Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Saturday, April 29, 2023

అమ్మకి 2 రూపాయలు అవసరమా!?


అమ్మకి 2 రూపాయలు అవసరమా!?

ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో ప్రచురించబడిన ఈ కథ, కేవలం రెండు పేజీలే వుంటుంది.
కానీ, కథ పూర్తయ్యాక రెండు నిమిషాలయినా మనం ఆలోచించకుండా వుండలేము..
ఈ కథలో చెప్పినదానికన్నా చెప్పకుండా వున్నదే ఎక్కువగా కనిపిస్తుంది.

        ఒక్క రెండు రూపాయలు..
   "నేనేం వందలడిగానా? వేలడిగానా? ఒక్క రెండు రూపాయలేగా! దానికే అంత దండకం చదవాలా?"
        గట్టిగా వినిపిస్తున్న తల్లి గొంతు చెవిన పడుతూనే మెలకువ వచ్చింది నూకరాజుకి. గబుక్కున లేచి కూర్చున్నాడు.
        "ఆఁ!...ఒక్క రెండు రూపాయలేగా అని ఎంత తీసి పడేస్తున్నావు? పిల్లలు ఖర్చులకడిగేదీ అదే. పుస్తకాలకడీగేదీ అదే. రెండూ రెండూ అంటూ నాలుగు సార్లు కలిపితే ఎనిమిదవదా? పదీ పదీ కలుపుకుంటూ పోతే వందవదా? ఇలాగే లెక్కలు పెడతాడు నీకొడుకు. రోజు రోజుకీ  పెరిగి పోతున్న ధరలతో, నీ కొడుకిచ్చే డబ్బులకి లెక్కలు చెప్పలేక నా తలప్రాణం తోకకొస్తోంది. అయినా ముసల్దానివయిపోయావు. ఇంట్లోంచి బైటకి కదలవు. భోజనం, కాఫీ, టిఫినూ అన్నీ చెల్లిస్తూనే వున్నావాయె. ఇంకా నీకు ఆ ఒక్క రెండు రూపాయలు మటుకు ఎందుకటా? ఏం చేసుకుందామనీ?" 
      సాగదీస్తూ అడుగుతున్న భార్య పంకజం నోటి దురుసుకి చెవులు మూసుకుంటూ మంచం దిగాడు నూకరాజు. కాఫీ ఇస్తున్న భార్య నడిగాడు సంగతేమిటని? వెంటనే ఆమె స్వరం సౌమ్యంగా మారిపోయింది.
        "ఆఁ? ఏముందీ? మీ అమ్మగారికి రెండు రూపాయలు కావాలట. మీరిచ్చిన డబ్బుతో పిల్లలకి ఫీజులు కట్టి, స్కూల్లో పుస్తకాలు, పెన్సిళ్లు కొనేేశాను. ఇంక నా దగ్గర డబ్బుల్లేవు. అయినా మీ అమ్మగారికి డబ్బెందుకండీ? భోజనం, టిఫినూ, కాఫీ అన్నీ గడచి పోతుంటేనూ?" నెమ్మదిగా పాయింటు లేవదీసింది పంకజం.
         నిజమే, అమ్మకు డబ్బులెందుకు?
      టైము చూసుకున్నాడు నూకరాజు. అప్పుడే ఎనిమిదయింది. అబ్బా, అప్పుడే షాపు తెరిచే టైమవుతోంది. గబగబా తయారయి షాపుకి బయలు దేరుతున్న అతనితో తల్లి అంది. 
         "ఒరేయ్ రాజూ, చూడరా మీ ఆవిడ... ఒక్క రెండు రూపాయలడిగితే..." 
    "అబ్బబ్బ ఏంటమ్మా. అసలే టైమయి పోతోందని కంగారు పడుతుంటే. అయినా నీకు డబ్బులెందుకు చెప్పు?”
అంటూనే హడావిడిగా చెప్పులేసుకు బయటకొచ్చేశాడు. వెనక్కి తిరిగి తల్లికి నెమ్మదిగా నచ్చజెప్పి రమ్మని మనస్సు బాధిస్తున్నా, పరిగెడుతున్న టైము అతన్ని ముందుకే నడిపించింది.
       నెలలో మొదటి వారం, షాప్ రష్‌గా వుంది. నాలుగు చేతులతో పని చేస్తున్నట్లు చేస్తున్న నూకరాజుకి ఊపిరి పీల్చుకుందుకు కూడా సమయం దొరకలేదు. పదకొండు దాటేక జనం కొంచెం పలచబడ్డారు. అమ్మయ్య అనుకుంటూ వాటర్ బాటిల్‌లో నీళ్లు తాగుదామని తలెత్తిన అతనికి, ఆ షాపు వైపే వస్తున్న రామ్మూర్తిగారు  కనిపించారు. నూకరాజు ముఖం విచ్చుకుంది. రూపాయలు, పైసల లెక్కల్తో కొట్టుకొంటున్న అతనికి రామ్మూర్తి గారితో మాట్లాడటం గొప్ప రిలీఫ్. చుట్టు పక్కల ప్రాంతంలో ఏం జరుగుతోందో తెలియనంత బిజీగా వుండే అతనికి, మధ్య మధ్యలో రామ్మూర్తిగారు చెప్పే మాటల్లోనే ప్రపంచం తీరు తెన్నుల గురించి తెలుస్తూంటుంది.
      రామ్మూర్తిగారు ఒక రిటైరైన గర్నమెంటు ఆఫీసరు. మనవలతో ఆడుకుంటూ హాయిగా కొడుకింట్లో కాలం గడిపేస్తున్నారు. ఏదో హోదాగల ఉద్యోగమే చేసుంటారు. అందుకే అభిమానం, పౌరుషం గల మనిషిలా కనిపిస్తారు. 
       ఎప్పుడైనా ఆయన ఉద్యోగపు రోజులు గుర్తుకు వస్తే, "ఏమిటోనయ్యా, ఆ రోజులే వేరు. ఎంతసేపూ సిన్సియర్‌గా పనిచేసి పేరు తెచ్చుకుందామనే గానీ, వేరే దృష్టి ఎక్కడిదయ్యా? ఇప్పుడేమో అంతా ఖాళీయే. ఎవరితోనన్నా మాట్లాడదామన్నా, వాడి టైము పాడు చేస్తున్నానేమోనని ఫీలింగు" అంటూ పకపకా నవ్వేస్తారు.
         "మీకేం సార్. మాలా బిజినెస్ కాదు కదా! చేసినన్నాళ్లు చేశారు. పెన్షన్ వస్తుంది. హాయిగా కొడుకు దగ్గర ఉంటున్నారు" అంటే,
         "నీకొక జీవిత సత్యం చెబుతాను వినవయ్యా నూకరాజూ.. ఎవరి జీవితం వాళ్లదేననుకో.. కానీ, కొంతమంది ఇవ్వడానికే పుడతారు, మరికొంతమంది పుచ్చుకోవడానికే పుడతారు. కాలం మారుతూంటుంది కదయ్యా.. అదెప్పుడూ ఒక్కలాగే ఉండదు. మా తరం 'తల్లిదండ్రులని చూడవలసిన బాధ్యత కొడుకులది' అని నమ్మే తరం. అల్లాగే చూసాం. కానీ మా కొడుకుల తరం వచ్చేసరికి, వాళ్లింట్లో ఉంటున్నందుకు మాకొచ్చే పెన్షన్ వాళ్ల చేతుల్లో పెట్ట వలసిన పరిస్థితి వచ్చేసింది. ఏం చేస్తాం? ఈ కాలమిలా వుంది. వాళ్ల వైపు నుంచి ఆలోచిస్తే సమర్థించుకోవచ్చేమో కాని, మాతరం వాళ్లం సర్దుకోలేక పోతున్నామాయే!" అంటూ బరువైన విషయాన్ని కూడా చాలా తేలికగా తీసుకుంటూ చెప్పేస్తారు.
       రామ్మూర్తిగారు కొంచెం భోజనప్రియులు అయివుండాలి. గతం గుర్తొస్తే మటుకు వెంటనే ఆయన చెప్పే మాట, "అప్పుడు బజార్లోకి కొత్తరకం ఏదొచ్చినా సరే, తెచ్చి పిల్లలకి తినిపించాల్సిందేనయ్యా. అప్పుడు మాకు తినడానికి టైముండేది కాదు.. ఇప్పుడు టైమున్నా పెట్టే వాళ్లు లేరు" అంటూ నవ్వేస్తారు.
         ఇలా మంచీ చెడూ చెపుతూ, లోకం పోకడ గురించి ముచ్చటిస్తూ ఆయన కోడలు రాసిచ్చిన సరుకుల లిస్టు, ఖాతా పుస్తకం నూకరాజు చేతికిచ్చేవారు. కావలసిన సరుకులిచ్చి, లెక్క ఖాతా పుస్తకంలో రాసే వరకు అతనేదో అడుగుతూండడం, ఆయన జవాబిస్తూండడం వాళ్లిద్దరికీ అలవాటయిపోయింది.
         "ఏంటి మాస్టారూ విశేషాలు?" అడిగాడు నూకరాజు సరుకుల లిస్టు అందుకుంటూ.
    "ఆఁ! ఏముందోయ్.. అన్నట్లు మీ పిల్లలెలా చదువుతున్నారు?" కుశల ప్రశ్నలు వేశారు రామ్మూర్తిగారు.
   "ఏం చదువులోనండి, వీళ్లు చదివి ఏం ఉధ్ధరిస్తారో తెలీదుకానండి ఫీజులు మటుకు చుక్కలంటుతున్నాయండి. పుస్తకాలు, డ్రెస్సులు, పాకెట్‌మనీ తడిసి మోపెడవుతున్నాయి" అన్నాడు నూకరాజు.
         "ఊఁ! అయితే పిల్లలకి పాకెట్ మనీ కూడా ఇస్తావేమిటోయ్?" అడిగారు ఆయన.
         "ఏదోనండి, రూపాయో, రెండో. పక్క పిల్లలు ఏదో కొనుక్కుంటారు కదండీ.. వాళ్లకీ అనిపిస్తుంది కదా.. మళ్లీ చిన్నబుచ్చుకుంటారనీ.." సమర్థించుకున్నాడు నూకరాజు.
    "నిజమేనోయ్, నీకొక సంగతి చెప్పనా? మా తాతగారంటూండేవారు... చిన్నపిల్లలూ, ముసలివాళ్లూ ఒకటేనని. అంటే వాళ్లిద్దరి మనస్తత్వం ఒక్కలాగే వుంటుందని. ఏదో అస్తమానం తింటూండాలనిపిస్తుందనీ, చపలత్వం, చాదస్తం ఎక్కువవుతాయనీ అంటూండేవాడు. పిల్లలకే కాదు, పెద్దలకి కూడా చేతిలో ఓ రూపాయుంటే, ఏ గుళ్లోనో దేవుడికిచ్చుకోవాలనిపిస్తుంది కదా!" అన్నారు ఆయన.
        నూకరాజుకి వెంటనే తల్లి గుర్తుకు వచ్చింది. 'అమ్మ గుడిలో దేవుడి కోసం అడిగిందా ప్రొద్దున్నే రెండు రూపాయలు?' ఆలోచనలు తప్పించుకుందుకు తల విదిలించి సరుకుల లిస్టు చూడడంలో మునిగిపోయాడు. సరుకుల ధరలు రాసి, మొత్తం కూడి, ఖాతా పుస్తకంలో రాస్తున్నాడు.
        "నూకరాజూ..."
         రామ్మూర్తిగారి గొంతు నెమ్మదిగా వినిపించింది. తలెత్తాడు నూకరాజు.
        "ఏదో ఒక సరుకులో రెండు రూపాయలు ఎక్కువెయ్యవయ్యా.." నసుగుతూ అన్నాడాయన.
   ఆశ్చర్యపోతూ చూశాడు నూకరాజు. ఆయన అతన్ని ఓ చూపు చూసి గబుక్కున తల దించుకున్నాడు. అభిమానంతో ఆయన నోటి వెంట వచ్చిన మాటలు "ఏం లేదయ్యా.. కొత్త రకం బిస్కెట్లేవో వచ్చాయన్నావు కదా.. ఎలా వుంటాయో రుచి చూద్దామనీ.. అంతే. ఒక్క రెండు రూపాయలే.."
         వింటున్న నూకరాజుకి ఛెళ్లున లెంపకాయ కొట్టినట్టయింది. కళ్లమ్మట గిఱ్ఱున నీళ్లు తిరిగాయి. తమలాంటి కొడుకులందర్నీ చంపి పాతరేసినా పాపం లేదనిపించింది. పాప భారంతో ఎత్తలేని తల భూమిలోకి దించుకున్నాడు నూకరాజు.

