Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Wednesday, August 30, 2023

దానం సక్రమమైనదా, ఉన్నతమైనదా, నీచమైనదా అనేది ఎలా నిర్ణయించబడుతుంది? భగవద్గీత Bhagavad Gita


దానం సక్రమమైనదా, ఉన్నతమైనదా, నీచమైనదా అనేది ఎలా నిర్ణయించబడుతుంది?

'భగవద్గీత' సప్తదశోధ్యాయం - శ్రద్ధా త్రయ విభాగ యోగం (17 – 20 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహేడవ అధ్యాయం, శ్రద్ధా త్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, శ్రద్ధా త్రయ విభాగ యోగములోని, 17 నుండి 20 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/8AVAHaPcbmw ]


రజో గుణ లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాము..

00:45 - శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్ త్రివిధం నరైః ।
అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్త్వికం పరిచక్షతే ।। 17 ।।

భక్తి-శ్రద్ధలు కల వ్యక్తులు, అత్యంత విశ్వాసముతో ఈ మూడు తపస్సులనూ, భౌతిక ప్రతిఫలాలను ఆశించకుండా ఆచరిస్తే, వాటిని సాత్త్విక తపస్సులని అంటారు.

శారీరక, వాక్కు, మరియు మనస్సులకు సంబంధించిన తపస్సులను వేర్వేరుగా, స్పష్టంగా వివరించిన తరువాత, శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, సత్త్వ గుణములో చేసే వాటి లక్షణములను వివరిస్తున్నాడు. భౌతిక ప్రతిఫలములను ఆశించి చేయబడితే, తపస్సు దాని యొక్క పవిత్రతను కోల్పోతుంది. అది నిస్వార్ధ చిత్తముతో, ఫలాసక్తి లేకుండా చేయబడాలి. అంతేకాక, అది విజయవంతమైనా, లేదా విఫలమైనా, ఆ తపస్సు యొక్క విలువ పట్ల అచంచలమైన విశ్వాసం ఉండాలి; సోమరితనం వల్ల కానీ, అసౌకర్యముగా ఉందని కానీ, దాని యొక్క ఆచరణను ఆపకూడదు.

01:46 - సత్కారమానపూజార్థం తపో దంభేన చైవ యత్ ।
క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమ్ ।। 18 ।।

కీర్తిప్రతిష్టలూ, గౌరవమూ, మరియు గొప్పల కోసం ఆడంబరంగా చేసే తపస్సూ మరియు యజ్ఞములూ, రజో గుణములో ఉన్నట్టు. దాని యొక్క ప్రయోజనములు అస్థిరమైనవి, మరియు తాత్కాలికమైనవి.

తపశ్చర్య అనేది, ఆత్మ-శుద్ధి కోసమున్న అత్యంత ప్రయోజనకరమైన ఉపకరణమే అయినా, దానిని అందరూ పవిత్రమైన ఉద్దేశంతో ఉపయోగించుకోరు. ఒక రాజకీయవేత్త రోజులో ఎన్నో ఉపన్యాసాలు ఇస్తూ, చాలా పరిశ్రమిస్తాడు. అది కూడా ఒక లాంటి తపస్సే. కానీ, దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం, పదవీ, హోదా పొందటము. అదే విధముగా, ఎవరైనా ఆధ్యాత్మిక కార్యకలాపాలలో, గౌరవం లేదా ప్రశంస కోసం నిమగ్నమయితే - మార్గం వేరయినా, దాని ఉద్దేశ్యం కూడా, అంతే సమానమైన భౌతికపరమైనదే అవుతుంది. గౌరవం కోసం, పదవి కోసం, లేదా ఏ ఇతర భౌతిక ప్రాపంచిక ప్రతిఫలం కోసం చేసినా, ఆ తపస్సు, రజో గుణ తపస్సుగా పరిగణించబడుతుంది.

02:57 - మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః ।
పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతమ్ ।। 19 ।।

అయోమయ భావాలతో, తమను తామే హింసపెట్టుకుని, లేదా ఇతరులకు హాని కలిగించటం కోసం చేయబడే తపస్సు, తమో గుణములో ఉన్నట్టు చెప్పబడినది.

మూఢ-గ్రాహేణాత్ అంటే - అయోమయ ఉద్దేశ్యంతో ఉన్న జనులు అని. తపస్సనే పేరు మీద, శాస్త్ర విధివిధానాలను పట్టించుకోకుండా, లేదా శరీర పరిమితులను అర్థం చేసుకోకుండా, అనవసరంగా తమను తాము హింసించుకోవడమో, లేదా ఇతరులకు హాని చేసేవారని అర్థం. ఇటువంటి తపస్సులు ఎటువంటి ప్రయోజనాన్నీ చేకూర్చవు. అవి శారీరక దృక్పథంతో చేయబడినట్లూ, మరియు మొరటు వ్యక్తిత్వాన్ని చాటుకునేందుకే చేస్తారు.

03:48 - దాతవ్యమితి యద్దానం దీయతేఽనుపకారిణే ।
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్ ।। 20 ।।

దానము చేయుట తన కర్తవ్యమని భావించి, తగిన పాత్రత ఉన్నవారికి, ప్రతిఫలాపేక్ష లేకుండా, సరియైన సమయంలో, సరియైన ప్రదేశంలో దానము చేయుట అనేది, సత్త్వగుణ దానమని చెప్పబడుతుంది.

మూడు విధముల దానములు ఇప్పుడు వివరించబడుతున్నాయి. శక్త్యానుసారంగా దానము ఇవ్వటం అనేది, మన కర్తవ్యముగా చేయాలి. భవిష్య పురాణం ఇలా పేర్కొంటున్నది: దానమేకం కలౌ యుగే.. ‘కలి కాలంలో దానం చేయటమే, అంతఃకరణ శుద్ధికి మార్గము.’ రామాయణం కూడా ఇలా పేర్కొంటున్నది: ‘ధర్మమునకు నాలుగు మూల సూత్రములున్నాయి. వాటిలో ఒకటి, కలియుగంలో అత్యంత ముఖ్యమైనదీ ఏమిటంటే - ఏ రూపంలోనైనా, పద్ధతిలోనయినా దానం చేయి - అని.’ దాన ప్రక్రియ ఎన్నో మంచి ఫలితాలను ఇస్తుంది. అది ఇచ్చే వాడికి, భౌతిక ప్రాపంచిక వస్తువులమీద మమకారాసక్తిని తగ్గిస్తుంది; అది సేవా దృక్పథాన్ని పెంచుతుంది; విశాల హృదయమును ఇస్తుంది, మరియు ఇతరుల పట్ల వాత్సల్య భావమును పెంచుతుంది. కాబట్టి, చాలా మతాల సిద్ధాంతాలు, వ్యక్తి సంపాదనలో పదవ వంతు దానము చేయమని ఉపదేశిస్తున్నాయి. ‘నీవు న్యాయముగా సంపాదించిన దానిలో నుండి, పదవవంతు పక్కకు తీసి, అది నీ కర్తవ్యముగా భావించి, దానిని దానం చేయి. నీ దానమును ఈశ్వర ప్రీతి కోసమే అర్పితం చేయి.’ దానము సక్రమమైనదా, లేదా, ఉన్నతమైనదా, నీచమైనదా అనేది, శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్పిన లక్షణాలను బట్టి నిర్ణయించబడుతుంది. అది ఎప్పుడైతే హృదయపూర్వకంగా, అర్హతగల పాత్రుడికి, సరియైన సమయంలో, సరియైన ప్రదేశంలో ఇవ్వబడుతుందో, అప్పుడది సత్త్వ గుణ దానమని చెప్పబడుతుంది.

05:47 - ఇక మన తదుపరి వీడియోలో, తామసిక దానముగా దేనిని పరిగణిస్తారో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, August 28, 2023

శ్రీ కృష్ణుడు – హిజ్రాలు! Why did Lord Krishna become a woman for one night?


శ్రీ కృష్ణుడు – హిజ్రాలు!
శ్రీ కృష్ణుడి గురించి చాలామందికి తెలియని వాస్తవాలు!

శ్రీ కృష్ణ భగవానుడు చేసిన మాయలూ, లీలలూ అనంతం. వాటిలో కొన్ని మనకు తెలుసు. రాక్షసులను సంహరించడం, అష్ట భార్యలను వివాహం చేసుకోవడం, గోపికలతో బృందావన రాస లీలలూ, వీటన్నింటి గురించీ మన హిందువులకు తెలుసు. కృష్ణుడి గురించిన సంఘటనలు చెప్పుకుంటూ పోతే, కోకొల్లలు. వాటిలో కొన్ని... అనునిత్యం కృష్ణ నామ స్మరణలోనే ఉండీ, ఆయన అనుగ్రహానికి ఆ భక్తుడు ఎందుకు నోచుకోలేదు? శ్రీ కృష్ణుడి తలనొప్పిని, గోపికలు ఎలా తగ్గించగలిగారు? శ్రీ కృష్ణుడు స్త్రీగా మారి ఎవరిని వివాహం చేసుకున్నాడు? శ్రీ కృష్ణుడికీ, హిజ్రాల వివాహానికీ, ఒక్క రోజులో వైధవ్యానికీ సంబంధం ఏమిటి - వంటి ఆసక్తికరమైన విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను తప్పక తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ukbzIKYaO1Y ]


ఒక రోజు కృష్ణుడు మధ్యాహ్నం భోజనం చేస్తున్నాడు. ఎంతో సంతోషంతో, సత్యభామ ఆయనకు వడ్డిస్తోంది. అయితే, భోజనం మధ్యలో కృష్ణుడు హఠాత్తుగా లేచి, చేతులు కూడా కడుక్కోకుండా ద్వారం వైపు పరుగెత్తాడు. సత్యభామ నిర్ఘాంతపోయింది. ఆదేమిటని అడుగగా అందుకు కృష్ణుడు, తాను వెంటనే వెళ్లాలంటూ ముఖ ద్వారం వైపు కదిలాడు. కానీ ఎందుకో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని, తిరిగి వచ్చి భోజనం చేయడం కొనసాగించాడు. అప్పుడు సత్యభామ ఏం జరిగిందని అడుగగా కృష్ణుడు, ‘నా భక్తుడొకడు అడవిలో కూర్చుని ఉన్నాడు. అతని జీవనంలో ప్రతి శ్వాసా, "కృష్ణ, కృష్ణ" గా మారిపోయింది. అతనివైపు ఆకలిగొన్న ఒక పులి రావడం చూసి, పరుగెత్తాను. అతడు పులి మీదకు విసరడానికి ఒక రాయిని తీసుకోవడం చూసి, తిరిగి వచ్చేశాను’ అని బదులిచ్చాడు. దీనిని బట్టి మనం తెలుసుకోవలసింది, శ్రద్ధ, భక్తి, నమ్మకం కొరవడిన చోట, దైవం ఉండదు.

ఒకసారి కృష్ణుడి పుట్టినరోజు నాడు, సంగీతం, నాట్యం, బాణాసంచాలతో, పెద్ద ఉత్సవం జరపాలని గొప్పగా ఏర్పాట్లు చేశారు. చాలామంది జనం వచ్చారు. కానీ, కృష్ణుడు మాత్రం, సంబరాలలో పాల్గొనడానికి ఇష్టపడక, ఇంట్లోనే ఉండిపోయాడు. సాధారణంగా ఎలాంటి వేడుకైనా, నలుగురితో చేరడానికి, కృష్ణుడు ముందుంటాడు. కానీ, ఆ రోజు మాత్రం, ఎందుకో ఆయన ఇష్టపడలేదు. రుక్మిణి ఎందుకని అడుగగా, తనకు తల నొప్పిగా ఉందని అన్నాడు కృష్ణుడు. ఆ జగన్నాటక సూత్రధారికి నిజంగా తలనొప్పి ఉందో లేదో మనకు తెలియదు. బహుశా ఉండి ఉండొచ్చు కానీ, ఆయన నటించడంలో కూడా సమర్ధుడు. వైద్యులను పిలిపించమన్నది రుక్మిణి. వైద్యులు వచ్చి, కృష్ణుడికి ఆ మందు, ఈ మందు ఇవ్వడానికి ప్రయత్నించారు. అవన్నీ తనకు పనిచేయవని అన్నాడు కృష్ణుడు. ఏం చేయాలో పాలుపోక, అయోమయంలో పడిపోయారు చుట్టూ ఉన్నవారు. ఆసరికి చాలా మంది జనం వచ్చిచేరారు. సత్యభామ, నారదుడూ వచ్చారు. కృష్ణుడి తలనొప్పికి ఏం చేయాలో తోచక, తర్జన భర్జన పడ్డారు.

"నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళెవరైనా, మీ పాదాల దగ్గర నుంచి కొంచెం ధూళిని తీసి, నా తలమీద రుద్దండి. నొప్పి తగ్గిపోతుంది" అని కృష్ణుడు చెప్పాడు. అప్పుడు సత్యభామ, "ఏమిటా అర్థం లేని మాటలు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కానీ నా పాదధూళి తీసి మీ తల మీద పెట్టటం మాత్రం చేయలేను. అలాంటివి చేయ తగని పనులు" అని అన్నది. ఇక రుక్మిణి కూడా "ఆ పని ఎలా చేయగలం? అది మహా పాపం.. అటువంటి పని నేను చేయలేను" అంటూ ఏడ్చింది. అక్కడ ఉన్న నారదుడు కూడా "నేను కూడా ఇలాంటి పని చేయ దలుచుకోలేదు. నువ్వు సాక్షాత్తూ భగవంతుడివి. దీనిలో ఏ రహస్యం ఉందో నాకు తెలియదు. ఇందులో దాగివున్న కుట్ర ఏంటో అస్సలు తెలియదు. నా పాదాల దగ్గర మట్టి తీసి నీ తల మీద పెడితే, నేను నరకంలో పడి, మాడి మసైపోతాను" అని నారదుడు వెనుదిరిగాడు. ఈ విషయం, అంతటా పాకిపోయింది. ప్రతి ఒక్కరూ భయపడ్డారు. "మేము అలాంటి పని చేయలేము. ఆయనంటే ప్రేమే గానీ, అలాంటి పని చేసి నరకానికి పోలేము" అని వాపోయారు.

