Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Monday, June 10, 2024

హిందూత్వం - 2 | Hinduism - History


హిందూత్వం - 2 (Hinduism - History) TELUGU VOICE

ఆంగ్లేయులూ, వామ‌ప‌క్షీయులూ క‌లిసి, మ‌న దేశ‌పు చ‌రిత్రను క‌ల‌గాపుల‌గం చేసి, ఏలా విప్పాలో తెలియ‌ని విధంగా పీట‌ ముడులు వేసి మ‌న‌పై వ‌దిలారు. ప్రాచీన కాలంలో మ‌న భార‌తీయ మేధావులు త‌మ గ్రంథాల‌లో, కాల నిర్ణయానికి శాలివాహ‌న శ‌కాన్ని ఒక ప్రమాణంగా తీసుకున్నారు. ఈ శ‌కం సా. శ‌. 79 మార్చి 22 న, చైత్ర మాసారంభ‌మున ప్రారంభించారు. ఈ చైత్ర మాస‌పు తొలి దిన‌మే, దైవ అహోరాత్ర యుగ‌మున‌కు ఆది క‌నుక, యుగాది అనే పేరును ఆపాదించి, దానికి చాలా విశిష్టత‌ను చేకూర్చారు. కానీ ఈ కాలంలో యువ‌త, జ‌న‌వ‌రి 1 న చూపే ఉత్సాహంలో స‌గం కూడా ఉగాది నాడు క‌నిపించ‌దు. ఇప్పుడు ఎటు చూసినా ప‌రాధీనంలో ఉన్న దౌర్భాగ్యమే క‌నిపిస్తుంది.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/PUzEWDiAhOw ]


గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణితో ప్రారంభించ‌బ‌డిన నాటినుండి, 1879 సంవ‌త్సర‌ములు గ‌డిచిన త‌రువాత, 1957 మార్చి 22 నుండి భార‌త ప్రభుత్వం, ఈ శాలివాహన శ‌కాన్ని అధికారికంగా కాల‌మానంగా స్వీక‌రించింది. అంటే, ఇప్పుడున్న గ్రిగేరియ‌న్ క్యాలెండ‌ర్ లోని సంవ‌త్సర‌ము నుండి, 79 తీసివేస్తే, శ‌క సంవ‌త్సరం వ‌స్తుంది. ఒక గ్రిగేరియ‌న్ తేదీకి స‌మాన‌మైన శాలివాహ‌న సంవ‌త్సర‌పు తేదీని లెక్కించాలంటే, చాలా త‌తంగాలున్నాయి. దీనిని ఒక ఉత్సాహ‌వంతుడు చేధించి వివ‌రించాడు. దాని ప్రకారం గ్రిగేరియ‌న్ తేదీ "2015, October 04, Sunday" నకు సమానమైన శాలివాహన సంవత్సరము లోని తేదీ "1937, ఆశ్వీజము 12, రవివారము అని వివ‌రించారు. ఈ శాలివాహ‌నులనే, శాత‌వాహ‌నులు అనికూడా అంటారు. మొద‌ట్లో నాగ‌జాతికి చెందిన వారి ఆధిప‌త్యం ఉండేది. ఈ నాగ మ‌రియు నాంధ్ర అనే ప‌దాలు, ప్రాచీన సాహిత్యంలో కొన్ని చోట్ల స‌మానార్థంలో వాడారు. విశ్వామిత్రుని చేత "ఏతమేవా ఆంధ్రేన పుళిందేన చాపి... అని శ‌పించ‌బ‌డిన‌ట్లు వీరిని ఉదహ‌రించి ప్రస్తావించారు. అందుచేత, వీరు బ‌హుశా ఆట‌విక జాతి అయ్యి ఉండ‌వ‌చ్చు. చ‌రిత్రకారులు కూడా దీనిని దృఢ‌ప‌రుస్తున్నారు. ఈ జాతి వారి శాలివాహ‌నుని త‌ల్లికి ఒక సాధువు, 'నీ కూమారుడు రాజ్య స్థాప‌న చేస్తాడ‌'ని జోస్యము చెప్పార‌ట‌. ఆ మాట‌ను త‌ల్లి శాలివాహ‌నునికి చెప్పగా, అత‌ను క్రమంగా ఆట‌వికత్వమున‌కు దూర‌మై, నాయ‌క‌త్వ ల‌క్షణాల‌ను పెంపోందించుకున్నాడ‌ట‌.

ఆ విధంగా రాజ్య స్థాప‌న చేసి, శాలివాహ‌న వంశ మూల‌పురుషుడు అయ్యాడ‌ని ఒక ఐహిత్యం ఉంది. ఒక రాజున‌కు వ‌చ్చిన క‌ల‌లో, పులి మీద స్వారీ చేసే బాలుడు క‌నిపించాడు. ఈ క‌ల వృత్తాంత‌మే దీనిని సూచించింది కాబోలు. మౌర్యులు వీరిని ఢీ కోని, సామంతులుగా చేసుకొన్నారన‌డానికి త‌గిన ఆధారాలు ఏమి లేవు. అందుకే, వారి ఇష్ట పూర్వకంగానే మౌర్యుల‌కు సామంతులై, విధేయ‌త చూపినందుకు గాను, వీరికి యాంధ్రభృత్యులను మాట తిర‌స్కారంగా కాక పుర‌స్కారంగా ఉద‌హ‌రించ‌బ‌డింది.

సుమారు సా.శ‌. 230 ప్రాంతంలో, మౌర్య సామ్రాజ్య ప‌త‌నం కార‌ణంగా, గ‌త్యంత‌రం లేక, శ్రీముఖ శాత‌క‌ర్ణి స్వతంత్రించి "యేకరాట్" బిరుదాంకితునిగా యాంధ్ర శాతవాహన రాజ్యస్థాపన చేసాడు. సా.శ‌. 78 నుండి సా.శ‌. 102 మ‌ధ్య కాలానికి చెందిన శాత‌వాహ‌న ప్రభువైన గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణియే, శాలివాహ‌న శ‌క ప్రారంభ‌కుడు. త‌న తాత తండ్రుల కాలంలో పోగోట్టుకున్న రాజ్యాల‌ను విడిపించుకొని, రాజ్యవిస్తర‌ణ చేసారు. క్రమ‌క్రమంగా, శ‌క, ప‌ల్లవ, క్షహ‌రాటులు మొద‌లు, అనేక రాజ్యాల‌ను జ‌యించారు. మ‌రుస‌టి చైత్రమాసం నుండి, శాలివాహ‌న శ‌కాన్ని ప్రక‌టించాడు. ఇంత‌వ‌ర‌కు మ‌న‌కు అర్థమ‌య్యే రీతిలో ఉంది. కానీ, మ‌న చ‌రిత్రకారులు దీనికి ఒక అద‌న‌పు వివ‌ర‌ణ ఇచ్చారు. శాలివాహ‌న అనే ప‌దానికి గానీ, వారి వంశానికి కానీ, ఏ సంబంధం లేని క‌నిష్కునికి, శాలివాహ‌న శ‌కంతో ముడిపెట్టారు.

చ‌రిత్రకారులు, సా.శ‌. 1913 నుండి సా.శ‌. 1960 సంవ‌త్సర‌ముల మ‌ధ్యకాలంలో, ఎన్నో స‌ద‌స్సులు పెట్టి, చాలాసార్లు కూలంక‌షంగా చ‌ర్చించినా, అమోద‌యోగ్యమైన క‌నిష్కుని కాలాన్ని క‌నిపెట్ట లేక‌పోయారు. సా.శ‌ 57, సా.శ‌ 78, సా.శ‌ 115, సా.శ‌ 128, సా.శ‌ 134, సా.శ‌ 144, సా.శ‌ 230 మరియు ఇత‌ర కాలాల్లో ఎప్పుడైనా కావోచ్చట‌..? ఒక మానవునికి ఇన్ని జన్మదినాలుంటాయా? చివ‌ర‌గా 2001 లో, Harry Falk అనే అత‌ను, క‌నిష్కుని య‌వ్వన జాత‌కంలో ఉన్న ఒక ప్రస్తావ‌నను బ‌ట్టి, అత‌ని రాజ్యపాల‌న, సా.శ 127 గా తేల్చిచెప్పాడు. ప్రస్తుతం జ‌రుగుతున్న ప‌ద్దతి ప్రకారం, అన్ని తేదీల‌నూ ఒక ప‌ట్టిక‌లో వేసి, ఆ తేదీల‌కు కొత్త ఆధారాలు దొరికిన‌ప్పుడ‌ల్లా, ఆ గ‌డుల‌లో మార్కులు వేయ‌డం జ‌రుగుతుంది. ఇంత‌క‌న్నా విచిత్రమేమిటంటే, క‌నిష్కుని పేరుతోనే కుషాను శ‌క‌మ‌ని మ‌రోక శ‌కం కూడా ఉంది. దాని మొద‌టి  సంవ‌త్సర‌ము, సా.శ 227. క‌నిష్కుడొక్కడే, శాలివాహ‌న శ‌కాన్నీ, కుషాను శ‌కాన్నీ స్థాపించ‌డం ఏ విధంగా సాధ్యం?

శాత‌వాహ‌నుల చ‌రిత్రలో ఒక అపూర్వమైన ర‌హ‌స్యం ఇమిడి ఉంది. మొద‌ట్లో వీరు సామాన్య స్థితిని అనుభ‌వించారు. ఆ త‌రువాత రాజ్య స్థాప‌న చేసి, క్షత్రియులుగా మారారు. కానీ, కొంద‌రు చ‌రిత్రకారులు సాధ్వహ‌ణుల‌ను పేరుతో, వైశ్య వ‌ర్ణము వార‌ని వాదిస్తున్నారు. శ్రీముఖ శాత‌క‌ర్ణి ఒక బ్రాహ్మణుడని కూడా చెప్పారు. దానిని అంద‌రూ అంగీక‌రించారు. ఆది కాల‌మందు బ్రహ్మణులు కానివారు బ్రహ్మణులుగా ఎప్పుడు మారారు? అగ‌స్త్యుని కుంభ‌సంభ‌వుడ‌ని అంటారు. ఏ మాన‌వుడైనా కుంభ‌మునుండా పుట్టగ‌ల‌రా? బ‌హుశా కుంభ‌కారుల యందు పుట్టి, ఆయ‌న‌కు ఉన్న ఆధిక జ్ఞాన‌ముతో అంద‌రిని మెప్పించి, బ్రాహ్మణులు సైతం న‌మ‌స్కరించే స్థాయికి ఎదిగి ఉండ‌వ‌చ్చు. వారి ప్రతి భావ‌మునూ సౌంద‌ర్య భ‌రితంగా మార్చి, అలంక‌రించి చెప్పుట భార‌తీయుల జీవ‌ల‌క్షణ‌ము. వేద‌వ్యాస విర‌చిత‌మైన జ‌యేతిహాసంలో ఒక కుంభ‌ సంభ‌వుడున్నాడు. ద్రోణాచార్యుడు స్వయంగా తానే అబ్రాహ్మణ‌త్వం నుండి బ్రాహ్మణ‌త్వానికి ఎదిగాడు. కానీ, నిష్కార‌ణంగా ఏక‌ల‌వ్యుడిపై ఎలా కులాధిక్యత‌ను ప్రద‌ర్శించాడు? ఎవ‌రైనా దీనిని సాధించ‌గ‌ల‌ను, అని ఆత్మవిశ్వాస‌ముక‌లిగి ఉన్నప్పుడు, ఏ చాతుర్వర్ణములు, ఏ కుల భేద‌ములు, ఏ బ్రాహ్మణ్యము వానిని ఆప‌లేవు క‌దా. శాత‌వాహ‌నులు అది సాధించారు. అది మాత్రమే కాక, స‌నాత‌న ధ‌ర్మమునూ ద్రవిడ సంప్రదాయ‌మునూ క‌లిపి, మొత్తం భార‌త‌దేశంలో ఏక‌త్వాన్ని సాధించారు.

ఈ శాలివాహ‌న శ‌కానికి ముందు, విక్రమ శ‌క‌మును బ‌ట్టి కాల‌నిర్ణయ‌ము చేసేవారు. గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి, త‌న విజ‌య యాత్రలో గెలిచిన ఉజ్జయిని ప్రభువైన విక్రమార్కుడే, ఈ విక్రమ శ‌క స్థాప‌కుడు. ఈ శ‌కము సా.శ‌.పూ 57 నుండి సాగుతుంది. య‌జ్ఞశ్రీ శాత‌క‌ర్ణి ఉజ్జయిని పై విజ‌యం సాధించేవ‌ర‌కు ఉన్న కాలంలో ర‌చించ‌బ‌డిన గ్రంధాల‌లో ఇది చెప్పబ‌డింది. ఇప్పటి నేపాల దేశంలో, ఇదే అధికారిక కాల‌మానం. కానీ, మ‌న చ‌రిత్రకారుల‌కు ఉజ్జయిని రాజ్యాన్ని ఏలిన విక్రమ‌మార్కుని జాడ క‌నిపించ‌లేదు. ఇదేం చోద్యమో..

