Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Monday, February 12, 2024

‘గరుడ పురాణం’ - గర్భస్థ శిశువు! Garuda Puranam


గర్భస్థ శిశువు! జీవిత సత్యాలు..
‘గరుడ పురాణం’ ప్రకారం తల్లి గర్భంలో శిశువు పడే ‘నరక యాతన’ తెలుసా?

మన సనాతన ధర్మం ప్రకారం, ఆత్మ జనన మరణ చక్రంలో నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. శరీరాన్ని కోల్పోయిన ఆత్మ తన కర్మలను అనుభవించి, తిరిగి మరొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఒక ప్రాణికి జన్మనిచ్చే క్రమంలో, స్త్రీ మృత్యువు అంచులవరకూ చేరుకుని, ప్రాణికి జీవం పోస్తుంది. అందుకే మన పురాణాలు స్త్రీమూర్తికి ఎంతో ప్రాముఖ్యతనూ, వెలకట్టలేని గౌరవాన్నీ ఆపాదించాయి. కానీ, గర్భంలో ఉన్న శిశువు గురించి మనం ఏనాడైనా ఆలోచించామా! నెలలు నిండిన శిశువు గర్భంలో ఏం చేస్తుంది? చీకటి కుహరం వంటి తల్లి గర్భంలో ఆ శిశువు ఎలాంటి బాధలను అనుభవిస్తుందనే విషయాల గురించి, మనలో చాలామందికి అవగాహన లేదనే చెప్పవచ్చు. వేల ఏళ్ళ క్రితం రచించబడిన గరుడ పురాణంలో, గర్భస్థ శిశువు గురించీ, ఆ సమయంలో అది పడే బాధల గురించీ, స్పష్టంగా వివరించబడివుంది. గర్భస్థ శిశువు యొక్క అనుభవాలేంటి? చీకటి ఆగాధంలో బందీ అయిన శిశువు అనుభవించే బాధలేంటి? ప్రసూతి సమయంలో శిశువు శరీరోత్పత్తి ఎలా జరుగుతుంది? గరుడ పురాణంలో శ్రీ మహా విష్ణువు గరుడుడికి వివరించిన గర్భస్థ శిశువుకు సంబంధించిన, మనలో ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవలసిన నిగూఢ సత్యాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Ds4YszMGDug ]


‘పరంధామా! జీవుడు నరకం నుంచి తిరిగి జన్మఎత్తటానికి తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాడు కదా! ఆ గర్భంలో అతడు ఎలాంటి నరక యాతనను అనుభవిస్తాడో, దయచేసి తెలియజేయండి!’ అని గరుత్మంతుడు శ్రీ హరిని ప్రార్థించాడు. అందుకు శ్రీ మహా విష్ణువు, "వైనతేయా! స్త్రీ పురుషుల సంయోగం వల్ల శుక్లశోణితాలు ఏకమై, జీవుడు ప్రాణం పోసుకుంటాడు. పాపం చేసిన జీవుడికి, ప్రసవసమయానికి మూడు రోజుల ముందే, శరీరోత్పత్తి జరుగుతుంది. ఎలాగంటే! ఇంద్రుడికి ఉన్న బ్రహ్మహత్యాదోషం, గర్భిణీ స్త్రీకి మొదటి మూడు రోజులు ఆవరించి ఉంటుంది. ఆ రోజుల్లో మొదటి రోజు స్త్రీని ఛండాలినిగా, రెండవ రోజు బ్రహ్మఘాతిగా, మూడవ రోజు, రజకి అని వ్యవహరించబడుతుంది. కాబట్టి, ఈ మూడు రోజుల్లోనే పాపాత్ములైన వారు జన్మిస్తారు.

ప్రతిజీవీ తాను చేసిన కర్మానుసారం, శరీరాన్ని పొందుతాడు. పురుషుడి వీర్యం ద్వారా స్త్రీ శరీరంలోకి ప్రవేశిస్తాడు. శుక్ల శోణితాలు రెండూ, ఒక్క రోజులో కలిసిపోతాయి. అవి అయిదు రోజులకు, నురగగా మారుతాయి. పది రోజులు గడిచేసరికి, మాంసాకారాన్ని పొంది, రేగుపండంత కఠినత్వాన్ని పొందుతాయి. తరువాత అది అండంగా మారుతుంది. గర్భంలో ఉన్న జీవికి ఒక నెలలో తల, రెండవ నెలలో చేతులూ మొదలైన అవయవాలు, మూడవ నెలలో గోళ్ళు, వెంట్రుకలు, చర్మం, మర్మావయవాలు, రంధ్రస్థానాలూ ఏర్పడతాయి. నాలుగవ నెల వచ్చేసరికి సప్తధాతువులూ, అయిదవ నెలలో ఆకలి దప్పికలూ, ఆరవ మాసంలో మావి చేత చుట్టుకోబడి, కుడిడొక్క తిరుగుతుంటుంది. ఆ విధంగా ఆకలి దప్పికలు పొందిన జీవి తల్లి గర్భంలోనే ఉండి, తల్లి తినే పదార్ధాలనే తనూ తింటూ, వృద్ధి చెందుతాడు.

మలమూత్రాలతో, దుర్వాసనలతో నిండి ఉండే తల్లి గర్భంలో శయనించి వుంటాడు. గర్భంలో ఉండే పురుగులు, శిశువును కుడుతూ ఉంటాయి. శిశువు శరీరం చాలా సుకుమారంగా ఉండటంతో, వాటి బాధను తట్టుకో లేక పోతాడు. తల్లి తినే ఉప్పుకారం, వేడి, పులుపు లాంటి పదార్ధాల వల్ల, తన అన్ని అంగాలూ ఎంతో బాధ పడతాయి. మావిచే చుట్టుకోబడ్డ శిశువు ప్రేగులతో వెలుపలి భాగమంతా ఆవరించబడి, నడుము, తల వంచుకుని, తల్లిగర్భంలో శయనిస్తాడు. పంజరంలో పక్షి వున్నట్టుగానే, జీవుడు మాతృ గర్భంలో కొలువుంటాడు. అలా గర్భంలోకి ప్రవేశించి రూపం పొందిన జీవుడు, పూర్వజన్మ జ్ఞానాన్ని కలిగి, ఎన్నో జన్మల నుంచీ తాను చేసిన పాపాలను తలచుకుని, చింతిస్తూ ఉంటాడు. సప్త ధాతువులతో పుట్టిన జీవుడు, గర్భంలోని నరక యాతన నుంచి విముక్తి కలగటం కోసం, ఒక మునిలాగా, తనను తల్లి గర్భంలోకి ప్రవేశ పెట్టిన భగవంతుడిని, దీనంగా ఇలా ప్రార్ధిస్తూ ఉంటాడు.

"విశ్వానికి ఆధారమైనవాడూ, లక్ష్మీ వల్లభుడూ, సకలజీవుల పాపాలనూ నశింపచేసేవాడూ, శరణన్న వారికి ఆపన్న హస్తాన్నందించే శ్రీహరిని శరణువేడుకుంటున్నాను. ఈ శరీరం మీదా, భార్యా పుత్రుల మీదా మాయా మోహంతో, అజ్ఞానంతో, ఇది నాది, ఇది నేనే అన్న అభిమానాన్నీ, అహంకారాన్నీ పొందాను ప్రభూ! నా కుటుంబ పోషణ కోసం, నా భార్యా బిడ్డలను సుఖపెట్టడం కోసం, ఎన్నో పాపకార్యాలను చేసి, ఎంతో సంపాదించాను. అయితే, నేను చేసిన పాప ఫలాలను నేను మాత్రమే అనుభవిస్తున్నాను కానీ, నా భార్యా బిడ్డలు నా పాపంలో భాగం పంచుకోవటం లేదు. స్వామీ! ఈ గర్భవాస నరకాన్ని భరించలేకపోతున్నాను. దయచేసి నన్ను ఈ నరకకూపం నుంచి బైటపడెయ్యండి. మీ పాదకమలాలనే నిత్యం ధ్యానం చేసుకుంటాను. మళ్ళీ జన్మంటూ లేకుండా ముక్తిని పొందే మార్గాన్ని ఆలోచించుకుంటాను. ప్రభూ! మలమూత్రాలతో నిండిన గర్భంలో చేరి, ఆకలిదప్పికలతో మలమల మాడిపోతున్నాను. గర్భంలోని ఈ యాతన నుంచి బైటపడాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు బైటికి వస్తానో నాకు తెలియటంలేదు.

దీనుల మీద దయచూపే ఏ పరమాత్మ నాకీ పూర్వజన్మ జ్ఞానాన్ని ప్రసాదించాడో, ఆ పరమాత్మనే తిరిగి ఈ సంసార కూపంలో పడవేయవద్దని వేడుకుంటాను. స్వామీ! ఒక్కోసారి నాకు ఈ గర్భం నుంచి బైటికి రాకూడదని కూడా అనిపిస్తోంది. ఎందుకంటే! ఇప్పటికే ఈ గర్భంలోకి ప్రవేశించి, నరకాన్ని అనుభవిస్తున్నాను. జన్మించాక మళ్ళీ పాపాలు చేసి, నీ యందు భక్తి ప్రపత్తులు లేకుండా ఉండేకన్నా, ఈ గర్భవాసనరకం ఎంత బాధపెట్టినప్పటికీ నేనిక్కడే ఉండి, నీ పాదపద్మాలను నమ్ముకుని, ఎలాంటి కష్టాలూ లేకుండా గడిపేస్తాను. తిరిగి సంసార బంధనంలో చిక్కుకోకుండా, నా ఆత్మను ముక్తిపథం వైపు పయనించేలా చేసుకుంటాను." అని గర్భస్థ జీవుడు భగవంతుడిని వేడుకుంటాడు. ఈ విధంగా నవమాసాల పాటు గర్భంలో ఉన్న ఆ జీవుడు, ఒక మునీశ్వరుడిలాగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు, అతడి బాధలు పోగొట్టటానికీ, తిరిగి కర్మఫలాన్ని అనుభవింపచేయటానికీ, ప్రసూతిగాలి వీచి, అతడు బైటికి రావటానికి వీలుగా, అధోముఖుడవుతాడు. ప్రసూతి ఘడియలు సమీపించగానే జీవుడు తల్లి గర్భం నుంచి యోనిమార్గం ద్వారా, అధోముఖంగా బయటికి వస్తాడు. వచ్చేటప్పుడు కూడా ఎంతోబాధతో, తెలివి తప్పి, అతికష్టంగా బైటికి చేరతాడు. మలంలో ఉండే పురుగులా భూమిమీద పడ్డ జీవుడు, అప్పటిదాకా వున్న పూర్వజన్మ జ్ఞానం నశించగా, అటు ఇటు కొట్టుకుంటూ ఏడుస్తాడు.

