Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Showing posts with label Bhagavadgita. Show all posts
Showing posts with label Bhagavadgita. Show all posts

Wednesday, July 26, 2023

3 Doors of Hell - 3 నరక ద్వారములు - Bhagavad Gita భగవద్గీత

 

3 నరక ద్వారములు!
చీకటి దిశగా ఉన్న ఆ మూడు ద్వారములు ఏవి? శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు?

'భగవద్గీత' షోడశోధ్యాయం - దైవాసుర సంపద్విభాగ యోగం (21 – 24 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహారవ అధ్యాయం, దైవాసుర సంపద్విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, దైవాసుర సంపద్విభాగ యోగములోని, 21 నుండి 24 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/XWs5w3_uIrU ]


ఆత్మ వినాశనానికి దారి తీసే నరక ద్వారముల గురించి, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:49 - త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః ।
కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్ ।। 21 ।।

ఆత్మ వినాశనానికి దారి తీసే నరక ద్వారములు, మూడు ఉన్నాయి - కామము, క్రోధము, మరియు లోభము. కాబట్టి, అందరూ వీటిని విడిచిపెట్టాలి.

శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, ఈ ఆసురీ స్వభావము యొక్క మూలకారణములను వివరిస్తున్నాడు. కామము అంటే కోరిక, క్రోధము అంటే కోపము, మరియు లోభము  అంటే దురాశ. ఈ మూడూ దీనికి కారణములని, సూటిగా చెబుతున్నాడు. కామము, క్రోధము, మరియు లోభము కలసి, ఆసురీ ప్రవృత్తి యొక్క మూలాధారములుగా ఉంటాయి. అవి మనస్సులో సలుపుతూ, పెరుగుతూ ఉండి, మిగతా అన్ని దుర్గుణములకూ పెరిగే అవకాశం ఇస్తాయి. అందుకే శ్రీ కృష్ణుడు వాటిని, నరకమునకు ద్వారములని పేర్కొంటున్నాడు. అలాగే, ఆత్మ వినాశనం నుండి కాపాడుకోవటానికి, వాటిని దూరంగా ఉంచాలని గట్టిగా చెబుతున్నాడు. సంక్షేమం కోరుకునే వారు, వాటి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే, వాటిని తమ వ్యక్తిత్వం నుండి దూరంగా ఉంచాలి.

02:03 - ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైః త్రిభిర్నరః ।
ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిమ్ ।। 22 ।।

చీకటి దిశగా ఉన్న ఈ మూడు ద్వారముల నుండి ముక్తి పొందిన వారు, ఆత్మ శ్రేయస్సుకై పరిశ్రమిస్తారు. తద్వారా వారు పరమ లక్ష్యమును పొందుతారు.

ఈ కామ క్రోధ లోభములను త్యజించటం వలన కలిగే ఫలితమును వివరిస్తున్నాడు శ్రీ కృష్ణుడు. ఇవి ఉన్నంతకాలం, వ్యక్తులు ప్రస్తుతానికి సుఖంగా అనిపించి, చివరకు చేదుగా ఉండే ఆనందము వైపుకు ఆకర్షించబడతారు. కానీ, భౌతిక పరమైన కోరికలు తగ్గిపోయినప్పుడూ, భౌతిక రజోగుణము నుండి స్వేచ్ఛను పొందిన తరువాతా, బుద్ధి ఈ మార్గంలో ఉండే అవివేకమును గమనించ గలుగుతుంది. ఆ తరువాత వ్యక్తి, శ్రేయస్సు వైపుకు తిరుగుతాడు. అంటే, ప్రస్తుతానికి కష్టముగా అనిపించినా, చివరకు మధురముగా ఉండే ఆనందము. ఈ శ్రేయస్సు వైపు ఆకర్షితమయ్యేవారికి, జ్ఞానోదయ మార్గము తెరుచుకుంటుంది. దానితో, తమ నిత్య శాశ్వత ఆత్మ సంక్షేమం కోసం పరిశ్రమిస్తారు. దాని వలన, పరమ లక్ష్యం దిశగా ముందుకెళతారు.

03:14 - యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః ।
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్ ।। 23 ।।

ఎవరైతే శాస్త్రములలో చెప్పబడిన ఆదేశములను కాదని, కామ ప్రేరితులై ప్రవర్తిస్తారో, వారు పరిపూర్ణ సిద్ధిని కానీ, సుఖాన్ని కానీ, చివరకు జీవిత పరమ లక్ష్యమును కానీ సాధించలేరు.

శాస్త్రములనేవి, మానవులకు జ్ఞానోదయ దిశలో ప్రయాణించటానికి ఇవ్వబడిన మార్గదర్శక పటముల వంటివి. అవి మనకు జ్ఞానమునూ, మరియు అవగాహననూ అందిస్తాయి. అవి మనకు, ఏమి చేయవచ్చు, ఏమి చేయకూడదనే ఉపదేశాలను కూడా అందజేస్తాయి. ఈ ఉపదేశములు రెండు రకాలుగా ఉంటాయి - విధి మరియు నిషేధము. కొన్ని చేయవలసిన కార్యములను చెప్పే వాటిని, ''విధి'' అంటారు. చేయకూడని పనులను చెప్పే వివరణను, ''నిషేధం'' అంటారు. ఈ రెండు ఉపదేశములనూ శ్రద్ధతో పాటించటం ద్వారా, మానవులు పరిపూర్ణతను సాధించవచ్చు. కానీ, ఆసురీ గుణములు కలవారు, శాస్త్ర ఉపదేశములకు విరుద్ధంగా ప్రవర్తిస్తారు. నిషేధింపబడిన పనులను చేస్తూ, చేయవలసిన విధులను విస్మరిస్తూ ఉంటారు. ఇటువంటి జనులను ఉదహరిస్తూ, శ్రీ కృష్ణుడు - కామ ప్రేరణచే మోహితులై, ఎవరైతే అనుమతింపబడిన మార్గమును త్యజించి, తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తారో, వారు యదార్థమైన జ్ఞానమునూ, పరిపూర్ణ ఆనంద సిద్ధినీ, మరియు భౌతిక బంధనము నుండి విముక్తిని కూడా పొందలేరని అంటున్నాడు.

04:49 - తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితౌ ।
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి ।। 24 ।।

కాబట్టి, ఏది చేయాలి, ఏది చేయకూడదన్న విషయంలో, శాస్త్రములనే ప్రమాణముగా తీసుకొనుము. శాస్త్ర విధివిధానాలనూ, ఉపదేశాలనూ తెలుసుకొనుము, మరియు ఆ విధంగానే ఈ జగత్తులో ప్రవర్తించుము.

శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు, ఈ అధ్యాయము లోని తన ఉపదేశము యొక్క అంతిమ ముగింపును ఇక్కడ ప్రకటిస్తున్నాడు. దైవీ మరియు ఆసురీ గుణములను పోల్చిచూపి, తేడాలను వివరించిన పిదప, ఆసురీ గుణములు ఏ విధంగా నరక లోకాలకు దారి తీస్తాయో వివరించాడు. ఈ విధంగా, శాస్త్ర విధివిధానములను తిరస్కరిస్తే, మనకు వచ్చే లాభం ఏమీ లేదని, ధృవీకరించాడు. ఇప్పుడు ఏదైనా కార్యము యొక్క ఔచిత్యం, అంటే, మంచో చెడో నిర్ణయించాలన్నా, వేద శాస్త్రములే ప్రమాణములని, గట్టిగా చెబుతున్నాడు. కొన్ని సార్లు మంచి ఉద్దేశ్యంతో ఉన్నవారు కూడా, ‘నేను ఏ నియమాలనూ పాటించను. నా మనస్సు చెప్పినట్టే వింటాను, నాకు నచ్చినట్లే చేస్తాను’ అని అంటుంటారు. మనస్సు చెప్పినట్టు అనుసరించటం మంచిదే అనుకున్నా, వారి మనస్సు వారిని తప్పుదోవ పట్టించటం లేదన్న గ్యారంటీ లేదుగా? ఇలా ఒక నానుడిలో చెప్పినట్టు, ‘నరకానికి మార్గం మంచి భావాలతోనే వేయబడి ఉంటుంది..’ అందుకే, మన మనస్సు మనలను సరియైన దిశలోనే తీసుకువెళుతున్నదా, లేదా అనేదానిని, శాస్త్రములతో పరీక్షించి, సరిచూసుకోవాలి. భూత, వర్తమాన, భవిష్యత్తులలో, ఏ ఆధ్యాత్మిక సూత్రము యొక్క ప్రామాణికత అయినా, వేదము ఆధారంగానే నిర్ణయింపబడాలి. కాబట్టి, శాస్త్రముల ఉపదేశం అర్థం చేసుకుని, తద్విధముగానే నడుచుకొమ్మని అర్జునుడికి చెబుతూ, ఈ అధ్యాయమును ముగిస్తున్నాడు, శ్రీ కృష్ణ భాగవానుడు.

ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం, యోగ శాస్త్రే శ్రీ కృష్ణార్జునసంవాదే, దైవాసుర సంపద్విభాగ యోగో నామ షోడశోధ్యాయ:

శ్రీ మద్భగవద్గీతలోని జ్ఞానషట్కం, పదహారవ అధ్యాయం, దైవాసుర సంపద్విభాగ యోగంలోని, 24 శ్లోకాలూ సంపూర్ణం.

07:08 - ఇక మన తదుపరి వీడియోలో, పదిహేడవ అధ్యాయం, శ్రద్ధా త్రయ విభాగ యోగములో, శ్రీ కృష్ణుడు విశదపరిచిన నిగూఢార్థాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Wednesday, July 12, 2023

ఏది నీది? What belongs to you? భగవద్గీత Bhagavadgita


ఏది నీది?
సమాజంలో ఉండే నాలుగు రకాలైన మనుష్యులు ఎవరు?

'భగవద్గీత' షోడశోధ్యాయం - దైవాసుర సంపద్విభాగ యోగం (13 – 16 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహారవ అధ్యాయం, దైవాసుర సంపద్విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, దైవాసుర సంపద్విభాగ యోగములోని, 13 నుండి 16 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/V53m_Aej3zs ]



అసురీ లక్షణాలను కలిగిన వారు ఎలా ఆలోచిస్తారో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:48 - ఇదమద్య మయా లబ్దమ్ ఇమం ప్రాప్స్యే మనోరథమ్ ।
ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్ ।। 13 ।।

00:58 - అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి ।
ఈశ్వరోఽహమహం భోగీ సిద్ధోఽహం బలవాన్ సుఖీ ।। 14 ।।

01:08 - ఆఢ్యోఽభిజనవానస్మి కోఽన్యోఽస్తి సదృశో మయా ।
యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః ।। 15 ।।

ఆసురీ లక్షణములు కలిగిన వారు ఇలా ఆలోచిస్తారు.. ‘నేను ఈనాటికే చాలా ధనమును సంపాదించాను. నా ఈ కోరికను తీర్చుకుంటాను. ఇదంతా నాదే. రేపు నాకు ఇంకా వస్తుంది. ఆ శత్రువు నాచే నాశనం అయిపోయాడు, మరియు నేను మిగతావారిని కూడా నాశనం చేస్తాను! నేనే స్వయంగా దేవుడి వంటి వాడిని. నేనే ఇదంతా భోగించేది. నేను దోషరహితుడను. నేను శక్తిమంతుడను మరియు నేను ఆనందంగా ఉన్నాను. నేను ధనవంతుడను మరియు గొప్ప హోదాలలో ఉన్న బంధువులు నాకు ఉన్నారు. నాకు ఇక సాటి ఎవరు? నేను దేవతలకు యజ్ఞములు చేస్తాను; దానములు ఇస్తాను; ఆనందిస్తాను.’ ఈ విధంగా, వారు అజ్ఞానముచే భ్రమపడుతుంటారు.

నైతికత్వాన్ని పూర్తిగా విస్మరిస్తూ, తమకేది నచ్చితే దానిని అనుభవించే హక్కు తమకుందని, ఆసురీ లక్షణములు కలవారనుకుంటారు. తన స్వప్రయోజనాలు నెరవేరటం కోసం, పరిస్థితులను తమ వైపు తిప్పుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వైదిక కర్మ కాండలు తమకు భౌతిక సంపత్తిని కలుగచేస్తాయని తెలుసుకుని, వారు కీర్తి సంపదల కోసం యజ్ఞయాగాదులు కూడా నిర్వహిస్తుంటారు. కానీ, ఏవిధంగా అయితే రాబందు ఎత్తులో ఎగిరినా, దాని చూపు క్రిందికే నిమగ్నమై ఉంటుందో, ఆసురీ స్వభావము కలవారు, కొన్నిసార్లు సమాజంలో ఉన్నతహోదాకి ఎదిగినా, వారి పనులు నీచమైనవిగా, మరియు నిమ్నస్థాయిలో ఉంటాయి. వారి కోరికలను తీర్చుకునేందుకు ఉన్న అవరోధాలను తొలగించటానికీ, ఇతరులకు హాని చేయటానికీ, లేదా గాయపరచటానికి కూడా వెనుకాడరు. నాలుగు రకాలైన మనుష్యులు ఉంటారు సమాజంలో.

మొదటి రకం మనుష్యులు, సాధు పురుషులు. వారు ఇతరుల సంక్షేమం కోసం, తమ స్వార్థ-ప్రయోజనాన్ని వదిలి పెడతారు. రెండవ రకం మనుష్యులు, సాధారణమైన వారు. వీరు తమకు హాని కలగనంత వరకూ, ఇతరుల సంక్షేమం కోసం పనిచేస్తారు. మూడవ రకం మనుష్యులు, ఆసురీ గుణాలు కలవారు. వారి స్వార్థ-ప్రయోజనం నెరవేరుతుంది అంటే, ఇతరులకు హాని చేయటానికీ వెనుకాడరు. ఇక నాల్గవ రకం మనుష్యులు కూడా ఉంటారు. అకారణంగా ఇతరులను బాధ పెడుతుంటారు. అటువంటి వారికి సరిపోయే పేరు కూడా లేదు. శ్రీ కృష్ణుడు, నీచమైన ఆసురీ ప్రవృత్తి గల వారిని, ఇక్కడ స్పష్టముగా వివరిస్తున్నాడు. గర్వముతో కళ్ళు మూసుకుపోయి, వారు ఈ విధముగా అనుకుంటారని చెబుతున్నాడు: ‘నేను ఒక ఐశ్వర్యవంత రాచరిక కుటుంబంలో పుట్టాను. ధనవంతుడను, మరియు బలవంతుడను. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. భగవంతుని ముందు మ్రోకరిల్లాల్సిన అవసరమూ నాకు లేదు. ఎందుకంటే, నేనే దేవుడి లాంటి వాడను’. చాలా సందర్భాలలో, మనుషులు ‘నేను’ అన్నప్పుడు, అది వారి అహంకారము మాట్లాడుతున్నట్టు.. వారు కాదు. ఈ అహంకారమనేది, అభిప్రాయాలూ, బాహ్య వేషధారణ, కోపావేశాల వంటి వాటితో, వ్యక్తిగతంగా అనుసంధానం అయి ఉంటుంది. ఈ అహంకారమనేది, దానికే ఒక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటుంది. దాని ప్రభావముచే, జనులు తలంపులు, భావోద్వేగాలు, మరియు జ్ఞాపకాలతో అనుసంధానమై ఉంటారు. వాటిని తమలో భాగమే అనుకుంటారు. ఈ అహంకారమే, ‘ఇది నాది’ అన్న భావన కలిగి ఉంటుంది. కానీ, ఈ యజమానత్వము తాత్కాలికమైనదే. దానిలోనే, ‘ఇది చాలదు’ అన్న గాఢమైన అసంతృప్తి భావన ఉంటుంది. ఈ యొక్క తీరని కోరికే, వ్యాకులతనూ, కలవరపాటునూ, విసుగునూ, ఆందోళననూ, మరియు అసంతృప్తినీ కలుగ చేస్తుంది. పర్యవసానంగా, యధార్థము యొక్క మరింత వికృతమైన అనుభూతి కలుగుతుంది. అది నిజమైన ఆత్మ నుండి, ‘నేను’ ను మరింత దూరం చేస్తుంది. ఈ అహంకారమే, మన జీవితంలో అత్యంత పెద్ద అబద్ధాన్నిసృష్టిస్తుంది. మనం-కాని దాన్ని మనముగా చూపిస్తుంది. ఈ విధంగా, ధర్మమార్గంలో పురోగతి కోసం, సమస్త మతధర్మాలూ, మరియు సాధువులూ, మన అహంకార పూరిత ఆలోచనా పరంపరను విధ్వంసం చేయాలని, వేడుకుంటారు.

05:39 - అనేకచిత్తవిభ్రాంతాః మోహజాలసమావృతాః ।
ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేఽశుచౌ ।। 16 ।।

ఇటువంటి ఊహలూ, తలంపులతో తప్పుదారి పట్టి, చిత్తభ్రాంతి వలలో చిక్కుకుపోయీ, మరియు ఇంద్రియ సుఖాల తృప్తికి బానిసై పోయి, వారు అధోః నరకాలకు పతనమై పోతారు.

