Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Friday, April 5, 2024

'8-4-2024' వ తారీకు సోమవారం రోజున, 'సోమావతీ అమావాస్య'.. Somavathi Amavasya 2024


'8-4-2024' వ తారీకు సోమవారం రోజున, 'సోమావతీ అమావాస్య'..  @mplanetleaf  

అమ్మాయికి, లేక అబ్బాయికి పెళ్లి సంబంధం కుదరడం ఆలస్యం అవుతున్న వారికీ, నిరుద్యోగులైన వారికీ శివుడు అందించిన అద్భుత అవకాశం 'సోమావతీ అమావాస్య'. సోమావతీ అమావాస్య రోజున ఈ చిన్ని పరిహారం చేస్తే, శివానుగ్రహంతో సమస్త శుభములనూ సమకూర్చుకో గలరు..

సోమవతీ అమావాస్య రోజున ఏం చేయాలి? శివుడికి సోమవారం అంటే చాలా ప్రీతికరం అన్న విషయం అందరికీ తెలిసిందే. అమావాస్య కలసి వచ్చే సోమవారమే ‘సోమవతీ అమావాస్య’. దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే! తన అల్లుడైన శివుడిని అవమానించేందుకే, దక్షుడు ఆ యజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకు చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా, శివుడి భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా, దక్షుడు ఆమెను కూడా అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి, తనను తాను దహించివేసుకున్నది.

సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రుడై, తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించాడు. ప్రమథ గణాలతో పాటుగా, ఆ వీరభద్రుడు దక్షుడి మీద దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చావ చితక బాదాడు. శివ గణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో, చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడే అయినా, శివుడిని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు, తగిన శాస్తిని అనుభవించాడు.

నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు, ఆ బాధలకు తాళలేక పోయాడు. తనకు ఉపశమనం కలిగించమని వెళ్లి, ఆ పరమేశ్వరుడిని వేడుకున్నాడు. చంద్రుడి బాధను చూసిన భోళాశంకరుని మనస్సు కరిగి, రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నదనీ, ఆ రోజున తనకు అభిషేకం చేస్తే, చంద్రుడు ఆరోగ్యవంతుడవుతాడనీ అభయమిచ్చాడు.

శివుడి సూచన మేరకు చంద్రుడు, సోమవారం, అమావాస్య కలిసిన రోజున శివుడికి అభిషేకం చేసి, తన బాధల నుంచి విముక్తుడు అయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని, ‘సోమవతీ అమావాస్య’ పేరుతో పిలవడం జరుగుతోంది.

ఈ పూజ పంచారామాలలో కానీ, రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందంటారు. ఏదీ కుదరని వారు, కనీసం శివపంచాక్షరీ మంత్రమైన 'ఓం నమః శివాయ' జపంతో అయినా ఆ రోజును గడపమని చెబుతారు.

సోమావతీ అమావాస్య రోజున చేయవలసిన పనులు: తులసి చెట్టుకు తెల్లవారు జామున నీరు పోసి, నుదుటిపై తులసి మట్టితో తిలకం పెట్టుకోవాలి. సాయంత్రం తులసి పూజ చేసి, నేతి దీపం వెలిగించాలి. సోమవారం రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఆ సమయంలో శివాభిషేకం చేసి, పూర్తి ఫలితాన్ని పొందగలరు.

సోమావతీ వ్రతాన్ని పాటించే భక్తులు, ఆ నాడు శివాభిషేక అనంతరం, రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. అనంతరం సోమావతీ అమావాస్య కథను చదువుకోవాలి.

వీలైన వారు, కార్తీక సోమవారం రోజున పాటించే విధంగానే ఉపవాసాన్ని పాటించాలి. ఉపవాసం చేసే వారు, సంధ్యా దీపం అనంతరం, సోమావతీ అమావాస్య కథను చదువుకోవాలి.

సోమావతీ అమావాస్య రోజున నిరుద్యోగులు ఈ పరిహారం చేస్తే, త్వరలోనే మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఉదయాన్నే ఒక నిమ్మకాయను బాగా శుభ్రం చేసి, ఇంట్లోని పూజా గదిలో వ్రేలాడదీయాలి. రాత్రి ఆ నిమ్మకాయను నిరుద్యోగి తలపై నుంచి ఏడుసార్లు దిష్టి తీసి, నాలుగు ముక్కలుగా కట్ చేసి ఒక్కో దిక్కులో పడవేయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది.

సోమావతీ అమావాస్య కథ: పూర్వం ఒక వర్తక వ్యాపారి ఇంటికి ఒక సాధువు వచ్చేవాడు. ఆ వ్యాపారికి వివాహితులైన ఏడుగురు కుమారులు, పెళ్లికాని ఒక కుమార్తె ఉంది. ఒక రోజు ఆ కుమార్తెను సాధువు చూసి కూడా దీవించకుండా వెళ్ళిపోయాడు. దీనికి వారు చాలా బాధ పడ్డారు. ఈ విషయమై ఒక పురోహితుడి దగ్గరకు వెళ్లి, తమ కుమార్తె జాతకాన్ని చూపించింది ఆ వర్తకుని భార్య. అది చూసిన పురోహితుడు, ఆమెకు పెళ్లైన వెంటనే భర్త చనిపోతాడని చెప్పాడు. వారు బాధపడి, దానికి ఎలాంటి పరిష్కారమూ లేదా? అని అడిగారు. అప్పుడు పురోహితుడు, సింఘాల్ ప్రాంతానికి వెళ్లి, అక్కడ ఒక చాకలి స్త్రీని కుంకుమ అడిగి నుదుటన పెట్టుకుంటే దోషం పోతుందని చెప్పాడు. మర్నాడు వ్యాపారి కుమారుల్లో చిన్నవాడు, తన తల్లి ఆజ్ఞానుసారం, తన సోదరిని తీసుకుని ఆ ప్రాంతానికి బయలుదేరాడు.

వారలా వెళ్తుండగా, మార్గ మధ్యంలో ఒక నదిని దాటవలసి వచ్చింది. ఆ నదిని ఎలా దాటాలా అని ఆలోచిస్తూ, ఆ చెట్టు క్రిందే విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే చెట్టుపైన ఒక రాబందు గూడు కట్టుకుని ఉంటోంది. రాబందుల జంట లేని సమయంలో ఒక పాము వచ్చి, రాబందు పిల్లలను తినటం పరిపాటి. ఈ సారి కూడా అలా పాము ప్రయత్నించడం చూసిన ఈ అమ్మాయి, ఆ పామును చంపేసింది. ఆ రాబందుల జంట, తమ పిల్లలను కాపాడినందుకుగాను, వారు నదిని దాటడానికి సహాయం చేశాయి. తరువాత అన్నాచెల్లెళ్ళిద్దరూ సింఘాల్ ప్రాంతానికి వెళ్ళి, చాకలి స్త్రీకి కొన్ని నెలలపాటు సేవ చేయగా, సోమావతీ అమావాస్య రోజునే, ఈ కన్య నుదుటన ఆమె కుంకుమ దిద్దింది.

ఆమె వెంటనే రావిచెట్టు దగ్గరికు వెళ్లి, 108 ప్రదక్షిణలు చేసింది. అంతటితో ఆమె జాతక దోషం తొలగిపోయింది. ఇదీ సోమావతీ అమావాస్య కథ. అంతేగాకుండా, సోమావతీ అమావాస్య రోజున, పూర్వీకుల కోసం దానం చేస్తే, కోపంతో ఉన్న పూర్వీకులు కూడా సంతోషించి, తమ సంతతి పురోగతికై దీవిస్తారు. ఈ రోజున పిండప్రదానం చేయడం వల్ల వాళ్ళు సంతృప్తి చెందుతారనీ, తద్వారా మనకు మంచి చేస్తారనీ విశ్వాసం. ఈ రోజున వివాహితులూ, అవివాహితులూ రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయడం ద్వారా, కోరిన కోరికలు తీరుతాయి. ఈ రోజు శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణునీ, పార్వతీ పరమేశ్వరులనూ, పితృదేవతలనూ పూజించాలి.

ఈ విశేషమైన సోమావతీ అమావాస్య వివరాలను వీలైనంత ఎక్కువ మంది హిందువులకు చేరేలా షేర్ చేయవలసిందిగా ప్రార్థన 🙏

Monday, April 1, 2024

గరుడ పురాణం ప్రకారం ఈ తప్పులకు ఎటువంటి శిక్షలు? Garuda Puranam


సంతప్తక బ్రాహ్మణుడు - పంచ ప్రేతాల గాధ! TELUGU VOICE
గరుడ పురాణం ప్రకారం ఈ తప్పులకు ఎటువంటి శిక్షలు?

