Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Monday, September 30, 2024

The Aim of Human Life | మానవ జన్మ!


మానవ జన్మ! మనస్సును బుద్ధి నియంత్రణలో ఉంచగలిగితే! TELUGU VOICE
మయుడు నిర్మించిన మయసభను మరిపించే భ్రమల సౌధాన్ని కల్పించేది ఏది?

జన్మలలోకెల్లా అత్యుత్తమమైన మానవ జన్మను పొంది కూడా, సంసారజీవితంలో పడి కొట్టుకు పోతూ వుంటారు చాలామంది అమాయకంగా. అంతా తమ ప్రమేయంతోనే, తమ మూలకంగానే నడుస్తుందనే అహంకారంతో ఉంటారు ఎక్కువగా. కేవలం కుటుంబ జీవితాన్ని గడపడానికీ, మన వారసత్వాన్ని ఈ ప్రపంచంలో మిగిల్చి వెళ్ళడానికీ, ఈ లోకంలోకి రాలేదు మనం. అది అటూ ఇటుగా అన్ని జీవరాశులూ చేసే పనే.. మానవులకే కాదు, అన్ని జంతు జాతులకూ వారసులూ, కుటుంబాలూ వుంటాయి. కానీ మానవ జన్మను ఎత్తిన మనం, భగవత్ చింతన కోసం ఈ లోకంలోకి వచ్చామని, ఎవరికి వారు తెలుసుకుని తీరాలి. యుక్త వయస్సులో ఉన్నట్లుగా, ముదిమి వయస్సులో కూడా ఇల్లేమైపోతుందో, భార్య ఏమైపోతుందో, బిడ్డలేమైపోతారో అని చింతిస్తూ కూర్చుంటే, అంతకు మించిన అవివేకం మరొకటి లేదు. మనకు మనమే కాకుండా పోయే రోజులు దగ్గర పడుతున్నా కూడా, ఇంకెవరో, ఏదో అయిపోతారని ఆందోళన పడుతున్నామంటే, అది అచ్చంగా అవివేకమే! మరి ఎలా..? అనే సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. 

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/iRjJtNLEQAo ]


ఈ విషయాన్ని గురించి గౌతమ బుద్ధుడు ఇలా అన్నాడు..

పుత్రా మే సంతి ధనం మే అస్తి ఇతి బాలో విహన్యతే |
ఆత్మా హి ఆత్మనో నాస్తి కుతః పుత్రః కుతో ధనమ్ ||

'నాకు కొడుకులున్నారు, ధనం ఉంది' అని ఆసక్త చిత్తులైన అజ్ఞానులు, కష్టాలలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. తనకు తానే లేనప్పుడు, ఇక కొడుకులూ, ధనం, తనదెలా అవుతుందని ఇక్కడ ప్రశ్నించాడు, బుద్ధ భగవానుడు. కళకళ లాడుతూ కళ్ళముందు తిరిగే భార్యా, సకలభోగాలలో ఓలలాడించిన ధనం కూడా మిమ్మల్ని విడిచిపెట్టే రోజొకటి వస్తుందనీ, సమస్త కాలచక్రాన్నీ తన కనుసన్నలలో తిప్పే కారుణ్యమూర్తి ఒకరున్నారనీ మనషులు ఎన్నడూ మరచిపోకూడదు. అలాగని, ఆత్మీయులను వదిలించుకోమని చెప్పడంలేదు.. వారి గురించే రేయింబవళ్ళూ చింతిస్తూ వుండిపోకుండా, దైవ చింతన అలవరచుకోమని, ఇందులోని సారాంశము. ఈ సృష్టిలో మనిషి తప్ప, ఏ జీవీ, తరతరాలకు సరిపడా పోగు చేసుకోవాలని తాపత్రయ పడదు. కారణం, వాటికి ప్రకృతిపైనా, పరమాత్మపైనా ఉన్న పూర్తి విశ్వాసం.

పేరుకు పరిణతి చెందిన జీవిగా చెప్పుకుంటూ, మరోవైపు ప్రకృతి నియమాలకు విరుద్ధంగా, పరమాత్మ ప్రణాళికకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు మనిషి. పులి కూడా ఆకలి వేసినప్పుడే వేటాడుతుంది. గుహ నిండా జింక మాంసాన్ని నింపుకుని, రోజుల తరబడీ తింటూ కూర్చోదు. పిల్లలను ఓ మూలన భద్రంగా కూర్చుండబెట్టి, తనే ఒళ్ళుగుల్ల చేసుకుని మాంసపు ముక్కలు తెచ్చి తినబెట్టదు. కానీ మనం మాత్రం, మునిమనుమళ్ళు కూడా ఏ చీకూ చింతా లేకుండా తింటూ కూర్చోవాలని, మనకున్న ఆయువునంతా హరింపజేసుకుంటూ, క్షణం తీరిక లేకుండా చింతిస్తూ, కాసులు కూడబెట్టుకుంటుంటాము.

ఇలాంటి సమయంలో ఎవరైనా మన పుణ్యం కొద్దీ వచ్చి, 'గుడికెళదామనో, ఏదైనా సంఘసేవ చేద్దామనో' అంటే, నాకు తీరిక లేదని చెప్పి తప్పించుకుంటూ వుంటాము. ఇలాంటి మన దుఃస్థితిని ముందే ఊహించిన ప్రహ్లాదుడు ఏనాడో.. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై, విషయ ప్రవిష్టులై, చచ్చుచు పుట్టుచున్ మరల చర్వితచర్వణులైన వారికిం జెచ్చెర బుట్టునే, పరులు సెప్పిననైన, నిజేచ్ఛనైన, నే మిచ్చిన నైన, కానలకు నేగిననైన, హరి ప్రబోధముల్? అని అన్నాడు. 'కొందరు గాఢమైన కారుచీకటి లాంటి ఈ మాయలో పడి, కోరికలను చంపుకోకుండా, సంసారం సాగిస్తూ ఉంటారు. అటువంటి మూర్ఖులకు, శ్రీహరిపై భక్తి దానంతట అదిగా పుట్టదు. ఒకవేళ ఇతరులు బోధించినా కలుగదు. ఏమైనా ఇచ్చి ఆశ చూపించినా, వారికి దేవుడి మీద భక్తి ఏర్పడదు. ఆఖరికి అడవులలోకి తీసుకు వెళ్ళినా, ఫలితం ఉండదు. భగవంతుడి మీదకు అంత త్వరగా మనస్సు పోతుందా!' అంటూ ఆవేదన పడ్డాడు ప్రహ్లాదుడు. కాబట్టి, మనిషికి భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి. అలాగే, ఎప్పుడూ పనులు అంటూ, భగవంతుడినే దూరం పెట్టేలా ఉండకూడదు.

మనస్సు, బుద్ధి నియంత్రణలో ఉంటే అది మంచి సేవకురాలు. మనసే బుద్ధిని నియంత్రిస్తే, అది ఒక నియంత. అది పాదరసం లాగా చురుకైనది. చేతికి దొరికినట్లే ఉంటుంది కానీ, తేలికగా జారిపోతుంది. భవ బంధాలకూ - మోక్షానికీ, రాగ - ద్వేషాలకూ, భయానికీ - ధైర్యానికీ, సంకల్ప - వికల్పాలకూ, శాంతికీ - అశాంతికీ, అన్నింటికీ మూలం మనస్సే. మనస్సును నియంత్రిస్తే, ప్రశాంతత, శాంతీ, సౌఖ్యాలూ లభిస్తాయి. నిజానికి అది అంత తేలిక కాదు. గట్టిగా ప్రయత్నిస్తే, కష్టమూ కాదు.

మచ్చికైన జవనాశ్వం రౌతు అధీనంలో ఉన్నట్లు, బుద్ధి అదుపులో మనస్సుండాలి. రౌతు కోరిన చోటుకు గుర్రం వెళ్ళాలిగానీ, అది తీసుకుపోయిన చోటుకు రౌతు వెళ్ళడం సరికాదు. మాలిమి చేసుకున్న మనస్సు మాత్రమే, బుద్ధి అధీనంలో నడుచుకుంటుంది. ‘మనస్సు’ మాయాజాలం, మాటలకు అందనిది. మయుడు నిర్మించిన మయసభను మరిపించే భ్రమల సౌధాన్ని కల్పిస్తుంది. తనది కానిదాన్ని తనదే అన్నట్లుగా, క్షణికమైనదాన్ని శాశ్వతమన్నట్లుగా భ్రమింపజేస్తుంది, మురిపిస్తుంది. బుద్ధిని సక్రమంగా ఉపయోగించి గానీ, ఆ మాయ నుంచి బయటపడలేము. రాగద్వేషాలతో నిండిన మనస్సు, ఉన్నది ఉన్నట్లుగా చూడనివ్వదు. అది ప్రసరింపజేసే రంగురంగుల కాంతిలో, గాజుముక్క కూడా వజ్రంలాగా కనిపిస్తుంది. బుద్ధి అనే సూర్యకాంతిలో మాత్రమే, వజ్రానికీ, గాజుముక్కకూ తేడా తెలుస్తుంది.

మనస్సు నిజ జీవితానికి భిన్నమైన గొప్ప ఊహా ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అది విశ్వామిత్రుడి త్రిశంకు స్వర్గం కన్నా మిన్నయైనది. ఆ కాల్పనిక జగత్తులో మునిగితేలే వారు, నిజ జీవితాన్ని దుర్భరం చేసుకుంటారు. కొంతమంది పలాయన వాదాన్ని చిత్తగిస్తారు, కొందరు మద్యపానాన్ని ఆశ్రయిస్తారు, కొందరు తమ బాధ్యతనూ, కర్తవ్యాన్నీ భగవంతుడిపై నెట్టేస్తారు. అటువంటి వారికి మద్యపానమైనా, భగవంతుడి ప్రార్థనలైనా, పెద్ద భేదం ఉండదు. ఎన్ని చూసినా, ఉపనిషత్తులు చదివినా, భగవద్గీతను కంఠస్థం చేసినా, వాటి సారాన్ని నిజ జీవితంలో అన్వయించుకుని ఆచరించగలిగితేనే, వాటికి సార్థకత.

మనిషి బలం, బలహీనత, రెండూ మనస్సే. మనిషిని దైవత్వానికి చేరువ చేసేది మనస్సే, రాక్షసుడిగా దిగజార్చేదీ మనస్సే. బలహీనమైన మనస్సు, ప్రతి అల్ప విషయానికీ ఉద్విగ్న భరితమవుతుంది. ప్రశంసలకు, ఆకాశంలో విహరిస్తుంది. విమర్శిస్తే, పాతాళానికి క్రుంగిపోతుంది. తాళం చెవి ఎడమవైపు తిప్పితే గడియ పడుతుంది, కుడిపక్కకు తిప్పితే గడియ తెరుచుకుంటుంది. అలాగే మనస్సు ఎటు తిప్పితే అటు తిరుగుతుంది. భౌతిక సుఖాలకు వ్యతిరేకంగా తిప్పితే, ఆధ్యాత్మికత వైపుకు తిరుగుతుంది. మనస్సులోని వ్యతిరేక భావనలను తొలగించి, సానుకూలమైన, ఆహ్లాదకరమైన ఆలోచనలతో నింపితే, శారీరక రుగ్మతలూ దరిజేరవు. నేటి శాస్త్రవేత్తలు కూడా, చాలా రోగాలకు కారణం మనస్సే అనీ, మనస్సును హాయిగా ఉంచుకున్నవారికి, రోగాలు దరిజేరవనీ ధ్రువీకరించారు.