గరుత్మంతా! గర్భంలో ఉన్నప్పుడూ, అనారోగ్యం కలిగినప్పుడూ, శ్మశానంలో ఉన్నప్పుడూ, పురాణ కథనాలు విన్నప్పుడూ కలిగిన వైరాగ్యం గనుక మానవులకు స్థిరంగా ఉంటే, వారికి మరలమరల సంసార బంధనాలలో చిక్కుకునే దుర్గతి కలుగదు. కర్మ ఫలాలను అనుభవించిన తరువాత గర్భం నుంచి బైటికి వచ్చిన వెంటనే, ఆ జీవుణ్ణి విష్ణుమాయ మోహింపచేస్తుంది. విష్ణుమాయతో ఆవరించబడిన జీవి భూమి మీదకు రాగానే, ఏ విధమైన జ్ఞానమూ లేకుండా, అలా నిశ్చలంగా ఉంటాడు. అతడికి ఏమీ చెప్పగలిగే సామర్థ్యం ఉండదు. అలా పుట్టిన తరువాత ఊహ వచ్చేంత వరకూ, నరకాన్నే అనుభవిస్తాడు. బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే, కడుపునొప్పి వచ్చిందేమో అనుకుని మందు వేస్తారు. నిజంగా కడుపు నొప్పి వచ్చి ఏడుస్తుంటే, ఆకలేసిందేమోనని పాలు తాగిస్తారు. ఇలా విరుద్ధంగా జరుగుతున్నప్పటికీ, శిశువుగా వున్నజీవుడు తానేదీ చెప్పగలిగే స్థితిలో ఉండడు. ఆ విధంగా జీవుడు నాలుగైదు సంవత్సరాలు వచ్చేవరకూ, బాల్య సంబంధిత దుఃఖాలు అనుభవిస్తూనే ఉంటాడు. తరువాత కౌమార వయసులో విద్యాభ్యాసం లాంటి బాధలు పడతాడు. యౌవనదశలో దర్పాన్నీ, అహంకారాన్నీ పొంది, రాక్షస గుణాలు కలిగినవాడౌతాడు. యౌవన ప్రాయంలోకి చేరిన మానవుడు, జూదం, సురాపానం లాంటి వ్యసనాల చేత మోహింపబడి, ఇంద్రియనిగ్రహాన్ని కోల్పోయి, నిప్పులలో పడ్డ మిడతలాగా, మోహంలో పడి కొట్టుకుంటాడు.

గరుత్మంతా! లోకంలో లేడి, ఏనుగు, పక్షి, తుమ్మెద, చేప అనే ఈ అయిదు జంతువులూ, ఒక్కొక్కటీ ఒక్కో విషయం మీద తీవ్రమైన కోరిక ఉండటంతో, చెడిపోతున్నాయి. అయితే, మానవుడొక్కడే, వివేకశూన్యుడై, చర్మం, చెవులు, కళ్ళు, నాలుక, ముక్కు అనే అయిదు ఇంద్రియాలకు వశమైపోయాక, ఇక చెడిపోకుండా ఎలా ఉంటాడు? ఇలా అత్యంత దుర్లభమైన మానవజన్మను పొందికూడా, ఎలాంటి సత్కర్మలూ ఆచరించకుండా, విషయ వ్యామోహంలో చిక్కి, తన జీవితాన్ని నశింపచేసుకునే మూర్ఖుడికన్నా పాపాత్ముడు, మరొకడుండడు. గరుత్మంతా! ఈవిధంగా పాపాత్ములు కర్మ అనే పాశంతో చుట్టబడి, నా విష్ణుమాయలో చిక్కుకుని, జన్మ తరింపచేసుకునే మార్గం తెలుసుకోలేక, వైరాగ్య భావం కలగక సంచరిస్తూ ఉంటారు. విషయాల మీద మమకారాన్ని పెంచుకుని సంచరిస్తే, తన చేతిలో ఉన్న అమృత కలశాన్ని జారవిడిచినవారే అవుతారు. ఈ విషయాన్ని గ్రహించక జీవితాన్ని వ్యర్ధంగా, దుర్వ్యసనాలతో, వ్యామోహాలతో గడిపిన మానవుడు, శ్లేష్మవ్యాధులతో కూడిన వార్ధక్యాన్ని పొంది, ఎన్నో బాధలు పడుతూ, చివరికి మరణించి, మళ్ళీ పూర్వంలాగానే నరకానికి చేరుకుంటాడు." అని శ్రీ మహా విష్ణువు గర్భంలో జీవి అనుభవించే బాధలను గరుడుడికి వివరించాడు.

జీవి గర్భంలో పడినది మొదలు, జీవంలేని శరీరం మన్నులో కలిసిపోయేదాకా, ఏదో ఒక రూపంలో బాధను అనుభవించాల్సిందే. ఈ నలభైనాలుగు లక్షల జీవరాశులలో, మానవ జన్మ మరీ దుర్లభం. అందుకే ఈ నరజన్మను అందరూ సార్ధకం చేసుకోవాలి. ధార్మిక కార్యక్రమాలు చేపట్టి, జీవితాన్ని తరింప చేసుకోవాలి.

సర్వేజనాః సుఖినోభవన్తు! లోకాః సమస్తా సుఖినోభవంతు!

Wednesday, February 7, 2024

సన్మార్గ జీవనం! Sanmarga Jeevanam


సన్మార్గ జీవనం!

మనిషి జీవితాన్ని ధర్మబద్ధంగా కొనసాగించడానికి, సన్మార్గమే ఉత్తమ సాధనం. తోటివారికి సహాయం చేయడం, సంఘ శ్రేయస్సు కోసం పాటు పడటమే సన్మార్గం. స్వార్థంతో ప్రవర్తించి, ఇతరులకు కీడు చేయడం, దుర్మార్గమవుతుంది. సన్మార్గంలో నడిచిన వ్యక్తి ఎప్పటికప్పుడు తానేమిటో, తన స్థాయి ఏమిటో తెలుసుకుంటూ వుంటాడు. అనునిత్యం ఆత్మవిమర్శ చేసుకుంటూ, ఉన్నతమైన బాటలో ప్రయాణిస్తుంటాడు.

ఎప్పుడూ పక్కవారితో పోల్చుకోవద్దు. ఈ సమాజంలో మిగతావారు ఎలా ఉన్నా, మనవరుకూ మనం ఎలా ఉన్నామన్నదీ, మనం ఏం చేస్తున్నామన్నదీ మాత్రమే ముఖ్యం. పవిత్రమైన కమలం పుట్టేది బురదలోనే అయినా, తన తేజస్సును కోల్పోదు, కోమలత్వాన్ని వీడదు. మనిషి కమలాన్ని చూసి ప్రేరణ పొందాలి. సన్మార్గంలో సాగే మనిషి, సమాజంలో అత్యుత్తమ గౌరవాన్ని పొందగలడు. మానవత్వం వల్లనే అందరికీ ఆదర్శప్రాయుడవుతాడు. అందుకే మనిషి, భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మను సద్వినియోగ పరచుకుని, అందరికీ సహాయం చేసే స్థాయికి ఎదగాలని పెద్దలంటారు.

మరుజన్మ ఉన్నదో లేదో, గత జన్మ ఎలాంటిదో తెలియనప్పుడు, ఈ జన్మలో లభించిన పవిత్రమైన మానవ జన్మను, ప్రతి మనిషి సార్థకం చేసుకునే ప్రయత్నం చేయాలి. కనీసం తనచుట్టూ ఉన్నవారిని ఉద్ధరించే ప్రయత్నం చేయాలి. ఒక్కసారి మనిషి సన్మార్గం వైపు ప్రయాణించడం మొదలుపెడితే, చెడుమార్గం వైపు కన్నెత్తి కూడా చూడడు. సత్‌ కార్యాలు చేస్తూ ముందుకు సాగిపోతుంటాడు.

అలనాడు దారి దోపిడీలు చేసి బ్రతికిన రత్నాకరుడనే బోయవాడు, నారద మహర్షి ఉపదేశం వల్ల పరివర్తన చెంది, రామనామ జపంతో వాల్మీకిగా ఎదిగాడు. సర్వలోకాలకూ మార్గదర్శకం, ఆదికావ్యమైన రామాయణాన్ని లోకానికి అందించాడు. రాజభోగాలను అనుభవించిన సిద్ధార్థుడు, అన్నింటినీ వదులుకుని సన్మార్గాన్ని అవలంభించి, జ్ఞానోదయం పొంది బుద్ధుడయ్యాడు. మహా బోధకుడిగా మారి, అమరుడయ్యాడు.

శ్రేష్ఠులైనవారు దేనిని ధర్మంగా భావించి ఆచరిస్తారో, సజ్జనులూ దానినే ఆచరిస్తారని బోధించాడు, శ్రీకృష్ణ భగవానుడు. జ్ఞానులూ, మహాత్ములూ, సన్మార్గాన్ని అనుసరించి చరితార్థులయ్యారు. ప్రతి మనిషీ మహనీయుల మార్గాన్నే అనుసరించి, కీర్తి శిఖరాలను చేరుకోవాలి. ఉదాహరణకి, పరమ శివభక్తుడైన రావణ బ్రహ్మ, స్త్రీ వ్యామోహం వల్ల దుర్మార్గంగా ప్రవర్తించి, చివరికి అధోగతిపాలయ్యాడు. అలాగే, వివేకం కోల్పోయి, బంధుమిత్రుల హితవచనాలు పెడచెవిన పెట్టినందువల్ల, కురువంశ నాశనానికి కారకుడయ్యాడు, దుర్యోధన సార్వభౌముడు.

మనిషి దుర్మార్గుడిగా మారడానికి ఎంతోకాలం అవసరంలేదు. కానీ మంచివాడిగా, ఉత్తముడిగా గుర్తింపు పొందడానికి మాత్రం చాలా కాలం పడుతుంది. అయినా, తద్వారా వచ్చే కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది. సన్మార్గమే మనిషికి నిజమైన సంపద. సన్మార్గంలో ప్రయాణించే మనిషికి ధనధాన్యాలు లేకపోయినా, అన్ని సంపదలూ ఉన్నట్లే. సత్ప్రవర్తన లేనివారికి ఎంత సంపద ఉన్నా, అవి ఎందుకూ కొరవడవన్నది, నీతికోవిదుల మాట.

