Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Monday, December 30, 2024

BARBARIK the Ancient Indian AI Robot బర్బరీకుడు! - 18 రోజుల మహాభారత యుద్ధాన్ని ఒక్కడే ఒకే నిమిషంలో ముగించగల పాండవ వీరుడి మరణాన్ని కృష్ణుడు ఎందుకు కోరాడు?


18 రోజుల మహాభారత యుద్ధాన్ని ఒక్కడే ఒకే నిమిషంలో ముగించగల పాండవ వీరుడి మరణాన్ని కృష్ణుడు ఎందుకు కోరాడు? TELUGU VOICE

ఒకే ఒక్క నిముషంలో కురుక్షేత్ర యుద్ధాన్ని ముగించ‌గ‌ల వీరుడూ, అభిమన్యుడికంటే చిన్నవాడైనా, భీమార్జునులను మించిన మహాయోధుడూ, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న బర్బరీకుడు. మరి అంతటి మహావీరుడిని, పైగా పాండవుల సంతతికి చెందినవాడిని, పాండవ పక్షపాతిగా ముదరింపబడిన శ్రీకృష్ణుడు  ఎందుకు వధించాడు? తన తలను శ్రీ కృష్ణుడికి సమర్పించి ప్రాణ త్యాగం చేసికూడా, బ‌ర్బరీకుడు అమ‌రుడెలా అయ్యాడు? కృష్ణ పరమాత్ముడి చేత వధింపడిన అతడు, ‘ఖాటూశ్యాం బాబా’గా భారతదేశంలో పూజలు అందుకోవడం ఏమిటి? అసలు ఎవరీ బర్బరీకుడు? అత‌ని చరిత్రేమిటి? మహా భారతంలో బర్బరీకుడి చావుకూ, అతని ముందు జన్మకూ ఉన్న కర్మ బంధం ఏమిటి? వంటి అనేక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/fgnxOIlHXL0 ]


నేటికి సుమారు 1000 సంవత్సరాల క్రితం, అంటే, సామాన్య శకం 1027 వ సంవత్సరంలో, రాజస్థాన్ లోని ఒక ప్రాంతంలో ఒక ఆవు ప్రతి రోజూ వచ్చి, ఎవరి ప్రమేయమూ లేకుండా తనంత తానుగా ఒక చోట తన పొదుగునుండి పాలను ధారగా విడిచేది. అది గమనించిన స్థానికులు అక్కడ త్రవ్వకాలు జరపగా, సుమారు 30 అడుగుల లోతున‌ లోహంతో చేయబడిన ఒక పేటిక లభించింది. గాలి కూడా చొర‌బ‌డ‌లేనంత ప‌క‌డ్బందీగా మూయబడి ఉందది. ఆ పేటికపై "బర్బరీక" అని వ్రాయబడి ఉంది. దానిని తెరిచి చూడ‌గా, అందులో వారికి ఒక మానవ కపాలం క‌నిపించింది. అది మామూలు పుర్రెల మాదిరిగా ఎముకలతో కాక, ఒక రకమైన లోహంతో నిర్మితమైనట్లుగా అనిపించింది వారికి. ఆ పుర్రెలోని క‌ళ్ళు చెక్కు చెదరకుండా, మ‌నిషి క‌ళ్లలాగే ఉన్నాయి. దానిని చూసిన స్థానికులు బిత్తరపోయి, వెంటనే ఆ విషయాన్ని నాటి రాజు రూప్ సింగ్ చౌహన్ కు తెలియజేశారు. ఆసక్తి కలిగిన రాజు వివరాలు తెలుసుకోగోరాడు. దక్షిణాదినుంచి వచ్చిన ఒక పండితుడు, బ‌ర్బరీకుని చ‌రిత్రను రాజుకు వివ‌రించాడు.

బర్బరీకుడు ‌సాధారణ వ్యక్తి కాదు. ధర్మపరులూ, దైవాంశ సంభూతులూ అయిన పాండ‌వ వంశీయుడూ, సాక్ష్యాత్తూ భీముడి మ‌నుమడూ, స్వయానా ఘటోత్కచుడూ, మౌర్విలకు కలిగిన సంతాన‌మే బర్బరీకుడు. అమిత బలసంపన్నుడైన బర్బరీకుడు, పసివయస్సులోనే యుద్ధ విద్యలలో ఆరి తేరాడు. అతడి తల్లి మౌర్వే, బ‌ర్బరీకుడికి సకల విద్యలూ నేర్పింది. ఒకానొక సమయంలో విజయుడు దేవీ దీక్షను నిరాటంకంగా ముగించ‌డానికి బ‌ర్బరీకుడు స‌హాయం చేయ‌గా, అతడు చేసిన స‌హాయానికి కృతజ్ఞతగా యజ్ఞ భస్మాన్ని ఇచ్చి, దానిని శత్రువుల పై జల్లితే వారు భస్మమ‌వుతారని దీవించాడు విజయుడు. కానీ, ప్రతిఫలాపేక్షతో తాను ఆ పని చేయలేదని చెప్పి, బర్బరీకుడు ఆ భస్మాన్ని తిరస్కరించాడు. ఆ స‌మ‌యంలో ఆకాశవాణి, రాబోయే కాలంలో కౌరవులు, పాండవుల మధ్య జరగబోయే కురుక్షేత్ర సంగ్రామాన్ని గురించి చెప్పి, ఆ భస్మం కౌరవుల హస్తగతమయితే, ధర్మపరులైన పాండవ నాశ‌నానికి వినియోగిస్తారు గనుక, అది అతడి ద‌గ్గర ఉండ‌డ‌మే లోక శ్రేయ‌స్కరమని తెలిపింది. అలా సిద్ధి వలన భస్మాన్ని పొందాడు కాబట్టి, బర్బరీకుడిని 'సిద్ద సేనుడ'ని కూడా పిలిచేవారు. అలాగే ఒకానొక సందర్భంలో తెలియక భీముడితో యుద్ధం చేసి ఓడించి, సంహరింప జూసిన సమయంలో, పరమేశ్వరుడు ప్రత్యక్షమై బర్బరీకుడిని వారించి, వారి మధ్య ఉన్న రక్త సంబంధం గురించి తెలియజేశాడు. ప‌శ్చాత్తప్త హృద‌యంతో బర్బరీకుడు ప్రాణ‌త్యాగం చేయ‌బోగా, పరమేశ్వరుడు అడ్డుకుని స‌ర్ది చెప్పాడు. స్పృహలోకి వచ్చిన భీముడు, ప‌రాక్రమ‌వంతుడైన బర్బరీకుడు స్వయానా తన మనుమ‌డ‌ని తెలుసుకుని అక్కున చేర్చుకున్నాడు. ఆ తరువాత బర్బరీకుడు చేసిన ఘోర తప‌స్సుకు మెచ్చిన శివుడు, మూడు అమిత శక్తివంతమైన బాణాలను అతడికి ప్రసాదించాడు.

కురుక్షేత్ర సమరం ఆరంభమవుతున్న తరుణంలో, తాను ఎవరి ప్రక్కన నిల‌బ‌డాలని బర్బరీకుడు తల్లిని అడుగగా, బలహీనుల పక్షాన పోరాడమని చెప్పిందామె. తల్లి మాట మేర‌కు పాండవుల తరుపున యుద్ధం చేయడానికి సిద్ధ పడ్డాడు బ‌ర్బరీకుడు. ఒకనాడు పాండవుల మధ్య, కురుక్షేత్ర యుద్ధం ఎవరు ఎన్ని రోజులలో ముగించగలరనే చర్చ రాగా, భీముడు 20 రోజులూ, అర్జునుడు 28 రోజులూ, ఇలా ఒకొక్కరు ఒకొక్క స‌మాధానం చెప్పారు. బర్బరీకుడు మాత్రం, ఒక్క నిముషంలోనే యుద్ధం ముగిస్తానని చెప్పి అంద‌రినీ ఆశ్చర్యప‌రిచాడు. కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనడానికి సిద్ధమవుతున్న బ‌ర్బరీకుడి ద‌గ్గర‌కు, అతడిని పరీక్షించదలచిన శ్రీ కృష్ణుడు మారువేషంలో ఒక బ్రాహ్మణుడిలా వెళ్లాడు. అతడి దగ్గరున్న అస్త్రాలను గురించి అడుగగా, శివుడు తనకు ప్రసాదించిన మూడు బాణాలను చూపించాడు, బర్బరీకుడు. వాటిని చూసి మాయా శ్రీ కృష్ణుడు నవ్వి, మూడు బాణాలతో కురుక్షేత్ర యుద్ధాన్ని ఎలా ముగించగలవని అడిగాడు. ఒక బాణం శత్రువులను, రెండవది మిత్రులనూ గుర్తిస్తుంది. మూడవ‌ది, ఆ గుర్తించిన శత్రువులను హతమారుస్తుందని వివ‌రించాడు, బర్బరీకుడు. ఆ బాణాల గొప్పద‌నం తనకు చూపించమ‌న్నాడు, బ్రాహ్మణుడి రూపంలో ఉన్న శ్రీ కృష్ణుడు. బర్బరీకుడు త‌న అస్త్రాన్ని ఒక చెట్టు ఆకులకు సంధించ‌గా, అది ఆ చెట్టు ఆకులన్నింటినీ ఛిద్రం చేసి, శ్రీ కృష్ణుని కాలి చుట్టూ తిరుగ‌డం మొద‌లుపెట్టింది. అప్పుడు బర్బరీకుడు, ‘మహానుభావా.. మీ కాలి క్రింద ఒక ఆకు ఉండిపోయినట్లు ఉంది. దానిని ఛేదించనిదే, నా బాణం వెనుకకు రాదు. దయచేసి మీ పాదాన్ని ప్రక్కకు జరపండ’ని కోరగా, శ్రీ కృష్ణుడు త‌న కాలిని తీసిన వెంట‌నే ఆ ఆకును ఛేదించి, తిరిగి బర్బరీకుని అమ్ముల పొదిలోకి చేరిందది.

‘నీ తల్లి నిన్ను బలహీన పక్షాన యుద్ధం చేయమని అన్నది కదా? నీవు ఎవరి ప‌క్షాన‌ పోరాడబోతున్నావ’ని, ఏమీ తెలియనివాడిలా బర్బరీకుని అడిగాడు మాయా కృష్ణుడు. త‌న త‌ల్లితో ర‌హ‌స్యంగా చ‌ర్చించిన విష‌యం కూడా తెలిసిన ఆ వ్యక్తి సామాన్యుడు కాద‌ని గ్రహించి, తన నిజ స్వరూపం చూపించమని కోరాడు, బర్బరీకుడు. సాక్ష్యాత్తు శ్రీ కృష్ణుడిని దర్శించిన బర్బరీకుడు అమితానంద భరితుడై, ‘మీ కోరిక ఎటువంటిదైనా తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాన’ని వాగ్దానం చేశాడు. ‘నీవు ఏ పక్షాన చేరితే అది బలపడుతుంది. నీ తల్లి మాట ప్రకారం, మళ్ళీ నీవు బలహీన పక్షానికి మారాలి. అది లోక శ్రేయస్కరం కాదు. లోక క‌ల్యాణార్థం నీ శిర‌స్సును నాక‌ర్పించి, నువ్వు నాకిచ్చిన మాటను నిల‌బెట్టుకో’ అన్న శ్రీ కృష్ణుడి మాట‌ల‌కు సంతోషంగా అంగీక‌రించాడు బర్బరీకుడు. తనకు సంగ్రామంలో పాల్గొనే అవకాశం లేకపోయినా, చివరిదాకా చూసే అదృష్టాన్ని ప్రసాదించమని, త‌న తుది కోరిక‌గా ప్రార్థించి, తన శిరస్సును తానే ఖండించుకున్నాడు. శ్రీకృష్ణుడు బర్బరీకుడి తలను ఒక ఎత్తైన‌ పర్వత శిఖరంపై నిలబెట్టించి, మహా భారత సంగ్రామాన్ని ఆద్యంతం తిలకించే ఏర్పాటు చేయించాడు.

మహాభారత యుద్ధానంతరం, ఎవరు ఎంత మందిని చంపివుంటారన్న చర్చ మొదలై శ్రీకృష్ణుడిని అడుగగా, తాను కూడా యుద్ధంలో పాల్గోన‌డం వల్ల గమనించలేదనీ, ఆద్యంతం వీక్షించిన బర్బరీకుని శిరస్సునడగమనీ చెప్పాడు, శ్రీకృష్ణుడు. ‘వారిలో ఎవరూ ఎవరినీ చంపినట్లుగా తనకు కనిపించలేదనీ, అందరినీ శ్రీ కృష్ణుని చక్రాయుధమే సంహ‌రించిన‌ట్లు తనకు గోచరించింద’నీ చెప్పాడు బ‌ర్బరీకుడు. గీతలో గీతాచార్యుడు చెప్పిన‌ట్లుగా, ‘చంపేదీ, చంపించేదీ, సమస్తాన్నీ న‌డిపించేదీ ఆ ప‌ర‌మాత్ముడే’న‌ని అందరికీ తేటతెల్లమయ్యింది మరోసారి.

కురుక్షేత్ర సంగ్రామం తరువాత బర్బరీకుడి తలను పెట్టెలో భద్రపరచి రూపవతీ న‌దిలో విడిచారు. కాలగమనంలో నేడు లభించినదదేనని, దక్షిణాదినుంచి వచ్చిన పండితుడు రూప్ సింగ్ చౌహన్ మహారాజుకు వివ‌రించాడు. ఆ పెట్టె దొరికిన ‘ఖాటూశ్యాం’ అనే ఊరిలోనే బ‌ర్బరీకుని పుర్రెను ప్రతిష్ఠించి, మందిరాన్ని స్థాపించారు. ఆ గుడి ప్రాంగణంలోనే ‘రూప్ కుండ్’ అనే పేరుతో ఒక కోనేటిని నిర్మించారు. అందులో స్నానం చేస్తే శుభాలు కలుగుతాయని స్థానికుల నమ్మిక. ద్వాపరయుగంలో ప్రాణత్యాగం చేసిన బ‌ర్బరీకుడి తల ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండ‌డంతో, అందులోని శ‌క్తులు అలాగే ఉన్నాయ‌న్న నమ్మికతో, భక్తులు ఆయ‌న‌ను దైవాంశ సంభూతునిగా నేటికీ కొలుస్తున్నారు.

ఇక అంతటి మహావీరుడైన బర్బరీకుడు, శ్రీ కృష్ణుడి ఉపాయంతో అర్ధాంతరంగా ప్రాణత్యాగం చేయాల్సిన పరిస్థితికి, అతడు ముందు జన్మలో చేసిన ఓ తప్పు కారణమనే విషయం, చాలా మందికి తెలియకపోవచ్చు. అతడి ముందు జన్మ గురించిన ప్రస్థావన, వ్యాస విరచిత జయకావ్యంలో ఎక్కడా లేక పోయినా, స్కాంద పురాణంలో పేర్కొన బడినట్లు పౌరాణికులు చెబుతున్నారు. దాని ప్రకారం, భూమిపై మానవుల మనుగడ సక్రమంగా సాగటానికి, రాక్షస సంహారం తప్పదని తెలిసన దేవతలు, యుగయుగాలుగా వారు తలపెట్టిన ధర్మ కార్యాలను నిర్విరామంగా పూర్తి చేసుకుంటూ వచ్చారు. ఆ విధంగా త్రేతాయుగం వచ్చేటప్పటకి, రాముడు రావణ సంహారం చేసే సమయంలో, నాడు భూమిపై ఉన్న ఎన్నో రాక్షస జాతులను సమూలంగా నాశనం చేశాడు. దానితో మానవ ప్రగతికి దారులు సుగమంకావటంతో పాటు, నాడు ఉన్న జ్ఞాన సంపదను అందిపుచ్చుకుని, రాజులు మరింత శక్తి వంతులయ్యారు. రామ రావణ యుద్ధంలో బ్రతికి బట్టగట్టిన అతి కొద్ది మంది రాక్షసులను కూడా రాజులు దాదాపుగా అంతం చేసేశారు. తమకిక అడ్డు అదుపు లేదని గ్రహించిన నాటి మానవులు, ముఖ్యంగా రాజులు, అధర్మం వైపుకు మొగ్గు చూపడం మొదలయ్యింది. ఇది గమనించిన దేవతలూ, గంధర్వులూ, యక్షులూ, భూమిపై నాడున్న పరిస్థితి అలాగే కొనసాగితే, సమస్త జీవకోటి అంతమయ్యే అవకాశం ఉందని చర్చించుకుని, ఆ విషయం బ్రహ్మ దేవుడికి నివేదించారు.

దేవతలు చెప్పిన మాటలు విని, తనకు భూమిపై జరుగుతున్న పరిణామాలు తెలుస్తున్నాయనీ, ఆ సమస్యకు పరిష్కారం కేవలం ఆ శ్రీ మహా విష్ణువే చూపిస్తాడానీ చతుర్ముఖుడన్నాడు. అనుకున్నదే తడవుగా దేవతలూ, గధర్వులూ, యక్షులతో సహా, బ్రహ్మ దేవుడు కూడా వైకుంఠానికి వెళ్ళి, విష్ణు మూర్తికి భూమిపై జరుగుతున్న పరిణామాలు తెలియజేసి, ఆ సమస్యకు పరిష్కారం చూపించమని వేడుకున్నారు. భూమండలంపై ప్రక్షాళన కార్యక్రమానికి తానే స్వయంగా మానవ జన్మ ఎత్తి, కరుక్షేత్ర సంగ్రామంతో అనుకున్న పనిని పూర్తి చేస్తానని తెలియజేశాడు, శ్రీ మహా విష్ణువు.

ఆ మాటలు విన్న వారందరూ హర్షించారు. కానీ, వారిలో ఒక యక్షుడు వెంటనే, ‘ఈ మాత్రం దానికి సాక్ష్యత్తు విష్ణు మూర్తే అవతారం ఎత్తడం అవసరమా? తుచ్ఛ మానవులను సంహరించడానికి తానొక్కడే సరిపోతాన’ని పొగరుగా అన్నాడు. అది విన్న బ్రహ్మ దేవుడికి కోపం వచ్చి, “భూమిపై ఉన్న దుష్టులనందరినీ సంహరించాలంటే, దేవతలకు పెద్ద పని కాకపోవచ్చు. కానీ, ధర్మ సంస్థాపన చేయడం, సాధారణ విషయం కాదు. యక్షుడవై ఉండి, అటువంటి ధర్మ సూక్ష్మాలు గ్రహించలేక, సాక్ష్యత్తు శ్రీ మహా విష్ణువు ముందు ఇలాంటి మాటలు మాట్లాడటం సముచితంకాదు. ఈ తప్పిదానికి నీవు మానవ జన్మ ఎత్తి, దుష్టులను సంహరించే అవకాశం వచ్చినప్పుడు, ముందుగా నీవే ప్రాణత్యాగం చేస్తావు” అని శపించాడు. ఆ విధంగా బ్రహ్మ దేవుడి శాపం పొంది, ఆ యక్షుడు బర్బరీకుడిగా జన్మించడం, సరిగ్గా కురుక్షేత్ర సంగ్రామానికి ముందు కృష్ణుడికి ఎదురుపడి, రణరంగానికి బలిగా మారిన ఘటనలు, మనం ఇదివరకు చెప్పుకున్నవే.

ఇక మరోకోణంలో, బర్బరీకుడు భీముడి మనుమ‌డు కాద‌నే వాదనా లేకపోలేదు. అతడు భీముడి మనుమ‌డైతే, వ్యాస‌ భారతంలో ఆ వివ‌ర‌ణ‌ ఉండి ఉండేద‌‌ని వారి భావన. బర్బరీకుడు కేవలం మానవాతీత శక్తులు కలిగిన ఒక మహావీరుడు మాత్రమేన‌నీ, శ్రీ కృష్ణుడు పాండవులను కాపాడటానికే, అత‌డిని యుద్ధంలో పాల్గొనకుండా వారించి, అతడి తలను ఒక యంత్రంలా వాడి, కురుక్షేత్ర యుద్ధ ఘట్టాలను అతడి మెద‌డులో భద్రపరిచి ఉండవచ్చనీ వారి అభిప్రాయం. కురుక్షేత్రానికి ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్న సంజయుడు, ధృతరాష్ట్రుడూ, గాంధారిలకు యుద్ధ విశేషాలను ఎలా వివరించి ఉంటాడు? బహుశా బర్బరీకుడు తన అద్భుత శక్తులతో మహాభారత యుద్ధాన్ని వీక్షిస్తూ, వేరే ప్రదేశాలలో ఉన్న వ్యక్తులకు ప్రసరింపజేసే వాడేమో! ఏది ఏమయినప్పటికీ బ‌ర్బరీకుడి తలలో మహాభారత యుద్ధ ఘ‌ట్టాలన్నీ నిక్షిప్తమై ఉన్నట్లుగా భావించ‌వ‌చ్చు.

🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏

Thursday, December 26, 2024

హరిహర 108 నామాలు.. యమధర్మరాజ కృతం.. Harihara Ashtottara Shatanama Stotram


హరిహర 108 నామాలు.. యమధర్మరాజ కృతం.. TELUGU VOICE
హరిహర అష్టోత్తర శతనామ స్తోత్రమ్ - Harihara Ashtottara Shatanama Stotram

108 శివకేశవుల నామాలు జీవితంలో ఒక్కసారైనా పఠిస్తే, యమధర్మరాజు నుంచి విముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అదీ ముఖ్యంగా వారణాసికి వెళ్లినప్పుడు, మణికర్ణిక తీర్థం వద్ద శివకేశవులను 108 నామాలతో స్తుతించిన వారికి ఇక నరక బాధలంటూ ఉండవని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా కార్తీక మాసంలో శివకేశవులను స్తుతించడం మాత్రమే చేయాలి.

గోవిన్ద మాధవ ముకున్ద హరే మురారే శంభో శివేశ శశిశేఖర శూలపాణే ||
దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి ||౧||

గఙ్గాధరాన్ధకరిపో హర నీలకణ్ఠ వైకుణ్ఠ కైటభరిపో కమఠాబ్జపాణే||
భుతేశ ఖణ్డపరశో మృడ చణ్డికేశ త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి ||౨ ||

విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే గౌరీపతే గిరిశ శఙ్కర చన్ద్రచూడ ||
నారాయణాసురనిబర్హణ శార్ఙ్గపాణే త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి ||౩||

మృత్యుఞ్జయోగ్ర విషమేక్షణ కామశత్రో శ్రీకాన్త పీతవసనాంబుద నీల శౌరే ||
ఈశాన కృత్తివసన త్రిదశైకనాథ త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి  ||౪||

లక్ష్మీపతే మధురిపో పురుషోత్తమాద్య శ్రీకణ్ఠ దిగ్వసన శాన్త పినాకపాణే ||
ఆనన్దకన్ద ధరణీధర పద్మనాభ త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి  ||౫||

సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ శఙ్ఖపాణే ||
త్ర్యక్షోరగాభరణ బాలమృగాఙ్కమౌలే త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి ||౬||

శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ ||
చాణూరమర్దన హృషీకపతే మురారే త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి ||౭||

శూలిన్ గిరీశ రజనీశ కలావతంస కంసప్రణాశన సనాతన కేశినాశ ||
భర్గ త్రినేత్ర భవ భూతపతే పురారే త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి ||౮||

గోపీపతే యదుపతే వసుదేవసూనో కర్పూరగౌర వృషభధ్వజ భాలనేత్ర ||
గోవర్ధనోద్ధరణ ధర్మధురీణ గోప త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి  ||౯||

స్థాణో త్రిలోచన పినాకధర స్మరారే కృష్ణానిరుద్ధ కమలాకర కల్మషారే ||
విశ్వేశ్వర త్రిపథగార్ద్రజటాకలాప త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి ||౧౦||

అష్టోత్తరాధికశతేన సుచారునామ్నాం సన్దర్భితాం లళితరత్నకదంబకేన ||
సన్నాయకాం దృఢగుణాం నిజకణ్ఠగతాం యః కుర్యాదిమాం స్రజమహో స యమం న పశ్యేత్ ||౧౧||

గణావూచతుః ||

ఇత్థం ద్విజేన్ద్ర నిజభృత్యగణాన్సదైవ సంశిక్షయేదవనిగాన్స హి ధర్మరాజః ||
అన్యేఽపి యే హరిహరాఙ్కధరా ధరాయాం తే దూరతః పునరహో పరివర్జనీయాః ||౧౨||

అగస్త్య ఉవాచ ||

యో ధర్మరాజరచితాం లళితప్రబన్ధాం నామావళిం సకలకల్మషబీజహన్త్రీమ్ ||
ధీరోఽత్ర కౌస్తుభభౄతః శశిభూషణస్య నిత్యం జపేత్స్తనరసం న పిబేత్స మాతుః ||౧౩||

ఇతి శ్రృణ్వన్కథాం రమ్యాం శివశర్మా ప్రియేఽనఘామ్ ||
ప్రహర్షవక్త్రః పురతో దదర్శ సరసీం పురీమ్ ||౧౪||

ఇతి హరిహరాష్టోత్తరశతనామస్తోత్రం సమ్పూర్ణమ్ ||

🚩 శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే 🙏

Monday, December 23, 2024

Shocking Facts About Shiva's Physical Appearance | శివుడి గురించి చాలామందికి తెలియని నమ్మలేని నిజాలు!


శివుడి గురించి చాలామందికి తెలియని నమ్మలేని నిజాలు!? TELUGU VOICE

ఆది మధ్యాంత రహితుడు, నిరాకారుడు, నిష్కళంకుడు, జటాజూట ధారి, నీలకంఠుడు, తినేత్రుడు, స్మశాన వాసి, కైలాస నివాసి, త్రిశూల ధరుడు అంటూ శత కోటి నామాలతో, అంతులేని సద్గుణాలు కలిగిన ఆ పరేమేశ్వరుడిని కొలుస్తూ ఉంటాము. స్వభావరీత్యా లయకారుడే అయినా భోళా శంకరుడు ఆ మహేశ్వరుడు. ఇలా వర్ణిస్తూ పోతే జీవిత కాలం సరిపోదు. మన వేద, పురాణ, ఇతిహాసాలలో, ఆ శివయ్య స్వభావం గురించీ, ఆయన రూపు రేఖల గురించీ ఎంతో వివరణ ఉంది. అందులో స్వామి ఎక్కువగా నాగుపామును మేడలో ధరించి, ఒంటికి పులి చర్మం కట్టుకుని, ఒళ్ళంతా చితాభస్మం పూసుకుని తిరుగుతాడనీ, లింగ రూప ప్రియుడనీ తెలిసిందే. అసలు ఆయన నిజ స్వరూపం ఎలాంటిది? ఆయన ఎంత ఎత్తు ఉంటాడు? ఆయనకి శివుడనే పేరెలా వచ్చింది? అసలు ఆయన మానవ రూపంలో ఉంటాడా? లేక గ్రహాంతర వాసిలా కనిపిస్తాడా? వంటి అనేక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/vPad4lqMF48 ]


మానవ మేధస్సు ఎంత వృద్ధి చెందినా, ఈ విశాల విశ్వాన్ని సృష్టించిందీ, నడిపించేదీ, అవసరమైతే లయం చేసి పునఃసృష్టి చేసేదీ, అంతులేని శక్తులు కలిగిన భగవంతుడేనని నమ్మక తప్పదు. ఆ నమ్మకానికి నిదర్శనంగా ఎన్నో సంఘటనలు జరిగాయని ఆధారాలతో సహా మన మహా ఋషులు, వివిధ గ్రంధాలలో పొందు పరిచారు. ఈ సమస్త సృష్టిలో నిండి ఉన్న శక్తి స్వభావాన్ని బట్టి, ఆ ఆది దేవుళ్లను గుర్తించి, వారి వారి స్వభావాలను గ్రంథస్థం చేశారు. అలా ఆది దేవుడైన పరమేశ్వరుడి గురించి తెలుసుకుని, యుగయుగాలుగా మానవులు ఆరాధిస్తున్నారు. ఈ ఆధునిక కాలంలో ఆ పరమేశ్వరుడి స్వరూపం, స్వభావం గురుంచీ చాలా మందిలో ఎన్నో సందేహాలు మెదులుతుంటాయి. అటువంటి సందేహాలకు సమాధానాలు మన వేదాలూ, పురాణాలూ, ఇతిహాసాలలో స్పష్టీకరించబడి ఉన్నాయని, ఆధ్యాత్మిక వేత్తలంటున్నారు.

దాని ప్రకారం ఆ పరమేశ్వరుడికి ఒక రూపం లేదనీ, ఆద్యంతయాలు లేని ఒక అపార శక్తి అనీ తెలుస్తోంది. Science చెప్పినా, మన శాస్త్రాలు చెప్పినా, ఆ అంతరీక్షం, కోటాను కోట్ల గ్రహాలూ, గ్రహ శకలాలూ, నక్షత్రాలూ, పాలపుంతలతో నిండి ఉంటుంది. అయితే, ఇవన్నీ కలిపి చూసినా, అంతేలేని అంతరిక్షంలో అవి కేవలం కొద్ది శాతాన్ని మాత్రమే ఆక్రమించుకున్నాయనీ, తక్కినదంతా ఏమీ లేని సూన్యమనీ తెలుస్తోంది. కానీ, సూన్యంలా కనబడే ఆ ప్రదేశంలో మానవ మేధస్సుకు అందని అపారమైన శక్తి దాగి ఉందనీ, ఆ శక్తినే ‘శివశక్తి’ అని అంటారనీ వేదాలలో ప్రస్థావించబడివుంది. మన వేద పురాణ ఇతిహాసాలన్నీ కట్టు కథలుగా, పుక్కిటి పురాణాలుగా కొట్టి పారేసే కుహనా మేధావులకు చెంప పెట్టులా, మన వేదాలలో ప్రస్తావించబడిన శివశక్తి స్వరూపానికి ఆధారాలను కనుగొన్న కొందరు శాస్త్రవేత్తలు, మన నమ్మకమే వాస్తవమని ఒప్పుకున్నారు.

ఏళ్ల తరబడీ ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్షం గురించి ఎన్నో పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో నేటి శాస్త్రవేత్తలు ఓ విషయాన్ని కనుగొన్నారు. దాని ప్రకారం అంతరిక్షంలో పాలపుంతలూ, గ్రహాలూ, నక్షత్రాలను మొత్తం కుప్పగా పోగేసినా, ఇంకా అంతులేని శూన్యం ఎంతో ఉందని గుర్తించారు. అయితే అది ఏమీ లేని శూన్యం కాదనీ, అక్కడ కంటికి కనపడని ఎదో శక్తి ఉందనీ గుర్తించారు. అలా కంటికి కనపడని శక్తులకు మన వారు కొన్ని పేర్లు పెట్టుకున్నారు. వాటిలో ముఖ్యంగా అణు శక్తీ, విధ్యుత్, అయాస్కాంత తరంగాల వంటివి చెప్పుకోదగినవి. ఆ కనపడని శక్తులను గుర్తించీ, వాటి గుణగణాలను గురించీ పాఠాలుగా మనం తెలుసుకుంటున్నాము. అయితే అంతులేని శూన్యంలో కనుగొనబడిన ఆ శక్తిని కొలిచే సాధనాలు తమవద్ద లేవనీ, అసలు ఆ శక్తి ఏంటో తమకు తెలియడం లేదనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ, లక్షల సంవత్సరాల క్రితం వ్రాయబడిన మన వేదాలలో ఆ శక్తిని గుర్తించి, దాని పేరు ‘శివశక్తి’ అని స్పష్టీకరించబడి ఉంది.

ఇదిలా ఉంటే, మన వేదాలలో చెప్పబడిన ఈ తత్వాలూ, తర్కాలూ, సామాన్యులకు సులభంగా అర్థంకావని గ్రహించిన మన మహర్షులు, ఎన్నో ఏళ్ల పాటు కఠోర తపస్సు చేసి, ఆ స్వామిని శరణు వేడారు. దానికి సంతోషించిన ఆ పరమేశ్వరుడు మానవ రూపంలో వారి మనో నేత్రాలకు దర్శనమిచ్చి, ఆ రూపాన్ని ప్రతిష్టించి చరితార్థులు కమ్మని చెప్పినట్లు, మన పురాణాలలో పేర్కొనబడివుంది. ఇదే క్రమంలో శివ పార్వతుల కళ్యాణాన్ని పరిశీలిస్తే, శివుడి రూపాన్ని గురించి స్పష్టంగా చెప్పబడిందని, ఆధ్యాత్మిక వేత్తలంటున్నారు. మన పురాణాల ప్రకారం, దక్ష ప్రజాపతి పుత్రిక అయిన సతీదేవి, పరమేశ్వరుడిని అనుదినం కొలుస్తూ, ఆయనను పెళ్లాడాలని అకుంఠిత దీక్ష బూనింది.

ఆమె వాంఛితార్ధం నెరవేర్చడానికి ఒకనాడు పరమేశ్వరుడు సతీ దేవిని చేపట్టడానికి, సపరివార సమేతంగా దక్ష ప్రజాపతి దగ్గరకు వచ్చాడు. ఒంటి నిండా చితా భస్మం పూసుకుని, మొల చుట్టూ అప్పుడే కాలం తీరి మృతిచెందిన ఏనుగు చర్మం చుట్టుకుని ఉన్న ఆయనను దక్షుడి భార్య చూసింది. చితా భస్మంతో, రక్తం కారుతున్న చర్మం చుట్టుకుని, మేడలో నాగుపామును ధరించిన శివయ్యనూ, అయన చుట్టూ వింత వింత శబ్దాలు చేస్తూ, ఎవరికీ అర్ధం కాని భాషలో మాట్లాడుతూ, భయంకరంగా ఉన్న ఆయన పరివారాన్నీ చూసి, భయంతో సొమ్మసిల్లి పడిపోయిందామె. దానితో సతి దేవి శివుడిని ప్రార్ధించింది. 'స్వామీ, తమరు ఎలా ఉన్నా నాకు పర్వాలేదు. కానీ, మీ తత్వం బోధపడని మా అమ్మ, మిగతా వారూ మీ రూపాన్ని చూసి భయపడుతున్నారు. అందుకే నా కోసం, ఈ ఒక్కసారికీ మీ రూపాన్ని మార్చుకోండి' అని ప్రార్ధించింది. సతీదేవి కోరికను మన్నించి, వెంటనే తన రూపాన్ని మార్చుకున్నాడు ఆ భోళాశంకరుడు. ముగ్ధమనోహరమైన రూపం, అత్యంత దృఢమైన శరీరం, గుర్రం ఎత్తు, లేదా ఇద్దరు స్త్రీల ఎత్తు కలిగి, మగ జాతిలోనే అత్యంత సుందరమైన వ్యక్తిగా మన పురాణాలలో వర్ణించబడివుంది.

పాదం నుంచి తల వరకూ చూసుకుంటే గుర్రాల ఎత్తు తొమ్మిదడుగుల వరకు ఉంటుంది. పురాణాల ప్రకారం, దక్ష ప్రజాపతి దక్షిణ భారత దేశ నివాసి. నాటి దక్షిణ భారత స్త్రీలు నాలుగున్నర నుంచి, ఐదు అడుగుల ఎత్తు మాత్రమే ఉండేవారని తెలుస్తోంది. ఈ లెక్కన కూడా శివుడు మానవ రూపం ధరించినప్పుడు, రమారమి తొమ్మిది అడుగుల ఎత్తు, అత్యంత దృఢమైన శరీరంతో ఉన్నాడని రూఢీ అవుతోంది. అంతేకాదు, శివ స్వరూపం గురించి ద్వాపర యుగంలో కూడా ప్రస్తావన ఉంది.

ద్వాపర యుగ పురుషుడైన శ్రీ కృష్ణుడు, కంస వధ తర్వాత మధురను పాలించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జనులు ధర్మ బద్ధంగా జీవించాలనీ, భక్తి మార్గంలో పయనించాలనీ చెబుతూ, ప్రతి రోజు వారితో మమేకమై, ఎంతో అద్భుతంగా నృత్యం చేస్తూ ఉండేవాడు శ్రీకృష్ణుడు. ఆ నృత్యం చూడటానికి రెండు కళ్ళూ చాలేవి కావనీ, అసలు వర్ణించనలవి కాదనీ చెప్పుకునేవారు. ఆ మాట ఆ నోటా ఈ నోటా పడి కైలాసంలో తపస్సు చేసుకుంటున్న శివుడి చెవులకు చేరింది. ఆ నృత్యం ఎలా ఉంటుందో కళ్లారా చూడాలని భావించిన శివుడు, యమునా నది సమీపానికి మానవ రూపంలో వచ్చాడు. ఆ నదీ తీరంలో పడవ నడుపుకునే ఓ వ్యక్తి దగ్గరకు వెళ్లి, తనను తీరం దాటించమని కోరాడు. తొమ్మిది అడుగుల పొడవు, బలమైన శారీరంతో, ఒంటి నిండా చితా భస్మ లేపనం, చర్మాంబరధారి అయిన శివయ్యను చూసి ఆశ్చర్యపోయాడు, ఆ పడవ నడుపుకునే వ్యక్తి. అంత వింత స్వరూపంతో ఎక్కడికి వెళుతున్నారని అడిగాడు. దానికి కృష్ణ నృత్యం చూడటానికి వెళ్తున్నట్లు, స్వామి చెప్పాడు.

'నువ్వు ఈ రూపంలో వెళితే ఎవ్వరూ నిన్ను లోపలకి రానీయరు. అయితే కృష్ణ పరంధాముడి నృత్యం చూడాలని అంటున్నావు గనుక, మా ఆవిడ బట్టలను ఇస్తాను. వాటిని ధరించి, కాస్త సౌమ్యమైన స్త్రీ వేషంలో అక్కడికి వేళ్ళు. నీకు వెంటనే ప్రవేశం దొరుకుతుంది' అని చెప్పాడు. దానికి అంగీకరించాడు శివుడు. కానీ, ఆ పడవ నడుపుకునే వ్యక్తి కడు బీదరికంలో ఉండడంతో, అతని భార్య వద్ద తను ధరించి ఉన్న ఒక్క చీర మాత్రమే ఉంది. పరోపకారమే మాధవ సేవ అని బలంగా నమ్మే ఆ భార్య భర్తలు ఏమీ ఆలోచించకుండా శివయ్యకు సహాయం చేస్తానని చెప్పడంతో, వెంటనే అతని భార్య గుడిసెలోకి వెళ్లి, తన ధరించి ఉన్న చీరనే విప్పి, భర్త ద్వారా ఆ చీరను స్వామికి ఇస్తే, ఆ స్వామి దానం తీసుకుంటున్నట్లు ఆ చీరను స్వీకరించి, అదే వస్త్రాన్ని ధరించి, కృష్ణ పరంధాముడి నృత్యం చూడటానికి వెళ్ళాడు. అంత పేదరికంలోనూ, లేదనకుండా వారు చేసిన సహాయానికి మెచ్చిన శివయ్య కరుణా కటాక్షాలను పొంది, ఆ భార్యాభర్తలు ఐశ్వర్యవంతులవ్వడమే కాకుండా, అంత్య కాలంలో మోక్షగతులు పొందినట్లు పురాణ విదితం. ఈ సంఘట ద్వారా స్వామి స్వరూప వివరణ మరో మారు తెలియవస్తుందని పౌరాణికులు చెబుతున్నారు.

శుభం భూయాత్!

Monday, December 16, 2024

జంతుబలి! Pashu Bali - Animal Sacrifice: Ritual Mystification and Mythical Demystification in Hinduism


జంతుబలి! TELUGU VOICE
Animal Cruelty vs Religious Sacrifice - Is Animal Sacrifice an Ethical Act?

ఆది నుంచీ మానవుడు అవలంభిస్తున్న ఓ పద్ధతి ‘శక్తి ఆరాధన’. నేల, నీరు, నింగి, నిప్పు, వాయువు అనబడే పంచ భూతాలతో పాటు, సృష్టికి వెలుగునిచ్చే సూర్య చంద్రుల వంటి వాటిని కూడా అపూర్వ దైవ శక్తులుగా భావించి, అనాదిగా భూమిపై మనుగడ సాగించిన మానవులందరూ కొలిచే వారని చరిత్ర చెబుతోంది. కోరకుండానే మంచి చేసే ఆ దేవతలను సంతృప్తి పరిచేలా పూజలు చేసి వరాలడిగితే వాటిని వెంటనే తీరుస్తారనే నమ్మకం, రాను రాను మనుష్యులలో బలంగా నాటుకు పోయింది. ఈ క్రతువులోనే జంతు బలుల ప్రక్రియ పుట్టుకొచ్చినట్లు చరిత్రకారుల వాదన. ఈ మాట వినగానే మనకి గ్రామదేవతల ముందిచ్చే జంతుబలులు గుర్తుకు వస్తాయి. నేడు చాలా మంది జంతుబలి ఇవ్వకూడదనీ, అది అనాగరిక చర్య అనీ వాదించడం కూడా మనం వింటూ ఉంటాము. మరి అసలు జంతుబలి ఇవ్వవచ్చా? మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? అసలు గ్రామ దేవతలకే ఎక్కువగా జంతుబలులు ఎందుకు ఇస్తూ ఉంటారు? వంటి అనేక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/PzFTGZ3NNw0 ]


బలి అనగా దైవప్రీతి కోసం ఏదో ఒక జీవాన్ని చంపే ఒక క్రతువుగా మనకు తెలిసినదే. హిందూ మతంలో జంతు బలి ఆచారం, ఎక్కువగా వేద శ్రౌత ఆచారాలు, స్థానిక గిరిజన సంప్రదాయాలలో బలంగా పాతుకుపోయిన హిందూ జానపద ఆచారాలతో ముడిపడి ఉంది. అయినప్పటికీ జంతు బలులు భారత దేశంలోని పురాతన వైదిక మతంలో భాగంగా ఉన్నాయి. జంతుబలులనగానే, మన దేశంలోని గ్రామ దేవతలకు ఇచ్చే బలులు ముందుగా మనకు గుర్తుకు వస్తాయి. గురివింద గింజ తన క్రింద నలుపెరుగదన్నట్లు, ముక్క లేనిదే రోజూ ముద్ద దిగని పాశ్చాత్యులూ, Science పేరుతో వారు చెప్పే మాటలను గొర్రెలలా నమ్మి, నిజా నిజాలు తెలుసుకోకుండా మాట్లాడే మన కుహనా మేధావులూ, మన దేశంలో ఏ నాటినుంచో వస్తున్న సంప్రదాయాలను తప్పుగా చూపించడం ఫ్యాషన్ గా మారిపోయింది. అటువంటి వారి కోసమే కాకుండా, మన మందరమూ జంతుబలుల వెనుక ఉన్న అనేక వాస్తవాలను తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉంది. జంతుబలులనేవి, కేవలం హిందూ ధర్మం పాటించే వారే కాకుండా, ప్రపంచంలో ఉండే ఎన్నో ఇతర మతాల వారు కూడా నేటికీ పాటిస్తూనే ఉన్నారు. అలా అని, తక్కిన మతాల వారు జీవ హింస చేయటంలేదా? అంటే, దానికి సమాధానం ప్రతి ఒక్కరికీ తెలిసిందే.