అహంకారపు పట్టులో, జనులు తమను తాము, తమ యొక్క మనస్సుతో అనుసంధానం చేసుకుని, దానియొక్క భ్రష్టుపట్టిన, మరియు నిరంతరంగా వచ్చే ఆలోచనా పరంపరకు బానిసై పోతారు. పూర్తిగా తమ మనస్సు యొక్క ఆధీనము లోనికి వెళ్ళిపోతారు. వారి మనస్సు సృష్టించిన జగత్తులో నివసిస్తుంటారు. అపవిత్రమైన మనస్సుకు ఇష్టమైన ఇటువంటి ఒక పని ఏమిటంటే, అస్తమానం ఫిర్యాదు చెయ్యటం. అది ఎప్పుడూ మనుష్యుల పట్లే కాక, పరిస్థితుల పట్ల కూడా సణుగుతూ, కోపంతో ఉంటూ ఉంటుంది. మనకున్న ప్రతి ఒక్క అసంతృప్తీ, మన మనస్సు సృష్టించినదే. వ్యక్తి దాన్ని గుడ్డిగా, పూర్తిగా నమ్మేస్తాడు. తలలో ఉన్న స్వరం, మన జీవితం గురించి దుఃఖపూరిత, ఆందోళనకర, లేదా క్రోధపూరిత కథలను చెబుతుంటుంది. పాపం ఆ వ్యక్తి, అహంకారము యొక్క పట్టులో ఉండి, ఆ చెప్పబడే దానిని నమ్ముతాడు. ఈ అసంతృప్తి తీవ్రమైనప్పుడు, అది ఆక్రోశముగా మారుతుంది. ఆక్రోశము అంటే, దుఃఖంతో, కోపంగా, వేదనతో, మనస్సు నొప్పించబడినట్టు ఉండటం. ఈ ఆక్రోశము చాలా కాలం ఉండిపోతే, అది వ్యధగా మారుతుంది. వ్యధ అంటే, భూతకాలంలో జరిగిన ఏదేని ఒక సంఘటనతో అనుసంధానమై, పదేపదే ‘నాపట్ల వారు ఇలా చేసారు’ అనే దాని గురించే ఆలోచిస్తూ, దానిని మనస్సులోనే ఉంచుకున్న, ఒక తీవ్రమైన, ప్రతికూల భావోద్వేగము. ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు అనేదేమిటంటే.. అహంకారముచే సృష్టించబడిన, మోహ భ్రాంతి వలలోనే ఉండాలని నిర్ణయించుకున్న ఆసురీ ప్రవృత్తి మనుష్యులు, ఎన్నెన్నో నీచమైన అలోచనలచే సతమతమై పోతుంటారు. అందువలన, వారి భవిష్యత్తును చీకటిమయం చేసుకుంటారు. మానవులు తమ స్వంత చిత్తముతో కర్మలు చేయటానికి, వారికి పూర్తి స్వేచ్ఛ ఉన్నది. కానీ, వారు చేసిన కర్మల యొక్క ఫలితములు వారే నిర్ణయించుకునే అధికారం లేదు. కర్మ సిద్ధాంతమును అనుసరించి, కర్మఫలములను ఆ భగవంతుడే వారికి ప్రసాదిస్తాడు. ఆసురీ స్వభావమును ఎంచుకున్న వారిని, వారి తదుపరి జన్మలలో, భగవంతుడు నిమ్న, నీచ స్థాయి జీవనం లోనికి పంపించి వేస్తాడు. సాత్త్విక బుద్ధితో ప్రవర్తించేవారు, ఉన్నత స్థాయికి వెళతారు; రాజసిక ప్రవృత్తితో వ్యవహరించేవారు, మధ్యమ స్థాయిలోనే ఉండిపోతారు; తామసిక మనస్తత్వంతో పనిచేసేవారూ, మరియు పాపిష్టి పనులపై మొగ్గు చూపేవారూ, నిమ్న స్థాయి లోకాలకు పడిపోతారు.

08:38 - ఇక మన తదుపరి వీడియోలో, దురహంకారము కలిగిన మనుషులు ఏవిధంగా నడుచుకుంటారో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Wednesday, July 5, 2023

చార్వాక సిద్ధాంతం! Charvaka Philosophy భగవద్గీత Bhagavadgita

చార్వాక సిద్ధాంతం!
మనిషి జీవించడానికి అవసరమైన దానికంటే ఎక్కువ పోగుజేసుకుంటే ఏమవుతుంది?

'భగవద్గీత' షోడశోధ్యాయం - దైవాసుర సంపద్విభాగ యోగం (09 – 12 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహారవ అధ్యాయం, దైవాసుర సంపద్విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, దైవాసుర సంపద్విభాగ యోగములోని, 9 నుండి 12 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/wPNEPowYsWk ]


ఏ విధంగా మోహితులై, తాత్కాలికమైన వాటికి ఆకర్షితులమవుతామో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:49 - ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోఽల్పబుద్ధయః ।
ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతోఽహితాః ।। 9 ।।

ఇటువంటి దృక్పథంలో గట్టిగా ఉండి, ఈ తప్పుదోవపట్టిన జీవాత్మలు, అల్ప బుద్ధితో, మరియు కౄర కార్యములతో, ప్రపంచానికి శత్రువులుగా మారి, దానిని విధ్వంసం చేయ భయపెడతారు.

నిజమైన ఆత్మ-జ్ఞానం లేక, ఆసురీ ప్రవృత్తి కలవారు, వారి యొక్క మలినమైన బుద్ధిచే, యధార్ధసత్యము యొక్క వక్రీకరించబడిన దృక్పథాన్ని పుట్టిస్తారు. చార్వాక సిద్ధాంతము, దీనికి ఒక ఉదాహరణ. ‘బ్రతికినంత కాలం సుఖిస్తూ బ్రతుకు. ఒకవేళ నెయ్యి త్రాగటం ఇష్టమైతే, అప్పుచేసైనా సరే అలాగే చెయ్యి. ఈ శరీరము భస్మమైపోయిన తరువాత, నీవు ఇక ఉండవు, మళ్లీ ఈ లోకం లోకి తిరిగి రావు’ అని చార్వాక సిద్ధాంతం ప్రబోధిస్తుంటుంది. ఈ ప్రకారంగా ఆసురీ-మనస్తత్త్వం కలవారు, ఆత్మ యొక్క నిత్య శాశ్వత అస్థిత్వమునూ, మరియు కర్మ ఫల ప్రతిచర్యనూ తిరస్కరిస్తారు; దీనితో వారు ఏ సంకోచమూ లేకుండా స్వార్థ పనులలో నిమగ్నమై, ఇతరుల పట్ల క్రూరంగా కూడా ప్రవర్తించటానికి వీలుగా ఉంటుంది. ఒకవేళ వారికి ఇతరులపై అధికారం ఉంటే, వారిపై కూడా, ఈ తప్పుడు దారి పట్టిన భౌతిక దృక్పథాన్ని రుద్దుతారు. ఇతరులకు బాధ కలిగించయినా, లేదా ప్రపంచాన్ని నాశనం చేసయినా, వారి యొక్క స్వార్థ పూరిత లక్ష్యము సాధించటానికి, సంకోచించరు. చరిత్రలో హిట్లర్, ముస్సోలిని, స్టాలిన్ వంటి నిరంకుశత్వ ఉన్మాదులూ, మరియు చక్రవర్తులను, మానవజాతి చాలా సార్లు ప్రత్యక్షంగా చూసింది; వారు సత్యం యొక్క తమ స్వంత పాపిష్టి దృక్పథంచే ప్రేరేపితమై, ‘ప్రపంచానికి’ చెప్పలేని దుఃఖాన్నీ, మరియు వినాశనాన్నీ కలుగచేశారు.

02:41 - కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః ।
మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్ ప్రవర్తంతేఽశుచివ్రతాః ।। 10 ।।

తృప్తిపరచలేని కామముతో ఉంటూ, దంభము, దురభిమానము, మరియు గర్వముతో నిండిపోయి, ఈ ఆసురీ లక్షణములు కలవారు, తప్పుడు సిద్ధాంతములను పట్టుకుని వుంటారు. ఈ విధంగా మోహితులై, వారు తాత్కాలికమైన వాటికి ఆకర్షితమై, అపవిత్ర సంకల్పంతో ప్రవర్తిస్తారు.

తృప్తిపరచలేని కామ కోరికల తుష్టి కోసం ప్రయత్నిస్తూ, ఆసురీ స్వభావము కలవారు, అత్యంత అపవిత్ర హృదయంతో ఉంటారు. కపట బుద్ధితో నిండిపోయి, ఎదో మంచి వారిలాగా నటిస్తుంటారు. వారి మోహపూరితమైన బుద్ధి, తప్పుడు ఆలోచనలను పాటిస్తుంది. వారి గర్వము, తమ కంటే తెలివికలవారు ఎవరూ లేరన్న భావనను కలిగిస్తుంది. తాత్కాలికమైన ఇంద్రియ సుఖముల పట్ల ఆకర్షితులై, వారి బుద్ధి, నీచంగా, స్వార్థ పూరితంగా, మరియు గర్విష్ఠిగా అవుతుంది. ఈ విధంగా వారు శాస్త్ర ఉపదేశాలను పట్టించుకోకుండా, ధర్మబద్ధమైన, సత్యవంతమైన నడవడికకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు.

03:53 - చింతామపరిమేయాం చ ప్రలయాంతాముపాశ్రితాః ।
కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః ।। 11 ।।

వారు అంతులేని చింతలు, లేక ఆందోళనలచే సతమతమై పోతుంటారు. అవి చివరకు మరణంతోనే ముగుస్తాయి. అయినా సరే, వాంఛల సంతుష్టి, మరియు ఆస్తులు కూడగట్టుకోవటమే జీవిత పరమావధి అని, నిశ్చయముగా ఉంటారు.

భౌతిక దృక్పథంలో ఉన్న జనులు తరచుగా ఆధ్యాత్మిక మార్గాన్ని - అది కష్టతరమైనది, మరియు భారమైనదనీ, మరియు అంతిమ లక్ష్యం చాలా దూరమైనదనీ, తిరస్కరిస్తారు. త్వరగా ఫలితాలను ఇచ్చే ఈ ప్రాపంచిక మార్గాన్నే వారు అనుసరిస్తారు కానీ, ప్రాపంచిక మార్గంలో ఇంకా ఎక్కువ బాధలు పడుతుంటారు. భౌతిక సంపాదనలకై ఉన్న వారి కోరికలు, వారిని క్షోభకు గురిచేస్తుంటాయి. వారి ఆశయాలను పూర్తిచేసుకోవటానికి, ఏవేవో పెద్ద పెద్ద ప్రణాళికలు వేసుకుంటారు. వారు కోరుకున్న వస్తువును పొందగానే కాసేపు ఉపశమనం పొందినా, వెంటనే కొత్త క్షోభ మొదలవుతుంది. వారు సంపాదించిన వస్తువు దెబ్బతింటుందనో, ఇతరులెవరైనా తీస్కుంటారేమో అన్న ఆందోళనతో, దానిని కాపాడుకోవటానికి శ్రమిస్తుంటారు. చిట్టచివరికి, ఆ మమకారాసక్తి ఉన్న వస్తు-విషయంతో, అనివార్యమైన ఎడబాటు సంభవించినప్పుడు, మిగిలేది దుఃఖమే. ఈ ప్రపంచంలోని జనులు, చెప్పలేని బాధలనూ, మరియు ఒత్తిడినీ, పాపంచిక ప్రయాసలో అనుభవిస్తుంటారు – సంతానాన్ని పెంచటం, వ్యాపారం చేయటం, ఆస్తి-పాస్తులను కూడబెట్టడం, మరియు కీర్తి ప్రతిష్ఠలను సంపాదించుకోవడం వంటివి. వారు గనక ఇదే విధమైన అనురాగమూ, శ్రద్ధా, ఆ శ్రీ కృష్ణుడి పాదారవిందముల వద్ద ప్రేమను పెంచుకోవటంలో చూపిస్తే, వారు ఇక ఎన్నటికీ ఆ మృత్యు దేవత, యమరాజు గురించి చింతించవలసిన అవసరం ఉండదు. కానీ, ఆసురీప్రవృత్తి కలవారు, ఈ పచ్చినిజాన్ని ఒప్పుకోవటానికి తిరస్కరిస్తారు. ఎందుకంటే, ఈ ప్రాపంచిక సుఖాలే అత్యున్నత ఆనందమని, వారి బుద్ధులు నిశ్చయంతో ఉంటాయి. వారిని నికృష్ట లోకాలకు తీసుకుపోవటానికీ, మరియు మరింత దుఃఖపూరిత తదుపరి జన్మలలోకి తీసుకువెళ్ళటానికీ, మృత్యువు ఓర్పుతో నిరీక్షిస్తున్నదని కూడా, తెలుసుకోలేరు.

06:13 - ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ।
ఈహంతే కామభోగార్థమ్ అన్యాయేనార్థసంచయాన్ ।। 12 ।।

వందల కొద్దీ కోరికలచే కట్టివేయబడీ, మరియు కామ క్రోధములచే ఆవరించబడీ, వారు అన్యాయ పద్ధతులలో సంపదను ప్రోగుచేయటానికి శ్రమిస్తారు. ఇదంతా వారి ఇంద్రియ సుఖాల కోసమే.

ఈ ప్రపంచాన్ని భోగించటానికి, డబ్బు ఒక సాధనం. అందుకే అంతులేని కోరికలతో, భౌతిక దృక్పథంలో ఉన్న జనులు, డబ్బు సంపాదించటానికి, అంత ప్రాముఖ్యతను ఇస్తారు. వారు అన్యాయ పద్ధతులలో డబ్బు ప్రోగుచేసుకోవటానికి కూడా, సంకోచించరు. అందుకే వారి అనైతిక ప్రవర్తనకు, రెట్టింపు శిక్ష ఉంటుంది. భాగవతం పేర్కోన్న దాని ప్రకారం, వ్యక్తి జీవన నిర్వహణకు సరిపోయినంత సంపద మాత్రమే, ఆ వ్యక్తికి ఉంచుకునే అర్హత ఉంది. ఒకవేళ ఎవరైనా తన అవసరాని కన్నా ఎక్కువ ప్రోగుచేసుకుంటే, భగవంతుని దృష్టిలో అతను దొంగ. అందుకతను శిక్షింపబడతాడు. ఏమిటి ఆ శిక్ష? అంటే, మొదటగా, మరణ సమయంలో, ప్రోగు చేసుకున్న సంపద మనతో పాటుగా రాదు. అది తీసివేయబడుతుంది. అంతేకాక, కర్మ సిద్ధాంతమును అనుసరించి, ఈ సంపత్తి ప్రోగుచేసిన వ్యవహారాలలో చేసిన పాపములకు, శిక్షింపబడతాడు. అది ఎలాగంటే, ఒక స్మగ్లర్ పట్టుబడితే, అతని సామాను జప్తుచేయబడుతుంది, చట్టాన్ని ఉల్లఘించినందుకు, అతనికి శిక్ష కూడా పడుతుంది. అదే విధంగా, మనం కూడా శిక్షను అనుభవించవలసి ఉంటుంది.

07:50 - ఇక మన తదుపరి వీడియోలో, ఆసురీ లక్షణాలు కలిగిన వారు ఎలా ఆలోచిస్తారో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Wednesday, June 14, 2023

సందిగ్ధావస్థ! భగవద్గీత Bhagavadgita


సందిగ్ధావస్థ! వేర్వేరు యుగాలలో మంచి చెడుల తారతమ్యం!

'భగవద్గీత' షోడశోధ్యాయం - దైవాసుర సంపద్విభాగ యోగం (05 – 08 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహారవ అధ్యాయం, దైవాసుర సంపద్విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, దైవాసుర సంపద్విభాగ యోగములోని, 5 నుండి 8 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/zEORvI6uU9s ]


ఆసురీ గుణాల పూర్తి వివరణను, శ్రీ కృష్ణుడిలా చెబుతున్నాడు..

00:46 - దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా ।
మా శుచః సంపదం దైవీమభిజాతోఽసి పాండవ ।। 5 ।। 

దైవీ గుణములు మోక్షము దిశగా తీసుకువెళతాయి. కానీ, ఆసురీ గుణములు, బంధనములో చిక్కుకుపోయి ఉండటానికి కారణమౌతాయి. శోకింపకుము అర్జునా.. నీవు దైవీ గుణములతోనే జన్మించినవాడవు.

శ్రీ కృష్ణుడు ఈ రెండు స్వభావాల పరిణామాలను వివరిస్తున్నాడు. ఆసురీ గుణములు, వ్యక్తిని జన్మ-మృత్యు-సంసార బంధనాలకు కట్టివేస్తాయని చెబుతున్నాడు. అదే సమయంలో, దైవీ గుణములను పెంపొందించు కోవటం, మాయా బంధనము నుండి విముక్తి పొందటానికి, దోహదం చేస్తుంది. ఆధ్యాత్మిక మార్గాన్ని విజయవంతముగా అనుసరిస్తూ, చివరి వరకూ దానిలోనే ఉండటంలో, సాధకుడు చాలా విషయాల పట్ల జాగరూకతతో ఉండాలి. గర్వము, కపటత్వము వంటి ఒక్క ఆసురీ గుణము వ్యక్తిత్వములో ఉండిపోయినా, అది ఓటమికి కారణం కావచ్చు. అదే సమయంలో, మనము దైవీ గుణములను పెంపొందించుకోవాలి. ఎందుకంటే, పవిత్ర గుణములు లేకుంటే, మన ఆధ్యాత్మిక పురోగతి మళ్లీ కుంటుపడవచ్చు. క్షమా గుణము లేకుంటే, మనస్సు ఎప్పుడూ ద్వేష భావనతోనే ఉండిపోయి, అది భగవంతునిలో నిమగ్నమై ఉండలేదు. కానీ, శ్రీ కృష్ణ పరమాత్మ పేర్కొన్న ఈ దైవీ గుణములను పెంపొందించుకుంటే, వేగంగా పురోగతి సాధించే సామర్ధ్యం, మరియు మార్గంలో ఎదురయ్యే అవరోధాలను ఎదుర్కునే శక్తీ పెరుగుతాయి. ఈ విధంగా, మంచి గుణములను పెంపొందించుకోవడం, మరియు చెడు గుణములను నిర్మూలించుకోవటం అనేవి, ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యమైన భాగమే. భగవంతుని పట్ల భక్తిని పెంపొందించుకుంటూ ఉంటే, సహజంగానే కాలక్రమేణా, శ్రీ కృష్ణుడు పేర్కొన్న దైవీ గుణములను ఆర్జించుకోవచ్చని, కొందరు వాదిస్తారు. నిజానికి ఇది యదార్ధమే. కానీ, మనం ప్రారంభంలోనే సంపూర్ణ భక్తితో, ఏ చెడు గుణములూ లేకుండా మొదలిడుతామన్నది కష్టమే. వాటిలో ఏ ఒక్కటయినా, మన భక్తి పురోగతిలో తీవ్ర అవరోధం కలిగించవచ్చు. భక్తిని క్రమక్రమంగా, అభ్యాసం ద్వారా పెంపొందించుకోవాలి. దైవీ గుణములను పెంపొందించుకోవటం, మరియు ఆసురీ గుణములను నిర్మూలించుకోవటం ద్వారా, అభ్యాసములో విజయం సాధించవచ్చు.

03:08 - ద్వౌ భూతసర్గౌ లోకేఽస్మిన్ దైవ ఆసుర ఏవ చ ।
దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు ।। 6 ।।

ఈ జగత్తులో రెండు రకాల జీవులు ఉంటారు - దైవీ గుణములు కలిగి ఉన్నవారు, మరియు ఆసురీ స్వభావము కలిగి ఉన్నవారు. నేను దైవీ గుణములను విస్తారముగా వివరించి ఉన్నాను. ఓ అర్జునా, ఆసురీ స్వభావమును గురించి చెబుతాను, వినుము.