మనిషి జీవన గమనంలో ఇటువంటి తప్పులు చేస్తే, వాటికి శిక్షలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసుకుని, సన్మార్గంలో నడుచుకోవాలనే ఉద్దేశ్యంతో, గరుడుడికి శ్రీ మహావిష్ణువు చెప్పిన అమృత వాకులను, అష్టాదశ పురాణాలలో ఒకటైన ‘గరుడ పురాణం’ పేరిట మనకు అందించారు, కృతికర్త అయిన వ్యాస భగవానుడు. ఇక అందులోని ఏడవ అధ్యాయంలో నిక్షిప్తమైవున్న ‘సంతప్తక బ్రాహ్మణుడు - పంచ ప్రేతాల గాధ’లోకి వెళితే..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/gPM542QYpBA ]


విష్ణు మహిమ విస్తారంగా కనిపించే కథను వినాలని వుందని గరుత్మంతుడు వేడుకోగా, ఆతనిని అనుగ్రహించి ఇలా చెప్పసాగాడు శ్రీ మహావిష్ణువు.. “గరుత్మంతా! పూర్వకాలంలో సంతప్తకుడనే తపోధనుడైన బ్రాహ్మణుడొకాయన వుండేవాడు. ఆయన తన తపోబలం వల్ల, పాపరహితుడయ్యాడు. ఈ ‘సంసారం’ పేరులోనే గానీ, తత్త్వంలో సారం లేనిదని తెలుసుకుని, అడవులలోకి పోయి, వైఖానస మునుల వృత్తినే తానూ పాలిస్తూ, అరణ్యంలోనే చరిస్తుండే వాడు. బాహ్య చిత్తవృత్తులను అదుపులో పెట్టుకుని, తద్ద్వారా ఇంద్రియాలపై విజయం సాధించే ఉద్దేశ్యంతో, తీర్థయాత్రలకు బయలు దేరాడు. కానీ, మధ్యలో దారి తప్పి, ఒక చీమలు దూరని, కాకులు కూడా దారి తప్పితే ఇక పట్టుకోలేని మహారణ్యంలోకి వెళ్ళిపోయాడు. నలువైపులా బ్రహ్మాండంగా పెరిగిన చెట్లూ, లతలూ, పొదలూ, అతనికి దారీ తెన్నూ తోచనివ్వలేదు. సాధు, క్రూర జంతువులూ, పక్షులూ, రాక్షస పిశాచ గణాలూ మాత్రమే వున్నాయక్కడ. నరసంచారమనేదే  లేదు.
సంతప్తునికి భయమనిపించ లేదు కానీ, ఎటూ దిక్కు తోచలేదు. కానున్నది కాక మానదు కదా! ఏదో ఒకటి జరుగుతుందిలే అనుకుంటూ, ఒకవైపు సూటిగా సాగిపోయాడు. కొంతసేపటికి కీచురాళ్ళ అరుపులు కర్ణకఠోరంగానూ, గూడ్లగూబల ధూత్‌కారాలు భయంకరంగానూ వినిపించ సాగాయి. అయినా ఆగలేదతను. కానీ, ఒక చోట ఒక జుగుప్పాకర దృశ్యాన్ని చూసి, నిలబడిపోయాడు. అడుగు ముందుకు పడలేదు.

అక్కడొక మర్రి చెట్టుకి కట్టబడి, వ్రేలాడుతూ వున్నదొక శవం. దానిని అయిదు ప్రేతాత్మలు పీక్కు తింటున్నాయి. ప్రతి ప్రేతమూ చూడడానికి చాలా భయంకరంగా వుంది. ముఖం మీద తప్ప, ఇంకెక్కడా మాంసం లేదు. చేతులు, కాళ్ళు, అన్ని అంగాలూ, ఎముకల మీద చర్మం కప్పినట్లున్నాయి. ముఖంలో కళ్ళు లేవు; వాటికి బదులు రెండు రంధ్రాలున్నాయి. ముక్కుఅసలే లేదు. నెత్తిపై జుట్టు లేదు. అలాగని, కోతిలా చూడగానే నవ్వు పుట్టించేలా కాకుండా, భయంతో గుండెలవిసిపోయేలా వున్నాయవి. బ్రాహ్మణుడు వాటిని చూసి భయంతో మ్రాన్పడిపోగా, అవి మాత్రం ఆయనను చూడగానే పిచ్చి ఆనందంతో గంతులేస్తూ, మంచి ఆహారం దొరికిందని సంబరపడిపోతూ, ఆయన వైపు పరుగు దీశాయి. కాళ్ళను రెండు ప్రేతాలూ, చేతులను రెండు ప్రేతాలూ పట్టుకోగా, అయిదవది ఆయన తలను పట్టుకుంది. అవన్నీ భయంకరంగా అరుస్తూ, అలా పట్టుకునే గాలిలోకి లేచాయి. అంతవరకూ తింటున్న శవంలో ఇంకా మాంసం వుండిపోవడంతో, దానిని కాళ్ళలో ఇరికించుకుంటూ ఎగిరాయి.

అప్పుడు భయార్తుడైన సంతప్త బ్రాహ్మణుడు, విష్ణుదేవునిలా ప్రార్ధిస్తూ, తన రక్షణకై పిలువనారంభించాడు. ‘ఆపద్రక్షకా! జగన్నాయకా! నాకు నీవే శరణు. నన్ను కాపాడు. దేవాధిదేవా, చిన్మయా, సుదర్శన చక్రధారీ, హరీ! నన్ను కాపాడు. ఖగరాజారూఢుడై, మొసలి నోట చిక్కిన ఏనుగును తన చక్రం ద్వారా రక్షించిన సామజవరగమనుడు, నా కర్మ పాశాలను కూడా ఆ మొసలి తల వలెనే ఖండించి, నన్ను ముక్తుని చేయాలి గాక! రమారమి వందమంది నిర్దోషులైన రాజకుమారులను కారాగారంలో బంధించి బలిచ్చుటకు సిద్ధపడిన, కర్కోటక లోకకంటక జరాసంధుని, ధర్మజ రాజసూయ మిషచే చంపించి, లోకకల్యాణాన్ని గావించిన శ్రీకృష్ణపరమాత్మ, ఆ రాకుమారుల వలెనే, నాకునూ విడుదలను ప్రసాదించాలి గాక!’ అంటూ, మరెన్నో విధాల నా అవతారతత్త్వాన్ని కీర్తిస్తూ, ఆర్తితో అరుస్తూ, నన్నే రమ్మని పిలచిన ఆ తపస్సంపన్నునిపై ప్రేమతో కూడిన జాలి కలుగగా, నేను స్వయంగా బయలుదేరాను.

నేనా దరిదాపులకు చేరగానే, అతనిలోని ఏ తపశ్శక్తి ఆ విషయాన్నతనికి చేరవేసిందోగానీ, అతడు భయాన్ని వదిలేసి, ఆ ప్రేతాల మూపులపై పల్లకీలో రాజులాగా సుఖంగా నిద్రిస్తున్నట్లయినాడు. నేనా గుంపు వెనుకే కాసేపు వెళ్ళగా, అక్కడ మణిభద్రుడనే యక్షరాజు కనిపించాడు. నేనతనికి ఆ ప్రేతాల సంగతేదో చూడమని కనుసైగ చేశాను. వెంటనే అతడా భయంకర ప్రేతాలకే దుఃఖాన్నీ భయాన్నీ కలిగించే ప్రేతరూపాన్ని ధరించి, వాటి కనులు కలవర పడేలా, గుండె గుభిల్లుమనేలా, పెద్ద భుజాలతో, బుసలు కొడుతున్న తాచు పామంత నాలుకతో, ఉచ్చ్వాస నిశ్వాసాలను, అవి భయంతో కంపించేలా తీసుకుంటూ, ముందు వాటి యెదుట నిశ్చలంగా నిలబడ్డాడు. ఆ ప్రేతాలు భయం నుండి తేరుకునేలోగానే, రెండింటిని చేతులతో, రెండింటిని కాళ్ళతో, ఒక ప్రేతాన్ని నోటితో ఒడిసి పట్టి, భయంకరమైన పిడి గుద్దులతో వాటి ఒళ్ళు హూనం చేశాడు. వారి చేతుల నుండి బ్రాహ్మణుని విడిపించి, శవాన్ని పట్టుకుని, ఆ మణిభద్ర యక్షుడు మాయమైపోయాడు. మణిభద్రుని శిక్షతో, నా యొక్క దయతో, ప్రేతాల పాపాలు నశించి, బ్రాహ్మణునికి ఎదురుగా మోకరిల్లి, ఇలా అన్నాయి. 'హే విప్రదేవా! మమ్మల్ని క్షమించండి' అంటూ, ఆయనకు చేతులు జోడించి ప్రదక్షిణ చేసి, మరల క్షమించమని కోరారు. దీనికి కారణం, బ్రాహ్మణ దర్శనం, శ్రీహరి కరుణ, యక్షస్పర్శల వల్ల, వారికి పూర్వ స్మృతి కలగడమే. వారి దీన వదనాలనూ, మరింత దీనాలాపనలనూ చూసి మనస్సు కరిగిన బ్రాహ్మణుడు, వారినిలా అడిగాడు: “బాబూ! ఎవరు మీరు? ఇదంతా ఏమిటి? ఏదైనా మాయా లేక నా చిత్త భ్రమా?

అప్పుడు ప్రేతాలు, “స్వామీ! ఇది మాయా కాదు, భ్రమా కాదు. మేము ప్రేతాలము. మా పూర్వ జన్మ దుష్కృతాల వల్ల, ఇలా మాకు ప్రేత యోని ప్రాప్తించింది.”

అది విన్న బ్రాహ్మణుడు, “ప్రేతాల్లారా! మీ పేర్లేమిటి? మీరేం చేస్తుంటారు? మీకీ దుర్దశ ఎలా ప్రాప్తించింది? నా పట్ల మీ ప్రవర్తనకీ, అందులోని మార్పుకూ కారణమేమిటి?” అని ప్రశ్నించాడు..

అందుకు ప్రేతాలు, “ద్విజోత్తమా! మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలిస్తాము. మా పేర్లు పర్యుషిత, సూచీముఖ, శీఘ్రగ, రోధక, లేఖకులు. సామాన్య మానవులే అనుకుని, మిమ్మల్ని పట్టుకున్నాము. మీరు యోగిరాజనీ, విష్ణుభక్తులనీ తెలిశాక, పూజిస్తున్నాము. మీ స్పర్శ మాత్రాననే, మా పాపాలన్నీ ఎగిరి పోయాయి”

“మీ నామధేయాలు విచిత్రంగా వినిపిస్తున్నాయి. ఇవి అర్ధం లేనివని నాకనిపించడం లేదు. మీరు నాకు విస్తారంగా మీ గురించి వివరించండి”అని బ్రాహ్మణుడాదేశించగానే, ఆ ప్రేతాలు ఒకటొకటిగా ఇలా చెప్పసాగాయి.

“బ్రాహ్మణోత్తమా! ఒకమారు నేను శ్రాద్ధం పెట్టవలసి వచ్చినపుడు, ఒక బ్రాహ్మణుని నియమించుకున్నాను. ఆ వృద్ధ బ్రాహ్మణుడు నడవలేక నడుస్తూ, బాగా ఆలస్యంగా వచ్చాడు. నేను ఆకలికి తాళలేక, శ్రాద్ధ కర్మ చేయకుండానే, ఆ శాకపాకాలను తినేశాను. బ్రాహ్మణునికి పర్యుషిత అంటే పాచిపోయిన అన్నాన్ని ఎక్కడి నుండో తెప్పించి మరీ పెట్టాను. నేనిలా దుష్ట ప్రేతాన్ని కావడానికీ, నా పేరు పర్యుషితుడు కావడానికి కారణం అదే.