2nd జూన్ 2001..

Wednesday, April 26, 2023

బంగారు సంకెళ్ళు! భగవద్గీత Bhagavadgita

 

బంగారు సంకెళ్ళు!
జన్మ, మృత్యువు, వృద్ధాప్యము, దుఃఖముల నుండి విముక్తి ఎలా పొందవచ్చు?

'భగవద్గీత' చతుర్దశోధ్యాయం – గుణత్రయ విభాగ యోగం (19 – 23 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్నాలుగవ అధ్యాయం, గుణత్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, గుణత్రయ విభాగ యోగములోని, 19 నుండి 23 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/VXwMTe9zIYs ]



ప్రకృతి త్రి-గుణములకు అతీతముగా అయిన వారి లక్షణములు ఏ విధంగా ఉంటాయో, భగవానుడిలా వివరిస్తున్నాడు..

00:49 - నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి ।
గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోఽధిగఛ్చతి ।। 19 ।।

అన్ని కార్యములలోనూ, కర్తలు ఈ త్రి-గుణములే తప్ప, వేరే ఇతరములు లేవని ఎప్పుడైతే వివేకవంతులు తెలుసుకుని, నన్ను ఈ గుణములకు అతీతునిగా తెలుసుకుంటారో, వారు నా దివ్య స్వభావాన్ని పొందుతారు.

ఈ మూడు గుణముల యొక్క సంక్లిష్టమైన పనితీరును వివరించిన పిదప, శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, వాటి బంధనము నుండి ముక్తిపొందటానికి సరళమైన ఉపాయమును చెబుతున్నాడు. జగత్తు లోని సమస్త జీవ భూతములూ, ఈ మూడు గుణముల బంధనములో ఉన్నాయి. కాబట్టి, ఈ గుణములే జగత్తులో జరిగే కార్యములన్నింటిలో, ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాయి. కానీ, సర్వోన్నత భగవానుడు వాటికి అతీతుడు. కాబట్టి, ఆయనను త్రి-గుణాతీతుడని అంటారు. అదే విధంగా, భగవంతుని యొక్క అన్ని గుణములూ, ఆయన నామములూ, రూపములూ, లీలలూ, ధామములూ, మరియు పరివారమూ, ఇవన్నీ త్రి-గుణాతీతములే. ఒకవేళ మన మనస్సును త్రి-గుణముల యొక్క పరిధిలోనే ఉన్న ఏ ఒక్క వ్యక్తి, లేదా వస్తువు పట్ల అనుసంధానం చేసినా, ఆ సంబంధిత గుణ-ప్రభావం, మన మనోబుద్ధులపై పెరుగుతుంది. కానీ, మన మనస్సును దివ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రములోనే ఉంచితే, అది త్రిగుణములకు అతీతముగా, దివ్యమైనదిగా అవుతుంది. ఈ సూత్రమును అర్థం చేసుకున్నవారు, ప్రాపంచిక వస్తువులు, మనుష్యుల పట్ల తమ సంబంధాన్ని తగ్గించుకుంటూ, భక్తి ద్వారా, భగవంతుడు, మరియు గురువు పట్ల సంబంధాన్ని బలపరుచుకుంటారు. ఇది వారికి త్రిగుణములకు అతీతముగా అవ్వటానికి సహాయకారిగా, మరియు భగవంతుని యొక్క దివ్య స్వభావాన్ని పొందటానికి సహాయకారిగా ఉంటుంది.

02:38 - గుణానేతానతీత్య త్రీన్ దేహీ దేహసముద్భవాన్ ।
జన్మమృత్యుజరాదుఃఖైః విముక్తోఽమృతమశ్నుతే ।। 20 ।।

శరీర సంబంధిత ప్రకృతి త్రిగుణములకు అతీతముగా అయిపోవటం వలన వ్యక్తి, జన్మ, మృత్యువు, వృద్ధాప్యము, మరియు దుఃఖముల నుండి విముక్తి పొంది, అమరత్వం పొందుతాడు.

మనం ఒకవేళ పాడైపోయిన ఆహారాన్ని తీసుకుంటే, మనకు అనారోగ్యం కలుగుతుంది. అదే విధంగా, మనం ఈ త్రిగుణములచే ప్రభావితం అయితే, మనం వాటి యొక్క పరిణామాలను అనుభవించాలి.. అంటే, పదేపదే ఈ భౌతిక జగత్తులో పుట్టటం, వ్యాధి, వృద్ధాప్యం, మరియు మరణం వంటివి. ఈ నాలుగే, భౌతిక జగత్తులో ప్రధానమైన క్లేశములు. వీటిని చూసిన తరువాతే, బుద్ధుడు ఈ ప్రపంచం దుఃఖములకు నిలయమని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఈ క్లేశములకు పరిష్కారం వెదికాడు. వేదములు ఎన్నెన్నో నియమములనూ, సామాజిక విధులనూ, పూజాది కర్మ కాండలనూ, మరియు నిబంధనలనూ, మానవులకు విధించాయి. ఈ చెప్పబడిన విధులూ, మరియు నియమనిబంధనలన్నింటినీ కలిపి, కర్మ ధర్మాలంటారు, లేదా, వర్ణాశ్రమ ధర్మములంటారు, లేదా, శారీరక ధర్మములంటారు. అవి మనలను తమో గుణము నుండి రజో గుణమునకూ, దానినుండి సత్త్వ గుణమునకూ, ఉన్నతమైనవిగా చేస్తాయి. కానీ, సత్త్వ గుణమును చేరుటయే సరిపోదు; అది కూడా ఒకలాంటి బంధనమే. సత్త్వ గుణమును బంగారు సంకెళ్ళతో కట్టివేయబడటంతో పోల్చవచ్చు. మన లక్ష్యము ఈ భౌతిక జగత్తు అనే జైలు నుండి బయట పడడం. మనము ఈ త్రి-గుణములకు అతీతముగా అయినప్పుడు, జీవాత్మలను ఇక మాయ బంధించదు. ఈ విధంగా, జీవాత్మ జనన మరణ చక్రము నుండి విముక్తి నొంది, అమరత్వం పొందుతుంది. నిజానికి, ఆత్మ అనేది ఎల్లప్పుడూ నిత్యమే. కానీ, అది తనకు తాను ఈ భౌతిక శరీరమే అనుకోవటం వలన, అది జన్మ-మృత్యువు అనే మిథ్యా దుఃఖమును అనుభవింప చేస్తుంది. ఈ మిథ్యానుభవము, తన యొక్క సనాతన అస్థిత్వ స్వభావానికి వ్యతిరేకమైనది; జీవాత్మ దీనినుండి విముక్తికై ప్రయత్నిస్తుంటుంది. కాబట్టి, భౌతిక ప్రాపంచిక మిథ్య సహజంగానే, మన అంతర్గత అస్థిత్వానికి ఇబ్బందికరమే.

04:59 - అర్జున ఉవాచ ।
కైర్లింగైః త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో ।
కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే ।। 21 ।।

అర్జునుడు ఇలా అడుగుతున్నాడు: ఓ ప్రభూ, ప్రకృతి త్రి-గుణములకు అతీతముగా అయినవారి లక్షణములు ఏ విధంగా ఉంటాయి? వారు ఏవిధంగా ప్రవర్తిస్తారు? వారు త్రి-గుణముల బంధనమునకు అతీతముగా ఎలా అవుతారు?

అర్జునుడు శ్రీ కృష్ణుడి నుండి, త్రి-గుణములకు అతీతులవటం గురించి విని ఉన్నాడు. అందుకే ఇప్పుడు, ఈ త్రి-గుణముల విషయమై, మూడు ప్రశ్నలను అడుగుతున్నాడు. త్రిగుణాతీతుల లక్షణములు ఎలా ఉంటాయి? త్రిగుణాతీతుల ప్రవర్తన ఎలా ఉంటుంది? త్రిగుణములకు అతీతంగా ఎలా అవుతాము? అని తన సంశయాన్ని శ్రీ కృష్ణుడి ముందుంచాడు.

05:48 - శ్రీ భగవానువాచ ।
ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ ।
న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ।। 22 ।।

05:59 - ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే ।
గుణా వర్తంత ఇత్యేవం యోఽవతిష్ఠతి నేంగతే ।। 23 ।।

శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు: ఓ అర్జునా, ఈ త్రిగుణములకు అతీతులైనవారు - సత్త్వ గుణ జనితమైన ప్రకాశమునుగానీ, రజో గుణ జనితమైన కార్యకలాపములనుగానీ, లేదా తమో గుణ జనితమైన మోహభ్రాంతినిగానీ, - అవి పుష్కలంగా ఉన్నప్పుడు ద్వేషించరు, లేదా, అవి లేనప్పుడు వాటిని కాంక్షించరు. వారు ప్రకృతి గుణముల పట్ల తటస్థముగా, ఉదాసీనంగా ఉండి, వాటిచే అలజడికి గురికారు. గుణములే ప్రవర్తించుతున్నవని తెలుసుకుని, వారు నిశ్చలముగా ఆత్మ యందే స్థితమై ఉంటారు.

అర్జునుడి ప్రశ్నలకు శ్రీ కృష్ణుడు సమాధానమిస్తున్నాడు. ప్రపంచంలో ఈ త్రి-గుణములు ప్రవర్తిల్లటం చూసినప్పుడు, వాటి ప్రభావం మనుష్యులలో, వస్తువులలో, మరియు వాటి చుట్టూ ఉండే పరిస్థితులలో వ్యక్తమైనప్పుడు, వారు చలింపరు. జ్ఞానోదయమైన వారు అజ్ఞానమును చూసినప్పుడు దానిని ద్వేషింపరు, లేదా దానిలో చిక్కుకోరు. ప్రాపంచిక మనస్తత్వం కలవారు, ఈ ప్రపంచ స్థితిగతులపై మరీ ఎక్కువగా చింతిస్తూ ఉంటారు. వారి యొక్క సమయాన్ని, మరియు శక్తిని, ప్రపంచంలోని పరిస్థితులపై తలపోస్తూ గడుపుతారు. జ్ఞానోదయమైన మహాత్ములు కూడా, మానవ సంక్షేమం కోసమే పని చేస్తుంటారు. కానీ, వారు అలా ఎందుకు చేస్తారంటే, అది వారి సహజ స్వభావం కాబట్టి. అదే సమయంలో, ఈ జగత్తు అంతా భగవంతుని నియంత్రణలో ఉన్నదని కూడా, వారికి తెలుసు. కేవలం తమ శక్త్యానుసారం పని చేయాలి, మరియు మిగతాది ఆ భగవంతునికే విడిచిపెట్టాలని, వారికి తెలుసు. ఈ భగవంతుని యొక్క జగత్తు లోనికి వచ్చిన తరువాత, మన యొక్క ప్రధానమైన కర్తవ్యం, మన అంతఃకరణ శుద్ధి కోసం పరిశ్రమించటమే. ఆ తదుపరి, శుద్ధమైన, పవిత్రమైన అంతఃకరణతో, మనం సహజంగానే, ప్రపంచ పరిస్థితులు మనలను తీవ్రంగా ప్రభావితం చేయనీయకుండా, ప్రపంచంలో సత్కార్యములూ, సంక్షేమ కార్యక్రమాలూ చేస్తాము. జ్ఞానోదయమయిన మహాత్ములూ, త్రి-గుణములు చేసే పనులకు తాము అతీతులమని తెలుసుకున్నవారూ, ప్రకృతి యొక్క త్రిగుణములు జగత్తులో వాటివాటి సహజ స్వభావ పనులు చేస్తుంటే, హర్షమునకు కానీ, లేదా శోకమునకు కానీ గురికారు. నిజానికి వారి మనసులోనే ఈ గుణములను గమనించినా, వారు కలత చెందరు. ఈ మనస్సు భౌతిక శక్తిచే తయారుచేయబడినది. అందుకే దానికి ప్రకృతి సహజమైన మాయా త్రి-గుణములు ఉంటాయి. కాబట్టి, మనస్సు సహజంగానే ఈ గుణములచే, మరియు వాటివాటి అనుగుణముగా వచ్చే తలంపులచే ప్రభావితం అవుతుంది. ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే, శారీరక దృక్పథంలో, మనము మన మనస్సుని మనకంటే వేరుగా చూడము. అలౌకికమైన స్థితిలో ఉండే మహాత్ములు, గుణముల ప్రభావం వలన తమ మనస్సులో పుట్టే అన్ని చెడు తలంపుల నుండీ, తమను తాము దూరం చేసుకునే కళను బాగా అభ్యసించిన వారే.

09:06 - ఇక మన తదుపరి వీడియోలో, త్రిగుణములకు అతీతులైనవారు ఎవరో, శ్రీ కృష్ణుడి వివరణలో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, April 24, 2023

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu


అంపశయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన అద్భుత నీతి కథ!