ధర్మబద్ధమైన కర్మలను నిష్కామంగా ఆచరిస్తూ, బుద్ధికి మనసును అప్పజెప్పి, జీవనయానాన్ని కొనసాగించాలి. ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం చేసుకుంటూ, మనస్సులో చెలరేగే ఆలోచనలనూ, ప్రలోభాలనూ, సంఘటనలనూ అవగాహన చేసుకుని, విచక్షణతో వాటి ప్రభావాన్ని కొద్దికొద్దిగా తగ్గించుకోవాలి. అప్పుడు కర్మేంద్రియాలూ, జ్ఞానేంద్రియాలూ, దారి తప్పకుండా నడుచుకుంటాయి.

🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏

Monday, September 23, 2024

ముసలం! కృష్ణుడి అంతిమ ప్రస్థాన సమయంలో ఏం జరిగింది? | The Mace and Annihilation Of the Yadavas - Krishna leaves the mortal world


ముసలం! కృష్ణుడి అంతిమ ప్రస్థాన సమయంలో ఏం జరిగింది? TELUGU VOICE
ముసలం పుట్టి యాదవులు అంతరించిన తరువత ఆ శవాల గుట్టల మధ్య కృష్ణుడి మనోగతం ఏమిటి?

పుట్టిన ప్రతి జీవీ మరణించక తప్పదు. ఎంతటి కీర్తి ప్రతిష్ఠలుగల వారయినా, ఎంత సంపద, అధికారాలు పొందిన వారయినా, చివరకు దైవాంశ సంభూతులైనా, ఏదో ఒక రోజు మరణాన్ని ఆహ్వానించక తప్పదు. ఇది భగవంతుడేర్పరచిన విధి విధానం. ద్వాపర యుగంలో అవతరించిన కృష్ణ భగవానుడు కూడా, ఈ విధి విధానాన్ని స్వయంగా పాటించాడు. అది ఎలా..? అనే సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. 

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/rrd3t9MiZ_Q ]


ద్వాపర యుగాంతం దగ్గర పడుతోంది. దుష్ట శక్షణ, శిష్ట రక్షణ జరిపి, భూ భారాన్ని చాలావరకూ తగ్గించాడు శ్రీకృష్ణపరమాత్ముడు. తన అవతార లక్ష్యం నెరవేరడంతో, అవతార పరిసమాప్తికి ఏర్పాట్లు మొదలు పెట్టాడాయన. అప్పటికి భూమిపై మిగిలిన ఉన్న యోధుల్లో, యాదవులు మహా బలవంతులు. వారి సైన్యం చాలా పెద్దది. శ్రీకృష్ణుడి అండతో యాదవ కులం, శత్రువులెవరూ కన్నెత్తి కూడా చూడలేనిదిగా, అజేయమైనదిగా అయ్యింది. ఈ కారణంగా, యాదవ వీరులకు అహంకారం పెరిగిపోయింది. బల గర్వంతో విర్రవీగుతున్నారు వారందరూ. వారు అంతరించి పోవలసిన సమయం ఆసన్నమయిందని గ్రహించాడు, శ్రీకృష్ణుడు. స్వయంగా తానే వారందరికీ రక్షకుడుగనుక, ఇతరులెవరూ వారిని నశింపజేయలేరని, ఆయనకు తెలుసు. అందుకే, వారిలో వారే కలహించుకోవడం ద్వారా, యాదవకులాన్ని నశింపజేయాలని తలచాడు, పరంధాముడు. మన జీవితాలలో జరిగే ప్రతి ఘటనకూ, ముందే బీజం పడి ఉంటుందనడానికి ఇది ఒక ఉదాహరణ. యదుకుల నాశనానికి బీజం ఏనాడో పడింది. ఒకానొక సందర్భంలో మునులూ, కురుక్షేత్ర యుద్ధానంతరం గాంధారీ ఇచ్చిన శాపాలు, శ్రీకృష్ణుని అభీష్టానికి అనుగుణంగా జరిగినవే అనేది, మనం గమనించాలి.

ఒకనాడు విశ్వామిత్రుడు, అసితుడు, కణ్వుడు, దూర్వాసుడు, భృగువు, అంగీరసుడు, కశ్యపుడు, వామదేవుడు, అత్రి, వశిష్టుడు, నారదుడు మొదలైన మహామునులు, పిండారక క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ ఆటలాడుకుంటున్న యాదవ యువకులు కొంతమంది, కర్మవశాన ఆ మునులను ఆటపట్టించాలనుకున్నారు. జాంబవతి కొడుకైన సాంబుడికి ఆడవేషం వేసి, గర్భవతిగా ఉన్నట్లు కడుపుకు చీరలు చుట్టి మునులవద్దకు తీసుకువెళ్ళారు. తనకు ఏ బిడ్డ జన్మిస్తుందో అడగడానికి సిగ్గుపడుతోందనీ, ఈమెకు మగబిడ్డ పుడతాడా? ఆడబిడ్డ పుడుతుందా? అని పరిహాసం ఆడారు. యాదవ యువకుల నాటకం మునులకు అర్థమై, వారిలో కోపం పెల్లుబికింది. “ఓరీ మూర్ఖులారా! ఈమెకు పుట్టేది ఆడపిల్లాకాదు, మగపిల్లవాడూ కాదు. మీ కులనాశనానికి కారణమయ్యే ముసలం పుడుతుంది” అని శపించారు. ముసలం అంటే, 'ఇనుప రోకలి' అని అర్థం. వారి శాపానికి భయపడిన యాదవ యువకులు, జరిగినదంతా శ్రీకృష్ణుడితో చెప్పారు. ఇది విధి విధానం! మునులు చెప్పినట్లే జరుగుతుందన్నాడాయన.

మరునాడు సాంబుడి కడుపు నుండి ముసలం బయటపడింది. దాన్నిజూసి యాదవులు భయంతో వణికి పోతూ, విషయమంతా కృష్ణుడితో మొరపెట్టుకున్నారు. తమ కులనాశనానికి కారణంకానున్న ఆ రోకలిని,  పరంధాముడి సూచన మేరకు ముక్కలు ముక్కలు చేసి చూర్ణం చేశారు. ఆ చూర్చాన్ని సముద్రజలాల్లో కలిపేశారు. అక్కడితో సమస్య తీరిపోయిందనుకుని శాంతించారు. ఎన్ని ఉపాయాలు పన్నినా, రాబోయే వినాశనం ఆగదని, శ్రీకృష్ణుడికి తెలుసు. ఇదంతా ఆయన సంకల్పమే. యాదవులు ముసలాన్ని చూర్ణంజేసి సముద్రంలో పారవేసినప్పుడు, ఆ చూర్ణంలో ఒక ఇనుప ముక్క ఉండిపోయి, సముద్రంలోని ఒక చేప దానిని మింగింది. చేప మింగిన ఆ ఇనుపముక్క కారణంగా, శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ఎలా చాలించాడో చూద్దాము.

సముద్రంలో కలపబడిన మిగిలిన రోకలి చూర్ణమంతా, అలలతాకిడికి ఒడ్డుకు చేరి, పదునైన తుంగగడ్డిగా మొలిచింది. నిలువెత్తు పెరిగిన ఆ తుంగ, కరకు కత్తులలా తయారై, యాదవులను నాశనం చేసేందుకు సిద్ధంగా ఉంది. పితృ తర్పణాలు వదిలే నెపంతో, యాదవులందరినీ ప్రభాస తీర్థానికి తీసుకువచ్చాడు శ్రీకృష్ణుడు. ముసలం వల్ల పెరిగిన తుంగ, ఆ స్థలంలోనే ఉంది. అక్కడకు చేరుకున్న తర్వాత, విధి విధానాన్ని అనుసరించి, యాదవులకు మతి చెడింది. వారు అకారణంగా పరస్పర నిందలు చేసుకుంటూ, పోట్లాడుకున్నారు. తమ దగ్గరున్న ఆయుధాలు ధ్వంసం కాగా, అక్కడున్న తుంగను పెకలించి, దానితోనే ఒకరినొకరు కొట్టుకుని మరణించారు. చివరకు శ్రీకృష్ణ బలరాములూ, యాదవ స్రీలూ, వారి పిల్లలూ మాత్రమే మిగిలారు.

తన కళ్ళముందే తన వారంతా కొట్టుకుని చావడం, శ్రీకృష్ణుడికీ వ్యధను కలిగించక పోలేదు. ఎందుకంటే ఆయన అవతారం, మానవ, దైవత్వాల కలయిక. మనస్సులోని బాధను అణచుకుంటూ, చుట్టూ పరికించి చూశాడు. ఎటుజూసినా శవాల గుట్టలు. ఆందరూ తన వారే. తనంటే ప్రాణమిచ్చే అభిమానులే. కొద్ది క్షణాల క్రితం వరకూ వారంతా తనకోసం వున్నారు. ఈ క్షణంలో వారెవ్వరూ లేరు. తనను ఒంటరి వాడినిజేసి వెళ్లిపోయారు. చిన్న తనంలో తనను ముద్దుజేసి ఆడించిన పెద్దలూ, తన కుమారులూ, సోదారులూ, తనతో ఆటపాటల్లో, కష్టసుఖాల్లో కలిసి జీవించిన బంధుమిత్రులూ.. ఇలా మొత్తం అందరూ రక్తంలో మునిగి, విగతజీవులై పడి ఉన్నారు. శవాలపైబడి రోదిస్తున్న యాదవ స్త్రీలనుజూసి, ఆయనలోని మానవ లక్షణం, దైవతత్వం, క్షణకాలం పోటీ పడ్డాయి. బాధను మౌనంగా తట్టుకున్నాడు. మానవ లక్షణంపై దైవత్వం గెలిచింది. తనవారెవరు? పరాయివారెవరు? అందరూ తనలోని వారే.. తాను నడిపించే జగన్నాటకమే కదా ఇదంతా! అని సమాధాన పరచుకున్నాడు. తక్షణమే ఆయనలోని అభిమాన వ్యామోహాలు నశించాయి. భూ భారాన్ని తగ్గించవలసిన తన అవతార లక్ష్యం పూర్తిగా నెరవేరిందని తృప్తి చెందాడు.

యాదవ స్త్రీలను ద్వారకకు తీసుకు వెళ్లి, వసుదేవుని సంరక్షణలో ఉంచాడు. అప్పటికి ఏడవ రోజున ద్వారక సముద్రంలో మునిగిపోతుందని ఆయనకు తెలుసు. అందువల్ల ద్వారకలోని వారందరినీ, అక్కడినుండి తప్పించి రక్షించవలసినదిగా, అర్జునుడికి కబురుజేశాడు. అలా తన బాధ్యతను నెరవేర్చుకుని, తిరిగి ప్రభాస తీర్థానికి చేరుకున్నాడు. అక్కడ యోగమార్గం గుండా శరీరాన్ని వదలి వెళుతున్న బలరాముణ్ణి జూశాడు. మహావిష్ణువు శయనించే ఆదిశేషుడే, బలరామునిగా జన్మించాడనే విషయం, మనం గతంలో ఒక వీడియోలో చెప్పుకున్నాము. బలరాముని ముఖం నుండి ఒక తెల్లని మహాసర్పం బయటకు వచ్చి, అది ఆదిశేషునిగా మారి, ఆకాశమార్గాన వెళ్ళిపోయింది. యాదవ కులనాశనం తర్వాత, తను వైకుంఠానికి చేరుకుంటానని బ్రహ్మదేవుడికీ, ఇంద్రాది దేవతలకూ ఇచ్చిన మాటను కృష్ణుడు గుర్తుకు తెచ్చుకున్నాడు.

