Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Showing posts with label Birth and Death. Show all posts
Showing posts with label Birth and Death. Show all posts

Monday, September 16, 2024

Death: A Curse or a Blessing? | మనిషికి మృత్యువు ఎందుకు అవసరం?


మరణం! మనిషికి మృత్యువు ఎందుకు అవసరం? TELUGU VOICE
ఆత్మ నిరంతర ప్రయాణంలో ఒక చిన్న మజిలీ అయిన ఈ జీవితాన్ని ఎలా మలుచుకోవాలి?

'చిరంజీవత్వం' అన్నది సాధారణ విషయం కాకపోయినా, సాధ్యమే. ఎందరో మహనీయులు దానిని సాధించారు కూడా. ఎవరైతే మూల చైతన్యాన్ని గురించి సంపూర్ణంగా తెలుసుకుని, ఆ ‘మూలధనం’ లో వృద్ధి చెందుతూ వుంటారో, వారు అకల్పాంతం వరకూ, అంటే, ఎల్లప్పటికీ ‘పిన్న వయస్కులు’ గానే ఈ లోకంలో ఉండగలరు. ఈ విధంగానే అంజనేయస్వామి గానీ, మహావతార్ బాబాజీ కానీ, ఇంకా ఎంతో మంది యోగులు, ‘చిరంజీవులు’ గా ఇప్పటికీ భూమిపై నడయాడుతూ ఉన్నారు. అందరూ మరణాన్ని గురించి భయపడటం సహజమే. కానీ, జనన మరణాలు సృష్టి నియమాలు. ఈ రెండూ విశ్వం యొక్క సమతౌల్యతను కాపాడటానికి అత్యవసరం. లేకపోతే, మనుషులు ఒకరినొకరు అధిగమించే ప్రయత్నంలో, సృష్టి అల్లకల్లోలమవుతుంది. అది ఎలా..? అనే సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/LrkjH4viRsU ]


మూల చైతన్యాన్ని తెలుసుకోలేని మానవుడు, సృష్టిలో అనివార్యమైన మరణాన్ని గురించి భీతిల్లుతుంటాడు. అవగాహనారాహిత్యం వలన, అది ఒక అంతు చిక్కని విషయంగా అనిపిస్తుంటుంది. మరణమనే సహజ పర్యవసానం ఉండడం వల్లనే, జీవితం ప్రకాశవంతమవుతుంది. ఆత్మ ప్రయాణంలో భాగంగా, మనం కేవలం కొద్ది కాలం మాత్రమే భూమిపై సజీవంగా ఉంటాము. ఎక్కువ కాలం మరణానంతర ప్రయాణంలో ఉంటాము. దీనికి సంబంధించి గతంలో చాలా వీడియోలు చేశాను. చూడని వారు తప్పక చూడండి. జనన మరణ చక్ర భ్రమణంలోని ఈ నిగూఢ సత్యాన్ని తెలుసుకోలేక, భౌతికపరమైన ఆశలూ, కోరికలతో, కలకాలం జీవించి ఉండాలని కోరుకునే వారికోసం, ఒక చిన్న కథను చెప్పుకుందాము..

మరణాన్ని జయించి, చిరంజీవిగా ఉండిపోవాలని తలచిన ఒక రాజు, తన రాజ్యం వెలుపల మహారణ్యంలో వున్న ఒక మహర్షిని సందర్శించాడు. తనకు అమరత్వం సిద్ధించే మార్గం తెలియజేయమని, ఆయనను ప్రార్ధించాడు. రాజు మనోవాంఛితం తెలుసుకున్న మహర్షి, అక్కడికి కొంత దూరంలో ఉన్న రెండు కొండలను దాటిన తరువాత ఒక దివ్య సరస్సు ఉంటుందనీ, దాని నీరు త్రాగితే రాజు అమరత్వాన్ని పొందగలుగుతాడనీ చెప్పాడు. మహర్షి చెప్పినట్లుగానే రాజు ఆ రెండు కొండలనూ దాటిన తరువాత, దివ్య సరస్సును కనుగొన్నాడు. అతను దైవాన్ని తలుచుకుని నీరు త్రాగబోతుండగా, బాధను భరించలేక ఎవరో చేస్తున్న దీనారావాలు వినిపించాయి. బాధాకరమైన ఆ శబ్దాలు వినవస్తున్న దిశకు వెళ్ళిన రాజుకు, చాలా బలహీనుడైన ఒక మనిషి కనిపించాడు.