మహాభారతంలో నేటి జీవన శైలికి ఉపయోగపడే ఎన్నో నీతి కథలున్నాయి. ధర్మరాజు సందేహాల నివృత్తి కోసం, భీష్మపితామహుడు వివరించిన కథలు నేటికీ అనుసరణీయమే. అయితే, ఈ రోజు మనం తెలుసుకోబోయే కథకు, ఒక ప్రత్యేకత ఉంది. మామూలుగా మనం విన్నవీ, చదివినవీ, అంపశయ్య మీదున్న భీష్ముణ్ణి ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా, భీష్ముడు చెప్పిన కథలను. ఈ కథను మాత్రం, ధర్మరాజు తనను ప్రశ్నించకుండానే, తనంతట తానుగా తెలియజేశాడు భీష్మపితామహుడు. భారతీయుల చారిత్రక గ్రంధమైన మహాభారత కావ్యం, శాంతి పర్వంలోని ఆపద్ధర్మ పర్వం అనే ఉప పర్వంలో, 137వ అధ్యాయంలో, 24వ శ్లోకంలో ఉన్న ఈ కథతో, కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి? ఏ మేరకు అప్రమత్తంగా ఉండాలి? అనే అంశాలను అనుసంధానించి, భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు...

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/HB27utkLXCo ]



ఈ కథ ఒకరకంగా, ప్రస్తుతం మన దేశంలో నెలకొని ఉన్న Secular పరిస్థితులకూ వర్తిస్తుంది. అది ఎలా అనేది అన్వయించుకుని, మీకేమనిపించిందో, మీ అభిప్రాయాలను Comment ద్వారా తెలియజేయండి.

ఒక చెరువులో మూడు చేపలుండేవి. దీర్ఘదర్శీ, ప్రాప్తకాలజ్ఞుడూ, దీర్ఘసూత్రుడనేవి వాటి పేర్లు. ముగ్గురి ఆలోచనలూ, నడవడికలూ వేరైనా, అవి మంచిమిత్రులు. నీరు నిండుగా ఉండి, చెరువు చల్లగా ఉండడంతో, హాయిగా కాలం గడిపేవవి. అయితే, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! వర్షాకాలం గడిచింది. శీతకాలం గడిచింది. ఇక ఎండాకాలం రానే వచ్చింది. ఎండాకాలం వస్తూనే, వేడి నిప్పులను చెరిగింది. ఎండ వేడిమికి వడగాడ్పులు తోడవడంతో, చెరువు ఎండి పోసాగింది. రాబోయే విపత్కర పరిస్థితిని ముందుగానే గమనించాడు, దీర్ఘదర్శి. మిత్రులిద్దరినీ పిలిచి, ఇలా చెప్పాడు. ‘చూశారుగా మిత్రులారా! ఈ ఏడు ఎండలు విపరీతంగా ఉన్నాయి. రోజు రోజుకీ చెరువు ఎండిపోతున్నది. ఎండిపోయిన చెరువులో మనం ఉండడం, ప్రమాదకరం. పైగా, ఈ చెరువుకీ, ఇంకో చెరువుకీ పల్లంలో గల కాలువ మార్గం కూడా ఎండిపోయిన పక్షంలో, మన బ్రతుకే ప్రశ్నార్థకమవుతుంది. అందుకని ముందుగా మనం మేల్కోవడం మంచిది. కాలువ మార్గం ద్వారా ఏదైనా ఇంకో చెరువుకు ప్రయాణించడం, శ్రేయస్కరం.

’’దీర్ఘదర్శి ఆలోచనా, ఆందోళనా విన్న స్నేహితులిద్దరూ నవ్వుకున్నారు. వారిలో ప్రాప్తకాలజ్ఞుడు వెక్కిరింపుగా, ‘‘మొదలుపెట్టావా? ఎండాకాలం ప్రారంభమయింది, ఇంకా మొదలుపెట్టలేదేమిటా అని చూస్తున్నాను’ అని పగలబడి నవ్వి, ‘‘అన్నింటికీ ముందే భయపడకూడదు మిత్రమా! ప్రమాదం అని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకడం, దుఃఖ దాయకం. ప్రమాదం ముంచుకొస్తే, అప్పుడు ఆలోచిద్దాము. అప్పటిదాకా హాయిగా ఉండు. లేనిపోని భయాలు పెట్టుకోకు’’ అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. వెంటనే దీర్ఘసూత్రుడు మాట్లాడుతూ,‘‘ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడెండిపోయింది చెరువు? సముద్రంలా చల్లగా ఉంటేను. ప్రతి సారీ ఎండాకాలం వస్తుంది, ఆ తరువాత వర్షాకాలం వస్తుంది. అయినా ఇప్పుడప్పుడే ఈ చెరువు ఎండిపోదు. మనకే ఆపదా రాదు. తిని తిరక్కుండా, ఎందుకీ భయాలు’’ అని, దీర్ఘదర్శి మాటలను, వారిరువురూ కొట్టి పారేశారు. 

తన మాట వినిపించుకోని మిత్రులిద్దరినీ జాలిగా చూశాడు, దీర్ఘదర్శి. ఇక అక్కడ ఉండడం ఎంత మాత్రం క్షేమకరం కాదనుకుని, పల్లంలో గల కాలువ ప్రవాహంలో ప్రయాణించి, వేరే చెరువుకు చేరుకున్నాడు. కొద్ది రోజులు గడిచాయి. దీర్ఘదర్శి చెప్పినట్లు, చెరువులోని నీరు క్రమక్రమంగా ఇంకి పోసాగింది. అది గమనించిన జాలరులు చేపల వేటకు సిద్ధమయ్యారు. నీరు సరిగాలేని ఆ చెరువులో, జాలరులకు చేపలు ఇట్టే దొరికిపోసాగాయి. దొరికిన చేపలను తాటినారకు గుది గుచ్చి, మళ్ళీ మరిన్ని చేపల కోసం చెరువును అల్లకల్లోలం చేయసాగారు. ప్రాప్తకాలజ్ఞుడు జాగ్రత్తగా అంతా పరిశీలించి, ఒక పథకాన్ని ఆలోచించాడు. ‘జాలరి చేతికి చిక్కితే, ఇక అంతే సంగతులు. అందుకని ఇప్పుడు ఎంచక్కా తాటి తీగను నోటితో కరచి పట్టుకుని, చచ్చిన దానిలా వ్రేలాడతాను. పట్టిన చేపల మట్టిని వదిలించేందుకు, జాలరి ఎప్పుడయితే మంచి నీటిలో చేపలన్నిటినీ ముంచి తీస్తాడో, అప్పుడు అదే అవకాశంగా, నీటిలోకి జారుకుంటాను. అక్కడి నుండి సురక్షితమైన ఇంకో చోటుకు చేరుకుని, ఈ ప్రమాదాన్నించి తప్పించుకుంటాను’ అని ఆలోచించి, తన పథకాన్ని అనుకున్నట్టుగానే చేశాడు. చేపల గుత్తిని కరచి పట్టుకుని, చచ్చినట్టు నటించాడు ప్రాప్తకాలజ్ఞుడు.

జాలరి మరిన్ని చేపలను పట్టుకుని, అక్కణ్ణుంచి ముందుకు నడిచాడు. బురదలేని, తేటనీటి కొలను దగ్గరకు చేరుకున్నాడు. అలసిపోయాడేమో! దాహమనిపిస్తే, దోసిట నీరు పట్టి త్రాగాడు. తర్వాత తాను తెచ్చిన చేపల గుత్తిని ఎత్తి చూశాడు. చేపలన్నీ బురద బురదగా ఉన్నాయి. వాటి బురదను పోగొట్టేందుకు, చేపల గుత్తిని మంచి నీటిలో ముంచి తీశాడు. జాలరి గుత్తిని ముంచడమే ఆలస్యం. ప్రాప్తకాలజ్ఞుడు చల్లగా నీటిలోకి జారుకుని, తన ప్రాణాలను కాపాడుకున్నాడు. దీర్ఘసూత్రుడు మాత్రం, దీర్ఘదర్శిలా ముందే మేల్కొనకుండా, ప్రాప్తకాలజ్ఞుడిలా తగిన సమయానికి, తగిన విధంగా ప్రవర్తించకుండా, ‘ఆఁ! ఏం కాదులే’ అనుకుంటూ రోజులు గడిపేసి, చివరకు జాలరి వలకు చిక్కి, చనిపోయి, మరొకరికి ఆహారమయిపోయాడు’’.. ఈ కథలో నేర్చుకోవాల్సింది చాలా ఉంది..

ప్రాణం మీదకు వచ్చిన ఆపదను తెలుసుకోలేని మూర్ఖులూ, రాగల ఆపదను ముందుగానే పసిగట్టే ప్రయత్నం చేయని అజ్ఞానులూ, దీర్ఘసూత్రునిలా ప్రమాదంలో చిక్కుకుని, మరణిస్తున్నారు. నేను తెలివి గలవాడిని, అవసరం వచ్చినపుడు ఆలోచించుకోవచ్చులే అని నిర్లక్ష్యంగా ఉండేవాడు, ప్రాప్తకాలజ్ఞుడిలా, ప్రాణసంకటంలో పడతాడు. రాగల ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన దీర్ఘదర్శిలాంటి జాగ్రత్తపరులు, చీకూ చింతా లేకుండా, హాయిగా, సుఖంగా ఉండగలుగుతారు.’’ అని భీష్ముడు ధర్మరాజుకు, తన కర్తవ్యాన్ని ముందు చూపుతో ఏవిధంగా నిర్వర్తించాలో,  తెలియజేశాడు.

ఈ కథను మన పాఠ్యాంశాలలో, ప్రాథమిక స్థాయి తరగతులలో, చదివే ఉంటాము. అయితే, ఈ కథ భారతంలో ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ఈ కథలోని దీర్ఘదర్శి, రాబోయే ఆపదను ముందుగానే పసిగట్టి, ఆపద రాకముందే సురక్షితంగా బయట పడాలనే నీతిని తెలుపుతోంది. ఈ పద్ధతి ఉత్తమమైనది. ఎలాంటి భయం, ఆందోళనా లేకుండా, ప్రశాంత జీవనం గడపడానికి, ఇది పనికి వస్తుంది. అపాయం ఎదురైనప్పుడు, ఉపాయంతో బయట పడడం, మధ్యమం. ఈ పద్ధతిలో, అపాయం నుంచి బయట పడేవరకూ, ప్రాణాలు అరచేతిలో చిక్కబట్టుకోవాలి. అపాయం నుంచి తప్పించుకోవడానికి, మన ఉపాయం నెరవేరుతుందో లేదో, తెలియదు. అందువల్ల, దాని కంటే మొదటి పద్ధతే ఉత్తమమైనది. ఒక వేళ ఏ కారణం చేతనైనా మొదటి పద్ధతిని పాటించలేకపోతే, ప్రాప్తకాలజ్ఞుడిలా రెండవ పద్ధతి ద్వారా, ప్రాణాలు కాపాడుకోవాలి. ఈ రెండు పద్ధతులూ పాటింపని సోమరిలా ఉంటే, దీర్ఘసూత్రుని లాగా నశించిపోవలసి వస్తుందనే చక్కని నీతిని, ఈ కథ ద్వారా భీష్మపితామహుడు, ధర్మరాజు తోపాటు, మనందరికీ తెలియజేశాడు.

ఏ విషయమైనా, మన దాకా వచ్చిన తరువాత చూసుకుందాములే.. అని తాత్సారం చేసి, భావితరాలను ముంపుకు గురిచేయకుండా, సరైన నిర్ణయాలను తీసుకుని, జాగ్రత్త పడదాము. సనాతన ధర్మాన్ని మించిన ధర్మం లేదు..

సర్వం కృష్ణ మయం!

Wednesday, April 19, 2023

పునర్జన్మలు వేటి మీద ఆధారపడి ఉంటాయి? భగవద్గీత Bhagavadgita


కర్మ సిద్ధాంతం! జీవాత్మల భవితవ్యం లేక పునర్జన్మలు వేటి మీద ఆధారపడి ఉంటాయి?