“బ్రాహ్మణ దేవతా! నా పేరు సూచీముఖుడు. ఒకనాడొక బ్రాహ్మణి, తీర్ధస్నానానికై భద్రవట తీరానికి వచ్చింది. ఆమెతో ఆమె అయిదేళ్ళ కొడుకున్నాడు. ఆమె అతనినే చూసుకుని జీవిస్తున్నట్లుంది. నేనప్పుడు క్షత్రియ యువకునిగా జన్మించియున్నాను. అలవి మీరిన పొగరు, క్రూరత్వాలతో ప్రజలను హింసిస్తుండే వాడిని. నేనా బ్రాహ్మణీ, ఆమె పుత్రుల దారికాచి, అతని తలపై పిడికిటితో బాది, వారి సామానులన్నిటినీ లాగేసుకున్నాను. ఆ పసివాడు దాహమని ఏడుస్తుంటే, తల్లి అతనికొక చిన్న పాత్రతో నీళ్ళిచ్చింది. నేను పాత్రను దౌర్జన్యంగా లాగేసుకుని, ఖాళీ చేశాను. భయసంత్రస్తుడై, దాహవ్యాకులుడై, ఆ పిల్లవాడు అప్పుడే, అక్కడే మరణించాడు. అతని తల్లి ఆ గర్భశోకాన్ని తట్టుకోలేక, అక్కడే వున్న నూతిలో దూకి అసువులు బాసింది. ఆ మహా పాపం వల్ల నాకీ ప్రేతయోని ప్రాప్తించింది. పర్వతాకార శరీరుడనే కానీ, నాకు నోరు లేదు. కొంగలాగా సూది ముక్కుంది. నాకు ఆహారం దొరికినా, దానిని తినడానికి చాలాసేపు కష్టపడవలసి వస్తుంది. నేనా రోజు బ్రాహ్మణ బాలకుని నీరు తాగనివ్వకుండా చేసినందుకు, ఇలా అనుభవిస్తున్నాను. నా ఈ నోరు కలిసిన ముక్కు, నా పేరుని సూచీముఖుడిగా చేసింది.

“భూ సురేంద్రా! నా పేరు శీఘ్రగుడు. నేనొకప్పుడొక ధనవంతుడనైన వైశ్యుడను. ఆ జన్మలో నా మిత్రుడొకనితో కలసి, ఇతర దేశాలకు వ్యాపార నిమిత్తమై వెళ్ళాను. నేను కటిక పేదవానిని కాకపోయినా, నా మిత్రుని వద్ద అశేష ధనరాశులుండడంతో, నాలో లోభం, దాని వల్ల క్రౌర్యం పెరిగాయి. మేమిద్దరం వ్యాపారం చేసి, వెనుకకు మరలి వస్తున్నపుడు, దారిలో తగిలిన ఒక నదిని పడవ సహాయాన దాటుతుండగా, సూర్యుడస్తమించాడు. మసక చీకటిలో ప్రయాణీకులంతా ఎవరి గోలలో వారున్నారు. చాలామంది అలసట కారణంగా, కునుకు పాట్లు పడుతున్నారు. వారిలో నా మిత్రుడు కూడా వున్నాడు. అతడు నా తొడ మీదే తలపెట్టి, నిశ్చింతగా నిద్ర పోసాగాడు. నేనతనిని ప్రవాహంలోకి తోసేశాను. చీకటిలో అది ఎవరూ చూడలేదు. అతని వద్దనున్న బహుమూల్యప్రదాలైన రత్న ఖచిత స్వర్ణాభరణాలూ, ముత్యాలూ, బంగారు కాసులన్నింటినీ పట్టుకుని, మా వూరొచ్చేశాను. నా మిత్రుని పత్నితో, దారిదోపిడీ దొంగలు మాపై దాడి చేయగా, ఆమె భర్త దొరికిపోయాడనీ, వారతని సొత్తంతా దోచుకుని, అతనిని చంపేశారనీ చెప్పాను. నేను మరోదారంటా, తుప్పల వెంటా, నా సొమ్ముని పట్టుకుని పరుగెత్తి, ఏదో చావు తప్పి కన్నులొట్టబోయిన చందాన, ఇల్లు చేరానని చెప్పాను. నా జీవితాన్నంతటినీ ఆ పాపపు సొమ్ముతోనే గడిపాను. శీఘ్రంగా డబ్బు సంపాదనలో ముందుకెళ్ళానని, నన్ను శీఘ్రగుడన్నారు. కానీ, ఆ పాపానికి నాకిలా ప్రేతయోనిలో పుట్టుక వస్తుందని ఎవరూ ఎరుగరు కదా!”

“విప్రోత్తమా! నా పేరు రోధకుడు. నేను శూద్రజాతికి చెందినవాడను. రాజభవనం నుండి నాకొక వంద పెద్ద పెద్ద గ్రామాలపై అధికారం ఇవ్వబడింది. నా కుటుంబంలో వృద్ధులైన తల్లిదండ్రులూ, ఒక తమ్ముడు మాత్రమే ఉండేవారము. అయినా, లోభం కొద్దీ నా తమ్ముడిని వేరే కాపురం పెట్టుకొమ్మని తరిమేశాను. వాడికేమీ లేదు. అన్నవస్త్రాలు లేక అవస్థపడుతున్నాడని తెలిసి, నా తల్లిదండ్రులు రహస్యంగా నా గృహం నుండి అన్ని వస్తువులనూ పంపిస్తుండేవారు. నేనది విని అగ్గిరాముడనై పోయి, నా తల్లిదండ్రులను సంకెళ్ళతో బంధించి, ఒక గదిలో పడవేశాను. వారు అతి కష్టం మీద విడిపించుకుని, ఆత్మాభిమానం దెబ్బతిన్నదనే బాధతో, విషం మింగి మరణించారు. నా తమ్ముడు ఏమీ లేక, ఎక్కడెక్కడో తిరుగుతూ, ఏమైపోయాడో తెలియలేదు. వృద్ధులను బంధాలతో “రుద్ధం” చేశాను కాబట్టి, రోధకుడనే పేరు వచ్చి నిలిచింది. ఈ మహాపాపాల వల్ల, నేనిలా ప్రేత యోనిలో పడి వున్నాను”.

“హే విప్రదేవా! నన్ను లేఖకుడంటారు. పూర్వం ఉజ్జయినీ నగరంలో బ్రాహ్మణునిగా జన్మించాను. మా రాజు గారు నన్నొక బ్రహ్మాండమైన కోవెలకు పూజారిగా నియమించారు. ఆ గుడిలో విభిన్న నామాలతో ఎన్నో విగ్రహాలున్నాయి. స్వర్ణ నిర్మితములైన ఆ విగ్రహాలలో, అవసరమైన చోట పలు విలువైన రత్నాలు తాపడం చేయబడి వున్నాయి. వాటిని రోజూ పూజిస్తూ, పుణ్యాన్ని వెనకేసుకోవలసిన నేను, లోభ మోహాలచే, రాకాసి మనస్సు గలవాడనై, డబ్బు వెనకేసుకోవాలనే వాంఛ పుట్టి, మహా పాపినై పోయాను. బుద్ధి పాపాసక్తమై పోతే, బ్రాహ్మణుడైనా, పూజాధికారైనా ఒకటే, రాక్షసుడైనా, పిశాచమైనా ఒకటే. నేనొక సూదిగా, వాడిగా వున్న ఇనుప ఆయుధాన్ని చేపట్టి, ఆ విగ్రహాలకున్న బంగారాన్నీ, రత్నాలనూ పెకలించి దాచేసుకున్నాను. మరునాడు ఏమీ తెలియనివాడిలాగా, ఎప్పటిలాగే కోవెల తెరచి, గోల గోల పెట్టాను. రాజుగారు ఆ రూపుమాసిన విగ్రహాలను చూసి, ప్రజ్వలితాగ్ని వలే, క్రోధంతో రగిలిపోయారు. 'ఈ పని చేసిన దొంగనూ, దైవద్రోహినీ, వాడు బ్రాహ్మణుడైనా సరే, పట్టుకుని నేరాన్ని నిరూపించి, వాడిని నా చేతులతోనే చిత్రవధ చేసి చంపుతాను” అని దేవునియెదుట ప్రతిజ్ఞ చేశారు. ఆయన “బ్రాహ్మణుడైనా సరే” అనడంతో, నా మీద అనుమానమేదైనా కలిగిందేమో అన్న సంశయం నాకు కలిగి, రాత్రికి రాత్రే రాజమందిరంలోకి ప్రవేశించి, ప్రశాంతంగా నిద్రిస్తున్న రాజును చంపేశాను. అటునుంచటే, రత్నాలనూ బంగారాన్నీ పట్టుకుని పారిపోయాను. దాంతో భూదేవికి కూడా నా మీద అసహ్యం కలిగిందేమో.. అలా పారిపోతూ, దారి తప్పి, ఘోరారణ్యంలో దిగబడి, అక్కడొక ఆకలిగొన్న పులివాత పడి చనిపోయాను. కలం వంటి సాధనంతో మహా పాపం చేశాను కాబట్టి, నన్ను నరకంలో లేఖకుడని పిలిచారు. అక్కడ ఎనలేని బాధలను అనుభవించి, ఇలా ప్రేతయోనిలో పడ్డాను.”

ఇలా అయిదు ప్రేతాలూ, వినయంతో తమ పన్నాలను వినిపించగా, బ్రాహ్మణుడు జాలిపడ్డాడు. వారి ప్రస్తుత పరిస్థితిని గూర్చి అడుగగా, వారిలా చెప్పుకుని విలపించారు.