అటువంటి నిర్జన ప్రాంతంలో అతడిని చూసి ఆశ్చర్యపోయిన రాజు, కారణం అడగగా, అతడు ఇలా చెప్పనారంభించాడు. తాను ఆ దివ్య సరస్సులోని నీరు త్రాగి అమరత్వాన్ని పొందగలిగాడనీ, వంద సంవత్సరాల వయస్సు దాటిన తనను, తన కుమారుడు ఇంటి నుండి బయటకు పంపించేశాడనీ చెప్పాడు. అప్పటికి యాభై సంవత్సరాల నుండి ఆలనా పాలనా లేకుండా, తానక్కడే పడి ఉన్నాడని తెలియజేశాడు. తన కుమారుడు మరణించి, మనవళ్లు కూడా వృద్ధులై పోయారని చింతించాడు. తాను తినడం, త్రాగడం మానేసినా, ఇంకా బ్రతికే ఉన్నానని వాపోయాడు.  చిరంజీవిత్వం తన పాలిట శాపంగా ఎలా పరిణమించిందో మొరపెట్టుకున్నాడు. తనకు మృత్యువును ప్రసాదించమని భగవంతుడిని ప్రార్ధిస్తూ రోదించసాగాడు.

రాజు ఆలోచనలో పడ్డాడు. వృద్ధాప్యం, దయనీయమైనది. జవసత్వాలతో కూడిన యవ్వనం లేని అమరత్వం పొంది, ప్రయోజనం ఏమిటి? అప్పుడు అమరత్వంతో పాటు యవ్వనాన్ని కూడా పొందాలని నిశ్చయించుకుని, తిరిగి మహర్షిని సందర్శించి, తనకు అమరత్వంతో పాటు యవ్వనాన్ని కూడా పొందేందుకు మార్గం సూచించమని కోరాడు. చిరునవ్వు నవ్వుతూ మహర్షి, రాజు అంతకు ముందు చూసిన దివ్య సరస్సును దాటి ఇంకా కొంత దూరం ముందుకు వెళితే కనిపించే మరో కొండను అధిగమిస్తే, పసుపు రంగు పండ్లతో నిండిన ఒక దేవతా వృక్షం కనిపిస్తుందనీ, దాని పండును తింటే, అమరత్వంతో పాటు యవ్వనాన్ని కూడా పొందవచ్చనీ చెప్పాడు.

మహర్షి చెప్పిన విధంగానే రాజు ఈసారి మూడవ కొండను కూడా దాటి, పసుపు రంగు పండ్లతో నిండిన దేవతా వృక్షాన్ని చేరుకున్నాడు. అతను ఒక పండు కోసి తినబోతున్న సమయంలో, ఉన్నట్లుండి అక్కడికి సమీపంలోనుంచి ఏదో సవ్వడి వినిపించింది. జన సంచారం లేని ఆ ప్రాంతంలో వాదులాడుకునేవారు ఎవరై ఉంటారా అని ఆశ్చర్యపోయాడు రాజు. హుటాహుటిన శబ్దం వినవస్తున్న దిశకు వెళ్లి చూసిన రాజుకు, తర్జన భర్జనలు పడుతున్న నలుగురు యువకులు కనిపించారు. సమస్య ఏమిటని రాజు అడగగా, వారిలో ఒక యువకుడు, "నా వయస్సు 400 సంవత్సరాలు. నా కుడివైపున ఉన్న మనిషి నా తండ్రి. వయస్సు 450 సంవత్సరాలు. అతడు నాకు రావలసిన వాటా ఆస్తిని నాకు ఇవ్వడం లేదు." అని అన్నాడు చిన్నబుచ్చుకుంటూ.