చూసిన ప్రతిదానినీ ఆశించడం, ఆశించినదానికోసం ప్రాకులాడటం, కోరుకున్నది దొరక్కపోతే బాధపడటం.. ఇవన్నీ మనిషిలోని అశాంతికి కారణాలు. ఇవే మనిషిని దుర్మార్గం వైపు నడిపించి, అతడి పతనానికి కారణమవుతాయి. అందుకే మనిషి ఎప్పటికప్పుడు కోరికలను నియంత్రించుకుంటూ, స్థిరచిత్తం ఏర్పరచుకోవాలి. సన్మార్గం మనిషికి సుఖశాంతులను ప్రసాదిస్తుంది. సన్మార్గంలో నడిచే వ్యక్తుల మనస్సులు కడిగిన ముత్యాలలా నిర్మలంగా ఉంటాయి. వారు అందరితోనూ మృదు మధురంగా మాట్లాడతారు. కలిమిలోనూ, లేమిలోనూ నిబద్ధత కలిగి ఉంటారు. మంచి పనుల ద్వారా అందరినీ ఆకట్టుకుంటారు. సన్మార్గంలో ప్రయాణించే మనిషి, మనీషిగా ఎదుగుతాడు. ఉన్న స్థితి నుంచి, ఉన్నత స్థితికి చేరుకుంటాడు. మంచి బాటలో నడిచే మనిషికి, ఒక్కోసారి ఆలస్యమైనా, దైవానుగ్రహం తప్పక లభిస్తుంది. అందుకే సన్మార్గం అందరికీ అనుసరణీయం.

ధర్మో రక్షతి రక్షితః

Monday, February 5, 2024

జీవన్ముక్తుడు! అద్భుత సత్యం.. Story of Jeevan Mukta


జీవన్ముక్తుడు! అద్భుత సత్యం..
అంత్యకాల చింతనలే మరుజన్మను నిర్ణయిస్తాయా?

"జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ" అని గీతాచార్యుడు చెప్పినట్లు.. “పుట్టినవానికి మరణం తప్పదు; మరణించినవానికి మరల జన్మము తప్పదు”. కానీ, అంత్య సమయంలో ఆ జీవి మనస్సులో మెదిలే ఆలోచనలను బట్టే, మరుజన్మ ఉంటుందన్నది సనాతన సత్యం. ఆ సమయంలో ‘దైవ నామ స్మరణ’ మోక్ష దాయకమని పెద్దలు చెబుతారు. అయితే, అలాంటి సద్భావన అటువంటి క్షణాలలో కలగాలంటే, ముందునుండే నిత్య దైవ నామ స్మరణ అలవరచుకోవాలి, లేదా, ఆ సమయంలో మనస్సును దైవంపై నిలకడగా నిలబెట్టగల సత్సాంగత్యమైనా ఉండాలి. వీటన్నింటికీ ఉదాహరణగా, ఈ రోజు ఒక అద్భుతమైన కథను చెప్పుకుందాము.. వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/y6vublgZiQ0 ]


చాలా కాలం క్రితం మాధవపురి అనే ఊరిలో, భక్తాగ్రేసరుడొకాయన జీవించేవాడు. భగవంతుని పట్ల అచంచల భక్తిని పెంపొందించుకోవడం ఒక్కటే ఆయన లక్ష్యం. అనునిత్యం జపం, ధ్యానం వంటి ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించడం ఆయనకు పరిపాటి. తన లక్ష్యం నుండి ఎప్పుడూ, ఏ కారణంచేతా ఆయన వైదొలగే వాడు కాడు. ఇలా ఆయన తపోమయ జీవితాన్ని దృఢనిశ్చయంతో గడపేవాడు. దాంతో కాలక్రమంలో ఆయన ఆధ్యాత్మికంగా చక్కని పురోగతిని సంతరించుకున్నాడు. ఆయన వద్దకు ఆత్మోపదేశం పొందడానికి పలువురు యువకులు వచ్చేవారు. ఆయన వారికి దైవభక్తి కలిగి ఉండటం ఒక్కటే జీవిత లక్ష్యమని స్పష్టంగా, వారి హృదయాలలో బాగా నాటుకుపోయేటట్లు వివరించి చెప్పేవాడు. తాను ఎటువంటి జీవితం గడుపుతూ వచ్చాడో, అటువంటి జీవితాన్నే తు.చ. తప్పక పాటిస్తూ గడపమని, తన శిష్యులకు బోధించేవాడు. దానినే ఆయన తన జీవితంలో ప్రతిఫలింపజేశాడు.

కాలానుగుణంగా, వృద్ధాప్యం ఆయనను కమ్ముకోసాగింది. తన ఆయుర్దాయం త్వరలోనే ముగియనున్నదని గ్రహించిన ఆయన, తన అవసాన కాలాన్ని ముక్తి ధామమైన కాశీలో గడపాలని అభిలషించాడు. గురువుగారి మనోభావనను శిష్యులు అవగతం చేసుకుని ఆయనను సమీపించి వినమ్రంగా, “స్వామీ! మీ అభిలాష ప్రకారమే, మిమ్మల్ని ఒక పల్లకీలో కూర్చుండబెట్టుకుని మేం కాశీకి తీసుకుపోతాము. ఎక్కడా పెద్దగా ఆగకుండా పయనిస్తే కొద్ది రోజుల్లోనే కాశీకి చేరుకోగలము” అని అన్నారు. వారి ప్రతిపాదనకు ఆయన మనస్ఫూర్తిగా సమ్మతించాడు. శిష్యులు తమ గురువును పల్లకీలో మోసుకుంటూ కాశీకి బయలుదేరారు. ప్రయాణం కొద్ది రోజులు సాగింది. శిష్యులు పల్లకీని ఒకింత వేగంగానే మోసుకు వెళ్ళసాగారు. త్వరలోనే కాశీకి చేరుకుంటారన్న తరుణంలో, గురువుకు తన అవసానం ముంచుకు వచ్చేసిందని అర్ధం అయింది. అప్పుడాయన ఎక్కడున్నామని శిష్యులను ప్రశ్నించాడు. పల్లకీ కాశీని చేరుకున్నదేమో అని నిర్ధారణ చేసుకోవడానికి, ఆయన అలా అడిగాడు. అప్పటికి పల్లకీ ఇంకా కొన్ని గంటల ప్రయాణానంతరం మాత్రమే కాశీని చేరుకునే స్థితిలో ఉంది. ఇంకా కాశీని చేరుకోలేదు. కనుక శిష్యులు, “స్వామీ పల్లకీ ఇప్పుడు ఒక మురికివాడ చేరువలో ఉంది” అని జవాబిచ్చారు. పల్లకీలో ఉన్న గురువు చెవులలో, శిష్యులు జవాబు చెబుతున్న సమయంలోనే, గురువు శ్వాస ఆగింది.

మరణిస్తున్న సమయంలో మనిషి ఎటువంటి చింతనలు చేస్తూ ఉంటాడో, ఆ చింతనలే ఆతడి మరుజన్మను నిర్ణయిస్తాయని, మహాత్ములు చెబుతారు. మరణిస్తున్నప్పుడు, “మురికివాడ” అనే మాట చెవులలో పడడంవలన, మురికివాడ జ్ఞాపకం గురువు హృదయంలో పాతుకుపోయింది. ఆ కారణంగా, ఆయన మరుజన్మలో అంత్యకులజులు నివసించే ప్రాంతమైన ఒక గూడెంలో జన్మించాడు! కానీ, తపోమయ జీవితం గడపడం వలన, ఆ ఉత్తమ సంస్కారాలు వృథా పోలేదు. రాజు కొలువులో పని చేస్తున్న ఒక అంత్యకులస్థుని ఇంట్లో ఆయన జన్మించాడు. ఆ అంత్యకులస్థుడి కర్తవ్యం, ప్రతి రోజూ రాత్రంతా రాజధాని నగరం చుట్టూ గస్తీ తిరుగడం, రాత్రి నాలుగు జాముల్లోనూ, వీథుల్లో డప్పు వాయిస్తూ, 'పారా హుషార్‌! జాగ్రత్తగా ఉండండి!” అంటూ కేకలు పెట్టి, జనులను హెచ్చరించడం. రాత్రి వేళ దొంగలు తమ హస్తలాఘవాన్ని చూపడానికి అవకాశం లేకుండా, రాజు చేసిన ఏర్పాటు అది.

ఆ అంత్యకులస్థునికే, గురువు మరుజన్మలో కుమారునిగా జన్మించాడు. ఈ జన్మలోనూ, ఆయనకు తన గతజన్మకు సంబంధించిన భావనలు కొనసాగాయి. అతడికి లౌకిక జీవితం పట్ల చెప్పలేనంత ఏవగింపు. జనుల్లో అత్యధిక పాలు, అవిద్యకు లోబడే జీవితం గడుపుతున్నారు. కనుక అతడు, లౌకిక అనురక్తి గల జనులతో మెలగకుండా, ఏకాంతంలో ఉండిపోయేవాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఇలా జీవిస్తున్న అతణ్ణి, జన్మతః మూగవాడని, కుటుంబ సభ్యులూ, ఊరి జనం జమకట్టారు. ఈ స్థితిలో తండ్రి, కుమారుణ్ణి నిష్ప్రయోజకుడు, ఒట్టి మొద్దని భావించి, పెద్దగా పట్టించుకునేవాడు కాదు. దాంతో పిల్లవాడు, తన ధోరణిలోనే ఎదుగుతూ వచ్చాడు.

ఇలా ఉండగా ఒకసారి, తండ్రి అత్యవసరమైన పని మీద హఠాత్తుగా పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది. అందుచేత తండ్రి రాజు వద్దకు వెళ్ళి, తను హఠాత్తుగా ఊరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఎదురైందనీ, తనకు బదులుగా మూగవాడైన తన కుమారుడు నగరం చుట్టూ గస్తీ తిరుగుతూ, నాలుగు జాముల్లోనూ డప్పు మోగిస్తాడనీ విన్నవించాడు. అందుకు రాజు నిరాక్షేపణీయంగా సమ్మతించాడు. మారువేషంలో రాత్రివేళ నగరంలో తిరుగుతూ, పర్యవేక్షించడం రాజుకు అలవాటు. ఈ మూగ మొద్దు తన కర్తవ్యం ఎలా నిర్వర్తిస్తాడో చూడాలనుకున్నాడు రాజు. మూగవాడు వీథి వెంట వీథిగా, డప్పు మ్రోగించుకుంటూ గస్తీ తిరిగుతున్నాడు. అతడికి తెలియకుండా రాజు అతని వెంట నీడలా అనుసరిస్తున్నాడు. డప్పు మ్రోగించి, హెచ్చరికగా కేక పెట్టవలసిన సమయం ఆసన్నమైంది.  అంతలో.. కామః క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః । జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత ॥ “కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు, మనలోని జ్ఞానమనే విలువైన రత్నములను దొంగిలించటానికి మన దేహంలో దాగి వున్న దొంగలు. కావున ఓ మానవులారా.. సావధానులై ఉండండి.” అని కేకలుపెడుతూ, మూగవాడిగా భావింపబడే అతడు వీధులలో నడవసాగాడు. మరుగున ఉండి ఇదంతా గమనిస్తున్న రాజు దిగ్భ్రాంతుడయ్యాడు. “ఈ యువకుడు నిజానికి మూగ కాదు, అతడొక జీవన్ముక్తుడు” అన్న విషయాన్ని గ్రహించి మహదానందం చెందాడు.