'భగవద్గీత' చతుర్దశోధ్యాయం – గుణత్రయ విభాగ యోగం (14 – 18 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్నాలుగవ అధ్యాయం, గుణత్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, గుణత్రయ విభాగ యోగములోని, 14 నుండి 18 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/gR4mTu-pZQg ]


త్రిగుణములచే ప్రసాదింపబడే గమ్యములను, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:46 - యదా సత్త్వే పవృద్ధే తు ప్రలయం యాతి దేహభృత్ ।
తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే ।। 14 ।।

00:56 - రజసి ప్రలయం గత్వా కర్మసంగిషు జాయతే ।
తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే ।। 15 ।।

సత్త్వ గుణ ప్రధానముగా ఉంటూ మరణించినవారు, జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలను అంటే, రజస్సు, తమస్సు లేనటువంటి లోకాలను చేరుకుంటారు. రజో గుణ ప్రధానముగా ఉంటూ మరణించినవారు, కర్మాసక్తులైన వారిలో జన్మిస్తారు; తమో గుణ ప్రభావంతో ఉంటూ మరణించిన వారు, జంతువుల జీవ రాశిలో పుడతారు.

జీవాత్మల భవితవ్యం, వాటి వ్యక్తిత్వ గుణముల మీద ఆధారపడి ఉంటుంది. భగవంతుని శాసనంలో, కర్మ సిద్ధాంతం ప్రకారం, మనకు ఏది పొందటానికి అర్హత ఉన్నదో, అదే లభిస్తుంది. ఎవరైతే సద్గుణములు, జ్ఞానము, మరియు ఇతరుల పట్ల సేవా భావాన్ని పెంపొందిచుకుంటారో, వారు ధర్మాత్ములు, పండితులు, లేదా సమాజ సేవకుల కుటుంబములలో జన్మిస్తారు, లేదా, వారు ఉత్తమ లోకాలకు వెళతారు. ఎవరైతే దురాశ, ధన దాహము, మరియు ప్రాపంచిక అభ్యుదయేచ్ఛలకు లొంగిపోతారో, వారు తీవ్రమైన భౌతిక, లౌకిక వ్యవహారములు నడిపే కుటుంబములలో, తరచుగా వ్యాపార కుటుంబాలలో జన్మిస్తారు. ఎవరైతే  హింస, సోమరితనం, మరియు కర్తవ్య నిర్వహణ పట్ల నిర్లక్ష్యం - వీటి పట్ల మొగ్గు చూపిస్తుంటారో, వారు తాగుబోతులూ మరియు చదువురాని వారి కుటుంబములలో జన్మిస్తారు, లేదా, వారు నిమ్నస్థాయి జీవరాశులలో, జంతువులలో జన్మిస్తారు. చాలా మంది జనులకు ఒక సందేహం ఉంటుంది. ఒకసారి మానవ రూపము వచ్చిన తరువాత, తిరిగి నీచ స్థాయి జాతులలో పడిపోవటం సంభవమేనా? అని. ఆత్మకు మానవ దేహము శాశ్వతముగా ఇచ్చివేయబడినది కాదని, ఈ శ్లోకము తెలియచేస్తున్నది. ఎవరైతే దానిని సరిగ్గా వాడుకోరో, వారు జంతువులలోకి వెళ్లిపోవాల్సిన ప్రమాదం ఉంటుంది. ఈ విధంగా, అన్ని మార్గాలూ, అన్ని సమయాలలో తెరచే ఉంటాయి. తనకు ఉండే గుణముల తీవ్రత, మరియు తరచుదనాన్ని బట్టి, ఆత్మ - ఆధాత్మిక పురోగతిలో పైకి వెళ్ళవచ్చు, లేదా అదే స్థాయిలో ఉండిపోవచ్చు, లేదా ఇంకా తక్కువ స్థాయికి పడిపోవచ్చు.

03:09 - కర్మణః సుకృతస్యాహుః సాత్త్వికం నిర్మలం ఫలమ్ ।
రజసస్తు ఫలం దుఃఖమ్ అజ్ఞానం తమసః ఫలమ్ ।। 16 ।।

సత్త్వ గుణములో చేసిన కార్యముల ఫలములు, పవిత్రమైన ఫలితములను ఇస్తాయి. రజో గుణములో చేసిన పనులు, దుఃఖాలను కలుగ చేస్తాయి, మరియు, తమో గుణములో చేసిన పనులు అజ్ఞానపు చీకటిని కలుగచేస్తాయి.

సత్త్వ గుణము ప్రధానముగా ఉన్నవారు, స్వచ్ఛత, సద్గుణము, జ్ఞానము, మరియు నిస్వార్ధముతో ఉంటారు. కాబట్టి, వారి యొక్క పనులు మిగతావారితో పోల్చితే, పవిత్రమైన ఉద్దేశంతో ఉంటాయి, ఆ యొక్క ఫలితములు ఉద్ధరించేవిగా, మరియు తృప్తినిచ్చేవిగా ఉంటాయి. రజో గుణముచే ప్రభావితమయ్యేవారు, తమ మనస్సు-ఇంద్రియముల యొక్క కోరికలచే, ఉద్వేగానికి గురౌతుంటారు. వారి యొక్క పనుల వెనుక ప్రధానోద్దేశం, సొంత గొప్పలూ, మరియు తమ యొక్క, తమ వారి యొక్క ఇంద్రియ-తృప్తీ ఉంటుంది. ఈ విధంగా వారి యొక్క పనులు ఇంద్రియ భోగానుభవము కోసం ఉంటాయి. అవి ఇంద్రియ వాంఛలను మరింత విజృభింప చేస్తాయి. తమో గుణము ప్రబలంగా ఉన్నవారికి, శాస్త్ర ఉపదేశాల పట్ల, మరియు మంచి నడవడిక పట్లా, ఏ మాత్రం గౌరవం ఉండదు. వారు పాపపు పనులు చేస్తూ, వక్రబుద్ధితో భోగవిలాసాలను అనుభవిస్తుంటారు. ఇది వారిని మరింత మోహభ్రాంతిలోనికి నెట్టివేస్తుంది.

04:37 - సత్త్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ।
ప్రమాదమోహౌ తమసో భవతోఽజ్ఞానమేవ చ ।। 17 ।।

సత్త్వ గుణముచే జ్ఞానమూ, రజో గుణముచే లోభమూ, మరియు తమో గుణముచే నిర్లక్ష్యమూ, మరియు మోహమూ జనించును.

త్రి-గుణముల వలన సంభవించే ఫలితములలో వైవిద్యమును వివరించిన పిదప, శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, దీనికి వెనుక కారణమును చెబుతున్నాడు. సత్త్వ గుణము జ్ఞానమును పెంపొందించుతుంది. దీనివలన మంచి-చెడు మధ్య విచక్షణను తెలుస్తుంది. అది ఇద్రియ లౌల్యమును కూడా తగ్గిస్తుంది. అదే సమయంలో, తృప్తి మరియు సంతోషమును కలుగ చేస్తుంది. సత్త్వగుణ ప్రధానంగా ఉన్నవారు, జ్ఞాన సముపార్జన, మరియు ధార్మిక ఆలోచనల వైపు మొగ్గు చూపిస్తారు. ఈ విధంగా, సత్త్వగుణము వివేకవంతమైన పనులను ప్రోత్సహిస్తుంది. రజో గుణము ఇంద్రియములను ఉద్రేకపరుస్తుంది, మరియు మనస్సుపై నియంత్రణ తప్పేటట్లు చేస్తుంది, ఎదో సాధించాలనే కోరికల వలయంలో, తిరుగుతూ ఉండేలా చేస్తుంది. ఇది జీవుడిని కోరికలతో బంధించివేసి, సుఖసంపదల కోసం తీవ్రంగా పరిశ్రమించేటట్లు చేస్తుంది. కానీ, ఇవి ఆత్మ దృక్పథంలో వ్యర్థమైనవి. తమో గుణము, జీవుడిని జడత్వం, మరియు అజ్ఞానముతో కప్పివేస్తుంది. అజ్ఞానముతో ఆవరించబడి, వ్యక్తి తప్పుడు, మరియు పాపపు పనులు చేసి, వాటి యొక్క ఫలితములను అనుభవిస్తాడు.

06:09 - ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థా మధ్యే తిష్ఠంతి రాజసాః ।
జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్ఛంతి తామసాః ।। 18 ।।

సత్త్వ గుణములో స్థితమై ఉన్నవారు, ఉన్నత స్థాయికి వెళతారు; రజో గుణములో స్థితమై ఉండేవారు, మధ్యస్థాయిలోనే ఉండిపోతారు. తమో గుణములో స్థితమై ఉండేవారు, అధోగతి పాలౌతారు.

జీవాత్మల పునర్జన్మ, వాటి వ్యక్తిత్వంలో ప్రబలంగా ఉండే గుణముల మీద ఆధారపడి ఉంటుందని, శ్రీ కృష్ణుడు ఇక్కడ వివరిస్తున్నాడు. ప్రస్తుత జన్మ ప్రయాణాన్ని పూర్తి చేసిన పిదప, జీవులు వారి వారి గుణములకు అనుగుణంగా ఉండే లోకాలకు చేరుకుంటాయి. ‘సత్త్వ గుణములో ఉన్నవారు, స్వర్గాది ఊర్ధ్వలోకములకు వెళతారు; రజో గుణములో ఉండేవారు, భూలోకానికి తిరిగి వస్తారు; తమో గుణములో ఉండేవారు, నరక లోకాలకు వెళతారు. అలాగే, త్రిగుణాతీతులైనవారు, నన్నే పొందుతారు.’ అని భాగవతంలో పేర్కోనబడింది.
07:10 - ఇక మన తదుపరి వీడియోలో, ప్రకృతి త్రి-గుణములకు అతీతముగా అయినవారి లక్షణములు ఏ విధంగా ఉంటాయో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, April 17, 2023

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

 

దుర్యోధనుడికి భీష్ముడు వివరించిన శిఖండి జన్మ రహస్యం!

మహాభారత కావ్యంలో, శిఖండిది ఒక విచిత్రమయిన పాత్ర. ద్రుపదమహరాజుకు కూతురుగా, శిఖండిగా జన్మించి, తరువాత మహారథుడయిన కొడుకుగా మారిన విచిత్ర గాధ. ఎవరైనా పంతాలూ పట్టింపులకు పొయినా, అనుకున్నది సాధించేవరకూ నిద్రపోని లక్షణాలు కనిపించినా, ''శిఖండి'' అని గొణుక్కోవడం, చాలామందికి పరిపాటే. తన పూర్వ జన్మలో భీష్ముడిపై కక్షతో, ఆత్మత్యాగం చేసుకున్న అంబ, మరు జన్మలో శిఖండిగా జన్మించి, భీష్ముడి మరణానికి కారణమైందన్న సంగతి, అందరికీ తెలిసిందే. కానీ, శిఖండి స్త్రీ గా జన్మించి, పురుషుడిగా మారడమనే విషయం, కొంతమందికి మాత్రమే తెలుసు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు, దుర్యోధనుడు తన సైన్యానికి భీష్ముడిని, సర్వ సైన్యాధ్యక్షునిగా చేసినపుడు, భీష్ముడు తన శక్తి సామర్థ్యాలను గురించి, దుర్యోధనుడు మొదలైన ధార్తరాష్ట్రులకు చెబుతూ, "స్త్రీని గానీ, మొదట స్త్రీగా ఉండి, తరువాత పురుషుడిగా మారిన వ్యక్తిని గానీ చంపను. శిఖండి మొదట స్త్రీగా పుట్టి, తర్వాత పురుషుడయ్యింది. అలాంటి వాడు నన్నెదిరించి, నా మీద బాణాలు వేసినప్పటికీ, నేను అతని మీద బాణం వెయ్యను" అని చెప్పాడు. అలా ఎందుకు వెయ్యలేవని దుర్యోధనుడు భీష్ముణ్ణి ప్రశ్నించాడు. దానికి సమాధానంగా భీష్ముడు, అంబోపాఖ్యానాన్ని వివరించాడు. స్త్రీగా జన్మించిన శిఖండి పురుషత్వాన్ని ఎలా పొందిందో, భారతంలో భీష్ముడు వివరించిన శిఖండి జన్మ రహస్యాన్ని, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/rOzNea41xS0 ]


ద్రుపద మహారాజుకు భీష్మునిపై ఉన్న కోపం కారణంగా, అతనిని చంపగల కుమారుణ్ణి ప్రసాదించమని, శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై, ద్రుపదుడికి పుట్టబోయే కూతురే పురుషుడిగా మారి, భీష్ముడి మరణానికి కారణమవుతుందని, అభయమిచ్చాడు. ద్రుపదుడు జరిగిన విషయమంతా తన భార్యకు వివరించాడు. ఈశ్వరుడు వరమిచ్చినట్లుగానే, వారికొక కుమార్తె జన్మించింది. వారు ఆమెకు శిఖండి అని నామకరణం చేసి, కుమారునిగానే పెంచారు. ఆమెకు ద్రోణాచార్యుని వద్ద విలువిద్య నేర్పించారు. ఆమె యవ్వనవతి కాగానే, శివుని వరం వృధా పోదు అని విశ్వసించి, పురుషత్వం రాక మునుపే, ఆమెకు వివాహం చేయాలని నిశ్చయించారు. వారు దశార్ణ దేశ రాజైన హేమవర్మ కుమార్తెతో, వివాహం జరిపించారు. శిఖండి గురించిన రహస్యం తెలుసుకున్న భార్య, మౌనంగా ఉండి పోయింది.

