Audi9 – Telugu Mythology & Temple History Stories | Voice of Maheedhar (Planet Leaf), Shadow Madhu Babu Audiobooks, Facts Hive Youtube Channels. Here I bring you Bhagavad Gita in Telugu, Stories of Mahabharata, Ramayana, Science behind Sanatana Dharma, Hinduism, Interesting and Unknown Facts and Mysteries in Telugu, and Writer Madhu babu's Shadow, Folklore, Fantasy Fiction Novels as Audiobooks / Podcasts. Watch interesting videos Every Day in the original Voice of Maheedhar and Sudha..
ఆధ్యాత్మిక ఉపదేశాలను పొందిన వారు అపరాధులుగా ఎందుకు మారుతారు?
'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (67 – 70 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 67 నుండి 70 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
ఎందుకు కర్మ సన్యాసము కంటే, కర్మ యోగము ఉన్నతమైనదో ఈ శ్లోకాలలో చూద్దాము..
00:48 - ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన ।
న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోఽభ్యసూయతి ।। 67 ।।
ఈ ఉపదేశాన్ని ఎప్పుడూ కూడా తపస్సంపన్నులు కాని వారికీ, లేదా భక్తి లేని వారికీ చెప్పకూడదు. ఆధ్యాత్మిక విషయములు వినటం పట్ల ఏవగింపుగలవారికి కూడా దీనిని చెప్పకూడదు. ముఖ్యంగా నా పట్ల అసూయగలవారికి దీనిని చెప్పకూడదు.
భగవంతుని పట్ల ప్రేమయుక్త భక్తిలో నిమగ్నమైన వారు, ప్రాపంచిక ధర్మములను విడిచిపెట్టినా పాపం లేదు. కానీ, ఈ ఉపదేశంలో ఒక సమస్య ఉన్నది. ఒకవేళ మనం ఇంకా భగవంతుని పట్ల ప్రేమలో స్థిరంగా లేకపోయినా, మరియు తొందరపడి ముందుగానే భౌతికప్రాపంచిక ధర్మములను విడిచి పెట్టినా, మనం అటూ ఇటూ కాకుండా పోతాము. అందుకే, కర్మ సన్న్యాసం అంటే, దానికి తగిన అర్హత ఉండాలి. మనకు దేనికి అర్హత ఉన్నదో, మన గురువు గారు నిర్ణయిస్తారు. ఆయనకే మన సామర్థ్యము, మరియు ఆయా మార్గాలలో ఉండే కాఠిన్యములూ తెలుస్తాయి. ఒకవేళ ఒక విద్యార్థి పట్టభద్రుడు కావాలనుకుంటే, నేరుగా వెళ్లి స్నాతకోత్సవంలో కూర్చుంటే కుదరదు. ఒకటో తరగతి నుండి క్రమక్రమంగా మొదలుపెట్టాలి. అదే విధంగా, అత్యధిక జనులకు కర్మ యోగమునకే అర్హత ఉంటుంది. తొందరపడి అకాలముగా కర్మ సన్యాసము తీసుకోవడం, పెద్ద తప్పే అవుతుంది. తమ శారీరక ధర్మములను నిర్వర్తిస్తూనే, దానితో పాటుగా భక్తిని అభ్యాస సాధన చేయమని చెప్పటమే మంచిది. అందుకే శ్రీ కృష్ణుడు, తాను చెప్పిన ఈ రహస్య జ్ఞానము అందరికోసం కాదని చెబుతున్నాడు. ఇతరులతో పంచుకునే ముందు, ఈ ఉపదేశం అందుకోవటానికి వారి యొక్క అర్హతను పరీక్షించాలి. ఈ హెచ్చరిక, భగవద్గీత మొత్తానికి కూడా వర్తిస్తుంది. ఒకవేళ దీనిని, శ్రీ కృష్ణుడంటే అసూయ, ఈర్ష్య కలిగిన వారికి చెబితే, ఆ వ్యక్తి ఇలా అనవచ్చు.. ‘శ్రీ కృష్ణుడు చాలా దురహంకారముగలవాడు. అర్జునుడిని పదేపదే తనను కీర్తించమని చెబుతున్నాడు’ అని. ఈ ఉపదేశాలను తప్పుగా అర్థం చేసుకుని, విశ్వాసరహితుడు, ఈ దివ్య ఉపదేశం వలన ఇంకా హాని పొందుతాడు. పద్మ పురాణం కూడా ఇలా చెబుతున్నది: ‘విశ్వాసం లేనివారికీ, మరియు భగవంతుని పట్ల ఏవగింపుగలవారికీ, అలౌకిక ఆధ్యాత్మిక ఉపదేశాలను ఇవ్వటం ద్వారా, వారిని అపరాధులుగా చేసినట్టు అవుతుంది.’
03:19 - య ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి ।
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః ।। 68 ।।
ఎవరైతే ఈ పరమ గోప్యమైన జ్ఞానమును నా భక్తులలో ఉపదేశిస్తారో, వారు మహోన్నత ప్రేమయుక్త సేవను చేసినట్టు. వారు నిస్సందేహముగా నన్నే చేరుకుంటారు.
శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, భగవద్గీతను సరియైన పద్ధతిలో బోధిస్తే కలిగే పరిణామాలను ప్రకటిస్తున్నాడు. అటువంటి బోధకులు, ప్రథమంగా ఆయన పరాభక్తిని పొందుతారు. ఆ తర్వాత ఆయననే పొందుతారు.
భక్తిలో నిమగ్నమవ్వటానికి లభించే అవకాశం అనేది, భగవంతుని యొక్క విశేషమైన కృప. అదే సమయంలో, ఇతరులను కూడా భక్తిలో నిమగ్నం చేసే అవకాశం అనేది, ఇంకా ఎక్కువ అనుగ్రహము. అది భగవంతుని యొక్క విశేష కృపను ఆకర్షిస్తుంది. మనం ఎప్పుడైనా ఇతరులతో ఒక మంచిదానిని పంచుకుంటే, మనం కూడా దాని నుండి ప్రయోజనాన్ని పొందుతాము. మన దగ్గరున్న ఏదేని జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటే, భగవదనుగ్రహం వలన, మన జ్ఞానం కూడా ఎంతో పెంపొందుతుంది. ఇతరులకు అన్నం తరచుగా పెట్టడం వలన, మనమెప్పుడూ ఆకలితో ఉండే అవసరం రాదు. దానం ఇవ్వటం వలన, సంపద ఎప్పుడూ తరిగిపోదు; జనులు నీరు తీసుకున్నా, నది ఎన్నడూ తరిగిపోదు. ఈ విధంగా, భగవద్ గీత యొక్క ఆధ్యాత్మిక జ్ఞానమును ఇతరులకు పంచే వారు, తామే అత్యున్నత అనుగ్రహాన్ని పొందుతారు.
04:53 - న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః ।
భవితా న చ మే తస్మాదన్యః ప్రియతరో భువి ।। 69 ।।
వారి కంటే ఎక్కువ ప్రేమయుక్త సేవ నాకు ఎవరూ చేసినట్టు కాదు; వారి కంటే ఎక్కువ ప్రియమైన వారు నాకు ఈ భూమిపై ఎవరూ ఉండబోరు.
ఇతరులకు మనం ఇచ్చే అన్ని బహుమతులకన్నా, ఆధ్యాత్మిక జ్ఞాన బహుమతి అనేది, అత్యంత ఉన్నతమైనది. ఎందుకంటే, ఆ జ్ఞానమును అందుకున్న వాడిని శాశ్వతంగా మార్చివేసే సామర్థ్యం, దానికి ఉన్నది. ఒకనాడు జనక మహారాజు తన గురువు అష్టావక్రుడిని ఇలా అడిగాడు. ‘ఈ అలౌకిక ఆధాత్మిక జ్ఞానమును నాకు ప్రసాదించినందుకు, మీకు ఏంతో రుణపడి ఉన్నాను. మీకు ప్రతిగా ఏమివ్వగలను?’ అని. అందుకు అష్టావక్రుడు ఇలా సమాధానం ఇచ్చాడు. ‘ఈ రుణాన్ని తీర్చగలిగినదేదీ నీవు ఇవ్వలేవు. నేనిచ్చిన జ్ఞానము దివ్యమైనది. నీ దగ్గరున్నదంతా భౌతికమైనది. భౌతిక వస్తువులు ఎప్పుడూ దివ్యమైన జ్ఞానమునకు వెలకట్టలేవు. కానీ, నీవు ఒక పని చేయవచ్చు. నీకు ఎవరైనా, ఈ జ్ఞానం కోసం పరితపిస్తున్నవారు తారసపడితే, దీనిని వారికి తెలియజేయుము.’ ‘భగవద్ గీత యొక్క జ్ఞానమును ఇతరులకు పంచటం అనేది, భగవంతునికి చేయగలిగే అత్యున్నత ప్రేమయుక్త సేవ’ అని, తన అభిప్రాయాన్ని భగవంతుడు వెల్లడిస్తున్నాడు. కానీ, భగవద్ గీత యొక్క జ్ఞానమును ప్రవచించేవారు, ఏదో గొప్ప పని చేస్తున్నట్టు గర్వపడకూడదు. నిజమైన ఉపాధ్యాయుని దృక్పథం ఏమిటంటే, తనను తాను భగవంతుని చేతిలో ఒక పనిముట్టుగానే చూసుకోవాలి. గొప్పతనాన్నంతా ఆ భగవత్ కృపకే ఆపాదించాలి.
06:46 - అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః ।
జ్ఞానయజ్ఞేన తేనాహమిష్టః స్యామితి మే మతిః ।। 70 ।।
మన మధ్య జరిగిన ఈ పవిత్ర సంవాదమును పఠించేవారు, జ్ఞాన యజ్ఞముచే, అంటే, తమ బుద్ధిచే నన్ను ఆరాధించినట్టుని నేను ప్రకటిస్తున్నాను; ఇదే నా అభిప్రాయము.
అర్జునుడికి తన బుద్ధిని, ఆయనకు సమర్పించమని శ్రీ కృష్ణుడు పదేపదే చెప్పి ఉన్నాడు. దీని అర్థం, మన బుద్ధిని ఉపయోగించు కోవటం మానేయమని కాదు; మన బుద్ధిని మన చేతనయినంతవరకూ ఆయన సంకల్పమును పూర్తి చేయుటకు ఉపయోగించమని. భగవద్ గీత యొక్క ఉపదేశము ద్వారా, ఆయన సంకల్పమేమిటో మనకు అర్థం అవుతుంది. కాబట్టి, ఈ పవిత్రమైన సంవాదమును అధ్యయనం చేసేవారు, భగవంతుడిని తమ బుద్ధిచే ఆరాధించినట్టవుతుంది.
07:41 - ఇక మన తదుపరి వీడియోలో, పాపముల నుండి విముక్తి పొంది, పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకములకు చేరుకోవడానికి మార్గం ఏంటో తెలుసుకుందాము..
తీర్థము అంటే, నది రేవు జలస్థానము, పవిత్ర స్థానము, యాత్రా స్థలము అనే అర్థాలున్నాయి. తీర్థ కాకము అంటే, నీటి కాకి. కాకి ఎన్ని తీర్థాలలో మునిగినా, పుణ్య ఫలం పొందలేదనే అర్థంతో, ఈ తీర్థ కాక న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు. ఇక్కడ పేరు కాకిదే అయినా, అసలు ఉద్దేశించి చెప్పింది, మనుషుల గురించేనని అర్థం చేసుకోవాలి. పవిత్రమైన నదుల్లో మునిగి స్నానాలు చేస్తే, అప్పటివరకు చేసిన పాపాలు హరించి పోతాయని భక్తుల విశ్వాసం. తెలిసీతెలియక ఏం పాపాలు చేశామో, అవి పోగొట్టుకుందామని నిష్టగా, భక్తితో తీర్థయాత్రలు చేసే వారు కొందరైతే, నిత్యం అనేక తప్పులూ, చెడు పనులూ చేస్తూ, ‘దాసుని తప్పు దండంతో సరి’ అన్నట్లుగా, తీర్థయాత్రలకు వెళ్ళి, తీర్థ స్నానాలు చేస్తూ ఉంటారు, మరికొందరు. అలా పాపాలు పోగొట్టుకోవాలని ప్రయత్నించే దుష్టుల గురించి, వేమన నిరసనగా ఇలా అంటాడు..
దీని అర్ధం, ఎంత చదివినా, ఎన్ని మంచి మాటలు విన్నా, నీచుడు, చెడు గుణం కలిగిన వ్యక్తి మారడు. నల్లని బొగ్గును పాలతో కడిగినా, ఆ నలుపు పోయి తెల్లగా మారదు కదా! అలా కొందరు తప్పులు కప్పి పుచ్చుకోవడానికి చేసే తీర్థయాత్రలూ, స్నానాల వల్ల, వారికి ఎలాంటి పుణ్యమూ రాదనే అర్థంతో, ఈ తీర్థ కాక న్యాయమును చెబుతుంటారు. ఇక మరో కోణం చూద్దాము..
ఒక నాడు గంగలో స్నానమాచరిస్తున్న లక్షలాది మందిని చూసిన ఒక ఋషికి, ఒక సందేహం వచ్చింది. వెంటనే గంగానదినే అడిగాడు.. 'తల్లీ! ఎందరో, ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి పాపాలు వదిలేస్తున్నారు. మరి ఇందరి, ఇంత పాప భారం ఎలా మోస్తున్నావమ్మా?' అని అడిగాడు.. అందుకా తల్లి, 'నాయనా, ఆ పాప భారం నేనెక్కడ మోస్తున్నాను? అవన్నీ తీసుకెళ్ళి, ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపి వేస్తుంటాను కదా!' అని బదులిచ్చింది..
అయ్యో, అన్ని పుణ్య నదులూ ఇంతే కదా..! పాపాలన్నీ సముద్రంలో కలిపేస్తే, ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో..! అని అనుకుని వెళ్ళి, సముద్రుడినే అడిగాడు.. 'ఎలా మోస్తున్నావు తండ్రీ ఈ పాప భారాన్ని?' అని.. దానికి సముద్రుడు.. 'నేనెక్కడ భరిస్తున్నానయ్యా? ఆ పాపాలను వెను వెంటనే ఆవిరిగా మార్చి, పైన మేఘాల లోకి పంపించేస్తుంటాను' అని బదులిచ్చాడు..
అరే! ఎంతో తేలికగా కదిలి పోయే మేఘాలకు ఎంత కష్టం వచ్చిందని అనుకుంటూ.. 'ఓ మేఘ మాలికల్లారా.. ఎలా భరిస్తున్నారు ఈ పాప భారాన్ని?' అని అడుగగా అవి పకపకా నవ్వి.. 'మేమెక్కడ భరిస్తున్నాము? ఎప్పటి కప్పుడు వర్ష రూపేణా మీ మీదే కురిపించేస్తున్నాము కదా!' అని బదులిచ్చాయి..
ఓహో! ఆ పాపాలన్నీ మన మీద పడి, మనమే అనుభవిస్తున్నామన్న మాట! అయితే ఎట్టి పరిస్థితులలోనూ, ఎవ్వరూ కర్మ ఫలితాలను వదిలించు కోలేరని గ్రహించాడు, ఋషి..
ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః ।
ఆత్మతీర్ధం నజానన్తి కధం మోక్షః శృణు ప్రియే ।।
ఈ తీర్ధంలో స్నానమాచరిస్తే పుణ్యం కలుగుతుంది, ఆ తీర్ధంలో స్నానమాచరిస్తే మోక్షం కలుగుతుందని, తీర్ధ స్నానాలకై పరుగులు పెడుతున్న మానవులు, ‘భ్రమకు లోబడిన వారు’! ఆత్మ జ్ఞాన తీర్ధంలో స్నానమాచరించని వారికి మోక్షమెలా కలుగుతుంది? అని ఈ శ్లోకం యొక్క అర్థం.
కర్మ కర్మణా నశ్యతి కర్మ ।। అంటే.. కర్మ అనేది కర్మతోనే నశిస్తుంది..
సత్కర్మ భిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం ।
అచ్యుత్కట పుణ్య పాపానం సత్యం ఫలాను భవమిహం ।।
ఈ చోటి కర్మ ఈ చోటే. ఈ నాటి కర్మ మరునాడే. అనుభవంచి తీరాలంతే, ఈ సృష్టి నియమం ఇదే..
'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (63 – 66 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 63 నుండి 66 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
ఈ విధంగా, నేను నీకు అన్ని రహస్యాలకంటే పరమ రహస్యమైన జ్ఞానమును తెలియచేశాను. దీనిపై లోతుగా ఆలోచించుము, మరియు నీకు నచ్చిన రీతిలో చేయుము.