మొదటి జాము ముగిసింది; కొంతసేపటికి రెండవ జాము కూడా వచ్చింది. రాజు ఆ జీవన్నుక్తుణ్ణి గమనిస్తూనేవున్నాడు. అతడు డప్పు మ్రోగించి ఈ సారి ఇలా పలికాడు: జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః । సంసార సాగరం దుఃఖం తస్మాత్‌ జాగ్రత జాగ్రత ॥ “ఈ జన్మ, వృద్ధాప్యము, భార్య, సంసారము, ఇవన్నీ దుఃఖ భరితములు. తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి!” అంటూ జీవన్ముక్తుడైన యువకుడు పలకడం రాజు విన్నాడు. ఇక మూడవ జాములో యువకుడు డప్పు మ్రోగించి ఇలా అన్నాడు: మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధుహ్ సహోదరః | అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్‌ జాగ్రత జాగ్రత ॥ “తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవన్నీ మిధ్యయే. ఇవేవీ నిజము కాదు. కనుక ఓ మానవులారా, సావధానులై ఉండండి!” మూడవ జాములో జీవన్నుక్తుడు డప్పు మ్రోగించి హెచ్చరిస్తూ పలికిన మాటలను, రాజు తన్మయత్వంతో విన్నాడు. తరువాత యథాప్రకారం జీవన్ముక్తుణ్ణి రహస్యంగా అనుసరిస్తూ వెళ్ళసాగాడు. ఇంతలో నాలుగవ జాము వచ్చింది. వీథుల్లో డప్పు మ్రోగిస్తూ వెళుతున్న ఆ యువకుడు, “పారాహుషార్‌” చెబుతూ ఇలా పలికాడు: ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా । ఆయుః క్షీణం న జానాతి తస్మాత్‌ జాగ్రత జాగ్రత ॥ “మనుష్యులు ఎల్లప్పుడూ ఏదో ఆశకూ, కర్మకూ కట్టుబడి, ఏవేవో ఆలోచనలతో జీవితాలు గడుపుతుంటారు. ఆయుర్దాయం తరిగిపోతుందన్న విషయాన్ని గమనించరు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి!” నాలుగు జాముల్లోనూ, ఆ యువకుడు డప్పు మ్రోగించి వెలిబుచ్చిన వేదాంత సత్యాలు, రాజు హృదయాన్ని అమితంగా ఆకర్షించాయి. రాజు ఆ జీవన్ముక్తుని మనస్సులోనే స్తుతించి, ప్రణమిల్లాడు. ఆ మహాత్ముడు సమ్మతిస్తే, ఆయనకు నచ్చిన పనిలో నియుక్తుని చేసి, తనకు చేరువలోనే ఉంచుకోవాలని రాజు భావిస్తూ, అంతఃపురానికి తిరిగి వెళ్ళిపోయాడు.

మర్నాడుదయం, జీవన్ముక్తుడి తండ్రి రాజ దర్శనానికి వచ్చినప్పుడు రాజు అతడితో, “ఇంతవరకూ మూగవాడిలా ఉంటూ వచ్చిన నీ కుమారుడు, నిజానికి ఒక జీవన్ముక్తుడు. అటువంటి మహోన్నతుడు మన రాజ్యంలో జీవిస్తూ ఉండటం, మన పూర్వులు చేసిన పుణ్య ఫలమే! ఆయన ఒకసారి మన అంతః పురం విచ్చేయడానికి సమ్మతిస్తే బాగుంటుంది. ఈ నా మనవిని ఆయనకు తెలుపండి” అని అన్నాడు. అయోమయంలో పడిపోయిన ఆ తండ్రి, రాజు చెప్పిన ప్రకారమే తన కుమారుణ్ణి తీసుకు వచ్చాడు. రాజు ఆనందభరితుడై జీవన్ముక్తునితో, “అయ్యా, అంతఃపురంలో మీకు ఏ పని ఇష్టమో తెలియజేయండి. నేను మిమ్మల్ని అందులో నియుక్తుని చేస్తాను” అని వేడుకుంటున్న ధోరణిలో చెప్పాడు. అందుకు జీవన్ముక్తుడు ఇలా స్పందించాడు.. “ఘోరమైన నేరాలకు పాల్పడిన వారికి శిరచ్ఛేదన దండన విధిస్తున్నారు కదా! అటువంటి నేరస్థులను నా వద్దకు పంపండి. వారికి నేనే స్వయంగా శిరచ్ఛేదన చేసి, మరణ దండనను అమలు పరుస్తాను. ఈ నా వేడుకోలును ఆమోదింపమని విన్నవించుకుంటున్నాను” అని అన్నాడు. జీవన్ముక్తుడు అటువంటి విచిత్రమైన విధి నిర్వహణను ఎందుకడుగుతున్నాడనే మర్మం రాజుకు అర్థం కాకపోయినా, ఎదురు చెప్పలేదు. జీవన్ముక్తుని వేడుకోలును వెంటనే నెరవేర్చమని ఆదేశించాడు. వధ్య స్థలానికి దగ్గరే జీవన్ముక్తుడు బస చేయడానికి అనువుగా, ఒక కుటీరాన్ని నిర్మించారు అధికారులు. ఆ కుటీరానికి ప్రక్కనే, నేరస్థులు ఉండటానికి ఒక చోటును కేటాయించారు. మూగగా పరిగణింపబడుతూ వచ్చిన యువకుడు, నేరస్థులకు శిరచ్ఛేదన చేస్తూ, మరణ దండనను అమలుపరిచే పనిని సక్రమంగా నిర్వర్తించసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది..

ఒక రోజు యమధర్మరాజు, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వద్దకు విచారవదనుడై వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మదేవుడు విషయం అడుగగా,  అందుకు యమధర్మరాజు, “దేవా! భూలోకంలో ఘోర నేరాలు చేసిన వారిని, నేను నరకానికి ఈడ్చుకొచ్చి, నరక యాతనలకు గురిచేయడం నా ధర్మము! నాకు అప్పగించిన ఈ కర్తవ్యాన్ని ధర్మం తప్పకుండా నిర్వర్తిస్తున్నాను. ఇప్పుడు పరిస్థితి మారింది. గత కొన్ని నెలలుగా నాకు పని తగ్గింది. నరకానికి వచ్చే వారు కరువయ్యారు. ఒక ప్రాంతంలోని పాపులు ఏమైపోతున్నారో, ఎక్కడికి పోతున్నారో అంతుబట్టడం లేదు.” అని అన్నాడు. కారణం తెలుసుకోవడానికి బ్రహ్మదేవుడు దృష్టి సారించి చూడగా, రాజసభలో జరుగుతున్న తతంగమూ, ఘోరమైన నేరాలు చేసిన వారికి రాజు మరణ దండన విధించడమూ, భటులు నేరస్థులను వధ్యస్థలానికి ఈడ్చుకుపోవడమూ గమనించాడు.

అక్కడొక యువకుడు, నేరస్థులకు శిరచ్ఛేదన చేయడం కూడా బ్రహ్మదేవుడు చూశాడు. కానీ, వధ్యస్థలంలో మరణ దండనను ఒక విచిత్రమైన పద్ధతిలో అమలుపరుస్తున్నాడు, ఆ యువకుడు. వధ్యస్థలం ఎదురుగా రెండు పెద్ద చిత్రపటాలను ఉంచాడు. వాటిలో ఒకటి మహాశివుడిది, రెండవది మహావిష్ణువుది. రెండు చిత్రాలూ హృదయాలను అలవోకగా ఆకర్షించేటంత దివ్యత్వం ఉట్టిపడుతున్నవిగా ఉన్నాయి. చిత్రాలకు అలంకరించిన పూలమాలలనుండి వస్తున్న పరిమళం, చుట్టూ వ్యాపిస్తోంది. దేవాలయాలలో వెలుగొందే తీరులో, ధూప దీపాలు వెలుగుతున్నాయి. వాటి పరిమళం, వధ్యస్థలం అంతటా వ్యాపించి ఉంది. మొత్తం మీద ఆ స్థలంలో, దేవాలయాలలోని విశేష పవిత్రత సంతరించుకుని ఉన్నది. అక్కడకు తీసుకు రాబడిన నేరస్థులను ఆ యువకుడు, అలంకరించబడిన రెండు దైవ చిత్తరువుల ముందు నిలబెట్టి, శివుడు, విష్ణువుల మహిమలను వారి హృదయాలలో హత్తుకుపోయే రీతిలో, సరళంగా ప్రవచించాడు. అతడు చెబుతున్నది వింటున్న నేరస్థుల కళ్ళు దైవ చిత్తరువులలో లయించిపోయి, మనస్సులు దైవ చింతనలో ఓలలాడసాగాయి. ఆ స్థితిలో, యువకుడు వారి వెనుక నిలబడి, కత్తితో వారి తలలను ఖండించివేశాడు. ఏం జరుగుతున్నదో తెలియని స్థితిలో, దైవ తలంపే తమ మనస్సులను పూర్తిగా ఆక్రమించి ఉండగా, నేరస్థుల శిరచ్ఛేదన జరిగిపోసాగింది. ఇదంతా చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి, ఆ యువకుని ఎదుట ప్రత్యక్షమై, అలా ఎందుకు చేస్తున్నాడని ప్రశ్నించాడు.

అప్పుడా యువకుడు, తన గత జన్మలో అంత్య కాలంలో జరిగిన సంఘటనను గుర్తుచేశాడు. “అంతిమ సమయంలో నా చెవిలో మురికివాడ” అనే మాట పడడం వలన, మనస్సులో మురికివాడ గురించిన తలంపు తలెత్తిన స్థితిలో, నా ప్రాణం పోయింది. నా మనస్సును అప్పుడు ఆక్రమించిన భావనే, నా మరు జన్మకు కారణమైంది. పైగా, “మరణ సమయంలో నన్నే తలచుకుంటూ ప్రాణం విడిచేవాడు నన్నే పొందుతాడ”ని, గీతలో సాక్షాత్తు భగవానుడే చెప్పాడు. “కనుక ఇక్కడకు తీసుకురాబడే నేరస్తులు, భగవంతుడిని తలచుకుంటూ ప్రాణం విడిస్తే, అ భగవంతుడినే చేరుకుంటారు. అందుకే నేరస్థుల ప్రాణం పోతున్నప్పుడు, వారి మనస్సులలో భగవంతుడే ఉండిపోయే రీతిలో, ఇక్కడ ఏర్పాట్లు చేయించాన”ని జీవన్ముక్తుడు వ్యక్తపరిచాడు.