కానీ, ఆమె చెలికత్తె ద్వారా ఈ విషయం తెలుసుకున్న దశార్ణ మహారాజు, తననూ, తన కుమార్తెనూ మోసం చేసినందుకు, తమ రాజ్యం మీదకు దండయాత్రకు వస్తున్నట్లు, ద్రుపదునికి దూతద్వారా తెలియపరచి, తన సేనలతో పాంచాల దేశాన్ని ముట్టడించాడు. శిఖండి తన పురుషత్వం గురించి, రెండుదేశాలు యుద్ధం చేసుకోవడం చూసి, సిగ్గుపడింది. అర్ధరాత్రి లేచి, అరణ్యంలోకి వెళ్ళింది. ఆ అరణ్యంలో స్థూలకర్ణుడనే యక్షుడు నివసించేవాడు. అతనికి భయపడి, మనుష్యులెవ్వరూ ఆ అరణ్యంలోకి ప్రవేశించేవారు కాదు. అది తెలిసే, శిఖండి అడవిలోకి ప్రవేశించింది. ఆ విషయం గ్రహించిన యక్షుడు శిఖండిని చూసి, "కుమారీ, నీవెవరు? ప్రాణముల మీద ఆశ వదలి, ఇక్కడికి ఎందుకు వచ్చావు?" అని అడిగాడు. శిఖండి జరిగినదంతా అతనికి వివరించి, తనకు పురుషత్వం కావాలి కానీ, అది శివుని వలననే సాధ్యం కాగలదని చెప్పి, చింతించింది.

అది విన్న యక్షుడు ఒక ఉపాయం చెప్పాడు. "నేను నీకు ఒక్క పది రోజుల కాలం నా పురుషత్వాన్ని ఇచ్చి, నీ స్త్రీ రూపం నేను ధరిస్తాను. ఆ సమయంలో నీవు హేమవర్మ వద్దకు వెళ్ళి, నీ పురుషత్వం నిరూపించుకో. పరిస్థితిలు చక్కబడగానే ఇక్కడకు తిరిగి వస్తే, మరలా మనం ఎవరి రూపం వారు పొందవచ్చ"ని అన్నాడు. శిఖండి అందుకు అంగీకరించి, యక్షుని నుండి పురుషత్వం స్వీకరించి, తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు. జరిగినది వారికి వివరించగానే వారు సంతోషించి, సమస్యకు కనీసం తాత్కాలిక పరిష్కారం లభించిందని తెలుసుకుని, హేమవర్మ వద్దకు దూతలను పంపి, తన వద్దకు రప్పించి, శిఖండి పురుషుడేనని నిరూపించాడు. హేమవర్మ తన తొందర పాటుకు చింతించి, ద్రుపదునికి క్షమాపణ చెప్పాడు. ద్రుపదుడు వారికి విందులూ, వినోదాలూ ఏర్పాటు చేసి, వారిని సగౌరవంగా సాగనంపాడు. ఇలా రెండు రోజులు గడిచిన తరువాత, కుబేరుడు తన విమానంపై విహరింస్తూ, యక్షుడైన స్థూలకర్ణుని మందిరానికి వెళ్ళాడు.

ఎంతకూ స్థూలకర్ణుడు తనను ఆహ్వానించడానికి రాకపోవడంతో కోపించి, కిన్నెరులను కొంత మందిని లోపలకు పంపి, స్థూలకర్ణుని విషయం కనుక్కుని రమ్మన్నాడు. కిన్నెరులు జరిగిన విషయమంతా స్థూలకర్ణునిద్వారా తెలుసుకుని, కుబేరుని వద్దకు వచ్చి చెప్పారు. దానికి కుబేరుడు శాంతించి, అతడిని స్త్రీరూపంతోనే రమ్మని చెప్పి, తన వద్దకు వచ్చిన స్థూలకర్ణునితో, "జరిగినదేదో జరిగింది. ఇది దైవ సంకల్పం. నీవు ఇక ఇలాగే ఉండు" అని అన్నాడు. స్థూలకర్ణుడు కుబేరుని కాళ్ళపై బడి విమోచన మార్గం చెప్పమని బ్రతిమాలాడు. దానికి కుబేరుడు, "స్థూలకర్ణా! దైవ సంకల్పానికి అనుగుణంగా జరిగినది, ఈ మార్పిడి. శిఖండిని జీవితాంతం పురుషునిగానే ఉండనివ్వు. జరగవలసిన ఈశ్వర సంకల్పం నెరవేరగానే, శిఖండి మరణిస్తాడు. ఆ తరువాత నీ పురుష రూపం నీకు వస్తుంది" అని చెప్పి, తన విమానంపై అలకాపురికి తిరిగి వెళ్ళాడు.

శిఖండి మాత్రం, తిరిగి స్థూలకర్ణుడిని కలుసుకుని, తన పురుషత్వాన్ని స్వీకరించి, స్త్రీత్వాన్ని తిరిగి ఇవ్వమని అడిగాడు. అప్పుడు స్థూలకర్ణుడు జరిగినదంతా వివరించి, ఇది దైవ సంకల్పం కనుక, నీవు ఇక పురుషుడిగానే సంచరించవచ్చని చెప్పాడు. శిఖండి పరమ సంతోషం చెంది, తన తల్లి తండ్రులకు జరిగనది వివరించాడు. అతడు బ్రాహ్మణులనూ, దేవతలనూ పూజించి, ఎన్నో వ్రతాలను ఆచరించి, ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి, అతడి శిష్యునిగా చేరి, ద్రోణాచార్యుని వలన విలువిద్యా ప్రావీణ్యాన్ని పొందాడు. మహాభారత యుద్ధములో, అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకుని చేసిన యుద్ధము వలన, భీష్ముడు అస్త్ర సన్యాసము చేసి, అంపశయ్యపై చేరటముతో, శిఖండి చరిత్ర ముగుస్తుంది. శిఖండిగా పుట్టిన అంబ, తన గత జన్మలో చేసిన శపథాన్ని నేరవేర్చుకుంది.

అంబ శిఖండిగా మారటం అనేది, భీష్ముని తనువు చాలించటానికే. ఎందుకంటే, భీష్ముడి లాంటి పరాక్రమవంతుడినీ, ధర్మ నిష్టాపరుడినీ, ఏ రకమైన శస్త్రాలూ, ఎటువంటి వీరులూ సంహరించలేరు. ఇందులో మరో ఆసక్తికరమైన విషయమేటింటే, అంబే శిఖండిగా జన్మించిందనీ, ఆమె వల్లే తనకు మరణం తథ్యమనీ, భీష్ముడికి కూడా తెలుసు. తనంతట తానుగా కోరుకుంటేనే మరణించే ‘ఇచ్ఛా మరణ’ వరం పొంది వుండి కూడా, శిఖండిని ఎదురించడానికి గానీ, మృత్యువు నుండి తప్పించుకోవడానికి గానీ, భీష్మ పితామహుడు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. స్వచ్ఛందంగా తన మరణాన్ని స్వాగతించి, అంపశయ్యపై ఉన్న భీష్ముడిని చూసి, సాక్షాత్తూ ఆ కృష్ణ భగవానుడే ఛలించిపోయాడంటే, ఆ మహా వీరుడి గొప్పదనం ఎంటో తెలుసుకోవచ్చు.

భీష్ముడు పరమపదం చేరిన మాఘశుద్ధ అష్టమినాటిని “భీష్మాష్టమి” గానూ, మాఘశుద్ధ ఏకాదశిని, “భీష్మ ఏకాదశి” గానూ, మనం నేటికీ ఆచరిస్తూ, ఆయనను స్మరిస్తున్నాం. భీష్మ నిర్యాణం జరిగి, సహస్రాబ్దాలు గతిస్తున్నా, ఆయన ప్రవచించిన “విష్ణు సహస్ర నామ స్తోత్రం”, యిప్పటికీ భాగవతుల రసాగ్రాలపై నర్తిస్తూనే వుంది. ఆయన దివ్య వాణి, విశ్వవ్యాప్తమై, ప్రతిధ్వనిస్తూనే వుంది. విష్ణుసహస్రనామ పఠనం, సర్వ దుఃఖహరం, సకల శుభకరం.
     
ఓం నమో భగవతే వాసుదేవాయ!

Wednesday, April 12, 2023

ఆకర్షణ! భగవద్గీత Bhagavadgita Chapter 14


ఆకర్షణ! స్త్రీ-పురుషుల మధ్య ఆకర్షణ పెంచేది ఏది?

'భగవద్గీత' చతుర్దశోధ్యాయం – గుణత్రయ విభాగ యోగం (09 – 13 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్నాలుగవ అధ్యాయం, గుణత్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, గుణత్రయ విభాగ యోగములోని, 09 నుండి 13 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/MBDgoVEZ_08 ]


సత్త్వ, తమః, రజో గుణముల లక్షణాలను, ఈ విధంగా తెలియజేస్తున్నాడు భగవానుడు..

00:48 - సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత ।
జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత ।। 9 ।।

సత్త్వము వ్యక్తిని భౌతిక సుఖాలకు కట్టివేస్తుంది; రజో గుణము, జీవాత్మకు కర్మల పట్ల ఆసక్తిని కలిగిస్తుంది; తమో గుణము, జ్ఞానమును కప్పివేసి, వ్యక్తిని మోహభ్రాంతికి బంధించివేస్తుంది.

సత్త్వ గుణములో భౌతిక జీవన క్లేశములు తగ్గుతాయి, మరియు ప్రాపంచిక కోరికలు తగ్గుముఖం పడతాయి. ఇది వ్యక్తి యొక్క స్థితిలో, ఒకలాంటి సంతుష్టిని కలుగచేస్తుంది. ఇది మంచిదే.. కానీ, దీనితో ఒక ఇబ్బంది కూడా ఉంది. ప్రపంచంలో క్లేశములకు గురైనవారూ, మరియు మనస్సులో ప్రాపంచిక కోరికలతో సతమతమై పోయేవారూ, వారి సమస్యలకై పరిష్కారమును వెదుకుతూ ఉంటారు. ఈ ప్రయత్నమే కొన్నిసార్లు, వారిని ఆధ్యాత్మికత వైపుకు తెస్తుంది. కానీ, సత్త్వ గుణములో ఉన్నవారు, ఒకలాంటి నిశ్చింతతో కూడిన తృప్తితో ఉండిపోయి, అలౌకిక స్థాయికి చేరుకోవటానికి, ఉత్సాహం చూపరు. సత్త్వ గుణము, బుద్ధిని జ్ఞానముచే ప్రకాశవంతము చేస్తుంది. దీనితో పాటుగా, ఆధ్యాత్మిక వివేకము లేకపోతే, జ్ఞానముతో గర్వము పెరిగి, ఆ గర్వము భగవత్ భక్తిలో అడ్డుగా వస్తుంది. దీనిని మనము, కొందరు శాస్త్రవేత్తలూ, విద్యావేత్తలూ, పండితులూ, మొదలైన వారిలో గమనించవచ్చు. వీరిలో సత్త్వ గుణము సాధారణంగా, ఎక్కువ ప్రభావశీలంగా ఉంటుంది. ఎందుకంటే, వారి యొక్క సమయాన్నీ, శక్తినీ, జ్ఞాన సముపార్జనలో వినియోగిస్తారు. అయినా, వారికి ఉన్న జ్ఞానము, వారిని కొన్నిసార్లు గర్వితులను చేస్తుంది. వారి బుద్ధికి అతీతముగా ఇంకే పరమ సత్యమూ లేదని అనుకుంటూ ఉంటారు. రజో గుణములో, జీవులు తీవ్ర పరిశ్రమ దిశగా ప్రేరణ పొందుతారు. ప్రపంచం పట్ల వారి అనురక్తీ, మరియు సుఖాలూ, హోదా, సంపద, మరియు శారీరిక సౌకర్యాల పట్ల వారి యొక్క ఆసక్తి, తమ ఆశయాలను సాధించే దిశగా పరిశ్రమించేటట్లు, వారిని ప్రేరేపిస్తుంది; అవే వారికి జీవితంలో అత్యంత ముఖ్యమైనవిగా అనిపిస్తాయి. రజో గుణము, స్త్రీ-పురుషుల మధ్య ఆకర్షణ పెంచుతుంది, మరియు కామమును ప్రేరేపిస్తుంది. ఈ కామమును తృప్తిపర్చుకోవటానికి, పురుషుడు-స్త్రీ వైవాహిక సంబంధంలోకి ప్రవేశించి, ఒక గృహమును కలిగి ఉంటారు. ఆ గృహమును నిర్వహించుకోవటానికి సంపద అవసరము కాబట్టి, వారు ఆర్ధిక అభ్యున్నతి కోసము పరిశ్రమిస్తుంటారు. తీవ్ర వ్యవహారములు చేస్తుంటారు కానీ, ఆ ప్రతి-ఒక్క పనీ, మరిన్ని కర్మలను సృష్టిస్తుంది, మరియు అవి వారిని మరింత భౌతిక అస్థిత్వ బంధనములో, బంధించివేస్తాయి. తమోగుణము, ప్రాణుల బుద్ధిని మబ్బులా కప్పివేస్తుంది. సుఖాల కోసం వాంఛ, ఇక ఇప్పుడు వక్రమైన తప్పుడు విధాలుగా పరిణమిస్తుంది. ఉదాహరణకి, సిగరెట్టు తాగటం హానికరమని అందరికీ తెలుసు. ప్రతి ఒక్క సిగరెట్టు పాకెట్ మీదా, ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరిక కూడా ఉంటుంది. సిగరెట్టు త్రాగేవారు దానిని చదువుతారు. అయినా, వారు ధూమపానం ఆపరు. ఇది ఎందుకు జరుగుతుందంటే, బుద్ధి తన విచక్షణా శక్తిని కోల్పోయి, తనకు హాని జరిగినా, ఆ ధూమపాన సుఖాన్ని ఆస్వాదించాలని కోరుకుంటుంది. ఇదే తమోగుణము యొక్క ప్రభావము. ఇది ఆత్మను అజ్ఞానపు చీకటిలో బంధించివేస్తుంది.