రహస్యము అంటే, అందరికీ సామాన్యముగా అందుబాటులో లేని జ్ఞానమని అర్థం. ఆధ్యాత్మిక జ్ఞానమనేది చాలా నిగూఢమయినది. అది ప్రత్యక్ష అనుభూతి ద్వారా తెలుసుకోబడలేనిది. దానిని గురువు, మరియు శాస్త్రముల ద్వారా నేర్చుకోవాలి. కాబట్టి, అది రహస్యమని చెప్పబడినది. రెండవ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు ఆత్మ జ్ఞానమును తెలియచేశాడు. 7వ మరియు 8వ అధ్యాయాలలో, తన శక్తిసామర్థ్యాల యొక్క జ్ఞానమును తెలియచేశాడు. 9వ మరియు తదుపరి అధ్యాయాలలో, తన భక్తి గురించి తెలియచేశాడు. ప్రస్తుత అధ్యాయంలో, తనను తన సాకార రూపంలో తెలుసుకోవటం కేవలం భక్తి ద్వారా మాత్రమే సాధ్యమని తెలియచెప్పాడు. అత్యంత రహస్యములతో కూడిన జ్ఞానాన్ని అర్జునుడికి తెలియ చేస్తూ, ఇక ఇప్పుడు ఏం చేయాలనే నిర్ణయాన్ని, అర్జునుడికే వదిలేస్తున్నాడు. ‘నేను నీకు గంభీరమైన, మరియు గోప్యమైన జ్ఞానాన్ని అందించాను. ఇక ఇప్పుడు నీ ఇష్టం.’ అని భగవంతుడు, తుది నిర్ణయాన్ని అర్జునుడికే వదిలివేశాడు. అయోధ్యావాసులకు శ్రీ రామచంద్ర ప్రభువు, సుమారుగా ఇటువంటి మాటలే చెప్పాడు. ఒకసారి ఆయన వారందరినీ తన ప్రవచనానికి పిలిచాడు. ఆ ఉపదేశంలో, రాముడు వారందరికీ, మానవ జీవిత లక్ష్యం ఏమిటో, దానిని ఎలా సాధించాలో చెప్పాడు. చివరికి ఇలా ముగించాడు. ‘నేను మీకు చెప్పిన ఉపదేశంలో తప్పు లేదు. అలాగే, నిర్బంధంగా దానిని పాటించాల్సిన అవసరమూ లేదు. దానిని జాగ్రత్తగా విని, ఆలోచించి, ఆ తరువాత మీకు నచ్చిన రీతిలో చేయండి.’ అందుబాటులో ఉన్న వాటిలో దేనిని ఎంపిక చేసుకోవాలనే ఈ యొక్క స్వేచ్ఛాచిత్తమును, భగవంతుడు జీవుడికిచ్చాడు. ఈ స్వేచ్ఛాచిత్తమునకు పరిమితులున్నాయి. ఎవరైనా, ‘తాను ప్రపంచంలో అత్యంత తెలివిగల వ్యక్తిగా ఉందామనుకుంటున్నాన’ని, వారికి వారే నిర్ణయించుకోలేరు. మన పూర్వ మరియు ప్రస్తుత కర్మలచే, మనకున్న ఎంపిక పరిధి లోనివి, పరిమితంగా ఉంటాయి. కానీ, మనకు ఖచ్చితంగా కొంతమేర ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే, మనం భగవంతుని చేతిలో యంత్రాలము కాము. కొన్నిసార్లు జనులు, ‘భగవంతుడు మనకు స్వేచ్ఛాచిత్తమును ఇచ్చి ఉండకపోతే, మనం చెడుపనులు చేసి ఉండేవాళ్ళం కాదుకదా’ అంటారు. అలా ఐతే, మనం మంచి కూడా చేసి ఉండేవాళ్ళం కాదు. మంచి చేసే అవకాశం ఎప్పుడూ, చెడు చేసే ప్రమాదంతోనే కూడి ఉంటుంది. మరీ ముఖ్యంగా, భగవంతుడు, మనం ఆయనను ప్రేమించాలనే కోరుకుంటాడు. స్వేచ్ఛాచిత్త ఎంపిక ఉన్నప్పుడే, ప్రేమ సాధ్యమవుతుంది. ఒక యంత్రము ఎప్పుడూ ప్రేమించలేదు. ఎందుకంటే, దానికి స్వేచ్ఛాచిత్తము ఉండదు గనుక. భగవంతుడు మనలను స్వేచ్ఛాచిత్తము తోటే సృష్టించి, ఎన్నో విషయాలనూ, పద్ధతులనూ ఎంచుకునే అవకాశాలను కలిగించాడు. ఇదంతా మనం ఆయననే ఎంచుకుని, ఆయన పట్ల మన ప్రేమను తెలియపరుచుకోవటానికే. సర్వ శక్తిమంతుడయిన భగవానుడు కూడా, జీవుడు తనను ప్రేమించి, శరణువేడుకునే విధంగా బలవంతం చేయలేడు. ఆ నిర్ణయం, జీవుడే స్వయంగా తీసుకోవాలి. ఇక్కడ శ్రీ కృష్ణుడు, అర్జునుడికి అతని యొక్క స్వేచ్ఛాచిత్తమును గుర్తుచేస్తూ, అతనినే ఎంచుకోమని చెబుతున్నాడు.
04:34 - సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ।
ఇష్టోఽసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్ ।। 64 ।।
నా యొక్క సర్వోత్కృష్ట ఉపదేశమును మళ్ళీ ఒకసారి వినుము. అది సమస్త జ్ఞానములలో కెల్లా అత్యంత గోప్యమైనది. నీ హితము కోరి, దీనిని తెలియచేస్తున్నాను. ఎందుకంటే, నీవు నాకు చాలా ప్రియమైనవాడివి కాబట్టి.
ఒక ఉపాధ్యాయుడికి నిగూఢమైన రహస్యం తెలిసి ఉండవచ్చు. కానీ, ఆయన దానిని విద్యార్థికి తప్పకుండా చెబుతాడనే నమ్మకం లేదు. దానిని చెప్పేముందు, ఆయన చాలా విషయాలను పరిగణనలోకి తీసుకుంటాడు. అంటే, విద్యార్థి యొక్క యోగ్యత, దానిని అర్థం చేసుకునే సామర్థ్యం, మరియు దాని నుండి ప్రయోజనం పొందగలగటం, మొదలైనవి. భగవద్గీత ప్రారంభంలో, అర్జునుడు తన ముందున్న సమస్యచే ఆందోళన చెంది, శ్రీ కృష్ణ పరమాత్మను దారిచూపమన్నాడు. భగవంతుడు చాలా జాగ్రత్తగా, సావధానంగా, అతని యొక్క జ్ఞానాన్ని క్రమక్రమంగా, పద్దెనిమిది అధ్యాయాల ద్వారా వృద్ధి చేశాడు. అర్జునుడు ఆ ఉపదేశాన్ని చక్కగా నేర్చుకోవటం చూసి, శ్రీ కృష్ణుడికి ఇక ఇప్పుడు, తన యొక్క అంతిమ, అత్యంత నిగూఢమైన జ్ఞానమును అర్జునుడు అర్థంచేసుకోగలడన్న ధైర్యం వచ్చింది. ‘నీవు నా ప్రియమిత్రుడవు. నీ క్షేమాన్ని కోరుకుంటున్నాను. నీకు ఎప్పుడూ మంచి జరగాలనే ఆశిస్తాను కావున, దీనిని నేను నీకు చెబుతున్నాను.’ అని వెల్లడించాడు.
06:07 - మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు ।
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోఽసి మే ।। 65 ।।
ఎప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను పూజించుము, మరియు నాకు నమస్కరించుము. ఇలా చేయటం వలన నీవు తప్పకుండా నన్నే చేరుకుందువు. నేను నీకిచ్చే వాగ్దానం ఇది. ఎందుకంటే, నీవు నాకు చాలా ప్రియమైనవాడవు.
శ్రీ కృష్ణుడు అర్జునుడికి అత్యంత రహస్యమైన జ్ఞానమును తెలియజేశాడు. ఆ తర్వాత భక్తి యొక్క ప్రాశస్త్యమును చెప్పాడు. ఇక్కడ, తన పట్ల భక్తితో నిమగ్నమవ్వమని చెబుతున్నాడు. భగవంతుడి పట్ల గాఢమైన ప్రేమను పెంపొందించుకుని, తన యొక్క మనస్సు సతతమూ అనన్య భక్తితో, ఆయన యందే నిమగ్నం చేయటం వలన, అర్జునుడు ఖచ్చితంగా సర్వోన్నత గమ్యమును చేరుకోగలడు. సంపూర్ణముగా భక్తిలో నిమగ్నమైన వానికి ఉన్న ఒక చక్కటి ఉదాహరణ, అంబరీష మహారాజు. ‘అంబరీషుడు తన మనస్సును శ్రీ కృష్ణుడి పాదారవిందముల మీదనే నిమగ్నం చేశాడు. తన వాక్కును భగవంతుని గుణములను కీర్తించటానికే వాడాడు. తన చేతులను, దేవాలయమును శుభ్రం చేయటానికే వాడాడు. తన చెవులను, భగవత్ దివ్య లీలలను వినటానికే వాడాడు. తన కన్నులను, దివ్యమంగళ విగ్రహాలను దర్శించటంలోనే నిమగ్నం చేశాడు. తన శరీర అంగములను భక్తుల సేవకే వాడాడు. తన ముక్కును, భగవంతుని పాదార విందముల వద్ద అర్పించిన తులసీ దళములను ఆఘ్రాణించటానికే వాడాడు. తన నాలుకను భగవత్ ప్రసాదమును రుచి చూడటానికే వాడాడు. తన కాళ్ళను పుణ్య ప్రదేశాలకు వెళ్ళటానికీ, తన శిరస్సును భగవత్ పాదార విందముల వద్ద ప్రణమిల్లటానికీ ఉపయోగించాడు. పూల దండలూ, చందనము వంటి సరంజామా అంతటినీ, భగవత్ సేవకే వాడాడు. ఇవన్నీ ఏదో స్వార్థ ప్రయోజనం కోరి కాకుండా, చిత్తశుద్ధి ద్వారా, కేవలం, శ్రీ కృష్ణుడి నిస్వార్థ ప్రేమ పొందటానికే చేశాడు. ఇంతటి సేవాతత్పరుడైన అంబరీషుడి వృత్తాంతాన్ని, గతంలో వివరించాను. హృదయ పూర్వకముగా భక్తిలో నిమగ్నమవ్వమని చెప్పే ఉపదేశమే, సమస్త శాస్త్రముల యొక్క సారాంశము, మరియు సమస్త జ్ఞానము యొక్క సారము. అయినా, శ్రీ కృష్ణుడు పేర్కొన్న అత్యంత గోప్యమైన జ్ఞానము ఇది కాదు. ఎందుకంటే, దీనిని కృష్ణుడు ఇంతకు పూర్వమే చెప్పి ఉన్నాడు.
08:37 - సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ।
అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ।। 66 ।।
అన్ని విధములైన ధర్మములనూ విడిచిపెట్టి, కేవలం నాకే శరణాగతి చేయుము. నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తి చేసెదను; భయపడకుము.
ఇప్పటివరకూ, శ్రీ కృష్ణుడు అర్జునుడిని ఒకే సమయంలో, రెండు పనులు చేయమన్నాడు – మనస్సును భక్తిలో నిమగ్నం చేయాలి, మరియు శరీరాన్ని, తన ప్రాపంచిక క్షత్రియ ధర్మమును నిర్వర్తించటంలో వాడాలి. ఈ విధంగా అర్జునుడిని, తన క్షత్రియ ధర్మమును విడిచిపెట్టమని చెప్పలేదు. దానితో పాటుగా, భక్తిని పెంపొందించుకోమన్నాడు. ఇదే 'కర్మయోగ' సిద్ధాంతము. ఇక ఇప్పుడు శ్రీ కృష్ణుడు, ఈ ఉపదేశానికి విరుద్ధంగా చెబుతూ, ప్రాపంచిక ధర్మములను నిర్వర్తించుట కూడా, అవసరంలేదని అంటున్నాడు. అర్జునుడు సమస్త ప్రాపంచిక ధర్మములనూ విడిచిపెట్టి, కేవలం భగవంతునికి శరణాగతి చేయవచ్చన్నాడు. ఇది కర్మ సన్న్యాస సిద్ధాంతము. యధార్థముగా, మనకు రెండు రకాల ధర్మములున్నాయి - భౌతిక ధర్మములు, మరియు ఆధ్యాత్మిక ధర్మములు. ఈ రెండు రకాల ధర్మములు, ‘నేను’ అంటే ఏమిటన్న రెండు వేర్వేరు విధములైన అవగాహన నుండి జనించాయి. మనం మనలను ఈ శరీరమే అనుకుంటే, మన ధర్మం అనేది, మన శారీరక హోదా, కర్తవ్యాలు, విధులు, మరియు ఆచారాల వల్ల నిర్ణయించబడుతుంది. కాబట్టి, శారీరక తల్లిదండ్రుల సేవ, సమాజ పర బాధ్యతలు, దేశం పట్ల కర్తవ్యాలు, మొదలైనవన్నీ, శారీరక ధర్మములంటారు. దీనినే 'అపర ధర్మం' లేదా ప్రాపంచిక ధర్మమని అంటారు. దీని పరిధిలోనే, బ్రాహ్మణ ధర్మం, క్షత్రియ ధర్మం మొదలైనవన్నీ ఉంటాయి. కానీ, ఎప్పుడైతే మనం మనలను ఆత్మ అనుకుంటామో, మనకు ఇక భౌతికమైన వర్ణాశ్రమ గుర్తింపులు ఉండవు. ఆత్మ యొక్క తండ్రి, తల్లి, మిత్రుడు, సఖి, సఖుడు, మరియు ఆశ్రయము, అన్నీ భగవంతుడే. కాబట్టి, మనకున్న ఏకైక ధర్మం, ప్రేమయుక్త భగవత్ సేవయే అవుతుంది. దీనినే పర-ధర్మం, లేదా ఆధ్యాత్మిక ధర్మమని అంటారు. ఒకవేళ వ్యక్తి తన భౌతికప్రాపంచిక ధర్మమును విడిచిపెడితే, కర్తవ్య ఉపేక్ష చేత, అది పాపముగా పరిగణించ బడుతుంది. కానీ, ఎవరైనా భౌతిక ధర్మమును విడిచిపెట్టి, ఆధ్యాత్మిక ధర్మమును ఆశ్రయిస్తే, అది పాపము కాదు. భగవంతునికి శరణాగతి చేయని వారికి, ఐదు రకాల రుణాలు ఉంటాయి: దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ఇతర మానవులకు, మరియు ఇతర ప్రాణులకు, వర్ణాశ్రమ వ్యవస్థ, మనలను మనం ఈ ఐదు రుణముల నుండి విడిపించుకోవటానికి, వివిధ పద్ధతులను కలిగి ఉంది. కానీ, మనం భగవంతునికి శరణాగతి చేస్తే, మనం అప్రయత్న పూర్వకంగానే, ఈ అన్ని ఋణాల నుండి విముక్తి చేయబడతాము; ఇది ఎలాగంటే, ఒక చెట్టు వేరులో నీరు పోస్తే, దాని యొక్క అన్ని శాఖలు, చిగుర్లు, ఆకులు, పుష్పాలు, మరియు కాయలు, అన్నిటికీ నీరు అందుతుంది. అదే విధముగా, భగవంతుని పట్ల మన కర్తవ్యమును నిర్వర్తిస్తే, మనం అప్రయత్నంగానే, అందరి పట్ల మన విధిని నిర్వర్తించినట్టే. కాబట్టి, మనం సముచితంగా, ఆధ్యాత్మిక ధర్మంలో స్థితమై ఉంటే, భౌతికప్రాపంచిక ధర్మమును విడిచిపెట్టినా, పాపం అంటదు. నిజానికి, అత్యున్నత లక్ష్యమేమిటంటే, మనం సంపూర్ణముగా, మరియు మనసారా, ఆధ్యాత్మిక ధర్మంలో నిమగ్నమవ్వటమే. భగవద్గీతలో, శ్రీ కృష్ణుడు అర్జునుడికి క్రమక్రమంగా, ఉన్నతమైన ఉపదేశాలను ఇచ్చాడు. ప్రారంభంలో అర్జునుడికి కర్మ చేయమని చెప్పాడు. అదే క్షత్రియ యోధుడిగా, తన భౌతికప్రాపంచిక ధర్మము. కానీ, భౌతిక ధర్మమనేది, భగవత్ ప్రాప్తిని కలుగచేయలేదు; అది స్వర్గాది లోకములనే ఇవ్వగలదు. పుణ్యక్షయం అయిపోయినప్పుడు, జీవుడు మరల తిరిగి రావలసినదే. కాబట్టి శ్రీ కృష్ణుడు, తదుపరి అర్జునుడికి కర్మ యోగమును చేయమని చెప్పాడు. అంటే, శరీరముతో భౌతిక ధర్మము, మరియు మనస్సుతో ఆధ్యాత్మిక ధర్మము. శరీరంతో యుద్ధం చేస్తూ, మనస్సుతో భగవంతుడిని స్మరిస్తూ ఉండమన్నాడు. ఈ కర్మయోగ ఉపదేశమే, భగవత్ గీత యొక్క అతిపెద్ద భాగము. ఇక చిట్ట చివరికి, శ్రీ కృష్ణుడు అర్జునుడిని కర్మ సన్యాసము చేయమని చెప్పాడు. అంటే, సమస్త భౌతిక ధర్మములనూ విడిచి, కేవలం ఆధ్యాత్మిక ధర్మం, అంటే భగవత్ ప్రేమను పాటించమన్నాడు. అందుకే యుద్ధం చేయాలి కానీ, అది తన క్షత్రియ ధర్మమని కాదు. భగవంతుడు తనను అలా చేయమంటున్నాడు కాబట్టి.
13:26 - ఇక మన తదుపరి వీడియోలో, ఎందుకు కర్మ సన్యాసము కంటే కర్మ యోగము ఉన్నతమైనదో తెలుసుకుందాము..
మనం చేసే ప్రతి పాపానికీ ప్రాయశ్చిత్తం తప్పక చేసుకోవాలి. ఎన్ని జన్మలెత్తైనా సరే, మన కర్మఫలాన్ని అనుభవించి తీరాలి. కర్మఫలం ఏ విధంగా ఉంటుందనేది, మనం చేసే పనులపైన ఆధారపడి ఉంటుంది. దేవకీ వసుదేవల సంతానాన్ని కంసుడు సంహరించాడు. కంసుడినీ, అతని సోదరులనూ బలరామకృష్ణులు తుదముట్టించారు. కృష్ణ భగవానుడికి సోదరులుగా జన్మించి, మరణించిన వారి వెనుక ఒక గాధ ఉంది. అదే విధంగా, బలరాముడి చేతిలో మరణించిన కంస సహోదరుల వెనుకా, ఒక గాధ ఉంది. దేవకీ సుతులుగా పుట్టి, కంసుని చేతిలో మరణించిన వారి పూర్వజన్మ వృత్తాంతం ఏంటి? రాక్షస జాతిలో జన్మించి, బలరాముడి చేతిలో మరణించి, పుణ్య ప్రాప్తి నొందిన కంసుని సోదరులు, గత జన్మలో చేసిన తప్పిదం ఏంటి? మరణించిన తన సంతానం కోసం, దేవకీ దేవి కోరిన కోరికను శ్రీ కృష్ణుడు తీర్చాడా? పాతాళానికి వెళ్లి, బలి చక్రవర్తిని ఎందుకు కలుసుకోవాల్సి వచ్చింది? కంసుడి చేతిలో మరణించిన కృష్ణుడి సహోదరులు ఏమయ్యారు? వంటి ఉత్సుకతను రేకెత్తించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
ముందు జన్మలో మారీచుడి కొడుకైన కాలనేమి, కంసుడిగా పుట్టాడు. కంసుని తండ్రి పేరు, ఉగ్రసేనుడు. అతని భార్యకు దేవదాది న్యాయము వలన, ద్రవిళుడనే వాడికి పుట్టినవాడు. అంటే, క్షేత్రజ పుత్రుడన్న మాట. ఉగ్రసేనుని భార్య పద్మావతి, కొందరు గొల్ల స్త్రీలతో కలసి యమునా నదికి స్నానానికి వెళ్ళి, పుష్పవతి అయింది. ఆమె తన భర్తను తలచుకుంది. రాక్షసుడైన ద్రవిళుడు చూసి, ఉగ్రసేనుని రూపంలో వెళ్ళాడు. అంతా జరిగిన తరువాత, తను మోసపోయానని గ్రహించి, నిలదీసింది పద్మావతి. నీ వలన పుట్టిన వాడు హరివంశమున పుట్టినవాడి చేతిలో మరణిస్తాడని శపించింది. రాక్షస రాజు వలన పుట్టిన కంసునికి రాక్షస లక్షణాలు వచ్చాయి. కంసుడు పెరిగి పెద్దవాడవుతూనే, తండ్రి ఉగ్రసేనుని చెరసాలలో బంధించి, తాను రాజయ్యాడు. జరాసంధుని కూతుళ్ళయిన ఆస్తి, ప్రాస్తి, ఇద్దరినీ పెళ్ళాడాడు. శిశుపాలునితో స్నేహం చేశాడు. తన పిన తండ్రి కూతురైన దేవకీ దేవిని, చెరసాలలో బంధించాడు. ఆమెకు పుట్టిన సంతానాన్ని సంహరించాడు. కానీ, దేవకీ దేవి గర్భంలో జన్మించిన అష్టమ సంతానమైన శ్రీ కృష్ణుడు పెరిగి పెద్దవాడై, తన మామ కంసుడి గురించి తెలుసుకున్నాడు. అతడిని సంహరించి, తల్లి దండ్రులను బంధవిముక్తుల్ని చేయడానికి మధురకు వెళ్ళాడు.