భగవంతుడిని చేరి, ఆయన సాయుజ్యం పొందడమే, ప్రతి ప్రాణీ చేరవలసిన లక్ష్యం. కానీ, జనన మరణ వలయాన్ని అధిగమించి, భగవంతుని సాయుజ్యం పొందడం అంత సులువు కాదు. మరణ దండనను అమలుపరిచే కర్తవ్యాన్ని స్వీకరించిన యువకుడు, అతి సులువుగా నేరస్థులకు భగవంతుడిని పొందే మార్గాన్ని ఆవిష్కరించాడు. అందుకే బ్రహ్మదేవుడు ఆ యువకుని ప్రశంసించి, ఆశీర్వదించి, అంతర్ధానమయ్యాడు. మనుష్యులను సన్మార్గం వైపు నడిపించే ఇటువంటి మంచి కథలను, మన చుట్టూ ఉన్నవారికి కూడా వినిపించి, లోకంలో మంచిని పెంచే ప్రయత్నం చేద్దాము..

Monday, January 29, 2024

Science Behind Mangalsutra | మంగళసూత్రం - నూరేళ్ళ పంట!


మంగళసూత్రం! - నూరేళ్ళ పంట! 
స్త్రీలు ధరించే మంగళసూత్రం వెనుకవున్న సైన్స్ మీకు తెలుసా?

హిందూ వివాహ తంతులో మాంగల్యధారణే అత్యంత ప్రధానమైనది. మాంగల్యానికే మంగళసూత్రం, తాళి, తాళిబొట్టు, పుస్తె, శతమానం అనే పేర్లతోపాటు, ప్రాంతాలవారీగా వివిధ రూపాలు కూడా ఉన్నాయి. ఇవి కులం, వంశానుసారం కూడా పలురూపాలలో ఉంటాయి. మనిషికి పెళ్లి ఎంత ముఖ్యమో, ఆ పెళ్లికి మంగళసూత్రమూ అంతే ముఖ్యం. వివాహ సమయం నుండి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఏనాటినుంచో వస్తోంది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో 'మంగళ' అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలున్నాయి. సూత్రం అంటే తాడు, ఆధారమైనదనే అర్ధాలు వస్తాయి. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని దారపు పోగులు కలిపి, దానికి పసుపు రాసి తయారు చేస్తారు. పెళ్లినాడు ఇచ్చిపుచ్చుకున్న ఇతర వస్తువులూ, ఆభరణాలన్నీ రూపాంతరం చెందినా, చివరి వరకూ వెంట ఉండేది మంగళసూత్రం మాత్రమే. అటువంటి మంగళసూత్రం గురించి మనలో చాలామందికి తెలియని, విస్మరిస్తున్న వాస్తవాలను ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/lNINMJMMhJc ]


పోతనామాత్యుల వివరణ ప్రకారం, క్షీరసాగరమధన సందర్భంలో మాంగల్య ప్రస్థావన ఇలా ఉంది.. “మ్రింగెడివాడు విభుండని, మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్, మ్రింగుమనె సర్వమంగళ, మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో! హాలాహలం పొంగుకొచ్చి, లోకాలు నాశనం అయ్యే ప్రమాదం ఏర్పడినప్పుడు, దేవతలందరూ కలసి మహేశ్వరుడికి మొర పెట్టుకున్నారు. భోళాశంకరుడు ఆ విషాన్ని మొత్తం మింగి ప్రపంచాన్ని కాపాడడానికి పూనుకుని, తన అర్థాంగి పార్వతి యేమంటుందో అని ఆమె వైపు చూశాడు. ఆమె చిరునవ్వుతో తన అంగీకారాన్ని తెలిపింది! ఇదీ సంస్కృత భాగవతంలో ఉన్న సన్నివేశం. "ఎంత దేవుళ్ళైనా, చూస్తూ చూస్తూ తన భర్త విషం తాగడానికి ఏ భార్యయినా అంగీకరిస్తుందా?" పరీక్షిత్తుకు కలిగిన సందేహానికి శుకమహర్షిచ్చిన జవాబు ఈ పద్యం. "మంగళసూత్రాన్ని నమ్మడ"మంటే తమ భార్యాభర్తల అనుబంధాన్ని నమ్మడం! ఒకరినొకరు విడిచిపెట్టమని చేసిన ప్రమాణాలలోని సత్యాన్ని నమ్మడం! ఇక్కడ పార్వతి, "సర్వమంగళ". అంటే, పరిపూర్ణమైన శుభానికి ప్రతిరూపమే ఆవిడ. తన మాంగల్యమ్మీద అంత నమ్మకం ఉండబట్టే, ఆవిడ సర్వమంగళ అయింది. అందుకే, మింగుతున్నది తన భర్తని తెలిసీ, మింగేది విషమని తెలిసీ, ప్రజలందరికీ మేలు జరుగుతుంది కాబట్టి, మింగమని చిరునవ్వుతో తన అంగీకారాన్ని చెప్పగలిగింది.

“మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా !
కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాంశతం”

ఓ సుభగా! నా జీవనానికి ఆధారమైన ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. దీనిని ధరించిన నువ్వు నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు నూరేళ్ళు జీవించు. అంటే పుణ్యస్త్రీగా, ముత్తయిదువగా సకల సౌభాగ్యాలతో జీవించమనే భావం స్పష్టంగా తెలుస్తుంది. దాని ఉద్దేశ్యం, నీవు దీనిని ధరించి, నా జీవితంలో అన్నింటా సగ భాగమై, నాకు తోడుగా, నీడగా ఉంటూ, మనమిద్దరమూ కలిసి, నిండు నూరేళ్ళు ఆనందంగా జీవిద్దామని.

పూర్వం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు, ఎటువంటి ఆచారాలూ, కట్టుబాట్లూ ఉండేవి కావు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి. భారతావనిలో పిండారీలూ, థగ్గుల వంటి కిరాత జాతులవారు వలస వచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను, మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకు పోయేవారు. మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు.. ఏ హానీ చేయకుండా విడిచిపెట్టేవారు. కిరాతకులు కూడా ఈ మంగళ సూత్రాన్ని గౌరవించారు. అలా కోట్లాది మగువల మాన ప్రాణాలను కాపాడింది ఈ మంగళసూత్రం. అందుకే అప్పటినుండీ, ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్ళి చేసి, మాంగల్యం వేసే వారు.

ఆదిశంకరాచార్యుల వారు వ్రాసిన ‘సౌందర్యలహరి’లో కూడా, మంగళ సూత్రానికి విశేష విశిష్టతను కల్పించారు. అటువంటి మంగళసూత్రంలో, ముత్యం, పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది. స్త్రీ శారీరక, మానసిక రక్షణ కోరకు, మంగళ సూత్రంలో ముత్యం, పగడం వాడతారు. ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలోనుండి ఎరుపు - కుజుడు, తెలుపు - చంద్రుడు స్వీకరించడం జరుగుతుంది. ఆ జంట గ్రహాలు, స్త్రీ శరీరంలోని అన్ని నాడీ కేంద్రములనూ ఉత్తేజ పరచి, శారీరకంగా, భౌతికంగా, ఆరోగ్య పరంగా స్త్రీలలో వచ్చే నష్టాలనూ, దోషాలనూ తొలగిస్తాయనటంలో ఎటువంటి సందేహమూ లేదు. చంద్ర, కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యత వహిస్తాయో, అలాగే ముత్యం, పగడం కలిపిన మంగళసూత్రం, స్త్రీకి అత్యంత శుభఫలితాలను అందిస్తుంది. వీటి ప్రయోజనాలను పరిశీలిస్తే, ముత్యం, పగడం ధరించిన పాత తరం స్త్రీలు, ప్రసవ సమయంలో, ఆపరేషన్ లేకుండా, సహజ సిద్ధంగా పిల్లలను కనేవారు. ఆపరేషన్ అనేది అప్పట్లో అరుదైన విషయం. కానీ, ప్రస్తుత కాలంలో కాన్పులు, సిజేరియన్ ఆపరేన్ ద్వారా జరగటం అనేది సర్వ సాధారణమై పోయింది.

ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకు, అన్యోన్య దాంపత్యములకూ కారకుడు. శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రంథులు, సిరలు, ధమనులు, స్థనములు, స్త్రీల గుహ్యావయవములు, నరములు, ఇంద్రియములు, గర్భధారణ, ప్రసవములకు కారకుడు. పగడం కుజగ్రహనికి ప్రతీక. కుజగ్రహ దోషం వలన కలిగే ప్రభావాలు, అతికోపం, కలహాలు, మూర్ఖత్వం, సామర్ధ్యరాహిత్యము, రోగము, ఋణపీడలు, అగ్ని, విద్యుత్భయములు, పరదూషణ, కామవాంఛలు, దీర్ఘ సౌమాంగల్యలోపం, దృష్టి దోషము యిత్యాదులు, శారీకంగా ఉదరసంబంధిత ఇబ్బందులు, రక్త స్రావము, గర్భ స్రావము, ఋతు దోషములు మొదలైనవి. భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రములో ముత్యాన్ని మించిన విలువగలది వేరే లేదు. దానికి తోడు జాతి పగడం ధరించమని మన మహర్షులు చెప్పటంలో విశేష గూఢార్ధాన్ని గమనించవచ్చు.

శాస్త్ర, సాంప్రదాయ పరంగా, ఆరోగ్య పరంగా, జ్యోతిష్య పరంగా, మంగళసూత్రాలు, మెట్టెలు, బొట్టు, గాజులనేవి, అలంకరణ కోసం మాత్రమే కాక, స్త్రీని అన్ని విధాలుగా కాపాడుతూ, చక్కటి దేహ కాంతితో, ఆరోగ్యకరమైన సంసార జీవనాన్ని కొనసాగించేలా చేస్తాయి. ఏ విధంగా చూసినా, విలువలు తెలియని వివాహాలు శుభకరం కాకపోగా, విడాకుల వరకూ తీసుకు వెళతాయి. సాంప్రదాయ సంస్కారం లేని బంధాలలో కలతలు చోటు చేసుకుంటాయి. అలాగే, పాశ్చాత్య అనుకరణ వెర్రిలో పెడ దారి పడుతున్న మన ఆడ కూతుర్లకు మన ధర్మం గొప్పదనం, విశిష్టత అర్ధం అయ్యేలా తెలియ పరుద్దాము. సంప్రదాయాలను కాపాడుకుంటూ సంతృప్తిగా జీవిద్దాము..

