అమ్మకి 2 రూపాయలు అవసరమా!?


అమ్మకి 2 రూపాయలు అవసరమా!?

ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో ప్రచురించబడిన ఈ కథ, కేవలం రెండు పేజీలే వుంటుంది.
కానీ, కథ పూర్తయ్యాక రెండు నిమిషాలయినా మనం ఆలోచించకుండా వుండలేము..
ఈ కథలో చెప్పినదానికన్నా చెప్పకుండా వున్నదే ఎక్కువగా కనిపిస్తుంది.

        ఒక్క రెండు రూపాయలు..
   "నేనేం వందలడిగానా? వేలడిగానా? ఒక్క రెండు రూపాయలేగా! దానికే అంత దండకం చదవాలా?"
        గట్టిగా వినిపిస్తున్న తల్లి గొంతు చెవిన పడుతూనే మెలకువ వచ్చింది నూకరాజుకి. గబుక్కున లేచి కూర్చున్నాడు.
        "ఆఁ!...ఒక్క రెండు రూపాయలేగా అని ఎంత తీసి పడేస్తున్నావు? పిల్లలు ఖర్చులకడిగేదీ అదే. పుస్తకాలకడీగేదీ అదే. రెండూ రెండూ అంటూ నాలుగు సార్లు కలిపితే ఎనిమిదవదా? పదీ పదీ కలుపుకుంటూ పోతే వందవదా? ఇలాగే లెక్కలు పెడతాడు నీకొడుకు. రోజు రోజుకీ  పెరిగి పోతున్న ధరలతో, నీ కొడుకిచ్చే డబ్బులకి లెక్కలు చెప్పలేక నా తలప్రాణం తోకకొస్తోంది. అయినా ముసల్దానివయిపోయావు. ఇంట్లోంచి బైటకి కదలవు. భోజనం, కాఫీ, టిఫినూ అన్నీ చెల్లిస్తూనే వున్నావాయె. ఇంకా నీకు ఆ ఒక్క రెండు రూపాయలు మటుకు ఎందుకటా? ఏం చేసుకుందామనీ?" 
      సాగదీస్తూ అడుగుతున్న భార్య పంకజం నోటి దురుసుకి చెవులు మూసుకుంటూ మంచం దిగాడు నూకరాజు. కాఫీ ఇస్తున్న భార్య నడిగాడు సంగతేమిటని? వెంటనే ఆమె స్వరం సౌమ్యంగా మారిపోయింది.
        "ఆఁ? ఏముందీ? మీ అమ్మగారికి రెండు రూపాయలు కావాలట. మీరిచ్చిన డబ్బుతో పిల్లలకి ఫీజులు కట్టి, స్కూల్లో పుస్తకాలు, పెన్సిళ్లు కొనేేశాను. ఇంక నా దగ్గర డబ్బుల్లేవు. అయినా మీ అమ్మగారికి డబ్బెందుకండీ? భోజనం, టిఫినూ, కాఫీ అన్నీ గడచి పోతుంటేనూ?" నెమ్మదిగా పాయింటు లేవదీసింది పంకజం.
         నిజమే, అమ్మకు డబ్బులెందుకు?
      టైము చూసుకున్నాడు నూకరాజు. అప్పుడే ఎనిమిదయింది. అబ్బా, అప్పుడే షాపు తెరిచే టైమవుతోంది. గబగబా తయారయి షాపుకి బయలు దేరుతున్న అతనితో తల్లి అంది. 
         "ఒరేయ్ రాజూ, చూడరా మీ ఆవిడ... ఒక్క రెండు రూపాయలడిగితే..." 
    "అబ్బబ్బ ఏంటమ్మా. అసలే టైమయి పోతోందని కంగారు పడుతుంటే. అయినా నీకు డబ్బులెందుకు చెప్పు?”
అంటూనే హడావిడిగా చెప్పులేసుకు బయటకొచ్చేశాడు. వెనక్కి తిరిగి తల్లికి నెమ్మదిగా నచ్చజెప్పి రమ్మని మనస్సు బాధిస్తున్నా, పరిగెడుతున్న టైము అతన్ని ముందుకే నడిపించింది.
