KHAGOLA SHASTRA: Ancient Indian Astronomical Science Facts | జంబూ ద్వీపం! భరత వర్షం! అంటే?
జంబూ ద్వీపం! భరత వర్షం! అంటే..?
నిత్య దైవ పూజ సంకల్పంలో ‘ఖగోళ శాస్త్రం’ ఎందుకుంది?
ఈ నాటికీ మన హిందువుల ఇళ్ళలో పూజలు చేసుకునేటప్పుడు, పూజ ప్రారంభంలో “మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య..” అంటూ సంకల్పం చెప్పుకుని, అక్షతలను నీళ్ళతో పక్కన పెట్టుకున్న పాత్రలో వదులుతూ ఉంటాము. ఇలా ఆ సంకల్పాన్ని చెప్పుకున్నప్పుడల్లా, అదేదో దేవుడికి చేసే పూజలో భాగమైన మంత్రంగానే అనుకుంటాము. అయినా చాలామంది దృష్టి అందులోని కొన్ని పదాలవైపు ఆకర్షింపబడుతుంది.. అవే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అనే పదాలు. ఇందులో భరతఖండం అంటే మన భారత దేశం అని సులువుగానే గుర్తించ వచ్చు. కానీ భరత వర్షం అంటే ఏమిటి, జంబూ ద్వీపం ఎక్కడుంది.. వంటి ఆలోచనలు కలిగిన వారు కామెంట్ చేయండి. ఈ సంకల్పాన్ని సరిగ్గా పరిశీలిస్తే, అది దేవుడి పూజలో భాగమైన మంత్రం కాదు. కొన్ని యుగాల క్రితమే మన భారతీయ ఋషులకు ఉన్న ఖగోళ మెధస్సు, గణిత విద్వత్తు, ఇంకా చెప్పాలంటే వారికున్న అఖండ విజ్ఞానాన్ని నిరూపిస్తుందనే విషయం ఎంతమందికి తెలుసు? ఈ మాటలు వినగానే ఆ మూడు పదాలలో అసలు ఏముంది..? జంబూద్వీపే, భరతవర్షే అంటే ఏమిటి..? దేవుడి నిత్య ప్రార్ధనలో మన ఖగోళ శాస్త్ర ప్రస్థావన ఎందుకు వచ్చింది..? వంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/64yYh_HGCog ]
ముందు చెప్పుకున్నట్లు, జంబూద్వీపం అనే పదం, సంకల్పం చెప్పుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. దాదాపు 16వ శతాబ్దం వరకూ, భూమి గుండ్రంగా ఉంటుందనే విషయం కూడా పాశ్చాత్య ప్రపంచానికి తెలియదు. రోమన్ నాగరికత సమయంలో కొందరు భూమి గుండ్రంగా ఉండవచ్చేమో అనీ, మరికొందరు సూర్యుడి వల్ల ప్రసరించే నీడ అలా ఉంది కాబట్టి, భూమి బల్ల పరుపుగా మాత్రం ఉండదనీ అన్నారు. అంతేకాదు, ఆ కాలంలో తత్వవేత్తలూ, ఖగోళ పరిశోధకుల లాంటి వారు, భూమి గుండ్రంగా ఉండే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తపరిచారు. మొదటి నుంచీ మన వారు మాత్రం, భూమి గోళాకారంలో ఉందని స్పష్టమైన ఆధారాలను చూపించి మరీ చెప్పారు. ఇందుకు ఒక చిన్న ఉదాహరణగా, యుగ యుగాలనుంచీ మనం పూజిస్తున్న విష్ణుమూర్తి దశావతారాలలోని మూడవ అవతారమయిన వరాహావతార విగ్రహాలనూ, చిత్రపటాలనూ చూడవచ్చు. అంతేకాదు, తక్కిన ప్రపంచం ఆకాశంలో కనిపించే నక్షత్రాలను ఏవో వెలిగే కాంతులుగా భావిస్తున్న సమయంలోనే, భారత ఖగోళ పరిశోధకులు, అవి నక్షత్రాలనీ, వాటి పేర్లతోసహా, అవి భూమికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటాయో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. సూర్యుడు కూడా ఒక నక్షత్రమనీ, సూర్యుడి చుట్టూ గ్రహాలన్నీ ఏ విధంగా తిరుగుతుంటాయి, ఆ భ్రమణంవల్ల మనకు ఋతువులు ఏలా ఏర్పడుతున్నాయి వంటి ఎన్నో విషయాలను మనవారు, ఖగోళ శాస్త్ర రూపంలో కొన్ని వేల ఏళ్ల క్రితమే మానవాళికి అందించారు.