'ఓ ద్విజేంద్రా! ఎక్కడ వేదమార్గం అనుసరింపబడుతుందో, ఎక్కడ లజ్జ, ధర్మమూ, దమమూ, క్షమ, ధృతి, జ్ఞానమూ వుంటాయో, అక్కడ మేము ప్రవేశించలేము. శ్రాద్ధ తర్పణ కర్మలు చేయబడని గృహాలలో మేము నిరాటంకముగా దూరగలము. అక్కడి మనుషుల రక్తమాంసాలను వారికి తెలియకుండానే అపహరించి ఆరగిస్తాము. వారు ఏ జబ్బూ లేకుండానే నీరసించి పోతుంటారు. మా ఆహారం పరమ అసహ్యకరం. మలం దగ్గరనుండి శవం దాకా, అన్నీ తింటాము. మాకే సిగ్గనిపిస్తుంది. అయినా తప్పదు. మేము అజ్ఞానులం, తామసులం, మంద బుద్ధులం. ఏ మాత్రం దైవశక్తి అలికిడి విన్నా, భయంతో పారిపోయే పిరికి జనాలము. మాకీ ప్రేతజన్మ ఎప్పుడు పూర్తవుతుందా? అని ఎదురు చూస్తూ వుంటాము.”

ఓ గరుత్మంతా, అలా బ్రాహ్మణుడు వారి బాధలను వింటుండగానే, నేను అతనికి దర్శనమిచ్చాను. హృదయంలో నివసించే అంతర్యామిని, పురుష స్వరూపంలో సాక్షాత్కరించిన నన్ను చూడగనే, ఆ విప్రుడు నేలపై సాష్టాంగ పడి నమస్కరించి, స్తుతులతో నన్ను సంతుష్ట పరిచాడు. అతని దయ వల్ల, ఆ ప్రేతాలు కూడా నన్ను చూడగలిగాయి. “అన్ని రకాల ప్రాణులనూ కేవలం నీ దయతోనే, వారికి ఏ అర్హతా లేకపోయినా, నీవు ఉద్ధరించగలవు. మహాప్రభో! నీకు నమస్కారములు" అని పలుకుతున్న ఆ బ్రాహ్మణుని మనస్సు లోని కోరికను అర్థం చేసుకుని, నేను వారందరికీ ఉత్తమలోకాలను ప్రసాదించాను. నా ఇచ్చ మేరకు, అత్యంత తేజముగల, శ్రేష్ఠ ఆకాశగమనం చేయగల, గంధర్వ, అప్సర యుక్తములైన ఆరు విమానాలు అక్కడకు వచ్చి, ఆ బ్రాహ్మణునీ, పంచ ప్రేతాలనూ ఎక్కించుకుని, నా లోకానికి తీసుకుని పోయాయి” అని చెప్పాడు శ్రీ మహా విష్ణువు. (అధ్యాయం - 7)

ఓం నమో భగవతే వాసుదేవాయ!

Monday, March 25, 2024

రంగుల కేళి హోళీ విశిష్ఠత! Holi Festival 2024


మిత్రులూ, శ్రేయోభిలాషులందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు 💐 TELUGU VOICE

రంగుల కేళి హోళీ విశిష్ఠత! - https://youtu.be/X7RDDA-ApRw



Satyameva Jayate | సత్యమేవ జయతే! - ఒక మంచి కథ..


సత్యమేవ జయతే! - ఒక మంచి కథ.. TELUGU VOICE
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మరణానికి సిద్ధపడిన నంద ఎవరు?

మన పురాణాలు సన్మార్గ బోధకాలు. వీటిలో మనకు ఎన్నెన్నో మంచి కథలు కనిపిస్తాయి. ఒక కథకు మంచి కథ అనిపించుకోవడానికి, కచ్చితమైన లక్షణాలంటూ ఏమీ ఉండవు. ఎందుకంటే, ఏవి మంచి కథకు ఉండకూడని లక్షణాలని అనుకుంటామో, ఆ లక్షణాలతోటే మంచి కథ అనిపించుకునేవీ వస్తూనే ఉంటాయి. అలాగే, మంచి కథ లక్షణాలని మనం అనుకునేవన్నీ పొదుగుకునీ, నిరుత్సాహపరిచే కథలూ ఉంటాయి. మంచి కథ మొదలయ్యాక, ఏదో ఒక క్షణంలో పాఠకుణ్ణి ట్యూన్ చేసుకుని, తనలో లీనం చేసుకుంటుంది. అందుకు పాఠకుడి నేపద్యమూ, అనుభవాలు కూడా, అన్నిసార్లూ కారణం కాకపోవచ్చు. కథను అనుసరించే సమయంలో, మన మానసిక స్థితిగతులే అందుకు కారణం కావచ్చు. చిట్టచివరికి అది పాఠకుడు, లేక వీక్షకుడిపై కలిగించే స్పందనా, ప్రభావమే గీటురాళ్లు. అందరికీ సన్మార్గాన్ని బోధించే వ్యాస విరచిత అష్టాదశపురాణాలలో ఒకటైన ‘పద్మపురాణం’ లోని అటువంటి ఒక కథను ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. ఇదే కథను కొంత రూపాంతరంతో, పంచతంత్ర కథలలో కూడా మనం చూడవచ్చు. ఇక కథలోకి వెళితే..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/9omJY5UQwQ4 ]


పూర్వం సరస్వతీ నదీ తీరాన విస్తరించి ఉన్న రాజ్యాన్ని, ప్రభంజనుడనే రాజు పరిపాలిస్తూవున్నాడు. ఒక రోజు ఆయన వేట నిమిత్తం అరణ్యానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఒక లేడి తన పిల్లకు పాలిస్తూ ఉండటం, ఆయన చూశాడు. వెంటనే ప్రభంజనుడు ఆ లేడి మీద బాణ ప్రయోగం చేశాడు. మరణించే ముందు ఆ లేడి, “బాణ ప్రయోగం చేసిన రాజు పులిగా మారిపోవాలి!” అని శపించింది. ఆ శాపం తక్షణమే ఫలించి, రాజు పులి అయిపోయాడు. పులిగా మారిన రాజు తన అపరాధాన్ని మన్నించమని, ఆ లేడిని వేడుకున్నాడు. “నువ్వు నూరు సంవత్సరాలు పులిగా జీవిస్తూ, శాపాన్ని అనుభవిస్తావు. ఆ తరువాత నంద అనే గోవు కారణంగా, నీకు శాప విమోచనం కలుగుతుంది” అని చెప్పి, లేడి ప్రాణం విడిచింది.

పులిగా మారిన రాజు ప్రభంజనుడు, గతాన్ని పూర్తిగా మరచిపోయి, పులి సహజ నైజాన్ని సంతరించుకుని, ఆ అరణ్యంలో జీవించసాగాడు. తక్కిన జంతువులను చంపి ఆకలిని తీర్చుకుంటూ, కాలం వెళ్ళబుచ్చసాగాడు. ఇలా అనేక సంవత్సరాలు గడిచాయి. ఒకానొక రోజు ఆ పులి జీవిస్తూన్న అరణ్యానికి, పచ్చిక మేయడానికి ఒక ఆవులమంద వచ్చింది. అరణ్యంలో రోజంతా మేసిన గోవులు, సాయంత్రం తమ ఊరికి తిరిగి వెళ్ళ నారంభించాయి. ఆ మందలో నంద అనే గోవు కాస్త వెనుకబడింది. అదే సమయంలో వర్షం కురవడం ప్రారంభించడంతో, తక్కిన గోవులు నంద వెనుకబడటం గమనించక, తమ దారిన తాము వెళ్ళిపోయాయి. వాన కారణంగా ఒక చెట్టు క్రింద ఒదిగి ఉన్న నంద, తన స్థితిని గ్రహించుకుని, వేగంగా తమ ఊరికేసి పరుగెత్తసాగింది. అదే సమయంలో పులి తన పిల్లలకు మాంసం వెదుకుతూ, అటువైపు వచ్చింది. నందని గమనించగానే, మంచి మాంసాహారం లభిసోందని భావిస్తూ ఆ పులి, గోవును అడ్డగించింది. నంద మీదికి పంజా విసరడానికి సంసిద్ధమైంది.

నంద తన ప్రాణం గురించి దిగులు చెందలేదు. కానీ, గోకులంలో తన రాకకై ఆతృతగా ఎదురు చూసే తన దూడను తలచుకుని, దాని మనస్సు విలవిలలాడిపోయింది. తనను చంపబోతున్న పులితో, “అయ్యా, నా దూడ ఇప్పుడు గోకులంలో ఆకలితో అలమటిస్తూ ఉంటుంది. దానికి పాలివ్వడానికే నేను వేగంగా పోతున్నాను. నేను వెళ్ళి నా దూడకు పాలిచ్చి, దానిని నా గోనేస్తాలకు అప్పగించి తిరిగి వస్తాను. అప్పుడు మీ అభీష్టం ప్రకారం, నన్ను ఆహారంగా చేసుకోండి. నా దూడను చివరిసారిగా చూడాలనీ, దానికి నాలుగు హితవచనాలు చెప్పిరావాలనీ ఆశిస్తున్నాను. ప్రస్తుతం నా పట్ల కరుణ వహించి, నా దూడను చూసిరావడానికి అనుమతి ఇవ్వండి” అని వినయంగా వేడుకున్నది.

నంద వేడుకోలును మన్నించడానికి, పులి సిద్ధంగా లేదు. “ఇప్పుడు నిన్ను వెళ్ళడానికి అనుమతిస్తే, నువ్వు తిరిగి వస్తావని హామీ ఏమిటి? నేడు నువ్వు నాకు ఆహారం కావడం, విధి నిర్ణయం. నిన్ను నేనిప్పుడు చంపవలసిందే!” అని అన్నది. ఆ మాటలు విని నంద, “నేను మాట తప్పను. నన్ను నమ్మండి” అంటూ తాను కనుక మాట తప్పితే, ఫలానా ఫలానా పాపాలకు ఒడిగట్టిన దాన్నవుతానని, కొన్ని ఘోరపాపకృత్యాలను పేర్కొని, వాటిపై శపథం చేసింది.