       నెలలో మొదటి వారం, షాప్ రష్‌గా వుంది. నాలుగు చేతులతో పని చేస్తున్నట్లు చేస్తున్న నూకరాజుకి ఊపిరి పీల్చుకుందుకు కూడా సమయం దొరకలేదు. పదకొండు దాటేక జనం కొంచెం పలచబడ్డారు. అమ్మయ్య అనుకుంటూ వాటర్ బాటిల్‌లో నీళ్లు తాగుదామని తలెత్తిన అతనికి, ఆ షాపు వైపే వస్తున్న రామ్మూర్తిగారు  కనిపించారు. నూకరాజు ముఖం విచ్చుకుంది. రూపాయలు, పైసల లెక్కల్తో కొట్టుకొంటున్న అతనికి రామ్మూర్తి గారితో మాట్లాడటం గొప్ప రిలీఫ్. చుట్టు పక్కల ప్రాంతంలో ఏం జరుగుతోందో తెలియనంత బిజీగా వుండే అతనికి, మధ్య మధ్యలో రామ్మూర్తిగారు చెప్పే మాటల్లోనే ప్రపంచం తీరు తెన్నుల గురించి తెలుస్తూంటుంది.
      రామ్మూర్తిగారు ఒక రిటైరైన గర్నమెంటు ఆఫీసరు. మనవలతో ఆడుకుంటూ హాయిగా కొడుకింట్లో కాలం గడిపేస్తున్నారు. ఏదో హోదాగల ఉద్యోగమే చేసుంటారు. అందుకే అభిమానం, పౌరుషం గల మనిషిలా కనిపిస్తారు. 
       ఎప్పుడైనా ఆయన ఉద్యోగపు రోజులు గుర్తుకు వస్తే, "ఏమిటోనయ్యా, ఆ రోజులే వేరు. ఎంతసేపూ సిన్సియర్‌గా పనిచేసి పేరు తెచ్చుకుందామనే గానీ, వేరే దృష్టి ఎక్కడిదయ్యా? ఇప్పుడేమో అంతా ఖాళీయే. ఎవరితోనన్నా మాట్లాడదామన్నా, వాడి టైము పాడు చేస్తున్నానేమోనని ఫీలింగు" అంటూ పకపకా నవ్వేస్తారు.
         "మీకేం సార్. మాలా బిజినెస్ కాదు కదా! చేసినన్నాళ్లు చేశారు. పెన్షన్ వస్తుంది. హాయిగా కొడుకు దగ్గర ఉంటున్నారు" అంటే,
         "నీకొక జీవిత సత్యం చెబుతాను వినవయ్యా నూకరాజూ.. ఎవరి జీవితం వాళ్లదేననుకో.. కానీ, కొంతమంది ఇవ్వడానికే పుడతారు, మరికొంతమంది పుచ్చుకోవడానికే పుడతారు. కాలం మారుతూంటుంది కదయ్యా.. అదెప్పుడూ ఒక్కలాగే ఉండదు. మా తరం 'తల్లిదండ్రులని చూడవలసిన బాధ్యత కొడుకులది' అని నమ్మే తరం. అల్లాగే చూసాం. కానీ మా కొడుకుల తరం వచ్చేసరికి, వాళ్లింట్లో ఉంటున్నందుకు మాకొచ్చే పెన్షన్ వాళ్ల చేతుల్లో పెట్ట వలసిన పరిస్థితి వచ్చేసింది. ఏం చేస్తాం? ఈ కాలమిలా వుంది. వాళ్ల వైపు నుంచి ఆలోచిస్తే సమర్థించుకోవచ్చేమో కాని, మాతరం వాళ్లం సర్దుకోలేక పోతున్నామాయే!" అంటూ బరువైన విషయాన్ని కూడా చాలా తేలికగా తీసుకుంటూ చెప్పేస్తారు.
       రామ్మూర్తిగారు కొంచెం భోజనప్రియులు అయివుండాలి. గతం గుర్తొస్తే మటుకు వెంటనే ఆయన చెప్పే మాట, "అప్పుడు బజార్లోకి కొత్తరకం ఏదొచ్చినా సరే, తెచ్చి పిల్లలకి తినిపించాల్సిందేనయ్యా. అప్పుడు మాకు తినడానికి టైముండేది కాదు.. ఇప్పుడు టైమున్నా పెట్టే వాళ్లు లేరు" అంటూ నవ్వేస్తారు.
         ఇలా మంచీ చెడూ చెపుతూ, లోకం పోకడ గురించి ముచ్చటిస్తూ ఆయన కోడలు రాసిచ్చిన సరుకుల లిస్టు, ఖాతా పుస్తకం నూకరాజు చేతికిచ్చేవారు. కావలసిన సరుకులిచ్చి, లెక్క ఖాతా పుస్తకంలో రాసే వరకు అతనేదో అడుగుతూండడం, ఆయన జవాబిస్తూండడం వాళ్లిద్దరికీ అలవాటయిపోయింది.