అది విన్న రాజు ఆ కుడివైపున ఉన్న రెండవ మనిషిని అడగగా, అతను మూడవ వ్యక్తిని చూపిస్తూ, "ఈయన నాకు తండ్రి. వయస్సు 500 సంవత్సరాలు. తాను ఇంకా జీవించి ఉండడంవలన, నా భాగం ఆస్తి నాకు రాలేదు. నాది కానిది నా కుమారుడికి నేనెలా ఇవ్వగలను?" అని అన్నాడు. ఇక అతడు నాలుగవ వ్యక్తిని చూపించి, అతడిని తన తండ్రిగా చెప్పి, వయస్సు 550 సంవత్సరాలని చెప్పాడు. అతడిది కూడా అదే సమస్య. ఇలా వారు ఆస్తి కోసం నిత్యం ఘర్షణ పడుతుండడంతో విసుగు చెందిన గ్రామస్థులు, వారిని గ్రామం నుండి బహిష్కరించారు. అలా వారు ఆ నిర్జన ప్రదేశంలో చేరి, నిత్యం ఘర్షణలతో మనశ్శాంతిని కోల్పోయి, కాలం వెళ్లబుచ్చుతున్నారు.

ఇదంతా చూసి ఆశ్చర్యానికి గురైన రాజు తిరిగి మహర్షిని చేరి, తన అజ్ఞానాన్ని దూరంచేసినందుకూ, తనకు మరణం యొక్క ఆవశ్యకతను ఎరుకపరచినందుకూ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు. అప్పుడు మహర్షి చిరుదరహాసంతో ఇలా అన్నాడు.. "రాజా! మరణం ఉన్నందువల్లనే ప్రపంచంలో ప్రేమ ఉంది. మరణాన్ని తప్పించడానికి ప్రయత్నించే బదులు, ప్రతి రోజూ, ప్రతి క్షణమూ సంతోషంగా గడపండి. సహజంగా అందరూ పొరబడే.. ‘నేనొక్కడిని మారితే ఏమవుతుంది!’ అని అనుకోకుండా, ముందు మీరు మారండి. అది చూసి మీ చుట్టూ ఉన్నవారు మారతారు. తదనుగుణంగా ప్రపంచం మారుతుంది." మార్పనేది, ఒక్కరితోనే మొదలవుతుంది..

మానవజన్మ విశిష్టతనూ, విలువనూ మనం గ్రహించాలి. అన్ని రాళ్లకంటె వజ్రం ఎలా విలువైనదో, అలాగే మానవజన్మ అన్ని జన్మలకంటే విలువైనది. ఇది మనకు అంత సులభంగా లభించలేదు. ఈ మానవ జన్మ లభించడానికి మనం ఎంతో పుణ్యం చేశాము. వజ్రం కోసం ఎంతో ధనాన్ని వెచ్చించినట్లే, మానవ జన్మకోసం మనం ఎంతో పుణ్యాన్ని వెచ్చించాము. అందుకే మానవ జన్మ కూడా వజ్రంలాగే ఎంతో విలువైనది. వజ్రాన్ని అలక్ష్యంచేసే వ్యక్తిని ఎలాగైతే మూర్ఖుడిగా భావిస్తామో, అలాగే, మానవజన్మను సక్రమంగా ఉపయోగించుకోకపోతే, మనం కూడా మూర్ఖులమే అవుతాము.

స్నానం చేస్తూ దేవుడి నామస్మరణ చేస్తే, అది పవిత్ర స్నానమవుతుంది..

తింటూ దైవ నామస్మరణ చేస్తే, ఆహారం ప్రసాదమవుతుంది..

నడుస్తూ భగవన్నామస్మరణ చేస్తే, అది యాత్ర అవుతుంది..

వంట చేస్తూ స్మరణ చేస్తే, ఆహారం దివ్యమవుతుంది..

నిద్రించే ముందు స్మరించుకుంటే, అది ధ్యాన నిద్రవుతుంది..

ఇంట్లో దివ్య నామస్మరణ చేస్తే, ఆ ఇల్లే దేవాలయంగా మారుతుంది..

నిత్య దైనందిన కర్మలు చేసుకుంటూ దైవాన్ని తలుచుకుంటే, అది భక్తి అయ్యి, మనలను భగవంతుడికి దగ్గరజేస్తుంది..

యతః కృష్ణస్తతో ధర్మో యతో ధర్మస్తతో జయః ||

Tuesday, October 10, 2023

జన్మ - విముక్తి Birth and Death


ఎందుకీ జన్మ? ఎప్పుడు విముక్తి?

జీవితం మీద విరక్తి కలిగినప్పుడు, ‘ఛీ.. ఎందుకీ జన్మ?’ అని మనలో మనం ఆక్రోశించుకుంటూ ఉంటాము. అసలు మనిషి జన్మ ఏమిటి? దీనికి విముక్తి ఎప్పుడనే విషయాలను తెలుసుకోవాలనుకున్న వారు ముందుకు సాగండి..