సామాన్యంగా మనుషుల స్థితి వేరు. బహుశా పులిగా ఉన్నందున, నంద చెప్పినది విన్న ప్రభంజనుడి మనస్సు కరిగిందేమో. “సరే, నువ్వు చెబుతున్నది నమ్ముతున్నాను. కానీ, వెంటనే నీ దూడను చూసి తిరిగి వచ్చేయాలి! దానితోపాటు మరో విషయం కూడా గుర్తుంచుకో: ప్రాణం కాపాడుకోవడానికి అబద్ధమాడినా తప్పులేదని చెప్పి, పలువురు నీ మనస్సు మార్చాలని ప్రయత్నిస్తారు. వారి మాటలు పట్టించుకోకుండా, చేసిన వాగ్దానం ప్రకారం ఇక్కడకు వచ్చేయాలి” అని అన్నది పులి. “నేను ఎన్నటికీ మిమ్మల్ని వంచించను. ఇతరులను వంచించే వాడు, ఆత్మవంచన చేసుకున్న వాడే అవుతాడు” అని నంద జవాబు చెప్పి, పులి అనుమతితో గోకులానికి బయలుదేరింది.

అక్కడ గోకులంలో నంద కనిపించకపోవడంతో, దూడ ఆందోళనతో తల్లడిల్లిపోతున్నది. తల్లిని చూడగానే, ఆనందోత్సాహాలతో గంతులు వేసి, పాలు త్రాగనారంభించింది. కానీ, అలవాటు ప్రకారం ఆప్యాయంగా నాలుకతో తనను తడిమే తల్లి, ఆ నాడు శోకమయంగా ఉండటం చూసి, దూడ ఉత్సాహం నీరుగారింది. అది ఆతృతగా, “అమ్మా. ఎందుకు దిగులుగా ఉన్నావు? కారణం ఏమిటో నాకు చెప్పకూడదా?” అని నందను అడిగింది.

నంద కారణాన్ని వివరించింది. అది వినగానే దూడ రోదించింది. “అమ్మా! నేనూ నీతోనే వచ్చి, ఆ పులికి ఆహారమైపోతాను” అన్నది కృత నిశ్చయంతో. ఆ మాట వినగానే నంద మనస్సు చివుక్కుమన్నది. తనను తాను సంభాళించుకుని, మనస్సును దృఢ పరచుకుని, ప్రేమ ఉట్టిపడే స్వరంలో, బిడ్డకు హితోక్తులు చెప్పింది. తను లేని స్థితిలో దూడ తనను తాను ఎలా రక్షించుకోవాలో, ఎలా జీవించాలో, ఇతరులతో ఎలా మసలుకోవాలో వివరించి చెప్పి, దూడ మనస్సును సాంత్వన పరచింది. తరువాత నంద తన దూడను, తన తల్లి వద్దకు, నేస్తాల వద్దకు తోడ్కొని పోయింది. వారికి దూడను అప్పగించి, తను అరణ్యానికి వెళ్ళవలసిన అగత్యాన్ని తెలిపింది.
పులి భావించినట్లే, నంద తల్లీ, నేస్తాలూ ఇలా చెప్పాయి: “ప్రాణ రక్షణకై అబద్ధం చెప్పినప్పటికీ, అది సత్యమే అవుతుంది; ప్రాణం కోల్పోయేట్లు చేసే సత్యం, అబద్ధమే అవుతుంది” అని లోకం చాటి చెప్పే పలు న్యాయాలను, నందకు నొక్కివక్కాణించారు. “పులికి నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని భంగం చెయడంలో తప్పులేదు” అని నంద మీద, దాని దూడ మీద ఉన్న ప్రేమాభిమానాల కారణంగా వేడుకున్నాయి.

కానీ, తన తల్లీ, నేస్తాలూ నొక్కిచెప్పిన కార్యకారణాలనూ, న్యాయాలనూ నంద అంగీకరించలేదు. అది వాటితో ఇలా చెప్పింది: “ఇతరులను రక్షించడానికైతే అబద్ధం చెప్పవచ్చు. నా ప్రాణ రక్షణకోసం నేను ససేమిరా అబద్ధం ఆడను. ఎవరు చేసిన పాప పుణ్యాల ఫలితాన్ని, వారే అనుభవించి తీరాలి. స్వర్గం, మోక్షం, ధర్మం, అన్నీ మన వాక్కులను బట్టే ఉంటాయి. ఎవడు సత్యం పలుకడం విడనాడతాడో, అతడు మంగళకరమైన హితాలనన్నీ కోల్పోతాడు. మనస్సులో ఒకటి ఉంచుకుని, బైటకు మరో విధంగా మాట్లాడే వాడు, తన ఆత్మనే తస్కరించే దొంగ అవుతాడు.”

నంద దృఢనిశ్చయాన్ని ఎవరూ మార్చలేకపోయారు. తరువాత అది అందరి వద్దా సెలవు పుచ్చుకుని, అరణ్యంలోని పులి వద్దకు వెళ్ళింది. పులితో నంద, “నా కర్తవ్యాలను పూర్తి చేసుకున్నాను. ఇక మీరు నన్ను నిరాక్షేపణీయంగా ఆహారంగా చేసుకోవచ్చు” అన్నది నిర్లిప్తంగా. అదే సమయంలో దూడ కూడా అతివేగంగా అక్కడకు వచ్చి చేరింది. అది తన తల్లి ముందు నిలబడి, “నా తల్లిని చంపడంతో పాటు నన్నూ చంపి, మీ ఆకలి తీర్చుకోండి” అని పులి వైపు చూస్తూ చెప్పింది. నంద శిక్షణలో పెరిగిన ఆ దూడ, తల్లి సుగుణాలనన్నీ పుణికిపుచ్చుకున్నది.

తన ముందు జరుగుతున్నదంతా చూసిన పులికి, అది కలా నిజమా అనే అనుమానం కలిగింది. ఆడిన మాటను సునాయాసంగా తప్పేవారు ఉండే ఈ లోకంలో, ప్రాణాన్ని ఖాతరు చేయక, ఆడిన మాటను నిలబెట్టుకునే నంద వంటి వారు ఉండటం, పులికి ఆశ్చర్యంతో పాటు, ఆనందం కూడా కలిగించింది.

పులికి తన పిల్లలు గుర్తుకు వచ్చారు. అదీ ఒక తల్లే కదా! “నేను చనిపోతే నా పిల్లలు ఎంత కష్టపడతాయో! అదే విధంగా ఈ గోవు మరణిస్తే, దాని దూడ కష్టపడుతుంది!” అనే ఆలోచన తలెత్తగానే, పులి మనస్సు ద్రవించింది. అంతేకాక తన దూడనూ బంధుగణాన్నీ విడిచి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన గోవు నంద నిజాయితీ, పులి మనస్సును పూర్తిగా మార్చి వేసింది. “నిన్ను చంపాలనే ఉద్దేశాన్ని మార్చుకున్నాను. సత్యమనే నీలో ఉన్న మహోన్నత సుగుణం, నన్ను జయించి వేసింది. నీ సత్యమే ఇప్పుడు నిన్ను రక్షించింది. ఇప్పటి నుండి ఇతరులను చంపి బ్రతికే జీవితం నాకు వద్దు. అటువంటి జీవితాన్ని నేను అసహ్యించుకుంటున్నాను. నాకు హితం చేకూరే ఉపదేశాలు చెప్పు” అని పులి ప్రార్ధించింది.

యావత్తు మానవాళీ స్వీకరించి, పాటించవలసిన ఒక ఉపదేశం, పులికి నంద చేసింది: “సర్వభూతాలకూ ఎవరు అభయమిస్తారో, అతడు బ్రహ్మాన్ని పొందుతాడు.” గోవు చెప్పడం పూర్తి అయినప్పుడు, దాని పేరు నంద అని పులికి తెలియ వచ్చింది. అది నందను తాకి ప్రణమిల్లింది. ఆ క్షణంలోనే, పులి రూపంలో జీవిస్తూన్న ప్రభంజనుని శాపం తీరి, తన పాత రాజోచిత రూపం దాల్చాడు. ఆ సమయంలో ధర్మదేవత అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ధర్మదేవత అనుగ్రహంతో, నందకు మోక్షం ప్రాప్తించింది. గోవత్స న్యాయం మేరకు, దూడకు కూడా తల్లితో పాటు మోక్ష పథం దక్కింది. ప్రభంజనుడు తన నగరానికి తిరిగి వెళ్ళి, మునుపటి కంటే ధర్మంగా, న్యాయంగా రాజ్యాన్ని పాలించాడు. సత్యమనే మహోన్నత గుణాన్ని ఊపిరిగా చేసుకున్న నంద పేరు, లోకంలో శాశ్వతంగా నిలిచిపోవడం న్యాయ సమ్మతమే.. నంద ముక్తి పొందిన నాటినుండి, సరస్వతీ నదికి నంద సరస్వతీ నది అనే పేరు శాశ్వతంగా స్థిరపడిపోయింది.

సత్యమేవ జయతే!

Monday, March 18, 2024

Dreams and What They Really Mean as per Garuda Purana | గరుడ పురాణం ప్రకారం కలలు!


కలలు! జీవిత సత్యాలు.. TELUGU VOICE
‘గరుడ పురాణం’ ప్రకారం మనకు వచ్చే ఈ కలలకు అర్ధం తెలుసా?