బలరామకృష్ణులను సంహరించడానికి కంసుడు పంపిన వారందరూ, మృత్యువు ఒడికి చేరుకున్నారు. కృష్ణుడిని ఎదురించడం అసంభవమని తెలిసిన కంసుడు, పులి నుండి తప్పించుకున్న మేకపిల్లలా, సభామందిరంలో సింహాసనం మీద ఒదిగొదిగి కూర్చుని వున్నాడు. అతని చుట్టూ మంత్రులూ, సైనికులూ వున్నారు. నిలువెల్లా కంపిస్తున్న తన అనుచరులనూ, మృత్యువు రూపంలో ఎదుట నిలిచిన నల్లనయ్యనూ చూసి కంసుడు, ఇక తెగించక తప్పదనుకున్నాడు. చావు ధైర్యం తెచ్చుకుని, 'పిచ్చెక్కిన ఏనుగునూ, తాగి తూలుతున్న యోధులనూ సంహరించడం గొప్ప కాదు. నాతో యుద్ధానికి రా. బలాబలాలు తేల్చుకుందాం' అన్నాడు శౌరివైపు తిరిగి. దాంతో కన్నయ్యకు కోపం వచ్చింది. కంసుడి మీదకు ఉరికాడు. మృత్యువు మాదిరి తన మీదకు వస్తున్న అచ్యుతుడిని చూసి, కంసుడు తటాలున సింహాసనం మీద నుంచి కిందకు దూకాడు. ఒర నుంచి ఖడ్గాన్ని తీసి, కృష్ణుడితో తలపడ్డాడు. కృష్ణుడు అంతెత్తుకు ఎగిరి అక్కడి నుంచి కొదమసింహంలా కంసుడి పైకి లంఘించాడు. ఆ దెబ్బతో కంసుడి కిరీటం బండి చక్రంలా దొర్లుకుంటూ వెళ్ళి, దూరంగా పడింది. కృష్ణుడు కంసుడి జట్టు పట్టుకు లాగి, విసురుగా తోశాడు. కంసుడు వెల్లకిలా పడ్డాడు. అతని పక్కటెముకలు నుజ్జు నుజ్జయ్యాయి. లేవలేక కూలబడిపోయాడు. మాధవుడు ఎగిరి అతని ఎదురు రొమ్ముమీద కూర్చుని, పిడికిళ్ళతో మర్దించాడు. కంసుడు నురగలు కక్కాడు.
'మామా! నిన్ను నేను ఈవేళ చంపడం కాదు. కొన్నేళ్ళుగా చంపుతున్నాను. రాత్రింబవళ్ళు, అనుక్షణం, తింటూ, తాగుతూ, విహరిస్తూ కూడా, నన్నే తలుచుకుని భయపడ్డావు. నేను గుర్తుకు వచ్చినప్పుడల్లా, నీకు కంటిమీద నిద్ర వుండేది కాదు. ప్రతి కదలికలో, ప్రతి ఒక్కరి నీడలో నన్నే చూసి, నరక యాతన పడ్డావు. ఎందుకొచ్చిన దిగులు చెప్పు? క్షణక్షణం చస్తూ బతికే కన్నా, ఒకేసారి చావడం మంచిది' అని ఒక్కపోటు పొడిచాడు. కంసుడి కళ్ళు మూతపడ్డాయి. అతనిలోంచి ఒక దివ్యతేజం వచ్చి, కృష్ణుడిలో లీనమైంది. సభ అంతా చేతులు జోడించి, ఆ కిశోర వీరుడికి నమస్కరించింది. కంసుడి మరణ వార్త విని ఉగ్రులై అతని తమ్ములు కంకుడు, న్యగ్రోధుడు, గహ్వుడు మొదలైనవారు, మూకుమ్మడిగా బలరామకృష్ణులమీద విరుచుకుపడ్డారు. బలరాముడొక్కడే, వాళ్ళందర్నీ హతమార్చాడు. బలరాముడి చేతిలో మరణించిన కంసుడి సొదరులకు సంబంధించి, ఒక కథ ఉంది.
కంసుడి సోదరులు, పూర్వం అలకాపురంలో వుండే దేవయక్షుని కుమారులు. దేవకూట, మహాగిరి, గండ, చండ, ప్రచండ, ఖండ, అఖండ, పృధువులని, వాళ్ళకు పేర్లుండేవి. ఆ అన్నదమ్ములొకసారి, తండ్రి ఆజ్ఞ మేరకు, మానస సరోవరానికి వెళ్ళి, మహేశ్వరుడిని పూజించేందుకు, అరవిందాలు కోసుకువచ్చారు. కానీ, దారిలో వాటి సుగంధాలకు ముగ్ధులై, వాసన చూశారు. దానివల్ల వారికి ఉచ్ఛిష్టీకృత దోషం, అంటే, ఎంగిలి చేసిన పదార్థాలను నివేదన చెయ్యడం, వాసన చూసిన పూలతో పూజించడం వల్ల కలిగే దోషం సంభవించింది. ఆ కారణంగా వారు ఎనిమిది మందీ, వరుసగా మూడు జన్మలలో రాక్షసులై పుట్టారు. మూడవసారి చివరగా, ఉగ్రసేనుని కుమారులుగా జన్మించారు. శ్రీకృష్ణుని చేతిలో మరణించి, పాపవిమోచనం పొందారు. కంసుని మరణవార్త వినగానే, ప్రజలంతా ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. చెరసాలలో మగ్గుతున్న దేవకీవసుదేవులకు నల్లనయ్య విముక్తి కలిగించాడు. వారు కారాగారం నుంచి బయటకు రాగానే, బలరామకృష్ణులు వారికి పాదాభివందనం చేశారు. ఆనందంతో దేవకీవసుదేవులు పరవశించారు. దేవకీదేవి తటాలున వంగి, బిడ్డలను లేవదీసి, గుండెలకు హత్తుకున్నది.
బలరామకృష్ణులు చంటిబిడ్డల్లా తల్లిని చుట్టుకుపోయారు. 'అమ్మా! పుట్టటమైతే నీ కడుపున పుట్టాను కానీ, పసితనం నుంచే నీ ప్రేమానురాగాలకు దూరమయ్యాను. ఆ దురదృష్టమంతా నాదే. నువ్వేం బాధపడకు. కంసుడి చేతిలో మీరు పడుతున్న కష్టాలు తెలిసి కూడా, మిమ్మల్ని రక్షించడానికి ఇంత ఆలస్యమైనందుకు మన్నించండి' అని కృష్ణుడు తల్లిని వేడుకున్నాడు. దేవకీ వసుదేవులు నల్లనయ్యను దగ్గరకు తీసుకుని, పరవశులయ్యారు. తరువాత కృష్ణుడు తాతైన ఉగ్రసేనుడ్ని పిలిచి, 'మహారాజా! యయాతి శాపం వల్ల, యాదవులకు సింహాసనం ఎక్కే అధికారం లేకుండా పోయింది. కనుక మీరే ఈ భూమికి అధిపతి కావాలి. సింహాసనం స్వీకరించండి. ధర్మం తప్పకుండా పాలన చేయండి' అని అన్నాడు. బిడ్డల గొప్పతనానికి మురిసిపోయి తల్లిదండ్రులు, బలరామకృష్ణులను దగ్గరకు పిలిచి, 'నాయనలారా! మిమ్మల్ని పొగడాలో, పొగడకుండా నా ఆనందాన్నంతా ఈ గుప్పెడు గుండెలో ప్రోది చేసుకోవాలో, మీకు నమస్కరించవచ్చో, లేక బిడ్డలకి చెయ్యకూడదో, మిమ్మల్ని ఆలింగనం చేసుకోవాలో, లేక దూరం నుంచి దర్శించి, కన్నులపండుగ చేసుకోవాలో తెలియటంలేదు. 'మీరు ఏమీ అనుకోకపోతే, ఒకే ఒక కోరిక కోరుతాను. మీరిద్దరూ, మరణించిన మీ గురుపుత్రుని తీసుకువచ్చిన విధంగానే, కంసుడు పొట్టన పెట్టుకున్న నా బిడ్డలను కూడా ఒక్కసారి తెచ్చి చూపండి' అని భోరున ఏడ్చింది.
బలరామకృష్ణులు ఆమెను ఓదార్చి, యోగమాయా ప్రభావంతో, వెంటనే సుతలానికి వెళ్ళారు. రాక్షసేశ్వరుడు బలి వాళ్ళకు ఘనంగా స్వాగతం చెప్పాడు. భక్తిపూర్వకంగా వాళ్ళను అర్చించి, కానుకలు సమర్పించాడు. బలరామకృష్ణులు అమితానందం పొందారు. 'బలీ! పూర్వం స్వాయంభువ మన్వంతరంలో మరీచికి, 'ఊర్ణ' అనే ఒక భార్య ఉండేది. ఆ దంపతులకు స్మరుడు, ఉద్గదుడు, పరిష్వంగుడు, పతంగుడు, క్షుద్రభువు, ఘృణి అనే ఆరుగురు కుమారులుండేవారు. వారందరూ దేవతలే. వాళ్ళు ఒకసారి బ్రహ్మదేవుని ఎగతాళి చేసి, పరిహాసంగా మాట్లాడారు. అందువల్ల వాళ్ళను రాక్షసులై పుట్టమని ఆయన శపించాడు. అలా శపించబడ్డ ఆ ఆరుగురూ, హిరణ్యకశిపుడికి జన్మించాల్సింది. కానీ, యోగమాయా ప్రభావం వలన, వాళ్ళు దేవకీదేవికి పుట్టారు. పుట్టిన వెంటనే వాళ్ళను కంసుడు సంహరించాడు. ఆ ఆరుగురూ ఇప్పుడు నీ దగ్గర వున్నారు. మా తల్లి దేవకీదేవి వాళ్ళను చూడాలనుకుంటోంది. ఆమె కోరికను తీర్చటంకోసమే, మేము ఇక్కడికి వచ్చాం. వాళ్ళు మా వెంట వస్తే, వాళ్ళకు శాపవిముక్తి కలుగుతుంది. వాళ్ళు తిరిగి వాళ్ళ నిజ వాసం చేరుకుంటారు' అని చెప్పారు. బలి వెంటనే వాళ్ళను బలరామకృష్ణులకు అప్పగించాడు. వాళ్ళను బలరామకృష్ణులు తమ తల్లికి చూపించి, ఆమెకు ఆనందం కలిగించారు. ఆ ఆరుగురూ శ్రీకృష్ణుని స్పృశించి, తమ పాపాలను తొలగించుకున్నారు. చతుర్ముఖుని శాపం నుంచి విముక్తి పొందారు. ఏనాడో మరణించిన కుమారులు తన సముఖానికి రావడం, వెంటనే తిరిగి వెళ్ళిపోవడం, దేవకీ దేవికి ఆశ్చర్యం కలిగించింది. అదంతా శ్రీకృష్ణుని లీల అని గ్రహించి, పరవశించిపోయిందామె.
మనం నడిచే నేల, చూసే సూర్యుని వెలుగు, పీల్చే గాలి, త్రాగే నీరు ఎక్కడివి?
'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (59 – 62 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 59 నుండి 62 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
ఒకవేళ నీవు అహంకారముచే ప్రేరితమై, ‘నేను యుద్ధం చేయను’ అని అనుకుంటే, నీ నిర్ణయం ఎలాగూ వ్యర్థమై పోతుంది. ఎందుకంటే, నీ యొక్క క్షత్రియ భౌతిక స్వభావమే, నిన్ను యుద్ధం చేయటానికి పురికొల్పుతుంది.
శ్రీ కృష్ణుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. మనకు ఏది నచ్చితే అది చేయటానికి మనకు పూర్తి స్వేచ్ఛ ఉందని, మనం ఎన్నడూ అనుకోకూడదు. ఆత్మ అనేది, పూర్తి స్వతంత్రమైన అస్తిత్వమును కలిగి ఉండదు. అది భగవంతుని సృష్టిపై ఎన్నో విధాలుగా ఆధారపడి ఉంటుంది. భౌతిక బద్ధ స్థితిలో, అది ప్రకృతి త్రిగుణముల ఆధీనములో ఉంటుంది. ఈ గుణముల సంయోగమే, మన స్వభావాన్ని ఏర్పరుస్తుంది. అది ఆదేశించినట్టుగా మనం ప్రవర్తించవలసి ఉంటుంది. కాబట్టి మనకు, ‘నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను’ అనే పరిపూర్ణ స్వేచ్ఛ లేదు. భగవంతుని యొక్క, మరియు శాస్త్రముల సత్-సందేశాన్నీ, లేదా ప్రకృతి యొక్క బలవంత ఒత్తిడినీ, ఈ రెంటిలో ఏదో ఒక దానిని ఎంచుకోవలసి ఉంటుంది. స్వభావసిద్ధంగా అర్జునుడు ఒక యోధుడు. ఒకవేళ గనక అహంకారముతో, మంచి సలహాని పాటించనని ఆయన నిర్ణయించుకున్నా, ఆయన యొక్క క్షత్రియ స్వభావము, అతనిని తప్పకుండా యుద్ధానికి ప్రేరేపిస్తుంది.
ఓ అర్జునా, మోహభ్రాంతిచే నీవు ఏదైతే పనిని చేయనని అంటున్నావో, నీ యొక్క సహజ ప్రకృతి స్వభావముచే జనించిన ప్రేరణచే, ఆ పనినే చేయటానికి ప్రేరేపింపబడతావు.
తన యొక్క హెచ్చరింపు మాటలను కొనసాగిస్తూ, శ్రీ కృష్ణుడు ఇంతకు క్రితం చెప్పిన విషయాన్నే, మరింత విశదీకరిస్తున్నాడు. ఆయన అనేదేమిటంటే, నీ యొక్క పూర్వ జన్మ సంస్కారాల వలన, నీకు క్షత్రియ స్వభావమున్నది. నీ యొక్క సహజ గుణములైన వీరత్వము, పరాక్రమము, మరియు దేశభక్తి, నిన్ను యుద్ధం చేయటానికే పురిగొల్పుతాయి. నీకు పూర్వ జన్మలలో, మరియు ఈ జన్మలో కూడా, ఒక యోధుడిగా నీ కర్తవ్యమును నిర్వర్తించటానికే, శిక్షణ ఇవ్వబడినది. నీ కళ్ళ ముందే ఇతరులకు అన్యాయం జరుగుతుంటే, ఊరికే ఉండటం నీకు సాధ్యమవ్వదు. నీ స్వభావము, మరియు లక్షణాలు ఎలాంటివంటే, నీవు ఎక్కడ దుర్మార్గాన్ని చూసినా, దానిని తీవ్రంగా అడ్డుకుంటావు. కాబట్టి, నీ సహజ స్వభావంచే ప్రేరేపితమై చేసేకన్నా, నా ఉపదేశాన్ని అనుసరించి యుద్ధం చేయటమే నీకు మేలు.. అనే సందేశాన్ని ఇస్తున్నాడు భగవంతుడు.
ఓ అర్జునా, పరమేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉంటాడు. భౌతిక శక్తిచే తయారు చేయబడిన యంత్రమును అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని, వాటి వాటి కర్మల అనుగుణముగా, ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు.
భగవంతునిపై జీవాత్మ ఆధారపడి ఉండటాన్ని వక్కాణిస్తూ, శ్రీ కృష్ణుడు ఇలా అంటున్నాడు. నేను చెప్పినట్టు విన్నా, వినకపోయినా, నీవు ఎల్లప్పుడూ నా ఆధీనంలోనే ఉంటావు. నీవు వసించి ఉండే ఈ శరీరము, నా భౌతిక శక్తిచే తయారు చేయబడినది. నీ యొక్క పూర్వ కర్మల ప్రకారం, నీకు తగిన శరీరమును ఇచ్చాను. నేను కూడా దానిలోనే కూర్చుని ఉన్నాను. నేను నీ సమస్త ఆలోచనలను, మాటలను, మరియు చేష్ఠలను లిఖించుకుంటున్నాను. కాబట్టి, నీవు ప్రస్తుతం చేసే దానిని బట్టి, నీ భవిష్యత్తు ఎలా ఉండాలని కూడా నిర్ణయిస్తాను. నీవు నాకంటే స్వతంత్రుడవని ఎన్నడూ తలంచకు. కాబట్టి అర్జునా, నీ శ్రేయస్సు కోసమే, నీవు నాకు శరణాగతి చేయటమే మంచిది. అని అర్జునుడికి విశదీకరిస్తున్నాడు.
05:02 - తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత ।
తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ ।। 62 ।।
ఓ భరతా, సంపూర్ణ హృదయ పూర్వకముగా, కేవలం ఆయనకే అనన్య శరణాగతి చేయుము. ఆయన కృపచే, నీవు పరమ శాంతిని, మరియు నిత్యశాశ్వత ధామమును పొందెదవు.