ఇక మన దేశంలో కనపడే జంతు బలుల వెనుక చాలా పెద్ద కథే ఉంది. సంస్కృత భాషలో ‘బలి’ అంటే ఇవ్వటం అనే అర్ధం ఉంది. దేవతలకూ భూతగణాలకూ సమర్పించే ప్రసాదాన్ని కూడా ‘బలి’ అంటారు. దక్షిణ భారత దేశంలో కాస్త పెద్దగా ఉన్న ఏ ఆలయానికి వెళ్లినా, ఆ ఆలయం చుట్టూ చిన్న చిన్న రాళ్లను ఏర్పాటు చేసి, వాటిపై పెసరపప్పు, లేదా మినప్పప్పుతో వండిన అన్నాన్నిగానీ, లేదా పెరుగన్నాన్నిగానీ, సృష్టిలో ఉండే వివిధ గణాలను సంతృప్తి పరచడానికి, బలి అన్నంగా పెట్టడం ఆనవాయితీ. సాధారణంగా, మన కడుపులు నింపుకోవడం మనకి ఎంత ముఖ్యమో, ఈ సృష్టిలో జీవించే అన్ని జీవరాసుల కడుపులు నింపడం కూడా అంతే ముఖ్యమని, మన హైందవ ధర్మం చెబుతుంది. ఆ విధంగా దేవుడి పేరుచెప్పి, భూమిపై తిరిగే అనేక జీవరాశులకు ఈ బలి అన్నం ఆహారంగా పెట్టాలని, మన పెద్దల ఉద్దేశ్యం. ఇలా బలి అనే పద్ధతికి శ్రీకారం చుట్టారు మన పూర్వీకులు.

ఇక జంతుబలులు ఎందుకు ఇస్తారనే సందేహానికి కూడా మన వేదాలలో జవాబు ఉంది. సాధారణంగా మనకి ఎవరైనా ఏదైనా ఇస్తే, అందుకు కృతజ్ఞతగా వారికి తిరిగి ఏదైనా ఇవ్వడం మానవ సహజం. అలాగే, ఈ సృష్టిని ప్రారంభించి, అందులో మనలాంటి జీవరాశి మనుగడకు అవసరమయ్యే అన్ని వనరులనూ సమకూర్చిన ఆ దైవానికి కృతజ్ఞతగా మానవుడు, భక్తి పూర్వకంగా ప్రసాదం చేసి నివేదించడం, ముఖ్యంగా మన హైందవ ధర్మాన్ని పాటించే వారికి ఒక ఆచారంగా వస్తోంది. ఈ క్రమంలో ఆ దేవుడిని ఆర్ధికంగా బలపరచమనీ, మంచి నడవడికనూ, బుద్ధినీ ప్రసాదించమని కోరుకుంటూ ఉంటాము. ఈ సృష్టిలో ఒక్కో ప్రాణికి ఒక్కో గుణం ఉంటుంది. ఉదాహరణకు, కోడికి ఎక్కువగా భయపడే గుణం ఉంటుంది. గొర్రెలకు గుడ్డిగా ఎదుటి వాటిని నమ్మే గుణం ఉంటుంది. మేకలకు మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుందని విజ్ఞులు చెబుతారు. వాటన్నిటినీ దుర్గుణాలుగా ఎంచి, అటువంటి దుర్గుణాలు మానవుడి ఎదుగుదలకు అవరోధాలవుతాయని భావించి, వాటిని దేవుడికి బలిగా ఇస్తే, ఆయన మనకు మంచి గుణాలు ప్రసాదిస్తాడని వేదాలు చెబుతున్నాయి. అందువల్ల, మానవులలో ఉండే ఒక్కో అవలక్షణాన్నీ పోగొట్టుకోవడానికి, ఒక్కో విధమైన నియమ నిష్ఠలతో కొన్నేళ్ల పాటుండి, కొన్ని ద్రవ్యాలను భగవంతుడికి అర్పిస్తే, ఆయా లక్షణాలు పోయి మంచి గుణాలు అబ్బుతాయని, వేదాలలో స్పష్టీకరింపబడింది. ఆ విధంగా మొదలైన ఆచారాలూ, పద్దతులలో షార్ట్ కట్ ని పాటిస్తూ ముందుకు తెచ్చిన మరో పద్ధతే, ఈ జంతుబలులని పండితులంటున్నారు. కాల గమనంలో ఎన్నో పద్ధతులు పక్క దారులు పట్టినట్లు, ‘మనలోని జంతు ప్రవృత్తిని బలి ఇవ్వమని చెబితే, మనవారు ఆ జంతువులను బలి ఇవ్వడం మొదలు పెట్టినట్లు, పండితుల వాదన.

ఈ జంతు బలులు మొదలవ్వడానికి మరో కారణం కూడా ఉందని మన పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా గ్రామాలకు రక్షణగా నిలిచే గ్రామ దేవతల ఎదుట, జంతు బలులను సమర్పించడం చూస్తూ ఉంటాము. దానికి సంబంధించి వేదాలలో చెప్పబడిన విషయంతో పాటు, సగటు మానవుడి ఆలోచనా ధోరణి కూడా తోడవుతుంది. మన పురాణాల ప్రకారం, శక్తి స్వరూపంగా కొలిచే ఆ జగదాంబ యొక్క కళాంశలలో కొన్ని అంశలు, గ్రామ, కుల, ఇంటి దేవతలుగా మారి, ఆయా ప్రజలను రక్షిస్తూ ఉంటాయి. అందువల్ల మనకి మేలు చేసే అమ్మవార్లను తగిన విధంగా పూజించి, నైవేద్యాలు సమర్పించడం మన సంప్రదాయంలో ఒక భాగం. అయితే, పెద్ద పెద్ద ఆలయాలలో ఉండే అమ్మవార్లను పూజించేటప్పుడు, వేదాల ప్రకారం పూజలూ, నైవేద్యాలు సమర్పించడం పూర్వం నుంచీ వస్తోంది. బలుల గురించి యజుర్వేదం వంటి గ్రంథాలలో ప్రస్థావనలున్నాయి. ఇరవై ఒక్క వైదిక శ్రౌత యజ్ఞాలలో ఏడింటికి, జంతు బలి అవసరం. సోమ యాగంలో మేకను, అశ్వమేథ యాగంలో గుర్రాన్ని బలి యిస్తారు. అయితే, బలి ఇచ్చే వ్యక్తికి అతని వంశం, కులాన్ని బట్టి మాంసాన్ని తినడం, తినకపోవడం అనేది వర్తిస్తుంది. ఇల్వలుడు, వాతాపి ఉదంతం తర్వాత అగస్త్య మహర్షి శాపం కారణంగా, చాలా బ్రాహ్మణ కులాలు మాంసాహారాన్ని అర్పిస్తారు కానీ తినరు. దేవీ భాగవత పురాణం, కాళికా పురాణం వంటి పద్దెనిమిది ప్రధాన పురాణాలూ, వాటి ఉపపురాణాలూ, జంతు బలిని సూచిస్తున్నాయి. ఆది శంకరాచార్యుల సనాతన స్మార్త అద్వైత వేదాంత సంప్రదాయం, బ్రహ్మ సూత్రాలను అనుసరిస్తుంది. ఆ గ్రంధాల ప్రకారం జంతు బలి, బాధితుడి ఆత్మ విముక్తికి మార్గంగా పరిగణించ బడుతుంది.

పూర్వం చాలా గ్రామాలలో ఉండే గ్రామ దేవతలను పూజించడానికి, వేదాలు చదివిన పండితులు అందుబాటులో లేక పోవడంతో, ఆ చుట్టప్రక్కల నివసించే వారే తమకు తోచిన విధంగా ఆయా దేవతలను పూజించే వారు. వారిలో కొంతమంది పూర్తి శాకాహారులయితే, మరికొందరు మాంసాహారులవ్వడంతో, వారు ఎలాంటి ఆహారాన్నయితే తింటారో, అటువంటి వాటినే గ్రామ దేవతలకు నైవేద్యంగా సమర్పించేవారు. అలా మొదలైన పద్ధతులే, నేటికీ గ్రామ దేవతల సమక్షంలో ఓ ఆచారంగా జరుగుతూ ఉందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

లక్షల సంవత్సరాల చరిత్రగలిగిన మన సనాతన ధర్మాన్ని అణగద్రొక్కాలనే దూరాలోచనతో, హిందువులను వారి మతాలవైపుకు తిప్పుకోవాలనే కుతంత్రంతో సాగే పాశ్చాత్యులు, మన సంప్రదాయాలనూ, ఆచారాలనూ తప్పు పట్టడం మొదలు పెట్టారు. వారానికోసారి వీకెండ్ పేరుతో తాగి తందానాలాడటమే కాకుండా, కొన్ని వేల జీవాల ప్రాణాలు తీసి పార్టీలు చేసుకోవడం వారికి తప్పుగా కనపడదు కానీ, నమ్మినవారిని చల్లగా చూడటమే కాకుండా, ఆయా గ్రామాలలోని ప్రజలు ధర్మం తప్పకుండా కాచే శక్తి స్వరూపాలకు భక్తితో ఇచ్చే బలులు తప్పుగా కనపడటం, నిజంగా శోచనీయం.

ధర్మో రక్షతి రక్షితః!

Monday, December 9, 2024

MIND-BLOWING Secrets of HELL (Narakam) Punishments Revealed నరకము - శిక్షలు!


నరకము - శిక్షలు! TELUGU VOICE
ఇక్కడే మనం ఇన్ని బాధలు పడుతున్నప్పుడు మళ్ళీ నరకము, శిక్షలు అవసరమా?

దైవం కరుణాసముద్రుడు. సకల ప్రాణికోటికీ ఆయన సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని ప్రసాదించాడు. తాననుకున్న పనులను చేసుకుంటూనే సచ్చిదానందాన్ని పొందవచ్చు. ఎవరు ఎన్ని తప్పులు చేసినా, ఆ పరమేశ్వరుడు కోపగించుకోడు, ద్వేషంతో దండించడు. కానీ, ఆయన రచించిన వ్యవస్థలో, జీవులు తమ తప్పులకు తగిన దండనను అనుభవించ వలసి రావటం అనేది, భవిష్యత్తులో మనం ఎక్కువ యోగ్యతను పొందటం కోసమే. స్వర్గ నరకాల వ్యవస్థ ఈ దృష్టికోణంతో రచింప బడినదే. మృత్యువు తరువాత వెంటనే మరో దేహం ధరించటం వీలుకాదు. నూతన దేహ ప్రాప్తికి ముందు జీవి, మనోమయ, ప్రాణమయ దేహం చేత, సుకృత, దుష్కృత, సుఖ దుఃఖాల ఫలితాలను అనుభవించవలసి ఉంటుంది. గరుడ పురాణంలో, కఠోపనిషత్తు వంటి గ్రంధాలలో చెప్పబడిన వివరణతో, గతంలో మనం కొన్ని వీడియోలు చేసి ఉన్నాము. చూడని వారు అవి కూడా చూస్తే మరికొంత అవగాహన వస్తుంది. ఇక వాస్తవంగా స్వర్గ నరకాలేమిటి, అక్కడి శిక్షలు, భోగాల వంటి విషయాలు తెలుసుకోవడం కోసం, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/v67DQWZTpik ]


భగవంతుడి సృష్టిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న నరకం అనే వ్యవస్థ ఎలాంటిదంటే, మన న్యాయ స్థానాలలో ఎవరికైనా జైలు శిక్ష విధించడానికి, న్యాయమూర్తి మనస్సులో అతని మీద ఉన్న ద్వేషం కారణం కాదు. అతడు చేసిన తప్పులకు పర్యవసానంగా శిక్షను అనుభవించి, తద్వారా నేరస్థునిలో మార్పు వచ్చి, అతడు ఉత్తముడిగా మారాలనేదే, ఇక్కడ ప్రధాన ఉద్దేశం. మృత్యువు అనంతరం జీవునికి స్వర్గం గానీ, నరకం గానీ ప్రాప్తిస్తాయి. దీనిని అన్ని మతాలూ అంగీకరించాయి. మృత్యువు, పునర్జన్మ మధ్య గడిచే కాలంలో, తప్పని సరిగా జీవుడు స్వర్గ నరకాలను అనుభవించ వలసిందే. ఈ వ్యవస్థ వలన, గతంలో చేసిన తప్పులనూ, పాపాలనూ ప్రక్షాళన చేసుకుని, భావి జీవితం నిరపాయకరంగా గడపాలన్నదే, భగవంతుడి కోరిక.

మరణానంతరం జీవుడు మూడు సంవత్సరాల కాలం గానీ, అంతకు ఎక్కువ తక్కువలతో గానీ, ఊర్ధ్వలోకాలలో అంటే, పరలోకంలోనే నివాసం చేయాలని అదృశ్య చేతన భావిస్తుంది. అందులో మూడవ వంతు నిద్రలోనే గడిచి పోతుంది. అందువలన జీవుడికి తగినంత విశ్రాంతి లభిస్తుంది. ఆ తరువాత జీవుడు ఆరోగ్యవంతంగా నిద్ర లేస్తాడు. అప్పుడు గతాన్ని గురించి ఆలోచన ప్రారంభమవుతుంది. మరో మూడవ వంతు కాలం, ఈ సింహావలోకనంలో గడచిపోతుంది. పూర్వం అతడు చేసిన పాపకర్మాదులూ, పుణ్యకార్యాలూ, అతడి చేతనలో పొరలు పొరలుగా ఏర్పడి ఉంటాయి. ఉల్లి పొరలలాగా ఒక్కొక్కటి ఊడిపోయి, చివరకు కర్మ ఫలాన్ని అనుభవించడానికి తగిన బీజం మాత్రమే మిగులుతుంది. మానవుడు తప్పులు చేసి మరచి పోతాడు. కానీ, సాక్షీ భూతమైన అతని ఆత్మ మాత్రం, వాటిని విస్మరించదు. ఉదాహరణకు, మనం దొంగతనం చేసేటప్పుడు అది తప్పని అంతరాత్మ హెచ్చరిస్తూనే వుంటుంది. కానీ ఆ హెచ్చరికను మనం పెడచెవిన పెట్టి, దొంగతనం చేస్తాము. ఎవరూ ఆ దొంగతనాన్ని చూడక పోవచ్చు. అందువల్ల దండన లభించకపోవచ్చు. కానీ ఆ దొంగతనం యొక్క బీజం, సారవంతమైన భూమిలో గోధుమ గింజ నాటబడినట్లు, ఆత్మక్షేత్రంలో అలా నిలిచిపోయి, నిదానంగా పెరిగి పెద్దదవుతుంది.

మన పురాణాలలో నరకం, అనేక రకాలుగా వర్ణించబడింది. ఒక్కో మత గ్రంధం దానిని ఒక్కో విధంగా వర్ణించింది. అంధకూపం, కుంభీ పాకం, వైతరణీ నది, రౌరవము, అలాగే జహన్నుం, హెల్‌ అన్నీ సత్యమే. ఒక అభిప్రాయం ప్రకారం, ఎవరి నరకం వారిది. ఎన్ని ప్రాణులుంటే అన్ని నరకాలుంటాయి. ఎవరి దృష్టి కోణం వారిది కావటమే అందుకు కారణం. అది ఎలా అంటే, ఒకరికి అంగ వైకల్యం దుఃఖ కారణం కావచ్చు. ఆ అంగ వైకల్యమే ఒక బిచ్చగాడికి వరము. అది తొలగిపోతే అతనికి భిక్ష లభించక, దుఃఖ కారణమవుతుంది. నెరస్థులకు వేసే ఉరిశిక్ష అంటే కొందరు భయ భ్రాంతులకు లోనవుతారు, కొందరు ఆనందంగా పాటలు పొడుతూ ఉరిశిక్షను అనుభవిస్తారు. కుంభీపాక నరక వర్ణన ప్రకారం, అది ఒక నుయ్యి వంటిది. అందులో కత్తులు ఉండి, కదిలినప్పుడల్లా శరీరాన్ని ఛేదిస్తూ, భాధకు గురిజేస్తాయి. అదే నరకం, కొందరి మానసిక పరిస్థితి వల్ల వారికి బాధ కలిగితే, కొందరు కొంతసేపు బాధ పడి, తరువాత నవ్వుకోగలరు. ఎవరి మానసిక పరిస్థితి వారిది.

మన పురాణాలలో వర్ణింప బడిన దానిని బట్టి, యమ దూతలు యమ పాశంతో జీవుని బంధించి, నరకానికి ఈడ్చుకు వెళతారు. ఆ యమ దూతలు స్వతంత్ర ప్రాణులు కారు. కేవలం జీవుని మానస పుత్రులు. జీవుడు నరకంలో ఉన్నంత వరకే వారు ఉంటారు. తరువాత నశిస్తారు. ఒకరి కొరకు జన్మించిన యమ దూతలు, మరొకరికి దండన విధించలేరు. నిజానికి ఊర్ధ్వలోకంలో భౌతిక జీవనం సమాప్తమై, ఆధ్యాత్మిక జీవనం మొదలవుతుంది. వైజ్ఞానికుల ప్రకారం, బాహ్య మనస్సు అంతరించిపోయి, అంతర్మనస్సు జన్మిస్తుంది. న్యాయవాదుల వాక్చాతుర్యము, పండితుల సాహితీ చర్చలూ ఇక్కడ మచ్చుకకైనా కనిపించవు. జీవించి ఉన్నప్పుడు బాహ్య మస్తిష్కంలాగా, జీవుని పాప ఫలం కొమ్మలు రెమ్మలతో, ఫల పుష్పాలతో నిండుగా వుంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములూ, పది ఇంద్రియములతో కూడిన సూక్ష్మ శరీరము, జీవించి ఉన్నవుటి గుప్త మస్తిష్కంలాగా అచేతనంగా వుంటుంది.

ఇంద్రజాలం అంటే Hypnotism చేసేటప్పుడు, బాహ్య మస్తిష్కం నిద్రిస్తుంది. అంతర మస్తిష్కానికి నీటిలో ఈదమని ఆజ్ఞాపిస్తే, నీటిలో ఈదుతున్న భావన కలుగుతుంది. నరకం యొక్క అనుభవం కూడా ఇదే విధంగా వుంటుంది. నరకమూ, యమ దూతలూ, ప్రత్యేకంగా వుండవు. ఊర్ధ్వలోకంలో న్యాయ వాదులూ, న్యాయమూర్తులూ వుండరు. ప్రతి రోజూ కోట్ల ప్రాణులు మరణిస్తూ వుంటాయి. వాటన్నిటికీ దండన విధించడానికి, అంతకు రెట్టింపు యమ దూతలు కావాలి. లక్షల, కోట్ల జైళ్ళు, నరకాలు కావాలి. అందువల్ల వాస్తవానికి జరిగేది, ఎవరి నరకాన్ని వాళ్ళు సృష్టించుకోవటమే. ఆ నరకం వారితోనే నశించి పోతుంది.