04:21 - రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత ।
రజఃసత్త్వం తమశ్చైవ తమః సత్త్వం రజస్తథా ।। 10 ।।

ఓ అర్జునా! ఒక్కోసారి రజస్తమోగుణములపై సత్త్వముది పైచేయిగా ఉంటుంది. ఒక్కోసారి, సత్త్వతమోగుణములపై రజో గుణము ఆధిపత్యంతో ఉంటుంది; అలాగే ఇంకాకొన్ని సార్లు, సత్త్వరజో గుణములను తమోగుణము ఓడిస్తుంది.

ఒకే వ్యక్తి యొక్క ప్రవృత్తి, ఈ మూడు గుణములలో ఎలా మారుతూఉంటుందో, శ్రీ కృష్ణుడు ఇప్పుడు వివరిస్తున్నాడు. భౌతిక శక్తి యందు ఈ మూడు గుణములూ ఉన్నాయి. మన మనస్సు ఇదే శక్తితో తయారైనది. అందుకే, ఈ మూడు గుణములూ, మన మనస్సులో కూడా ఉన్నాయి. ఒకరితో ఒకరు తలపడే ముగ్గురు మల్లయోధులతో, వీటిని పోల్చవచ్చు. ప్రతి ఒక్కడూ, మిగతా ఇద్దరినీ క్రింద పడవేస్తుంటాడు. కాబట్టి, ఒక్కోసారి మొదటివాడు పైనుంటాడు, ఒక్కోసారి రెండవవాడు, ఇంకోసారి, మూడవ వాడిది పైచేయి అవుతుంది. ఇదే విధంగా, ఈ మూడు గుణములూ, వ్యక్తి యొక్క ప్రవృత్తి పై, ఒక్కోటి ఒక్కోసారి ఎక్కువ ప్రభావంతో ఉంటాయి. బాహ్యమైన పరిస్థితులూ, అంతర్లీన చింతన, మరియు పూర్వ జన్మ సంస్కారములపై ఆధారపడి, ఒక్కో గుణమూ, ఒక్కోసారి ప్రబలమై ఉంటుంది. ఎంతసేపు ఆ ప్రభావం ఉంటుందన్న దానికి, ఏ నియమమూ లేదు. ఒక్కో గుణము, మనోబుద్ధులపై ఒక క్షణం నుండి, ఒక గంట వరకూ ఉండవచ్చు. సత్త్వ గుణము ప్రబలంగా ఉన్నప్పుడు, వ్యక్తి ప్రశాంతముగా, తృప్తిగా, దయాళువుగా, నిర్మలంగా, ప్రసన్నంగా ఉంటాడు. రజో గుణము ప్రబలంగా ఉన్నప్పుడు, వ్యక్తి ఉద్వేగంతో, లక్ష్యమును సాధించాలనే తపనతో, ఇతరుల విజయం పట్ల అసూయతో, ఇంద్రియ సుఖముల పట్ల ఆసక్తితో ఉంటాడు. తమో గుణము ప్రబలంగా ఉన్నప్పుడు, విపరీత నిద్ర, సోమరితనము, ద్వేషము, కోపము, రోషము, హింస మరియు అపనమ్మకంతో ఉంటాడు.

06:23 - సర్వద్వారేషు దేహేఽస్మిన్ ప్రకాశ ఉపజాయతే ।
జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్త్వమిత్యుత ।। 11 ।।

06:33 - లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహా ।
రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ ।। 12 ।।

06:43 - అప్రకాశోఽప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ ।
తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన ।। 13 ।।

దేహములోని అన్ని ద్వారములూ, జ్ఞానముచే ప్రకాశితమైనప్పుడు, అది సత్త్వగుణము యొక్క ప్రకటితమని తెలుసుకొనుము. రజో గుణము ప్రబలినప్పుడు, ఓ అర్జునా, లోభమనబడే దురాశ, ప్రాపంచిక లాభము కోసం పరిశ్రమ, వ్యాకులత, మరియు యావ, పెంపొందుతాయి. ఓ అర్జునా – అజ్ఞానమూ, జడత్వమూ, నిర్లక్ష్యమూ, మరియు మోహమూ - ఇవి తమో గుణము యొక్క ప్రధానమైన లక్షణములు.

భగవంతుడు మళ్ళీ ఒకసారి, త్రిగుణములు వ్యక్తి యొక్క ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తాయో, వివరిస్తున్నాడు. సత్త్వ గుణము, సద్గుణములను పెంపొందించుకునేటందుకూ, మరియు జ్ఞానము ప్రకాశితమవ్వటానికీ, దారితీస్తుంది. రజో గుణము దురాశకీ, ప్రాపంచిక సంపత్తి కోసం అతిప్రయాస, మరియు మనస్సు యొక్క వ్యాకులతకు దారి తీస్తుంది. తమో గుణము, చిత్తభ్రాంతికీ, సోమరితనానికీ, మరియు మత్తుపదార్ధాలకూ, హింసా ప్రవృత్తి దిశగా తీసుకువెళుతుంది. నిజానికి ఈ గుణములు, భగవంతుడు, మరియు ఆధ్యాత్మిక మార్గముల పట్ల మన దృక్పథాన్ని కూడా, ప్రభావితం చేస్తాయి. సత్వ గుణములో ఉన్నప్పుడు, సాధనలో త్వరితగతిన పురోగతిని సాధించటానికి, కృషి చేయాలి. ఎందుకంటే, మానవ దేహమనేది దుర్లభమైనది కాబట్టి, దానిని లౌకికమైన వాటి సముపార్జన కోసం వ్యర్థం చేసుకోకూడదని అనుకుంటాము. రజో గుణము ప్రధానముగా ఉన్నప్పుడు, ‘నేను తప్పకుండా ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి. కానీ అంత తొందర ఏమున్నది? ప్రస్తుతం, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. అవి దీనికన్నా ఇంకా ముఖ్యమైనవి.’ అని ఆలోచిస్తాము. ఎప్పుడైతే తమో గుణము ప్రబలంగా ఉంటుందో, ‘ఏమో, భగవంతుడు ఉన్నాడో లేడో నమ్మకం లేదు. ఎవరూ ఆయనను చూడలేదు. ఎందుకు సాధన కోసం సమయం వృధా చేయాలి?’ అని భావిస్తుంటాము. భక్తిలో ఒకే వ్యక్తి యొక్క ఆలోచనలు ఎంత ఉన్నత స్థాయి నుండి, ఎంత తక్కువ స్థాయికి ఊగిసలాడతాయో, మనం గమనించవచ్చు. ఈ త్రిగుణములచే, మనస్సు ఊగిసలాడటం చాలా సహజమే. 
కానీ, ఈ స్థితిగతులచే మనం నిరాశ చెందకుండా, ఇది ఎందుకు ఇలా అవుతుందో అర్థం చేసుకోవాలి. అలాగే, దానికి అతీతంగా ఎదగటానికి పరిశ్రమించాలి. సాధన అంటే, మనసులో ఈ త్రిగుణముల యొక్క ప్రవాహంతో పోరాడుతూ, దానిని గురువు, మరియు భగవంతుడి పట్ల భక్తితో ఉండటానికి, అభ్యాసము చేయటమే. ఒకవేళ మన యొక్క స్మృతి, అత్యంత ఉన్నతమైన స్థాయిలో రోజంతా ఉండి ఉంటే, అప్పుడు సాధన యొక్క అవసరం లేదు. మనస్సు యొక్క సహజమైన భావనలు ప్రపంచం వైపు మొగ్గు చూపినా, బుద్ధి యొక్క సహాయంతో, దానిని ఆధ్యాత్మిక రంగం వైపు మరల్చాలి. ప్రారంభంలో ఇది కష్టతరంగా అనిపించవచ్చు. కానీ, అభ్యాసముచే అది చాలా సులువుగా అయిపోతుంది.

09:51 - ఇక మన తదుపరి వీడియోలో, త్రిగుణములచే ప్రసాదింపబడే గమ్యములను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, April 10, 2023

ఏది శాకాహారం – ఏది మాంసాహారం? Story of Dharmavyadha and his curse - Varaha Purana


ఏది శాకాహారం – ఏది మాంసాహారం?
అత్తా-కోడళ్ల మధ్య సఖ్యత లోపించడానికి ఆ శాపమే కారణమా?

అత్తాకోడళ్ల సమస్యలు ఇనాటి కావు. తరతరాలుగా, నిజం చెప్పాలంటే, యుగయుగాలుగా వస్తూ ఉన్నవే. అసలు అత్తాకోడళ్ల మధ్య అన్యోన్యత లోపించడానికి కారణమేంటో తెలుసా? బ్రహ్మ జ్ఞానాన్నెరిగిన కిరాతుడిచ్చిన శాపం ఏంటి? వేటను వృత్తిగా చేసుకుని జీవించే వ్యక్తి, తన కూతురిని ముని శ్రేష్ఠుడికిచ్చి వివాహం జరిపించి, ఆ విధంగా ఎందుకు శపించాడు? వరాహ పురాణంలో వివరించబడిన ధర్మవ్యాధుడనే కిరాతుడి వృత్తాంతంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/aton1Ucj7gY ]


వేల సంవత్సరాల క్రితం, వేటను జీవన వృత్తిగా చేసుకుని జీవించేవాడు, వ్యాధుడనే కిరాతుడు. తన కుటుంబం కోసం, రోజుకొక అడవి పందిని చంపి, తన సేవకులనూ, బంధువులనూ, అతిథులనూ, అగ్నినీ సంతృప్తి పరచేవాడు. అతడు కిరాతుడైనప్పటికీ, ప్రతిరోజూ అగ్నిని పూజిస్తూ, నిత్య కర్మలను ఆచరిస్తూ, సత్యాన్నే పలుకుతూ, తన జీవన యాత్రను కొనసాగించాడు. ఏనాడూ అతడు సాధు జంతువులను చంపలేదు. ధర్మ మార్గాన్ని అనుసరించడం వలన వ్యాధుడికి, ధర్మవ్యాధుడనే పేరు స్థిరపడిపోయింది.

ధర్మవ్యాధుడికి, అర్జునకుడనే కుమారుడు జన్మించాడు. అతడు కూడా ఎంతో ధర్మబుద్ధికలవాడు. ఇంద్రియాల మీద నిగ్రహాన్ని కలిగి, తపస్సు మీద ఆసక్తిని పెంచుకున్నాడు. ధర్మవ్యాధుడికి కొంతకాలం తరువాత, అర్జునకి అనే కుమార్తె కూడా కలిగింది. ఆ కన్యకు యుక్తవయస్సురాగానే, ఆమెకు తగిన వరుడైన మతంగుడి కుమారుడు ప్రసన్నుడికిచ్చి, వివాహం జరిపించాడు. ధర్మవ్యాధుడి కూతురు అర్జునకి కూడా, తండ్రిలాగానే ధర్మపరాయణురాలు. అత్తగారింటికి వెళ్లి, అక్కడ తన అత్త మామలకు ఏ లోటూ రాకుండా, సేవలు చేసింది. అలా కొంతకాలం గడిచింది. ఒకనాడు అర్జునకి అత్తగారు ఆమెతో, "ఓ కోడలా, నీవు జంతువులను వధించే బోయవాడి కూతురివి. నీవు కూడా తండ్రికి తగ్గ దానవే. నీకు తపస్సు చేయడం, భర్తను శ్రద్ధగా సేవించడం తెలియదు." అని పరుషంగా మాట్లాడింది.