భగవంతునిపైనే ఆధారపడి ఉన్న జీవాత్మ, తన ప్రస్తుత దురవస్థ నుండి బయట పడటానికీ, మరియు సర్వోన్నత పరమ లక్ష్యమును సాధించటానికి కూడా, భగవత్ కృప పైనే ఆధారపడి ఉండాలి. కేవలం సొంత ప్రయత్నం మాత్రమే దీనికి సరిపోదు. కానీ, భగవంతుడు తన కృపను ప్రసాదిస్తే, ఆయన తన దివ్య జ్ఞానమునూ, మరియు దివ్య ఆనందమునూ, ఆ జీవాత్మకు ప్రసాదించి, దానిని భౌతిక శక్తి యొక్క మాయా బంధనముల నుండి విడిపిస్తాడు. తన కృపచేత, వ్యక్తి నిత్య శాశ్వత మోక్షమును, మరియు అనశ్వరమైన ధామమును పొందుతాడని, శ్రీ కృష్ణుడు వక్కాణిస్తున్నాడు. కానీ, ఆ కృపను పొందటానికి జీవాత్మ, భగవత్ శరణాగతి ద్వారా అర్హతను సంపాదించుకోవాలి. ఈ లోకంలోని ఒక తండ్రి కూడా, తన కొడుకు ప్రయోజకుడై, వాటిని బాధ్యతతో సన్మార్గంలో ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకునే వరకూ, తన విలువైన సంపత్తిని అతనికి అప్పచెప్పడు. అదే విధంగా, భగవత్ కృప అనేది, ఏదో ఆషామాషీ వ్యవహారం కాదు. దానిని ప్రసాదించటానికి, సంపూర్ణ, సహేతుక, తర్కబద్ధ నియమాలు ఆధారంగా ఉన్నాయి. ఒకవేళ భగవంతుడు తన కృపను ప్రసాదించటంలో నియమాలు పాటించకపోతే, జనుల విశ్వాసము దెబ్బతింటుంది. భగవంతుడు తన కృపను, మనకు అర్హత లేకుండానే ప్రసాదిస్తే, ఇంతకు క్రితం మహాత్ములైన వారు, ఈ విధంగా అనుకుంటారు. ‘ఏమిటిది? మేము ఎన్నో జన్మల తరబడి, మమ్ములను మేము పరిశుద్ధి చేసుకోవటానికి కష్టపడ్డాము. ఆ తదుపరి భగవంతుని కృప లభించింది. కానీ ఈ వ్యక్తి తనను తాను యోగ్యుడిగా చేసుకోకముందే, ఆయన కృప లభించినది. అలా అయితే, ఆత్మ-ఉద్ధరణ కోసం మా పరిశ్రమ అంతా అర్థరహితమైనది.’ అని అనుకుంటారు. దానికి సమాధానంగా, శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:
‘ఆ బ్రహ్మ దేవుడినీ మరియు ఇతరులను సృష్టించిన ఆ సర్వోత్కృష్ట తత్త్వమును ఆశ్రయిస్తున్నాము. ఆయన కృపచేతనే, ఆత్మ మరియు బుద్ధి, జ్ఞానప్రకాశితమౌతాయి.’
భగవత్ శరణాగతి యొక్క ఆరు అంగములు ఏమిటంటే:
1. భగవంతుని సంకల్పమునకు అనుగుణముగానే కాంక్షించటం: సహజ సిద్ధంగానే, మనం ఆ భగవంతుని సేవకులము. తన స్వామి కోరికను తీర్చటమే, సేవకుని కర్తవ్యము. కాబట్టి, శరణాగతి చేసిన భగవత్ భక్తులుగా, మన సంకల్పాన్ని, దివ్య భగవత్ సంకల్పంతో ఏకం చేయాలి. ఒక ఎండుటాకు, వీచేగాలికి లొంగిపోతుంది. అంటే శరణాగతి చేస్తుంది. ఆ వీచేగాలి, దాన్ని పైకిలేపినా, ముందుకు, లేదా వెనుకకు పడవేసినా, లేదా నేలపై పడవేసినా – అదేమీ ఫిర్యాదు చేయదు. అదే విధంగా, మనం కూడా భగవంతుని ఆనందమే మన ఆనందం అని ఉండటం నేర్చుకోవాలి.
2. భగవంతుని సంకల్పమునకు వ్యతిరేకంగా కోరుకోకుండా ఉండటం: మన జీవితంలో మనకు లభించినదంతా, మన పూర్వ, ప్రస్తుత కర్మల అనుసారమే ఉంటుంది. కానీ, కర్మ ఫలములు వాటంతట అవే రావు. భగవంతుడు వాటిని లిఖించి, వాటి ఫలములను సరైన సమయంలో ఇస్తుంటాడు. భగవంతుడే స్వయంగా ఈ ఫలములను ఇస్తుంటాడు కాబట్టి, మనం వాటిని ప్రశాంత చిత్తముతో స్వీకరించటం నేర్చుకోవాలి. సాధారణంగా జనులు తమకు సంపద, కీర్తి, ఆనందము, మరియు విలాసాలు లభించినప్పుడు, భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పటం మరచిపోతారు. కానీ, కష్టాలు ఎదురైనప్పుడు, ‘ఎందుకు భగవంతుడు ఇలా చేశాడు?’ అని భగవంతుడిని నిందిస్తారు. రెండవ సూత్రం ఏమిటంటే, భగవంతుడు మనకు ఇచ్చిన దాని పట్ల, ఎటువంటి అసంతృప్తులు ఉండకపోవటం.
3. భగవంతుడు మనలను రక్షిస్తున్నాడన్న దృఢ విశ్వాసం కలిగి ఉండటం: భగవంతుడు మన సనాతనమైన నిత్య శాశ్వత తండ్రి. సృష్టిలోని సమస్త ప్రాణుల సంక్షేమం చూసుకుంటూనే ఉంటాడు. ఈ భూమిపై కొన్ని వేల కోట్ల చీమలు ఉన్నాయి. అవన్నీ సమయానుసారం ఆహారం తీసుకోవలసినదే. మన తోటలో కొన్నివేల చీమలు ఆకలితో చనిపోయి ఉండటం అనేది ఎప్పుడైనా జరిగిందా? వాటన్నిటికీ భగవంతుడు ఆహారం సమకూర్చి పెడుతూనే ఉంటాడు. అదే సమయంలో మరో పక్క, ఏనుగులు కిలోలకొద్దీ ఆహారం ప్రతి రోజూ తీసుకోవాలి. భగవంతుడు వాటి అవసరాలు కూడా తీరుస్తుంటాడు. ఈ లోకపు తండ్రి కూడా, తన బిడ్డల అవసరాలన్నీ తీరుస్తాడు. మరైతే మన నిత్యసనాతన తండ్రి అయిన భగవంతుడు, మన సంరక్షణ చూసుకోడన్న సందేహం ఎందుకు? ఆయనిచ్చే రక్షణ పట్ల సంపూర్ణ దృఢ విశ్వాసం కలిగి ఉండటం, శరణాగతి యొక్క మూడవ అంగము.
4. భగవంతుని పట్ల కృతజ్ఞతా భావమును కలిగి ఉండటం: మనం భగవంతుని నుండి ఎన్నో అమూల్యమైన బహుమానాలను పొంది ఉన్నాము. మనం నడిచే నేల, చూసే సూర్యుని వెలుగు, పీల్చే గాలి, త్రాగే నీరు - ఇవన్నీ భగవంతుడు మనకు ఇచ్చినవే. నిజానికి ఆయన వలననే మనం ఇలా ఉండగలుగుతున్నాము; మనకు ప్రాణ శక్తినిచ్చి, మన ఆత్మకు చైతన్యమును ప్రసాదించినది ఆయనే. వీటికి ప్రతిగా, ఆయనకు మనం ఏమీ పన్నులు కట్టడంలేదు. కానీ కనీసం ఆయన ఇచ్చిన దాని పట్ల కృతజ్ఞతా భావముతో ఉండాలి. ఇదే, ఉపకారస్మృతి, కృతజ్ఞతా భావము. మనకు ఆయన ప్రసాదించిన అన్నింటి పట్ల, మన నిత్య శాశ్వత తండ్రి అయిన భగవంతుని పట్ల, కృతజ్ఞతా భావము కలిగి ఉండటమే, శరణాగతి యొక్క నాలుగవ అంశము.
5. మనకున్నదంతా ఆయన సొత్తుగా పరిగణించటం: భగవంతుడు ఈ సమస్త జగత్తుని సృష్టించాడు; అది మనం పుట్టకముందు నుండీ ఉన్నది, మరియు మన తరువాత కూడా ఉంటుంది. కాబట్టి, ఈ సృష్టిలో సమస్తానికీ ఆయనే నిజమైన యజమాని. మనం ఏదైనా వస్తువు మనకే చెందినదని అనుకుంటే, భగవంతుని యొక్క యజమానత్వమును మరచి పోయినట్టే. ఈ జగత్తు, మరియు దానిలో ఉన్నదంతా భగవంతునికే చెందినది. ఈ విషయం గుర్తుంచుకుని, మన యజమానత్వమును విడిచి పెట్టటం, శరణాగతి యొక్క ఐదవ అంగము.
6. శరణాగతి చేశానన్న అహంకారమును కూడా విడిచిపెట్టటం: ఒకవేళ మనం చేసిన మంచి పనుల పట్ల గర్వపడితే, అహంకరిస్తే, ఆ గర్వం మన హృదయాన్ని మలినం చేస్తుంది. మనం చేసిన మంచి పని యొక్క ఫలితాన్ని నిర్మూలిస్తుంది. అందుకే నమ్రత, మరియు విధేయత ఉంచుకోవటం అనేది, చాలా ముఖ్యమైనది. ‘నేను ఏదైనా మంచి పని చేయగలిగానంటే, అది కేవలం భగవంతుడు నా బుద్ధిని సరియైన దిశలో ప్రేరేపించాడు కాబట్టే. నామటుకు నేనే అయితే, నేను ఎప్పటికీ ఇది సాధించేవాడిని కాదు.’ అనేటటువంటి వినమ్రతా దృక్పథాన్ని కలిగి ఉండటమే, శరణాగతి యొక్క ఆరవ అంగము.
ఒకవేళ మనం శరణాగతి యొక్క ఈ ఆరు అంగములనూ పరిపూర్ణముగా అమలుపరిస్తే, మనం భగవంతుని యొక్క షరతులను పూర్తిచేసినట్టే.. అప్పుడాయన తన కృపను మనపై ప్రసాదిస్తాడు.
12:39 ఇక మన తదుపరి వీడియోలో, జనులు ఏ విధంగా చేయడం వలన భగవంతుడిని పొందగలరో తెలుసుకుందాం..
మన పురాణాలలో ఎన్నో ప్రేమకథలు చోటుచేసుకున్నాయి. వాటిలో విచిత్రమైన ప్రేమకథలు, స్వర్గలోక వాసులైన సౌందర్యరాశుల సొంతం. అప్సరసల గురించి హిందూ పురాణాలలో చాలా చోట్ల ప్రస్తావించబడింది. వీరిలో రంభ, ఊర్వసి, మేనక, తిలోత్తమలతో పాటు, అనేక మంది ఇతర అప్సరసలు కూడా ఉన్నారు. అయితే, ఊర్వసి పుట్టుక గురించి ప్రత్యేకమైన కథ ప్రచారంలో ఉంది. నరనారాయణులకూ, ఊర్వశికీ గల సంబంధం ఏమిటో మన గత వీడియోలో వివరించాను. చూడని వారి కోసం, దాని లింక్ ను i Cards లో పొందుపరిచాను. అనన్య సామాన్యమైన అందాల రాశి ఊర్వశి ఎందుకు మానవ జన్మ ఎత్తవలసి వచ్చింది? ఆమెకున్న శాపం ఏమిటి? పూరూరవ చక్రవర్తి ఎవరు? ఊర్వశి పూరురవుడితో ప్రేమలో ఎలా పడింది? పూరురవుడిని ఊర్వశి ఎందుకు వదిలి వెళ్లింది? తిరిగి ఊర్వశీ పూరురవులు కలుసుకున్నారా? వీరి ప్రేమకావ్యానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
ప్రజాపతి బ్రహ్మకు, అత్రిమహర్షి సంతానంగా కలిగాడు. ఆయనకు చంద్రుడు ఉదయించాడు. ఈయన తారా మండలానికి రాజుగా, ఓషధులకు అధీశుడిగా ప్రఖ్యాతుడయ్యాడు. ఈయన రాజసూయం చేసి, ముల్లోకాలూ గెలిచాడు. చంద్రుడు దేవగురువు భార్య తారను కామించాడు. ఆమె గర్భవతి అయి, కుమారుని కన్నది. ఆ సుందరాకారుని చూచి, బృహస్పతి తన కుమారునిగా స్వీకరిస్తాననగా, వివాదం చెలరేగింది. బ్రహ్మ విషయం గ్రహించి, వానిని చంద్రుని పుత్రుడిగా పంపించాడు. ఆ కుమారుడే, బుధుడు. బుధుని భార్య ఇల. వీరి కుమారుడు, పురూరవుడు. అతి పరాక్రమవంతుడైన పురూరవుడు, దేవతలకు సన్నిహితుడిగా పేరుగాంచి, ఎన్నో యుద్ధాలలో పాల్గోన్నాడు. పురు అనే పర్వతం పై జన్మించాడు కాబట్టి, పురూరవుడు అనే పేరొచ్చింది. ప్రతిష్టాన పురాన్ని పాలించే పురూరవుడు, తపస్సు చేసి, బ్రహ్మను మెప్పించి, భూమండలానికి అధిపతి అయ్యాడు. ఆ తరువాత పురూరవుడు కొన్ని వందల అశ్వమేధ యాగాలు చేశాడు.
పురూరవునితో దేవతలు స్నేహితులుగాను, రాక్షసులు అనుచరులుగాను మెలిగేవారు. మహాభారతం ప్రకారం, పురూరవుడు గంధర్వ లోకంనుండి, మూడు రకాల అగ్నులను యజ్ఞయాగాదుల కోసం తెచ్చాడు. ఆ సందర్భంలోనే, అక్కడ ఊర్వశిని చూసి మోహించాడు. ఊర్వశి మహా సౌందర్యవతి. నారాయణుడి ఊరువు నుండి ఉద్భవించిన ఆమె ముగ్ధమోహన లావణ్యానికి, ఎంతటివారైనా దాసోహం అవ్వాల్సిందే. రంభాది అప్సరసలకంటే రెట్టింపు అందం, ముఖవర్ఛస్సుతో, ఆమె దేవలోకంలో అగ్ర నర్తకిగా పేరుగాంచింది. ఊర్వశి ఒకనాడు సూర్యుని చేత శాపగ్రస్థురాలై, మానవజన్మ యెత్తి భూలోకానికి వచ్చింది. పూరురవ మహారాజును ఏకాంతంలో దర్శించింది. అప్పటికే ఊర్వశి సౌందర్యానికి మోహితుడైన పురూరవుడు ఆమెను చేరి, తన కోరికను తెలిపాడు.
ఊర్వశి కూడా పురూరవుడి యందు కామ కోరికను కలిగి నవ్వుతూ, "రాజేంద్రా! నాకు రెండు నియమాలున్నాయి. అవి నీవు పాటిస్తే, నిన్ను వరిస్తాను. నియమం తప్పిన క్షణంలో నిన్ను విడిచి పోతాను. ఒకటి, నాకు రెండు గొర్రెలున్నాయి. వాటిని నిరంతరం నువ్వు రక్షిస్తూండాలి. రెండవది - ఎన్నడూ నా ముందు నువ్వు దిగంబరంగా కనపడ కూడదు" అని అన్నది. మోహమత్తుడైన పురూరవుడు ఆమె నియమాలను ఆమోదించి, ఆమెతో కలసి జీవించనారంభించాడు. అక్కడ అమరావతిలో దేవేంద్రుడు, తన సభలో ఊర్వశి లేకపోవడం లోటుగా వున్నదని భావించాడు. ఎలాగైనా ఆమెను స్వర్గలోకానికి తీసుకురావాలని, గంధర్వులను భూలోకానికి పంపించాడు. ఊర్వశీ పూరూరవల ప్రణయాన్ని చూసిన గంధర్వులు, ఆమె తిరిగి అమరావతి రావడం అసాధ్యం అని భావించి, ఒక పన్నాగం పన్నారు.
ఒకనాటి రాత్రి అత్యంత రహస్యంగా, ఊర్వశి పెంచుకునే గొర్రెలను అపహరించబోగా, అవి రోదన చేశాయి. వాటి అరుపు సాగుతున్నా, పురూరవుడు ఏమాత్రం చలించక, గాఢనిద్రలో వుండిపోయాడు. ఆ అరుపులకు ఊర్వశి లేచి, "నా కన్నబిడ్డల వంటి పొట్టేళ్ళను దొంగలు అపహరిస్తున్నా, మొద్దు నిద్రపోయే నీవు మగవాడివేనా! నోరులేని పశువులను రక్షించలేవు. ప్రియురాలి కౌగిలి తప్ప మరేమీ యెరగని మగవాడై పుట్టడం కంటే, ఆడజన్మ మేలు". అని అనేక విధాలా నిందించగా భరించలేని పూరురవుడు, శయ్యదిగి పోయి, ఆ దొంగల నుండి గొర్రెలను తోలుకు వచ్చాడు. గాఢ నిద్ర నుండి లేచిన ఆ మైకంలో, శరీరం మీద వస్త్రం వున్నదీ లేనిదీ చూసుకోకుండా, గొర్రెల కోసం పోయి వాటిని తీసుకువచ్చి, ఊర్వశి ముందు దిగంబరంగా నిలబడ్డాడు. తక్షణం ఊర్వశి తన నియమానుసారం, అంతర్ధానం అయ్యింది.
ప్రియురాలు కనిపించక దీనంగా విలపిస్తూ, ఆమె కోసం ఎదురు చూశాడు పూరురవుడు. ఆమె జాడ కోసం ముల్లోకాలూ సంచరిస్తూ, సరస్వతీ నదీ తీరాన చెలికత్తెలతో వున్న ఊర్వశిని చూశాడు. ఆనందభరితుడైన పురూరవుడు, తనతో పాటు రమ్మని పరి పరివిధాలా ఊర్వశిని వేడుకున్నాడు. అందుకు ఊర్వశి, "మహారాజా! తియ్య తియ్యని మాటలతో వంచించడమే తప్ప, మన్మథుణ్ణి కూడా మనసారా ప్రేమించని వేశ్యలతో నీకెందుకయ్యా? సరే, ఒక్క సంవత్సరం ఆగి నా దగ్గరకు రా. అప్పుడు నీకు యోగ్యులయిన పుత్రులను అందిస్తాను" అని చెప్పింది. అప్పుడు పురూరవుడు ఆమె గర్భవతియని గ్రహించి, అక్కడి నుండి వెళ్ళి పోయాడు.
ఊర్వశి మాట ప్రకారమే, సంవత్సరం గడిచాక ఆమె దగ్గరకు పోయాడు. ఊర్వశి, పూరూరవుడితో గంధర్వులను వేడుకోమ్మని చెప్పింది. పూరూరవుడు ఆమె మాటకు లోబడి వారిని అభ్యర్థించగా, వారు ఊర్వశి వంటి రూపం కలిగిన అగ్నిస్థలిని యిచ్చారు. ఆమెను ఊర్వశిగా భావించి, అగ్నిస్థలితో జీవనం కొనసాగించాడు, పూరూరవుడు. అయితే, కొంత కాలం గడిచిన తరువాత, ఆమె ఊర్వశి కాదని తెలియగా, ఆమెను విడిచిపెట్టాడు. ఎంతకాలమైనా పురూరవుడి మనస్సు ఊర్వశి యందే లగ్నమై ఉంది.