ఉత్సవం కృష్ణుడి కోసం ఎదురుచూస్తోంది. కానీ, ఆయన మాత్రం తలనొప్పితో అక్కడే కూర్చుండిపోయాడు. ఈ వార్త బృందావనం చేరింది. కృష్ణుడికి తలనొప్పిగా ఉందని గోపికలకు తెలిసింది. రాధ తన పవిటచెంగు తీసి, నేల మీద పరచింది. గోపికలందరూ దానిమీద తీవ్రంగా నృత్యం చేశారు. తరువాత వాళ్లు దానిని తీసి నారదుడికి ఇచ్చి, "దీనిని తీసుకెళ్లి, కృష్ణుడి తలచుట్టూ కట్టండి" అని చెప్పారు. నారదుడు ఆ వస్త్రాన్ని తీసుకెళ్లి, కృష్ణుడి తలచుట్టూ కట్టగానే, ఆయన తలనొప్పి మటుమాయమైంది! కృష్ణుడు ఎప్పుడూ, తాను దేనికి ఎక్కువ విలువ ఇస్తాడో స్పష్టం చేసేవాడు. రాజులతో పాటు తిరిగినా, రాజ్యాలను తనకు కానుకలుగా ఇచ్చినా, ఆయన అవి తృణప్రాయంగా భావించేవాడు. కానీ, భక్తితో, ప్రేమతో చేసే పని మాత్రం, ఆయనకు ఎంతో ప్రియమైనది.

ఇక మరో విశేషం, కృష్ణుడి వివాహం కారణంగా, హిజ్రాలు ఒక పండుగను నేటికీ ఆచరిస్తారు. సభ్యసమాజంలో నిరాదరణకు గురయ్యే హిజ్రాలు, ఏడాది పొడవునా ఎదురుచూసే ఆ పండుగ చాలా ప్రత్యేకం. తాము జీవితంలో పొందలేని వేడుకైన పెళ్లి, తాళి కోసం, సంవత్సరమంతా ఆతృతగా ఎదురుచూస్తారు. ఆ పండుగ తెచ్చే సంబరమే, కూతాండవర్‌ ఆలయ ఉత్సవం. తమిళనాడులోని విల్లుపురం జిల్లా, 'కూవాగం'లో ఉన్న'కూతాండవర్‌', హిజ్రాలకు ఆరాధ్య దైవం. ఏటా చైత్రమాసంలో వచ్చే ఈ ఉత్సవంలో, వారు ఆ దైవాన్ని పెళ్లి చేసుకుంటారు. ఇలా వాళ్లు  పెళ్లిచేసుకున్న మర్నాడే, కూతాండవర్‌ మరణిస్తాడు. వారంతా రోదిస్తూ గాజులు పగులగొట్టుకుని, పూవులు తీసివేసి, అక్కడి కొలనులో స్నానాలుచేసి, వైధవ్యానికి చిహ్నమైన తెల్లచీరలను ధరిస్తారు. అయితే, హిజ్రాల కథనం ప్రకారం, కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు గెలవాలంటే, ఒక గొప్ప వీరుడి బలిదానం జరగాలి. అలాంటి వీరుడు అర్జునుడే అని గుర్తించిన శ్రీకృష్ణుడు, అర్జునుణ్ణి బలివ్వడం ఇష్టంలేక, ప్రత్యామ్నాయం కోసం ఆలోచించాడు. అప్పుడు అర్జునుడికీ, నాగకన్య ఉలూచికీ జన్మించిన ఇరావంతుడిని, ఆ మహత్కార్యానికి ఎంచుకున్నాడు, శ్రీకృష్ణుడు.

అసలు విషయాన్ని ఇరావంతుడికి చెప్పి, బలిదానానికి ఒప్పించాడు. అయితే, యుద్ధంలో బలయ్యే ముందురోజు తనకు వివాహం చేయాలని షరతు పెట్టాడు, ఇరావంతుడు. ఒక్క రోజులో వైధవ్యాన్ని పొందడానికి ఎవరూ ఇష్టపడరు గనుక, కృష్ణుడే మోహినీ రూపంలో అతణ్ణి పెళ్లిచేసుకున్నాడు. శ్రీకృష్ణుడి మోహినీ అంశతోనే తాము జన్మించామనీ, మోహినికి భర్త అయిన ఇరావంతుడే, తమ దైవమనీ భావిస్తారు హిజ్రాలు. ఇంచుమించు 5 వెల ఏళ్ల నాడు జరిగిన ఇరావంతుడూ, మోహినిల పరిణయానికి సూచికగా.. నేటికీ ప్రతి ఏటా హిజ్రాలు, తమ ఇష్టదైవమైన ఇరావంతుడిని పెళ్లిచేసుకుంటారు. ఆ సందర్భంగా జరిగే జాతరే, కూతాండవర్‌ ఆలయ ఉత్సవం. ఈ ఉత్సవంలో అతిముఖ్యమైన ఘట్టం, కల్యాణోత్సవం. కల్యాణోత్సవం రోజు రాత్రి పట్టుచీరలు కట్టుకుని, నవవధువుల్లా ముస్తాబవుతారు హిజ్రాలు. ఇరావంతుడి దర్శనానికి వెళ్లి, పూజారులతో పసుపుతాడు కట్టించుకుంటారు.

ఆలయ నియమానుసారం, మగవాళ్లు కూడా తాళికట్టించుకోవచ్చు. అందుకే సమీప గ్రామాలలోని చాలామంది పురుషులు, ఆ వేడుకలో పాలుపంచుకుంటారు. వింత ఆసక్తికొద్దీ, ఆడవేషం ధరించాలనుకునే మగవాళ్లూ, అందులో భారీగా పాల్గొంటారు. దేశం నలుమూలలనుంచీ వేల సంఖ్యలో అక్కడకు చేరిన హిజ్రాలు, చేతికి గాజులూ, మెడలో మల్లెపూలూ ధరించి వెళ్లి, తాళి కట్టించుకుంటారు. తాళి బొట్లు ధరించిన హిజ్రాలు, రాత్రంతా ఆలయం వద్దే ఆడుతూ పాడుతూ ఆనందోత్సాహాలతో  కాలం గడుపుతారు. చెక్కతో చేసిన ఇరావంతుని విగ్రహాన్ని వూరంతా ఊరేగిస్తారు. ఇరావంతుడి బలికి సూచికగా, తెల్లవారు జామున విగ్రహం తలను తీసివేస్తారు. అంతవరకూ ఆనందోత్సాహాలతో గడిపిన హిజ్రాలు, ఇరావంతుని బలి తర్వాత రోదిస్తూ, వైధవ్యాన్ని స్వీకరించి, మౌనంగా అక్కడినుండి బయలుదేరి తమ స్వస్థలాలకు వెళ్లిపోతారు. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో జరిగిన ఇరావంతుడూ, మోహినిల వివాహానికి గుర్తుగా, నేటికీ హిజ్రాలు ఆ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ, ఆ నాటి గాధను స్మరించుకుంటారు. ఆ వేడుక వారికి ఎంతో మేలుచేస్తుందని వారి నమ్మకం.

కృష్ణం వందే జగద్గురుం!

Wednesday, August 23, 2023

బ్రాహ్మణులని ఎవరిని అంటారు? భగవద్గీత Bhagavad Gita


బ్రాహ్మణులని ఎవరిని అంటారు? శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు?

'భగవద్గీత' సప్తదశోధ్యాయం - శ్రద్ధా త్రయ విభాగ యోగం (13 – 16 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహేడవ అధ్యాయం, శ్రద్ధా త్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, శ్రద్ధా త్రయ విభాగ యోగములోని, 13 నుండి 16 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/w2ANVXD63co ]


ఎటువంటి యజ్ఞము, తమో గుణములోనికి వస్తుందో ఇప్పుడు చూద్దాము..

00:47 - విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణమ్ ।
శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ।। 13 ।। 

శ్రద్ధావిశ్వాసములు లేకుండా మరియు శాస్త్ర నియమాలకు విరుద్ధంగా, ప్రసాదవితరణ చేయకుండా, మంత్రములు జపించకుండా, మరియు దక్షిణ ఇవ్వకుండా చేయబడిన యజ్ఞము, తమో గుణములో ఉన్నదని పరిగణించబడును.

జీవితంలో, అనుక్షణం వ్యక్తులకు ఏ పనులు చేయాలన్న విషయంలో, ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. మన సమాజానికి, మరియు మన సంక్షేమానికి దోహదపడే మంచి పనులు ఉంటాయి. అదే సమయంలో, ఇతరులకూ మనకూ హానికరమైన తప్పుడు పనులు కూడా ఉంటాయి. కానీ, ఏది ప్రయోజనకరమైనది, మరియు ఏది హానికరమైనదని ఎవరు నిర్ణయించాలి? అంతేకాక, ఏదైనా వివాదం తలెత్తితే, దానిని దేని ఆధారంగా నివృత్తి చేసుకోవాలి? ప్రతివారు తమ స్వంత నిర్ణయం తీసుకుంటే, అదొక గందరగోళ పరిస్థితికి దారితీస్తుంది. కాబట్టి, శాస్త్ర ఉపదేశాలు మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయి, మరియు ఎక్కడెక్కడైతే సంశయం తలెత్తుతుందో, మనం ఈ శాస్త్రముల ఆధారంగా ఏది సరియైన పనో నిర్ణయించుకోవచ్చు. కానీ, తమో గుణములో ఉన్నవారికి, శాస్త్రముల పట్ల విశ్వాసం ఉండదు. వారు కర్మ కాండలను చేస్తారు కానీ, శాస్త్రములలో చెప్పబడిన ఉపదేశములను లెక్క చేయరు. శాస్త్ర నియమ-నిబంధనలను పక్కనపెట్టి, సోమరితనంతో, అలసత్వంతో, లేదా వైరబుద్ధితో, తమకు నచ్చినట్టు చేసే యజ్ఞము, తమో గుణములో ఉన్నట్టు. ఇటువంటి శ్రద్ద, నిజానికి భగవంతుని పట్లా మరియు శాస్త్రముల పట్లా విశ్వాసరాహిత్యమే.

02:29 - దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్ ।
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే ।। 14 ।।

పరమేశ్వరుడూ, బ్రాహ్మణులూ, ఆధ్యాత్మిక గురువూ, జ్ఞానులూ మరియు పెద్దలూ - వీరి ఆరాధన, శుచి, నిష్కాపట్యము, బ్రహ్మచర్యమూ మరియు అహింసలను ఆచరిస్తూ ఎప్పుడైతే చేయబడతాయో - అది శారీరక తపస్సని చెప్పబడును.

తపః’ అంటే ‘వేడిమిని పెంచటం’.. ఉదాహరణకి, అగ్నిపై ఉంచటం. మలినములను నిర్మూలించే ప్రక్రియలో, లోహములు వేడి చేసి కరిగించబడతాయి. ఈ ప్రక్రియలో మలినములు పైకి వచ్చినప్పుడు, నిర్మూలించబడతాయి. బంగారమును అగ్నిపై ఉంచినప్పుడు, దానిలో ఉన్న మలినములు కాలిపోయి, దాని యొక్క తేజస్సు పెరుగుతుంది. అదే విధంగా, ఋగ్వేదం ఈ విధంగా పేర్కొంటున్నది: ‘శరీరమును తపస్సుచే పవిత్రం చేయకుండా, మనిషి యోగములో అంతిమ స్థాయిని చేరుకోలేడు.’ శారీరక తపస్సును త్రికరణశుద్ధిగా అభ్యాసం చేస్తే, మానవులు తమ జీవితాన్ని, ప్రాపంచికత్వం నుండి భగవత్ పరంగా ఉన్నతంగా మార్చుకోగలరు. ఇటువంటి తపస్సనేది, ఆర్భాటం లేకుండా, సద్భావనతో, శాంతియుతంగా, గురువు, మరియు శాస్త్రముల ఉపదేశ ప్రకారంగా ఉండాలి.

శ్రీ కృష్ణుడు ఇటువంటి తపస్సును మూడు రకాలుగా వర్గీకరిస్తున్నాడు — శారీరిక తపస్సు, వాక్కు యొక్క తపస్సు, మరియు మనస్సు యొక్క తపస్సు. ఈ శ్లోకములో కృష్ణుడు శారీరక తపస్సును గురించి, వివరించాడు. ఎప్పుడైతే శరీరము పవిత్రమైన, సాధుపురుషుల సేవలో వినియోగించబడుతుందో, ఇంద్రియ భోగములూ, ప్రత్యేకంగా లైంగిక భోగములూ త్యజించబడినప్పుడు, అది శారీరక తపస్సని చెప్పబడుతుంది. ఇటువంటి తపస్సు, శౌచముతో, సరళముగా, మరియు ఇతరులను ఇబ్బంది పెట్టకుండా చేయబడాలి. ఇక్కడ, ‘బ్రాహ్మణులు’ అంటే, ఏదో పుట్టుకతో తమను తాము బ్రాహ్మణులని అనుకునేవారు కాదు. సాత్త్విక గుణములు కలవారు అని అర్థం.

04:34 - అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ ।
స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్ఞ్మయం తప ఉచ్యతే ।। 15 ।।

ఉద్వేగమును కలిగించనివీ, సత్యములూ, కోపము పుట్టించనివీ, ప్రయోజనకరమైనవీ అగు మాటలూ, మరియు నిత్య వేద శాస్త్రముల పఠనమూ - ఇవి వాక్కు సంబంధమైన తపస్సని చెప్పబడుతున్నది.

వాక్కు యొక్క తపస్సు అంటే, సత్యములైన వాటినే మాట్లాడటం, ఎదుటివారికి ఉద్వేగమును కలిగించనివి, వినేవారికి ప్రియముగా, మరియు ప్రయోజనకారిగా ఉండే మాటలు మాట్లాడటమే. వేద మంత్ర పారాయణ అభ్యాసము కూడా, వాక్కు సంబంధ తపస్సులోనే చెప్పబడినది.