[ మరణించిన తరువాత కర్ణుడు తిరిగి భూమిపైకి ఎందుకు పంపబడ్డాడు?: https://youtu.be/vfBBesZcTbw?si=FoJjN6HAcHW4cOKK ]


నిజంగా మానవ జన్మ అంత నీచ నికృష్టమైనదా? అసలు మనం ఈ భూమిమీద ఎందుకు పుట్టము? ఎందుకు చనిపోతున్నాము? చనిపోయాక ఎక్కడికి పోతాము? ఇలాంటి ప్రశ్నలన్నీ మనిషికి సర్వ సాధారణంగా కలుగుతుంటాయి. మనం అనుకున్నట్లుగా మనిషి జన్మ నీచమైనది కాదు.. ఉత్తమోత్తమమైనది.. ‘పునరపి జననం, పునరపి మరణం’ అన్నారు పెద్దలు. జన్మ అంటే మళ్లీ పుట్టడం. అంటే, చనిపోయిన వారు మళ్ళీ పుట్టడమే జన్మ. కానీ, తిరిగి మానవ జన్మే వస్తుందని మాత్రం చెప్పలేము. ఎందుకంటే, మనం ఎలాంటి జన్మ ఎత్తాలో మనం సంపాదించుకున్న జ్ఞానం మీదా, తద్వారా కర్మల మీదా మాత్రమే ఆధారపడి ఉంటుంది. కర్మ ఫలాలను బట్టే మనిషి జన్మ ఉంటుంది. మనిషి జన్మ అనేది, మనం దేవుడికి చేరువ కావడానికి మనకు దొరికిన ఓ అపురూపమైన అవకాశం. భక్తి మార్గంలో ఉండి, వైరాగ్యం చెంది, భగవంతుడిని చేరుకోవడానికి మనిషి జన్మ తప్ప మరో జన్మలో ఆ అవకాశం లేదు.

అయినా, పూర్వ జన్మ పుణ్య ఫలంతో సాలీడు, ఏనుగు, పాము, నెమలి వంటివి దేవుడిని పూజించి, ముక్తిని పొందినట్లు శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యం వంటి మన పురాణ గ్రంథాలలో ప్రస్ఫూటంగా తెలుస్తుంది. కానీ, మనిషిగా పుట్టిన వారంతా భగవంతుడికి దగ్గరయ్యే మార్గాన్ని నిజంగా ఉపయోగించుకుంటున్నారా లేదా? అనేది, మనకు మనం ఆలోచించు కోవాలి. మనిషి పుట్టినప్పటి నుంచీ తాను చెయ్యాల్సిన మంచి పనులు చేయక తప్పదు. సంసార సాగరంలో ఈదుకుంటూ పోవడం తప్ప, మనకు మరో మార్గం లేదు.

ఇవన్నీ మనుషులకేనా! చెట్లకూ చేమలకూ ఉండవా? అని మనం అనుకోవచ్చు.. ఒక చెట్టుకు మొగ్గ వచ్చి, అది పువ్వై, ఆ తర్వాత కాయగా మారింది. పండిన తరువాత కొంతకాలానికి అది నేల రాలిపోతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, పిందెగానో, కాయగానో ఉండగా దానిని కొమ్మ నుంచి కోసి వేరు చేస్తే, అది ఉన్న చోటు నుంచి నీరు కారుతుంది. కాయ మొదలు లోనూ, ఆ తడిని చూడవచ్చు. కానీ, పండు రాలినప్పుడు, కొమ్మలో ఎలాంటి తడీ ఉండదు. పండు రాలిన చోట కూడా తడి ఉండదు. కాయ కోస్తున్నప్పుడు మాత్రమే తడి ఉండటానికి కారణం, ‘అయ్యో మరిన్ని రోజులు నన్ను అంటి పెట్టుకుని ఉంటే, అది పండు అయ్యేది కదా!’ అని చెట్టు కొమ్మ కంట తడి పెడుతుంది. కాబట్టే అక్కడ తడిని మనం చూస్తుంటాము. అలాగే కాయ మొదలులోనూ ఆ నీటి తడి ఉంటుంది. ‘అయ్యో ముందుగానే నన్ను చెట్టు కొమ్మ నుంచి వేరు చేసేశారు కదా’ అని కాయ కూడా బాధపడుతుంది. కానీ పండు విషయంలో అలా కాదు.. కాయ పండి రాలుతున్నప్పుడు, చెట్టు కొమ్మకు తడి కనిపించదు. పండు మొదలులోనూ నీటి తడి ఉండదు. రెండింటిలోనూ ఓ పరిపక్వత వస్తుంది. దాని బంధం అయిపోయింది కాబట్టే పండు రాలిపోయిందని, చెట్టు కొమ్మ అనుకుంటుంది. పండు కూడా తన కాలం ముగిసినట్టు అనుకోవడంతో, రెండువైపులా బాధ అనేది ఉండదు. అలాంటిదే మనిషి జీవితం కూడా.