Wednesday, January 24, 2024

Rama an Ordinary Human Being or God? Legend, History & Religion | రాముడు దేవుడా?


రాముడు దేవుడా?
శతృత్వం ఎంతటిదైనా, అది చావుతో ముగిసిపోతుంది! 

శ్రీరాముడి జీవితాన్ని చూస్తే, ఎన్నెన్నో సమస్యల సుడిగుండాలలో ఆయన ఈదినట్లు తెలుస్తుంది. ఆయన జీవితమంతా సమస్యలతోనే సాగింది. మొదట పినతల్లి కారణంగా, పితృవాక్య పరిపాలనను అనుసరించి ఆయన తన రాజ్యాన్ని వదులుకోవలసి వచ్చింది. అడవుల పాలైన శ్రీరాముడి చెంత ఉన్న భార్య సీతమ్మను, రావణుడు అపహరించుకుపోయాడు. ఆమె కోసం ఆయన అంతటా గాలించి, ఆమె జాడను కనుగొని, తనకు ఇష్టం లేకపోయినా యుద్ధం చేశాడు. అలా సీతమ్మను తీసుకుని రాజ్యానికి వెళితే, అక్కడ సీతమ్మను గురించి అపవాదులు వినాల్సి వచ్చింది. ఈ దశలో గర్భవతిగా ఉన్న సీతమ్మను తిరిగి అడవుల పాలు చేయాల్సివచ్చింది. ఆ తర్వాత తన కొడుకులతోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి. ఆ భీకర యుద్ధ సమయంలో సీత రణస్థలికి రావడం, పుత్రులను రామునికి అప్పగించి, భూమాత ఒడిలోకి చేరడం, ఇలా రాముడి జీవితం చూసుకుంటే ముళ్లబాటే. ఐనప్పటికీ భారతదేశంలో కోట్లాదిమంది రాముడినే ఎందుకు కొలుస్తారు? ఆయననే ఆదర్శంగా ఎందుకు తీసుకుంటారు? శ్రీరాముని గొప్పదనం గురించిన వివరాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/8iPA9Kys0Ec ]


రాముడు మాయలూ, మంత్రాలూ చూపించలేదు. శ్రీకృష్ణుడిలా విశ్వరూపం ప్రకటించలేదు. జీవితంలో ఎన్నెన్నో కష్టాలు, జరగరాని సంఘటనలు.. చిన్న వయస్సులోనే పినతల్లి స్వార్థానికి తండ్రికి దూరమై, ఆయనను పోగొట్టుకున్నాడు. పట్టాభిషేక ముహూర్తానికే అడవులపాలయ్యాడు. అరణ్యవాసంలో తోడుగా, ఊరటగా నిలుస్తుందనుకున్న భార్యకు దూరమయ్యాడు. కారడవులలో బాధాతప్త హృదయంతో వెతికాడు. అంతులేని దుఃఖాన్ని గుండెల్లో మోస్తూనే, రాక్షస వధ గావించాడు. అందరిలాగే ఉద్వేగాలు, ఆలోచనలు, ఆవేదనలు అనుభవించాడు. లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా, తాను మాత్రం విస్పష్టంగా 'అహం దశరథాత్మజః' అంటే, దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే అని ప్రకటించాడు. అయినా లోకమంతా ఆయననే ఎందుకు ఆదర్శంగా తీసుకుంది?

ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించినవాడు రాముడు. ధర్మానికి రూపునిస్తే, రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. చేతికి అందివచ్చిన సింహాసనాన్ని వదులుకుని, స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ.. ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే రామచంద్రుడు ధర్మమూర్తి అయ్యాడు. ఆ యుగపురుషుడిగానే కాక, సకల జగత్తుకూ ఒకేఒక్కడుగా నిలిచాడు.

1. శాస్త్ర ధర్మ పాలన..

తండ్రి మాట కోసం, సీత, లక్ష్మణులతో కలిసి వనవాసానికి బయలుదేరాడు రాముడు. అయోధ్యలో పుత్రవియోగ దుఃఖంతో దశరథుడు మరణించాడు. మేనమామ ఇంట్లో ఉన్న భరతుడు వచ్చి, దశరథుడికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. అన్నను వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్లి, తండ్రి మరణవార్త తెలియజేశాడు. అది విని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు రామయ్య. 'పెద్దకుమారుడినైవుండీ తండ్రికి ఉత్తరక్రియలు చెయ్యలేకపోయాన'ని బాధపడ్డాడు. అక్కడికక్కడే శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి ఉత్తరక్రియలు చేసి, పిండితో పిండాలు చేసి, దర్భల మీద ఉంచబోయాడు. ఇంతలో బంగారు కంకణాలు ధరించిన ఓ హస్తం రాముడి ముందుకు వచ్చి, తాను దశరథుడిననీ, పిండం తన చేతిలో పెట్టమనీ వాణి వినిపించింది. కానీ, రాముడు అందుకు ఒప్పుకోలేదు. శాస్త్రప్రమాణాలను అనుసరించి, దర్భల మీదే పిండాలు ఉంచాడు. నిజంగా మీరు నా తండ్రే అయితే, దర్భల మీద ఉంచిన పిండాలను స్వీకరించండి. నేను శాస్త్ర ప్రమాణాన్నే పాటిస్తానని నిక్కచ్చిగా చెప్పాడు. తండ్రి వియోగ దుఃఖంలో ఉన్న సమయంలో కూడా, శాస్త్ర ధర్మాన్ని తు.చ తప్పకుండా పాటించిన ఆదర్శమూర్తి రామచంద్రుడొక్కడే.

2. స్నేహ ధర్మ పాలన..

సీతమ్మ మాయలేడిని కొరినప్పుడు, ఆమెను వదలి, పర్ణశాలను దాటి, చాలా దూరం వెళ్ళారు రామలక్ష్మణులు. అదే అదనుగా, రావణుడు మారు వేషంలో వెళ్ళి సీతమ్మను అపహరించాడు. అదంతా గమనించిన జటాయువు రావణుడిని అడ్డగించే ప్రయత్నంలో, రావణుడిని ముప్పుతిప్పలు పెట్టాడు. సహనం నశించిన రావణాసురుడు జటాయువు రెక్కలు నరికివేశాడు. రెక్కలు తెగిన పక్షిరాజు  నేలకూలాడు. కొన్నాళ్లకు సీతాన్వేషణ చేస్తూ అటుగా వచ్చిన రాముడికి జరిగిన వృత్తాంతం చెప్పి, రాముడి చేతిలోనే ప్రాణాలు విడిచాడు. తన క్షేమం కోసం ప్రాణత్యాగం చేసిన జటాయువును ఆప్తమిత్రుడిగా స్వీకరించి, అతడికి ఉత్తరక్రియలు స్వయంగా నిర్వహించాడు రామచంద్రుడు. తాను క్షత్రియుడు. చేస్తున్నది వనవాసం. మరణించింది పక్షి. అయినప్పటికీ జటాయువుకు తాను స్వయంగా ఉత్తరక్రియలు చేసి, స్నేహధర్మానికి అసలైన అర్థాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించాడా స్నేహశీలి.

3. యుద్ధ ధర్మ పాలన..

వాలి తన తమ్ముడైన సుగ్రీవుడి భార్య రుమను చెరబట్టాడు. తమ్ముడి భార్య కోడలితో సమానం. మామగారు తండ్రితో సమానం. తండ్రిలాగా కాపాడవలసిన తమ్ముడి భార్యను, వాలి కామంతో కోరుకున్నాడు. అంతేకాదు.. వాలి వనచరుడు. క్రూరత్వం కలిగిన వనచరాలను వేటాడటం క్షత్రియ ధర్మం. అంతేకాకుండా, ఎదుటివారి బలాన్ని తగ్గించే వరమాల వాలి మెడలో ఉంది. దానిని ధరించిన సమయంలో, వాలి ఎదుట ఎవరు నిలిచినా, వారి శక్తి క్షీణిస్తుంది. కాబట్టే రాముడు చెట్టుచాటున దాగి, వాలిపై బాణాన్ని ప్రయోగించాడు. ఇది యుద్ధ ధర్మం. వాలి వధ ఘట్టంలో రాముడు క్షత్రియ, యుద్ధ ధర్మాలను పాటించాడు.

రావణ సంహారం తర్వాత విభీషణుడు రాముని వద్దకు వచ్చి, ఉత్తర క్రియలు నిర్వహించేందుకు అన్నగారి పార్థివ దేహాన్ని ఇమ్మని అడిగాడు. అప్పుడు రాముడు..
మరణాంతాని వైరాని నివృత్తం నః ప్రయోజనం |
క్రియతామద్య సంస్కారః మమాప్యేష యథా తవ ||
'విభీషణా! శతృత్వం ఎంతటిదైనా, అది చావుతో ముగిసిపోతుంది. సంధి కుదరక పోవడం వల్లనే, యుద్ధం చేయాల్సి వచ్చింది. మీ అన్నగారికి, ఆచార విధి ప్రకారం ఉత్తర క్రియలు జరిపించు. ఇక నుంచి ఈయన నీకు మాత్రమే కాదు. నాకూ అన్నగారే’ అని అన్నాడు. ఇదీ రాముడి ధర్మవర్తనం..

4. దయా ధర్మ పాలన..

సీతను రాముడికి అప్పగించమని హితబోధ చేసిన విభీషణుడికి, రాజ్యబహిష్కరణ శిక్ష వేశాడు, రావణుడు. సముద్ర తీరంలో, అపారమైన వానర సేనతో ఉన్న రామచంద్రుడి పాదాలను ఆశ్రయించాడు, విభీషణుడు. మరో ఆలోచన లేకుండా, విభీషణుడికి అభయం ఇచ్చాడు రామయ్య. అంతేకాదు, రావణుడిని చంపి, విభీషణుడిని లంకా రాజ్యానికి రాజును చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కానీ, సుగ్రీవుడు, మొదలైన వారికి, ఇదంతా ఇష్టం లేదు. ఏకాంతంలో ఉన్న రామయ్య దగ్గరకు వెళ్లి, విభీషణుడిని నమ్మవద్దని చెప్పారు. అతడు రావణాసురుడి దూత అని హెచ్చరించారు. అంతా విన్న రాముడు, విభీషణుడే కాదు. చివరకు రావణుడే తనను ఆశ్రయించినా, అతడికి కూడా అభయం ఇస్తానన్నాడు. ఆశ్రయించిన ప్రాణులకు రక్షణ కల్పించటం, క్షత్రియ ధర్మం, దయా ధర్మం. వనవాసంలో ఉన్నా, చివరకు యుద్ధ భూమిలో ఉన్నా, దయా ధర్మాన్ని విడిచి పెట్టలేదు రాముడు.