శ్రీకృష్ణుడు కూడా యోగ మార్గంలోనే తన దేహాన్ని విడిచి, దివ్యంగా వెళ్ళిపోవచ్చు. కానీ, ఆయన అలా చేయలేదు. భూమిపై మానవ జన్మ తీసుకోవడం వలన, శరీర త్యాగం ద్వారానే తన అవతారాన్ని చాలించాలని, నిర్ణయించుకున్నాడు. యాదవులలో ఒకడైన తాను కూడా, ముసలం ద్వారానే అవతార త్యాగం చెయ్యాలని భావించి, అందుకు తగిన ఏర్పాట్లు ముందునుండీ చేసుకున్నాడు. అవేంటంటే, ముసలాన్ని చూర్ణం చేసి సముద్రంలో కలిపినప్పుడు, అందులో వాడియైన ఒక ఇనుప ముక్క ఉండిపోయిందనీ, దాన్ని ఒక చేప మ్రింగిందనీ, ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ చేప ఒక కిరాతకుని వలలో చిక్కింది. వాడు దాన్ని కోసి, దాని కడుపులో దొరికిన ఇనుప ముక్కను, తన బాణానికి మొనగా చేసుకున్నాడు. ఆ బాణాన్నే, తన అవతార పరిసమాప్తి కోసం వినియోగించుకో దలచాడు, శ్రీకృష్ణుడు. ముసలం ద్వారానే తన అవతారాన్ని చాలించాలన్నదే కదా ఆయన సంకల్పం..

హుందాగా మరణాన్ని ఆహ్వానిస్తూ, ఒక రావిచెట్టు మొదట్లో నేలపై పవళించి, కుడి మోకాలి మీద ఎడమ పాదాన్ని ఠీవిగా పెట్టుకున్నాడు. అలా యోగనిద్రలోకి ప్రవేశించాడు. ముసలంలోని ఇనుప ముక్కతో బాణం తయారు చేసుకున్న కిరాతకుడు, అదే సమయంలో వేటాడుతూ, అటుగా వచ్చాడు. చెట్లచాటు నుండి శ్రీకృష్ణుని పాద పద్మాన్ని చూసి, అక్కడ ఏదో లేడి దాగున్నదని భ్రమించి, బాణాన్ని సూటిగా ప్రయోగించాడు. అది శ్రీకృష్ణుడి బొటన వ్రేలిలో దిగబడింది. కిరాతకుడు దగ్గరకు వెళ్ళిజూసి, తాను బాణం వేసినది కృష్ణపరమాత్ముడి పైనని తెలుసుకుని, తన మహాపరాధానికి ఎంతగానో విలపించాడు. తనను మన్నించమని ప్రార్ధించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతడిని ఓదార్చి, “నేను కోరుకున్న పనినే నువ్వు చేశావు, విచారించకు” అని చెప్పి, కిరాతకుడికి ముక్తిని ప్రసాదించాడు. ఈ విషయాన్ని విపులంగా వివరిస్తూ మనం గతంలో చేసిన వీడియోను చూడండి. ఆనంతరం శ్రీకృష్ణుడి శరీరం నుండి ఒక దివ్య తేజస్సు వెలువడి, ఆకాశ మార్గాన వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఆయన దివ్య రధమూ, గుర్రాలూ, గరుడ ధ్వజమూ, శంఖ చక్రాదులూ ఆయనను అనుసరించాయి. దేవ దుందుభులు మ్రోగాయి. దివి నుండి పూలవాన కురిసింది. కృష్ణావతార పరిసమాప్తిని బ్రహ్మాది దేవతలంతా కనుల పండువగా చూశారు.

ఇందులో ఒక విశేషాన్ని గమనించాలి. శ్రీకృష్ణుడు తన జీవిత కాలంలో, ఎన్నో యుద్ధాలలో నిలిచి, ఎన్నో ఆయుధాల దెబ్బలు తినివున్నాడు. ఆ గాయాల నుండి కారుతున్న రక్తధారలతో, 'పూసిన మోదుగవృక్షం'లా కనిపించేవాడు. అలాంటప్పుడు కూడా కాస్తయినా చలించేవాడు కాదాయన. అటువంటి వజ్రకాయుడు, కేవలం బొటన వ్రేలికి బాణం గ్రుచ్చుకున్నంత మాత్రాన ప్రాణాన్ని కోల్పోతాడా? యథార్ధానికి అది జరగని పని! అయితే, అవతారాన్ని ముగించేందుకు శ్రీకృష్ణుడే స్వయంగా సృష్టించుకున్న మిష ఇది. దీనిలో ఒక పరమార్థం ఉంది. శ్రీకృష్ణుణ్ణి గెలవడం, చంపడం ఎవరికీ సాధ్యం అయ్యే పని కాదు. పైగా ముసలం ద్వారానే తన మరణాన్ని ఆహ్వానించ దలచుకున్నాడాయన. అందువల్ల పూర్వజన్మ పుణ్యఫలం గల ఒక కిరాతకుని ఎన్నుకుని, ముసలంలోని ఇనుప ముక్క అతని చేతికి ఆయుధంగా వచ్చే ఏర్పాటు చేసుకున్నాడు. దాని ద్వారానే అవతారాన్ని చాలించాడు.

శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు, ద్వారకలోని వారందరినీ తరలించి తీసుకుపోయాడు అర్జునుడు. కృష్ణావతార పరిసమాప్తి జరిగిన వారం రోజులకు, సముద్రంలో మునిగిపోయింది ద్వారక. ద్వ్యాపరయుగంలో సముద్రంలో మునిగిన ద్వారకా పట్టణం, ఇటీవలి చారిత్రక పరిశోధనల్లో బయటపడిన విషయం అందరికీ తెలిసిందే. భారతీయ సముద్ర గర్భ పురావస్తుశాఖ అధిపతి శ్రీ యస్‌. ఆర్‌. రావు గారు తన బృందంతో జరిపిన పరిశోధనల్లో, గుజరాత్‌ నమీపంలోని అరేబియా మహాసముద్రంలో మునిగివున్న ద్వారక అవశేషాలు బయటపడ్డాయి. ద్వారకా నగరానికి పూర్వ వైభవాన్ని కల్పించేందుకు, ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశ, విదేశాలకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం, ఈ దిశగా కృషి చేస్తోంది. సముద్రగర్భంలో వున్న ద్వారకను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, మన ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

యతః కృష్ణస్తతో ధర్మో యతో ధర్మస్తతో జయః ||

Tuesday, September 17, 2024

మహాలయ పక్షాలు 2024 Mahalay Paksh - Pitru Paksh


ఈ రోజు 'సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2' వరకు, 'మహాలయ పక్షాలు'.. TELUGU VOICE
- అంటే ఏమిటి? ఏం చేయాలి?

మనిషి ఎంతగా ఎదిగినా, ఎంత దూరం పయనించినా, తన మూలాలను మరచి పోకూడదు. ఆ మూలాలే అతని జన్మకీ, అతని సంస్కారానికీ, సంస్కృతికీ కారణం. అందుకే, ప్రతి ఏటా ఏదో ఒక సమయంలో మన పెద్దలను తలుచుకునేందుకు కొన్ని సందర్భాలను ఏర్పరిచారు మన పూర్వీకులు. వాటిలో ముఖ్యమైనవి, మహాలయపక్షం రోజులు.

చనిపోయినవారి ఆత్మలు తిరిగి జన్మించాలంటే, అన్నాన్ని ఆశ్రయించే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుందని శాస్త్రం చెబుతోంది. శ్రాద్ధకర్మలు సరిగ్గా నిర్వహించకపోతే, మనిషి ప్రేత రూపంలో సంచరిస్తూనే ఉంటాడని నమ్మకం. ఈ రెండు వాదనలూ నమ్మకపోయినా, పూర్వీకులను తలుచుకోవడం అనే సంస్కారాన్ని మాత్రం కాదనలేము కదా! అందుకు ఓ సందర్భమే మహాలయ పక్షాలు. భ్రాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకూ వచ్చే 15 రోజుల కాలాన్ని, 'మహాలయ పక్ష'మని అంటారు.

మహాలయ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు విడుస్తాము కాబట్టి, దీనిని పితృ పక్షమని కూడా అంటారు. ఇప్పటి వరకూ మనం పితృ దేవతలకు చేస్తున్న శ్రాద్ధకర్మలలో ఎలాంటి లోపం వచ్చినా కూడా, ఈ పక్షంలో తర్పణాలని విడిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి. అంతే కాదు! మనకి రక్త సంబంధం లేని గురువులు, స్నేహితులకు కూడా ఈ సమయంలో తర్పణాలను వదల వచ్చు. కొందరికి పుత్రులు లేకపోవడం వల్ల శ్రాద్ధకర్మలు జరగక పోవచ్చు. అలాంటి వారికి కూడా ఈ సమయంలో తర్పణాలను వీడవ వచ్చు.

మహాలయ పక్షంలోని ఒక్కో రోజుకీ ఒక్కో ప్రత్యేకత ఉంది. ఒక్కో కారణంతో చనిపోయిన వారికి, ఒక్కో రోజు కేటాయించ బడింది. క్రితం ఏడు చనిపోయిన వారికీ, భర్త ఉండగానే చనిపోయిన వారికీ, పిల్లలకీ, అర్ధాంతరంగా చనిపోయిన వారికీ.. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో తిథి నాడు తర్పణం విడవడం మంచిదని శాస్త్ర వచనం. అలా కుదరక పోతే, మహాలయ పక్షం చివరి రోజు వచ్చే అమావాస్య నాడు తర్పణం విడవవచ్చని చెప్పబడింది. అందుకే ఆ అమావాస్య రోజును ‘సర్వ పితృ అమావాస్య’ అని పిలుస్తారు.

ఈ మహాలయ అమావాస్య వెనుక ఓ చిత్రమైన కథ ప్రచారంలో ఉంది. కర్ణుడు చనిపోయిన తర్వాత స్వర్గలోకానికి చేరుకున్నాడు. అక్కడ ఇంద్రుడు అతన్ని సాదరంగా ఆహ్వానించాడు. బంగారం, వజ్రాలను అతని ముందు ఉంచి భుజించమన్నాడు. వాటిని చూసిన కర్ణుడికి ఆశ్చర్యం వేసింది. అన్నంతో తీరే ఆకలి బంగారంతో ఎలా తీరుతుందని అడిగాడు. ‘నీ జీవితకాలమంతా బంగారం, వజ్రాలను దానం చేశావు. కానీ నీ పితృదేవతలకు ఏనాడూ పిండ ప్రదానం చేసి ఎరగవు’ అని బదులిచ్చాడు ఇంద్రుడు. దానితో కర్ణుడు తన తప్పును తెలుసుకుని, తన పితృదేవతలకు తర్పణాలు విడిచేందుకు ఓ పదిహేను రోజులు తిరిగి భూలోకం మీదకు పంపమని వేడుకున్నాడు. అలా కర్ణుడికి దక్కిన 15 రోజులే ఈ మహాలయ పక్షం. ఈ విషయాలను విపులంగా వివరిస్తూ మనం చేసిన వీడియోను చూడదలుచుకున్న వారు ఈ లింక్ క్లిక్ చేయండి.. https://youtu.be/vfBBesZcTbw


మహాలయ పక్షంలో ఏదో ఒక రోజున కనీసం ఒక భోక్తనన్నా పిలిచి పితృ దేవతలకు తర్పణాలు వీడాలి, లేదా గయ వంటి పుణ్యక్షేత్రాలకు చేరుకుని అక్కడ శ్రాద్ధకర్మలు నిర్వహించాలి, లేదా తమ పితృ దేవతలను స్మరిస్తూ ఎవరన్నా బ్రాహ్మణుడికి స్వయంపాకాన్ని దానం చేయాలి. మహాలయ పక్షంలో అంతటా ఈ పితృకర్మలు జరుగుతాయి కాబట్టి, పెద్ద పనులు వేటినీ చేపట్టకూడడు. తీర్థయాత్రలు తప్ప, దూరప్రయాణాలు సాగించకూడదు.