05:15 - మనఃప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః ।
భావసంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే ।। 16 ।।

ఆలోచనలో ప్రశాంతత, మృదుత్వము, మౌనము, ఆత్మ-నిగ్రహము, మరియు ఉద్దేశ్య పవిత్రత - ఇవన్నీ మనస్సు యొక్క తపస్సని పేర్కొనబడినాయి.

మనస్సు యొక్క తపస్సనేది, శరీరము, మరియు వాక్కు యొక్క తపస్సుల కంటే ఉన్నతమైనది. ఎందుకంటే, మనస్సును గెలువ గలిగితే, శరీరము, మరియు వాక్కు, వాటంతట అవే స్వాధీనంలోనికి వస్తాయి. కానీ, శరీరము, వాక్కులను గెలిస్తే, మనస్సు ఖచ్చితంగా నియంత్రణ లోనికి వచ్చినట్లు చెప్పలేము. నిజానికి, మనస్సు యొక్క స్థితియే, వ్యక్తి యొక్క స్థాయిని నిర్ణయిస్తుంది. మనస్సును ఒక పూదోటతో పోల్చవచ్చు. దానిని తెలివిగా సాగు చేసుకోవచ్చు, లేదా దానిని అలా విశృంఖలంగా వదిలేయవచ్చు. పండ్లు, పువ్వులు మరియు కూరగాయలు పండించుకోవటానికి, తోటమాలులు తమ నేలని సాగు చేస్తారు. అదే సమయంలో, వారు కలుపుమొక్కలు పెరగకుండా కూడా, జాగ్రత్త పడతారు. అదే విధంగా, మన స్వంత మనస్సుని ఉన్నత తలంపులతో, పవిత్రమైన భావాలతో నింపుకుంటూ, అదే సమయంలో ప్రతికూల, వినాశకర తలంపులను ఏరిపారేస్తూ ఉండాలి. ఒకవేళ మనం క్రోధపూరిత, ద్వేషపూరిత, దూషణభరిత, ప్రతీకారేచ్ఛతో కూడిన, విమర్శక, మరియు నిందించే తలంపులను మన మనస్సులో ఉండనిస్తే, అవి మన వ్యక్తిత్వం పైన తీవ్ర వినాశకర ప్రభావం చూపుతాయి. మనస్సును నియంత్రించటం నేర్చుకుని, దానిని క్రోధము, ద్వేషము, అయిష్టత వంటి వాటి నుండి ప్రభావితం కాకుండా చూసుకోనంతవరకూ, మన మనస్సు నుండి ప్రయోజనకారక పని ఏదీ మనకు లభించదు. భగవంతుని కృప మన హృదయములలో వ్యక్తమవ్వటాన్ని అడ్డుకునే కలుపుమొక్కలు ఇవే. జనులు వారి తలంపులు రహస్యమైనవనీ, అవి వారి మనస్సులోనే ఉంటూ, ఇతరులకు ఏమాత్రం తెలియనివి కాబట్టి, వాటికి ఎటువంటి బాహ్యమైన పరిణామం ఉండదని అనుకుంటారు. ఈ ఆలోచనలే, వారి యొక్క అంతర్గత స్వభావాన్నీ, బాహ్య వ్యక్తిత్వాన్నీ ప్రభావితం చేస్తాయి. నీ ఆలోచనలను గమనించు. అవే నీ మాటలవుతాయి. నీ మాటలను గమనించు. అవే నీవు చేసే పనులవుతాయి. నీవు చేసే పనులను గమనించు. అవే నీ అలవాట్లవుతాయి. నీ అలవాట్లను గమనించు. అవే నీ వ్యక్తిత్వం అవుతాయి. నీ వ్యక్తిత్వాన్ని గమనించు. అదే నీ భవితవ్యము అవుతుంది. మన మనస్సులో ఉన్న ప్రతి ఒక్క ప్రతికూల ద్వేషభావ ఆలోచనతో, మనం మనకే హాని చేకూర్చుకుంటున్నామని మనం తెలుసుకోవటం, చాలా ముఖ్యం. అదే సమయంలో, ప్రతిఒక్క మంచి ఆలోచనతో, మనలను మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటాము.  మనలో ఉండే ప్రతి ఒక్క తలంపుకీ దాని పరిణామాలు ఉంటాయి. ఒక్కొక్క ఆలోచనతో మనం మన భవిష్యత్తును ఎంచుకుంటాము. ఈ కారణం చేత, మనస్సును చెడు, ప్రతికూల తలంపుల నుండి దూరం చేస్తూ, దానిని సద్భావనతో ఉన్న తలంపులలో ఉంచటం అనేది, మనస్సు యొక్క తపస్సని చెప్పబడుతుంది.

08:31 - ఇక మన తదుపరి వీడియోలో, రజో గుణ లక్షణాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, August 21, 2023

Did Lakshman kill his son-in-law? #ramayana | లక్ష్మణుడు తన అల్లుడిని చంపాడా?


లక్ష్మణుడు తన అల్లుడిని చంపాడా?
‘సమాధి కళ’ను పొందిన ఇంద్రజిత్తు మరణ రహస్యం ఏంటి?

రామాయణం ప్రకారం, రావణ మండోదరిలకు జన్మించిన జ్యేష్ఠ పుత్రుడు, మేఘనాథుడు. మేఘనాథుడు, శైవ యాగం చేసి శివుని మెప్పించి, ‘సమాధి కళ’ను పొందాడు. దీని వల్ల అతడు అందరిలో ఉన్నా, ఎవరికీ కనిపించడు. అతనికి మాత్రం, అందరూ కనిపిస్తారు. అమోఘమైన శక్తులను పొందిన మేఘనాధుడు, ఇంద్రజిత్తుగా ఎలా మారాడు? లక్ష్మణుడి చేతిలో ఎలా వధింపబడ్డాడు? ఇంద్రజిత్తుకు తన మరణం గురించి ముందే తెలుసా? అనేటటువంటి ఉత్సుకతను రేకేత్తించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/_xD_6-POHho ]


మేఘనాధుడు ఇంద్రుణ్ణి జయించడం వల్ల, ఇంద్రజిత్తు అని పేరు వచ్చింది. రావణుడు ఒకనాడు దేవలోకంపై దండెత్తాడు. రాక్షస సేన దేవలోకాన్ని చుట్టుముట్టింది. ఇంద్రుడు రావణుడితో తలపడ్డాడు. మేఘనాథుడు, శివుడు తనకు వరంగా ఇచ్చిన మాయా రూపంలో, ఇంద్రుని కుమారుడు జయంతుని, అస్త్రాలతో ముంచెత్తగా, అతడు పడిపోయాడు. ఇంద్రుడి తండ్రి పులోముడు, జయంతుడిని తీసుకుని వెళ్ళి, సముద్రంలో దాచాడు. ఈ విషయం తెలిసి కోపోద్రిక్తుడైన ఇంద్రుడు, వజ్రాయుధంతో రావణుని దెబ్బతీశాడు. దాంతో రావణుడు క్రింద పడగా, ఇంద్రజిత్తు మాయా రూపంలో ఇంద్రుని రథమెక్కి, అతన్ని ఓడించి, బంధించాడు. అప్పుడు రావణుడు కుమారునితో కలసి, ఇంద్రుని లంకానగరానికి బందీగా తీసుకువెళ్ళాడు. ఆ విషయం తెలుసుకున్న దేవతలందరూ, బ్రహ్మను శరణు కోరారు.

అప్పుడు బ్రహ్మ లంకకు చేరి, "రావణా! నీ కొడుకు తండ్రిని మించిన తనయుడని ప్రశస్తి పొందాడు. అతని శౌర్య పరాక్రమములు నిరుపమానములు. నీ కుమారుడి వలన దిక్పాలకులను జయించాలనే నీ మనోరధం, సఫలమయ్యింది. అసమాన ధైర్య సాహసాలతో, యుద్ధనైపుణ్యాన్ని ప్రదర్శించి, సర్గలోకాధిపతి ఇంద్రుని జయించి, బంధించాడు. నేటి నుండి మేఘనాథుడు, "ఇంద్రజిత్‌" అను పేరుతో ప్రఖ్యాతి పొందుతాడు. ఇంద్రుని బంధ విముక్తుణ్ణి చేయి. అందుకు ప్రతిఫలం ఏంకావాలో కోరుకో” అన్నాడు బ్రహ్మ. అందుకు ఇంద్రజిత్తు అమరత్వాన్ని కోరుకోగా, భూ మండలంలో ఏ ప్రాణికీ అమరత్వం లేదని, బ్రహ్మ తిరస్కరించాడు. అప్పుడు ఇంద్రజిత్తు మళ్ళీ ఈ విధంగా కోరుకున్నాడు. "బ్రహ్మ దేవా, యుద్ధానికి సిద్ధమవడానికి ముందే, నేను మంత్ర యుక్తంగా హవిస్సును అర్పించి, అగ్నిని సంతృప్తుడిని చేస్తాను. అగ్ని కుండం నుండి ఒక దివ్య రథం ఆవిర్భవించాలి. ఆ రథంలో నిలచి యుద్ధం చేస్తున్నంత వరకు, నేను అవధ్యుని అయ్యేటట్లు వరాన్ని ప్రసాదించు. నా పూజ పూర్తికాక మునుపే నేను యుద్దానికి సిద్దమయితే, నాకు మరణం ప్రాప్తించవచ్చు" అని వేడుకున్నాడు. అందుకు బ్రహ్మ సమ్మతించి, ఇంద్రజిత్తు కోరిన వరాన్ని ప్రసాదించాడు. మేఘనాథుడు ఇంద్రుని బంధ విముక్తుడిని కావించి, ఇంద్రజిత్తుగా స్థిరపడ్డాడు.

ఇంద్రజిత్తు, రామ రావణుల మధ్య జరిగిన మహాయుద్ధంలో, వీరోచిత పాత్రను పోషించాడు. ఇంద్రజిత్తు ఆ యుద్ధంలో, రామలక్ష్మణులను నాగపాశంతో బంధించాడు. అయితే, గరుడుడు వారిని నాగాపాశంనుండి విడిపించాడు. యుద్ధంలో ఇంద్రజిత్తు 'శక్తి' అస్త్రాన్ని ప్రయోగించగా, లక్ష్మణుడు మూర్ఛబోయాడు. లక్ష్మణుడు మరణించాడనుకుని, రావణ సైన్యం విజయం తమదేనని ఆనందించింది. యుద్ధ సమయం ముగుస్తుండగా, ఇంద్రజిత్తు విజయ గర్వంతో రాజ్యానికి వెళ్ళిపోయాడు. సొమ్మసిల్లి పడిపోయిన లక్ష్మణుడు, సంజీవని సహాయంతో కళ్ళు తెరచాడు. ఇంద్రజిత్తు ఏదైనా యుద్ధానికి వెళ్లేముందు, యజ్ఞము చేసి వెళ్లేవాడు. ఆ యజ్ఞమహిమ వలన, అతడిని యుద్ధంలో ఓడించటం ఎవరివల్లా సాధ్యం అయ్యేది కాదు. ఆ యజ్ఞాన్ని భంగ పరచి ఇంద్రజిత్తును చంపితేనే, రావణ యుద్ధం ముగుస్తుందని భావించాడు లక్ష్మణుడు.

విభీషణుడి సహయంతో లక్ష్మణుడు, ఇంద్రజిత్తు హోమం చేస్తున్న ప్రదేశానికి వెళ్ళాడు. వారు అక్కడికి వెళ్ళేసరికి, ఇంద్రజిత్తు హోమం చెయ్యడం కోసం సిద్ధపడుతున్నాడు. తన హోమాన్ని ఎవరూ పాడుచెయ్యకుండా చుట్టూ సైన్యాన్ని కాపు పెట్టాడు. అప్పుడు విభీషణుడు, "లక్ష్మణా! నువ్వు ఒక పక్క నుండి సైన్యాన్ని బాణాలతో కొట్టి కాకావికలం చెయ్యి. అప్పుడు ఇంద్రజిత్తు కనపడతాడు. అదే సమయంలో హనుమ వెళ్ళి, రాక్షస సైన్యాన్ని తుదముట్టించెయ్యాలి. అంతమంది అక్కడ పడిపోతుంటే, వాడు ఇక్కడ కూర్చుని హోమం చెయ్యలేడు. కాబట్టి, రథం ఎక్కుతాడు. అప్పుడు నువ్వు వాడిని కొట్టాలి" అని అన్నాడు. వెంటనే లక్ష్మణుడు బాణ ప్రయోగం చేశాడు. అప్పుడా సైన్యం పక్కకి తప్పుకుంది. వారు పక్కకు తప్పుకోగానే, ఇంద్రజిత్తు కూర్చుని ఉన్న మర్రి చెట్టు కనపడింది. వెంటనే హనుమంతుడు అరివీరభయంకరుడై, రాక్షసుల పని పట్టాడు. హనుమ ప్రతాపం ముందు ఆ రాక్షన సైన్యం నిలబడలేక, పెద్దగా హాహాకారాలు చేశారు. ఆ హాహాకారాలు విన్న ఇంద్రజిత్తు హోమాన్ని ఆపి, "ముందు హనుమంతుడిని సంహరించి, అప్పుడు హోమం చేస్తాను" అని ఆగ్రహావేశాలతో రథాన్ని అధిరోహించాడు.

