Causes of Short Life Span According to Garuda Purana! గరుడపురాణం ప్రకారం అల్పాయువు రహస్యం!
గరుడపురాణం ప్రకారం అల్పాయువు రహస్యం!
ఒకరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తే, మరొకరు అర్ధాంతరంగా ఎందుకు తనువు చాలిస్తున్నారు?
Causes of Short Life Span According to Garuda Purana!
ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణికీ తప్పని ఒకే ఒక సత్యం, ‘మరణం’... "పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు మరల పుట్టక తప్పదు" అనేది భగవద్గీత శ్లోకం మాత్రమే కాదు, ప్రకృతి ధర్మం కూడా. కానీ... ఒకరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తే, మరొకరు అర్ధాంతరంగా ఎందుకు తనువు చాలిస్తున్నారు?
సృష్టి ధర్మం ప్రకారం మనిషి ఆయుర్దాయం వంద సంవత్సరాలు. కానీ నేటి కలియుగంలో, 60 లేదా 70 ఏళ్లు బతకడమే గగనమైపోయింది. ఎందుకిలా జరుగుతోంది? మన ఆయుష్షును హరించివేస్తున్న ఆ అదృశ్య శక్తులు ఏమిటి? ఆధునిక వైద్యం, సైన్స్ కూడా సమాధానం చెప్పలేని ఎన్నో ప్రశ్నలకు... వేల సంవత్సరాల క్రితమే "గరుడ పురాణం" స్పష్టమైన సమాధానాలు ఇచ్చింది.
శ్రీ మహావిష్ణువుకూ, పక్షిరాజైన గరుత్మంతుడికీ మధ్య జరిగిన అద్భుతమైన సంవాదమే ‘గరుడ పురాణం’. ఈరోజు మన చానెల్ లో... గరుడ పురాణం ప్రకారం ఒక మనిషి తక్కువ వయసులోనే మరణించడం, అంటే "అల్పాయుష్కుడు" కావడానికి గల అసలైన కారణాలు ఏమిటో, ప్రాచీన గ్రంథాల ఆధారంగా, శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషిద్దాము. ఈ వీడియోను చివరి వరకు చూడండి.. ఇందులో చెప్పబడిన కొన్ని విషయాలు మీ జీవనశైలినే మార్చేయవచ్చు.
వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/l0Fpyq7G6as ]
ఓ గరుడా! మనిషి నూరేళ్ళూ బ్రతకాలనే వేదం చెప్పిందని, సాక్షాత్తూ ఆ నారాయణుడు పక్షిరాజుతో అన్నాడు. ఒకప్పుడు మనుషులు ప్రకృతితో మమేకమై, ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ, పరిపూర్ణమైన ఆయుష్షును అనుభవించేవారు. కానీ, కలికాలం ప్రవేశించిన తర్వాత, ఆ మాటకు అవాంతరం ఏర్పడింది.
ఎందుకు మనిషి ఆయుష్షు క్షీణిస్తోంది? దానికి గరుడ పురాణం చెప్పిన మొదటి కారణం... "కర్మ సిద్ధాంతం". నిందిత కర్మలను, అంటే, సమాజం, ధర్మం అసహ్యించుకునే పనులను నిరంతరాయంగా ఎవరైతే చేస్తారో, వారు ఎక్కువ కాలం జీవించరు. పాప కర్మలు శరీరంలోని ప్రాణశక్తిని ఎలా క్షీణింపజేస్తాయో మన ప్రాచీన గ్రంథాలు చాలా స్పష్టంగా వివరించాయి.
అంతేకాదు, వేద జ్ఞానం కొరవడడం ప్రధాన కారణం. ఆధునికత మోజులో పడి, వంశ పారంపర్యంగా వస్తున్న సదాచారాలను మనం గాలికొదిలేశాము. పొద్దున్నే లేవడం, సూర్యనమస్కారాలు చేయడం, ప్రకృతిని ఆరాధించడం లాంటి సదాచారాలు మూఢనమ్మకాలు కావు. అవి మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడే అదృశ్య కవచాలు. ఆ కవచాలను వదిలేసినప్పుడే, మనిషి అల్పాయుష్కుడు అవుతున్నాడు.