అనామ‌కుడయిన రాజు, శ‌క స్థాప‌కుడు కాలేరు క‌దా? మ‌రి శ‌క స్థాప‌కుడు వాస్తవ ప్రపంచంలో లేర‌న‌డం, ఏ విధంగా స‌మంజ‌సం? అత‌డు దొర‌క‌క‌పోవ‌డం వ‌ల్లనే ఈ శ‌కానికి క‌ర్తగా, గుప్త వంశ‌పు చంద్రగుప్త విక్రమాదిత్యుని తెచ్చి పెట్టారు. ఇత‌ని కాలం, సా.శ 375 నుండి, సా.శ 415 వ‌ర‌కు ఉంది.  ఏ ప్రభువైనా త‌న కీర్తినిబ‌ట్టి శ‌క‌మును స్థాపించాల‌నుకున్నప్పుడు, అన్ని సంవ‌త్సర‌ములు వెన‌క‌నుండి ప్రారంభించ‌డం ఏ విధంగా స‌రియైన‌ది? ఈ శ‌కాన్ని ముందు కృత‌శ‌క‌మ‌నీ, త‌రువాత మాల్వేశ‌ శ‌క‌మ‌నీ పిలిచారు. త‌రువాత సా.పూ. 57 నుండి, విక్రమార్కుని ప్రాభ‌వాన్నిబ‌ట్టి, విక్రమ శ‌క‌మ‌ని పొందుప‌రిచారు.

మ‌హాక‌వి కాళిదాసు జ్యోతిర్విద్యాభ‌ర‌ణం అనే కావ్యాన్ని ర‌చించి, అందులోని ప్రధ‌మాధ్యాయంలో, క‌లియుగం ప్రారంబ‌మై 3,045 సంవ‌త్సరాలు గ‌డిచిన త‌రువాత, విక్రమ శ‌కం ప్రారంభ‌మ‌య్యింద‌ని ప్రస్తావించారు. క‌లియుగ ప్రారంభం సా.శ‌. పూ. 3102 అని ఖ‌చ్చితంగా తెలిసింది క‌నుక, దానిని బ‌ట్టి లెక్కిస్తే సా.శ. 57 నుండి విక్రమ శ‌కం మొద‌ల‌య్యింద‌ని నిర్ధారించ‌వ‌చ్చు. మ‌రియు విక్రమార్కుడు వాస్తవ ప్రపంచంలో లేడ‌ని చెప్పడం దుర్మార్గమే కాక, ఈ కాళిదాసు మ‌హాక‌విని కూడా గుప్త వంశ‌పు చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలానికి జ‌రిపారు. కానీ, అదే జ్యోతిర్విద్యాభ‌ర‌ణ కావ్యంలోని గ్రంధ ర‌చనా కాలాన్ని, క‌లి ప్రారంభ‌మైన త‌రువాత 5.067 అని చెప్పుకున్నారు. ఈ సంవ‌త్సరం విక్రమ శ‌కారంభ‌ము. త‌రువాత వ‌చ్చే సా.శ‌.పూ. 35 తో స‌రిపోతుంది. మ‌రి విక్రమార్కుని ఉనికిని గ‌ల సాక్ష్యాల‌ను క‌నిపెట్టటం మాని, ఈ ఎగ‌లాగుడు దిగ‌లాగుడు వ్యవ‌హారాలేంటో మ‌రి? అందుకే పెద్దలు.. ‘నాయ‌నా, ప‌రిధిని దాటిన జ్ఞాన‌ము శిరోభార హేతువు. క‌నిపించిన ప్రతిదానికీ ప్రశ్నలు సంధించ‌కురా...’ అని ప‌దే ప‌దే చెప్పేవారు.

మా తాత ఎడ్ల బండి మీద తిరిగారు. నేను కూడా ఎడ్ల బండి మీద జ‌ర్మనీకి పోతాను. అనుకోవ‌డ‌మే భార‌తీయ సంస్కృత‌ని, హిందువుల‌ను వెక్కిరించే వారికి, వారి దేశంలోనే ఉన్న 14 విశ్వ విద్యాల‌యాల్లో, మ‌న సంస్కృత భాష‌ను బోధిస్తున్నార‌ని తెలియ‌దేమో మ‌రి... ఈ థాయిలాండ్ వారు ఏ దేశాన్ని చూసి, ‘మ‌న’ దేశం క‌న్నా గొప్పదని లొట్టలు వేస్తున్నారో, ఆ దేశంలో గ‌ల ప‌రిశోధ‌క‌లు, మ‌న భార‌త‌య విజ్ఞాన శాస్త్ర ప్రతిభ‌కు త‌లొగ్గిన సంగ‌తి ఇంకా తెలుసుకోలేదేమో.. సూర్యుని అఖండ తేజోమ‌య‌మైన కాంతిని ఒక గ్రుడ్డివాడు చూడ‌లేడు క‌దా.... స్వతంత్ర భార‌తావ‌నిలో మొద‌టి ప్రధాని హైంద‌వ ధ‌ర్మ ద్వేషి అవ్వడం వ‌ల్లే, ఇక్కడి విశ్వవిద్యాల‌యాల్లో ఉన్నవారు, కోతి మూక‌లా అడ్డూ అదుపూ లేకుండా చేల‌రేగి పోతున్నారు. ఇప్పటికి వారి ఆగ‌డాల‌కు అడ్డుక‌ట్ట ప‌డింది. హిందువులు ఇంత‌కు ముందు వారివ‌లె లేరు. వీరు క‌క్కిన హైంద‌వ ద్వేషం యెక్క నిజ‌రూపాన్ని తెలుసుకుని, వారి వ‌ల్ల ఈ నాటికి హిందువులు జాగ్రత్త ప‌డ్డారు.

ఏ ప్రజ‌లూ త‌మ దేశానికి చేయ‌ని అప‌కారాన్ని, భార‌త దేశ‌పు వామ‌ప‌క్షాలు చేశాయి. ముఖ్యంగా, మ‌న దేశ చ‌రిత్రను ఏం ఆశించి వ‌క్రీక‌రించారు? మ‌న దేశానికి సంబంధించి ప్రతీదీ చెత్తగానే భావించారు. మ‌న దేశాన్ని ఆక్రమించి, మ‌న ద‌గ్గర నెల‌కొని ఉన్న శాంతిని ధ్వంసం చేసిన విదేశీయులు జ‌గ‌దేక‌వీరులా? మ‌న దేశ‌పు రాజులు శివాజీ మ‌హారాజ్ మెద‌లుకొని, మ‌హారాణా ప్రతాప్ వ‌ర‌కు ఎవ్వరైనా క్రూరులే. బాబ‌రు నుండి ఔరంగ జేబు వ‌ర‌కు ఉన్న వారు మాత్రమే ధ‌ర్మ ప్రభువులుగా క‌నిపించారా? వీరు మ‌న దేశానికి రాక‌పోతే, మ‌న‌కు చాలా న‌ష్టము వాటిల్లేదనే భావ‌న‌లో ఉన్నారు. ఏంటి ఈ పైత్యకారి సిద్ధాంతాలు? మ‌న ఆచార వ్యవ‌హారాల‌న్నీ అనాగ‌రిక‌ములే అని, విదేశీయుల సిద్దాంతాల‌ను మ‌న‌పై రుద్దమ‌ని ప్రక‌టించిన వాడూ, వ్యభిచారీ, లౌకిక‌త్వముతో అగ్రగ‌ణ్యుడైన వాడూ, పండితుడ‌య్యాడు. అత‌ని త‌ప్పుల‌నూ, వీరి అబ‌ద్దముల‌ను బ‌య‌ట‌పెడితే, అది లౌకిక‌త‌త్వమున‌కు విరుద్దమ‌ట. ఇదేం చోద్యమో...

🚩 జై శ్రీ కృష్ణ 🙏

Link: https://www.youtube.com/post/UgkxNkF7ZHn7e05R2t5qeV8xkn377PNPQkla

Monday, June 3, 2024

హిందూత్వం - 1 - Science and Hinduism


హిందూత్వం - 1 TELUGU VOICE

మ‌నం కాలాన్ని ఏ విధంగా కొలుస్తాము?.. భూమి మీద ఒక ప్రామాణిక దూర‌ములోగల బిందువుల‌ను తీసుకుని, ఆ రెండు బిందువుల‌నూ, నిర్దేశిత వేగంతో చేరే స‌మ‌యాన్నీ, కాలాన్నీ, ఒక ప్రమాణంగా తీసుకోవ‌డం జ‌రుగుతుంది. అంతేక‌దా.. మ‌రి మీరు దూరాన్ని ఏ విధంగా కొలుస్తారు? అని అడిగితే దానికి  స‌మాధానం, ఇంత‌కు ముందు చెప్పిన విధానాన్నే చెప్పవ‌ల‌సి వ‌స్తుంది. ఏ విధంగా అంటే, ఒక రెండు బిందువుల‌ను తీసుకుంటే, మీరు ఒకే స‌మ‌యంలో, రెండు బిందువుల వ‌ద్దా ఉండ‌లేరు గ‌నుక, మొద‌టి బిందువు నుండి ఒక ప్రామాణిక వేగంతో, ప్రామాణిక కాలంలో, రెండ‌వ బిందువు చేర‌గ‌లిగితే, దానిని దూర‌ము అంటాం.. ఇలా ఈ రెండూ ఒక దానితో ఒక‌టి ముడిప‌డి, ఈ కాల‌ము, విశ్వముతో ఉన్న సంబంధాన్ని మ‌నకు తెల‌య‌జేస్తుంది. ఈ విష‌యాన్ని ఐన్స్టీన్ మ‌హ‌శ‌యుడు సాపేక్షతా సిద్ధాంత రూపంలో తెలియ‌ప‌రిచారు.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/HAU_0e-RybQ ]


నిన్న మొన్నటి వ‌ర‌కూ వీదేశీయుల కాల‌గ‌మ‌నం ప్రకారం, సెక‌ను, నిమిష‌ము, గంట‌, దిన‌ము, వార‌ము, మాస‌ము, ఋతువు, సంవ‌త్సరం మాత్రమే ఉండేవి. సంవ‌త్సర‌ములు, అంటే, కేవ‌లం అంకెలు మాత్రమే .. ర‌శ్మ్యుద్గార‌క‌త‌, ప‌ర‌మాణు విచ్చిత్తి వంటివి జ‌రిగిన త‌రువాతే, వారు మైక్రొ సెక‌ను పై దృష్టి పెట్టారు. కానీ, ప్రాచీన వైదిక కాలంలోనే, మ‌న భార‌తీయులు, కాల‌గ‌ణ‌నాన్ని ప‌ర‌మాణువు నుండి మొద‌లు పెట్టి, మ‌హా యుగాల వ‌ర‌కు విస్తరించి ఉన్నారు. విదేశీయుల కాల‌గ‌ణ‌న‌ము ప్రకారం, 26 మైక్రొ సెక‌న్లకు స‌మాన‌మైన‌ది ఒక ప‌ర‌మాణువు.. రెండు ప‌ర‌మాణువులు ఒక అణువు, మూడు అణువులు ఒక త్రస‌రేణువు, మూడు త్రస‌రేణువులు క‌లిపి ఒక తృటి, వంద తృటులు క‌లిస్తే ఒక వేధ‌, మూడు వేధ‌లు ఒక ల‌వ‌ము, మూడు ల‌వ‌ములు క‌లిపి, ఒక నిమిష‌మవుతుంది. ఆ విధంగానే, మూడు నిమిష‌ములు, ఒక క్షణ‌ము, అయిదు క్షణ‌ములు ఒక కాష్ఠము, ప‌దిహేను కాష్ఠములు క‌లిపితే ఒక ల‌ఘువు, ప‌దిహేను ల‌ఘువులు క‌లిపితే ఒక దండ‌, అదే రెండు దండ‌లు అయితే, విదేశీయుల కాల‌మానం ప్రకారం, 48 నిమిష‌ముల‌కు స‌రిప‌డే ఒక ముహుర్తం. ఇలాంటి ముప్పది ముహుర్తములు కలిపి, ఒక అహోరాత్ర దినం, 30 దిన‌ములు ఒక మాస‌ము, రెండు మాస‌ములు క‌లిపి ఒక ఋతువు. మూడు ఋతువులు క‌లిసి ఒక ఆయ‌న‌ము, అదే రెండు ఆయ‌న‌ములు కలిస్తే, దేవ‌త‌ల అహోరాత్రముల‌కు స‌మాన‌మైన ఒక సంవ‌త్సర‌ము.. దేవ‌త‌ల మాస‌మున‌కు 30 దిన‌ములు. దేవ‌త‌ల సంవ‌త్సర‌ముల‌కు రెండు ఆయ‌న‌ములు మ‌రియు 12 మాస‌ములు...  దేవ‌త‌ల సంవ‌త్సర‌ముల ప్రకారం, 4,800 దివ్యవత్సర‌ములు, ఒక స‌త్య యుగం. 3,600 దివ్యవ‌త్సర‌ములు ఒక త్రేతాయుగం, 2,400 దివ్యవ‌త్సర‌ములు క‌లిపి, ఒక ద్వాప‌ర యుగం, 1,200 దివ్యవ‌త్సర‌ముల‌కు, ఒక క‌లయుగం. ఈ నాలుగు యుగ‌ములూ క‌లిపితే, మానవ సంవ‌త్సర‌ముల లెక్క ప్రకారం, 43,20,000 సంవ‌త్సరాల‌న్న మాట‌...