సాధారణంగా ఎవరికైనా కలలు రావడం అనేది సహజమే. వాటిలో కొన్ని సంతోషం కలిగించేవిగా ఉంటే, కొన్ని పీడ కలలు కూడా వస్తూంటాయి. కొన్ని మనకు కర్తవ్య బోధ చేసేవిగా ఉంటే, మరికొన్ని ఎక్కడో ఆకాశంలోనుంచి పడిపోతున్నట్లు, విచిత్రంగా కూడా ఉంటాయి. వీటిలో కొన్ని కలలు గుర్తుంటాయి, మరికొన్ని గుర్తుండవు. మన పురాణాలు, శాస్త్రాల ప్రకారం, తెల్లవారు జామున వచ్చే కలలు నిజం అవుతాయంటారు. స్వప్న శాస్త్రం ప్రకారం కూడా, కలలో వచ్చేవి కొన్ని నిజం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, కలల గురించి గరుడపురాణంలో, శ్రీ మహావిష్ణువు గరుడుడికి తెలియజేసిన సత్యాలేంటి? వాటిపై ప్రేతాల ప్రభావం ఉంటుందా? కలలో కనిపించే కొన్నింటికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? వాటికి ప్రాయశ్చిత్తాలేంటి వంటి విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/lqxfEzeB4Uc ]


గరుడపురాణంలో శ్రీ మహావిష్ణువు చెప్పిన ప్రకారం, కొన్ని కలలు మన మానసికి స్థితి మీద ఆధారపడి ఉంటే, కొన్ని కలలపై ప్రేతాల ప్రభావం వుంటుంది. గరుడపురాణంలో ప్రేతాలకు సంబంధించి గతంలో నేను చేసిన వీడియో link, చూడని వారి కోసం description లో, I-cards లో పొందుపరుస్తున్నాను. ప్రేతాల నుండి విడుదల వుంది. దానికి ముందు అది ఎలాంటి ప్రేతమో, ఇది ఎలాంటి తాపమో తెలియాలి. దానికి జ్యోతిర్విద్వాంసుల సహకారం అవసరం. ప్రేతగ్రస్త ప్రాణికి కొన్ని అద్భుతమైన కలలొస్తుంటాయి. తీర్థ యాత్రలకు వెళ్ళాలనీ, నదీ స్నానాలు చెయ్యాలనీ, ధర్మకార్యాలను అనుష్టించాలనీ గట్టిగా నిశ్చయించుకుని, ముహూర్తం కూడా చూసుకున్నాక, ఎందుకో అత్యంత నిరాసక్తత ఏర్పడుతుంది. ఎక్కడికీ వెళ్ళ బుద్ధికాదు. చెడు పనులవైపు మనస్సు లాగుతుంది. వెంటనే ఇది ప్రేత నిర్వాకమే అని పోల్చి, జ్యోతిర్విద్వాంసులనాశ్రయించిన వాడు, బాగు పడతాడు. వారిని సంప్రదించవలసిన అవసరం లేకుండా కూడా, దానాలు చేసినా ప్రేత బాధలు వదిలి పోతాయి. కలలో కనిపించిన ప్రేతాన్నుద్దేశించి మంత్ర సహితంగా దానం చేయడం వల్ల, ఆ ప్రేతానికీ, ఈ మనిషికి కూడా తృప్తి కలుగుతుంది. ప్రేతాలు వాటిలో అవి కూడబలుకుకుని, దానమిచ్చిన వానికి సుఖాలనిస్తాయి. వారి బంధు బాంధవులకు కూడా, ధన ధాన్యాల నిస్తాయి. స్వప్నాలలో ప్రేతాలు కనిపించిన పిమ్మట కూడా, వాటి మాటలు, చేష్టలు, పీడలను చూసి కూడా, శ్రాద్ధాదుల ద్వారా వాటి నుండి ముక్తికై ప్రయత్నించని వారు, ఆ ప్రేతాలు పెట్టే శాపాలకు లోనై, దుఃఖ సాగరంలోనే మునిగి వుండి, ఇక తేలరు. కొంత మంది మరుజన్మలో కూడా నిస్సంతులు, పశుహీనులు, దరిద్రులు, రోగులుగానే వుండిపోతారు.

కొన్ని సందర్భాలలో ప్రేతాల నామ గోత్రాలు, స్వప్నాల వల్ల తెలుస్తాయి. కొందరిని కలలు రాకున్నా, ప్రేతాలు పట్టి పీడిస్తాయి. అలాంటి సందర్భాలలో, కుల పురోహితుని మాటనే పూర్తిగా విశ్వసించి, ఆయన ఆదేశం మేరకు, భక్తిభావ పూర్వకంగా పితృభక్తి నిష్టులై, పురశ్చరణ పూర్వకంగా నారాయణ బలి కార్యాన్ని నిర్వహించి, జప, హోమ, దానముల ద్వారా దేహ శోధనను చేసుకోగానే, సమస్త విఘ్నాలూ సమసిపోతాయి. ఇవన్నీ చేయగానే, అంతవరకూ భూత ప్రేత పిశాచాదులచే పీడింపబడుతున్న ప్రాణి బాధలన్నీ, దూదిపింజలలాగా ఎగిరిపోతాయి.

ఒక్కటి మాత్రం గుర్తుంచుకో కశ్యప నందనా! పితృభక్తి ఉండాలి. లేకుంటే సుఖం లేదు. అన్ని ప్రయత్నాలలోనూ విజయం కావాలంటే, తండ్రిపోయిన తొమ్మిదవ, లేదా పదవ సంవత్సరంలో, పదివేల గాయత్రీ జపం చేసి, దశాంశ హోమం కూడా చేసి, “ఇది మా పితరుల నిమిత్తం” అని చెప్పుకోవాలి. దీని ఫలితంగా ఉపద్రవాలిక దరిజేరవు. తల్లిదండ్రులను మించిన దైవాలు లేరు.

పితృమాతృ సమం లోకేనాస్త్య న్య దైవతం పరం ।
తస్మాత్‌ సర్వప్రయత్నేన పూజయేత్‌ పితరౌ సదా ॥

హితానాము పదేష్టా హి ప్రత్యక్షం దైవతం పితా ।
అన్యాయా దేవతాలోకే న దేహ ప్రభవో హి తాః ॥ (ధర్మ... 21/28 29)

ప్రాణులకు స్వర్గానికిగానీ, మోక్షానికి గానీ, ఏకమాత్ర సాధనం శరీరమే. అటువంటి శరీరం దేని ద్వారా అయితే వచ్చిందో, దానికన్న పూజ్యమేది? కాబట్టి, దానమిచ్చిన వాడికి దక్కే ఫలమే గొప్పది.

పుత్రుడు పుట్టుటయే భాగ్యము. వాడు మంచివాడై, అన్ని పితృకార్యములనూ చేయుటయే గొప్ప పుణ్య ఫలము. వాడు పుట్టగానే తండ్రికి 'పుత్' అనే నరకబాధ తప్పిపోతుంది.

పున్నామ నరకాద్యస్మాత్‌ పితరం త్రాయతే సుతః ।
తస్మాత్‌ పుత్ర ఇతి ప్రోక్త ఇహచాపి పరత్ర చ ॥ (ధర్మ... 21/92)

ఓయి ఖగరాజా! ఎవరికైనా మాతాపితరులిరువురూ అకాల మృత్యువు పాలైతే, వారొక యేడాది పాటు ఆ తల్లిదండ్రులకు పుణ్యలోకాలను ప్రాప్తింపజేసే ప్రయత్నంలోనే వుండాలి. ఆ ఏడు వ్రతాలనూ, తీర్థయాత్రలనూ, వివాహాది మంగళ కార్యాలనూ తలపెట్టకూడదు. (అధ్యాయం - 21)

తమ సతీసుతుల, బంధు మిత్రుల కలలలో భయంకరమైన అశ్వాలుగా, ఏనుగులుగా, ఎద్దులుగా, వికృత రూపులైన మానవులుగా కనిపించి, బాధిస్తాయి. కొంతమంది నిద్ర పోతుండగా వచ్చి, వారి శయ్యలను అన్ని విధాలా అపభ్రంశం చేసి పడేస్తాయి. మనిషి తెల్లారి లేచి చూసుకునే సరికి, తానూ తన పక్కా చాలా అసహ్యకరంగా తయారౌతారు. కొందరికి తాము సంకెళ్ళచే బంధింపబడినట్లు కల వస్తే, మరికొందరికి చనిపోయిన తమ వారు పరువు తక్కువ, నిందనీయ వేషాలలో తిరుగుతున్నట్టు కల వస్తుంది. తింటున్న వాని నుండి అన్నాన్ని తామే లాగుకొని పారిపోతున్నట్లు, దాహంతో ఆబగా నీరు త్రాగబోతున్న వాని నుండి ఆ నీటిని తామే లాక్కుని పారిపోతున్నట్లు, కొందరికి కలలు వస్తాయి. ఇవన్నీ ప్రేతాల నిర్వాకాలే. ప్రేతాలలో ఒక రకమే పిశాచాలు. ఇవన్నీ వాటి విన్యాసాలు.

ఎద్దు మీద స్వారీ చేస్తున్నట్లు, ఎద్దులతో కలసి ఎక్కడికో వెళుతున్నట్టు, ఆకాశంలో భయంగా, పడిపోయేలా ఎగురుతున్నట్టు, ఆకలితో అలమటిస్తూ తీర్ధంలో తిరుగుతున్నట్టూ, ఆవు, ఎద్దు, గుర్రం, పక్షులతో, తన గొంతులోనే వాటి భాషను మాట్లాడుతూ గోష్టి సలుపుతున్నట్టూ, తన నుదుటిపై తనకే, ఏనుగు, దేవతలు, భూతప్రేత నిశాచరాదుల చిహ్నాలు కనిపిస్తే, తనకి పిశాచజన్మే వస్తుందని అర్ధం.

పక్షీంద్రా! ప్రేతయోని సంబంధితాలైన ఎన్నో చిహ్నాలు కలల్లో వచ్చి కంగారు పెట్టేవి ఉన్నాయి. తన అన్నదమ్ములు, భార్య, కొడుకు ఎవరైనా పోయినట్టు కల వస్తే అది ప్రేత దోషమే. మనిషికి ఆకలి దప్పులతో తాను ఆరాట పడుతున్నట్టూ, “వాటిని తీర్చండి మహాప్రభో” అని ఎవరినో యాచిస్తున్నట్టూ కల వస్తే, ప్రేత దోషాన్ని వదలించుకోవాలి. వెంటనే ఏదైనా తీర్థానికి వెళ్ళి, తన పితరులందరికీ పిండదానం చేసి, ప్రేత సంతృప్తిని సాధించాలి. పుత్ర, పితా, భ్రాత, పత్ని, పశు, పత్యాది ముఖ్యులు ఇల్లు వదలి బయటికి పోతున్నట్టు కల వచ్చినా, ప్రేత దోషముందని అర్ధము.