అంతరాత్మలో పేరుకుని వున్న పాప సంస్కారాలు ప్రకాశ రూపంలో ప్రత్యక్షమైనప్పుడు, ఎంతో శక్తి వంతంగా వుండి, సూక్ష్మ శరీరాన్ని బలవత్తరంగా ఆకర్షిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే, సర్పం కళ్లతో తీక్షణంగా చూచి, పక్షులను బలవత్తరంగా ఆకర్షించినట్లే ఇది కూడా. అటువంటి సమయంలో, వేరే ఏదో స్వతంత్ర శక్తి, యమ దూతల రూపంలో ఈడ్చుకు పోతున్నట్లు భావన కలగ వచ్చు. ఈ యమ దూతల రంగు, రూపం, ఆకారం, ఎవరి భావనలను బట్టి, వారికి ప్రత్యేకంగా వుండవచ్చు. హిందువులకు తిలకం పెట్టుకుని, గదను ధరించిన యమదూతలు ప్రత్యక్షం కావచ్చు. ఇంకొకరికి గడ్డంతో, టర్కీ టోపీతో ప్రత్యక్షం కావచ్చు. ఆంగ్ల యమ దూతలు, టోపీ, నెక్‌ టై ధరించి కనిపించ వచ్చు. వారు మాట్లాడటం కూడా ఆ భాషలలోనే ఉండవచ్చు. ఎవరి విశ్వాసాలను బట్టి, వారికి అనుగుణంగా ఈ యమదూతలు కనిపిస్తారు.

ఒకరికి కనిపించే యమ దూతలు, పెద్ద కోరలు కలిగివుండవచ్చు. మరొకరికి మిడిగుడ్లతో కనిపించవచ్చు. ఈ యమ దూతలను, చూచేవారి సంస్కార తేజంగా భావించవచ్చు. సూక్ష్మ శరీరం, తన కోరికకు విరుద్ధంగా దండనలు విధించ వచ్చు. అంతిమంగా దుష్కర్మల ఫలితం దుఃఖమే. సూక్ష్మ శరీరం, వేదనలు, బాధలు, కష్టాలు అనుభవించడానికి, అంతరాత్మ ఒక స్వతంత్ర నరకాన్ని నిర్మిస్తుంది. ఇందులో ఇనుప ముక్కుల కాకులు, గ్రద్దలు, దాటనలవి కాని వై తరణీ నది, చమురు బాండీలలో భారీగా వేయించడానికి ఏర్పాట్లు, ఇవన్నీ వుంటాయి. లేదా కేవలం అవమానాలు, అపహస్యాలు, తిట్లు పొందటంతో సరిపోవచ్చు. ఎవరి మానసిక పరిస్థితిని బట్టి, వారి అనుభవం ఉంటుంది. ఈ నియంత్రణ అంతా జీవుడు దుఃఖాన్ని అనుభవించటానికి మాత్రమే. తాము చేసిన పాపాలకి తగిన ఫలితం అనుభవించాలని, జీవుడు గ్రహంచాలి. తనను తాను సంస్కరించుకునేటంత వరకూ, జీవునికి ఈ నరక లోకానుభవం ఉంటుంది. ఉదాహరణకు, న్యాయమూర్తి చిన్నచిన్న అపరాధాలకు స్వల్ప దండన విధిస్తే, పెద్ద నేరాలకు దండన పెద్దదిగా వుంటుంది. దానికి కారణం, చిల్లర నేరాలు చేసే వారి మనో భూమి, శీఘ్రంగా పరిష్కరింప బడుతుంది. కానీ, హత్యలూ మొదలైన పెద్ద అపరాధాలు చేసే వారి మనో భూమి కఠోరంగా వుండి, సంస్కరింప బడటానికి చాలా కాలం పట్టవచ్చు. నరక దండనలు కూడా ఇదే విధంగా వుంటాయి. దుష్కర్మల ప్రభావం పొరలు పొరలుగా ఊడి నశించి పోతుంది. సూక్ష్మ శరీరానికి ఇంద్రియాలు, మనస్సు కూడా వుంటాయి.

ఇక శారీరక పాపాలకు శారీరక దండన, మానసిక పాపాలకు మానసిక దండన, విధింప బడుతుంది. చేసిన పాపాలకు తగిన శిక్షను ఆ జీవి అంతరాత్మయే విధిస్తుంది. ఇందులో మరొకరి ప్రమేయము ఉండదు. కొంత వరకు పాపానికి తగిన శిక్ష జీవిత కాలంలోనే అనుభవించ వలసి రావచ్చు. మిగిలిన దానికి ఫలితాన్ని పరలోకంలో అనుభవించవలసి ఉంటుంది. పరమాత్మ ఏర్పాటు చేసిన వ్యవస్థననుసరించి, తిరిగి జన్మ ఎత్తే ముందే పాపాలకు తగిన ప్రాయశ్చిత్తం విధింప బడి, ప్రక్షాళనం చేయ బడుతుంది. తిరిగి జన్మించినపుడు, వాటి ప్రభావం చూపే అవసరం రాకుండా ఉండటానికే ఈ వ్యవస్థ. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తప్పితే, పాప ఫలమంతా ఊర్ధ్వలోకంలోనే అనుభవంలోకి వస్తుంది. నరక లోకానుభవం, పాప ఫలాన్ని అనుభవించి నశింపజేసుకోవటం మాత్రమే గాక, పాత అలవాట్లనూ, దుష్ప్రవృత్తులనూ మాని, మంచి అలవాట్లను పెంపొందించుకోవడానికి కూడా ఉద్దేశింపబడింది. దొంగతనం చేసేటప్పుడు దొంగ గొంతు పొడారిపోతుంది. దుర్మార్గం చేసేటప్పుడు, కాళ్ళు వణుకుతాయి. అదంతా గతంలో పాపాలకు పొందిన ప్రాయశ్చిత్తం యొక్క స్మరణ వల్లే జరుగుతుంది. కానీ, దురదృష్ట వశాత్తూ, అంతరాత్మ ప్రబోధాన్ని పెడ చెవిన బెట్టి, మనిషి పాప కర్మలకు ఉద్యుక్తుడవుతూనే వున్నాడు.

అందుకే మనిషి ధ్యానం, లేక Meditation ని తప్పనిసరిగా అలవరుచుకుని, మనస్సును స్వీయ నియంత్రణ చేసుకోవాలి. సత్యం లేదా వ్యక్తిగత ఆధీనం నుంచి ఎలాంటి ఆలోచనలూ మనలను పక్కద్రోవ పట్టించకుండా, ఇబ్బంది పెట్టే సమస్యల నుంచి మనస్సును ప్రశాంత పరిచే విధమైన స్థితిని అలవరుచుకుని, ఇప్పటివరకు మనం చెప్పుకున్న నరకము, శిక్షలు, తప్పించుకోవచ్చు, లేదా తగ్గించుకోవచ్చు. ఇక స్వర్గ లోకం, దాని వివరణా, మన తదుపరి వీడియోలో తెలుసుకుందాము..

ధర్మో రక్షతి రక్షితః!

Monday, December 2, 2024

STOP Ignoring the Power of Time and Karma - Scientific Proof You Won't Believe | కాలం! కర్మం! సైన్స్ పరంగా


సైన్స్ పరంగా - కాలం! కర్మం! TELUGU VOICE
40 లక్షల సంవత్సరాల తరువాత భూమికి తిరిగి వచ్చిన అతడికి ఏం తెలిసింది?

‘కాలం’, ‘కర్మం’ కలిసి రావడమో, లేక అడ్డుపడడమో అనే పద ప్రయోగం మనం నిత్యం వింటూ ఉంటాము. ఈ సువిశాల విశ్వంలో ఎంతో విలువైనదీ, అద్భుతమైనదీ, అంతుచిక్కని ఎన్నో రహస్యాల గనీ ‘కాలం’. కాలం యొక్క తీరుతెన్నులు తెలుసుకోవడానికి ప్రయత్నించే ఏ మనిషికైనా, ఆ కాలం చేసే మాయను చూసి నోట మాటరాదు. ఇక కర్మ గురించి చెప్పనవసరమే లేదు. ఆ కారణంగానే, ఆది కాలం నుంచీ మానవుడు, కాలం గురించీ, కర్మల గురించీ తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నా, నేటికీ వాటి గురించి తెలిసింది కేవలం గడ్డిపోచ మొన భాగమంత కూడా లేదు. ఆధునిక మానవుడి మనుగడలో ఎంతో వ్యత్యాసం రావడంతో పాటు, నేటి పరిజ్ఞానం కూడా మానవ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. ఈ పరిజ్ఞానం సహాయంతోనే, కొన్ని దశాబ్దాల క్రితం, Albert Einstein అనే శాస్త్రవేత్త, The Theory of Relativity అనే సిద్ధాంతాన్ని మన ముందుంచారు. ఆ సిద్ధాంతం ప్రకారం, కాలం నడిచే తీరుతెన్నుల గురించి, వెయ్యిలో ఒకటో వంతు మానవుడికి తెలుసుకునే అవకాశం దక్కింది. ఈనాడు Einstein చెప్పిన ఆ సాపేక్ష సిద్ధాంతం, కొన్ని యుగాల పూర్వమే మన మహాపురుషులు కనిపెట్టి, దానితో ఎన్నో ప్రయోగాలు కూడా చేశారు. కేవలం మన పురాణాలలో రాయడమే కాకుండా, హిందువులు ప్రతి సంవత్సరం జరుపుకునే ఒక పండగకీ, Einstein చెప్పిన సాపేక్ష సిద్ధాంతానికి కూడా సంబంధం ఉంది! అలాగే, Newton అనే శాస్త్రవేత్త 3వ సూత్రానికీ, కర్మ సిద్ధాంతానికీ సంబంధం ఉంది! మరి ఆ విషయాలు తెలుసుకోవడం కోసం, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Nb12ylQ-zd0 ]


ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయాలలో ముందుగా, “ప్రతి చర్యా దానికి వ్యతిరేకమైన సమాన ప్రతిచర్యను కలిగి ఉంటుంది” - న్యూటన్‌ అనే శాస్త్రజ్ఞుని 3వ సూత్రం ఇది. కర్మ సిద్ధాంతం కూడా ఒక విధంగా ఇదే భావనను వ్యక్తం చేస్తుంది. ప్రతి కర్మా, దానికి తగ్గ సమాన ఫలితాన్ని తిరిగి ఇచ్చి తీరుతుంది. పాపకర్మ పాప ఫలాన్నీ, పుణ్యకర్మ పుణ్య ఫలాన్నీ ఇస్తుంది. దానిని ప్రతి జీవీ అనుభవించక తప్పదు. కర్మ ఫలం ఎప్పుడూ ఆ కర్మకు తగిన రీతిలో సమానంగానే ఉంటుంది. అందులో ఏ మాత్రం హెచ్చు తగ్గులుండవు. మనం అనుభవిస్తున్న సుఖానికీ, దుఃఖానికి కూడా ఒక విధంగా కారకులం మనమే. వివిధ జన్మలలో మనం చేసుకున్న కర్మలు వాటికి సరిపోయే సమాన ఫలితాలను ఆ తరువాతి జన్మలలో మనకు అందిస్తాయి. అంటే, ప్రతి కర్మా, దానికి తిరిగి ఎదురొచ్చే సమాన కర్మ ఫలితాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఇందులో న్యూటన్‌ 3వ సూత్రం, అచ్చంగా ప్రతిధ్వనిస్తుంది.

ఎవరి కర్మ ఫలం, వారికే చెంది తీరుతుందని కృష్ణ పరమాత్ముడు స్పష్టంగా వివరించాడు. అంటే, పుణ్య కర్మకు సౌఖ్యాన్నీ, పాప కర్మకు శిక్షనూ, ఎవరిది వారే అనుభవించి తీరాలని అర్ధం. అప్పుడే పాపభీతీ, దైవభక్తీ నిలుస్తాయి. విచ్చలవిడితనానికి అడ్డుకట్ట పడుతుంది. ఒకరి పాప భారాన్ని మరొకరు మోస్తారని భావించడం, వట్టి భ్రమ. గాయం చేసుకున్న వారికే రక్త స్రావం జరుగుతుంది గానీ, వారి ఆత్మీయులకు కాదు కదా! 'చేసుకున్న వారికి చేసుకున్నంత! ఎవరి కర్మ వారిదే! అనే విషయం సత్యం.. కర్మ సిద్ధాంతం గురించి, గరుడపురాణం, కఠోపనిషత్తు, భాగవత, రామాయణ, మహాభారతాలలోని ప్రస్థావనలతో, గతంలో మనం చాలా వీడియోలు చేసి ఉన్నాము. చూడని వారు తప్పక చూడండి..

ఇక Einstein చెప్పిన The Theory of Relativity కీ, మన పురాణాలూ, వేదాలలో చెప్పబడిన అంశాలకూ గల సంబంధం ఏంటో తెలియాలంటే, ముందు అసలు ఈ సాపేక్ష సిద్ధాంతం అంటే ఏంటో తెలియాలి. నేటి ఆధునిక యుగంలో గొప్ప శాస్త్రవేత్తలలో ఒకరైన Einstein, కాలం యొక్క పోకడపై ఎన్నో ఏళ్లపాటు శ్రమించి, The Theory Of Relativity ని చెప్పడం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారం, కాలం తీరు ఒక్కోచోట ఒక్కో విధంగా ఉంటుంది. అంటే, ఒక పది సంవత్సరాల వయస్సున్న పిల్లవాడిని, కాంతి వేగంతో ప్రయాణించే వాహనంలో కూర్చో పెట్టి, భూమికి ఇరవై ఐదు లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న Andromeda Galaxy కి పంపితే, తిరిగి వచ్చే సరికి అతడి వయస్సు, 56 సంవత్సరాలు పెరుగుతుంది. కానీ, అతడు భూమికి తిరిగి వచ్చేసరికి, దాదాపు, నలభై లక్షల సంవత్సరాల పైనే గడిచిపోయి ఉంటుంది. బాగా వేగంగా ప్రయాణించడం వల్ల, ఆ వాహనంలో ఉండే వ్యక్తి కాలం, బయటి వ్యక్తుల కంటే మెల్లగా కదులుతుంది. ఆ వాహనంలో ప్రయాణించే వ్యక్తికి ఆ విషయం తెలియదు. అందుకు కారణం, అతడు కూడా కాలంతో ప్రయాణించడమే. ఇక కాంతి వేగం అంటే, దాదాపు ఒక సెకనుకు మూడు లక్షల కిలోమీటర్లని, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ విధంగా కాంతి వేగంతో ప్రయాణించే వాహనంలో ఉండే వ్యక్తుల కాలం, భూమిపై జరిగే కాలం కంటే చాలా నెమ్మదిగా ఉంటుంది. అందులో ఉన్న వారికి ఆ వ్యత్యాసం తెలియదని పరిశోధకులు చెబుతున్నారు.

అదే విధంగా, మన galaxy ని దాటి ఇతర galaxy లలో ఉండే గ్రహాలకు చేరుకున్నప్పుడు, అక్కడ ఉండే gravity, మరియూ, ఆ గ్రహం రొటేటింగ్ టైం ఆధారంగా కూడా, ఆ గ్రహంపై జరిగే కాలానికీ, భూ గ్రహంపై జరిగే కాలానికీ చాలా వ్యత్యాసాలు ఉంటాయని, Einstein బలపరిచిన సాపేక్ష సిద్ధాంతం ద్వారా తెలుస్తోంది. ఈ theory ల ఆధారంగానే, మొన్నామధ్య Hollywood లో, ప్రముఖ దర్శకుడైన Christopher Nolan, ‘Interstellar’ అనే సినిమా తీశారు. ఆ సినిమాలో భూమిపై మానవ జాతి మనుగడ సంకటంలో పడే సమయానికి, కథానాయకుడు అతని బృందంతో కలిసి, మానవ మనుగడకు అనుకూలమైన గ్రహాలను వెతికే పనిలో, వేరే galaxy లో ఉన్న ఒక గ్రహానికి వెళతాడు. అలా వెళ్లిన హీరో బృందానికి, ఆ గ్రహంపై ఒక గంటసేపు గడిపితే, భూ గ్రహంపై ఏడు సంవత్సరాలు గడిచిపోతాయనే విషయం తెలుస్తుంది. ఆ విధంగా, హీరో తన Mission ని కొన్ని రోజుల్లోనే పూర్తి చేసుకుని, పలు నాటకీయ పరిణామాల మధ్య భూమికి చేరుకునేటప్పటికి, అతని వయస్సు 124 సంవత్సరాలు. అయినా తను నలభైలలో ఉన్న మనిషిలానే ఉంటాడు. తనకు ఎంతో ఇష్టమైన కూతురు మాత్రం బాగా ముసలిదయిపోయి, హాస్పిటల్ లో చావు బ్రతుకులమధ్య ఉందని తెలుసుకుంటాడు. ఈ సినిమా చూసిన వారికి, టైం చేసే మాయ ఏంటో అర్ధమవుతుంది.

కొన్ని దశాబ్దాల క్రితం Einstein బలపరిచిన సిద్ధాంతం ప్రకారం ఈ సినిమా రాగా, కొన్ని యుగాలకు పూర్వమే మన దేశంలో ఇలాంటి గాథలు జరిగినట్లు మన పురాణాలలో చెప్పబడి ఉంది. అందుకు ఒక ఉదాహరణ.. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం రైవంతకుడనే యాదవ రాజుకు, రేవతి అనే కూతురుండేది. ఆమె దాదాపు ఎనిమిదిన్నర అడుగుల ఎత్తుకు పెరిగిపోవడంతో, రేవతికి వరుడు దొరకలేదు. కొన్నేళ్ల పాటు ఆమె పెళ్లి సంబంధాల గురించి వెతికి వేసారిన రైవంతకుడు, అంత పొడవైన కూతురునిచ్చిన బ్రహ్మదేవుడినే, ఆ సమస్యకు పరిష్కారం అడగాలని నిశ్చయించుకున్నాడు. రైవంతక మహారాజు మహా తపోశక్తి సంపన్నుడు. ఇక్కడ తపోశక్తి అంటే, శాస్త్ర పరిజ్ఞానం బాగా తెలిసినవాడని అర్ధం చేసుకోవాలి. ఆయనకున్న శక్తితో, అంతరీక్షయానానికి అవసరమయ్యే వాహనాన్ని సిద్ధం చేసుకుని, కూతురు రేవతితో సహా బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అతను అక్కడికి చేరే సరికి, బ్రహ్మా సరస్వతీ దేవిల ముందు గంధర్వులు నాట్యం చేయడం చూసి, కొంత సమయం వేచివున్నాడు. ఆ తంతు పూర్తయ్యాక, తన కూతురితో సహా బ్రహ్మ దేవుడి ముందుకు వెళ్లి, తన సమస్యను చెప్పుకున్నాడు. దానికి బ్రహ్మదేవుడు, అతను తన కూతురిని తనతో పాటు తీసుకువచ్చి మంచి పని చేశాడని అన్నాడు. ఎందుకంటే, అతనక్కడికి వచ్చాక, అక్కడ జరుగుతున్న గంధర్వ నాట్యం ముగిసే లోపు, భూమిపై నలభై లక్షల సంవత్సరాలు గడిచిపోయాయని చెప్పాడు. అందుకు కారణం, బ్రహ్మలోకానికీ, భూలోకానికీ జరిగే కాలంలో వ్యత్యాసాలు ఉన్నాయని తెలియజేశాడు. ఒకవేళ అతని కూతురు అక్కడే ఉండి ఉంటే, ఆ పాటికి ఎప్పుడో చనిపోయి ఉండేదనీ, రేవతి కూడా అక్కడికి రావడం వలన, ఆమె వయస్సులో ఎటువంటి మార్పూ రాలేదనీ చెప్పాడు. అతడిని బయలుదేరి భూలోకానికి వెళ్ళమని ఆదేశించాడు. ఆ సమయంలో భూమిపై బలరాముడనే యాదవ రాజు ఉన్నాడని చెప్పి, ఆయన ఎత్తు దాదాపు పదడుగులు ఉంటుంది కాబట్టి, రేవతికి తగిన వరుడతడేనని రైవంతకుడికి చెప్పాడు బ్రహ్మదేవుడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన మహారాజు, క్షణం ఆలస్యం చేయకుండా, రేవతితో కలిసి భూమిపైకి వచ్చేశాడు. అలా వచ్చిన రైవంతకుడికి, భూమిపై పరిస్థితులన్నీ మారిపోయాయని తెలిసివచ్చింది. తన వారెవరూ లేరనే విషయం తెలిసి, ఆశ్చర్యపోయాడు. బ్రహ్మ దేవుడు చెప్పినట్లు, బలరాముడి వద్దకు వెళ్లి జరిగినది చెప్పి, తన కూతురినిచ్చి వివాహం జరిపినట్లు, భాగవతంలో ప్రస్థావన వుంది.