సూర్యు గ్రహ‌ము త‌న చుట్టు తాను తిరిగే 12,000 భ్రమ‌ణ‌ముల‌కు స‌మాన‌మైన కాలాన్ని,  ఒక మ‌హా యుగం అంటారు. 1000 మ‌హా యుగాల కాలాన్ని క‌ల్పము అంటారు. 2 క‌ల్పముల స‌మ‌యం, విధాత‌కు ఒక అహోరాత్రము. విధాత మాస‌మున‌కు 30 దిన‌ములు, విధాత సంవ‌త్సరానికి 12 మాస‌ములు. అన‌గా మ‌న లెక్క ప్రకారం 3.1104 ట్రిలియ‌న్ సంవ‌త్సర‌ములన్న మాట‌. ఇటువంటివి 50 విధాత సంవ‌త్సర‌ములు గ‌డిస్తే, ఒక ప‌రార్థము, రెండు ప‌రార్ధములు క‌లిస్తే, 311.04 ట్రిలియ‌న్ మాన‌వ సంవ‌త్సర‌ములకు స‌మాన‌ము. ఈ మ‌హా క‌ల్ప స‌మ‌యాన్ని, విధాత పూర్ణాయుర్ధాయ స‌మ‌యంగా నిర్వచించారు మ‌న పూర్వీకులు. 30,67,20,000 సౌర సంవ‌త్సర‌ముల‌కు స‌మాన‌మైన 71 మ‌హాయుగాల‌ను, ఒక మ‌న్వంత‌రం అంటారు. ప్రతి మ‌న్వంత‌రానికి, ఒక మ‌నువు శాస‌న కర్త, మ‌రియు ప్రతి రెండు మ‌న్వంత‌ర‌ముల‌కు మ‌ధ్య, కృత‌యుగ కాలంతో స‌మాన‌మైన ఒక సంధికాలం ఉంటుంది. ఈ సంధి కాలమంతా, భూమి నీటితో మునిగి ఉంటుంది. ఇంత సూక్ష్మ వివ‌ర‌ణ‌ల‌తో  కాలాన్ని వివ‌రించిన ఘ‌న‌త మ‌న పూర్వీకుల‌కు చెందుతుంది.

భార‌తీయుల సంవ‌త్సర‌ములు అంటే కేవ‌లం అంకెలు మాత్రమే కాదు. వాటికి పేర్లు నిర్దేశించారు. ప్రతి సంవ‌త్సరానికీ ఒక అధిష్టాన దేవ‌త ఉన్నారు. ప్రభ‌వ నుండి క్షయ వ‌ర‌కు గ‌ల 60 సంవ‌త్సర‌ములు కూడా గొలుసుక‌ట్టు విధంగా ఒక‌దానితో ఒకటి ముడిప‌డి ఉంది. ఈ 60 సంవత్సర‌ముల చ‌క్రములో ఒక విశేషం ఇమిడి ఉంది. శ్రద్దగా ప‌రిశీలించిన‌ట్లయితే, మ‌న‌కు అర్దమ‌వుతుంది. మొద‌టి 20 సంవ‌త్సర‌ములు శుభ‌క‌ర‌మైన, వృద్ది క‌లిగే గుణ‌మును క‌లిగి ఉంటాయి. పెరుగుట విరుగుట కొర‌కే అనే సామెత ప్రకారం, త‌దుప‌రి వ‌చ్చే 20 సంవ‌త్సర‌ములూ అభివృద్ది లేని స‌మ‌తా స్థితిని క‌లిగి ఉంటాయి. ఇక చివ‌రి 20 సంవ‌త్సర‌ములు ప్రశాంత‌త  క‌రువై  క్రమంగా అశాంతితో మిగిలి ఉంటుంది. ఈ మాన‌వ స‌మాజాన్ని చారిత్రకంగా, ఇన్ని ద‌శ‌ల‌లో చూచి, వాటికి త‌గిన పేర్లతో, ఒక చ‌క్రంగా స‌మ‌కూర్చిన వారి మేధ‌స్సుకు మ‌నం త‌లోగ్గక త‌ప్పదు.

ఈ 20 సంవ‌త్సర‌ముల‌కు మ‌రొక విశేషం కూడా ఉంది.  భార‌త‌దేశ‌మంత‌టా క‌లియ‌దిరిగి, హైంద‌వధ‌ర్మ త‌త్వాన్ని నిరూపించి, ఎన్నో లెక్కకు మించిన స‌ద్గురు పీఠ‌ముల‌ను నిర్మించి, అక్కడ జ‌రగ‌వ‌ల‌సిన ప్రతి కార్యాన్నీ వివ‌రించి, భ‌విష్యత్త్ కాలంలో కూడా వాటికి ఎటువంటి ఆటంకాలూ రాకుండా, అన్ని విధాల ఏర్పాట్లను చేసిన శ్రీ శంక‌ర భ‌గ‌వ‌త్పాదుల ఆయుర్ధాయం, 32 సంవ‌త్సర‌ములు మాత్రమే క‌దా... అందులో ఆయ‌న బాల్యాన్నీ, ఆయ‌న శక్తి అంద‌రికి స్పష్టంగా తెలిసేవ‌ర‌కూ ప‌ట్టిన స‌మ‌యాన్నీ వ‌దిలేస్తే, ఆయ‌న‌కు ఉన్న కాలం 20 ఏండ్లు మాత్రమే.. ఆంధ్రులు ఇప్పటికీ త‌మ‌కు ఆద‌ర్శ ప్రభువుగా భావించే, ఆంధ్రభోజుడ‌నే కీర్తిని సాధించిన శ్రీకృష్ణ దేవ‌రాయ‌ల ప‌రిపాల‌నా కాలం కూడా, 20 ఏండ్లే..  దీనిని బ‌ట్టి మ‌నం అర్థం చేసుకోవాల్సింది, మాన‌వ జ‌న్మను సార్థకం చేసుకోవాలంటే, వంద‌ల ఏండ్లు బ్రత‌కాల్సిన అవ‌స‌రం లేదు. 20 ఏండ్ల స‌మ‌యం స‌రిపోతుంద‌ని అర్థం అవుతుంది.

భార‌తీయ కాల‌మానం ప్రకారం ఈ విశ్వమంతా ఒక క‌ల్పము వెనుక పుట్టింది. ఆనాటి ప‌ద్మక‌ల్పము నుండి మొద‌లై, నేటికి శ్వేత వ‌రాహ క‌ల్పానికి చేరుకున్నాం. ఇప్పటికి విధాత ఆయుర్థాయం 50 ఏండ్లు పూర్తయి ప‌రార్ధమున తొలి దిన‌ము న‌డుస్తున్నది. ఆరు మ‌న్వంత‌రాలు గ‌డిచి, ఏడ‌వ‌ద‌యిన వైవ‌స్వత మ‌న్వంత‌ర‌ము సాగుతున్నది. ఈ వైవ‌స్వత మ‌న్వంత‌ర‌ములో, 28 వ మ‌హా యుగంలోని క‌లియుగంలో ఉన్నాము.

సామాన్య శ‌కం పూర్వం, 3102 లో, క‌లి ప్రారంభ‌య‌య్యింద‌ని అంద‌రి చేత నిర్ధారించ‌బ‌డింది. ఇవ‌న్నీ కూడా  ప‌నిపాట లేక, ముక్కుమూసుకొని, కార‌డ‌వుల‌లో ఆశ్రమ‌ములు క‌ట్టుకుని, ఒంట‌రి ప‌క్షులవ‌లె తిరిగే మునుల కాకిలెక్కలు కావు. ఈ నాటి ఆధునిక వైజ్ఞానిక శాస్త్రపు లెక్కల‌తో స‌రిస‌మానంగా నిరూపించ‌బ‌డి ఉన్నాయి. విష్ణు పురాణం ప్రకారం లెక్కిస్తే, ప్రస్తుత సృష్టి కాలం 4.32 బిలియ‌న్ సంవ‌త్సర‌ములు.. ఇటీవ‌లి కాలంలో ఆధునిక శాస్త్రం, భూమి వ‌య‌స్సు 4.5 బిలియ‌న్ సంవ‌త్సర‌ములు అని తెలియ‌జేసింది.  ఈ లెక్క మ‌న పురాణాల లెక్కకు ఇంచుమించు ద‌గ్గర‌గా ఉంది. తొలి ఆరు మ‌న్వంత‌రాలు, సంధి కాలంతో క‌లిపి, (6 X 71 X 43,20,000 ) + 7 X 1.728 X 106 = 1.852 ) ఇప్పటికి 1.852 బిలియ‌న్ సంవ‌త్సర‌ములు పూర్తయ్యాయి. ప్రస్తుత మన్వంతరంలో గడిచిన 27 మహాయుగముల కాలము 116.640000 మిలియన్ సంవత్సరాలు. ఇప్పటి మహాయుగంలో (1.728 X 106 + 1.296 X 106 + 8,64,000 = 3.888) 3.888 మిలియన్ సంవత్సరాలు గడిచాయి. కలి కాలం  ప్రారంభమై (3102 + 2019 = 5119) 5119 సంవత్సరములు నిండాయి. వీటన్నింటిని కలిపితే, మొత్తము (155.52 X 1012 + 1.973X109 + 0.00012053302 = 155,521,972,949,113) 155 ట్రిలియన్ సంవత్సరాల‌న్నమాట‌. మ‌హా విస్ఫోట‌నం జ‌రిగిన‌ప్పటి నుండి, పాశ్చాత్యుల లెక్క ప్రకారం, మ‌న విశ్వం యెక్క వ‌య‌స్సు 13.7 బిలియ‌న్లు మాత్రమే. కానీ, వారి లెక్క ప్రకారం, ఒక చిన్న త‌ప్పు ఉంది. ఒక విస్ఫాట‌నం జ‌రిగింది అంటే, అంత‌కుముందే దాని ప్రభావం వ్యాపించి ఉంటుంద‌ని వారు ఆలోచించ‌లేదు. వారు లెక్కించిన విలువ మొట్టమొద‌టిది కాదు. ద‌ప‌ద‌ఫాలుగా మారుతూ వ‌స్తూ ఉంది. అదే విధంగా, బావి త‌రాల‌లో మ‌రిన్ని ఆవిష్కారాల త‌ర్వాత, దాని విలువ కొంచెం అటు ఇటుగా మారి, మ‌న పూర్వీకుల లెక్కకు మ‌రింత ద‌గ్గర‌గా చేర‌వ‌చ్చు.  భూమి యొక్క గోళాకారాన్ని నిరూపించాలి అనుకున్న వారికి, అత్యంత క్రూరమైన మ‌ర‌ణ శిక్ష  విధించ‌క ముందే, మ‌న భార‌తీయ ఖ‌గోళ శాస్త్రజ్ఞులంద‌రూ ముక్త కంఠంతో దానిని నిరూపించారు. మార్కండేయ పురాణంలో, భూమి ఒక అంచున నొక్కబ‌డి ఉంద‌ని వ‌ర్ణించ‌బ‌డింది. మ‌న దేశ పూర్వీకుల శాస్త్ర విజ్ఞాన ప్రతిభ‌కు, ఇంకా ఎవ‌రైనా సాక్ష్యాల‌డిగితే, వారిని మ‌న దేశం నుండి బ‌హిష్కరించి, వారికి న‌చ్చిన దేశంలోకి వెళ్లి బ్రత‌క‌మ‌ని మ‌ర్యాద‌పూర్వకంగా పంప‌డం మంచిది.

"INCEPTION" అనే ఆంగ్ల చిత్రం మీకు సులువుగా అర్థమ‌వ్వాలంటే, భార‌తీయ విశ్వ సృష్టి వాదం తెలియాలి. ఎందుకంటే, అందులో ఉన్న క‌థ అంతా ఒక క‌ల. ఆ క‌ల‌లో మ‌రొక క‌ల‌ను క‌లిపి చిత్రిక‌రించారు. ఇదంతా బ్రహ్మసత్యం, జగన్మిధ్య అనే దానికి, బింబ‌రూపంగా అనిపిస్తుంది. ‌"MATRIX అనే మ‌రొక చిత్రంలో కూడా, న‌టీన‌టులు చెప్పే మాట‌లన్నీ, మ‌న భార‌తీయ క‌ర్మ సిద్ధాంతానికి  ప్రతిధ్వనిలా విన‌బ‌డుతుంది. మ‌న భార‌త‌దేశ‌పు సంస్కృతి వైభ‌వాన్ని, విదేశీయులు సైతం పార‌వ‌శ్యంతో కీర్తిస్తుంటే, మ‌న ప్రజ‌లు మాత్రం, మ‌న దేశ‌పు గొప్పత‌నాన్ని తెలుసుకోలేక, ఈ దేశంలో ఏముంద‌ని చిన్నచూపు చూస్తున్నారు. మ‌రి ఏ దేశ‌మైనా, ఇంత‌టి కీర్తిని సాధించి ఉంటే, క‌న్ను మిన్ను కాన‌రాక, త‌మ గోప్పలు చెప్పుకుంటూ, భూమి ఆకాశాన్ని ఏకం చేసేవారు. గురుత్వాక‌ర్షణ సిద్దాంతాన్ని తెలియ‌జేసిన మ‌హానుబావుడు,  ఐజాక్ న్యూట‌న్. కానీ,  64 శ‌తాబ్ధాల‌ క్రిత‌మే, ఋగ్వేద సంహిత‌లో ఈ ప్రపంచంలో ప్రతి వ‌స్తువూ మ‌రొక వ‌స్తువుకు ఆక‌ర్షించ‌బ‌డుతుంద‌ని స్పష్టముగా వివ‌రించి ఉంది. నేటి కాలంలో ఈ విష‌యం అంద‌రికి తెలిసినా స‌రే, గుర్తింపు ఎవరికి చెందింది. ఇంటి దొంగ‌ను ఈశ్వరుడైనా ప‌ట్టలేడు క‌దా... ఆ విధంగానే, గ‌డిచిన మ‌న చ‌రిత్ర వాస్తవాల‌ను మఱుగున ప‌డేసి, అస‌త్యాలను ప్రచారం చేసే దుష్కర్ములూ, మ‌న శ‌కక‌ర్తల ఉనికిని క‌నిపెట్టలేని ఈ అస‌మ‌ర్థులూ, మ‌న దేశపు కీర్తి ప్రతిష్ఠల కోసం పోరాడ‌డం సాద్యమ‌య్యే ప‌నేనా?