         "ఏంటి మాస్టారూ విశేషాలు?" అడిగాడు నూకరాజు సరుకుల లిస్టు అందుకుంటూ.
    "ఆఁ! ఏముందోయ్.. అన్నట్లు మీ పిల్లలెలా చదువుతున్నారు?" కుశల ప్రశ్నలు వేశారు రామ్మూర్తిగారు.
   "ఏం చదువులోనండి, వీళ్లు చదివి ఏం ఉధ్ధరిస్తారో తెలీదుకానండి ఫీజులు మటుకు చుక్కలంటుతున్నాయండి. పుస్తకాలు, డ్రెస్సులు, పాకెట్‌మనీ తడిసి మోపెడవుతున్నాయి" అన్నాడు నూకరాజు.
         "ఊఁ! అయితే పిల్లలకి పాకెట్ మనీ కూడా ఇస్తావేమిటోయ్?" అడిగారు ఆయన.
         "ఏదోనండి, రూపాయో, రెండో. పక్క పిల్లలు ఏదో కొనుక్కుంటారు కదండీ.. వాళ్లకీ అనిపిస్తుంది కదా.. మళ్లీ చిన్నబుచ్చుకుంటారనీ.." సమర్థించుకున్నాడు నూకరాజు.
    "నిజమేనోయ్, నీకొక సంగతి చెప్పనా? మా తాతగారంటూండేవారు... చిన్నపిల్లలూ, ముసలివాళ్లూ ఒకటేనని. అంటే వాళ్లిద్దరి మనస్తత్వం ఒక్కలాగే వుంటుందని. ఏదో అస్తమానం తింటూండాలనిపిస్తుందనీ, చపలత్వం, చాదస్తం ఎక్కువవుతాయనీ అంటూండేవాడు. పిల్లలకే కాదు, పెద్దలకి కూడా చేతిలో ఓ రూపాయుంటే, ఏ గుళ్లోనో దేవుడికిచ్చుకోవాలనిపిస్తుంది కదా!" అన్నారు ఆయన.
        నూకరాజుకి వెంటనే తల్లి గుర్తుకు వచ్చింది. 'అమ్మ గుడిలో దేవుడి కోసం అడిగిందా ప్రొద్దున్నే రెండు రూపాయలు?' ఆలోచనలు తప్పించుకుందుకు తల విదిలించి సరుకుల లిస్టు చూడడంలో మునిగిపోయాడు. సరుకుల ధరలు రాసి, మొత్తం కూడి, ఖాతా పుస్తకంలో రాస్తున్నాడు.
        "నూకరాజూ..."
         రామ్మూర్తిగారి గొంతు నెమ్మదిగా వినిపించింది. తలెత్తాడు నూకరాజు.
        "ఏదో ఒక సరుకులో రెండు రూపాయలు ఎక్కువెయ్యవయ్యా.." నసుగుతూ అన్నాడాయన.
   ఆశ్చర్యపోతూ చూశాడు నూకరాజు. ఆయన అతన్ని ఓ చూపు చూసి గబుక్కున తల దించుకున్నాడు. అభిమానంతో ఆయన నోటి వెంట వచ్చిన మాటలు "ఏం లేదయ్యా.. కొత్త రకం బిస్కెట్లేవో వచ్చాయన్నావు కదా.. ఎలా వుంటాయో రుచి చూద్దామనీ.. అంతే. ఒక్క రెండు రూపాయలే.."
         వింటున్న నూకరాజుకి ఛెళ్లున లెంపకాయ కొట్టినట్టయింది. కళ్లమ్మట గిఱ్ఱున నీళ్లు తిరిగాయి. తమలాంటి కొడుకులందర్నీ చంపి పాతరేసినా పాపం లేదనిపించింది. పాప భారంతో ఎత్తలేని తల భూమిలోకి దించుకున్నాడు నూకరాజు.

2nd జూన్ 2001..

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

ప్రతి హిందువూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర! New Year History

మనిషి శరీరాన్ని పోలిన మెత్తటి శరీరం గల నరసింహ స్వామి విగ్రహం ఎక్కడుంది? Hemachala Lakshmi Narasimha Swamy Mallur