ఒక బ్రహ్మాండమైన అస్త్రాన్ని హనుమంతుడి మీద ప్రయోగిద్దామని, ఇంద్రజిత్తు ఆ అస్త్రాన్ని అభిమంత్రిస్తుండగా, లక్ష్మణుడు ధనుష్టంకారం చేశాడు. దాంతో ఇంద్రజిత్తు లక్ష్మణుడి వైపు చూశాడు. అప్పుడు లక్ష్మణుడు, "మాయావీ, హనుమతో యుద్ధం ఎందుకు? నీతో యుద్ధం చేయడానికే నేను వచ్చాను. పౌరుషం ఉంటే నాతో యుద్ధం చెయ్యి" అని అన్నాడు. "ఇంతకు ముందు నిన్ను పడగొట్టాను. అయినా బుద్ధి లేకుండా మళ్ళీ వచ్చావు. చూడు నీకు ఎటువంటి గతి పట్టిస్తానో" అంటూ ఇంద్రజిత్తు తొడలు చరిచాడు. వాళ్ళిద్దరి మధ్యా భీకర యుద్ధం మొదలయ్యింది. ఇద్దరూ ఒకరినొకరు బాణాలతో కొట్టుకున్నారు. లక్ష్మణుడు వేసిన బాణాలకు ఇంద్రజిత్తు ధనుస్సు ముక్కలయిపోయింది. తరువాత ఇంద్రజిత్తు బాణాలతో, లక్ష్మణుడి కవచాన్ని పగలగొట్టాడు. ఇద్దరూ సింహాలలా యుద్ధం చేశారు.

విభీషణుడు రాక్షసుల మీద బాణాలు వేసి, వాళ్ళను సంహరించాడు. ఇంద్రజిత్తుకీ, లక్ష్మణుడికీ, 3 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. ఆఖరికి ఇంద్రజిత్తు రథ సారధిని లక్ష్మణుడు పడగొట్టాడు. అప్పుడు ఇంద్రజిత్తు ఒక చేతితో సారధ్యం చేస్తూ, లక్ష్మణుడితో యుద్ధం చేశాడు. నలుగురు వానర వీరులు ఆ రథం యొక్క గుర్రాలను క్రిందికి లాగి, రథాన్ని కూలద్రోశారు. అప్పుడు లక్ష్మణుడు రెండు కోరలు కలిగిన సర్పంలాంటి ఒక బాణాన్ని తీసి వింటినారికి తొడిగి, "మా అన్న రాముడే గనుక ధర్మాత్ముడూ, సత్యసంధుడూ, దశరథ తనయుడూ, పౌరుషంగల వాడయితే, నా ఎదురుగా నిలబడిన ప్రతిద్వంది ఇంద్రజిత్తు నిగ్రహింపబడుగాక" అని బాణ ప్రయోగం చేశాడు. ఆ బాణం వెళ్ళి ఇంద్రజిత్తు కంఠానికి తగలగానే, అతడి శిరస్సు శరీరం నుండి వెరై క్రింద పడిపోయింది. అంతటితో ఇంద్రజిత్తు మరణించాడు.

అయితే, ఇంద్రజిత్తుకు తన మరణం లక్ష్మణుడి చేతనే అని ముందుగానే తెలుసు. అసురుడైన మేఘనాధుడు, గతంలో ఓ రుషిని పీడిస్తూ, ఆయన నుండి ఓ శాపాన్ని పొందాడు. అ శాప ప్రభావంగా ఇంద్రజిత్తు, పాముల వల్ల గానీ, పాముల ప్రభువు వల్ల గానీ మరణిస్తాడు. తన అద్భుత పరాక్రమం వల్ల, పాములు తనను చంపలేవని విశ్వసించిన మేఘనాథుడు, రాక్షస గురువు సలహాను కోరాడు. శేషనాగు అంశ ఈ భూలోకంలో లక్ష్మణుడిగా అవతరిస్తుందనీ, అతనే నిన్ను హతమార్చే ప్రమాదముందనీ, గురువు సూచన ప్రాయంగా చెప్పాడు. దీనిని తప్పించుకోవటానికి మేఘనాథుడు, సర్పలోక రాజు ఆదిశేషువుకు తెలియకుండా, అతడి కూతురు సులోచనను పెళ్లి చేసుకున్నాడు.

లక్ష్మణుడు సాక్షాత్తూ ఆదిశేషువు అవతారం కావడం వలన, కూతురిని పెళ్లి చేసుకున్న కారణంగా అల్లుడిని చంపబోడని అపోహపడ్డాడు. ఆ భావనతోనే మేఘనాథుడు, రామరావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడికి ప్రాణాపాయం లేకుండా ఉండేలా, అస్త్రాన్ని తక్కువ మోతాదులో ప్రయోగించాడని అంటారు. శక్తివంతమైన అస్త్రంతో మరణించవలసిన లక్ష్మణుడు కేవలం మూర్చపోయి, తిరిగి సంజీవని ప్రభావంతో లేచి, ఇంద్రజిత్తును అంజలికాస్త్రంతో సంహరించాడు. అరివీరపరాక్రమాలు కలిగిన ఇంద్రజిత్తు, రామ రావణ యుద్ధ ఘట్టంలో ప్రముఖ పాత్రను పోషించాడనటంలో అతిశయోక్తి లేదు.

ఎవరెన్ని మాయోపాయాలు చేసినా, అంతిమంగా చెడుపై మంచి విజయం సాధించడం తధ్యం..

Saturday, August 19, 2023

'2023 శ్రావణ మాసం' ప్రారంభమైంది..


2023 శ్రావణ మాసం ప్రారంభమైంది..
ఈ నెలలో నాగ పంచమి, రాఖీతో సహా ఏయే పండుగలొచ్చాయో తెలుసా?

మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్క మాసానికీ ఒక ప్రత్యేకత ఉంది. అయితే, శ్రావణ మాసానికి ఉన్న విశిష్ఠతే వేరు. ఈ మాసాన్ని, ఉపవాసాలూ, పండుగల మాసంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ప్రతి ఒక్క ఇల్లూ, ఆలయాన్ని తలపిస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈ కాలంలోనే వర్షాలు అధికంగా కురుస్తాయి. వాగులూ, వంకలూ, సరస్సులూ, చెరువులూ, నదులూ పొంగి పొర్లుతాయి. తెలుగు పంచాంగం ప్రకారం, ఆగస్టు 17వ తేదీ నుంచి, నిజ శ్రావణ మాసం ప్రారంభమైంది. ఇది సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఉంటుంది. ఈ సందర్భంగా, శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలూ, వ్రతాలేంటి? అవి ఏయే తేదీలలో వచ్చాయి? వాటి ప్రాముఖ్యతేంటో తెలుసుకుందాము..

శ్రావణ సోమవారం..

పరమేశ్వరుని ఆరాధనకు శ్రావణ మాసం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. అందులోనూ శ్రావణ సోమవారం రోజున శివుడిని పూజించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చని, ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. ఇదే మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారానికి, ఎంతో ప్రాముఖ్యత ఉంది.

శ్రావణ మంగళవారం..

శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం రోజున, మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. కొత్తగా పెళ్లయిన స్త్రీలు, పెళ్లి జరిగిన తొలి ఐదు సంవత్సరాల పాటూ, ఈ వ్రతాన్ని ఆచరించాలి. అదే విధంగా, కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలను ఉదయాన్నే ఇంటికి పిలిచి, పూజలు చేసి, ఆ తర్వాత రాత్రి మేల్కొలుపు నిర్వహిస్తారు.

శ్రావణ బుధ, గురువారాలలో..

శ్రావణ మాసంలో ప్రతి బుధవారం, గురువారం రోజున, బుధుడినీ గురుడినీ ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఏడు సంవత్సరాల పాటు ఆచరిస్తారు. సంపద, తెలివి తేటలూ, విద్య పెరగాలని కోరుకునేవారు, ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తారు. బుధుడు, గురుడి ఆరాధన, అనేక ఇళ్లలో సంప్రదాయబద్ధంగా జరుగుతుంది.

శ్రావణ శుక్రవారం..

శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఎంతో ప్రత్యేకమైనది. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి ఆశీస్సులు పొందేందుకు, అత్యంత అనుకూల సమయమని చాలా మంది నమ్ముతారు. ఈ పర్వదినాన అమ్మవారికి పూజలు చేయడం వల్ల, సంతాన, సౌభాగ్యం లభిస్తుందని పండితులు చెబుతారు.

శ్రావణ శనివారం..

శ్రావణ మాసంలోని ప్రతి శనివారం నాడూ, అశ్వత్థ పూజలు చేస్తారు. అదే విధంగా, శ్రీ మహా విష్ణువుకు ప్రతి రూపంగా పరిగణించి, రావి చెట్టును కూడా పూజిస్తారు. అలాగే, శ్రావణ మాసంలోని అన్ని శనివారాలలో, స్థంభం, లేదా గోడలపై నరసింహ స్వామి అవతారాన్ని ఉంచి, పూజిస్తారు. ప్రహ్లాదుని కోసం పరమాత్ముడు నరసింహావతారం ఎత్తాడు. ఆ సమయంలో ఆయన స్థంభం నుంచి ప్రత్యక్షమయ్యాడుకాబట్టి, దానికి ప్రతీకగా, స్థంభం, లేదా గోడపై స్వామి వారి చిత్రాన్ని ఉంచి పూజిస్తారు.

శ్రావణ ఆదివారం..

శ్రావణ మాసంలో తొలి ఆదివారం నాడు, మహిళలు ఆదిత్య వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ సమయంలో సూర్యుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఆదివారం నాడు సూర్యు భగవానుడికి అంకితం చేయబడింది. అందుకే ఆదివారం రోజున సూర్య దేవుడిని ఆరాధించడం వల్ల, ఖచ్చితంగా శుభ ఫలితాలొస్తాయని నమ్ముతారు.

శ్రావణ మాసంలో పంచమి తిథి నాడు, నాగ పంచమిగా పరిగణిస్తారు. ఈ పవిత్రమైన రోజున, నాగ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సారి శ్రావణ నాగ పంచమి, ఆగస్టు 21వ తేదీ, సోమవారం నాడు వచ్చింది. తెలుగు రాష్ట్రాలలో నాగ పంచమి రోజున, పుట్టలోని పాములకు పాలూ, గుడ్లూ నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల, కాల సర్ప దోషాలు తొలగి పోతాయని అనాదిగా వస్తున్న నమ్మకం.

రాఖీ పౌర్ణమి..

ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని, శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, లేదా కొబ్బరి పూర్ణిమగా పరిగణిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 30వ తేదీన రాఖీ పండుగ వచ్చింది. ఆ సమయంలో సోదరులకు సోదరీమణులు రాఖీలను కట్టి, పండుగను ఆప్యాయతానురాగాల మధ్య జరుపుకుంటారు. మహారాష్ట్రలో నార్లీ పూర్ణిమ పేరిట, కొబ్బరికాయలను సాగరానికి సమర్పిస్తారు. మరోవైపు శ్రావణ మాసంలో అష్టమి రోజున, రోహిణీ నక్షత్రం వేళ శ్రీ క్రిష్ణుడు జన్మించాడని నమ్ముతారు. అందుకే ఈ ఏడాది, శ్రీ క్రిష్ణ జయంతిని సెప్టెంబర్ 6న, బుధవారం నాడు జరుపుకుంటారు.

Friday, August 18, 2023

అశ్వత్థ వృక్షం! Significance of Ashvattha (Peepal) Tree

అశ్వత్థ వృక్షం!

మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణీ!
అగ్రత శ్శివ రూపాయ వృక్ష రాజాయతే నమః!!

అశ్వత్థ వృక్షం త్రిమూర్తి స్వరూపమే కాకుండా, సర్వదేవతా స్వరూపం.

ఈ వృక్షమును ఒక్క శనివారము మాత్రమే ముట్టుకోవచ్చు. అమావాస్య  నాడు ఈ అశ్వత్థ వృక్షానికి శక్తి కొలదీ అంటే, 21, 108 ప్రదక్షిణలు చేసి పూజిస్తే, సర్వాభీష్ట సిద్ధి కలుగుతు౦ది. విష్ణు సహస్ర నామం పఠిస్తూ ప్రదక్షిణ చేయవచ్చు.  మౌనంగా ప్రదక్షిణ చేస్తే అమిత ఫలం లభిస్తు౦ది.

ఉదక కుంభం (నీళ్ళ చెంబు) తీసుకుని గర్భిణీ స్త్రీలా మ౦దగతితో ప్రదక్షిణ చేస్తే, అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తు౦ది.

రావి చెట్టును పూజించటం వలన కలిగే ఫలితములు:

అశ్వత్ధ వృక్షంలో సర్వదేవతలూ ఉంటారు. దాని మహాత్మ్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారదుడు వివరించాడు. అశ్వత్ధమే నారాయణ స్వరూపము. ఆ వృక్షం యొక్క 'మూలము – బ్రహ్మ', 'మధ్య భాగం – విష్ణువు', 'చివరి భాగము – శివుడు' కనుక, దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించి నట్లే. ఈ త్రిమూర్తులు దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులలోని కొమ్మలలో ఉంటారు. తూర్పు దిక్కున ఉన్న కొమ్మలలో, ఇంద్రాది దేవతలో, సప్త సముద్రాలో, అన్ని పుణ్య నదులూ ఉంటాయి. దాని వేర్లలో మహర్షులో, గో బ్రాహ్మలో, నాలుగు వేదాలూ ఉంటాయి. అశ్వత్ధ వృక్షాన్ని ఆశ్రయించి అష్టవసువులూ, ఏకాదశ రుద్రులూ, ద్వాదశాధిపతులూ, దిక్పాలకులూ ఎల్లప్పుడూ ఉంటారు.

అశ్వత్ధ వృక్షం మూలములో ‘అ’ కారము, మానులో ‘ఉ ‘ కారము, అది ఇచ్చే పళ్ళలో ‘మ’ కారము, వెరసి ఆ వృక్షమంతా ప్రణవ స్వరూపమే. అశ్వత్ధ వృక్షం సాక్షాత్తు కల్ప వృక్షము.

ప్రదక్షణ మరియు పూజించే విధానము:

ముందుగా అశ్వత్ధ వృక్షాన్ని దర్శించి, దానిని చేతితో తాకి (శనివారం మాత్రమే తాకాలి) ఈ క్రింది అశ్వత్ధ వృక్ష స్తోత్రమును పఠించాలి..