🚩 జై శ్రీ కృష్ణ 🙏
Contd.. in Part 2

Monday, May 27, 2024

గుడి! దేవుడు మనలోనే ఉన్నప్పుడు మరి గుడికి ఎందుకు వెళ్ళడం? Temple Secrets - Gudi - Aalayam


గుడి! దేవుడు మనలోనే ఉన్నప్పుడు మరి గుడికి ఎందుకు వెళ్ళడం? TELUGU VOICE

దేవుడు అన్ని చోట్లా, అంతటా ఉన్నప్పుడు, మరి ప్రత్యేకించి దేవాలయాలకు వెళ్ళడం అవసరమా? ఈ ప్రశ్న నేటి తరం వారందరికీ కలుగుతుంటుంది.. ఆలయాలను దర్శించుకోవడం వెనుక ఎన్నో శాస్త్రీయ ప్రయోజనాలున్నాయి. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి? ఈ విషయమై వేదాలు ఏం చెబుతున్నాయి? నేటి తరంలో చాలామందికి తెలియని ఇటువంటి అంశాలు ప్రతి హిందువూ తెలుసుకోవడం చాలా అవసరం.. ఈ వీడియోను అందరికీ చేరేలా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/gh0S2nYUMIM ]


మనదేశంలో చిన్నా పెద్దా ఆలయాలను చూసుకుంటే, వేలాది సంఖ్యలో ఉంటాయి. అయితే, అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దిష్ఠంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే, గురువులు పరిగణిస్తారు. అలాంటివే, అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే కానీ, కొన్ని ఆలయాలు మరింత పునీతమై, స్థలమాహాత్మ్యాన్ని సంతరించుకున్నాయి.

భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో, అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే, ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో, అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట, ప్రసిద్ధ దేవాలయాలున్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే, తనువూ, మనస్సూ ప్రశాంతతను పొందుతాయి.

దేవాలయ గర్భగృహంలో, ఉత్క్రుష్టమైన ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమైన చోట, మూల విరాట్టును నిలిపిన ప్రదేశంలో, వేద మంత్రాలు రాసిన రాగి రేకును నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంటుంది. ఆ విధంగా రాగి గ్రహించిన ఆకర్షణను, ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది. అందువల్ల రోజూ గుడికి వెళ్ళి, మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటున్నవారికి ఆ తరంగాలు సోకి, అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో ఆ శక్తి సోకినా, గమనించ దగ్గ తేడా ఉండదు. కానీ, నిత్యం గుడికి వెళ్ళే వారిలో, పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.

ఇక గర్భగుడి మూడు వైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక వైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల, గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర, పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై, మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా, చెప్పుకోదగ్గదే. ఆలయాలలో గంటలు మోగిస్తారు, వేద మంత్రాలు పఠిస్తారు, భక్తి గీతాలు ఆలపిస్తారు.. ఈ మధుర ధ్వనులు కూడా, అలౌకిక శక్తిని సమకూరుస్తాయి.

గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరు వత్తులు, గంధం, పసుపు కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు, శరీరంలో రసాయన చర్య జరపడం వల్ల, శక్తి విడుదలవుతుంది. మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు, గుడిగంటలు, మంత్ర ఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరు వత్తులు, గంధం, పసుపు కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాలలో ఉండే ఔషధ గుణాలు, అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది.

గుడిలో దేవుడికి కొబ్బరికాయ, అరటిపళ్ళు నైవేద్యంగా పెడతారు. ఆ కొబ్బరినీ, అరటిపళ్ళనూ భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని సేవించడం వల్ల, శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి. తీర్థంలో పచ్చ కర్పూరం, యాలుకలు, సాంబ్రాణి  తైలము, తులసి పత్రాలు, లవంగాలు మొదలైనవి కలుపుతారు. ఆయా పదార్థాలన్నీ, ఔషధ గుణాలు కలిగినవే. అలా గుడికి వెళ్ళిన వారు సేవించే తీర్థం, ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయురారోగ్యాలను ఇస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

ఇప్పుడు చాలా మంది పాటించడం లేదు కానీ, పూర్వం ఆలయానికి వెళ్ళేటప్పుడు, పురుషులు చొక్కా లేకుండా వెళ్ళేవారు. దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు, వేగంగా పురుషుల శరీరంలోకి ప్రవేశిస్తాయి. స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకుని, అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం మన సంప్రదాయంగనుక, అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు. లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆ విధంగా స్త్రీ పురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది.

భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో, గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది. కర్పూర హారతి వెలిగిస్తారు. గంటలు మోగుతాయి. తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలూ సమీకృతమై, భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. మనలో దివ్య శక్తి ప్రవేశించి, తేజస్సు అనుభూతికొస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి...

ఇక మన చానెల్ community లో post చేసిన ‘కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి క్షేత్ర పాలకుడు ఎవరు?’ అనే quiz కి సంబంధించిన వివరణలోకి వెళితే..

సాధారణంగా వైష్ణవ క్షేత్రాలకు శివుడు... శైవ క్షేత్రాలకు విష్ణువు క్షేత్ర పాలకులుగా వ్యవహరిస్తుంటారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల క్షేత్రంలో, శివుడు క్షేత్ర పాలకుడిగా వున్నాడు. ఈ స్వామియే తిరుమల క్షేత్రాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. అలాంటి క్షేత్ర పాలకుడైన శివుడు, తిరుమల ప్రధాన గర్భాలయం ఎదురుగా గల ధ్వజస్తంభం దగ్గర శిలగా, అంశ రూపంలోనూ... ప్రస్తుతం 'గోగర్భ క్షేత్రం' గా పిలువబడుతోన్న 'పాండవ తీర్థం' దగ్గర, పూర్ణ స్వరూపంతోనూ భక్తులకు దర్శనమిస్తున్నాడు.

అయితే, క్షేత్ర పాలకుడైన శివుడు, ఇలా శిలా రూపంలో రెండు ప్రదేశాలలో ఉండటానికి కారణం లేకపోలేదు. క్షేత్ర పాలకుడైన శివుడు పూర్వం, 'రాతి గుండు' రూపంలో రాత్రి వేళలో శ్రీవారి ఆలయం చుట్టూ తిరిగేవాడని పురాణ విదితం. పూజారులు ఉదయం వేళలో ఆలయం తలుపులు తీసేటప్పుడూ, రాత్రి వేళలో తలుపులు మూసేటప్పుడూ, తప్పని సరిగా క్షేత్రపాలక శిలకు తాళాలు తాకించి, ఆయన అనుమతి లభించినట్టుగా భావించి, ఆ పనులు చేసే వారు. ఇప్పటికీ ఇదే పద్ధతి కొనసాగుతుంది. అయితే, ఇప్పుడు తిరుమల ప్రధాన గర్భాలయంలో అంశావతారం మాత్రమే ఉండడానికి కారణం..

ఒకసారి పూర్ణశిల అంటే రాతి గుండు, రాత్రి సమయంలో ఆలయం చుట్టూ తిరుగుతూ వుండగా, ఒక చిన్న పిల్లవాడు ప్రమాదానికి గురయ్యాడని చెబుతారు. అప్పటి నుంచీ క్షేత్ర పాలక శిలయొక్క అంశావతారాన్ని మాత్రమే ఆలయంలోని ధ్వజస్తంభం దగ్గర వుంచి, పూర్ణ స్వరూపాన్ని, పాండవ తీర్థం దగ్గర ఉంచారు. ప్రతి యేటా, 'మహా శివరాత్రి' పర్వదిన సందర్భంగా, శ్రీవారి ఆలయం నుంచి పాండవ తీర్థానికి చేరుకున్న పూజారులు, క్షేత్ర పాలక శిలకి, వెండి ఆభరణాలతో రూపురేఖలు కల్పించి, 'ఏకాదశ రుద్రాభిషేకం' చేస్తారు. ఈ సందర్భంగా, స్వామివారికి వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించి, వాటిని ప్రసాదంగా, అక్కడి భక్తులకు పంచుతారు. స్వామివారి అభిషేక కార్యక్రమాన్ని వీక్షించిన వారికి మోక్షం లభిస్తుందని చెబుతారు.

🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

Monday, May 20, 2024

Was being Kaikeyi easy? ‘కైకేయి’ది స్వార్ధమా? త్యాగమా?


‘కైకేయి’ది స్వార్ధమా? త్యాగమా? TELUGU VOICE
రాముడు అడవుల పాలైనా.. భర్త మరణానికి ప్రత్యక్ష కారకురాలైనా..

రామచరితం రసరమ్య భరితం. రామాయణంలాగా లోక వ్యవహారాన్ని విస్పష్టంగా బోధించే కావ్యం మరొకటి లేదన్నది, ఆర్యోక్తి. ఆదికవి వాల్మీకి నుంచి నేటి వరకూ, రమణీయమైన రామగాధ, పలుభాషలలో, పలు రీతులలో రూపు దిద్దుకుంటూ, భారతావని లోనే కాకుండా, భారతీయుల సంస్కృతి ప్రసరించిన అన్య దేశాలలోనూ ప్రచార ప్రశస్తి పొందింది. రామాయణం ఆదికావ్యం. వాల్మీకి మహర్షి ఈ మహాకావ్యాన్ని రచించడానికి కారణం, బ్రహ్మానుగ్రహం. భారత దేశంలోనూ, భారతీయ వాఙ్మయంలోనూ, సీతారాములు ప్రతి అణువులోనూ, ప్రతి అక్షరంలోనూ ప్రకాశించే దైవదంపతులు. రామాయణాన్ని చదవడం వల్ల, తల్రిదండ్రుల పట్ల భక్తి, సోదర ప్రీతి, జ్యేష్టానువర్తనం, లోకమర్యాదానుసరణం, ప్రతిజ్ఞా పాలనం, ఆశ్రిత వాత్సల్యం, స్వామికార్య నిర్వహణం, స్వార్ధపరత్వ నివృత్తి, చిత్త శుద్ధీ, పరోపకార బుద్ధివంటి అనేక సద్గుణాలు అలవడడానికి ప్రోత్సహిస్తుంది. అటువంటి రామాయణ గాధలో, కైకేయి తన దాసీ అయిన మంథర మాటలు విని, రాముడిని ఆడవుల పాలుజేసి, భర్త మరణానికి కారకురాలై, అటు కన్నబిడ్డ ప్రేమకూ, ఇటు పెంచిన బిడ్డ మామకారానికీ దూరమైన అభాగ్యురాలిగా, మనలో చాలామందికి తెలిసిన విషయమే.. కానీ, ఆ తల్లి అలా చేయడం వెనుక చాలామంది ఊహించని మరో కోణం ఉంది.. వీడియోను చివరిదాకా చూసిన తరువాత మాత్రమే, మీ అభిప్రాయాలను comments ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/1Om0PMDewuQ ]


నూతన వీక్షకులకు మనవి: వీడియోను చూడకుండానే, Thumbnail చూసో, Title చూసో, అర్ధంపర్ధంలేకుండా చేసే comment లను నిర్మొహమాటంగా delete చేయడమే కాకుండా, ఇకముందు మన channel లో కామెంట్ చేసే పరిస్థితి లేకుండా block చేయడమనే తప్పనిసరి పరిస్థితులలోకి నన్ను తీసుకువెళ్లరని ఆశిస్తున్నాను. ప్రతి ఘటనకీ వేర్వేరు కోణాలు ఉన్నట్లే, రాముడి పినతల్లి కైకేయి విషయంలోనూ మరో కోణం కనిపిస్తుంది. అసలు కైక తన బిడ్డడు భరతుడిని దాసీకి వదిలేసి, సవతి కొడుకైన రాముడినే తన బిడ్డడిగా పెంచింది. ఇది చాలు ఆమెకు రాముడంటే ఎంత ప్రేమో తెలియజేయడానికి. రధాలు నడపటంలో, బాణాలు వదలటంలో ఆమె సాటిలేని మేటిగా చెప్పబడుతుంది. రాముడికి ధనుర్విద్యలో తానే మొదటి గురువుగా ప్రస్తావించబడింది. దశరధుడితో కలసి ఎన్నో దేవాసుర సంగ్రామాలలో పాల్గొనటం వల్ల, అసురులు ఎటువంటి వారో, ఎంతటి దుర్మార్గులో ఆమెకు బాగా తెలుసు. అటువంటి వారిని సమర్ధవంతంగా ఎదుర్కోవటానికి, రాముడిని పసి వయస్సునుంచే సర్వసన్నద్ధం చేసిందామె. మరి అంతటి ప్రేమ మూర్తి, ఒక దాసి మాటలకు నిజంగానే తలవంచిందా?

మంథర కేకయ రాజు అంతఃపురం నుంచి, కైకేయితో వచ్చిన దాసి. వట్టి దాసీగాక, చెలికత్తెగా కూడా చెప్పబడింది. రామకథను అరణ్యం వరకూ నడపడంలో, ఈవిడ పాత్ర ముఖ్యమని అంటారు. ఆలోచిస్తే, రాక్షస సంహారానికై రాముడి వాంఛితార్ధం నెరవేరడానికి, ఈమె సూచనలు ఒకరకంగా ఉపయోగ పడినట్లే.. ఎందుకంటే, అనుకున్న ప్రకారం రామ పట్టాభిషేకం జరిగి ఉంటే, రామాయణమే లేదు! పట్టాభిషేక భంగానికి ప్రధాన హేతువు మంథరా? కైకేయా? లేక స్వయంగా రాముడేనా? అన్న విషయాలను పక్కన బెడితే, కైకేయి మనస్సును మంథర విషపూరితం చేసిందనేది మనం చదివిన వాస్తవం. తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం చేయాలనీ, రాముడు నారబట్టలు కట్టి 14 ఏళ్లు అరణ్యవాసం చేయాలనీ, దశరధుడిని కోరింది కైక. నిజానికి ఆమెకు రాముడితో ఉన్న అనుబంధంలో వెయ్యవవంతు కూడా, దాసీకి అప్పగించిన తన బిడ్డడు భరతుడితో పంచుకోలేదు. ఇంతవరకూ జరిగినది ప్రతి హిందువుకూ తెలిసిన, చాలా పుస్తకాలలో చదివిన విషయమే. నిజానికి గ్రంధమో, పుస్తకమో అనగానే, పత్రుల పరంగానో, నిడివి పరంగానో, కొన్ని పరిమితులుంటాయి. ప్రతి విషయాన్నీ కూలంకషంగా ప్రస్తావించడం ఎంతటి రచయితకైనా, కవికయినా సాధ్యపడదు. కొన్ని ముఖ్య ఘట్టాలను, అవసరం, అవకాశం ఉన్నంత మేరకే పొందుపరచడం జరుగుతుంటుంది.

