం కలవాడు. అదే శివుడు, పరమ శాంతమూర్తి కూడా! శివుడి ఫాలనేత్రంలో భయంకరమైన అగ్ని ఉంది. తలమీద చల్లని వెన్నెలను కురిపించే చంద్రుడున్నాడు. మన్మథుడు తన మీద బాణంవేసిన సమయంలో, శివుడు కాలాగ్నిరుద్రుడయ్యాడు. తన మూడవ కన్ను తెరచి, అతణ్ని భస్మీపటలం చేశాడు. మన్మథుడి భార్య రతి దీనంగా ప్రార్థించగానే చల్లబడి, ఆమెకు పతిభిక్ష పెట్టాడు. ఇక్కడ మనం దృష్టిలో ఉంచుకోవలసినది, కోపమనేది మనిషికి చాలా సహజమైన లక్షణం. దీర్ఘక్రోధం పనికిరాదు. ఇరుగు పొరుగుకు నష్టాన్ని కలిగించే క్రోధం, అసలు పనికిరాదు. పశ్చాత్తాపం చెందినవారిని క్షమించే గుణం ఉండాలి. ఇదీ శివతత్వమే!

ఎక్కడో గగనతలంలో ఉన్న గంగానదీ ప్రవాహం, ఒక్క వూపున భూమి మీదకు దూకితే, చిన్న మట్టిముద్దలాంటి భూగోళం మొత్తం తడిసి బద్దలైపోవటం ఖాయం. అటువంటి సంకట పరిస్థితిలో భగీరథుడు, ‘త్వమేవ శరణం మమ’ అంటూ ప్రార్థిస్తే, శివుడు తన రెండు చేతులనూ నడుంమీద మోపి, రెండు పాదాలనూ కైలాస పర్వతశిల మీద స్థిరంగా పూని, గంభీరంగా నిలబడ్డాడు. ఆకాశం నుంచి ఒక్క వూపున దూకిన గంగను, తన శిరస్సు మీద భరించి, జటాజూటంలో బంధించాడు. ఒక్క పాయను వదిలి, గంగను నిదానంగా, హిమవత్పర్వతం మీదకు పంపాడు. ఇక్కడ మనం నేర్చుకోవలసినది, మన సమక్షంలో ఏదైనా మహాప్రమాదం జరగబోతూ ఉంటే, దానిని ఆపగలిగిన సామర్థ్యం మనకుంటే, ఎట్టి పరిస్థితులలోనూ దానిని మనం ఆపవలసిందే. ఇదీ శివతత్వం!

శివుడు విభూతిరాయుడు. విభూతి అంటే ఐశ్వర్యం. అన్ని విధాలైన ఐశ్వర్యాలకూ ఆయన అధిపతి. సమస్త సంపదలకూ అధీశ్వరుడైన కుబేరుడు, ఆయనకు ప్రియమిత్రుడు. అయినప్పటికీ, శివుడు నిరాడంబరుడే! ఇక్కడ మనం పాటించవలసినది, మన ఘనత అనేది మన వ్యక్తిత్వంలో, మన ప్రవర్తనలో ఉండాలి. మన కర్తవ్య నిర్వహణలో ఉండాలి. అంతేకానీ, బాహ్యవేషధారణలో కాదనటానికి, శివుడే ఉదాహరణ, ఆదర్శం. ఇదీ శివతత్వం!

మహాన్యాసం అనే శివాభిషేకంలో, దశాంగరౌద్రీకరణం అని ఉంది. అదే విధంగా, షోడశాంగ రౌద్రీకరణం కూడా ఉంది. ఇవి మన శరీరంలోని లలాటం, నేత్రం, మొదలైన పది అవయవాల్లోనూ, శిఖ, శిరస్సు మొదలైన పదహారు అవయవాల్లోనూ, శివుడున్నాడని తెలియజేస్తున్నాయి. అంటే, మన శరీరం యావత్తూ, శివస్వరూపమేనన్నమాట. మన శరీరం ఇంత పవిత్రమైనదీ, విలువైనదీ కనుక, దీనిని మనం సత్కార్యాల కోసమే వినియోగించాలని, దీని అంతరార్థం. ‘శివోహం - నేను శివుడిని, నేనే శివుడిని’ అనే మాటకు అసలైన అర్థమిదే!

చిదానందరూపః శివోహం శివోహం!

Sunday, March 3, 2024

I am Shiva - Aham Shivam Ayam Shivam | శివోహం - నేను శివుడిని!

I am Shiva - Aham Shivam Ayam Shivam | శివోహం - నేను శివుడిని! - ‘నేను శివుడిని, నేనే శివుడిని’ – అసలు శివతత్వమేమిటి? | TELUGU VOICE

https://youtu.be/UafRztjHW04?si=7AeN4Z9brur793Ek


maheedhar planet leaf, m planet leaf, Telugu Videos, mpl, interesting facts in telugu, telugu facts, amazing facts in telugu, shivoham shivoham, voice of maheedhar, facts in telugu, శివోహం, I am Shiva, Aham Shivam Ayam Shivam, నేను శివుడిని, nirvana, nirvana shatakam, ultimate reality, manchi matalu, garuda purana, kathopanishad, shiva gita, shivoham full video, shivoham adipurush, ps2 shivoham, shivoham ps2, shivoham video, shivoham promo, chidananda roopah shivoham, sivoham

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...