అశ్వత్ధవృక్ష స్తోత్రం:

మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే
అగ్రత శ్శివరూపాయ వృక్షరాజయతే నమః

అశ్వత్ధ వృక్ష ప్రదక్షిణ, చైత్ర, ఆషాడ, పుష్య మాసాలలో చేయరాదు. గురు, శుక్ర మౌడ్యాలలో చేయరాదు. కృష్ణ పక్షంలో అశ్వత్ధ వృక్ష ప్రదక్షిణ ప్రారంబించరాదు. ఆది, సోమ, శుక్ర వారాలలో, గ్రహణ మరియు సంక్రమణ సమయాలలో, నిషిద్ధ సమయాలలో, రాత్రి భోజనము చేసి, ఈ వృక్షాన్ని సేవించరాదు.

మౌనంగా లేదా గురు నామము లేదా విష్ణు సహస్ర నామమును చదువుతూ, నెమ్మదిగా ప్రదక్షణలు చేయాలి. ప్రతి ప్రదక్షణానికి ముందు, అలాగే చివర, అశ్వత్ధ వృక్షానికి నమస్కారించాలి.

అశ్వత్ధ వృక్ష పూజా ఫలము..

అశ్వత్ధ వృక్షానికి రెండు లక్షల ప్రదక్షణాలు చేస్తే, సర్వ పాపాలూ నశించి, నాలుగు పురుషార్ధాలు సిద్ధిస్తాయి.

బిడ్డలు కలగాలన్న సంకల్పముతో ప్రదక్షణలు చేస్తే, తప్పక కలుగుతారు.

శనివారం నాడు అశ్వత్ధ వృక్షాన్ని చేతితో తాకి, మహామృత్యుంజయ మంత్రమును జపిస్తే, మృత్యు భయం పోతుంది. అలాగే, శనివారం నాడు అశ్వత్ధ వృక్షాన్ని చేతితో తాకి, ఈ క్రింది శనైశ్చర స్తోత్రమును పఠించడం వలన, శనిదోషం తొలగిపోతుంది.

అశ్వత్ధ వృక్షం క్రింద చెప్పవలసిన శనైశ్చర స్తోత్రం..

కోణస్థ: పింగళో బభ్రు: కృష్ణో రౌద్రాంతకోయమః
శౌరీ శ్శనైశ్చరో మందః పిప్పిలా దేవ సంస్తుతః

గురువారం, అమావాస్య కలసి వచ్చిన రోజున, అశ్వత్ధ వృక్షం క్రింద వేద విప్రునికి భోజనము పెడితే, కోటి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితముంటుంది.

గురువారం, అమావాస్య కలసి వచ్చిన రోజున, అశ్వత్ధ వృక్షనీడలో స్నానమాచరించిన, మహా పాపములు తొలగుతాయి.

అశ్వత్ధ వృక్షం క్రింద చదివిన గాయత్రీ మంత్ర జపం, నాలుగు వేదాలు చదివిన ఫలితాన్ని ఇస్తుంది. అశ్వత్ధ వృక్షాన్ని స్థాపిస్తే, నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది.

లోకా సమస్తా సుఖినో భవంతు!

ఇంకా ఎన్నో మంచి విషయాలకోసం: https://www.youtube.com/@mplanetleaf/videos

Wednesday, August 16, 2023

మాంసాహారం! భగవద్గీత Bhagavad Gita Chapter 17

మాంసాహారం!
బాధలనూ, శోకమునూ, మరియు వ్యాధులనూ కలుగజేసే ఆహారములేవి?

'భగవద్గీత' సప్తదశోధ్యాయం - శ్రద్ధా త్రయ విభాగ యోగం (09 – 12 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహేడవ అధ్యాయం, శ్రద్ధా త్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, శ్రద్ధా త్రయ విభాగ యోగములోని, 09 నుండి 12 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/xi3aiY2qQeA ]


ఎటువంటి ఆహారములు బాధనూ, శోకమునూ, మరియు వ్యాధులనూ కలుగ చేస్తాయో, శ్రీకృష్ణుడిక్కడ వివరిస్తున్నాడు..

00:50 - కట్వమ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః ।
ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః ।। 9 ।।

అతి చేదుగా, అతి పుల్లగా, ఉప్పగా, చాలా వేడిగా, ఘాటుగా, ఎండిపోయిన మరియు కారంగా ఉన్న ఆహార పదార్ధములు, రజో గుణ ప్రధానముగా ఉండే వారికి ఇష్టముగా ఉంటాయి. ఇటువంటి ఆహారములు బాధనూ, శోకమునూ, మరియు వ్యాధులనూ కలుగచేస్తాయి.

ఎప్పుడైతే శాకాహార పదార్థములను మితిమీరిన కారం, చక్కెర, ఉప్పు వంటివి వేసి వండుతారో, అవి రాజసికమైనవి అవుతాయి. అవి అనారోగ్యమునూ, ఉద్వేగమునూ, మరియు నిస్పృహనూ కలుగచేస్తాయి. రజో గుణములో ఉండేవారు, అటువంటి ఆహారమును ఇష్టపడతారు. కానీ, అటువంటి ఆహారము, సత్త్వ గుణములో ఉన్నవారికి వికారమైనవిగా అనిపిస్తాయి. ఆహారాన్ని భుజించటం అనేది, నాలుకతో ఏదో ఆనందాన్ని అనుభవించటానికి కాదు. అది శరీరమును ఆరోగ్యముగా, మరియు బలముగా ఉంచటానికి ఉపయోగపడాలి. ఈ విధంగా, వివేకవంతులు, చక్కటి ఆరోగ్యమునకు అనుగుణముగా ఉండే, మరియు మనస్సుపై శాంతియుత ప్రభావం కలిగించే ఆహారాన్నే తీసుకుంటారు. అంటే, సాత్త్విక ఆహారమన్నమాట.

02:09 - యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ ।
ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ ।। 10 ।।

మాడిపోయిన ఆహారము, మురిగిపోయిన ఆహారము, కలుషితమైన, మరియు అపరిశుద్ధ ఆహారము, తామసీ గుణము ప్రధానముగా ఉన్నవారికి ప్రియముగా ఉంటాయి.

వండిన పదార్ధము ఒక జాము, అంటే, మూడు గంటల కంటే ఎక్కువగా నిలువ ఉంటే, అది తామసిక ఆహారము అయిపోతుంది. అపరిశుద్దమైన ఆహారము, చెడురుచి, లేదా చెడువాసన వచ్చే పదార్ధములు, ఇవే కోవకు వస్తాయి. అన్ని రకాల మాంసాహారములూ, ఈ అపరిశుద్ధ ఆహారము కోవకే వస్తాయి. ప్రకృతి ఈ మానవ దేహమును శాకాహారమునకే నిర్మాణం చేసింది. మానవులకు, మాంసాహార జంతువుల లాగా, మాంసం చీల్చటానికి కోరపళ్ళు కానీ, వెడల్పైన దవడ కానీ ఉండవు. మాంసభక్షక జంతువులకు, త్వరగా కుళ్లిపోయే, చనిపోయిన జంతుమాంసం, కొద్ది కాలమే కడుపు లోపల ఉండేవిధంగా, అది త్వరగా బయటకు వెళ్లిపోవటానికి, తక్కువ పొడువు కలిగిన పేగులు ఉంటాయి. దీనికి విరుద్ధంగా, శాకాహార పదార్థములను నెమ్మదిగా, మరియు చక్కగా జీర్ణం చేసుకోవటానికి, మనుష్యులకు పొడవాటి జీర్ణ వ్యవస్థ ఉంటుంది. మాంసాహార జీవుల కడుపులో, ఆమ్ల తీవ్రత, మనుష్యులలో కంటే ఎక్కువగా ఉంటుంది. అది వాటికి పచ్చి మాంసాన్ని జీర్ణం చేసుకోవటానికి దోహదపడుతుంది. ఆసక్తికరంగా, మాంసాహార జంతువులు, చర్మరంధ్రాల నుండి చెమర్చవు. అవి శరీర తాపమును, నాలుక ద్వారా నియంత్రిస్తాయి. అదే సమయంలో, శాకాహారులు, మరియు మనుష్యులు, తమ శరీర తాపమును, చర్మరంధ్రాల ద్వారా వచ్చే చెమట ద్వారా నియంత్రించడం జరుగుతుంది. త్రాగేటపుడు మాంసాహార జీవులు, నీటిని గతుకుతాయి. కానీ, శాకాహార జంతువులు, నీటిని గతకాకుండా, పీల్చుతాయి. మనుష్యులు కూడా నీరు త్రాగేటప్పుడు, నీటిని పీల్చుతారు. ఇవన్నీ మానవ శరీరము యొక్క భౌతిక లక్షణములు. భగవంతుడు మనుష్యులను మాంసభక్షక జంతువులలా తయారుచేయలేదని, మనకు తెలియచేస్తున్నాయి. అందుకే మాంసము మనుష్యులకు అపవిత్రమైనదిగా పరిగణించ బడుతుంది.

04:28 - అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే ।
యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్త్వికః ।। 11 ।।

ఫలాపేక్ష లేకుండా, శాస్త్ర విధినియమములను పాటిస్తూ, ఇది చేయవలసిన కర్తవ్యమని మనస్సులో దృఢ సంకల్పముతో చేసిన యజ్ఞము, సత్త్వ గుణముతో చేయబడినట్లు.

యజ్ఞము చేసే ప్రవృత్తి కూడా, త్రిగుణముల ప్రకారముగానే ఉంటుంది. శ్రీ కృష్ణుడు, సత్త్వ గుణములో చేసే యజ్ఞ పద్ధతిని మొదటగా వివరిస్తున్నాడు. ‘అఫల-ఆకాంక్షిభిః’ అంటే, ఎటువంటి ప్రతిఫలాన్ని అపేక్షించకుండా యజ్ఞము చేయబడాలి. ‘విధి దృష్టః’ అంటే, అది వేద శాస్త్రములలో చెప్పబడిన నియమముల ప్రకారంగా, చేయబడాలి. ‘యష్టవ్యమ్ ఏవైతి’ అంటే, శాస్త్రములలో ఆదేశింపబడినట్టు, ఈశ్వర ఆరాధన నిమిత్తమే చేయబడాలి. ఎప్పుడైతే యజ్ఞము ఈ విధముగా చేయబడినదో, అది సత్త్వ గుణముతో చేయబడినట్టు.

05:30 - అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్ ।
ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్ ।। 12 ।।

ఓ భరత శ్రేష్ఠుడా, ప్రాపంచిక లాభము కోసము, లేదా అహంకారముతో చేయబడిన యజ్ఞము, రజోగుణములో ఉన్నట్టు తెలుసుకొనుము.

అట్టహాసముగా, ఆడంబరముగా చేసినా, దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం, ‘నాకు ప్రతిఫలముగా ఏమి దక్కుతుంది?’ అన్న స్వార్థ పూరితభావనతో ఉన్నప్పుడు, ఆ యజ్ఞమనేది భగవంతునితో వ్యాపారం చేసినట్టవుతుంది. శుద్ధ భక్తి అంటే, వ్యక్తి తనకు తిరిగి ఏ ప్రతిఫలాన్నీ ఆశించనిది. యజ్ఞమును ఒక గొప్ప క్రతువుగా చేయవచ్చు. కానీ, అది పేరు ప్రతిష్ఠ, లేదా సొంతగొప్ప వంటి వాటి కోసం చేస్తే, అది రాజసిక స్వభావముతో చేసినట్టవుతుందని, శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు.

06:25 - ఇక మన తదుపరి వీడియోలో, ఎటువంటి యజ్ఞము, తమో గుణములోనికి వస్తుందో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, August 14, 2023

శంభలలో ఉన్న దివ్య మణి! A Truly Powerful Gem - The Chintamani Stone


శంభలలో ఉన్న ఆ దివ్య మణి రహస్యం మీకు తెలుసా?
దుర్బుద్ధితో ఆ మణిని చేజిక్కించుకోవాలనుకున్న వారు ఏమైపోయారు?

శంభల.. ఆ పేరు తలచుకుంటేనే, ఏదో తెలియని పులకింత కలుగుతుంది. బాహ్య ప్రపంచానికి తెలియని మహా నగరమది. ఎందుకంటే, అది అన్ని ఇతర ప్రాంతాల తీరులో, సాధారణమైన నగరం కాదు. అక్కడ ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. దేవతలు సంచారం చేసే దైవభూమి అది. ఆ ప్రాంతాన్ని చేరుకోవాలంటే, శారీరక, మానసిక ధైర్యంతో పాటు, యోగం కూడా ఉండాలని, హిందూ, బౌద్ధ గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి. బౌద్ధులు ఆ ప్రదేశాన్ని స్తుతిస్తూ, "ఓం శ్రీ మణిపద్మేహుం" అని స్మరిస్తారు. మహిమాన్విత వ్యక్తులు జీవించే, మహోన్నతులకు మాత్రమే కనిపించే ఆ అత్యద్భుత ప్రదేశంలో దాగి ఉన్న రహస్యాలేంటి? ఆ నిగూఢ నగరం ఎలా ఉంటుంది? శంభల నగరానికి వెళ్ళి, సజీవంగా తిరిగివచ్చిన వారెవరైనా ఉన్నారా - వంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/QMlIeuhRDak ]


"స్వరవ్యయం స్వర్గ నాక త్రిదివత్రి దశాలయః
సురలోకో ద్యోదివౌద్వే త్రివిష్టపం"

శంభల నగరానికి మరోపేరు త్రివిష్టపం. మన పురాణాలలో దీనిని స్వర్గంగా పేర్కోన్నారు. సత్యం, అహింస, ధర్మం పాటించే పుణ్యమూర్తులకు మాత్రమే, అందులోకి ప్రవేశం ఉంటుంది. యోగ సాధన ద్వారా సుషుమ్న నాడిని వశపరుచుకున్న సాధకులు మాత్రమే, అందులోకి ప్రవేశించగలరు. పూర్వ పుణ్య ఫలము, భగవంతునికి అర్పించిన మనస్సు, అకుంఠిత తపః ఫలము, మరియూ సడలని పట్టుదల కలిగిన వారికి తప్ప, సామాన్యులకు ‘శంభల’ దర్శనము అలభ్యము. సాక్షాత్తు పరమ శివుడు కొలువుండే కైలాసము, మానస సరోవరము, శంభల, కలాప, ఇవన్నీ ఒకదానికొకటి సమీపంగానే ఉంటాయి. హిమాలయ పర్వత శ్రేణులలోని కైలాస పర్వతం, మానస సరోవరం పరిసర ప్రాంతాలలో, ఆ అద్భుత రహస్య నగరం ఉంది. మన పురాణాల ప్రకారం, శంభల ప్రాంతమంతా, అద్భుతమైన ప్రాకృతిక సంపద పరచుకుని ఉంటుంది. అక్కడి వృక్షాలు నిరంతరం, సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. అక్కడి ప్రజల ఆయువు, సాధారణ ప్రజల ఆయువు కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆ నగరం వయస్సు, 60 లక్షల సంవత్సరాలకు పైబడి ఉంటుందని, అంచనా. అక్కడి ప్రజల పొడవు, సగటున 12 అడుగులుంటుందని చెప్పబడింది. యోగ సాధన ద్వారా శంభలలో ఉండే ప్రజలు, లోకంలో ఎక్కడున్న వారితో అయినా సంభాషించే సామర్థ్యం కలిగి ఉంటారు.