దీనిని బట్టే ఆనాటి మన భృగుమహర్షి, వరాహమిహిరుడు, ఆర్యభట్ట వంటి ఎంతో మంది సనాతన శాస్త్రవేత్తలు ఎంతటి విజ్ఞానవంతులో అర్ధం చేసుకోవచ్చు. ఇలా నాడు మన శాస్త్రవేత్తలు రచించిన గ్రంథాలలోనూ, రామాయణం, మహాభారతం, భాగవతం, విష్ణు పురాణం, బ్రహ్మాండ పురణం, వాయు పురణం, స్కంద పురాణం వంటి అత్యంత ప్రాచీన పురాణాలలో, సర్వసాధారణంగా కనిపించిన పదం జంబూద్వీపం. ముఖ్యంగా ఆ కాలంలో ఒక వ్యక్తి లేదా ఊరు, లేక ప్రాంతం ఫలానా చోట ఉందని చెప్పేటప్పుడు కూడా, ముందుగా జంబూద్వీపం, అది ఏ వర్షంలో ఉందో కూడా చెప్పి, ఆ తర్వాత మిగిలిన వివరాలు చెప్పేవారు.
ఇక్కడ మరో సందేహం రావచ్చు.. జంబూద్వీపం సరే, ఈ వర్షం ఏమిటి..? సంకల్పంలో భరతవర్షే భరతఖండే అని రెండు సార్లు భారత దేశం గురించి ఎందుకు చెప్పారు? అనే ప్రశ్న వెంటనే తలెత్తుతుంది. అందుకే జంబూద్వీపం అంటే ఏమిటో తెలుసుకునే ముందు, అసలు ఈ వర్షాలు ఏమిటో తెలుసుకుందాము.
ప్రత్యేకంగా పూర్వం మన భూమిని గురించి వివరించడానికి, ఈ భూమిని మొత్తం 9 వర్షాలుగా విభజించారు. అవేంటంటే.. భరత, కింపురుష, హరి, ఇలావృత, రమ్యక, హిరణ్మయ, ఉత్తరకురు, కేతుమాల, భద్రాశ్వ అనేవే ఆ 9 వర్షాలు. మన ఖగోళ శాస్త్రం ప్రకారం, ఈ 9 వర్షాలలోనే సమస్త భూమండలం ఉందని చెప్పబడింది.
ఇందులో మొదటగా మన భరత వర్షం విషయానికొస్తే, దాదాపు మధ్య ఆసియా నుంచి మొదలు పెట్టి సుమత్ర దీవులు వరకూ, ఇటు చైనాలో దక్షిణ భాగం నుంచి లంక వరకు ఉన్న భూమిని, భరత వర్షంగా పేర్కొన్నారు. ఇక్కడ లంక అంటే, నేడు ఉన్న శ్రీలంక కాదు. నాడు జీరో మేరీడియన్ లైన్ పై నెలకొన్న అత్యంత విశాలమైన రావణ లంక. అసలైన ఆ లంక గురించి వివరంగా తెలియాలంటే, మన ఛానల్ లో గతంలో చేసిన వీడియో లింక్, చూడని వారి కోసం కింద description లోనూ, పైన icards లోనూ పొందుపరుస్తున్నాను. ఇక అఖండ భారతం అంటే.. అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు వియత్నాం వరకూ ఉన్న భూమిని భరత ఖండం అని పిలిచే వారు. అంతేకాదు, భరత వర్షంలో ఉన్న ప్రజలు కర్మ జీవులనీ, వారు కర్మ ఆధారంగానే జీవిస్తారనీ, అందుకోసమే ఇక్కడ మానవీయ విలువలు ఉచ్ఛ స్థితిలో ఉండేవనీ, మన పురణాలలో పేర్కొనబడి ఉంటుంది.