గరుడ పురాణంలో విష్ణుమూర్తి, మనిషి ఆయుష్షును క్షీణింపజేసే దైనందిన తప్పులను చాలా స్పష్టంగా ఎత్తి చూపాడు.
1. బద్ధకం: బద్ధకస్తుడై, తాను చేయవలసిన సత్కర్మలను అంటే, బాధ్యతలను చేయకపోవడం. సోమరితనం శరీరాన్నే కాదు, ఆత్మను కూడా తుప్పు పట్టిస్తుంది.
2. దుష్టకర్మలు: ఇతరులకు హాని తలపెట్టే దుష్టకర్మలు చేసేవాడు, ప్రకృతి ఆగ్రహానికి గురవుతాడు.
3. ఆహార నియమాలు లేకపోవడం: "భోజనం కూడా ఎవరింట్లోనో చేసి వేస్తూ..." అని గ్రంథం చెబుతోంది. అంటే ఆహారం ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వారు వండినది తినడం. వండేవాడి మనస్తత్వం తినేవాడిపై ప్రభావం చూపుతుందని, మన పెద్దలు చెబుతారు.. అపవిత్రమైన, వాడిపోయిన, ప్రాణశక్తి లేని ఆహారం తినడం వల్ల, ఆయుష్షు కచ్చితంగా తగ్గుతుంది.
4. కుటుంబ బాధ్యతారాహిత్యం మరియు పరస్త్రీ వ్యామోహం: సొంతంగా కుటుంబాన్ని నెలకొల్పుకోకుండా, భార్యాబిడ్డలను పోషించకుండా, పరస్త్రీ సంగంతో అంటే, ఇతరుల భార్యల పట్ల వ్యామోహంతో కాలక్షేపం చేసే వాడికి, ఆయుష్షు దారుణంగా క్షీణిస్తుంది. అనైతిక సంబంధాలు మనిషిలోని ఓజస్సునూ, తేజస్సునూ హరించివేస్తాయని ఆయుర్వేదం కూడా చెబుతోంది.
సమాజంలో ఒక్కొక్కరికీ ఒక్కో బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతలను విస్మరించడం కూడా ఆయువును తగ్గిస్తుంది.
మన గ్రంథాల ప్రకారం... సమాజానికి మార్గనిర్దేశం చేయాల్సిన బ్రాహ్మణులు, శ్రద్ధాహీనులు, అపవిత్రులు, నాస్తికులు అయితే, శుభకార్యాలను చేపట్టనివారూ, పరద్రోహులూ, అసత్యవాదులూ అయితే, వారు ఎక్కువ కాలం బ్రతకరు. సమాజపు జ్ఞాన దీపాన్ని వెలిగించాల్సిన వారే చీకటిలో ఉంటే, అది ఘోరమైన పాపం.
ఇక పాలకుల విషయానికి వస్తే... ప్రజలను కంటికి రెప్పలా రక్షించవలసిన వారే, ఆ పని చేయకుండా, క్రూరులై, ధర్మాచరణ చేయక, వ్యసనపరులై, మూర్ఖులై, వేద శాసనాన్ని పక్కనపెట్టి, ప్రజలను పీడించే పాలకులు ఉంటే... ఆ పాపాన్ని సాక్షాత్తూ భూమాత కూడా భరించలేదు. అలాంటి పాలకులకు పతనం, అర్ధాంతర మరణం తథ్యం అని, మన పురాణాలు ఘోషిస్తున్నాయి.
సామాన్య మానవులు కూడా కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. స్నాన, దానాదులు లేకుండా రోజును గడిపేవారు వ్యర్థులే అని పురాణాలు చెబుతున్నాయి. ధర్మ శాస్త్రంలోని 24వ అధ్యాయం, 18-19 శ్లోకాల్లో ఒక అద్భుతమైన మాట చెప్పబడింది.