శంభల ప్రాంతంలో మార్కండేయుడు, వశిష్ఠుడు, జాబాలి, జమదగ్ని, అగస్త్యాది మహర్షులు తపములాచరించారని, మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే మహావతార్ బాబాజీ, దేవరహా బాబా, ఇంకా చాలా మంది సిద్ధులూ, జ్ఞానులు కూడా, శంభల ప్రాంతాలలో తపమాచరించినట్లు చెబుతారు. ప్రపంచంలో ఎక్కడ జరిగే అభివృద్ధి అయినా, విధ్వంసమైనా, అక్కడి వారికి క్షణాలలో తెలిసిపోతుంది. లోకంలో అధర్మం పెచ్చుమీరి, కలి ప్రభావం కట్టడి చెయ్యలేనంతగా పెరిగినప్పుడు, శంభలలో ఉండే పుణ్యపురుషులూ, యోగులూ, లోక పరిపాలనను తమ చేతులలోకి తీసుకుంటారని, కొన్ని గ్రంధాల ఆధారంగా తెలుస్తోంది. అంతేకాదు, శ్రీ మహావిష్ణువు కల్కిగా, శంభలలోనే జన్మించబోతున్నాడనే సంగతి, మనలో చాలామందికి తెలిసిన విషయమే. రాబోయే కాలంలో శ్రీ హారి జన్మించబోయే శంభల ప్రాంత నిర్మాణం, అత్యద్భుతంగా ఉంటుంది. హిందూ, బౌద్ధ పురాణాలలో, ఆ నగర నిర్మాణానికి సంబంధించిన వివరాలు ఎన్నో ఉన్నాయి.

ఆ వివరాల ప్రకారం, శంభల నగరం చుట్టూ ఎనిమిది రేకుల కమలం ఆకారంలో, పర్వతాలు గొలుసుకట్టుగా ఉంటాయి. మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది. శ్రీచక్ర ఆకృతిలో ఉన్న భవనం మధ్యలో, భూగ్రహాన్ని పోలిన నమూనా ఉంటుంది. అది తిరగబడిన పిరమిడ్ తరహాలో ఉంటుంది. అందులోకి వెళ్ళేందుకు సొరంగ మార్గాలు ఉంటాయి. అంతేకాదు, అందులో ఉన్న మరో ఆశ్చర్యం ఏమిటంటే, సృష్టి ఆరంభం నుంచీ, మహర్షులు రాసిన గ్రంథాలన్నీ అక్కడ భద్రపరచబడి ఉన్నాయట. మొత్తం 18 సంపుటాలుగా వీటిని విభజించి ఉంచినట్లు చెబుతారు. బౌద్ధ సన్యాసులు కూడా ఆ నగరాన్ని పవిత్ర ప్రదేశంగా చెబుతారు. వారి సంప్రదాయం ప్రకారం, శంభలలో ఉండే చింతామణి కి సంబంధించిన మంత్రాన్ని ఉపాసన చేస్తారు. మన భారతీయ గ్రంధాల ప్రకారం కూడా, చింతామణికి చాలా ప్రాశస్త్యం ఉంది.

కోటి సూర్య ప్రభా సమానమైన ఆకుపచ్చని రంగులో ఉన్న "చింతామణి" అన్న మహామణి గురించి, లలితా సహస్రనామంలో, ‘చింతామణి గృహాంతఃస్థా’ అంటే, చింతామణుల చేత నిర్మింపబడిన గృహము లోపల ఉండేది, అని వివరించబడింది. కోటి సూర్యుల కాంతితో వెలిగే ఆ దివ్యమైన చింతామణి, శంభలలో ఉంది. పాదరసం గడ్డకట్టినట్లు, పనసకాయంత పరిమాణంలో, ఆ మణి ఉంటుంది. సప్తరస ధాతువులతో ఏర్పడిన ఆ మణికి, అర్ధచంద్రాకారంలో ముఖం ఉంటుంది. పెదవులు తెరచినట్లుండే ఒక ద్వారం ఉంటుంది. సిద్ధులైన యోగులూ, యుగయుగాలుగా జీవిస్తున్న సప్త చిరంజీవులూ, నిత్యం ఆ మణికి పూజలు చేస్తుంటారని ప్రతీతి. ఆ మణి కోరిన వరాలను ఇస్తుందంటారు. శంభలలో ఉండే వారు, ఆ మణి ఆధారంగానే వారి కోరికలను తీర్చుకుంటూ జీవిస్తుంటారని అంటారు.

కొంతమంది దుర్బుద్ధి కలిగిన వారు, ఆ మణిని చేజిక్కించుకోవాలని ఆశపడి, అగాధంలో కలిసిపోయారు. ఎంతో పవిత్రమైన ఆ మణిని, కల్కి అవతారంలో వచ్చిన శ్రీహరి ధరిస్తాడని, పురాణాల ద్వారా అవగతమవుతోంది. అంతటి మహిమాన్వితమైన, పవిత్రమైన ఆ నగరాన్ని చూడాలంటే, ఆషామాషీ విషయం కాదు. సత్యం, ధర్మం, అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంభల నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని, పురాణాలలో పేర్కొనబడి ఉంది. వాటిలో ప్రస్తావించబడినట్లే, కొందరు సాధారణ వ్యక్తులు శంభల నగర ప్రజలను చూసి రావడం గమనార్హం. వారి వద్ద తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. శంభల ప్రాంతంలో ఉండే కాల ప్రమాణాలు, సాధారణ కాల ప్రమాణానికి భిన్నంగా ఉంటాయి. ఆ నగరాన్ని బాహ్య ప్రపంచానికి పరిచయం చేయడం కోసం ప్రయత్నించిన ఓ బృందానికి, విచిత్రమైన అనుభవం ఎదురైంది.

ఆ ప్రాంతంలో 12 గంటలు గడిపితే, బయటి ప్రపంచంలో రెండు వారాలు గడిపితే పెరిగినంత ప్రమాణంలో, గోళ్ళు, వెంట్రుకలు పెరిగాయట. కొంత దూరం వెళ్ళిన తర్వాత, ఆ బృంద సభ్యులకు ఆకస్మాత్తుగా వయస్సు పెరగటం ప్రారంభమైంది. రోజుల వ్యవధిలోనే దశాబ్దాల వయస్సు పెరగటంతో, వారు భయపడి వెనక్కు తిరిగి వచ్చేశారు. వారు వెనక్కు వచ్చిన తర్వాత, కొన్ని రోజులలో, 100 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు వచ్చే వ్యాధులకు గురై, వారంతా మరణించారు. 1889లో జన్మించిన ఆనందమయి, హిమాలయాలలో, సుమారు 20 నుంచి 25 అడుగుల ఎత్తు గల మనుషులను చూశానని చెప్పడం, గమనార్హం. వారంతా 5 వేల ఏళ్ల నాటి ద్వాపర యుగానికి చెందిన మనుషులని పేర్కొన్నారు.

రష్యాకు చెందిన హెలీనా, హిమాలయలలోని అతి రహస్యమైన ప్రదేశాల అన్వేషణలో భాగంగా, శంభలకు చేరుకున్నది. ఆనందమయి చెప్పినట్లే, ఆమె కూడా ద్వాపర యుగం నాటి మనుషులను చూశానని తెలపడం, గమనార్హం. వారితో ఉన్న కొన్ని ఫొటోలను కూడా ఆమె రాసిన పుస్తకంలో ప్రచురించింది. తమిళనాడులోని కుర్తలానికి చెందిన మౌనస్వామి కూడా, శంభల సిద్ధాశ్రమంలో తపస్సు చేశారు. శంభల నగరాన్ని చూసిన వ్యక్తులలో మరొకరు, వడ్డిపర్తి పద్మాకర్ గారు. 1980లలో, ఆయన హిమాలయాలలోని ఓ గుహలో కఠోర తపస్సు చేస్తున్నప్పుడు, విపరీతమైన మంచు తుఫాన్ ఏర్పడిందనీ, ఆ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్న సమయంలో, సుమారు 20 అడుగుల ఎత్తైన వ్యక్తి తనను పట్టుకుని, జనావాసాలు ఉన్న ప్రాంతంలో వదిలి వెళ్లిపోయాడనీ, ఆయన స్వీయ అనుభవాలలో తెలియజేశారు.

ఫ్రాన్స్‌కు చెందిన చారిత్రక పరిశోధకురాలూ, రచయిత్రి, అలెగ్జాండ్రా డేవిడ్ నీల్, శంభలకు సంబంధించి కొన్ని గ్రంథాలు రచించారు. ఆమె తన 56 ఏళ్ల వయసులో, ఫ్రాన్స్ నుంచి టిబెట్ వచ్చి, లామాలను కలుసుకున్నారు. వారి ద్వారా శంభల వెళ్లి, అక్కడి మహిమాన్వితుల ఆశీర్వాదాలు తీసుకోవడం వల్లే, ఆమె 101 ఏళ్లు బతికారని చెబుతారు. అయితే, ఇప్పటివరకు శంభలను చూడడానికి వెళ్ళిన వ్యక్తులు, కేవలం శంభల నగరంలోని మనుషులను మాత్రమే చూసి వచ్చినట్లు తెలుస్తుంది. అసలైన రహస్య నగరంలోకి అడుగుపెట్టడం, ఇప్పటివరకూ ఎవరికీ సాధ్యం కాలేదు. హిమాలయ పర్వత పంక్తుల మధ్య నిక్షిప్తమైన ఆ రహస్య నగరాన్ని చేరుకోవాలంటే, ముందుగా కైలాస పర్వతాన్ని దాటాలని అంటారు. సామాన్య చర్మ చక్షువులకు కనిపించని రీతిగా దానిని ఒక మాయావరణం ఆవరించి ఉంటుందని, సిద్ధ పురుషులూ, జ్ఞానులూ చెబుతారు. అటువంటి శంభలను చేరుకోవాలంటే, భౌతిక ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించి, కైలాస పర్వతాన్ని చేరుకున్న వారు మాత్రమే అక్కడి వరకూ చేరుకోగలరని, భారతీయ, బౌద్ధ గ్రంధాలతో పాటు, ఎన్నో విదేశీ రచనలలో సైతం పేర్కొనబడి ఉంది.

ధర్మో రక్షతి రక్షితః!

Wednesday, August 9, 2023

ఏ ఆహారాన్ని ఎటువంటి వారు ఇష్టపడతారు? భగవద్గీత Bhagavad Gita Chapter 17


ఏ ఆహారాన్ని ఎటువంటి వారు ఇష్టపడతారు? కృష్ణ భాగవానుడు ఏం చెప్పాడు?

'భగవద్గీత' సప్తదశోధ్యాయం - శ్రద్ధా త్రయ విభాగ యోగం (05 – 08 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహేడవ అధ్యాయం, శ్రద్ధా త్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, శ్రద్ధా త్రయ విభాగ యోగములోని, 05 నుండి 08 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/vyd-yOxDqbc ]


ఎటువంటి బుద్ధిహీనులు ఆసురీ గుణ సంకల్పంతో ఉంటారో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:48 - అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే యే తపో జనాః ।
దంభాహంకారసంయుక్తాః కామరాగబలాన్వితాః ।। 5 ।।

00:58 - కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః ।
మాం చైవాంతఃశరీరస్థం తాన్ విద్ధ్యాసురనిశ్చయాన్ ।। 6 ।।

కొంతమంది జనులు, అత్యంత కఠినమైన తపస్సులను, శాస్త్రవిరుద్ధమైనా, తమ కపటత్వం మరియు అహంకారముచే ప్రేరితులై చేస్తారు. కామము మరియు మమకారముచే ప్రేరితులై, వారు తమ శరీర అవయవములనే కాక, వారి శరీరములోనే పరమాత్మగా ఉన్న నన్ను కూడా క్షోభ పెడతారు. ఇటువంటి బుద్ధిహీనులు ఆసురీ గుణసంకల్పంతో ఉన్నవారని తెలుసుకొనుము.