ఇక రెండవది కింపురుష వర్ష.. ఇది భరత వర్షానికి ఉత్తరం వైపున ఉంటుంది. నార్త్ చైనా నుంచి దక్షిణ రష్యా వరకు ఉన్న భూభాగాన్ని, కింపురుష వర్షంగా పేర్కొంటారు. ఆ కాలంలో అక్కడ కింపురుషులు ఉండేవారనీ, వారంతా విష్ణు మూర్తి భక్తులనీ, వారు మానవులకూ, దేవతలకూ జన్మించిన ఒక జాతి అనీ, వారి సంఖ్య కూడా పరిమితంగా ఉండేదనీ మన పురాణాలలో పేర్కొనబడింది.
మూడవది హరి వర్షం. ఇది కింపురుష వర్షానికి ఉత్తరం వైపున ఉన్న భూమి. అంటే, ఉత్తర రష్యా ప్రాంతం అని చెప్పవచ్చు. వారు కూడా విష్ణు మూర్తి భక్తులే. మరీ ముఖ్యంగా వారు నరసింహ, వరాహ అవతారాలను ఎక్కువగా పూజించేవారని, పురాణాల ద్వారా తెలుస్తోంది.
ఇక నాలుగవది ఇలావృత వర్షం. ఇది జంబూద్వీపానికి మధ్య భాగంగా, పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. అంటే, పశ్చిమ రష్యా, తూర్పు యూరోప్ ప్రాంతాలను కలుపుతూ ఉన్న భూభాగాన్ని మొత్తం, ఇలావృత వర్షం అనే పేరుతో పిలిచేవారు. ఇక్కడ కొంతమంది కింపురషులు ఉంటే, మరి కొంతమంది మ్లేచ్ఛులు ఉండేవారని తెలుస్తున్న విషయం.
అలాగే, ఐదవ వర్షాన్ని రమ్యక వర్షమని పిలిచేవారు. ఇది ఇలావృత వర్షానికి నార్త్ వెస్ట్ లో ఉండేదని చెప్పవచ్చు. అంటే, నేడు మనం పిలుచుకుంటున్న western Europe ప్రాంతం అని, ఖగోళ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అక్కడ నివశించే వారినే మ్లేచ్ఛులుగా మన పురాణాలు స్పష్టంగా తెలుపుతున్నాయి. మ్లేచ్ఛులు అంటే, వావి వరుసలు లేకుండా సంభోగాలు జరిపేవారు, శృంగారమే ప్రధమ కార్యంగా బ్రతికేవారు. మద్యం, జూదం వంటి వాటికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చేవారు. వారు అన్ని రకాల మాంసాన్నీ తినేవారని, పురాణాలలో వివరించబడింది.
ఆ తర్వాత, హిరణ్మయ వర్షం. ఇప్పుడు ఆ ప్రాంతాలను నార్త్ పోల్ గా పిలుచుకుంటున్నారు. Scandinavia ప్రాంతాలు కూడా ఈ హిరణ్మయ వర్షం క్రిందికే వస్తాయని పురాణాలలో పేర్కొనబడి ఉంది. ఇక ఉత్తరకురు వర్షం అంటే, నేటి సౌదీ అరేబియా నుంచి దక్షిణ యూరోప్ దేశాలూ, ఉత్తర ఆఫ్రికా దేశాలూ వస్తాయని చెప్పబడింది.
కేతుమాల వర్ష ప్రాంతం, దక్షిణ ఆఫ్రికా ఖండం అయ్యి ఉండవచ్చని, పరిశోధకులు చెబుతున్నారు. ఇక ఆఖరి వర్షం భద్రాశ్వ వర్షం. ఇది బహుశా మన పురాణాలలో పాతాళ లోకంగా పేర్కొనబడిన ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలు అయ్యి ఉండవచ్చన్నది పరిశోధకుల అభిప్రాయం.