అత్తగారి మందలింపు విని, అర్జునకి ఎంతో బాధపడింది. వెంటనే తన తండ్రి ఇంటికి వెళ్ళి విలపించింది. ధర్మవ్యాధుడు ఆమెను ఊరడించి, "అమ్మా, ఎందుకు విలపిస్తున్నావు?" అని అనునయంగా అడిగాడు. "తండ్రీ, మా అత్తగారు అకారణంగా నన్ను దూషించారు. అందుకే నేనింతగా బాధపడుతున్నాను." అని అత్త తనను అన్న మాటలు యధాతథంగా చెప్పింది. అర్జునకి చెప్పిన మాటలు విన్నాక, ధర్మవ్యాధుడికి ఎంతో కోపం వచ్చింది. వెంటనే మతంగుడి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వచ్చిన ధర్మ వ్యాధుణ్ణి చూసి, మతంగుడు ఆదరంగా లోపలికి ఆహ్వానించి, కూర్చోబెట్టాడు. ఆ తరువాత కుశల ప్రశ్నలు వేసి, తను వచ్చిన కారణాన్ని అడిగాడు.

అప్పుడు ధర్మవ్యాధుడు మతంగుడితో, "మతంగా! నేను మీ ఇంట్లో ప్రాణం లేని ఆహారాన్ని భుజించాలనుకుంటున్నాను" అని అన్నాడు. మతంగుడు ధర్మవ్యాధుడితో, "అయ్యా! మా ఇంట్లో గోధుమలూ, బియ్యం, యవలు లాంటి ధాన్యాలున్నాయి. వాటిలో మీకిష్టం వచ్చిన వాటిని భుజించవచ్చు" అని అన్నాడు. అది విని ధర్మవ్యాధుడు, "మతంగా! నీవు చెప్పిన యవలూ, గోధుమలూ, బియ్యం, నేనడిగిన రూపంలోనే వున్నాయా? ఏదీ చూపించు" అని అడిగాడు. అప్పుడు మతంగుడు గోధుమలతో నిండిన చేటనీ, బియ్యంతో నిండిన మరోచేటనీ ఆయనకు చూపించాడు. వాటిని చూసిన ధర్మవ్యాధుడు, "ఇక చాలు, నేను వెళ్తాను" అని బయలుదేరాడు. ఆ మాటలకు అశ్చర్యపోయిన మతంగుడు, "స్వామీ, తమరు భోజనం చేయకుండానే వెళ్ళిపోతున్నారు. ఏమిటి కారణం?" అని అడిగాడు.

అందుకు ధర్మవ్యాధుడు, "మతంగా ప్రతిరోజూ నీవు వేలకొద్దీ జీవులను చంపుతున్నావు. నీవు పాపాత్ముడవే కదా! నీ ఇంట్లో ప్రాణశక్తి లేని పదార్థమేదైనా ఉంటే, దానిని వండి, అప్పుడు నాకు భోజనం పెట్టు. ఇప్పుడు నాకు చూపించిన ధాన్యాలన్నీ, నీటి ద్వారా జన్మించనవే కదా? ఈ ధాన్యాలను నాటితే, తిరిగి మొలకలు వస్తాయి.. అంటే, ఆ గింజలలో ప్రాణం ఉన్నట్టేగా.. మరి ప్రాణం ఉన్న ఈ గింజలను వండడం ద్వారా, చంపుతున్నావా, లేదా? అది జీవహింస కాదా? నేను నా సంసారం కోసం, బంధువుల కోసం, రోజుకొక మృగాన్ని చంపి, దానిని ముందుగా పితృదేవతలకు అర్పించి, ఆ తరువాతే, నేనూ, నా కుంటుబం భుజిస్తాము. ఇక నీవు నిత్యం రకరకాల ధాన్యాల రూపంలో, ఎన్నో జీవులను చంపి, నీ వారితో కలిసి తింటున్నావు. ఇది తినరాని తిండి అని నా అభిప్రాయం.

బ్రహ్మదేవుడు మొదట చెట్టూ చేమలనూ, తీగలనూ, యజ్ఞం కోసం పుట్టించాడు. కాలక్రమంలో అవే, ప్రాణులకు ఆహారంగా మారాయి. 1. దేవ యజ్ఞం 2. భూత యజ్ఞం 3.పితృ యజ్ఞం 4. మనుష్య యజ్ఞం 5. బ్రహ్మ యజ్ఞం అని అయిదు మహాయజ్ఞాలున్నాయి. బ్రహ్మ దేవుడు వీటిని ఏర్పరచాడు. ఈ యజ్ఞాల కోసం వండిన అన్నమే, ఉత్తమమైన అన్నం అవుతుంది. అలా కాకపోతే, ఒక్కో ధాన్యంగింజా, పశుపక్ష్యాదుల లాంటిదే కనుక, అది పెట్టేవాడికీ, తినేవాడికీ మాంసాహారమే అవుతుంది. దేవత లాంటి నా కుమార్తెను నీకు కోడలిగా చేశాను. నీ భార్య నా కుమార్తెను, జంతువులను చంపేవాడి బిడ్డవు.. నీకు ఏ ఆచారాలూ, మర్యాదలూ తెలియవని నిందించింది. అందుకే నీవూ, నీ కుంటుంబం, ఎంతటి ఆచారవంతులో తెలుసుకుందామని, నీ ఇంటికి వచ్చాను.

మతంగా! నీ ఇంట్లో నాకు గొప్ప ఆచారం ఏదీ కనిపించలేదు. నేను మా ఇంటికి వెళుతున్నాను. పితృ శ్రాద్ధం చేయాలి. శ్రాద్ధ దినం కనుక, నేను నీ ఇంట్లో భోజనం చేయను. నేనేమో ప్రాణహింస చేసేవాడినా? నీవు మాత్రం పరమ అహింసాపరుడివా? ఇదేమన్నా న్యాయంగా వుందా? ఇక నేటినుంచీ, అత్తలకు కోడళ్ళపై నమ్మకం లేకుండు గాక. అలాగే, కోడళ్ళు అత్త బ్రతికి ఉండడాన్ని ఇష్టపడకపోవుగాక." అని శపించి, ధర్మవ్యాధుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు.

కొంతకాలం తరువాత ధర్మవ్యాధుడు, తన కుంటుంబ బాధ్యతలను పెద్ద కుమారుడైన అర్జునకుడికి అప్పగించి, ముల్లోకాలలో ప్రసిద్ధి చెందిన పురుషోత్తమ క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ నిశ్చలమైన మనస్సుతో, భగవంతుణ్ణి స్తుతిస్తూ, ప్రార్థించడం ప్రారంభించాడు. ధర్మవ్యాధుడి ప్రార్థనకు శ్రీ హరి చతుర్భుజాలతో దర్శనమిచ్చాడు. భగవంతుడి రూపాన్ని చూసి సంతోషించిన ధర్మవ్యాధుడు, "స్వామీ, నా పుత్రులూ, పౌత్రులూ, అలాగే నా కులంలో పుట్టిన వారందరూ, నాలాగానే సత్యధర్మపరాయణులుగా ఉండేలా, వరమివ్వు. అలాగే, నాకూ, నా తరం వారికీ, ధర్మయుగాలలోనే జన్మ లభించాలి. కలియుగంలో మేము జన్మించకూడదు. నా కులం వారు ఎక్కడికి వెళ్లినా, ఎక్కడున్నా, జ్ఞానం ఉదయించాలి. నాకిక జీవితం మీద ఏమాత్రం ఆసక్తి లేదు. నీలో లయమవ్వాలని భావిస్తున్నాను." అని ప్రార్థించాడు. ధర్మవ్యాధుడి కోరిక విన్న శ్రీహరి, "ధర్మవ్యాధా, నీ కోరిక ఫలిస్తుంది. నీ కులానికి గొప్ప కీర్తి లభిస్తుంది. నీకు శాశ్వతంగా నాలో స్థానం లభిస్తుంది." అని ఆశీర్వదించాడు. వెంటనే ధర్మవ్యాధుడి శరీరం నుంచి, ఒక దివ్యమైన వెలుగు బయటకు వచ్చి, సనాతనుడైన ఆ శ్రీహరిలో కలసిపోయింది.

ధర్మాన్ని అనుసరించడం వలన, దైవ సాన్నిధ్యం తప్పక లభిస్తుంది. కులాలూ, వర్ణాలూ, గత యుగాలలోనూ ఉన్నాయి. రాబోయే యుగాలలోనూ ఉంటాయి. వాటిని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము, మన జీవితంలో వాటిని ఎలా అన్వయిస్తున్నాము? అనేది ముఖ్యం. మతంగుడి వంటి మునిశ్రేష్ఠుడు కూడా, కిరాతుడైన ధర్మవ్యాధుడి మాటలకు తలొగ్గాడు. తనకు తెలియని బ్రహ్మ జ్ఞానాన్ని, ధర్మవ్యాధుడి ద్వారా తెలుసుకున్నాడు. మనకు తెలిసిన మిడి మిడి జ్ఞానంతో, మనుషులను దూరం పెడుతూ, ఆహంకార పూరితమైన జీవితాన్ని సాగిస్తున్నాము. పరమాత్ముడికి సకల ప్రాణులూ సమానమే. సనాతన ధర్మాన్ని మించిన ధర్మంలేదు.

ధర్మో రక్షతి రక్షితః

Thursday, April 6, 2023

హనుమద్విజయోత్సవం Hanumath Vijayotsavam


అందరికీ హనుమద్విజయోత్సవ శుభాకాంక్షలు 💐

ఆంజనేయ స్వామి అద్భుత చరిత్ర!: https://youtu.be/6wOkEw-wpsw

హనుమంతుడు భీముడికి చెప్పిన యుగ ధర్మాలు!: https://youtu.be/5Qbjiqk3f9I


ఆవేశంలో ఉన్న హనుమకు సీతమ్మ చెప్పిన కథ!: https://youtu.be/YK8QjVW2kc0


అర్జునుడి రథంపై హనుమంతుడు ఉండడానికి గల కారణం!: https://youtu.be/F3pdXaWX7ps


మనోజవం మారుత తుల్యవేగం

జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం । 

వాతాత్మజం వానరయూధ ముఖ్యం

శ్రీరామదూతం శిరసా సమామి ।।


చైత్రపౌర్ణమి హనుమాన్ జయంతి కాదు విజయోత్సవమే..

హనుమంతుని సహాయంతో సీత జాడను వెతకడం, రావణుడిపై యుద్ధానికి రామసేతు వారధిని నిర్మించడం, లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు పర్వతంతోసహా సంజీవిని తీసుకొచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించడం, ఇలా రాముడు ఎదురైన క్షణం నుంచీ, తిరిగి అయోధ్య చేరుకునే వరకూ, శ్రీరామ విజయం వెనుక అడుగడుగునా హనుమంతుడు ఉన్నాడు. అయోధ్యకు చేరుకుని, పట్టాభిషేక ఘట్టం ముగిసిన తర్వాత, రాముడు ఇలా అనుకున్నాడు.. "హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే సీతాదేవి తిరిగి వచ్చింది.. తిరిగి అయోధ్యా నగరంలో పట్టాభిషిక్తుడిని అయ్యాను.. ఈ రోజు ప్రజలు అత్యంత ఆనందంగా ఉన్నారంటే, ఈ విజయం, ఆనందం, అన్నీ హనుమంతుడి వల్లనే" అని..

ఆంజనేయుడిని ప్రేమగా ఆలింగనం చేసుకుని, కృతజ్ఞతలు తెలియజేశాడు రాముడు. ఈ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రజలు అప్పటి నుంచీ, శ్రీరామనవమి, శ్రీరామ పట్టాభిషేకం తర్వాత వచ్చే పూర్ణిమను, హనుమత్ విజయోత్సవంగా భావించి, వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది..

''కలౌ కపి వినాయకౌ'' అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు వినాయకుడు, హనుమంతుడు..

"యత్ర యత్ర రఘునాధ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తకాంజిలమ్, బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్" అంటే, శ్రీరాముని కీర్తన ఎక్కడ జరిగితే, అక్కడ హనుమంతుడు పులకించిపోతూ, అంజలి జోడించి ప్రత్యక్షమైపోతాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నానని అర్థం.