Monday, September 16, 2024

Death: A Curse or a Blessing? | మనిషికి మృత్యువు ఎందుకు అవసరం?


మరణం! మనిషికి మృత్యువు ఎందుకు అవసరం? TELUGU VOICE
ఆత్మ నిరంతర ప్రయాణంలో ఒక చిన్న మజిలీ అయిన ఈ జీవితాన్ని ఎలా మలుచుకోవాలి?

'చిరంజీవత్వం' అన్నది సాధారణ విషయం కాకపోయినా, సాధ్యమే. ఎందరో మహనీయులు దానిని సాధించారు కూడా. ఎవరైతే మూల చైతన్యాన్ని గురించి సంపూర్ణంగా తెలుసుకుని, ఆ ‘మూలధనం’ లో వృద్ధి చెందుతూ వుంటారో, వారు అకల్పాంతం వరకూ, అంటే, ఎల్లప్పటికీ ‘పిన్న వయస్కులు’ గానే ఈ లోకంలో ఉండగలరు. ఈ విధంగానే అంజనేయస్వామి గానీ, మహావతార్ బాబాజీ కానీ, ఇంకా ఎంతో మంది యోగులు, ‘చిరంజీవులు’ గా ఇప్పటికీ భూమిపై నడయాడుతూ ఉన్నారు. అందరూ మరణాన్ని గురించి భయపడటం సహజమే. కానీ, జనన మరణాలు సృష్టి నియమాలు. ఈ రెండూ విశ్వం యొక్క సమతౌల్యతను కాపాడటానికి అత్యవసరం. లేకపోతే, మనుషులు ఒకరినొకరు అధిగమించే ప్రయత్నంలో, సృష్టి అల్లకల్లోలమవుతుంది. అది ఎలా..? అనే సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/LrkjH4viRsU ]


మూల చైతన్యాన్ని తెలుసుకోలేని మానవుడు, సృష్టిలో అనివార్యమైన మరణాన్ని గురించి భీతిల్లుతుంటాడు. అవగాహనారాహిత్యం వలన, అది ఒక అంతు చిక్కని విషయంగా అనిపిస్తుంటుంది. మరణమనే సహజ పర్యవసానం ఉండడం వల్లనే, జీవితం ప్రకాశవంతమవుతుంది. ఆత్మ ప్రయాణంలో భాగంగా, మనం కేవలం కొద్ది కాలం మాత్రమే భూమిపై సజీవంగా ఉంటాము. ఎక్కువ కాలం మరణానంతర ప్రయాణంలో ఉంటాము. దీనికి సంబంధించి గతంలో చాలా వీడియోలు చేశాను. చూడని వారు తప్పక చూడండి. జనన మరణ చక్ర భ్రమణంలోని ఈ నిగూఢ సత్యాన్ని తెలుసుకోలేక, భౌతికపరమైన ఆశలూ, కోరికలతో, కలకాలం జీవించి ఉండాలని కోరుకునే వారికోసం, ఒక చిన్న కథను చెప్పుకుందాము..

మరణాన్ని జయించి, చిరంజీవిగా ఉండిపోవాలని తలచిన ఒక రాజు, తన రాజ్యం వెలుపల మహారణ్యంలో వున్న ఒక మహర్షిని సందర్శించాడు. తనకు అమరత్వం సిద్ధించే మార్గం తెలియజేయమని, ఆయనను ప్రార్ధించాడు. రాజు మనోవాంఛితం తెలుసుకున్న మహర్షి, అక్కడికి కొంత దూరంలో ఉన్న రెండు కొండలను దాటిన తరువాత ఒక దివ్య సరస్సు ఉంటుందనీ, దాని నీరు త్రాగితే రాజు అమరత్వాన్ని పొందగలుగుతాడనీ చెప్పాడు. మహర్షి చెప్పినట్లుగానే రాజు ఆ రెండు కొండలనూ దాటిన తరువాత, దివ్య సరస్సును కనుగొన్నాడు. అతను దైవాన్ని తలుచుకుని నీరు త్రాగబోతుండగా, బాధను భరించలేక ఎవరో చేస్తున్న దీనారావాలు వినిపించాయి. బాధాకరమైన ఆ శబ్దాలు వినవస్తున్న దిశకు వెళ్ళిన రాజుకు, చాలా బలహీనుడైన ఒక మనిషి కనిపించాడు.

అటువంటి నిర్జన ప్రాంతంలో అతడిని చూసి ఆశ్చర్యపోయిన రాజు, కారణం అడగగా, అతడు ఇలా చెప్పనారంభించాడు. తాను ఆ దివ్య సరస్సులోని నీరు త్రాగి అమరత్వాన్ని పొందగలిగాడనీ, వంద సంవత్సరాల వయస్సు దాటిన తనను, తన కుమారుడు ఇంటి నుండి బయటకు పంపించేశాడనీ చెప్పాడు. అప్పటికి యాభై సంవత్సరాల నుండి ఆలనా పాలనా లేకుండా, తానక్కడే పడి ఉన్నాడని తెలియజేశాడు. తన కుమారుడు మరణించి, మనవళ్లు కూడా వృద్ధులై పోయారని చింతించాడు. తాను తినడం, త్రాగడం మానేసినా, ఇంకా బ్రతికే ఉన్నానని వాపోయాడు.  చిరంజీవిత్వం తన పాలిట శాపంగా ఎలా పరిణమించిందో మొరపెట్టుకున్నాడు. తనకు మృత్యువును ప్రసాదించమని భగవంతుడిని ప్రార్ధిస్తూ రోదించసాగాడు.

రాజు ఆలోచనలో పడ్డాడు. వృద్ధాప్యం, దయనీయమైనది. జవసత్వాలతో కూడిన యవ్వనం లేని అమరత్వం పొంది, ప్రయోజనం ఏమిటి? అప్పుడు అమరత్వంతో పాటు యవ్వనాన్ని కూడా పొందాలని నిశ్చయించుకుని, తిరిగి మహర్షిని సందర్శించి, తనకు అమరత్వంతో పాటు యవ్వనాన్ని కూడా పొందేందుకు మార్గం సూచించమని కోరాడు. చిరునవ్వు నవ్వుతూ మహర్షి, రాజు అంతకు ముందు చూసిన దివ్య సరస్సును దాటి ఇంకా కొంత దూరం ముందుకు వెళితే కనిపించే మరో కొండను అధిగమిస్తే, పసుపు రంగు పండ్లతో నిండిన ఒక దేవతా వృక్షం కనిపిస్తుందనీ, దాని పండును తింటే, అమరత్వంతో పాటు యవ్వనాన్ని కూడా పొందవచ్చనీ చెప్పాడు.

మహర్షి చెప్పిన విధంగానే రాజు ఈసారి మూడవ కొండను కూడా దాటి, పసుపు రంగు పండ్లతో నిండిన దేవతా వృక్షాన్ని చేరుకున్నాడు. అతను ఒక పండు కోసి తినబోతున్న సమయంలో, ఉన్నట్లుండి అక్కడికి సమీపంలోనుంచి ఏదో సవ్వడి వినిపించింది. జన సంచారం లేని ఆ ప్రాంతంలో వాదులాడుకునేవారు ఎవరై ఉంటారా అని ఆశ్చర్యపోయాడు రాజు. హుటాహుటిన శబ్దం వినవస్తున్న దిశకు వెళ్లి చూసిన రాజుకు, తర్జన భర్జనలు పడుతున్న నలుగురు యువకులు కనిపించారు. సమస్య ఏమిటని రాజు అడగగా, వారిలో ఒక యువకుడు, "నా వయస్సు 400 సంవత్సరాలు. నా కుడివైపున ఉన్న మనిషి నా తండ్రి. వయస్సు 450 సంవత్సరాలు. అతడు నాకు రావలసిన వాటా ఆస్తిని నాకు ఇవ్వడం లేదు." అని అన్నాడు చిన్నబుచ్చుకుంటూ.

అది విన్న రాజు ఆ కుడివైపున ఉన్న రెండవ మనిషిని అడగగా, అతను మూడవ వ్యక్తిని చూపిస్తూ, "ఈయన నాకు తండ్రి. వయస్సు 500 సంవత్సరాలు. తాను ఇంకా జీవించి ఉండడంవలన, నా భాగం ఆస్తి నాకు రాలేదు. నాది కానిది నా కుమారుడికి నేనెలా ఇవ్వగలను?" అని అన్నాడు. ఇక అతడు నాలుగవ వ్యక్తిని చూపించి, అతడిని తన తండ్రిగా చెప్పి, వయస్సు 550 సంవత్సరాలని చెప్పాడు. అతడిది కూడా అదే సమస్య. ఇలా వారు ఆస్తి కోసం నిత్యం ఘర్షణ పడుతుండడంతో విసుగు చెందిన గ్రామస్థులు, వారిని గ్రామం నుండి బహిష్కరించారు. అలా వారు ఆ నిర్జన ప్రదేశంలో చేరి, నిత్యం ఘర్షణలతో మనశ్శాంతిని కోల్పోయి, కాలం వెళ్లబుచ్చుతున్నారు.

ఇదంతా చూసి ఆశ్చర్యానికి గురైన రాజు తిరిగి మహర్షిని చేరి, తన అజ్ఞానాన్ని దూరంచేసినందుకూ, తనకు మరణం యొక్క ఆవశ్యకతను ఎరుకపరచినందుకూ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు. అప్పుడు మహర్షి చిరుదరహాసంతో ఇలా అన్నాడు.. "రాజా! మరణం ఉన్నందువల్లనే ప్రపంచంలో ప్రేమ ఉంది. మరణాన్ని తప్పించడానికి ప్రయత్నించే బదులు, ప్రతి రోజూ, ప్రతి క్షణమూ సంతోషంగా గడపండి. సహజంగా అందరూ పొరబడే.. ‘నేనొక్కడిని మారితే ఏమవుతుంది!’ అని అనుకోకుండా, ముందు మీరు మారండి. అది చూసి మీ చుట్టూ ఉన్నవారు మారతారు. తదనుగుణంగా ప్రపంచం మారుతుంది." మార్పనేది, ఒక్కరితోనే మొదలవుతుంది..

మానవజన్మ విశిష్టతనూ, విలువనూ మనం గ్రహించాలి. అన్ని రాళ్లకంటె వజ్రం ఎలా విలువైనదో, అలాగే మానవజన్మ అన్ని జన్మలకంటే విలువైనది. ఇది మనకు అంత సులభంగా లభించలేదు. ఈ మానవ జన్మ లభించడానికి మనం ఎంతో పుణ్యం చేశాము. వజ్రం కోసం ఎంతో ధనాన్ని వెచ్చించినట్లే, మానవ జన్మకోసం మనం ఎంతో పుణ్యాన్ని వెచ్చించాము. అందుకే మానవ జన్మ కూడా వజ్రంలాగే ఎంతో విలువైనది. వజ్రాన్ని అలక్ష్యంచేసే వ్యక్తిని ఎలాగైతే మూర్ఖుడిగా భావిస్తామో, అలాగే, మానవజన్మను సక్రమంగా ఉపయోగించుకోకపోతే, మనం కూడా మూర్ఖులమే అవుతాము.