చివరి నాలుగు వర్షాలకు చెందిన భూభాగాలు ఏవి అనే విషయాన్ని రూఢి పరిచే ఆధారాలు నేడు అందుబాటులో లేవని శాస్త్రవేత్తలంటున్నారు. దానికి కారణం, గత వెయ్యేళ్లుగా మన దేశంపై జరిగిన మొఘలులు, బ్రిటీషర్ల దాడుల వల్ల, అత్యంత విలువైన విజ్ఞాన సంపదలో కొంత ఖిల్జీ వంటి ధూర్తుల దూరాగతాలకు ఆహుతి అయిపోగా, మరికొంత పాశ్చాత్యుల చేత తస్కరింపబడింది. ఉదాహరణగా నలందా విశ్వ విద్వాలయాన్ని కాల్చి బూడిద చేసిన ఘటనను తీసుకోవచ్చు. పూర్వం మన జ్ఞాన సంపద ఎక్కువగా ఆలయాలలో భద్రపరచబడి ఉండేది. తాళ పత్ర గ్రంథాలలోనూ, అక్కడి శిలా శాసనాలలోనూ పొందు పరచి ఉంచేవారు. అలాంటి ఎన్నో వేల ఆలయాలను ముస్లిం పాలకులు పూర్తిగా నెలమట్టం చేయడంతో, మన ప్రాచీన విజ్ఞానం దాదాపు తుడిచి పెట్టుకుపోయింది.
ఇక మన భారతీయులకు సమస్త భూమండలం గురించీ తెలుసనే విషయం, ఒక పద్యాన్ని గమనిస్తే అవగతం అవుతుంది...
ఉదయో యో లంకాయాం సోయస్తమయః సవితురేవ సిద్ధపురే ।
మధ్యాహ్నో యమకోట్యాం రోమక్ విషయేర్ధరాత్రం సః ॥
వరాహ మిహిరుడు అనే గొప్ప ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్త, భూమి, అంతరిక్షం, గ్రహాల వంటి వాటి గురించి స్పష్టంగా తెలియచేస్తూ, ‘పంచ సిద్ధాంతిక’ అనే గ్రంథాన్ని రచించారు. అందులోని ఈ పద్యం నాటి మన భూమండలాన్ని గురించి తెలియచేస్తుంది. ఈ పద్యం ప్రకారం, సూర్యుడు లంక దగ్గర ఉదయించినప్పుడు, సిద్ధ పురా దగ్గర సాయంత్ర సమయం అయ్యి ఉంటుందనీ, యమకోటి దగ్గర మధ్యాహ్నం, రోమక దగ్గర రాత్రి అవుతుందనీ తెలియబరుస్తోంది. ఈ లెక్కల ప్రకారం, శాస్త్రవేత్తలు చెప్పిన సూర్య భ్రమణం తీరును చూసినప్పుడు, యమకోటి అంటే నేటి ఆస్ట్రేలియా అనీ, రోమక అంటే ఉత్తర మరియూ మధ్య యూరోప్ ప్రాంతాలనీ, ఇక సిద్ధపురా అంటే అమెరికా ఖండమనీ గుర్తించారు. దీనిని బట్టి కొన్ని యుగాలకు పూర్వమే మన సిద్ధ పురుషుల దగ్గర సమస్త ఖగోళ జ్ఞానమూ ఉండేదనే విషయం తేటతెల్లమవుతోంది.
ఇక జంబూద్వీపం విషయానికి వస్తే, నేటి శాస్త్రవేత్తలు రెండు విధాలుగా చెబుతున్నారు. ఈ సమస్త భూమండలాన్నీ జంబూద్వీపంగా పరిగణించ బడిందని కొంతమంది అంటే, కాదు, కేవలం ఆసియా, యూరోప్, ఆఫ్రికా ప్రాంతాలను మాత్రమే జంబూద్వీపంగా నాటి మహర్షులు ప్రస్థావించారని మరికొంతమంది అంటున్నారు. ఇందులో అధిక శాతం శాస్త్రవేత్తలు మాత్రం, సమస్త భూమండలాన్నీ ఉద్దేశించే నాడు జంబూద్వీపంగా పేర్కొన్నారని వాదిస్తున్నారు.
🚩 ॐ నమో నారాయణాయ 🙏
Comments
Post a Comment