అంతేకాదు, ప్రతి సంవత్సరం, విష్ణు మూర్తి నిద్ర నుంచి లేచే రోజును, వైకుంఠ ఏకాదశి పేరుతో పండుగగా జరుపుకునే ఆచారం మన హైందవ ధర్మంలో ఉంది. ఇలా ప్రతి సంవత్సరం, శ్రీ మహా విష్ణువు లేచి ఉన్న కాలాన్ని ఉత్తరాయణం అని అంటాము. అది ఆరు నెలల పాటు ఉంటుంది. ఆ తర్వాత దక్షిణాయన కాలం వస్తుంది. అదొక ఆరు నెలలపాటు ఉంటుంది. ఆ కాలంలో విష్ణుమూర్తి పడుకుని ఉంటాడని మన వేదాలలో ప్రస్థావించబడివుంది. ఇక్కడ ఉత్తరాయణం, దక్షిణాయన కాలాలు, వైకుంఠంలో ఒక రాత్రి, ఒక పగలుగా చెబుతారు. అంటే, ఆ లక్ష్మీనాథుడికి ఒక రోజు, మనకి ఒక సంవత్సరంగా లెక్కించబడుతుంది. ఈ విధంగా కూడా ఆ స్వామి వారు ఉండే గ్రహానికీ, మన గ్రహానికీ మధ్య కాలంలో ఉన్న తేడాలను గురించి, ఎన్నో యుగాల పూర్వమే మన వేదాలలో చెప్పబడింది. ఆ విధంగా మన మహా ఋషులకూ, యోగులకూ, కాలం ప్రయాణించే తీరూ, దాని వల్ల పరిణమించే మార్పుల వంటి అన్ని విషయాలపై, ఎంతో అవగాహన ఉన్నట్లు మనం గుర్తించాలి. సనాతన ధర్మం అంటే కేవలం నచ్చిన దేవుడిని గుడ్డిగా, మూఢ నమ్మకంతో కొలవడం కాదు. ఇది శాస్త్ర, సాంకేతిక సమాహారమనీ, ఇదో జీవన విధానమనీ ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి.

ధర్మో రక్షతి రక్షితః!

Friday, November 29, 2024

ఈ రోజు 'మాస శివరాత్రి'.. ఎందుకు? ఎలా జరుపుకోవాలి? Masa Shiva Ratri - Masik Shivratri

 


ఈ రోజు 'మాస శివరాత్రి'.. ఎందుకు? ఎలా జరుపుకోవాలి? TELUGU VOICE

ప్రతి నెలా అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్ధశి తిధిని, మాస శివరాత్రిగా జరుపుకుంటాము. అసలు శివరాత్రి అంటే శివుడి జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం. శివుని జన్మ తిధిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి.

[ నందీశ్వరుడు చెప్పిన శివరాత్రి మాహాత్మ్యం! https://youtu.be/YPCDlvLz5Sw ]


మాస శివరాత్రి  ఎందుకు జరుపుకోవాలి?

మహా శివుడు లయ కారకుడు. కనీనికా నాడీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, లయానికి (మృత్యువుకు) కారకుడు కేతువు. అమావాస్య ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. 'చంద్రోమా మనస్సో జాతః' అనే సిద్దాంతం ప్రకారం, చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడు, జీవుల పై ఈ కేతు ప్రభావం ఉండటం వలన, వారి వారి ఆహారపు అలవాట్ల పై ప్రభావం చూపడం వలన, జీర్ణ శక్తి మందగిస్తుంది. తద్వారా మనస్సు ప్రభావితం అవుతుంది. తద్వారా ఆయా జీవులు ఈ సమయంలో మానసికంగా సంయమనాన్ని కోల్పోవడమో, చంచల స్వభావులుగా మారడమో, మనోద్వేగముతో తీసుకో కూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి, కొన్ని సమయాలలో తమకే కాకుండా, తమ సమీపంలో ఉన్న వారి యొక్క మనస్సు, ఆరోగ్యం, ధనం, ప్రాణాలకు సైతం హాని తలపెట్టే ప్రయత్నం, తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు. అందుకే మనం గమనించవచ్చు.. అమావాస్య తిధి ముందు ఘడియలలో కొందరి అనారోగ్యం మందగించండం, లేదా తిరగబెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణం ఇదే అని చెప్పవచ్చు.

కాబట్టి, ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా, లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా, మనం అవకాశం ఉన్నంత మేర, ప్రతి మాసమూ ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉంది.

మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలి?

ఈ అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసముండి, సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకుని, దగ్గరలోని శివాలయ దర్శనం చెయ్యాలి. అవకాశం ఉన్న వారు, వారి శక్తి మేర 5, 11, 18, 21, 56, 108, ఇలా ప్రదక్షణాలు చేయవచ్చు. అలాగే, ఈ రోజు శివాలయంలో పూజలో ఉంచిన చెరకు రసాన్ని భక్తులకు పంచడం వలన, వృత్తి అంశములో ఇబ్బందులను ఎదుర్కొనే వారికి అటువంటి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే, ఈ రోజు ప్రదోష వేళ శివుడికి మారేడు దళాలతో, లేదా కనీసం గంగా జలంతో అభిషేకాది అర్చనలు చేయడం మంచిది. ఇవేవీ చేయడానికి అవకాశం లేని వారు, ఆరోగ్యవంతులు, అలాగే గృహంలో అశుచి దోషం లేని వారు, ఈ రోజు ఉపవాసముండి, మూడు పూటలా చల్లటి నీటితో వీలయినంత ఎక్కువ సమయం స్నానం చెయ్యాలి. మంచం మీద కాకుండా నేలపై పవళించాలి.

మాస శివరాత్రిని జరుపుకోవడం వలన కలిగే ఉపయోగాలు!

ప్రత్యేకించి ఈ రోజును సశాస్త్రీయంగా జరుపుకోవడం వలన, మన జాతకములోని క్షీణ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది. సంతానలేమి సమస్యలనుండి విముక్తి లభిస్తుంది. వృత్తి అంశంలో ఉన్న ఆలస్యాలు , అవరోధాలు అంశంలో మార్పు కలుగుతుంది. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మొండిగా, పెంకిగా, బద్దకంగా, మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత, వారి తల్లిదండ్రులు ఈ రోజు ఉపవాసమును చేయించి, దేవాలయానికి వెళ్ళే అలవాటు చేయించగలిగితే, వారిలో కాలక్రమంగా, ఖచ్చితంగా మార్పు వస్తుందని భావించవచ్చు. మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.

కాబట్టి, ప్రతి ఒక్కరూ ఈ రోజు నుండి అవకాశం ఉన్నంత మేర, ప్రతి మాస శివరాత్రినీ సశాస్త్రీయంగా జరుపుకోవడం ద్వారా శుభాలను పొందవచ్చు..

Monday, November 25, 2024

When the soul enters mother's womb | పునర్జన్మ సిద్ధాంతం! పరకాయ ప్రవేశం!


పునర్జన్మ సిద్ధాంతం! పరకాయ ప్రవేశం! TELUGU VOICE
ఆత్మ తల్లి గర్భంలోకి ప్రవేశించక ముందు, తండ్రి శరీరంలో 3 నెలలు ఉంటుందా? జీవుడి 5 శరీరాలేమిటి?

సైన్స్ పరంగా మానవుడు ఎంతో పురోగతి సాధించినప్పటికీ, కొన్ని విషయాలు ఎప్పటికీ మన చేతులలో ఉండవు. అటువంటి వాటిలో చావు పుట్టుకలు ఒకటి. శాస్త్రాల పుణ్యమా అని, జనన మరణ వలయాన్ని గురించి కూడా సైన్స్ పరంగా కొంత తెలుసుకోగలిగాడు మానవుడు. మనిషి తల్లి గర్భం నుంచి బయటపడి జన్మనెత్తుతాడనేది, అందరికీ కనిపించే యధార్థమే! అలా కనిపించని యధార్థం మరొకటి వుందని మీకు తెలుసా!? మనిషి పుట్టడానికి ముందే, అంటే, 270 రోజులకు పూర్వమే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి, జన్మించడం జీవితానికి మొదలు కాదు. తల్లి గర్భంలో ప్రవేశించడమే ప్రారంభము. మనిషి, జన్మనెత్తడానికి పూర్వ దశ పిండ రూపంగా వున్నట్టే, శరీరంలోకి ప్రవేశించక ముందు కూడా, ఈ జననానికి పూర్వ దశ ఒకటుంది..! చాలామందికి తెలియని ఆ విషయాలకోసం, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/LNLyArvxWjA ]


మనిషి మరణించిన వెంటనే శరీరాన్ని విడిచిపెట్టి బయటికి పోతున్నాడు. అంటే, మనిషి శరీరాన్ని విడిచిపెట్టి బయటపడ్డాక, కంటికి కనిపించని అపర దశ ఒకటి వుంది. ఆ దశలో, జీవాత్మ స్థితిలో, శరీరం లేకుండా గాలిలో సంచరిస్తుంటుంది. ఆ స్థితిని గురించి సైన్స్ కు ఏమీ తెలియదు. అప్పుడే మరణించిన జీవాత్మలను, Kirlian Photography ద్వారా ఫోటోలు తీసిన కొందరు విదేశీ సైంటిస్టులు, తమ పరిశోధనల ద్వారా, శరీరం లేని జీవాత్మలు ఎలా వుంటాయో కనుగొనడానికి ప్రయత్నించారు.

మన ప్రాచీన వేద ఋషులు, యోగాభ్యాసం ద్వారా శరీరాన్ని విడిచిపెట్టి, 'పరకాయ ప్రవేశం', అంటే, ఒక శరీరంనుంచి బయటకువచ్చి, ఇంకొక శరీరంలోకి ప్రవేశించడమనే యోగ ప్రక్రియ సిద్ధిని పొందారు. ఈ పరకాయ ప్రవేశ విద్య లాగానే, సామాన్య మానవుడు నిద్రావస్థలో మరణించి, అపస్మారక స్థితి అంటే, Coma లో, తల్లి గర్భంలోకి ప్రవేశిస్తున్నాడు గనుక, అలాంటి వాడు తెలుసుకో లేని పునర్జన్మ విజ్ఞానమే, వేదాలూ ఉపనిషత్తులూ తెలిపే ‘పునర్జన్మ రహస్యము’. అదేమిటో ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాము.

మనిషి బ్రతికి వున్నప్పుడు, మనకు బైటికి కనిపించే ఆకారాన్ని, స్థూల శరీరం, లేదా Material Body అంటాము. అంటే, ఒక పదార్థంతో తయారైన శరీరమని అర్ధం. ఇది మనం తినే ఆహారంతో ఏర్పడుతుంది గనుక, అన్నశరీరం లేదా అన్నమయకోశం అంటాము. మరణించే సమయంలో మనిషి, ఈ అన్నమయ శరీరాన్ని వదిలేస్తాడు. సాధారణంగా మనం ఎలాగైతే స్నానం చేసి బట్టలు మార్చుకుంటామో, మరణాసన్న సమయంలో, అంటే, ఈ భూలోక యాత్రను ముగించే సమయంలో, శరీరాన్ని ఇక్కడే వదిలేసి, లోపలి జీవుడు బయటికి వస్తున్నాడు. అలా, మరణించాక బయటకు వచ్చే జీవాత్మను, ప్రాణమయ శరీరం అంటారు. అంటే, ఇది మనలోని ప్రాణశక్తితో తయారైన శరీరము.

ఈ ప్రాణమయ శరీరాన్ని, సెంయోన్ కిర్ణియన్‌ (Semyon Kirlian) అనే రష్యన్‌ సైంటిస్ట్, తాను కనిపెట్టిన ప్రత్యేక Camera ద్వారా, మరణించిన వారి శరీరాలనుంచి బయటకు వచ్చే జీవాత్మలనూ, వాటి చుట్టూ ప్రకాశించే ప్రాణ శక్తినీ ఫోటోలు తీసి, వివరించాడు. ఈ ప్రాణమయ శరీరమే,  మనం అనుభవించే నొప్పులకూ, శరీర సౌష్టవానికీ కారణమయిన జీవాత్మ. అంటే, మనం ఎదుర్కొనే ఆకలి దప్పులూ, నీరసమూ, పుష్టీ, ఆరోగ్యమూ, అనారోగ్యమూ, శారీరక సుఖ దుఃఖాలూ, మొదలైన అనుభూతులన్నీ అనుభవంగా తెలిసేది, ఈ ప్రాణమయ శరీరం వల్లనే. ఇందుకు science పరంగా చెప్పుకోదగిన ఒక ఉదాహరణ, సహజంగా డాక్టర్లు ఆపరేషన్‌ చేసే ముందు, Patient కి Anesthesia అంటే, మత్తు మందు ఇస్తారు. అలా చేయడం వలన వారు, వారికి తెలియకుండానే ఈ ప్రాణమయ శరీరాన్ని వేరు జేస్తున్నారు. అందుకే Patient కి ప్రాణమయ శరీరం తెలిపే నొప్పి, బాధ, లేక ఏం జరుగుతున్నదో తెలిసే స్పృహ నశించిపోయి, అపస్మారక స్థితి కలుగుతోంది. ఇదే, మనిషి మరణించి, స్థూలశరీరం నుండి బయటపడే జీవము. దీనినే ఆత్మ, దయ్యం, లేక ప్రేతమని కూడా అంటాము.

మనిషి మరణించిన తరువాత రెండవ దశలో, ఈ ప్రాణమయ శరీరాన్ని కూడా వదిలి, తన ఆలోచనలూ, జ్ఞాపకాలూ, అనుభూతులూ నెమరు వేసుకునే మనోమయ శరీరంతో బయటకు వస్తాడు. ఇది మనిషి స్థూల శరీరం లోపల, ప్రాణమయ శరీరంలో నిగూఢంగా ఉంటుంది. ఉల్లి పొరల లాగా, మనిషి మరణానంతరం, ఈ శరీరాలు ఒక్కొక్కటీ బయట పడతాయి. మనోమయ శరీరాన్ని కూడా వదిలి జీవుడు బయటకు రాగానే, అంతవరకూ తాను ఆ జీవితంలో అనుభవించిన సంఘటనలూ, సుఖ దుఃఖాలూ, వాటికి సంబంధించిన జ్ఞాపకాలన్నీ మరచిపోతాడు. అయినా ఆ మనోమయశరీరాన్ని యోగులు తమ దివ్యదృష్టితో వీక్షించి, మరణించిన జీవుడి పూర్వ జన్మ చరిత్రనంతా చదవ గలరు. నాడీ గ్రంధాలలోని పూర్వజన్మ చరిత్ర కూడా, అలాగే తెలుస్తుంది. మనోమయ శరీరాన్ని విడిచి బైటకు వచ్చిన జీవుడు, గతాన్ని మరచి పోతాడనే విషయాన్నే, విరజానదిని దాటడంతో గతం గుర్తులు నశిస్తాయని, మన సనాతనధర్మ గ్రంధాలలో తెలిపిన సత్యం..

ఇక మనోమయ శరీరం లోపల వుండే నిగూఢమైన 'జీవాత్మ'నే, ‘విజ్ఞానమయ శరీరం’ అంటారు. ఇది ప్రతి జన్మలోని అనుభవాలను సేకరించి, ఆ జన్మలో మనం అనుభవించిన సుఖ దుఃఖాలూ, సంఘటనలూ, వ్యక్తులూ, శత్రుత్వ మిత్రత్వాదుల వంటి జ్ఞాపకాలనూ విడిచి పెట్టి, అనుభవాల సారమైన జీవిత గుణపాఠాన్ని మాత్రం తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. ఈ అనుభవం దృష్ట్యా, తను పుట్టబోయే మరుజన్మలో ఏ రూపాన్ని పాందాలో, ఆ జీవాత్మయే నిర్ధారించుకుంటుంది. అంటే పై మూడు శరీరాలూ గతజన్మకు సంబంధించిన అనుభవాలకు ముద్రితాల వంటివి. విజ్ఞానమయ శరీరం మాత్రం, ఆ అనుభవాల సారాన్ని తీసుకుని, తిరిగి జన్మించే మనలోని సిసలైన జీవాత్మ, అంటే, Individual Soul. అయితే, వేదాలూ ఉపనిషత్తులూ ఉపదేశించేది, ఈ జీవాత్మ కూడా అనేక జన్మల పరిణామక్రమంలో, సక్రమంగా గనుక ముందుకు సాగితే, పొదగబడిన కోడిగుడ్డు పగిలినప్పుడు, అందులోనుంచి చైతన్య మయమైన కోడి పిల్ల వచ్చినట్టే, అజ్ఞానమనే జీవస్థితి పగిలి, అందులోనుంచి అంతర్యామి, లేక ఈశ్వరుడుగా ప్రస్తావించే, దైవ స్వరూపుడైన భగవదంశతో కూడుకున్న దివ్య స్వరూపం వెలికి వస్తుంది.

ఆ స్థితిలో ఇక మరి జన్మలు ఎత్తవలసిన అవసరం లేదు. ఆ స్థితిని చేరుకునేలోగా, జీవాత్మ ఎత్త వలసిన అనేక జన్మలూ, పాంద వలసిన అనుభవాలూ, సుఖ దుఃఖాలన్నిటినీ అనుభవించాల్సింది, ఈ విజ్ఞానమయ శరీరం, లేక జీవాత్మయే!

ఈ జీవాత్మయే, మరణించిన చాలా కాలానికి, తిరిగి బయట ఆకాశంలోకి ప్రవేశిస్తుంది. ఆకాశంలోని విద్యుత్తులో లీనమై పైకి ప్రయాణించి, చంద్రుడిలోనూ, సూర్యుడిలోనూ ప్రవేశించి, కొంత కాలానికి తిరిగి క్రిందకు ప్రయాణం చేస్తుంది.

మళ్ళీ సూర్యుని నుండి చంద్రునికీ, చంద్రుడిలోనుంచి ‘మెరుపు’ అంటే విద్యుత్తులోనికీ, వర్షపు బిందువులలోనికీ, తరువాత ప్రాణ చైతన్యంగా మొక్కలకూ, వాటిని తినే పశు పక్ష్యాదులకూ, ఆ పశువుల పాలను త్రాగే మానవ శరీరంలోకీ, అలా ప్రాణ స్వరూపంగా ప్రవేశిస్తుంది. ఈ ప్రాణ కళ, ముందుగా పురుషుడి శరీరంలో ఏర్పడి మూడు మాసాలుండి, అతడి సహస్రారం నుండి ఆజ్ఞాచక్రంలోకి దిగుతుంది. సంకల్పాలకు స్థానమైన ఆజ్ఞాచక్రంలోనుంచి, అభిమాన స్థానమైన హృదయంలోకి ప్రవేశించి, భార్యాభర్తల ప్రేమశక్తి ద్వారా భార్య హృదయంలోకీ, నాభి వద్ద మణిపూరక చక్రంలోకీ ప్రయాణించి, తల్లి యొక్క కుండలినీ శక్తి ద్వారా, ఆమె గర్భంలో ఒక శరీరాన్ని నిర్మాణం చేసుకుంటుంది.

అందుకే ఈ పునర్జన్మల చక్రానికి చంద్రుడూ, సూర్యుడూ ముఖ్యమైన సంబంధం. సూర్యుడికీ, చంద్రుడికీ మధ్య ఏర్పడే నక్షత్రాలూ తిథుల వల్లనే, మన జన్మ కాలంలోని తిథులూ, రాశి చక్రమూ, మన జీవితంలో రాగల ఫలితాలను సూచించే దశలూ, మన జన్మ నక్షత్రం నుంచే ఏర్పడుతున్నాయి. అందుకే మన సనాతనధర్మంలో, మనిషి పుట్టిన రోజు పండుగ అయిన నక్షత్రానికీ, మరణించిన తిథి నక్షత్రానికీ సంబంధించిన సంవత్సరీక, శ్రాద్ధ కర్మకూ, జీవునికీ, సంబంధం చెప్పబడింది. ఈ జన్మ నక్షత్రం, రాశి ద్వారానే, మన మహర్షులు యోగదృష్టి ద్వారా చూసి, ఆ జీవుని గత జన్మనూ, రానున్న జన్మలనూ, నాడీ గ్రంధాలలో ముందుగానే వ్రాసి పెట్టారు. దీనివల్ల జాతకంలోని గ్రహస్థితులకూ, ఆకాశంలో అవి ఏర్పడ్డ సమయానికీ, జీవుడు తల్లి గర్భం నుండి జన్మించే గ్రహస్థితికీ, జాతకంలో ఎందుకంత ప్రాముఖ్యత వున్నదో బోధపడుతుంది.

అలా తండ్రి శరీరంలో మూడు నెలలూ, తల్లి శరీరంలో 9 నెలలూ గడిపి, మొత్తం 12 రాశుల చక్రంలో జీవుడు ప్రయాణిస్తున్నాడు. ఇది, క్లుప్తంగా జనన మరణ చక్రం. దీనిని జాగ్రత్తగా విని అర్ధం చేసుకుంటే, అనేక రహస్యాలు బోధ పడతాయి.