అన్ని జీవాత్మలు, తమతమ పూర్వ జన్మల నుండి వస్తూ ఉన్న స్వభావాలను కలిగి ఉంటాయి. ఆ ప్రకారంగానే, గత జన్మలలో దైవీ గుణములను పెంపొందించుకున్నవారు, మరియు పుణ్య కార్యములను చేసిన వారు, ఈ జన్మలో దైవీ గుణములతో పుడతారు. కానీ, గత జన్మలలో పాపపు పనులు చేసిన వారూ, తమ మనస్సులను అపవిత్రం చేసుకున్నవారూ, ఈ జన్మలో కూడా అవే స్వభావాలను కలిగి ఉంటారు. ఈ ప్రపంచంలో జీవులకు, అందుకే విభిన్న రకములైన స్వభావాలు ఉంటాయి. దైవీ మరియు ఆసురీ గుణములు రెండూ, పూర్తి పరస్పర విరుద్ధ స్వభావములు. స్వర్గాది లోకాలలో ఉన్న జీవులు ప్రధానంగా, దైవీ గుణములను కలిగి ఉంటారు. అలాగే, ఆసురీ గుణములు క్రింది లోకాలలో ఎక్కువగా ఉంటాయి. మానవులు దైవీ, ఆసురీ గుణములను రెంటినీ కలిగి ఉంటారు. ఏంతో క్రూరమైన కాసాయి వాడికి కూడా, వ్యక్తిగత జీవితంలో దయాగుణమున్నట్టు మనము గమనించవచ్చు. అలాగే, ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధకులలో కూడా, మనకు గుణ దోషములు కనపడతాయి. సత్య యుగములో దేవతలు, రాక్షసులు వేర్వేరు లోకాలలో ఉండేవారని చెబుతారు; త్రేతా-యుగములో, వారు ఒకే లోకంలో ఉండేవారు; ద్వాపర యుగములో, ఒకే కుంటుంబంలో ఉండేవారు; కలి యుగంలో, ఒకే వ్యక్తి హృదయంలో, దైవీ, ఆసురీ గుణములు కలిసే ఉంటాయని చెబుతారు. అదే మానవ జీవితంలో ఉండే సందిగ్ధావస్థ. ఉన్నత అస్థిత్వము మనలను భగవంతుని వైపుకు, పైకి తీసుకువెళితే, నిమ్న స్థాయి అస్థిత్వము మనలను, క్రిందికి గుంజుతుంటుంది.

05:14 - ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః ।
న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే ।। 7 ।।

ఆసురీ గుణములు కలవారు, ఏది మంచి నడవడిక, ఏది చెడు నడవడిక అని అర్థం చేసుకోరు. అందుకే వారు పవిత్రత, సత్ప్రవర్తన, లేదా కనీసం సత్యసంధత కూడా కలిగి ఉండరు.

ధర్మము అంటే, ఒక వ్యక్తి యొక్క పరిశుద్ధతకూ, మరియు సర్వ భూతముల సాధారణ సంక్షేమానికీ దోహదపడే నియమములు. అధర్మము అంటే, దిగజారిపోవటానికి దారితీసే, మరియు సమాజానికి హాని చేసే, నిషేధింపబడ్డ పనులు. ఆసురీ స్వభావమనేది, జ్ఞానము యందు, మరియు శాస్త్ర విజ్ఞానము పట్లా విశ్వాసరాహిత్యముగా ఉంటుంది. కాబట్టి, దాని ప్రభావంలో ఉన్నవారు, ఏది ఒప్పో, ఏది తప్పో తెలియని అయోమయ స్థితిలో ఉంటారు. ఉదాహరణకు, ఎవరికైనా ట్రాఫిక్ సిగ్నల్స్ ని పాటించకపోవడం ఒప్పుగానే అనిపిస్తే, ఆ వ్యక్తి తాను ఒప్పు అనుకున్నది చేయటం వలన, ఇతరుల జీవితాలను కూడా ప్రమాదంలో పెడతాడు. ఆసురీ స్వభావమనేది, ఏది మంచి, ఏది చెడు, అన్న విషయంపై అయోమయ స్థితిలో ఉంటుంది. అందుకే వారిలో స్వచ్ఛత / పవిత్రత, సత్యము, సరియైన నడవడిక అగుపించవని, శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు.

06:34 - అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్ ।
అపరస్పరసంభూతం కిమన్యత్ కామహైతుకమ్ ।। 8 ।।

వారు ఇలా అంటారు.. ‘ఈ జగత్తులో పరమ సత్యమనేది ఏదీ లేదు. ఏ రకమైన నైతిక నియమ ఆధారమూ లేదు. అసలు భగవంతుడు అనేవాడే లేడు. ఇదంతా స్త్రీ-పురుష సంయోగము వలననే ఉద్భవించినది, మరియు లైంగిక తృప్తి కంటే వేరే ఇతర ప్రయోజనమేమీ లేదు’ అని అంటారు.

అనైతిక ప్రవర్తన నుండి దూరంగా ఉండటానికి, రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది సంకల్ప బలం ద్వారా అధార్మికత నుండి దూరంగా ఉండటం. రెండవది భగవంతుని భయం వల్ల పాపిష్టి పనులకు దూరంగా ఉండటం. కేవలం సంకల్ప బలం వల్ల మాత్రమే, పాపపు పనులకు దూరంగా ఉండేవారు, చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఎక్కువ శాతం మంది, దండన / శిక్ష భయం వలననే, తప్పుడు పనులు చేయటానికి వెనకాడుతారు. ఆసురీ స్వభావములు కలవారు, భగవంతుని మీద విశ్వాసంతో వచ్చే ఈ యొక్క భగవత్ అజమాయిషీనీ, మరియు నియమబద్ధ ప్రవర్తననూ అంగీకరించటానికి ఒప్పుకోరు. బదులుగా, అసలు భగవంతుడు అనేవాడు లేడు, మరియు నైతిక ప్రవర్తనకు ఈ ప్రపంచంలో ఆధారం లేదన్న దృక్పథాన్నే, అవలంభిస్తారు. సంశయము లేకుండా, లేదా పరిణామాల మీద భయం లేకుండా, ఇంద్రియములను తృప్తి పరచటంలో నిమగ్నమవ్వటానికి, కొన్ని సిద్ధాంతాలు వారికి అనుకూలంగా ఉంటాయి. వివిధములైన ఇంద్రియ తృప్తులలో, లైంగిక భోగము తీవ్రమయినది. ఇది ఎందుకంటే, ఈ భౌతిక జగత్తనేది, ఆద్ధ్యాత్మిక జగత్తు యొక్క వక్రీకరించబడిన పరావర్తనం వంటిది. ఆధ్యాత్మిక జగత్తులో, ముక్తి నొందిన జీవుల యొక్క కార్యకలాపాలకూ, మరియు వారు భగవంతునితో చేసే వ్యవహారాలకూ, దివ్య ప్రేమ అనేదే మూలాధారము. భౌతిక జగత్తులో, దానియొక్క వక్ర ప్రతిబింబమైన కామమే, భౌతికంగా బద్ధులైన జీవుల మనస్సులలో ప్రధానంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా, రజో గుణ ప్రభావంలో ఉన్నవారికి. అందుకే, ఆసురీ మనస్సు కలవారు, లైంగిక కార్యకలాపములే మానవ జీవన ప్రయోజనమని అనుకుంటారు.

08:48 - ఇక మన తదుపరి వీడియోలో, ఏ విధంగా మోహితులై, తాత్కాలికమైన వాటికి ఆకర్షితులమవుతామో, శ్రీ కృష్ణుడి మాటల్లో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Wednesday, June 7, 2023

అత్యున్నత లక్ష్యం! దైవీ స్వభావం యొక్క ఇరవై ఆరు గుణములను శ్రీ కృష్ణుడు ఏమని వివరించాడు? భగవద్గీత Bhagavadgita

అత్యున్నత లక్ష్యం! దైవీ స్వభావం యొక్క ఇరవై ఆరు గుణములను శ్రీ కృష్ణుడు ఏమని వివరించాడు?

భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహారవ అధ్యాయం, దైవాసుర సంపద్విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, దైవాసుర సంపద్విభాగ యోగములోని, 1 నుండి 4 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/XiCTrae3dQg ]


మనుష్యులలో ఉండే రెండు రకాల స్వభావాలైన దైవీ గుణాలు, మరియు ఆసురీ గుణాలను, శ్రీ కృష్ణుడిలా వివరించబోతున్నాడు.

00:50 - శ్రీ భగవానువాచ ।
అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః ।
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్ ।। 1 ।।

01:01 - అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతిరపైశునమ్ ।
దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్ ।। 2 ।।

01:11 - తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా ।
భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత ।। 3 ।।

శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు: ఓ భరత వంశీయుడా, దైవీ సంపద కలవాని లక్షణములు - నిర్భయత్వము, కల్మషం లేని మనస్సు, ఆధ్యాత్మిక జ్ఞానములో ధృఢసంకల్పము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞములను చేయుట, పవిత్ర గ్రంధ పఠనం, తపస్సు మరియు నిష్కాపట్యం, అహింస, సత్య సంధత, క్రోధము లేకుండుట, త్యాగము, శాంతి, ఇతరుల దోషములు వెతకకుండా ఉండుట, సర్వ ప్రాణులపట్ల దయ, దురాశ లేకుండుట, సౌమ్యత, అణకువ, మరియు నిశ్చలత్వము, బలము, క్షమాగుణము, మనఃస్థైర్యము, పరిశుభ్రత, ఎవరిపట్లా శత్రుత్వం లేకుండుట, మరియు దురభిమానం లేకుండుట.

ఇక్కడ శ్రీ కృష్ణుడు దైవీ స్వభావం యొక్క ఇరవై ఆరు గుణములను వివరిస్తున్నాడు. అత్యున్నత లక్ష్యం దిశగా వెళ్ళటానికి, మన ఆధ్యాత్మిక సాధనలో భాగంగా వీటిని మనం పెంపొందించుకోవాలి. 

నిర్భయత్వం: వర్తమాన కాలంలో మరియు భవిష్యత్తులో ఉండే కష్టాల మీద చింతన నుండి విముక్తి భావమే ఇది. దేనిమీదైనా మితిమీరిన మమకారాసక్తియే, ఈ భయాన్ని కలుగ చేస్తుంది. ధనం మీద వ్యామోహం, డబ్బులు పోతాయేమో అన్న భయాన్ని కలుగచేస్తుంది. సామాజిక కీర్తిప్రతిష్ఠల మీద మక్కువ, అపఖ్యాతి అంటే భయాన్ని కలుగచేస్తుంది. దుర్గుణములపై మక్కువ, పాపభీతిని కలుగచేస్తుంది. శారీరక సుఖాలపై ఆసక్తి, అనారోగ్యం అంటే భయాన్ని కలుగచేస్తుంది. వైరాగ్యము మరియు భగవంతునికి శరణాగతి - మన హృదయములో సర్వ భయాలనూ నిర్మూలిస్తాయి.

అంతఃకరణ శుద్ధి: ఇది ఆంతర పరిశుభ్రత. మనస్సు అనేది ఆలోచనలనూ, ఇష్టాయిష్టాలనూ, రాగద్వేషాలనూ, భావోద్వేగాలనూ పుట్టిస్తుంది, మరియు వాటిపై చింతన చేస్తుంది. ఇవి ఎప్పుడైతే నైతికంగా, మంచి దృక్పథంతో, సకారత్మకంగా మరియు ఉన్నతమైనవిగా ఉంటాయో, అప్పుడు మనస్సు పవిత్రంగా ఉన్నదనుకోవచ్చు; అవి ఎప్పుడైతే అనైతికంగా, తక్కువస్థాయిలో ఉంటాయో, అప్పుడు మనస్సు మలినమైనదిగా భావించాలి. రజో గుణము, మరియు తమోగుణములలో ఉన్న వస్తువిషయముల పట్ల అనుబంధమే, మనస్సును మలినం చేస్తుంది. అదే సమయంలో, భగవంతునితో అనుబంధము, మనస్సును శుద్ధి చేస్తుంది.

ఆధ్యాత్మిక జ్ఞానములో స్థిరత్వం: ఏది మంచో ఏది చెడో మర్చిపోయినప్పుడు, మానవులు పశువుల వలె అయిపోతారు. అందుకే, శాస్త్ర ఉపదేశాల పట్ల దృఢ సంకల్పంతో ఉండటమే, ధర్మ మార్గములో పయనించటానికి మూలాధారము.

దానము: దానము అంటే మన సంపదను ఒక మంచి పనికోసం, లేదా అది అవసరమైన వారికి ఇచ్చివేయటం. నిజమైన దానం ఏమిటంటే, ఎదో ఇస్తున్నామనే గర్వముతో కాకుండా, భగవత్ సేవలో పాలుపంచుకునే అవకాశం లభించిందనే కృతజ్ఞతతో ఇవ్వటం. శారీరక సంక్షేమం కోసం చేసే భౌతికపరమైన దానం, ఇతరులకు తాత్కాలికంగా దోహద పడుతుంది. ఆత్మ స్థాయిలో చేసే ఆధ్యాత్మిక దానము, సమస్త క్లేశముల మూల కారణమైన భగవత్ విముఖత నుండి విముక్తికి దోహదపడుతుంది. అందుకే, ఇది భౌతిక దానం కంటే ఉన్నతమైనదిగా పరిగణించబడుతుంది.

ఇంద్రియ నిగ్రహణ: మనస్సును మరింత ప్రాపంచిక మోహములో పడవేయటానికి, ఇంద్రియములు ఎంత శక్తివంతమైనవో మన అందరికీ తెలుసు. అవి జీవులను తక్షణ సుఖాల కోసం ప్రేరేపిస్తాయి. కానీ, ఆధ్యాత్మిక ధర్మ మార్గంలో పయనిస్తూ, ఉన్నతమైన లక్ష్యమును సాధించటానికి, నిమ్నస్థాయి ఇంద్రియ సుఖాలను విడిచిపెట్టడం చాలా అవసరం. అందుకే, ఇంద్రియ నిగ్రహణ అనేది, భగవత్ మార్గంలో పయనించటానికి, ఒక ఆవశ్యకమైన సద్గుణము.

యజ్ఞము చేయటం: అంత ఆహ్లాదకరంగా లేకపోయినా, మన యొక్క వైదిక ధర్మాలనూ, సామాజిక విధులనూ నిర్వర్తించుట. నిజమైన యజ్ఞము అంటే, భగవంతుని ప్రీతి కోసము చేయబడినదే.

పవిత్ర గ్రంధ పఠనం: శాస్త్రములలో ఉండే ఉన్నతమైన జ్ఞానమును బుద్ధికి అందించటమనేది, దైవీ గుణము పెంపొందించుకునే ప్రక్రియలో, ఒక ముఖ్యమైన పని. ఎప్పుడైతే బుద్ధి నిజమైన జ్ఞానముచే ప్రకాశితమవుతుందో, ఆ వ్యక్తి యొక్క కార్యములు సహజంగానే పవిత్రమవుతాయి.

తపస్సు: శరీరము-మనస్సు-ఇంద్రియములు ఎటువంటివంటే, వాటిని గారాబం చేస్తే, అవి సుఖాసక్తి కలిగి ఉంటాయి. కానీ, వాటిని నిగ్రహిస్తే, అవి క్రమశిక్షణ కలిగి ఉంటాయి. అందుకే, తపస్సు అంటే, శరీర-మనోబుద్ధులను శుద్ధి చేయటానికి, స్వచ్ఛందంగా కష్టాలను స్వీకరించటం.

సరళత్వము / నిష్కపటత: మాటలలో, మరియు నడవడికలో సరళత అనేది, మనసులో అక్కరలేని గజిబిజిని తొలగిస్తుంది, మరియు ఉత్తమమైన ఆలోచనలను జనింపచేస్తుంది.

అహింస: ఇతర ప్రాణుల పురోగతికి, మనసా, వాచా, లేదా కర్మణా, ఇబ్బంది పెట్టకుండా ఉండటం.

సత్యసంధత: మన స్వార్థం కోసం నిజాలను వక్రీకరించకపోవటమే, సత్యసంధత. భగవంతుడే పరమ సత్యము. కాబట్టి, సత్యసంధత అనేది, మనలను ఆయన దిశగా తీసుకువెళుతుంది. అదే సమయంలో, అసత్యము, మనకు అనుకూలంగా ఉన్నా, అది మనలను భగవంతుని నుండి దూరముగా తీసుకు వెళుతుంది.

క్రోధము లేకుండుట: కోపమనేది, ప్రాకృతిక మనస్సు యొక్క వికారము. ఆనందాన్ని అనుభవించాలనే కోరికలకు అవరోధం కలిగినప్పుడూ, లేదా వారు అనుకున్నట్టు జరగనప్పుడూ, ఈ క్రోధము వ్యక్తమవుతుంది. వైరాగ్యం పెంచుకోవటం ద్వారా, మరియు భగవత్ సంకల్పానికి శరణాగతి చేయటం ద్వారా, ఈ క్రోధమును అధిగమించవచ్చు.

త్యాగము: ఈ భౌతిక శక్తి అంతా భగవంతుని సొత్తు, మరియు ఇది ఆయన ప్రీతి కోసమే ఉన్నది. కాబట్టి, ఈ జగత్తు యొక్క వైభవములు మన సుఖానుభూతి కోసం లేవు. అవి భగవంతుని సేవలోనే ఉపయోగించబడాలి. ఈ భావనలో స్థితమై ఉండటమే, త్యాగము.

శాంతి: సద్గుణములు పెంచుకోవాలంటే, మానసిక ప్రశాంతత అవసరం. శాంత స్వభావం అంటే, బాహ్యంగా కల్లోల పరిస్థితులు ఉన్నా, అంతర్గతంగా నిశ్చలముగా ఉండటమే.

తప్పులు వెదకకుండా ఉండటం: ఈ ప్రపంచం, మరియు దానిలో ఉన్నదంతా, మంచి-చెడు గుణముల సమ్మేళనమే. ఇతరుల దోషాల మీద దృష్టిపెడితే, మన మనస్సు మలినమవుతుంది. అదే సమయంలో, వారి మంచిగుణములపై దృష్టి పెట్టడం, శుద్ధి చేస్తుంది. తనలోని లోపాలను చూసుకుంటూ, ఇతరుల లోని మంచి గుణాలను గమనించటం, సాధు జనుల లక్షణం.

సర్వ భూతముల పట్ల దయ: వ్యక్తులు ఆధ్యాత్మికంగా ఎదిగిన కొద్దీ, వారు సహజంగానే తమ స్వార్ధం కంటే ఉన్నతంగా ఎదిగి, సమస్త ప్రాణుల పట్లా కరుణా స్వభావమును పెంచుకుంటారు. ఇతరుల కష్టాలు చూసినప్పుడు కలిగే గాఢ సానుభూతినే, దయ అంటారు.
అలోలుప్త్వం - దురాశ లేకుండుట: దురాశ అంటే, న్యాయపరంగా, శారీరక నిర్వహణకు కావలసిన దానికన్నా, పోగుచేసువాలనే వాంఛయే, దురాశ. దీనికి వశమైనవారు, తాము మరణ సమయంలో, అంతా ఇక్కడే వదిలివేయాలని తెలిసి కూడా, భారీ స్థాయిలో ఆస్తులూ, సంపదలూ ప్రోగు చేసుకుంటారు. ఇటువంటి దురాశ నుండి విముక్తి, సంతుష్టికీ మరియు ఆంతరంగిక ప్రశాంతతకూ దారితీస్తుంది.