5. మనుష్య ధర్మ పాలన..

రామరావణ సంగ్రామం ముగిసింది. రావణుడు నేలకొరిగాడు. ముల్లోకాలూ ఆనందించాయి. వానరసేన చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇంతలో బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమయ్యారు. రాముడిని సాక్షాత్తు శ్రీమహావిష్ణు స్వరూపంగా స్తుతించారు. ‘నీది విష్ణు అంశ. వాస్తవానికి నువ్వు నిరాకారుడివి. అయినా, సాకారుడిగా ఉన్నావు. సృష్టి, స్థితి, లయలు నీవే నిర్వహిస్తావు’ అంటూ రాముడికి దైవత్వాన్ని ఆపాదించారు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి చెప్పినా, రాముడు తాను దైవాన్నని చెప్పుకోలేదు. తనకు దైవత్వాన్ని ఆపాదించుకోలేదు. ‘ఆత్మానం మానుషం మన్యే... దశరథాత్మజః’ అంటూ, తాను కేవలం దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే, సాధారణ మనుజుడిని మాత్రమే’ అని అన్నాడు. ఇదీ రామయ్య పాటించిన మనుష్య ధర్మం. రామయ్య ఎక్కడా మాయలు, మంత్రాలు ప్రకటించలేదు. తాను దైవాన్నని ఎన్నడూ చెప్పుకోలేదు. సాధారణ మనిషిలాగే, రాజ్య భోగాలతో పాటు, సుఖ దుఃఖాలూ అనుభవించాడు. మనుష్య ధర్మాన్ని పరిపూర్ణంగా పాటించిన యుగపురుషుడు రామచంద్రుడు.

6. సోదర ధర్మ పాలన..

రావణ వధ అనంతరం, లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావలసిందిగా విభీషణుడుకి వర్తమానం పంపించి, విశ్రాంతిగా కూర్చున్నాడు రాముడు. దూరంగా ఓ స్త్రీమూర్తి వడివడిగా అడుగులు వేసుకుంటూ, తన వైపే వస్తోంది. ఆమె ఎవరై ఉంటుందని రాముడు ఆలోచిస్తుండగా, ఆమె  ఎదురుగా వచ్చి నిలుచుంది. అమ్మా! ఎవరు నువ్వు? ఎందుకిలా వచ్చావు? రక్తసిక్తమైన రణభూమిని చూస్తుంటే, నీకు భయం అనిపించటం లేదా? నా వల్ల ఏదైనా సహాయం కావాలా? అంటూ రాముడు ఎంతో వినమ్రంగా ఆమెను అడిగాడు. అందుకామె సమాధానం ఇస్తూ, రామచంద్ర ప్రభూ! నన్ను మండోదరి అంటారు. నీ చేతిలో మరణించిన రావణాసురుడి భార్యను. రామా! నీవు ధర్మమూర్తివనీ, ఏకపత్నీవ్రతుడవనీ.. సీతను తప్ప మరే ఇతర స్త్రీ పేరు కూడా తలవవనీ విన్నాను. నా భర్త అనేకమంది స్త్రీలను చెరపట్టాడు. నీవంటి ఉత్తమ గుణసంపన్నుడైన యోధుడిని దర్శించుకోవాలనే కుతూహలంతో వచ్చాను. పరస్త్రీని చూడగానే వినమ్రంగా ఉన్నప్పుడే, నీ ఔన్నత్యం అర్థమైంది. రామచంద్రా! నీ దర్శన భాగ్యంతో ధన్యురాలనయ్యాను. ఇక సెలవు. అంటూ నిష్క్రమించింది. ఇదీ, పర స్త్రీలపై ఆ రామచంద్రుడు చూపించే సోదర ధర్మం.

పవిత్ర జీవితం కోసం, ముక్తి కోసం సాధన చేసే యోగులు, రామునిలా జీవించాలని అనుకుంటారు. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా మారొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. నిరీక్షించి, కాల పరీక్షను ఎదుర్కోవడమే వివేకవంతుల లక్షణం. రామయ్యా అదే చేశాడు. ఎప్పుడూ ప్రణాళికా బద్ధంగానే జీవితం నడుస్తుందని భావించలేము. మన ప్రమేయం లేకుండా, చికాకులు కలుగుతాయి. వాటికి క్రుంగిపోతే, జీవితం గతి తప్పుతుంది. గుచ్చుకున్న ముల్లును నెమ్మదిగా తొలగించి, ముందుకెళ్లాలి. అలా చేయగలిగితే, అద్భుతమైన అనుభూతి మిగులుతుంది. ఏ విషయాన్నైనా, సక్రమంగా నిర్వర్తించే సామర్ధ్యం పెరుగుతుంది. రాముడిని ఆదర్శంగా తీసుకోవడం అనేది, ఆరాధన కోసం కాదు. మన జీవితాలను మనమే ఉద్ధరించుకోవాలన్నది, అందులోని పరమార్థం. త్యాగం, ధర్మం, దయ, పరాక్రమం, రామునిలోని గొప్ప లక్షణాలు. వీటిని పెంపొందించుకోవాలని చెప్పేదే రామాయణం.

జై శ్రీరామ!

Monday, January 22, 2024

శ్రీ రామ రక్షా స్తోత్రం Sri Rama Raksha Stotram

 

శ్రీ రామ రక్షా స్తోత్రం

ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్య
బుధకౌశిక ఋషిః
శ్రీ సీతారామ చంద్రోదేవతా
అనుష్టుప్ ఛందః
సీతా శక్తిః
శ్రీమద్ హనుమాన్ కీలకం
శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్రజపే వినియోగః ॥

ధ్యానం:

ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం
పీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్ ।
వామాంకారూఢ సీతాముఖ కమలమిలల్లోచనం నీరదాభం
నానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్ ॥

స్తోత్రం:

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ ।
ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్ ॥ 1 ॥

ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్ ।
జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితమ్ ॥ 2 ॥

సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్ ।
స్వలీలయా జగత్త్రాతు మావిర్భూతమజం విభుమ్ ॥ 3 ॥

రామరక్షాం పఠేత్ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్ ।
శిరో మే రాఘవః పాతు ఫాలం (భాలం) దశరథాత్మజః ॥ 4 ॥

కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్రప్రియః శృతీ ।
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః ॥ 5 ॥

జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః ।
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః ॥ 6 ॥

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ ।
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః ॥ 7 ॥

సుగ్రీవేశః కటిం పాతు సక్థినీ హనుమత్-ప్రభుః ।
ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకుల వినాశకృత్ ॥ 8 ॥

జానునీ సేతుకృత్-పాతు జంఘే దశముఖాంతకః ।
పాదౌ విభీషణశ్రీదః పాతు రామోఽఖిలం వపుః ॥ 9 ॥

ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ ।
స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ ॥ 10 ॥

పాతాళ-భూతల-వ్యోమ-చారిణ-శ్చద్మ-చారిణః ।
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః ॥ 11 ॥

రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ ।
నరో న లిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి ॥ 12 ॥

జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్ ।
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః ॥ 13 ॥

వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్ ।
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళమ్ ॥ 14 ॥

ఆదిష్టవాన్-యథా స్వప్నే రామరక్షామిమాం హరః ।
తథా లిఖితవాన్-ప్రాతః ప్రబుద్ధౌ బుధకౌశికః ॥ 15 ॥

ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్ ।
అభిరామ-స్త్రిలోకానాం రామః శ్రీమాన్ స నః ప్రభుః ॥ 16 ॥

తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ ।
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ॥ 17 ॥

ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ ।
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ॥ 18 ॥

శరణ్యౌ సర్వసత్త్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతామ్ ।
రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ ॥ 19 ॥

ఆత్త సజ్య ధనుషా విషుస్పృశా వక్షయాశుగ నిషంగ సంగినౌ ।
రక్షణాయ మమ రామలక్షణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్ ॥ 20 ॥

సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా ।
గచ్ఛన్ మనోరథాన్నశ్చ (మనోరథోఽస్మాకం) రామః పాతు స లక్ష్మణః ॥ 21 ॥

రామో దాశరథి శ్శూరో లక్ష్మణానుచరో బలీ ।
కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః ॥ 22 ॥

వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః ।
జానకీవల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః ॥ 23 ॥

ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః ।
అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః ॥ 24 ॥

రామం దూర్వాదళ శ్యామం పద్మాక్షం పీతవాససమ్ ।
స్తువంతి నాభి-ర్దివ్యై-ర్నతే సంసారిణో నరాః ॥ 25 ॥

రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్ ।
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందే లోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిమ్ ॥ 26 ॥

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే ।
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ॥ 27 ॥

శ్రీరామ రామ రఘునందన రామ రామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ ।
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ ॥ 28 ॥

శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి
శ్రీరామ చంద్ర చరణౌ వచసా గృహ్ణామి ।
శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి
శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే ॥ 29 ॥

మాతా రామో మత్-పితా రామచంద్రః
స్వామీ రామో మత్-సఖా రామచంద్రః ।
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
నాన్యం జానే నైవ జానే న జానే ॥ 30 ॥

దక్షిణే లక్ష్మణో యస్య వామే చ (తు) జనకాత్మజా ।
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ ॥ 31 ॥

లోకాభిరామం రణరంగధీరం
రాజీవనేత్రం రఘువంశనాథమ్ ।
కారుణ్యరూపం కరుణాకరం తం
శ్రీరామచంద్రం శరణ్యం ప్రపద్యే ॥ 32 ॥

మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్ ।
వాతాత్మజం వానరయూథ ముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే ॥ 33 ॥

కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్ ।
ఆరుహ్యకవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్ ॥ 34 ॥

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ ।
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్ ॥ 35 ॥

భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదామ్ ।
తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్ ॥ 36 ॥

రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః ।
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర ॥ 37 ॥

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ।
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ॥ 38 ॥

ఇతి శ్రీబుధకౌశికముని విరచితం శ్రీరామ రక్షాస్తోత్రం సంపూర్ణమ్ ।

శ్రీరామ జయరామ జయజయరామ ।

శ్రీ రామ పట్టాభిషేకం! భాగం - 2 Coronation of Lord Rama in Ayodhya - Shri Rama Pattabhishekam


శ్రీ రామ పట్టాభిషేకం! భాగం - 2
ఆనాడు శ్రీరామ పట్టాభిషేకం ఎలా జరిగింది? ఈనాడు ప్రాణ ప్రతిష్ట సమయంలో మనం ఏం చేయాలి?