అలా చాలా గ్రంధాలలో ప్రస్తావించబడని విషయాలు చాలానే ఉంటాయి. రాముడి అరణ్య వాసం మొదలై, దండకారణ్యంలోకి అడుగు పెట్టినప్పటి నుంచీ, ముందుగా అక్కడి తపోధనులను హింసిస్తున్న 14 వేల మంది రాక్షసులను అంతమొందించి, మునిపుంగవులను విముక్తులను గావించాడు. ఇది ఎంతమందికి తెలుసు? ఆ సమయంలోనే నీలమేఘశ్యాముడిపై మనస్సుపడి, లక్ష్మణుడి చేత భంగ పడిన శూర్పణఖ, అతిలోక సౌందర్యవతి అయిన సీతమ్మను అతని వద్దకు చేర్చే ప్రయత్నంలో విఫలమై భంగపడినట్లు అబద్ధమాడి, తన అన్న రావణాసురుడిని రెచ్చగొట్టింది. ఆ తరువాత సీతాపహరణం, చివరకు రామ రావణ యుద్ధం, పెద్ద ఎత్తున రాక్షస సంహారం చేయడమనే విషయాలు తెలిసినవే.. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసినది, రాముడు అవతార పురుషుడు. రామావతార ముఖ్య ఉద్దేశం, ఆ యుగంలో ధరణిని పట్టి పీడిస్తున్న రాక్షస పీడనుంచి విముక్తినొందించమని భూదేవి శ్రీమహావిష్ణువును కోరగా, దశావతారాలలో ఏడవదయిన రామావతారం సంభవించింది. ద్వాపర యుగంలో శ్రీమహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన కృష్ణావతారం లాగా, తన దైవీక శక్తులను రాముడు ఎన్నడూ వాడక పోయినా, రాముడికి తన జన్మ రహస్యం తెలియకుండానే ఉందంటారా? మరి అన్నీ తెలిసిన రాముడికి, తన పట్టాభిషేకం జరిగితే రాజ్యపాలన తప్ప, రాక్షస సంహారం జరుగదని తెలియకపోవడం నమ్మశక్యమేనా?

సింహాసనం ఎక్కితే రాముడు రాజ్యపాలన తప్ప మరో విషయాన్ని పట్టించుకునే పరిస్థితి ఉండదని తెలుసుకున్న కైకమ్మ, రాముడిపై తనకున్న ప్రేమను అణచుకుని, లోక నిందలను సైతం భరించడానికి సిద్ధపడి, భరతుడికి రాజ్యం ఇవ్వాలనే నిబంధననూ, రాముడిని అడవులకు పంపటానికి దశరధుడు అంగీకరించడుకాబట్టి, అరణ్యవాసపు నియమాన్నీ పెట్టి, తనొక మొండి రాక్షసిగా అపనిందలను కూడా భరించింది. రాముడికి ఈ విషయం తెలియబట్టే, ఆమె వాంఛితానికి తలవంచి, అడవికి వెళ్లాడు. తండ్రి మాట నిలబెట్టడానికని అందరూ అనుకున్నా,  అమ్మ ఆశయాన్ని అమలు పరచటం కోసమని, కొద్దిగా ఆలోచిస్తే అర్ధమవుతుంది. దేశక్షేమం కోసం, భర్తను చంపుకున్న అధమురాలిగా, సవతి బిడ్డడిని కానలకు పంపిన దుర్మార్గురాలిగా నిలిచిపోయిన ‘కైకమ్మ’, నిజానికి ఇవన్నీ రాముడిపై ప్రేమతోనే చేసిందనేది తేటతెల్లమవుతుంది. పిల్లల భవితకై తల్లులు పడే తపనకు, ఈ వీడియో అంకితం.. మాతృదేవోభవ.. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, మంచిని మాత్రమే ప్రబోధించే మన సనాతన ధర్మానికి సాష్టాంగ ప్రాణామాలు..

జై శ్రీరామ!

Monday, May 13, 2024

శ్రీకృష్ణావతారతత్వం! కుచేలుడు! Sri Krishna Kuchela - Sri Krishnavatara Tatvam


కుచేలుడు! శ్రీకృష్ణావతారతత్వం! TELUGU VOICE
నిజానికి మానవుడికి ముగ్గురు గురువులుంటారు! వారు ఎవరు?

పరీక్షిత్ మహారాజు అంతరంగంలో, భక్తి భావం సంపూర్ణంగా నాటుకుంది. శ్రీకృష్ణుని మహిమలను చెప్పే కథలు ఎన్ని విన్నా, ఇంకా వినాలన్న కోరిక పెరుగుతోంది. ఎంతటి విషయలోలుడైనా, ఒక్కసారి శ్రీకృష్ణుని చరిత్ర వింటే, ఇక సంసార లంపటంలో చిక్కుకోడు. పశుపక్ష్యాదులకూ, మానవులకూ ఒక్క విషయంలోనే భేదం ఉంది. అది, చేతులతో భగవంతునికి సేవలు చేయగలగడం, చెవులతో భగవానుని పుణ్య గాథలను వినడం, శిరస్సు వంచి ఆయన పాద పద్మాలకు నమస్మరించడం, కన్నులతో ఆయన దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించగలగడం, భక్తుల పాదోదకాన్ని గ్రహించడం, ఇలా ఒక్కటేమిటి, ఈ విధంగా అంగాంగం భగవంతునికై వినియోగించగలగడమే, మానవ జన్మకు సాఫల్యం. ఎవరు భగవంతుడిచ్చిన అవయవాలను భగవత్సేవకు వినియోగించరో, అతడు పాపాత్ముడు, కృతఘ్నుడు అవుతాడు. కావున ఓ మునీంద్రా! నా చివరి ఘడియల వరకూ శ్రీహరి సేవలోనే గడపాలని ఉంది. అందుకే ఆయన లీలలను నాకు చెబితే, తనివితీరా వినాలని ఉందన్నాడు.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/C7kNPs6Rn3E ]


పరీక్షిత్ మహారాజు మాటలకు శుకమహర్షి ఇలా బదులిచ్చాడు. రాజా! శ్రీకృష్ణుడితోపాటు గురుకులంలో విద్యాభ్యాసం చేసిన చిన్ననాటి స్నేహితుల్లో, సుదాముడనే వాడొకడున్నాడు. సాందీపుని వద్ద విద్యాభ్యాసం కాగానే, ఇంటికి పోయి వివాహం చేసుకుని, వేదాధ్యయనం చేస్తూ, అగ్నిహోత్రాది కర్మలతో కాలం గడిపేవాడు. అయాచితంగా లభ్యమయ్యే ద్రవ్యంతో తృప్తి పడి జీవించేవాడు. ఒంటినిండా గుడ్డకూ, కడుపునిండా తిండికి కూడా ముఖం వాచి ఉండేవాడు. దానికి తోడు, గంపెడు పిల్లలు. అతడి భార్య అనుకూలవతి, పరమ పతివ్రత. భర్తను అది కావాలి, ఇది కావాలని ఎన్నడూ వేధించేది కాదు.

అందువల్ల అతడి జీవితం చాలా సంతోషంగా ఉండేది. అయినా పిల్లలకు కడుపునిండా పట్టెడన్నం కూడా పెట్టలేక పోతున్నామే అని బాధపడేది ఆమె. అలా బాధపడుతూ, ఒక రోజున భర్తతో ఇలా అన్నది. “మహాత్మా! కుటుంబ పోషణ రోజు రోజుకూ భారమై పోతున్నది. పెద్ద వాళ్ళం మనం ఆకలి బాధకు తట్టుకున్నా, పిల్లలు ఆకలితో అలమటించి పోతున్నారు. నాకో ఆలోచన వచ్చింది. అదేమిటంటే, మీకు చిన్ననాటి స్నేహితుడైన శ్రీకృష్ణ పరమాత్మ, ఇప్పుడు రాజయ్యాడు కదా.. అదీకాకుండా, ఆయన సాక్షాత్తూ లక్ష్మీదేవికి భర్త. ఆయన తన భక్తులన్నా, బ్రాహ్మణులన్నా, తనకన్నా ఎక్కువగా ప్రేమిస్తాడని విన్నాము. మీరొకసారి వెళ్ళి, ఆయన పాదపద్మాలనాశ్రయించి, మన దారిద్ర్యాన్ని గూర్చి ఆయన చెవిలో పడేస్తే, మనకు అంతో ఇంతో సహాయం చేయకపోడు” అని సలహా ఇచ్చింది.

భార్యమాటలు విన్న సుదాముడు ఇలా అన్నాడు. “కల్యాణీ! నువ్వు చెప్పినదంతా బాగానే ఉంది. అతడు ఎప్పుడో చదువు కునే రోజులలో నాకు స్నేహితుడే గానీ, ఈనాడతడు దేశాన్నేలే రాజు. ప్రభువును దర్శించాలంటే, ఏదైనా కానుక లేకుండా, ఒట్టి చేతులతో వెళితే బాగుంటుందా? ప్రభువుకు సమర్పించుకో దగిన కానుకేదైనా ఉంటే, వెతికి తీసుకునిరా! నువ్వు చెప్పినట్లే వెళ్ళి, దర్శనం చేసుకుని వస్తాను” అని అన్నాడు. భర్త అంగీకరించినందుకే పరమానందం చెందిన ఆ సాధ్వి, ఏదైనా దొరకకపోతుందా అని, చుట్టు ప్రక్కల బ్రాహ్మణుల ఇళ్ళకు వెళ్ళి యాచించింది. ఒకరింట్లో నాలుగు పిడికిళ్ళ అటుకులు దొరికాయి. వాటిని భర్త పై పంచె కొంగున కట్టి, ద్వారకకు సాగనంపింది.

సుదాముడు కొన్నాళ్ళకు కాలినడకన, ద్వారకకు చేరుకున్నాడు. ఇతర బ్రాహ్మణులతో కలసి, అంతఃపురంలోని మూడు ద్వారాలు దాటాడు. ఆ తర్వాత పదహారు వేలమంది భార్యల భవనాలను దాటుకుంటూ, రుక్మిణీదేవి నివాసానికి చేరుకో గలిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పట్టు పానుపుపై పవళించి ఉండగా, రుక్మిణీ దేవి ఆయన పాదాలు వత్తుతోంది. సుదాముడిని అల్లంత దూరం నంచే గుర్తుపట్టి, చివాలున లేచి ఎదురువెళ్ళి తీసుకు వచ్చి, తన పట్టు పానుపుపై కూర్చోబెట్టుకున్నాడు. సుదాముడికి అది కలో, నిజమో తేల్చుకోలేక, కళ్ళవెంట ఆనంద బాష్బాలు కారుతూ ఉంటే, శ్రీకృష్ణుడే చేత్తో తుడిచాడు. పూజా ద్రవ్యాలు తెప్పించి, పాదాలు కడిగి, ఆ నీటిని నెత్తిన చల్లుకున్నాడు. రుక్మిణీదేవి వింజామర విసురుతూ ఉంటే, కుచేలుడి ప్రక్కన కూర్చుని, చిన్ననాటి ముచ్చట్లన్నీ గుర్తు చేసుకున్నారు. ఇదంతా చూస్తున్న పరిచారికలు అవాక్కయ్యారు. “ఈ దరిద్రుడు చిరిగిపోయిన గుడ్డలతో, అడుక్కుతినే వాడిలా ఉన్నాడు. ఆహా! ఇతడు ఎన్నెన్ని జన్మలలో, ఎన్నెన్ని పుణ్యకర్మలు చేశాడో గదా? లేకపోతే, ఇటువంటి వాడు శ్రీకృష్ణుని పట్టు పానుపుపైనే కూర్చోవడం, రుక్కిణీ దేవి అతడికి వింజామర విసరడం వంటివి, ఎన్నడూ కనలేదు, వినలేదు” అని ముక్కున వేలేసుకున్నారు.

అప్పుడు శ్రీకృష్ణుడు సుదాముడితో ఇలా అన్నాడు. “మిత్రమా! మనం గురుకులంలో ఉన్నంతకాలం, ఒకరిని విడిచి ఒకరం ఉండే వారము కాదు. గురు దక్షిణ సమర్పించుకుని, ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళి పోయాము. ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ చెబితే వినాలని ఉంది. వివాహం చేసుకున్నావా? చూస్తే గృహస్థు లాగానే కనిపిస్తున్నావు. అయినా విషయ భోగాలేవీ నిన్ను బాధిస్తున్నట్లుగా లేదు. వివాహం అయినా కూడా, విరక్తితో ఎలా జీవించ గలుగుతున్నావు? కొంతమంది గృహస్థులు కర్మలు చేస్తున్నా, స్వార్ధంతో చేయకుండా, లోక హితం కోసమే చేస్తూ ఉంటారు. వాళ్ళంతా నన్నే ఆదర్శంగా పెట్టుకుంటారు.