సౌమ్యత: ఇతరుల మనస్సు కష్టపెడతామనే భావన కలగకపోవడం వలన, కొందరు మొరటుగా ప్రవర్తిస్తారు. కానీ, వ్యక్తులు ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ, సహజంగానే వారు ప్రవర్తనలో మొరటుతనాన్ని విడిచిపెడతారు. సౌమ్యత అంటే, మృదుత్వం అనేది ఆధ్యాత్మిక సంస్కారానికి సూచిక.

సిగ్గు - లజ్జ: శాస్త్రములు ఉపదేశించిన దానికి, లేదా సమాజానికి విరుద్ధంగా చేయటానికి, సంకోచము కలగటము. సత్పురుష స్వభావమనేది, పాపపు పనులు చేసేటప్పుడు, అపరాధ భావనను కలిగించే బలమైన అంతర్గత అంతరాత్మను ఇస్తుంది;
చపలత్వం లేకుండుట: మనము మంచి ఉద్దేశంతో ప్రారంభించవచ్చు. కానీ, మనం దురాకర్షణ, మరియు కష్టాల వలన పెడదారి పడితే, మనం ఈ ప్రయాణాన్ని పూర్తిచేయలేము. ధర్మ పథంలో విజయం అనేది, ఎన్ని అవాంతరాలు వచ్చినా, లక్ష్యం దిశగా, అచంచలమైన సంకల్పంతో పరిశ్రమిస్తేనే, సాధ్యము.

దృఢసంకల్పం: స్వచ్ఛమైన మనస్సు నుండి, మనం విలువలూ, మరియు విశ్వాసానికి అనుగుణంగా ప్రవర్తించాలన్న గాఢమైన దృఢ సంకల్పము వస్తుంది. కాబట్టి, సాధు పురుషులు వారు చేయదలుచుకున్న పనుల పట్ల చాలా శక్తినీ, మరియు పట్టుదలనూ కలిగి ఉంటారు.

క్షమాగుణము, లేదా ఓర్పు: ప్రతీకారేచ్ఛ లేకుండా, ఇతరుల తప్పిదాలను సహించే గుణమే, క్షమ. క్షమాగుణము ద్వారా వ్యక్తి, ఇతరుల వలన కలిగిన మానసిక గాయాలను మాన్పివేయగలడు. అలాచేయకపోతే, అవి మనస్సులో చికాకు కలిగించి, అశాంతిని కలుగచేయగలవు.

మనఃస్థైర్యము: మనసేంద్రియములు ప్రతికూల పరిస్థితుల వల్ల అలసిపోయినా, లక్ష్యమును సాధించుటలో ఉన్న మనో బలమూ, మరియు స్థైర్యమే ఇది. సాధిస్తామనే ఆశ ఏమాత్రం లేకపోయినా, నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్న వారే, ఈ ప్రపంచంలో గొప్పగొప్ప విజయాలు సాధించారు.

పరిశుభ్రత: ఇది అంతర్గత, మరియు బాహ్యమైన స్వచ్ఛతను సూచిస్తుంది. సాధు పురుషులు, బాహ్యమైన శుభ్రతను కోరుకుంటారు. ఎందుకంటే, అది అంతర్గత స్వచ్ఛతకి అనుకూలంగా ఉంటుంది.

ఎవరిపట్ల కూడా శత్రుత్వం లేకుండుట: ఇతరుల పట్ల శత్రుత్వం కలిగి ఉండటం, మన మనస్సునే విషపూరితం చేస్తుంది. ఇది ఆధ్యాత్మిక పురోగతికి అవరోధంగా ఉంటుంది. వారు కూడా మనలాంటి వారే, అందరిలోనూ భగవంతుడు ఉంటాడన్న భావనను పెంపొందించు కోవటం ద్వారా, ఇతరుల పట్ల శత్రుత్వ భావన నిర్మూలించబడుతుంది.

దురభిమానం లేకుండుట: ఆత్మ-స్తుతి, గొప్పలు చెప్పుకోవటం, ఆడంబర ప్రదర్శన మొదలైనవన్నీ, గర్వము వలన జనిస్తాయి. సాధు జనులు గర్వ పడటానికి, వారిలో వారికి ఏమీ కనిపించదు. అదే సమయంలో, వారిలో ఉన్న సద్గుణములకు, వారు భగవతునిపట్ల కృతజ్ఞతతో ఉంటారు. ఆ విధంగా వారు సొంత-గొప్పలకు దూరంగా ఉంటారు.

11:51 - దంభో దర్పోఽభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ ।
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్ ।। 4 ।।

ఓ పార్థా, దంభము, దురహంకారము, గర్వము, క్రోధము, మొరటుతనము, మరియు అజ్ఞానము అనేవి, ఆసురీ స్వభావముగల వారి గుణములు.

శ్రీ కృష్ణుడు ఇప్పుడు, ఆసురీ స్వభావము కలవారి ఆరు లక్షణములను వివరిస్తున్నాడు. వారు - కపటులు, అంటే, బాహ్యముగా ఎదో ఇతరుల మెప్పు కోసం సాధువులాగా ప్రవర్తించినా, వారికి అంతర్గతంగా దానికి సరిపోయే సంస్కారం ఉండదు. అది అంతర్గతంగా మలినమైనదే అయినా, బయటకు మాత్రం స్వచ్ఛమైన దానిగా కనిపిస్తుంది. ఆసురీ స్వభావముగల జనుల ప్రవర్తన, ఇతరుల పట్ల గర్వంతో, మరియు అమర్యాదతో ఉంటుంది. తమ యొక్క సంపద, విద్య, అందము, హోదా వంటి శారీరక సంపత్తి, మరియు పదవులను చూసుకుని గర్వ పడతారు. వారికి మనస్సు మీద నియంత్రణ లేక, వారి దురాశ, మరియు వాంఛలు తీరనప్పుడు, వారికి కోపము వస్తుంటుంది. వారు క్రూరముగా, మరియు మొరటుగా ప్రవర్తిస్తూ ఉంటారు; తమ వ్యవహారములలో ఇతరులకు కలిగే ఇబ్బంది / కష్టాలను పట్టించుకోరు. వారికి ఆధ్యాత్మిక విషయముల పట్ల ఏమాత్రం అవగాహన ఉండదు. అలాగే, పాపిష్టి పనులను కూడా, ధార్మికమైనవే అని అనుకుంటారు.

13:15 - ఇక మన తదుపరి వీడియోలో, ఆసురీ గణాల పూర్తి వివరణను, శ్రీ కృష్ణుడి మాటలలో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Wednesday, May 31, 2023

సర్వోన్నత జ్ఞానం! భగవద్గీత Bhagavadgita


సర్వోన్నత జ్ఞానం!
ఈ జ్ఞానమును స్వీకరించి అంగీకరించినవారు యదార్థముగా జ్ఞానోదయం పొందుతారా?

'భగవద్గీత' పంచదశోధ్యాయం - పురుషోత్తమ ప్రాప్తి యోగం (16 – 20 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదునైదవ అధ్యాయం, పురుషోత్తమ ప్రాప్తి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, పురుషోత్తమ ప్రాప్తి యోగములోని, 16 నుండి 20 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/WrzxKc8Ch5A ]


నాశరహిత పరమాత్మయైన ఆ సర్వోత్కృష్ట దివ్య పురుషుడి గురించిన వివరణ, ఇలా ఉండబోతోంది..

00:47 - ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ ।
క్షరః సర్వాణి భూతాని కూటస్థోఽక్షర ఉచ్యతే ।। 16 ।।

సృష్టిలో రెండు రకాల ప్రాణులు ఉన్నాయి.. క్షరములు అంటే, నశించేవి, మరియు అక్షరములు అంటే, నశించనివి. భౌతిక జగత్తులో ఉన్నవి క్షరములు. అక్షరములు అంటే, మోక్షము పొందిన జీవులు.

భౌతిక జగత్తులో, మాయ అనేది జీవాత్మను ఈ భౌతిక శరీరమునకు కట్టివేస్తుంది. ఆత్మ అనేది, నిత్యసనాతనమైనది అయినా కూడా, అది పదేపదే శరీరము యొక్క జననము, మరియు మరణములను అనుభవిస్తూ ఉంటుంది. అందుకే, శ్రీ కృష్ణుడు భౌతిక జగత్తులో బద్ధ జీవులను, క్షరములని అంటున్నాడు. అతిచిన్న పురుగుల నుండి, ఉన్నతమైన దేవతల వరకూ, ఈ కోవకు చెందినవారే. వీటికన్నా వేరుగా, భగవంతుని ధామములో, ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న జీవులు కలరు. ఈ జీవులకు మరణంలేని శరీరములు ఉంటాయి; వాటి యందు వారు మరణమును అనుభవించరు; అందుకే వారు అక్షరములని పేర్కొనబడ్డారు.

01:53 - ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః ।
యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః ।। 17 ।।

ఇవే కాక, నాశరహిత పరమాత్మయైన ఆ సర్వోత్కృష్ట దివ్య పురుషుడున్నాడు. ఆయన అవ్యయమైన ఈశ్వరునిగా ముల్లోకములలో ప్రవేశించి, సమస్త ప్రాణులనూ పోషిస్తూ ఉంటాడు.

జగత్తు, మరియు జీవాత్మల గురించి చెప్పిన పిదప, శ్రీ కృష్ణుడిక ఆ రెండు లోకాలకూ, మరియు క్షర, అక్షర ప్రాణులకూ అతీతమైన భగవంతుని గురించి చెబుతున్నాడు. శాస్త్రాలలో ఆయనే పరమాత్మగా చెప్పబడ్డాడు. జీవాత్మ అత్యల్పమైనది, మరియు అది వసించి ఉన్న శరీరము యందు మాత్రమే, వ్యాపించి ఉంటుంది. కానీ, పరమాత్మ సమస్త ప్రాణుల హృదయములలో స్థితమై ఉన్నాడు. వాటి కర్మలను నోట్ చేసుకుంటాడు, వాటి ఖాతా ఉంచుకుంటాడు, మరియు వాటి ఫలములను సరియైన సమయంలో ఇస్తూ ఉంటాడు. ఆత్మ జన్మ జన్మలలో ఏ శరీరము తీసుకుంటే, ఆ శరీరములోనికి తాను కూడా ప్రవేశిస్తాడు. ఒకవేళ ఆత్మకు ఒకానొక జన్మలో కుక్క శరీరము ఇవ్వబడితే, పరమాత్మ కూడా దానిలోకి ప్రవేశిస్తాడు, మరియు పూర్వ జన్మల కర్మఫలములను అందిస్తాడు. ఈ విధముగా, కుక్కల అదృష్టంలో కూడా, ఎంతో తేడా ఉంటుంది. కొన్ని వీధి కుక్కలుగా దుర్భరమైన జీవితం గడుపుతుంటాయి, మరికొన్ని పెంపుడు కుక్కలుగా, ఐశ్వర్యంలో విలాసంగా జీవిస్తుంటాయి. ఇంత తేడా వాటి వాటి కర్మరాశి ఫలితంగా సంభవిస్తుంది. ఆ కర్మఫలములను, ఆ పరమాత్మయే అందిస్తూ ఉంటాడు. సర్వ భూతముల హృదయములలో స్థితుడై ఉండే ఆ పరమాత్మ, తన సాకార రూపములో ఉంటాడు.

03:37 - యస్మాత్ క్షరమతీతోఽహమక్షరాదపి చోత్తమః ।
అతోఽస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః ।। 18 ।।

నేను నశ్వరమైన ఈ భౌతిక పదార్ధముకంటే, మరియు నాశరహితమైన జీవాత్మ కంటే కూడా అతీతమైనవాడను. కాబట్టి, వేదములలో, మరియు స్మృతులలో నేనే సర్వోత్కృష్ట దివ్య పురుషుడిగా కీర్తింపబడ్డాను.

ప్రకృతిలో ఉన్న మహాద్భుతమైనవన్నీ, తన యొక్క విభూతుల ప్రకటితములే అని, గతంలో శ్రీ కృష్ణుడు వివరించాడు. కానీ, ఆ కనిపించే జగత్తును సృష్టించడానికి తానే స్వయముగా శ్రమకు లోనవ్వడు. ఆయన యొక్క అలౌకిక వ్యక్తిత్వము, భౌతిక ప్రకృతికీ, మరియు దివ్య ఆత్మలకు కూడా అతీతమైనది. ఇక్కడ తన దివ్య వ్యక్తిత్వమును పురుషోత్తమ అని అంటున్నాడు. ‘శ్రీ కృష్ణుడే సర్వోన్నత భగవానుడు. ఆయన మీదే ధ్యానం చేయుము, ఆయన భక్తినే ఆస్వాదించుము, మరియు ఆయనను ఆరాధించుము.’ ‘శ్రీ కృష్ణుడు సర్వోత్కృష్ట పురుషుడ’ని, వేదములు పేర్కొన్నాయి. మరయితే విష్ణుమూర్తి, శ్రీ రామ చంద్రుడు, శంకరుడు - వీరి స్థాయి ఏమిటన్న సందేహం రావచ్చు. వారందరూ ఆ సర్వోన్నతుని స్వరూపములే, మరియు వారందరూ, ఒకరికొకరు అబేధములే. వారందరూ భగవంతుని, అంటే సర్వోత్కృష్ట దివ్య పురుషుని ప్రకటితములే.

05:00 - యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్ ।
స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత ।। 19 ।।

ఎవరైతే సంశయము లేకుండా నన్ను సర్వోత్కృష్ట పురుషోత్తమునిగా తెలుసుకుంటారో, వారికి సంపూర్ణ జ్ఞానమున్నట్టు. ఓ అర్జునా, వారు హృదయపూర్వకముగా నన్నే భజింతురు.

మనం భగవంతుడిని మూడు రకాలుగా తెలుసుకోవచ్చు: ‘సర్వోన్నత తత్త్వము ఒక్కటే.. అది జగత్తులో బ్రహ్మము, పరమాత్మ, మరియు భగవానుడనే మూడు విధములుగా వ్యక్తమవుతుంది.’ ఇవి మూడు వేర్వేరు అస్థిత్వములు కావు. ఒకే సర్వోన్నత తత్త్వము యొక్క మూడు స్వరూపాలు. ఉదాహరణకి, నీరు, మంచు, నీటి ఆవిరి, మూడూ విభిన్న పదార్ధములుగా అగుపిస్తాయి. కానీ, అవి ఒకే పదార్ధము యొక్క మూడు విభిన్న రూపాలు. అదే విధంగా బ్రహ్మము అంటే, భగవంతుని యొక్క నిరాకార, సర్వ వ్యాప్త అస్థిత్వము. జ్ఞాన యోగమును అనుసరించే వారు, భగవంతుని యొక్క బ్రహ్మమనే అస్థిత్వాన్ని ఆరాధిస్తారు. పరమాత్మ అంటే, సమస్త ప్రాణుల హృదయములో స్థితమై ఉన్న, ఆ సర్వోన్నత తత్త్వము యొక్క అస్థిత్వము. అష్టాంగ యోగ మార్గము, దేవుని యొక్క పరమాత్మ రూపమును దర్శింపచేస్తుంది. భగవానుడంటే, పరమేశ్వరుని యొక్క సాకర రూపము. ఆ రూపంలో ఆయన ఎన్నో మధురమైన లీలలను చేస్తాడు. భక్తి మార్గము, మనకు ఈశ్వరుడిని భగవానుని రూపంలో, భగవత్ ప్రాప్తిని కలిగిస్తుంది. తనను భక్తి ద్వారా భగవానునిగా, సర్వోన్నత దివ్య పురుషోత్తమునిగా తెలుసుకున్నవారు, యదార్థముగా ఆయన పట్ల పూర్తి జ్ఞానముతో ఉన్నట్టు. ‘బ్రహ్మము అస్థిత్వంలో, ఈశ్వరుని యొక్క అనంతమైన శక్తులు గుప్తముగా ఉంటాయి. ఆయన కేవలం నిత్య జ్ఞానమును, మరియు ఆనందమును ప్రదర్శిస్తాడు.’ ‘పరమాత్మ అస్థిత్వంలో, ఈశ్వరుడు తన రూపమునూ, నామమునూ, మరియు గుణమునూ చూపిస్తాడు. కానీ, లీలలను ప్రదర్శించడు, పరివారమును కలిగి ఉండడు.’

‘తన సర్వ శక్తులనూ ప్రకటితం చేస్తూ, మరియు, భక్తులతో ఎన్నెన్నో మధురమైన లీలలను చేస్తూ ఉండే ఈశ్వరుని అస్థిత్వమే, భగవానుడు.’ఈ శ్లోకాలు, బ్రహ్మము మరియు పరమాత్మ అస్థిత్వములలో, ఈశ్వరుడు తన సర్వ శక్తులనూ ప్రకటించడని, స్పష్టంగా చెబుతున్నాయి. ఈశ్వరుడు భగవానుడి రూపములో సంపూర్ణముగా ఉంటాడు. దానిలో తన యొక్క నామములూ, రూపములూ, గుణములూ, లీలలూ, ధామములూ, మరియు పరివారమూ, అన్నింటినీ ప్రకటిస్తాడు.

07:36 - ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మాయానఘ ।
ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత ।। 20 ।।

ఓ పాపరహితుడా, అర్జునా.. అత్యంత రహస్యమైన వేద శాస్త్ర మూలతత్త్వమును, నేను నీకు తెలియచేశాను. దీనిని అర్థం చేసుకున్న వ్యక్తి, జ్ఞాని అవుతాడు, మరియు సాధించవలసినదంతా నెరవేర్చినవాడవుతాడు.

ఈ అధ్యాయంలోని ఇరవై శ్లోకాలలో, భగవంతుడు వేద శాస్త్రాల సారాన్ని తెలియచేశాడు. ఈ జగత్తు యొక్క స్వభావాన్నీ, భౌతికపదార్ధము మరియు ఆత్మ మధ్య భేదాన్నీ, మరియు చివరగా పరమ సత్యము యొక్క సర్వోన్నత జ్ఞానమునూ, ఆ దివ్య మంగళ పురుషోత్తమునిగా తెలియచేశాడు. ఎవరైతే ఈ జ్ఞానమును స్వీకరించి అంగీకరిస్తారో, వారు యదార్థముగా జ్ఞానోదయం పొందుతారని, ఇప్పుడు భగవంతుడు హామీ ఇస్తున్నాడు. అటువంటి జీవాత్మ, సమస్త కార్యముల, కర్తవ్యముల లక్ష్యమయిన భగవత్ ప్రాప్తిని సాధిస్తుందని వివరిస్తున్నాడు, శ్రీ కృష్ణ భగవానుడు.

ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం, యోగ శాస్త్రే, శ్రీ కృష్ణార్జునసంవాదే, పురుషోత్తమ ప్రాప్తి యోగోనామ పంచదశోధ్యాయ:

శ్రీ మద్భగవద్గీతలోని జ్ఞానషట్కం, పదునైదవ అధ్యాయం, పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని, 20 శ్లోకాలూ సంపూర్ణం.

09:02 - ఇక మన తదుపరి వీడియోలో, పదహారవ అధ్యాయం, దైవాసుర సంపద్విభాగ యోగములో, శ్రీ కృష్ణుడు విశదపరిచిన నిగూఢార్థాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Wednesday, May 17, 2023

పుట్టుకతోనే గుడ్డివాళ్ళు కూడా కలలు ఎందుకు చూడగలుగుతారు? 6 ఇంద్రియములు! భగవద్గీత Bhagavadgita


6 ఇంద్రియములు!
పుట్టుకతోనే గుడ్డివాళ్ళు కూడా కలలు ఎందుకు చూడగలుగుతారు?

'భగవద్గీత' పంచదశోధ్యాయం - పురుషోత్తమ ప్రాప్తి యోగం (06 – 10 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదునైదవ అధ్యాయం, పురుషోత్తమ ప్రాప్తి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, పురుషోత్తమ ప్రాప్తి యోగములోని, 06 నుండి 10 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/qiura3E5uwY ]


భౌతిక శక్తిచే కట్టివేయబడి, మనస్సుతో కలిపి ఉన్న ఆరు ఇంద్రియములతో ఏ విధంగా ప్రయాస పడుతుంటామో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:51 - న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః ।
యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ ।। 6 ।।

సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ, ఇవేవీ నా పరంధామమును ప్రకాశింపచేయలేవు. అక్కడికి వెళ్లిన పిదప, జనులు మరల ఈ భౌతిక లోకానికి తిరిగిరారు.

ఇక్కడ శ్రీ కృష్ణుడు, దివ్య లోక స్వభావాన్ని సంక్షిప్తముగా వివరిస్తున్నాడు. దానిని ప్రకాశింపచేయటానికి, సూర్యుడు, చంద్రుడు, మరియు అగ్ని అవసరం లేదు. ఎందుకంటే, అది సహజంగానే స్వయం ప్రకాశితము. భౌతిక జగత్తు అనేది, భౌతిక శక్తి, మాయ ద్వారా తయారుచేయబడినది. కానీ, దివ్య లోకము, ఆధ్యాత్మిక శక్తీ, యోగ మాయచే తయారు చేయబడినది. అది భౌతిక జగత్తు యొక్క ద్వందములు, మరియు దోషములకు అతీతమైనది, సంపూర్ణ దోషరహితమైన ప్రదేశము. అది సత్-చిత్-ఆనందము, అంటే, అమరత్వము, జ్ఞానము, మరియు ఆనందముతో పూర్ణముగా నిండి ఉంటుంది. దివ్య లోకము, పరవ్యోమమనే ఆధ్యాత్మిక ఆకాశమును కలిగి ఉంటుంది. దానిలో దైవీ ఐశ్వర్యములూ, అద్భుతములతో నిండిన ఎన్నెన్నో ధామములుంటాయి. సమస్త నిత్య సనాతన భగవత్ స్వరూపములైన, కృష్ణుడూ, రాముడూ, నారాయణుడి వంటి వారు, వారి వారి ధామములను ఆ ఆధ్యాత్మిక ఆకాశములో కలిగి ఉంటారు. అక్కడ వారు నిత్య శాశ్వతముగా, తమ భక్తులతో నివసిస్తూ, తమ దివ్య లీలలలో వారితో గడుపుతూ ఉంటారు.

02:25 - మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః ।
మనః షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ।। 7 ।।

భౌతిక జగత్తులో ఉన్న జీవాత్మలు, నా యొక్క సనాతనమైన అంశలు. కానీ, భౌతిక శక్తిచే కట్టివేయబడి, వారు మనస్సుతో కలిపి ఉన్న ఆరు ఇంద్రియములతో ప్రయాస పడుతున్నారు.

శ్రీ కృష్ణుడు ఇంతకు పూర్వం, ఆయన ధామమునకు చేరిన జీవులు ఇక మళ్ళీ తిరిగి రారని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు, భౌతిక జగత్తు లోనే ఇంకా ఉండిపోయిన జీవుల గురించి చెబుతున్నాడు. భగవంతుడికి ఉన్న వివిధ అంశలు, రెండు రకాలుగా ఉంటాయి..

స్వాంశలు: వీరు భగవంతుని అవతారములైన రాముడు, నృసింహ, వరాహ మొదలైనవారు. వారు శ్రీ కృష్ణునికి అబేధములు. అందుకే వారిని స్వాంశలు అంటాము. అంటే, ఏకీకృతమైన అంశలని అర్థం.

విభిన్నాంశలు: వీరు భగవంతునికి భిన్నములైన అంశలు. వారు నేరుగా భగవంతుని అంశలు కాదు. అయినా, వారు ఆయన యొక్క జీవ శక్తి యొక్క అంశలే. ఈ కోవలోకే, జగత్తులో ఉన్న ఆత్మలన్నీ వస్తాయి. ఇంతేకాక, విభిన్నాంశ ఆత్మలు మూడు రకాలు:

నిత్య సిద్ధులు: వీరు ఎప్పుడూ విముక్తులైన వారే కాబట్టి, భగవంతుని యొక్క దివ్య ధామములో, ఆయన దివ్య లీలలలో పాలుపంచుకుంటూ, సనాతన కాలం నుండి ఉన్నవారు.

సాధన సిద్ధులు: ఈ జీవాత్మలు మనలాగే, ఒకప్పుడు భౌతిక జగత్తులో ఉండే వారే. కానీ, వారు తమ సాధనా అభ్యాసం ద్వారా, ఆ భగవంతుడిని చేరుకున్నారు. ఇక ఇప్పుడు వారు, దివ్య భగవత్ ధామములోనే శాశ్వతంగా ఉంటూ, భగవంతుని దివ్య లీలలలో పాలుపంచుకుంటూ ఉంటారు.

నిత్య బద్ధులు: వీరు సనాతన కాలం నుండీ భౌతిక జగత్తులోనే ఉండిపోయినవారు. వీరు ఐదు ఇంద్రియములూ, మరియు మనస్సుచే కట్టివేయబడినారు. కాబట్టి, వారు ప్రయాస పడుతున్నారు. ఈ యొక్క విభిన్నాంశలైన నిత్యబద్ధ అంశల గురించి శ్రీ కృష్ణుడు చెప్పిన ప్రకారం, వారు మనస్సూ, ఇంద్రియములను తృప్తిపరచటానికి ప్రయాసపడుతూ, ఆ క్రమంలో దుఃఖాన్ని అనుభవిస్తున్నారు.

4:39 - శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః ।
గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్ ।। 8 ।।

ఎలాగైతే గాలి సుగంధమును ఒకచోటి నుండి ఇంకొక చోటికి తీసుకువెళుతుందో, జీవాత్మ కూడా, పాత శరీరమును విడిచి, కొత్త శరీరంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు, మనస్సూ మరియు ఇంద్రియములను తనతో పాటుగా తీసుకెళుతుంది.

ఆత్మ ఒక శరీరము నుండి ఇంకొక శరీరములోకి వెళ్లే ప్రక్రియను గురించి, ఇక్కడ వివరించబడినది. వీచేగాలి, పుష్పముల సువాసనను ఒకచోటి నుండి ఇంకొక చోటికి తీసుకెళ్లటం, ఇక్కడ ఉదాహరణగా చెప్పబడినది. అదే విధముగా, మరణ సమయంలో ఆత్మ దేహమును విడిచి వెళ్ళేటప్పుడు, అది స్థూల శరీరమును విడిచి పెడుతుంది. కానీ, తనతో పాటుగా సూక్ష్మ, మరియు కారణ శరీరములను తీసుకుని వెళుతుంది; వీటిలోనే మనస్సూ, ఇంద్రియములూ ఉంటాయి. ఆత్మకు ప్రతి జన్మలో ఒక కొత్త శరీరము వచ్చినా, మనస్సు మాత్రం, పూర్వ జన్మల నుండీ అదే వస్తుంటుంది. పుట్టుకతోనే గుడ్డివాళ్ళు కూడా, కలలు ఎందుకు చూడగలుగుతారో, దీని వలన మనకు తెలుస్తుంది. మామూలుగా అయితే, మనం మెలకువగా ఉన్న సమయంలో చూసిన దృశ్యాలూ, ఆలోచించిన తలపుల వికారములే, నిద్రలో ఒకలా మళ్ళీ అగుపిస్తాయి. కలలో ఆ వ్యక్తి మానవ శరీరంతోనే ఎగురుతూ, తనకు తానే అగుపించవచ్చు. ఇది ఎందుకంటే, అతను మెలకువగా ఉన్నప్పటి ఆలోచనలూ, చూసిన దృశ్యాలూ, ఒకలా వికారంచెంది, మరల స్వప్న స్థితిలో అగుపిస్తాయి. కానీ, పుట్టుగ్రుడ్డి వాడు, ఎప్పుడూ ఎలాంటి రూపములూ, ఆకారములూ చూసి ఉండడు. అయినా ఆ వ్యక్తి కూడా స్వప్నములు చూస్తాడు. ఎందుకంటే, మెలకువగా ఉన్నప్పటి అనుభూతులు, అనంతమైన పూర్వ జన్మల నుండీ మనస్సులలో ముద్రించబడి ఉంటాయి. ఆత్మ వెళ్లిపోయేటప్పుడు, తనతో పాటు మనస్సూ, ఇంద్రియములనూ తీసుకువెళుతుంది.

06:34 - శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ ।
అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే ।। 9 ।।

మనస్సును ఆశ్రయించి ఉన్న ఇంద్రియములైన చెవులూ, కన్నులూ, చర్మమూ, నాలుక, మరియు ముక్కూ, వీటి యొక్క గ్రహణశక్తితో, జీవాత్మ ఇంద్రియ వస్తువిషయములను ఆస్వాదిస్తుంటుంది.

ఆత్మ దివ్యమైనది కావున, అది సూటిగా రుచి చూడటం, స్పర్శించటం, అనుభవించటం, వాసనచూడటం, లేదా వినటం చేయలేదు. మరి అది ఎలా ఈ అనుభూతులను ఆస్వాదించవచ్చు? అనే ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, దానికి ఇంద్రియములూ, మనస్సూ సహాయం చేస్తాయి. ఇంద్రియములూ, మనస్సూ, నిజానికి జడమైనవి. కానీ, అవి ఆత్మ శక్తిచే చైతన్యవంతమయ్యి, ప్రాణం ఉన్నట్లుగా అవుతాయి. కాబట్టి, అవి వస్తువులూ, పరిస్థితులూ, ఆలోచనలూ, మరియు వ్యక్తుల ద్వారా సుఖదుఃఖాలను అనుభవిస్తాయి. అహంకారముచే ఆత్మ తన మనసేంద్రియములతో అనుసంధానమై, పరోక్షంగా ఆ యొక్క సుఖాలను అనుభవిస్తుంటుంది.

07:39 - ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితమ్ ।
విమూఢా నానుపశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుషః ।। 10 ।।

అది ఇంద్రియ వస్తువిషములను ఆనందిస్తూ, దేహములోనే ఉన్నప్పుడు కానీ, లేదా అది దేహమును విడిచివెళ్లినప్పుడు కానీ, జీవాత్మను అజ్ఞానులు గమనించరు. కానీ, జ్ఞాన నేత్రములు కలవారు, దానిని దర్శించగలరు.

ఆత్మ దేహములోనే స్థితమై ఉండి, తన మనస్సూ, ఇంద్రియముల యొక్క అనుభూతులను ఆస్వాదిస్తూ ఉన్నా, దానిని అందరూ గుర్తించలేరు. దీనికి గల కారణం ఏమిటంటే, ఆత్మ అనేది ప్రాకృతికమైనది కాదు. అందుకే అది భౌతిక ఇంద్రియములచే చూడబడలేదు, లేదా స్పర్శించబడలేదు. శాస్త్రజ్ఞులు దానిని తమ ప్రయోగశాలలో, తమ ఉపకరణాలతోనూ గుర్తించలేరు. కాబట్టి వారు తప్పుగా, ఈ శరీరమే మనము అని అంటారు. కానీ, ఆధ్యాత్మిక మార్గం లో పయనించిన వారు, ఆత్మయే ఈ అన్ని శరీర భాగములనూ జీవింపచేస్తుందని, తమ జ్ఞాన నేత్రములచే తెలుసుకుంటారు. అది వెళ్ళిపోయిన తరువాత, భౌతిక శరీరము యొక్క అన్ని భాగములూ, గుండె, మెదడు, ఊపిరితిత్తుల వంటివన్నీ అక్కడే ఉన్నా, వాటిలో చైతన్యం ఉండదు. చైతన్యమనేది, ఆత్మ యొక్క లక్షణము. ఆత్మ ఉన్నంత వరకే, శరీరములో చైతన్యము ఉంటుంది; ఆత్మ వెళ్ళిపోయినప్పుడు, అదికూడా ఉండదు. జ్ఞాన నేత్రములు కలవారే, దీనిని చూడగలరు. అజ్ఞానులు, తమ స్వంత దివ్య అస్థిత్వము తెలియక, ఈ భౌతిక కాయమే తామని అనుకుంటారు.

09:14 - ఇక మన తదుపరి వీడియోలో, దేహములోనే స్థితమై ఉన్న ఆత్మను ఎటువంటి వారు తెలుసుకోగలుగుతారో, చూద్దాము..

కృష్ణం వందే జగద్గురుం!

Wednesday, May 10, 2023

కామ్య కర్మలు! భగవద్గీత Bhagavadgita


కామ్య కర్మలు! ఏ కార్యములను చేయటం వలన వ్యక్తి స్వర్గాది పై లోకాలకు వెళతాడు?

'భగవద్గీత' పంచదశోధ్యాయం - పురుషోత్తమ ప్రాప్తి యోగం (01 – 05 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదునైదవ అధ్యాయం, పురుషోత్తమ ప్రాప్తి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, పురుషోత్తమ ప్రాప్తి యోగములోని, 01 నుండి 05 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/Eo6LbRTPR8Q ]


ఈ అధ్యాయములో, భౌతిక ప్రపంచంలో క్లేశములకు గురయ్యే జీవాత్మ, భౌతిక అస్థిత్వములో ఉండే జగత్తు యొక్క నిజ స్వరూపము యొక్క అజ్ఞానము వలన మరింతగా, దానిలో ఎలా చిక్కుకుని పోతుందో, శ్రీ కృష్ణుని  వివరణను తెలుసుకుందాము..

00:57 - శ్రీ భగవానువాచ ।

ఊర్ధ్వమూలమధః శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ ।

ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ।। 1 ।।

శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు: వేర్లు పైకీ, మరియు కొమ్మలు క్రిందికీ ఉన్న సనాతనమైన అశ్వత్థ వృక్షము గురించి చెబుతుంటారు. దాని యొక్క ఆకులు వేద మంత్రములుగా, ఆ చెట్టు యొక్క రహస్యం తెలిసిన వారు, వేదములను తెలుసుకున్నట్లుగా చెబుతారు.

అశ్వత్థ అన్న పదానికి అర్థం, ఉన్నది ఉన్నట్లుగా ఒక్కరోజు కూడా ఉండనిది, అని. ఈ జగత్తు కూడా అశ్వత్థమే.. ఎందుకంటే, ఇది కూడా నిరంతరం మారుతూ ఉంటుంది. ఈ జగత్తు ప్రతినిత్యం మారుతూ ఉండటమే కాక, అది ప్రళయ వినాశనం చేయబడి, తిరిగి భగవంతునిలోనికి ఒక రోజు తీసుకొనబడుతుంది. అందుకే దానిలో ఉండేదంతా తాత్కాలికమైనదే, అశ్వత్థమే. అశ్వత్థ అంటే ఇంకొక అర్థం కూడా ఉంది - రావి చెట్టు అని. ఆత్మకు భౌతిక జగత్తు, చాలా విశాలమైన ఒక అశ్వత్థ వృక్షము వంటిదని, శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. సాధారణంగా వృక్షములకు వేర్లు క్రిందికీ, మరియు కొమ్మలు పైకీ ఉంటాయి. కానీ, ఈ వృక్షమునకు, ఊర్ధ్వ మూలం, వేర్లు పైకీ ఉంటాయి. అందుకే అది భగవంతుని నుండి ఉత్పన్నమైనదిగా చెప్పుకుంటాము. ఆయన యందే స్థితమై ఉన్నది, మరియు ఆయనచేతనే పోషించబడుతున్నది. ఆ చెట్టుబోదె, శాఖలూ, క్రిందికి విస్తరించి ఉంటాయి. వాటియందే భౌతిక జగత్తులోని లోకాల సమస్త జీవరాశులూ, స్థితమై ఉన్నాయి. కర్మ కాండలూ, మరియు వాటి ఫలములు చెప్పే వేద మంత్రములు, ఈ వృక్షము యొక్క ఆకులు. ఈ భౌతిక అస్థిత్వమనే వృక్షమునకు, అవి పోషకములు. వేదమంత్రములలో చెప్పబడిన ఫలాపేక్ష గల యజ్ఞ కర్మ కాండలు చేయటం వలన, ఆత్మ స్వర్గ భోగములను అనుభవించటానికి, స్వర్గాది లోకములకు వెళుతుంది. కానీ, ఆ పుణ్యము క్షయమై పోయినప్పుడు, తిరిగి భూలోకానికి చేరుతుంది. ఈ విధంగా, ఆ చెట్టు యొక్క ఆకులు దానిని నిరంతరం, జనన-మరణ చక్రంలో ఉంచుతూ పోషిస్తాయి. ఈ జగత్తు రూపంలో ఉండే వృక్షము సనాతనమైనదని అంటారు. ఎందుకంటే, దాని ప్రవాహం నిరంతరంగా జరుగుతుంటుంది. దాని యొక్క ఆది మరియు అంత్యమూ, జీవాత్మల అనుభవంలోనికి రాదు. ఎలాగైతే నిరంతర ప్రక్రియలో, సముద్రము యొక్క నీరు ఆవిరై మేఘాలుగా మారి, మరల వానలాగా భూమిపై పడి, అంతిమంగా తిరిగి సముద్రం చేరుతుందో, ఈ జనన-మరణ చక్రము కూడా నిరంతరం సాగుతూనే ఉంటుంది.