#HanumanJayanti #2023 #mplanetleaf #voiceofmaheedhar #HanumanVijayotsavam 

Wednesday, April 5, 2023

నిర్లక్ష్యమూ, సోమరితనమూ, మరియు నిద్రచే భ్రమకు గురి చేసేది ఏది? భగవద్గీత Bhagavadgita


నిర్లక్ష్యమూ, సోమరితనమూ, మరియు నిద్రచే భ్రమకు గురి చేసేది ఏది?

'భగవద్గీత' చతుర్దశోధ్యాయం – గుణత్రయ విభాగ యోగం (05 – 08 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్నాలుగవ అధ్యాయం, గుణత్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, గుణత్రయ విభాగ యోగములోని, 05 నుండి 08 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/wK2c-rdTcMI ]


నాశములేని నిత్య జీవాత్మను, నశ్వర దేహమునకు బంధించేవి ఏంటో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:49 - సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః ।
నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయమ్ ।। 5 ।।

ఓ మహా బాహువులుగల అర్జునా.. భౌతిక ప్రాకృతిక శక్తి అనేది, సత్త్వ గుణము, రజో గుణము, మరియు తమో గుణమను త్రిగుణములను కలిగి ఉంటుంది. ఈ గుణములే, నాశములేని నిత్య జీవాత్మను, నశ్వర దేహమునకు బంధించును.

పురుషుడు, మరియు ప్రకృతి చేతనే, సమస్త జీవ రాశులూ ఉద్భవించాయని చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇప్పుడు ప్రకృతి జీవాత్మను ఎలా బంధించివేస్తుందో, వివరించబోతున్నాడు. ఆత్మ దివ్యమైనదే అయినా, తనను తాను శరీరమే అనుకుంటుంది కాబట్టి, అది భౌతిక ప్రకృతికి కట్టివేయబడుతుంది. భౌతిక శక్తి, సత్త్వము, రజస్సు, మరియు తమస్సనబడే మూడు గుణములను కలిగి ఉంటుంది. కాబట్టి, ప్రకృతిచే తయారుచేయబడిన శరీరమూ, మనస్సూ, మరియు బుద్ధీ, ఈ మూడింటికి కూడా త్రిగుణములు ఉంటాయి. మూడు రంగులతో చేసే ప్రింటింగ్‌ని, ఉదాహరణగా చూడండి. ఒకవేళ ఏదో ఒక రంగు కాస్త ఎక్కువగా పేపర్ మీదకు పంపబడితే, కాగితం పై బొమ్మ, ఆ రంగుతో కనబడుతుంది. అదే విధంగా, ప్రకృతి ఈ మూడు రంగుల సిరా కలిగి ఉన్నది. వ్యక్తి యొక్క అంతర్గత ఆలోచనలూ, బాహ్య పరిస్థితులూ, పాత సంస్కారములూ, మరియు ఇతర అంశాలపై ఆధారపడి, వీటిలో ఏదో ఒక గుణము ఆ వ్యక్తిలో ప్రబలంగా కనిపిస్తుంది. ఏ గుణము ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందో, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వముపై, ఆ రంగు ప్రభావము, ప్రబలంగా ఉంటుంది. కాబట్టి, జీవాత్మ ఈ మూడు గుణములచే ప్రభావితమవుతుంది.

02:32 - తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయమ్ ।
సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ ।। 6 ।।

వీటిలో సత్త్వ గుణము, మిగతావాటి కంటే పవిత్రమైనది కావుటచే, ఇది ప్రకాశకమైనది, మరియు చాలా క్షేమదాయకమైనది. ఓ పాపరహితుడా, సుఖానుభవము, మరియు జ్ఞానము పట్ల ఆసక్తి వలన, అది జీవాత్మను బంధించివేస్తుంది.

ప్రకాశకం అంటే, ‘ప్రకాశింపచేసేది’ అని అర్థం. అనామయం అంటే, ‘ఆరోగ్యవంతము, మరియు సంపూర్ణ క్షేమదాయకము’ అని అర్థం; సత్త్వ గుణము నిర్మలమైనది, మరియు ప్రకాశింపచేసేది. ఈ విధంగా సత్త్వ గుణమనేది, మనిషి యొక్క వ్యక్తిత్వములో సద్గుణమును పెంపొందించి, బుద్ధిని జ్ఞానముచే ప్రకాశింపచేయును. అది వ్యక్తిని నిర్మలంగా, తృప్తితో, దానగుణముతో, కారుణ్యంతో, సహాయకారిగా, స్థిమితముగా, మరియు ప్రశాంతముగా చేస్తుంది. అది చక్కటి ఆరోగ్యమును, మరియు వ్యాధుల నుండి విముక్తినీ ఇస్తుంది. సత్త్వ గుణము ప్రశాంతతను, మరియు సుఖమును ఇస్తుంది కానీ, వీటి పట్ల మమకారాసక్తియే, ఆత్మను భౌతిక ప్రకృతికి కట్టివేస్తుంది. దీనిని ఒక ఉదాహరణ ద్వారా అర్థంచేసుకుందాము. ఒక బాటసారి అడవి గుండా ప్రయాణిస్తున్నప్పుడు, ముగ్గురు బందిపోటు దొంగలు దాడిచేశారు. మొదటి వాడు, ‘వీడిని చంపేసి, వీడి సొమ్మంతా దోచేద్దాము’ అని అన్నాడు. రెండవ వాడు, ‘వద్దు, వాడిని చంపొద్దు. కేవలం కట్టిపడేసి, వాడి దగ్గర ఉన్నవి అంతా తీసుకు వెళ్ళి పోదాం’ అని అన్నాడు. ఆ రెండవ దొంగ చెప్పిన సలహా ప్రకారం, బాటసారిని కట్టేసి, అతని సొమ్మంతా దోచుకున్నారు. వారు కొంత దూరం వెళ్ళిపోయిన తరువాత, మూడవ దొంగ తిరిగొచ్చాడు. వాడు ఆ బాటసారి కట్లు విప్పేసి, అడవి చివర వరకూ తీసుకువెళ్లి , బయటకి దారి చూపించి, ఇలా అన్నాడు.. ‘నేను బయటకురాలేను.. కానీ, నీవు ఈ మార్గంలో వెళ్తే, అడవి బయటకు వెళ్లగలవు.’ అని చెప్పాడు. అయితే, ఈ ఉదాహరణలో మొదటి బందిపోటు, తమో-గుణము.. అది ఆత్మను, సోమరితనం, నిర్లక్ష్యము, మరియు అజ్ఞానంతో నిజంగానే, చంపటానికి ప్రయత్నిస్తుంది. రెండవ బందిపోటు, రజో-గుణము.. అది ప్రాణులలో ఆవేశ ఉద్వేగాలను జనింప చేస్తుంది, మరియు ఆత్మను అసంఖ్యాకమైన ప్రాపంచిక కోరికలతో బంధించివేస్తుంది. మూడవ బందిపోటు, సత్త్వ గుణము.. అది జీవుల దుష్టగుణములను తగ్గిస్తుంది, భౌతిక అసౌఖ్యమును తగ్గిస్తుంది, మరియు ఆత్మను సంక్షేమ మార్గంలో పెడుతుంది. అయినా, సత్త్వ గుణము కూడా భౌతిక ప్రకృతి యొక్క పరిధిలోనే ఉన్నది. మనము దాని పట్ల మమకారాసక్తితో ఉండకూడదు; పైగా, అలౌకిక స్థాయికి చేరుకోవటానికి, దానిని ఒక మెట్టుగా ఉపయోగించుకోవాలి. ఈ మూడింటికీ అతీతముగా, శుద్ధ-సత్త్వ గుణము ఉంటుంది. ఇది అలౌకిక సత్త్వ గుణము. ఇది భౌతిక శక్తికి అతీతమైన భగవంతుని యొక్క దివ్యమైన శక్తి యొక్క గుణము. ఎప్పుడైతే ఆత్మ భగవత్ ప్రాప్తి పొందుతుందో, ఆయన యొక్క కృపచే, భగవంతుడు ఆ జీవాత్మకు శుద్ధ సత్వమును ప్రసాదిస్తాడు. దానితో ఆయొక్క ఇంద్రియమనోబుద్ధులు, దివ్యమైనవిగా అవుతాయి.

05:55 - రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవమ్ ।
తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినమ్ ।। 7 ।।

ఓ అర్జునా, రజో గుణము మోహావేశ ప్రవృత్తితో కూడినది. అది ప్రాపంచిక కోరికలు, మరియు మమకారముల వల్ల జనిస్తుంది. అలాగే, ఆత్మను కామ్యకర్మల పట్ల ఆసక్తిచే, బంధించివేస్తుంది.

శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు, రజో గుణము యొక్క పనితీరునూ, అది జీవాత్మను భౌతిక అస్థిత్వమునకు ఎలా కట్టివేస్తుందో, వివరిస్తున్నాడు. భౌతిక ప్రాపంచిక వ్యవహారములే, రజో గుణము యొక్క ప్రధానమైన ప్రకటితమని, పతంజలి యోగ దర్శనం, వివరిస్తుంది. ఇక్కడ శ్రీ కృష్ణ పరమాత్మ, దానియొక్క ప్రధానమైన వ్యక్తీకరణ, మమకారాసక్తీ మరియు కోరికలని చెబుతున్నాడు. రజో గుణమనేది, ఇంద్రియ భోగముల కోసం ఉన్న కామమును, మరింత పెంచుతుంది. అది శారీరిక, మరియు మానసిక వాంఛలను, ప్రజ్వలింప చేస్తుంది. అది ప్రాపంచిక విషయముల పట్ల మమకారాసక్తులను, పెంచుతుంది. రజో గుణముచే ప్రభావితమైన వ్యక్తులు, హోదా, ప్రతిష్ఠ, వృత్తిలో విజయం, కుటుంబము, మరియు ఇల్లూ వంటి ప్రాపంచికమైన వాటి పట్ల, నిమగ్నమై ఉంటారు. వీటిని ఆనంద కారకములుగా భావించి, వాటి కొరకై, నిరంతరం పరిశ్రమిస్తూ ఉంటారు. ఈ విధంగా రజో గుణము, కోరికలను మరింతగా పెంచుతుంది. ఈ కోరికలు, రజో గుణమును మరింత పెంచుతాయి. ఇవి పరస్పరం ఇనుమడింపచేసుకుని, జీవాత్మను ప్రాపంచిక జీవితంలో కట్టి వేస్తాయి. కర్మయోగ ఆచరణచే దీనిని ఛేదించి, బయటపడవచ్చు. అంటే, మన కర్మల యొక్క ఫలములను, భగవంతునికే అర్పించటమనేదాన్ని, ప్రారంభించటం అన్నమాట. ఇది ప్రపంచం పట్ల అనాసక్తిని కలుగచేస్తుంది, మరియు రజో గుణము యొక్క తీవ్రతను, శాంతింపజేస్తుంది.

07:51 - తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ ।
ప్రమాదాలస్యనిద్రాభిః తన్నిబధ్నాతి భారత ।। 8 ।।

ఓ అర్జునా, అజ్ఞానముచే జనించిన తమో గుణము, జీవాత్మల యొక్క మోహభ్రాంతికి కారణము. అది సమస్త జీవరాశులను, నిర్లక్ష్యమూ, సోమరితనమూ, మరియు నిద్రచే భ్రమకు గురి చేస్తుంది.

తమో గుణము, సత్త్వ గుణమునకు విరుద్ధమైనది. దానిచే ప్రభావితమైన జనులు, నిద్ర, సోమరితనము, మత్తు, హింస, మరియు జూదముచే ఆనందమును అనుభవిస్తారు. ఏది మంచి, లేదా ఏది చెడు, అన్న విచక్షణను వారు కోల్పోతారు; తమ స్వార్థ ప్రయోజనం కోసం, అనైతికమైన పనులు చేయటానికి, వెనుకాడరు. వారి కర్తవ్యమును వారు చేయటమే, వారికి భారంగా అవుతుంది. వారు దానిని నిర్లక్ష్యం చేస్తారు. మరింత సోమరితనానికీ, నిద్రకూ అలవాటు పడిపోతారు. ఈ ప్రకారంగా తమో గుణము, జీవాత్మను అజ్ఞానపు చీకటి లోనికి మరింతగా నెట్టివేస్తుంది. జీవాత్మ తన యొక్క దివ్య అస్థిత్వమునూ, జీవిత లక్ష్యమునూ, మరియు పురోగతికై మానవ జన్మ ఇచ్చే అపూర్వ అవకాశమునూ, పూర్తిగా విస్మరిస్తుంది.

09:07 - ఇక మన తదుపరి వీడియోలో, సత్త్వ, తమో, రజో గుణముల లక్షణాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...