విప్రశ్రేష్టుడా! సంసారంలో చిక్కుకోకుండా ఉండాలంటే, అందుకు గురు కృప కావాలి. నిజానికి మానవుడికి ముగ్గురు గురువులుంటారు. మొదటి గురువు జన్మనిచ్చిన తండ్రి, రెండవ గురువు, ఉపనయనం చేయించి, వేద విద్యకు అర్హత కల్పించే వాడు.. ఇక మూడవ గురువు, జ్ఞాన ప్రదాత. అతడు సర్వోత్తముడు. అనగా నా ప్రతిరూపమే. అటువంటి గురువు ఉపదేశాన్ని ఎవరు త్రికరణ శుద్ధిగా ఆచరించి, సంసారాన్ని అధిగమిస్తారో, అతడే నిజమైన పండితుడు.

పండితుడా! గురువులందరికీ గురువునైన నేను జగద్గురువును. అందువల్లనే, గురుసేవ అన్ని సేవలలోకీ ఉత్తమమైనది. యజ్ఞయాగాల వంటి క్రతువులకన్నా, గురుసేవా తత్పరులనే నేను ఎక్కువగా ఇష్టపడతాను. గురుసేవ అంటే, నేను చెప్పిన ధర్మాలను తు. చ. తప్పకుండా ఆచరించడమే.

మిత్రమా! ఒకరోజు గురుపత్ని మనిద్దరినీ, అగ్నిహోత్రానికి సమిధలు తెమ్మని అడవికి పంపింది. మనం వెళ్ళిన ఆ అడవి అతి భయంకరమైనది. మనం కట్టెలు కొడుతూ ఉండగా, కారు మబ్బులు కమ్మి, కుండ పోతగా వర్షం కురిసింది. కన్ను పొడుచుకున్నా కనిపించని గాఢాంధకారంలో, మనం దారి తప్పాము. ఒక ప్రక్కన ఆకలి, మరొక ప్రక్కన భయం. బిక్కుబిక్కుమంటూ ఒకరి చేతులు ఒకరం పట్టుకుని, రాత్రంతా అడవిలోనే గడిపాము. మన గురువు సాందీపుల వారు మనలను వెదుక్కుంటూ వచ్చి, అడవి అంతా గాలించారు. మనం కంట పడగానే, “నాయనలారా! ప్రాణులన్నింటికీ దేహం మిక్కిలి విలువైనది. మీరిద్దరూ, అటువంటి దేహాన్ని కూడా లెక్కచెయ్యకుండా, నా కోసం ఇన్ని కష్టాలకు ఓర్చారు. గురువుకు తన సర్వ సంపదలనే కాకుండా, నిస్వార్ధంగా శరీరాన్ని కూడా అర్పించడమే, నిజమైన గురుదక్షిణ. మీరు నా పై చూపిన ప్రేమకు ఎంతో సంతోషించాను. మీరు నా వద్ద నేర్చుకున్న విద్య ఈ లోకంలో, పరలోకంలో కూడా మీకు మేలు చేస్తుంది” అని మనిద్దరినీ ఆశీర్వదించారు. సుదామా! నీకా సంఘటన గుర్తుందా? ఇంకా ఇలాంటివి ఎన్నో జరిగాయి.

తనువెల్లా పులకరించి పోతుండగా, సుదాముడు ఆనందాశ్రువులతో, “జగద్గురూ! దేవదేవా! భక్తుల కోరికలను తీర్చే వాడివైన నీతో గురుకులంలో ఉండటం, నా పూర్వ జన్మల పుణ్య ఫలమని భావిస్తున్నాను. నా జన్మ ధన్యమై పోయింది.” అని అన్నాడు, పరవశించిపోతూ..

సర్వ ప్రాణులలోనూ అంతర్భూతుడిగా ఉంటూ, బ్రాహ్మణ హితాన్నే కోరే శ్రీకృష్ణ పరమాత్మ, సుదాముడితో ఆ మాటా ఈ మాటా చెబుతూ, సుదాముడిలో ఉన్న బెరుకునంతా పోయేటట్లు చేశాడు. ఆ తరువాత.. “మిత్రమా! నువ్వు ఎంతో దూరం నుండి వచ్చావు. వస్తూ నాకేదైనా తీసుకుని వచ్చావా? నువ్వు ప్రేమతో ఇచ్చినది పత్రమైనా, ఫలమైనా, పుష్పమైనా, కనీసం ఉద్ధరిణెడు నీళ్ళిచ్చినా సరే.. సంతోషిస్తాను. కానీ, ప్రేమ లేకుండా, వస్తువు ఎంత విలువైనదైనా, నన్ను సంతోష పెట్టలేదు...” అని అన్నాడు.

పరీక్షిత్ మహారాజా! శ్రీకృష్ణుడన్న ఈ మాటలు సుదాముడిని సిగ్గుతో మరీ క్రుంగదీశాయి. అప్పుడు శ్రీకృష్ణుడే చొరవ చూపి, అతడి చిరుగుల పై పంచెలో కట్టి ఉంచిన మూటను సుతారంగా విప్పాడు. చిరిగిన వస్త్రాలను ధరించిన వాడు కాబట్టే, సుదాముడికి కుచేలుడనే పేరు స్థిరపడింది. ఆ చిరిగిన పై వస్త్రంలో ఉన్న అటుకులను చూసిన శ్రీకృష్ణుడు బ్రహ్మానందంగా, “ఆహా! ఏమి నా భాగ్యం! నా కోసం అటుకులు కానుకగా తెచ్చాడు. తను ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా, ఇంతవరకు నోరు విప్పి నన్నేమీ కోరలేదు. పతివ్రత అయిన భార్య మాటలు విని, పిల్లల ఆకలి బాధలు చూడలేక, నా వద్దకు వచ్చాడు. ఇప్పుడితడికి సర్వ సంపదలనూ ప్రసాదిస్తాను” అని మనస్సులో అనుకుని, గుప్పెడు అటుకులను తీసుకుని నోట్లో పోసుకున్నాడు. రెండవ గుప్పెడు తీసుకోబోతుండగా, రుక్మిణీ దేవి చెయ్యి పుచ్చుకుని ఆపుతూ, “నాథా! మీరు నోటిలో పోసుకున్న ఒక గుప్పెడు అటుకులకే, నా సర్వ సంపదలూ అతడి పరమయ్యాయి. ఇక రెండవ గుప్పెడు కూడా తింటే, నేను కూడా ఇతగాడి అధీనంలో ఉండాల్సి వస్తుంది” అని అన్నది.

సుధాముడు ఆ రాత్రి శ్రీకృష్ణుని తోనే గడిపాడు. శరీరం గాలిలో తేలిపోతున్నట్లనిపించింది. బ్రహ్మానందాన్ని అనుభవించాడు. మరునాడు తన గ్రామానికి ప్రయాణమయ్యాడు. శ్రీకృష్ణుడు కూడా అతడితో ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ, ఊరి చివరిదాకా సాగనంపి వచ్చాడు. కానీ, ఆ బాహ్మణుడు శ్రీకృష్ణుని ఎటువంటి సహాయాన్నీ కోరలేదు. శ్రీకృష్ణుని దర్శనమే పరమ భాగ్యమనుకున్నాడు. పైగా “ఆహా! ఎల్ల వేళలా లక్ష్మీదేవిని వక్షస్థలంలో నిలుపుకునే భగవానుడు నన్ను ఆలింగనం చేసుకున్నాడు గదా! దరిద్రుడనైన నేనెక్కడ? పరబ్రహ్మమైన శ్రీకృష్ణుడెక్కడ? తాను రుక్కిణీదేవితో కలసి శయనించే శయ్యపైన, ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు. అంతేకాదు.. సాక్షాత్తూ రుక్కిణీదేవియే, నాకు వింజామర విసిరింది. శ్రీకృష్ణుని పాదపద్మాలను సేవించేవారికి, ముక్తి లభిస్తుంది. అటువంటిది, శ్రీకృష్ణుడంతటివాడు నా కాళ్ళు కడిగి, ఆ నీటిని నెత్తిన చల్లుకుని పవిత్రుడైనట్లు సంతోషపడిపోయాడు. శ్రీకృష్ణుడు, తనను కొలిచిన వారందరికీ సర్వైశ్వర్యాలనూ ప్రసాదించి పంపుతాడు. నా వంటి దరిద్రునికి సంపదలిస్తే, తనను ఎక్కడ మరచిపోతానోనని, నా మేలు కోరి, ఉత్తిచేతులతో ఇంటికి పంపుతున్నాడ”నుకున్నాడు ఆ పిచ్చి బ్రాహ్మణుడు.

సుదాముడు ఈ విధంగా ఆలోచిస్తూ, ఇంటికి చేరుకున్నాడు. ఇంటిముందు సూర్య చంద్రులలా వెలిగిపోతున్న విమానాలు నిలబెట్టి ఉన్నాయి. తమ పూరిపాక స్థానంలో, ఒక పెద్ద భవనం వెలసింది. ఇంటి ముందు పెద్ద ఉద్యానవనం, ఖరీదైన దుస్తులను ధరించిన స్తీ పురుష నౌకర్లు ఇంటినిండా బిలబిలా తిరుగుతూ, పనీపాటలలో మునిగి పోయారు. వారంతా సుదాముణ్ణి గుర్తుపట్టారు. యజమానికి చెయ్యాల్సిన మర్యాదలన్నీ చేశారు. సుదాముడికి అంతా అయోమయంగా ఉంది. తాను ద్వారకకు పోయినప్పుడు, పూరిపాక స్థానంలో పెద్ద భవనం వెలిసింది. నౌకర్లంతా సంగీత వాద్యాలతో బ్రాహ్మణునికి స్వాగతం పలికారు.

ఇంతలో భార్య ఎదురు వచ్చింది. ఆమె అలంకారాలతో సాక్షాత్తూ లక్ష్మీదేవిలా ఉంది. భార్యను చూసి ఇంకా ఆశ్చర్య పోయాడు. ఇల్లంతా భోగ వస్తువులతో నిండిపోయింది. ఇదంతా శ్రీకృష్ణుని మహిమేనని అర్ధమైంది. వానదేవుడు, సమయం వస్తే అడగకుండానే వర్షిస్తాడు. అలాగే, శ్రీకృష్ణుడు పట్టెడటుకులు తిని, ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించాడు గదా! అని అనుకుంటూ, శ్రీకృష్ణుని మనస్సులోనే అనేక విధాలుగా స్తుతించాడు.

సుదాముడు ఈ విధంగా ఆలోచిస్తూ, మనస్సును శ్రీకృష్ణుని యందే స్థిరంగా నిలిపి, విషయలంపటుడు కాకుండా, భార్యబిడ్డలతో సుఖంగా జీవించాడు. సకల బ్రాహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణుడు, బ్రాహ్మణుల యెడల దైవీ భావం కలిగి ఉండేవాడు. బ్రాహ్మణుల కన్నా పరమదైవం మరొకడు లేడని, శ్రీకృష్ణ పరబ్రహ్మ లోకానికి చాటి చెప్పాడు.

ఈ విధంగా సుదాముడు, సకల భోగాలనూ అనుభవిస్తున్నా, ఏ భోగంపైనా కోరిక లేని వాడై, శ్రీకృష్ణుడి పాదపద్మాలనే ఆశ్రయించి, పరమ భక్తుడై, భగవద్దాశ్యాన్ని పొంద గలిగాడు.

కృష్ణం వందే జగద్గురుం!

Monday, May 6, 2024

కఠోపనిషత్తు! Significance of Kathopanishad


కఠోపనిషత్తు! ఎందుకంత ముఖ్యం? TELUGU VOICE
‘యమధర్మరాజు’ సూటిగా, సందేహాలకు తావు లేకుండా చెప్పిన విషయాలేంటి?