స్నానందానం జపోహోమో స్వాధ్యాయో దేవతార్చనం ।
యస్మిన్ దినే నసేవ్యంతే స వృధా దివసో నృణాం ।।
దీని అర్థం ఏమిటో తెలుసా? ఏ రోజునైతే మనిషి.. పవిత్ర స్నానం, దానం, జపం, హోమం, స్వాధ్యాయం అంటే తనను తాను విశ్లేషించుకోవడం లేదా మంచి గ్రంథాలను చదవడం, మరియు దేవతార్చన... ఈ ఆరింటిలో కనీసం ఒక్కటైనా చేయకుండా ఆ రోజును ముగిస్తాడో... ఆ రోజు అతని జీవితంలో వృధా అయిపోయినట్టే. ఆ వృధా అయిన రోజులు మన ఆయుష్షు ఖాతాలోంచి మైనస్ అయిపోతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోనివాడికి, ఎక్కువ కాలం బ్రతికే హక్కును ప్రకృతి ఇవ్వదు.
ఇప్పటివరకు మనం పెద్దలైన వారు తెలిసీ తెలియక చేసే పాపాల వల్ల ఆయుష్షు ఎలా క్షీణిస్తుందో చూశాం. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరి మదిలో మెదిలే, గుండెను కలచివేసే ఒకే ఒక్క ప్రశ్న... పుట్టగానే, లేదా అభం శుభం తెలియని పసి వయసులోనే చనిపోయే వారి పరిస్థితి ఏమిటి? వారు ఎలాంటి పాపం చేయలేదు కదా, మరి వారి ఆయుష్షు ఎందుకు అంత త్వరగా ముగిసిపోతుంది?
దీనికి సైన్స్ జన్యుపరమైన లోపాలు అనో, ఇన్ఫెక్షన్లు అనో కారణాలు చెబుతుంది. కానీ సనాతన ధర్మం, గరుడ పురాణం దీని వెనుక ఉన్న అతి సూక్ష్మమైన "కర్మ సిద్ధాంతాన్ని" మరియు ఆత్మ ప్రయాణాన్ని వివరిస్తాయి.
పురాణాల ప్రకారం, దీని వెనుక నాలుగు ప్రధాన కారణాలు ఉంటాయి.
• మొదటిది ప్రారబ్ద కర్మ: సంచిత కర్మలో, ప్రస్తుత జన్మలో అనుభవించవలసిన కొంత భాగాన్ని ప్రారబ్ద కర్మ అంటారు. చూడటానికి వారు పసిపిల్లలే కావచ్చు, కానీ ఆ ఆత్మ ఎన్నో జన్మల ప్రయాణం చేసి వస్తుంది. ఆ శరీరంతో కేవలం కొన్ని రోజులు మాత్రమే గడపాలన్న ఆత్మ ప్రారబ్ధ కర్మ తీరగానే, అది దేహాన్ని వదిలేస్తుంది.
• రెండవది ఋణానుబంధం: "ఋణానుబంధ రూపేణ పశు పత్నీ సుతాలయః" అన్న పద్మ పురాణం లోని శ్లోకాన్ని మీరు వినే ఉంటారు. ఆ పసికందు రూపంలో వచ్చిన ఆత్మకూ, తల్లిదండ్రులకూ మధ్య ఉన్న ఋణం, ఆ కొద్ది రోజులకే పరిమితమై ఉండవచ్చు. ఆ బాకీ తీరగానే, ఆత్మ తన దారిన తాను వెళ్ళిపోతుంది.
• మూడవది తల్లిదండ్రుల కర్మ: చాలా సందర్భాల్లో, శిశువు అర్ధాంతరంగా మరణించడం అనేది, గత జన్మలలో తల్లిదండ్రులు చేసుకున్న కర్మ ఫలితం కారణంగా, ఆ పుత్ర శోకాన్ని అనుభవించక తప్పదు.
• కానీ ఇందులో ఉన్న ఒకే ఒక ఊరట ఏమిటంటే... అభం శుభం తెలియని వయసులో చనిపోయిన పిల్లలకు, ఈ జన్మలో ఎలాంటి కొత్త కర్మలూ అంటవు కాబట్టి, గరుడ పురాణం ప్రకారం ఆ ఆత్మలకు నరక బాధలు ఉండవు. అవి వెంటనే ఉన్నత లోకాలకో, లేదా మరో ఉత్తమ జన్మకో వెళతాయి.