శుభం భూయాత్!

Monday, November 18, 2024

శ్రీ కృష్ణుడి చిట్టచివరి ప్రసంగం! Last Message of Krishna on the day he left his body

 

శ్రీ కృష్ణుడి చిట్టచివరి ప్రసంగం!? TELUGU VOICE
కృష్ణుడు తనువు చాలించే ముందు చెప్పిన ఆఖరి మాటలేంటి?

కడలి లోతులను గుర్తుకు తెచ్చేటంతటి చరిత్రగల మహాభారత గాధలలో, నేటికీ మనలో చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు నిబిడీకృతమై వున్నాయి. అటువంటి వాటిలో ఒకటి, ఆ శ్రీకృష్ణ పరంధాముడు చెప్పిన చివరి మాటలు. ఆ స్వామి అవతార పరిసమాప్తికి ముందు చెప్పిన కొన్ని విషయాలు, ఆశ్చర్యం కలిగించక మానవు. ఇది ఆయన చిట్టచివరి ప్రసంగం. దీని తర్వాత ఇక ఆయన మాట్లాడ లేదు. ఇది లోకాన్ని ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పారు. ఇంతకీ శ్రీకృష్ణ పరంధాముడు చెప్పిన ఆ చివరి పలుకులేంటి? చాలామందికి తెలియని ఆ విషయాలకోసం, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/IkX39QAjEJw ]


‘ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’ అని చెప్పినట్లుగా, సాక్షాత్తు ఆ శ్రీ మహా విష్ణువే దిగివచ్చి, ద్వాపర యుగంలో కృష్ణావతారాన్ని ఎత్తిన విషయం తెలిసిందే. మానవ జన్మ అయినప్పటికీ, పుట్టినప్పటి నుంచీ ఒక పక్క ఎన్నో మహిమలను చూపుతూ, మరోపక్క అందరితో కలివిడిగా తిరగడం, తోటి స్నేహితులతో ఆటలాడటం, కొంటెపనులు చేయడం వంటి కార్యాలు చేస్తూనే వున్నాడు. అందువల్ల ఆయనంటే బృందావన వాసులు పంచ ప్రాణాలూ ఒడ్డే వారు. అటువంటి వారిలో, శ్రీకృష్ణుడి చిన్ననాటి స్నేహితుడైన ఉద్ధవుడు కూడా ఒకడుగా చరిత్ర చెబుతోంది. ఉద్ధవుడు వృష్ఠి వంశానికి చెందినవాడు. ఆయన సాక్షాత్తు దేవతలకు గురువైన బృహస్పతికి ప్రియ శిష్యుడు కూడా అని, భారతం చెబుతోంది. శాస్త్ర విజ్ఞానంలో మహా జ్ఞానిగా పేరు తెచ్చుకున్న ఉద్ధవుడు, శ్రీకృష్ణ పరంధాముడు రాజుగా పట్టాభిషక్తుడయిన కొద్ది రోజులకే, మథురా నగారానికి చేరుకున్నాడు. అప్పటి నుంచీ ఉద్ధవుడు కృష్ణ భగవానుడికి ఆంతరంగికుడిగా, ఆయన మంత్రులలో ఒకడిగా ఉండేవాడు.

కురుక్షేత్ర యుద్ధం తర్వాత, గాంధారి శాప ప్రభావంతో ద్వారకలో అనర్ధాలు సంభవిచడం కృష్ణ భగవానుడు గమనించి, ఇక తన అవతారం చాలించే సమయం ఆసన్నమయిందని నిర్ణయించుకున్నాడు. అంతంలో తాను చక్కబెట్టవలసిన కార్యాలన్నీ ముగించుకుని, తుది ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో, ఆయన చిన్ననాటి స్నేహితుడైన ఉద్ధవుడికి కబురు బెట్టాడు. ఆయన కృష్ణుడి దగ్గరకు వచ్చి, ‘మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడుకున్నాము, కలిసి తిన్నాము, సంతోషంగా గడిపాము. అటువంటిది నీ అవతారం పరిసమాప్తమవుతోందంటే, జీర్ణించుకోలేక పోతున్నాను కృష్ణా. నాదొక ప్రార్థన.. నా మనస్సు శాంతించేటట్లూ, నిరంతరమూ నీతోనే ఉండిపోయేటట్లూ ఏదయినా ఉపదేశం చేయి’ అని ప్రార్థించాడు. దానికి పరంధాముడు చిరు దరహాసంతో, మనుష్యులు జీవితంలో పాటించవలసిన నియమాలనూ, రాబోయే కలియుగం యొక్క స్వరూపాన్నీ, భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలనూ ముందుగానే ఉద్ధవుడితో చెప్పాడు. ఆ పలుకులే కృష్ణావతారంలో చివరి పలుకులని భాగవతం 10వ స్కంధంలో ఉంది.

పరమాత్ముడు ఉద్ధవుడితో చెప్పిన ఆ చివరి మాటల ప్రాకారం, ‘నేటికి సరిగ్గా ఏడవ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఏడవ రాత్రి లోపు ద్వారకా నగరం మొత్తం కడలి గర్భంలో కలిసి పోతుంది. దానితో ద్వారక వాసులందరూ మృత్యువు పాలవుతారు. ఆ తరువాత కలి ప్రవేశంతో కలియుగం ప్రారంభమవుతుంద’ని శ్రీ కృష్ణుడు చెప్పినట్లుగా తెలుస్తోంది. కలియుగం ప్రారంభం కాగానే, కలి ప్రభావం మనుషులపై చూపడం మొదలై, మానవులలో అపారమైన కోర్కెలూ, విపరీతమైన కోపం పెరిగిపోతాయనీ, కలియుగంలో ఎవ్వరూ తమ తప్పులను తాము తెలుసుకునే ప్రయత్నం చేయక, ఈ రెండు కారణాల వల్లా వివిధ రోగాలకు గురై, వారి ఆయుర్దాయం క్రమక్రమంగా క్షీణించి పోతుందని, శ్రీకృష్ణుడు చెప్పాడు..

అలాగే, కలియుగంలో మనుష్యులకు వేదాలపై అవగాహన పూర్తిగా నశించిపోయి, వేద ప్రోక్తమయిన భగవన్మూర్తులను మరచి పోతారు. అందువల్ల వారు చేసే పూజలకు అర్ధం పర్ధం లేకుండా పోతుంది. దానిని అలుసుగా తీసుకుని, అవన్నీ మూఢ నమ్మకాలని చెప్పే వర్గాలవారు తయారవుతారు. వారిని నమ్మి చాలా మంది వేద విహిత కర్మలను విడిచి పెట్టేస్తారు. వేదాల చేత ప్రోక్తమయిన భగవన్మూర్తులను పూజించ వద్దని చెప్పిన మాటలు బాగా రుచించి, కోట్ల జన్మల అదృష్టం చేత వేదం ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదాన్ని వదిలి, తమంత తాముగా పాషండ మతాలను కౌగలించుకుని, అభ్యున్నతిని విడిచి వేరు మార్గాలలోకి వెళ్ళి పోతారు.

పూజలు తమ మనస్సును సంస్కరించు కోవడానికీ, ఆచారాలు తమంత తాము పాటించడానికీ ఏర్పడినవి. తక్కువ పదార్ధాలను తిని శరీరాన్ని నిలబెట్టుకుని, మరింత పవిత్రంగా పూజ చేసుకోవడం కోసమని, ఉపవాసమనే ఆచారం వచ్చింది. కలియుగంలో రానురానూ ఆచారాలను విడిచి పెట్టేయడానికే, ప్రజలు ఇష్ట పడతారు. ఆచారం లేని పూజ చేయడానికే సుముఖత చూపెడతారు. ఆచారం అక్కర్లేదనే పూజలు ఏవేవి ఉంటాయో, వాటిపై మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదం కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోలేరు.

అంతః శ్శుద్ధి ఉండదు, చిత్త శుద్ధి ఏర్పడదు. ఆచారాలనూ, సంప్రదాయాలనూ విడిచిపెట్టిన పూజలపై మక్కువ చూపించి, అటు మొగ్గుజూపడం ప్రారంభిస్తారు. మంచి ఆచారాలు మనస్సును సంస్కరిస్తాయని తెలుసుకోవడం మానేసి, ఏ రూపాన్ని ఆశ్రయిస్తే, ఏ పూజజేస్తే ఆచారం అవసరంలేదని ప్రచారం ఉంటుందో, అటు వైపుకే అడుగులు వేస్తారు. కానీ దాని వలన తాము పొంద వలసిన స్థితిని పొందలేమని తెలుసుకోలేక పోతారని, శ్రీకృష్ణుడు వ్యక్త పరిచాడు.

అంతేగాకుండా, కలియుగంలో మానవులందరూ ఇంద్రియాలకు వశమై, దానివల్ల కలిగే సుఖాలే అసలైన స్వర్గమని అపోహపడి, వారి జీవితాలను నరక ప్రాయం జేసుకుంటారు. ఇంద్రియ సుఖాలకు లోబడి, పాప కర్మలను మూటగట్టుకుని, మరణాంతరం నరకానికి చేరుకోవడమే కాకుండా, ఆ పాప కర్మల వల్ల మరు జన్మలలో కూడా ఎన్నో కష్టాలకు లోవనవుతారు. ఇంద్రియ సుఖాల వల్ల తమకు అంత నష్టం జరుగుతున్నా, కలియుగ మానవులు వారి దారిని ససేమిరా మార్చుకోరు. కలియుగంలో ధనార్జనే మానవులకు ప్రధానంగా మారుతుంది. రాజులు ప్రజల సొమ్మును దోచుకుంటుంటే, ప్రజలు రాజుల మీద తిరగబడి, ప్రజా ఉద్యమాలు మొలకెత్తుతాయి. అయినా అందరూ ధనానికే ప్రాధాన్యతనిస్తారు. ఎవరికీ పాండిత్యాన్ని బట్టిగానీ, యోగ్యతను బట్టిగానీ గౌరవం లభించదు. కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్న దానికన్నా, ఎంత వెనకేసుకున్నాడన్నదే ప్రధానమవుతుంది. ఐశ్వర్యవంతుడే పండితుడిగా కొనియాడబడతాడని, శ్రీకృషుడు తెలియజేశాడు.

కలియుగం గురించిన విషయాలన్నీ ఉద్ధవుడికి చెప్పిన తర్వాత, ఆ స్వామి ఆయనను వెంటనే ద్వారకను వదలి, బదిరకాశ్రమానికి వెళ్లిపొమ్మని చెప్పాడు. అక్కడికి వెళ్లిన తరువాత, బంగారం, లేదా వెండి, లేదా కంచు వంటి లోహాలలో ఏదైనా ఒక లోహంతో తన ప్రసన్న మూర్తిని తయారుజేయించుకుని, దానిని పూజా మందిరంలో పెట్టుకుని నిత్యం పూజించమని చెప్పాడు. ‘విగ్రహారాధన’గా అన్యమతస్థులు ఎత్తి పొడిచే ఆ పద్ధతి గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాము. ఆ విధంగా ఓ సాత్విక మూర్తికి పూజలు చేయడం వలన, కొద్ది రోజులకు అతడు అర్పిస్తున్న పుష్పాలను భగవంతుడు స్వీకరిస్తున్నట్లూ, సమర్పించిన ప్రసాదం సేవిస్తున్నట్లూ అనిపిస్తుంది. అలా క్రమంగా అతడి అహంకారాన్ని ఆ మూర్తి హరించడం మొదలు పెడుతుంది. క్రమక్రమంగా అతడు ఆ మూర్తి ఆశీర్వచనం మీద ఆధారపడడం ప్రారంభిస్తాడు. మనస్సు తొందరగా నిలబడడానికి, ‘విగ్రహారాధన’ అనేది ఒక ఆలంబన. కొన్నాళ్ళకు ప్రతి జీవి గుండెలలోనూ పరమాత్మ ఉన్నాడనే సత్యాన్ని గ్రహించ గలుగుతాడు.

అప్పుడు ఎక్కడ చూసినా అతడికి నారాయణుడే కనిపిస్తాడు. పరమాత్మ అనేక రూపాలతో దర్శనమిస్తాడు. అంతటా ఉన్న ఈశ్వరుని చూస్తూ ఉండగా ఒకనాడు, జీవునిలో వున్న ప్రాణవాయువు ఉత్క్రమణమును పొందుతుంది. అతడు నన్నే చూస్తూ వెళ్ళిపోతాడు కాబట్టి, నా యందే చేరిపోతాడని, పరమాత్ముడు చెప్పాడు. ఆ విధంగా పరంధాముడు ఉద్ధవుడికి తన అమృత వాక్కులను వినిపించి, అవతార పరిసమాప్తి కోసం వెళ్ళిపోయాడు. ఆ వెంటనే ఉద్ధవుడు కూడా బదరికాశ్రమం చేరి, తన శేష జీవితం మొత్తం, భగవన్నామ స్మరణలో గడిపి, కలి ప్రభావం నుంచి తప్పించుకుని ముక్తినొందాడని, భాగవతంలో చెప్పబడి ఉంది.

🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

Monday, November 11, 2024

HONDURAS: Lost City of the Monkey God! ‘అద్భుత నగరం’ ఆనవాళ్ళు!


మకరధ్వజుడేలిన ‘అద్భుత నగరం’ ఆనవాళ్ళు! అమెరికాలో? TELUGU VOICE
HONDURAS: Secrets of a Lost City of the Monkey God!

అనిలాత్మజుడు ఆజన్మ బ్రహ్మచారనీ, శివుడికి కైలాసంలాగా, విష్ణుమూర్తికి వైకుంఠంలాగా, ఆంజనేయ స్వామికి ఒక చోటంటూ ఉండదనీ, ఆయన నిరంతర రామనామ జపం జరిగే ప్రదేశాలలో, అదృశ్య రూపంలో తిరుగుతూ ఉంటాడనీ మనకు తెలిసిందే. మరి అటువంటి హనుమంతుడి కొడుకు ఎవరు? అతడేలిన ఒక మహా నగరాన్ని కొత్తగా కనుగొన్నారా?... అవును.. ఆ నగరం మన దేశంలోనో, లేక ఆసియా ఖండంలోనో కాకుండా, భూమికి ఆవలి వైపున ఉన్న మరో ఖండంలో ఉంది! అక్కడ కొన్ని వేల ఏళ్లుగా హనుమంతుడిని కోలుస్తున్నారు! మరి చాలామందికి తెలియని ఆ విషయాలకోసం, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/_5M8nrRGuYE ]


అది 1940వ సంవత్సరం.. దక్షిణ అమెరికా ఖండంలోని Honduras అనే ఒక చిన్న దేశం. నేటివ్ అమెరికన్ల సంస్కృతీ సంప్రాదాయలకు సంబంధించిన వివిధ రకాల పురాతన వస్తువులను సేకరించి, తన మ్యుజియంలో భద్రపరిచే George Gustav Heye అనే వ్యక్తి, మొదటి సారి ఆ దేశంలో అడుగుపెట్టాడు. అతను ఆ దేశానికి వచ్చినప్పటి నుంచి, అతని మెదడును తొలిచేస్తున్న ఒకే ఒక్క పేరు, La Ciudad Blanca. Gustav ఆ దేశంలో దిగినప్పటి నుంచి, ఎంతో మందిని ఆరా తీసింది, ఈ ‘La Ciudad Blanca’ గురించే.  అప్పుడే అతడికి, Theodore Morde అనే వ్యక్తి పరిచయం అయ్యాడని, చరిత్రకారులు చెబుతున్నారు.

Theodore Morde, అమెరికాకు చెందిన ఒక సాహస యాత్రీకుడు, జర్నలిస్ట్ గా కూడా పనిచేసిన వ్యక్తి. అతడికి అప్పటికే ‘La Ciudad Blanca’ గురించి కొంత అవగాహన ఉంది. తనకు ఆర్ధిక సాహయం, కొన్ని ఆధునిక పరికరాలూ సమకూర్చితే, La Ciudad Blanca ను కనిపెట్టి తీరతానని, Gustav కి చెప్పాడు. దాంతో వారిద్దరూ కలిసి, దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న అతి భయంకరమైన La Mosquitia అనే వర్షారణ్యంలోకి వెళ్ళారు. అక్కడ వారు అనేక నదులూ, సరస్సులూ, పెద్ద పెద్ద పర్వతాలూ దాటుతూ... అప్పటివరకు ప్రపంచం చూడని ఎన్నో ప్రమాదకర విష సర్పాలనూ, మనుషులను ఆమాంతం మింగేయగల భారీ అనకొండాలనూ, చిన్న కాటుతో పైలోకాలకు పంపించగల కీటకాల నుంచీ తప్పించుకుంటూ, ఎట్టకేలకు La Ciudad Blanca ను చేరుకోగలిగారు.

అక్కడ తెల్లటి రాతితో కట్టబడిన పెద్ద పెద్ద ఆలయాలూ, పలు ఇతర రాతి నిర్మాణాలూ, దాదాపు శిధిలమైన స్థితిలో, అంతరించిపోయిన ఓ మహానగరమే వారికి కనిపించింది. దాని పేరే, La Ciudad Blanca అనీ, స్పానిష్ భాషలో, ‘The White City’ అనే అర్ధం వస్తుందనీ, నిపుణుల మాట. ఆ నగరంలో ఉన్న వివిధ కట్టడాలను పరిశీలించిన Theodore Morde కి, కొన్ని విరిగిన రాతి మెట్లు కనిపించాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించగా, అక్కడ భారీ కప్ప ఆకారంలో ఉన్న శిల్పం ఒకటి కనిపించింది. దానిని ఇంకాస్త పరిశీలించగా, అందులో మొసలి ఆకారం కూడా కనిపించింది. దానిని బట్టి, ఆ విగ్రహాన్ని ఒక కోణంలో చూస్తే మొసలిగా, మరో కోణంలో చూస్తే కప్పగా కనిపించే తీరులో, ఆ విగ్రహాన్ని మలచడం జరిగింది. దాంతో అవి ఓ పురాతన ఆలయానికి చెందిన శిధిలాలని, వారికి అర్ధం అయ్యింది. ఆ మెట్లను పట్టుకుని ఇంకాస్త దూరం వెళ్తే, వారికి చాలా కోతుల బొమ్మలు కనిపించాయి. అవన్నీ చూడటానికి ఒకే విధంగా ఉన్నా, ఒక్క కోతి బొమ్మ మాత్రం, తెల్లటి రాయితో కాకుండా, గోధుమ రంగు రాయితో చెక్కారనీ, దానికి ఒక చేతిలో గద ఉందనీ Morde గమనించాడు. పూర్వం ఆ మెట్లకు చివరన పై భాగంలో, ఓ భారీ కోతి విగ్రహం ఉండేదని, స్థానిక కథల ద్వారా తెలుస్తుంది.

అక్కడ ఉన్న ఆ వింత కోతి ఆకారాన్ని మరింత లోతుగా పరిశీలించిన Morde కి, అది ఎక్కడో భారత దేశంలో ఉండే హిందువులు కొలిచే హనుమంతుడి విగ్రహంతో సరిపోలుతొందనిపించింది. దాంతో Morde, Gustav తో కలిసి ఆ ప్రాంతం గురించి మరింత లోతుగా పరిశోధనలు జరపగా, అది కొన్ని వేల ఏళ్ల క్రితం పూర్తిగా మానవ లోకం నుంచి వేరు పడిన, The Lost City of the Monkey God అని తెలిసివచ్చింది.

Morde, Gustav లు చాలా రకాలైన వస్తువులనూ, కొన్ని చిన్న చిన్న శిలలనూ అక్కడి నుంచి బయటి ప్రపంచానికి తీసుకు వచ్చారు. అంతేకాదు, వారు తీసుకువచ్చిన వాటిలో, రాళ్ళతో చేసిన పనిముట్లు, ఆయుధాలు, లోహంతో చేసిన ఆయుధాలు కూడా ఉన్నాయి. అవే కాకుండా, వారిద్దరూ అక్కడ బంగారం, ప్లాటినం, శిలాజ ఇంధన అవశేషాలు కూడా కనుగొన్నట్లు తెలుస్తుంది. నాడు Morde, Gustav లు తీసుకువచ్చిన ఆ అవశేషాలను, అమెరికా New York సిటీలో ఉన్న The National Museum of American Indian లో చూడవచ్చు.