అంతలో కృతయుగం గడచి, త్రేతాయుగం ప్రవేశించింది. ఆయన మనస్సులో వేద ధర్మం మూడు విధాలుగా గోచరించగా, జమ్మిచెట్టులో పుట్టిన రావిచెట్టు కొమ్మలతో, రెండు అరణులు చేశాడు. మొదటి అరణి తానుగా, రెండవది ఊర్వశిగా, నడుమనున్న కర్ర కుమారుడుగా మథనం చేయగా, జాత వేద రూపంతో అగ్ని సంభవించి, ఆహవనీయాగ్నిగా ప్రఖ్యాతమయింది. ఆ అగ్నితో పురూరవుడు, శ్రీహరిని ఆరాధించాడు. ఆ శ్రీహరి సంతోషించి, ఊర్వశితో జీవితాన్ని సంతోషంగా గడపమని చెప్పి, ఊర్వశీ పురూరవుల సంతానం చంద్ర వంశంగా ప్రఖ్యాతి గడిస్తుందని వరమిచ్చాడు. అనంతరం పురూరవుడు, గంధర్వ లోకంలో ఊర్వశిని చేరి, ఆయువు, శ్రుతాయువు ఆదిగా, ఆరుగురు కుమారులను కన్నాడు.
నిస్వార్థ ప్రేమయుక్త భక్తితో మనం ఆరాధించిన భగవత్ స్వరూప ధామానికి చేరుకుంటామా?
'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (55 – 58 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 55 నుండి 58 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
కేవలం నా పట్ల ప్రేమ యుక్త భక్తి చేత మాత్రమే, యదార్థముగా నేను ఎవరో, ఎంతటి వాడినో తెలుసుకోవచ్చును. నన్ను తెలుసుకున్న పిదప, నా భక్తుడు నా సంపూర్ణ భావనలో లీనమగును.
అలౌకిక ఆధ్యాత్మిక జ్ఞానములో స్థితుడై ఉన్న పిదప, వ్యక్తి భక్తిని పొందుతాడు. ఇక ఇప్పుడు, కేవలం భక్తి చేత మాత్రమే భగవంతుని యొక్క యధార్థ స్వరూపమును తెలుసుకోవచ్చని అంటున్నాడు. ఇంతకు క్రితం, జ్ఞాని భగవంతుడిని నిర్గుణ, నిర్విశేష, నిరాకార బ్రహ్మముగా ఆచరణలో తెలుసుకుని ఉన్నాడు. కానీ, జ్ఞాని భగవంతుని యొక్క సాకార రూపమును అనుభవించలేదు. ఆ సాకార రూప రహస్యము - కర్మ, జ్ఞానము, అష్టాంగ యోగము, మొదలైన ప్రక్రియల ద్వారా తెలుసుకోబడలేదు. కేవలం ప్రేమ మాత్రమే, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది, మరియు అందని దానిని అందిస్తుంది. భగవంతుని యొక్క రూపమూ, గుణములూ, లీలలూ, ధామములూ, మరియు పరివారముల యొక్క నిగూఢత, ఆయన పట్ల అనన్య భక్తి ద్వారానే తెలుసుకోబడతాయి. ప్రేమ దృష్టి ఉండటం చేతనే, భక్తులు భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతారు. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవటానికి, పద్మ పురాణంలో ఒక చక్కటి కథ ఉంది. జాబాలి అనే ఋషి ఒకసారి, అడవిలో ధ్యానం చేస్తున్న ఒక అత్యంత తేజోవంతమయిన, మరియు ప్రశాంతమైన కన్యను చూశాడు. తానెవరో, తానెందుకు ధ్యానం చేస్తున్నదో తెలియ చేయమని, ఆ ఋషి ఆమెను ప్రార్థించాడు. ఆమె ఇలా సమాధానం ఇచ్చింది: ‘నేను బ్రహ్మ విద్యను, అంటే ఆత్మ గురించి తెలుసుకునే శాస్త్రము. అది అంతిమంగా భగవంతుని అంటే, బ్రహ్మము యొక్క అస్తిత్వమును ఎఱుకలోకి తెస్తుంది. గొప్ప గొప్ప యోగులూ, సాధువులూ నన్ను తెలుసుకొనుటకు, తపస్సులు చేస్తుంటారు. కానీ, సాకార రూప భగవంతుని పాదారవిందముల పట్ల భక్తిని పెంపొందించుకోవటానికి, నేనే స్వయంగా కఠినమైన తపస్సు ఆచరిస్తున్నాను. నేను బ్రహ్మానందములో తృప్తిగా, మరియు నిండుగా ఉన్నాను. అయినా, శ్రీ కృష్ణుడి పట్ల ప్రేమానుబంధం లేకపోతే, వెలితిగా, శూన్యంగా అనిపిస్తుంది.’ అని జాబాలికి తెలియజేసింది. ఈ విధంగా, కేవలం జ్ఞానం మాత్రమే ఉంటే, అది భగవంతుని సాకార రూప ఆనందాన్ని ఆస్వాదించటానికి సరిపోదు. భక్తి ద్వారా మాత్రమే ఎవరైనా ఆ రహస్యం తెలుసుకోవచ్చు, సంపూర్ణ భగవత్ భావనను పొందవచ్చు.
సర్వ కార్యములూ చేస్తూనే ఉన్నా, నా భక్తులు నన్నే పూర్తిగా ఆశ్రయిస్తారు. నా కృపచే వారు నిత్యశాశ్వతమైన, మరియు అనశ్వరమైన ధామమును పొందుతారు.
భక్తి ద్వారా భక్తులు తన యొక్క సంపూర్ణ ఏకీభావ స్థితిలోకి వస్తారు. ఈ దృక్పథంలో, వారు ప్రతిదానినీ ఈశ్వర సంబంధముగా చూస్తారు. తమ శరీర, మనోబుద్ధులను భగవంతుని శక్తిగా పరిగణిస్తారు. వారి భౌతిక సంపత్తిని భగవంతుని సొత్తుగా చూస్తారు. వారు సర్వ భూతములనూ, భగవంతుని అంశలుగానే పరిగణిస్తారు, తమను తాము భగవత్ సేవకులుగా పరిగణించుకుంటారు. ఆ దివ్య దృక్పథంలో, వారు పనిని విడిచిపెట్టరు. కానీ, కర్తృత్వ భావననూ, మరియు కర్మఫలభోక్తలమనే భావననూ విడిచిపెడతారు. అన్ని పనులనూ ఈశ్వర సేవగా చూస్తూ, వాటిని చేయటానికి ఆయన మీదనే ఆధార పడతారు.
ఆ తర్వాత, దేహమును విడిచిపెట్టిన పిదప, భగవంతుని దివ్య ధామమును చేరుకుంటారు. ఏ విధంగానైతే ఈ భౌతిక జగత్తు, భౌతిక శక్తితో తయారు చేయబడినదో, దివ్య లోకాలు, ఆధ్యాత్మిక దివ్య శక్తిచే తయారుచేయబడినవి. కాబట్టి, అది భౌతిక స్వభావం యొక్క దోషములకు అతీతమయినది, మరియు సంపూర్ణ దోషరహితమైనది. అది సత్-చిత్-ఆనందం.. అంటే, నిత్యశాశ్వతత్వము, జ్ఞానము, మరియు ఆనందములచే నిండి ఉన్నది. భగవంతుని యొక్క వివిధమైన స్వరూపాలకు, ఆధ్యాత్మిక జగత్తులో వారి వారి స్వీయ ధామములున్నాయి; అక్కడ వారు తమ భక్తులతో నిత్య ప్రేమయుక్త లీలలలో నిమగ్నమై ఉంటారు. ఎవరైతే ఆయన పట్ల నిస్వార్థ ప్రేమయుక్త భక్తి సేవలో పరిపూర్ణత సాధిస్తారో, వారు ఆయొక్క ఆరాధించిన భగవత్ స్వరూప ధామమునకు చేరుకుంటారు. ఈ విధంగా, శ్రీ కృష్ణుడి భక్తులు గోలోకమునకూ, విష్ణుభక్తులు వైకుంఠమునకూ, రామ భక్తులు సాకేతలోకమునకూ, శివ భక్తులు శివలోకమునకూ, దుర్గామాత భక్తులు దేవీలోకమునకూ చేరుకుంటారు. ఈ దివ్య ధామములకు చేరుకున్న భక్తులు, ఆయనను చేరిన తరువాత, ఆధ్యాత్మిక శక్తితో పరిపూర్ణమైన ఆయన దివ్య లీలలలో పాలుపంచుకుంటారు.
06:02 - చేతసా సర్వకర్మాణి మయి సన్న్యస్య మత్పరః ।
బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ ।। 57 ।।
నన్నే నీ యొక్క పరమ లక్ష్యముగా చేసుకుని, నీ యొక్క ప్రతి కర్మనూ నాకే సమర్పించుము. బుద్ధి యోగమును ఆశ్రయించి, నీ చిత్తమును నా యందే ఎల్లప్పుడూ లగ్నము చేయుము.
‘యోగము’ అంటే ఏకమైపోవుట, మరియూ, బుద్ధి యోగము అంటే, ‘బుద్ధిని భగవంతునితో ఏకం చేయుట’ అని. సమస్త పదార్థములూ, జీవులూ, భగవంతుని నుండే జనించాయి, ఆయనతో అనుసంధానమై ఉన్నాయి, మరియు ఆయన ప్రీతికోసమే ఉన్నాయని ఎప్పుడైతే బుద్ధి దృఢ నిశ్చయంతో ఉంటుందో, అప్పుడు బుద్ధి భగవంతునితో ఏకమై పోతుంది. మనలో ఉన్న అంతర్గత వ్యవస్థలో, బుద్ధి యొక్క స్థాయిని ఒకసారి అర్థం చేసుకుందాము. మన శరీరంలో సూక్ష్మమైన అంతఃకరణ ఉంటుంది. మనం దానినే సామాన్యంగా, 'హృదయము' అంటుంటాము. దానికి నాలుగు అస్తిత్వాలు ఉంటాయి. అది ఆలోచనలను సృష్టిస్తే, దానిని మనం 'మనస్సు' అంటాము. అది విశ్లేషించి, నిర్ణయం తీసుకుంటే, దానిని 'బుద్ధి' అంటాము. అది ఒక వస్తువుకు, లేదా వ్యక్తి పట్ల మమకారానురాగంతో ఉంటే, దానిని 'చిత్తము' అంటాము. అది తనను తాను దేహ సంబంధ గుణములతో అనుసంధానం చేసుకునీ, మరియు గర్వంతో ఉంటే, దానిని మనం 'అహంకారము' అంటాము. ఈ యొక్క అంతర్గత వ్యవస్థలో, బుద్ధి యొక్క స్థాయి ఉన్నతమైనది. అది నిర్ణయం తీసుకుంటే, మనస్సు ఆ నిర్ణయాల ప్రకారం తన కోరికలను కోరుతుంది, మరియు చిత్తము ఆయా వస్తువిషయముల పట్ల మమకారాసక్తితో ఉంటుంది. ఉదాహరణకి, బుద్ధి గనుక మనకు భద్రతయే చాలా ప్రధానమైనదని నిర్ణయిస్తే, మనస్సు ఎల్లప్పుడూ, జీవితంలో భద్రత కోసమే ప్రాకులాడుతుంది. హోదా, ప్రతిష్ఠలే జీవితంలో ఆనందానికి మూలమని గనుక బుద్ధి నిర్ణయిస్తే, మనస్సు ఎల్లప్పుడూ, ‘ప్రతిష్ఠ... ప్రతిష్ఠ...’ అని ప్రాకులాడుతుంది. మనుష్యులమైన మనం, రోజంతా మనస్సును బుద్ధిచే నియంత్రిస్తుంటాము. మనం బుద్ధిని సరియైన జ్ఞానంచే పెంపొందించుకోవాలి, దానిని మనస్సును సరియైన దిశలో పెట్టడానికి ఉపయోగించుకోవాలి. శ్రీ కృష్ణుడు చెప్పే బుద్ధి యోగమంటే ఇదే - అన్ని వస్తువులూ, మరియు పనులూ, భగవంతుని ప్రీతికోసమే, ఆయన సంతోషం కొరకే ఉన్నాయనే దృఢ సంకల్పము, బుద్ధి యందు పెంపొందించుకోవటం అన్నమాట. దృఢ సంకల్పబుద్ధి ఉన్న ఇటువంటి వ్యక్తి యొక్క చిత్తము, సునాయాసముగానే, భగవంతుని పట్ల అనుసంధానమైపోతుంది.
అథ చేత్ త్వమహంకారాన్ న శ్రోష్యసి వినంక్ష్యసి ।। 58 ।।
నీవు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉంటే, నా కృపచే అన్ని అడ్డంకులనూ, మరియు కష్టాలనూ అధిగమించగలవు. కానీ, ఒకవేళ అహంకారముచే నా సలహా వినకపోతే, నీవు నాశనమైపోతావు.
ఏం చెయ్యాలో ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇక ఇప్పుడు తన ఉపదేశాన్ని పాటిస్తే వచ్చే లాభాన్ని చెబుతున్నాడు, మరియు పాటించకపోతే కలిగే పరిణామాలనూ వివరిస్తున్నాడు. జీవాత్మ ఎన్నటికీ, తాను భగవంతుని కంటే స్వతంత్రుడనన్న భావనలో ఉండకూడదు. మనస్సును పూర్తిగా భగవంతుని యందే నిమగ్నం చేసి, మనం భగవంతుడినే సంపూర్ణంగా ఆశ్రయిస్తే, ఆయన కృపచేత అన్ని అవరోధాలూ, మరియు కష్టాలూ తీరిపోతాయి. కానీ, గర్వముచే, సనాతన భగవత్ జ్ఞానము, మరియు శాస్త్రముల కంటే మనకే ఎక్కువ తెలుసనుకుని, ఆయన ఉపదేశాన్ని పెడచెవిన పెడితే, మనం మానవ జన్మ యొక్క ప్రధాన లక్ష్యాన్ని సాధించటంలో విఫలం అవుతాము. ఎందుకంటే, భగవంతుని కంటే ఉన్నతమైదేమీ లేదు, మరియు ఆయన ఉపదేశాన్ని మించిన సందేశమూ లేదు.
10:03 - ఇక మన తదుపరి వీడియోలో, జీవాత్మల గతిని, వాటి వాటి కర్మల అనుగుణంగా భగవంతుడు ఏ విధంగా నిర్దేశిస్తూ ఉంటాడో, తెలుసుకుందాము..
ప్రతిరోజూ ఉదయం లేవగానే రామాయణం, మధ్యాహ్నం భోజనానంతరం భారతం, రాత్రి నిద్రించే మందు భాగవతం చదవాలనీ, లేదా చదివించుకుని వినాలనీ పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుత కాలంలో అందరికీ అంత వెసులుబాటు లేక పోయినప్పటకీ, కొందరు ప్రవచనకర్తల ద్వారా కొన్ని పురాణ గాథలను వినగలుగుతున్నాము. భాగవతంలో ఎన్నో కథలు ప్రాశస్త్యంలో ఉన్నాయి. అటువంటి వాటిలో ముఖ్యమైనవిగా, ధ్రువ చరిత్ర, ప్రహ్లద చరిత్ర, గజేంద్ర మోక్షం, అంబరీషోపాఖ్యానం వంటివి చోటుచేసుకుంటాయి. భాగవతం, కార్తీక పురాణాలలో పేర్కోనబడిన అంబరీషోపాఖ్యానం ఎంతో ప్రాముఖ్యత చెందినది. గొప్ప విష్ణు భక్తుడిగా పేరుగడించిన అంబరీషుడి వృత్తాంతం ఏమిటి? మాంధాత, ముచికుందుడి వంశంలో జన్మించిన అంబరీషుడు, మహా చక్రవర్తిగా ఎలా పేరుగడించాడు? దుర్వాస మహామునిని సైతం పరుగులు పెట్టించిన అంబరీషుడి శక్తి ఎటువంటిదో, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. మీలో ఎవరైనా షోడశ రాజులలో ఒకరైన మాంధాత మాహారాజు వృత్తాంతాన్నీ, ఇక్ష్వాకు వంశంలో, త్రేతా యుగంలో జన్మించి, ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడికి సహాయం చేసిన ముచికుంద మహారాజు చరిత్రనూ గనుక తెలుసుకోనట్లయితే, వారికి సంబంధించిన వీడియో లింక్స్, ఐ కార్డ్స్ లో పొందుపరిచాను.. ప్రతి వీడియోలో కామెంట్ చేస్తూ, వీడియోను లైక్ చేస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సాహిస్తున్న సహృదయులందరికీ, పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను..
అంబరీషుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు. శ్రేష్ఠుడైన అంబరీషుడు, ఏడు దీవులతో కూడిన భూమండల భారాన్ని, తన భుజస్కంధాల మీద మోసి శుభాలను పొంది, అఖండ రాజ్యసంపదలను కలిగి, చెడు నడతలకు లోనుకాకుండా, విష్ణుపూజలతోనే కాలాన్ని వెళ్ళబుచ్చి, విష్ణు సాన్నిధ్యాన్ని చేరి, ప్రశస్తి పొందాడు. సూర్యవంశములో సుప్రసిద్ధుడైన అంబరీషుడు, హరి పూజా దురంధరుడు, సద్గుణ సంపన్నుడు, నిరాడంబరుడు, పరిపాలనా దక్షుడు. పూర్వ జన్మ సుకృతం వల్ల, అతనిలో బాల్యం నుంచీ హరి భక్తి ఏర్పడింది. మనోవాక్కాయ కర్మలతో మహా విష్ణువునే ఆరాధించడం, అతనికి నిత్యకృత్యం అయింది. విష్ణు భక్తులను ఆదరిస్తూ, విష్ణు కీర్తనలను ఆలపిస్తూ, విష్ణు మందిరాన్ని పరిశుభ్రం చేస్తూ అతడు కాలం గడిపేవాడు. ఫలాపేక్ష లేకుండా, సరస్వతీ నదీ తీరంలో అనేక యజ్ఞాలు గావించి, రాజర్షి అనే పేరును కూడా పొందాడు అంబరీషుడు. కొంతకాలానికి అంబరీషుడు సంసార బంధాలకు అతీతుడై, సత్యమార్గంలో, ధర్మ నిష్టతో ప్రవర్తింపసాగాడు. విష్ణువు అతని భక్తికి మెచ్చి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయగల సుదర్శన చక్రాన్ని అతనికి ప్రసాదించాడు. అంబరీషుడు విష్ణుదేవుని కరుణా కటాక్షాలకు పొంగి పులకించాడు.