సమస్త మానవాళికీ, వారి వారి స్థాయిలలో ఉద్ధరింప బడటానికి మార్గాలను చూపేవి, ‘వేదాలు’. పరిపక్వం చెందిన సాధకులకూ, వైరాగ్య భావనగల వారికీ, మోక్షంకోసం తపించేవారికీ చక్కగా ఉపకరించేవి, ‘ఉపనిషత్తులు’. ‘ఉపనిషత్తు’ అనే శబ్దం వినిపించగానే, ఎవరిలో అయితే ఒక పారవశ్యం, పులకరింత కలుగుతాయో, వారే ఉపనిషత్తులలోని జ్ఞానాన్ని గ్రహించగల బుద్ధిని కలిగి వుంటారు. ఉపనిషత్తు అంటే, అజ్ఞానాన్ని పూర్తిగా నశింపజేసేదని ఒక అర్థమయితే, వైరాగ్యవంతుడైన సాధకుని, పరమాత్మ సన్నిధికి చేర్చి, ఆ పరమాత్మతో ఐక్యత కలిగించేదే ఉపనిషత్తని, మరొక అర్థం. నాలుగు వేదాలలోనూ ‘జ్ఞాన భాండాగారాలు’ అనదగిన ఉపనిషత్తులు, 1180 ఉన్నాయి. అయినా ఇప్పుడు అన్ని పేర్లూ లభించడం లేదు. ముక్తికోపనిషత్తులో, శ్రీరాముడు ఆంజనేయునికి, 108 ఉపనిషత్తుల పేర్లను తెలియజేయడం జరిగింది. అందులో 10 ఉపనిషత్తులను, అత్యంత ప్రధానమైనవిగా భావించి, ముగ్గురు ఆచార్యులు వాటికి భాష్యాలు వ్రాశారు. అవే, దశోపనిషత్తులుగా ప్రఖ్యాతిగాంచాయి. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, ఐతరేయ, తైత్తిరీయ, ఛాందోగ్య, బృహదారణ్యక ఉపనిషత్తులే అవి. ఉపనిషత్తులనే వేదాంతమని కూడా అంటారు.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/vYv_2z5jIJg ]


ఇక్కడ ఒక విషయం మనం బాగా గుర్తుంచుకోవాలి. ఏ ఉపనిషత్తయినా, తనంతట తానుగా, మనకు ఇష్టం ఉన్నా లేకున్నా, బలవంతంగా మనలను ఈడ్చుకు వెళ్ళి, పరమాత్మ సన్నిధికి చేర్చదు. ఎవరైతే ప్రపంచంలో తిరుగుతూ, వారి వారి వాసనలకనుగుణంగా వ్యవహరిస్తూ, సుఖ దుఃఖాలను పొందుతూ, ఏదో ఒక నాటికి నిత్యమైనదేమిటో, అనిత్యమైనదేమిటో తెలుసుకుని, అనిత్యమైన ప్రాపంచిక విషయాలపట్లా, భోగాలపట్లా వైరాగ్యం చెంది, నిత్యమైన, శాశ్వతమైన, ఆనంద స్వరూపమైన పరమాత్మపట్ల ఆసక్తికలిగి, ఆ పరమాత్మ కొరకు తపిస్తూ సాధనలు చేస్తారో, అటువంటి వారినే, ఉపనిషత్తులు పరమాత్మ సన్నిధికి చేర్చుతాయి. ‘సాధన’ అంటే, నామ మాత్రంగా, మొక్కుబడిగా చేసే సాధన కాదు. ముక్తికోసం తీవ్ర సాధన చేయాలి. నిజంగా ముక్తి సాధన అనేది, ఈ భూమి మీద జన్మించే ప్రతి ప్రాణికీ అనివార్యం. అది ఎప్పటికైనా తప్పదు. కానీ, మానవులు తప్ప, మిగిలిన ఏ ప్రాణికూడా ముక్తి సాధన చెయ్యలేదు. వాటికి ఆలోచించే బుద్ధి ఉండదు. ఆచరించేందుకు అవకాశాలు లేవు. ఒక్క మానవునికి మాత్రమే, ఆ అవకాశం, అదృష్టం. అందుకే, 'అన్ని జన్మలలోను మానవజన్మ శ్రేష్టమైనద'ని అంటూ, “జంతూనాం నరజన్మ దుర్లభం” అని శంకరాచార్యుల వారన్నారు. అంతమాత్రాన, మానవులంతా ముక్తి సాధన చేస్తున్నారా? లేదు.. చాలామంది జంతువులలాగానే తినటం, కనటం, నిద్రపోవటం అనే వాటితోనే సరిపుచ్చుకుంటారు. మరి కొందరు, లౌకిక భోగాలూ, విషయాల కొరకే జీవితాలను వినియోగించుకుంటారు. ఇంకొందరు, ఏదో నామ మాత్రంగా భగవంతుని తలుచుకోవడమో, స్వార్థ ప్రయోజనాలకొరకో, దుఃఖాలు కలిగినప్పుడో, భగవంతునికి దగ్గరవుతూ ఉంటారు. అలాగాక, కేవలం భగవంతుని కొరకే భగవంతునికి దగ్గర కావాలనుకునేవారూ, జన్మను సార్ధకం చేసుకోవటానికి భగవంతుని దరిజేరేవారూ, చాలా అరుదు. వీరిలో పూర్తిగా భగవంతుని శరణాగతి పొంది, 'త్వమేవ సర్వం మమదేవ దేవ' అని దగ్గరయ్యే వారు, బహుకొద్ది మంది మాత్రమే.

నిజంగా ముక్తి సాధనకై భగవంతుడు ప్రతి మానవుడినీ తొందర పెడుతూనే ఉంటాడు. ఎప్పుడూ కష్టాలూ, కడగండ్లనే మొట్టికాయలు వేస్తూనే ఉంటాడు. అయినా మానవుడు, జన్మలకు జన్మలు నెట్టుకొస్తూనే ఉంటాడు. అనిత్యమైన వాటి కోసమే ప్రాకులాడుతూ ఉంటాడు. బొప్పి కడితే మందు వేసుకుందామనుకుంటాడే గానీ, ఆ మొట్టికాయల వెనుకవున్న భగవంతుని ఉద్దేశమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయడు. అయితే, భగవంతుడు మాత్రం విసుగూ విరామం లేకుండా, తన ప్రయత్నాన్ని సాగిస్తూనే ఉంటాడు. కోట్లాది జన్మల తర్వాతయినా, జ్ఞానోదయం కలగాల్సిందే. కానీ, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు, సంసార బాధలు నసాళానికెక్కి, ఇక భరించలేక పిచ్చెక్కినట్లై, అప్పుడు కక్కుర్తి పడి ఏదో హడావుడిగా ప్రయత్నిస్తే, సుఖం దొరకక పోగా, దుఃఖం కలుగుతుంది. ఇలా హడావుడిగా ఏదో తెలిసీ తెలియని సాధనలు చేసి, వెనుక పిచ్చి కుక్క ఏదో వెంబడిస్తే పరుగెత్తినట్లు పరుగులు తీసి, ఏ గోతిలోనో పడక, దుఃఖాలలో చిక్కుబడి పోక, చక్కని అవకాశాలు లభించిన ఈ జన్మలోనే, సద్గురువులను ఆశ్రయించి, ఉపనిషత్తులలో నిక్షిప్తం చేయబడిన ఆత్మజ్ఞానాన్ని అవగతం చేసుకుని ఆచరించటం, తెలివైన వారి పని. అది ఉత్తముల లక్షణం.

అలాగాక, మానవుడు సంసారధ్యేయంతో, లౌకిక విషయాలపట్ల ఆసక్తితో, భోగాలపట్ల వ్యామోహంతో, ఈ ఒక్క జన్మనే దృష్టిలో పెట్టుకుని, శాస్త్రాలన్నింటినీ తిరస్కరించి, మహాత్ములూ, జ్ఞానుల యొక్క సలహాలనూ, సూచనలనూ పెడచెవినబెట్టి, గురువులను ధిక్కరించి, మొండిగా, మూర్ఖంగా ఈ సంసార లంపటంలోనే కూరుకుపోతే, భగవంతుడు ఊరు కుంటాడా? అడుగడుగునా విచారణలకూ, శిక్షలకూ గురిచేస్తూ ఉంటాడు. అదీ ఎక్కడో కాదు. ఇక్కడే, ఈ జన్మలోనే. అయినా సరే నిర్లక్ష్యం చేశావా! మరణించిన తర్వాతయినా, ధర్మాధర్మ విచారణ పేరుతో, యమధర్మ రాజు న్యాయస్థానంలో ముద్దాయిగా నిలబడాలి. ఆయన వేసే శిక్షలను అనుభవించాలి. మరి అక్కడ న్యాయస్థానంలో నిలబడి, న్యాయవాది చిత్ర గుప్తుడడిగే ప్రశ్నలకు బిక్క మొగం వేస్తే ఏం లాభం? అక్కడ నిన్ను రక్షించటానికి ఏ ప్రతివాద న్యాయవాదీ ఉండడు. కనుక ఆ విషయాలన్నీ ఇక్కడే బాగా ఆలోచించుకుని, తగిన విధంగా తయారై పోవాలి. అసలు యమ ధర్మరాజుకు ఎదురు పడకుండా, తప్పించుకునే ఉపాయమేదో ఇప్పుడే, ఇక్కడే ఆలోచించు కోవాలి. భజ గోవిందంలో దీనికి సూటిగా ఉపాయం చెప్పారు శంకరులవారు..

“భగవద్గీతా కించిదధీతా గంగాజల లవకణికా పీతా ।
సకృదపి యేన మురారి సమర్చా క్రియతే తస్యయమేన నచర్చా ॥

భగవద్దీత అధ్యయనం, జ్ఞాన గంగాజలపానం, ‘మురారి అర్చనం’ అంటే, అహంకారమనే రాక్షసుడే ముర.. అతణ్ణి సంహరించిన వాడే మురారి. కనుక అహంకారాన్ని అంతం చేసి, పరమాత్మగా నిలిచిపోవాలి. ఈ మూడూ చేసిన వారికి, ఇక యమునితో ఎటువంటి వివాదమూ ఉండదు.

యమధర్మరాజుకు సంబంధం లేకుండా, ఆయన కంట పడకుండా, ఆయనతో వివాద పడకుండా ఉండాలంటే, ఆయన మాటలలోనే చెప్పిన కఠోపనిషత్తును, ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి. యముని భయం తీరాలంటే, ఈ ఉపనిషత్తును అధ్యయనం చేయాలి.

కృష్ణ యజుర్వేదంలో, యమ ధర్మరాజూ, నచికేతుల సంవాద రూపంగా, ఈ ఉపనిషత్తు ప్రఖ్యాతి గాంచింది. కృష్ణ యజుర్వేదంలోని కఠశాఖకు చెందిన బ్రాహ్మణాలలోనిది, ఈ ఉపనిషత్తు. కఠక బుషి, ఈ బ్రాహ్మణానికి కర్త. దశోపనిషత్తులలో ఎంతో ప్రాచీనమైనదిగా భావించబడేది, ఈ ఉపనిషత్తు. చెప్పేదేదో గట్టిగా, సూటిగా, సందేహాలకు తావు లేకుండా చెప్పేశాడు ‘యమధర్మరాజు’. ఆత్మతత్వ బోధను సమగ్రంగా అందిస్తున్నది, ఈ ఉపనిషత్తు. అందుకుని, ఆచరించి, ఆనందించి, తరించటం ఇక మన చేతులలోనే ఉంది.
శ్రేష్ఠమైన దశోపనిషత్తులలో మూడవదైన ఈ కఠోపనిషత్తు, చాలా సుబోధమైనది. ఉపనిషత్తు అంటే బ్రహ్మ విద్యయే, బ్రహ్మ జ్ఞానమే. అయితే, చాలా ఇతర ఉపనిషత్తులలాగా ఉపాసనలనూ, కర్మలనూ కలగలిపి, అసలు విషయాన్ని క్లిష్టం చెయ్యకుండా, అన్ని ముఖ్య విషయాలను వదలి పెట్టకుండా వెల్లడిస్తూ, ఈ కఠోపనిషత్తు బ్రహ్మ విద్యను సుస్పష్టంగా, సువ్యక్తంగా బోధించి, వివరిస్తుంది. జగదేక సత్యమైన పరబ్రహ్మనూ, పరమాత్మనూ సుస్పష్టంగా మన హృదయంలో సాక్షాత్మరింపజేస్తుంది.

ఈ ప్రపంచంలోని సమస్త దుఃఖాలకూ, ఆపదలకూ మూల కారణం, అవిద్య, అజ్ఞానమే, తానెవరో తనకు తెలియకపోవటమే. మానవుడు ఈ దేహమే తానని భ్రమపడుతుంటాడు. అదే అజ్ఞానం. దేహం ఎన్నటికీ, ‘నేను’ కావటానికి వీలు లేదు. జనన మరణాలు లేకుండా, శాశ్వతంగా, ఎల్లప్పుడూ, అంతటా ఉండే చైతన్యమైన ఆత్మయే ‘నేను’. ఏ మార్పులూ, ఏ ఆకారమూ, ఏ పరిమితులూ, ఏ కల్మషాలూ లేని ఆనంద స్వరూపమైన ఆత్మయే ‘నేను’. అటువంటి ఆత్మను శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా తెలుసుకుని, విచారణ చేసి, బాగా ధ్యానించి, సుస్పష్టంగా గ్రహించి అనుభవించటమే, ‘జ్ఞానం’. అటువంటి ఆత్మగా, సర్వకాల సర్వావస్థలలోనూ ఎరుక కలిగి చేరటమే మోక్షం.

అటువంటి ఆత్మ జ్ఞానాన్ని నచికేతుడు కోరగా, యమధర్మరాజు అనేక ఉదాహరణలతో, అనేక రీతులలో వివరించి, బోధించటమే, ఈ ఉపనిషత్తు సారాంశము.

ఆత్మను కొత్తగా ఎవరూ ఎక్కడినుంచీ పొందనక్కరలేదు. అది బయటి నుంచి రాదు. ప్రతి వ్యక్తీ నిజంగా, ఆత్మ అయ్యే, ఆత్మను పొందే ఉన్నాడు. కనుక పొందడమంటే, లేని వస్తువును తెచ్చుకోవటం లాంటిది కాదు. అది ‘నేనే’ అని తెలుసుకోవటం. ప్రతి వడ్లగింజా బియ్యపు గింజలాగే, ప్రతి ప్రాణీ ఆత్మయే. ప్రతి జీవుడిలోను ఆత్మ శుద్ధచైతన్య రూపమై, స్వయం ప్రకాశకమై ఉంటుంది. ఆ చైతన్యము వల్లనే, సర్వకార్యములూ జరిగిపోతున్నప్పటికీ, అజ్ఞాని మానవుడు, ఆత్మను తెలుసుకోలేక పోతున్నాడు. అందుకే శ్రుతి మాత ఇలా అంటుంది..

“ఉత్తిష్ణత - జాగృత - ప్రాప్యవరాన్ని బోధత”

లేవండి, మేలుకొనండి.. ఆత్మజ్ఞానులైన మహాత్ములను శరణువేడి, ఆత్మను తెలుసుకోండి. ఇది స్వామీ వివేకానందుల వారి గుండె లోతులలోనుండి పెల్లుబికి వచ్చిన వాక్యం. ఈ ఆత్మజ్ఞానమునే, కఠోపనిషత్తు బోధిస్తోంది. ఆసక్తిగలిగినవాడూ, బుద్ధిమంతుడైనవాడూ, విచారణాశీలుడైనవాడూ, దీనిని ప్రశాంతమైన మనస్సుతో, సూక్ష్మమైన బుద్ధితో చదివినా, విన్నా, ఈ విషయాన్ని పూర్తిగా, స్పష్టంగా గ్రహించగలుగుతాడు. అయితే, 'నేను', సత్యము, నిత్యము, చైతన్య మాత్రము, ఆనంద స్వరూపమయిన బ్రహ్మమును.. ‘నేను’ ఈ దేహ, ఇంద్రియ, మనోబుద్ధులకు అతీతుడననే జ్ఞానం, ఈ ఉపనిషత్తును వింటే కలుగవచ్చు కానీ, అంతమాత్రం చేతనే అతడు అత్మానందాన్ని పొందలేడు.