ఈ కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్న తర్వాత మనకు తెలిసేది ఒకటే.. "పక్షీంద్రా! పుట్టినవాడు గిట్టడం ఎంత సత్యమో, మరణించినవాడు మరల పుట్టుడం కూడా అంతే సహజం. కానీ దీనిని తప్పించిన వారు కూడా ఉన్నారు.." అని గరుత్మంతుడితో శ్రీ మహావిష్ణువు చెబుతున్నాడు...
మనిషి తనకు మరణం లేకుండా ఉండాలని కోరుకోవడం అన్యాయం, ప్రకృతి విరుద్ధం. కానీ, "మరల పుట్టుక ఉండకూడదు" అని కోరుకోవడం అంటే.. జనన మరణ చక్రం నుండి బయటపడి, "జన్మరాహిత్యం" అంటే మోక్షాన్ని వాంఛించడం చాలా మంచిది.
కానీ ఆ కోరిక తీరాలంటే... లెక్కలేనన్ని త్యాగాలు చేయాలి, అనంతంగా శ్రమ పడాలి. తనకెంతో ప్రియమైన వాటన్నింటినీ వదులుకోవాలి, దానం చేసి వేయాలి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన, ప్రాక్టికల్ సూత్రం మన పురాణాలలో చెప్పబడింది.
మానవ జీవితంలో ఈ మూడు శక్తులు అత్యంత దుర్లభమైనవి.. అవి:
1. తిన్నది అరిగించుకునే శక్తి అంటే ఆరోగ్యం
2. రతి శక్తి అంటే శారీరక పటుత్వం / సంతానోత్పత్తి సామర్థ్యం
3. దాన శక్తి అంటే, ఇతరులకు ఇవ్వాలనే విశాల హృదయం
అలాగే ఒక మనిషిని మోక్షం వైపు నడిపించే మూడు అత్యుత్తమ వస్తువులు లేక వరాలు ఏవో తెలుసా?
1. సరైన భోజనం అంటే, సాత్వికమైన, పవిత్రమైన ఆహారం.
2. అనుకూలవతియైన స్త్రీని భార్యగా పొందటం – దీని అర్ధం, జీవితాంతం ధర్మ మార్గంలో నడిపించే సహధర్మచారిణి.
3. ధర్మ న్యాయార్జిత ధనం - ఎవరినీ మోసం చేయకుండా, ఎవరి ఏడుపూ కొట్టకుండా, ధర్మబద్ధంగా సంపాదించిన డబ్బు.
ఈ మూడు వస్తువులూ, పైన చెప్పుకున్న మూడు శక్తులూ ఏ మనిషికైతే ఉంటాయో... అతడు అల్పాయుష్కుడు కాడు. అతడు పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి, అంతిమంగా మోక్షం వైపు ప్రయాణిస్తాడు.
గరుడ పురాణం కేవలం మరణం తర్వాత జరిగే శిక్షల గురించి మాత్రమే చెప్పే గ్రంథం కాదు. బ్రతికున్నప్పుడు ఎలా జీవించాలో చెప్పే అద్భుతమైన సైన్స్ అందులో ఉంది. అల్పాయువుకు కారణాలు దేవుడి శాపాలు కావు. మనం రోజూ చేసే చిన్న చిన్న తప్పులే. బద్ధకాన్ని వీడదాం, ధర్మాన్ని ఆచరిద్దాం, స్వచ్ఛమైన ఆహారం తీసుకుందాం, మనకు ఉన్నదానిలో కాస్తయినా దానం చేద్దాము. ప్రకృతికి అనుగుణంగా జీవిస్తే, వందేళ్ల ఆయుష్షు మన సొంతం అవుతుంది.
ఇలాంటి మరెన్నో లోతైన, ప్రాచీన రహస్యాల కోసం మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మిమ్మల్ని ఏమాత్రం ఆలోచింపజేసినా, మీ మిత్రులతో పంచుకోండి.
జై శ్రీకృష్ణ!

Comments
Post a Comment