వారి తర్వాత మరికొంతమంది చరిత్రకారులూ, శాస్త్రవేత్తలూ, అతి కష్టంమీద Honduras లో గల ఆ పురాతన నగరానికి చేరుకుని, మరికొన్ని పరిశోధనలు చేశారు. వారి పరిశోధనల ప్రకారం, దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితమే, Honduras అడవులలో ఈ మహానగరం వేలసిందనీ, దానిని అక్కడ నివసించిన నేటివ్ ప్రజలు నిర్మించి ఉంటారనీ తెలుసుకున్నారు. అప్పట్లో అక్కడ నివశించిన ప్రజలు, కోతులను దేవుళ్ళుగా కొలిచేవారు. అంతేగాకుండా, అక్కడున్న ప్రత్యేకమైన కోతి విగ్రహానికి, కొన్ని విశేష పూజలు నిర్వహించేవారు. ఆ కోతి విగ్రహం ముందు దీపం వెలిగించడం, ధూపం సమర్పించడం, పలు రకాల పళ్ళనూ, కందములాలనూ ప్రసాదంగా నివేదించడం వంటివి కూడా చేశారనీ, అటువంటి పూజా విధానం, భారత దేశంలోని సనాతన ధర్మస్తులు చేసే పూజా విధానంతో సరిపోలుతోందనీ, చరిత్రకారులు గుర్తించారు.

దాంతో అక్కడ ఉన్న Monkey God, మన పురాణాలలో చెప్పబడిన హనుమంతుల వారే అని, నిపుణులు నిర్ధారించారు. అందుకు రామాయణంలో చెప్పబడిన ఓ ఘట్టాన్ని సాక్ష్యంగా కూడా చూపిస్తున్నారు. రామాయణంలోని యుద్ధ కాండలో, ఒకనాడు తాను యుద్ధం ఓడిపోతానేమో అని భయపడిన రావణుడు, తన మేనమామ అయిన మైరావణుడి సహాయం కోరాడు. అతడు పాతాళ లోకానికి రాజుగా, మహా మాయావిగా, ముల్లోకాలలో పేరు తెచ్చుకున్నాడు. మేనల్లుడి కోరిక మేరకు ఒక రోజు సూర్యాస్తమయం తర్వాత, యుద్ధం ముగిసిన కొంతసేపటికి, మర్నాడు అవలంభించవలసిన యుద్ధ తంత్రాల గురించి చర్చలు జరిపిన రామ లక్ష్మణులు, విశ్రాంతికోసం వారి శిబిరంలోకి వెళ్ళారు. అక్కడ రాముల వారు నిద్రకుపక్రమించిగా, లక్ష్మణుడు అన్నగారి కాళ్ళు వత్తుతూ ఉన్నాడు. మాయావి అయిన రావణుడు స్వామికి అపకారం తలపెట్టే అవాకాశం ఉండటంతో, హనుమంతుల వారే ప్రతి రోజూ ఆ శిభిరానికి కాపలాగా ఉండేవారు. ఆ రోజు కూడా హనుమంతుల వారు కాపలా కాస్తుండగా, రావణుడి తమ్ముడూ, రామ భక్తుడైన విభీషణుడు, ఆ శిభిరం దగ్గరకు వచ్చి, ఓ ముఖ్యమైన సమాచారాన్ని రాముల వారికి చేరవేయాలని చెప్పడంతో, అతన్ని ఆ శిభిరంలోకి అనుమతించాడు, ఆంజనేయుడు. అలా లోపలకి వెళ్ళిన మాయా విభీషణుడు, తన మంత్రోచ్చాటనతో రామ లక్ష్మణులు మూర్చబోయేలా చేశాడు. ఆ తర్వాత వారిని సూక్ష్మ శరీరులుగా మార్చి, ఓ పెట్టెలో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 

ఇది జరిగిన కొంత సమయానికి అక్కడికి అసలైన విభీషణుడు వచ్చి, రాముల వారితో మర్నాటి యుద్ధం గురించి చర్చించాలని, హనుమంతుల వారితో అన్నాడు. ఆ మాటకు ఖంగుదిన్న హనుమంతుడు, జరిగిన మోసాన్ని విభీషణుడితో అన్నాడు. దాంతో కంగారుగా ఆ గుడారంలోకి వెళ్లి చూడగా, అక్కడ రామ లక్ష్మణులు లేకపోవడం చూసి, ఆ పని తన మేన మామ అయిన మైరావణుడే చేసివుంటాడని అన్నాడు, విభీషణుడు. అతడు పాతాళ లోకానికి రాజనీ, ఆ లోకానికి తీసుకు వెళ్ళే స్వరంగ మార్గం తనకు తెలుసనీ, వెంటనే ఆ మార్గం గుండా వెళ్లి అతడిని పట్టుకోకపోతే, రామ లక్ష్మణుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదముందనీ, విభీషణుడు పవన తనయుడితో అన్నాడు. దాంతో ఆంజనేయుడు వెంటనే ఆ స్వరంగా మార్గం గుండా ప్రయాణించి, మైరావణుడుండే పాతాళ లోకానికి చేరుకున్నాడు.

పాతాళ లోక ద్వారం దగ్గర మకరధ్వజుడనే ఓ విచిత్రాకారుడు కాపలా కాస్తూ కనిపించాడు. అతడు సగం కోతి రూపంలో, సగం మొసలి రూపంలో ఉండడం చూసిన ఆంజనేయుడు తన దివ్యదృష్టితో, అతడు తన స్వేదంనుండి ఉద్భవించిన వాడని గ్రహించాడు. హనుమంతుల వారిని చుసిన మకరధ్వజుడు, వచ్చినది తన తండ్రి అని గ్రహించి, జరిగిన వృతాంతం చెప్పి, తండ్రి ఆశిస్సులను పొందాడు. అతను చెప్పిన మాటలకు సంతోషించిన హనుమంతుల వారు, మైరావణుడిని అప్పగించమని కోరాడు. దానికి సమ్మతించని మకరధ్వజుడు, ఆంజనేయుడితో యుద్ధం చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత హనుమంతుల వారు పంచముఖుడై, మైరావణుడిని వధించి, రామ లక్ష్మణులను రక్షించి భూమిపైకి తీసుకువచ్చాడు. అలా వచ్చే ముందు తన కొడుకైన మకరధ్వజుడికి ఆయన పాతాళలోక పాలన అప్పగించాడనీ, అతడి పాలనలో మకరధ్వజుడినీ, హనుమంతుల వారినీ అక్కడి ప్రజలు భక్తి శ్రద్ధలతో కొలిచేవారనీ, చరిత్రకారులు చెబుతున్నారు. భౌగోళికంగా చూసుకుంటే... భారత దేశానికి సరిగ్గా దిగువన దక్షిణ అమెరికా ఖండం, మరీ ముఖ్యంగా బ్రెజిల్, Honduras వంటి దేశాలే వస్తాయి. ఆ ప్రకారంగా చూసుకుంటే, భారత ఇతిహాసాలలో చెప్పబడిన పాతాళ లోకం, దక్షిణ అమెరికా ఖండం అయ్యే అవాకాశం లేకపోలేదని, చరిత్రకారులు ఘంటాపథంగా చెబుతున్నారు.

కొంతమంది మాత్రం, ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత పురాతన నాగరికత గల దేశం భారత దేశమనీ, అందువల్ల ఇక్కడ ఉండే ప్రజలు, పూర్వకాలంలో వ్యాపార  నిమిత్తం కానీ, కొత్త ప్రాంతాలను కనుగొనడానికి కానీ, ఓడలపై ప్రయాణాలు చేసేవారనీ, ఈ సందర్భంలో మన దేశానికి చెందిన పూర్వికులు, ప్రపంచంలో ఉన్న చాలా ప్రదేశాలకు వెళ్లి, అక్కడి ప్రజలకు నాగరికత నేర్పించాడంతో పాటు, మన దేవుళ్ళకు చెందిన ఆలయాలను నిర్మించి, అక్కడ పూజలు చేసేవారని, వారి వాదన. ఈ మధ్య కాలంలో, ప్రపంచ వ్యాప్తంగా బయటపడుతున్న పలు హిందూ దేవుళ్ళ విగ్రహాలూ, ఆలయాల వెనుక, ఈ కారణమే ఉంటుందని, వీరి వాదన. ఆ విధంగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే, భారతీయులు దక్షిణ అమెరికా ఖండానికి వలస వెళ్లి, అక్కడి అడవులలో ఓ మహా నగరాన్ని నిర్మించి ఉండవచ్చనీ, ఆ నగరమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న The Lost City of the Monkey God అనీ, అంటున్నారు.

ఎవరి వాదన ఎలా ఉన్నా, భారత దేశం నుంచి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న ఆ ప్రాచీన నగరాన్ని ఒకప్పుడు పాలించింది మన భారతీయులేననీ, అక్కడ దొరికిన ఆధారాలను బట్టి, అది కేవలం ఒక మహా నగరంగానే కాకుండా, నాడు బంగారు వర్తకం చేసిన ఓ ప్రముఖ నగరంగా కూడా ఉండేదని చెప్పడంలో, ఎటువంటి సందేహం లేదు. మరి అంతటి మహా నగరం నేడు శిధిలావస్థలో దర్శనమివ్వడం వెనుక ఉన్న అసలు కారణాలు మాత్రం, భగవంతుడికే తెలియాలి. మీరేమని అనుకుంటున్నారో comments ద్వారా తెలియజేయండి..

🚩 ఓం శ్రీ ఆంజనేయం 🙏

Thursday, November 7, 2024

నవంబర్‌ 9, 2024 "కోటి సోమవారం!"


నవంబర్‌ 9, 2024 "కోటి సోమవారం!" TELUGU VOICE

కార్తీక సోమవారం లాగానే, కోటి సోమవారం అనే ఒక సోమవారం వస్తుందనుకుంటే, అది పొరపాటే...

సోమవారం శివుడికి ఇష్టమైన రోజు, కోటి సోమవారాల పూజ ఫలితాన్ని ఇచ్చే విశేషమైన రోజు, 'కోటి సోమవారం'.

కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రంతో కలసి వచ్చే రోజునే, కోటి సోమవారంగా పిలుస్తారు.

ఈ 2024లో, కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రం నవంబర్‌ 8న ఉదయం 9.18 నిముషాలకు ప్రారంభమై, నవంబర్‌ 9న శనివారం ఉదయం 8.42 నిముషాలకు ముగుస్తుంది. శ్రవణా నక్షత్రం సూర్యోదయంతో కలిసి ఉండడం వలన, నవంబర్‌ 9ని కోటి సోమవారంగా జరుపుకోవాలని అధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఆ రోజు చేసే ఏ పని అయినా సరే.. దీపం, స్నానం, దానం, ఉపవాసం లాంటివి, కోటి రెట్లు అధిక ఫలాన్నిస్తాయని శాస్త్ర విదితం.

🚩 ఓం నమః శివాయ 🙏

Tuesday, November 5, 2024

నాగుల చవితి 2024 Nagula Chavithi


అందరికీ 'నాగుల చవితి' శుభాకాంక్షలు 🙏  TELUGU VOICE

'కాల నాగు' మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాలను గ్రక్కుతూ, మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందనీ, అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే, మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివసించే 'శ్రీమహావిష్ణువు'కు తెల్లని ఆదిశేషువుగా మారి, శేషపాన్పుగా మారాలనే కోరికతో చేసేదే, ఈ పాము పుట్టలో పాలు పోయడంలో గల ఆంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వారా తెలుస్తుంది.

పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి, దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా, నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాము. అలాగే మన బ్రతుకనే పాలను, జ్ఞానమనే వేడితో కాచి, వివేకమనే చల్ల కలిపితే, సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా, శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం, శివం, సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే, సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే, త్యాగము, యోగము, భోగమనే మూడు రకాల నెయ్యి ఆవిర్భవిస్తుంది. సకల వేదాల సారం, సకల జీవన సారం అయిన పాలను, జీవనానికి ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం ఇదే.

”దేవాః చక్షుషా భుంజానాః భక్తాన్‌ పాలయంతి” అనేది ప్రమాణ వాక్యం.. అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం.  పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా, కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి.

నాగులచవితి రోజు పుట్ట వద్ద పఠించ వలసిన శ్లోకం..

పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా!

నాగుల చవితి రోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ |
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనమ్‌ ||

పాములకు చేసే ఏదైనా పూజ, నైవేద్యం, నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్ప దేవతలు ఉన్నప్పటికీ, 12 మందిని మాత్రం నాగుల చవితి పూజా సమయంలో కొలుస్తారు.

చవితి నాడు సర్పాలను పూజిస్తే, కుజ దోషం, కాలసర్ప దోషానికి అధిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి, నాగుపాము పుట్టకు పూజ చేస్తే, కళత్ర దోషాలు తొలగుతాయని, శాస్త్రాలు సూచిస్తున్నాయి.

దేవతా సర్పాలుగా పేర్కొనబడే - అనంత, వాసుకి, శేష, పద్మ, కంబాల, కర్కోటక, ఆశ్వతర, ధృతరాష్ట్ర, శంఖపాల, కలియ, తక్షక, పింగళ అనే  12 దేవతా సర్పాలను ఈ రోజు పూజించి, ఆశీర్వాదాలు పొందుతారు. ఈ విశ్వంలో పాములు - ఆకాశంలో, స్వర్గంలో, సూర్యకిరణాలలో, సరస్సులలో, బావులూ చెరువులలో నివసిస్తాయి.

పాము పుట్టలో పాలు పోసేటప్పుడు ఇలా చేప్పాలి, పిల్లల చేతా చెప్పించాలి.

 "నడుము తొక్కితే నావాడనుకో
 పడగ తొక్కితే పగవాడు కాదనుకో
 తోక తొక్కితే తోటి వాడనుకో
 నా కంట నువ్వు పడకు, నీ కంట నేను పడకుండా చూడు తండ్రీ.." అని చెప్పాలి.

ప్రకృతిని పూజిచటం, మన భారతీయుల సంస్కృతి. మనం విషసర్పమును కూడా పూజించి, మన శత్రువును కూడా ఆదరిస్తామని అర్ధము. పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటే, వారికి మంచి అలవాట్లు నేర్పించడం, మన ముఖ్య వుద్దేశము. మనలను ఇబ్బంది పెట్టినవారినీ, కష్టపెట్టేవారిని కూడా క్షమించాలని తెలియజేయటమే, ఇలాంటివి నేర్పటంలో ముఖ్య ఉద్దేశము.

నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోసిన తరువాత, బియ్యం, రవ్వ, లేదా పిండిని చుట్టూ జల్లుతారు. ఎందుకంటే, మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులకు ఆహారాన్ని సమకూర్చడానికి. ఉదాహరణకు, చీమలకు ఆహారంగా అదే కదా.. పుట్ట నుండి మట్టి తీసుకుని, ఆ మట్టిని చెవులకు పెడతాము. ఇది చెవికి సంభందించిన ఇబ్బందులు రాకుండా..

Monday, November 4, 2024

What is Cosmic Plan? | కర్మయోగం!


కర్మయోగం! TELUGU VOICE
ఫలాన్ని ఆశించి చేసే 'కర్మ' వలన ఎటువంటి ఫలితాన్ని పొందుతాము?

ఫలితంపై కోరిక లేకుండా పనిచేయడానికి, అంటే, నిష్కామకర్మకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు పెట్టిన పేరే, 'కర్మయోగం'. యోగం అంటే ఆసనాలు వేయడం, గాలి పీల్చడం అని మనం సాధారణ పరిభాషలో అనుకుంటూ వుంటాము. నిజానికి యోగమంటే కలయిక. ఫలానా వాడికి రాజయోగం పట్టింది, లక్ష్మీ యోగం పట్టిందని అనడం వింటూంటాము. లేనిదానిని పొందడం, పొందినదానిని రక్షించుకోవడమే, యోగమంటే. ఇక్కడ కర్మయోగం అంటే, కర్మ అనే ఉపాయాన్ని పట్టుకుని, మరొకదానిని సాధించడం. ఆ మరొకటే, 'ఆత్మజ్ఞానం'. ఆ విషయాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/XycX4sTLnE8 ]


ఫలితం కోరకుండా పని చేసే వ్యక్తి మనస్సు, క్రమక్రమంగా పవిత్రంగా మారుతుంది. దీనినే చిత్తశుద్ధి అంటారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మంచిపనులు చేస్తున్నప్పుడు, మనస్సు ఎంత ప్రశాంతత, సంతృప్తిని పొందుతుందో, మనం స్వంతంగా ప్రయత్నం చేసి చూడవచ్చు. కర్మ మనస్సును శుభ్రపరచడానికి ఒక మార్గం. చిత్తశుద్ధి ఉన్న వ్యక్తియే, ఆత్మజ్ఞానం గురించి ఆలోచన చేయగలడని ఉపనిషత్తుల సిద్ధాంతం.

కర్మయోగం గురించి చెబుతూ, శ్రీకృష్ణుడు ‘యోగః కర్మసు కౌశలం’ అన్నాడు. ‘కర్మయోగం అంటే, పనులు చేయడంలో నేర్పరితనం’ అని చెప్పాడు. ఏమిటి ఆ నేర్పరితనం అంటే, కర్మచేస్తూ ఉండి కూడా, దాని ఫలితం నుంచి తప్పించుకోవడం. అది ఒక దొంగ దొంగతనం చేసి తప్పించుకున్నట్లు కాకుండా, మంచి పని చేసి కూడా దాని ఫలితమైన పుణ్యాన్ని కోరకపోవడం.. ఇది ఆశ్చర్యంగా కనిపించవచ్చు. ఇందుకు ఉదాహరణగా ఒక సంఘటన చెప్పుకుందాము..

ఒకానొక సందర్భంలో కాశీలోని హనుమాన్‌ ఘాట్ దారి గుండా ఇద్దరు యువకులు వెళుతున్నారు. ఆ సమయంలో ఇద్దరు యువతులు నీళ్ళలో మునిగిపోయే స్థితిలో ఉండటం యాదృచ్ఛికంగా గమనించారు వాళ్ళు. మరు క్షణమే ఆ ఇద్దరూ ముందూ వెనుకా చూడకుండా నీళ్ళలోకి దూకి, మునిగి పోబోతున్న ఆ ఇద్దరు యువతులనూ సురక్షితంగా కాపాడి, వడ్డుకు చేర్చారు.

తమను కాపాడిన ఆ ఇద్దరు యువకులకూ తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నారు, ఆ యువతులు. కాపాడిన యువకుల్లో ఒకడు, తను కాపాడిన యువతితో తనను వివాహం చేసుకోమని అడిగాడు. అతడు “ఈ లోకమే సత్యం" అనే దృక్పథంగల వాడు. రెండవ యువకుడు, తనకన్నా వయస్సులో పెద్దవారైన స్త్రీలను తల్లి గానూ, సమ వయస్కులైన వారిని సోదరిగానూ, పిన్నలను పుత్రికలుగానూ భావించి మెలగేవాడు. కనుక అతడు, “సోదరీ, ఒక మంచి పని చేయడానికి భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. నేను నా కర్తవ్యాన్ని మాత్రమే చేశాను” అని తాను కాపాడిన యువతితో చెప్పాడు. అతడు "భగవంతుడు మాత్రమే సత్యం” అనే దృక్పథం గలవాడు.

బాహ్య స్థాయిలో చూసినప్పుడు, ఇద్దరు యువకులూ ఒక ప్రాణాన్ని కాపాడాలనే ఒకే రకమైన కర్మనే చేశారు. కానీ వాస్తవ దృక్పథం ప్రకారం, ఇద్దరిలో వ్యత్యాసం ఉంది. ఆ కారణంగా, వారికి ఫలమూ విభిన్నంగానే దక్కింది.

కర్మయోగి కానివాడు, స్వంత అభ్యుదయం కోసం పనిచేస్తూ, జనన మరణ చక్రంలో తిరుగుతూ వుంటాడు. అతడికి మోక్షం ప్రాప్తించదు. అలాకాకుండా, 'కర్మయోగి' లోకం మేలు కోసం, ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేస్తూంటాడు. ఈశ్వరార్పణ అంటే, తాను భగవంతుడి కాస్మిక్ ప్లాన్ లో ఒక భాగంగా, భగవంతుని చేతిలో ఒక పనిముట్టుగా భావిస్తూ, పనిచేయడం. దీనివల్ల ప్రయోజనం, చిత్తశుద్ధి. చిత్తశుద్ధి ఉన్న మనస్సు, పరిశుభ్రమైన అద్దం వంటిది. ఒక అద్దంలో ఏదైనా వస్తువు ప్రతిబింబం ఏర్పడాలంటే, అద్దం శుభ్రంగా ఉండాలి. అలాగే, ఆత్మజ్ఞానమనే వెలుగును ప్రతిబింబించాలంటే, మనస్సనే అద్దం శుభ్రంగా ఉండాలని, వేదాంతం చెబుతుంది.

ఫలితాన్ని ఆశించి చేసే 'కర్మ', బంధానికి దారి తీస్తుంది. తనను భగవంతుని ఉపకరణగా భావించి కర్మను ఆచరించటమూ, దాని ఫలాన్ని భగవంతునికే అర్పించడమూ, 'ఆత్మ విముక్తి'కి దారి తీస్తుంది. పైగా, ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్న వారు మాత్రమే, నిష్కళంక భావంతో లోకానికి సేవలు అందించగలరు. అలా కాని స్థితిలో, స్వార్ధం చోటుచేసుకోవడాన్ని నివారించలేము.