ఒకసారి అంబరీషుడు తన తోడూనీడ అయిన అర్థాంగి లక్ష్మితో కలసి, ద్వాదశ వ్రతాన్ని ఆచరించాడు. వ్రతాన్ని సంపూర్ణం చేయడానికి, కార్తీక మాసంలో మూడు రాత్రులు ఉపవాసం వుండి, విష్ణువును షోడశోపాచారాలతో అర్చించాడు. బ్రాహ్మణులకు గోవులను దానమిచ్చాడు. యధావిధిగా, వేదవేత్తలను ఆరాధించి, ద్వాదశీ పారాయణ చేయటానికి సిద్ధమయ్యాడు. సరిగ్గా అదే సమయంలో, భాసుర తపో విలాసుడూ, నిరంతర యోగాభ్యాసుడూ అయిన దుర్వాస మహర్షి అక్కడకు విచ్చేశాడు. అనుకోకుండా భోజన సమయానికి అరుదెంచిన అతిధి, సాక్షాత్తు విష్ణుమూర్తితో సమానమని పెద్దల ఉవాచ. తన ఇంటికి వచ్చిన అతిథికి అంబరీషుడు స్వాగతం పలికి, తగిన మర్యాదలు చేసి, తన ఆతిధ్యాన్ని స్వీకరించమని వేడుకున్నాడు. అందుకు ఎంతగానో సంతసించి, స్నానం చేసి వస్తానని యమునా నదికి వెళ్ళాడు, దుర్వాసుడు. అక్కడ స్నానానికై నీటిలోకి దిగి జపం మొదలుపెట్టి, ఆలస్యం చేశాడు. ఎండ మండిపోతున్నది. ద్వాదశీ పారాయణకు సమయం మించిపోతున్నది. ఆ సమయంలో పారాయణ చేయకపోతే, చేసిన వ్రతం అంతా వ్యర్దమైపోతుంది.
అటువంటి క్లిష్ట సయంలో ఏం చేయడానికీ తోచక, అంబరీషుడు పండితులనందరినీ పిలిపించి, విషయాన్ని వివరించాడు. తగిన ఉపాయాన్ని సూచించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడా విద్వాంసులందరూ ఆలోచించి, అతిధి రాలేదని అంబరీష మహారాజు, ద్వాదశీ పారాయణం మానకూడదు. ఆలాగని భోజనం చేయకూడదు. కనుక మధ్యేమార్గంగా జలపానం చేసినట్లయితే, ద్వాదశీవ్రత ఫలితం దక్కుతుందని, అతని ధర్మసందేహాన్ని తీర్చారు. అందుకు సంతోషించి, అంబరీషుడు నీటిని మాత్రమే కొద్దిగా త్రాగి, వ్రతాన్ని పూర్తి చేశాడు. కొంతసేపటికి తన అనుష్టానం ముగించుకుని దుర్వాసుడు రానే వచ్చాడు. జరిగిన సంగతి తెలుసుకుని, ఆగ్రహోదగ్రుడయ్యాడు. నన్ను భోజనానికి పిలిచి, నేను రాకముందే పారాయణ చేసి కూర్చుంటారా? అని పళ్ళు పటపట కొరికాడు. కనుబొమలు ముడివేసి, పెదవులు అదరుచుండగా, తన జట నొకదానిని ఊడపెరికి మంత్రించి, దానిని కృత్య అనే రాక్షసిగా మార్చాడు. అపార్ధంతో కూడిన అహంకారంతో హుంకరించి, ఆ కృత్యను అంబరీషుని మీదకు ప్రయోగించాడు. ప్రళయాగ్నిలాగా విజృంభించి, పెద్ద శూలాన్ని ధరించి, కృత్య భయంకర ఆకారంతో అంబరీషుని పైకి దూకింది.
అంతలోనే వెర్రిమొర్రి కోపంతో కేకలు పెడుతున్న దుర్వాసుడి దురహంకారాన్ని తుత్తునియలు చేయమని, మహావిష్ణువు తన చక్రాయుధాన్ని పంపించాడు. చక్రం రివ్వున వచ్చి, క్షణకాలంలో కృత్యను భస్మం చేసింది. అంతటితో ఆగక, అవక్రపరాక్రమము గల ఆ చక్రం, దుర్వాసుడి వెంట పడింది. ఆ ముక్కోపి దిక్కుతోచక, భయంతో పరుగెత్తసాగాడు. అతడు ఎక్కడెక్కడకు వెళ్ళితే, ఆ చక్రం అక్కడకు వెళ్ళింది. పాతాళానికి వెళితే పాతాళానికీ, సముద్రంలోకి ప్రవేశిస్తే సముద్రంలోనికీ, ఆకాశానికి వెళితే ఆకాశానికీ, దిక్కులకు పోతే దిక్కులకూ వెన్నంటి పోసాగింది. సుదర్శన చక్రపు అగ్నిజ్వాలలకు తట్టుకోలేక, గిలగిల కొట్టుకుంటూ, దుర్వాసుడు పరుగెత్తుతూ పోయి, సత్యలోకం చేరాడు. కాపాడమని బ్రహ్మదేవుని ప్రార్థించాడు. ఆయన సుదర్శన చక్రాన్ని మరల్చే శక్తి తనకు లేదన్నాడు. ఈశ్వరుడు, చక్రాన్ని ఉపసంహరించాలంటే ఆ చక్రధరుడే రావాలన్నాడు. దుర్వాసునికి దిక్కు తోచలేదు. విష్ణుమూర్తిని శరణు వేడడం కంటే, వేరే మార్గం లేదని నిర్ణయించుకున్నాడు.
శోకంతో ఆక్రోశిస్తూ, వెంటనే వైకుంఠానికి చేరాడు. లక్ష్మి సమేతుడైయున్న శ్రీమహావిష్ణువుకు, దుర్వాసుడు మొరపెట్టుకున్నాడు. అప్పుడు శ్రీహరి, "దుర్వాసా, నేను భక్త పరాధీనుణ్ణి. గోమాత వెంటనంటి నుండే గోవత్సలులాగా, నేను నా భక్తులను అనుసరిస్తుంటాను. అందువలన ఆ చక్రాన్ని ఉపసంహరించే శక్తి నాకంటే ఎక్కువగా, ఆ అంబరీషుడికే వుంది. వెంటనే వెళ్ళి అతన్ని ఆర్దించు" అని పంపించాడు. దుర్వాసమహర్షి తన అహంకారినికీ తన ప్రవర్తనకూ ఎంతగానో పశ్చాత్తాపపడ్డాడు. ఇక తప్పేదేముంది? అంబరీషుడే శరణ్యం. లేకుంటే చక్రజ్వాలామాలికలు తనను కాల్చివేస్తాయి. చకచకామని వెళ్ళి, అంబరీషుడిని "పాహి పాహి" అని ప్రార్థించాడు. సహజంగానే సాధు స్వభావుడైన అంబరీషుడు, దాయార్ద్ర హృదయుడై, దుర్వాసుణ్ణి ఓదార్చాడు. శాంతించమని చక్రాయుధాన్ని పరి పరి విధాలా స్తుతించాడు. చక్రం శాంతించి, ఆరోగమించగా, దుర్వాసుడి ప్రాణాలు కుదుటపడ్డాయి. ఆ ముని తన అవివేకానికి సిగ్గుపడ్డాడు. భక్తి ప్రభావాన్ని కన్నులారా చూశాడు. భక్తులంటే ఏమిటో, వారి శక్తి ఎంత గొప్పదో తెలుసుకొనగలిగాడు.
వెంటనే చేతులెత్తి, తనను క్షమించమని అంబరీషుడిని వేడుకున్నాడు. అంబరీషుడు దుర్వాసమహర్షికీ, వేదవేత్తలైన బ్రాహ్మణులకూ తృప్తిగా భోజనం పెట్టి, అనంతరం తన భార్యతో కలసి భుజించాడు. ద్వాదశీవ్రతం విజయవంతంగా పరి సమాప్తమయ్యింది. అంబరీషుని వద్ద సెలవు తీసుకుని, దుర్వాసుడు తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. భక్తునికి భగవంతుడు ఏవిధంగా లోబడివుంటాడో, వారిద్దరికీ గల బంధం ఎటువంటిదో, అంబరీషుడి వృత్తాంతం వెల్లడిస్తుంది. అంతేకాదు, భగవంతునికంటే ఒక్కొక్కసారి, భక్తుడే శక్తిమంతుడని కూడా మనకు స్పష్టమవుతుంది. భగవంతుడిని ప్రభువుగా భావించి, సర్వకర్మలనూ ఆయనకే అంకితం చేయడం, నవవిధ భక్తి మార్గాలలో ఒకటైన ‘దాస్య భక్తి’గా పిలువబడుతుంది. దాస భక్తితో, స్వామికి దాసుడననే భావముతో సేవిస్తూ, భగవంతునికి దాసుడై, సర్వమూ ఆ భగవంతునికి అర్పించడమే దాస్యం. సప్తద్వీప విశాల భూభారాన్ని వహించి, విష్ణు సేవతో కాలం గడిపి, సద్గుణ సంశోభితుడైన అంబరీష చక్రవర్తి భక్తి, అటువంటి దాస్య భక్తికి ఒక ఉదాహరణ.
ముక్త-జీవులను కూడా ఆకర్షించే మహాద్భుతమైన గుణములు ఎటువంటివి?
'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (51 – 54 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 51 నుండి 54 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
వ్యక్తి ఎప్పుడైతే - ఇంద్రియములను చక్కగా నిగ్రహించి, పరిశుద్ధమైన బుద్ధిగలవాడగునో, శబ్దము, మరియు ఇతర ఇంద్రియ విషయములను త్యజించి, రాగ ద్వేష రహితముగా ఉండునో, అప్పుడు బ్రహ్మమును పొందుటకు పాత్రుడగును. అటువంటి వ్యక్తి, ఏకాంతమును ఇష్టపడతాడు, మితంగా తింటాడు, శరీరమనోవాక్కులను నియంత్రిస్తాడు, నిత్యమూ ధ్యానములో నిమగ్నమౌతాడు, మరియు వైరాగ్యమును అభ్యాసం చేస్తాడు. అహంకారము, హింస, దురభిమానము, కోరికలు, ఆస్తిపాస్తులు తనవే అన్న భావన, స్వార్థము లేకుండా ఉన్నటువంటి వ్యక్తి, ప్రశాంతంగా ఉన్నవాడై, బ్రహముతో ఏకీభావ స్థితిని పొందుటకు అర్హుడవుతాడు.
మన విధులను సరైన దృక్పథంలో చేయటం ద్వారా, మనం పరిపూర్ణ సిద్ధిని ఎలా పొందవచ్చో, శ్రీ కృష్ణుడు చెబుతూ వచ్చాడు. ఇక ఇప్పుడు బ్రహ్మము సాక్షాత్కారానికి కావలసిన శ్రేష్ఠత గురించి వివరిస్తున్నాడు. ఆ యొక్క పరిపూర్ణ సిద్ధి స్థితిలో, మనకు అలౌకిక ఆధాత్మిక జ్ఞానంలోనే స్థితమై ఉన్న విశుద్ధ బుద్ధి పెంపొందుతుంది. ఇష్టాలు, మరియు అయిష్టాల భావనల యందు ఆసక్తి లేకుండా ఉండటంచేత, మనస్సు నియంత్రించబడుతుంది. ఇంద్రియములు నిగ్రహించబడి, శరీర-వాక్కుల ఉద్రేకాలు గట్టిగా నిగ్రహించబడతాయి. శరీర నిర్వహణ కోసం ఉన్న, భుజించటం మరియు నిద్ర వంటి పనులు, వివేకముతో, మితంగా క్రమబద్ధీకరించబడతాయి. అటువంటి యోగి, ధ్యానపరుడై ఉంటాడు. అందుకే ఏకాంతాన్ని ఇష్టపడతాడు. అహంకారము, మరియు దానికున్న అధికార-హోదాల కోసం, తపన నిర్మూలించబడుతుంది. నిరంతరం మనస్సును పరమాత్మ ధ్యానంలో నిమగ్నం చేస్తూ, ఆ యోగి ప్రశాంతముగా, మరియు కామ, క్రోధ, లోభముల బంధము నుండి స్చేచ్ఛతో ఉంటాడు. అటువంటి యోగి, పరమ సత్యమును, బ్రహ్మము రూపంలో తెలుసుకుంటాడు.
03:16 - బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి ।
సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్ ।। 54 ।।
పరబ్రహ్మాంతో ఏకీభావ స్థితిలో ఉన్న వ్యక్తి, మానసికంగా ప్రశాంత చిత్తముతో ఉంటాడు, దేనికీ శోకింపడు, దేనినీ కాంక్షింపడు. సర్వ భూతముల పట్ల సమత్వ భావముతో ఉంటూ, అటువంటి యోగి నా పరాభక్తిని పొందుతాడు.
సంపూర్ణ సిద్ధి స్థాయి యొక్క తన వివరణను, శ్రీ కృష్ణుడిక ఇప్పుడు ముగిస్తున్నాడు. బ్రహ్మ-భూతః అంటే బ్రహ్మమును తెలుసుకున్న స్థితి. దాని యందే స్థితమై ఉండి, ఒక వ్యక్తి సంక్లిష్టమైన, మరియు బాధాకరమైన పరిస్థితులలో కూడా, ప్రశాంతముగా మరియు వాటిచే ప్రభావితం కాకుండా ఉంటాడు. ఆ వ్యక్తి దేనికీ శోకింపడు, లేదా ఎటువంటి కొరతనూ తలంచడు. తన ఆనందం కోసం ఎటువంటి భౌతిక వస్తువునూ కాంక్షింపడు. అటువంటి యోగి, అన్నింటిలో ఉన్నది బ్రహ్మమే అని గ్రహించి, సర్వ భూతములనూ సమ దృష్టితో చూస్తాడు. ఈ స్థితిలో, వ్యక్తి అంతర్గత విజ్ఞాన జ్ఞానోదయ స్థితిలో ఉంటాడు. కానీ, ఇటువంటి జ్ఞానోదయ స్థితిలో ఉన్న వ్యక్తి, భగవంతుని దివ్య ప్రేమను పొందుతాడు. భక్తి అనేది, బ్రహ్మమనే జ్ఞానోదయమునకు ఒక మధ్యమ మెట్టుగా మాత్రమే చేయదగినదని, జ్ఞానులు తరచుగా అంటుంటారు. భక్తి అనేది, అంతఃకరణ శుద్ధికి మాత్రమే ప్రయోజనకారి అనీ, ఈ పథంలో చివరికి కేవలం జ్ఞానమే మిగిలిపోతుందనీ అంటుంటారు. అందుకే దృఢమైన బుద్ధీ, వివేకమూ ఉన్నవారు, భక్తిని పక్కకుపెట్టి, కేవలం జ్ఞానమునే పెంపొందించుకోవాలని, సిఫారసు చేస్తారు. కానీ, ఈ పై శ్లోకం ఇటువంటి దృక్పథాన్ని ఖండిస్తుంది.
అత్యున్నతమైన జ్ఞానోదయాన్ని పొందిన తరువాత, వ్యక్తి పరా భక్తిని పెంపొందించుకుంటాడు. వేద వ్యాసుడు ఇదే విషయాన్ని, శ్రీమద్భాగవతంలో పేర్కొన్నాడు. ‘ఆత్మ యందే రమించే ఆత్మారాములు, ఆత్మ జ్ఞానములోనే స్థితమై, భౌతిక బంధాలనుండి విముక్తులైనవారు.. ఇటువంటి సిద్ధులైన జీవులు కూడా, భగవంతుని పట్ల భక్తిని కలిగిఉండాలని కోరుకుంటారు. భగవంతుని మహాద్భుతమైన గుణములు ఎటువంటివంటే, అవి ముక్త-జీవులను కూడా ఆకర్షిస్తాయి.’ ఆత్మ జ్ఞానాన్ని పొంది, నిరాకార బ్రహ్మామును ఆచరణలో తెలుసుకున్న స్థితిలో, ప్రఖ్యాత జ్ఞానులు ఎందరో ఉన్నారు. కానీ, ఎప్పుడైతే వారికి అలౌకికమైన భగవంతుని దివ్య గుణముల క్షణ దర్శనము లభించిందో, వారు సహజంగానే భక్తి మార్గంలో ఆకర్షితులయ్యారు.
నాలుగు యుగాలలో ప్రతి యుగం నుండీ ఇటువంటి జ్ఞానులున్నారు. సత్య యుగపు మహా జ్ఞానులు, బ్రహ్మ నలుగురు కుమారులైన సనత్ కుమారుడు, సనాతన కుమారుడు, సనక కుమారుడు, మరియు సనందన కుమారుడు. వారు పుట్టుకతోనే ఆత్మజ్ఞాన సంపన్నులు. వారి మనస్సులు నిత్యమూ నిరాకార బ్రహ్మము యందే నిమగ్నమై ఉండేవి. ఈ నలుగురు కుమారులు ఒకసారి విష్ణుమూర్తి నివాసమైన వైకుంఠాన్ని సందర్శించారు. అక్కడ భగవంతుని యొక్క పాదారవిందముల వద్ద నుండి, తులసి ఆకుల పరిమళం వారి ముక్కుపుటాలను తాకింది. అది వారి హృదయంలో అమితమైన ఆనందాన్ని రేకెత్తించింది. తక్షణమే, నిర్గుణ బ్రహ్మముపై వారి ధ్యానం అంతమై పోయింది. వారు విష్ణుమూర్తి యొక్క దివ్య ప్రేమానందములో మునిగి పోయారు. అప్పుడు వారొక వరం కోసం వేడుకున్నారు: ‘ఓ స్వామీ, నీ పాదారవిందముల నుండి జాలువారే దివ్య ప్రేమానందమును గ్రోలే అవకాశం మా మనస్సుకు లభించినంత కాలం, నీవు మమ్ములను నరకానికి పంపినా, మాకు సమ్మతమే.’ ఒక్కసారి ఊహించండి.. నిరాకార బ్రహ్మమును అనుభవించిన తరువాత కూడా, ఈ వరిష్ఠమైన జ్ఞానులు, భగవంతుని సగుణ రూపము యొక్క ఆనందమును అనుభవించుటకు, నరకములో కూడా ఉండటానికి వెనుకాడలేదు.
ఇక ఇప్పుడు, త్రేతాయుగములో చూసినట్లయితే, ఆ యుగపు మాహా జ్ఞాని, జనక మహారాజు. ఆయన శ్రీరామ చంద్ర ప్రభువు యొక్క నిత్యసఖి సీతమ్మవారి త్రండ్రి . ఆయనకే విదేహుడనే పేరు కూడా ఉన్నది. అంటే శారీరక దృక్పథానికి అతీతుడన్నమాట. ఆయన మనస్సు నిత్యమూ నిరాకార బ్రహ్మము పట్లనే రమిస్తూ ఉండేది. కానీ, ఒకరోజు విశ్వామిత్ర మహర్షి ఆయనను కలవటానికి, శ్రీ రామచంద్రుడు మరియు లక్ష్మణుడితో సహా వెళ్లారు. రామచంద్ర ప్రభువును చూసిన జనక మహారాజు, నిరాకార బ్రహ్మము యొక్క ఆనందముపై ఆసక్తిని కోల్పోయాడు. భగవంతుని సాకార రూపము పట్ల, గాఢంగా ఆసక్తుడై పోయాడు.’ ఈ విధంగా, తేత్రాయుగపు మోహోన్నత జ్ఞాని, భక్తి పథంలోకి వచ్చాడు.