ఆధ్యాత్మికత పేరుమీద, జనులు మూర్ఖపు తపస్సులు చేస్తుంటారు. కొందరు, ఈ ఘోరమైన ఆచారాలలో భాగంగా, భౌతిక ఉనికిపై ఆధిపత్యము కోసం, ముళ్ల పరుపుల మీద పడుకుంటారు, లేదా శరీరంలో చువ్వలను గుచ్చుకుంటారు. మరికొందరు, ఏవో గూఢమైన సిద్ధులకోసం, ఒక చేతిని సంవత్సరాల తరబడి పైకిలేపి ఉంచుతారు. కొంతమంది సూర్యుడి వంకే ఆపకుండా చూస్తుంటారు. అది కంటి చూపుకు ఎంత హానికరమో గమనించరు. మరికొందరు, ఏవో భౌతిక ప్రతిఫలాల కోసం, తమ శరీరములను శుష్కింపచేస్తూ, దీర్ఘ కాలం ఉపవాసాలు చేస్తుంటారు.  అటువంటి వారిని గురించి, శ్రీ కృష్ణుడు ఇలా అంటున్నాడు: ‘ఓ అర్జునా, నీవు అడిగావు కదా, శాస్త్ర ఉపదేశాలను పాటించకుండా, అయినా, విశ్వాసంతో పూజించేవారి స్థితి ఎలా ఉంటుందని. నేను చెప్పేదేమిటంటే, శ్రద్ధ, నమ్మకము అనేవి, తీవ్ర నియమ నిష్ఠలను ఆచరించేవారిలో కూడా కనబడతాయి. కానీ, అది సరియైన జ్ఞాన-ఆధారముగా లేనిది. ఇటువంటి జనులు, తమ పద్దతి పట్ల ప్రగాఢ నమ్మకంతో ఉంటారు. కానీ, వారి నమ్మకం, తామసికమైనది. ఎవరైతే తమ భౌతిక శరీరమును దుర్వినియోగం చేస్తూ, చిత్రహింసకు గురి చేస్తారో, వారు తమ దేహములోనే ఉన్న పరమాత్మను అగౌరవ పరిచినట్లే. ఇవన్నీ శాస్త్ర విధివిధానాలకు విరుద్ధంగా ఉన్నట్లని, వివరణ ఇస్తున్నాడు.

03:04 - ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః ।
యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు ।। 7 ।।

వ్యక్తులు ఇష్టపడే ఆహారము, వారి వారి స్వభావానుసారం ఉంటుంది. యజ్ఞము, తపస్సు, మరియు దానములు కూడా, వారి యొక్క ప్రవృత్తిని బట్టి ఉంటాయి. ఇప్పుడిక ఈ భేదముల గురించి వినుము.

మనస్సు, మరియు శరీరము, ఒకదానికొకటి ప్రభావితం చేసుకుంటాయి. కాబట్టి, మనుష్యులు తినే ఆహారము, వారి స్వభావమును ప్రభావితం చేస్తుంది, మరియు వారి స్వభావము, వారి ఆహార ఇష్ట-అయిష్టములను ప్రభావితం చేస్తుంది. ఛాందోగ్య ఉపనిషత్తు ప్రకారం, మనం తినే వాటిలో, స్థూల పదార్ధం మలముగా బయటకు వచ్చేస్తుంది; మెత్తనిది మాంసముగా అవుతుంది; అలాగే, సూక్ష్మమైనది మనస్సుగా అవుతుంది. స్వచ్ఛమైన ఆహారం తినటం వలన, మనస్సు పవిత్రమవుతుంది. అలాగే, దీనికి విపర్యయం కూడా సత్యమే - పవిత్రమైన మనస్సుతో ఉండేవారు, పవిత్రమైన ఆహారాన్ని ఇష్టపడతారు.

04:11 - ఆయుఃసత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః ।
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్వికప్రియాః ।। 8 ।।

సత్త్వగుణ ప్రధానముగా ఉండేవారు, ఆయుష్షును పెంచేవీ, మరియు సౌశీల్యమునూ, బలమునూ, ఆరోగ్యమునూ, సుఖమునూ, మరియు తృప్తినీ పెంచేవాటిని ఇష్టపడతారు. ఇటువంటి ఆహారము రసముతో, సత్తువతో, పోషకములతో కూడినవై, మరియు సహజంగానే రుచిగా ఉంటాయి.

సత్త్వ గుణము స్వచ్ఛమైనది, తేజోవంతమయినది, మరియు ప్రశాంతమైనది. అది ఒకలాంటి సంతోషమునూ, మరియు తృప్తినీ కలుగచేస్తుంది. సాత్త్విక ఆహారము కూడా ఇదే విధమైన ప్రభావమును కలిగి ఉంటుంది. ఈ పై శ్లోకములో, ఈ రకమైన ఆహారములు, 'ఆయుః సత్త్' అంటే, ‘ఆయుష్షును పెంచేవి’ అని చెప్పబడ్డాయి. అవి మంచి ఆరోగ్యమునూ, సద్గుణములనూ, ఆనందమునూ, మరియు సంతుష్టినీ కలుగ చేస్తాయి. ఇటువంటి ఆహారములు రసభూరితముగా, సహజంగానే రుచిగా, ఘాటుగా లేకుండా, మరియు మేలుకలిగించేవిగా ఉంటాయి. అవి, ధాన్యములూ, పప్పులూ, బీన్స్, పండ్లు, కూరగాయలు, పాలు, మరియు ఇతర శాకాహార పదార్దముల వంటివి. కాబట్టి, శాకాహార భోజనము ఆధ్యాత్మిక జీవనానికి అనుగుణముగా, సత్త్వ గుణమును పెంపొందించుకోవటానికి వీలుగా ఉంటుంది. ఎంతోమంది సత్త్వ గుణ ప్రధానముగా ఉన్నవారు, మేధావులూ, మరియు తత్త్వవేత్తలూ, ఈ భావాన్నే వ్యక్తీకరించారు. జంతువుల పట్ల హింసలో కూడా, ఆవును సంహరించటం, అత్యంత హేయమైనది. ఆవు మానవుల కోసం పాలను ఇస్తుంది. కాబట్టి, అది మానవులకు తల్లి వంటిది. అది పాలు ఇవ్వలేని పరిస్థితిలో వున్నప్పుడు, అమ్మ లాంటి ఆవును సంహరించటం అనేది, అమానుషము, మొరటుపని, మరియు కృతజ్ఞతలేని పని.

06:07 - ఇక మన తదుపరి వీడియోలో, ఎటువంటి ఆహారములు బాధనూ, శోకమునూ, మరియు వ్యాధులనూ కలుగ చేస్తాయో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, August 7, 2023

Weird Marriages in Hinduism | సనాతనధర్మంలో ‘వింత పెళ్ళిళ్ళు’!


సనాతనధర్మంలో ‘వింత పెళ్ళిళ్ళు’!
ఈ విచిత్ర వివాహ గాధలలో మీకు తెలిసినవి ఎన్ని?

వియ్యానికైనా, కయ్యానికైనా సమవుజ్జీలు ఉండాలంటారు. అందుకే, పెళ్ళి నిశ్చయించుకునే ముందు అటు ఏడు, ఇటు ఏడు తరాలు చూస్తారు. వధూవరులు ఇద్దరూ దాదాపుగా ఒకే రకమైన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వాతావరణంలో పెరిగినవారైతే.. ఇబ్బందులు తలెత్తవన్నది ఇక్కడి నమ్మకం. ఇదో సహజీవన కొలమానం! ఆ లెక్క తప్పితే, కలహాల కాపురమే అవుతుంది. ఆ తీవ్ర పరిణామాలను కళ్లకు కట్టేదే కుండలకేశి గాధ..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/zhGGu7MpdtE ]


కుండలకేశి!

ఓ ధనిక వ్యాపారి కూతురు, కుండలకేశి. ఒక నేరస్తుణ్ని ఉరిశిక్ష వేయడానికి తీసుకువెళ్తుంటే చూసింది. అతనితో ప్రేమలో పడింది. అతణ్ని తప్ప వేరెవ్వరినీ పెళ్ళి చేసుకోనని మొండికేసింది. చివరికి తన మాటే నెగ్గించుకుంది. అయితే, కొన్నేళ్ళు గడిచిన తర్వాత, కుండలకేశి దాంపత్య జీవితంలో, ప్రేమ తగ్గిపోయింది. కలహాలు మొదలయ్యాయి. తగవులు నిత్యకృత్యంగా మారిపోయాయి. భర్త నేరమయ జీవితాన్ని, కుండలకేశి ఎత్తిపొడిచేది. దాంతో ఆవేశానికి గురైన భర్త, ఆమెను చంపబోయాడు. కానీ, విధివశాత్తూ అతనే ఆమె చేతిలో మరణించాడు. దాంతో కుండలకేశి సన్యాసినిగా మారింది. కోరికలే దుఃఖానికి మూలం అన్న బుద్ధుడి బోధనల్లో, సాంత్వన పొందింది.

రురువు - ప్రియంవద!

సావిత్రీ, సత్యవంతుల గాధ, మనలో చాలామందికి తెలిసిందే. యముణ్ని అడ్డుకుని, పతి ప్రాణాలను దక్కించుకున్న స్త్రీమూర్తి, సతీ సావిత్రి. సాధారణంగా ఇలాంటి విషయంలో, మహిళల గాధలే ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. అయితే, పురుషులు కూడా భార్యల ప్రాణాల కోసం, యముణ్ని ప్రార్థించిన ఘట్టాలు అనేకం ఉన్నాయి. అలాంటిదే, మహాభారతంలోని రురువు, ప్రియంవదల గాధ. రురువు అనే రాజు భార్య పేరు ప్రియంవద. ఆమె అతి సౌందర్యవతి. ప్రియంవద చిన్న వయస్సులోనే మరణించింది. తన భార్యను బ్రతికించమని, మృత్యుదేవుడైన యముణ్ని ప్రార్థించాడు రురువు. ప్రియంవదకు తన జీవితంలో సగం కాలాన్ని ఇవ్వగలిగితే, ఆమెను బతికిస్తానన్నాడు, యముడు. రురువు ఒప్పుకోవడంతో, ప్రియంవద తిరిగి బ్రతికింది. అలా తాము మరణించేవరకూ, రురువు, ప్రియంవదలు జీవితాన్ని హాయిగా సాగించారు.

శశిరేఖ – అభిమన్యుడు!

ఉత్తర భారతదేశంలో మేనరికం పెళ్ళిళ్ళు తక్కువ. ఈ సంప్రదాయం, దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యంలో ఉంది. పాండవుల అరణ్యవాసం సమయంలో, వారి పిల్లలు కృష్ణుడి వద్ద ఆశ్రయం పొందారు. వారిలో సుభద్రా, అర్జునుడి సంతానం అభిమన్యుడు కూడా ఉన్నాడు. మేనమామల ఇంట్లో, అభిమన్యుడు పెద్దమామ బలరాముడి కూతురు శశిరేఖతో ప్రేమలో పడ్డాడు. బలరాముడు మాత్రం, తన కూతురిని దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుడికి ఇద్దామని అనుకున్నాడు. అయితే, అన్న నిర్ణయాన్ని కాదనలేని కృష్ణుడు, ఓ మాయోపాయం తలపెట్టి, ఘటోత్కచుడిని కామరూప విద్య సహాయంతో శశిరేఖగా మార్చి, వివాహన్ని ఆపాడు. అభిమన్యుడి కోసం శశిరేఖ తన ఇంటిని వదిలి రాగా, వారిరువురూ అరణ్యంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆనాటి కాలంలోనే ప్రేమ వివాహం కోసం, ఎన్నో సమస్యలను ఎదురించి, మాయోపాయాలతో ఒక్కటైన ఈ జంట గాథ, నేటి కాలంలో కూడా శశిరేఖా పరిణయంగా, అద్భుత కావ్యంగా భాసిల్లుతోంది.

రుక్మిణీ కృష్ణుల కల్యాణం!

విదర్భ రాకుమారి రుక్మిణిని, ఛేది పాలకుడు శిశుపాలుడికిచ్చి పెళ్ళి చేయాలని నిశ్చయించుకున్నారు. రుక్మిణి మనస్సు మాత్రం, కృష్ణుడిపైనే లగ్నమయ్యింది. తన కోరికను వెల్లడించాలని, ఓ పురోహితుణ్ని కృష్ణుడి దగ్గరకు రాయబారం కూడా పంపించింది. బ్రాహ్మణుడి ద్వారా రుక్మిణీ దేవి మనస్సూ, అంద చందాల గురించి తెలుసుకున్న కృష్ణుడు, శిశుపాలుడితో పెళ్ళి జరిగే సమయానికి వచ్చి, ఆమెను రథంలో ఎక్కించుకుని, ద్వారకకు పయనమయ్యాడు. ఆ సమయంలో తనను అడ్డగించబోయిన రుక్మిణి సోదరుడైన రుక్మినీ, అతని సైన్యాన్నీ ఓడించి, రుక్మిణీ దేవిని తన రాజ్యానికి తీసుకుని వచ్చి, వివాహం చేసుకున్నాడు. అయితే, ధర్మశాస్త్రాలు శ్రేష్ఠమైనవిగా చెప్పిన పద్ధతిలో, రుక్మిణీ కృష్ణుల వివాహం జరగకపోవడం, గమనార్హం. ఇది జరిగిన పద్ధతి, ధర్మశాస్త్రాల్లోని రాక్షస వివాహం. పెళ్ళికుమార్తెను ఎత్తుకెళ్లడం, గాంధర్వ వివాహం, అమ్మాయి, అబ్బాయి పరస్పర ఇష్టంతో జరిగే వివాహాల కోవలోకి వస్తుంది.

ఏకలింగ వివాహాలు!

సోమవంతుడు, సుమేధుడనే వారిద్దరూ స్నేహితులు. సీమంతిని అనే రాణి, పెళ్లయిన జంటలకు ఆవులను దానంగా ఇవ్వడానికి నిశ్చయించుకుంది. దాంతో సోమవంతుడు భార్యగా, సుమేధుడు భర్తగా, రాణి దగ్గర పరిచయం చేసుకున్నారు. ఆవులను ఇస్తూ, సీమంతిని ఆ ఇద్దరినీ భార్యభర్తలుగా వర్ధిల్లమని, ఆశీర్వదించింది. ఆమె వాక్శుద్ధి కారణంగా, సోమవంతుడు నిజంగానే స్త్రీలా, సోమవతిగా మారిపోయాడు. అలా ఒకప్పుడు మిత్రులుగా ఉన్న యువకులు, భార్యాభర్తలుగా మారిపోయారు.

తీజా- బీజాల పెళ్ళి!