03:38 - అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా

గుణప్రవృద్ధా విషయప్రవాలాః ।

అధశ్చమూలాన్యనుసంతతాని

కర్మానుబంధీని మనుష్యలోకే ।। 2 ।।

త్రి-గుణములచే పోషించబడి, ఈ చెట్టు యొక్క శాఖలు, పైకీ క్రిందికీ విస్తరించి ఉంటాయి. ఇంద్రియ విషయములు వాటికి చిగుర్ల వలె ఉంటాయి. మానవ రూపంలో కర్మ ప్రవహించటానికి, చెట్టు యొక్క వేర్లు క్రిందికి వేళ్ళాడుతూ ఉంటాయి. క్రింది భాగాన దాని యొక్క వేర్లు శాఖలుగా విస్తరించి, మనుష్య లోకములో కర్మలను కలుగచేస్తాయి.

భౌతిక జగత్తును అశ్వత్థ వృక్షముతో పోల్చుతున్నాడు భగవంతుడు. చెట్టు యొక్క ప్రధాన మొండెము, ఆత్మ తన కర్మలు చేసేటటువంటి మానవ స్వరూపము. వృక్షము యొక్క శాఖలు క్రిందికీ, మరియు పైకి కూడా విస్తరించి ఉంటాయి. ఒకవేళ ఆత్మ పాపిష్టి పనులు చేస్తే, అది జంతువులలో, లేదా నరకలోకాలలో పుడుతుంది. ఇవి క్రిందికి ఉండే శాఖలు. ఒకవేళ ఆత్మ పుణ్య కార్యములు చేస్తే, అది స్వర్గ లోకాలలో గంధర్వుడిలాగా, దేవతల లాగా, లేదా మరేదైనా జీవిలా పుడుతుంది. ఇవి పైకి ఉన్న శాఖలు. ఒక వృక్షము నీటితో పోషింపబడినట్లుగా, ఈ భౌతిక ఆస్థిత్వపు జగత్తు, ప్రకృతి త్రిగుణములచే పోషించబడుతుంది. ఈ త్రిగుణములు, ఇంద్రియ వస్తువిషయములను సృష్టిస్తాయి. అవి వృక్షమునకు చిగుర్లవంటివి. చిగుర్ల యొక్క ప్రయోజనం ఏమిటంటే, అవి అంకురించి, మరింతగా విస్తరిస్తాయి. ఈ అశ్వత్థ వృక్షము మీది చిగుళ్లు మొలకెత్తి, భౌతిక వాంఛలను కలుగ చేస్తాయి. అవి చెట్టు ఊడల వంటివి. రావి చెట్టు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అవి శాఖలనుండి ఊడలను నేల వద్దకు పంపిస్తాయి. దీనితో, ఊడలు ద్వితీయ స్థాయి బోదెలుగా మారతాయి; అలా ఆ రావి చెట్టు విస్తరించి, చాలా విశాలంగా పెరుగుతుంది. అశ్వత్థ వృక్షము యొక్క ఉపమానంలో, భౌతిక జగత్తులో ఇంద్రియ వస్తువిషయములు, చెట్టుకు ఉన్న చిగుళ్లు. అవి అంకురించి, వ్యక్తిలో ఇంద్రియ భోగముల పట్ల కోరికలను జనింపచేస్తాయి. ఈ కోరికలు ఆ వృక్షము యొక్క ఊడల వంటివి. అవి ఈ చెట్టు పెరుగుతూనే ఉండటానికి, పోషకములను ఇస్తుంటాయి. భౌతిక భోగముల పట్ల కోరికలచే ప్రేరేపించబడి, జీవ ప్రాణి కర్మలను చేస్తుంది. కానీ, ఇంద్రియ వాంఛలు ఎన్నటికీ తీరవు; పైగా, వాటిని సంతృప్తి పరచాలని చూసే కొద్దీ, అవి మరింతగా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి, కోరికలను తీర్చుకోవటానికి చేసే కర్మలు, వాటిని మరింత పెంచుకోవటానికి మాత్రమే దోహద పడతాయి.

06:19 - న రూపమస్యేహ తథోపలభ్యతే

నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా ।

అశ్వత్థమేనం సువిరూఢమూలమ్

అసంగశస్త్రేణ దృఢేన ఛిత్త్వా ।। 3 ।।

06:31 - తతః పదం తత్పరిమార్గితవ్యం

యస్మిన్ గతా న నివర్తంతి భూయః ।

తమేవ చాద్యం పురుషం ప్రపద్యే

యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ ।। 4 ।।

ఈ వృక్షము యొక్క నిజ స్వరూపము, ఈ జగత్తులో గ్రహింపబడదు. దాని యొక్క మొదలూ, చివర, లేదా సనాతన అస్థిత్వము కూడా అర్థం కావు. కానీ, ఈ యొక్క లోతైన వేర్లుగల అశ్వత్థ వృక్షమును, అనాసక్తి అనే బలమైన గొడ్డలిచే ఖండించివేయాలి. ఆ తరువాత ఆ వృక్షము యొక్క మొదలు వెతకాలి. అదియే, ఆ భగవంతుడు. ఆయన నుండే ఈ జగత్తు యొక్క ఉత్పత్తి, సనాతన కాలం క్రితం సంభవించినది. ఆయనను ఆశ్రయించిన తరువాత, మళ్ళీ మనం ఈ జగత్తు లోనికి రాము.

సంసారములో, అంటే ఎడతెగని జనన-మరణ చక్రములో మునిగి ఉన్న బద్ధులైన జీవాత్మలు, ఈ యొక్క అశ్వత్థ వృక్షము యొక్క స్వభావమును తెలుసుకోలేకున్నారు. వారికి ఈ చెట్టు యొక్క చిగుళ్ళు చాలా ఆకర్షణీయముగా అనిపిస్తాయి. వారు ఇంద్రియ వస్తు విషయముల పట్ల ఆకర్షితమవుతారు, వాటి పట్ల కోరికలను పెంచుకుంటారు. ఈ కోరికలను తీర్చుకోవటానికి, వారు ఎంతో శ్రమిస్తుంటారు. కానీ, వీరి శ్రమ అంతా, ఆ వృక్షము మరింతగా పెరగటానికి దోహదపడుతుందని తెలుసుకోరు. ఎప్పుడైతే కోరికలు తీరుతాయో, అవి మరింత ఉధృతంగా, అత్యాశ రూపంలో తిరిగి వస్తాయి. కోరికలను అడ్డుకున్నప్పుడు, అవి క్రోధమునకు దారితీస్తాయి. అది బుద్ధిని మరింత భ్రమకు గురి చేసి, మరింత అజ్ఞానము లోకి నెట్టి వేస్తాయి. ఈ అశ్వత్థ వృక్షము యొక్క నిగూఢ మర్మమును, కొద్ది మందే అర్థం చేసుకుంటారని, శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. ఈ వృక్షము యొక్క మొదలు, లేదా దాని అసలు స్వభావము తెలుసుకోకుండా, జీవుడు వ్యర్ధమైన పనులు చేయటం, లేదా ప్రయాసలు పడటం చేస్తుంటాడు. తన యొక్క భౌతిక కోరికలను తీర్చుకోవటం కోసం, మానవుడు ఒక్కోసారి పాపపు పనులు చేస్తూ, నిమ్నస్థాయి జీవులలోకీ, అధోలోకాలలోనికీ ప్రవేశిస్తాడు. ఒక్కోసారి భౌతిక భోగములు అనుభవించాలనే కోరిక, వ్యక్తిని ఆ చెట్టు యొక్క ఆకుల పట్ల ఆకర్షితం చేస్తుంది. అవే, వేదములలో చెప్పబడిన కామ్య కర్మ కాండలు. ఈ కార్యములను చేయటం వలన, వ్యక్తి స్వర్గాది పై లోకములకు వెళతాడు. కానీ, పుణ్యము క్షయమయిపోయిన తరువాత, తిరిగి భూలోకానికి చేరుతాడు.

08:59 - నిర్మానమోహా జితసంగదోషా

అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ।

ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః

గచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్ ।। 5 ।।

దురభిమానము, మరియు మోహము లేకుండా ఉన్నవారూ, మమకారాసక్తియనే అరిష్టాన్ని జయించినవారూ, సతతమూ, ఆత్మ భగవంతుని చింతనలోనే ఉన్నవారూ, ఇంద్రియ భోగములను అనుభవించాలని కోరికలు లేని వారూ, సుఖదుఃఖములనెడి ద్వందములకు అతీతులై ఉన్నవారూ, ఇటువంటి ముక్తజీవులు, నా పరమపదమును చేరుకుంటారు.

శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, ఆ వృక్షము యొక్క మూలాధారమైన భగవంతునకు, ఎలా శరణాగతి చేయాలో వివరిస్తున్నాడు. ప్రప్రధమంగా, అజ్ఞానము వల్ల జనించిన అహంకారమునూ, మరియు గర్వమునూ విడిచిపెట్టాలని అంటున్నాడు. భ్రాంతికి లోనైన జీవాత్మ, ప్రస్తుతం ఇలా అనుకుంటుంది.. ‘నాకున్న దానికంతా నేనే యజమానిని, భవిష్యత్తులో మరింత సంపాదించుకుంటాను. ఇదంతా నా భోగవిలాసానికీ, మరియు సంతోషానికే ఉన్నది.’ అనే భ్రమలో ఉంటుంది. మనము అజ్ఞానము వలన జనించిన ఈ అహంకారముచే మోహితులమై ఉన్నంత వరకూ, మనమే ప్రకృతిని అనుభవించేదని అనుకుంటాము. ఇటువంటి పరిస్థితిలో, మనము ఆ భగవంతుడిని పక్కకుపెట్టి, ఆయన సంకల్పానికి శరణాగతి చేయటానికి వాంఛించము. మనమే వీటన్నిటినీ అనుభవించేదన్న దృక్పథం, జ్ఞాన సహకారంతో నిర్మూలించబడాలి. ఈ భౌతిక శక్తి భగవంతునికి చెందినది కాబట్టి, ఆయన సేవ కోసమే ఉన్నదని గ్రహించాలి. ఆత్మ కూడా భగవంతుని యొక్క సేవకుడే కాబట్టి, ప్రస్తుతమున్న భోగించే దృక్పథాన్ని, సేవా దృక్పథముగా మార్చాలి. దీని కోసం మనము మనస్సుని భగవంతుని నుండి దూరంగా, ప్రాపంచికత్వం వైపు మరల్చే భౌతిక బంధాలను నిర్మూలించుకోవాలి. బదులుగా, ఆత్మ అనేది భగవంతుని యొక్క సనాతన నిత్య దాసుడే అని అర్థం చేసుకుని, మనస్సును నిస్వార్ధ సేవా దృక్పథంలో, భగవంతుని యందే అనుసంధానం చేయాలి.

11:05 - ఇక మన తదుపరి వీడియోలో, భౌతిక శక్తిచే కట్టివేయబడి, మనస్సుతో కలిపి ఉన్న ఆరు ఇంద్రియములతో ఏ విధంగా ప్రయాస పడుతుంటామో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Link: https://www.youtube.com/post/UgkxaOc1LBkdNKgupyDYRmy98045V70C_wxa

Wednesday, May 3, 2023

Transcendental Meditation - భగవద్గీత Bhagavadgita


Transcendental Meditation?
అనుకూల - ప్రతికూల పరిస్థితులనూ, విమర్శనూ - ప్రశంసనూ ఒక్కలాగే ఎలా చూడాలి?

'భగవద్గీత' చతుర్దశోధ్యాయం – గుణత్రయ విభాగ యోగం (24 – 27 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్నాలుగవ అధ్యాయం, గుణత్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, గుణత్రయ విభాగ యోగములోని, 24 నుండి 27 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/UdZlKp1cyro ]



త్రిగుణములకు అతీతులైనవారెవరో, శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు..

00:45 - సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మకాంచనః ।
తుల్యప్రియాప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః ।। 24 ।।

00:55 - మానాపమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః ।
సర్వారంభపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే ।। 25 ।।

సుఖదుఃఖాలలో ఒక్క రీతిగానే ఉండేవారూ, ఆత్మ భావన యందే స్థితమై ఉండేవారూ, మట్టిముద్ద, రాయి, మరియు బంగారము, వీటన్నిటినీ ఒకే విలువతో చూసేవారూ, అనుకూల, లేదా ప్రతికూల పరిస్థితిలో ఒక్కరీతిగానే ఉండేవారూ, తెలివైన వారూ, నిందాస్తుతులను రెంటినీ సమముగా స్వీకరించేవారూ, గౌరవమునూ, అవమానమునూ ఒక్క రీతిగానే తీసుకునేవారూ, శత్రువునూ, మిత్రుడినీ ఒక్కలాగే చూసేవారూ, అన్ని యత్నములనూ విడిచిపెట్టినవారూ - వీరు త్రిగుణములకు అతీతులైనవారని చెప్పబడతారు.

భగవంతుని లాగానే, ఆత్మ కూడా త్రిగుణాతీతమయినదే. శారీరక దృక్పథంలో మనము, మనలను శరీరము యొక్క సుఖ-దుఃఖాలతో అనుసంధానం చేసుకుంటాము. అందుకే, హర్షము లేదా శోకము వంటి భావోద్వేగాల మధ్య ఊగిసలాడతాము. కానీ, ఆత్మ భావము యందే స్థితమైనవారు, శరీరము యొక్క సుఖము, లేదా దుఃఖముచే ప్రభావితం కారు. ఇటువంటి ఆత్మజ్ఞానులు జగత్తు యందలి ద్వందములను గమనిస్తారు కానీ, వాటిచే ప్రభావితం కారు. అందుకే వారు నిర్గుణులైపోతారు. అంటే, గుణముల ప్రభావమునకు అతీతమైపోతారు. ఇది వారికి సమత్వ దృష్టిని ఇస్తుంది. దానితో వారు, ఒక రాయిని, లేదా మట్టి ముద్దని, బంగారాన్ని, అనుకూల మరియూ ప్రతికూల ప్రరిస్థితులనూ, విమర్శనూ మరియు ప్రశంసనూ ఒక్కలాగే చూస్తారు.

02:33 - మాం చ యోఽవ్యభిచారేణ భక్తియోగేన సేవతే ।
స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే ।। 26 ।।

నిష్కల్మషమైన భక్తి ద్వారా నన్ను సేవించిన వారు, ప్రకృతి త్రిగుణములకు అతీతులై పోవుదురు, మరియు బ్రహ్మము స్థాయికి చేరతారు.

ప్రకృతి త్రి-గుణములకు అతీతులైన వారి యొక్క లక్షణములను వివరించిన పిదప, శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, ఈ త్రిగుణములకు అతీతమై పోవటానికి ఉన్న ఏకైక పద్ధతిని వివరిస్తున్నాడు. ఆత్మ యొక్క జ్ఞానము, మరియు దానికీ శరీరమునకూ ఉన్న బేధమును, కేవలం తెలుసుకుంటే సరిపోదు. భక్తి యోగము ద్వారా, మనస్సును ఆ పరమేశ్వరుడైన శ్రీ కృష్ణ పరమాత్మపై లగ్నం చేయాలి. అప్పుడు మాత్రమే మన మనస్సు, నిర్గుణుడైన శ్రీకృష్ణుడి వలె, మూడు గుణములకు అతీతమైన స్థాయికి చేరుతుంది. చాలా మంది జనులు, మనస్సును సాకార రూప భగవంతునిపై నిమగ్నం చేస్తే, అది అలౌకిక స్థాయికి చేరుకోలేదని అనుకుంటారు. దానిని నిరాకార బ్రహ్మముపై నిమగ్నం చేస్తేనే, మనస్సు త్రి-గుణములకు అతీతమవుతుందని భావిస్తారు. కానీ, ఈ శ్లోకం ఆ అభిప్రాయాన్ని ఖండిస్తున్నది. సాకార రూప భగవంతుడు అనంతమైన గుణములను కలిగి ఉన్నా, అవి అన్నీ దివ్యమైనవి, మరియు ప్రకృతి గుణముల కన్నా అతీతమైనవి. కాబట్టి, సాకార రూప భగవానుడు నిర్గుణుడు. పద్మ పురాణంలో, మహర్షి వేద వ్యాసుడు, ఈ విషయాన్ని ఇలా వివరిస్తున్నాడు: ‘శాస్త్రములు ఏవైనా భగవానుడు నిర్గుణుడని అంటే, దాని అర్థం, ఆయనకి ప్రాకృతిక గుణములు లేవని. ఐనప్పటికీ, ఆయన యొక్క దివ్య వ్యక్తిత్వము గుణరహితము కాదు. ఆయనకు అనంతమైన దివ్య గుణములు ఉన్నాయి’. ధ్యాన విషయంలో ఏది శ్రేష్ఠమో కూడా, ఈ శ్లోకము తెలియచేస్తున్నది. Transcendental meditation అంటే, ఎదో శూన్యంపై ధ్యానం చేయటం కాదు. భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములకు అతీతమైన అస్థిత్వము, భగవంతుడు. కాబట్టి, మన ధ్యాన విషయం భగవంతుడయినప్పుడే, దానిని నిజమైన Transcendental meditation అని అనవచ్చు.

04:45 - బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమ్ అమృతస్యావ్యయస్య చ ।
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ ।। 27 ।।

అనశ్వరమైన, అవ్యయమైన నిరాకార బ్రహ్మమునకూ, సనాతనమైన ధర్మమునకూ, మరియు అఖండమైన దివ్య ఆనందమునకూ నేనే ఆధారమును.

సర్వశక్తిమంతుడైన భగవానుడు, తన అస్తిత్వంలో నిరాకార తత్వమును, మరియు సాకార రూపమును, రెంటినీ కలిగి ఉన్నాడని, ఇదివరకే చెప్పబడినది. జ్ఞానులు ఉపాసించే బ్రహ్మము అనేది, భగవంతుని యొక్క సాకార రూపము నుండి జనించే ప్రకాశమే అని, ఇక్కడ శ్రీ కృష్ణుడు తెలియపరుస్తున్నాడు. ‘బృందావనేశ్వరుడైన శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క పాద నఖముల నుండి వెలువడే కాంతియే, జ్ఞానులూ, దేవతలూ ధ్యానించే అలౌకిక బ్రహ్మమ’ని, పద్మ పురాణంలో వివరించబడింది. భగవంతుని యొక్క దివ్య దేహము నుండి వెలువడే తేజస్సే, ఉపనిషత్తులలో బ్రహ్మముగా చెప్పబడినది. పరమేశ్వరుని సాకార రూపము పట్ల నిశ్చలమైన భక్తితో నిమగ్నమవ్వటమే, త్రిగుణముల యొక్క వ్యాధుల సర్వరోగనివారిణి అని, రూఢీగా తెలియజేస్తున్నాడు శ్రీ కృష్ణుడు.

ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం, యోగ శాస్త్రే, శ్రీ కృష్ణార్జునసంవాదే, గుణత్రయ విభాగయోగో నామ చతుర్దశోధ్యాయ:

శ్రీ మద్భగవద్గీతలోని జ్ఞానషట్కం, పద్నాలుగవ అధ్యాయం, గుణత్ర విభాగ యోగములోని, 27 శ్లోకాలూ సంపూర్ణం..

06:18 - ఇక మన తదుపరి వీడియోలో, పదునైదవ అధ్యాయం, పురుషోత్తమ ప్రాప్తి యోగములో, శ్రీ కృష్ణుడు విశదపరిచిన నిగూఢార్థాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Wednesday, April 26, 2023

బంగారు సంకెళ్ళు! భగవద్గీత Bhagavadgita

 

బంగారు సంకెళ్ళు!
జన్మ, మృత్యువు, వృద్ధాప్యము, దుఃఖముల నుండి విముక్తి ఎలా పొందవచ్చు?

'భగవద్గీత' చతుర్దశోధ్యాయం – గుణత్రయ విభాగ యోగం (19 – 23 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్నాలుగవ అధ్యాయం, గుణత్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, గుణత్రయ విభాగ యోగములోని, 19 నుండి 23 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/VXwMTe9zIYs ]



ప్రకృతి త్రి-గుణములకు అతీతముగా అయిన వారి లక్షణములు ఏ విధంగా ఉంటాయో, భగవానుడిలా వివరిస్తున్నాడు..

00:49 - నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి ।
గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోఽధిగఛ్చతి ।। 19 ।।

అన్ని కార్యములలోనూ, కర్తలు ఈ త్రి-గుణములే తప్ప, వేరే ఇతరములు లేవని ఎప్పుడైతే వివేకవంతులు తెలుసుకుని, నన్ను ఈ గుణములకు అతీతునిగా తెలుసుకుంటారో, వారు నా దివ్య స్వభావాన్ని పొందుతారు.

ఈ మూడు గుణముల యొక్క సంక్లిష్టమైన పనితీరును వివరించిన పిదప, శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, వాటి బంధనము నుండి ముక్తిపొందటానికి సరళమైన ఉపాయమును చెబుతున్నాడు. జగత్తు లోని సమస్త జీవ భూతములూ, ఈ మూడు గుణముల బంధనములో ఉన్నాయి. కాబట్టి, ఈ గుణములే జగత్తులో జరిగే కార్యములన్నింటిలో, ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాయి. కానీ, సర్వోన్నత భగవానుడు వాటికి అతీతుడు. కాబట్టి, ఆయనను త్రి-గుణాతీతుడని అంటారు. అదే విధంగా, భగవంతుని యొక్క అన్ని గుణములూ, ఆయన నామములూ, రూపములూ, లీలలూ, ధామములూ, మరియు పరివారమూ, ఇవన్నీ త్రి-గుణాతీతములే. ఒకవేళ మన మనస్సును త్రి-గుణముల యొక్క పరిధిలోనే ఉన్న ఏ ఒక్క వ్యక్తి, లేదా వస్తువు పట్ల అనుసంధానం చేసినా, ఆ సంబంధిత గుణ-ప్రభావం, మన మనోబుద్ధులపై పెరుగుతుంది. కానీ, మన మనస్సును దివ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రములోనే ఉంచితే, అది త్రిగుణములకు అతీతముగా, దివ్యమైనదిగా అవుతుంది. ఈ సూత్రమును అర్థం చేసుకున్నవారు, ప్రాపంచిక వస్తువులు, మనుష్యుల పట్ల తమ సంబంధాన్ని తగ్గించుకుంటూ, భక్తి ద్వారా, భగవంతుడు, మరియు గురువు పట్ల సంబంధాన్ని బలపరుచుకుంటారు. ఇది వారికి త్రిగుణములకు అతీతముగా అవ్వటానికి సహాయకారిగా, మరియు భగవంతుని యొక్క దివ్య స్వభావాన్ని పొందటానికి సహాయకారిగా ఉంటుంది.

02:38 - గుణానేతానతీత్య త్రీన్ దేహీ దేహసముద్భవాన్ ।
జన్మమృత్యుజరాదుఃఖైః విముక్తోఽమృతమశ్నుతే ।। 20 ।।

శరీర సంబంధిత ప్రకృతి త్రిగుణములకు అతీతముగా అయిపోవటం వలన వ్యక్తి, జన్మ, మృత్యువు, వృద్ధాప్యము, మరియు దుఃఖముల నుండి విముక్తి పొంది, అమరత్వం పొందుతాడు.

మనం ఒకవేళ పాడైపోయిన ఆహారాన్ని తీసుకుంటే, మనకు అనారోగ్యం కలుగుతుంది. అదే విధంగా, మనం ఈ త్రిగుణములచే ప్రభావితం అయితే, మనం వాటి యొక్క పరిణామాలను అనుభవించాలి.. అంటే, పదేపదే ఈ భౌతిక జగత్తులో పుట్టటం, వ్యాధి, వృద్ధాప్యం, మరియు మరణం వంటివి. ఈ నాలుగే, భౌతిక జగత్తులో ప్రధానమైన క్లేశములు. వీటిని చూసిన తరువాతే, బుద్ధుడు ఈ ప్రపంచం దుఃఖములకు నిలయమని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఈ క్లేశములకు పరిష్కారం వెదికాడు. వేదములు ఎన్నెన్నో నియమములనూ, సామాజిక విధులనూ, పూజాది కర్మ కాండలనూ, మరియు నిబంధనలనూ, మానవులకు విధించాయి. ఈ చెప్పబడిన విధులూ, మరియు నియమనిబంధనలన్నింటినీ కలిపి, కర్మ ధర్మాలంటారు, లేదా, వర్ణాశ్రమ ధర్మములంటారు, లేదా, శారీరక ధర్మములంటారు. అవి మనలను తమో గుణము నుండి రజో గుణమునకూ, దానినుండి సత్త్వ గుణమునకూ, ఉన్నతమైనవిగా చేస్తాయి. కానీ, సత్త్వ గుణమును చేరుటయే సరిపోదు; అది కూడా ఒకలాంటి బంధనమే. సత్త్వ గుణమును బంగారు సంకెళ్ళతో కట్టివేయబడటంతో పోల్చవచ్చు. మన లక్ష్యము ఈ భౌతిక జగత్తు అనే జైలు నుండి బయట పడడం. మనము ఈ త్రి-గుణములకు అతీతముగా అయినప్పుడు, జీవాత్మలను ఇక మాయ బంధించదు. ఈ విధంగా, జీవాత్మ జనన మరణ చక్రము నుండి విముక్తి నొంది, అమరత్వం పొందుతుంది. నిజానికి, ఆత్మ అనేది ఎల్లప్పుడూ నిత్యమే. కానీ, అది తనకు తాను ఈ భౌతిక శరీరమే అనుకోవటం వలన, అది జన్మ-మృత్యువు అనే మిథ్యా దుఃఖమును అనుభవింప చేస్తుంది. ఈ మిథ్యానుభవము, తన యొక్క సనాతన అస్థిత్వ స్వభావానికి వ్యతిరేకమైనది; జీవాత్మ దీనినుండి విముక్తికై ప్రయత్నిస్తుంటుంది. కాబట్టి, భౌతిక ప్రాపంచిక మిథ్య సహజంగానే, మన అంతర్గత అస్థిత్వానికి ఇబ్బందికరమే.

04:59 - అర్జున ఉవాచ ।
కైర్లింగైః త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో ।
కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే ।। 21 ।।

అర్జునుడు ఇలా అడుగుతున్నాడు: ఓ ప్రభూ, ప్రకృతి త్రి-గుణములకు అతీతముగా అయినవారి లక్షణములు ఏ విధంగా ఉంటాయి? వారు ఏవిధంగా ప్రవర్తిస్తారు? వారు త్రి-గుణముల బంధనమునకు అతీతముగా ఎలా అవుతారు?

అర్జునుడు శ్రీ కృష్ణుడి నుండి, త్రి-గుణములకు అతీతులవటం గురించి విని ఉన్నాడు. అందుకే ఇప్పుడు, ఈ త్రి-గుణముల విషయమై, మూడు ప్రశ్నలను అడుగుతున్నాడు. త్రిగుణాతీతుల లక్షణములు ఎలా ఉంటాయి? త్రిగుణాతీతుల ప్రవర్తన ఎలా ఉంటుంది? త్రిగుణములకు అతీతంగా ఎలా అవుతాము? అని తన సంశయాన్ని శ్రీ కృష్ణుడి ముందుంచాడు.

05:48 - శ్రీ భగవానువాచ ।
ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ ।
న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ।। 22 ।।

05:59 - ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే ।
గుణా వర్తంత ఇత్యేవం యోఽవతిష్ఠతి నేంగతే ।। 23 ।।

శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు: ఓ అర్జునా, ఈ త్రిగుణములకు అతీతులైనవారు - సత్త్వ గుణ జనితమైన ప్రకాశమునుగానీ, రజో గుణ జనితమైన కార్యకలాపములనుగానీ, లేదా తమో గుణ జనితమైన మోహభ్రాంతినిగానీ, - అవి పుష్కలంగా ఉన్నప్పుడు ద్వేషించరు, లేదా, అవి లేనప్పుడు వాటిని కాంక్షించరు. వారు ప్రకృతి గుణముల పట్ల తటస్థముగా, ఉదాసీనంగా ఉండి, వాటిచే అలజడికి గురికారు. గుణములే ప్రవర్తించుతున్నవని తెలుసుకుని, వారు నిశ్చలముగా ఆత్మ యందే స్థితమై ఉంటారు.

అర్జునుడి ప్రశ్నలకు శ్రీ కృష్ణుడు సమాధానమిస్తున్నాడు. ప్రపంచంలో ఈ త్రి-గుణములు ప్రవర్తిల్లటం చూసినప్పుడు, వాటి ప్రభావం మనుష్యులలో, వస్తువులలో, మరియు వాటి చుట్టూ ఉండే పరిస్థితులలో వ్యక్తమైనప్పుడు, వారు చలింపరు. జ్ఞానోదయమైన వారు అజ్ఞానమును చూసినప్పుడు దానిని ద్వేషింపరు, లేదా దానిలో చిక్కుకోరు. ప్రాపంచిక మనస్తత్వం కలవారు, ఈ ప్రపంచ స్థితిగతులపై మరీ ఎక్కువగా చింతిస్తూ ఉంటారు. వారి యొక్క సమయాన్ని, మరియు శక్తిని, ప్రపంచంలోని పరిస్థితులపై తలపోస్తూ గడుపుతారు. జ్ఞానోదయమైన మహాత్ములు కూడా, మానవ సంక్షేమం కోసమే పని చేస్తుంటారు. కానీ, వారు అలా ఎందుకు చేస్తారంటే, అది వారి సహజ స్వభావం కాబట్టి. అదే సమయంలో, ఈ జగత్తు అంతా భగవంతుని నియంత్రణలో ఉన్నదని కూడా, వారికి తెలుసు. కేవలం తమ శక్త్యానుసారం పని చేయాలి, మరియు మిగతాది ఆ భగవంతునికే విడిచిపెట్టాలని, వారికి తెలుసు. ఈ భగవంతుని యొక్క జగత్తు లోనికి వచ్చిన తరువాత, మన యొక్క ప్రధానమైన కర్తవ్యం, మన అంతఃకరణ శుద్ధి కోసం పరిశ్రమించటమే. ఆ తదుపరి, శుద్ధమైన, పవిత్రమైన అంతఃకరణతో, మనం సహజంగానే, ప్రపంచ పరిస్థితులు మనలను తీవ్రంగా ప్రభావితం చేయనీయకుండా, ప్రపంచంలో సత్కార్యములూ, సంక్షేమ కార్యక్రమాలూ చేస్తాము. జ్ఞానోదయమయిన మహాత్ములూ, త్రి-గుణములు చేసే పనులకు తాము అతీతులమని తెలుసుకున్నవారూ, ప్రకృతి యొక్క త్రిగుణములు జగత్తులో వాటివాటి సహజ స్వభావ పనులు చేస్తుంటే, హర్షమునకు కానీ, లేదా శోకమునకు కానీ గురికారు. నిజానికి వారి మనసులోనే ఈ గుణములను గమనించినా, వారు కలత చెందరు. ఈ మనస్సు భౌతిక శక్తిచే తయారుచేయబడినది. అందుకే దానికి ప్రకృతి సహజమైన మాయా త్రి-గుణములు ఉంటాయి. కాబట్టి, మనస్సు సహజంగానే ఈ గుణములచే, మరియు వాటివాటి అనుగుణముగా వచ్చే తలంపులచే ప్రభావితం అవుతుంది. ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే, శారీరక దృక్పథంలో, మనము మన మనస్సుని మనకంటే వేరుగా చూడము. అలౌకికమైన స్థితిలో ఉండే మహాత్ములు, గుణముల ప్రభావం వలన తమ మనస్సులో పుట్టే అన్ని చెడు తలంపుల నుండీ, తమను తాము దూరం చేసుకునే కళను బాగా అభ్యసించిన వారే.

09:06 - ఇక మన తదుపరి వీడియోలో, త్రిగుణములకు అతీతులైనవారు ఎవరో, శ్రీ కృష్ణుడి వివరణలో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Wednesday, April 19, 2023

పునర్జన్మలు వేటి మీద ఆధారపడి ఉంటాయి? భగవద్గీత Bhagavadgita


కర్మ సిద్ధాంతం! జీవాత్మల భవితవ్యం లేక పునర్జన్మలు వేటి మీద ఆధారపడి ఉంటాయి?

'భగవద్గీత' చతుర్దశోధ్యాయం – గుణత్రయ విభాగ యోగం (14 – 18 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్నాలుగవ అధ్యాయం, గుణత్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, గుణత్రయ విభాగ యోగములోని, 14 నుండి 18 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/gR4mTu-pZQg ]


త్రిగుణములచే ప్రసాదింపబడే గమ్యములను, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:46 - యదా సత్త్వే పవృద్ధే తు ప్రలయం యాతి దేహభృత్ ।
తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే ।। 14 ।।

00:56 - రజసి ప్రలయం గత్వా కర్మసంగిషు జాయతే ।
తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే ।। 15 ।।

సత్త్వ గుణ ప్రధానముగా ఉంటూ మరణించినవారు, జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలను అంటే, రజస్సు, తమస్సు లేనటువంటి లోకాలను చేరుకుంటారు. రజో గుణ ప్రధానముగా ఉంటూ మరణించినవారు, కర్మాసక్తులైన వారిలో జన్మిస్తారు; తమో గుణ ప్రభావంతో ఉంటూ మరణించిన వారు, జంతువుల జీవ రాశిలో పుడతారు.

జీవాత్మల భవితవ్యం, వాటి వ్యక్తిత్వ గుణముల మీద ఆధారపడి ఉంటుంది. భగవంతుని శాసనంలో, కర్మ సిద్ధాంతం ప్రకారం, మనకు ఏది పొందటానికి అర్హత ఉన్నదో, అదే లభిస్తుంది. ఎవరైతే సద్గుణములు, జ్ఞానము, మరియు ఇతరుల పట్ల సేవా భావాన్ని పెంపొందిచుకుంటారో, వారు ధర్మాత్ములు, పండితులు, లేదా సమాజ సేవకుల కుటుంబములలో జన్మిస్తారు, లేదా, వారు ఉత్తమ లోకాలకు వెళతారు. ఎవరైతే దురాశ, ధన దాహము, మరియు ప్రాపంచిక అభ్యుదయేచ్ఛలకు లొంగిపోతారో, వారు తీవ్రమైన భౌతిక, లౌకిక వ్యవహారములు నడిపే కుటుంబములలో, తరచుగా వ్యాపార కుటుంబాలలో జన్మిస్తారు. ఎవరైతే  హింస, సోమరితనం, మరియు కర్తవ్య నిర్వహణ పట్ల నిర్లక్ష్యం - వీటి పట్ల మొగ్గు చూపిస్తుంటారో, వారు తాగుబోతులూ మరియు చదువురాని వారి కుటుంబములలో జన్మిస్తారు, లేదా, వారు నిమ్నస్థాయి జీవరాశులలో, జంతువులలో జన్మిస్తారు. చాలా మంది జనులకు ఒక సందేహం ఉంటుంది. ఒకసారి మానవ రూపము వచ్చిన తరువాత, తిరిగి నీచ స్థాయి జాతులలో పడిపోవటం సంభవమేనా? అని. ఆత్మకు మానవ దేహము శాశ్వతముగా ఇచ్చివేయబడినది కాదని, ఈ శ్లోకము తెలియచేస్తున్నది. ఎవరైతే దానిని సరిగ్గా వాడుకోరో, వారు జంతువులలోకి వెళ్లిపోవాల్సిన ప్రమాదం ఉంటుంది. ఈ విధంగా, అన్ని మార్గాలూ, అన్ని సమయాలలో తెరచే ఉంటాయి. తనకు ఉండే గుణముల తీవ్రత, మరియు తరచుదనాన్ని బట్టి, ఆత్మ - ఆధాత్మిక పురోగతిలో పైకి వెళ్ళవచ్చు, లేదా అదే స్థాయిలో ఉండిపోవచ్చు, లేదా ఇంకా తక్కువ స్థాయికి పడిపోవచ్చు.

03:09 - కర్మణః సుకృతస్యాహుః సాత్త్వికం నిర్మలం ఫలమ్ ।
రజసస్తు ఫలం దుఃఖమ్ అజ్ఞానం తమసః ఫలమ్ ।। 16 ।।

సత్త్వ గుణములో చేసిన కార్యముల ఫలములు, పవిత్రమైన ఫలితములను ఇస్తాయి. రజో గుణములో చేసిన పనులు, దుఃఖాలను కలుగ చేస్తాయి, మరియు, తమో గుణములో చేసిన పనులు అజ్ఞానపు చీకటిని కలుగచేస్తాయి.