ద్వాపర యుగపు మహోన్నత జ్ఞాని, వేద వ్యాసుని పుత్రుడు ‘శుకదేవుడు’. ఆయన ఎంత ఉన్నతుడంటే, బయటకు వస్తే, భౌతిక శక్తి మాయ తనను వశపరుచుకుంటుందని, తల్లి గర్భంలోనే పన్నెండు సంవత్సరములున్నాడని, పురాణములు మనకు చెబుతున్నాయి. చివరికి, నారద మహర్షి వచ్చి, తల్లి చెవుల ద్వారా ఆయనతో మాట్లాడి, బయటకు వస్తే ఏమీ కాదులే అని హామీ ఇచ్చి, తనను తల్లి గర్భం నుండి బయటకు రమ్మని వేడుకున్నాడు. ఆ తరువాత ఆయన బయటకు వచ్చి, తన యోగ శక్తి చే, తన శరీరాన్ని పన్నెండు సంవత్సరముల బాలుడిగా పెద్దదిగా చేసుకుని, ఇంటిని వదిలి, సన్యసించి అడవిలో నివసించటానికి వెళ్లిపోయాడు. అక్కడ, త్వరితగతిన అత్యున్నత సమాధి స్థితికి చేరుకున్నాడు. అలా సంవత్సరములు గడచిన పిదప, వేద వ్యాసుని శిష్యులు అడవిలో కట్టెలు కొడుతూ, ఆయనను సమాధి స్థితిలో చూశారు. వారు తిరిగివెళ్ళి వేదవ్యాసునికి ఆ విషయం చెప్పారు.
ఆయన శుకదేవుని చెవిలో, శ్రీ కృష్ణుడి స్వరూప అందాన్ని వివరించే ఒక శ్లోకాన్ని, ఈ విధంగా చెప్పాడు.. ‘శ్రీ కృష్ణుడు శిరస్సుపై నెమలి పింఛముతో ఉన్న కిరీటముతో అలంకరింపబడి ఉన్నాడు. తన స్వరూపాన్ని గొప్ప నర్తకుడిగా చూపిస్తున్నాడు. ఆయన చెవులు నీలి కర్ణికా పుష్పములచే అలంకరింపబడి ఉన్నవి. ఆయన శాలువా, బంగారు వర్ణముతో మెరిసిపోతున్నది. ఆయన వైజయంతీ పూసల మాలను మేడలో ధరించి ఉంటాడు. తన వేణువు యొక్క రంధ్రములను తన అధరామృతముతో నింపివేస్తాడు. ఆయన బృందావనము చేరగానే, గోపబాలురచే చుట్టుముట్టబడి, కీర్తించబడతాడు. ఆయన పాద గుర్తులు, ఆ నేల సౌందర్యాన్ని మరింత ఇనుమడింప చేస్తాయి.’ ఈ శ్లోకము తన చెవులలోనికి ప్రవేశించిన సమయంలో, శుకదేవుడు నిరాకార బ్రహ్మములో లీనమై ఉన్నాడు. అకస్మాత్తుగా ఆయన ధ్యాన విషయం, మైమరిపించే శ్రీ కృష్ణ భగవానుని స్వరూపంపైకి మళ్ళింది. భగవంతుని సాకార రూపం పట్ల ఎంత గాఢంగా ఆకర్షింపబడ్డాడంటే, తన సమాధిని వదిలి, తండ్రి వేద వ్యాసుని దగ్గరకు వెళ్ళిపోయాడు. ఆయన నుండి, సంపూర్ణ భక్తి మాధుర్యముతో నిండినటువంటి శ్రీమద్ భాగవతమును విన్నాడు. తదుపరి కాలంలో, గంగానదీ తీరంలో, అర్జునుడి మనుమడైన పరీక్షిత్తు మహారాజుకు దానిని వివరించాడు. ఈ విధంగా, ద్వాపర యుగపు అత్యున్నత జ్ఞాని, భక్తి పథంలో ఆకర్షింపబడ్డాడు.
చివరికి, ఇక కలి-యుగానికి వద్దాము. జగద్గురు శంకరాచార్య, కలియుగపు అత్యున్నత జ్ఞానిగా పరిగణించబడతాడు. అద్వైత వాద తత్త్వమును ప్రాచుర్యం లోనికి తెచ్చినది ఆయనే. దీని ద్వారా ఆయన చెప్పినది, సృష్టిలో ఉన్నది ఒక్కటే అనీ, అదే నిర్గుణ అంటే గుణములు లేకుండా ఉన్నది, నిర్విశేష అంటే, లక్షణములు లేకుండా, నిరాకార అంటే, ఆకారము లేకుండా ఉన్న బ్రహ్మమని చెప్పారు. కానీ, ఎంతోమందికి తెలియని విషయం ఏమిటంటే, ఇరవై సంవత్సరాల వయస్సు నుండి, ముప్పైరెండు సంవత్సరాల వయస్సులో ఆయన శరీరాన్ని విడిచిపెట్టే వరకూ, శ్రీకృష్ణ భగవానుడు, శ్రీరామ చంద్ర ప్రభువు, శివుడు, మరియు దుర్గామాతలపై వందల శ్లోకాలను రచించారు. నాలుగు ధామాలను కూడా దర్శించి, భగవంతుని యొక్క సాకార రూప విగ్రహాలను కూడా ఆరాధించారు. ఈ విధంగా, మహోన్నత జ్ఞానోదయ స్థితికి చేరినవారు, ఆ తదుపరి భక్తిలో నిమగ్నమయ్యారనటానికి, కలియుగంలో శంకరాచార్యుల వారు ఒక ఉదాహరణ.
11:40 - ఇక మన తదుపరి వీడియోలో, భగవానుడి కృపచే ఎటువంటి వారు నిత్యశాశ్వతమైన, మరియు అనశ్వరమైన ధామమును పొందుతాతో, శ్రీ కృష్ణుడి వివరణలో తెలుసుకుందాము..
యాదవులచేతిలో మరణం లేని వరాన్ని పొందిన కాలయవనుడిని కృష్ణుడు ఎలా చంపాడు?
సూర్యవంశానికి చెందిన ముచికుందుడు, మహాపరాక్రమవంతుడు. మాంధాత కుమారుడైన ముచికుందుడిని యుద్ధంలో గెలవడం అసాధ్యం. వందలాది సైన్యాన్ని మట్టుపెట్టగల సమర్థుడు. కదనరంగాన మహా మహావీరులు సైతం ఆయనకు ఎదురు నిలువలేరు, ఆయన ధాటికి తట్టుకోలేరు. అందువల్లనే దేవతలు సైతం ఆయన సహాయాన్ని కోరేవారు. దీనిని బట్టే ఆయన ఏ స్థాయి పరాక్రమవంతుడనేది అర్ధం చేసుకోవచ్చు. త్రేతాయుగంలో జన్మించిన ముచికుందుడు ఇంకా జీవించే ఉన్నాడా? ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడికీ, ముచికుందుడుకీ సంబంధం ఏమిటీ? ముచికుందుడు దేవతల నుండి పొందిన వరం ఏమిటి? అది కృష్ణుడికి ఎలా ఉపయోగపడింది? ముచికుందుడి వృత్తాంతానికి సంబంధించిన ఉత్సుకతను కలిగించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
ఒకసారి దేవదానవుల మధ్య పోరు భీకరంగా సాగింది. దేవతలను జయించే పరిస్థితికి, దానవులు చేరుకున్నారు. అలాంటి సమయంలోనే, వాళ్లంతా ముచికుందుడి సహాయాన్ని కోరారు. దాంతో ఆయన దేవతల పక్షాన, అసురులతో పోరాడాడు. ముచికుందుడు యుద్ధరంగాన నిలిచిన తొలిరోజునే, ఆయన ఎంతటి పరాక్రమవంతుడనేది, దానవులకు అర్థమయ్యింది. అసురులు ఆయన ధాటికి నిలువలేక, తమ ప్రాణాలను కొల్పోయారు. అలా దేవతలు విజయం సాధించడంలో, ముచికుందుడి పాత్ర ప్రధానమైనది. యుద్ధం పూర్తయిన తరువాత, విజయానికి కారకుడైన ముచికుందుడిని దేవతలు అభినందించారు. తమకు చేసిన సాహాయానికిగాను, ఏదైనా వరం కోరుకోమని అన్నారు. ఎడతెరపి లేని యుద్ధంలో పోరాడి అలసిన తనకు, కొన్నేళ్లపాటు హాయిగా నిద్రించే వరం ప్రసాదించమని, ముచికుందుడు కోరుకున్నాడు. ఆ సమయంలో ఎవరైతే తనకి నిద్రా భంగం కలిగిస్తారో, వాళ్లు తన కంటిచూపు సోకగానే భస్మం అయ్యేలా, వరాన్ని ప్రసాదించమన్నాడు. అందుకు దేవతలు తథాస్తు పలికి, ఆయన కోరికను మన్నించారు. దాంతో ముచికుందుడు, సామాన్యుల కంటబడని ఒక గుహను ఎంపిక చేసుకుని, అందులో నిద్రకు ఉపక్రమించాడు.
యుగాల తరబడి ఆయన అలా నిద్రావస్థలోనే ఉన్నాడు. ముచికుందుడు దేవతల నుండి పొందిన వరం, ద్వాపర యుగంలో ఒక అసురుడి మరణానికి కారణమయ్యింది. బలరామకృష్ణుల చేతిలో ఓడిపోయిన జరాసంధుడు, ఎప్పటికప్పుడు ఇతర రాజులతో మైత్రి చేసుకుని, వాళ్లతో కలిసి మధురపై దండెత్తేవాడు. అలా జరాసంధుడు వరుసగా దండయాత్రలు చేయడం, కృష్ణుడు అతనిని తప్ప, మిగతావారిని కడతేర్చడం జరుగుతూ వచ్చింది. ఇలా తరచూ జరుగుతుండడంతో, యాదవ సైన్యం కూడా పెద్ద సంఖ్యలో నశించసాగింది. దాంతో సముద్ర మధ్య ప్రాంతంలో "ద్వారకా నగరం" నిర్మించాలని, శ్రీ కృష్ణుడు సంకల్పించాడు. అక్కడైతే జరాసంధుడి దాడుల కారణంగా, ప్రజల ప్రాణాలకు ముప్పుండదని భావించాడు. అనుకున్నదే తడవుగా, "విశ్వకర్మ"ను రప్పించి, ద్వారకా నగర నిర్మాణ పనులను, ఆయనకు అప్పగించాడు.
అత్యంత సుందరంగా ద్వారకా నగరాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో, విశ్వకర్మ రంగంలోకి దిగాడు. మంచి ముహూర్తం చూసుకుని, ఆయన ద్వారకా నగర నిర్మాణ పనులను ఆరంభించాడు. అలా చకచకా పనులు సాగిపోతున్నాయి. ఒక వైపున ద్వారకా నగర నిర్మాణం జరుగుతూ ఉన్న సమయంలో కూడా, జరాసంధుడు యుద్ధానికి రావడం, ఓడిపోయి ఒంటరిగా తిరిగి వెళ్లడం జరుగుతూనే ఉంది. ఆ మరుసటి రోజు నుంచే, మళ్లీ సైన్యాన్ని కూడగట్టుకోవడం మొదలు పెట్టే వాడు. అలా కృష్ణుడి వీరత్వం గురించి, "కాలయవనుడి" కి తెలిసింది. తనను మించిన వీరుడు లేడనే అహంభావంతో ఉన్న కాలయవనుడు, కృష్ణుడి ధైర్యసాహసాలను గురించి విన్నాడు. కృష్ణుడిని చూడాలనీ, ఆయనతో యుద్ధం చేయాలనీ భావించాడు. "కంసుడిని హతమార్చి, జరాసంధుడిని పలుమార్లు ఎదుర్కున్న కృష్ణుడు, నిజంగానే మహావీరుడయ్యే ఉంటాడు. అలాంటి వీరుడు సహజంగా మిడిసిపడుతుండటం జరుగుతూ ఉంటుంది. తాను ఉండగా అలా జరగకూడదు. అలాంటివాళ్లకు తాను ఉన్నాననే ఒక భయం ఉండాలి" అని తనలో తాననుకున్నాడు. అలాంటి ఆలోచన రాగానే, కృష్ణుడిని ఎదిరించడమే ధ్యేయంగా కదలమని, తన సైనిక బలగాలను ఆదేశించాడు కాలయవనుడు.
అతడి సైనిక బలగాలు మధుర పొలిమేరలను చేరుకున్నాయి. యాదవుల చేతిలో మరణం లేకుండా వరాన్ని పొందిన కాలయవనుడిని, తెలివిగా అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు కృష్ణుడు. మరుక్షణమే, కాలయవనుడు తన సైన్యంతో విడిది చేసిన ప్రదేశానికి ఒంటరిగా చేరుకున్నాడు. కృష్ణుడు ఎలాంటి ఆయుధాలూ చేతపట్టక, ఒంటరిగా తనవైపుకు రావటం చూసిన కాలయవనుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణుడిని చూడగానే, "కాలయవనుడు" ఆగ్రహావేశాలకు లోనయ్యాడు. తన వరబలం, భుజబలం సంగతి తెలియక, కృష్ణుడు ఒంటరిగా రావడం చూసి నవ్వుకున్నాడు. ఇతర అసురులను సంహరించినంత తేలికగా తనను మట్టుపెట్టగలననే నమ్మకంతో, అతను వస్తుండవచ్చని భావించాడు. ఒక్కసారి తన శౌర్య పరాక్రమాలను రుచి చూపిస్తే, ఇకపై తనను తలచుకోవడానికి కూడా భయపడతాడని అనుకున్నాడు. కృష్ణుడు తన సమీపానికి వస్తుండగానే, ఒక్కసారిగా ఖడ్గాన్ని దూశాడు. అది చూసిన కృష్ణుడు ఉలిక్కిపడినట్టుగా నటించి, అక్కడి నుంచి పరుగందుకున్నాడు.
భయంతో కృష్ణుడు అలా పారిపోవటం చూసి కాలయవనుడు పకపకా నవ్వుతూ, "కృష్ణుడు మహావీరుడు, ఎంతోమంది అసురులను సంహరించాడని తెలిసి, అతనితో యుద్ధం చేయాలని తాను ముచ్చటపడి వస్తే, అతను ఇలా పారిపోతుండటం హస్యాస్పదం" అని ప్రగల్భాలు పలికాడు. ఎంతో దూరం నుంచి వచ్చిన తను, కృష్ణుడిని ఓడించకుండా వెనుతిరగకూడదని నిశ్చయించుకుని, ఆయనను అనుసరించాడు. కాలయవనుడు తన వెంటపడుతుండటంతో, మరింత భయాన్ని నటిస్తూ, కృష్ణుడు పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆయన ఎంతగా భయపడుతుంటే, అంతగా కాలయవనుడు ఆనందంతో పొంగిపోతున్నాడు. ఒక్కసారి తనతో యుద్ధం చేయమనీ, తనని వీరుడిగా అంగీకరించమనీ కోరుతూ, కృష్ణుడి వెంటే కాలయవనుడు కూడా పరిగెత్తాడు. అయినా ఆగకుండా కృష్ణుడు పరిగెడుతూనే ఉన్నాడు. అక్కడక్కడా ఆగి వెనక్కి తిరిగి చూస్తూ, కాలయవనుడు కాస్త దగ్గరికి రాగానే, మళ్లీ పరిగెడుతూ ఉన్నాడు కృష్ణుడు.
ఆయనను పట్టుకోవడం చేతకాక పరుగెత్తలేక ఆయాసంతో, "ఇంత పిరికివాడినా, అంతటి మహా వీరుడంటూ ఆకాశానికి ఎత్తేశారు! ఇంత భయస్థుడి చేతిలోనా, అసురులు అసువులు బాసినది! ఏది ఏమైనా, కృష్ణుడిని పట్టుకుని, ఒక్కసారైనా కత్తి కలిపి ఆయనను ఓడించాననే సంతృప్తితోనే తాను వెనుదిరగాలి. లేదంటే, జీవితాంతం ఆ అసంతృప్తి అలా వెంటాడుతూనే ఉంటుంది" అనుకుంటూ, మళ్లీ పరుగు వేగాన్ని పెంచాడు కాలయవనుడు. అతనికి అందినట్టుగానే అంది, తప్పించుకుని మళ్లీ పరుగందుకుంటున్నాడు కృష్ణుడు. ఇలా వాళ్లు చాలాదూరం వెళ్ళారు. కాలయవనుడిని తప్పించుకోవడం కోసం, కృష్ణుడు గుహలోకి ప్రవేశించాడు. అది చూసిన కాలయవనుడు, ఆయన వెనుకే గుహలోకి ప్రవేశించాడు. పొడవైన, విశాలమైన ఆ గుహలో అంతా చీకటిమయం. అందులో కృష్ణుడి కోసం అంగుళం అంగుళం వెతకసాగాడు కాలయవనుడు. అయితే, ఒక చోట ఎవరో పడుకుని ఉన్నట్టనిపించడంతో, అది కృష్ణుడని భావించిన కాలయవనుడు, అతనికి దగ్గరగా వెళ్లి, "ఎక్కడ ఉన్నా, ఎన్ని వేషాలు వేసినా, నా నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు. కృష్ణుడు నా చేతికి చిక్కడం అసంభవమనీ, అసాధ్యమనీ చాలామంది చెప్పారు. అలాంటి వారందరికీ, తానేమిటనేది ఇప్పుడు తెలుస్తుంది." అని గర్వంతో పలుకుతూ, "ముసుగు తొలగించి బయటికి వస్తే, బలాబలాలు తేల్చుకుందాం" అని సవాలు చేశాడు.
అయినా అవతలి వ్యక్తి నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో, లేవమంటూ కాలయవనుడు తన కాలితో ఒక్క తన్ను తన్నాడు. కాలయవనుడు అలా తన్నడంతో, అప్పటివరకూ ముసుగుపెట్టి పడుకున్న "ముచికుందుడు", నెమ్మదిగా ముసుగు తొలగించాడు. కృష్ణుడికి బదులుగా అక్కడ ఎవరో ఉండటం చూసి, కాలయవనుడు బిత్తరపోయాడు. కృష్ణుడు ఎక్కడికి పోయాడు? ఏమైపోయాడన్నట్టుగా, ఆయన కోసం చుట్టూ చూశాడు. తనకు నిద్రాభంగం కలిగించిందెవరని అనుకుంటూ, ముచికుందుడు కళ్లు నలుపుకుంటూ లేచాడు. ఆయన కళ్లు తెరిచి చూడగానే, తీక్షణమైన ఆ శక్తికి కాలయవనుడు ఒక్కసారిగా భస్మమైపోయాడు. వందల ఏళ్లపాటు నిద్రలో ఉండి లేచిన కారణంగా, ఏం జరిగిందనేది ముచికుందుడికి అర్థం కాలేదు. తన కళ్ల ఎదురుగా పోగుపడిన భస్మ రాశిని చూశాడు. తన గుహలోకి ప్రవేశించిందెవరు? తనను నిద్రలో నుంచి లేపిందెవరు? తనతో వాళ్లకి గల పనేమిటి? అని పరిపరివిధాల ఆలోచించసాగాడు ముచికుందుడు. అప్పటివరకూ చాటుగా ఉండి ఇదంతా చూస్తున్న కృష్ణుడు బయటికి వచ్చి, జరిగిందంతా ముచికుందుడికి వివరించగా, కృష్ణ దర్శనభాగ్యం లభించినందుకు ముచికుందుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, పరి పరి విధాలా భగవానుడిని స్తుతించాడు.