పిల్లలు కడుపున పడింది మొదలు, దగ్గరి బంధువుల పిల్లలకు ఇస్తామని అనుకునేవాళ్లు, ఇప్పటికీ తారస పడతారు. కడుపులో ఉన్నప్పుడే, పిల్లలకు పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకునే వాళ్లూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో, ఇద్దరు పిల్లలూ ఆడగానీ, మగగానీ అయితే, ఇబ్బంది తలెత్తుతుంది. అలాంటి సరదా కథే ఈ తీజా - బీజా వివాహం. ఇది రాజస్థాన్‌ జానపదుల్లో ప్రాచుర్యంలో ఉన్న హస్య కథ. వేర్వేరు ఊళ్లలో ఉండే ఇద్దరు స్నేహితుల భార్యలు గర్భంతో ఉన్నప్పుడు, రెండు జంటలూ ఓ వేడుకలో కలుసుకుంటారు. తమకు పుట్టబోయే సంతానానికి పెళ్ళి చేయాలని అనుకుంటారు. జ్యోతిష్కులూ, దానిని సమర్థిస్తారు. అయితే, ఇద్దరికీ ఆడ శిశువులే జన్మిస్తారు. ఊళ్లు దూరం కావడంతో, ఒకరికి ఆడపిల్ల కాబట్టి మరోజంటకు మగ పిల్లవాడు పుట్టి ఉంటాడని అనుకుంటారు. అలా జన్మించిన ఇద్దరు బాలికలు, తీజా – బీజా, ఒకరికొకరు తమ భర్త కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఒకరోజు బీజా అనుకోకుండా మాయా బావిలో పడిపోయింది. అందులో పడితే, ఆడవాళ్లు మగవాళ్లు అవుతారు. అలా బీజా మగవాడిగా మారిపోయింది. దాంతో బీజా తండ్రి, తన కూతురు అబ్బాయిగా మారిందని, తన స్నేహితుడికి వర్తమానం పంపించాడు. అయితే, తనకు అసలు కొడుకులే లేరనీ, ఉన్నది కూతురే అనీ, తీజా తండ్రి బదులిచ్చాడు. ఇన్నిరోజులు అల్లుడి కోసమే ఎదురు చూస్తున్నాననీ, బీజాను వెంటనే పంపించమనీ కబురు పెట్టాడు, తీజా తండ్రి. చివరికి జ్యోతిష్కుల మాటలు నిజమై, తీజా - బీజా ఒక్కటయ్యారు.

ప్రపంచ దేశాలతో పొలిస్తే, మన భారతదేశంలో మాత్రమే, విడాకుల శాతం తక్కువ. అందుకు కారణం, మనం చిన్నప్పటి నుంచీ ఎదో ఒక సందర్భంలో, వివాహ బంధం గొప్పదనాన్ని చూస్తూ ఉన్నాము, తెలుసుకుంటూ ఉన్నాము. ఈనాటి నాగరిక సమాజంలో కూడా భర్తకు భార్య విధేయురాలిగా, భార్యకు భర్త విధేయుడిగా ఉన్నారంటే అందుకు ముఖ్య కారణం, పురాణాలూ, ఇతిహాసాల నుండి మనం ఇనుమడింపజేసుకున్న వివాహ వ్యవస్థ సూత్రాలు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వివాహాలలో కూడా, ఏదో ఒక కోణంలో మనువు విభజించిన ఎనిమిది రకాల వివాహాల పొలికలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. వివాహం అంటే, ఒక్క జీవితం, రెండు మనసులు, మూడు ముళ్ళు, ఏడు అడుగులు, నూరు సంవత్సరాలు.

వివాహ మహోత్సవ ఆహ్వానం అని అందరికీ పంపుతుంటాము. కానీ, వివాహం ఉత్సవం కాదు. అది మానవుని వికాసానికి ఏర్పరచిన షోడశ సంస్కారాలలో ప్రధాన మైనదని, మనకు తెలియదు. సాన పెట్టటం వలన వజ్రం ప్రకాశించి నట్లు, సంస్కారాల వల్ల ఆత్మ ప్రకాశిస్తుంది. జీవితం సార్థకం, సుఖవంతం, ఆనందమయం అవుతుంది. వివాహం లోని మంత్రాల అర్థం, పరమార్థం తెలియక, ఒక్కోసారి ఏదో విధంగా త్వరగా పూర్తి చేయండని, పురోహితుని తొందర పెడుతూ ఉంటాం. దాని వల్ల మనమే నష్ట పోతామని గ్రహించము. ఫోటోలు, వీడియోలు, విందులకు ప్రాధాన్యత ఇస్తూ, ముఖ్యమైన సంస్కారాన్ని విడిచిపెడుతున్నాము. తరువాత ఫలితం బాగోలేదని, బాధపదుతుంటాము.

పరస్పర తపస్సంప త్ఫలాయిత పరస్పరౌ |
ప్రపంచ మాతాపితరౌ ప్రాంచౌ జాయావతీ స్తుమః ||

పార్వతీ పరమేశ్వరులు సనాతన దంపతులు. వారి దాంపత్యము, తపస్సంపద యొక్క ఫలితము. ప్రపంచానికి తల్లితండ్రులైన ఆ ఆది దంపతులకు నమస్కారములు.

Wednesday, August 2, 2023

భగవంతుడిని నమ్మనివారు నమ్మేది ఏమిటి? భగవద్గీత Bhagavadgita Chapter 17

 

నాస్తికులు - భగవంతుడిని నమ్మనివారు నమ్మేది ఏమిటి?
తమ కళ్ళకు కనిపించనిది లేదని అనుకునే వారి గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు?

'భగవద్గీత' సప్తదశోధ్యాయం - శ్రద్ధా త్రయ విభాగ యోగం (01 – 04 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహేడవ అధ్యాయం, శ్రద్ధా త్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, శ్రద్ధా త్రయ విభాగ యోగములోని, 01 నుండి 04 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/67VRFQrM3jE ]


ప్రకృతి త్రిగుణములలో, యజ్ఞములు వేర్వేరు రకాలుగా ఏ విధంగా ఉంటాయో, ఈ అధ్యాయంలో శ్రీ కృష్ణుడు వివరించబోతున్నాడు.

00:50 - అర్జున ఉవాచ ।
యే శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః ।
తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమః ।। 1 ।।

అర్జునుడు ఇలా అడుగుతున్నాడు: ఓ కృష్ణా, శాస్త్ర విధులను త్యజించి, శ్రద్ధా విశ్వాసములతో పూజలు చేసే వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది? వారి యొక్క విశ్వాసము, సత్త్వ గుణంలో ఉన్నట్లా? లేదా రజో, తమో గుణములలో ఉన్నట్లా?

ఇంతకు క్రితం అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు, అర్జునుడికి, ఏ ఏ సద్గుణములను పెంపొందించుకోవాలి? మరియు ఎలాంటి వ్యక్తిత్వ లక్షణాలను త్యజించాలి అనే విషయాలనూ, దైవీ మరియు ఆసురీ స్వభాముల మధ్య తేడానూ వివరించి ఉన్నాడు. ఎవరైతే శాస్త్ర ఉపదేశాలను విస్మరిస్తూ, శారీరక ఉత్తేజాలనూ, మనస్సు యొక్క వెర్రితలంపులనూ అవివేకంతో అనుసరిస్తారో, వారు పరిపూర్ణత, లేదా సుఖాన్ని, లేదా జనన-మరణ చక్రమునుండి విముక్తినీ పొందలేరు. అందుకే భగవంతుడు, శాస్త్ర ఉపదేశాలను అనుసరిస్తూ, తద్విధంగా ప్రవర్తించమని చెప్పాడు. ఆ ఉపదేశమే, ఈ ప్రస్తుత ప్రశ్నకు దారి తీసింది. వేద శాస్త్రముల ఉపదేశాల పట్ల, విశ్వాసం లేకుండా పూజలు చేసే వారి యొక్క విశ్వాసము ఎలాంటిదో, అర్జునుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు. ప్రత్యేకంగా దీనికి సమాధానాన్ని, భౌతిక ప్రకృతి త్రిగుణముల పరంగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాడు.

02:10 - శ్రీ భగవానువాచ ।
త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా ।
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు ।। 2 ।।

శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు: ప్రతి ఒక్క మానవుడూ, తన సహజసిద్ధ విశ్వాసముతో జన్మిస్తాడు. ఇది, సాత్త్వికము, రాజసము, లేదా తామసమనే మూడు విధములుగా ఉండవచ్చును. ఇప్పుడిక ఈ విషయాన్ని వివరించెదను వినుము.

ఎవ్వరూ కూడా శ్రద్ధా, విశ్వాసము లేకుండా ఉండరు. ఎందుకంటే, అది మానవ నైజము యొక్క విడదీయలేని భాగము. వేద శాస్త్రముల పట్ల నమ్మకం లేని వారు కూడా, శ్రద్ధ లేకుండా ఉండరు. వారి యొక్క శ్రద్ధ వేరే చోట ఉంటుంది. అది వారి బుద్ధి కుశలత పైన గానీ, వారి ఇంద్రియ అనుభూతి పట్ల గానీ, లేదా వారు నమ్మిన సిద్ధాంతాల పట్ల గానీ ఉంటుంది. ఉదాహరణకి.. ‘నేను భగవంతుడిని నమ్మను. ఎందుకంటే, నేను ఆయనను చూడలేకున్నాను’ అని పలికే వారికి, భగవంతుని పట్ల విశ్వాసం లేదు కానీ, వారి కళ్లపై విశ్వాసం ఉంది. కాబట్టి, వారు తమ కళ్ళకు ఏదైనా కనిపించకపోతే, అది లేదని అనుకుంటారు. ఇది కూడా ఒకలాంటి విశ్వాసమే. భౌతిక శాస్త్రవేత్త అయినా, లేదా సామాజిక శాస్త్రవేత్త అయినా, లేదా ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అయినా, విజ్ఞానాన్ని ఒప్పుకోవటానికి, నమ్మకంతో వేసే అడుగు చాలా ముఖ్యమైనది. శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, ఎందుకు వేర్వేరు మనుష్యులు, వేర్వేరు ప్రదేశాలలో తమ నమ్మకం ఉంచుతారో, వివరిస్తున్నాడు.

03:58 - సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత ।
శ్రద్ధామయోఽయం పురుషో యో యఛ్చ్రద్ధః స ఏవ సః ।। 3 ।।

అందరు మనుష్యులూ, తమ మనస్సు యొక్క స్వభావమునకు తగ్గట్టుగా, శ్రద్ధావిశ్వాసములను కలిగి ఉంటారు. అందరికీ శ్రద్ధావిశ్వాసములు ఉంటాయి, మరియు వారి విశ్వాసము ఎట్టిదో, అదే వారి వ్యక్తిత్వముగా ఉంటుంది.

మన విశ్వాసము ఎక్కడో ఒక చోట తప్పక ఉంటుంది. మనం దేనిమీద నమ్మకం కలిగి ఉంటామో, మరియు దేని పట్ల శ్రద్ధావిశ్వాసములను కలిగి ఉంటామో, అదే ఖచ్చితంగా మన జీవన గమనాన్ని నిర్ణయిస్తుంది. ఎవరైతే డబ్బే జగత్తులో అత్యంత ప్రధానమని విశ్వసిస్తారో, వారు తమ పూర్తి జీవితాన్ని, డబ్బును పోగు చేసుకోవటానికే ఉపయోగిస్తారు. ఎవరైతే కీర్తి ప్రతిష్టలే అన్నింటికన్నా ప్రధానమని అనుకుంటారో, వారి సమయాన్నీ మరియు శక్తినీ, రాజకీయ పదవులూ, మరియు సామాజిక హోదాల కోసం వెచ్చిస్తారు. ఎవరైతే ఉత్తమ విలువల పట్ల విశ్వాసంతో ఉంటారో, వారు వాటి కోసం మిగతా అన్నింటినీ త్యజిస్తారు. ఎవరైతే భగవత్ ప్రాప్తి యొక్క అతి ముఖ్యమైన ప్రాధాన్యత పట్ల గాఢమైన శ్రద్ధను పెంపొందించుకుంటారో, వారు భగవదన్వేషణ కోసం, ప్రాపంచిక జీవితాన్ని వదిలివేస్తారు. ఈ విధంగా, మన శ్రద్ధావిశ్వాసపు స్వభావమే, మన జీవిత దిశను నిర్ణయిస్తుంది, మరియు, మన విశ్వాసము, మన మానసిక స్వభావముపై ఆధారపడి ఉంటుంది. అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా, శ్రీ కృష్ణుడు శ్రద్ధావిశ్వాసములు ఏ ఏ రకాలుగా ఉంటాయో, చెప్పటం ప్రారంభిస్తున్నాడు.

05:40 - యజంతే సాత్త్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ।
ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః ।। 4 ।।

సత్త్వ గుణములో ఉండేవారు, దేవతలను ఆరాధిస్తారు; రజోగుణములో ఉండేవారు, యక్షులనూ, రాక్షసులనూ పూజిస్తారు; తమో గుణములో ఉండేవారు, భూత ప్రేతములను ఆరాధిస్తారు.

మంచివారు మంచి విషయముల పట్లా, మరియు చెడ్డ వారు, చెడు విషయముల పట్లా ఆకర్షింపబడుతారని అంటుంటారు. తమోగుణములో ఉండేవారు, అవి కౄరమైన దుష్ట స్వభావము కలవని తెలిసి కూడా, భూతప్రేతముల పట్ల ఆకర్షితమవుతారు. రజోగుణములో ఉండేవారు, యక్షులు, మరియు రాక్షసుల పట్ల ఆకర్షితమవుతారు. ఈ అధమ జీవులను శాంతింపజేయడానికి, వారు జంతువుల రక్తాన్ని కూడా సమర్పిస్తారు. అటువంటి నిమ్నస్థాయి పూజల యొక్క ఔచిత్యంపై, విశ్వాసం కలిగి ఉంటారు. సత్త్వ గుణ ప్రధానముగా ఉండేవారు, దేవతల ఆరాధన పట్ల ఆకర్షితమవుతారు; దేవతలలో వారికి మంచి గుణములు కనిపిస్తాయి. కానీ, భగవదర్పితముగా చేసే పూజయే, సరియైన దిశలో ఉన్నట్లు.

06:53 - ఇక మన తదుపరి వీడియోలో, ఎటువంటి బుద్ధిహీనులు, ఆసురీ గుణ సంకల్పంతో ఉంటారో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...