స్నానం చేస్తూ దేవుడి నామస్మరణ చేస్తే, అది పవిత్ర స్నానమవుతుంది..

తింటూ దైవ నామస్మరణ చేస్తే, ఆహారం ప్రసాదమవుతుంది..

నడుస్తూ భగవన్నామస్మరణ చేస్తే, అది యాత్ర అవుతుంది..

వంట చేస్తూ స్మరణ చేస్తే, ఆహారం దివ్యమవుతుంది..

నిద్రించే ముందు స్మరించుకుంటే, అది ధ్యాన నిద్రవుతుంది..

ఇంట్లో దివ్య నామస్మరణ చేస్తే, ఆ ఇల్లే దేవాలయంగా మారుతుంది..

నిత్య దైనందిన కర్మలు చేసుకుంటూ దైవాన్ని తలుచుకుంటే, అది భక్తి అయ్యి, మనలను భగవంతుడికి దగ్గరజేస్తుంది..

యతః కృష్ణస్తతో ధర్మో యతో ధర్మస్తతో జయః ||

Friday, September 13, 2024

నేను దేవాలయానికి ఇక రాను!!!


నేను దేవాలయానికి ఇక రాను!!! TELUGU VOICE

11 సంవత్సరాల ఒక పాప తన తండ్రితో కలిసి దేవాలయానికి వెళ్లింది. భగవంతుడికి నమస్కరించి వచ్చి ఓ ప్రక్కన కూర్చున్న సమయంలో, తన తండ్రితో ఆమె ఇలా అన్నది. "నాకు ఇకపై ఆలయానికి రావాలని లేదు నాన్నా".. అని. తండ్రి ఎందుకని ఆడగగా ఆమె ఇలా అన్నది.. "భగవంతుడికి సేవ చేయడం మరియు భజనలో సమయం గడపటం కోసం మనం ఇక్కడకు వస్తున్నాము. కానీ, ఇక్కడ నాకు అందరూ కపట భక్తులే కనిపిస్తున్నారు. దేవాలయానికి వచ్చిన తరువాత కూడా వారు తమ మొబైల్ ఫోన్లతోనే గడుపుతున్నారు. వారి మనసు, దృష్టి మొత్తం సెల్ ఫోన్ మీదనే నిమగ్నమై ఉంటోంది. చెడు మాటలు వినిపిస్తున్నాయి. వీరు కేవలం కపటులు మాత్రమే. వీరందరినీ చూసి చూసి నేను కూడా అలానే అవుతానేమో అనే భయం కలుగుతున్నది. అందుకే నేను ఇకపై ఆలయానికి రాదలచుకోవడం లేదు" అని చెప్పింది కుమార్తె.

[ ప్రార్థించే మనస్సెలా ఉండాలి?: https://youtu.be/HYR6GJyUWUc ]


తండ్రి నిశ్శబ్దంగా విన్న తరువాత.. "సరే.. నాకోసం ఒక పని చేసి పెట్టు తల్లీ" అని అన్నాడు  తండ్రి. ఆమె అలాగే అన్నది.. "ఒక గాజు గ్లాసు నిండా నీరు తీసుకుని ఆలయం చుట్టూ 2 సార్లు తిరిగి రా. ముఖ్యంగా వీళ్లందరి మధ్యలో నుండి నడచి, నీరు క్రింద పడకుండా రావాలి. రాగలవా?" అన్నాడు తండ్రి.

కుమార్తె సరేనని చెప్పి, తండ్రి చెప్పినట్లుగానే తిరిగి వచ్చి.. చూశారా! ఈ గ్లాసు నిండుగా ఉంది. ఒక్క చుక్క నీరు కూడా క్రింద పడలేదు. మీరు చెప్పిన పనిని నేను విజయవంతంగా పూర్తి చేశాను" అన్నది ఆనందంగా..

అప్పుడు తండ్రి పాపను అభినందించి, ఆమెను 3 ప్రశ్నలడిగాడు..

1. ఈ సారి వెళ్లినప్పుడు, ఇందాక నీకు నచ్చని పనులు చేస్తున్నవారు ఏం చేస్తున్నారు?
2. ఎవరైనా చెడు మాటలు, ఇతర గాసిప్స్ చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారా?
3. కపట భక్తులేం చేస్తున్నారు?

అదుకామె.. "నేను అవేమీ చూడలేదు. నా దృష్టి గ్లాసు, మరియు దానిలోని నీటిపైనే ఉంది. నీరు ఒక్క చుక్క కూడా పోకుండా తీసుకు రావడంలో, మిగతా వారిని గమనించనే లేదు" అని చెప్పింది.

అప్పుడు తండ్రి ఆమెతో ఇలా అన్నాడు.. "నీవు దేవాలయానికి వచ్చినప్పుడు సరిగ్గా చేయవలసినది ఇదే. కేవలం భగవంతునిపై దృష్టి నిలిపి, ఆయన గురించే ఆలోచిస్తూ, ఆయనతో మమేకం అవడానికి ప్రయత్నించాలి. అలాగనుక చేయ గలిగితే, ఎవ్వరూ నీ దృష్టికిరారు. పైగా నీవంటి వారిని చూసి వారు కూడా క్రమంగా తమ పద్ధతిని మార్చుకోవచ్చు. అచంచలమైన భక్తి, ఏకాగ్రత, నిరంతర సాధన మాత్రమే మనల్ని భగవంతునికి చేరువ చేస్తాయి. జీవితంలో ఉన్నత పథంవైపుకు నడిపిస్తాయి".

దేవాలయంలో గడప వలసిన విధానం గురించి ఇంత చక్కగా చెప్పిన ఆ తండ్రి ధన్యుడు. పిల్లలకు ఇదే విధమైన ఏకాగ్రత అలవాటు చేయాలి అందరూ. దైవ సన్నిధిలో ఏకాగ్రతతో ఉండడం ఎంతో ముఖ్యం. దాని కొరకు సాధన చేయడంలోనే అర్థం పరమార్థం ఉన్నాయి.

🚩 ఓం శ్రీమాత్రే నమః 🙏

Thursday, September 12, 2024

అశోకుడి 9 మంది రహస్య సంఘం ఇంకా కొనసాగుతోందా? Mystery of secret organization formed over 2000 yrs ago


అశోకుడి 9 మంది రహస్య సంఘం ఇంకా కొనసాగుతోందా? TELUGU VOICE

మనిషి ఆది మానవుడి స్థితి నుంచి, ఆధునిక మానవుడి స్థాయికి ఎదిగే క్రమంలో, ఎన్నో విషయాలను మధించి, కొన్ని శాస్త్రాలను వెలికి తీశాడు.. ఈ శాస్త్రాలలో కొన్ని, మనిషి అభివృద్ధికి తోడ్పడితే, మరికొన్ని, వినాశనానికి కారణమవుతున్నాయి.. ఆ శాస్త్రాలను దాచిపెట్టడం తోపాటు, మానవాళిని రక్షించడానికి కొన్ని రహస్య సంఘాలు ఏర్పడితే, మరికొన్ని నాశనం చేయడానికి ఏర్పడ్డాయి. వీటిలో కొన్ని పురాతన సంఘాలు, ఇప్పటికీ రహస్యంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంటే, కొన్ని కాలగమనంలో కలిసిపోయాయి. అటువంటి వాటిలో 'Illuminati, The Skull and Bones, The Rosicrucians, The Knights Templar' అనే సంస్థలు బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే, ఈ రహస్య సంఘాలన్నీ 15, 16 శతాబ్దాల మధ్యలో ఆరంభమైనవే. కానీ, పాశ్చాత్యులకు రహస్య సంఘాలు అనే పదం తెలియక మునుపే, అఖండ భారతావనిని ఏలిన ఒక చక్రవర్తి, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రహస్య సంఘాన్ని ఏర్పాటు చేసి, అతి పురాతనమైన, శక్తివంతమైన విజ్ఞాన భాండాగారాన్ని, దుష్టుల చేతిలో పడకుండా రక్షణ కల్పించాడు. అసలు ఎవరా భారత చక్రవర్తి? అతను ఎందుకని ఈ రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశాడు? అందులో ఎంత మంది సభ్యులు ఉన్నారు? వారి వద్దనున్న ఆ విజ్ఞానం ఏంటి? అనే విషయాలు, నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/-wMOVPj2sIA ]


అఖండ భారతావనిని ఏలిన మహా చక్రవర్తి, మౌర్య సామ్రాజ్య అధిపతి అశోకుడు. ఈయన సామాన్యశకానికి పూర్వం, 268 నుంచి 232 వరకు పాలించినట్లు, చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఈయన మౌర్య సామ్రాజ్యాన్ని, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బెంగాల్, అస్సాంతో పాటు, దక్షిణ భారత దేశంలో మైసూర్ వరకు విస్తరింపజేసి, ఈ భరతగడ్డను ఏలిన వారిలో ఒక గొప్ప చక్రవర్తిగా నిలిచారు. ఆయన రాజ్య విస్తరణలో భాగంగా, ఎన్నో ప్రాచీన గ్రంథాలను అవపోసన బట్టి, వాటి సహాయంతో కొత్త కొత్త యుద్ధ యంత్రాలూ, తంత్రాలూ సృష్టించి, తనకి కదన రంగంలో తిరుగులేకుండా చేశాడు. అయితే, అశోకుడి తండ్రి అయిన బిందుసారుడి చిరకాల కోరిక, కళింగను జయించడం. తండ్రి కోరిక నెరవేర్చడానికి, అతి బలమైన కళింగ రాజ్యంపై దండెత్తి, తన వశం చేసుకున్నాడు. అయితే, ఈ యుద్ధంలో తన సైన్యం సుమారు పది వేల మందికి పైగా చనిపోతే, కళింగ సైనికులు, ప్రజలు, సుమారు లక్ష మంది వరకు చనిపోయారు. రక్తపుటేరులై ప్రవహించిన రణరంగం చూసిన అశోకుడికి, మనసు చలించిపోయింది. ఎటు చూసినా పీనుగుల గుట్టలు, అశోకుడిని రాజ్యవిస్తరణ కాంక్షనుంచి, వైరాగ్యం వైపు నడిపించాయి..

ఈ కళింగ యుద్ధం వల్ల జరిగిన నష్టం మళ్లీ జరగకూడదని భావించి, ఆయుధాన్ని వదిలి, బౌద్ధమతాన్ని స్వీకరించాడు. రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తూనే, శాంతి స్థాపనకు అమోఘ కృషి చేశాడు. ఈ క్రమంలో ఆయన ఏర్పాటు చేసిన సంఘమే, అశోక నవ రహస్య సంఘం. ఈ సంఘంలో, మొత్తం తొమ్మిది మంది అత్యంత ప్రతిభావంతులు ఉండేవారట. ఈ తొమ్మిది మందీ, మన ప్రాచీన గ్రంథాలను అవపోసన బట్టి, వాటిలోని విజ్ఞానాన్ని దుష్టుల చేతిలో పడకుండా రక్షించడమే, వారు చేయవలసిన కార్యం. ఈ నవ రహస్య సంఘం, ప్రపంచం నలుమూలలకూ వెళ్లి, అతి రహస్య జీవనం సాగిస్తూ, అత్యంత విలువైన విజ్ఞాన భాండాగారాన్ని రక్షించినట్లు, చరిత్రకారులు చెబుతున్నారు. అయితే, కాలగమనంలో మరుగున పడిపోయిన ఈ విషయాన్ని, Talbot Mundy అనే బ్రిటిష్ అధికారి, 1923లో వెలువరించిన 'The Nine unknown' అనే పుస్తకం వల్ల, ప్రపంచం మొత్తానికీ తెలిసింది.