యావత్ భారత దేశం ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూసిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ ఘట్టానికి చేరుకున్నాం. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఆలయంలో ముగ్ధ మనోహరుడైన బాల రాముడు కొలువు దీరుతున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన అయోధ్య రామాలయ విశిష్టతలేంటి? వేల ఏళ్ళ క్రితం నాటి రాముడి పట్టాభిషేకం ఎలా జరిగింది? రాముడి ప్రాణ ప్రతిష్ఠ రోజున మనం చేయవలిసిన కార్యాలేంటి? అనేటటువంటి విషయాలను ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/WJxFJo2M8QU ]


రాముడు లంక నుండి సీతా దేవిని తీసుకుని పుష్పక విమానంలో, భల్లూక, వానరుల సమూహంతో అయోధ్యలోని నందిగ్రామానికి చేరుకున్నాడు. అక్కడ నుండి రాముడు అందమైన పట్టుపుట్టములను ధరించి, సూర్యమండల సన్నిభమైన రథాన్ని ఎక్కి పట్టాభిషేకానికి బయలుదేరాడు. ఆ రథం యొక్క పగ్గాలను భరతుడు పట్టుకుని నడిపించాడు. లక్ష్మణుడు నూరు తీగలు కలిగిన తెల్లటి గొడుగును పట్టాడు. ఒకపక్క శత్రుఘ్నుడు, మరొకపక్క విభీషణుడు వింజామర వీస్తున్నారు. అలా రథంలో అయోధ్యకు వెళుతున్న రాముడు, కనపడ్డ వాళ్ళందరినీ పలకరించుకుంటూ వెళ్ళాడు. రాముడు అందరితో కలిసి ఊరేగింపుగా, నందిగ్రామం నుండి అయోధ్యకు వెళుతుంటే,  అయోధ్యలో ప్రతి ఇంటిమీదా పతాకాలు ఎగురవేశారు. అన్ని ఇళ్ళముందు రంగవల్లులు వేశారు. అందరూ సంతోషపడిపోతూ, నాట్యం చేస్తూ వెళుతున్నారు. అలా వెళ్ళేటప్పుడు ముందుగా మంగళ వాయిద్యాలు నడిచాయి. ఆ వెనుక వేద పండితులు నడిచారు. తరువాత పెద్దలు, వాళ్ళ వెనుక కన్నె పిల్లలు. కొంతమంది స్త్రీలు పిండివంటలు పట్టుకుని నడిచారు. మార్గమధ్యంలో గంధపు నీరు జల్లుకుంటూ వెళ్ళారు. ఆ తరువాత సువాసినులయిన స్త్రీలు చేతులలో పువ్వులు, పసుపు, కుంకుమ పట్టుకుని వెళ్ళారు. వశిష్ఠుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు మొదలైన ఋషులందరూ అక్కడికి వచ్చారు. అలా అందరూ కలిసి అయోధ్యకి చేరుకున్నారు.

ఆ రాత్రికి అయోధ్యలో గడిపాక, మరునాడు రాముడి పట్టాభిషేకానికి 4 సముద్ర జలాలూ, 500 నదుల జలాలనూ వానరులు తీసుకొచ్చారు. ఇంద్రుడు నూరు బంగారు పూసలు కలిగిన మాలను రాముడికి బహూకరించాడు. వానరులు తీసుకొచ్చిన ఆ జలాలను రాముడి మీద పోసి, ఆయనకు పట్టాభిషేకం చేశారు. అప్పుడే కిరీటాన్ని తీసుకు వచ్చి రాముడి శిరస్సున అలంకరించారు. ఆ సమయంలో రాముడు కొన్ని కోట్ల బంగారు నాణాలూ, లక్షల ఆవులూ, వేల ఎద్దులనూ దానం చేశాడు.

తిరిగి ఇన్ని వేల సంవత్సరాల తరువాత, అయోధ్యలో బాల రాముడి పట్టాభిషేకం కన్నుల పండువుగా జరగుతోంది. ఆనాడు అయోధ్య ప్రజలు రాముడి రాక కోసం ఎదురుచూసిన విధంగా, నేడు భరత జాతి యావత్తూ రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఎదురుచూస్తోంది. సర్వాంగ సుందరంగా, ఎన్నో ప్రత్యేకతలతో నిర్మింపబడిన రామ మందిరం, ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద హిందూ ఆలయంగా నిలువనుంది. ప్రస్తుతం కంబోడియా అంకోర్‌వాట్‌లోని దేవాలయ సముదాయం, ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా రికార్డులకెక్కింది. ఆ తర్వాత స్థానంలో, తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న రంగనాథస్వామి ఆలయం ఉంది. ఇప్పుడు అయోధ్యలోని రామాలయం, మూడవ అతి పెద్ద ఆలయంగా ప్రసిద్ధి చెందింది. భారత సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు ప్రతిరూపం, అయోధ్య రామ మందిరం. ఈ రామమందిరాన్ని సంప్రదాయ నాగర్‌ శైలిలో నిర్మించారు. ఈ ఆలయం, 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో నిర్మితమైంది. మందిరాన్ని మొత్తం మూడు అంతస్తుల్లో నిర్మించారు. ఒక్కో అంతస్తు, 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ రామాలయంలో మొత్తం 392 స్తంభాలూ, 44 గేట్లూ ఉన్నాయి. ప్రధాన గర్భగుడిలో శ్రీరాముడు, ఐదేళ్ల బాలరాముడిగా దర్శనమివ్వనున్నాడు.

ఆలయంలో మొత్తం 5 మండపాలున్నాయి. అవి నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థనా మండపం, కీర్తన మండపం. రామాలయంలోని మొత్తం గోడలూ, స్తంభాలపై, అనేక రకాల దేవతామూర్తులను చెక్కారు. రామాయణ ఘట్టాలను చిత్రీకరించారు. ఆలయం చుట్టూ 732 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో, దీర్ఘచతురస్రాకారంలో ప్రహరీని నిర్మించారు. నాలుగు మూలల్లో నాలుగు దేవాలయాలను నిర్మించారు. వీటిలో సూర్యభగవానుడు, దేవి భగవతి, గణపతి, శివుడి ఆలయాలున్నాయి. ఉత్తర భుజంలో అన్నపూర్ణ ఆలయం, దక్షిణం వైపు ఆంజనేయ స్వామి ఆలయాలున్నాయి. మందిరం సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి అయిన సీతా కూపం ఉంది. మందిర సముదాయంలో వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, నిషాద్ రాజ్, శబరి మాత, అహల్య దేవిల మందిరాలను చూడొచ్చు. నైరుతి భాగంలో నవరత్న కుబేరు తిలపై, పురాతన శివాలయం పునరుద్ధరించబడింది. అక్కడ జటాయువు విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇంత విశాలమైన ఈ ఆలయాన్ని, ఇనుము వాడకుండా, ప్రత్యేక శిలలతో అత్యంత సుందరంగా నిర్మించారు. మందిర నిర్మాణంలో నేల, గోడలు, మెట్లు, పైకప్పు.. ఇలా అంతటా రాతినే వినియోగించారు. ఎక్కడా ఇనుము, స్టీల్‌, సిమెంట్‌, కాంక్రీటును వాడలేదు. భూమిలోని తేమతో, ఆలయానికి భవిష్యత్తులో ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు, 21 అడుగుల ఎత్తున గ్రానైట్‌తో పునాదిని నిర్మించారు.

దేశం నలు మూలల నుంచి సేకరించిన రెండు లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వాడారు. రిక్టర్‌ స్కేల్‌పై 10 తీవ్రతతో భారీ భూకంపాలు వచ్చినా, మరే విధమైన ప్రకృతి విపత్తులు వచ్చినా, కనీసం 2,500 సంవత్సరాల పాటు తట్టుకునేలా ఆలయ నిర్మాణాన్ని డిజైన్‌ చేశారు. ఆయోధ్య రామాలయ ప్రాంగణంలో, 27 నక్షత్రాలకు సూచికగా, 27 మొక్కలను గతంలో నాటారు. భక్తులు తమ జన్మ నక్షత్రాన్నీ, రాశినీ అనుసరించి, ఆయా చెట్ల కింద కూర్చుని ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం కోసమే, ఈ వాటికను ఏర్పాటు చేశారు.

నాడు వానరులు 500 నదులూ, 5 సముద్రాల నుండి తెచ్చిన జలాలతో, రాముడి పట్టాభిషేకాన్ని నిర్వహించారు. నేడు వసుదైక కుటుంబం అన్న భారతీయ భావనను ప్రతిబింబించేలా, ప్రపంచ వ్యాప్తంగా ఏడు ఖండాలలోని 115 దేశాలలో ప్రవహించే నదులూ, సముద్రాల నుంచి తీసుకొచ్చిన జలాన్ని, 2,587 ప్రాంతాల నుంచి తెప్పించిన మట్టినీ, రామాలయ నిర్మాణంలో వినియోగించారు.  ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత, ఒడిశాలోని కోణార్క్‌ సూర్య దేవాలయం గర్భగుడిలో, మూల విరాట్‌పై సూర్య కిరణాలు పడినట్లుగా, రామ మందిరంలోని బాల రాముడి విగ్రహం మీద, శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు ప్రసరించేలా, అయోధ్య ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం విశేషం. ఇలా ఎన్నో విశిష్టతలతో నిర్మింపబడిన ఈ ఆలయంలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం, మేష లగ్నంలో అభిజిత్ ముహుర్తంలో జరగబోతోంది. సాధారణంగా 5 గ్రహాలు అనుకూల స్థానంలో ఉంటే మంచి ముహుర్తం. అయితే ప్రాణ ప్రతిష్ట సమయంలో ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో విగ్రహ ప్రతిష్టాపన చేస్తే, ప్రపంచంలోనే మన దేశ కీర్తి మరింత పెరుగుతుంది. ఇంతటి బృహత్తర కార్యక్రమంలో మనమందరం ప్రత్యక్షంగా పాల్గోనే అవకాశం లేకపోవచ్చు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు శ్రీ రాముడి అక్షతలను పంపిణీ చేశారు. ప్రాణ ప్రతిష్ఠ రోజున అయోధ్యలోని రామ మందిరంతో పాటు, ప్రతీ రామాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. వాటిలో పాల్గోనే అవకాశం ఉన్నవారు, ఆలయంలో రామ నామ స్మరణ చేస్తూ రాముల వారి కృపకు పాత్రులు కావచ్చు. ఇన్నేళ్ళ మనందరి కల తీరబోతున్న వేళ సాయం సమయంలో, ప్రతీ ఇంట్లో దీప కాంతిలో దీపావళి శోభ కనువిందు చేయబోతోంది. ప్రతి ఇంట్లో 5 దీపాలను వెలిగించి, మన ఇంటికి కూడా రాముల వారిని ఆహ్వానిద్దాము.

జై శ్రీరామ!

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...