ఈ రోజు '26/11/2023' కార్తీక పూర్ణిమ - అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు..
కార్తీక పూర్ణిమను 'త్రిపుర పూర్ణిమ', 'రాస పూర్ణిమ', 'దేవ దీపావళి' అని కూడా అంటారు. ఈ రోజును మనువులలో పద్నాలుగోవాడైన భౌత్యుని పేరున భౌత్యమన్వంతరాది, ఇంద్ర సావర్ణిక మన్వంతరమని కూడా అంటారు. త్రిపురాసుర సంహారం జరిగింది కూడా ఈ రోజే.
జ్వాలాతోరణ దర్శనంతో ఈ భూమిపై ఉండే సర్వ ప్రాణుల పాపాలూ పరిహరించబడి, సద్గతి లభిస్తుందని పురాణ వచనం. కార్తీక జ్వాలా తోరణం చేసినందు వలన, జాతిభేదం లేకుండా, మానవులకు, కీటకాదులకు, పక్షులకు, దోమలకు, జలచరాలైన చేపలకు, వృక్షాలకు కూడా పునర్జన్మ ఉండదని ఐతిహ్యం. కార్తీక పౌర్ణమి రోజున వేదవ్యాస పూజ కూడా నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున దీపోత్సవం, సర్వపాపహరం. కార్తీక పౌర్ణమి వ్రతం ఆచరించిన పురంజయుడనే రాజు తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకుని, విష్ణు పూజతో మోక్షాన్ని పొందిన గాధ ప్రచారంలో ఉంది.
కార్తీక పౌర్ణమి రోజున పితృ ప్రీతిగా వృషోత్సర్జనం చేయటం, సాలగ్రామాన్ని దానం చేయటం, ఉసిరి కాయలు దక్షిణతో దానం చేయటం వలన, వెనుక జన్మలలో చేసిన సమస్త పాపములనూ నశింప జేసుకోవచ్చు.
కార్తీకంలో ఆధ్యాత్మిక, ఆరోగ్య పరమైన ఉపయోగాలు..
కార్తీక మాసం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రమైనది, మహిమాన్వితమైనది. నెలరోజుల పాటు తులసి కోట, లేదా దేవాలయంలో దీపారాధన చేయడం ద్వారా, అంతర్గత శక్తి పెరుగుతుంది, జ్ఞానం వికసిస్తుంది.
కార్తీకంలో శరదృతువు పవిత్ర జలం హంసోదకంగా పిలవబడుతుంది. మానసిక, శారీరక, రుగ్మతలను తొలగించి, ఆయుష్షునూ, ఆరోగ్యాన్నీ ప్రసాదించే ఉషోదయ స్నానం, కార్తీకంలో ప్రముఖ స్థానం పొందింది.
పైత్య ప్రకోపాలను తగ్గించేందుకే, ఈ హంసోదక స్నానం. ఇది అమృత తుల్యంగా మానవాళికి ఉపయుక్తంగా ఉంది. అగస్త్య నక్షత్రం ఉదయించడం వల్ల, దోష రహితమైనది. శరదృతువులోని పవిత్ర జలాన్ని హంసోదకం అంటాము.
తులారాశిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావనీ ౹
సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా ౹౹
సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు, గంగాదేవి అన్ని ప్రదేశాలలో ద్రవరూపంలో ఉంటుంది. తులా మాసంలో గోవు పాదమంత జల ప్రదేశంలో కూడా శ్రీమహావిష్ణువు ఉంటాడనేది, పురాణ వచనం. సూర్యుడు తులారాశిలో సంచారం చేసే కార్తీకమాసంలో, నిత్యం ప్రాతః కాలం నదీ స్నానం చేసే వారికి, మహాపాతకాలు సైతం హరించ బడతాయని ప్రతీతి. కొండలు, కోనలు, అడవుల గుండా నదులు ప్రవహిస్తూ ఉండటం వల్ల, ఆయుర్వేద గుణాలున్న నదీ నీటిలో స్నానం ఆచరించడం వల్ల, ఆరోగ్యం సిద్ధిస్తుందని శాస్త్ర వచనం. నదిలో అనిర్వచనీయమైన విద్యుత్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తినిస్తుంది. శరీరాన్ని సమస్థితిలో ఉంచే నిరాహారం, మరో యోగం. కొందరు ఉపవాసాన్ని, రోజు మొత్తంలో ఒకసారి ఫలాహారాన్ని స్వీకరించి, ఏక భుక్తంగా నిర్వహిస్తారు. మరి కొందరు, నక్తం చేస్తుంటారు. అంటే, పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయడం. ఇలా కార్తీక సోమవారాలు, కార్తీక శనివారాలు, ఏకాదశులు, కార్తీక పౌర్ణమి వంటి రోజులలో ఉపవాస దీక్ష చేయటం, శరీరానికి మేలు చేస్తుంది.
ఈ కార్తీక మాసంలో విశేషంగా దీపాలను వెలిగించటం వలన, ఆనేక దీపాల వల్ల, వాటినుంచి వచ్చే వాయువుల వల్ల, వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి, వాతావరణ శుద్ధి అవుతుంది. తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది. ఈ రోజు ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలుగజేస్తుంది. భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి, దీనికా పేరు ప్రసిద్ధమైనది. ఎవరి శక్తి సామర్ధ్యాలను బట్టి వారు హరిహరులను సేవించి, వారి కారుణా కటాక్షాలను పొందుతారు. వీటిని ఎంత నిష్ఠతో ఆచరిస్తే అంత శుభ ఫలితాలు ఉంటాయి.
మనకు విధింపబడిన వృత్తి ధర్మములను ఎప్పటివరకు నిర్వర్తించాలి?
'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (47 – 50 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 47 నుండి 50 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ।। 47 ।।
పర ధర్మమును సరిగ్గా చేయుటకంటే, సరిగా చేయలేకపోయినా సరే, స్వ-ధర్మము చేయుటయే వ్యక్తికి శ్రేష్ఠము. తన స్వభావ సిద్ధ విధులను చేయుటలో, వ్యక్తికి పాపము అంటదు.
మనం మన స్వ-ధర్మమును అంటే, విధింపబడిన వృత్తి ధర్మములు పాటిస్తున్నప్పుడు, రెండు విధాల ప్రయోజనం ఉంటుంది. అది మన స్వభావానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి, పక్షికి ఎగరటంలా, లేదా చేపకు ఈదటంలా, అది మన వ్యక్తిత్వానికి సహజంగా ఉంటుంది. రెండవది ఏమిటంటే, మనస్సుకు సౌకర్యముగా ఉంటుంది కాబట్టి, అప్రయత్నంగానే మనం దానిని నిర్వర్తించవచ్చు. దానితో భక్తిలో నిమగ్నమవ్వటానికి, అంతఃకరణ స్వేచ్ఛగా ఉంటుంది. బదులుగా, అవి దోషపూరితముగా ఉన్నాయని మనం మన ధర్మములను విడిచిపెట్టి, మన స్వభావానికి అనుకూలంగా లేని ఇంకొకరి ధర్మములు పాటిస్తే, మనం మన సహజ సిద్ధ ప్రవృత్తికి విరుద్ధంగా ప్రయాసపడవలసి ఉంటుంది. అర్జునుడి పరిస్థితి సరిగ్గా ఇదే. అతని క్షత్రియ స్వభావము, సైనిక మరియు పరిపాలనా కార్యకలాపాల పట్ల మొగ్గు చూపుతుంది. పరిస్థితులు ఆయనను ధర్మయుద్ధంలో పాలుపంచుకునే అవసరం వైపుకు తీసుకువచ్చాయి. తన కర్తవ్యం నుండి తప్పించుకుని, అడవిలో తపస్సు కోసం యుద్ధభూమి నుండి వెనుతిరిగితే, అది అతని ఆధ్యాత్మిక పురోగతికి దోహదపడదు. ఎందుకంటే, అడవిలో కూడా తన సహజ స్వభావం తన వెంటే ఉంటుంది. అక్కడ కూడా బహుశా, తను అడవిలో ఆటవికులను కూడగట్టుకుని, వారికి నాయకుడిగా అయిపోవచ్చేమో. బదులుగా, తన స్వభావ సిద్ధంగా జనించిన విధులను నిర్వర్తిస్తూ ఉండి, తన కర్మ ఫలాలను అర్పించటం ద్వారా, భగవదారాధన చేయటమే మేలు. ఎప్పుడైతే వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదుగుతాడో, అప్పుడు స్వ-ధర్మం మారుతుంది. అది ఇక శారీరక స్థాయిలోనే ఉండిపోదు. అది ఆత్మ స్థాయి ధర్మముగా మారిపోతుంది. అంటే, భగవత్ భక్తి. ఆ స్థాయిలో, వ్యక్తి తన వృత్తి ధర్మములను త్యజించి, పూర్తిగా భక్తిలోనే నిమగ్నమవ్వటం తప్పు కాదు. ఎందుకంటే, అదే అప్పుడు అతని సహజ స్వ-ధర్మమమవుతుంది. శ్రవణం, కీర్తనం, మరియు భగవత్ లీలలపై ధ్యానముచే, భక్తి అంటే, అభిరుచి వృద్ధి చెందనంత వరకూ, మనం మనకు విధింపబడిన వృత్తి ధర్మములను నిర్వర్తిస్తూనే ఉండాలి.
03:24 - సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ ।
సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః ।। 48 ।।
ఓ కుంతీ పుత్రా, తన సహజ సిద్ధ స్వభావంచే జనితమైన కర్తవ్యములను, వాటిలో దోషాలున్నా సరే, వాటిని వ్యక్తి ఎన్నటికీ విడిచి పెట్టరాదు. అగ్ని పొగచే కప్పివేయబడినట్లు, నిజానికి సమస్త కర్మ ప్రయాసలూ, ఏదో ఒక దోషముచే ఆవరింపబడి ఉంటాయి.
ఏదో దోషము చూడటం వలన జనులు కొన్నిసార్లు, తమ కర్తవ్యము నుండి వెనుతిరుగుతారు. అగ్నిపై సహజంగానే పొగ ఆవరింపబడి ఉన్నట్టు, ఏ పని కూడా సంపూర్ణ దోషరహితముగా ఉండదని, ఇక్కడ శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. ఉదాహరణకి, కోట్లాది సూక్ష్మ క్రిములను చంపకుండా, మనం శ్వాస కూడా తీసుకోలేము. ఒకవేళ నేల దున్ని వ్యవసాయం చేస్తే, అసంఖ్యాకమైన సూక్ష్మ జీవులను నాశనం చేస్తాము. వ్యాపారంలో పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తే, ఇతరులకు సంపద లేకుండా చేస్తాము. ఒకవేళ మనం భుజిస్తే, ఇంకొకరికి ఆహరం లేకుండా చేసినట్టవుతుంది. స్వ-ధర్మము అంటే, కార్యకలాపాలు చేయటం కాబట్టి, అది సంపూర్ణ దోషరహితముగా ఉండజాలదు. కానీ, స్వ-ధర్మ పాలన యొక్క ప్రయోజనాలు, దాని దోషములకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. అన్నింటికన్నా ముఖ్య ప్రయోజనం ఏమిటంటే, అది మనుష్యులకు, తమ పరిశుద్ధికీ, మరియు ఉన్నతికీ ఒక సహజమైన అనాయాస మార్గమును అందిస్తుంది. శ్రీ కృష్ణుడు అర్జునుడితో - తన స్వభావానికి బాగా సరిపోయే పనిని విడిచి పెట్టవద్దని అంటున్నాడు. దానిలో దోషములున్నాసరే, తన సహజమైన స్వభావానికి అనుగుణంగా కర్మలు చేయమంటున్నాడు.
ఎవరి బుద్ధి అంతటా అనాసక్తిగా ఉంటుందో, ఎవరు మనస్సును జయించారో, మరియు సన్న్యాస అభ్యాసముచే కోరికలను త్యజించారో, వారు శ్రేష్ఠమైన నైష్కర్మ్య సిద్ధిని పొందుతారు.
శ్రీ కృష్ణుడు గతంలో, కేవలం జీవిత బాధ్యతల నుండి పారిపోవటం సన్న్యాసము కాదు, అది త్యాగము కూడా కాదని, అర్జునుడికి చెప్పి ఉన్నాడు. ఇక ఇప్పుడు కర్మ రహిత స్థితి, అంటే, నైష్కర్మ్య-సిద్ధి స్థితిని వివరిస్తున్నాడు. నిరంతరం మారుతున్న ప్రపంచం యొక్క స్థితి గతుల మధ్యకూడా, మనలను మనమే ప్రపంచ సంఘటనలు, పరిణామాలకు దూరంగా, ఆసక్తి రహితముగా ఉంచుకుని, కేవలం మన కర్తవ్య నిర్వహణ పట్ల మాత్రమే ధ్యాస ఉంచటం ద్వారా, ఈ నైష్కర్మ్య -సిద్ధి స్థితిని సాధించవచ్చు. ఇది ఎలాగంటే, ఒక వంతెన క్రింది నుండి, నీరు ఒకవైపునుండి వచ్చి, ఇంకొక వైపు నుండి వెళ్ళిపోవటం లాంటిది. ఆ వంతెన ఆ నీటిని తీసుకోదు, లేదా నీటిని సరఫరా చేయదు; ఆ నీటి ప్రవాహంచే ఏమాత్రం ప్రభావితం కాదు. అదే విధంగా, కర్మయోగులు తమ కర్తవ్యాన్ని చేస్తుంటారు.. కానీ, నిరంతరం జరిగే పరిణామాల పట్ల ఉదాసీనంగా ఉంటారు. భగవదారాధన లాగా, వారు తమ కర్తవ్య నిర్వహణలో చక్కటి పరిశ్రమ చేస్తారు. కానీ, అంతిమ ఫలితాన్ని ఆ భగవంతునికే వదిలేస్తారు. తద్వారా వారు ఎల్లప్పుడూ తృప్తితో, మరియు ఏది జరిగినా ప్రశాంతంగానే ఉంటారు. దీనిని వివరించటానికి, ఒక చక్కటి కథ ఉంది. ఒకాయనకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మొదటి అమ్మాయికి ఒక రైతుతో వివాహమయ్యింది. రెండవ అమ్మాయికి, ఒక ఇటుకబట్టి యజమానితో వివాహమయ్యింది. ఒకరోజు ఆ తండ్రి మొదటి అమ్మాయికి ఫోన్ చేసి, ఎలా ఉందో కనుక్కున్నాడు. ‘నాన్నా, మేము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము. మంచి వర్షాలు పడాలని మాకోసం దేవుణ్ణి ప్రార్ధించు.’ అని అన్నదామె. తరువాత ఆయన రెండవ అమ్మాయికి ఫోన్ చేశాడు.. ‘నాన్నా, మాకు వ్యాపారం బాగాలేదు, ఈ సంవత్సరం వానలు పడొద్దని దయచేసి దేవుణ్ణి ప్రార్థించు. బాగా ఎండ కాస్తే, మాకు మంచి ఇటుకల ఉత్పత్తి జరుగుతుంది.’ అని అన్నదామె. తండ్రి తన కూతుర్ల నుండి విరుద్ధమైన విన్నపాలు విని, ‘ఏది మంచో, ఏది సరియైనదో, ఆ భగవంతునికే తెలుసు.. ఆయననే చేయనీ" అని అనుకున్నాడు. ఈశ్వర సంకల్పానికి ఇటువంటి శరణాగతి అనేది, ప్రపంచంలో నిరంతరం జరిగే వ్యవహారములలో తలమునకలై ఉన్నా, వాటివాటి ఫలితములపట్ల అనాసక్తిని కలుగచేస్తుంది.
08:06 - సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే ।
సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా ।। 50 ।।
ఓ అర్జునా, పరిపూర్ణ సిద్ధిని పొందిన వ్యక్తి ఏ విధముగా, అలౌకిక ఆధ్యాత్మిక జ్ఞానము యందే స్థితమై ఉండటం ద్వారా, బ్రహ్మమును కూడా ఎలా పొందగలడో వివరిస్తాను. నా నుండి క్లుప్తముగా వినుము.
పుస్తక జ్ఞానాన్ని చదవటం ఒక ఎత్తయితే, ఆ జ్ఞానాన్ని ఆచరణలో, అనుభవపూర్వకంగా తెలుసుకోవటం మరో ఎత్తు. మంచి ఆలోచనలు ఎన్ని ఉన్నా, వాటిని ఆచరణలో పెట్టకపోతే, అన్నీ వ్యర్థమే. పుస్తక జ్ఞానం ఉన్న పండితులకు బుర్రలో సర్వ శాస్త్రముల జ్ఞానం ఉంటుంది కానీ, వాటి విజ్ఞానం అవగతం కాకపోవచ్చు. మరోపక్క, కర్మ యోగులకు ప్రతినిత్యం, శాస్త్ర సత్యాలను ఆచరణలో అభ్యాసం చేసే అవకాశాలు వస్తుంటాయి. అందుకే, కర్మ యోగము యొక్క నిరంతర అభ్యాసము, మనకు ఆధ్యాత్మిక జ్ఞానమును హృదయములో విజ్ఞానముగా వికసింపచేస్తుంది. ఎప్పుడైతే వ్యక్తి నైష్కర్మ్య సిద్ధితో, అంటే పని చేస్తూ కూడా కర్మ రహితముగా ఉండగలడో, అప్పుడు అలౌకిక ఆధ్యాత్మిక జ్ఞానము, నిజమైన అనుభవంగా తెలుస్తుంది. ఆ జ్ఞానంలో స్థితమై ఉన్నప్పుడు, కర్మ యోగి భగవత్ ప్రాప్తిలో పరిపూర్ణతను సాధిస్తాడు.
09:31 - ఇక మన తదుపరి వీడియోలో, పరమ సత్యమును బ్రహ్మము రూపంలో, అనుభవపూర్వకంగా నేర్చుకోవటం ఎలాగో, శ్రీ కృష్ణుడి వివరణలో తెలుసుకుందాము..