ఈయన భారతదేశంలో బ్రిటిష్ అధికారిగా ఉన్న సమయంలో, మన దేశ చరిత్ర మీద ఎంతో అధ్యయనం చేశాడు. దాని ఫలితంగానే, అశోకుడి కాలంలో స్థాపించబడ్డ రహస్య సంఘం గురించిన కొన్ని నిజాలను, మన ముందుకు తీసుకు రాగలిగాడు. ఆయన రాసిన దాని ప్రకారం, ఈ తొమ్మిది మంది వద్ద, ఊహకందని అత్యంత అధునాతన విజ్ఞాన భాండాగారం ఉందనీ, వాటిని వారు తాళపత్రాల రూపంలో పొందుపరిచారనీ, ఆ పరిశోధనలు నేటి శాస్త్రవేత్తల వద్ద కూడా లేవనీ, ఆయన వివరించాడు. ఈ తొమ్మిది మందీ, ప్రాచీన విజ్ఞాన భాండాగారాన్ని తొమ్మిది అంశాలుగా విభజించి, వాటిని గ్రంథాలుగా మార్చి, ఒక్కొక్కరూ ఒక్కొక్క గ్రంథాన్ని రక్షించేవారు. వారు ఆ గ్రంథాలను రక్షించడమే కాకుండా, కాలానుగుణంగా వచ్చిన అంశాలను అందులో పొందుపరచాలని, వారి తరువాత తమకు నమ్మకస్తులైన వారు ఈ పనిని చేయాలని చెప్పినట్టు, Mundy వ్రాసిన పుస్తకంలో ఉంది. Mundy చెప్పినదాని ప్రకారం, ఆ తొమ్మిది మంది వద్దనున్న తొమ్మిది గ్రంథాల గురించి, ఇలా వివరించబడింది.

మొదటి గ్రంథంలో, మనసులతో చేయు యుద్ధం గురించిన సమాచారం ఉంది. దానిని ఇంగ్లీషులో 'Propaganda and Psychological Warfare' అంటే, ఎదుటి వ్యక్తులని మాటలతో వశపరుచుకుని, వారిని తమకు నచ్చినట్లు వినియోగించుకోవడం. ఈ విధంగా ప్రజలను మాటలతోనే వశపరుచుకుని, వారిని యుద్ధాలకూ, విపరీత కార్యాలకూ పురిగొల్పడం.

రెండవ గ్రంథంలో, శరీర ధర్మం గురించిన పూర్తి సమాచారం ఉంటుంది. దీనిని ఇంగ్లీషులో, Physiology అని అంటారు. దీని ద్వారా మన శరీర నిర్మాణంపై పూర్తి పట్టుతో పాటు, కేవలం ఒక్క స్పర్శతో ఎంతటి వారినైనా చంపవచ్చు. ఈ విద్య ద్వారా, మనిషి నాడీ వ్యవస్థపై ఎలా దాడి చేస్తే ఏం జరుగుతుందో అనే విషయాలు, చాలా విపులంగా వివరించబడింది.

ఇక మూడవ గంధంలో, అతి సూక్ష్మ జీవ శాస్త్రం మరియు జీవ సాంకేతిక శాస్త్రం గురించిన వివరాలు ఉంటాయట. దీనిని ఇంగ్లీషులో మైక్రోబయాలజీ అండ్ బయోటెక్నాలజీ అంటారు. దీని ప్రకారం, సూక్ష్మజీవులపై పరిశోధన, వాటిలో మంచి వాటిని గుర్తించి, వివిధ సందర్భాలలో ఎలా ఉపయోగించడం లాంటి అనేక విషయాలపై సమగ్రంగా ఉందట.

నాల్గవ గ్రంధంలో, రసవాదం వాదం గురించి ఉందట. దీనినే ఇంగ్లీషులో, Alchemy అని అంటారు. ఇందులో సమస్త లోహాల గురించిన పూర్తి వివరణతో పాటు, ఒక లోహాన్ని మరో లోహంగా మార్చే ప్రక్రియ గురించి ఉందట. ఈ శాస్త్రాన్ని ఉపయోగించి, ఈ లోహాన్ని బంగారంగా మార్చవచ్చు.

5వ గంధంలో సమాచారం, అంతరిక్ష మరియు గ్రహాంతరవాసులతో సమాచారం గురించి వివరించబడింది. దీనిని ఇంగ్లీష్లో, Communication and Communicate with Extraterrestrials అంటారు. దీని సహాయంతో, దూర ప్రాంతాల్లో ఉన్న వారితో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు, గ్రహాంతర వాసులను ఎలా కలవాలి? వారితో ఏ విధంగా సంభాషించాలి? అనే విషయాలు తెలుసుకోవచ్చు.

ఆరవ గ్రంధంలో, భూమ్యాకర్షణ మరియు విమానాల తయారీ గురించి వివరించబడింది. దీనిని నేడు గ్రావిటేషన్ అండ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ అని అంటున్నారు.

ఏడవ గ్రంథంలో అంతరిక్షం గురించిన వివరాలున్నాయి. ఈ గ్రంథం ఆధారంగా, అంతరిక్షం గురించి, విశ్వం ఏర్పడిన విధానం గురించీ వివరించబడింది. దీనినే కాస్మాలజీ అని నేడు అంటున్నారు. అంతేకాదు,  ఈ గ్రంధం ద్వారా టైం ట్రావెలింగ్ ఎలా చేయాలి? Portals ఎలా ఏర్పడతాయి? వాటిని ఎలా మనకు ఉపయోగపడేలా వాడవచ్చు? అనే విషయాలు వివరించబడింది.

ఎనిమిదవ గ్రంథంలో, కాంతి గురించీ దాని వేగాన్ని మార్చే సాంకేతికత గురించీ వివరించబడింది. అంతేకాదు, కాంతినీ, వేగాన్నీ మనకి అనుకూలంగా మార్చుకుని, దానితో దాడి ఎలా చేయాలి? అనే విషయాలపై వివరంగా రాసి ఉందట.

ఇక ఆఖరి గ్రంధంలో సమాజ శాస్త్రం గురించి వివరించబడింది. ఈ గ్రంథం ఆధారంగా, మన సమాజం ఎలా ఉండాలనే నియమ నిబంధనలు, ప్రభువులు సమాజ అభివృద్ధి చేయడానికి కావలసిన మార్గదర్శకాలతో పాటు, రాజ్య పాలన గురించి వివరించబడింది. అంతే కాదు, ఇందులో ఏం చేస్తే సమాజం నాశనం అవుతుందో తెలిపే సమాచారం కూడా ఉందట.

ఇది, అశోకుడి తొమ్మిదిమంది రహస్య సభ్యుల వద్దనున్న గ్రంథాలలోని సమాచారం. ఈ తొమ్మిది మంది సభ్యులు, తమ వారసుల ద్వారా, వారి రహస్య కార్యకలాపాలను నేటికీ కొనసాగించేలా చేశారని, వారి వారసులు ఈ సమాచారం అత్యంత రహస్యంగా, వారి తరువాతి తరాల వారికి అందిస్తూ ఉంటారనీ, అందువల్ల అశోకుడు స్థాపించిన ఈ రహస్య సంఘం నేటికీ మనుగడలో ఉందనీ, చాలామంది బలంగా నమ్ముతున్నారు. కొన్ని విపత్కర పరిస్థితులలోనూ, కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు సమయంలో వీరు బయటకు వచ్చి, కొంత సమాచారాన్ని ఇచ్చారని కూడా చాలామంది నమ్ముతున్నారు. ఏది ఎలా ఉన్నా, ఈ తొమ్మిది మందికి సంబంధించిన విషయాలు, ఇంకా ఒక మిస్టరీగానే ఉండిపోయాయి.

[ 20 లక్షల సంవత్సరాల క్రితం వ్రాయబడిన మొదటి గ్రంధం! = https://youtu.be/40259dhpZm4 ]

Monday, September 9, 2024

అభిమన్యుడిని శ్రీకృష్ణుడు ఎందుకు కాపాడలేదు? Why Lord Krishna didn't save Abhimanyu


అభిమన్యుడిని శ్రీకృష్ణుడు ఎందుకు కాపాడలేదు? TELUGU VOICE
అన్నీ తెలిసిన కృష్ణుడు 16 ఏళ్ల చిరు ప్రాయంలో అభిమన్యుడి మరణాన్ని ఎందుకు అడ్డుకోలేదు?

పంచమ వేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతంలోని వీర యోధులు అనగానే, ముందుగా అందరి మదిలో మెదిలే పేరు 'అభిమన్యుడు'. పాండవ మధ్యముడు అర్జునుడు, శ్రీకృష్ణుడి సోదరి సుభద్రాదేవిల ముద్దుల తనయుడు అభిమన్యుడు. అంటే, సాక్షాత్తు శ్రీ కృష్ణుడికి మేనల్లుడు. తల్లి కడుపులో ఉన్న సమయంలోనే తండ్రి నుంచి అస్త్రశస్త్ర విద్యలను అభ్యసించిన జ్ఞాని. పుట్టకముందే చక్రవ్యూహంలోకి ప్రవేశించే జ్ఞానాన్ని సంపాదించాడు. అయితే, ఆ చక్ర వ్యూహం నుంచి బయటపడే మార్గం తెలియక, 16 ఏళ్ల చిరు ప్రాయంలో మరణించాడు. అభిమన్యుడు యుద్ధంలో ఇలా వీర మరణం పొందడం వెనుక కారణం ఏంటి? ఎందుకు శ్రీ కృష్ణుడు కూడా తన మేనల్లుడు అభిమన్యుడిని కాపాడకుండా మిన్నకుండిపోయాడు? వంటి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/wKZGYNXa9V4 ]


మహాభారతం అనగానే మనకు గుర్తుకు వచ్చేది, కురుక్షేత్ర మహాసంగ్రామం. కురుక్షేత్రాన్నే ధర్మక్షేత్రం అని కూడా అంటారు. ఆ యుద్ధం, ధర్మాన్ని పరిరక్షించడానికి జరిగిన యుద్ధంగా పేర్కొంటారు. 'ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగేయుగే' అని చెప్పినట్లుగానే, లోకంలో అధర్మం పెచ్చు మీరిన ప్రతి సారీ, శ్రీ మహా విష్ణువు అవతరిస్తుంటాడు. అలా ద్వాపర యుగంలో విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు, ఆయనకు సహాయంగా ఇతర దేవతలు కూడా జన్మించడానికి సిద్ధపడ్డారు. వివిధ ప్రదేశాలలో ఎందరో దేవతలు జన్మించి, ధర్మాన్ని స్థాపించడంలో శ్రీ కృష్ణ భగవానుడికి సహాయం చేశారు. అందులో భాగంగానే, చంద్రుడి కుమారుడైన 'వర్చస్సు', అభిమన్యుడిగా జన్మించాడు.

అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే, తండ్రి పద్మవ్యూహం గురించి చెబుతుండగా శ్రద్ధగా ఆలకించాడు. ఇక పద్మవ్యూహం నుంచి బయటపడటం ఎలాగో చెప్పబోతున్న సమయంలో, శ్రీకృష్ణుడు అర్జనుడిని అడ్డుకున్నాడు. కావాలనే శ్రీకృష్ణుడు అలా చేశాడు. దీనితో అభిమాన్యుడు, పద్మవ్యూహాన్ని ఛేదించడం మాత్రమే తెలుసుకుని, బయట పడటం తెలుసుకోలేకపోయాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జనుడు, శ్రీకృష్ణుడు లేని సమయంలో, పాండవులకు అండగా యుద్ధరంగంలోకి ప్రవేశించిన అభిమన్యుడు, కౌరవులను వీరోచితంగా ఎదుర్కొని, చివరకు పద్మవ్యూహం నుంచి బయటకు రాలేక, కౌరవుల చేతిలో అసువులు బాశాడు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా, శ్రీకృష్ణ పరంధాముడు మౌనంగా ఉండిపోయాడు.

ముందు చెప్పుకున్నట్లుగా దీనికి కారణం, గత జన్మలో అభిమన్యుడు చంద్రుడి కుమారుడు. మానవ జన్మ అయిన అభిమన్యుడిగా తన కుమారుడిని భూమి పైకి పంపడానికి ముందే, చంద్రుడు తన తనయుడు భూమిపై 16 ఏళ్లు మాత్రమే ఉంటాడని షరతు పెట్టాడు. ఆ మాట ప్రకారమే, 16 ఏళ్లకే అభిమన్యుడు మరణిస్తున్నా, కృష్ణ భగవానుడు చూస్తుండిపోయాడు. పైగా ఈ ఘటన, అర్జనుడు తన సోదరులపై యుద్ధం చేయడానికి వెనుకాడుతున్న సమయంలో జరిగి, వారు కుతంత్రం పన్ని తన తనయుడిని హతమార్చడంతో, వైరాగ్యం వీడి, అర్జునుడు పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగాడు. మహాభారతంలోని ఆదిపర్వంలో, భీష్ముడి సంశయాన్ని తీరుస్తూ, పులస్త్య మహాముని తెలియజేసిన వివరాలివి.

మరో కథనం ప్రకారం, అభిమన్యుడు పూర్వ జన్మలో అభికాసురుడనే రాక్షసుడిగా చెప్పబడింది. అతడు కృష్ణుడి మేనమామ కంసుడికి మిత్రుడు. కంస వధ తరువాత, అభికాసురుడు కృష్ణుడిపై ప్రతీకారం తీర్చుకోదలచాడు. విషయం గ్రహించిన శ్రీకృష్ణ పరమాత్ముడు అతడిని కీటకంగా మార్చి, ఒక పెట్టెలో బంధించాడు. కాలక్రమంలో, కృష్ణుడి సోదరి సుభద్రా దేవీ, అర్జునుల వివాహం జరిగింది. ఒకనాడు అనుకోకుండా సుభద్ర ఆ పెట్టెను తెరచినప్పుడు, కీటకం ఆమె కడుపులోకి చేరి ప్రాణాలు విడిచింది. అభికాసురుడు అభిమన్యుడిగా, సుభద్ర కడుపున పునర్జన్మను పొందాడు.

విషయం తెలిసిన కృష్ణుడు బరువెక్కిన హృదయంతో తన మేనల్లుడి మరణానికి వేదికను సిద్ధం చేశాడు. అందుకే పద్మవ్యూహంలోకి ప్రవేశించడం మాత్రమే తెలిసిన అభిమాన్యుడి మరణాన్ని కావాలని అడ్డుకోలేదు. అర్జునుడు తన కుమారుడి మరణానికి దుఃఖిస్తూ కృష్ణుడిని నిందించినప్పుడు, పరమాత్ముడు అతడికి అభికాసురుడి గురించీ, అభిమన్యుడిగా అతడు పునర్జన్మనెత్తిన వైనాన్నీ వివరించాడు.

🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏

Monday, September 2, 2024

ఎవరు గొప్ప! కర్ణుడా - అర్జునుడా? Who is more powerful - Karna or Arjuna


ఎవరు గొప్ప! కర్ణుడా - అర్జునుడా? TELUGU VOICE
ద్రౌపది మనస్సులో కర్ణుడిని కామించిందనడంలో ఎంతవరకూ నిజం ఉంది?

వేదవ్యాసుడు చెబుతుండగా, గణపతి రచించిన మహాభారతం, పంచమ వేదంగా పరిగణించబడే భారత ఇతిహాసం. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం, మహాభారత కావ్యం, వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000 సంవత్సరాల కాలంలో, దేవనాగరి లిపి అయిన సంస్కృత భాషలో రచించబడింది. 18 పర్వాలతో, లక్ష శ్లోకాలతో, 74,000 పద్యాలతో లేక సుమారు 18 లక్షల పదాలతో, ప్రపంచంలోనే అతి పెద్ద పద్య కావ్యాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ మహా కావ్యాన్ని 14వ శతాబ్దంలో, కవిత్రయంగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రనలు తెలుగులోకి అనువదించారు. అటువంటి మహాభారతంలోని అర్జునుడూ, కర్ణుడి గురించి తెలియనివారుండరు. ఇక ప్రభాస్ నటించిన కల్కి వంటి చిత్రాలు చూసినప్పుడు, వీరిలో ఎవరు గొప్ప అనే సందేహం మెదులుతూ ఉంటుంది చాలామందిలో. విశ్లేషణాత్మకంగా ఈ విషయాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/xKPQS3XGcWg ]


కర్ణుడు గొప్పా, అర్జునుడు గొప్పా అనేది తెలుసుకునే ముందు, వ్యాస విరచిత మహాభారత కావ్యంలోని కొన్ని పాత్రల వైశిష్ట్యం, కొన్ని సంఘటనలూ తెలుసుకోవడం తప్పనిసరి. దానం విషయంలో కర్ణుడికి సాటి ఎవరూ లేరన్న పేరుంది. కర్ణుడు అంగరాజ్యానికి రాజయ్యాక చేసిన దానాలన్నీ, దుర్యోధనుడు ఇచ్చినవే కావచ్చు. కానీ, బాల్యం నుండీ కర్ణుడికి దానగుణం హెచ్చని, భారతం చెబుతుంది. అలాగే, కర్ణుడి దానాలలోకెల్లా గొప్ప దానం, కవచ కుండలాల దానం. ఎందుకంటే, అవి దుర్యోధనుడు ఇచ్చినవి కావు. కర్ణుడి స్వంతం, అతడికి పుట్టుకతో సంక్రమించినవి. కవచ కుండలాల దానం, కర్ణుడికి మహత్తర కీర్తిని తెచ్చిపెట్టింది. కానీ, ఇక్కడ గమనించాల్సింది, కవచ కుండలాలను దానం చేసి, అంతకంటే గొప్పదైన 'శక్తి' ఆయుధాన్ని ప్రతిఫలంగా పుచ్చుకున్నాడు. ప్రతిఫలం పుచ్చుకున్న దానికి, దాన ఫలం మిగలదు. కర్ణుడు తన పూర్వజన్మలో సహస్ర కవచుడిగా, 1000 కవచాలూ, కుండలాలతో వున్నప్పుడే, నరనారాయణుల ముందు నిలువలేక పోయాడు. ఇక ఈ జన్మలో, కేవలం ఒక్క కవచంతో, నరనారాయణులు అంటే, కృష్ణార్జునుల ముందు నిలువగలడా? ఆ కవచం బలం ఎంతో కర్ణుడికి తెలుసు. అందుకే దాన్ని ఇచ్చేసి, అర్జునుణ్ణి చంపగల శక్తి ఆయుధాన్ని తీసుకున్నాడు. అంటే, ఈ విషయంలో మోస పోయింది కర్ణుడు కాదు, ఇంద్రుడే అనేది తేటతెల్లమవుతుంది. ఈ దానం సందర్భంలో, కర్ణుడు అంతటి చాకచక్యం చూపించాడు.

ఇక భీష్ముడు తన తండ్రి కోసం, రాజ్యాన్ని వదులుకున్నాడు. తండ్రి కోసం ఆయన చేసిన త్యాగమది. ఇక్కడ చెప్పుకోవలసిన విషయం, ఆ రాజ్యం భీష్ముడి స్వంతం కాదు, స్వార్జితమూ కాదు. అప్పటికి ఇంకా భీష్ముడు రాజు కాలేదు. యువరాజు మాత్రమే. ఆ రాజ్యం అప్పటికీ ఆయన తండ్రి అయిన శంతనుడిదే. శంతనుడి రాజ్యాన్ని శంతనుడికే వదిలేశాడు. ఒక విధంగా ఆ త్యాగం అసంపూర్ణం. అతను రాజ్యాన్ని వదిలేసి, దానికి ప్రతిఫలంగా, తాను కోరుకున్నప్పుడే మరణించే వరాన్ని పొందాడు. అంటే, ఈయనా తన త్యాగానికి ఫలితాన్ని పొందాడు. పైగా, సత్యవతి కుమారులు పెరిగి పెద్దయ్యే వరకూ, సుమారు 25 సంవత్సరాలు మకుటం లేని మహారాజుగా, రాజ్యపాలన చేశాడు. అనంతర కాలంలోనూ, చివరి వరకూ బ్రహ్మాండమైన రాజభోగాలను కూడా అనుభవించాడు.

ఈ విధంగా కర్ణుడూ, భీష్ముడూ, తగిన ప్రతిఫలాలను పొందడం వలన, వారి చర్యల్లో చెప్పుకునేంత గొప్పదనం ఏమీ మిగలదు. వీరిద్దరికంటే గొప్ప దాతగా, త్యాగశీలిగా, ధర్మరాజును చెప్పుకోవచ్చు. ఎందుకంటే, అరణ్యవాస కాలంలో, తమకే తిండి తిప్పలు కరువైన రోజుల్లో కూడా, తమనే నమ్ముకుని, తమతోబాటు అరణ్యాలకు వచ్చిన వేలాది మంది అమాయక ప్రజల కోసం, సూర్యునికై తపస్సుజేసి, అక్షయపాత్రను సంపాదించి, ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా, వేలాది మందికి ప్రతిరోజూ అన్నదానాలు చేశాడు. ఎక్కడో హిమాలయాలకు వెళ్లి, అక్కడ భూమిలో నిక్షిప్తమైవున్న నిధులను స్వయంగా సాధించుకు తెచ్చి, అశ్వమేధ యాగ సమయంలో వేలాది మందికి, వారు కోరినంత, స్వార్జితమైన బంగారాన్ని దానం చేసిన ధర్మరాజు, కర్ణ భీష్ముల కంటే గొప్పవాడని నిరూపితమవుతుంది.