సంసార చక్రంలో ఉండి కుటుంబ వ్యవహారాలు సాగిస్తున్న సమయంలో, ఉన్నట్లుండి పక్కకు తప్పుకుంటే, అటు కుటుంబ సభ్యులకూ బాధే, ఇటు మధ్యలోనే దూరమవుతున్నామని, అతనికీ బాధే. ఆ వ్యక్తి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి, నెమ్మదిగా జ్ఞాన మార్గం వైపుకు అడుగులు వేస్తూ, అందులో మునిగి తేలినప్పుడు, అటు అతనికీ, ఇటు కుటుంబ సభ్యులకూ బాధ ఉండదు. రెండు వైపులా కన్నీరు కార్చడం అనేది ఉండదు. జ్ఞానమనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. నెమ్మదిగా రావాలి. అందుకే మెల్ల మెల్లగా దాని వైపుకు అడుగులు వేయాలి.

జ్ఞానం, కర్మలు, ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. జ్ఞానం పెరిగే కొద్దీ, కర్మలు అంతరిస్తాయి. అనేక జన్మలుగా మనం చేసిన పాపపుణ్యాలు, కర్మల రూపంలో మనతోనే వస్తాయి. ఈ కర్మలు మూడు రకాలుగా ఉంటాయి. ‘ఆగామి, సంచితం, ప్రారబ్దం’ అని, మూడు రకాలుగా కర్మలు ఉంటాయి. నిత్యం మనం చేసే కర్మలన్నీ ఆగామి కర్మల క్రిందికే వస్తాయి. కొన్ని వెంటనే ఫలిస్తాయి, మరికొన్ని తర్వాతి జన్మలలో తమ ఫలితాలను చూపిస్తాయి. మనం ఎన్ని పాపాలు చేశాం? ఎన్ని పుణ్యాలు చేశాం? దాన ధర్మాలు ఏమైనా చేశామా? వంటివన్నీ, ఆగామి కర్మల క్రిందికి వస్తాయి. ఇక పూర్వ జన్మలో మనం చేసిన కర్మలు ఈ జన్మకు వచ్చి, ఇప్పుడు కూడా వాటిని అనుభవించలేకపోతే, అవి మళ్లీ రాబోయే జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. ఇటువంటి వాటిని, సంచిత కర్మలని అంటారు.

ఇక ప్రారబ్దం విషయానికి వస్తే అంతా నా ప్రారబ్దం అని అనుకోవడం మనం తరచూ వింటూ ఉంటాము. సంచిత కర్మలలో ఖచ్చితంగా అనుభవించి తీరాల్సినవి ఉంటాయి. వాటినే ప్రారబ్దం అంటారు. గత జన్మలలో చాలా పాపాలు చేసి ఉండి, పైగా పుణ్యబలం కూడా లేకపోతే, జన్మ తీసుకోగానే దాని సమయం వచ్చినప్పుడు, ఆ ప్రారబ్దం తగిన ఫలితం చూపిస్తుంది. ఇలాంటి చావు ఎవరికీ రాకూడదని అందరూ అనుకుంటూ ఉంటారు. అది ప్రారబ్ద కర్మ కాబట్టే, అతను అనుభవించక తప్పలేదు. అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు, ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి.