కర్మాచరణలో మాత్రమే నీకు అధికారం ఉంది. దాని ఫలాలలో ఎన్నడూ లేదు. కర్మ ఫలాలను రూపొందించే వానిగా అవ్వవద్దు. కర్మలు ఒనర్చకుండటంలో అనురక్తి కూడదు.

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోஉస్త్వకర్మణి || -గీత, 2.47

మనం మన కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించాలి. ఫలితాల గురించి చింతించకూడదు. మన కర్తవ్యాన్ని నిర్వర్తించే హక్కు మనకు ఉంది కానీ, ఫలితాలు మన ప్రయత్నాలపై మాత్రమే ఆధారపడి ఉండవు. ఫలితాలను నిర్ణయించడంలో, అనేక అంశాలు అమలులోకి వస్తాయి.. అవి మన ప్రయత్నాలూ, విధి, అంటే, మన గత కర్మలూ, భగవంతుని సంకల్పం, ఇతరుల ప్రయత్నాలూ, పాల్గొన్న వ్యక్తుల సంచిత కర్మలూ, స్థలమూ మరియు పరిస్థితి, అంటే, అదృష్టానికి సంబంధించిన విషయం, మొదలైనవి. మనం ఫలితాల కోసం ఆత్రుతగా ఉంటే, అవి మన అంచనాలకు అనుగుణంగా లేనప్పుడు, ఆందోళనను అనుభవిస్తాము. కాబట్టి, ఫలితాల కోసం చింతించవద్దనీ, మంచి పని చేయడంపై మాత్రమే దృష్టి పెట్టమనీ, శ్రీ కృష్ణుడు అర్జునుడికి సలహా ఇచ్చాడు. వాస్తవమేమిటంటే, ఫలితాల గురించి మనం పట్టించుకోనప్పుడు, మన ప్రయత్నాలపై పూర్తిగా దృష్టి పెట్టగలుగుతాము. ఫలితం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.

మరో కోణంలో భగవాన్‌ శ్రీరామకృష్ణులవారు ఇలా అన్నారు.. పడవ నీటి మీద తేలవచ్చు. కాని పడవలో నీరు ప్రవేశించ కూడదు. ఆ విధంగానే, మనిషి సంసారంలో ఉండవచ్చు కానీ, సంసారానురక్తి అతడిలో ప్రవేశించ కూడదు.

🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

Tuesday, October 29, 2024

2024 'ధన్వంతరి జయంతి' శుభాకాంక్షలు

 

అందరికీ 'ధన్వంతరి జయంతి' శుభాకాంక్షలు 🙏 TELUGU VOICE
సూర్యుడికి గల 108 పేర్లలోనూ, శివుడికి గల 1008 పేర్లలోనూ 'ధన్వంతరి' ఒకటి!

క్షీర సాగర మధన సమయంలో, విష్ణు అంశతో సాగర గర్భం నుండి యువకుడిగా ఉదయించాడు 'ధన్వంతరి'. లేలేత బాహు దండాలు, విశాలమైన వక్షస్థలి కలిగివున్నాడు. పద్మాలవంటి ఎర్రని కన్నులతో, చిక్కనైన కేశజాలంతో, నీలగాత్ర తేజంతోనూ కనిపించాడు. పీతాంబరాలలను కట్టుకున్నాడు. మణికుండలాలతోనూ, పుష్పమాలాతోనూ సమలంకృతుడై ఉన్నాడు. అమృత కలశాన్ని ఒక చేత్తోనూ, వనమూలికల్ని మరొక చేత్తోనూ పుచ్చుకుని ఆవిర్భవించాడు.

ముక్కోటి దేవతలూ ఆ రూపాన్ని రెప్ప వాల్చకుండా చూశారు. "ఓం తత్పురుషాయ విద్మహే అమృత కలశహస్తాయా ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్..." అని ధన్వంతరీ గాయత్రి జపించారు. శరీరానికి ముసురుకున్న వ్యాధుల్నీ, మనసుకు పట్టిన జాడ్యాన్ని తొలగించే వాడు ధన్వంతరి. సూర్యుడికి గల 108 పేర్లలోనూ, శివుడికి గల 1008 పేర్లలోనూ ధన్వంతరి ఒకటని మహాభారతంలో ఉంది. భాగవత పురాణం ధన్వంతరిని విష్ణుమూర్తి 12వ అవతారంగా పేర్కొంది.

అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణాఽమృత రోగాన్మే నాశయాఽశేషానాశు ధన్వంతరే హరే... ఇది శ్రీ ధన్వంతరి ధ్యానమంత్రం. ఋగ్వేదంలో దేవభిషక్కులుగా అశ్వనీదేవతలే ప్రసిద్ధులు. పురాణకాలంలో ధన్వంతరి ఆవిర్భవించాడు. వ్యాస భారతం ఉద్యోగ పర్వంలోనూ, భాగవంతం నవమ స్కంధంలోనూ, హరి వంశం 29వ అధ్యాయంలోనూ, ధన్వంతరిని గురించిన ప్రస్తావనలున్నాయి. ఇంకా అగ్నిపురాణం, గరుడపురాణాలలో కూడా ఉంది. ధన్వంంతరి చారిత్రక వ్యక్తిగా భారతదేశంలో నడయాడాడనీ, ఆయనే ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు అందించాడనీ నమ్మేవారున్నారు.

అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణాఽమృత !
రోగాన్మే నాశయాఽశేషానాశు ధన్వంతరే హరే !!

Monday, October 28, 2024

సర్వధర్మజ్ఞుడైన భీష్మాచార్యుడిని ధర్మరాజడిగిన 6 ప్రశ్నలేంటి? 6 Questions of Yudhishtira to Bhishma


భక్తి! జ్ఞాన సముపార్జన! TELUGU VOICE
సర్వధర్మజ్ఞుడైన భీష్మాచార్యుడిని ధర్మరాజడిగిన 6 ప్రశ్నలేంటి?

“స్వ స్వరూపానుసంధానం భక్తి రిత్యభిధీయతే” అని సూత్రీకరించారు, నారద మహర్షి. దానిని బట్టి, జీవాత్మను పరమాత్మతో చేర్చటమే ‘భక్తి’ అని తెలుస్తోంది. “సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం, హృషీకేణ హృషీకేశ సేవనం భక్తి రుచ్యతే” అని నారద పంచరాత్రం లోనూ, “అన్యాభిలాషితా శూన్యం జ్ఞానకర్మాద్యనావృతం, ఆనుకూల్యేన కృష్టానుశీలనం భక్తి రుత్తమా”.. అని భక్తి రసామృత సింధువులోనూ విశదీకరింపబడి ఉంది. “మన ఇంద్రియాలన్నింటి ద్వారా, ఇంద్రియాలకు అధిపతి అయిన పరమాత్మను సేవిస్తూ ఉండడమే 'భక్తి'. జ్ఞాన కర్మాదులవైపు మనస్సు పోనీయకుండా, శ్రీ కృష్ణుని సంతృప్తి పరచడమే లక్ష్యంగా చేసే సాధన, ఉత్తమ భక్తిగా పరిగణింప బడుతుందన్నదే, వాటి తాత్పర్యం. మరి అంపశయ్యపై మృత్యు నిరీక్షణలో వున్న భీష్ముడు, భక్తి గురించీ, విష్ణు సహస్రనామం గురించి ఏం చెప్పాడు? అన్న విషయాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/QI8rw_UOcco ]


ఉపాధిగతుడై ఉన్న పరమాత్మనే, ‘జీవుడు’అని అంటాము. అటువంటి జీవులు అనంతంగా ఉంటాయి. అంటే, ఆ పరమాత్మ, ఈ సువిశాల విశ్వమంతటా ఉన్న అన్ని ఉపాధులలోనూ, జీవ రూపంలో ఉన్నాడని అర్ధం. దానివల్ల, అన్ని ప్రాణులలో ఉండేవాడు ఆయన ఒక్కడే అని తెలుస్తోంది. ఆ సత్యాన్నే “ఏకో దేవః సర్వభూతేషు గూఢః” అని ఉపనిషత్తులూ, “క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు..” అని శ్రీ కృష్ణపరమాత్మా, వ్యక్త్రపరచటం జరిగింది.

అయితే, యిప్పుడు మన కర్తవ్య మేమిటి? అంటే, సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ శ్రీమహావిష్ణువును, విష్ణు సహస్ర నామస్తోత్ర రూపంలో ఉన్న“మహా మంత్రం” ఆధారంగా గుర్తించటానికి ప్రయత్నించటం. మనలో భక్తి అనేది దృఢంగా ఉంటే, తప్పకుండా సఫలమనోరథులమవుతాము. అందులో సందేహమేమీలేదు.

“శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం” అనే మహామంత్రం, శ్రీమన్మహాభారతంలో, అనుశాసనిక పర్వంలో ఉంది. మహాభారత యుద్ధ కాలంలో, ఒక వైపు కురు పితామహుడైన భీష్మాచార్యుడు ప్రాణోత్క్రమణ సమయం కోసం ఎదురు చూస్తూ, అంపశయ్య మీద ఉన్నాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అయిన శ్రీకృష్ణుని దర్శనం కోసం తహతహలాడుతున్నాడు. మరొక వైపు యుధిష్ఠిరుడు, తన రాజ్యకాంక్ష కారణంగానే యుద్ధం జరిగిందనీ, అందులో తన గురువులూ, బంధువులూ, మిత్రులూ అన్యాయంగా మరణించటం సంభవించిందనీ భావించి, అమిత వేదనను అనుభవిస్తూ, పాపభీతితో కుమిలిపోతున్నాడు.

ఇదంతా గ్రహిస్తున్న శ్రీకృష్ణ భగవానుడు, తన పరమ భక్తుడైన భీష్మాచార్యునికీ, ధర్మమూర్తి అయిన యుధిష్ఠిరునికీ, ఏకకాలంలో మనశ్శాంతి చేకూర్చాలని నిశ్చయించుకున్నాడు. ఆ కారణంగానే, ధర్మజుని తీసుకుని భీష్మాచార్యుని దగ్గరకు వెళ్ళాడు.

శ్రీ కృష్ణుని ఆగమనాన్ని గ్రహించిన భీష్ముడు, ఆనంద పరవశుడయ్యాడు. శ్రీ కృష్ణుని భక్తవాత్సల్యాన్ని అమితంగా ప్రశంసించాడు. ఆపైన శ్రీ కృష్ణుని ఆదేశానుసారం, ఆయన ప్రసాదించిన శక్తి ఆధారంగా, పాండవాగ్రజునికి అనేక ధర్మసూక్ష్మాలు బోధించాడు. ఆ ధర్మసూక్ష్మాలలో కొన్నింటిని, మనం ఇదివరకే వీడియోలుగా అందించివున్నాము. చూడనివారు తప్పక చూడగలరు. అలా ఆయన ధర్మరాజు ఆవేదనను ఉపశమింప చేయటానికి ప్రయత్నించాడు.

కానీ, ధర్మజుడికి సంపూర్ణమైన సంతృప్తి కలుగలేదు. తన గురు దేవుని ద్వారా తాను తెలుసుకో వలసిన అసలు విషయమేదో మిగిలి ఉన్నదన్న అభిప్రాయం, ఆయనను బాధిస్తూనే ఉంది. ఆ కారణంగానే ఆయన, సర్వధర్మజ్ఞుడైన భీష్మాచార్యుడిని ఉద్దేశించి, ఆరు ప్రశ్నలడిగాడు..

1. ‘కి మేకం దైవతం లోకే’ అంటే, ప్రపంచమంతటికీ ఏకైక ఆరాధ్య దేవత ఎవరు?
2. ‘కిం వా ప్యేకం పరాయణం’ అంటే, ప్రాణికోటికి ఏకైక పరమ లక్ష్యమేమిటి?
3. ‘స్తువంతః కం ప్రాప్నుయుర్‌ మానవాః శుభం’ అంటే, ఎవరిని స్తుతించడం ద్వారా మానవులకు మేలు కలుగుతుంది?
4. ‘కమర్చంతః ప్రాప్నుయుర్‌ మానవాః శుభం’ అంటే, ఎవరిని అర్చించడం ద్వారా మానవులకు సుఖమూ, శాంతీ లభిస్తాయి?
5. ‘కోధర్మః సర్వధర్మాణాం భవతః పరమోమతః?’ అంటే, మీ అభిప్రాయంలో ధర్మాలన్నింటిలోకీ విశిష్ఠమైన ధర్మం ఏది?
6. ‘కిం జపన్‌ ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్‌’ అంటే, ఏ మంత్రాన్ని జపించడం ద్వారా ప్రాణికోటి, జనన-మరణ రూపమైన సంసారచక్రం నుండి విడివడగలుగుతుంది?

అన్న ఈ ఆరు ప్రశ్నలకు సమాధానాలను, భీష్మాచార్యుడు ఇలా చెప్పనారంభించాడు..

ప్రపంచమంతటికీ ఏకైక ఆరాధ్య దేవత ఎవరు? అన్న ప్రశ్నకు, ‘పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం, దైవతం దేవతానాం చ భూతానాం యో అవ్యయః పితా’ అంటే, పవిత్రమైన వాటన్నింటికీ పవిత్రతను చేకూర్చే పరమ పవిత్రుడూ, సర్వశ్రేయాలకూ మూలమైన వాడూ, దేవతలందరికీ దైవతమైన వాడూ, సమస్త ప్రాణికోటికీ తండ్రి అయిన శ్రీ మహావిష్ణువే, ప్రపంచమంతటికీ ఏక్రైక దైవతం.

ప్రాణికోటికి ఏకైక పరమ లక్ష్యం ఏమిటి? అన్న ప్రశ్నకు, ‘పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః, పరమం యో మహద్‌ బ్రహ్మ పరమం యః పరాయణం’ అంటే, పరమ తేజస్వరూపుడూ, సర్వ నియామకుడూ, సర్వ వ్యాపకుడూ, సర్వేశ్వరుడూ, పరమాత్మా అయిన శ్రీ మహావిష్ణువే, ప్రాణికోటి అంతటికీ ఏకైక లక్ష్యం.

ఎవరిని స్తుతించడం ద్వారా మానవులకు మేలు కలుగుతుంది? అన్న ప్రశ్నకు, ‘జగత్ ప్రభుం దేవదేవ మనంతం పురుషోత్తమం, స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః’ అంటే, ముల్లోకాలకూ ప్రభువూ, దేవతలకు కూడా దైవతమైన వాడూ, ఆది మధ్యాంత రహితుడూ అయిన పరమ పురుషుడిని, ఆయనకు సంబంధించిన అనంత నామాల ద్వారా స్తోత్రం చేయటంవలన, జీవులకు మేలు కలుగుతుంది.

ఎవరిని అర్చించడం ద్వారా మానవులకు సుఖమూ, శాంతీ లభిస్తాయి? అన్న ప్రశ్నకు, ‘తమేవ చార్చయన్‌ నిత్యం భక్ష్యాపురుష మవ్యయం, స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః’ అంటే, భక్తితో ఆ పరమపురుషుని ధ్యానించడం, పూజించడం, సేవించడం ద్వారా, మానవులకు సుఖమూ, శాంతీ లభిస్తాయి.

చివరి రెండు ప్రశ్నలు.. ‘మీ అభిప్రాయంలో ధర్మాలన్నింటిలోకీ విశిష్ఠమైన ధర్మం ఏది? ఏ మంత్రాన్ని జపించడం ద్వారా ప్రాణికోటి, జనన-మరణ రూపమైన సంసారచక్రం నుండి విడివడగలుగుతుంది? అన్న ప్రశ్నలకు, ‘అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం, లోకాధ్యక్షం స్తువ న్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్‌’ అంటే, జనన మరణాలకు అతీతుడూ, సర్వవ్యాపీ, విశ్వమంతటికీ ప్రభుడూ, సర్వసాక్షీ అయిన పరమాత్ముని అనంత నామాలను అనుదినమూ జపించడం ద్వారా, మానవులు దుఃఖ నివృత్తి చేసుకో గలుగుతారు.

ఈ విధంగా సమాధానమిచ్చిన తరువాత భీష్మాచార్యుల వారు, భగవంతుడికి సంబంధించిన అనంతనామాలైన శ్రీ విష్ణు సహస్రనామాలను ధర్మజుడికి వినిపించడం జరిగింది. నిరాకారుడైన భగవంతుడు, నామ రూపాలుగల ప్రపంచంగా వ్యక్తంకావడం వల్ల, ఆయనకు అనంత నామాలు ఏర్పడ్డాయి. ఆ నామాలన్నీ ఆయనవే అని గ్రహించడం, ఆ రూపాలన్నీ ఆయనవిగానే భావించడం, ప్రపంచంలోనూ, త్రికాలాలలోనూ శాశ్వతంగా ఉండేది ఆయన ఒక్కడే అని స్పష్టంగా తెలుసుకోవడం అన్నదే, ‘జ్ఞానం’. ఆ విధమైన జ్ఞాన సముపార్జనకు, విష్ణు సహస్రనామాలు అమితంగా సహాయపడతాయి.

ధర్మ సంరక్షణకోసం, అధర్మ నిర్మూలనకోసం, భగవంతుడు అప్పుడప్పుడూ అవతరిస్తూ ఉంటాడు. జ్ఞానులూ, భక్తులూ, సత్పురుషులూ మొదలయిన మహనీయుల రూపంలో, సామాన్యంగా వ్యక్తమవుతూ ఉంటాడు. ఆయా నమయాలలో ఆయన వెలువరుస్తూ ఉండే గుణాల ఆధారంగానే, మనం ఆయనదైన మహత్తర శక్తిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. అంటే, అవ్యక్త శక్తిని అవగాహన చేసుకోవటానికి, వ్యక్త రూపాలను ఆధారం చేసుకోవాలి. ఉదాహరణకు, ఒక చిత్రపటాన్నో, శిల్పాన్నో దర్శించుకున్నా, ఒక మహాకావ్యాన్ని చదివినా, ఆ చిత్రపటం, శిల్పం, లేక కావ్యం ద్వారా, ఆయా చిత్రకారుల, శిల్పాచార్యుల, మహాకవుల శక్తి సామర్థ్యాలు కొంతవరకైనా మనకు అవగతమవుతాయి. అలాగే వివిధ రూపాలలో వ్యక్తమయ్యే భగవత్‌ సృష్టిని పరిశీలించడం ద్వారా, ఆ భగవత్‌ శక్తిని లేశ మాత్రమైనా అర్థంజేసుకోవడానికి మనకు వీలవుతుంది. మనకు ఆ విధమైన అనుభూతిని కలిగించేవే, ‘శ్రీ విష్ణు సహస్రనామాలు’.

అలాగే, ‘కలిదోష నివారకమైన మార్గమేమిటి?’ అని నారద మహర్షి ఒకసారి, చతుర్ముఖ బ్రహ్మని అడిగాడు. అప్పుడాయన, ‘సర్వ శృతి రహస్యం గోప్యం తత్‌ శృణు యేన కలి సంసారం తరిష్యసి, భగవతః ఆదిపురుషస్య నారాయణస్య నామోచ్ఛారణ మాత్రేన నిర్ధూత కలిర్‌ భవతి’ అని సమాధానమిచ్చాడు.

ఆ అభిప్రాయాన్నే ‘బృహన్నారద పురాణం’, ‘హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం, కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతి రన్యథా’ అని ఉద్ఘోషించింది. దానిని బట్టి, ‘కలియుగంలో మానవులకు హరినామం ఒక్కటే గతి. అంతకు మించి వేరే గతి లేదు..’ అని నిష్కర్షగా తేటతెల్లమవుతోంది. అటువంటి మహత్తర శక్తిగల నామాలు, ఈ ‘స్తోత్ర మహామంత్రం’లో వెయ్యి వున్నాయి.

జనన ధర్మంగల జీవులకు జన్మరాహిత్యాన్ని చేకూర్చేది, భగవన్నామ జపం ఒక్కటే. ఏ రూపంలో ఉన్నా, ఏ జాతికి, కులానికి, మతానికి చెంది ఉన్నా, భగవన్నామాన్ని జపించే అర్హత ప్రతి ప్రాణికీ ఉంది. ఆ సత్య నిరూపణకు, గజేంద్ర మోక్షం ప్రబల నిదర్శనం. జడ భరతుని గాథ ఒక తార్కాణం. వాల్మీకి, హరిదాసు మొదలైన వారి చరితలు, కొన్ని ఉదాహరణలు.

శ్రీ విష్ణు సహస్రనామాలలో ప్రతి నామం ఒక మంత్రమే. వీటిలో ఏ ఒక్క నామాన్ని జపించినా, ధన్యత్వం సిద్ధించి తీరుతుందంటారు ఆర్యులు.

🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...