సత్త్వ గుణము ప్రధానముగా ఉన్నవారు, స్వచ్ఛత, సద్గుణము, జ్ఞానము, మరియు నిస్వార్ధముతో ఉంటారు. కాబట్టి, వారి యొక్క పనులు మిగతావారితో పోల్చితే, పవిత్రమైన ఉద్దేశంతో ఉంటాయి, ఆ యొక్క ఫలితములు ఉద్ధరించేవిగా, మరియు తృప్తినిచ్చేవిగా ఉంటాయి. రజో గుణముచే ప్రభావితమయ్యేవారు, తమ మనస్సు-ఇంద్రియముల యొక్క కోరికలచే, ఉద్వేగానికి గురౌతుంటారు. వారి యొక్క పనుల వెనుక ప్రధానోద్దేశం, సొంత గొప్పలూ, మరియు తమ యొక్క, తమ వారి యొక్క ఇంద్రియ-తృప్తీ ఉంటుంది. ఈ విధంగా వారి యొక్క పనులు ఇంద్రియ భోగానుభవము కోసం ఉంటాయి. అవి ఇంద్రియ వాంఛలను మరింత విజృభింప చేస్తాయి. తమో గుణము ప్రబలంగా ఉన్నవారికి, శాస్త్ర ఉపదేశాల పట్ల, మరియు మంచి నడవడిక పట్లా, ఏ మాత్రం గౌరవం ఉండదు. వారు పాపపు పనులు చేస్తూ, వక్రబుద్ధితో భోగవిలాసాలను అనుభవిస్తుంటారు. ఇది వారిని మరింత మోహభ్రాంతిలోనికి నెట్టివేస్తుంది.

04:37 - సత్త్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ।
ప్రమాదమోహౌ తమసో భవతోఽజ్ఞానమేవ చ ।। 17 ।।

సత్త్వ గుణముచే జ్ఞానమూ, రజో గుణముచే లోభమూ, మరియు తమో గుణముచే నిర్లక్ష్యమూ, మరియు మోహమూ జనించును.

త్రి-గుణముల వలన సంభవించే ఫలితములలో వైవిద్యమును వివరించిన పిదప, శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, దీనికి వెనుక కారణమును చెబుతున్నాడు. సత్త్వ గుణము జ్ఞానమును పెంపొందించుతుంది. దీనివలన మంచి-చెడు మధ్య విచక్షణను తెలుస్తుంది. అది ఇద్రియ లౌల్యమును కూడా తగ్గిస్తుంది. అదే సమయంలో, తృప్తి మరియు సంతోషమును కలుగ చేస్తుంది. సత్త్వగుణ ప్రధానంగా ఉన్నవారు, జ్ఞాన సముపార్జన, మరియు ధార్మిక ఆలోచనల వైపు మొగ్గు చూపిస్తారు. ఈ విధంగా, సత్త్వగుణము వివేకవంతమైన పనులను ప్రోత్సహిస్తుంది. రజో గుణము ఇంద్రియములను ఉద్రేకపరుస్తుంది, మరియు మనస్సుపై నియంత్రణ తప్పేటట్లు చేస్తుంది, ఎదో సాధించాలనే కోరికల వలయంలో, తిరుగుతూ ఉండేలా చేస్తుంది. ఇది జీవుడిని కోరికలతో బంధించివేసి, సుఖసంపదల కోసం తీవ్రంగా పరిశ్రమించేటట్లు చేస్తుంది. కానీ, ఇవి ఆత్మ దృక్పథంలో వ్యర్థమైనవి. తమో గుణము, జీవుడిని జడత్వం, మరియు అజ్ఞానముతో కప్పివేస్తుంది. అజ్ఞానముతో ఆవరించబడి, వ్యక్తి తప్పుడు, మరియు పాపపు పనులు చేసి, వాటి యొక్క ఫలితములను అనుభవిస్తాడు.

06:09 - ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థా మధ్యే తిష్ఠంతి రాజసాః ।
జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్ఛంతి తామసాః ।। 18 ।।

సత్త్వ గుణములో స్థితమై ఉన్నవారు, ఉన్నత స్థాయికి వెళతారు; రజో గుణములో స్థితమై ఉండేవారు, మధ్యస్థాయిలోనే ఉండిపోతారు. తమో గుణములో స్థితమై ఉండేవారు, అధోగతి పాలౌతారు.

జీవాత్మల పునర్జన్మ, వాటి వ్యక్తిత్వంలో ప్రబలంగా ఉండే గుణముల మీద ఆధారపడి ఉంటుందని, శ్రీ కృష్ణుడు ఇక్కడ వివరిస్తున్నాడు. ప్రస్తుత జన్మ ప్రయాణాన్ని పూర్తి చేసిన పిదప, జీవులు వారి వారి గుణములకు అనుగుణంగా ఉండే లోకాలకు చేరుకుంటాయి. ‘సత్త్వ గుణములో ఉన్నవారు, స్వర్గాది ఊర్ధ్వలోకములకు వెళతారు; రజో గుణములో ఉండేవారు, భూలోకానికి తిరిగి వస్తారు; తమో గుణములో ఉండేవారు, నరక లోకాలకు వెళతారు. అలాగే, త్రిగుణాతీతులైనవారు, నన్నే పొందుతారు.’ అని భాగవతంలో పేర్కోనబడింది.
07:10 - ఇక మన తదుపరి వీడియోలో, ప్రకృతి త్రి-గుణములకు అతీతముగా అయినవారి లక్షణములు ఏ విధంగా ఉంటాయో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Wednesday, April 12, 2023

ఆకర్షణ! భగవద్గీత Bhagavadgita Chapter 14


ఆకర్షణ! స్త్రీ-పురుషుల మధ్య ఆకర్షణ పెంచేది ఏది?

'భగవద్గీత' చతుర్దశోధ్యాయం – గుణత్రయ విభాగ యోగం (09 – 13 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్నాలుగవ అధ్యాయం, గుణత్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, గుణత్రయ విభాగ యోగములోని, 09 నుండి 13 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/MBDgoVEZ_08 ]


సత్త్వ, తమః, రజో గుణముల లక్షణాలను, ఈ విధంగా తెలియజేస్తున్నాడు భగవానుడు..

00:48 - సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత ।
జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత ।। 9 ।।

సత్త్వము వ్యక్తిని భౌతిక సుఖాలకు కట్టివేస్తుంది; రజో గుణము, జీవాత్మకు కర్మల పట్ల ఆసక్తిని కలిగిస్తుంది; తమో గుణము, జ్ఞానమును కప్పివేసి, వ్యక్తిని మోహభ్రాంతికి బంధించివేస్తుంది.

సత్త్వ గుణములో భౌతిక జీవన క్లేశములు తగ్గుతాయి, మరియు ప్రాపంచిక కోరికలు తగ్గుముఖం పడతాయి. ఇది వ్యక్తి యొక్క స్థితిలో, ఒకలాంటి సంతుష్టిని కలుగచేస్తుంది. ఇది మంచిదే.. కానీ, దీనితో ఒక ఇబ్బంది కూడా ఉంది. ప్రపంచంలో క్లేశములకు గురైనవారూ, మరియు మనస్సులో ప్రాపంచిక కోరికలతో సతమతమై పోయేవారూ, వారి సమస్యలకై పరిష్కారమును వెదుకుతూ ఉంటారు. ఈ ప్రయత్నమే కొన్నిసార్లు, వారిని ఆధ్యాత్మికత వైపుకు తెస్తుంది. కానీ, సత్త్వ గుణములో ఉన్నవారు, ఒకలాంటి నిశ్చింతతో కూడిన తృప్తితో ఉండిపోయి, అలౌకిక స్థాయికి చేరుకోవటానికి, ఉత్సాహం చూపరు. సత్త్వ గుణము, బుద్ధిని జ్ఞానముచే ప్రకాశవంతము చేస్తుంది. దీనితో పాటుగా, ఆధ్యాత్మిక వివేకము లేకపోతే, జ్ఞానముతో గర్వము పెరిగి, ఆ గర్వము భగవత్ భక్తిలో అడ్డుగా వస్తుంది. దీనిని మనము, కొందరు శాస్త్రవేత్తలూ, విద్యావేత్తలూ, పండితులూ, మొదలైన వారిలో గమనించవచ్చు. వీరిలో సత్త్వ గుణము సాధారణంగా, ఎక్కువ ప్రభావశీలంగా ఉంటుంది. ఎందుకంటే, వారి యొక్క సమయాన్నీ, శక్తినీ, జ్ఞాన సముపార్జనలో వినియోగిస్తారు. అయినా, వారికి ఉన్న జ్ఞానము, వారిని కొన్నిసార్లు గర్వితులను చేస్తుంది. వారి బుద్ధికి అతీతముగా ఇంకే పరమ సత్యమూ లేదని అనుకుంటూ ఉంటారు. రజో గుణములో, జీవులు తీవ్ర పరిశ్రమ దిశగా ప్రేరణ పొందుతారు. ప్రపంచం పట్ల వారి అనురక్తీ, మరియు సుఖాలూ, హోదా, సంపద, మరియు శారీరిక సౌకర్యాల పట్ల వారి యొక్క ఆసక్తి, తమ ఆశయాలను సాధించే దిశగా పరిశ్రమించేటట్లు, వారిని ప్రేరేపిస్తుంది; అవే వారికి జీవితంలో అత్యంత ముఖ్యమైనవిగా అనిపిస్తాయి. రజో గుణము, స్త్రీ-పురుషుల మధ్య ఆకర్షణ పెంచుతుంది, మరియు కామమును ప్రేరేపిస్తుంది. ఈ కామమును తృప్తిపర్చుకోవటానికి, పురుషుడు-స్త్రీ వైవాహిక సంబంధంలోకి ప్రవేశించి, ఒక గృహమును కలిగి ఉంటారు. ఆ గృహమును నిర్వహించుకోవటానికి సంపద అవసరము కాబట్టి, వారు ఆర్ధిక అభ్యున్నతి కోసము పరిశ్రమిస్తుంటారు. తీవ్ర వ్యవహారములు చేస్తుంటారు కానీ, ఆ ప్రతి-ఒక్క పనీ, మరిన్ని కర్మలను సృష్టిస్తుంది, మరియు అవి వారిని మరింత భౌతిక అస్థిత్వ బంధనములో, బంధించివేస్తాయి. తమోగుణము, ప్రాణుల బుద్ధిని మబ్బులా కప్పివేస్తుంది. సుఖాల కోసం వాంఛ, ఇక ఇప్పుడు వక్రమైన తప్పుడు విధాలుగా పరిణమిస్తుంది. ఉదాహరణకి, సిగరెట్టు తాగటం హానికరమని అందరికీ తెలుసు. ప్రతి ఒక్క సిగరెట్టు పాకెట్ మీదా, ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరిక కూడా ఉంటుంది. సిగరెట్టు త్రాగేవారు దానిని చదువుతారు. అయినా, వారు ధూమపానం ఆపరు. ఇది ఎందుకు జరుగుతుందంటే, బుద్ధి తన విచక్షణా శక్తిని కోల్పోయి, తనకు హాని జరిగినా, ఆ ధూమపాన సుఖాన్ని ఆస్వాదించాలని కోరుకుంటుంది. ఇదే తమోగుణము యొక్క ప్రభావము. ఇది ఆత్మను అజ్ఞానపు చీకటిలో బంధించివేస్తుంది.

04:21 - రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత ।
రజఃసత్త్వం తమశ్చైవ తమః సత్త్వం రజస్తథా ।। 10 ।।

ఓ అర్జునా! ఒక్కోసారి రజస్తమోగుణములపై సత్త్వముది పైచేయిగా ఉంటుంది. ఒక్కోసారి, సత్త్వతమోగుణములపై రజో గుణము ఆధిపత్యంతో ఉంటుంది; అలాగే ఇంకాకొన్ని సార్లు, సత్త్వరజో గుణములను తమోగుణము ఓడిస్తుంది.

ఒకే వ్యక్తి యొక్క ప్రవృత్తి, ఈ మూడు గుణములలో ఎలా మారుతూఉంటుందో, శ్రీ కృష్ణుడు ఇప్పుడు వివరిస్తున్నాడు. భౌతిక శక్తి యందు ఈ మూడు గుణములూ ఉన్నాయి. మన మనస్సు ఇదే శక్తితో తయారైనది. అందుకే, ఈ మూడు గుణములూ, మన మనస్సులో కూడా ఉన్నాయి. ఒకరితో ఒకరు తలపడే ముగ్గురు మల్లయోధులతో, వీటిని పోల్చవచ్చు. ప్రతి ఒక్కడూ, మిగతా ఇద్దరినీ క్రింద పడవేస్తుంటాడు. కాబట్టి, ఒక్కోసారి మొదటివాడు పైనుంటాడు, ఒక్కోసారి రెండవవాడు, ఇంకోసారి, మూడవ వాడిది పైచేయి అవుతుంది. ఇదే విధంగా, ఈ మూడు గుణములూ, వ్యక్తి యొక్క ప్రవృత్తి పై, ఒక్కోటి ఒక్కోసారి ఎక్కువ ప్రభావంతో ఉంటాయి. బాహ్యమైన పరిస్థితులూ, అంతర్లీన చింతన, మరియు పూర్వ జన్మ సంస్కారములపై ఆధారపడి, ఒక్కో గుణమూ, ఒక్కోసారి ప్రబలమై ఉంటుంది. ఎంతసేపు ఆ ప్రభావం ఉంటుందన్న దానికి, ఏ నియమమూ లేదు. ఒక్కో గుణము, మనోబుద్ధులపై ఒక క్షణం నుండి, ఒక గంట వరకూ ఉండవచ్చు. సత్త్వ గుణము ప్రబలంగా ఉన్నప్పుడు, వ్యక్తి ప్రశాంతముగా, తృప్తిగా, దయాళువుగా, నిర్మలంగా, ప్రసన్నంగా ఉంటాడు. రజో గుణము ప్రబలంగా ఉన్నప్పుడు, వ్యక్తి ఉద్వేగంతో, లక్ష్యమును సాధించాలనే తపనతో, ఇతరుల విజయం పట్ల అసూయతో, ఇంద్రియ సుఖముల పట్ల ఆసక్తితో ఉంటాడు. తమో గుణము ప్రబలంగా ఉన్నప్పుడు, విపరీత నిద్ర, సోమరితనము, ద్వేషము, కోపము, రోషము, హింస మరియు అపనమ్మకంతో ఉంటాడు.

06:23 - సర్వద్వారేషు దేహేఽస్మిన్ ప్రకాశ ఉపజాయతే ।
జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్త్వమిత్యుత ।। 11 ।।

06:33 - లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహా ।
రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ ।। 12 ।।

06:43 - అప్రకాశోఽప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ ।
తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన ।। 13 ।।

దేహములోని అన్ని ద్వారములూ, జ్ఞానముచే ప్రకాశితమైనప్పుడు, అది సత్త్వగుణము యొక్క ప్రకటితమని తెలుసుకొనుము. రజో గుణము ప్రబలినప్పుడు, ఓ అర్జునా, లోభమనబడే దురాశ, ప్రాపంచిక లాభము కోసం పరిశ్రమ, వ్యాకులత, మరియు యావ, పెంపొందుతాయి. ఓ అర్జునా – అజ్ఞానమూ, జడత్వమూ, నిర్లక్ష్యమూ, మరియు మోహమూ - ఇవి తమో గుణము యొక్క ప్రధానమైన లక్షణములు.

భగవంతుడు మళ్ళీ ఒకసారి, త్రిగుణములు వ్యక్తి యొక్క ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తాయో, వివరిస్తున్నాడు. సత్త్వ గుణము, సద్గుణములను పెంపొందించుకునేటందుకూ, మరియు జ్ఞానము ప్రకాశితమవ్వటానికీ, దారితీస్తుంది. రజో గుణము దురాశకీ, ప్రాపంచిక సంపత్తి కోసం అతిప్రయాస, మరియు మనస్సు యొక్క వ్యాకులతకు దారి తీస్తుంది. తమో గుణము, చిత్తభ్రాంతికీ, సోమరితనానికీ, మరియు మత్తుపదార్ధాలకూ, హింసా ప్రవృత్తి దిశగా తీసుకువెళుతుంది. నిజానికి ఈ గుణములు, భగవంతుడు, మరియు ఆధ్యాత్మిక మార్గముల పట్ల మన దృక్పథాన్ని కూడా, ప్రభావితం చేస్తాయి. సత్వ గుణములో ఉన్నప్పుడు, సాధనలో త్వరితగతిన పురోగతిని సాధించటానికి, కృషి చేయాలి. ఎందుకంటే, మానవ దేహమనేది దుర్లభమైనది కాబట్టి, దానిని లౌకికమైన వాటి సముపార్జన కోసం వ్యర్థం చేసుకోకూడదని అనుకుంటాము. రజో గుణము ప్రధానముగా ఉన్నప్పుడు, ‘నేను తప్పకుండా ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి. కానీ అంత తొందర ఏమున్నది? ప్రస్తుతం, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. అవి దీనికన్నా ఇంకా ముఖ్యమైనవి.’ అని ఆలోచిస్తాము. ఎప్పుడైతే తమో గుణము ప్రబలంగా ఉంటుందో, ‘ఏమో, భగవంతుడు ఉన్నాడో లేడో నమ్మకం లేదు. ఎవరూ ఆయనను చూడలేదు. ఎందుకు సాధన కోసం సమయం వృధా చేయాలి?’ అని భావిస్తుంటాము. భక్తిలో ఒకే వ్యక్తి యొక్క ఆలోచనలు ఎంత ఉన్నత స్థాయి నుండి, ఎంత తక్కువ స్థాయికి ఊగిసలాడతాయో, మనం గమనించవచ్చు. ఈ త్రిగుణములచే, మనస్సు ఊగిసలాడటం చాలా సహజమే. 
కానీ, ఈ స్థితిగతులచే మనం నిరాశ చెందకుండా, ఇది ఎందుకు ఇలా అవుతుందో అర్థం చేసుకోవాలి. అలాగే, దానికి అతీతంగా ఎదగటానికి పరిశ్రమించాలి. సాధన అంటే, మనసులో ఈ త్రిగుణముల యొక్క ప్రవాహంతో పోరాడుతూ, దానిని గురువు, మరియు భగవంతుడి పట్ల భక్తితో ఉండటానికి, అభ్యాసము చేయటమే. ఒకవేళ మన యొక్క స్మృతి, అత్యంత ఉన్నతమైన స్థాయిలో రోజంతా ఉండి ఉంటే, అప్పుడు సాధన యొక్క అవసరం లేదు. మనస్సు యొక్క సహజమైన భావనలు ప్రపంచం వైపు మొగ్గు చూపినా, బుద్ధి యొక్క సహాయంతో, దానిని ఆధ్యాత్మిక రంగం వైపు మరల్చాలి. ప్రారంభంలో ఇది కష్టతరంగా అనిపించవచ్చు. కానీ, అభ్యాసముచే అది చాలా సులువుగా అయిపోతుంది.

09:51 - ఇక మన తదుపరి వీడియోలో, త్రిగుణములచే ప్రసాదింపబడే గమ్యములను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...