పుణ్య కర్మలు పక్వానికి వస్తే, ఆ వ్యక్తి దేవ లోకంలో పుడతాడు. ఆ కర్మల ఫలితంగా, అనేక భోగాలను అనుభవిస్తాడు. ఆ భోగాలు అయిపోగానే, ‘క్షీణే పుణ్యే మర్త్య లోకం విశంతి’ అన్నట్లు, మళ్లీ మానవ లోకాన్ని చేరుకుంటాడు. ఇక్కడ మళ్లీ మనిషిగానో, జంతువుగానో పుడతాడు. అంతకు ముందు అతను దేవ లోకంలో పుట్టినా, అతనికి కర్మలు చేసే స్థూల శరీరం ఉండదు. ఎందుకంటే, అక్కడ భోగాలు అనుభవించటానికి మాత్రమే అధికారం ఉంటుందిగానీ, కర్మలు చేసే అధికారం ఉండదు. పుణ్య కర్మలు పక్కన పెట్టి, మనం పాపాలు మాత్రమే చేస్తూ పోతే, అవి కూడా పక్వానికి వస్తాయి. అప్పుడు ఏ జంతువుగానో పుట్టక తప్పదు.

ఇలా కర్మ ఫలాలను అనుభవించటం మాత్రమే కాదు.. కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా, మనిషి జన్మలోనే ఉంటుంది. 'బుద్ధే కర్మానుసారిణి' అంటారు.. కర్మలను బట్టే మనిషి బుద్ధి మారుతుంటుంది. బుద్ధి అనే సాధనం ఉన్న జన్మ, 'మానవ జన్మ'. పరమాత్మను చేరుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారాన్నీ, జ్ఞానాన్నీ పొందే అవకాశం ఉన్నది, ఒక్క మానవ జన్మలోనే. అందుకే ఈ మానవ జన్మ ఉత్తమోత్తమమైనది, అపురూపమైనది. 84 లక్షల జీవరాసులలో పుట్టి-గిట్టిన తర్వాతే, ఈ మనిషి జన్మ లభిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. మనిషి తన జన్మకు ఒక లక్ష్యం అంటూ పెట్టుకోవాలి. 'బాగా చదువుకోవాలి, పెద్ద ఉద్యోగం చేయాలి, కోట్లు సంపాదించాలి' అనేది మాత్రమే లక్ష్యం కాదు. జ్ఞాన సముపార్జన చేయాలి.

ఎన్నో సుఖాలూ, భోగాలూ అనుభవించినా, మన మనస్సులో ఏదో ఒక వెలితి మాత్రం ఉంటుంది. పరమాత్మను తెలుసుకోవాలంటే, జ్ఞాన మార్గం ఒక్కటే దారి. ‘నిత్య వస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం’ అని తత్వ బోధలో శంకరాచార్యుల వారు స్పష్టంగా చెప్పారు. అంటే, నిత్య వస్తువు అనేది, ఒక్క పరమాత్మ మాత్రమే. అందుకు భిన్నంగా ఉంటే, అవి అశాశ్వతం అని అర్థం. ప్రతి జీవీ, భగవంతుడిలో ఐక్యం కాగలిగినప్పుడే, ఈ జన్మకు ముక్తి లభించినట్లు. ఆ ముక్తి మార్గానికి దారి తెలియాలంటే, అది మానవ జన్మలోనే సాధ్యం. నేనెవరు? ఎందుకు పుట్టాను? ఎవరి కోసం పుట్టాను? నా లక్ష్యం ఏమిటి? నా కర్తవ్యం ఏమిటి? అని తెలుసుకుని, మనస్సును అదుపులో పెట్టుకుని, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవలి.

ఆత్మకూ పరమాత్మకూ తేడాను తెలుసుకోవడమే 'జ్ఞానం'. భగవంతుడిని తెలుసుకోవాలన్న తపన ఉంటే, ఆ భగవంతుడే మనకు దారి చూపిస్తాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో, ‘అర్జునా! ఎవరైతే నా జ్ఞానాన్ని గ్రహించి, కర్మ, జ్ఞాన, ధ్యాన యోగాలను అవలంభించి ఉంటారో, వారు ఇంకా ఏదైనా కర్మలు చేయాల్సి ఉంటే, వారికి ఖచ్చితంగా ఒక మంచి జన్మ లభిస్తుంది’ అని చెప్పాడు. ఈ విషయాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని మనిషి ముందుకు సాగాలి. అప్పుడే జీవన్ముక్తి సాధ్యం. అప్పటి వరకూ ఈ భవ బంధాలను అనుభవించి తీరవలసిందే.

సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...