కర్ణుడిలో కొంత దానగుణం తప్ప, ఇక ఏ ఇతర మంచి గుణాలూ లేవు. అందుకే వ్యాసభగవానుడూ, తిక్కన, కర్ణుడిని దుష్టచతుష్టయంలో చేర్చారు. అంగరాజ్యమిచ్చి దుర్యోధనుడు ఆదరించాడనే విశ్వాసంతోనే, దుష్టకార్యాలు చేశాడని కొందరు భ్రమపడుతుంటారు. కానీ అది నిజం కాదు. అంత విశ్వాసం వుంటే, పంతాలకు పోయి, కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళకుండా, పది రోజుల పాటు దుర్యోధనుణ్ణి వదిలేస్తాడా? అంటే, దుర్యోధనుడికంటే, అతనికి తన స్వంత పంతాలే ముఖ్యం. అంతేగాక, కర్ణుడు అసూయ, మోసం, ద్వేషం, అన్నీ మెండుగా కలిగివున్న వాడు. అతడు పరశురాముడి వద్ద విద్య నేర్చుకున్నదే, మోసంతో. మొట్టమొదట కురు పాండవ యుద్ధవిద్యా ప్రదర్శనలో, తానూ పాల్గొనాలని వచ్చాడు. కానీ, అతడు క్షత్రియుడు కాదని కొందరు అభ్యంతరం వెలిబుచ్చారు. ఆ సమయంలో అర్జునుడు గొప్ప అస్త్ర నిధిగా పొగడబడుతున్నాడు. అదే, కర్ణుని అసూయకు నాంది. దుర్యోధనుడి పుణ్యమా అని ఆ అస్త్ర విద్యా ప్రదర్శనలో పాల్గొన్నాడు. అయితే, కౌరవులు తప్ప అతడిని అర్జునుడి కన్నా మిన్న అని అక్కడ ఎవ్వరూ పొగడలేదు. అందుకే ఏనాటికైనా అర్జునుణ్ణి ఓడించాలని అనుకున్నాడు. కానీ, ద్రౌపదీ స్వయంవరం, ఘోష యాత్ర, ఉత్తర గోగ్రహణం లాంటి సంఘటనలు తీసుకుంటే, అనేకసార్లు అర్జునుడి ముందు ఓడిపోయాడు. అందుకే భూమిపై తానో, అర్జునుడో, ఎవరో ఒక్కరే వుండాలని నిర్ణయించుకుని, అర్జునుడి పై పగబట్టాడు.

నిజం చెప్పాలంటే, అర్జునుడేమీ కర్ణుని అంతగా అవమానించిన సందర్భం లేదు. అస్త్ర విద్యా ప్రదర్శన నాడు కూడా, కర్ణుని భీముడే అవమానించి మాట్లాడాడు. దుర్యోధనుడికి ముఖ్య శత్రువు భీముడు. స్నేహితుని శత్రువు గనుక, పగబడితే భీముడిపై పగబట్టాలి కర్ణుడు. కానీ, అర్జునుడిపై పగబట్టింది, కేవలం అసూయ వల్లనే. అందుకే పాండవులలో ఎవరు దొరికినా చంపను, అర్జునుడిని మాత్రం వదలనన్నాడు కుంతీ దేవితో. అర్జునుడిని చంపడానికి నాగాస్త్రం సంపాదించాడు. ఇంద్ర 'శక్తి' ఆయుధం తీసుకున్నాడు. యుద్ధంలో అర్జునుడు అలసిపోయే వరకూ, 10 రోజుల పాటు తాను విశ్రాంతి తీసుకుని, కురుక్షేత్రానికి వచ్చాడు. అతని గురి కేవలం అర్జునుడే..

కర్ణుడి జన్మ రహస్యం ధర్మరాజుకు తెలిస్తే, ఆయన తనకున్నదంతా కర్ణుడికే ఇచ్చేసే వాడు. అలా జరిగితే, పాండవులంతా అతని అనుచరులుగా వుండేవారు. కానీ, కర్ణుడికి కావలసింది, భ్రాతృ ప్రేమో, మాతృ ప్రేమో కాదు. పెద్దన్నయ్యగా గౌరవాదులూ కాదు. అర్జునుడిని ఓడించాలి. తానే గొప్ప వీరుడిగా కీర్తించబడాలి. అందుకు అర్జునుడిని చంపేయాలి. పాండవులతో కలసి జీవిస్తే, తన అసూయా పూరిత దుష్టాశయం నెరవేరదు కాబట్టి, అతడు ఆజన్మాంతం పాండవ విరోధిగానే మిగిలిపోయాడు.

ఇక కర్ణుడి దానశీలతను ఆసరాగా తీసుకుని, ఇంద్రుడు అతని కవచకుండలాలను కాజేశాడనీ, కురుక్షేత్రంలో కర్ణుడిని శల్యుడు తన మాటలతో కుంచింపచేశాడనీ, రధచక్రం భూమిలో క్రుంగిన సమయంలో, అర్జునుడు అతడిని చంపేశాడనీ, ఇటువంటి ఘటనలు జరిగివుండకపోతే, కర్ణుడి చేతిలో అర్జునుడు ఓడిపోయే వాడనీ కొందరు అంటూ ఉంటారు. మరి ఆ విషయాలలోకి వెళితే.. ఏ విధంగా చూసినా, అర్జునుడి వీరత్వం ముందు, కర్ణుడు దిగదుడుపే. ఇందులో ఎంత మాత్రం సందేహం లేదు. అయితే, ఈ కలియుగంలో కలి ప్రభావంచేతనో ఏమోగానీ, ఈ మధ్య విలన్స్‌కి అభిమానులు పెరుగుతున్నారు. అంతటితో ఆగకుండా, డబ్బున్న మారాజులు కొందరు విలన్స్‌ను గొప్పవారిగానూ, ధర్మపరులను అల్పులు గానూ చిత్రించి, సినిమాలూ, టి.వి. సీరియల్స్‌ తీసి ప్రదర్శిస్తున్నారు. ఆ పుక్కిటి కథలనే నిజమని నమ్మడం వల్లే, ఇటువంటి సందేహాలు పుట్టుకొస్తున్నాయి.

‘రావణుడు రాముడికన్నా మిన్న’ అంటాడు ఒకడు. ‘ద్రౌపది, మనస్సులో కర్ణుడిని కామించింద’ని అంటాడు ఇంకొకడు. ‘ధర్మరాజుకు రాజ్య పిపాస హెచ్చ’ని అంటాడు మరొకడు. ‘కీచకుడు మంచివాడే.. అతడిని రెచ్చగొట్టింది ద్రౌపదే’ అని వేరొకడంటాడు. కీచకుడిపై గెలవలేక, భీముడు రహస్యంగా దాచుకున్న కత్తితో పొడిచి చంపేశాడనీ, ద్రౌపదీ స్వయంవరంలో కర్ణుడే మత్స్య యంత్రాన్ని కొట్టేసేవాడు కానీ, ద్రౌపదే అతడిని కించ పరచి, పోటీలో పాల్గొన నీయలేదనీ, అసలు మత్స్య యంత్రాన్ని జరాసంధుడు కొట్టేసేవాడు కానీ, ద్రౌపది అతడిని వేడుకుని, బ్రతిమాలి, పోటీ నుండి తప్పించిందనీ, ఇలా ఎన్నెన్నో.. ఇవన్నీ మన సినిమాలలో, టి.వి. సీరియల్స్‌లోని మాయా జాలాలు. ఈ సంఘటనలేవీ, కృతికర్త వ్యాసుల వారు చెప్పినవి కావు. కర్ణుడు వీరుడే.. కానీ అర్జునుడితో ఏ మాత్రం సరిసమానుడు కాడు. ద్రౌపదీ స్వయంవరంలో, కర్ణుడు అర్జునుడిచేత ఓడించబడ్డాడు. ఘోష యాత్రలో కర్ణుడిని ఓడించిన చిత్రరధుడు, అర్జునుడి చేతిలో ఓడి పోయిన వాడే. ఉత్తర గోగ్రహణంలో కర్ణుడిని పడగొట్టి, అతని తలపాగా కుచ్చును తీసుకు పోయాడు అర్జునుడు. కురుక్షేత్రంలో ఒకే రోజున అయిదు సార్లు భీముడి చేతిలో ఓడిపోయి, పారిపోయాడు కర్ణుడు. అభిమన్యుడి చేతిలో చావుదెబ్బలు తిని పారిపోయి, మరో ఐదుగురు దుర్మార్గులతో కలసివచ్చి, అన్యాయంగా అభిమన్యుణ్ణి చంపిన భీరువు కర్ణుడు. కర్ణుడి కుమారుణ్ణీ, సైంధవుణ్ణీ చంపుతానని చెప్పిమరీ, కర్ణుడి కళ్ళముందే వారిద్దరినీ చంపేశాడు అర్జునుడు. ఘటోత్కచుడి చేతిలో చావుదెబ్బలు తిని, గత్యంతరం లేక, తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం, అర్జునుణ్ణి చంపడానికి దాచుకున్న ఇంద్రశక్తిని ప్రయోగించి, ఘటోత్కచుణ్ణి తుదముట్టించిన భయస్థుడు కర్ణుడు. ఇదీ, కర్ణుడి వీరత్వం.

వేయి కవచాలు కలిగి ఉన్ననాడే, కృష్ణార్జునులు నరనారాయణుల రూపంలో కర్ణుడిని, అంటే సహస్ర కవచుడిని చావగొట్టి, 999 కవచాలను ఛేదించారు. చేసేది లేక పారిపోయాడు కర్ణుడు. ద్రౌపదీ స్వయంవరం, ఘోషయాత్ర, ఉత్తర గోగ్రహణం సమయాలలో, కర్ణుడికి చివరి కవచ కుండలాలున్నాయి. అయినా, అర్జునుడే గెలిచాడు. అందుకే ఆ కవచ కుండలాల శక్తి ఏ పాటిదో కర్ణుడికి అర్ధమై, ఇంద్రుడు అడిగిన వెంటనే వాటిని ఇచ్చేసి, బదులుగా, అర్జునుడిని చంపగల శక్తి ఆయుధాన్ని తీసుకున్నాడు, దాన కర్ణుడు. ఇక శల్యుడు తన మాటలతో కర్ణుడి మనస్సు పాడు చేయటం సంగతి ఎలావున్నా, ఒక సంఘటనలో, కర్ణుడి ప్రాణాలను రక్షించాడు శల్యుడు. కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజున, కర్ణుడు ధర్మరాజును దూషించిన విషయం తెలుసుకున్న భీముడు వెళ్ళి, కర్ణుడితో యుద్ధం చేసి ఓడించి, మూర్చబోయేటట్లుజేశాడు. అన్నగారిని తిట్టిన నాలుకను కోసి పారేస్తానని ముందుకురికాడు, భీముడు. అప్పుడు శల్యుడు భీముణ్ణి శాంతపరచి, మూర్చలో వున్న వారి నాలుక కోయడం తగదని నచ్చజెప్పి, కర్ణుడిని రక్షించాడు.

ఇక రధ చక్రం కృంగి పోయినప్పటి సంగతికొస్తే, చక్రాన్ని కర్ణుడు ఎత్తుతుండగా అర్జునుడు అతన్ని చంపడం వాస్తవం కాదు. క్రుంగిన రధ చక్రాన్ని ఎత్తడానికి ఎంత ప్రయత్నించినా రాకపోవటంతో, శాపవశాన ఆ చక్రం ఇక రాదనీ, మరో రధం తెచ్చుకున్నా, అదే గతి పడుతుందనీ తెలుసుకున్న కర్ణుడు, ఆ పై ఇక నేలపై నిలబడే యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలోనే కర్ణుడు మరణించాడు. ఇక్కడ అర్జునుడు రధంపైనా, కర్ణుడు నేలపైనా వున్నందువల్లనే, కర్ణుడు ఓడిపోయాడని అనుకోవడం సరికాదు. ఎందుకంటే, అదే కర్ణుడిని ఓడించిన చిత్రరధుడు రధంపై వుండి యుద్ధం చేయగా, నేలపై నిలబడి పోరాడిన అర్జునుడే గెలిచాడు. అందువల్ల మనం గమనించవలసింది, శాపాలు వగైరాలు లేకపోయినా, కర్ణుడు అర్జునుడిపై గెలవగలగడం అసంభవం.

🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...