గరుడా, ఇలాంటి స్వప్న దోషాలకు ప్రాయశ్చిత్తమెలా చేయించుకోవాలో విను. ఆ వ్యక్తి ఇంట్లోగానీ, తీర్ధంలోగానీ స్నానం చేసి, మారేడు మూలంలో జలతర్పణమివ్వాలి. వేద పారంగతులైన బ్రాహ్మణులను పూజించి, వారికి నల్లని ధాన్యాలను దానమివ్వాలి. తరువాత యథాశక్తి హవనం చేసిన పిమ్మట, గరుడ పురాణ పారాయణ చేయించు కోవాలి. శ్రద్ధాపూర్వకంగా ఈ అధ్యాయాన్ని విన్నా, చదివినా, వారికి ఏ ప్రేత దోషమూ అంటదు. అప్పటికే అంటివుంటే మంటిలో కలసి పోతుంది. (అధ్యాయం -23)

సర్వేజనాః సుఖినోభవన్తు! లోకాః సమస్తా సుఖినోభవంతు!

Tuesday, March 12, 2024

భోజన నియమాలు - Meal Rules


సనాతన సాంప్రదాయంలో తప్పక తెలుసుకోవలసిన భోజన నియమాలు.. TELUGU VOICE

1. భోజనానికి ముందు, తరువాత తప్పక కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.
2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.
3. ఆహార పదార్థాలు (కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.) తినే పళ్ళానికి తాకించరాదు. అలా చేస్తే అవి ఎంగిలి అవుతాయి. ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు. అది చాలా పెద్ద దోషం.
4. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు.
5. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు.
6. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు, తాకరాదు.
7. ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు. ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి.
8. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు.
9. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు. *బఫే పద్దతి* పూర్తిగా మన సనాతన హైందవ ధర్మానికి విరుద్ధం. దయచేసి దీనిని వీలైనంత వరకు పాటించవద్దు. పాదరక్షలు తో పొరపాటున కూడా భోజనం చేయవద్దు.
10. భగవన్నామము ఉచ్చరించి భోజనం చేయాలి.
11. అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు.
12. ఆపోశనము అయ్యాక ఉప్పు వడ్డించుకోరాదు. ఏవైనా పదార్థాలలో ఉప్పు తక్కువైతే ఆ పదార్థాలు ఉన్న గిన్నెలలో ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి.
13. కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే మంచం మీద భోజనం చేయరాదు. (ఇది వృద్ధులకు, వికలాంగులకు, అనారోగ్యంతో ఉన్నవారికి వర్తించదు)
14. మాడిన అన్నాన్ని నివేదించరాదు. అతిథులకు పెట్టరాదు. మన ఇంటి చాకలి వారికి పొరపాటున కూడా పెట్టకూడదు.
15. భోజనం అయ్యాక క్షురకర్మ చేసుకోరాదు (వెంట్రుకలు కత్తిరించడం).
16. గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తేమనం తినగా మిగిలినవి పెట్టరాదు. వారికి మళ్ళీ ప్రత్యేకంగా వంటచేయాలి.
17. భోజనం వడ్డించేటప్పుడు పంక్తిబేధం చూపరాదు. అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం మరొకరికి తక్కువ వడ్డించడం చేయరాదు. 
18. భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి. 
19. వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలో ఆవునెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది.
20. భగవన్నామము తలుచుకుంటూ లేదా భగవత్ కథలు వింటూ వంట వండడం, భోజనం చేయడం చాలా ఉత్తమం.
21. ఉపాసకులను, ఏదైనా దీక్షలో ఉన్నవారిని ఎక్కువ తినమని బలవంతపెట్టరాదు ముఖ్యముగా అయ్యప్ప దీక్షల వద్ద ఈ చెడు అలవాటు ఇటీవల కాలములో మితి మీరుచున్నది. (అతిగా ఆహారం స్వీకరిచడం వారి అనుష్ఠానానికి ఇబ్బంది అవ్వచ్చు) 
22. భోజనం చేస్తున్నవారు (అనగా భోజనం మధ్యలో తింటూ) వేదం చదువరాదు.
23. గిన్నె మొత్తం ఊడ్చుకుని తినరాదు. ఆహార పదార్థాలను కాళ్ళతో తాకరాదు.
24. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి.
25. స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు, వడ్డించరాదు. వారు ఆ 4 రోజులు ఎవరినీ తాకరాదు. వడ్డన సమయంలో అక్కడ ఉండరాదు.
26. అరటి ఆకుల వంటి వాటిలో భోజనం చేసిన వ్యక్తి వాటిని మడవకూడదు (తిన్న విస్తరిని మడవడం అనాచారం) తన ఇంటిలో ఒక్కడు ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు.
27. ఎంగిలి విస్తరాకులను తీసేవాడికి వచ్చే పుణ్యం అన్నదాత కు కూడా రాదని శాస్త్రం. (జగద్గురువైన శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజసూయయాగంలో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు ఎత్తాడని మహాభారతం చెబుతోంది)
28. భోజనం అయ్యాక రెండు చేతులూ, కాళ్ళూ కడుక్కోవాలి. అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి.
నోరు నీటితో పుక్కిలించుకోవాలి.
29. భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి (మెతుకులు తీసేసి, తిన్న చోట తడిగుడ్డతో శుభ్రం) చేసి మాత్రమే అక్కడ వేరేవారికి భోజనం వడ్డించాలి (ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరి ఇళ్ళల్లో గోమయం లేదా పసుపు నీళ్ళు చల్లి మరీ శుద్ధి చేస్తారు)
30. స్నానం చేసి మాత్రమే వంట వండాలని కఠోర నియమము. పెద్దలు, సదాచారపరులు హోటళ్ళలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం చేయకపోవడానికి ఇదే ముఖ్యకారణం. అక్కడ వంట చేసే వారు స్నానం చేసారో లేదో తెలియదు, పాచిముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంటచేసినా దోషం. అవి తిన్న వారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది.
31. ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు. ద్విపాక దోషం వస్తుంది.
32. ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు, వడ్డించరాదు.


మన ఆంధ్రరాష్ట్రం అన్నపూర్ణగా కీర్తించబడటానికి, మన పూర్వీకులు పాటించిన పై సూత్రాలే ప్రధాన కారణం..

Monday, March 11, 2024

Who are you? What is Karma Siddhanta? | ఎవరు నువ్వు? కర్మ సిద్ధాంతం ఏమిటి?


ఎవరు నువ్వు? కర్మ సిద్ధాంతం ఏమిటి? TELUGU VOICE
కోరికలు తీరకపోతే నమ్ముకున్న దైవాన్ని మార్చి, వేరే దైవాన్ని ఆశ్రయిస్తారా?

సనాతనధర్మం ప్రకారం కర్మ సృష్టి ధర్మం. ప్రకృతి గుణాల వలన కర్మలు నిర్వహించబడతాయి. మానవుడు స్వతంత్రుడు కాదు.. కర్మబద్ధుడు! కర్మ ఫలితంగానే జన్మ ఆధారపడి ఉంటుంది. ఈ జన్మలో అనుభవించగా మిగిలిన కర్మ ఫలాన్ని, మరు జన్మలో అనుభవించక తప్పదు. జీవుల కష్ట సుఖాలకూ, లాభ నష్టాలకూ ఇతరులు కారణం కాదు. భార్యా బిడ్డలూ, బంధు మిత్ర, సంయోగ వియోగాలూ, పురాకృత కర్మ ఫలితాలే. అసలు నువ్వెవరు? బలీయమైన కర్మ సిద్ధాంతం ఏమిటి? అనే జీవిత సత్యాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/obtCjPk1svs ]


64 లక్షల జీవ కణాలు అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే, అందులో ఒకే ఒక్క జీవ కణం మాత్రమే, తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది. అదికూడా మొండాన్ని కోల్పోయి, శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత, కేవలం 24 గంటలలో, అండాన్ని పట్టుకుని బ్రతకకపోతే, ముక్కలై బయటికి వచ్చేస్తుంది. అదొక పోరాటమే. ఆ పోరాటానికి మనకు దేవుడిచ్చిన సమయం, కేవలం 24 గంటలు మాత్రమే. నిలిచావా, బ్రతుకుతావు. లేదా ముక్కలై బయటికి వచ్చేస్తావు.

అలా రూపం లేకుండా వెళ్లిన కణం రూపాంతరం చెంది బయటికి వచ్చి, రూపాన్ని పొందుతుంది. కాళ్లూ చేతులూ కదప లేని, నోటితో చెప్పలేని స్థితి. ఏం చేసినా భరించాలి. క్రమంగా దేహం పెరుగుతుంది. దేహం మీద మోహమూ పెరుగుతుంది. ఈ దేహం నేనే అంటాము. అసలు అలా అనటానికి, నీ దేహంలోని ఏ భాగం నీ మాట వింటుంది..? నిజానికి ఏ భాగమూ వినదు. వినాలని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది. చిన్నప్పుడు రెండడుగులుగా ఉన్న దేహం, క్రమంగా పెరుగుతూ, ఆరడుగులవుతుంది. అందంగా మారుతుంది. క్రమంగా అందం మందగించి, ముదిరి ముడతలు పడి, ఒక్కొక్క అవయవం చొప్పున క్రమంగా వేగాన్ని తగ్గించుకుని, అసలు పని చేయడానికి మొరాయిస్తాయి.

మరి ఈ దేహం నీదే కదా! ఎందుకు మొరాయిస్తుంది? ఈ దేహం నీదే అయినప్పుడు, ఎందుకు ఒకప్పుడున్న రూపం ఈ రోజు లేదు? దేహం నీదయినప్పుడు, నీ మాట ఎందుకు వినడం లేదు? దేహం నీదే అనుకున్నప్పుడు, చివరికి ఎందుకు వదిలేసి వెళ్లి పోతున్నావు..?
ఎందుకంటే, అసలు ఈ దేహం నీది కాదు. నీకు ఆ దేవుడిచ్చిన ఉపకరణం మాత్రమే. ఆ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తప్ప, "ఈ దేహం నాదే, నేను శాశ్వతంగా ఉండిపోతాను" అనే భ్రమకి లోను కాకూడదు. ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు, నీకున్న బాధ్యతలను నువ్వు సక్రమంగా నిర్వర్తించు. శాస్త్రాలు ఏం చెప్పాయో, వాటిని అనుసరించు. ఈ సృష్టి పరమాత్మదని తెలుసుకో..

రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించి, రూపం పొంది, ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు. చివరికి ధరించిన రూపం ఇక్కడే వదిలి వెళ్ళిపోవాలి. నిజానికి ఇక్కడున్నది నువ్వు కాదు. నీకు ఆ పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే యధార్థం తెలుసుకుంటే, ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి. రూపానికి ముందు నువ్వున్నావు, రూపంలో  నువ్వున్నావు, రూపం వదిలేసిన తారువాతా నువ్వుంటావు. ప్రతి చోటా నువ్వు అనే వాడివి లేకపోతే, అసలు రూపమే ఉండదు.

ఈ దేహం దేవుడిచ్చిన ఓ అద్భుత వరం. ఆయనే ఆ దేహానికి ఏం కావాలో ఇస్తాడు. ఆయనే తయారు చేశాడు, సమయమవ్వగానే ఆయనే నాశనం చేస్తాడు. ఈ దేహాన్ని ధరించినంత కాలం, దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ  దేహాన్ని ఇష్టం వచ్చినట్లు చేయడానికి అధికారం ఎవ్వరికీ లేదు. ఈ దేహంలో ఉన్న అన్ని భాగాలూ, పరమాత్మ ఆజ్ఞ ప్రకారమే నడుస్తాయి. అయన ఆగమన్నప్పుడు అన్నీ ఆగిపోతాయి. కాబట్టి, ఆ  నువ్వు ఎవరో తెలుసుకుని మసలుకునే ప్రయత్నం చెయ్యాలి.

ఇక కర్మ సిద్ధాంతం విషయానికి వస్తే, కర్మలకు దోషం వున్నప్పటికీ, జీవులు కర్మబద్ధులు. కర్మలు మానడం కంటే, కర్మలు చేయడమే మేలు. కర్మ చేయకపోతే, జీవయాత్ర జరగదు. జీవులు కర్మ చేయకుండా ఒక్క క్షణమైనా వుండలేరు. అయితే, కర్మల వలన ఫలం తప్పదు కాబట్టి, సత్కర్మలు చేయడం అలవరుచుకోవాలి. ప్రతిఫలాన్ని ఆశించకుండా, కర్మఫలాన్ని దైవానికి అర్పించడం ద్వారా, జీవుడు క్రమేణా జన్మరాహిత్యాన్ని పొందగలడని తీర్మానం చేసింది, మన సనాతనధర్మం. అజ్ఞానులు కర్మలలో మునిగి ఎలా పని చేస్తారో, జ్ఞానులు కూడా లోక శ్రేయస్సు కోరుతూ, అలాగే కర్మలు చెయ్యాలి. కర్మలలో మునిగిపోయిన వారిని ఆక్షేపించకుండా, వారు సత్కర్మలు ఆచరించేలా జ్ఞానులు ప్రోత్సహించాలి. అహంకారం వలన తానే అన్నింటికీ కర్తనని అనుకుంటాడు అజ్ఞాని. కానీ, గుణకర్మల యొక్క తత్వం తెలిసిన జ్ఞాని, ఆ చట్రంలో చిక్కుకోడు.

కర్మఫలితాన్ని కోరుకునే వాళ్ళు, దేవతలను ధూపదీపనైవేద్యాలతో ఆరాధిస్తారు. ఆరాధనలో తమ కోరికలను నెరవేర్చమని వేడుకుంటారు. కొన్ని కోరికలు తీరిన తరువాత, ఆరాధనలో కొంత ఆడంబరాన్ని పెంచుతారు. పది మందికీ తమ ఆడంబరతను చూపెట్టే ప్రయత్నం చేస్తారు. దేవుడు నా వాడే అని భావిస్తారు. కొన్ని జరగకపోతే, దేవుణ్ణి నిందించడం ప్రారంభిస్తారు. నెమ్మదిగా అహం చోటుచేసుకుంటుంది. మెల్లగా నమ్ముకున్న దైవాన్ని మార్చి, వేరే దైవాన్ని ఆశ్రయిస్తారు. ప్రస్తుతం జరుగుతున్నది ఇదే!! అంటే, తాము చేస్తున్న కర్మలవలన, మనుజుల గుణము బయటపడుతోంది! వ్యక్తిలో దాగివున్న సత్వ, రజో, తమో గుణములు, కర్మలరూపంలో తేటతెల్లమవుతున్నాయి. ఎంత కపటమును ప్రదర్శించినా, అవి ఒకానొకప్పుడు బయటపడక తప్పదు.

కర్మలు శాశ్వతము కావు. ఎందుకంటే, కాలానుగుణంగా కర్మలు మారుతూ వుంటాయి. కాబట్టి, వాటి ఫలితాలు కూడా తాత్కాలికములే. అంటే, మనుజులు కర్మలు చేయటంగానీ, చేయకపోవటంగానీ ముఖ్యంకాదు. తమ మనస్సులోని మాలిన్యాలను తొలగించడమే ప్రధానమని తెలుస్తోంది. ఆ మాలిన్యాలను మనసా, వాచా తొలగించకుండా చేసే ఏ కర్మ అయినా, నిరుపయోగమే! అజ్ఞాని, ‘నేను’ చేస్తున్నానని భావించి, ఫలితముల యందు ఆసక్తితో కర్మలను చేసి, వాటి ఫలితాన్ని అనుభవించడానికి ఈ జన్మ చాలకపోతే, ఇంకొన్ని జన్మలు ఎత్తవలసి వుంటుంది. దానినే ప్రారబ్ధకర్మ అంటారు. జ్ఞానులు ఆత్మస్థితిలో వుండి, ఏ ఫలితములనూ ఆశించకుండా, దైవబుద్ధితో కర్మలు చేస్తారు. అది యజ్ఞంగా, యోగంగా మారి, బంధమును కలిగించదు. సాధనతో ఆత్మజ్ఞానమును పొంది, బంధము నుండి విముక్తి పొందుతారు. అంటే, అనాసక్తితో, ఫలాపేక్ష లేకుండా, ఎటువంటి కోరికా లేక, అహమనే భావాన్ని త్యజించి చేసే ఏ కర్మ అయినా, "కర్మయోగము"గా మారిపోతుంది. కర్మయోగము వలన, బంధము కలుగదు. జ్ఞానము పరిపక్వత చెంది, సమాధి స్థితి కలిగినప్పుడు, కర్మలతో పనిలేదు. కొందరు లోక కల్యాణం కొరకు కర్మలు చేస్తారు, కొందరు చేయరు. వారు కర్మను అకర్మగా, అకర్మను కర్మగా భావిస్తారు. అంటే, వారు చేసే కర్మలు అసంగముగా చేస్తారు కాబట్టి, కర్మబంధము ఉండదు.

అష్టైశ్వర్యాలు, ఇంద్ర భోగాలను అనుభవించేవారిని కూడా, కాలరూపమనే మృత్యువు వెంబడించి కబళిస్తుంది. వారు సకల సౌభాగ్యాలూ అనుభవించడానికి, వారి పూర్వజన్మ సుకృతమే కారణమని మన పురాణాలు చెబుతున్నాయి. పురాకృత కర్మ ఫలాన్ని బ్రహ్మాది దేవతలు కూడా తప్పించుకోలేరు. అలనాడు ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుడిని చంపగా, బ్రహ్మ హత్యా దోషం ఆయనను వెంటాడింది. దీనితో ఇంద్రుడు భీతచిత్తుడై పరుగెత్తి, మానస సరస్సులో, ఒక తామర తూడులో దూరి, సన్నని తంతువుల్లో కలిసిపోయి, వెయ్యి సంవత్సరములు అజ్ఞాతవాసం గడిపి, కర్మ ఫలాన్ని అనుభవించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఇంద్రుని బ్రహ్మ హత్యా దోషాన్ని విభజించి, పాప విముక్తి కలిగించాడు. ఇంద్రుడు అశ్వమేధ యాగం చేసి, మళ్లీ తన సింహాసనంపై కూర్చోగలిగాడు.

దుర్లభమైన మానవ జన్మ లభించినప్పుడే, మానవులు మంచి పనులు చేయాలి. అది కూడా ఫలాపేక్ష లేకుండా చేయాలి. చేసిన మంచి పని తాలూకు ఫలితాన్ని, భగవదర్పణం చేయాలి. అప్పుడే, మోక్షం లభించి, జననమరణ చక్ర భ్రమణం నుంచి ముక్తి కలుగుతుంది. పుణ్య పాప కర్మలు మిశ్రమముగా పక్వానికి వచ్చినప్పుడు, జీవుడు మానవ జన్మ ఎత్తుతాడు. కర్మ ఫలముగా సుఖములను, దుఃఖములను అనుభవిస్తాడు. కర్మ ఫలమును అనుభవించటమే కాక, కొత్త కర్మలు కూడా చేసే అవకాశం, కేవలం మానవ జన్మలోనే కలుగుతుంది. పరమాత్మను అందుకోవడానికి కావలసిన కర్మలు చేసే అధికారం, జ్ఞానం వున్న ఈ మానవ జన్మ, ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది. “జంతూనాం నర జన్మ దుర్లభం” అని శంకరులు ‘వివేక చూడామణి’లో తెలియచేసారు. ఇలాంటి ఉత్తమమైన మానవ జన్మని సార్ధకం చేసుకోడానికి, ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి. మానవులు పరమాత్మను చేరడానికి, కర్మ-జ్ఞానములు తప్పక అవసరము. ఇక్కడ "కర్మ అంటే, నిష్కామ కర్మ" అనే భావించాలి. దానివలననే జ్ఞానము ఉదయిస్తుంది.

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...