మరి ఎప్పుడు పొందుతాడు??? “నేను పవిత్రమై, జనన మరణ రహితమై, నిత్యమై, ఆనంద స్వరూపమై, ఏ మార్పులూ లేని, ఏ మలినాలూ లేని, శాశ్వత సత్యమైన ఆత్మను” అనే భావాన్ని అదే పనిగా, ఏకధారగా, గంగా ప్రవాహంలాగా, నిత్యము, నిరంతరము మననము చేస్తూ ఉంటే, ఈ సాధన మనలోని అజ్ఞానాన్ని నశింపజేసి, పరమశాంతినీ, పరమానందాన్నీ కలిగిస్తుంది.

జీవితం మరియు మరణం యొక్క ప్రశ్నలూ, మానవ జీవితానికి సంబంధించిన సమస్యలూ, ఆత్మ యొక్క అమరత్వం తాలూకు స్వభావం, మరియు అంతిమంగా ఆత్మ యొక్క ఆరోహణ లక్ష్యం అయిన ఇతివృత్తాలూ, కఠోపనిషత్తులో సాధారణంగా కనిపించే కొన్ని అంశాలు.. అటువంటి కఠోపనిషత్తును ప్రతి ఒక్కరూ తెలుసుకుని తీరాలి! దీనికి మరో ప్రత్యామ్నాయం లేదు..

శివ గోవింద!

Monday, April 29, 2024

నరబలి! ఏం నేర్పింది? Sacrifice of Satamanyu


నరబలి! ఏం నేర్పింది? TELUGU VOICE

వేల సంవత్సరాల క్రితం గ్రంధస్థం చేయబడిన మన సనాతన ధర్మ గ్రంధాలలో చెప్పబడిన గాధలు, నేటికీ మనకు ఆదర్శదాయకాలే.. నేటి మన పరిస్థితులకు మార్గదర్శకాలే.. అటువంటి ఉత్తమ సన్మార్గ కథలలో కొన్ని ఇదివరకే మనము చెప్పుకుని ఉన్నాము. మరొక మంచి కథను ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. వీడియోను చివరిదాకా చూసి, మీకు అనిపించిన మంచినీ, మీ అభిప్రాయాన్నీ comment చేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/VvQgufypfeI ]


ఒకప్పుడు ఒక రాజ్యంలో రెండేళ్ళ పాటు వానలు కురవలేదు. వర్షాలు లేని కారణంగా, కరవు కాటకాలు తాండవించి, జనులు అల్లల్లాడి పోయారు. చెట్లూ చేమలూ మోడువారాయి. ఎక్కడ చూసినా పచ్చదనం అనేది మచ్చుకకు కూడా లేకుండా పోయింది. తాగడానికి నీరు కూడా లభించక, జనులు నానా అవస్థలూ పడసాగారు. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే, ఇక మూగ జీవాల పరిస్థితి మరీ దారుణం. పశుగణాలు వేల సంఖ్యలో నేలకొరగ సాగాయి.

ఈ స్థితిలో జనులకు వాటిల్లిన కష్టాన్ని ఎలా తీర్చాలా! అని రాజు దీర్ఘంగా యోచించి, కరవు తీరడానికి ఏదైనా పరిహారం కనుగొనాలని నిశ్చయించుకున్నాడు. అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో రాజ గురువుతో పాటు, రాజోద్యోగులూ, పలువురు పండితులూ పాల్గొన్నారు. వారంతా కలసి, కరవు సమస్యకు పరిష్కారం గూర్చి కూలంకషంగా చర్చించారు.

చివరికి రాజగురువు ఆ సమస్యకు ఒక పరిహారం తెలియజేశాడు. కానీ, ఆ పరిహారం అంత సులభంగా నెరవేర్చ గలిగేది కాదు. ఆయన తెలియజేసిన పరిహారం ప్రకారం, “వర్షానికి అధిష్టాన దేవత ఇంద్రుడు. ఆ ఇంద్రుణ్ణి తృప్తి పరచి ప్రసన్నం చేసుకుంటే, వర్షం కురుస్తుంది. ఇంద్రుని తృప్తి పరచాలంటే, నరబలి ఇచ్చి యాగం చేయడం తప్ప, మరో మార్గం లేదు.” మరో మార్గం ఏదీ లేకపోవడం వలన, రాజుతో సహా అందరూ ఆ పరిహార సూచనను ఆమోదించాల్సి వచ్చింది. యాగానికి ఒక ముహూర్తం నిర్ణయించబడింది. రాజ్యం అంతటా దండోరా వేసి, యాగం గూర్చి ప్రకటించారు.

ఇంతలో యాగం నిర్వర్తించే రోజు రానే వచ్చింది. నాడు రాజధాని నగరంలో, ఇసుక వేస్తే రాలనంత జనం గుమిగూడారు. యాగం సవ్యంగా జరిగి వర్షం కురిసి కరవు తీరడానికి, నరబలికి తనను తాను సమర్పించుకోవడానికి ఎవరు ముందుకు రానున్నారో తెలుసుకోవడానికీ, యాగాన్ని తనివితీరా చూడడానికీ యావత్తు రాజ్యమే నాడు యాగశాలకు తరలి వచ్చింది.

నరబలి ఇవ్వవలసిన తరుణం ఆసన్నమయ్యింది. రాజ గురువు తన ఆసనం మీది నుండి లేచి నిలబడ్డాడు. జనులు కళ్ళప్పగించుకుని, ఆయననే తదేకంగా చూస్తున్నారు. రాజగురువు ఏం చెప్పబోతున్నాడో వినాలనే ఆత్రుతా, కుతూహలం, అందరి ముఖాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

అప్పుడు రాజగురువు, తండోపతండాలుగా తరలి వచ్చి, అక్కడ గుమిగూడి ఉన్న జనులను ఉద్దేశించి, ఇలా చెప్పనారంభించాడు.. “మహాజనులారా! మన రాజ్య సంక్షేమానికై ఈ యాగం నిర్వర్తిస్తున్నట్లు, మీ అందరికీ తెలిసిన సంగతే! యాగం సంపూర్ణంగానూ, సవ్యంగానూ నిర్వర్తింప బడినప్పుడే, రాజ్యంలో వర్షాలు కురిసి, కరవు తీరుతుంది. దీనిలో నరబలి ఇవ్వడం ఒక ముఖ్యాంశం. నరబలికి తనను తాను అర్పించుకుని, యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయించే వారెవరైనా, ముందుకు రావచ్చు.”

రాజగురువు చెప్పడం ముగించగానే, అక్కడి మహాజన సందోహంలో, కటిక నిశ్శబ్దం రాజ్యమేలింది. తనను తాను బలిగా అర్పించుకోవడానికి ఎవరు ముందుకు వస్తారోనని, అందరూ అటూ ఇటూ చూడసాగారు. చిన్న త్యాగం అంటే, నిరాక్షేపణీయంగా చెయ్యవచ్చునేమో! కానీ, తనను తానే బలిగా అర్పించుకోవడమంటే..! ఇది సాధ్యపడే పనేనా? అక్కడ గుమిగూడి ఉన్న యావన్మందీ, కదలక మెదలక తమ స్థానాల్లో అతుక్కుపోయి నిలబడ్డారే తప్ప, ‘నన్ను నేను బలిగా అర్పించుకుంటాను!’ అంటూ ఎవరూ బలిపీఠం మీద నిలబడడానికి ముందుకు రాలేదు.

ఇంతలో అక్కడ నెలకొని వున్న నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ, ఒక పిల్లవాడి స్వరం బిగ్గరగా వినిపించింది. జనుల దృష్టి ఆ స్వరం వినవచ్చిన దిశగా తిరిగింది.. “మాతృదేశ సంక్షేమం కోసం బలి కావడానికి, నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను బలి ఇచ్చి యాగాన్ని పూర్తిచేయండి. తద్ద్వారా వానలు కురిసి, రాజ్యం సుభిక్షమవుతుంది.” పన్నెండేళ్ళ చిరు ప్రాయంలోని ‘శతమన్యు’ అనే బాలుడు ఇలా చెబుతూ, యాగశాల వైపుగా నడవనారంభించాడు.

అతడి పక్కనే ఉన్న శతమన్యు తల్లి, “నాయనా! నా అనుంగు శతమన్య్యూ! నిన్ను నేను కన్నప్పుడు పొందిన ఆనందం కన్నా, ఇప్పుడు నేను పొందుతున్న ఆనందం చెప్పనలవి కానిది” అంటూ, ఆమె తనయుణ్ణి ఆశీర్వదించి, బలిపీఠం వైపుగా పంపించింది. అవును, ఆమె నిజమైన భారతీయ మాతృమూర్తి కనుక, అలాగే చేయగలదు! శతమన్యు తండ్రి కూడా పక్కనే నిలబడి ఉన్నాడు. కుమారుడు తన కళ్ళ ముందే బలి కాబోతున్నాడని తెలిసినా, ఆయన ఏ రకమైన ఆవేదనకు గానీ, ఆందోళనకు గానీ లోనుకాక, తనయుణ్ణి ఆశీర్వదించి సాగనంపాడు!

గుమిగూడి ఉన్న జనులు అది చూసి విస్తుబోయారు. కలకలం చెలరేగింది. ఒక పిల్లవాడు, రాజ్య సంక్షేమానికై తనంతట తానే మరణానికి సంసిద్ధుడై ముందుకు వస్తున్నాడు! ఇలా కూడా జరుగుతుందా!? దగ్గరుండి, బలి కావడానికి పంపిస్తున్న అలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా!?

ఇంతలో శతమన్యు బలిపీఠం మీద ఎక్కి నిలబడ్డాడు. ఇక కొద్ది క్షణాలలో, ఆ బాలుని తల నేల మీద దొర్లిపడుతుంది. అందరిలో ఉత్కంఠత నెలకొంది. శతమన్యు తలను ఖండించబోయే తరుణంలో, అక్కడ ఒక అద్భుతం జరిగింది. శతమన్యు మీద గగనం నుండి పుష్ప వర్షం కురిసింది. అదే సమయంలో, వర్షానికి అధిష్టాన దేవతయైన సాక్షాత్తు ఆ ఇంద్రుడే అక్కడ ప్రత్యక్షమయ్యాడు.

యాగశాలలో ఉన్న యావన్మందీ దేవేంద్రునికి ప్రణమిల్లారు. అప్పుడు ఇంద్రుడు వారిని సంబోధిస్తూ ఇలా అన్నాడు: “రాజ్య ప్రజల సంక్షేమం కొరకై, తనను తానే బలి ఇచ్చుకోవడానికి ముందుకు వచ్చాడు శతమన్యు. ఆతడి మహోన్నత త్యాగమయ హృదయం నన్ను కూడా కదిలించి వేసింది. శతమన్యు వంటి త్యాగధనులను కన్న ఒక రాజ్యం, ఇంకా కరువులో అలమటించడం న్యాయం కాదు. కనుక నేడు నరబలి జరగకుండానే, నరబలి జరిగి యాగం పరిపూర్ణంగా సవ్యంగా నిర్వర్తించినట్లు నేను పరిగణిస్తున్నాను. అవసరమైన మేరకు వర్షాన్ని కూడా కురిపిస్తాను.”

శతమన్యు వంటి వారు జన్మించి జీవించి నదయాడి, జనుల సంక్షేమం కొరకు త్యాగాలు ఒనరించిన పుణ్య భూమి మన భరతభూమి. మనం వారి పరంపరకు చెందిన వారమే. ఈ విషయంలో మనం ఎంతైనా గర్వించవచ్చు. వారిని గురించి మనం గర్వించినట్లు, మనలను గురించీ మన తరువాత రాబోయే తరాల వారు కూడా గర్వించాలి కదా! అందుకు మనం ఏం చేయాలి?

ఎందరో పుణ్యాత్ములు ఈ నాటికీ, భరత మాత రక్షణకై, మనందరి క్షేమం కోరి, తమ పిల్లలనూ, తోబుట్టువులనూ, ఆత్మీయులనూ భారత సైన్యంలోకి పంపిస్తూనే ఉన్నారు. అటువంటి త్యాగధనులందరికీ సాష్టాంగ ప్రాణామాలు. మరొక్క విన్నపం.. ఇటువంటి త్యాగాలు అందరూ చేయలేకపోవచ్చు. కానీ, దేశ సంక్షేమానికీ, ధర్మ సంరక్షణకూ, కనీసం మనం చేయగలిగే, మన చేతులలో మటుకే ఉన్న అవకాశం, ‘ఓటు వేయడం’. మన ధర్మాన్ని పరిరక్షించే ఉత్తమ లక్షణాలున్న నాయకుడిని దృష్టిలో ఉంచుకుని, మే 13న, ఏ మాత్రం అలసత్వం చూపకుండా, బాధ్యతాయుతంగా, మనం ఓటు వేయడమే కాకుండా, మనకు తెలిసిన వారందరి చేతా తప్పనిసరిగా ఓటు వేయిద్దాము.. ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే, ఇక భావితరాలకు చెప్పుకోవడానికి ఏమీ ఉండదు.

ధర్మో రక్షతి రక్షితః

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...